ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.౹ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.౹ దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.౹ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.౹ దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.౹ మరియు దేవుడు–జలములమధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను.౹ దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆప్రకారమాయెను.౹ దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవదినమాయెను.౹ దేవుడు–ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆప్రకారమాయెను.౹ దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.౹ దేవుడు— గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆప్రకార మాయెను.౹ భూమి గడ్డిని తమతమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను.౹ అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.౹ దేవుడు–పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,౹ భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆప్రకారమాయెను.౹ దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.౹ [17-18] భూమిమీద వెలు గిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను.౹ *** అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.౹ దేవుడు–జీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.౹ దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృ ద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను.౹ దేవుడు–మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను.౹ అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను.౹ దేవుడు–వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆప్రకారమాయెను.౹ దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను.౹ దేవుడు–మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.౹ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.౹ దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా–మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.౹ దేవుడు— ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చియున్నాను; అవి మీ కాహారమగును.౹ భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగు నని పలికెను. ఆప్రకారమాయెను.౹ దేవుడు తాను చేసి నది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను.౹ దేవుడు తాను చేసిన తన పని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పనియంతటినుండి యేడవదినమున విశ్రమించెను.౹ కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.౹ అదివరకు పొలమందలి యే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడులేడు;౹ అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను.౹ దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.౹ దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.౹ మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను.౹ మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలుదేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను.౹ మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది.౹ ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికములును దొరుకును.౹ రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.౹ మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.౹ మరియు దేపుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును;౹ అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా–నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.౹ దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను.౹ అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశపక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను.౹ అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.౹ తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.౹ అప్పుడు ఆదాము ఇట్లనెను — నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగం బరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో–ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.౹ అందుకు స్త్రీ–ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును;౹ అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములనుగూర్చి దేవుడు–మీరు చావకుండునట్లు వాటిని తిన కూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను.౹ అందుకు సర్పము–మీరు చావనే చావరు;౹ ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొనితిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడ తినెను;౹ అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.౹ చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్లమధ్యను దాగు కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి— నీవు ఎక్కడ ఉన్నావనెను.౹ అందుకతడు–నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను.౹ అందుకాయన–నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.౹ అందుకు ఆదాము–నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.౹ అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో–నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ–సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను.౹ అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు.౹ మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.౹ ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.౹ ఆయన ఆదాముతో–నీవు నీ భార్యమాట విని–తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;౹ అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు;౹ నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.౹ ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి.౹ దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా–ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొనితిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను.౹ అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని–యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను.౹ తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱెల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు.౹ కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.౹ హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను;౹ కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తనముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో–నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.౹ కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలుమీదపడి అతనిని చంపెను.౹ యెహోవా–నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు —నే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.౹ అప్పుడాయన–నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తముయొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది.౹ కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు;౹ నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.౹ అందుకు కయీను —నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.౹ నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడోవాడు నన్ను చంపునని యెహోవాతో అనెను.౹ అందుకు యెహోవా అతనితో–కాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతి దండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరివెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను.౹ కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను.౹ హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషా యేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను.౹ లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను; వారిలో ఒక దాని పేరు ఆదా రెండవదానిపేరు సిల్లా.౹ ఆదా యా బాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు.౹ అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు.౹ మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటిని ఇనుపపనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా. లెమెకు తన భార్యలతో –ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతి దండన కయీను కోసము, వచ్చిన యెడల లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని–కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెనను కొని అతనికి షేతు అను పేరు పెట్టెను.౹ మరియు షేతునకు కూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;౹ మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.౹ ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.౹ షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.౹ ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.౹ ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.౹ షేతు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.౹ కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.౹ ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయి దేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.౹ మహలలేలును కనినతరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.౹ కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. మహలలేలు అరువదియైదేండ్లు బ్రదికి యెరెదును కనెను.౹ యెరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పదియేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.౹ మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.౹ హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.౹ యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువదిరెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. హనోకు అరువదియైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.౹ హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.౹ హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.౹ హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషెల నూట ఎనుబదియేడేండ్లు బ్రదికి లెమెకును కనెను.౹ మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.౹ మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని –భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను.౹ లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.౹ లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.౹ అప్పుడు యెహోవా–నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.౹ ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే.౹ నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయముయొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.౹ అప్పుడు యెహోవా–నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినం దుకు సంతాపము నొందియున్నాననెను.౹ అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితోకూడ నడచినవాడు.౹ షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను.౹ భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.౹ దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి. దేవుడు నోవహుతో–సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.౹ చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలుపెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను.౹ నీవు దాని చేయవలసిన విధమిది; ఆ ఓడ మూడువందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల యెత్తును గలదై యుండవలెను.౹ ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను; క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను.౹ ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చని పోవును;౹ అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.౹ మరియు నీతోకూడ వాటిని బ్రదికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులయొక్క ప్రతి జాతిలో నివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను; వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను.౹ నీవు వాటిని బ్రదికించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును.౹ మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని నీదగ్గర ఉంచుకొనుము; అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను.౹ నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. యెహోవా–ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి.౹ పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశపక్షులలో ప్రతి జాతి మగవి యేడును ఆడువి యేడును, నీవు భూమి అంతటిమీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీయొద్ద ఉంచుకొనుము;౹ ఎందు కనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాసులను భూమిమీద ఉండకుండ తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను.౹ తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు ఆరువందల యేండ్లవాడు.౹ అప్పుడు నోవహును అతనితోకూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహజలములను తప్పించు కొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి.౹ [8-9] దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను, పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను, మగది ఆడుది జతజతలుగా ఓడలో నున్న నోవహు నొద్దకు చేరెను.౹ *** ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను.౹ నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవనెల పదియేడవదినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.౹ నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను.౹ ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితోకూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి.౹ వీరే కాదు; ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేలమీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానావిధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను.౹ జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను.౹ ప్రవేశించినవన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను.౹ ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను.౹ జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను.౹ ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను.౹ పదిహేను మూరల యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగి పోయెను.౹ అప్పుడు పక్షులేమి పశువులేమి మృగము లేమి భూమిమీద ప్రాకుపురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.౹ పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చని పోయెను.౹ నరులతోకూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితోకూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.౹ నూట ఏబది దినములవరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను. దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసి కొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.౹ అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకా శమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచి పోయెను.౹ అప్పుడు నీళ్లు భూమిమీదనుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను; నూట ఏబది దినములైనతరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదియేడవదినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను.౹ నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచువచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను.౹ నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను.౹ మరియు నీళ్లు నేలమీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దనుండి నల్లపావుర మొకటి వెలుపలికి పోవిడిచెను.౹ నీళ్లు భూమి అంతటిమీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతనియొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసికొనెను.౹ అతడు మరి యేడుదినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను.౹ సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చి నప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను.౹ అతడింక మరి యేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు.౹ మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటినెల తొలిదినమున నీళ్లు భూమిమీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను.౹ రెండవనెల యిరువది యేడవదినమున భూమియెండి యుండెను. [15-16] అప్పుడు దేవుడు–నీవును నీతోకూడ నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి.౹ *** పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్తశరీరులలో నీతోకూడ నున్న ప్రతిజంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను.౹ కాబట్టి నోవహును అతనితోకూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి.౹ ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమిమీద సంచరించునవన్నియు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలోనుండి బయటికి వచ్చెను.౹ అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠముకట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.౹ అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి–ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందు కనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.౹ భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి–మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.౹ మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి.౹ ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.౹ అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.౹ మరియు మీకు ప్రాణమైన మీ రక్తమునుగూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమునుగూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.౹ నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.౹ మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. [8-10] మరియు దేవుడు నోవహు అతని కుమారులతో —ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతాన ముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.౹ *** *** నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను.౹ మరియు దేవుడు–నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్ప రచుచున్న నిబంధనకు గురుతు ఇదే.౹ మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును.౹ భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును.౹ అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్య నున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు.౹ ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను.౹ మరియు దేవుడు —నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను. ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి.౹ ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను. నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్ష తోట వేసెను.౹ పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.౹ అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడైయుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను.౹ అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుటవలన తమ తండ్రి దిసమొలను చూడలేదు.౹ అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని— కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను. మరియు అతడు— షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను. ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను.౹ నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. ఇది నోవహు కుమారులగు షేము హాము యాపె తను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.౹ గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.౹ యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు.౹ వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.౹ కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.౹ కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.౹ అతడు యెహోవాయెదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి–యెహోవా యెదుట పరా క్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు.౹ షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.౹ ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము.౹ మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూ హీయులలోనుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను హివ్వీయులను అర్కీయులను సినీయులను [16-18] అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.౹ *** *** కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషావరకును ఉన్నది.౹ వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులనుబట్టియు హాము కుమారులు. మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.౹ షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామనువారు.౹ అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.౹ అర్ప క్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.౹ ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకనిపేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.౹ యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మా వెతును యెరహును [27-29] హదోరమును ఊజాలును దిక్లాను ఓబాలును అబీమాయెలును షేబను ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.౹ *** *** మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము.౹ వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు. వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను. భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.౹ మరియు వారు–మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించు కొందము రండని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.౹ అప్పుడు యెహోవా–ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు.౹ గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.౹ ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.౹ దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదర గొట్టెను. షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను.౹ షేము అర్పక్షదును కనినతరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.౹ అర్పక్షదు షేలహును కనినతరువాత నాలుగు వందలమూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.౹ షేలహు ఏబెరును కనినతరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.౹ ఏబెరు పెలెగును కనినతరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను.౹ పెలెగు రయూను కనినతరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.౹ రయూ సెరూగును కనినతరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.౹ సెరూగు నాహోరును కనినతరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను.౹ నాహోరు తెరహును కనినతరువాత నూటపం దొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను.౹ హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను.౹ అబ్రామును నాహోరును వివాహము చేసికొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.౹ శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు.౹ తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్లుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.౹ తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను. యెహోవా–నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.౹ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.౹ నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితోకూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.౹ అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానునువారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపా దించిన సమస్తమైనవారిని తీసికొని కనానను దేశమునకు వెళ్లుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి.౹ అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారముచేసి మోరేదగ్గరనున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి.౹ యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి— నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.౹ అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికినిమధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను.౹ అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్లెను. అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.౹ అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితో–ఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును.౹ ఐగుప్తీయులు నిన్ను చూచి యీమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రదుక నిచ్చెదరు.౹ నీవలన నాకు మేలుకలుగునట్లును నిన్నుబట్టి నేను బ్రదుకు నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను.౹ అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియయి యుండుట చూచిరి ఫరోయొక్క అధిపతులు ఆమెను చూచి ఫరోయెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను.౹ అతడామెనుబట్టి అబ్రామునకు మేలుచేసెను; అందువలన అతనికి గొఱ్ఱెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను.౹ అయితే యెహోవా అబ్రాము భార్యయయిన శారయినిబట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనలచేత బాధించెను.౹ అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి–నీవు నాకు చేసినది యేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని యేల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసికొందునేమో అయితే నేమి, ఇదిగో నీ భార్య; ఈమెను తీసికొనిపొమ్మని చెప్పెను.౹ మరియు ఫరో అతని విషయమై తన జనుల కాజ్ఞాపించినందునవారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతోకూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులోనుండి నెగెబునకు వెళ్లెను.౹ అబ్రాము వెండి బంగారము పశువులుకలిగి బహు ధనవంతుడై యుండెను.౹ అతడు ప్రయాణము చేయుచు దక్షిణమునుండి బేతేలువరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమువరకు వెళ్లి తాను మొదట బలిపీఠమును కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.౹ అబ్రాముతోకూడ వెళ్లిన లోతుకును గొఱ్ఱెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను.౹ అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి.౹ కాబట్టి అబ్రాము —మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు.౹ ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లినయెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమతట్టునకును వెళ్లుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను.౹ కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణముచేసెను. అట్లువారు ఒకరి కొకరు వేరై పోయిరి.౹ అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమదగ్గర తన గుడారము వేసికొనెను.౹ సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునైయుండిరి.౹ లోతు అబ్రామును విడిచి పోయినతరువాత యెహోవా–ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోటనుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పుతట్టు పడమరతట్టును చూడుము;౹ ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను.౹ మరియు నీ సంతానమును భూమిమీదనుండు రేణువులవలె విస్తరింప చేసెదను; ఎట్ల నగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమును కూడ లెక్కింపవచ్చును.౹ నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను.౹ అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రేదగ్గరనున్న సింధూరవృక్షవనములోదిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమరాజైన బెరాతోను, గొమొఱ్ఱా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి.౹ వీరందరు ఉప్పు సముద్రమైన సిద్దీములోయలో ఏకముగా కూడి పండ్రెండు సంవత్సరములు కదొర్లా యోమెరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగు బాటు చేసిరి.౹ పదునాలుగవ సంవత్సరమున కదొర్లా యోమెరును అతనితోకూడనున్న రాజులును వచ్చి అష్తా రోత్ కర్నాయిములో రెఫాయీయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారానువరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేషను ఏన్మిష్పతుకువచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడ కొట్టిరి.౹ అప్పుడు సొదొమ రాజును గొమొఱ్ఱా రాజును అద్మా రాజును సెబోయీము రాజును సోయరను బెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో,౹ అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ యైదుగురు రాజులు యుద్ధము చేసిరి.౹ ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొఱ్ఱాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించినవారు కొండకు పారిపోయిరి.౹ అప్పుడు వారు సొదొమ గొమొఱ్ఱాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నియు పట్టుకొనిపోయిరి.౹ మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొనిపోగా తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసికొనినవారు.౹ అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన యింట పుట్టి అలవరచ బడిన మూడువందల పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను.౹ రాత్రివేళ అతడును అతని దాసులును వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొని వచ్చెను.౹ అతడు కదొర్లాయోమెరును అతనితోకూడ నున్న రాజులను ఓడించితిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను.౹ మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.౹ అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి–ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు,౹ నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను.౹ సొదొమ రాజు–మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసికొనుమని అబ్రాముతో చెప్పగా [22-23] అబ్రాము–నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులవారైనను నీవాటిలో ఏదైనను తీసికొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను.౹ *** అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతోకూడ వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏయే భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసికొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను. ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి–అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.౹ అందుకు అబ్రాము–ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా మరియు అబ్రాము–ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి —ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.౹ మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి–నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి–నీ సంతానము ఆలాగవునని చెప్పెను.౹ అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.౹ మరియు ఆయన–నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు–ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనెదనని నాకెట్లు తెలియుననగా ఆయన–మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.౹ అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కళేబరములమీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను.౹ ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్ర పట్టెను. భయంకరమైన కటికచీకటి అతని కమ్మగా ఆయన–నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.౹ వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.౹ నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయె దవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.౹ అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను. మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండములమధ్య నడిచిపోయెను.౹ ఆ దినమందే యెహోవా–ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరి జ్జీయులను రెఫాయీయులను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను. అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను.౹ కాగా శారయి–ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసియున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమెవలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను.౹ కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయురాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.౹ అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దానిదృష్టికి నీచమైనదాయెను.౹ అప్పుడు శారయి— నా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటి కిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దానిదృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను.౹ అందుకు అబ్రాము–ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనుండి అది పారిపోగా యెహోవాదూత అరణ్యములో నీటిబుగ్గయొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని –శారయి దాసివైన హాగరూ, ఎక్కడనుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్లుచున్నావని అడిగినందుకు అది–నా యజమానురాలైన శారయియొద్దనుండి పారిపోవుచున్నాననెను.౹ అప్పుడు యెహోవాదూత— నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణగియుండుమని దానితో చెప్పెను.౹ మరియు యెహోవాదూత–నీ సంతానమును నిశ్చయముగా విస్త రింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవు నని దానితో చెప్పెను.౹ మరియు యెహోవాదూత— ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు;౹ అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా అది–చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.౹ అందుచేత ఆ నీటిబుగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది.౹ తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను.౹ హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్ల వాడు. అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై–నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.౹ నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను.౹ [3-4] అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి–ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను; నీవు అనేక జనములకు తండ్రివగుదువు.౹ *** మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రి నిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును.౹ నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు.౹ నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.౹ నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.౹ మరియు దేవుడు–నీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను.౹ నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా–మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను.౹ మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.౹ ఎనిమిది దినముల వయస్సుగలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను.౹ నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును.౹ సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టివేయబడును.వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను. మరియు దేవుడు–నీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు; ఏలయనగా ఆమె పేరు శారా నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగ జేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమెవలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను.౹ అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి–నూరేండ్లవానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అను కొనెను.౹ అబ్రాహాము–ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు–నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను.౹ ఇష్మాయేలునుగూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండుమంది రాజులను కనును; అతనిని గొప్ప జనముగా చేసెదను;౹ అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.౹ దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్దనుండి పరమునకు వెళ్లెను.౹ అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగచర్మమున సున్నతి చేసెను.౹ అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంబది తొమ్మిది యేండ్లవాడు.౹ అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగచర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదుమూడేండ్లవాడు.౹ ఒక్కదినమందే అబ్రాహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి.౹ అతని యింట పుట్టినవారును అన్యునియొద్ద వెండితో కొనబడినవారును అతని యింటిలోని పురుషులందరును అతనితోకూడ సున్నతి పొందిరి. మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.౹ అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి –ప్రభువా, నీ కటాక్షము నామీద నున్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు.౹ నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగు కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి.౹ కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసునియొద్దకు వచ్చితిరనెను. వారు–నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రాహాము గుడారములోనున్న శారాయొద్దకు త్వరగా వెళ్లి–నీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను.౹ మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్ప గించెను.వాడు దాని త్వరగా సిద్ధపరచెను.౹ తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనముచేయుచుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను.౹ వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు–అదిగో గుడారములోనున్నదని చెప్పెను.౹ అందుకాయన–మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు విను చుండెను.౹ అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక శారా–నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడుగదా అని తనలో నవ్వు కొనెను.౹ అంతట యెహోవా అబ్రాహాముతో–వృద్ధు రాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల? యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.౹ శారా భయపడి–నేను నవ్వలేదని చెప్పగా ఆయన–అవును నీవు నవ్వితివనెను. అప్పుడా మనుష్యులు అక్కడనుండి లేచి సొదొమతట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితోకూడ వెళ్లెను.౹ అప్పుడు యెహోవా–నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును.౹ ఎట్లనగా యెహోవా అబ్రాహామునుగూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను. మరియు యెహోవా–సొదొమ గొమొఱ్ఱాలనుగూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను.౹ ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను.౹ అప్పుడు అబ్రాహాము సమీపించి యిట్లనెను–దుష్టులతోకూడ నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానిలోనున్న యేబదిమంది నీతిమంతులనిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతోకూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా–సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను అందుకు అబ్రాహాము–ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువు తో మాటలాడ తెగించుచున్నాను.౹ ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువై నందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన–అక్కడ నలుబదియైదు గురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను;౹ అతడింక ఆయనతో మాటలాడుచు–ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ నలుబదిమందిని బట్టి నాశనముచేయక యుందునని చెప్పగా అతడు–ప్రభువు కోపపడనియెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన–అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను.౹ అందుకతడు–ఇదిగో ప్రభువు తో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన —ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననగా అతడు–ప్రభువు కోపపడనియెడల నే నింకొకమారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ పదిమందినిబట్టి నాశనము చేయక యుందుననెను.౹ యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి –నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్లవచ్చుననెను. అందుకు వారు–ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి.౹ అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతనితట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనముచేసిరి.౹ వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి లోతును పిలిచి–ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపువేసి — అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి;౹ ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెల వైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి.౹ ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు–నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు–వీడెవడో మనలోనికి పరదేశిగావచ్చి తీర్పరిగానుండ చూచుచున్నాడు; కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి.౹ అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోపలికి తమ యొద్దకు తీసికొని తలుపు వేసిరి.౹ అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దలవరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి.౹ అప్పుడామనుష్యులు లోతుతో–ఇక్కడ నీకు మరియెవ రున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొని రమ్ము;౹ మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి; వారినిగూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్ప దాయెను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాటలాడి–లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్లదృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.౹ తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి–లెమ్ము; ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసికొని రమ్మని చెప్పిరి.౹ అతడు తడవు చేసెను. అప్పుడు అతనిమీద యెహోవా కనికరపడుటవలన ఆ మనుష్యులు అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయటనుంచిరి.౹ ఆ దూతలు వారిని వెలుపలికి తీసికొని వచ్చిన తరువాత ఆయన–నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా [18-19] లోతు–ప్రభువా ఆలాగు కాదు. ఇదిగో నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది; నా ప్రాణము రక్షిం చుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను ఘనపర చితివి; నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదు నేమో *** ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది గదా, నేను బ్రదుకుదునని చెప్పినప్పుడు ఆయన— ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని;౹ నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము; నీ వక్కడ చేరువరకు నేనేమియు చేయలేననెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను.౹ అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించినవారినందరిని నేల మొలకలను నాశనము చేసెను.౹ అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పుస్తంభమాయెను.౹ తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొఱ్ఱాలతట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలె లేచుచుండెను.౹ దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసికొని, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనముమధ్యన లోతు నశించకుండ అతని తప్పించెను. లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతోకూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి.౹ అట్లుండగా అక్క తన చెల్లెలితో–మన తండ్రి ముసలివాడు; సర్వ లోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు.౹ మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను.౹ ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.౹ మరునాడు అక్క తన చెల్లెలిని చూచి–నిన్నటి రాత్రి నా తండ్రితో నేనుశయ నించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను.౹ ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.౹ ఆలాగున లోతుయొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.౹ వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.౹ చిన్నది కూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును. అక్కడనుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను.౹ అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారానుగూర్చి–ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను.౹ అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి —నీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను.౹ అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు–ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? –ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ–అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితిననెను.౹ అందుకు దేవుడు–అవును, యథార్థహృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు.౹ కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.౹ తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరిని పిలిపించి ఈ సంగతు లన్నియు వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి.౹ అబీమెలెకు అబ్రాహామును పిలిపించి–నీవు మాకు చేసిన పని యేమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించునట్లు నేను నీయెడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను.౹ మరియు అబీమెలెకు–నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహాము నడుగగా అబ్రాహాము–ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదు రనుకొని చేసితిని.౹ అంతేకాక–ఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది.౹ దేవుడు నన్ను నా తండ్రియిల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి–మనము పోవు ప్రతి స్థలమందు— ఇతడు నా సహోదరుడని నన్నుగూర్చి చెప్పుము; నీవు నాకు చేయవలసిన ఉపకారమిదేయని చెప్పితిననెను.౹ అబీమెలెకు గొఱ్ఱెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి, అబ్రాహాముకిచ్చి అతని భార్యయైన శారాను అతనికి తిరిగి అప్పగించెను.౹ అప్పుడు అబీమెలెకు–ఇదిగో నా దేశము నీ యెదుట నున్నది. నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను.౹ మరియు అతడు శారాతో— ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలిచ్చియున్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై యిది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను.౹ అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను; వారు పిల్లలుకనిరి.౹ ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారానుబట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను.౹ ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను.౹ అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను.౹ మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినములవాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.౹ అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు.౹ అప్పుడు శారా –దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని యెవరు అబ్రాహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా? అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.౹ అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి –ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను.౹ అతని కుమారునిబట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను.౹ అయితే దేవుడు–ఈ చిన్నవానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును.౹ అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.౹ కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజముమీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.౹ ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొదక్రింద ఆ చిన్నవాని పడవేసి యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటివేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను.౹ దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచి–హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు;౹ నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేతపట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.౹ మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.౹ దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్ద వాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను.౹ అతడు పారాను అరణ్యములోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడి–నీవుచేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను.౹ అందుకు అబ్రాహాము–ప్రమాణము చేసెదననెను.౹ [25-26] అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసికొనిన నీళ్ల బావివిషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా అబీమెలెకు–ఈ పని యెవరు చేసిరో నేనెరుగను; నీవును నాతో చెప్పలేదు; నేను నేడేగాని యీ సంగతి విన లేదని చెప్పగా *** అబ్రాహాము గొఱ్ఱెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి.౹ తరువాత అబ్రాహాము తన గొఱ్ఱెల మందలోనుండి యేడు పెంటిపిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రాహాముతో–నీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱెపిల్లలు ఎందుకని యడిగెను. అందుకతడు –నేనే యీ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱెపిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను.౹ అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను.౹ బెయేర్షెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను.౹ అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను.౹ అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను. ఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన–అబ్రా హామా, అనిపిలువగా అతడు–చిత్తము ప్రభువా అనెను.౹ అప్పుడాయన–నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను.౹ తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలికొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.౹ మూడవనాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి తన పనివారితో–మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తనచేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో–నా తండ్రీ అనిపిలిచెను; అందుకతడు–ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు–నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా అబ్రాహాము–నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను.౹ ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.౹ అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవాదూత పరలోకమునుండి–అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు–చిత్తము ప్రభువా అనెను.౹ అప్పుడు ఆయన–ఆ చిన్నవానిమీద చెయ్యివేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్న దనెను.౹ అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములుతగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను.౹ అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత–యెహోవా పర్వతముమీద చూచుకొనును అని నేటివరకు చెప్పబడును.౹ యెహోవాదూత రెండవమారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను –నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.౹ మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.౹ తరువాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరును కలిసి బెయేర్షెబాకు వెళ్లిరి. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించెను. ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుప బడినదేమనగా–మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను.౹ వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,౹ కెసెదు, హజో, పిల్దాషు, యిద్లాపు, బెతూయేలు. బెతూయేలు రిబ్కాను కనెను.౹ ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.౹ మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును, గహమును తహ షును మయకాను కనెను. శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికిన యేండ్లు నూట ఇరువదియేడు.౹ శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెనుగూర్చి యేడ్చుటకును వచ్చెను.౹ తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుటనుండి లేచి హేతు కుమారులను చూచి –మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నులయెదుట ఉండకుండ, ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశానభూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా [5-6] హేతు కుమారులు–అయ్యా మా మాట వినుము. నీవు మామధ్యను మహారాజవై యున్నావు; మా శ్మశాన భూములలో అతి శ్రేష్ఠమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము; నీవు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశానభూమి ఇయ్యనొల్లనివాడు ఎవడును లేడని అబ్రాహామునకు ఉత్తరమిచ్చిరి.౹ *** అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి –మృతిబొందిన నా భార్యను నా యెదుట ఉండకుండ నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి.౹ సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవిచేయుడి. మీమధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను.౹ అప్పుడు ఎఫ్రోను హేతు కుమారులమధ్యను కూర్చుండి యుండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించువారందరి యెదుట హేతు కుమారులకు వినబడునట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా –అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము, ఆ పొలమును నీకిచ్చుచున్నాను; దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను; నా ప్రజల యెదుట అది నీకిచ్చుచున్నాను; మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టు మనెను.౹ అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల యెదుట సాగిలపడి –సరేకాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల యిచ్చెదను; అది నాయొద్ద పుచ్చుకొనినయెడల మృతిబొందిన నా భార్యను పాతిపెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడునట్లు ఎఫ్రోనుతో చెప్పెను.౹ [14-15] అందుకు ఎఫ్రోను–అయ్యా నా మాట వినుము; ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును; నాకు నీకు అది యెంత? మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామున కుత్తరమిచ్చెను;౹ *** అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.౹ [17-18] ఆలాగున మమ్రే యెదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నియు, అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.౹ *** ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.౹ ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారులవలన శ్మశానముకొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. అబ్రాహాము బహు కాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను.౹ అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్దదాసు నితో నీ చెయ్యి నా తొడక్రింద పెట్టుము;౹ నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.౹ ఆ దాసుడు — ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసికొని పోవలెనా అని అడుగగా అబ్రాహాము–అక్కడికి నా కుమారుని తీసికొని పోకూడదు సుమీ.౹ నా తండ్రి యింటనుండియు నేను పుట్టిన దేశమునుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి–నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణముచేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు.౹ అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవుగాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను.౹ ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను.౹ అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్ఠమైన నానా విధములగు వస్తువులను తీసికొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోకరింపచేసి యిట్లనెను –నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేనువచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాముమీద అనుగ్రహము చూపుము.౹ చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచుచున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు.౹ కాబట్టి–నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా —నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండునుగాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను.౹ అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజముమీద పెట్టుకొనివచ్చెను.౹ ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని యెక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి —నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగ నిమ్మని అడిగెను.౹ అందుకామె–అయ్యా త్రాగు మని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను.౹ మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాత–నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించితిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొనిపోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.౹ ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలముచేసెనో లేదో తెలిసికొనవలెనని ఊరకుండెను.౹ ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు పది తులముల ఎత్తు గల రెండు బంగారు కడియములను తీసి –నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము; నీ తండ్రి యింట మేము ఈ రాత్రి బసచేయుటకు స్థలమున్నదా అని అడిగెను.౹ అందుకామె —నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను.౹ మరియు ఆమె–మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్న వనగా [26-27] ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి — అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను.౹ *** అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను.౹ రిబ్కాకు లాబానను నొక సహోదరు డుండెను. అప్పుడు లాబాను ఆ బావిదగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను.౹ అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి–ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావియొద్ద ఒంటెల దగ్గర నిలిచి యుండగా లాబాను–యెహోవావలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను.౹ ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగు కొనుటకు అతనికిని అతనితోకూడ నున్నవారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెనుగాని అతడు–నేను వచ్చిన పనిచెప్పకమునుపు భోజనము చేయననగా లాబాను —చెప్పుమనెను.౹ [34-35] అంతట అతడిట్లనెను–నేను అబ్రాహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను.౹ *** నా యజమానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను; నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చియున్నాడు;౹ మరియు నా యజమానుడు నాతో–నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లిచేయవద్దు.౹ అయితే నా తండ్రి యింటి కిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నాచేత ప్రమాణము చేయించెను.౹ [39-40] అప్పుడు నేను నా యజమానునితో —ఆ స్త్రీ నావెంట రాదేమో అని చెప్పినందుకు అతడు —ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతోకూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు *** నీవు నా వంశస్థులయొద్దకు వెళ్లితివా యీ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యనియెడల కూడ ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను.౹ నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి–అబ్రాహామను నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసినయెడల నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను–నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పు నప్పుడు –నీవు త్రాగుము నీ ఒంటెలకును చేది పోయుదునని యెవతె చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయై యుండును గాకని మనవిచేసికొంటిని.౹ నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపకముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకొనివచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడు–నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి —త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని; ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను.౹ అప్పుడు నేను–నీవు ఎవరికుమార్తెవని యడిగినందుకు ఆమె —మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నే నామె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని; ఏలయనగా ఆయన నా యజమానునియొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను.౹ కాబట్టి నా యజమానునియెడల మీరు దయను నమ్మకమును కనుపరచినయెడల అదియైనను నాకు తెలియచెప్పుడి, లేనియెడల అదియైనను తెలియ చెప్పుడి; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెద ననగా లాబానును బెతూయేలును–ఇది యెహోవావలన కలిగిన కార్యము; మేమైతే అవుననిగాని కాదనిగాని చెప్ప జాలము;౹ ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొని పొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తర మిచ్చిరి.౹ అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను.౹ తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను.౹ అతడును అతనితోకూడనున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమునవారు లేచి నప్పుడు అతడు–నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు–ఈ చిన్నదాని పదిదినములైనను మాయొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చుననిరి.౹ అప్పుడతడు–యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పి నప్పుడు వారు–ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని రిబ్కాను పిలిచి–ఈ మనుష్యునితోకూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు —వెళ్లెదననెను.౹ కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పని కత్తెలును లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను.౹ సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను,౹ రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెమీదనుండి దిగి –మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యు డెవరని దాసుని నడుగగా అతడు–ఇతడు నా యజమాను డని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను.౹ అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను.౹ ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణపొందెను. అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసి కొనెను, ఆమె పేరు కెతూరా.౹ ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను.౹ యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు.౹ ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు. వీరందరు కెతూరా సంతతివారు.౹ అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను.౹ అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానము లిచ్చి, తాను సజీవుడై యుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పుతట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను.౹ అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు.౹ అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.౹ హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుట నున్నది.౹ అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతిపెట్టబడిరి.౹ అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను; అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను. ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి యిదే.౹ ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము మిష్మా దూమా మశ్శా హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరులచొప్పున ఇష్మాయేలు కుమారులయొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు పండ్రెండుగురు రాజులు.౹ ఇష్మాయేలు బ్రదికిన సంవత్సరములు నూట ముప్పదియేడు. అప్పుడతడు ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను.౹ వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి యెదుట నివాస మేర్పరచుకొనెను. అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళియిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను.౹ ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లిచేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.౹ ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను.౹ ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగు లాడిరి గనుక ఆమె–ఈలాగైతే నేను బ్రదుకుట యెందు కని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను— రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిప్ఠమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.౹ మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి.౹ తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చి నప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది యేండ్లవాడు.౹ ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను.౹ ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను.౹ ఒకనాడు యాకోబు కలగూరవంటకము వండు కొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములోనుండి వచ్చి –నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను.౹ అందుకు యాకోబు–నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు–నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడుతిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.౹ అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై–నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.౹ ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను;౹ ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.౹ ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను. [6-7] ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి–ఆమె యెవరని అడిగినప్పుడు అతడు–ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా —రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.౹ *** అక్కడ అతడు చాలాదినము లుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలోనుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యయైన రిబ్కాతో సరసమాడుట కనబడెను.౹ అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి–ఇదిగో ఆమె నీ భార్యయే–ఆమె నా సహో దరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకు–ఆమెనుబట్టి నేను చనిపోవుదునేమో అనుకొంటినని అతనితో చెప్పెను.౹ అందుకు అబీమెలెకు–నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను.౹ అబీమెలెకు–ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికి ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలముపొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.౹ అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను.౹ అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.౹ అతని తండ్రియైన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు–నీవు మాకంటె బహుబలము గలవాడవు గనుక మాయొద్దనుండి వెళ్లిపొమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించెను.౹ అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను; ఏలయనగా అబ్రాహాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను.౹ మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను.౹ అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి–ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను.౹ వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను.౹ అతడు అక్కడనుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడ మాడలేదు గనుక అతడు–ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను.౹ [23-24] అక్కడనుండి అతడు బెయేర్షె బాకు వెళ్లెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామునుబట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను.౹ *** అక్కడ అతడొక బలిపీఠముకట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.౹ అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారునుండి అతనియొద్దకు వచ్చిరి.౹ ఇస్సాకు–మీరు నామీద పగపెట్టి మీయొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారినడుగగా వారు–నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితిమి గనుక నీవును మాకు కీడుచేయకుండునట్లు నీతో నిబంధనచేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి.౹ అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి.౹ తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.౹ ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసి–మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటివరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసి కొనెను.౹ వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్దకుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు–చిత్తము నాయనా అని అతనితోననెను.౹ అప్పుడు ఇస్సాకు— ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు.౹ కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము.౹ నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచి గల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని చెప్పెను.౹ ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్లెను.౹ అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి–ఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో –మృతి బొందకమునుపు నేనుతిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకొరకు మాంసము తెచ్చి నాకు రుచి గల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని.౹ కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము.౹ నీవు మందకు వెళ్లి రెండు మంచి మేక పిల్లలను అక్కడనుండి నాయొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను.౹ నీ తండ్రి మృతిబొందక ముందు అతడు వాటినితిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రియొద్దకు తీసికొనిపోవలెననెను.౹ అందుకు యాకోబు–నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్ననివాడను గదా.౹ ఒకవేళ నాతండ్రి నన్ను తడవిచూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల నా మీదికి శాపమేగాని ఆశీర్వాదము తెచ్చు కొననని చెప్పెను.౹ అయినను అతని తల్లి–నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాటమాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా అతడు వెళ్లి వాటిని తన తల్లియొద్దకు తీసికొనివచ్చెను. అతని తల్లి అతని తండ్రి కిష్టమైన రుచి గల భోజ్యములను సిద్ధపఱచెను.౹ మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్దనుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతనిచేతులను అతని మెడమీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతి కియ్యగా అతడు తన తండ్రియొద్దకు వచ్చి–నా తండ్రీ, అనిపిలువగా అతడు–ఏమి నా కుమారుడా, నీ వెవరవని అడిగెను అందుకు యాకోబు–నేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పినప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచికూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను.౹ అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా అతడు–నీ దేవుడైన యెహోవా నా యెదుటికి దాని రప్పించుటచేతనే అని చెప్పెను.౹ అప్పుడు ఇస్సాకు–నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పెను.౹ యాకోబు తనతండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచి–స్వరము యాకోబు స్వరముగాని చేతులు ఏశావు చేతులే అనెను.౹ యాకోబు చేతులు అతని అన్నయైన ఏశావు చేతులవలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గురుతు పట్టలేక అతనిని దీవించి –ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు–నేనే అనెను.౹ అంతట అతడు అది నాయొద్దకు తెమ్ము; నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందు ననెను; అతడు తెచ్చినప్పుడు అతడు తినెను; ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను.౹ తరువాత అతని తండ్రియైన ఇస్సాకు —నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెను.౹ అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దుపెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసనచూచి అతని దీవించి యిట్లనెను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది. ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను.౹ అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రియొద్దకు తెచ్చి–నా తండ్రీ నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినదాని తినుమని తన తండ్రితోననెను.౹ అతని తండ్రియైన ఇస్సాకు–నీ వెవర వని అతని నడిగినప్పుడు అతడు–నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా ఇస్సాకు మిక్కు టముగా గడగడ వణకుచు–అట్లయితే వేటాడిన భోజ్యమును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలోతిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను.౹ ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసి–ఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను.౹ అతడు–నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను.౹ ఏశావు–యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పి–నాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను.౹ అందుకు ఇస్సాకు–ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తర మియ్యగా ఏశావు–నా తండ్రీ, నీయొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రీ, నన్ను, నన్ను కూడ దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి యేడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు— నీ నివాసము భూసారము లేకయు పైనుండిపడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావు–నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను.౹ రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు మాటలనుగూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను–ఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్నుగూర్చి తన్నుతాను ఓదార్చుకొనుచున్నాడు.౹ కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకు [44-45] నీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచువరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము; అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ యిద్దరిని నేను పోగొట్టుకొన నేల అనెను. *** మరియు రిబ్కా ఇస్సాకుతో–హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసికొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజన మనెను. ఇస్సాకు యాకోబును పిలిపించి–నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.౹ నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొను మని యతనికి ఆజ్ఞాపించి –సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభి వృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసికొనునట్లు ఆయన నీకు, అనగా నీకును నీతోకూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేసెను. అతడు పద్దన రాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను.౹ ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు–నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞా పించెననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లిపోయెననియు ఏశావు తెలిసికొని నప్పుడు,౹ ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసి నప్పుడు ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమా ర్తెయు నెబాయోతు సహోదరియునైన మాహలతును కూడ పెండ్లి చేసికొనెను. [10-11] యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను.౹ *** అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.౹ మరియు యెహోవా దానికి పైగా నిలిచి–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.౹ నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును; నీవు పడమటితట్టును తూర్పుతట్టును ఉత్తరపుతట్టును దక్షిణపుతట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.౹ ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి–నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని భయపడి–ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమేగాని వేరొకటికాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను.౹ తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.౹ మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.౹ [20-21] అప్పుడు యాకోబు–నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినయెడల యెహోవా నాకు దేవుడైయుండును.౹ *** మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను.౹ అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దానియొద్ద గొఱ్ఱెల మందలు మూడు పండుకొని యుండెను; కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు; ఒక పెద్ద రాయి ఆ బావిమీద మూత వేసి యుండెను.౹ అక్కడికి మందలన్నియు కూడి వచ్చు నప్పుడు బావిమీదనుండి ఆ రాతిని పొర్లించి, గొఱ్ఱెలకు నీళ్లుపెట్టి తిరిగి బావిమీది రాతిని దాని చోటనుంచుదురు.౹ యాకోబు వారిని చూచి–అన్నలారా, మీ రెక్కడివారని అడుగగా వారు–మేము హారానువార మనిరి.౹ అతడు–నాహోరు కుమారుడగు లాబానును మీ రెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి.౹ మరియు అతడు–అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు–క్షేమముగానే ఉన్నాడు; ఇదిగో అతని కుమార్తెయైన రాహేలు గొఱ్ఱెలవెంట వచ్చుచున్నదని చెప్పిరి.౹ అతడు–ఇదిగో ఇంక చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగుచేయు వేళకాలేదు, గొఱ్ఱెలకు నీళ్లుపెట్టి, పోయి వాటిని మేపుడని చెప్పగా వారు–మంద లన్నియు పోగుకాకమునుపు అది మావలన కాదు, తరువాత బావిమీదనుండి రాయి పొర్లించుదురు; అప్పుడే మేము గొఱ్ఱెలకు నీళ్లు పెట్టుదుమనిరి.౹ అతడు వారితో ఇంక మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొఱ్ఱెల మందను తోలుకొని వచ్చెను; ఆమె వాటిని మేపునది.౹ యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావిమీదనుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని యెలుగెత్తి యేడ్చెను.౹ [11-12] మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు, రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను.౹ *** లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికొనివచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన యింటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నియు లాబానుతో చెప్పెను.౹ అప్పుడు లాబాను–నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై యున్నావు అనెను. అతడు నెలదినములు అతనియొద్ద నివసించిన తరువాత లాబాను–నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబు నడిగెను.౹ లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా; చిన్నదాని పేరు రాహేలు.౹ లేయా జబ్బు కండ్లు గలది; రాహేలు రూపవతియు సుందరియునై యుండెను.౹ యాకోబు రాహేలును ప్రేమించి–నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను.౹ అందుకు లాబాను–ఆమెను అన్యునికిచ్చుటకంటె నీకిచ్చుట మేలు; నాయొద్దఉండు మని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను.౹ తరువాత యాకోబు–నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యయొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా లాబాను ఆ స్థలములోనున్న మనుష్యుల నందరిని పోగుచేసి విందుచేయించి రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతనియొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను.౹ మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.౹ ఉదయమందు ఆమెను లేయా అని యెరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని యేమిటి? రాహేలు కోసమేగదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను.౹ అందుకు లాబాను–పెద్ద దానికంటె ముందుగా చిన్న దాని నిచ్చుట మాదేశ మర్యాదకాదు.౹ ఈమెయొక్క వారము సంపూర్ణము చేయుము; నీవిక యేడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల అందుకై ఆమెను కూడ నీకిచ్చెదమని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తియైన తరువాత అతడు తన కుమార్తెయైన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను.౹ మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాకంటె రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు కొలువు చేసెను.౹ లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.౹ లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.౹ ఆమె మరల గర్భవతియై కుమారుని కని–నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడ నాకు దయచేసె ననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను.౹ ఆమె మరల గర్భవతియై కుమారుని కని–తుదకు ఈ సారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను ఆమె మరల గర్భవతియై కుమారుని కని–ఈ సారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో–నాకు గర్భఫలము నిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను.౹ యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడు–నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను.౹ అందు కామె–నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను.౹ అప్పుడు రాహేలు–దేవుడు నాకు తీర్పు తీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.౹ రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను.౹ అప్పుడు రాహేలు–దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.౹ లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.౹ లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా–ఇది అదృష్టమేగదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను.౹ లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను–స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.౹ గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాతవృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు–నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా ఆమె —నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు–కాబట్టి నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.౹ సాయంకాలమందు యాకోబు పొలమునుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొన బోయి–నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.౹ దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.౹ లేయా–నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.౹ లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.౹ అప్పుడు లేయా–దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.౹ ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.౹ దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.౹ అప్పుడామె గర్భవతియై కుమారుని కని–దేవుడు నా నింద తొలగించెననుకొనెను.౹ మరియు ఆమె–యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో–నన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను.౹ నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువుగదా అని చెప్పెను.౹ అందుకు లాబాను అతనితో–నీ కటాక్షము నా మీదనున్నయెడల నా మాట వినుము; నిన్నుబట్టి యెహోవా నన్ను ఆశీర్వదించె నని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.౹ మరియు అతడు–నీ జీత మింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.౹ అందుకు యాకోబు అతని చూచి–నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును;౹ నేను రాకమునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభివృద్ధి పొందెను; నేను పాదముపెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను.౹ అప్పుడతడు–నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు–నీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను.౹ నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొఱ్ఱెను, గొఱ్ఱెపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను; అట్టివి నాకు జీతమగును.౹ ఇకమీదట నాకు రావలసిన జీతమునుగూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్నయెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను.౹ అందుకు లాబాను —మంచిది, నీ మాటచొప్పుననే కాని మ్మనెను.౹ ఆ దినమున లాబాను చారయైనను మచ్చ యైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱెపిల్లలలో నల్లవాటినన్నిటిని వేరుచేసి తన కుమారులచేతి కప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడుదినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపు చుండెను.౹ యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను.౹ యాకోబు ఆ గొఱ్ఱెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటితట్టును లాబాను మందలలో నల్లని వాటితట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను.౹ మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను.౹ మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను.౹ ఆప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధిపొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను. లాబాను కుమారులు–మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.౹ మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు.౹ అప్పుడు యెహోవా–నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను.౹ –మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడై యున్నాడు;౹ మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది.౹ మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతము మార్చెను; అయినను–దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.౹ అతడు–పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను.౹ అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.౹ మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను.౹ మరియు ఆ స్వప్నమందు దేవుని దూత —యాకోబూ అని నన్ను పిలువగా–చిత్తము ప్రభువా అని చెప్పితిని.౹ అప్పుడు ఆయన–నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటు చున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.౹ అందుకు రాహేలును లేయాయు— యింక మా తండ్రి యింట మాకు పాలు పంపు లెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను.౹ దేవుడు మా తండ్రి యొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్ల చేయుమని అతనికి ఉత్తరమియ్యగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి కనానుదేశమునకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు వెళ్లుటకు తన పశువులన్నిటిని, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దన రాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని పోయెను.౹ లాబాను తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను దొంగిలెను.౹ యాకోబు తాను పారిపోవు చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుటవలన అతని మోసపుచ్చినవాడాయెను.౹ అతడు తనకు కలిగినదంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను.౹ యాకోబు పారిపోయెనని మూడవదినమున లాబానుకు తెలుపబడెను.౹ అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొనిపోయి, గిలాదు కొండమీద అతని కలిసికొనెను.౹ ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి–నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.౹ లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసికొనియుండెను; లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసి కొనెను.౹ అప్పుడు లాబాను యాకోబుతో–నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేల? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.౹ అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దుపెట్టుకొననియ్యక పిచ్చిపెట్టి యిట్లు చేసితివి.౹ మీకు హాని చేయుటకు నా చేతనవును; అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు–నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుక కుము జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను.౹ నీ తండ్రి యింటిమీద బహు వాంఛగల వాడవై వెళ్లగోరినయెడల వెళ్లుము, నా దేవతల నేల దొంగిలితివనగా యాకోబు —నీవు బలవంతముగా నా యొద్దనుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని ఎవరియొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రదుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల యెదుట వెదకి నీ దానిని తీసికొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు.౹ లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారములోనికి ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్లెనుగాని అతని కేమియు దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములోనుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్లెను.౹ రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచి నప్పటికిని అవి దొరకలేదు.౹ ఆమె తన తండ్రితో–తమ యెదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు; నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెదకినను ఆ విగ్రహములు దొరకలేదు.౹ యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో–నీవిట్లు మండిపడి నన్ను తరుమ నేల? నేను చేసిన ద్రోహమేమి? పాపమేమి? నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ యింటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి యెదుటను నీ వారియెదుటను అది యిట్లు తెచ్చిపెట్టుము; వారు మన ఉభయులమధ్య తీర్పు తీర్చుదురు.౹ ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు.౹ దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దానినేమి రాత్రియందు దొంగిలింపబడిన దానినేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని.౹ పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూర మాయెను.౹ ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి.౹ నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.౹ అందుకు లాబాను–ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను.౹ మరియు యాకోబు–రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు ఆ కుప్పయొద్ద భోజనముచేసిరి.౹ లాబాను దానికి యగర్ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.౹ లాబాను–నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు–మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.౹ [49-50] అంతట లాబాను–నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము, మనయొద్ద ఎవరును లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను.౹ *** మరియు లాబాను–నాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము.౹ హానిచేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి.౹ అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసెను.౹ యాకోబు ఆ కొండమీదబలి యర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి.౹ తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లి పోయెను. యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి.౹ యాకోబు వారిని చూచి–ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహన యీము అను పేరు పెట్టెను. [3-4] యాకోబు ఎదోము దేశమున, అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి–మీరు నా ప్రభువైన ఏశావుతో —ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి యుంటిని;౹ *** నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీజనమును కలరు; నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికాజ్ఞాపించెను.౹ ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగివచ్చి–మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్లితిమి; అతడు నాలుగువందలమందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి –ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినయెడల మిగిలిన గుంపు తప్పించుకొనిపోవుననుకొని, తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను.౹ అప్పుడు యాకోబు–నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, —నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,౹ నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.౹ నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.౹ నీవు —నేను నీకు తోడై నిశ్చయముగా మేలుచేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్త రింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను అనగా రెండువందల మేకలను ఇరువది మేకపోతులను రెండువందల గొఱ్ఱెలను ఇరువది పొట్టేళ్లను ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసికొని మందమందను వేరు వేరుగా తన దాసులచేతి కప్పగించి–మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.౹ మరియు వారిలో మొదటివానితో–నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని–నీవెవరివాడవు? ఎక్కడికి వెళ్లుచున్నావు? నీ ముందరనున్నవి యెవరివని నిన్ను అడిగినయెడల నీవు–ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావుకొరకు పంపబడిన కానుక; అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను.౹ అట్లతడు–నేను ముందుగా పంపుచున్న కానుకవలన అతని సమాధానపరచిన తరువాత నేను అతని ముఖము చూచెదను; అప్పుడతడు ఒకవేళ నన్ను కటా క్షించుననుకొని–మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు మీరు–ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవవానికిని మూడవవానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను.౹ అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన యిద్దరు భార్యలను తన యిద్దరు దాసీలను తన పదకొండుమంది పిల్లలను తీసికొని యబ్బోకు రేవు దాటిపోయెను.౹ యాకోబు వారిని తీసికొని ఆ యేరు దాటించి తనకు కలిగినదంతయు పంపి వేసెను.౹ యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారువరకు అతనితో పెనుగులాడెను.౹ తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడగూడు వసిలెను.౹ ఆయన–తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు–నీవు నన్ను ఆశీర్వదించితేనేగాని నిన్ను పోనియ్యననెను.౹ ఆయన–నీ పేరేమని యడుగగా అతడు–యాకోబు అని చెప్పెను.౹ అప్పుడు ఆయన–నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.౹ అప్పుడు యాకోబు–నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయన–నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.౹ యాకోబు–నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.౹ అతడు పెనూయేలునుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను; అప్పుడతడు తొడకుంటుచు నడిచెను.౹ అందుచేత ఆయన యాకోబు తొడగూటిమీది తుంటినరము కొట్టినందున నేటివరకు ఇశ్రాయేలీయులు తొడ గూటిమీదనున్న తుంటినరము తినరు. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును. అతనితో నాలుగువందలమంది మనుష్యులును వచ్చుచుండిరి.౹ అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించువరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను.౹ అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి.౹ ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి —వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను.౹ అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి.౹ లేయాయు ఆమె పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి.౹ ఏశావు–నాకు ఎదురుగావచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు–నా ప్రభువు కటాక్షము నామీద వచ్చుటకే అని చెప్పెను.౹ అప్పుడు ఏశావు–సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను.౹ అప్పుడు యాకోబు–అట్లు కాదు; నీ కటాక్షము నామీద నున్నయెడల చిత్తగించి నాచేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని; నీ కటాక్షము నామీద వచ్చినది గదా;౹ నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్త గించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని –మనము వెళ్లుదము; నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా అతడు–నాయొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు, గొఱ్ఱెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్కదినమే వాటిని వడిగా తోలినయెడల ఈ మంద అంతయు చచ్చును.౹ నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలెను. నేను నా ప్రభువునొద్దకు శేయీరునకు వచ్చువరకు, నా ముందర నున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగినకొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదనని అతనితో చెప్పెను.౹ అప్పుడు ఏశావు–నీ కిష్టమైనయెడల నాయొద్దనున్న యీ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా–అతడు అదియేల? నా ప్రభువు కటాక్షము నామీద నుండనిమ్మనెను.౹ ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయెను.౹ అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై పోయి తనకొక యిల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను.౹ అట్లు యాకోబు పద్దనరాములోనుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను.౹ మరియు అతడు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠముకట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను.౹ ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను.౹ అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను; అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి ఈ చిన్నదాని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను.౹ తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములలోనుండినందునవారు వచ్చువరకు ఊరకుండెను.౹ షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతనియొద్దకు వచ్చెను.౹ యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను; అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపమువచ్చెను.౹ అప్పుడు హమోరు వారితో–షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తెమీదనే ఉన్నది; దయచేసి ఆమెను అతని కిచ్చి పెండ్లిచేయుడి.౹ మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి.౹ ఈ దేశము మీ యెదుట ఉన్నది; ఇందులో మీరు నివసించి వ్యాపారముచేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను.౹ మరియు షెకెము–మీ కటాక్షము నామీద రానీయుడి; మీరేమి అడుగుదురో అది యిచ్చెదను.౹ ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి; మీరు అడిగినంత యిచ్చెదను; మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను.౹ అయితే తమ సహోదరియైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రియైన హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా –మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించు కొననివానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవ మానమగును.౹ మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలె నుండినయెడల సరి;౹ ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని, మా పిల్లలను మీ కిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని, మీ మధ్య నివసించెదము, అప్పుడు మనము ఏకజనమగుదుము.౹ మీరు మా మాట విని సున్నతి పొందని యెడల మా పిల్లను తీసికొని పోవుదుమని చెప్పగా వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను.౹ ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవుచేయలేదు. అతడు తన తండ్రి యింటి వారందరిలో ఘనుడు హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరిగవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు –ఈ మనుష్యులు మనతో సమాధానముగా నున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండ నిచ్చి యిందులో వ్యాపారము చేయనియ్యుడి; ఈ భూమి వారికిని చాలినంత విశాలమైయున్నదిగదా, మనము వారి పిల్లలను పెండ్లి చేసికొని మన పిల్లలను వారికి ఇత్తము.౹ అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినయెడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యేకజనముగా నుందురు.౹ వారి మందలు వారిఆస్తి వారి పశువులన్నియు మనవగునుగదా; ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము, అప్పుడు వారు మనలో నివసించెదరనగా హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరిగవినిద్వారా వెళ్లు వారందరు వినిరి. అప్పుడతని ఊరి గవినిద్వారా వెళ్లు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను.౹ మూడవదినమునవారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు, తమ కత్తులు చేతపట్టుకొని యెవరికి తెలియకుండ ఆ ఊరిమీదపడి ప్రతి పురుషుని చంపిరి.౹ వారు హమో రును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటనుండి దీనాను తీసికొని వెళ్లిపోయిరి తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్నచోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొఱ్ఱెలను పశువులను గాడిదలను ఊరిలోని దేమి పొలములోని దేమి వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లల నందరిని వారి స్త్రీలను చెరపెట్టి, యిండ్లలోనున్నదంతయు దోచుకొనిరి.౹ అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి; నా జనసంఖ్య కొంచెమే; వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు; నేనును నాయింటివారును నాశన మగుదుమని చెప్పెను.౹ అందుకు వారు–వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి. దేవుడు యాకోబుతో–నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుటనుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా [2-3] యాకోబు తన యింటివారితోను తనయొద్దనున్న వారందరితోను–మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నా శ్రమదినమున నా కుత్తర మిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను.౹ *** వారు తమయొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను.౹ వారు ప్రయాణమై పోయినప్పుడు, దేవునిభయము వారి చుట్టున్న పట్టణములమీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు.౹ యాకోబును అతనితోనున్న జనులందరును కనానులో లూజుకు, అనగా బేతేలునకు వచ్చిరి.౹ అతడు తన సహోదరుని యెదుటనుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్ష మాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరుపెట్టిరి.౹ రిబ్కా దాదియైన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూరవృక్షము క్రింద పాతిపెట్టబడెను, దానికి అల్లోను బాకూత్ అను పేరు పెట్టబడెను. యాకోబు పద్దనరామునుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని నాశీర్వదించెను.౹ అప్పుడు దేవుడు అతనితో–నీపేరు యాకోబు; ఇకమీదట నీపేరు యాకోబు అనబడదు; నీపేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరుపెట్టెను. మరియు దేవుడు–నేను సర్వశక్తిగల దేవుడను; నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీవలన కలుగును; రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు.౹ నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను; నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను.౹ దేవుడు అతనితో మాటలాడిన స్థలమునుండి పరమునకు వెళ్లెను.౹ ఆయన తనతో మాటలాడినచోట యాకోబు ఒక స్తంభము, అనగా రాతిస్తంభముకట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను.౹ తనతో దేవుడు మాటలాడినచోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలునుండి ప్రయాణమై పోయిరి.౹ ఎఫ్రాతాకు వెళ్లు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాస పడెను.౹ ఆమె ప్రసవమువలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో–భయపడకుము; ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను.౹ ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె— అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.౹ అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను.౹ యాకోబు ఆమె సమాధిమీద ఒక స్తంభముకట్టించెను. అది నేటివరకు రాహేలు సమాధి స్తంభము.౹ ఇశ్రాయేలు ప్రయా ణమై పోయి మిగ్దల్ ఏదెరు కవతల తన గుడారము వేసెను.౹ ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్న ప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు.౹ రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను.౹ రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి.౹ లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.౹ అబ్రాహామును ఇస్సాకును పరదేశులైయుండిన మమ్రేలో కిర్య తర్బాకు తన తండ్రియైన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సరములు.౹ ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి. ఎదోమను ఏశావు వంశావళి ఇదే,౹ ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను,౹ ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాశెమతును పెండ్లియాడెను.౹ ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను.౹ అహోలీబామా యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన యింటివారినందరిని తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని తన తమ్ముడైన యాకోబు ఎదుటనుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను;౹ వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందునవారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేక పోయెను.౹ అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము. శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి ఇదే,౹ ఏశావు కుమారుల పేరులు ఇవే. ఏశావు భార్యయైన ఆదా కుమారుడగు ఎలీఫజును ఏశావు భార్యయైన బాశెమతు కుమారుడగు రగూయేలును.౹ ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని.౹ ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్యయైన ఆదా కుమారులు.౹ రగూయేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ; వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.౹ ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహొలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు యాలాము కోరహు.౹ ఏశావు కుమారులలో వీరు నాయకులు; ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు,౹ కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయ కులు. వీరు ఆదా కుమారులు.౹ వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు, నహతు నాయకుడు జెరహు నాయకుడు షమ్మా నాయకుడు మిజ్జ నాయకుడు; వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.౹ వీరు ఏశావు భార్యయైన అహొలీబామా కుమారులు, యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు; వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహొలీ బామా పుత్రసంతానపు నాయకులు.౹ ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు, లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు.౹ లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము.౹ సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు.౹ అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.౹ దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను.౹ దీషాను కుమారులు ఊజు అరాను.౹ హోరీయుల నాయకులు, లోతాను నాయకుడు శోబాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు దిషోను నాయకుడు ఏసెరు నాయకుడు దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయ కుల చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయులమీద రాజ్య పరిపాలన చేయకమునుపు, ఎదోము దేశములో రాజ్యపరి పాలన చేసినరాజు లెవరనగా బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్యపరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా బెల చనిపోయిన తరువాత బొస్రా వాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను.౹ యోబాబు చనిపోయిన తరువాత తేమ నీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను.౹ హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు.౹ హదదు చనిపోయిన తరువాత మశ్రేకావాడైన శవ్లూ అతనికి ప్రతిగా రాజాయెను.౹ శవ్లూ చనిపోయిన తరువాత నదీతీరమందలి రహెబోతువాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయెను.౹ షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి ప్రతిగా రాజాయెను.౹ అక్బోరు కుమారుడైన బయల్ హానాను చనిపోయినతరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు కుమార్తె మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరు లేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు అహొలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు కనజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమతమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు. యాకోబు తన తండ్రి పరదేశవాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను.౹ యాకోబువంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతోకూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమునుగూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.౹ మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కు వగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను.౹ అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతనిమీద పగపెట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి.౹ యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతనిమీద మరి పగపెట్టిరి.౹ అతడు వారినిచూచి–నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి.౹ అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను.౹ అందుకతని సహోదరులు— నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మామీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలనుబట్టియు అతనిమీద మరింత పగపెట్టిరి.౹ అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి— ఇదిగో నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగ పడెనని చెప్పెను.౹ అతడు తన తండ్రితోను తన సహోదరులతోను అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన యీ కల యేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడు దుమా అని అతని గద్దించెను.౹ అతని సహోదరులు అతనియందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లిరి.౹ అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి–నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. నిన్ను వారియొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు–మంచిదని అతనితో చెప్పెను.౹ అప్పుడతడు నీవు వెళ్లి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలోనుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను.౹ అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి–నీవేమి వెదకుచున్నావని అతని నడిగెను.౹ అందుకతడు–నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపు మని అడిగెను.౹ అందుకు ఆ మనుష్యుడు–ఇక్కడనుండి వారు సాగి వెళ్లిరి. వారు–దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కను గొనెను.౹ అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచనచేసిరి.౹ వారు–ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు;౹ వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.౹ రూబేను ఆ మాట విని— మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండ అతని విడిపించెను.౹ ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండ అతని విడిపింప దలచి–రక్తము చిందింపకుడి; అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న యీ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను.౹ యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని యుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి,౹ అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అందులో నీళ్లులేవు.౹ వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి.౹ అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి;వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి.౹ మిద్యానీయు లైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.౹ రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేక పోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగివెళ్లి–చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్క డికి పోదుననగా వారు యోసేపు అంగీని తీసికొని, ఒక మేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువు టంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి–ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి అతడు దానిని గురుతుపెట్టి —ఈ అంగీ నా కుమారునిదే; దుష్ట మృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను.౹ యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొంద నొల్లక–నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్లెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను.౹ మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసికొనిపోయి, ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మి వేసిరి. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయునియొద్ద ఉండుటకు వెళ్లెను.౹ అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసికొని ఆమెతో పోయెను.౹ ఆమె గర్భవతియై కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను.౹ ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను.౹ ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో నుండెను. యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను.౹ యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను.౹ అప్పుడు యూదా ఓనానుతో–నీ అన్నభార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయుమని చెప్పెను.౹ ఓనాను ఆ సంతానము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను.౹ అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడ చంపెను.౹ అప్పుడు యూదా–ఇతడు కూడ ఇతని అన్నలవలె చని పోవు నేమో అనుకొని–నా కుమారుడైన షేలా పెద్దవాడగువరకు నీ తండ్రియింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి యింట నివసించెను.౹ చాలాదినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చని పోయెను. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించు వారియొద్దకు వెళ్లెను దాని మామ తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్లు చున్నాడని తామారునకు తెలుపబడెను.౹ అప్పుడు షేలా పెద్దవాడై నప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్యవస్త్రములను తీసివేసి, ముసుకువేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోనుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పు కొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక–నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందు కామె–నీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను.౹ అందుకతడు–నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె–అది పంపువరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను.౹ అతడు–నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె–నీ ముద్రయు దాని దారమును నీ చేతికఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతనివలన గర్భవతియాయెను.౹ అప్పుడామె లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్యవస్త్రములను వేసి కొనెను.౹ తరువాత యూదా ఆ స్త్రీ యొద్దనుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లా మీయునిచేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు.౹ కాబట్టి అతడు–మార్గమందు ఏనాయిము నొద్ద నుండిన ఆ వేశ్య యెక్కడనున్నదని ఆ చోటి మనుష్యులను అడుగగా వారు–ఇక్కడ వేశ్య యెవతెయు లేదని చెప్పిరి.౹ కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్లి–ఆమె నాకు కనబడలేదు; మరియు ఆ చోటి మనుష్యులు —ఇక్కడికి వేశ్య యెవతెయు రాలేదని చెప్పిరని అని నప్పుడు యూదా–మనలను అపహాస్యము చేసెదరేమో; ఆమె వాటిని ఉంచు కొననిమ్ము; ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను.౹ రమా రమి మూడు నెలలైన తరువాత–నీ కోడలగు తామారు జారత్వము చేసెను; అంతేకాక ఆమె జారత్వమువలన గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా–ఆమెను బయటికి తీసికొనిరండి, ఆమెను కాల్చి వేయవలెనని చెప్పెను.౹ ఆమెను బయటికి తీసికొని వచ్చి నప్పుడు ఆమె తన మామయొద్దకు ఆ వస్తువులను పంపి–ఇవి యెవరివో ఆ మనుష్యునివలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర యీ దారము ఈ కఱ్ఱ యెవరివో దయచేసి గురుతు పట్టుమని చెప్పించెను.౹ యూదా వాటిని గురుతు పెట్టి–నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పుడును ఆమెను కూడలేదు.౹ ఆమె ప్రసవకాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి.౹ ఆమె ప్రసవించుచున్న ప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎఱ్ఱనూలు తీసి వాని చేతికి కట్టి–ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను.౹ అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామె–నీవేల భేదించుకొని వచ్చితివనెను. అందు చేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను.౹ తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను. యోసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియు నైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను.౹ యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను.౹ యెహోవా అతనికి తోడై యుండెననియు, అతడు చేసినదంతయు అతనిచేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపుమీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతి కప్పగించెను.౹ అతడు తన యింటిమీదను తనకు కలిగినదంతటిమీదను అతని విచారణ కర్తగా నియమించినకాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తముమీదను ఉండెను.౹ అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతి కప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను.౹ అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి–తనతో శయ నించుమని చెప్పెను అయితే అతడు ఒప్పక–నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెనుగదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు.౹ నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప గింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను.౹ దిన దినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెనుగాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుట కైనను ఆమె మాట విన్నవాడుకాడు.౹ అట్లుండగా ఒక నాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు.౹ అప్పు డామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.౹ అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొనిపోవుట ఆమె చూచినప్పుడు తన యింటి మనుష్యులను పిలిచి–చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మనయొద్దకు తెచ్చియున్నాడు. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకురాగా నేను పెద్దకేక వేసితిని.౹ నేను బిగ్గరగా కేకవేయుటవాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెనని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చువరకు అతని వస్త్రము తనదగ్గర ఉంచు కొనెను.౹ అప్పుడామె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను —నీవు మనయొద్దకు తెచ్చిన ఆ హెబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నాయొద్దకు వచ్చెను.౹ నేను బిగ్గరగా కేక వేసినప్పుడువాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారి పోయెననెను కాబట్టి అతని యజమానుడు–ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను.౹ అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, అతనియందు కనికరపడి అతనిమీద ఆ చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను.౹ చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీల నందరిని యోసేపు చేతి కప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు.౹ యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతనిచేతికి అప్పగింపబడిన దేనిగూర్చియు విచారణచేయక యుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. అటుపిమ్మట ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల తప్పుచేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన యిద్దరు ఉద్యోగస్థులమీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము.౹ ఆ సేనాధిపతి వారిని యోసేపు వశముచేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్నిదినములు కావలిలోనుండినతరువాత వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి; ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను.౹ తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతా క్రాంతులై యుండిరి.౹ అతడు–ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి యున్నవని తన యజమానుని యింట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్థుల నడిగెను.౹ అందుకు వారు–మేము కలలు కంటిమి; వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి–భావములు చెప్పుట దేవుని అధీనమే గదా; మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను.౹ అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి–నా కలలో ఒక ద్రాక్షావల్లి నా యెదుట ఉండెను;౹ ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలుండెను, అది చిగిరించినట్టు ఉండెను; దాని పువ్వులు వికసించెను; దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను.౹ మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను; ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను.౹ అప్పుడు యోసేపు–దాని భావ మిదే; ఆ మూడు తీగెలు మూడుదినములు;౹ ఇంక మూడుదినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పాన దాయకుడవై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతనిచేతికప్పగించెదవు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము.౹ ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.౹ అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను–నేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండివంటలు గల మూడు గంపలు నా తలమీద ఉండెను.౹ మీదిగంపలో ఫరో నిమిత్తము సమస్తవిధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలోనుండి వాటిని తీసికొని తినుచుండెను.౹ అందుకు యోసేపు–దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడుదినములు ఇంక మూడుదినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీదనుండి నీ మాంసమును తినివేయునని ఉత్తర మిచ్చెను. మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందుచేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరోచేతికి గిన్నె నిచ్చెను.౹ మరియు యోసేపు వారికి తెలిపిన భావముచొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను.౹ అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసికొనక అతని మరచిపోయెను. రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటిదగ్గర నిలిచియుండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలోనుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను.౹ వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవులదగ్గర నిలుచుండెను.౹ అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను.౹ అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను.౹ మరియు తూర్పు గాలిచేత చెడి పోయిన యేడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను.౹ అప్పుడు నిండైన పుష్టిగల ఆ యేడు వెన్నులను ఆ పీలవెన్నులు మ్రింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను.౹ తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెనుగాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడును లేక పోయెను.౹ అప్పుడు పానదాయకుల అధిపతి–నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసికొనుచున్నాను.౹ ఫరో తన దాసులమీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతియింట కావలిలో ఉంచెను.౹ ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొకడు వేరువేరు భావములుగల కలలు చెరి యొకటి కంటిమి.౹ అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక హెబ్రీ పడుచువాడు మాతోకూడ ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొకని కలచొప్పున దాని దాని భావమును తెలిపెను.౹ అతడు మాకు ఏ యే భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలోనుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరోయొద్దకు వచ్చెను.౹ ఫరో యోసేపుతో–నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలను విన్నయెడల దాని భావమును తెలుపగలవని నిన్నుగూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు–నావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను.౹ అందుకు ఫరో–నా కలలో నేను ఏటి యొడ్డున నిలుచుంటిని.౹ బలిసినవియు, చూపునకందమైనవియునైన, యేడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను.౹ మరియు నీరసమై బహు వికారరూపము కలిగి చిక్కిపోయిన మరి యేడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు.౹ చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి యేడు ఆవులను తినివేసెను.౹ అవి వాటి కడుపులో పడెనుగాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని.౹ మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల యేడు మంచి వెన్నులు ఒక్క దంటున పుట్టెను.౹ మరియు తూర్పు గాలిచేత చెడి పోయి యెండిన యేడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను.౹ ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మ్రింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియ చెప్పితినిగాని దాని భావమును తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పెను.౹ అందుకు యోసేపు–ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ యేడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్సరములు.౹ కల ఒక్కటే. వాటి తరువాత, చిక్కిపోయి వికారమై పైకివచ్చిన యేడు ఆవులును ఏడు సంవత్సరములు; తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీలవెన్నులు కరవుగల యేడు సంవత్సరములు.౹ నేను ఫరోతో చెప్పు మాట యిదే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను.౹ ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి.౹ మరియు కరవు గల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరవు దేశమును పాడుచేయును.౹ దాని తరువాత కలుగు కరవుచేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును; ఆ కరవు మిక్కిలి భారముగా నుండును.౹ ఈ కార్యము దేవునివలన నిర్ణయింపబడి యున్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను.౹ కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియమింపవలెను.౹ ఫరో అట్లు చేసి యీ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశ మందంతటను అయిదవభాగము తీసికొనవలెను.౹ రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహార మంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను.౹ కరవుచేత ఈ దేశము నశించి పోకుండ ఆ ఆహారము ఐగుప్తుదేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగానుండునని ఫరోతో చెప్పెను.౹ ఆ మాట ఫరోదృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక అతడు తన సేవకులను చూచి–ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను.౹ మరియు ఫరో–దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేకజ్ఞానములుగలవారెవరును లేరు.౹ నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులైయుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.౹ మరియు ఫరో–చూడుము, ఐగుప్తు దేశ మంతటిమీద నిన్ను నియమించియున్నానని యోసేపుతో చెప్పెను.౹ మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథముమీద అతని నెక్కించెను. అప్పుడు–వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను.౹ మరియు ఫరో యోసేపుతో–ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను.౹ మరియు ఫరో యోసేపునకు జప్నత్ప నేహు అను పేరు పెట్టి, అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను.౹ యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడై యుండెను. అప్పుడు యోసేపు ఫరో యెదుటనుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతట సంచారము చేసెను. సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను.౹ ఐగుప్తు దేశమందున్న యేడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి, ఆయా పట్టణములలో దాని నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునుండు పొలముయొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువచేసెను.౹ యోసేపు సముద్రపు ఇసుకవలె అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను. కొలుచుట అసాధ్య మాయెను గనుక కొలుచుట మానివేసెను. కరవు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను.౹ అప్పుడు యోసేపు–దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.౹ తరువాత అతడు–నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభ మాయెనుగాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను.౹ ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి, అప్పుడు ఫరో–మీరు యోసేపునొద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను.౹ కరవు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరవు భారముగా ఉండెను;౹ మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసి కొనినప్పుడు–మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను.౹ మరియు అతడు–చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మనకొరకు అక్కడనుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొన బోయిరి.౹ అయినను–ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చినవారితోకూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.౹ అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియైయుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనముచేసిరి.౹ యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపెట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి–మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు–ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితి మనిరి.౹ యోసేపు తన సహోదరులను గురుతు పట్టెనుగాని వారతని గురుతు పట్టలేదు.౹ యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని–మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితో ననగా వారు–లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి;౹ మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము; మేము యథార్థవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి.౹ అయితే అతడు–లేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొనుటకై వచ్చితిరని వారితో అనెను.౹ అందుకు వారు— నీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనానుదేశములోనున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి.౹ అయితే యోసేపు— మీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే.౹ దీనివలన మీ నిజము తెలియబడును; ఫరో జీవముతోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనేగాని మీరిక్కడనుండి వెళ్లకూడదు.౹ మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి; అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును; లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగుల వారని చెప్పి వారిని మూడుదినములు చెరసాలలో వేయించెను. మూడవదినమున యోసేపు వారిని చూచి–నేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.౹ మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను; మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి.౹ మీ తమ్ముని నా యొద్దకు తీసికొని రండి; అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.౹ అప్పుడు వారు–నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి; అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒక నితో ఒకడు మాటలాడుకొనిరి.౹ మరియు రూబేను — ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాప రాధము మనమీద మోపబడుచున్నదని వారికి ఉత్తర మిచ్చెను.౹ అయితే ద్విభాషి వారి మధ్యనుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.౹ అతడు వారియొద్దనుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యో నును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.౹ మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణముకొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడల నిట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదలమీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి.౹ అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేతపెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనెమూతిలో ఉండెను.౹ అప్పుడతడు–నా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనె లోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయినవారై జడిసి–ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.౹ వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియ చేసిరి.౹ ఎట్లనగా–ఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను.౹ అప్పుడు–మేము యథార్థవంతులము, వేగులవారము కాము.౹ పండ్రెండుమంది సహోదరులము, ఒక్కతండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రియొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి.౹ అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి–మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నాయొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరునట్లు ధాన్యము తీసికొనిపోయి,౹ నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులేగాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను; అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసికొనవచ్చునని చెప్పెననిరి. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి.౹ అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి— మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను.౹ అందుకు రూబేను–నేనతని నీయొద్దకు తీసికొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును; అతని నా చేతికప్పగించుము, అతని మరల నీయొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను.౹ అయితే అతడు–నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను. ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి–మీరు మరల వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా యూదా అతని చూచి–ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనేగాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను.౹ కాబట్టి నీవు మా తమ్ముని మాతోకూడ పంపినయెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము.౹ నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మనుష్యుడు–మీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను.౹ అందుకు ఇశ్రాయేలు–మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా వారు–ఆ మనుష్యుడు–మీ తండ్రి యింక సజీవుడై యున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మునుగూర్చియు మా బంధువులనుగూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితిమి–మీ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి.౹ యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి–ఆ చిన్న వానిని నాతోకూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము;౹ నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టనియెడల ఆ నింద నామీద ఎల్లప్పుడును ఉండును.౹ మాకు తడవు కాక పోయినయెడల ఈపాటికి రెండవమారు తిరిగి వచ్చి యుందుమని చెప్పగా వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితో–అట్లయిన మీ రీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొని పోవుడి.౹ రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడ చేతపట్టుకొనిపోయి మరల ఇచ్చివేయుడి; ఒకవేళ అది పొరబాటై యుండును;౹ మీ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్లుడి.౹ ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని బెన్యామీనును మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడనై యుండవలసినయెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను. ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని, చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి.౹ యోసేపు వారితో నున్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహ కునితో–ఈ మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము; మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను.౹ యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసికొనిపోయెను.౹ ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందునవారు భయపడి–మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపెట్టి మన గాడిదలను తీసికొనుటకు లోపలికి తెప్పించెననుకొనిరి. వారు యోసేపు గృహనిర్వాహకునియొద్దకు వచ్చి యింటి ద్వారమున అతనితో మాటలాడి –అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి.౹ అయితే మేము దిగినచోటికి వచ్చి మా గోనెలను విప్పి నప్పుడు, ఇదిగో మా మా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో నుండెను. అవి చేతపట్టుకొని వచ్చితిమి.౹ ఆహారము కొనుటకు మరి రూకలను తీసికొని వచ్చితిమి; మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి.౹ అందుకతడు–మీకు క్షేమమగునుగాక భయపడకుడి; మీపితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారియొద్దకు తీసికొని వచ్చెను.౹ [24-25] ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసికొని వచ్చి వారికి నీళ్లియ్యగా వారు కాళ్లు కడుగుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధముచేసిరి.౹ *** యోసేపు ఇంటికి వచ్చి నప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి.౹ అప్పుడు —మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అతడు ఇంక బ్రతికియున్నాడా? అని వారి క్షేమసమాచారము అడిగినందుకు వారు –నీ దాసుడైన మా తండ్రి ఇంక బ్రదికియున్నాడు క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి.౹ అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి–మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి —నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అనెను.౹ అప్పుడు తన తమ్మునిమీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను.౹ అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్నుతాను అణచుకొని, భోజనము వడ్డించుడని చెప్పెను.౹ అతనికిని వారికిని అతనితో భోజనముచేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు; అది ఐగుప్తీయులకు హేయము.౹ జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠునివరకు వారు అతని యెదుట తమతమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి.౹ మరియు అతడు తనయెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. యోసేపు ఆ మనుష్యుల గోనెలు పెట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనియు,౹ కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు, తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాటచొప్పున అతడు చేసెను. తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతోకూడ పంపివేయబడిరి.౹ వారు ఆ పట్టణమునుండి బయలుదేరి యెంతో దూరము వెళ్లకమునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి — నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని–మీరు మేలుకు కీడుచేయనేల? దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదే కదా? మీరు దీని చేయుటవలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను.౹ అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు–మా ప్రభువు ఇట్లు మాటలాడనేల? ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక.౹ ఇదిగో మా గోనెలమూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములోనుండి తిరిగి తీసికొనివచ్చితిమి; నీ ప్రభువు ఇంటిలోనుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము? నీ దాసులలో ఎవరియొద్ద అది దొరుకునోవాడు చచ్చును గాక; మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి.౹ అందుకతడు–మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి; ఎవరియొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను.౹ అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను.౹ అతడు పెద్దవాడు మొదలుకొని చిన్న వానివరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను.౹ కావునవారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిదమీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి.౹ అప్పుడు యూదాయును అతని సహోదరులును యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింక అక్కడనే ఉండెను గనుక వారు అతని యెదుట నేలను సాగిలపడిరి.౹ అప్పుడు యోసేపు–మీరు చేసిన యీ పని యేమిటి? నావంటి మనుష్యుడు శకునము చూచి తెలిసికొనునని మీకు తెలియదా అని వారితో అనగా యూదా యిట్లనెను–ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని యెట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనోవాడును ఏలిన వారికి దాసుల మగుదుమనెను.౹ అందుకతడు–అట్లు చేయుట నాకు దూరమవునుగాక; ఎవనిచేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును; మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్లుడని చెప్పగా యూదా అతని సమీపించి–ఏలినవాడా ఒక మనవి; ఒక మాట యేలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము; తమ కోపము తమ దాసునిమీద రవులుకొననీయకుము; తమరు ఫరో అంతవారుగదా ఏలినవాడు–మీకు తండ్రియైనను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులనడిగెను.౹ అందుకు మేము–మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక చిన్నవాడును ఉన్నారు; వాని సహోదరుడు చనిపోయెను, వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి.౹ అప్పుడు తమరు–నేనతని చూచుటకు అతని నా యొద్దకు తీసికొని రండని తమ దాసులతో చెప్పి తిరి.౹ అందుకు మేము–ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు.వాడు తన తండ్రిని విడిచినయెడల వాని తండ్రి చనిపోవునని యేలినవారితో చెప్పితిమి.౹ అందుకు తమరు–మీ తమ్ముడు మీతో రానియెడల మీరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి.౹ కాబట్టి నా తండ్రియైన తమ దాసుని యొద్దకు మేము వెళ్లి యేలినవారి మాటలను అతనికి తెలియచేసితిమి.౹ మా తండ్రి–మీరు తిరిగి వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము–అక్కడికి వెళ్లలేము; మా తమ్ముడు మాతోకూడ ఉండినయెడల వెళ్లుదుము; మా తమ్ముడు మాతో నుంటేనేగాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి.౹ అందుకు తమ దాసుడైన నా తండ్రి–నాభార్య నాకిద్దరిని కనెనని మీ రెరుగుదురు.౹ వారిలో ఒకడు నా యొద్దనుండి వెళ్లి పోయెను. అతడు నిశ్చయముగా దుష్టమృగములచేత చీల్చ బడెనను కొంటిని, అప్పటినుండి అతడు నాకు కనబడలేదు.౹ మీరు నా యెదుటనుండి ఇతని తీసికొనిపోయిన తరువాత ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలుగల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను.౹ కావున తమ దాసుడైన నా తండ్రియొద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మాయొద్ద లేనియెడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసికొని యున్నది గనుక ఈ చిన్నవాడు మాయొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెండ్రుకలు గల తమ దాసుడైన మాతండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము.౹ [32-33] తమ దాసుడనైన నేను ఈ చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి–నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నామీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవాని తన సహోదరులతో వెళ్లనిమ్ము.౹ *** ఈ చిన్నవాడు నాతోకూడ లేనియెడల నా తండ్రియొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లినయెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి యెదుట తన్నుతాను అణచుకొనజాలక–నా యొద్దనుండి ప్రతిమనుష్యుని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్నుతాను తెలియచేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండలేదు.౹ అతడు ఎలుగెత్తి యేడ్వగా ఐగుప్తీయులును ఫరో యింటివారును వినిరి.౹ అప్పుడు యోసేపు–నేను యోసేపును; నా తండ్రి యింక బ్రదికియున్నాడా అని అడిగి నప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందర పడి అతనికి ఉత్తరము ఇయ్యలేక పోయిరి.౹ అంతట యోసేపు–నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పి నప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు–ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే.౹ అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.౹ రెండు సంవత్సరములనుండి కరవు దేశములోనున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.౹ కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటి వారికందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగాను నియమించెను.౹ మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో–నీ కుమారుడైన యోసేపు— దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు;౹ నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొఱ్ఱెలమందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును.౹ ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.౹ ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నవి.౹ ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియ చేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసికొనిరండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడమీదపడి యేడ్చెను; బెన్యామీను అతని మెడమీదపడి యేడ్చెను.౹ అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకొని వారిమీదపడి యేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి. యోసేపుయొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో యింటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకు లకును ఇష్టముగా నుండెను.౹ అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను–నీవు నీ సహోదరులను చూచి–మీరీలాగు చేయుడి, మీ పశువులమీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్లి మీ తండ్రిని మీ యింటివారిని వెంట బెట్టుకొని నా యొద్దకు రండి; ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకిచ్చెదను, ఈ దేశముయొక్క సారమును మీరు అనుభవించెదరు.౹ నీకు ఆజ్ఞయైనది గదా? దీని చేయుడి, మీ పిల్లలకొరకును మీ భార్యలకొరకును ఐగుప్తులోనుండి బండ్లను తీసికొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి.౹ ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా ఇశ్రాయేలు కుమారులు ఆలాగుననే చేసిరి. యోసేపు ఫరోమాటచొప్పున వారికి బండ్లను ఇప్పించెను; మార్గమునకు ఆహారము ఇప్పించెను.౹ అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యా మీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,౹ అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును తినుబండములను మోయుచున్న పది ఆడు గాడిదలను పంపెను.౹ అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా–మార్గమందు కలహ పడకుడని వారితో చెప్పెను.౹ వారు ఐగుప్తునుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను.౹ అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచి నప్పుడు వారి తండ్రియైన యాకోబు ప్రాణము తెప్ప రిల్లెను.౹ అప్పుడు ఇశ్రాయేలు–ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రదికియున్నాడు, నేను చావకమునుపు వెళ్లి అతని చూచెదనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసికొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను.౹ అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు–యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు–చిత్తము ప్రభువా అనెను.౹ ఆయన–నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను.౹ నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను, యోసేపు నీ కన్నులమీద తన చెయ్యి యుంచునని సెలవియ్యగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్లెను. ఫరో అతని నెక్కించి తీసికొని వచ్చుటకు పంపిన బండ్లమీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రియైన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి.౹ వారు, అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను తాము కనానులో సంపా దించిన సంపద యావత్తును తీసికొని ఐగుప్తునకు వచ్చిరి.౹ అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతోకూడ తీసికొనివచ్చెను. యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే;౹ యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ.౹ షిమ్యోను కుమారులైన యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావూలు.౹ లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.౹ ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.౹ జెబూలూను కుమారులైన సెరెదు ఏలోను యహలేలు.౹ వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు.౹ గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ.౹ ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.౹ లాబాను తన కుమార్తెయైన లేయా కిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను.౹ యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను.౹ యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తుదేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను.౹ బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీ రోషు ముప్పీము హుప్పీము ఆర్దు.౹ యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు.౹ దాను కుమారుడైన హుషీము.౹ నఫ్తాలి కుమారులైన యహసేలు గూనీ యేసెరు షిల్లేము.౹ లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరు ఏడుగురు.౹ యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు.౹ ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బదిమంది. అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపునొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీదపడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను.౹ అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో–నీవింక బ్రదికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను.౹ యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినిచూచి–నేను వెళ్లి యిది ఫరోకు తెలియచేసి, కనానుదేశములో ఉండిన నా సహోదరులును నా తండ్రి కుటుంబపువారును నాయొద్దకు వచ్చిరి;౹ ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొఱ్ఱెల కాపరులు. వారు తమ గొఱ్ఱెలను పశువులను తమకు కలిగినదంతయు తీసికొనివచ్చిరని అతనితో చెప్పెదను.౹ గొఱ్ఱెల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి యేమిటని అడిగినయెడల మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు–మా చిన్నతనమునుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వికులును పశువులు గలవారమై యున్నామని ఉత్తరమియ్యుడని చెప్పెను. యోసేపు వెళ్లి ఫరోను చూచి–నా తండ్రియు నా సహోదరులును వారి గొఱ్ఱెల మందలతోను వారి పశువులతోను వారికి కలిగినదంతటితోను కనాను దేశము నుండి వచ్చి గోషెనులో నున్నారని తెలియచేసి తన సహోదరులందరిలో అయిదుగురిని వెంటబెట్టుకొనిపోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను.౹ ఫరో అతని సహోదరులను చూచి–మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు–నీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱెల కాపరులమని ఫరోతో చెప్పిరి.౹ మరియు వారు–కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా ఫరో యోసేపును చూచి–నీ తండ్రియు నీ సహోదరులును నీయొద్దకు వచ్చియున్నారు.౹ ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయుము, గోషెను దేశములో వారు నివసింప వచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచినయెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను.౹ ఫరో— నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగినందుకు యాకోబు–నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరోయెదుటనుండి వెళ్లిపోయెను.౹ ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి, ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము నిచ్చెను.౹ మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపువారినందరిని వారివారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. కరవు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరవువలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను.౹ వచ్చినవారికి ధాన్య మమ్ముటవలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంత యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్య మంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను.౹ ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరు యోసేపునొద్దకు వచ్చి–మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలెను? ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి.౹ అందుకు యోసేపు–మీ పశువులను ఇయ్యుడి; ద్రవ్యము వ్యయమైపోయినయెడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చెదనని చెప్పెను, కాబట్టి వారు తమ పశువులను యోసేపునొద్దకు తీసికొనివచ్చిరి. యోసేపు గుఱ్ఱములను గొఱ్ఱెల మందలను పశువుల మందలను గాడిదలను తీసికొని వారికి ఆహారమిచ్చెను.౹ ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికి ప్రతిగా అతడు వారికి ఆహారమిచ్చి సంరక్షించెను.౹ ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమునవారు అతని యొద్దకు వచ్చి ఇది మా యేలినవారికి మరుగుచేయము; ద్రవ్యము వ్యయమై పోయెను, పశువుల మందలును ఏలినవారి వశమాయెను, ఇప్పుడు మా దేహములును మా పొలములును తప్ప మరి ఏమియు ఏలినవారి సముఖమున మిగిలియుండలేదు.౹ నీ కన్నుల యెదుట మా పొలములును మేమును నశింపనేల? ఆహారమిచ్చి మమ్మును మా పొలములనుకొనుము; మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము; మేము చావక బ్రదుకునట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనము లిమ్మని అడిగిరి.౹ అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటిని ఫరోకొరకు కొనెను. కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరు తమతమ పొలములను అమ్మివేసిరి గనుక, భూమి ఫరోది ఆయెను.౹ అతడు ఐగుప్తు పొలిమేరలయొక్క యీ చివరనుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను.౹ యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెములవలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు–ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరోకొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు; పొలములలో విత్తుడి.౹ పంటలో అయిదవభాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపువారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై యుండునని ప్రజలతో చెప్పగా వారు–నీవు మమ్ము బ్రదికించితివి, ఏలినవారి కటాక్షము మా మీదనుండనిమ్ము; ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి.౹ అప్పుడు అయిదవభాగము ఫరోదని నేటివరకు యోసేపు ఐగుప్తు భూములనుగూర్చి కట్టడ నియమించెను, యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను. అవి ఫరోవి కావు.౹ ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతా నాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు.౹ ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించి నప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి–నా యెడల నీకు కటాక్షమున్నయెడల దయచేసి నీ చెయ్యి నాతొడక్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము.౹ నా పితరులతోకూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను.౹ అందుకతడు–నేను నీ మాటచొప్పున చేసెదననెను. మరియు అతడు–నాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపిమీద వంగి దేవునికి నమస్కారము చేసెను. ఈ సంగతులైన తరువాత–ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా,౹ ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచముమీద కూర్చుండెను.౹ యోసేపును చూచి–కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి –ఇదిగో నీకు సంతానాభి వృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహ మగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను.౹ ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తుదేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే; రూబేను పిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలైయుందురు.౹ వారి తరువాత నీవు కనిన సంతానము నీదే; వారు తమ సహోదరుల స్వాస్థ్యమునుబట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు.౹ పద్దనరామునుండి నేను వచ్చుచున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా యెదుట మృతి పొందెను. అక్కడ బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను.౹ ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి–వీరెవరని అడుగగా యోసేపు–వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నా కనుగ్ర హించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు–నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొనిరమ్మనెను.౹ ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యమువలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేక పోయెను. యోసేపు వారిని అతనిదగ్గరకు తీసికొనివచ్చినప్పుడు అతడు వారిని ముద్దుపెట్టుకొని కౌగిలించుకొనెను.౹ ఇశ్రాయేలు యోసే పుతో–నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదుగాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచియున్నాడనగా యోసేపు అతని మోకాళ్లమధ్యనుండి వారిని తీసికొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను.౹ తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతితట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతితట్టున తన యెడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసికొనివచ్చెను.౹ మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తలమీద తన కుడిచేతిని మనష్షే తలమీద తన యెడమచేతిని ఉంచెను.౹ అతడు యోసేపును దీవించి–నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు,౹ అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందువారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.౹ యోసేపు ఎఫ్రాయిము తలమీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతని కిష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తలమీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తలమీదనుండి యెత్తి –నా తండ్రీ అట్లు కాదు; ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి యితని తలమీద పెట్టుమని చెప్పెను.౹ అయినను అతని తండ్రి ఒప్పక–అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగునుగాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను.౹ ఆ దినమందు అతడు వారిని దీవించి–ఎఫ్రాయిమువలెను మనష్షేవలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవిం చెదరనెను. ఆలాగు అతడు మనష్షేకంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను.౹ మరియు ఇశ్రాయేలు–ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీపితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొని పోవును.౹ నేను నీ సహోదరులకంటె నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను అమోరీయుల చేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను. యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. —మీరుకూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను. యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేనూ, నీవు నా పెద్దకుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచముమీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచముమీది కెక్కెను. షిమ్యోను లేవి అనువారు సహోదరులువారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దువారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగ గొట్టిరి. వారికోపము వేండ్రమైనదివారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహము నా కుమారుడా, నీవు పెట్టినదానితిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడుసింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు? షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్లమధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులైయుందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును. జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోనువరకు నుండును. ఇశ్శాఖారు రెండు దొడ్లమధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టి యున్నాను. బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును. ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును. యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరివారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలియైనవాని హస్త బలమువలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయముచేయు నీ తండ్రి దేవునివలనను పైనుండి మింటి దీవెనలతోను క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను అతని బాహుబలము దిట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని చిరకాల పర్వతములకంటె హెచ్చుగ ప్రబలమగును. అవి యోసేపు తలమీదను తన సహోదరులనుండి వేరుపరచబడిన వాని నడినెత్తిమీదను ఉండును. బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరనుతిని అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును. ఇవి అన్నియు ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది యిదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను.౹ తరువాత అతడు వారికాజ్ఞాపించుచు ఇట్లనెను–నేను నా స్వజనులయొద్దకు చేర్చబడుచున్నాను.౹ హిత్తీయుడైన ఎఫ్రోను భూమియం దున్న గుహలో నా తండ్రులయొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను.౹ అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతిపెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతిపెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని.౹ ఆ పొలమును అందులోనున్న గుహయు హేతుకుమారులయొద్ద కొనబడినదనెను.౹ యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచముమీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణమువిడిచి తన స్వజనులయొద్దకు చేర్చబడెను. యోసేపు తన తండ్రి ముఖముమీదపడి అతని గూర్చి యేడ్చి అతని ముద్దుపెట్టుకొనెను.౹ తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి.౹ సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడువారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతనికొరకు నలుబది దినములు సంపూర్ణమాయెను. అతనిగూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చిరి.౹ అతనిగూర్చిన అంగలార్పు దినములు గడచిన తరువాత యోసేపు ఫరో యింటి వారితో మాటలాడి–మీ కటాక్షము నామీద నున్నయెడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి –నా తండ్రి నాచేత ప్రమాణము చేయించి–ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్ట వలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నే నక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చెదనని చెప్పుడనెను.౹ అందుకు ఫరో–అతడు నీచేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను.౹ కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను; అతనితో ఫరో యింటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరును యోసేపు యింటివారందరును అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారును వెళ్లిరి. వారు తమ పిల్లలను తమ గొఱ్ఱెల మందలను తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి.౹ మరియు రథములును రౌతులును అతనితో వెళ్లినందున ఆ సమూహము బహు విస్తార మాయెను.౹ యొర్దానునకు అవతలనున్న ఆఠదు కళ్లమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రినిగూర్చి యేడు దినములు దుఃఖము సలిపెను.౹ ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆఠదు కళ్లము నొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి–ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖ మని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్ మిస్రాయిము అను పేరు పెట్టబడెను, అది యొర్దానునకు అవతల నున్నది.౹ అతని కుమారులు తన విషయమై అతడు వారికాజ్ఞాపించినట్లు చేసిరి.౹ అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసికొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశానముకొరకు స్వాస్థ్యముగానుండు నిమిత్తము మమ్రే యెదుట హిత్తీయుడైన ఎఫ్రోనుయొద్ద కొనెను. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులును అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరును తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతిపొందుట చూచి–ఒకవేళ యోసేపు మనయందు పగపెట్టి మన మత నికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఈలాగు వర్తమాన మంపిరి –నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించిన దేమనగా–మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను.౹ మరియు అతని సహోదరులు పోయి అతని యెదుట సాగిలపడి–ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు–భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరిగాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.౹ కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. యోసేపు అతని తండ్రి కుటుంబపువారును ఐగుప్తులో నివసించిరి, యోసేపు నూటపది సంవత్సరములు బ్రది కెను.౹ యోసేపు ఎఫ్రాయిముయొక్క మూడవతరము పిల్లలను చూచెను; మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి.౹ యోసేపు తన సహోదరులను చూచి–నేను చనిపోవు చున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను మరియు యోసేపు —దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించు కొనెను.౹ యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను.౹ [2-5] దాను నఫ్తాలి గాదు ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.౹ *** *** *** యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారందరును చనిపోయిరి.౹ ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబ లిరి; వారున్న ప్రదేశము వారితో నిండి యుండెను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏల నారంభించెను.౹ అతడు తన జనులతో ఇట్లనెను— ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది.౹ వారు విస్తరింపకుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడు కూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను.౹ కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియ మింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.౹ అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్య పడిరి.౹ ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి;౹ వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోచేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి –మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానిపని చేయుచు వారిని కాన్పుపీటలమీద చూచినప్పుడు మగవాడైనయెడల వాని చంపుడి, ఆడుదైనయెడల దాని బ్రదుకనియ్యుడని వారితో చెప్పెను.౹ అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి–మీరెందుకు మగపిల్లలను బ్రదుకనిచ్చితిరి? ఈ పని యేల చేసితిరి అని అడిగెను.౹ అందుకు ఆ మంత్ర సానులు–హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలవంటివారు కారు; వారు చురుకైనవారు. మంత్రసాని వారియొద్దకు వెళ్లకమునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి.౹ దేవుడు ఆ మంత్రసానులకు మేలుచేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను.౹ ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను.౹ అయితే ఫరో–హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను. లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను.౹ ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని,వాడు సుందరుడైయుండుట చూచి మూడునెలలు వానిని దాచెను.౹ తరువాత ఆమె వాని దాచలేక వానికొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానినిపెట్టి యేటియొడ్డున జమ్ములో దానిని ఉంచగా,౹ వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను.౹ ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటియొడ్డున నడుచుచుండగా ఆమె నాచు లోని ఆ పెట్టెను చూచి, తన పనికత్తె నొకతెను పంపి దాని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వానియందు కనికరించి— వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను.౹ అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీకొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను.౹ అందుకు ఫరో కుమార్తె–వెళ్లుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను.౹ ఫరో కుమార్తె ఆమెతో–ఈ బిడ్డను తీసికొనిపోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసికొనిపోయి పాలిచ్చి పెంచెను.౹ ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె–నీటిలోనుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులయొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను.౹ అతడు ఇటు అటు తిరిగి చూచి యెవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో వాని కప్పి పెట్టెను.౹ మరునాడు అతడు బయట నడిచి వెళ్లుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరు పోట్లాడుచుండిరి.౹ అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి–నీ వేల నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు–మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే–నిశ్చయముగా ఈ సంగతి బయలు పడెననుకొని భయపడెను.౹ ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెనుగాని, మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచి పోయి యొక బావియొద్ద కూర్చుండెను.౹ మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను.౹ వారు తమ తండ్రియైన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు–నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను.౹ అందుకు వారు–ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలోనుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో–అతడెక్కడ? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను.౹ మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను.౹ ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే–నేను అన్య దేశములో పర దేశినై యుంటిననుకొని వానికి గెర్షోము అనుపేరు పెట్టెను. ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారు పెట్టిన మొర దేవునియొద్దకు చేరెను.౹ కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.౹ దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.౹ ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవాదూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను.గాని పొద కాలిపోలేదు.౹ అప్పుడు మోషే–ఆ పొద యేల కాలిపోలేదో నేను ఆతట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను.౹ దానిని చూచుటకు అతడు ఆతట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండి–మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు–చిత్తము ప్రభువా అనెను.౹ అందుకాయన–దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.౹ మరియు ఆయన–నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను.౹ మరియు యెహోవా యిట్లనెను–నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.౹ కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను.౹ ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని.౹ కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను.౹ అందుకు మోషే–నేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడనని దేవునితో అనగా ఆయన–నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను.౹ మోషే–చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయులయొద్దకు వెళ్లి వారిని చూచి–మీపితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు–ఆయన పేరేమి అని అడిగినయెడల వారితో నే నేమి చెప్పవలెనని దేవుని నడిగెను.౹ అందుకు దేవుడు –నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన–ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.౹ మరియు దేవుడు మోషేతో నిట్లనెను–మీపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.౹ నీవు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి–మీపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, నాకు ప్రత్యక్షమై యిట్లనెను — నేను మిమ్మును, ఐగుప్తులో మీకు సంభవించిన దానిని, నిశ్చయముగా చూచితిని,౹ ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము.౹ వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజునొద్దకు వెళ్లి అతని చూచి–హెబ్రీ యులదేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను.౹ ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును;౹ కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భు తములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును.౹ మరియు నేను ఈ జనుల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు.౹ ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండినగలను బంగారునగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను. అందుకు మోషే–చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు–యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా యెహోవా–నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు–కఱ్ఱ అనెను.౹ అప్పుడాయన–నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను.౹ అప్పుడు యెహోవా–నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతనిచేతిలో కఱ్ఱ ఆయెను.౹ ఆయన —దానిచేత వారు తమపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయెనని నమ్ముదురనెను.౹ మరియు యెహోవా–నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను మనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను.౹ తరువాత ఆయన–నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను.౹ మరియు ఆయన–వారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయినయెడల రెండవ దానిబట్టి విందురు.౹ వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయినయెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.౹ అప్పుడు మోషే–ప్రభువా, ఇంతకుమునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడినప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా యెహోవా–మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.౹ కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.౹ అందుకతడు–అయ్యో ప్రభువా, నీవు పంప తలంచినవానినే పంపుమనగా ఆయన మోషేమీద కోపపడి–లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును;౹ నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడై యుండి, మీరు చేయ వలసినదానిని మీకు బోధించెదను.౹ అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు.౹ ఈ కఱ్ఱను చేతపట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను. అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రోయొద్దకు తిరిగి వెళ్లి–సెలవైనయెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువులయొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో–క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను.౹ అంతట యెహోవా–నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లు మని మిద్యానులో మోషేతో చెప్పగా,౹ మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేతపట్టుకొని పోయెను.౹ అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనియ్యడు.౹ అప్పుడు నీవు ఫరోతో–ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;౹ నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను; వాని పంపనొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను.౹ అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసి–నిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటి వైతివనెను; అంతట ఆయన అతనిని విడిచెను.౹ అప్పుడు ఆమె–ఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను. మరియు యెహోవా–మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలిసికొని అతని ముద్దు పెట్టుకొనెను.౹ అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటిని, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను. తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పోగుచేసి,౹ యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నియు అహరోను వివరించి, జనులయెదుట ఆ సూచక క్రియలనుచేయగా జనులు నమ్మిరి.౹ మరియు–యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోనుచూచి–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా–అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి.౹ ఫరో–నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను.౹ అప్పుడు వారు–హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైనయెడల మేము అరణ్యములోనికి మూడుదినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవాకుబలి అర్పించుదుము; లేనియెడల ఆయన మామీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి.౹ అందుకు ఐగుప్తు రాజు–మోషే అహరోనూ, ఈ జనులు తమ పనులను చేయకుండ మీరేల ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను.౹ మరియు ఫరో–ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది; వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను.౹ ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను –ఇటుకలు చేయుటకు మీరు ఇకమీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను.౹ అయినను వారు ఇదివరకు చేసిన యిటుకల లెక్కనే వారిమీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు; వారు సోమరులు గనుక–మేము వెళ్లి మా దేవునికిబలి నర్పించుటకు సెలవిమ్మని మొఱ పెట్టుచున్నారు.౹ ఆ మనుష్యులచేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపుమాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను.౹ కాబట్టి ప్రజల కార్య నియామకులును వారి నాయకులును పోయి ప్రజలను చూచి–నేను మీకు గడ్డి ఇయ్యను;౹ మీరు వెళ్లి మీకు గడ్డి యెక్కడ దొరకునో అక్కడ మీరే సంపాదించు కొనుడి, అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి.౹ అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తుదేశమందంతటను చెదిరి పోయిరి.౹ మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటివలెనే యేనాటిపని ఆనాడే ముగించుడనిరి.౹ ఫరో కార్య నియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారిమీద ఉంచిన నాయకులను కొట్టి–ఎప్పటివలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయించలేదని అడుగగా ఇశ్రాయేలీయుల నాయకులు ఫరోయొద్దకు వచ్చి–తమ దాసుల యెడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు; చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు; అయితే తప్పిదము తమరి ప్రజలయందే యున్నదని మొఱపెట్టిరి.౹ అందుకతడు— మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత–మేము వెళ్లి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరడుగుచున్నారు.౹ మీరు పొండి, పనిచేయుడి, గడ్డి మీకియ్య బడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పెను.౹ –మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవియ్యగా, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడియున్నట్లు తెలిసికొనిరి.౹ వారు ఫరో యొద్దనుండి బయలుదేరి వచ్చుచు, తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలిసి కొని –యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చును గాక; ఫరో యెదుటను అతని దాసుల యెదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారిచేతికి ఖడ్గ మిచ్చితిరని వారితో అనగా మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి–ప్రభువా, నీవేల ఈ ప్రజలకు కీడు చేసితివి? నన్నేల పంపితివి? నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటినుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను. అందుకు యెహోవా–ఫరోకు నేను చేయబోవు చున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు; బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములోనుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను–నేనే యెహోవాను;౹ నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.౹ మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనానుదేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని.౹ ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకముచేసికొని యున్నాను.౹ కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము–నేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములోనుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించి,౹ మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు.౹ నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి యెత్తి ప్రమాణముచేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను; నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమునుబట్టియు మోషే మాట వినరైరి. [10-11] మరియు యెహోవా మోషేతో–నీవు లోపలికి వెళ్లి, ఐగుప్తురాజైన ఫరోతో–ఇశ్రాయేలీయులను తన దేశములోనుండి వెలుపలికి పోనియ్యవలెనని అతనితో చెప్పుమనెను.౹ *** అప్పుడు మోషే–చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు; మాటమాంద్యము గలవాడనగు నా మాట ఫరో యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.౹ మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను–ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్లవలెనని వారికాజ్ఞాపించెను. వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.౹ షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు.౹ లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.౹ గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ.౹ కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.౹ మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమతమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.౹ అమ్రాము తన మేనత్తయైన యోకె బెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.౹ ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రీ.౹ అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహో దరియునైన ఎలీషెబను పెండ్లిచేసి కొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను.౹ కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.౹ అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒక తెను పెండ్లిచేసికొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను; వీరు తమతమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూలపురుషులు.౹ ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తుదేశములోనుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు.౹ ఇశ్రాయేలీయలను ఐగుప్తులోనుండి వెలుపలికి రప్పించ వలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడినవారు వీరు; ఆ మోషే అహరోనులు వీరే. ఐగుప్తుదేశములో యెహోవా మోషేతో మాటలాడిన దినమున యెహోవా–నేను యెహోవాను; నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషే–చిత్తగించుము; నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను–ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును.౹ నేను నీ కాజ్ఞాపించునది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్యవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును;౹ అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను.౹ ఫరో మీ మాట వినడుగాని నేను నా చెయ్యి ఐగుప్తుమీద వేసి గొప్ప తీర్పులచేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెదను.౹ నేను ఐగుప్తుమీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్యనుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.౹ మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, ఆలాగుననే చేసిరి.౹ వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎనుబదియేండ్లు, అహరోనుకు ఎనుబది మూడు ఏండ్లు. [8-9] మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను–ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి–నీ కఱ్ఱను పట్టుకొని ఫరో యెదుట దాని పడ వేయుమనుము; అది సర్పమగును.౹ *** కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమకాజ్ఞా పించినట్లు చేసిరి. అహరోను ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పడవేయగానే అది సర్ప మాయెను.౹ అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి.౹ వారిలో ప్రతివాడును తన కఱ్ఱను పడవేసినప్పుడు అది సర్పమాయెనుగాని అహరోను కఱ్ఱ వారి కఱ్ఱలను మ్రింగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను.౹ తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనియ్యనొల్లడాయెను ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్లుము, ఇదిగో అతడు ఏటిదరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటియొడ్డున నిలిచి పాముగా చేయబడిన కఱ్ఱను చేతపట్టుకొని అతని చూచి–అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగాను హెబ్రీయులదేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు–ఇదివరకు వినకపోతివి.౹ కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీనిబట్టి నీవు తెలిసి కొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న యీ కఱ్ఱతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును.౹ ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపుకొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పు మనెను.౹ మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు అహరోనుతో–నీకఱ్ఱను పట్టుకొని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదులమీదను వారి కాలువలమీదను, వారి చెరువులమీదను, వారి నీటిగుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము; అవి రక్తమగును; ఐగుప్తు దేశమందంతటను మ్రానుపాత్రలలోను రాతిపాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను.౹ యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పైకెత్తి ఏటినీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చబడెను.౹ ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను, ఐగుప్తీయులు ఏటినీళ్లు త్రాగలేక పోయిరి, ఐగుప్తుదేశమందంతట రక్తము ఉండెను.౹ ఐగుప్తు శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అట్లుచేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను.౹ జరిగినదానిని మన స్సున పెట్టక ఫరో తిరిగి తన యింటికి వెళ్లెను.౹ అయితే ఐగుప్తీయులందరు ఏటినీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లకొరకు ఏటిప్రక్కలను త్రవ్విరి. యెహోవా ఏటిని కొట్టి యేడు దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఫరో యొద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము;౹ నీవు వారిని పోనియ్యనొల్లనియెడల ఇదిగో నేను నీ పొలి మేరలన్నిటిని కప్పలచేత బాధించెదను.౹ ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును; అవి నీ యింట నీ పడకగదిలోనికి నీ మంచముమీదికి నీ సేవకులయిండ్లలోనికి నీ జనులమీదికి నీ పొయిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును;౹ ఆ కప్పలు నీ మీదికి నీ జనులమీదికి నీ సేవకులందరిమీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను.౹ మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు అహరోనును చూచి–నీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయలమీదను కాలువలమీదను చెరువులమీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను.౹ శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి.౹ అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి–నా యొద్దనుండి నా జనులయొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడు కొనుడి, అప్పుడు యెహోవాకుబలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదననెను.౹ అందుకు మోషే–నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవకులకొరకును నీ ప్రజలకొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను.౹ అందుకతడు–మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లు నీ మాటచొప్పున జరుగును;౹ అనగా కప్పలు నీ యొద్ద నుండియు నీ యిండ్లలోనుండియు నీ సేవకులయొద్ద నుండియు నీ ప్రజలయొద్దనుండియు తొలగిపోవును; అవి యేటిలోనే ఉండుననెను.౹ మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱ పెట్టగా యెహోవా మోషే మాటచొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను.౹ జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపుకొట్టెను.౹ ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినక పోయెను. అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి.౹ అహరోను తన కఱ్ఱను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండెను; ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను.౹ శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరిగాని అది వారివలన కాకపోయెను. పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండగా శకునగాండ్రు —ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.౹ కాబట్టి యెహోవా మోషేతో —నీవు ప్రొద్దున లేచి ఫరో యెదుట నిలువుము, ఇదిగో అతడు ఏటియొద్దకు పోవును. నీవు అతని చూచి–నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.౹ నీవు నా ప్రజలను పోనియ్యని యెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీయులయిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును.౹ మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించు చున్న గోషెనుదేశమును వినాయించెదను, అక్కడ ఈగలగుంపులుండవు.౹ నా ప్రజలను నీ ప్రజలనుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెననెను.౹ యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగలగుంపులు ఫరో యింటిలోకిని అతని సేవకులయిండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను.౹ అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి–మీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా మోషే— అట్లు చేయతగదు; మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల యెదుట అర్పించినయెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా.౹ మేము అరణ్యములోనికి మూడుదినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదు మనెను.౹ అందుకు ఫరో–మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదనుగాని దూరము పోవద్దు; మరియు నాకొరకు వేడు కొనుడనెను.౹ అందుకు మోషే–నేను నీ యొద్దనుండి వెళ్లి రేపు ఈ యీగల గుంపులు ఫరో యొద్దనుండియు అతని సేవకుల యొద్దనుండియు అతని జనులయొద్ద నుండియు తొలగి పోవునట్లు యెహోవాను వేడుకొందును గాని, యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనియ్యక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.౹ యెహోవా మోషే మాటచొప్పునచేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకులయొద్ద నుండియు అతని ప్రజల యొద్దనుండియు తొలగిపోయెను; ఒక్కటియైనను నిలువలేదు.౹ అయితే ఫరో ఆ సమయమున కూడ తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనియ్యడాయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఫరోయొద్దకు వెళ్లి–నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.౹ నీవు వారిని పోనియ్యనొల్లక ఇంకను వారిని నిర్బంధించినయెడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దులమీదికిని గొఱ్ఱెలమీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును.౹ అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును; ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పు మనెను.౹ మరియు యెహోవా కాలము నిర్ణయించి–రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను.౹ మరునాడు యెహోవా ఆ కార్యముచేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెనుగాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు.౹ ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావ లేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమై నందున జనులను పంపక పోయెను. కాగా యెహోవా–మీరు మీ పిడికిళ్లనిండ ఆవపు బుగ్గి తీసికొనుడి, మోషే ఫరో కన్నులయెదుట ఆకాశమువైపు దాని చల్లవలెను.౹ అప్పుడు అది ఐగుప్తు దేశ మంతట సన్నపు ధూళియై ఐగుప్తు దేశమంతట మనుష్యులమీదను జంతువులమీదను పొక్కులు పొక్కు దద్దురు లగునని మోషే అహరోనులతో చెప్పెను.౹ కాబట్టి వారు ఆవపుబుగ్గి తీసికొనివచ్చి ఫరో యెదుట నిలిచిరి. మోషే ఆకాశమువైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను.౹ ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువలేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికిని పుట్టెను.౹ అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–హెబ్రీ యులదేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరోయెదుట నిలిచి–నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.౹ సమస్త భూమిలో నావంటివారెవరును లేరని నీవు తెలిసికొనవలెనని ఈ సారి నేను నా తెగుళ్లన్నియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని పంపెదను;౹ భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును.౹ నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని.౹ నీవు ఇంక నా ప్రజలను పోనియ్యనొల్లక వారిమీద ఆతిశయపడుచున్నావు.౹ ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను; ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు.౹ కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగి నది యావత్తును త్వరగా భద్రముచేయుము. ఇంటికి రప్పింపబడక పొలములోఉండు ప్రతిమనుష్యునిమీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.౹ ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను.౹ అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. యెహోవా–నీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తుదేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తుదేశ మంతట పడునని మోషేతో చెప్పెను.౹ మోషే తన కఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను.౹ ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహుబలమైన వాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు.౹ ఆ వడగండ్లు ఐగుప్తుదేశమందంతట మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగ గొట్టెను.౹ అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు.౹ ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి–నేను ఈసారి పాపముచేసియున్నాను; యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులును దుర్మార్గులము;౹ ఇంతమట్టుకు చాలును; ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా మోషే అతని చూచి–నేను ఈ పట్టణమునుండి బయలు వెళ్లగానే నా చేతులు యెహోవావైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇకమీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును.౹ అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను.౹ అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెనుగాని గోధుమలు మిరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు.౹ మోషే ఫరోను విడిచి ఆ పట్టణమునుండి బయలు వెళ్లి యెహోవావైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ యురుములును వడగండ్లును నిలిచిపోయెను, వర్షము భూమిమీద కురియుట మానెను.౹ అయితే ఫరో వర్షమును వడ గండ్లును ఉరుములును నిలిచిపోవుట చూచి, అతడును అతని సేవకులును ఇంక పాపము చేయుచు తమ హృదయములను కఠినపరచుకొనిరి.౹ యెహోవా మోషేద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యక పోయెను. కాగా యెహోవా మోషేతో — ఫరోయొద్దకు వెళ్లుము. నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లును, నేనుచేయు సూచకక్రియలను ఐగుప్తీయుల యెదుట కనుపరచుటకు, నేను వారియెడల జరిగించిన వాటిని వారి యెదుట కలుగజేసిన సూచకక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరచితిననెను.౹ కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి, అతనిని చూచి యీలాగు చెప్పిరి— హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా— నీవు ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.౹ నీవు నా జనులను పోనియ్య నొల్లనియెడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను.౹ ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును, తప్పించుకొనిన శేషమును, అనగా వడగండ్లదెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును.౹ మరియు అవి నీ యిండ్లలోను నీ సేవకులందరి యిండ్లలోను ఐగుప్తీయులందరి యిండ్లలోను నిండిపోవును. నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములోనుండిన నాటనుండి నేటివరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో యెదుటనుండి బయలు వెళ్లెను.౹ అప్పుడు ఫరో సేవకులు అతని చూచి— ఎన్నాళ్లవరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింకను తెలియదా అనిరి.౹ మోషే అహరోనులు ఫరోయొద్దకు మరల రప్పింపబడగా అతడు–మీరు వెళ్లి మీ దేవుడైన యెహోవాను సేవించుడి; అందుకు ఎవరెవరు వెళ్లుదురని వారి నడిగెను.౹ అందుకు మోషే–మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతోకూడ వెళ్లెదమనెను.౹ అందుకతడు–యెహోవా మీకు తోడైయుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు.౹ పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి; మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖమునుండి వారు వెళ్లగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో–మిడతలు వచ్చునట్లు ఐగుప్తుదేశముమీద నీ చెయ్యి చాపుము; అవి ఐగుప్తుదేశముమీదకి వచ్చి యీ దేశపు పైరులన్నిటిని, అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిటిని తినివేయునని చెప్పెను.౹ మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను.౹ ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి, అంతకుమునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను.౹ ఆ దేశమున చీకటికమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలముల కూరయేగాని పచ్చని దేదియు మిగిలియుండలేదు.౹ కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి —నేను మీ దేవుడైన యెహోవాయెడలను మీ యెడలను పాపముచేసితిని.౹ మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొల గించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా అతడు ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.౹ అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహా బలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలువలేదు.౹ అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను. అందుకు యెహోవా మోషేతో–ఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తుదేశముమీద చీకటి చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను.౹ మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తుదేశ మంతయు మూడుదినములు గాఢాంధకారమాయెను.౹ మూడుదినములు ఒకని నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేక పోయెను; అయినను ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.౹ ఫరో మోషేను పిలిపించి–మీరు వెళ్లి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చుననగా మోషే–మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణలనిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను.౹ మా పశువులును మాతోకూడ రావలెను. ఒక డెక్కయైనను విడువబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలోనుండి తీసికొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరకమునుపు మాకు తెలియదనెను.౹ అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనియ్య నొల్లక యుండెను.౹ గనుక ఫరో–నా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను.౹ అందుకు మోషే–నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–ఫరో మీదికిని ఐగుప్తుమీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటుతరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.౹ కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము.౹ యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. మోషే ఫరోతో ఇట్లనెను–యెహోవా సెలవిచ్చిన దేమనగా–మధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను.౹ అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు; జంతు వులలోను తొలిపిల్లలన్నియు చచ్చును.౹ అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు.౹ యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతు వులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.౹ అప్పుడు నీ సేవకు లైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి–నీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలందరును బయలు వెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుదుననెను. మోషే ఆలాగు చెప్పి ఫరో యొద్దనుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను. అప్పుడు యెహోవా–ఐగుప్తుదేశములో నా మహ త్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను.౹ మోషే అహరోనులు ఫరో యెదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్య డాయెను. మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవావారితో ఈలాగు సెలవిచ్చెను — నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.౹ మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో–ఈ నెల దశమినాడు వారు తమతమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను.౹ ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడలవాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను.౹ ఆ గొఱ్ఱెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.౹ నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలోనుండి యైనను మేకలలోనుండియైనను దాని తీసికొనవచ్చును.౹ ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమతమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిను యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను;౹ దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.౹ మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేతపట్టుకొని, త్వరపడుచు దాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.౹ ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతు వులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను.౹ మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.౹ కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను.౹ ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్లలోనుండి పొంగినది పార వేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినమువరకు పులిసినదానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును.౹ ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవదినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు.౹ పులియనిరొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను; ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును.౹ మొదటి నెల పదునాలుగవదినము సాయంకాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవదినము సాయంకాలమువరకు మీరు పులియనిరొట్టెలను తినవలెను.౹ ఏడు దినములు మీ యిండ్లలో పొంగినదేదియును ఉండకూడదు, పులిసిన దానిని తినువాడు అన్యుడేగాని దేశములో పుట్టినవాడేగాని ఇశ్రాయేలీయుల సమాజములో నుండక కొట్టివేయబడును.౹ మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెను–మీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి.౹ మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములోనున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదు.౹ యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారముచేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు.౹ కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను.౹ యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను.౹ మరియు మీ కుమారులు–మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు మీరు–ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీ యులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయులయిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారముచేసిరి.౹ అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగుచేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీయొక్క తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను.౹ ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.౹ ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో —మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజలమధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి.౹ మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.౹ ఐగుప్తీయులు–మనమందరము చచ్చిన వారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతముచేసిరి.౹ కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియకమునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టుకొని, తమ భుజములమీద పెట్టుకొనిపోయిరి.౹ ఇశ్రాయేలీయులు మోషే మాటచొప్పున చేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి.౹ యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లువారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కో తుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.౹ అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను.౹ వారు ఐగుప్తులోనుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయ లేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు.౹ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.౹ ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరిపోయెను.౹ ఆయన ఐగుప్తుదేశములోనుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమతమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను–ఇది పస్కాపండుగనుగూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదుగాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును.౹ పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.౹ మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలోనుండి బయటికి తీసికొని పోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువకూడదు.౹ ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను.౹ నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములోచేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు.౹ దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలెననెను.౹ ఇశ్రాయేలీయులందరు ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.౹ యెహోవా ఇశ్రాయేలీయులను వారివారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను. మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను –ఇశ్రాయేలీయులలో మనుష్యులయొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను.౹ మోషే ప్రజలతో నిట్లనెను–మీరు దాస గృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి. యెహోవా తన బాహు బలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసిన దేదియు తినవద్దు.౹ ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా.౹ యెహోవా–నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై యుండు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను.౹ ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, ఏడవదినమున యెహోవా పండుగ ఆచరింపవలెను.౹ పులియని వాటినే యేడు దినములు తినవలెను. పులిసినదేదియు నీయొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోను పొంగినదేదియు నీయొద్ద కనబడకూడదు.౹ మరియు ఆ దినమున నీవు–నేను ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసినదాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను.౹ యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను బయటికి రప్పించెననుటకు, ఈ ఆచారము నీ చేతిమీద నీకు సూచనగాను నీ కన్నులమధ్య జ్ఞాపకార్థముగా ఉండును.౹ కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. యెహోవా నీతోను నీ పితరులతోను ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత ప్రతి తొలి చూలుపిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగసంతానము యెహోవా దగును.౹ ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని యెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగ వానిని వెలయిచ్చి విడిపింపవలెను.౹ ఇకమీదట నీ కుమారుడు–ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి–బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను.౹ ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తుదేశములో తొలి సంతాన మంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను.౹ బాహు బలముచేత యెహోవా మనలను ఐగుప్తులోనుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతిమీద సూచనగాను నీ కన్నులమధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను. మరియు ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడు–ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయులదేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు.౹ అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱసముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి.౹ మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొని వచ్చెను. అతడు–దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును; అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని ఇశ్రాయేలీయులచేత రూఢిగా ప్రమాణము చేయించుకొని యుండెను.౹ వారు సుక్కోతునుండి ప్రయాణమై పోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి.౹ వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవాత్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.౹ ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు. మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను –ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య నున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను.౹ ఫరో ఇశ్రాయేలీయులనుగూర్చి–వారు ఈ దేశములో చిక్కు బడి యున్నారు; అరణ్యము వారిని మూసి వేసెనని అను కొనును.౹ అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను; అతడు వారిని తరుమగా; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయులందరు తెలిసికొందురనెను. వారు ఆలాగు దిగిరి.౹ ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి —మనమెందుకీలాగు చేసితిమి? మన సేవలో నుండకుండ ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పు కొనిరి.౹ అంతట అతడు తన రథమును సిద్ధపరచుకొని, తన జనమును తనతోకూడ తీసికొని పోయెను.౹ మరియు అతడు శ్రేష్ఠమైన ఆరువందల రథములను ఐగుప్తు రథముల నన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడుకొనిపోయెను.౹ యెహోవా ఐగుప్తురాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలు వెళ్లుచుండిరి.౹ ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱములన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి.౹ ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి.౹ అంతట వారు మోషేతో–ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పినమాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటె ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి.౹ అందుకు మోషే–భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగ జేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.౹ యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో–నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? —సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము.౹ నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.౹ ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చు కొందును.౹ నేను ఫరోవలనను అతని రథములవలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.౹ అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను.౹ అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు.౹ మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొల గించి దానిని ఆరిన నేలగా చేసెను.౹ నీళ్లు విభజింప బడగా ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.౹ ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.౹ అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండువైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడునట్లుచేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు —ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవావారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో–ఐగుప్తీయులమీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.౹ మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను.౹ నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.౹ అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను.౹ ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్రతీరమున చూచిరి.౹ యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవానుగూర్చి యీ కీర్తన పాడిరి— యెహోవానుగూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను. యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎఱ్ఱసముద్రములో మునిగిపోయిరి అగాధజలములు వారిని కప్పెనువారు రాతివలె అడుగంటిపోయిరి. యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితక గొట్టును. నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయమువలన అణచివేయుదువు నీ కోపాగ్నిని రగులజేయుదువు అది వారిని చెత్తవలె దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరివలన నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధజలములు సముద్రముమధ్య గడ్డకట్టెను –తరిమెదను కలిసికొనియెదను దోపుడుసొమ్ము పంచుకొనియెదను వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసితివి సముద్రము వారిని కప్పెనువారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి. యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మ్రింగివేసెను. నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడి పించితివి. జనములు విని దిగులుపడును ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు. భయము అధికభయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీచేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందువారిని నిలువ పెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ఫరో గుఱ్ఱములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యెహోవావారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేతపట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను— యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎఱ్ఱసముద్రమునుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడుదినములు నడిచిరి; అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి.౹ మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను.౹ ప్రజలు–మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగు కొనగా అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురము లాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి,౹ –మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.౹ తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యీతచెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లయొద్ద దిగిరి. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరిన రెండవనెల పదునైదవదినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి.౹ ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజ మంతయు మోషే అహరోనులమీద సణిగెను.౹ ఇశ్రాయేలీయులు–మేము మాంసము వండుకొనుకుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావక పోతిమి? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా యెహోవా మోషేను చూచి–ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.౹ మరియు ఆరవదినమునవారు తెచ్చుకొనినదానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలై యుండవలెననెను.౹ అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో–యెహోవా ఐగుప్తు దేశములోనుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును.౹ యెహోవామీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము? మామీద సణుగనేల అనిరి.౹ మరియు మోషే —మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహో వాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను అంతట మోషే అహరోనుతో–యెహోవా సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుమనెను.౹ అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.౹ అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను— నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని నీవు–సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను.౹ కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళెముచుట్టు పడియుండెను.౹ పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను.౹ ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక–ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.౹ మోషే–ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా–ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములోనున్నవారికొరకు కూర్చుకొనవలెననెను.౹ ఇశ్రాయేలీయులు అట్లుచేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి.౹ వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమతమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి.౹ మరియు మోషే–దీనిలో ఏమియు ఉదయమువరకు ఎవరును మిగుల్చు కొనకూడదని వారితో చెప్పెను.౹ అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయమువరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపెట్టి కంపుకొట్టెను. మోషే వారిమీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన యింటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను.౹ ఆరవదినమునవారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజముయొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి.౹ అందుకు అతడు–యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండు కొనుడి, ఉదయమువరకు మిగిలినదంతయు మీకొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను.౹ మోషే ఆజ్ఞాపించి నట్లువారు ఉదయమువరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు.౹ మోషే–నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతిదినము, నేడు అది బయట దొరకదు.౹ ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతిదినమున అనగా ఏడవదినమున అది దొరకదనెను.౹ అట్లు జరిగెను; ప్రజలలో కొందరు ఏడవదినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకక పోయెను.౹ అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను–మీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు? చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవదినమున రెండు దినముల ఆహారము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవదినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడదనెను.౹ కాబట్టి యేడవదినమున ప్రజలు విశ్రమించిరి.౹ ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతి మెరగింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను.౹ మరియు మోషే ఇట్లనెను–యెహోవా ఆజ్ఞాపించినదేమనగా–నేను ఐగుప్తుదేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను.౹ కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను.౹ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను.౹ ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలుబది యేండ్లు మన్నానే తినుచుండిరి; వారు కనానుదేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి.౹ ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము. తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాటచొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లులేనందున మోషేతో వాదిం చుచు–త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే— మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను.౹ అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పి గొని మోషేమీద సణుగుచు–ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులోనుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి.౹ అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచు–ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదు రనెను.౹ అందుకు యెహోవా–నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేతపట్టుకొని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.౹ అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమునుబట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటనుబట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా మోషే యెహోషువతో–మనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను.౹ యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను; మోషే అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి,౹ మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతనిచేతులను ఆదుకొనగా అతనిచేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను.౹ అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.౹ అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను–నేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు విని పించుము.౹ తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరుపెట్టి –అమాలేకీయులు తమచేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి వెలుపలికి రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషేమామయునైన యిత్రో వినినప్పుడు మోషే మామయైన ఆ యిత్రో తనయొద్దకు పంపబడిన మోషే భార్యయైన సిప్పోరాను ఆమె యిద్దరి కుమారులను తోడుకొని వచ్చెను.౹ అతడు–అన్యదేశములో నేను పర దేశిననుకొని వారిలో ఒకనికి గేర్షోము అని పేరుపెట్టెను.౹ –నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాతనుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరని పేరు పెట్టెను.౹ మోషే మామయైన యిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషేయొద్దకు వచ్చెను.౹ –యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతోకూడ ఆమె యిద్దరు కుమారులును నీయొద్దకు వచ్చియున్నామని మోషేకు వర్తమానము పంపగా మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతని ముద్దుపెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి.౹ తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయులకొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసిన దంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను.౹ యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను.౹ మరియు యిత్రో— ఐగుప్తీయుల చేతిలోనుండియు ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించి, ఐగుప్తీయుల చేతిక్రిందనుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక.౹ ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్యమునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసిన దనెను.౹ మరియు మోషే మామయైన యిత్రో ఒక దహనబలిని బలులను దేవునికర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరును మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి.౹ మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయము మొదలుకొని సాయంకాలమువరకు ప్రజలు మోషేయొద్ద నిలిచియుండిరి.౹ మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి–నీవు ఈ ప్రజలకు చేయుచున్న యీ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలమువరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరు నీయొద్ద నిలిచి యుండనేల అని అడుగగా మోషే–దేవుని తీర్పు తెలిసి కొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు.౹ వారికి వ్యాజ్యెము ఏదైనను కలిగినయెడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి, దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్రవిధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను.౹ అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు;౹ నీవును నీతో నున్న యీ ప్రజలును నిశ్చయముగా నలిగిపోవుదురు; ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయచాలవు.౹ కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడై యుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యెములను దేవుని యొద్దకు తేవలెను.౹ నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రవిధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను.౹ మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియమింపవలెను.౹ వారు ఎల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యెములన్నిటిని నీయొద్దకు తేవలెను. ప్రతి అల్పవిషయమును వారే తీర్చవచ్చును. అట్లువారు నీతోకూడ ఈ భారమును మోసినయెడల నీకు సుళువుగా ఉండును.౹ దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చినయెడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరు తమతమ చోట్లకు సమాధానముగా వెళ్లుదురని చెప్పెను.౹ మోషే తన మామమాట విని అతడు చెప్పినదంతయు చేసెను.౹ ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యముగల మనుష్యులను ఏర్పరచుకొని, వెయ్యిమందికి ఒకనిగాను, నూరు మందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజలమీద ప్రధానులనుగా నియమించెను.౹ వారెల్ల ప్పుడును ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యెములను మోషేయొద్దకు తెచ్చుచు, స్వల్పవ్యాజ్యెములను తామే తీర్చుచువచ్చిరి.౹ తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్లెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవనెలలో, వారు బయలుదేరిననాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.౹ వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి.౹ మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి–నీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా –నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి.౹ కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.౹ సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను.౹ అందుకు ప్రజలందరు–యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.౹ యెహోవా మోషేతో–ఇదిగో నేను నీతో మాటలాడు నప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మక ముంచునట్లు నేను కారు మబ్బులలో నీయొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో–నీవు ప్రజలయొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము; వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవనాటికి సిద్ధముగా నుండవలెను; మూడవనాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతముమీదికి దిగివచ్చును.౹ నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరచి–మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమీ ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను.౹ ఎవడును చేతితో దాని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను, మనుష్యుడుగాని మృగముగాని బ్రదుకకూడదు, బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతముయొద్దకు రావలెననెను.౹ అప్పుడు మోషే పర్వతముమీదనుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి.౹ అప్పుడతడు–మూడవనాటికి సిద్ధముగా నుండుడి; ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను.౹ మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూరయొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి.౹ దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములోనుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి.౹ యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.౹ ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.౹ యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరముమీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరముమీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను అప్పుడు యెహోవా–ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము.౹ మరియు యెహోవావారిమీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ముతామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో— ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు–పర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను.౹ అందుకు యెహోవా–నీవు దిగి వెళ్లుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవావారిమీద పడకుండునట్లు యాజకులును ప్రజలును ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు; ఆయన వారిమీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజలయొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పెను. దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.౹ –నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని;౹ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.౹ ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.౹ ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయకూడదు.౹ ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవదినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి –నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడినయెడల మేము చనిపోవుదుము అందుకు మోషే–భయపడకుడి; మిమ్ము పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలు గుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను — ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము–నేను ఆకాశమునుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి.౹ మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసికొనకూడదు.౹ మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహనబలులను సమాధానబలులను నీ గొఱ్ఱెలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను.౹ నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు; దానికి నీ పనిముట్టు తగలనిచ్చినయెడల అది అపవిత్రమగును.౹ మరియు నా బలిపీఠముమీద నీ దిగంబరత్వము కనబడక యుండునట్లు మెట్లమీదుగా దానిని ఎక్కకూడదు. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా –నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడలవాడు ఆరుసంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.౹ వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండినయెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.౹ వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన కుమారులనైనను కుమార్తెలనైనను కనినయెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురుకానివాడు ఒంటిగానే పోవలెను.౹ అయితే ఆ దాసుడు–నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పినయెడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసికొని రావలెను, మరియువాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాతవాడు నిరంతరము వానికి దాసుడైయుండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసు లైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపోకూడదు.౹ దానిని ప్రధానము చేసికొనిన యజమానుని దృష్టికి అది యిష్టురాలు కానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారములేదు.౹ తన కుమారునికి దాని ప్రధానము చేసినయెడల కుమార్తెల విషయమైన న్యాయవిధినిబట్టి దానియెడల జరిగింపవలెను.౹ ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకొనినను, మొదటిదానికి ఆహారమును వస్త్రమును సంసారధర్మమును తక్కువ చేయకూడదు.౹ ఈ మూడును దానికి కలుగజేయని యెడల అది ఏమియు ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును. నరుని చావగొట్టినవానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను.౹ అయితేవాడు చంపవలెనని పొంచి యుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగినయెడలవాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణయించెదను. అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడలవాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షనొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, తనయొద్ద నుంచుకొనినను,వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుటవలనవాడు చావక మంచముమీద పడియుండి తరువాత లేచి తన చేతికఱ్ఱతో బయటికి వెళ్లి తిరుగుచుండినయెడల, వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదుగాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చివాడు అతనిని పూర్తిగా బాగుచేయింపవలెను. ఒకడు తన దాసుడైనను తన దాసియైనను చచ్చునట్లు కఱ్ఱతో కొట్టినయెడల అతడు నిశ్చయముగా ప్రతి దండన నొందును.౹ అయితేవాడు ఒకటి రెండు దినములు బ్రదికినయెడల ఆ ప్రతి దండన అతడు పొందడు,వాడు అతని సొమ్మేగదా.౹ నరులు పోట్లాడుచుండగా గర్భవతియైన స్త్రీకి దెబ్బతగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హానియు రానియెడల హానిచేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వానిమీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను.౹ [23-24] హాని కలిగినయెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు,౹ *** వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినయెడల ఆ కంటి హానినిబట్టి వారిని స్వతంత్రు నిగా పోనియ్యవలెను.౹ వాడు తన దాసుని పల్లయినను తన దాసి పల్లయినను ఊడగొట్టినయెడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులగా పోనియ్యవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు, అయితే ఆ యెద్దు యజమానుడు నిర్దోషియగును.౹ ఆ యెద్దు అంతకు ముందు పొడుచునది అని దాని యజమానునికి తెలుపబడినను,వాడు దాని భద్రము చేయకుండుటవలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినయెడల ఆ యెద్దును రాళ్లతో చావగొట్టవలెను; దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను.౹ వానికి పరిక్రయధనము నియమింపబడినయెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను.౹ అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను.౹ ఆ యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచినయెడల వారి యజమానునికి ముప్పది తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ యెద్దును రాళ్లతో చావకొట్టవలెను. ఒకడు గోతిమీది కప్పు తీయుటవలన, లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుటవలన, దానిలో ఎద్దయినను గాడిదయైనను పడినయెడల ఆ గోతి ఖామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను; వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను; చచ్చినది వానిదగును. ఒకని యెద్దు వేరొకని యెద్దు చచ్చునట్లు దాని పొడి చినయెడల బ్రదికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన యెద్దును పంచుకొనవలెను.౹ అయితే అంతకు ముందు ఆ యెద్దు పొడుచునది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతేవాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను; చచ్చినది వానిదగును. ఒకడు ఎద్దునైనను గొఱ్ఱెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ యెద్దుకు ప్రతిగా అయిదు ఎద్దులను ఆ గొఱ్ఱెకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెలను ఇయ్యవలెను.౹ దొంగ కన్నము వేయుచుండగావాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినయెడల అందువలన రక్తాపరాధ ముండదు.౹ సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టినయెడల వానికి రక్తాపరాధముండును;వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెను. వానికేమియు లేకపోయినయెడలవాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను.౹ వాడు దొంగిలినది ఎద్దయినను గాడిదయైనను గొఱ్ఱెయైనను సరే అది ప్రాణముతో వానియొద్ద దొరికినయెడల రెండం తలు చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్షతోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసినయెడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నియ్యవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుటవలన పంట కుప్పయైనను పంటపైరైనను చేనైనను కాలి పోయినయెడల అగ్ని నంటించినవాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను.౹ ఒకడు సొమ్మయినను సామానైనను జాగ్రత్తపెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని యింటనుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికినయెడలవాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను;౹ ఆ దొంగ దొరకని యెడల ఆ యింటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసికొనెనో లేదో పరిష్కారమగుటకై దేవునియొద్దకు రావలెను.౹ ప్రతి విధమైన ద్రోహమునుగూర్చి, అనగా ఎద్దునుగూర్చి గాడిదనుగూర్చి గొఱ్ఱెనుగూర్చి బట్టనుగూర్చి పోయినదాని నొకడు చూచి యిది నాదని చెప్పిన దానిగూర్చి ఆ యిద్దరి వ్యాజ్యెము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవనిమీద నేరము స్థాపించునోవాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొఱ్ఱెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించినమీదట, అది చచ్చినను హాని పొందినను, ఎవడును చూడకుండగా తోలుకొని పోబడినను,౹ వాడు తన పొరుగువాని సొమ్మును తీసికొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరిమధ్యనుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను; ఆ నష్టమును అచ్చు కొననక్కరలేదు.౹ అది నిజముగా వానియొద్దనుండి దొంగిలబడినయెడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చు కొనవలెను.౹ అది నిజముగా చీల్చబడినయెడలవాడు సాక్ష్యముకొరకు దాని తేవలెను; చీల్చబడినదాని నష్టమును అచ్చుకొన నక్కరలేదు. ఒకడు తన పొరుగువానియొద్ద దేనినైనను బదులు దీసి కొనిపోగా దాని యజమానుడు దానియొద్ద లేనప్పుడు, అది హానిపొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను.౹ దాని యజమానుడు దానితో నుండినయెడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైనయెడల అది దాని అద్దెకు వచ్చెను.౹ ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను మరులుకొల్పి ఆమెతో శయనించినయెడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసికొనవలెను.౹ ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని యెడలవాడు కన్యకల ఓలిచొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు. మృగసంయోగముచేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను.౹ యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు.౹ పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గదా.౹ విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు.౹ వారు నీచేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొఱపెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును.౹ నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను, మీ భార్యలు విధవ రాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కు లేనివారగుదురు. నా ప్రజలలో నీయొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింపకూడదు, వానికి వడ్డికట్టకూడదు.౹ నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడల సూర్యుడు అస్తమించువేళకు అది వానికి మరల అప్పగించుము.౹ వాడు కప్పుకొనునది అదే. అది వాని దేహమునకు వస్త్రము;వాడు మరి ఏమి కప్పుకొని పండు కొనును? నేను దయగలవాడను,వాడు నాకు మొఱపెట్టినయెడల నేను విందును. నీవు దేవుని నిందింపగూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవుచేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను.౹ అట్లే నీ యెద్దులను నీ గొఱ్ఱెలను అర్పింపవలెను. ఏడు దినములు అది దాని తల్లియొద్ద ఉండవలెను. ఎనిమిదవదినమున దానిని నాకియ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను. లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;౹ దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించ వద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు;౹ వ్యాజ్యెమాడువాడు బీదవాడైనను వానియెడల పక్షపాతముగా నుండకూడదు. నీ శత్రువుని యెద్దయినను గాడిదయైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడినయెడల అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెను.౹ నీవు నీ పగవాని గాడిద బరువుక్రింద పడియుండుట చూచి, దానినుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యెములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగానుండుము; నిరప రాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు; నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను.౹ లంచము తీసికొనకూడదు; లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును.౹ పరదేశిని బాధింపకూడదు; పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు; మీరు ఐగుప్తుదేశములో పరదేశులై యుంటిరిగదా. ఆరుసంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను.౹ ఏడవ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్షతోట విషయములోను నీ ఒలీవతోట విషయములోను ఆలాగుననే చేయవలెను.౹ ఆరు దినములు నీ పనులు చేసి, నీ యెద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు ఏడవదినమున ఊరక యుండవలెను.౹ నేను మీతో చెప్పినవాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను; వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు; అది నీ నోటనుండి రానియ్య తగదు. సంవత్సరమునకు మూడుమారులు నాకు పండుగ ఆచరింపవలెను.౹ పులియనిరొట్టెల పండుగ నాచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు.౹ నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంటయొక్క కోతపండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను.౹ సంవ త్సరమునకు మూడుమారులు పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయమువరకు నిలువ యుండకూడదు.౹ నీ భూమి ప్రథమఫలములో మొదటివాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను.౹ ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది.౹ అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును.౹ ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్లుచు, అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను.౹ వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు; వారి క్రియలవంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి, వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను.౹ నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను.౹ కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తిచేసెదను.౹ నన్నుబట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వదేశములవారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ యెదుటనుండి పారిపోవునట్లు చేసెదను.౹ మరియు, పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ యెదుటనుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టును.౹ దేశము పాడై అడవిమృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ యెదుటనుండి వెళ్లగొట్టను.౹ నీవు అభివృద్ధిపొంది ఆ దేశమును స్వాధీనపరచుకొనువరకు క్రమక్రమముగా వారిని నీయెదుటనుండి వెళ్లగొట్టెదను.౹ మరియు ఎఱ్ఱసముద్రమునుండి ఫిలిష్తీయుల సముద్రమువరకును అరణ్యమునుండి నదివరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను, ఆ దేశ నివాసులను నీ చేతి కప్పగించెదను. నీవు నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టెదవు.౹ నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసికొన వద్దు. నీవు వారి దేవతలను సేవించినయెడల అది నీకు ఉరియగును గనుక వారు నీచేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లువారు నీ దేశములో నివసింపకూడదు. మరియు ఆయన మోషేతో ఇట్లనెను–నీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి.౹ మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు.౹ మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరు–యెహోవా చెప్పిన మాట లన్నిటి ప్రకారము చేసెదమని యేకశబ్దముతో ఉత్తర మిచ్చిరి.౹ మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులలో యౌవనస్థులను పంపగా వారు దహనబలులనర్పించి యెహోవాకు సమాధానబలులగా కోడెలను వధించిరి.౹ అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను.౹ అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు —యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.౹ అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి–ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను.౹ తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు ఎక్కి పోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశమండలపు తేజమువంటిదియు ఉండెను.౹ ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను.౹ అతడు పెద్దలను చూచి–మేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను.౹ మోషే కొండమీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను.౹ యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవదినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను.౹ అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్లు నలుబది దినములుండెను. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹ –నాకు ప్రతిష్ఠార్పణ తీసికొనిరండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతిమనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను.౹ మీరు వారియొద్ద తీసికొన వలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి,౹ నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేకవెండ్రుకలు,౹ ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,౹ ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు,౹ లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.౹ నేను వారిలో నివసించునట్లువారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.౹ నేను నీకు కనుపరచువిధముగా మందిరముయొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకఱ్ఱతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు రెండుమూరలునర, దాని వెడల్పు మూరెడు నర, దానియెత్తు మూరెడునర దానిమీద మేలిమి బంగారురేకు పొదిగింపవలెను; లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను; దానిమీద బంగారు జవను చుట్టు కట్టవలెను.౹ దానికి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను.౹ తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను దూర్చవలెను.౹ ఆ మోతకఱ్ఱలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దానియొద్దనుండి తీయకూడదు;౹ ఆ మందసములో నేను నీకిచ్చు శాసనముల నుంచవలెను.౹ మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలునర దాని వెడల్పు మూరెడునర.౹ మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠముయొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.౹ ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనలమీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచవలెను.౹ నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.౹ అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసముమీద నుండు రెండు కెరూబులమధ్యనుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. మరియు నీవు తుమ్మకఱ్ఱతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని యెత్తు మూరెడునర.౹ మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయింపవలెను.౹ దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టును బంగారు జవ చేయవలెను.౹ దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్లకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను బల్ల మోయుటకు మోతకఱ్ఱలు ఉంగరములును బద్దెకు సమీపముగా నుండవలెను.౹ ఆ మోతకఱ్ఱలు తుమ్మకఱ్ఱతో చేసి వాటిమీద బంగారు రేకు పొదిగింపవలెను; వాటితో బల్లమోయబడును.౹ మరియు నీవు దాని పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పణముకు పాత్రలను దానికి చేయవలెను; మేలిమి బంగారుతో వాటిని చేయవలెను.౹ నిత్యమును నా సన్నిధిని సన్నిధిరొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను; నకిషిపనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను; దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమైయుండవలెను.౹ దీపవృక్షముయొక్క ఒక ప్రక్కనుండి మూడుకొమ్మలు, దీపవృక్షముయొక్క రెండవ ప్రక్కనుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కలనుండి ఆరుకొమ్మలు నిగుడవలెను.౹ ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను.౹ మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములును వాటి మొగ్గలును వాటి పువ్వులును ఉండవలెను,౹ దీపవృక్ష ప్రకాండమునుండి నిగుడు ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పున ఉండవలెను.౹ వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును; అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను.౹ నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.౹ దాని కత్తెర దాని కత్తెరచిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను.౹ ఆ ఉపకరణములన్ని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను.౹ కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము. మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గల వాటినిగా చేయవలెను.౹ ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికి ఒకటే కొలత.౹ అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను.౹ తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను.౹ ఒక తెరలో ఏబది కొలుకులను చేసి, ఆ కొలుకులు ఒకదాని నొకటి తగులుకొనునట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.౹ మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే మందిరమగును.౹ మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను.౹ ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు, వెడల్పు నాలుగు మూరలు, పదకొండు తెరల కొలత ఒక్కటే.౹ అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒక దానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటిభాగమున మడవవలెను.౹ తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.౹ మరియు ఏబది యిత్తడి గుండీలను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పవలెను.౹ ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను.౹ మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కలమీద వ్రేలాడవలెను.౹ మరియు ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును దానికిమీదుగా సముద్ర వత్సల తోళ్లతో పై కప్పును చేయవలెను. మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.౹ పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.౹ ప్రతి పలకలో ఒకదాని కొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసిపెట్టవలెను.౹ ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను.౹ మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.౹ [20-21] మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తరదిక్కున, ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలును వాటి నలువది వెండి దిమ్మలు ఉండవలెను.౹ *** పడమటితట్టు మందిరముయొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.౹ మరియు ఆ వెనుక ప్రక్కను మందిరముయొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.౹ అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరముదనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును.౹ పలకలు ఎనిమిది; వాటి వెండి దిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మ లుండవలెను.౹ తుమ్మకఱ్ఱతో అడ్డ కఱ్ఱలను చేయవలెను. మందిరముయొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును పడమటి వైపున మందిరముయొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను;౹ ఆ పలకలమధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరియుండవలెను.౹ ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారురేకును పొదిగింపవలెను.౹ అప్పుడు కొండమీద నీకు కనుపరచబడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్ర కారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను.౹ తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారురేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగా రువి వాటి దిమ్మలు వెండివి.౹ ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.౹ అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసముమీద కరుణాపీఠము నుంచవలెను.౹ అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచవలెను.౹ మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.౹ ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను. మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పుగల బలిపీఠమును తుమ్మకఱ్ఱతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను; దాని యెత్తు మూడు మూరలు.౹ దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.౹ దాని బూడిదె ఎత్తుటకుకుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నియు ఇత్తడితో చేయవలెను.౹ [4-5] మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను.౹ *** మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.౹ ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండవలెను.౹ పలకలతో గుల్లగా దాని చేయవలెను; కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.౹ దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.౹ అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగుగల యవనికలుండవలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి.౹ పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది.౹ తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు.౹ ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.౹ రెండవ ప్రక్కనుపరునైదుమూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు.౹ ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అది పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; దాని స్తంభములు నాలుగు దాని దిమ్మలు నాలుగు.౹ ఆవరణముచుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి.౹ ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబదిమూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి.౹ మందిరసంబంధమైన సేవోపకరణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను. మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించుము.౹ సాక్ష్యపు మందసము ఎదుట నున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలోనుండి నీ యొద్దకు పిలిపింపుము.౹ అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.౹ అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము.౹ పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడైయుండునట్లువారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.౹ వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననారను తీసికొని బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల ఏఫోదును పేనిన సన్ననారతోను చిత్ర కారునిపనిగా చేయవలెను.౹ రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలెను; అట్లు అది సమకూర్పబడియుండును.౹ మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.౹ మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నముమీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను.౹ ముద్రమీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.౹ అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకముకొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును.౹ మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను;౹ సూత్రములవలె అల్లికపనిగా వాటినిచేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధాన పతకము చేయవలెను. ఏఫోదుపనివలె దాని చేయవలెను; బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను.౹ అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను; అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలదై యుండవలెను.౹ దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములుగల పంక్తి మొదటిది;౹ పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది;౹ గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములుగల పంక్తి మూడవ వది;౹ రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములుగల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.౹ ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులుగలవై వారి పేరులచొప్పున పన్నెండుండవలెను. ముద్రమీద చెక్కినవాటివలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను.౹ మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను.౹ పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను.౹ అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను.౹ మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను.౹ మరియు నీవు రెండు బంగారు ఉంగరములుచేసి ఏఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పు నొద్ద, దాని యెదుటి ప్రక్కకు దిగువను, ఏఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలెను.౹ అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదునుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను. అట్లు అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్లునప్పుడు అతడు తన రొమ్ముమీద న్యాయవిధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను.౹ మరియు నీవు న్యాయ విధాన పతకములో ఊరీము తుమ్మీము అనువాటిని ఉంచవలెను; అహరోను యెహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును. మరియు ఏఫోదు నిలువుటంగీని కేవలము నీలిదారముతో కుట్టవలెను.౹ దానినడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంఠ కవచ రంధ్రము వలె దాని రంధ్రముచుట్టు నేతపనియైన గోటు ఉండవలెను.౹ దాని అంచున దాని అంచులచుట్టు నీల ధూమ్ర రక్తవర్ణములుగల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగీ చుట్టు తగిలింపవలెను.౹ ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మపండును ఆ నిలువు టంగీ క్రింది అంచున చుట్టు ఉండవలెను.౹ సేవచేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించు నప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను.౹ మరియు నీవు మేలిమి బంగారు రేకుచేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను.౹ అది పాగామీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను.౹ తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైనవాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను; వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను.౹ మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను. సన్ననారతో పాగాను నేయవలెను; దట్టిని బుట్టాపనిగా చేయవలెను.౹ అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను; వారికి దట్టీలను చేయవలెను; వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్లాయిలను వారికి చేయవలెను.౹ నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను; వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకముచేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను.౹ మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను.౹ వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను, పరిశుద్ధస్థలములో సేవచేయుటకు బలిపీఠమును సమీపించునప్పుడైనను, వారు దోషులై చావక యుండునట్లు అది అహరోనుమీదను అతని కుమారులమీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడెదూడను కళంకములేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసికొనుము.౹ గోధుమపిండితో వాటినిచేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొనిరావలెను.౹ మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసికొని చొక్కాయిని ఏఫోదు నిలువు టంగిని ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసికొని అతని తలమీద పోసి అతని నభిషేకింపవలెను.౹ మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను.౹ అహరోనుకును అతని కుమారులకును దట్టినికట్టి వారికి కుళ్లాయిలను వేయింపవలెను; నిత్యమైన కట్టడనుబట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను ఆలాగున ప్రతిష్ఠింపవలెను.౹ మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమ చేతుల నుంచగా ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను.౹ ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో బలి పీఠపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు టడుగున పోయవలెను.౹ మరియు ఆంత్రములను కప్పు కొను క్రొవ్వంతటిని కాలేజముమీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటిమీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠముమీద దహింపవలెను.౹ ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి.౹ నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాని తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠముచుట్టు దాని ప్రోక్షింపవలెను.౹ అంతట నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోను తలతోను చేర్చి బలిపీఠముమీద ఆ పొట్టేలంతయు దహింపవలెను; అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.౹ మరియు నీవు రెండవ పొట్టేలును తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడిచెవి కొనమీదను అతని కుమారుల కుడి చెవుల కొనమీదను, వారి కుడిచేతి బొట్టన వ్రేళ్లమీదను, వారి కుడికాలి బొట్టనవ్రేళ్లమీదను చమిరి బలిపీఠముమీద చుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.౹ మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోనుమీదను, అతని వస్త్రములమీదను, అతనితోనున్న అతని కుమారులమీదను, అతని కుమారుల వస్త్రములమీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములును అతనితోనున్న అతని కుమారులును అతని కుమారుల వస్త్రములును ప్రతిష్ఠితము లగును.౹ మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజముమీది వపను రెండు మూత్రగ్రంథులను వాటిమీది క్రొవ్వును కుడి జబ్బను ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక భక్ష్యమును యెహోవా యెదుటనున్న పొంగనివాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసికొని అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి, అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.౹ తరువాత నీవు వారి చేతులలోనుండి వాటిని తీసికొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠముమీద దహింపవలెను. అది యెహోవాకు హోమము.౹ మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలునుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను; అది నీ వంతగును.౹ ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను.౹ అది ప్రతిష్ఠార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీయులనుండి అహరోనుకును అతని కుమారులకునగును. అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి తాము చేసిన ప్రతిష్ఠా ర్పణ, అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా నుండును.౹ మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములును అతని తరువాత అతని కుమారులవగును; వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను.౹ అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధస్థలములో సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడు ఏడు దినములు వాటిని వేసికొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొని పరిశుద్ధస్థలములో దాని మాంసమును వండవలెను.౹ అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారముదగ్గర ఆ పొట్టేలు మాంసమును గంప లోని రొట్టెలను తినవలెను.౹ వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటివలన ప్రాయశ్చిత్తము చేయబడెనో వాటిని వారు తినవలెను; అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు.౹ ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయమువరకు మిగిలియుండినయెడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను; అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు.౹ నేను నీ కాజ్ఞాపించిన వాటన్నిటినిబట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. ఏడు దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను.౹ ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థబలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను.౹ ఏడుదినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతిపరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠముమీద నిత్యమును అర్పింపవలసినదేమనగా, ఏడాదివి రెండు గొఱ్ఱెపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొఱ్ఱెపిల్లను సాయంకాలమందు ఒక గొఱ్ఱెపిల్లను అర్పింపవలెను.౹ దంచితీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱెపిల్లను అర్పింపవలెను.౹ అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని నర్పింపవలెను.౹ ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారముయొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును.౹ అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలిసికొందును; అది నా మహిమవలన పరిశుద్ధపరచబడును.౹ నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను.౹ నేను ఇశ్రాయేలీయులమధ్య నివసించి వారికి దేవుడనై యుందును.౹ కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములోనుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలిసికొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను. మరియు ధూపమువేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మకఱ్ఱతో దాని చేయవలెను.౹ దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగా నుండవలెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై యుండవలెను.౹ దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను.౹ దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను; దాని రెండు ప్రక్కలయందలి దాని రెండు మూలలమీద వాటిని ఉంచవలెను.౹ అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను.౹ సాక్ష్యపు మందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను కలిసికొందును.౹ అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను.౹ మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము.౹ మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు; పానీయమునైనను దానిమీద పోయకూడదు.౹ మరియు అహరోను సంవత్సరమున కొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థబలి రక్తమువలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. [11-12] మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణపరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు.౹ *** వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ.౹ ఇరువది సంవత్సరములుగాని అంతకంటె యెక్కువ వయస్సుగాని గలవారై లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను.౹ అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులముకంటె ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్యకూడదు.౹ నీవు ఇశ్రాయేలీయుల యొద్దనుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క సేవనిమిత్తము దాని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటనుచేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను.౹ ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులును తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను.౹ వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును సేవచేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను.౹ తాము చావక యుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తులముల యెత్తును నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులములును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభారముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.౹ ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటిని దీప వృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతిపరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును.౹ మరియు అహరోనును అతని కుమారులును నాకు యాజకులై యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను.౹ మరియు నీవు ఇశ్రాయేలీయులతో–ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేకతైలమై యుండవలెను;౹ దానిని నర శరీరముమీద పోయకూడదు; దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలెను.౹ దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసికొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పుగలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము.౹ దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను.౹ నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను.౹ దాని వాసన చూచుటకు దానివంటిది చేయువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను –చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని.౹ [3-5] విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసియున్నాను.౹ *** *** మరియు నేను దాను గోత్రములోని అహీ సామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసితిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను.౹ ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దానిమీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటిని బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటిని ధూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను యాజకసేవచేయునట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోనుయొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలముకొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. [12-13] మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఇశ్రాయేలీయులతో–నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తర తరములకు నాకును మీకును గురుతగును.౹ *** కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.౹ ఆరు దినములు పనిచేయ వచ్చును; ఏడవదినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము. ఆ విశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును.౹ ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతిదినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది నిత్యనిబంధన.౹ నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము. మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి —లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.౹ అందుకు అహరోను–మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి.౹ అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు–ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.౹ అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠముకట్టించెను. మరియు అహరోను–రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహనబలులను సమాధానబలులనర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి.౹ నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించి–ఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.౹ మరియు యెహోవా ఇట్లనెను–నేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.౹ కావున నీవు ఊరకుండుము; నాకోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని–యెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తుదేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల? –ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడుచేయక దానిగూర్చి సంతాపపడుము.౹ నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితో–ఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.౹ అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడునుగూర్చి సంతాపపడెను. మోషే శాసనములుగల రెండు పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి; అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయ బడియుండెను.౹ ఆ పలకలు దేవుడు చేసినవి; ఆ పలకలమీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత.౹ ఆ ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని–పాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా అతడు–అది జయధ్వనికాదు, అపజయధ్వనికాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను.౹ అతడు పాళెమునకు సమీపింపగా, ఆ దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను; అతడు కొండదిగువను తన చేతులలోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను.౹ మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్లమీద చల్లి ఇశ్రాయేలీయులచేత దాని త్రాగించెను.౹ అప్పుడు మోషే–నీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లువారు నిన్ను ఏమిచేసిరని అహరోనును నడుగగా అహరోను–నా యేలినవాడా, నీ కోపము మండనియ్యకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు.౹ వారు–మాకు ముందునడుచుటకు ఒక దేవతను చేయుము; ఐగుప్తులోనుండి మమ్మును రప్పించినవాడగు ఈ మోషే యేమాయెనో మాకు తెలియదనిరి.౹ అందుకు నేను–ఎవరియొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ యాయెననెను.౹ ప్రజలు విచ్చల విడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచి పెట్టి యుండెను.౹ అందుకు మోషే పాళెముయొక్క ద్వారమున నిలిచి–యెహోవా పక్షమున నున్నవారందరు నాయొద్దకు రండి అనగా లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి.౹ అతడు వారిని చూచి–మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారమునుండి ద్వారమునకు వెళ్లుచు, ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నా డనెను.౹ లేవీయులు మోషే మాటచొప్పున చేయగా, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడువేలమంది కూలిరి.౹ ఏలయనగా మోషే వారిని చూచి–నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారునిమీద పడియేగాని తన సహోదరునిమీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసి కొనుడనెను.౹ మరునాడు మోషే ప్రజలతో–మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవాయొద్దకు కొండ యెక్కి వెళ్లెదను; ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను.౹ అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి–అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి.౹ అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములోనుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాననెను.౹ అందుకు యెహోవా–యెవడు నా యెదుట పాపము చేసెనో వాని నా గ్రంథములోనుండి తుడిచి వేయుదును.౹ కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పినచోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్లును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదనని మోషేతో చెప్పెను.౹ అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవావారిని బాధపెట్టెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవును నీవు ఐగుప్తుదేశమునుండి తోడుకొనివచ్చిన ప్రజలును బయలుదేరి, నేను అబ్రాహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణముచేసి–నీ సంతానమునకు దీని నిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి.౹ నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను అమోరీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను వెళ్లగొట్టెదను.౹ మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతోకూడ రాను; త్రోవలో మిమ్మును సంహరించెదనేమో అని మోషేతో చెప్పెను.౹ ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి; ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.౹ కాగా యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఇశ్రాయేలీయులతో–మీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను.౹ కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి, దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్లుచు వచ్చెను.౹ మోషే ఆ గుడారమునకు వెళ్లినప్పుడు ప్రజలందరును లేచి, ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి, అతడు ఆ గుడారములోనికి పోవువరకు అతని వెనుకతట్టు నిదానించి చూచు చుండెను.౹ మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను.౹ ప్రజలందరు ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుటచూచి, లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి.౹ మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యౌవనస్థుడు గుడారములోనుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను–చూడుము–ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావుగాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు–నేను నీ పేరునుబట్టి నిన్ను ఎరిగియున్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా.౹ కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగినయెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును; చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలేగదా అనెను.౹ అందుకు ఆయన–నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా మోషే–నీ సన్నిధి రానియెడల ఇక్కడనుండి మమ్మును తోడుకొని పోకుము.౹ నాయెడలను నీ ప్రజలయెడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును? నీవు మాతో వచ్చుటవలననే గదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమిమీదనున్న సమస్త ప్రజలలోనుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. కాగా యెహోవా–నీవు చెప్పిన మాటచొప్పున చేసెదను; నీమీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు–దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన–నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరు ణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను.౹ మరియు ఆయన–నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.౹ మరియు యెహోవా–ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండమీద నిలువవలెను.౹ నా మహిమ నిన్ను దాటి వెళ్లుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్లువరకు నా చేతితో నిన్ను కప్పెదను;౹ నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. మరియు యెహోవా మోషేతో–మొదటి పలకల వంటి మరి రెండు రాతిపలకలను చెక్కుము. నీవు పగుల గొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద వ్రాసెదను.౹ ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరముమీద నా సన్నిధిని నిలిచియుండవలెను.౹ ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు; ఏ నరుడును ఈ కొండమీద ఎక్కడనైనను కనబడకూడదు; ఈ కొండయెదుట గొఱ్ఱెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను.౹ కాబట్టి అతడు మొదటి పలకలవంటి రెండు రాతిపలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతిపలకలను చేతపట్టుకొని సీనాయికొండ యెక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.౹ అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు–యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా ఆయన వేయివేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించునుగాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికిని కుమారుల కుమారులమీదికిని రప్పించునని ప్రకటించెను.౹ అందుకు మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని నమస్కారముచేసి –ప్రభువా, నామీద నీకు కటాక్షము కలిగినయెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మామధ్యను ఉండి మాతోకూడ రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసికొను మనెను అందుకు ఆయన–ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను; భూమిమీద ఎక్కడనైనను ఏజనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరియెదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరును యెహోవా కార్యమును చూచెదరు. నేను నీయెడల చేయబోవునది భయంకరమైనది.౹ నేడు నేను నీ కాజ్ఞా పించుదాని ననుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీ యులను కనానీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను నీ యెదుటనుండి వెళ్ల గొట్టెదను.౹ నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును.౹ కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతాస్తంభములను పడగొట్టవలెను.౹ ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు.౹ ఆ దేశపు నివాసులతో నిబంధనచేసికొనకుండ జాగ్రత్త పడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచినయెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము.౹ మరియు నీవు నీ కుమారులకొరకు వారి కుమా ర్తెలను పుచ్చుకొనునెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో.౹ పోతపోసిన దేవతలను చేసికొన వలదు.౹ మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబునెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి.౹ ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయేగాని గొఱ్ఱెపిల్లయేగాని అది నాదగును గొఱ్ఱెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను, దాని విమోచింపనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలువాని విడిపింపవలెను, నా సన్నిధిని వారు వట్టిచేతులతో కనబడవలదు.౹ ఆరు దినములు నీవు పనిచేసి యేడవదినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయుకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను.౹ మరియు నీవు గోధుమలకోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను సంవత్స రాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలెను.౹ సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరు ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను ఏలయనగా నీ యెదుటనుండి జనములను వెళ్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశిం పడు.౹ నీవు పులిసినదానితో నా బలిరక్తమును అర్పింపకూడదు; పస్కాపండుగలోని బలిసంబంధమైన మాంసమును ఉదయకాలమువరకు ఉంచకూడదు.౹ నీ భూమియొక్క ప్రథమఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనెను.౹ మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–ఈ వాక్యములను వ్రాసికొనుము; ఏలయనగా ఈ వాక్యములనుబట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసియున్నాను.౹ అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతోకూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను. మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములుగల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు.౹ అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.౹ మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగి వచ్చిరి, మోషే వారితో మాటలాడెను.౹ అటుతరువాత ఇశ్రాయేలీయులందరు సమీపింపగా సీనాయికొండమీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికాజ్ఞాపించెను.౹ మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖముమీద ముసుకు వేసికొనెను.౹ అయినను మోషే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చువరకు ఆ ముసుకు తీసివేసెను; అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడినదానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను.౹ మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి; మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్లువరకు తన ముఖముమీద ముసుకు వేసికొనెను. మోషే ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగు చేసి–మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధు లేవనగా ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్షనొందును.౹ విశ్రాంతిదినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్ట కూడదని వారితో చెప్పెను. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వసమాజముతో ఇట్లనెను–యెహోవా ఆజ్ఞాపించినదేమనగా –మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి,౹ నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్ననార మేకవెండ్రుకలు,౹ [7-8] ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱ, ప్రదీపమునకు తైలము, అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు,౹ *** ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొని రావలెను.౹ మరియు వివేక హృదయులందరు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నియు చేయవలెను.౹ అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకఱ్ఱలు దాని స్తంభములు దాని దిమ్మలు.౹ మందసము దాని మోతకఱ్ఱలు, కరుణాపీఠము కప్పు తెర,౹ బల్ల దాని మోతకఱ్ఱలు దాని ఉపకరణములన్నియు, సన్నిధి రొట్టెలు,౹ వెలుగుకొఱకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు, దీపములకు తైలము ధూపవేదిక దాని మోతకఱ్ఱలు, అభిషేకతైలము పరిమళద్రవ్య సంభారము, మందిరద్వారమున ద్వారమునకు తెర.౹ దహన బలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకఱ్ఱలు దాని యుపకరణములన్నియు, గంగాళము దాని పీట ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్లు పరిశుద్ధస్థలములో సేవచేయుటకు సేవావస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములునవియే అనెను. ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుటనుండి వెడలిపోయెను.౹ తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పని కొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి.౹ స్త్రీలుగాని పురుషులుగాని యెవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను తావళములను, సమస్తవిధమైన బంగారు వస్తువులను తెచ్చిరి.౹ మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, వీటిలో ఏవి యెవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి.౹ వెండిగాని యిత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకఱ్ఱ యెవని యొద్దనుండెనోవాడు దాని తెచ్చెను.౹ మరియు వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననార నూలును తెచ్చిరి.౹ ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలను వడికిరి.౹ ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేతపచ్చలను సుగంధద్రవ్యమును, దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి.౹ మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. [30-33] మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను— చూడుడి; యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు.౹ *** *** *** అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను.౹ చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపనిచేయువాడేమి నేతగా డేమిచేయు సమస్తవిధములైన పనులు, అనగా ఏ పని యైనను చేయువారియొక్కయు విచిత్రమైన పని కల్పించు వారియొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు. పరిశుద్ధస్థలముయొక్క సేవనిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞావివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరును యెహోవా ఆజ్ఞాపించిన అంతటిచొప్పున చేయుదురనెను.౹ బెసలేలును అహోలీయాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరిని మోషే పిలిపించెను.౹ ఆ పని చేయుటకై వారు పరిశుద్ధస్థలముయొక్క సేవకొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటిని మోషేయొద్ద నుండి తీసికొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంక ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి.౹ అప్పుడు పరిశుద్ధస్థల సంబంధమైన పని అంతయుచేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయుపని విడిచివచ్చి మోషేతో–చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటె బహు విస్తారము తీసికొని వచ్చుచున్నారని చెప్పగా మోషే–పరిశుద్ధస్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీయైనను ఇకమీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి; ఆ పని అంతయు చేయునట్లు దానికొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసికొనివచ్చుట మానిరి. ఆ పని చేసినవారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేసెను.౹ ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు; ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే.౹ అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్చెను; మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను.౹ మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలినూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను.౹ ఒక తెరలో ఏబది కొలుకులను చేసెను, రెండవ కూర్పునున్న తెర అంచున ఏబదికొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒక దానితో ఒకటి సరిగా నుండెను.౹ మరియు అతడు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒక దానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను. మరియు మందిరముమీద గుడారముగా మేకవెండ్రుకలతో తెరలను చేసెను; వాటిని పదకొండు తెరలనుగా చేసెను.౹ [15-16] ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగుమూరలు; ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను.౹ *** మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబదికొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకులను చేసెను.౹ ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు ఏబది యిత్తడి గుండీలను చేసెను.౹ మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను. మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను.౹ పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర.౹ ప్రతి పలకకు ఒకదాని కొకటి సమదూరముగల కుసులు రెండు ఉండెను. అట్లు మందిరముయొక్క పలకలన్నిటికి చేసెను.౹ కుడివైపున, అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను.౹ ఒక్కొక్క పలకక్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను.౹ [25-26] మందిరముయొక్క రెండవ ప్రక్కకు, అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను, అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేసెను.౹ *** పడమటి దిక్కున మందిరముయొక్క వెనుకప్రక్కను ఆరు పలకలు చేసెను.౹ వెనుకప్రక్కను మందిరముయొక్క మూలలకు రెండు పలకలను చేసెను.౹ అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరముదాక ఒక దానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను.౹ ఎనిమిది పలకలుండెను; వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు; ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను.౹ మరియు అతడు తుమ్మ కఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేసెను. మందిరముయొక్క ఒక ప్రక్క పలకకు అయిదు అడ్డ కఱ్ఱలను మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను, పడమటివైపున మందిరముయొక్క వెనుకప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను చేసెను.౹ పలకలమధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱను ఈ కొననుండి ఆ కొనవరకు చేరియుండ చేసెను.౹ ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకు బంగారు రేకులను పొదిగించెను. మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములుగల అడ్డ తెరను పేనిన సన్ననారతో చేసెను, చిత్రకారుని పనియైన కెరూబులుగలదానిగా దాని చేసెను.౹ దాని కొరకు తుమ్మకఱ్ఱతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటికొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను. మరియు అతడు గుడారపు ద్వారముకొరకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటా పని యైన అడ్డ తెరను చేసెను.౹ దాని అయిదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను; వాటి అయిదు దిమ్మలు ఇత్తడివి. మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర దాని యెత్తు మూరెడునర.౹ లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను.౹ దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములును ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములుండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను.౹ మరియు అతడు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను చొనిపెను.౹ మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర;౹ మరియు రెండు బంగారు కెరూబులను చేసెను, కరుణాపీఠముయొక్క రెండు కొనలను వాటిని నకిషిపనిగా చేసెను.౹ ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనలమీద కెరూబులను చేసెను.౹ ఆ కెరూబులు పైకివిప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒక దానికి ఒకటి ఎదురుగా ఉండెను; వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను. మరియు అతడు తుమ్మకఱ్ఱతో బల్లను చేసెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని యెత్తు మూరెడునర.౹ అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను;౹ దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టు బంగారు జవను చేసెను.౹ దానికి నాలుగు బంగారు ఉంగ రములను పోతపోసి దాని నాలుగు కాళ్లకుండిన నాలుగు మూలలయందు ఆ ఉంగరములను వేసెను.౹ బల్లను మోయుటకు మోతకఱ్ఱలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా నుండెను.౹ బల్లను మోయుటకు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను.౹ మరియు నతడు బల్లమీదనుండు దాని ఉపకరణములను, అనగా దాని గంగాళములను దాని ధూపకలశములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను. అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకిషిపనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి.౹ దీపవృక్షముయొక్క ఇరుప్రక్కలనుండి మూడేసికొమ్మలు అట్లు దాని ప్రక్కలనుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి.౹ ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులుగల బాదమురూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను.౹ మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులుగల బాదమురూపమైన నాలుగు కలశము లుండెను.౹ దీపవృక్షమునుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను.౹ వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి; అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిషిపనిగా చేయబడెను.౹ మరియు అతడు దాని యేడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెరచిప్పను మేలిమి బంగారుతో చేసెను.౹ దానిని దాని ఉపకరణములన్నిటిని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేసెను. మరియు అతడు తుమ్మకఱ్ఱతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు మూరెడు దాని వెడల్పు మూరెడు, అది చచ్చౌకముగా నుండెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు ఏకాండమైనవి.౹ దానికి, అనగా దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను.౹ దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములుగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దాని రెండు ప్రక్కలయందు దాని రెండు మూలలయందు దాని జవకు దిగువను వాటిని వేసెను.౹ దాని మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను.౹ అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను. మరియు అతడు తుమ్మకఱ్ఱతో దహనబలిపీఠమును చేసెను. దాని పొడుగు అయిదు మూరలు దాని వెడల్పు అయిదు మూరలు, అది చచ్చౌకమైనది. దాని యెత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను.౹ దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి; దానికి ఇత్తడిరేకు పొదిగించెను.౹ అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటిని, అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటిని ఇత్తడితో చేసెను.౹ ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసెను.౹ మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱలుండు నాలుగు ఉంగరములను పోతపోసెను.౹ ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను.౹ ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకఱ్ఱలు చొనిపెను; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనిన సన్ననారవియునైన తెరలుండెను.౹ వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది. ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.౹ ఉత్తర దిక్కున నున్న తెరలు నూరు మూరలవి; వాటి స్తంభములు ఇరువది, వాటి యిత్తడి దిమ్మలు ఇరువది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.౹ పడమటి దిక్కున తెరలు ఏబది మూరలవి; వాటి స్తంభములు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.౹ తూర్పువైపున, అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు;౹ ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.౹ అట్లు రెండవ ప్రక్కను, అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.౹ ఆవరణము చుట్టునున్న దాని తెరలన్నియు పేనిన సన్ననారవి.౹ స్తంభముల దిమ్మలు రాగివి, స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. వాటి బోదెలకు వెండిరేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నియు వెండి బద్దలతో కూర్పబడెను.౹ ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములుగలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటాపనిది. దాని పొడుగు ఇరువది మూరలు; దాని యెత్తు, అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా, అయిదు మూరలు.౹ వాటి స్తంభములు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి వంకులు వెండివి.౹ వాటి బోదెలకు వెండిరేకు పొదిగింప బడెను, వాటి పెండెబద్దలు వెండివి, మందిరమునకును దాని చుట్టునున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నియు ఇత్తడివి. మందిరపదార్థముల మొత్తము, అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయులచేత మోషే మాటచొప్పున లెక్కపెట్టించెను.౹ యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను.౹ దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబు అతనికి తోడైయుండెను. ఇతడు చెక్కువాడును విచిత్రమైనపని కల్పించువాడును నీల ధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపని చేయువాడునై యుండెను. పరిశుద్ధస్థలవిషయమైన పని అంతటిలోను పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు, అనగా ప్రతిష్ఠింప బడిన బంగారు పరిశుద్ధస్థలపు తులము చొప్పున నూట పదహారుమణుగుల ఐదువందల ముప్పది తులములు.౹ సమాజములో చేరినవారి వెండి పరిశుద్ధస్థలపు తులముచొప్పున నాలుగువందల మణుగుల వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులములు.౹ ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమందిలో తలకొకటికి అరతులము.౹ ఆ నాలుగువందల వెండి మణుగులతో పరిశుద్ధస్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలును; అనగా ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నాలుగు వందల మణుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను.౹ వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండెబద్దల చేత కట్టెను.౹ మరియు ప్రతిష్ఠింపబడిన యిత్తడి రెండువందల ఎనుబది మణుగుల రెండువేల నాలుగువందల తులములు.౹ అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటిని చుట్టునున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటిని చుట్టునున్న ఆవరణమునకు మేకులన్నిటిని చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధస్థలములో అహరోనుచేయు సేవనిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములుగల సేవావస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. మరియు అతడు బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను ఏఫోదును చేసెను.౹ నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగెలుగా కత్తిరించిరి.౹ దానికి కూర్చు భుజఖండములను చేసిరి, దాని రెండు అంచులయందు అవి కూర్పబడెను.౹ దానిమీదనున్న దాని విచిత్రమైన దట్టి యేకాండమై దానితో సమమైన పని గలిగి బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతోను చేయబడెను; అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు బంగారు జవలలో పొదిగిన లేతపచ్చలను సిద్ధపరచిరి. ముద్రలు చెక్కబడునట్లు ఇశ్రాయేలీయుల పేళ్లు వాటిమీద చెక్కబడెను.౹ అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజములమీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదుపనివలె బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పంక్తులతోను సన్న నారతోను చిత్రకారునిపనిగా పతకమును చేసెను.౹ అది చచ్చౌకముగా నుండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలది.౹ వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేధిక మరకతములుగల పంక్తి మొదటిది;౹ పద్మరాగ నీల సూర్యకాంత మణులుగల పంక్తి రెండవది;౹ గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమునుగల పంక్తి మూడవది;౹ రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతమునుగల పంక్తి నాలుగవది; వాటివాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను.౹ ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేళ్ల చొప్పున, పండ్రెండు ముద్రలవలె చెక్కబడిన వారి పేళ్ల చొప్పున, పండ్రెండు గోత్రముల పేళ్లు ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క పేరు చెక్కబడెను.౹ మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లికపనియైన గొలుసులు చేసిరి.౹ వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములును చేసి ఆ రెండు ఉంగరములును పతకపు రెండు కొనలను ఉంచి అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలోవేసి అల్లబడిన ఆ రెండు గొలుసుల కొనలను ఆ రెండు జవలకు తగిలించి ఏఫోదు భుజఖండములమీద దాని యెదుట ఉంచిరి.౹ మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి.౹ మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పునొద్దనున్న దాని యెదుటి ప్రక్కను, ఏఫోదు రెండు భుజఖండములకు దిగువను వాటిని వేసిరి.౹ ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదునుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలిసూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లికపనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్య నున్న రంధ్రము కవచరంధ్రమువలె ఉండెను.౹ అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టు ఒక గోటు ఉండెను.౹ మరియు వారు చొక్కాయి అంచులమీద నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి.౹ మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మపండ్లమధ్యను, అనగా ఆ చొక్కాయి అంచులమీద చుట్టునున్న దానిమ్మపండ్లమధ్యను ఆ గంటలను పెట్టిరి.౹ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవచేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మపండును ఆ చొక్కాయి అంచులమీద చుట్టు ఉంచిరి. [27-29] మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లువారు అహరోనుకును అతని కుమారులకును నేతపనియైన సన్న నార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుళ్లాయిలను పేనిన సన్ననార లాగులను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటాపనియైన నడికట్టును చేసిరి. *** *** మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లువారు మేలిమి బంగారుతో పరిశుద్ధకిరీట భూషణము చేసి చెక్కిన ముద్రవలె దానిమీద — యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి.౹ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి.౹ ప్రత్యక్షపు గుడారపు మందిరముయొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి. అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నిటిని దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మలను,౹ ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్రవత్సల తోళ్ల పైకప్పును, కప్పు తెరను,౹ సాక్ష్యపు మందసమును దాని మోత కఱ్ఱలను, కరుణాపీఠమును,౹ బల్లను, దాని ఉపకరణములన్నిటిని, సముఖపు రొట్టెలను,౹ పవిత్రమైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరణములన్నిటిని దీపముకొరకు తైలమును బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ ధూప ద్రవ్యములను శాలాద్వారమునకు తెరను ఇత్తడి బలిపీఠమును దానికుండు ఇత్తడి జల్లెడను దాని మోతకఱ్ఱలను దాని ఉపకరణములన్నిటిని, గంగాళమును దాని పీటను ఆవరణపు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణద్వారమునకు తెరను దాని త్రాళ్లను దాని మేకులను ప్రత్యక్షపు గుడారములో మందిర సేవకొరకైన ఉపకరణములన్నిటిని, పరిశుద్ధస్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను, అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసికొని వచ్చిరి.౹ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి.౹ మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లువారు దానిని చేసియుండిరి; ఆలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను –మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.౹ అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డ తెరతో కప్పవలెను.౹ నీవు బల్లను లోపలికి తెచ్చి దానిమీద క్రమముగా ఉంచవలసినవాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను.౹ సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిరద్వారమునకు తెరను తగిలింపవలెను.౹ ప్రత్యక్షపు గుడారపు మందిరద్వారము నెదుట దహన బలిపీఠమును ఉంచవలెను;౹ ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకునుమధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను.౹ తెరలచుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణద్వారముయొక్క తెరను తగిలింపవలెను.౹ మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.౹ దహన బలిపీఠమునకు అభిషేకముచేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధమగును.౹ ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకముచేసి దాని ప్రతిష్ఠింపవలెను.౹ మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకముచేసి అతని ప్రతిష్ఠింపవలెను.౹ మరియు నీవు అతని కుమారులను తోడుకొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను.౹ మోషే ఆప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను. రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను.౹ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలనువేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరముమీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను.౹ మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.౹ మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.౹ మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరముయొక్క ఉత్తర దిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను.౹ మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను.౹ మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర యెదుట బంగారు ధూపవేదికను ఉంచి దానిమీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను.౹ మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహనబలిపీఠమును ఉంచి దానిమీద దహనబలి నర్పించి నైవేద్యమును సమర్పించెను.౹ మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళణకొరకు దానిలో నీళ్లు పోసెను.౹ దానియొద్ద మోషేయు అహరోనును అతని కుమారులును తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి.౹ వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును బలిపీఠమునకు సమీపించు నప్పుడును కడుగుకొనిరి.౹ మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరముమీద నిలుచుటచేత మందిరము యెహోవా తేజ స్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను.౹ మేఘము మందిరముమీదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయిరి.౹ ఇదే వారి ప్రయాణపద్ధతి. ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి.౹ ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరముమీద ఉండెను. రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను.౹ –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవులమందలోనుండిగాని గొఱ్ఱెల మందలోనుండిగాని మేకల మందలోనుండిగాని దానిని తీసికొని రావలెను.౹ అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను.౹ అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును.౹ అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.౹ అప్పుడతడు దహనబలిరూపమైన ఆ పశుచర్మమును ఒలిచి, దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠముమీద అగ్నియుంచి ఆ అగ్నిమీద కట్టెలను చక్కగా పేర్చవలెను.౹ అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను.౹ దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠముమీద దహింపవలెను. దహనబలిగా అతడు అర్పించునది గొఱ్ఱెలయొక్కగాని మేకలయొక్కగాని మందలోనిదైనయెడల అతడు నిర్దోషమైన మగదాని తీసికొని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.౹ దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠముమీద నున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను.౹ దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. అతడు యెహోవాకు దహనబలిగా అర్పించునది పక్షి జాతిలోనిదైనయెడల తెల్ల గువ్వలలోనుండిగాని పావురపు పిల్లలలోనుండిగాని తేవలెను.౹ యాజకుడు బలిపీఠముదగ్గరకు దాని తీసికొనివచ్చి దాని తలను త్రుంచి బలిపీఠముమీద దాని దహింపవలెను, దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పుదిక్కున బూడిదెను వేయుచోట దానిని పారవేయవలెను.౹ అతడు దాని రెక్కలసందున దాని చీల్చవలెనుగాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠముమీద, అనగా అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దానిమీద నూనెపోసి సాంబ్రాణి వేసి యాజకులగు అహరోను కుమారులయొద్దకు దానిని తేవలెను. అందులోనుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలిపీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను.౹ ఆ నైవేద్యశేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు, పొంగనిదియునైన గోధుమపిండి అప్పడములేగాని నూనె రాచినదియు పొంగనిదియునైన పూరీలేగాని కావలెను.౹ నీ అర్పణము పెనముమీద కాల్చిన నైవేద్యమైనయెడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమపిండిదై యుండవలెను.౹ అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటిమీద నూనె పోయవలెను. నీవు అర్పించునదికుండలో వండిన నైవేద్యమైనయెడల నూనె కలిసిన గోధుమపిండితో దానిని చేయవలెను.౹ వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవాయొద్దకు తేవలెను. యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలెను.౹ ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును జెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము. మీరు యెహోవాకుచేయు నైవేద్యమేదియు పులిసి పొంగినదానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనెయైనను యెహోవాకు హోమముగా దహింపవలదు.౹ ప్రథమఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చునుగాని బలిపీఠముమీద ఇంపైన సువాసనగా వాటి నర్పింప వలదు.౹ నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధనయొక్క ఉప్పు నీ నైవేద్యముమీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను.౹ నీవు యెహోవాకు ప్రథమఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమఫలముల నైవేద్యముగా అర్పింపవలెను.౹ అది నైవేద్యరూపమైనది, నీవు దానిమీద నూనెపోసి దాని పైని సాంబ్రాణి వేయవలెను.౹ అందులో జ్ఞాపకార్థమైన భాగమును, అనగా విసిరిన ధాన్యములో కొంతయు, నూనెలో కొంతయు, దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము. అతడు అర్పించునది సమాధానబలియైనయెడల అతడు గోవులలోనిది తీసికొని వచ్చినయెడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసికొనిరావలెను.౹ తాను అర్పించుదాని తలమీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.౹ [3-4] అతడు ఆ సమాధాన బలిపశువుయొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటిమీదను డొక్కలమీదనున్న క్రొవ్వును కాలేజముమీదను మూత్రగ్రంథులమీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింవలెను.౹ *** అహరోను కుమారులు బలిపీఠముమీద, అనగా అగ్నిమీది కట్టె లపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. యెహోవాకు సమాధానబలిగా ఒకడు అర్పించునది గొఱ్ఱె మేకలలోనిదైనయెడల అది మగదేగాని ఆడుదేగాని నిర్దోషమైనదాని తీసికొని రావలెను.౹ అతడర్పించు అర్పణము గొఱ్ఱెపిల్లయైనయెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను.౹ తాను అర్పించుదాని తలమీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.౹ ఆ సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది కాలేజముయొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను.౹ యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము.౹ అతడు అర్పించునది మేకయైనయెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను.౹ తాను దాని తలమీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.౹ తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులపైనున్న కాలేజముయొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను.౹ యాజకుడు బలిపీఠముమీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు.౹ అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము— యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనివిషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైనయెడల, ఎట్లనగా –ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసినయెడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.౹ అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసికొనివచ్చి కోడె తలమీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను.౹ ఆయాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరముయొక్క అడ్డతెర యెదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను.౹ అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ములమీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడెయొక్క రక్తశేషమంతయు పోయవలెను.౹ మరియు అతడు పాపపరిహారార్థబలిరూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దానినుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వంతటిని మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల పైనున్న కాలేజముమీది వపను సమాధాన బలియగు ఎద్దునుండి తీసినట్లు దీనినుండి తీయవలెను. యాజకుడు దహనబలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను.౹ ఆ కోడెయొక్క శేషమంతయు, అనగా దాని చర్మము దాని మాంసమంతయు, దాని తల దాని కాళ్లు దాని ఆంత్రములు దాని పేడ పాళెము వెలుపల, బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెలమీద కాల్చివేయవలెను. బూడిదె పారపోయు చోట దానిని కాల్చివేయవలెను. ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదముచేసి, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరానిపని చేసి అపరాధులైనయెడల వారు ఆయాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడునప్పుడు, సంఘము పాపపరిహారార్థబలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను.౹ సమాజముయొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడెమీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను.౹ అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెయొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసికొని రావలెను.౹ ఆయాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని ఏడుమారులు దాని ప్రోక్షింపవలెను.౹ మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ములమీద చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.౹ మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠముమీద దహింపవలెను.౹ అతడు పాపపరిహారార్థబలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను; అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా వారికి క్షమాపణ కలుగును.౹ ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరిహారార్థబలి. అధికారి పొరబాటున పాపముచేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధియైనయెడల అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగమేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి ఆ మేకపిల్ల తలమీద చెయ్యి ఉంచి, దహనబలి పశువును వధించుచోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను.౹ ఇది పాపపరిహారార్థబలి. యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి, దహనబలిపీఠము కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును దహనబలిపీఠము అడుగున పోయవలెను.౹ సమాధానబలి పశువుయొక్క క్రొవ్వువలె దీని క్రొవ్వంతయు బలిపీఠముమీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును. మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరానిపనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైనయెడల తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడినయెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి పాపపరిహారార్థబలి పశువుయొక్క తలమీద తన చెయ్యి ఉంచి, దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను.౹ యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను.౹ మరియు సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును. ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొఱ్ఱెను తీసికొనివచ్చినయెడల నిర్దోషమైనదాని తీసికొనివచ్చి పాపపరిహారార్థబలియగు ఆ పశువు తలమీద చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాపపరిహారార్థబలియగు దానిని వధింపవలెను.౹ యాజకుడు పాపపరిహారార్థబలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.౹ మరియు సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును. ఒకడు ఒట్టు పెట్టుకొనినవాడై తాను చూచినదాని గూర్చిగాని తనకు తెలిసినదానిగూర్చిగాని సాక్షియైయుండి దాని తెలియచేయక పాపము చేసినయెడల అతడు తన దోషశిక్షను భరించును.౹ మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టినయెడల, అది అపవిత్ర మృగ కళేబరమేగాని అపవిత్ర పశుకళేబరమేగాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమేగాని అది అపవిత్రమని తనకు తెలియక పోయినను అతడు అపవిత్రుడై అపరాధి యగును.౹ మనుష్యులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండ అంటినయెడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగినయెడల ఆ సంగతి తెలిసిన తరువాతవాడు అపరాధి యగును.౹ మరియు కీడైనను మేలైనను, మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసెదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసెదనని యొకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనినయెడల, అది తెలిసిన తరువాతవాడు అపరాధియగును.౹ కాబట్టి అతడు వాటిలో ఏవిషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాపవిషయమై యెహోవా సన్నిధికి మందలోనుండి ఆడు గొఱ్ఱెపిల్లనేగాని ఆడు మేకపిల్లనేగాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును.౹ అతడు గొఱ్ఱెపిల్లను తేజాలని యెడల, అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని పాపపరిహారార్థబలిగా ఒకదానిని దహనబలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.౹ అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాపపరిహారార్థమైనదానిని మొదట నర్పించి, దాని మెడనుండి దాని తలను నులమవలెనుగాని దాని నూడదీయకూడదు.౹ అతడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలెను. దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలెను. అది పాపపరిహారార్థబలి.౹ విధిచొప్పున రెండవదానిని దహనబలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును. రెండు తెల్ల గువ్వలైనను రెండు పావురపు పిల్లనైనను తనకు దొరకనియెడల పాపముచేసినవాడు తూమెడు గోధుమపిండిలో పదియవవంతును పాపపరిహారార్థబలి రూపముగా తేవలెను. అది పాపపరిహారార్థబలి గనుక దానిమీద నూనెపోయవలదు. సాంబ్రాణి దానిమీద ఉంచవలదు.౹ అతడు యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది పాపపరిహా రార్థబలి.౹ పై చెప్పినవాటిలో దేని విషయమైనను పాపము చేసినవాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషమువలె యాజకునిదగును. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరబాటున పాపముచేసినయెడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలోనుండి అపరాధ పరిహారార్థబలిగా యెహోవాయొద్దకువాడు తీసికొని రావలెను.౹ పరిశుద్ధమైనదాని విషయములో తాను చేసిన పాపమువలని నష్టము నిచ్చుకొని దానితో అయిదవవంతు యాజకునికియ్యవలెను. ఆయాజకుడు అపరాధపరిహారార్థబలియగు పొట్టేలువలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించినవాటిలో దేనినైనను చేసి ఒకడు పాపియైనయెడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధియై తన దోషమునకు శిక్ష భరించును.౹ కావున నీవు ఏర్పరచిన వెలచొప్పున మందలోనుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధపరిహారార్థబలిగా అతడు యాజకునియొద్దకు తీసికొనిరావలెను. అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పునుగూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును.౹ అది అపరాధపరిహారార్థబలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహముచేసి పాపియైనయెడల, అనగా తనకు అప్పగింపబడినదాని గూర్చియేగాని తాకట్టు ఉంచినదాని గూర్చియేగాని, దోచుకొనినదాని గూర్చియేగాని, తన పొరుగువానితో బొంకినయెడలనేమి, తన పొరుగువాని బలాత్కరించినయెడలనేమి పోయినది తనకు దొరికినప్పుడు దానిగూర్చి బొంకినయెడల నేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగు దురో వాటన్నిటిలో దేనివిషయమైనను అబద్ధప్రమాణము చేసినయెడల నేమి,౹ అతడు పాపముచేసి అపరాధి యగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మునుగూర్చిగాని బలాత్కారముచేతను అపహరించినదానిగూర్చిగాని తనకు అప్పగింపబడినదానిగూర్చిగాని, పోయి తనకు దొరి కినదానిగూర్చిగాని, దేనిగూర్చియైతే తాను అబద్ధప్రమాణము చేసెనో దానినంతయు మరల ఇచ్చుకొనవలెను.౹ ఆ మూలధనము నిచ్చుకొని, దానితో దానిలో అయిదవ వంతును తాను అపరాధ పరిహారార్థబలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను.౹ అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలోనుండి నిర్దోషమైన పొట్టేలును యాజకునియొద్దకు తీసికొని రావలెను.౹ ఆయాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము —ఇది దహనబలినిగూర్చిన విధి. దహనబలిద్రవ్యము ఉదయమువరకు రాత్రి అంతయు బలిపీఠముమీద దహించుచుండును; బలిపీఠముమీది అగ్ని దానిని దహించుచుండును.౹ యాజకుడు తన సన్ననార నిలువుటంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగు కొని బలిపీఠముమీద అగ్ని దహించు దహనబలిద్రవ్యపు బూడిదెను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్రస్థలమునకు ఆ బూడిదెను తీసికొని పోవలెను.౹ బలిపీఠముమీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలువేసి, దానిమీద దహనబలిద్రవ్యమును ఉంచి, సమాధానబలియగు పశువు క్రొవ్వును దహింపవలెను.౹ బలిపీఠముమీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నైవేద్యమునుగూర్చిన విధి యేదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము నెదుట దానిని అర్పించవలెను.౹ అతడు నైవేద్యతైలమునుండియు దాని గోధుమపిండినుండియు చేరెడు పిండిని నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలోనుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను.౹ దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతివారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధస్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను;౹ దాని పులియబెట్టి కాల్చవలదు; నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను. పాపపరిహారార్థబలివలెను అపరాధపరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము.౹ అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –అహరోనుకు అభిషేకముచేసిన దినమున, అతడును అతని సంతతివారును అర్పింపవలసిన అర్పణమేదనగా, ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమపిండిలో పదియవవంతు.౹ పెనముమీద నూనెతో దానిని కాల్చవలెను; దానిని కాల్చినతరువాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్యభాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను.౹ అతని సంతతివారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు ఆలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ, అదంతయు దహింపవలెను.౹ యాజకుడుచేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను; దాని తినవలదు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు అహరోనుకును అతని సంతతివారికిని ఈలాగు ఆజ్ఞాపించుము–పాపపరిహారార్థబలిని గూర్చిన విధి యేదనగా, నీవు దహనబలిరూపమైన పశువులను వధించు చోట పాపపరిహారార్థబలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను; అది అతి పరిశుద్ధము.౹ పాపపరిహారార్థబలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను; పరిశుద్ధస్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను.౹ దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రముమీద ప్రోక్షించినయెడల అది దేనిమీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధస్థలములో ఉదుకవలెను.౹ దాని వండిన మంటికుండను పగులగొట్టవలెను; దానిని ఇత్తడిపాత్రలో వండినయెడల దాని తోమి నీళ్లతో కడుగవలెను.౹ యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము.౹ మరియు పాప పరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచెమైనను అతిపరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను. అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము. దాని గూర్చిన విధి యేదనగా దహనబలి పశువులను వధించుచోట అపరాధపరిహారార్థబలిరూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.౹ దానిలోనుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది క్రొవ్వును కాలేజముమీది వపను తీసి దాని నంతయు అర్పింపవలెను.౹ యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠముమీద వాటిని దహింపవలెను; అది అపరాధపరిహారార్థబలి; యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను;౹ అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.౹ పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధపరిహారార్థబలిని గూర్చిగాని విధియొక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తముచేయు యాజకుని దగును.౹ ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆయాజకుడు అర్పించిన దహనబలిపశువు చర్మము అతనిది; అది అతనిదగును.౹ పొయ్యిమీద వండిన ప్రతి నైవేద్యమును,కుండలోనేగాని పెనముమీదనేగాని కాల్చినది యావత్తును, దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును.౹ అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంటలను అర్పింపవలెను.౹ ఆ పిండివంటలేకాక సమాధానబలి రూపమైన కృతజ్ఞతాబలిద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను.౹ మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధానబలిపశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును.౹ సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు.౹ అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దాని నర్పించు నాడే తినవలెను.౹ మిగిలినది మరునాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంసములో మిగిలినదానిని అగ్నితో కాల్చి వేయవలెను.౹ ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరించును.౹ అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు; అగ్నితో దానిని కాల్చివేయవలెను; మాంసము విషయమైతే పవిత్రులందరు మాంసమును తినవచ్చునుగాని ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహోవాకు అర్పించు సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను తినినయెడలవాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.౹ ఎవడు మనుష్యుల అపవిత్రతనేగాని అపవిత్రమైన జంతువునేగాని యే అపవిత్రమైన వస్తువునేగాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలిపశువు మాంసమును తినునోవాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము — ఎద్దుదేగాని గొఱ్ఱెదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తినకూడదు.౹ చచ్చినదాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చునుగాని దాని నేమాత్రమును తినకూడదు.౹ ఏలయనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.౹ మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు.౹ ఎవడు రక్తము తినునోవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఎవడు యెహోవాకు సమాధానబలిద్రవ్యములను తెచ్చునోవాడు ఆ ద్రవ్యములలోనుండి తాను అర్పించునది యెహోవా సన్ని ధికి తేవలెను.౹ అతడు తన చేతులలోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను.౹ యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును.౹ సమాధానబలిపశువులలోనుండి ప్రతిష్ఠార్పణముగా యాజకునికి కుడి జబ్బనియ్యవలెను.౹ అహరోను సంతతివారిలో ఎవడు సమాధానబలియగు పశువురక్తమును క్రొవ్వును అర్పించునో కుడిజబ్బ వానిదగును.౹ ఏలయనగా ఇశ్రాయేలీయుల యొద్దనుండి, అనగా వారి సమాధానబలిద్రవ్యములలోనుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసికొని, నిత్యమైన కట్టడచొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతివారికిని ఇచ్చియున్నాను.౹ వారు తనకు యాజకులగునట్లు యెహోవావారిని చేర దీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమద్రవ్యములలోనుండినది అభిషేకమునుబట్టి అహరోనుకును అభిషేకమునుబట్టియే అతని సంతతివారికిని కలిగెను.౹ వీటిని ఇశ్రాయేలీయులు వారికియ్యవలెనని యెహోవావారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను.౹ [37-38] ఇది దహనబలిని గూర్చియు అపరాధపరిహారార్థపు నైవేద్యమునుగూర్చియు పాపపరిహా రార్థబలినిగూర్చియు అపరాధపరిహారార్థబలినిగూర్చియు ప్రతిష్ఠితార్పణమునుగూర్చియు సమాధానబలినిగూర్చియు చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసికొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను. మరియు యెహోవా –నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేకతైలమును పాప పరిహారార్థబలిరూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు కూడిరాగా మోషే సమాజముతో–చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను.౹ అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను.౹ తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువుటంగీని, ఏఫోదునువేసి ఏఫోదుయొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి, అతనికి పతకమువేసి ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి అతని తలమీద పాగాను పెట్టి, ఆ పాగామీదను అతని నొసట పరిశుద్ధకిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.౹ మరియు మోషే అభిషేకతైలమును తీసికొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను.౹ అతడు దానిలో కొంచెము ఏడుమారులు బలిపీఠముమీద ప్రోక్షించి, బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను.౹ మరియు అతడు అభిషేకతైలములో కొంచెము అహరోను తలమీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను.౹ అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్లాయిలను పెట్టెను.౹ ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను తీసికొనివచ్చెను. అహరోనును అతని కుమారులును పాపపరిహారార్థబలిరూపమైన ఆ కోడె తలమీద తమ చేతులుంచిరి.౹ దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ములచుట్టు వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాపపరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించెను.౹ మోషే ఆంత్రములమీది క్రొవ్వంతటిని కాలేజముమీది వపను రెండు మూత్రగ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠముమీద దహించెను.౹ మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను.౹ తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని వచ్చెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచిరి.౹ అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షించెను.౹ అతడు ఆ పొట్టేలుయొక్క అవయవములను విడతీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను.౹ అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి, ఆ పొట్టేలంతయు బలిపీఠముమీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది యింపైన సువాసనగల దహనబలి ఆయెను. అది యెహోవాకు హోమము.౹ అతడు రెండవ పొట్టేలును, అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొనిరాగా అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచిరి.౹ మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడిచెవి కొనమీదను అతని కుడిచేతి బొట్టనవ్రేలిమీదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొనమీదను దాని చమిరెను.౹ మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి, వారి కుడిచెవుల కొనలమీదను వారి కుడిచేతుల బొట్టనవ్రేలిమీదను వారి కుడి కాళ్ల బొట్టనవ్రేలిమీదను ఆ రక్తములో కొంచెము చమి రెను. మరియు మోషే బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షించెను తరువాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములమీది క్రొవ్వంతటిని కాలేజముమీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలోనుండి పులియని యొక పిండివంటను నూనె గలదై పొడిచిన యొక భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి, ఆ క్రొవ్వుమీదను ఆ కుడి జబ్బమీదను వాటిని ఉంచి అహరోను చేతులమీదను అతని కుమారుల చేతులమీదను వాటన్నిటిని ఉంచి, అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను.౹ అప్పుడు మోషే వారి చేతులమీదనుండి వాటిని తీసి బలిపీఠముమీద నున్న దహనబలి ద్రవ్యముమీద వాటిని దహించెను. అవి యింపైన సువాసనగల ప్రతిష్ఠార్పణలు. అది యెహోవాకు హోమము.౹ మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణరూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.౹ మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠముమీది రక్తములో కొంతయు తీసి, అహరోనుమీదను అతని వస్త్రములమీదను అతని కుమారులమీదను అతని కుమారుల వస్త్రములమీదను దానిని ప్రోక్షించి, అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను.౹ అప్పుడు మోషే అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనెను–ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి, అహరోనును అతని కుమారులును తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని, ప్రతిష్ఠితద్రవ్యములుగల గంపలోని భక్ష్యములను తినవలెను.౹ ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను.౹ మీ ప్రతిష్ఠదినములు తీరువరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనుండి బయలువెళ్లకూడదు; ఏడు దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్ఠను చేయుచుండును.౹ మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను.౹ మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఏడు దినములవరకు రేయింబగళ్లుండి, యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను; నాకు అట్టి ఆజ్ఞ కలిగెను.౹ యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించిన వన్ని అహరోనును అతని కుమారులును చేసిరి. ఎనిమిదవదినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను–నీవు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన యొక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసికొని రమ్ము.౹ మరియు నీవు ఇశ్రాయేలీయులతో–మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించునట్లు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన మేక పిల్లను, దహనబలిగా నిర్దోషమైన యేడాది దూడను గొఱ్ఱెపిల్లను సమాధానబలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసికొని రండి; నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము.౹ మోషే ఆజ్ఞాపించినవాటిని వారు ప్రత్యక్షపు గుడారము నెదుటికి తీసికొనివచ్చిరి. సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా మోషే–మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే; అట్లు చేయుడి. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను.౹ మరియు మోషే అహరోనుతో ఇట్లనెను–నీవు బలిపీఠమునొద్దకు వెళ్లి పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి ప్రజల కొరకు అర్పణము చేసి, యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము.౹ కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తనకొరకు పాపపరిహారార్థబలిగా ఒక దూడను వధించెను.౹ అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను.౹ దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజముమీది వపను బలిపీఠముమీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.౹ దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను.౹ అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తము నప్పగింపగా అతడు బలిపీఠముచుట్టు దానిని ప్రోక్షించెను.౹ మరియు వారు దహన బలిపశువుయొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠముమీద వాటిని దహించెను.౹ అతడు దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపీఠముమీదనున్న దహనబలి ద్రవ్యముపైని దహించెను.౹ అతడు ప్రజల అర్పణమును తీసికొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థబలియగు మేకను తీసికొని వధించి మొదటి దానివలె దీనిని పాప పరిహారార్థబలిగా అర్పించెను.౹ అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధి చొప్పున దాని నర్పించెను.౹ అప్పుడతడు నైవేద్యమును తెచ్చి దానిలోనుండి చేరెడు తీసి ప్రాతఃకాలమందు చేసిన దహనబలిగాక బలిపీఠముమీద తీసినదానిని దహించెను.౹ మరియు మోషే ప్రజలు అర్పించు సమాధానబలిరూపమైన కోడెదూడను పొట్టేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టుదానిని ప్రోక్షించెను.౹ మరియు వారు ఆ దూడ క్రొవ్వును మేకక్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజముమీది వపను అప్పగించిరి.౹ బోరలమీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహించెను.౹ బోరలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.౹ అప్పుడు అహరోను పాప పరిహారార్థబలిని దహనబలిని సమాధానబలిని అర్పించి, ప్రజలవైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను.౹ మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికివచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను.౹ యెహోవా సన్నిధినుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠము మీదనున్న దహనబలిద్రవ్యమును క్రొవ్వును కాల్చి వేసెను; ప్రజలందరు దానిని చూచి ఉత్సాహధ్వనిచేసి సాగిలపడిరి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమతమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి.౹ అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను–ఇది యెహోవా చెప్పిన మాట–నాయొద్దనుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును;౹ అహరోను మౌనముగానుండగా మోషే అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి–మీరు సమీపించి పరిశుద్ధ స్థలము నెదుటనుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసికొని పోవుడని వారితో చెప్పెను.౹ మోషే చెప్పినట్లువారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసికొనిపోయిరి.౹ అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో–మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజముమీద ఆగ్రహపడకుండునట్లును, మీరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు కాని, యెహోవావారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల యింటివారందరు ఏడవ వచ్చును.౹ యెహోవా అభిషేకతైలము మీమీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనుండి బయలు వెళ్ల కూడ దనెను. వారు మోషే చెప్పిన మాటచొప్పున చేసిరి. [8-9] మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను–మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చునప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు.౹ *** మీరు ప్రతిష్ఠింపబడిన దానినుండి లౌకికమైనదానిని, అపవిత్రమైనదానినుండి పవిత్రమైనదానిని వేరుచేయుటకును,౹ యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైనకట్టడ. అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఇట్లనెను— మీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసికొని అది పొంగకుండ బలిపీఠము దగ్గర తినుడి; అది అతిపరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములోనుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడినవంతు.౹ కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను; నేను అట్టి ఆజ్ఞను పొందితిని.౹ మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు, అనగా నీవును నీతోపాటు నీ కుమారులును నీ కుమార్తెలును పవిత్రస్థలములో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు.౹ హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించునట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసికొని రావలెను. నిత్యమైన కట్టడచొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. అప్పుడు మోషే పాపపరిహారార్థబలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయి యుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారిమీద ఆగ్రహపడి –మీరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థబలిపశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధముగదా. సమాజముయొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా.౹ ఇదిగో దాని రక్తమును పరిశుద్ధస్థలములోనికి తేవలెను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధస్థలములో దానిని తినవలెనని చెప్పెను.౹ అందుకు అహరోను మోషేతో–ఇదిగో నేడు పాప పరిహారార్థబలిపశువును దహనబలిద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాపపరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినినయెడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను.౹ మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి–భూమిమీదనున్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును;౹ జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చునుగాని నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు, ఒంటె నెమరువేయునుగాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.౹ పొట్టి కుందేలు నెమరువేయునుగాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.౹ కుందేలు నెమరు వేయునుగాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.౹ పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము.౹ వాటి మాంసమును మీరు తినకూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్రములోనేమి, నదులలోనేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును.౹ సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచరములలోను సమస్త జలజంతువులలోను వేటికి రెక్కలు పొలు సులు ఉండవో అవన్నియు మీకు హేయములు;౹ అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను.౹ నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,౹ క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద,౹ [15-17] ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతివిధమైన డేగ,౹ *** *** పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ,౹ సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము. రెక్కలుకలిగి నాలుగుకాళ్లతో చరించు చరములన్నియు మీకు హేయములు.౹ అయితే నాలుగుకాళ్లతో చరించుచు నేల గంతులువేయుటకు కాళ్లమీద తొడలు గల పురుగులన్ని తినవచ్చును.౹ నేత మిడతగాని చిన్నమిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును.౹ నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.౹ వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹ వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹ రెండుడెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు, నెమరువేయకయు నుండునవి మీకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును.౹ నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును;౹ వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును; అవి మీకు అపవిత్రమైనవి. నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్రమైనవి ఏవేవనగా, చిన్నముంగిస, చిన్నపందికొక్కు, ప్రతి విధమైన బల్లి,౹ ఊసరవెల్లి, నేలమొసలి, తొండ, సరటము, అడవి యెలుక.౹ ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹ వాటిలో చచ్చిన దాని కళేబరము దేనిమీద పడునో అది అపవిత్రమగును. అది చెక్కపాత్రయేగాని బట్టయేగాని చర్మమేగాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియుగాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్రమగును.౹ వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; మీరు దానిని పగుల గొట్టవలెను.౹ తినదగిన ఆహారమంతటిలో దేనిమీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన యే పానీయమును అపవిత్రము.౹ వాటి కళేబరములలో కొంచెము దేనిమీదపడునో అది అపవిత్రమగును. అది పొయ్యియైనను కుంపటియైనను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను.౹ అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావుగాని కళేబరమునకు తగిలినది అపవిత్రమగును.౹ వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనములమీద పడినను అవి అపవిత్రములు కావుగాని ఆ విత్తనములమీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటిమీద పడినయెడల అవి మీకు అపవిత్రములగును. మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చినయెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹ దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. నేలమీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు.౹ నేలమీద ప్రాకు జీవరాసులన్నిటిలో కడుపుతో చరించుదానినైనను నాలుగుకాళ్లతో చరించుదానినైనను చాలా కాళ్లుగల దానినైనను మీరు తినకూడదు; అవి హేయములు.౹ ప్రాకు జీవరాసులలో దేనినైననుతిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు; వాటివలన అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రత కలుగ జేసికొనకూడదు.౹ నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.౹ నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. అపవిత్రమైనదానికిని పవిత్రమైనదానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు జంతువులనుగూర్చియు, పక్షులనుగూర్చియు, జలచరములైన సమస్త జీవులనుగూర్చియు, నేలమీద ప్రాకు సమస్త జీవులనుగూర్చియు చేసిన విధి యిదే అని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనినయెడల ఆమె యేడు దినములు పురిటాలై యుండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కనుబట్టి పురిటాలై యుండవలెను.౹ ఎనిమిదవదినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను.౹ ఆమె తన రక్తశుద్ధికొరకు ముప్పది మూడుదినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగువరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు.౹ ఆమె ఆడుపిల్లను కనినయెడల ఆమె తాను కడగా ఉండునప్పటివలె రెండు వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు అరువదియారు దినములు కడగా ఉండవలెను.౹ కుమారునికొరకేగాని కుమార్తెకొరకేగాని ఆమె శుద్ధిదినములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొనిరావలెను.౹ అతడు యెహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లనుగాని ఆడు పిల్లనుగాని కనిన స్త్రీనిగూర్చిన విధి.౹ ఆమె గొఱ్ఱెపిల్లను తేజాలని యెడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని, పాపపరిహారార్థబలిగా ఒక దానిని తీసికొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా ఆమెకు పవిత్రత కలుగును. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.౹ –ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కుగాని నిగనిగలాడు మచ్చగాని యుండి వాని దేహచర్మమందు కుష్ఠుపొడవంటిది కనబడినయెడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకనియొద్దకైనను వాని తీసికొని రావలెను.౹ ఆయాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెండ్రుకలు తెల్లబారినయెడలను, ఆ పొడ అతని దేహచర్మము కంటె పల్లముగా కనబడినయెడలను అది కుష్ఠు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను.౹ నిగనిగలాడు మచ్చ చర్మముల కంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారకున్నయెడలను ఆయాజకుడు ఏడు దినములు ఆ పొడగలవానిని కడగా ఉంచవలెను.౹ ఏడవ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండినయెడల, యాజకుడు మరి యేడు దినములు వాని కడగా ఉంచవలెను.౹ ఏడవనాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండినయెడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను; అది పక్కే,వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.౹ అయితేవాడు తన శుద్ధివిషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడలవాడు రెండవసారి యాజకునికి కనబడవలెను.౹ అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినయెడల యాజకుడువాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్ఠుపొడ యొకనికి కలిగినయెడల యాజకుని యొద్దకు వానిని తీసికొనిరావలెను.౹ యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను, అది వెండ్రుకలను తెల్లబరచినయెడలను, వాపులో పచ్చి మాంసము కనబడినయెడలను,౹ అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడువాడు అపవిత్రుడని నిర్ణ యింపవలెను, వానిని కడగా ఉంచకూడదు;వాడు అప విత్రుడు.౹ కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంతవరకు ఆ పొడగలవాని తలమొదలుకొని పాదములవరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి యుండినయెడల యాజకుడు వానిని చూడవలెను; ఆ కుష్ఠము వాని దేహమంతట వ్యాపించినయెడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను;వాడు పవిత్రుడు.౹ అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమునవాడు అపవిత్రుడు.౹ యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచివాడు అపవిత్రు డని నిర్ణయింపవలెను. ఆ పచ్చిమాంసము అపవిత్రమే; అది కుష్ఠము.౹ అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లబారినయెడలవాడు యాజకునియొద్దకు రావలెను;౹ యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారినయెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను;వాడు పవిత్రుడు. ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండినచోటను తెల్లని వాపైనను తెలుపుతోకూడిన యెరుపురంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినయెడల, యాజకునికి దాని కనుపరచవలెను.౹ యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, దాని వెండ్రు కలు తెల్లబారి యుండినయెడలను, యాజకుడువాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది ఆ పుంటివలన పుట్టిన కుష్ఠుపొడ.౹ యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను, అది చర్మము కంటె పల్లముకాక కొంచెము నయముగా కనబడినయెడలను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను.౹ అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల యాజకుడువాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ.౹ నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినయెడల అది దద్దురు; యాజకుడువాడు పవిత్రు డని నిర్ణయింపవలెను. దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత యెఱ్ఱగానేగాని తెల్లగానేగాని నిగనిగలాడు తెల్లని మచ్చగానేగాని యుండినయెడల యాజకుడు దాని చూడవలెను.౹ నిగ నిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారినయెడలను, అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, అది ఆ వాతవలన పుట్టిన కుష్ఠుపొడ; యాజకుడువాడు అపవిత్రు డని నిర్ణయింపవలెను; అది కుష్ఠము.౹ యాజకుడు దాని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రు కలు లేకయేగాని చర్మముకంటె పల్లముగా నుండకయేగాని కొంత నయముగా కనబడినయెడల, యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను.౹ ఏడవనాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడలవాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠమే.౹ అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనేయుండి కొంచెము నయముగా కనబడినయెడల అది వాతపు వాపే;వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది వాతపు మంటయే. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినయెడల, యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మముకంటె పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడినయెడల,వాడు అపవిత్రు డని యాజకుడు నిర్ణయింపవలెను; అది బొబ్బ, తలమీద నేమి గడ్డముమీద నేమి పుట్టిన కుష్ఠము.౹ యాజకుడు ఆ బొబ్బయిన పొడను చూచినప్పుడు అది చర్మముకంటె పల్లము కానియెడలను, దానిలో నల్లవెండ్రుకలు లేనియెడలను, యాజకుడు ఆ బొబ్బయిన పొడగలవానిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.౹ ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపిం పక యుండినయెడలను, దానిలో పసుపు పచ్చవెండ్రు కలు లేనియెడలను, చర్మముకంటె పల్లముకాని యెడలను,౹ వాడు క్షౌరము చేసికొనవలెనుగాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి యేడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.౹ ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మముకంటె పల్లముకాక యుండినయెడల, యాజకుడువాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.౹ వాడు పవిత్రు డని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించినయెడల యాజకుడు వాని చూడవలెను,౹ అప్పుడు ఆ మాద వ్యాపించియుండినయెడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు;వాడు అపవిత్రుడు.౹ అయితే నిలిచిన ఆ మాదలో నల్లవెండ్రుకలు పుట్టినయెడల ఆ మాద బాగుపడెను;వాడు పవిత్రుడు; యాజకుడువాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. మరియు పురుషుని దేహపుచర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు, అనగా నిగనిగలాడు తెల్లనిమచ్చలు పుట్టినయెడల యాజకుడు వానిని చూడవలెను; వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండినయెడల అది చర్మమందు పుట్టిన యొక పొక్కు;వాడు పవిత్రుడు. తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు; అయిననువాడు పవిత్రుడు.౹ ముఖమువైపున తలవెండ్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు;వాడు పవిత్రుడు.౹ అయినను బట్ట తలయందేగాని బట్ట నొసటియందేగాని యెఱ్ఱగానుండు తెల్లని పొడ పుట్టినయెడల, అది వాని బట్ట తలయందైనను బట్ట నొసటియందైనను పుట్టిన కుష్ఠము.౹ యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహచర్మమందు కనబడునట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలయందైనను వాని బట్ట నొసటియందైనను ఎఱ్ఱగా నుండు తెల్లని పొడయైనయెడల వాడు కుష్ఠరోగి,వాడు అపవిత్రుడు; యాజకుడువాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను; వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను;వాడు తల విరియబోసికొనవలెను;వాడు తన పైపెదవిని కప్పుకొని–అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను.౹ ఆ పొడ వానికి కలిగిన దినములన్నియువాడు అపవిత్రుడైయుండును;వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱెవెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి నారతోనేగాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏయొక వస్తువునందేమి పుట్టి ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళుగానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కనుపరచవలెను.౹ యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.౹ ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించినయెడల అది కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము.౹ కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతోచేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను.౹ అయితే యాజకుడు చూచి నప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు, అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపక పోయినయెడల యాజకుడు ఆ పొడగలదానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలెను.౹ ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపిం పక పోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చి వేయవలెను. అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును.౹ యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి యుండినయెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను.౹ అటుతరువాత అది ఆ వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడినయెడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలో నున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను.౹ ఏ వస్త్రమునేగాని పడుగునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉదికినతరువాత ఆ పొడ వదిలినయెడల, రెండవమారు దానిని ఉదుకవలెను;౹ అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్ట యందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలు వస్తువులయందేగాని యుండు కుష్ఠు పొడనుగూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణ యింపవలసిన విధి యిదే. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి యేదనగా, యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను.౹ యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచినయెడల యాజకుడు పవి త్రత పొందగోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సో పును తెమ్మని ఆజ్ఞాపింపవలెను.౹ అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించి సజీవమైన పక్షిని ఆ దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తీసికొని పారు నీటి పైని చంపిన పక్షిరక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరు వానిమీద ఏడుమారులు ప్రోక్షించివాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను.౹ అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానముచేసి పవిత్రుడగును. తరువాతవాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను.౹ ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమ మంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును.౹ ఎనిమిదవనాడువాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱెపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను.౹ పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.౹ అప్పుడు యాజకుడు ఒక మగ గొఱ్ఱెపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అపరాధ పరిహారార్థబలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.౹ అతడు పాపపరిహారార్థబలి పశువును దహన బలిపశువును వధించు పరిశుద్ధస్థలములో ఆ గొఱ్ఱెపిల్లను వధింపవలెను. పాపపరిహారార్థమైనదానివలె అపరాధపరి హారార్థమైనదియు యాజకునిదగును; అది అతిపరిశుద్ధము.౹ అప్పుడు యాజకుడు అపరాధపరిహారార్థమైనదాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను, దానిని చమరవలెను.౹ మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన యెడమ అరచేతిలో పోసికొనవలెను.౹ అప్పుడు యాజకుడు తన యెడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని ఏడుమారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను.౹ యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసికొని పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను ఉన్న అపరాధపరిహారార్థబలిపశువుయొక్క రక్తముమీద చమరవలెను.౹ అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొంద గోరువాని తలమీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.౹ అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాతవాడు దహనబలిపశువును వధింపవలెను.౹ యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠముమీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగావాడు పవిత్రుడగును. వాడు బీదవాడై పైచెప్పినదంతయు తేజాలని యెడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకైవాడు అల్లా డించుటకు అపరాధపరిహారార్థబలిగా ఒక గొఱ్ఱెపిల్లను నైవేద్యముగా తూములో పదియవవంతు నూనెతో కలిసిన గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని, అనగా పాపపరిహారార్థబలిగా ఒకదానిని దహనబలిగా ఒక దానిని తీసికొని రావలెను.౹ వాడు పవిత్రతపొంది ఎనిమిదవ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు వాటిని తీసికొని రావలెను.౹ యాజకుడు అపరాధ పరిహారార్థబలియగు గొఱ్ఱెపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.౹ అప్పుడతడు అపరాధపరిహారార్థబలియగు గొఱ్ఱెపిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థబలిపశువుయొక్క రక్తములో కొంచెము తీసికొని, పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను దానిని చమరవలెను.౹ మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన యెడమ అరచేతిలో పోసికొని తన యెడమచేతిలో నున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యెహోవా సన్నిధిని ఏడుమారులు ప్రోక్షింపవలెను.౹ మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను ఆ అపరాధ పరిహారార్థబలిపశువుయొక్క రక్తమున్న చోటను వేయవలెను.౹ యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరువానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తలమీద పోయవలెను.౹ అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగువ్వలలోనేగాని పావురపుపిల్లలలోనేగాని ఒక దాని నర్పింపవలెను.౹ తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహనబలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను.౹ కుష్ఠుపొడ కలిగినవాడు పవిత్రత పొందతగినవాటిని సంపాదింపలేనియెడల వాని విషయమైన విధి యిదే. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చినతరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల ఆ యింటి యజమానుడు యాజకునియొద్దకు వచ్చి–నా యింటిలో కుష్ఠుపొడవంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను.౹ అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగాచేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను.౹ అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎఱ్ఱదాళుగానైననుఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండినయెడల యాజకుడు ఆ యింటనుండి యింటివాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసి యుంచవలెను.౹ ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైనయెడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను.౹ అప్పుడతడు ఆ యింటిలోపలను చుట్టు గోడలను గీయింపవలెను. వారు గీసిన పెల్లలను ఊరివెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరురాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను.౹ అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లుగీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలుపడినయెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను.౹ అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము.౹ కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడగొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను.౹ మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹ ఆ యింట పండు కొనువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. ఆ యింట భోజనముచేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను.౹ యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను.౹ ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను.౹ అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవమైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్తవర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరి హారార్థబలి అర్పింపవలెను.౹ అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగుర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తముచేయగా అది పవిత్రమగును. ప్రతివిధమైన కుష్ఠుపొడనుగూర్చియు, బొబ్బనుగూర్చియు వస్త్రకుష్ఠమునుగూర్చియు, వస్త్రమునకై నను ఇంటికైనను కలుగు కుష్ఠమునుగూర్చియు,౹ వాపునుగూర్చియు, పక్కునుగూర్చియు, నిగనిగలాడు మచ్చనుగూర్చియు,౹ ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమునుగూర్చిన విధి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి— ఒకని దేహమందు స్రావమున్నయెడల ఆ స్రావమువలనవాడు అపవిత్రుడగును.౹ వాని స్రావము కారినను కారక పోయినను ఆ దేహస్థితినిబట్టివాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అప విత్రము;౹ [4-5] వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹ *** అట్టివాడు దేనిమీద కూర్చుండునో దానిమీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹ స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹ స్రావముగలవాడు పవిత్రునిమీద ఉమ్మివేసినయెడలవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹ స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము.౹ వాని క్రిందనుండిన యే వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹ స్రావముగలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునోవాడు తన బట్టలు ఉదుకుకొని స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹ స్రావము గలవాడు ముట్టుకొనిన మంటిపాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను.౹ స్రావముగలవాడు తన స్రావమునుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకుకొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రుడగును.౹ ఎనిమిదవనాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను.౹ యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఒకనికి వీర్యస్ఖలనమైనయెడలవాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹ ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలమువరకు అపవిత్రమై యుండును.౹ వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రులైయుందురు. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు.౹ ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును.౹ ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹ ఆమె దేనిమీద కూర్చుం డునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹ అది ఆమె పరుపుమీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండినయెడల దానిని ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹ ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల,వాడు ఏడు దినములు అపవిత్రుడగును;వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండుకాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంక అనేకదినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలోవలెనే ఆ స్రావదినములన్నియు ఉండును, ఆమె అపవిత్రురాలు.౹ ఆమె స్రావదినములన్నియు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచమువలె ఉండవలెను. ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రతవలె అపవిత్రమగును.౹ వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు.వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹ ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైనయెడల ఆమె యేడుదినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును.౹ ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తేవలెను.౹ యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావవిషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాసస్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను. స్రావముగలవానిగూర్చియు, వీర్యస్ఖలనమువలని అప విత్రతగలవానిగూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు, స్రావముగల స్త్రీ పురుషులనుగూర్చియు, అపవిత్రురాలితో శయనించువాని గూర్చియు విధింపబడి నది ఇదే. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను –నేను కరుణాపీఠముమీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.౹ అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను.౹ అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టికట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠవస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను.౹ మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని రావలెను.౹ అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను.౹ అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను.౹ ఏ మేకమీద యెహోవాపేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.౹ ఏ మేకమీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు, దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను.౹ అప్పుడు అహరోను పాపపరిహారార్థబలియగు ఆ కోడెను తీసికొని వచ్చి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తరువాత అతడు తనకొరకు తానర్పించు పాపపరిహారార్థబలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరి మళధూపచూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనములమీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను.౹ అప్పుడతడు ఆ కోడెరక్తములో కొంచెము తీసికొని తూర్పుప్రక్కను కరుణాపీఠముమీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను.౹ అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్థబలియగు మేకను వధించి అడ్డతెరలోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడెరక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను.౹ అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టియు, అనగా వారి అపవిత్రతనుబట్టియు, వారి అతి క్రమములనుబట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారిమధ్య ఉండుటవలన వారి అపవిత్రతనుబట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను.౹ పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు.౹ మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠము నొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడెరక్తములో కొంచెమును ఆ మేకరక్తములో కొంచెమును తీసికొని బలిపీఠపు కొమ్ములమీద చమిరి యేడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను.౹ అతడు పరిశుద్ధస్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసికొని రావలెను.౹ అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు, అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేకతలమీద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను.౹ ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను.౹ అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి, తాను పరిశుద్ధస్థలములోనికి వెళ్లినప్పుడు తాను వేసికొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తనకొరకు దహన బలిని ప్రజలకొరకు దహనబలిని అర్పించి, తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను పాప పరిహారార్థబలి పశువుయొక్క క్రొవ్వును బలిపీఠముమీద దహింపవలెను విడిచిపెట్టే మేకను వదలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను.౹ పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థబలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను.౹ వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకు కొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను.౹ ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను.౹ అది మీకు మహా విశ్రాంతిదినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఇది నిత్యమైన కట్టడ.౹ ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకముపొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆయాజకుడు ప్రాయశ్చిత్తము చేసికొని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను.౹ మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను.౹ సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹ –నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఈలాగు చెప్పుము — ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట [3-4] ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు అది ఎద్దేగాని గొఱ్ఱెయేగాని మేకయేగాని ప్రత్యక్షపు గుడా రముయొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును;౹ *** వాడు రక్తమును ఒలికించినవాడు; ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలిపశువులను ఇక బయట వధింపక యెహోవాపేరట యాజకునియొద్దకు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకే తీసికొని వచ్చి సమాధాన బలిగా అర్పించునట్లు ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడవలెను.౹ యెహోవాకు ఇంపైన సువాసన గలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠముమీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను.౹ వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింప రాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ.౹ [8-9] మరియు నీవు వారితో ఇట్లనుము–ఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలోగాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను యెహోవాకు అర్పింప నుద్దేశముగలవాడై ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియెడల ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడును. *** మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలోనుండి వాని కొట్టివేయుదును.౹ రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.౹ కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. మరియు ఇశ్రాయేలీయులలోనేగాని మీలో నివసించు పరదేశులలోనేగాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పెట్టినయెడలవాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను; ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము;౹ దాని రక్తము దాని ప్రాణమున కాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.౹ మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశియేమివాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును.౹ అయితేవాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండినయెడలవాడు తన దోషశిక్షను భరించును. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల. విచ్చెను –నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము.౹ మీరు నివసించిన ఐగుప్తు దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలనుబట్టి నడవకూడదు.౹ మీరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలనుబట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; మీ దేవుడనగు నేను యెహోవాను.౹ మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను. మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను.౹ నీ తండ్రికి మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.౹ నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే.౹ నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టిన దేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తెయొక్క యైనను నీ తల్లి కుమార్తెయొక్కయైనను మానాచ్ఛాదనమును తీయకూడదు.౹ నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయకూడదు; అది నీది.౹ నీ తండ్రివలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.౹ నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.౹ నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.౹ నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు; ఆమె నీ పినతల్లి.౹ నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.౹ నీ సహోదరుని భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము.౹ ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్త సంబంధులు; అది దుష్కామప్రవర్తన.౹ నీ భార్య బ్రదికి యుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానా చ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లిచేసి కొనకూడదు.౹ అపవిత్రతవలన స్త్రీ కడగాఉండు నప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.౹ నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొనకూడదు.౹ నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.౹ స్త్రీ శయనమువలె పురుషశయనముకూడదు; అది హేయము.౹ ఏ జంతువునందును నీ స్ఖలనముచేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము. వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వా టన్నిటివలన అపవిత్రులైరి.౹ ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కివేయుచున్నది.౹ [26-28] కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతనుబట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు, అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక, యీ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను.౹ *** *** ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలోనుండి కొట్టివేయబడుదురు.౹ కాబట్టి మీకంటె ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసికొనకుండునట్లు నేను మీకు విధించిన విధిననుసరించి నడుచు కొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల. విచ్చెను–ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో ఇట్లు చెప్పుము.౹ మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను.౹ మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.౹ మీరు వ్యర్థమైన దేవతలతట్టు తిరుగకూడదు. మీరు పోతవిగ్రహములను చేసికొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను మీరు యెహోవాకు సమాధానబలి అర్పించునప్పుడు అది అంగీకరింపబడునట్లుగా అర్పింపవలెను.౹ మీరు బలినర్పిం చునాడైనను మరునాడైనను దాని తినవలెను. మూడవ నాటివరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలెను.౹ మూడవనాడు దానిలో కొంచెమైనను తినినయెడల అది హేయమగును; అది అంగీకరింపబడదు.౹ దానిని తినువాడు తన దోషశిక్షను భరించును.వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను.వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును. మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలముయొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు; నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు;౹ నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను;౹ నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు;౹ నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు; నేను యెహోవాను.౹ నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటివరకు నీయొద్ద ఉంచుకొనకూడదు;౹ చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివానియెదుట అడ్డమువేయకూడదు; నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను.౹ అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.౹ నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణహానిచేయ చూడకూడదు, నేను యెహోవాను.౹ నీ హృదయములో నీ సహోదరునిమీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.౹ కీడుకు ప్రతికీడుచేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.౹ మీరు నా కట్టడలను ఆచరింపవలెను; నీ జంతువులను ఇతరజాతి జంతువులను కలియనీయకూడదు; నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు; బొచ్చును నారయు కలిసినబట్ట వేసి కొనకూడదు.౹ ఒకనికి ప్రధానము చేయబడిన దాసి, వెలయిచ్చి విమోచింప బడకుండగానేమి ఊరక విడిపింప బడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసినయెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు.౹ అతడు అపరాధ పరిహారార్ధబలిని, అనగా అపరాధపరిహారార్థబలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.౹ అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమునుబట్టి పాపపరిహారార్థబలియగు పొట్టేలువలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును.౹ మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరములవరకు మీకు అపవిత్రముగా ఉండవలెను, వాటిని తినకూడదు.౹ నాలుగవ సంవత్సరమున వాటి ఫలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును; అయిదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును;౹ నేను మీ దేవుడనైన యెహోవాను.౹ రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్ర యోగములు చేయకూడదు,౹ మీ నుదుటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు,౹ చచ్చినవారికొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.౹ మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణియగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు.౹ నేను నియమించిన విశ్రాంతిదినములను మీరు ఆచరింపవలెను నా పరిశుద్ధస్థలమును మన్నింపవలెను; నేను యెహోవాను.౹ కర్ణపిశాచిగలవారి దగ్గరకుపోకూడదు, సోదె గాండ్రను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.౹ తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను.౹ మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు,౹ మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.౹ తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు.౹ న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.౹ కాగా మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను; నేను యెహోవాను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల. విచ్చెను–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము –ఇశ్రాయేలీయులలోనేగాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనేగాని యొకడు ఏమాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను; మీ దేశప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను.౹ ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.౹ [4-5] మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక, చూచి చూడనట్లు తమ కన్నులు మూసికొనినయెడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారముచేయు వారినందరిని ప్రజలలోనుండి కొట్టివేతును.౹ *** మరియు కర్ణపిశాచిగలవారితోను సోదెగాండ్రతోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టి వేతును.౹ కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి; నేను మీ దేవుడనైన యెహోవాను.౹ మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను.వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.౹ పరుని భార్యతో వ్యభిచరించినవానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.౹ తన తండ్రి భార్యతో శయనించినవాడు తన తండ్రి మానాచ్ఛాదనమును తీసెను; వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.౹ ఒకడు తన కోడలితో శయనించినయెడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి; వారి ప్రాణాపరాధము వారిమీదనుండును.౹ ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించినయెడల వారిద్దరు హేయక్రియనుచేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.౹ ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లిచేసికొనినయెడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామప్రవర్తన మీ మధ్యనుండకుండ వానిని వారిని అగ్నితో కాల్చవలెను.౹ జంతుశయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.౹ స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమ శిక్షకు తామే కారకులు.౹ ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనేగాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలనువాడును వాని దిసమొలను ఆమెయు చూచినయెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను.వాడు తన సహోదరి మానా చ్ఛాదనమును తీసెను; తన దోషశిక్షను తాను భరించును.౹ కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్తధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజలలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.౹ నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్తసంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.౹ పినతల్లితోనేగాని పెత్తల్లితోనేగాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరిం చెదరు; సంతానహీనులై మరణమగుదురు.౹ ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము.వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులైయుందురు. కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధు లన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.౹ నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములనుబట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.౹ నేను మీతో చెప్పిన మాట యిదే–మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలోనుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే.౹ కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన యే జంతువువలననేగాని, యే పక్షివలననేగాని, నేలమీద ప్రాకు దేనివలననేగాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు.౹ మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్యజనులలోనుండి మిమ్మును వేరుపరచితిని. పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణశిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను.౹ యాజకులగు అహరోను కుమారులతో ఇట్లనుము–మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుటవలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్తసంబంధులు, అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు,౹ తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక, అను వీరియొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచు కొనవచ్చును.౹ అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసికొనరాదు.౹ వారు తమ తలలు బోడిచేసికొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసికొన రాదు, కత్తితో దేహమును కోసికొనరాదు.౹ వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను. కావునవారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి అహారమును, అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు; కావునవారు పరిశుద్ధులై యుండవలెను.౹ వారు జారస్త్రీనేగాని భ్రష్టురాలినేగాని పెండ్లిచేసికొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లిచేసికొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు.౹ అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావ లెను.౹ మరియు యాజకుని కుమార్తె జారత్వమువలన తన్ను అపవిత్రపరచుకొనినయెడల ఆమె తన తండ్రిని అపవిత్ర పరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను. ప్రధానయాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తలమీద అభిషేకతైలము పోయబడునో, యాజకవస్త్రములు వేసికొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు; తన బట్టలను చింపుకొనరాదు;౹ అతడు శవముదగ్గరకు పోరాదు; తన తండ్రి శవమువలననేగాని తన తల్లి శవమువలననేగాని తన్ను అపవిత్రపరచుకొన రాదు.౹ దేవుని అభిషేకతైలము అనెడు కిరీటముగా అతనిమీద ఉండును గనుక అతడు పరిశుద్ధమందిరమును విడిచి వెళ్లరాదు; తన దేవుని పరిశుద్ధమందిరమును అపవిత్రపరచ రాదు; నేను యెహోవాను అతడు కన్యకను పెండ్లిచేసి కొనవలెను.౹ విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసికొనవలెను.౹ యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచు వాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹ –నీవు అహరోనుతో ఇట్లనుము–నీ సంతతివారిలో ఒకనికి కళంకమేదైనను కలిగినయెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు.౹ ఏలయనగా ఎవనియందు కళంకముండునోవాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవ యవముగల వాడేగాని కాలైనను చేయైనను విరిగినవాడేగాని గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గలవాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు.౹ యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు.౹ అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.౹ మెట్టుకు అతడు కళంకముగలవాడు గనుక అడ్డతెరయెదుటికి చేరకూడదు; బలిపీఠమును సమీపింపకూడదు; నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించువాటి వలన అహరోనును అతని కుమారులును నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకుండునట్లువారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము; నేను యెహోవాను.౹ నీవు వారితో ఇట్లనుము–మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించినయెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండ కొట్టివేయబడును; నేను యెహోవాను.౹ అహరోను సంతానములో ఒకనికి కుష్ఠయినను స్రావమై నను కలిగినయెడల అట్టివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైనవాటిలో దేనిని తినకూడదు. శవమువలని అపవిత్రతగల దేనినైనను ముట్టువాడును స్ఖలితవీర్యుడును,౹ అపవిత్రమైన పురుగునేమి యేదో ఒక అపవిత్రతవలన అపవిత్రుడైన మనుష్యునినేమి ముట్టువాడును, అట్టి అప విత్రత తగిలినవాడును సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹ అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొనువరకు ప్రతిష్ఠితమైనవాటిని తినకూడదు.౹ సూర్యుడు అస్త మించినప్పుడు అతడు పవిత్రుడగును; తరువాత అతడు ప్రతిష్ఠితమైనవాటిని తినవచ్చును, అవి వానికి ఆహారమే గదా.౹ అతడు కళేబరమునైనను చీల్చబడినదానినైననుతిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు; నేను యెహోవాను.౹ కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి, దాని పాపభారమును మోసికొని దానివలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను; నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను.౹ అన్యుడు ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు, యాజకునియింట నివసించు అన్యుడేగాని జీతగాడేగాని ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు,౹ అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని యింట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును.౹ యాజకుని కుమార్తె అన్యుని కియ్యబడినయెడల ఆమె ప్రతిష్ఠితమైనవాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు.౹ యాజకుని కుమార్తెలలో విధవరాలేకాని విడనాడబడినదే కాని సంతానము లేనియెడల ఆమె తన బాల్యమందువలె తన తండ్రి యింటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చునుగాని అన్యుడెవడును దాని తినకూడదు.౹ ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైనదానిని తినినయెడలవాడు ఆ ప్రతిష్ఠితమైనదానిలో అయిదవవంతు కలిపి దానితో యాజకునికియ్యవలెను.౹ ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైనవాటిని తినుటవలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు.౹ నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఇట్లు చెప్పుము–ఇశ్రాయేలీయుల యింటివారిలోనేగాని ఇశ్రాయేలీయులలో నివసించు పరదేశులలోనేగాని యెవడు యెహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబళ్లనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు, గోవులలోనుండి యైనను గొఱ్ఱెమేకలలోనుండియైనను దోషములేని మగ దానిని అర్పింపవలెను.౹ దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు; అది మీ పక్షముగా అంగీకరింపబడదు.౹ ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకేగాని స్వేచ్ఛార్పణము అర్పించుటకేగాని సమాధానబలిరూపముగా గోవునైనను గొఱ్ఱెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడునట్లు దోషము లేనిదై యుండవలెను; దానిలో కళంకమేదియు నుండకూడదు.౹ గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరతగలదేమి గడ్డగలదేమి గజ్జిరోగముగలదేమి చిరుగుడుగలదేమి అట్టివాటిని యెహోవాకు అర్పింపకూడదు; వాటిలో దేనిని బలిపీఠముమీద యెహోవాకు హోమము చేయకూడదు.౹ కురూపియైన కోడెనైనను గొఱ్ఱె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింప వచ్చునుగాని అది మ్రొక్కుబడిగా అంగీకరింప బడదు.౹ విత్తులు నులిపిన దానినేగాని విరిగినదానినేగాని చితికినదానినేగాని కోయబడినదానినేగాని యెహోవాకు అర్పింపకూడదు; మీ దేశములో అట్టికార్యము చేయకూడదు;౹ పరదేశి చేతినుండి అట్టివాటిలో దేనిని తీసికొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు; అవి లోపము గలవి, వాటికి కళంకములుండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –దూడయేగాని, గొఱ్ఱెపిల్లయేగాని, మేకపిల్లయేగాని, పుట్టినప్పుడు అదియేడు దినములు దాని తల్లితో నుండవలెను. ఎనిమిదవనాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింప తగును.౹ అయితే అది ఆవైనను గొఱ్ఱె మేకలలోనిదైనను మీరు దానిని దానిపిల్లను ఒక్క నాడే వధింపకూడదు.౹ మీరు కృతజ్ఞతాబలియగు పశువును వధించినప్పుడు అది మీకొరకు అంగీకరింపబడునట్లుగా దానిని అర్పింపవలెను.౹ ఆనాడే దాని తినివేయవలెను; మరునాటివరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు; నేను యెహోవాను.౹ మీరు నా ఆజ్ఞలననుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను; నేను యెహోవాను.౹ నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసికొందును;౹ నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడనై యుండునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–మీరు చాటింపవలసిన యెహోవా నియామకకాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామకకాలములు ఇవి.౹ ఆరు దినములు పనిచేయవలెను; వారము వారము ఏడవ దినము విశ్రాంతిదినము; అది పరిశుద్ధసంఘపు దినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతిదినము. ఇవి యెహోవా నియామకకాలములు, నియమించిన కాలములనుబట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధసంఘపు దినములు ఇవి.౹ మొదటి నెల పదునాలుగవదినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.౹ ఆ నెల పదునయిదవదినమున యెహోవాకు పొంగనిరొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి యైన ఏ పనియు చేయకూడదు.౹ ఏడు దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. ఏడవదినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–నేను మీ కిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయు నప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను.౹ యెహోవా మిమ్ము నంగీకరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతిదినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను.౹ మీరు ఆ పనను అర్పించుదినమున నిర్దోషమైన యేడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము.౹ మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టె యేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తర తరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతిదినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని యేడు వారములు లెక్కింపవలెను; లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములు ఉండవలెను.౹ ఏడవ విశ్రాంతిదినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింపవలెను.౹ మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లా డించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము.౹ మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును.౹ అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాపపరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొఱ్ఱెపిల్లలను సమాధానబలిగా అర్పింపవలెను.౹ యాజకుడు ప్రథమఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకునివగును.౹ ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్తనివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంటచేను కోయునప్పుడు నీ పొలముయొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹ –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాపకార్థశృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను.౹ అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹ –ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను.౹ ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు; మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసికొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము.౹ ఆ దినమున తన్నుతాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.౹ ఆ దినమున ఏ పనినైననుచేయు ప్రతివానిని వాని ప్రజలలోనుండకుండ నాశము చేసెదను.౹ అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.౹ అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల తొమ్మిదవనాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలమువరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.౹ వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.౹ ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవదినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములుగాకయు, మీ మ్రొక్కు బడి దినములుగాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యము నేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి.౹ ఏ అర్పణదినమున ఆ అర్పణమును తీసికొని రావలెను. అయితే ఏడవ నెల పదునయిదవదినమున మీరు భూమిపంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతిదినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము.౹ మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను.౹ అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను.౹ నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.౹ నేను మీ దేవుడనైన యెహోవాను.౹ అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియ చెప్పెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.౹ ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.౹ అతడు నిర్మలమైన దీపవృక్షముమీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను.౹ యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్లమీద ఆరేసి భక్ష్యములుగల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను.౹ ఒక్కొక్క దొంతిమీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా యెదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును.౹ యాజకుడు ప్రతి విశ్రాంతిదినమున నిత్య నిబంధననుబట్టి ఇశ్రాయేలీయులయొద్ద దాని తీసికొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను.౹ అది అహరోనుకును అతని సంతతివారికి ఉండవలెను. వారు పరిశుద్ధస్థలములో దాని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకుచేయు హోమములలో అది అతి పరిశుద్ధము. ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయులమధ్యకు వచ్చెను.౹ ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసికొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమార్తె యెహోవా యేమి సెలవిచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹ –శపించినవానిని పాళెము వెలుపలికి తీసికొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తలమీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావ గొట్టవలెను.౹ మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను.౹ యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను.౹ ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను.౹ జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను.౹ ఒకడు తన పొరుగువానికి కళంకము కలుగజేసినయెడలవాడు చేసినట్లు వానికి చేయవలెను.౹ విరుగగొట్టబడిన దాని విషయములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను.వాడు ఒకనికి కళంకము కలుగజేసినందున వానికి కళంకము కలుగజేయవలెను.౹ జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను.౹ మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనెను.౹ కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పెను–శపించిన వానిని పాళెము వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టవలెను, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి. మరియు యెహోవా సీనాయికొండమీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడ యెహోవా పేరట విశ్రాంతి కాలమును, ఆచరింపవలెను.౹ ఆరుసంవత్సరములు నీ చేను విత్తవలెను. ఆరుసంవత్సరములు నీ ఫలవృక్షములతోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొన వచ్చును.౹ ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు; నీ ఫలవృక్షములతోటను శుద్దిపరచకూడదు.౹ నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్దిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు; అది భూమికి విశ్రాంతి సంవత్సరము.౹ అప్పుడు భూమియొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును.౹ మరియు నీ పశువులకును నీ దేశజంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను, అనగా ఏడేసి యేండ్లుగల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ యేడు విశ్రాంతి సంవత్సరములకాలము నలుబది తొమ్మిది సంవత్సరములగును.౹ ఏడవ నెల పదియవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చి త్తార్థదినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలెను.౹ మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.౹ ఆ సంవత్సరము, అనగా ఏబదియవ సంవత్సరము మీకు సునాదకాలము. అందులో మీరు విత్తకూడదు కారుపంటను కోయకూడదు శుద్దిపరచని నీ ఫల వృక్షముల పండ్లను ఏరుకొనకూడదు.౹ అది సునాద కాలము; అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు.౹ ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను.౹ నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములోకాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు.౹ సునాద సంవత్సరమైన తరువాత గడచిన యేండ్ల లెక్క చొప్పున నీ పొరుగువానియొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్కచొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను.౹ ఆ సంవత్సరముల లెక్క హెచ్చినకొలది దాని వెల హెచ్చింపవలెను, ఆ సంవత్సరముల లెక్క తగ్గినకొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాని నీకు అమ్మెనుగదా.౹ మీరు ఒకరి నొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.౹ కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిననుసరించి నడుచుకొనవలెను.౹ అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించె దరు, ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు.౹ ఏడవయేట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంటకూర్చను వల్లగాదే అనుకొందురేమో.౹ అయితే నేను ఆరవయేట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను; అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును.౹ మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరమువరకు పాత పంట తినెదరు; దాని పంటను కూర్చువరకు పాత దానిని తినెదరు. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నాయొద్ద కాపురమున్న పరదేశులు.౹ మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడునట్లుగా దాని అమ్ముకొనవలెను. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చినయెడల తన సహోదరుడు అమ్మినదానిని అతడు విడి పించును.౹ అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించినయెడల దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సరములు లెక్కించి యెవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును.౹ అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని యెడల అతడు అమ్మిన సొత్తు సునాదసంవత్సరమువరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాదసంవత్సరమున అది తొలగిపోవును; అప్పుడతడు తన స్వాస్థ్యమును మరల నొందును. ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాసగృహమును అమ్మినయెడల దాని అమ్మినదినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును; ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును.౹ అయితే ఆ సంవత్సరదినములు నిండకమునుపు దాని విడిపింపనియెడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ యిల్లుకొనినవానికి వాని తరతరములకు అది స్థిరముగానుండును. అది సునాద కాలమున తొలగిపోదు.౹ చుట్టును ప్రాకారములులేని గ్రామములలోని యిండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును; అవి సునాదకాలములో తొలగి పోవును.౹ అయితే లేవీయుల పట్టణములు, అనగా వారి స్వాధీన పట్టణములలోని యిండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును.౹ లేవీయుల పట్టణములయిండ్లు ఇశ్రాయేలీయులమధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయులయొద్ద ఇల్లు సంపా దించినయెడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ యిల్లు సునాదసంవత్సరమున తొలగిపోవును.౹ వారు తమ పట్టణముల ప్రాంతభూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము. పరవాసియైనను అతిథియైనను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీయొద్దకు వచ్చినయెడల నీవు వానికి సహాయము చేయవలెను; అతడు నీవలన బ్రదుకవలెను.౹ నీ దేవునికి భయపడి వానియొద్ద వడ్డినైనను తీసి కొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను.౹ నీ రూకలు వానికి వడ్డికియ్యకూడదు; నీ ఆహారమును వానికి లాభమున కియ్యకూడదు.౹ నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొనకూడదు.౹ వాడు జీతగానివలెను పరవాసివలెను నీయొద్ద నివసించు సునాదసంవత్సరమువరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను.౹ అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతోకూడ నీయొద్దనుండి బయలుదేరి తన వంశస్థులయొద్దకు తిరిగి వెళ్లవలెను.౹ ఏలయనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు;౹ నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకుము.౹ మీ చుట్టుపెట్లనున్న జనములలోనుండి దాసీలను దాసులను కొనవచ్చును.౹ మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు.౹ మీ తరువాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని, ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠినసేవ చేయించు కొనకూడదు. పరదేశియేగాని నీయొద్ద నివసించువాడేగాని ధనసంపా దనము చేసికొనునప్పుడు అతనియొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీయొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైనను తన్ను అమ్ముకొనినయెడల తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును.౹ వాని పినతండ్రియేగాని పినతండ్రి కుమారుడేగాని వాని వంశములో వాని రక్తసంబంధియేగాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికినయెడల తన్నుతాను విడిపించుకొనవచ్చును.౹ అప్పుడువాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరమువరకు తన్ను కొనినవానితో లెక్కచూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్క చొప్పున ఉండవలెను. తాను జీతగాడైయుండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను.౹ ఇంక అనేక సంవత్సరములు మిగిలియుండినయెడల వాటినిబట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచనక్రయధనమును మరల ఇయ్యవలెను.౹ సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైనయెడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచనక్రయధనమును అతనికి చెల్లింపవలెను.౹ ఏటేటికి జీతగానివలె వాడతనియొద్ద ఉండవలెను. అతడు మీ కన్నులయెదుట వానిచేత కఠినముగా సేవ చేయించకూడదు.౹ అతడు ఈ రీతిగా విడిపింపబడనియెడల సునాదసంవత్సరమునవాడు తన పిల్లలతోకూడ విడుదలనొందును.౹ ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు; నేను ఐగుప్తుదేశములోనుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన. ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.౹ నేను నియమించిన విశ్రాంతిదినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును,౹ మీ ద్రాక్ష పండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.౹ ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయ పెట్టడు, ఆ దేశములో దుష్టమృగములులేకుండ చేసెదను, మీ దేశములోనికి ఖడ్గమురాదు;౹ మీరు మీ శత్రువులను తరిమెదరు; వారు మీ యెదుట ఖడ్గముచేత పడెదరు.౹ మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు.౹ ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్త రింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను.౹ మీరు చాలాకాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు; క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును.౹ నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీయందు నా మనస్సు అసహ్యపడదు.౹ నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలైయుందురు.౹ మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములోనుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించినయెడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనినయెడలను,౹ నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు;౹ నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.౹ ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను.౹ మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను.౹ మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫల మియ్యకుండును.౹ మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచినయెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను.౹ మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతాన రహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును.౹ శిక్షలమూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల నేను కూడ మీకు విరోధముగా నడిచెదను; మీ పాపములనుబట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను.౹ మీమీదికి ఖడ్గమును రప్పించెదను; అది నా నిబంధనవిషయమై ప్రతి దండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింప బడెదరు.౹ నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణా ధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరుగాని తృప్తి పొందరు. నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములనుబట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.౹ మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు.౹ నేను మీ యున్నతస్థలములను పాడు చేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.౹ నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడు చేసెదను; మీ సువాసనగల వాటి సువాసనను ఆఘ్రా ణింపను.౹ నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.౹ జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును.౹ మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నియు అది తన విశ్రాంతికాలములను అనుభవించును.౹ అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును.౹ మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధై ర్యము పుట్టించెదను; కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లువారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు.౹ తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకనిమీద నొకడు పడెదరు; మీ శత్రువులయెదుట మీరు నిలువలేక పోయెదరు.౹ మీరు జనముగానుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును.౹ మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములనుబట్టి క్షీణించిపోయెదరు.౹ వారు నాకు విరో ధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు, ఒప్పుకొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల,౹ నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; ఆ దేశమును కూడ జ్ఞాపకము చేసికొందును.౹ వారిచేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతిదినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకొనిరి. ఆ హేతువుచేతనే వారు తమ దోషశిక్ష న్యాయ మని ఒప్పుకొందురు.౹ అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారియందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను.౹ నేను వారికి దేవుడనైయుండునట్లు వారి పూర్వికులను జనములయెదుట ఐగుప్తులోనుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులనుబట్టి జ్ఞాపకము చేసికొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను. యెహోవా మోషేద్వారా సీనాయికొండమీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పునవారు యెహోవాకు దాని చెల్లింపవలెను.౹ నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సువరకు మగవానికి పరిశుద్ధస్థలముయొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను.౹ ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను.౹ అయిదేండ్లు మొదలుకొని యిరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను, ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.౹ ఒక నెల మొదలుకొని అయిదేండ్లలోపలి వయస్సుగల మగవానికి అయిదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను.౹ అరువది ఏండ్ల ప్రాయముదాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.౹ ఒకడు నీవు నిర్ణయించినవెలను చెల్లింపలేనంత బీదవాడైనయెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను; అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను. యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను.౹ అట్టిదానిని మార్చకూడదు; చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చినయెడల అదియు దానికి మారుగా ఇచ్చి నదియు ప్రతిష్ఠితమగును.౹ జనులు యెహోవాకు అర్పింప కూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చినయెడల ఆ జంతువును యాజకుని యెదుట నిలువబెట్టవలెను.౹ అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును.౹ అయితే ఒకడు అట్టిదానిని విడిపింప గోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు వానితో కలుపవలెను. ఒకడు తన యిల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించినయెడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును.౹ తన యిల్లు ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల అతడు నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు దానితో కలుపవలెను; అప్పుడు ఆ యిల్లు అతనిదగును. ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించినయెడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది.౹ అతడు సునాదసంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించినయెడల నీవు నిర్ణయించు వెల స్థిరము.౹ సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించినయెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున, అనగా మరుసటి సునాదసంవత్సరమువరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను.౹ పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును.౹ అతడు ఆ పొలమును విడిపింపనియెడలను వేరొకనికి దాని అమ్మినయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు.౹ ఆ పొలము సునాదసంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.౹ ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని యెహోవాకు ప్రతిష్ఠించినయెడల యాజకుడు సునాదసంవత్సరమువరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను.౹ సునాదసంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగిరావలెను.౹ నీ వెలలన్నియు పరిశుద్ధ స్థలముయొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను. ఒక తులము ఇరువది చిన్నములు. అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక యెవడును దాని ప్రతిష్ఠింపకూడదు; అది ఎద్దయిననేమి గొఱ్ఱెమేకల మందలోనిదైననేమి యెహోవాదగును.౹ అది అపవిత్రజంతువైనయెడలవాడు నీవు నిర్ణయించు వెలలో అయిదవవంతు దానితో కలిపి దాని విడిపింప వచ్చును. దాని విడిపింపనియెడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను. అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్యమైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించినయెడల ప్రతిష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపనుకూడదు, ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును.౹ మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.౹ ఒకడు తాను చెల్లింపవలసిన దశమభాగములలో దేనినైనను విడిపింప గోరినయెడల దానిలో అయిదవ వంతును దానితో కలుపవలెను.౹ గోవులలోనేగాని గొఱ్ఱెమేకలలోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును.౹ అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చకూడదు. దాని మార్చినయెడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును; అట్టిదాని విడిపింప కూడ దని చెప్పుము. ఇవి యెహోవా సీనాయికొండమీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. వారు ఐగుప్తుదేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవనెల మొదటి తేదిని, సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను –ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము.౹ ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమతమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను.౹ మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతోకూడ ఉండవలెను.౹ మీతోకూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా–రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;౹ షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామా; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి.౹ వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమతమపితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.౹ పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహరోనులు పిలుచుకొని రెండవనెల మొదటి తేదిని సర్వసమాజమును కూర్చెను.౹ ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారు తమతమ వంశావళులనుబట్టి తమతమ వంశములను తమతమపితరుల కుటుంబములను తమతమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియ చెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది యైరి. [21-22] షిమ్యోను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా *** షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి. గాదు పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి. యూదా పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా యూదా గోత్రములో లెక్కింపబడినవారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి. ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడినవారు ఏబది నాలుగువేల నాలుగువందలమంది యైరి. జెబూలూను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా జెబూలూను గోత్రములో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగువందలమంది యైరి. యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేపు గోత్రములో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది యైరి. మనష్షే పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది యైరి. బెన్యామీను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా బెన్యామీను గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది యైదువేల నాలుగువందలమంది యైరి. దాను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందలమంది యైరి. ఆషేరు పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి. నఫ్తాలి పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి. వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహరోనును తమతమపితరుల కుటుంబములనుబట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించినవారు.౹ అట్లు ఇశ్రాయేలీయులలో తమతమపితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలు వెళ్లిన ఇశ్రాయేలీయులందరు లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది యైరి. అయితే లేవీయులు తమపితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు.౹ ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెను —నీవు లేవీగోత్రమును లెక్కింపకూడదు.౹ ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు.౹ నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటిమీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవచేయుచు దానిచుట్టు దిగవలసినవారై యుందురు.౹ మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించినయెడలవాడు మరణశిక్ష నొందును.౹ ఇశ్రాయేలీయులు తమతమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను.౹ ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.౹ యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండ ఇశ్రాయేలీయులు చేసిరి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.౹ –ఇశ్రాయేలీయులందరు తమతమపితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమతమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను.౹ సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమతమ సేనలచొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.౹ అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బదినాలుగువేల ఆరువందలమంది.౹ అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.౹ అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది.౹ అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.౹ అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగువందలమంది.౹ యూదా పాళెములో లెక్కింప బడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారువేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను. రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.౹ అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది.౹ అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.౹ అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడువందలమంది.౹ అతని సమీపమున గాదు గోత్రముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు కుమారులకు ప్రధానుడు.౹ అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది.౹ రూబేను పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబదియొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవ తెగలో సాగినడవవలెను. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమతమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను. ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.౹ అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది.౹ అతని సమీపమున మనేష్ష గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు.౹ అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది.౹ అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.౹ అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగువందలమంది.౹ ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను. దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషద్దాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు.౹ అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడువందలమంది.౹ అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.౹ అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.౹ అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.౹ అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందలమంది.౹ దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను. వీరు ఇశ్రాయేలీయులలో తమతమపితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు. తమతమ సేనల చొప్పున తమతమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.౹ అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.౹ అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లువారు తమతమ వంశములచొప్పునను తమతమపితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచునుండిరి. యెహోవా సీనాయికొండమీద మోషేతో మాటలాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే.౹ అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే.౹ ఇవి అభిషేకమునొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు; వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను.౹ నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందునవారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రియైన అహరోను ఎదుట యాజకసేవ చేసిరి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను —నీవు లేవి గోత్రికులను తీసికొనివచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము.౹ వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపుసేవ చేయవలెను. తాము కాపాడ వలసినదానిని, సర్వసమాజము కాపాడ వలసినదానిని, వారు కాపాడవలెను.౹ మందిరపు సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారముయొక్క ఉపకరణములన్నిటిని, ఇశ్రాయేలీయులు కాపాడవలసినదంతటిని, వారే కాపాడవలెను.౹ కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయులలోనుండి అతని వశము చేయబడినవారు.౹ నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించినయెడలవాడు మరణశిక్ష నొందును. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను —ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను నా వశము చేసికొని యున్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు.౹ ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలి చూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నావారైయుందురు. నేనే యెహోవాను. మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹ –లేవీయుల పితరుల కుటుంబములను వారివారి వంశములను లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారినందరిని లెక్కింపవలెను.౹ కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాటచొప్పున వారిని లెక్కించెను.౹ లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.౹ గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి.౹ కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.౹ మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.౹ లిబ్నీయులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే.౹ వారిలో లెక్కింప బడినవారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడువేల ఐదువందలమంది.౹ గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటి దిక్కున దిగవలెను.౹ గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు.౹ ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసిన వేవనగా, మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు ప్రాకారయవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకొరకైన త్రాళ్లును. కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీయుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.౹ ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరి లెక్క చూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసినవారైరి.౹ కహాతు కుమారుల వంశములు మందిరముయొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు.౹ కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను.౹ వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవచేయు పరిశుద్ధస్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసినవారు.౹ యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధస్థలమును కాపాడు వారిమీద విచారణకర్త. మెరారి వంశమేదనగా, మహలీయుల వంశము మూషీయుల వంశము; ఇవి మెరారి వంశములు.౹ వారిలో లెక్కింపబడినవారెందరనగా, ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందలమంది.౹ మెరారీయుల పితరుల కుటుంబములో అబీహా యిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు.౹ మెరారి కుమారులు మందిరముయొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు.౹ మందిరము ఎదుటి తూర్పుదిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడ వలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్ష నొందును.౹ మోషే అహరోనులు యెహోవా మాటనుబట్టి, తమతమ వంశములచొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరు, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరు ఇరువది రెండువేలమంది. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను —నీవు ఇశ్రాయేలీయులలో ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల తొలిచూలియైన ప్రతిమగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము.౹ నేనే యెహోవాను; నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలో తొలిచూలియైన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసికొనవలెను.౹ కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టినవారినందరిని లెక్కించెను.౹ వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య యిరువది రెండువేల రెండువందల డెబ్బదిమూడు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసికొనుము. లేవీయులు నా వారైయుందురు; నేనే యెహోవాను.౹ ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయులకంటె రెండువందల డెబ్బది ముగ్గురు ఎక్కువైనందున శేషించినవారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను.౹ పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసికొనవలెను.౹ తులము ఇరువది చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచనకొరకు ఇయ్య బడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను.౹ కాబట్టి మోషే లేవీయులవలన విడిపింప బడినవారికంటె ఆ యెక్కువైన వారియొక్క విమోచన ధనమును తీసికొనెను.౹ పరిశుద్ధమైన తులముచొప్పున వెయ్యి మూడువందల అరువదియైదు తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠకుమారులయొద్ద తీసికొనెను.౹ యెహోవా మోషే కాజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాటచొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే యిచ్చెను. యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –నీవు లేవీయులలో కహాతీయులను వారివారి వంశములచొప్పునను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని, యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి, ప్రత్యక్షపుగుడారములో పనిచేయుటకు సేనగా చేరగలవారందరి సంఖ్యను వ్రాయించుము.౹ అతి పరిశుద్ధమైనదాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ యేదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పునువేసి దానిమీద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.౹ సన్నిధిబల్లమీద నీలిబట్టను పరచి దానిమీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలును దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎఱ్ఱ బట్ట పరచి దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పువేసి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.౹ మరియు వారు నీలి బట్టను తీసికొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉప యోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటిని సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండెమీద ఉంచవలెను.౹ మరియు బంగారుమయమైన బలిపీఠముమీద నీలిబట్టనుపరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.౹ మరియు తాము పరిశుద్ధస్థలములో సేవచేయు ఆ ఉపకరణములన్నిటిని వారు తీసికొని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండెమీద పెట్టవలెను.౹ వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి దానిమీద తమ సేవోప కరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను.౹ దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము.౹ యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగా–దీపతైలము పరిమళధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పైవిచారణలోనికి అతని భారము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి.౹ వారు అతి పరిశుద్ధమైనదానికి సమీపించినప్పుడు వారు చావక బ్రదికి యుండునట్లు మీరు వారినిగూర్చి చేయవలసినదేదనగా —అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియువాని వాని బరువును నియమింపవలెను.౹ వారు చావకయుండునట్లు పరిశుద్ధస్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –గెర్షోనీయులను వారివారి పితరుల కుటుంబముల చొప్పు నను వారివారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము.౹ ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనలో పని చేయ చేరువారందరిని లెక్కింపవలెను.౹ పనిచేయుటయు మోతలు మోయుటయు గెర్షో నీయుల సేవ;౹ వారు మందిరముయొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను౹ మందిరము చుట్టును బలిపీఠము చుట్టునుఉండు ప్రాకారపు గవినిద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటిని వాటికొరకు చేయబడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను.౹ గెర్షోనీయుల పని అంతయు, అనగా తాము మోయు వాటినన్నిటిని చేయుపనియంతటిని అహరోనుయొక్కయు అతని కుమారులయొక్కయు నోటిమాటచొప్పున జరుగవలెను. వారు జరుపువాటినన్నిటిని జాగ్రత్తగా చూచు కొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను.౹ ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయులయొక్క పని యిది; వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతా మారు చేతిక్రింద నుండవలెను. మెరారీయులను వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను.౹ ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కింపవలెను.౹ ప్రత్యక్షపు గుడారములో వారు చేయుపని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డ కఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావలసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలెను.౹ మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద చేయవలసిన సేవ యిది; అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులు సమాజప్రధానులను కహాతీయులను, అనగా వారివారి వంశముల చొప్పునను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కించిరి.౹ వారివారి వంశములచొప్పున వారిలో లెక్కింపబడినవారు రెండువేల ఏడువందల ఏబదిమంది.౹ ప్రత్యక్షపు గుడారములో సేవచేయతగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా మోషేచేత పలికించిన మాటచొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి. గెర్షోనీయులలో వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింప బడినవారు, అనగా ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై సేనగా చేరువారందరు తమతమ వంశముల చొప్పునను తమతమపితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడినవారు రెండువేల ఆరు వందల ముప్పదిమంది.౹ ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగినవారని గెర్షోనీయులలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా నోటిమాటనుబట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి.౹ మెరారీయుల వంశములలో తమతమ వంశముల చొప్పునను తమతమపితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు అనగా ముప్పదియేండ్లు మొదలుకొని యేబదియేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనగా చేరువారు అనగా తమతమ వంశములచొప్పున వారిలో లెక్కింప బడినవారు మూడువేల రెండువందలమంది.౹ మెరారీయుల వంశములలో లెక్కింపడినవారు వీరే; యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి.౹ మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల ప్రధానులును లెక్కించిన లేవీయులలో ముప్పది యేండ్లు మొదలుకొని యేబదియేండ్లవరకు ప్రాయము కలిగి తమతమ వంశములచొప్పునను తమతమపితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరు, అనగా వారిలో లెక్కింపబడినవారు ఎనిమిదివేల ఐదువందల ఎనుబదిమంది.౹ యెహోవా నోటిమాటచొప్పున మోషేచేత వారు లెక్కింపబడిరి; ప్రతివాడును తన తన సేవనుబట్టియు తన తన మోతనుబట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లువారు అతనివలన లెక్కింపబడిరి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹ –ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతి వానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతి వానిని, పాళెములోనుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.౹ నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్ర పరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్టవలెను.౹ ఇశ్రాయేలీయులు ఆలాగు చేసిరి; పాళెము వెలుపలికి అట్టివారిని వెళ్లగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను —నీవు ఇశ్రాయేలీయులతో –పురుషుడుగాని స్త్రీగాని యెహోవామీద తిరుగబడి మనుష్యులుచేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధమువలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో అయిదవవంతు దానితో కలిపి యెవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను.౹ ఆ అపరాధ నష్టమును తీసికొనుటకు ఆ మనుష్యునికి రక్తసంబంధి లేనియెడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును.౹ ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతనివగును.౹ ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చినయెడల అది అతని దగునని చెప్పుము. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకని భార్య త్రోవతప్పి వానికి ద్రోహముచేసినయెడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించినయెడల ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడినదనుటకు సాక్ష్యము లేక పోయినను, ఆమె పట్టుబడకపోయినను,౹ వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్యమీద కోపపడినయెడల, లేక వాని మనస్సులో రోషముపుట్టి అపవిత్ర పరచబడని తన భార్యమీద కోపపడినయెడల,౹ ఆ పురుషుడు యాజకునియొద్దకు తన భార్యను తీసికొనివచ్చి, ఆమె విషయము తూమెడు యవలపిండిలో పదియవ వంతును తేవలెను.వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు; ఏలయవగా అది రోషవిషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకముచేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము.౹ అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసికొనివచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను.౹ తరువాత యాజకుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసికొనవలెను, మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసికొని ఆ నీళ్లలో వేయవలెను.౹ తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తల ముసుకును తీసి, రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకునిచేతిలో ఉండవలెను.౹ అప్పుడు యాజకుడు ఆ స్త్రీచేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసిన దేమనగా–ఏ పురుషుడును నీతో శయనింపనియెడలను, నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యముచేయక పోయినయెడలను, శాపము కలుగజేయు ఈ చేదునీళ్లనుండి నిర్దోషివి కమ్ము.౹ నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవతప్పి అపవిత్ర పరచబడినయెడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమిచేసినయెడల యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుటవలన యెహోవా నీ జనులమధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక.౹ శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీచేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ— ఆమేన్ అని చెప్పవలెను.౹ తరువాత యాజకుడు పత్రముమీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. శాపము కలుగజేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును.౹ మరియు యాజకుడు ఆ స్త్రీ చేతినుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసికొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠము నొద్దకు దాని తేవలెను.౹ తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములోనుండి పిడికెడు తీసి బలిపీఠముమీద దాని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసినయెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనులమధ్య శాపమున కాస్పదముగా నుండును.౹ ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రురాలై యుండినయెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగునని చెప్పుము.౹ రోషము విషయమైన విధి యిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములోనున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడినయెడలనేమి,౹ లేక వానికి రోషము పుట్టి తన భార్యమీద కోపపడినయెడలనేమి,వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజకుడు ఆమెయెడల సమస్తము విధిచొప్పున చేయవలెను.౹ అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను —నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము.౹ పురుషుడేగాని స్త్రీయేగాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్నుతాను ప్రత్యేకించుకొనినయెడలవాడు ద్రాక్షారస మద్యములను మానవలెను.౹ ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండినవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.౹ అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు.౹ అతడు నాజీ రగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్నుతాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను.౹ అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్ని టిలో ఏ శవమును ముట్టవలదు.౹ తన దేవునికి మీదు కట్టబడిన తలవెండ్రుకలు అతని తలమీదనుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరిగాని చనిపోయినను వారినిబట్టి అతడు తన్నుతాను అపవిత్రపరచుకొనవలదు.౹ అతడు ప్రత్యేకముగాఉండు దినములన్నియు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును.౹ ఒకడు అతనియొద్ద హఠాత్తుగా చనిపోవుటవలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడినయెడల అతడు పవిత్రపరపబడు దినమున, అనగా ఏడవదినమున తనతల గొరిగించుకొనవలెను.౹ ఎనిమిదవదినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న యాజకునియొద్దకు తేవలెను.౹ అప్పుడు యాజకుడు ఒకదానితో పాపపరిహారార్థబలిని రెండవదానితో దహన బలిని అర్పించి,వాడు శవము ముట్టుటవలన పాపి యైనందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలెను.౹ మరియు తాను ప్రత్యేకముగాఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱెపిల్లను తీసికొని రావలెను; తన వ్రతసంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుకమునుపటి దినములు వ్యర్థమైనవి. నాజీరు ప్రత్యేకముగాఉండు దినములు నిండిన తరువాత వానిగూర్చిన విధి యేదనగా, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు వానిని తీసికొని రావలెను.౹ అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను, సమాధాన బలిగాను నిర్దోషమైన యొక పొట్టేలును,౹ గంపెడు పొంగని పిండి, అనగా గోధుమపిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవాయొద్దకు తేవలెను.౹ అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పింపవలెను.౹ యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను.౹ అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద తన వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించుకొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను.౹ మరియు యాజకుడు ఆ పొట్టేలుయొక్క వండిన జబ్బను ఆ గంపలోనుండి పొంగని యొక భక్ష్యమును పొంగని యొక పూరీని తీసికొని నాజీరు తన వ్రతసంబంధమైన వెండ్రుకలు గొరికించుకొనిన పిమ్మట అతనిచేతులమీద వాటి నుంచవలెను.౹ తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠితమైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును; తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును.౹ మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరునుగూర్చిన విధిని బట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము –మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.౹ యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక;౹ యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక;౹ యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లువారు ఇశ్రాయేలీయులమీద నా నామమును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను. మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి,౹ దాని ఉపకరణములన్నిటిని బలిపీఠమును దాని పాత్రలన్నిటిని చేయించి, అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమతమపితరుల కుటుంబములలో ప్రధానులును గోత్ర ముఖ్యులును లెక్కింప బడిన వారిమీద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి.౹ వారు ఇద్దరిద్దరికి ఒక్కొక బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక యెద్దు చొప్పునను, ఆరు గూడు బండ్లను పండ్రెండు ఎద్దులను యెహోవా సన్నిధికి తీసికొనివచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసికొనివచ్చిరి.౹ [4-5] అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు వారియొద్ద ఈ వస్తువులను తీసికొనుము; అవి ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకై యుండును; నీవు వాటిని లేవీయులలో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను.౹ *** మోషే ఆ బండ్లను ఆ యెద్దులను తీసికొని లేవీయుల కిచ్చెను.౹ అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవచొప్పున గెర్షోనీయులకిచ్చెను.౹ అతడు నాలుగు బండ్లను ఎనిమిది యెద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద సేవచేయు మెరారీ యులకు వారి వారి సేవచొప్పున ఇచ్చెను.౹ కహాతీయుల కియ్యలేదు; ఏలయనగా పరిశుద్ధస్థలపు సేవ వారిది; తమ భుజములమీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు.౹ బలిపీఠము అభిషేకింప బడిననాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమతమ అర్పణములను తెచ్చిరి.౹ బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడునైన నయస్సోను.౹ అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను అపరాధ పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. రెండవదినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడునైన నెతనేలు.౹ అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము. మూడవదినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము. నాలుగవదినమున అర్పణమును తెచ్చినవాడు షెదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను [34-35] సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము. *** అయిదవదినమున అర్పణమును తెచ్చినవాడు సూరీష దాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమీయేలు.౹ అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్నకోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము. ఆరవదినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయా సాపు.౹ అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను [46-47] పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు అర్పణము. *** ఏడవదినమున అర్పణమును తెచ్చినవాడు అమీ హూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడునైన ఎలీషామా.౹ అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును, ఏడాది గొఱ్ఱెపిల్లను పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీ షామా అర్పణము. ఎనిమిదవదినమున అర్పణమును తెచ్చినవాడు పెదా సూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడునైన గమలీ యేలు.౹ అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను [57-58] అపరాధపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.౹ *** ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము. తొమ్మిదవదినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అబీదాను.౹ అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది షెకెలుల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము. పదియవదినమున అర్పణమును తెచ్చినవాడు అమీష ద్దాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీ యెజెరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తు గల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము. పదకొండవదినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు.౹ అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము. పండ్రెండవదినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర.౹ అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్నకోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీర అర్పణము. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణములు ఇవి, వెండి గిన్నెలు పండ్రెండు, వెండి ప్రోక్షణపాత్రలు పండ్రెండు, బంగారు ధూపార్తులు పండ్రెండు, ప్రతి వెండిగిన్నె నూట ముప్పది తులములది.౹ ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్బది తులములది; ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి రెండువేల నాలుగువందల తులములది.౹ ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపా ర్తులు పండ్రెండు; వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి పది తులములది.౹ ఆ ధూపార్తుల బంగారమంతయు నూటఇరువది తులములది; దహనబలి పశువులన్నియు పండ్రెండు కోడెలు, పొట్టేళ్లు పండ్రెండు, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు పండ్రెండు, వాటి నైవేద్యములును పాపపరిహారార్థమైన మగమేకపిల్లలు పండ్రెండు,౹ సమాధానబలి పశువులన్నియు ఇరువదినాలుగు కోడెలు,౹ పొట్టేళ్లు అరువది, మేకపోతులు అరువది, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు అరువది.౹ మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసముమీద నున్న కరుణాపీఠముమీద నుండి, అనగా రెండు కెరూబుల నడమనుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాటలాడెను. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను.౹ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను.౹ ఆ దీపవృక్షము బంగారు నకిషిపనిగలది; అది దాని స్తంభము మొదలుకొని పుష్పములవరకు నకిషిపనిగలది; యెహోవా కనుపరచిన మాదిరినిబట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను —నీవు ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను ప్రత్యే కించి వారిని పవిత్రపరచుము.౹ వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారిమీద పాపపరిహా రార్థజలమును ప్రోక్షింపుము; అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధుమపిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసికొని రావలెను.౹ అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేయవలెను.౹ నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొనివచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయులమీద ఉంచవలెను.౹ లేవీయులు యెహోవా సేవచేయు వారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులును ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను.౹ లేవీయులు ఆ కోడెల తలలమీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను.౹ [14-15] అట్లు నీవు ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను వేరుపరచవలెను; లేవీయులు నావారై యుందురు. తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై లోపలికి వెళ్లవచ్చును.౹ *** ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడినవారు; తొలిచూలియైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసికొనియున్నాను.౹ ఏలయనగా మనుష్యులలోను పశువులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైనది యావత్తును నాది; ఐగుప్తుదేశములో తొలిచూలియైన ప్రతివానిని నేను సంహరించిననాడు వారిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని.౹ ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను తీసికొని యున్నాను.౹ మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవచేయుటకును ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలీయులలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధమందిరమునకు సమీపించునప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను.౹ అప్పుడు మోషే అహరోనులును ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా లేవీయులనుగూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమునుబట్టి లేవీయులయెడల చేసిరి; ఇశ్రాయేలీయులు వారికి అట్లేచేసిరి.౹ లేవీయులు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉదుకుకొనిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.౹ తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు లోపలికి వెళ్లిరి. యెహోవా లేవీయులనుగూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారియెడల చేసెను.౹ మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–ఇది లేవీయులనుగూర్చిన విధి.౹ ఇరువదియైదేండ్లు మొదలుకొని పైప్రాయముగల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారముయొక్క సేవలో పని చేయుటకు రావలెను.౹ అయితే ఏబది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను.౹ వారు కాపాడవలసినవాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపువారితోకూడ పరిచర్య చేయవలెనుగాని పనిచేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటివిషయము నీవు వారికి ఆలాగు నియమింపవలెను. ఐగుప్తుదేశములోనుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయులు పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను.౹ దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవదినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను.౹ కాబట్టి మోషే —పస్కాపండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదునాలుగవదినమున సాయంకాలమందు పస్కాపండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి.౹ యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి.౹ కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పస్కాపండుగను ఆచరింపలేకపోయిరి.౹ వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో — నరశవమును ముట్టుటవలన అపవిత్రులమైతిమి; యెహోవా అర్పణమును దాని నియామకకాలమున ఇశ్రాయేలీయులమధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడితిమని అడుగగా మోషే–నిలువుడి; మీ విషయములో యెహోవా యేమి సెలవిచ్చునో నేను తెలిసి కొందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను —నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము –మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుటవలన అప విత్రుడైనను, దూరప్రయాణము చేయుచుండినను, అతడు యెహోవా పస్కాపండుగను ఆచరింపవలెను.౹ వారు రెండవనెల పదునాలుగవదినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను.౹ వారు మరునాటివరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు; దానిలోనిది ఒక్క యెముకనైనను విరువవలదు; పస్కాపండుగ విషయమైన కట్టడ లన్నిటినిబట్టి వారు దానిని ఆచరింపవలెను.౹ ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానినయెడల ఆ మనుష్యుడు తన జనులలోనుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను.౹ మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను. వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకారము మందిరముమీద నుండెను.౹ నిత్యమును ఆలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను.౹ ఆ మేఘము గుడారము మీదనుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి.౹ యెహోవానోటిమాటచొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి. యెహోవా నోటిమాటచొప్పునవారు తమ గుడారములను వేసికొనిరి. ఆ మేఘము మందిరముమీద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి.౹ ఆ మేఘము బహుదినములు మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిననుసరించి ప్రయాణము చేయకుండిరి.౹ మేఘము కొన్ని దినములు మందిరముమీద నిలిచినయెడల వారును నిలిచిరి; యెహోవా నోటిమాటచొప్పుననే నిలిచిరి, యెహోవా నోటిమాటచొప్పుననే ప్రయాణము చేసిరి.౹ ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు నిలిచినయెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి.౹ ఆ మేఘము రెండుదినములుగాని, ఒక నెలగాని, యేడాదిగాని తడవు చేసి మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ప్రయాణముచేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి.౹ యెహోవా మాటచొప్పునవారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవా మాటచొప్పునవారు ప్రయాణముచేసిరి; మోషేద్వారా యెహోవా చెప్పిన మాటనుబట్టి యెహోవా ఆజ్ఞ ననుసరించి నడిచిరి. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు. రెండు వెండి బూరలు చేయించుకొనుము;౹ నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.౹ ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను.౹ వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడి రావలెను.౹ మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగి యున్న సైన్యములు సాగవలెను.౹ మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణదిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను.౹ సమాజమును కూర్చునప్పుడు ఊదవలెనుగాని ఆర్భాటము చేయవలదు.౹ అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను; నిత్యమైన కట్టడనుబట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును.౹ మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులనుండి రక్షింపబడుదురు.౹ మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలు లనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే. రెండవ సంవత్సరము రెండవనెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరము మీదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములోనుండి ప్రయాణములు చేయసాగిరి.౹ తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.౹ యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి వారు మొదట ప్రయాణము చేసిరి.౹ యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి.౹ ఇశ్శాఖారీయుల గోత్రసైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి.౹ జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి.౹ మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచు సాగిరి.౹ రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.౹ షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి.౹ గాదీయుల గోత్రసైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి.౹ కహాతీయులు పరిశుద్ధమైనవాటిని మోయుచుసాగిరి; అందరు వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి.౹ ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి.౹ పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి.౹ గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్రసైన్యమునకు అధిపతి.౹ దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుక నుండెను; అమీషద్దాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్యమునకు అధిపతి.౹ ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్రసైన్యమునకు అధిపతి.౹ ఇశ్రాయేలీయులు ప్రయాణముచేయునప్పుడు తమతమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే–యెహోవా మా కిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము; మాతోకూడ రమ్ము; మేము మీకు మేలు చేసెదము; యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలునుగూర్చి వాగ్దానము చేసెననగా అందుకతడు–నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్లుదుననెను.౹ అందుకు మోషే–నీవు దయచేసి మమ్మును విడువకుము; ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి; నీవు మాకు కన్నులవలె ఉందువు.౹ మరియు నీవు మాతోకూడ వచ్చినయెడల యెహోవా మాకు ఏ మేలుచేయునో ఆ మేలునుబట్టి మేము నీకు మేలుచేయుదుమనెను. వారు యెహోవా కొండనుండి మూడుదినముల ప్రయాణముచేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడుదినముల ప్రయాణములో యెహోవా నిబంధనమందసము వారికి ముందుగా సాగెను.౹ వారు తాము దిగిన స్థలమునుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారిమీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే–యెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుటనుండి పారిపోవుదురుగాక యనెను.౹ అది నిలిచినప్పుడు అతడు–యెహోవా, ఇశ్రాయేలు వేవేలమధ్యకు మరల రమ్మనెను. జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను.౹ జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను.౹ యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి— మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచి తముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.౹ ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి.౹ ఆ మన్నా కొతిమెరగింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను.౹ జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనముమీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను.౹ రాత్రియందు మంచు పాళెముమీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను.౹ జనులు తమతమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్దవారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను.౹ కాగా మోషే యెహోవాతో యిట్లనెను–నీవేల నీ సేవకుని బాధించితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జనులందరి భారమును నామీద పెట్టనేల? నేనే యీ సర్వ జనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు.౹ ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నా కెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు —తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచినయెడల నన్ను చంపుము.౹ నామీద నీ కటాక్షము వచ్చినయెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను నాయొద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతోకూడ నిలువబడవలెను.౹ నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లువారు దానిలో నొక పాలు నీతోకూడ భరింపవలెను.౹ నీవు జనులను చూచి యిట్లనుము–మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచు కొనుడి; మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి–మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు.౹ ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు.౹ ఒక నెలదినములవరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలోనుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దానిని తిందురు; ఏలయనగా మీరు మీ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి–ఐగుప్తులోనుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి.౹ అందుకు మోషే–నేను ఈ జనులమధ్య ఉన్నాను; వారు ఆరు లక్షల పాదచారులు–వారు నెలదినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితివి.౹ వారు తృప్తిగా తినునట్లు వారినిమిత్తము గొఱ్ఱెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నియు వారినిమిత్తము కూర్చవలెనా? అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను— యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ యెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు.౹ మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను పోగుచేసి గుడారముచుట్టు వారిని నిలువబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతనిమీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరిగాని మరల ప్రవచింపలేదు.౹ ఆ మనుష్యులలో నిద్దరు పాళెములో నిలిచియుండిరి; వారిలో ఒకనిపేరు ఎల్దాదు, రెండవ వానిపేరు మేదాదు; వారి మీదను ఆత్మ నిలిచియుండెను; వారు వ్రాయబడినవారిలోను ఉండియు వారు గుడారమునకు వెళ్లక తమ పాళెములోనే ప్రవచించిరి.౹ అప్పుడు ఒక యౌవనుడు మోషే యొద్దకు పరుగెత్తివచ్చి–ఎల్దాదు మేదాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకొనినవారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ–మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను.౹ అందుకు మోషే–నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను.౹ అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును పాళెములోనికి వెళ్లిరి.౹ తరువాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్లను రప్పించి పాళెముచుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరమువరకు భూమిమీద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను.౹ కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటినిపరచిరి.౹ ఆ మాంసము ఇంక వారి పండ్ల సందున నుండగానే, అది నమలకమునుపే, యెహోవా కోపము జనులమీద రగులుకొనెను; యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను.౹ మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను.౹ జనులు కిబ్రోతు హత్తావానుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి. మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీనిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.౹ వారు–మోషేచేత మాత్రమే యెహోవా పలి కించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పు కొనగా యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.౹ యెహోవా —మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను.౹ వారిద్దరు రాగా ఆయన —నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడుకాడు.౹ అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు.౹ నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను.౹ యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను.౹ మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారముమీదనుండి ఎత్తబడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను.౹ అహరోను–అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము; పాపులమైన మేము చేసిన యీ పాపమును మామీద మోపవద్దు.౹ తన తల్లి గర్భములోనుండి పుట్టినప్పటికే సగముమాంసము క్షీణించిన శిశు శవమువలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా మోషే యెలుగెత్తి–దేవా, దయచేసి యీమెను బాగుచేయుమని యెహోవాకు మొఱపెట్టెను.౹ అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖముమీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గు పడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చు కొనవలెను.౹ కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరల చేర్చబడువరకు జనులు ముందుకు సాగరైరి.౹ తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను — నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.౹ మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.౹ వారి పేళ్లు ఏవనగా–రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;౹ యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు;౹ ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;౹ ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;౹ బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ;౹ జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;౹ యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;౹ దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మీయేలు;౹ ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;౹ నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;౹ గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.౹ దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.౹ మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెను–మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,౹ దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.౹ వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను.౹ వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టుయొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి.౹ ఇశ్రాయేలీయులు అక్కడకోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను.౹ వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచితిరిగి వచ్చిరి.౹ అట్లువారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహరోనులయొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్దకును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి.౹ వారు అతనికి తెలియపరచినదేమనగా–నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితిమి; అది పాలు తేనెలు ప్రవహించు దేశమే; దాని పండ్లు ఇవి.౹ అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితిమి.౹ అమాలేకీయులు దక్షిణదేశములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి.౹ కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచి–మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.౹ అయితే అతనితోకూడ పోయిన ఆ మనుష్యులు–ఆ జనులు మనకంటె బలవంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి.౹ మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి–మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.౹ అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి; మా దృష్టికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను; ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి.౹ మరియు ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనుల పైని సణుగుకొనిరి.౹ ఆ సర్వసమాజము–అయ్యో ఐగుప్తులో మేమేల చావ లేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలుకాదా? అని వారితో అనిరి.౹ వారు–మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వసమాజసంఘము ఎదుట సాగిలపడిరి.౹ అప్పుడు దేశమును సంచరించి చూచినవారిలోనుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో–మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము.౹ యెహోవా మనయందు ఆనం దించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును; అది పాలు తేనెలు ప్రవహించుదేశము.౹ మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై యున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికి కనబడెను. యెహోవా–ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారిమధ్యను చేసిన సూచకక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక యుందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ఇట్లనెను–ఆలాగైతే ఐగుప్తీయులు దానిగూర్చి విందురు; నీవు నీ బలముచేత ఈ జనమును ఐగుప్తీయులలోనుండి రప్పించితివిగదా; వీరు ఈ దేశనివాసులతో ఈ సంగతి చెప్పియుందురు.౹ యెహోవా అను నీవు ఈ ప్రజలమధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియు, నీ మేఘము వారిమీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా.౹ కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినయెడల నీ కీర్తినిగూర్చి వినిన జనములు –ప్రమాణ పూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవావారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు.౹ యెహోవా దీర్ఘశాంతు డును, కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాటచొప్పున నా ప్రభువుయొక్క బలము ఘనపరచబడును గాక ఐగుప్తులోనుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ఈ ప్రజలదోషమును పరిహరించియున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజలదోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా యెహోవా–నీ మాటచొప్పున నేను క్షమించియున్నాను.౹ అయితే నా జీవముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును.౹ నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి.౹ కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యము చేసినవారిలో ఎవరును దానిని చూడరు.౹ నా సేవకుడైన కాలేబు మంచిమనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను.౹ అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులును కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎఱ్ఱసముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను.౹ నీవు వారితో–యెహోవా వాక్కు ఏదనగా–నా జీవముతోడు; మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీయెడల చేసెదను.౹ మీ శవములు ఈ అరణ్యములోనే రాలును; మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడినవారందరు, అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలిగి నాకు విరోధముగా సణగినవారందరు రాలిపోవుదురు.౹ యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు; ఇది నిశ్చయము.౹ అయితే–వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోపలికి రప్పించెదను; మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు;౹ అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును.౹ మీ శవములు ఈ అరణ్యములో క్షయమగువరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచారశిక్షను భరించెదరు.౹ మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు.౹ ఇది యెహోవా అను నేను చెప్పిన మాట; నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వసమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు; ఇక్కడనే చనిపోవుదురు అనెను.౹ ఆ దేశమును సంచరించి చూచుటకై మోషేచేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమునుగూర్చి చెడ్డసమాచారము చెప్పుటవలన సర్వ సమాజము అతనిమీద సణుగునట్లు చేసిన మనుష్యులు,౹ అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి.౹ అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి.౹ మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాల దుఃఖించిరి.౹ వారు ఉదయమున లేచి ఆ కొండ కొనమీదికెక్కి–చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్లుదుము అనిరి.౹ అప్పుడు మోషే–ఇది ఏల? మీరు యెహోవా మాట మీరు చున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీమధ్యను లేడు గనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి.౹ ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు; మీరు ఖడ్గముచేత కూలుదురు; మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను.౹ అయితే వారు మూర్ఖించి ఆ కొండకొన కెక్కిపోయిరి; అయినను యెహోవా నిబంధనమందసమైనను మోషేయైనను పాళెములోనుండి బయలు వెళ్లలేదు.౹ అప్పుడు ఆ కొండమీద నివాసముగానున్న అమాలేకీయులును కనానీయులును దిగి వచ్చి వారిని కొట్టి హోర్మావరకు వారిని తరిమి హతము చేసిరి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–నేను మీ కిచ్చుచున్న దేశనివాసములలో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదానినేకాని, గొఱ్ఱె మేకలలోనిదానినేకాని, దహనబలిగానైనను, బలిగానైనను తెచ్చి, మ్రొక్కుబడి చెల్లించుటకనియో, స్వేచ్ఛార్పణగాననియో, నియామక కాలమందు అర్పించునదియనియో, దేనినైనను మీరు అర్పింపగోరినయెడల యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను.౹ ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతోకూడ దహనబలిమీదనేమి బలిమీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను.౹ పొట్టేలుతోకూడ పడి నూనెతో కలుపబడిన నాలుగు పళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను.౹ పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను; అది యెహోవాకు ఇంపైన సువాసన.౹ మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధానబలి నర్పించుటకైనను నీవు దహనబలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరచినయెడల ఆ కోడెతోకూడ పడిన్నరనూనె కలుపబడిన ఆరుపళ్ల గోధుమపిండిని నైవేద్యముగా అర్పింపవలెను.౹ మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా పడిన్నర ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను; ఒక్కొక్క కోడెతోకూడను ఒక్కొక్క పొట్టేలుతోకూడను, గొఱ్ఱెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతోకూడను, ఆలాగు చేయవలెను.౹ మీరు సిద్ధపరచువాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను.౹ దేశములో పుట్టినవారందరు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమార్పణమును తెచ్చునప్పుడు ఆలాగుననే చేయవలెను.౹ మీయొద్ద నివసించు పరదేశిగాని మీ తరతరములలో మీ మధ్యనున్నవాడెవడుగాని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము అర్పింప గోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను.౹ సంఘమునకు, అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ; అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ; యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును.౹ మీకును మీయొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే యేర్పాటు, ఒక్కటే న్యాయవిధి యుండవలెను. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము –నేను మిమ్మును కొని పోవుచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను.౹ మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను; కళ్లపు అర్పణమువలె దాని అర్పింపవలెను.౹ మీ తరతరములకు మీ మొదటి పిండిముద్దలోనుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేతో చెప్పిన యీ ఆజ్ఞలన్నిటిలో, అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించినవాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు, అది సమాజమునకు తెలియ బడనియెడల సర్వసమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడెదూడను, విధిచొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను.౹ యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను; తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములనుబట్టి తమ అర్పణమును, అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్థబలిని యెహోవా సన్నిధికి తీసికొని రావలెను.౹ అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజమేమి, వారిమధ్యను నివసించు పరదేశియేమి క్షమాపణ నొందును; ఏలయనగా ప్రజలందరు తెలియకయే దాని చేయుట తటస్థించెను.౹ ఒకడు పొరబాటున పాపము చేసినయెడలవాడు పాప పరిహారార్థబలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసికొని రావలెను.౹ పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపముచేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును; వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలనవాడు క్షమాపణ నొందును.౹ ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారిమధ్యను నివసించు పరదేశియేగాని పొరబాటున ఎవడైనను పాపము చేసినయెడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను.౹ అయితే దేశమందు పుట్టినవాడేగాని పరదేశియేగాని యెవడైనను సాహసించి పాపముచేసినయెడల వాడు యెహోవాను తృణీకరించినవాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టి వేయబడును;వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును; వాని దోషశిక్షకు వాడే కారకుడు. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి.౹ వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషేయొద్దకును అహరోనునొద్దకును సర్వసమాజమునొద్దకును వానిని తీసికొని వచ్చిరి.౹ వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి.౹ తరువాత యెహోవా–ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను.౹ సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. వారు తమ తర తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసికొని అంచుల కుచ్చులమీద నీలిసూత్రము తగిలింపవలెను.౹ [39-41] మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని మీ దేవునికి ప్రతిష్ఠితులైయుండునట్లుమునుపటివలె కోరినవాటినిబట్టియు చూచినవాటినిబట్టియు వ్యభిచరింపక, దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని వాటి ననుసరించుటకే అది మీకు కుచ్చుగానుండును. నేను మీకు దేవుడనై యుండునట్లుగా ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను; మీ దేవుడనైన యెహోవాను నేనే. లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబదిమందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి–మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవావారి మధ్యనున్నాడు; యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,౹ మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను –తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చు కొనును.౹ ఈలాగు చేయుడి; కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి.౹ అప్పుడు యెహోవా యే మనుష్యుని యేర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు.౹ మరియు మోషే కోరహుతో ఇట్లనెను–లేవి కుమారులారా వినుడి.౹ తన మందిరసేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారినందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వము కూడ కోరుచున్నారు.౹ ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగ నేల అనెను.౹ అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను.౹ అయితే వారు–మేము రాము; ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములోనుండి మమ్మును తీసికొనివచ్చుట చాలనట్టు, మామీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసికొని రాలేదు; పొలములు ద్రాక్షతోటలుగల స్వాస్థ్యము మాకియ్యలేదు; ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి.౹ అందుకు మోషే మిక్కిలి కోపించి–నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొనలేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవిచేసెను.౹ మరియు మోషే కోరహుతో— నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను.౹ మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటిమీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను.౹ కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసికొని వాటిలో అగ్నియుంచి వాటిమీద ధూప ద్రవ్యము వేసినప్పుడు, వారును మోషే అహరోనులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచిరి.౹ కోరహు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను.౹ అప్పుడు యెహోవా–మీరు ఈ సమాజములోనుండి అవతలికి వెళ్లుడి.౹ క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి–సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీయొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజముమీద నీవు కోపపడుదువా? అని వేడు కొనిరి.౹ [23-24] అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–కోరహు దాతాను అబీరాములయొక్క నివాసముల చుట్టుపెట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.౹ *** అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి.౹ అతడు–ఈ దుష్టుల గుడారములయొద్దనుండి తొలగిపోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.౹ కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసములయొద్దనుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి.౹ మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలిసికొందురు.౹ మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందినయెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్ను పంపలేదు.౹ అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలనవారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మ్రింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.౹ అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించ గానే వారి క్రింది నేల నెరవిడిచెను.౹ భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మ్రింగివేసెను.౹ వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; భూమి వారిని మ్రింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.౹ వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష విని–భూమి మనలను మ్రింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి.౹ మరియు యెహోవాయొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చి వేసెను.౹ అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము–ఆ అగ్నిమధ్యనుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి.౹ ఆ అగ్నిని దూరముగా చల్లుము.౹ పాపముచేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసికొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి; అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును.౹ [39-40] అహరోను సంతాన సంబంధికాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి, కోరహువలెను అతని సమాజమువలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకసూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడినవారు అర్పించిన యిత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులు చేయించెను. *** మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు–మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారమువైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను; యెహోవా మహిమయు కనబడెను.౹ మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా–మీరు ఈ సమాజము మధ్యనుండి తొలగి పోవుడి,౹ క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి.౹ అప్పుడు మోషే–నీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.౹ అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికినిమధ్యను నిలువబడగా తెగులు ఆగెను.౹ కోరహు తిరుగుబాటున చనిపోయినవారు గాక పదునాలుగువేల ఏడువందలమంది ఆ తెగులుచేత చచ్చిరి.౹ ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరనున్న మోషేయొద్దకు తిరిగి వచ్చెను. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹ –నీవు ఇశ్రాయేలీయులతో మాటలాడి వారియొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కఱ్ఱగా, అనగా వారి ప్రధానులందరియొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పండ్రెండు కఱ్ఱలను తీసికొని యెవరి కఱ్ఱమీద వారిపేరు వ్రాయుము.౹ లేవికఱ్ఱమీద అహరోను పేరు వ్రాయవలెను; ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కఱ్ఱయే యుండవలెను.౹ నేను మిమ్మును కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని శాసనములయెదుట వాటిని ఉంచవలెను.౹ అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కఱ్ఱ చిగిరించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండ మాన్పివేయుదును.౹ కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరు తమతమపితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కఱ్ఱ చొప్పున పండ్రెండు కఱ్ఱలను అతనికిచ్చిరి; అహరోను కఱ్ఱయు వారి కఱ్ఱలమధ్యనుండెను.౹ మోషే వారి కఱ్ఱలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను.౹ మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కఱ్ఱ చిగిర్చి యుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లుగలదాయెను. మోషే యెహోవా సన్నిధినుండి ఆ కఱ్ఱలన్నిటిని ఇశ్రాయేలీయులందరి యెదుటికి తేగా వారు వాటిని చూచియొక్కొక్కడు ఎవరి కఱ్ఱను వారు తీసికొనిరి.౹ అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–తిరుగబడిన వారినిగూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు, అహరోను కఱ్ఱను మరల శాసనముల యెదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవౌదువు.౹ అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను; ఆలాగుననే చేసెను.౹ అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరి–ఇదిగో మా ప్రాణములు పోయినవి; నశించిపోతిమి మేమందరము నశించిపోతిమి.౹ యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును; మేము అందరము చావవలసియున్నదా? అని పలికిరి. యెహోవా అహరోనుతో ఇట్లనెను–నీవును నీ కుమారులును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధస్థలపు సేవ లోని దోషములకు ఉత్తరవాదులు; నీవును నీ కుమారులును మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును, అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొని రావలెను; వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట సేవచేయవలెను వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లువారు పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములయొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు.౹ వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవవిషయములో దాని కాపాడవలెను.౹ అన్యుడు మీయొద్దకు సమీపింపకూడదు; ఇకమీదట మీరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడవలెను; అప్పుడు ఇశ్రాయేలీయులమీదికి కోపము రాదు.౹ ఇదిగో నేను ఇశ్రాయేలీయులమధ్యనుండి లేవీయులైన మీ సహోదరులను తీసికొని యున్నాను; ప్రత్యక్షపు గుడారముయొక్క సేవచేయుటకు వారు యెహోవావలన మీ కప్పగింపబడియున్నారు.౹ కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను–ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతి ష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను; అభిషేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను.౹ అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్ని టిలోను, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరిశుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను.౹ ప్రతి మగవాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును.౹ మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటి నిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును.౹ వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని.౹ వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును; నీ యింటిలోని పవిత్రులందరు వాటిని తినవచ్చును.౹ ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును.౹ మనుష్యులలోనిదేమి జంతువులలోనిదేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను.౹ అపవిత్ర జంతువుల తొలిచూలిపిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెలచొప్పున, పరిశుద్ధమందిరముయొక్క తులపు పరిమాణమునుబట్టి అయిదు తులముల వెండియిచ్చి వాటిని విడిపింపవలెను. తులము ఇరువది చిన్నములు.౹ అయితే ఆవుయొక్క తొలిచూలిని గొఱ్ఱెయొక్క తొలిచూలిని మేకయొక్క తొలిచూలిని విడిపింపకూడదు; అవి ప్రతిష్ఠితమైనవి; వాటి రక్తమును నీవు బలిపీఠముమీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెనుగాని వాటి మాంసము నీదగును.౹ అల్లాడింపబడు బోరయు కుడిజబ్బయు నీదైనట్లు అదియు నీదగును.౹ ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడనుబట్టి యిచ్చితిని. అది నీకును నీతోపాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన.౹ మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను–వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారిమధ్యను నీకు పాలు ఉండదు; ఇశ్రాయేలీయులమధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇదిగో లేవీయులుచేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులయొక్క దశమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని.౹ ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లువారు ఇకమీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు.౹ అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారముయొక్క సేవ చేసి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులైయుందురు. ఇశ్రాయేలీయులమధ్యను వారికి స్వాస్థ్య మేమియు ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.౹ అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయులమధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు లేవీయులతో ఇట్లనుము–నేను ఇశ్రాయేలీయులచేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారియొద్ద పుచ్చుకొనునప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమభాగములో దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను.౹ మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షల తొట్టి ఫలమువలెను ఎంచవలెను.౹ అట్లు మీరు ఇశ్రాయేలీయులయొద్ద పుచ్చుకొను మీ దశమభాగములన్నిటిలోనుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలోనుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను.౹ మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలోనుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును, అనగా దాని ప్రతిష్ఠితభాగమును దానిలోనుండి ప్రతిష్ఠింపవలెను.౹ మరియు నీవు వారితో మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపువచ్చుబడివలెను ద్రాక్షతొట్టి వచ్చుబడివలెను లేవీయులదని యెంచవలెను.౹ మీరును మీ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును; ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరుచేయు సేవకు అది మీకు జీతము.౹ మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత దానినిబట్టి పాపశిక్షను భరింపకుందురు; మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైనవాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి యేదనగా, ఇశ్రాయేలీయులు కళంకములేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన యెఱ్ఱని పెయ్యను నీయొద్దకు తీసికొని రావలెనని వారితో చెప్పుము.౹ మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలుకొనిపోయి అతని యెదుట దానిని వధింపవలెను.౹ యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను;౹ అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను.౹ మరియు ఆయాజకుడు దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపునూలును తీసికొని, ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను.౹ అప్పుడు ఆయాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹ దాని దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹ మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థబలి.౹ ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ.౹ ఏ నరశవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అప విత్రుడైయుండును.౹ అతడు మూడవదినమున ఆ జలముతో పాపశుద్ధి చేసికొని యేడవదినమున పవిత్రుడగును. అయితేవాడు మూడవదినమున పాపశుద్ధి చేసికొనని యెడల ఏడవదినమున పవిత్రుడుకాడు.౹ నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొననియెడలవాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు గనుకవాడు అపవిత్రుడు, వాని అపవిత్రత యింక వానికుండును.౹ ఒకడు ఒక గుడారములో చచ్చినయెడల దానిగూర్చిన విధి యిది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములోనున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును.౹ మూత వేయబడక తెరచియున్న ప్రతిపాత్రయు అపవిత్రమగును.౹ బయట పొలములో ఖడ్గముతో నరకబడినవానినైనను, శవమునైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడైయుండును.౹ అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమభస్మము లోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన ఆ భస్మముమీద ఒకడు పారు నీళ్లు పోయవలెను.౹ తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసికొని ఆ నీళ్లలో ముంచి, ఆ గుడారముమీదను దానిలోని సమస్తమైన ఉపకరణములమీదను అక్కడనున్న మనుష్యులమీదను, ఎముకనేగాని నరకబడిన వానినేగాని శవమునేగాని సమాధినేగాని ముట్టినవాని మీదను దానిని ప్రోక్షింపవలెను.౹ మూడవదినమున ఏడవదినమున పవిత్రుడు అపవిత్రునిమీద దానిని ప్రోక్షింపవలెను. ఏడవ దినమునవాడు పాపశుద్ధి చేసికొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును.౹ అపవిత్రుడు పాపశుద్ధిచేసికొనని యెడల అట్టి మనుష్యుడు సమాజములోనుండి కొట్టివేయబడును;వాడు యెహోవా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచెను; పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు;వాడు అపవిత్రుడు.౹ వారికి నిత్యమైన కట్టడ ఏదనగా, పాపపరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను; పాపపరి హార జలమును ముట్టువాడు సాయంకాలమువరకు అప విత్రుడైయుండును; అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము.౹ దాని ముట్టు మనుష్యులందరు సాయంకాలమువరకు అపవిత్రులైయుందురు. మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.౹ ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందునవారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి.౹ జనులు మోషేతో వాదించుచు–అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినయెడల ఎంతో మేలు అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి? ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులోనుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లే లేవనిరి.౹ అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటనుండి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను.౹ అంతట యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను –నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము.౹ యెహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధినుండి ఆ కఱ్ఱను తీసికొని పోయెను.౹ తరువాత మోషే అహరోనులు ఆ బండ యెదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను.౹ అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.౹ అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను.౹ అవి మెరీబా జలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారిమధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. మోషే కాదేషునుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి–నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగున దేమనగా–మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది;౹ మా పితరులు ఐగుప్తునకు వెళ్లిరి; మేము చాలాదినములు ఐగుప్తులో నివసించితిమి; ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి.౹ మేము యెహోవాకు మొఱ పెట్టగా ఆయన మా మొఱను విని, దూతను పంపి ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము.౹ మమ్మును నీ దేశమును దాటి పోనిమ్ము; పొలములలో బడియైనను ద్రాక్షతోటలలో బడియైనను వెళ్లము; బావుల నీళ్లు త్రాగము; రాజమార్గమున నడిచిపోయెదము. నీ పొలిమేరలను దాటువరకు కుడివైపునకైనను ఎడమవైపున కైనను తిరుగకుండ పోయెదమని చెప్పించెను.౹ ఎదోమీయులు —నీవు నా దేశములోబడి వెళ్లకూడదు; నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చెదను సుమీ అని అతనితో చెప్పగా ఇశ్రాయేలీయులు–మేము రాజమార్గముననే వెళ్లెదము; నేనును నా పశువులును నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందును మరేమి లేదు, కాలినడకనే దాటిపోవుదును; అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు–నీవు రానేకూడదనెను.౹ అంతట ఎదోము బహుజనముతోను మహా బలముతోను బయలుదేరి వారి కెదురుగా వచ్చెను.౹ ఎదోము ఇశ్రాయేలు తన పొలి మేరలలోబడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతనియొద్దనుండి తొలగిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేషులోనుండి సాగి హోరు కొండకు వచ్చెను.౹ యెహోవా ఎదోము పొలిమేరలయొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –అహరోను తన పితరులతో చేర్చబడును; ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు.౹ [25-26] నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండయెక్కి, అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును.౹ *** యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండ నెక్కిరి.౹ మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండశిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగివచ్చిరి.౹ అహరోను చనిపోయెనని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబికులందరును అహరోనుకొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి. ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణదిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందిరిని చెరపట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని — నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినయెడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి.౹ యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గా యాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.౹ కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి— ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి.౹ అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.౹ కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి–మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి; యెహోవా మా మధ్యనుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి.౹ మోషే ప్రజలకొరకు ప్రార్థనచేయగా యెహోవా–నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకు నని మోషేకు సెలవిచ్చెను.౹ కాబట్టి మోషే ఇత్తడి సర్ప మొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.౹ తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి.౹ ఓబోతులోనుండి వారు సాగి సూర్యోదయదిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయ్యె అబారీమునొద్ద దిగిరి.౹ అక్కడనుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి.౹ అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు.౹ [14-15] కాబట్టి —యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నో నులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెననుమాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడియున్నది.౹ *** అక్కడనుండి వారు బెయేరుకు వెళ్లిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ల నిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది.౹ అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి— బావీ ఉబుకుము. దాని కీర్తించుడి బావీ; యేలికలు దాని త్రవ్విరి తమ అధికార దండములచేతను కఱ్ఱలచేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. వారు అరణ్యమునుండి మత్తానుకును మత్తానునుండి నహలీయేలుకును నహలీయేలునుండి బామోతుకును మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతునుండి యెడారికి ఎదురుగానున్న పిస్గాకొండకు వచ్చిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి–మమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము.౹ మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము; బావుల నీళ్లు త్రాగము; మేము నీ పొలిమేరలను దాటువరకు రాజమార్గములోనే నడిచి పోదుమని అతనితో చెప్పించిరి.౹ అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్యలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను.౹ ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతముచేసి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకువరకు, అనగా అమ్మోనీయుల దేశమువరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలి మేర దుర్గమమైనది.౹ అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లె లన్నిటిలోను దిగిరి.౹ హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకుమునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను.౹ కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు— హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబూ, నీకు శ్రమ కెమోషు జనులారా, మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయులరాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటిమీద గురిపెట్టి కొట్టితిమి దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడు చేసితిమి. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితిమి. అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి.౹ మరియు యాజెరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి.౹ వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషానురాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో నిట్లనెను–అతనికి భయపడకుము; నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని; నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు.౹ కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీనపరచుకొనిరి. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి.౹ సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను.౹ జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి; మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి.౹ మోయాబీయులు మిద్యాను పెద్దలతో —ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టు ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయు ననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు.౹ కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నదియొద్దనున్న పెతోరుకు దూతలచేత ఈ వర్తమానము పంపెను–చిత్తగించుము; ఒక జనము ఐగుప్తులోనుండి వచ్చెను; ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు.౹ కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము; వారు నాకంటె బలవంతులు; వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో; అప్పుడు నేను ఈ దేశములోనుండి వారిని తోలివేయుదును; ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును.౹ కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదె సొమ్మును చేతపట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో–యీ రాత్రి ఇక్కడనే ఉండుడి; యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదననెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బసచేసిరి.౹ దేవుడు బిలామునొద్దకు వచ్చి–నీ యొద్దనున్న యీ మనుష్యులు ఎవరని అడుగగా బిలాము దేవునితో యిట్లనెను–సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు –చిత్తగించుము; ఒక జనము ఐగుప్తునుండి బయలుదేరి వచ్చెను; వారు భూతలమును కప్పుచున్నారు; నీవు ఇప్పుడేవచ్చి నా నిమిత్తము వారిని శపింపుము; నేను వారితో యుద్ధముచేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను.౹ అందుకు దేవుడు–నీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను.౹ కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో–మీరు మీ స్వదేశమునకు వెళ్లుడి; మీతోకూడ వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లి–బిలాము మాతోకూడ రానొల్లడాయెననిరి.౹ అయినను బాలాకు వారి కంటె బహు ఘనతవహించిన మరి యెక్కువ మంది అధికారులను మరల పంపెను.౹ వారు బిలామునొద్దకు వచ్చి అతనితో–నీవు దయచేసి నాయొద్దకు వచ్చుటకు ఏమియు అడ్డము చెప్పకుము.౹ నేను నీకు బహు ఘనత కలుగజేసెదను; నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసెదను గనుక నీవు దయచేసి వచ్చి, నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి.౹ అందుకు బిలాము–బాలాకు తన యింటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్దిపనినైనను గొప్పపనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటిమాట మీరలేను.౹ కాబట్టి మీరు దయచేసి యీ రాత్రి ఇక్కడ నుండుడి; యెహోవా నాతోనిక నేమి చెప్పునో నేను తెలిసికొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను.౹ ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకువచ్చి–ఆ మనుష్యులు నిన్ను పిలువవచ్చినయెడల నీవు లేచి వారితో వెళ్లుము; అయితే నేను నీతో చెప్పిన మాటచొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను.౹ ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతోకూడ వెళ్లెను.౹ అతడు వెళ్లుచుండగా దేవుని కోపము రగులుకొనెను; యెహోవాదూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితోకూడ నుండిరి.౹ యెహోవాదూత ఖడ్గము దూసి చేతపట్టుకొని త్రోవలో నిలిచి యుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా యెహోవాదూత యిరుప్రక్కలను గోడలుగల ద్రాక్షతోటల సందులో నిలిచెను.౹ గాడిద యెహోవాదూతను చూచి గోడమీదపడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరల కొట్టెను.౹ యెహోవాదూత ముందు వెళ్లుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని యిరుకు చోటను నిలువగా గాడిద యెహోవాదూతను చూచి బిలాముతోకూడ క్రింద కూలబడెను గనుక బిలాము కోపముమండి తన చేతి కఱ్ఱతో గాడిదను కొట్టెను.౹ అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు నిచ్చెను గనుక అది–నీవు నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా బిలాము–నీవు నామీద తిరుగబడితివి; నాచేత ఖడ్గమున్నయెడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను.౹ అందుకు గాడిద— నేను నీదాననైనది మొదలుకొని నేటివరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైన నీకిట్లు చేయుట కద్దా? అని బిలాముతో అనగా అతడు–లేదనెను.౹ అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవాదూతను అతడు చూచి తలవంచి సాష్టాంగ నమస్కారముచేయగా యెహోవాదూత–యీ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో నా యెదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని.౹ ఆ గాడిద నన్ను చూచి యీ ముమ్మారు నా యెదుటనుండి తొలిగెను; అది నా యెదుటనుండి తొలగని యెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి యుందునని అతనితో చెప్పెను.౹ అందుకు బిలాము–నేను పాపముచేసితిని; నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలి సినది కాదు. కాబట్టి యీ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లెదనని యెహోవాదూతతో చెప్పగా యెహోవాదూత–నీవు ఆ మనుష్యులతోకూడ వెళ్లుము. అయితే నేను నీతో చెప్పు మాటయేకాని మరేమియు పలుకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతోకూడ వెళ్లెను.౹ బిలాము వచ్చెనని బాలాకు విని, ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణమువరకు అతనిని ఎదుర్కొన బయలువెళ్లగా బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీయొద్దకు దూతలను పంపియుంటిని గదా. నాయొద్దకు నీవేల రాకపోతివి? నిన్ను ఘనపరచ సమర్థుడను కానా? అనెను.౹ అందుకు బిలాము–ఇదిగో నీయొద్దకు వచ్చితిని; అయిన నేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను.౹ అప్పుడు బిలాము బాలాకుతోకూడ వెళ్లెను. వారు కిర్యత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొఱ్ఱెలను బలిగా అర్పించి, కొంతభాగము బిలాముకును అతనియొద్దనున్న అధికారులకును పంపెను.౹ మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి, బయలుయొక్క ఉన్నతస్థలములమీదనుండి జనులను చివరవరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను. అప్పుడు బిలాము–ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి, ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను.౹ బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలామును ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి.౹ మరియు బిలాము బాలాకుతో–బలిపీఠము మీది నీ దహనబలియొద్ద నిలిచియుండుము, నేను వెళ్లెదను; ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొను నేమో; ఆయన నాకు కనుపరచునది నీకు తెలియచేసెదనని చెప్పి మెట్ట యెక్కెను.౹ దేవుడు బిలాముకు ప్రత్యక్షముకాగా అతడు–నేను ఏడు బలిపీఠములను సిద్ధపరచి ప్రతి దానిమీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించితినని ఆయనతో చెప్పగా,౹ యెహోవా ఒకమాట బిలాము నోట ఉంచి–నీవు బాలాకునొద్దకు తిరిగివెళ్లి యిట్లు చెప్పుమనెను.౹ అతడు బాలాకునొద్దకు తిరిగివెళ్లినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్ద నిలిచియుండెను.౹ అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను — అరామునుండి బాలాకు తూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్ను రప్పించి –రమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరమునుండి అతని చూచుచున్నాను కొండలనుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్ట గలరు? నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక. నా అంత్యదశ వారి అంతమువంటి దగును గాక అనెను. అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని; అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను.౹ అందుకతడు— యెహోవా నా నోట ఉంచినదాని నేను శ్రద్ధగా పలుక వద్దా? అని ఉత్తరమిచ్చెను.౹ అప్పుడు బాలాకు–దయచేసి నాతోకూడ మరియొక చోటికి రమ్ము. అక్కడనుండి వారిని చూడవచ్చును; వారి చివరమాత్రమే కనబడునుగాని వారందరు నీకు కనబడరు; అక్కడనుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి పిస్గా కొన నున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి, యేడు బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.౹ అతడు–నీవు ఇక్కడ నీ దహనబలియొద్ద నిలిచియుండుము; నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా,౹ యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి–నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి యిట్లు చెప్పుమనెను.౹ అతడు బాలాకు నొద్దకు వెళ్లినప్పుడు అతడు తన దహనబలియొద్ద నిలిచియుండెను. మోయాబు అధికారులును అతనియొద్ద నుండిరి. బాలాకు —యెహోవా యేమి చెప్పెనని అడుగగా బిలాము ఉపమానరీతిగా నిట్లనెను— బాలాకూ, లేచి వినుము సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను; నేను దాని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు. రాజుయొక్క జయధ్వని వారిలో నున్నది దేవుడు ఐగుప్తులోనుండి వారిని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇశ్రాయేలులో శకునము లేదు ఆయాకాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులగు ఇశ్రాయేలీయులకు తెలియ చెప్పబడును. ఇదిగో ఆ జనము ఆడుసింహమువలె లేచును అది సింహమువలె నిక్కి నిలుచును అది వేటనుతిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంతట బాలాకు–నీవు ఏ మాత్రమును వారిని శపింపను వద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలెనని నేను నీతో చెప్పలేదా? అని బాలాకుకు ఉత్తరమియ్యగా బాలాకు నీవు దయచేసి రమ్ము; నేను వేరొకచోటికి నిన్ను తోడుకొని పోయెదను; అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవునిదృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను.౹ బాలాకు ఎడారికి ఎదురుగా నున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొనిపోయిన తరువాత బిలాము–ఇక్కడ నాకు ఏడు బలిపీఠములను కట్టించి, యిక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను.౹ బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడుమునుపటివలె శకునములను చూచుటకు వెళ్లక అరణ్యమువైపు తన ముఖమును త్రిప్పుకొనెను.౹ బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమతమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను— బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబూ, నీ గుడారములు ఇశ్రాయేలూ, నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి. వాగులవలె అవి వ్యాపించియున్నవి నదీతీరమందలి తోటలవలెను యెహోవా నాటిన అగరు చెట్లవలెను నీళ్లయొద్దనున్న దేవదారు వృక్షములవలెను అవి యున్నవి. నీళ్లు అతని బొక్కెనలనుండి కారును అతని సంతతి బహు జలములయొద్ద నివసించును అతనిరాజు అగగుకంటె గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులోనుండి అతని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించునువారి యెముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును. సింహమువలెను ఆడుసింహమువలెను అతడు క్రుంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును. అప్పుడు బాలాకు కోపము బిలాముమీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో–నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్లుము.౹ నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితినిగాని యెహోవా నీవు ఘనత పొందకుండ ఆటంకపరచెననెను.౹ అందుకు బిలాము బాలాకుతో–బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా యిష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను.౹ యెహోవా యేమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నాయొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము; నేను నా జనులయొద్దకు వెళ్లుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను రమ్మని చెప్పి ఉపమానరీతిగా ఇట్లనెను— బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విద్య నెరిగినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నానుగాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నానుగాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును. ఎదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులువారు స్వాధీనపరచబడుదురు ఇశ్రాయేలు పరాక్రమమొందును. యాకోబు సంతానమున యేలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపజేయును. మరియు అతడు అమాలేకీయులవైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను — అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్యనాశనమే. మరియు అతడు కేనీయులవైపు చూచి ఉపమానరీతిగా ఇట్లనెను — నీ నివాసస్థలము దుర్గమమైనది. నీ గూడు కొండమీద కట్టబడియున్నది. అష్షూరు నిన్ను చెరగా పట్టువరకు కయీను నశించునా? మరియు అతడు ఉపమానరీతిగా— అయ్యో దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడు బ్రదుకును? కిత్తీము తీరమునుండి ఓడలు వచ్చును. అవి అష్షూరును ఏబెరును బాధించును. కిత్తీయులు కూడ నిత్యనాశనము పొందుదురనెను. అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్లెను; బాలాకును తన త్రోవను వెళ్లెను. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి.౹ ఆ స్ర్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి.౹ అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.౹ అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ప్రజల అధిపతుల నందరిని తోడుకొని, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీదనుండి తొలగిపోవునని చెప్పెను.౹ కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయో రుతో కలిసికొనిన తన తన వశములోనివారిని చంపవలెనని చెప్పెను.౹ ఇదిగో మోషే కన్నులయెదుటను, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజముయొక్క కన్నులయెదుటను, ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొనివచ్చెను.౹ యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి,౹ సమాజమునుండి లేచి, యీటెను చేతపట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచిపోయెను.౹ ఇరువది నాలుగువేలమంది ఆ తెగులుచేత చనిపోయిరి.౹ అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,౹ వారిమధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయులమీదనుండి నాకోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.౹ కాబట్టి నీవు అతనితో ఇట్లనుము— అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను.౹ అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.౹ చంప బడిన వాని పేరు జిమ్రీ, అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధానియైన సాలూ కుమారుడు.౹ చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధానియైయుండెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను —మిద్యానీయులు తమ తంత్రములవలన మీకు బాధకులై యున్నారు; వారిని బాధపెట్టి హతము చేయుడి;౹ వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను, తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహో దరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను, మిమ్మును మోసపుచ్చిరి. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఈలాగు సెలవిచ్చెను –మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజములోను ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలు వెళ్లువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వ్రాయించుడి.౹ [3-4] కాబట్టి–యిరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయముగలవారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తుదేశమునుండి వచ్చిన ఇశ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో యెరికోయొద్దనున్న యొర్దాను దగ్గర నుండగా జన సంఖ్యను చేయుడని వారితో చెప్పిరి.౹ *** ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు;౹ పల్లువీయులు పల్లువంశస్థులు; హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు; కర్మీయులు కర్మీ వంశస్థులు;౹ వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది.౹ పల్లు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారులు నెమూయేలు దాతాను అబీరాము.౹ కోరహు తన సమూహములో పేరు పొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు.౹ ఆ సమూహపువారు మృతిబొంది నప్పుడు అగ్ని రెండువందల ఏబదిమందిని భక్షించినందునను, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మ్రింగి వేసినందునను, వారు దృష్టాంతములైరి.౹ అయితే కోరహు కుమారులు చావలేదు.౹ షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యామీనీయులు యామీను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు;౹ జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీయులు షావూలు వంశస్థులు.౹ ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు ఇరువదిరెండువేల రెండువందలమంది.౹ గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు; హగ్గీయులు హగ్గీ వంశస్థులు; షూనీయులు షూనీ వంశస్థులు,౹ ఓజనీయులు ఓజని వంశస్థులు; ఏరీయులు ఏరీ వంశస్థులు;౹ ఆరోదీయులు ఆరోదు వంశస్థులు; అరేలీయులు అరేలీ వంశస్థులు.౹ వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు నలుబది వేల ఐదువందలమంది.౹ యూదా కుమారులు ఏరు ఓనాను; ఏరును ఓనానును కనాను దేశములో మృతి బొందిరి.౹ యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీయులు జెరహు వంశస్థులు;౹ పెరెసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదు వందలమంది.౹ ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలా వంశస్థులు; పువ్వీయులు పువ్వా వంశస్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రో నీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.౹ వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల మూడువందలమంది.౹ [25-26] జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు; ఏలోనీయులు ఏలోను వంశస్థులు;యహలేలీయులు యహ లేలు వంశస్థులు;౹ *** వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది.౹ యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము.౹ [29-32] మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు; మాకీరు గిలాదును కనెను; గిలాదీయులు గిలాదు వంశస్థులు; వీరు గిలాదుపుత్రులు. ఈజరీయులు ఈజరు వంశస్థులు; హెలకీయులు హెలకు వంశస్థులు; అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు; షెకెమీయులు షెకెము వంశస్థులు; షెమీదాయీయులు షెమీదా వంశస్థులు; హెపెరీయులు హెపెరు వంశస్థులు.౹ *** *** *** హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా.౹ వీరు మనష్షీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు ఏబదిరెండువేల ఏడు వందలమంది.౹ ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు,౹ వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు.౹ వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ముప్పదిరెండువేల ఐదువందలమంది; వీరు యోసేపు పుత్రుల వంశస్థులు.౹ బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;౹ అహీరామీయులు అహీరాము వంశస్థులు;౹ షూపామీయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశస్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు.౹ వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబదియయిదువేల ఆరువందలమంది.౹ దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు;౹ వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందలమంది.౹ ఆషేరు పుత్రుల వంశములలో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు;౹ బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు;౹ ఆషేరు కుమార్తె పేరు శెరహు.౹ వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబదిమూడువేల నాలుగువందలమంది.౹ నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీయులు గూనీ వంశస్థులు;౹ యేసెరీయులు యేసెరు వంశస్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.౹ వీరు నఫ్తాలీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబదియయిదువేల నాలుగువందలమంది ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పదిమంది. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను.౹ ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను;౹ తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. దాని దాని జనసంఖ్యనుబట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను.౹ చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమతమపితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను.౹ ఎక్కువ మందికేమి తక్కువమందికేమి చీట్లు వేసి యెవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు.౹ లేవీయుల వంశములు ఏవనగా, లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీయుల వంశము కోరహీయుల వంశము.౹ కహాతు అమ్రామును కనెను; అమ్రాము భార్యపేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె; ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రామువలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను.౹ అహరోనువలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి.౹ నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి.౹ వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడినవారందరు ఇరువదిమూడువేలమంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినవారు కారు గనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడలేదు. యెరికో ప్రాంతములయందలి యొర్దానునొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు.౹ మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసి నప్పుడు లెక్కింపబడినవారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు.౹ ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవావారినిగూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెపెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి.౹ వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద మోషే యెదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల యెదుటను సర్వసమాజము యెదుటను నిలిచి చెప్పినదేమనగా–మా తండ్రి అరణ్యములో మరణమాయెను.౹ అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడినవారి సమూహములో ఉండలేదుగాని తన పాపమునుబట్టి మృతిబొందెను.౹ అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంత మాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి.౹ అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవిచేయగా యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. —సెలోపెహాదు కుమా ర్తెలు చెప్పినది యుక్తము.౹ నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను.౹ మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను— ఒకడు కుమారుడు లేక మృతి బొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను.౹ వానికి కుమార్తె లేనియెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను.౹ వానికి అన్నదమ్ములు లేనియెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్న దమ్ములకు ఇయ్యవలెను.౹ వాని తండ్రికి అన్నదమ్ములు లేనియెడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను;వాడు దాని స్వాధీనపరచు కొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము.౹ నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజ నులలో చేర్చబడుదువు.౹ ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయొద్ద వారి కన్నుల యెదుట నన్ను పరిశుద్ధపరచక నామీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్లే.౹ అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను— యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱెలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము.౹ అతడు వారి యెదుట వచ్చుచు, పోవుచునుండి,౹ వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.౹ అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను–నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసికొని అతనిమీద నీ చెయ్యి యుంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల యెదుట అతనికి ఆజ్ఞ యిమ్ము;౹ ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతనిమీద నీ ఘనతలో కొంత ఉంచుము.౹ యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమా జము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను.౹ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసికొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువ బెట్టి అతనిమీద తన చేతులుంచి యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ యిచ్చెను. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము — నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నాయొద్దకు తెచ్చుటకు జాగ్రత్తపడవలెను.౹ మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుము–మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన యేడాదివగు రెండు మగ గొఱ్ఱెపిల్లలను అర్పింపవలెను.౹ వాటిలో ఒక గొఱ్ఱెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవదానిని అర్పింపవలెను.౹ దంచితీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలుప బడిన తూమెడు పిండిలో పదియవవంతు నైవేద్యము చేయవలెను.౹ అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సీనాయికొండమీద నియమింపబడిన నిత్యమైన దహనబలి.౹ ఆ మొదటి గొఱ్ఱెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు; పరిశుద్ధస్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను.౹ ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా ఆ రెండవ గొఱ్ఱెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను. విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱెపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను.౹ నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతిదినమున చేయవలసిన దహనబలి. నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,౹ నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను, నూనెతో కలుపబడి తూమెడు పిండిలో రెండు పదియవ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయవలెను.౹ అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహన బలి.౹ వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొఱ్ఱెపిల్లతో ముప్పావును ఉండవలెను. ఇది సంవత్సరములో మాస మాసమునకు జరుగవలసిన దహనబలి.౹ నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యొక మేక పిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పింపవలెను. మొదటి నెల పదునాలుగవ దినము యెహోవాకు పస్కాపండుగ.౹ ఆ నెల పదునయిదవ దినము పండుగ జరుగును. ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలెను.౹ మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు అయితే యెహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై యుండవలెను వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి.౹ ఒక్కొక్క కోడెతో తూములో మూడు పదియవవంతులను, పొట్టేలుతో రెండు పదియవ వంతులను ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో ఒక్కొక్క పదియవవంతును మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను.౹ ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను.౹ అట్లే ఆ యేడు దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసనగల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక దానిని అర్పించవలెను.౹ ఏడవదినమున పరిశుద్ధసంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనో పాధియైన పనులేమియు చేయకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించుదినమున, అనగా వారముల పండుగదినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి యైన పనులేమియు చేయకూడదు.౹ యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా మీరు రెండు కోడె దూడలను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు మగ గొఱ్ఱెపిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోను నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవ వంతులను, ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై యొక మేకపిల్లను అర్పింపవలెను.౹ నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమునుగాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను. ఏడవ నెల మొదటితేదిన మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను.౹ [2-6] మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు; అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. వాటి వాటి విధిప్రకారముగా అమావాస్యకు అర్పించు దహనబలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన యేడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను యెహోవాకు, ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమపిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదియవవంతులను, పొట్టేలుకు రెండు పదియవవంతులను, ఏడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. *** *** *** *** ఈ యేడవ నెల పదియవదినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఏపనియు చేయకూడదు.౹ ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలియు నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములునుగాక, మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱెపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై యుండవలెను.౹ నూనెతో కలుప బడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడెతో తూములో మూడు పదియవవంతులను ఒక పొట్టేలుతో రెండు పదియవవంతులను ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మరియు ఏడవ నెల పదునయిదవదినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనో పాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను.౹ నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమునుగాక, యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై యుండవలెను.౹ నూనెతో కలుపబడిన గోధుమపిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియవవంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను ఆ పదునాలుగు గొఱ్ఱెపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింవలెను. రెండవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన పండ్రెండు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధిప్రకారముగా,౹ వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మూడవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదు నాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. నాలుగవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున,౹ ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. అయిదవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున,౹ ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. ఆరవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన యెనిమిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఏడవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన యేడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,౹ ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగా నుండును. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులనేమియు చేయకూడదు.౹ అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక మీరు యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,౹ [37-38] ఆ కోడెదూడతోను పొట్టేలుతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరి హారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. *** మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలెను.౹ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను. మోషే ఇశ్రాయేలీయులయొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను –ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనినయెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసినయెడల, అతడు తన మాటతప్పక తన నోటనుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను.౹ [3-6] మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి యింటనుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురా లైనయెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దానిగూర్చి ఊరకొనినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినినదినమున ఆక్షేపణచేసినయెడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తనమీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలువకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.౹ *** *** *** ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లయినను, నిరాలోచనగా ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమెమీదనుండుట ఆమె భర్త విని, దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించినయెడల, ఆమె మ్రొక్కుబళ్లును ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును.౹ ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినయెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనమీద పెట్టుకొనిన ఒట్టులను రద్దుచేసినవాడగును; యెహోవా ఆమెను క్షమించును.౹ విధవరాలుగాని విడనాడబడినదిగాని తనమీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును.౹ ఆమె తన భర్తయింట ఉండి మ్రొక్కుకొనినయెడలనేమి, ప్రమాణముచేసి తనమీద ఒట్టు పెట్టుకొనినయెడలనేమి, తరువాత ఆమె భర్త విని దానిగూర్చి ఆక్షేపణచేయక ఊరకుండినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును; ఆమె తనమీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును.౹ ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినయెడల, ఆమె మ్రొక్కుబళ్లనుగూర్చియు, ఆమె మీది ఒట్టునుగూర్చియు ఆమె పలికినదేదియు నిలువక పోవును; ఆమెభర్త వాటిని రద్దుచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.౹ ప్రతి మ్రొక్కుబడిని, తన్నుతాను దుఃఖపరచుకొందునని ప్రమాణపూర్వకముగా తనమీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచ వచ్చును, రద్దుచేయవచ్చును.౹ అయితే ఆమె భర్త నానాట దానిగూర్చి ఊరకొనుచు వచ్చినయెడల,వాడు ఆమెమీదనున్న ఆమె మ్రొక్కుబడులన్నిటిని ఆమె ఒట్టులన్నిటిని స్థిరపరచినవాడగును. అతడు వినిన దినమున దానిగూర్చి ఊరకుండుటవలన వాటిని స్థిరపరచెను.౹ అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దుచేసినయెడల, తానే ఆమె దోషశిక్షను భరించును.౹ ఇవి భర్తనుగూర్చియు, భార్యనుగూర్చియు, తండ్రినిగూర్చియు, బాల్యమున తండ్రి యింటనున్న కుమార్తెనుగూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు. మరియు యెహోవా–మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతి హింస చేయుడి.౹ తరువాత నీవు నీ స్వజనులయొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవియ్యగా మోషే ప్రజలతో–మీలో కొందరు యుద్ధసన్నద్ధులై మిద్యానీయులమీదికిపోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతి దండన చేయునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోను ప్రతి గోత్రములోనుండి వేయేసిమందిని ఆ యుద్ధమునకు పంపవలెననెను.౹ అట్లు గోత్రమొక్కంటికి వేయిమందిచొప్పున, ఇశ్రాయేలీయుల సేనలలోనుండి పండ్రెండువేల యుద్ధ వీరులు ఏర్పరచబడగా మోషే వారిని, అనగా ప్రతి గోత్రమునుండి వేయేసిమందిని, యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతనిచేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను.౹ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లువారు మిద్యానీయులతో యుద్ధముచేసి మగవారినందరిని చంపిరి.౹ చంపబడిన యితరులుగాక మిద్యానురాజులను, అనగా మిద్యాను అయిదుగురు రాజులైన ఎవీని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి.౹ అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను వారి గొఱ్ఱె మేకలన్నిటిని వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి.౹ మరియు వారి నివాస పట్టణములన్నిటిని వారి కోటలన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి.౹ వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్లసొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసికొనిరి.౹ తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసికొని రాగా మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొనుటకు పాళెములోనుండి వెలుపలికి వెళ్లిరి.౹ అప్పుడు మోషే యుద్ధసేనలోనుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకులమీద కోపపడెను.౹ మోషే వారితో–మీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చి తిరా? ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయులచేత యెహోవామీద తిరుగు బాటు చేయించినవారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా.౹ కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి;౹ పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి.౹ మీరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండవలెను; మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును మీరు చెరపెట్టినవారును మూడవదినమున ఏడవదినమున మిమ్మును మీరే పవిత్ర పరచుకొనవలెను.౹ మీరు బట్టలన్నిటిని చర్మవస్తువులన్నిటిని మేక వెండ్రుకల వస్తువులన్నిటిని కొయ్యవస్తువులన్నిటిని పవిత్రపరచవలెననెను.౹ అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో–యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి యేదనగా మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులనుమాత్రము అగ్నిలో వేసి తీయవలెను; అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాపపరిహార జలముచేతను వాటిని పవిత్ర పరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను.౹ ఏడవదినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చుననెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹ –నీవును యాజకుడైన ఎలియాజరును సమాజముయొక్క పితరుల కుటుంబములలో ప్రధానులును మనుష్యులలోనేమి, పశువులలోనేమి, చెరపట్టబడిన దోపుడుసొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగాచేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరినవారికి సగమును సర్వసమాజమునకు సగమును పంచిపెట్టవలెను.౹ మరియు సేనగా బయలుదేరిన యోధులమీద యెహోవాకు పన్ను కట్టి, ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱె మేకలలోను ఐదువందలకు ఒకటిచొప్పున వారి సగములోనుండి తీసికొని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను.౹ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱెమేకలలోను సమస్తవిధముల జంతువులలోను ఏబదింటికి ఒకటిచొప్పున, ఇశ్రాయేలీయులు సగములోనుండి తీసికొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను.౹ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి.౹ ఆ దోపుడుసొమ్ము, అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది ఆరులక్షల డెబ్బదియయిదు గొఱ్ఱె మేకలును,౹ డెబ్బది రెండువేల పశువులును, అరువది యొకవేయి గాడిదలును,౹ ముప్పది రెండు వేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును,౹ అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱె మేకల లెక్కయెంతనగా మూడులక్షల ముప్పదియేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱె మేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, ఆ పశువులు ముప్పదియారువేలు.౹ [37-39] వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు. ఆ గాడిదలు ముప్పది వేల ఐదువందలు, వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి.౹ *** *** [40-42] మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరున కిచ్చెను. సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయుల కిచ్చిన సగమునుండి లేవీయులకిచ్చెను.౹ *** *** మూడులక్షల ముప్పదియేడువేల ఐదువందల గొఱ్ఱెమేకలును ముప్పది ఆరువేల గోవులును ముప్పదివేల ఐదువందల గాడిదలును పదునారు వేలమంది మనుష్యులును సమాజమునకు కలిగిన సగమైయుండగా, మోషే ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగమునుండి మనుష్యులలోను జంతువులలోను ఏబదింటికి ఒకటిచొప్పున తీసి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయుల కిచ్చెను.౹ అప్పుడు సేనా సహస్రముల నియామకులు, అనగా సహస్రాధిపతులును శతాధిపతులును మోషే యొద్దకు వచ్చి –నీ సేవకులమైన మేము మా చేతిక్రింద నున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి; మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు.౹ కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతిమనుష్యునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసికొనిరి.౹ సహస్రాధిపతులును శతాధిపతులును ప్రతిష్ఠార్పణముగా యెహోవాకు అర్పించిన బంగార మంతయు పదునారువేల ఏడువందల ఏబది తులములు.౹ ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకొనియుండెను.౹ అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతులయొద్ద నుండియు శతాధిపతులయొద్దనుండియు ఆ బంగారును తీసికొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి. రూబేనీయులకును గాదీయులకును అతివిస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో –అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు.౹ కాబట్టి మా యెడల నీకు కటాక్షము కలిగినయెడల, మమ్మును యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే గాదీయులతోను రూబే నీయులతోను— మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్లకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్య పరచుదురు? ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా వారు ఎష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్లకపోయిరి.౹ ఆ దినమున యెహోవా కోపము రగులుకొని –ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తుదేశములోనుండి వచ్చిన మనుష్యులలో పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూనుకుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణమనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను.౹ అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడునడత నడిచిన ఆ తరమువారందరు నశించువరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేసెను.౹ ఇప్పుడు ఇశ్రాయేలీయులయెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి యున్నారు.౹ మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్లినయెడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంక నిలువచేయును. అట్లు మీరు ఈ సర్వజనమును నశింప చేసెదరనెను.౹ అందుకు వారు అతనియొద్దకు వచ్చి— మేము ఇక్కడ మా మందలకొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము.౹ ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చువరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయముచేత ప్రాకారముగల పురములలో నివసింపవలెను.౹ ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా యిండ్లకు తిరిగి రాము.౹ తూర్పుదిక్కున యొర్దాను ఇవతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యొర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి. అప్పుడు మోషే వారితో–మీరు మీ మాటమీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన యెదుటనుండి తన శత్రువులను వెళ్ల గొట్టువరకు యెహోవా సన్నిధిని మీరందరు యుద్ధ సన్నద్ధులై యొర్దాను అవతలికి వెళ్లినయెడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులైయుందురు; అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును.౹ మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపముచేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసి కొనుడి.౹ మీరు మీ పిల్లలకొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోటనుండి వచ్చిన మాటచొప్పున చేయుడనెను.౹ అందుకు గాదీయులును రూబే నీయులును మోషేతో —మా యేలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసెదము.౹ మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును.౹ నీ దాసులమైన మేము, అనగా మా సేనలో ప్రతి యోధుడును మా యేలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యొర్దాను అవతలికి వచ్చెదమనిరి. కాబట్టి మోషే వారినిగూర్చి యాజకుడైన ఎలియాజరుకును, నూను కుమారుడైన యెహోషువకును, ఇశ్రాయేలీయుల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను –గాదీయులును రూబే నీయులును అందరు యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతోకూడ యొర్దాను అవతలికి వెళ్లినయెడల ఆ దేశము మీచేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను.౹ అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్లనియెడల వారు కనాను దేశమందే మీమధ్యను స్వాస్థ్యములను పొందు దురనగా గాదీయులును రూబేనీయులును–యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము.౹ మేము యెహోవా సన్నిధిని యుద్ధసన్నద్ధులమై నది దాటి కనానుదేశములోనికి వెళ్లెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి.౹ అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబే నీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషానురాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చుట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను.౹ [34-35] గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను *** అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి.౹ రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను షిబ్మా అను పురములను కట్టి, తాముకట్టిన ఆ పురములకు వేరు పేరులుపెట్టిరి.౹ మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి.౹ మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను.౹ నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను. మోషే అహరోనులవలన తమతమ సేనలచొప్పున ఐగుప్తుదేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి.౹ మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి.౹ మొదటి నెల పదునయిదవదినమునవారు రామెసేసులోనుండి ప్రయాణమై పస్కాపండుగకు మరునాడు వారిమధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులయెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి.౹ అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను.౹ ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి.౹ సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి.౹ ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి.౹ పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణముచేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి.౹ ఏలీములో పండ్రెండు నీటిబుగ్గలును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి.౹ ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱసముద్రము నొద్ద దిగిరి.౹ ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.౹ సీను అరణ్యములోనుండి బయలుదేరి దోపకాలో దిగిరి దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.౹ ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.౹ రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.౹ సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.౹ కిబ్రోతుహత్తా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.౹ హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.౹ రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి.౹ రిమ్మోను పారె సులోనుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి.౹ లిబ్నాలోనుండి బయలుదేరి రీసాలో దిగిరి.౹ రీసాలోనుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి.౹ కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి.౹ షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.౹ హరాదాలోనుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.౹ మకెలోతులోనుండి బయలుదేరి తాహతులో దిగిరి.౹ తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.౹ తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.౹ మిత్కాలోనుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి.౹ హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.౹ మొసేరోతులోనుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.౹ బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి.౹ హోర్‌హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.౹ యొత్బా తాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి.౹ ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.౹ ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్యములో దిగిరి.౹ కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.౹ యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.౹ అహరోను నూటఇరువదిమూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.౹ అప్పుడు దక్షిణదిక్కున కనానుదేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను.౹ వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.౹ సల్మానాలోనుండి బయలుదేరి పూనొనులో దిగిరి.౹ పూనొనులోనుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.౹ ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేరయొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.౹ ఈయ్యె అబారీములోనుండి బయలుదేరి దీబోనుగాదులో దిగిరి.౹ దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.౹ అల్మోను దిబ్లాతాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబారీము కొండలలో దిగిరి.౹ అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.౹ వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి.౹ యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹ –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–మీరు యొర్దానును దాటి కనానుదేశమును చేరిన తరువాత ఆ దేశనివాసులందరిని మీ యెదుటనుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నతస్థలములనన్నిటిని పాడుచేసి ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని.౹ మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను.౹ అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు.౹ మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు ఇశ్రాయేలీయులతో కనాను దేశమున, అనగా పొలిమేరలచొప్పున మీరు చీట్లువేసి స్వాస్థ్యముగా పంచుకొను కనానుదేశమున మీరు ప్రవేశించుచుండగా, మీ దక్షిణదిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు, అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రముయొక్క తూర్పు తీరమువరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనుమయొద్ద తిరిగి సీనువరకు వ్యాపించును. అది దక్షిణమునుండి కాదేషు బర్నేయవరకు వ్యాపించి, అక్కడనుండి హసరద్దారువరకు పోయి, అక్కడనుండి అస్మోనువరకు సాగును.౹ అస్మోనునుండి ఐగుప్తు నదివరకు సరిహద్దు తిరిగి సముద్రమువరకు వ్యాపించును.౹ పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.౹ మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దనుండి హోరు కొండవరకు ఏర్పరచుకొనవలెను.౹ హోరు కొండయొద్దనుండి హమాతునకు పోవుమార్గమువరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపించును.౹ అక్కడనుండి సరిహద్దు జిప్రోనువరకు వ్యాపించును, దాని చివర హసరేనానునొద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు.౹ తూర్పు సరిహద్దు హసరేనానునుండి షెపామువరకు మీరు ఏర్పరచుకొనవలెను.౹ షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లావరకు నుండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నె రెతు సముద్రమునొడ్డును తగిలియుండును.౹ ఆ సరిహద్దు యొర్దానునదివరకు దిగి ఉప్పు సముద్రముదనుక వ్యాపిం చును. ఆ దేశము చుట్టునున్న సరిహద్దులమధ్యనున్న దేశము మీదై యుండునని వారికాజ్ఞాపించుము.౹ మోషే ఇశ్రాయేలీయులతో–మీరు చీట్లచేత పొంద బోవుచున్న దేశము ఇది. యెహోవా తొమ్మిది గోత్రములకును అర్ధగోత్రమునకును దీని నియ్యవలెనని ఆజ్ఞాపించెను;౹ ఏలయనగా తమతమపితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులును గాదీయులును తమతమ స్వాస్థ్యముల నొందిరి.౹ మనష్షే అర్ధగోత్రపువారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ రెండు గోత్రపువారును అర్ధ గోత్రపువారును సూర్యోదయ దిక్కున, అనగా తూర్పు దిక్కున యెరికోయొద్ద యొర్దాను ఇవతల తమతమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసినవా రెవరనగా, యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు.౹ మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక ప్రధానుని ఏర్పరచుకొనవలెను.౹ వారెవరనగా, యూదావారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు.౹ షిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు, బెన్యామీనీయుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు.౹ దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని,౹ యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్రప్రధాని,౹ ఎఫ్రాయిమీయుల గోత్రములో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని,౹ జెబూలూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని,౹ ఇశ్శాఖారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని,౹ ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని.౹ నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని.౹ కనాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించినవారు వీరే. మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారికాజ్ఞాపించుము; ఆ పురముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలెను.౹ వారు నివసించుటకు ఆ పురములు వారివగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను.౹ మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురముయొక్క గోడ మొదలుకొని చుట్టు వెయ్యి మూరలు మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండువేల మూరలను, దక్షిణ దిక్కున రెండువేల మూరలను, పడమటి దిక్కున రెండువేల మూరలను, ఉత్తర దిక్కున రెండువేల మూరలను కొలవవలెను. ఆ నడుమ పురముండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును.౹ మరియు మీరు లేవీ యులకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక నలువదిరెండు పురములను ఇయ్యవలెను.౹ వాటి వాటి పల్లెలతోకూడ మీరు లేవీయులకు ఇయ్యవలసిన పురములన్నియు నలువదియెని మిది.౹ మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములోనుండియే ఇయ్యవలెను. మీరు ఎక్కువైనదానిలో ఎక్కువగాను, తక్కువైనదానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున, తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్యవలెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను —నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము– మీరు యొర్దాను దాటి కనానుదేశములోనికి వెళ్లిన తరువాత ఆశ్రయ పురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను.౹ పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజమునెదుట నిలుచువరకువాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండ అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును.౹ మీరు ఇయ్య వలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయ పురములుండవలెను.౹ వాటిలో యొర్దాను ఇవతల మూడు పురములను ఇయ్యవలెను, కనాను దేశములో మూడు పురములను ఇయ్యవలెను. అవి మీకు ఆశ్రయ పురములుగా ఉండును.౹ పొరబాటున ఒకని చంపిన యెవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ ఆరు పురములు ఇశ్రాయేలీయులకును పర దేశులకును మీ మధ్య నివసించువారికిని ఆశ్రయమై యుండును.౹ ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను.౹ ఒకడు చచ్చునట్లు మరియొకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినినవాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.౹ మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికఱ్ఱతో కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంత కుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.౹ హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను.౹ వాని కనుగొనినప్పుడు వాని చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపెట్టి పొడిచినను, లేక పొంచియుండి వానిమీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరమువలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంపవలెను.౹ నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను.౹ [22-23] అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను, పొంచియుండక వానిమీద ఏ ఆయుధమునైన వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వానిమీద రాయి పడవేసినను, దెబ్బతినినవాడు చనిపోయినయెడల కొట్టినవాడు వానిమీద పగపట్టలేదు, వానికి హానిచేయ గోరలేదు.౹ *** కాబట్టి సమాజము ఈ విధులనుబట్టి కొట్టిన వానికిని హత్యవిషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పుతీర్చవలెను.౹ అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంత కుని విడిపింపవలెను. అప్పుడు సమాజమువాడు పారిపోయిన ఆశ్రయ పురమునకు వాని మరల పంపవలెను.వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధానయాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.౹ అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురముయొక్క సరిహద్దును దాటి వెళ్లునప్పుడు నరహత్యవిషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురముయొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనినయెడల, ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వానిమీద ప్రాణముతీసిన దోషము ఉండదు.౹ ఏలయనగా ప్రధానయాజకుడు మృతినొందువరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధానయాజకుడు మృతినొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్లవచ్చును.౹ ఇవి మీ సమస్త నివాసస్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ.౹ ఎవడైనను ఒకని చావగొట్టినయెడల సాక్షుల నోటిమాటవలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షిమాటమీదనే యెవనికిని మరణశిక్ష విధింపకూడదు.౹ చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను.౹ మరియు ఆశ్రయపురమునకు పారిపోయినవాడు యాజకుడు మృతినొందకమునుపు స్వదేశమందు నివసించునట్లు వానిచేత విమోచన ధనమును అంగీకరింపకూడదు.౹ మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగునుగాని మరి దేనివలనను కలుగదు.౹ మీరు నివసించు దేశమును అపవిత్ర పరచకూడదు. అందులో నేను మీమధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయులమధ్య నివసించుచున్నాను. యోసేపు పుత్రులవంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడునైన గిలాదుయొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషేయెదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానులయెదుటను మాటలాడి యిట్లనిరి –ఆ దేశమును వంతు చీట్లచొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా యేలినవాని కాజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా యేలినవాడు యెహోవాచేత ఆజ్ఞ నొందెను.౹ అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రములవారి నెవరినైనను పెండ్లిచేసికొనినయెడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యమునుండి తీయబడి, వారు కలిసికొనినవారి గోత్రస్వాస్థ్యముతో కలుపబడి, మాకు వంతు చీట్లచొప్పున కలిగిన స్వాస్థ్యమునుండి విడిపోవును.౹ కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరము వచ్చునప్పుడు వారి స్వాస్థ్యము వారు కలిసికొనినవారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్రస్వాస్థ్యము తగ్గిపోవుననగా మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి యిట్లనెను–యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే.౹ యెహోవా సెలోపెహాదు కుమార్తెలనుగూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా–వారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చునుగాని వారు తమ తండ్రి గోత్రవంశము లోనే పెండ్లి చేసికొనవలెను.౹ ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్రస్వాస్థ్యమును హత్తుకొని యుండవలెను.౹ మరియు ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు, ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యముగల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రవంశములోనే పెండ్లిచేసికొనవలెను.౹ స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచియుండవలెను.౹ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి.౹ సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లిచేసికొనిరి.౹ వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెండ్లి చేసికొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్రవంశములోనే నిలిచెను.౹ యెరికోయొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులును ఆజ్ఞలును ఇవే. యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.౹ హోరేబునుండి శేయీరు మన్నెపుమార్గముగా కాదేషు బర్నేయవరకు పదకొండు దినముల ప్రయాణము.౹ హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును అష్తారోతులో నివసించిన బాషానురాజైన ఓగును ఎద్రెయీలో హతము చేసినతరువాత నలుబదియవ సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదిని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తన కాజ్ఞా పించినదంతయు వారితో చెప్పెను.౹ యొర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే యీ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను — మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను —ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును;౹ మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబాలోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనానుదేశమునకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసువరకును వెళ్లుడి.౹ ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని మీరు వెళ్లి యెహోవా మీపితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణముచేసిన దేశమును స్వాధీన పరచుకొనుడి.౹ అప్పుడు నేను–ఒంటరిగా మిమ్మును భరింపలేను.౹ మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింప జేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములవలె విస్తరించియున్నారు.౹ మీపితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వెయ్యిరెట్లు ఎక్కువచేసి, తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక.౹ నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను? జ్ఞానవివేకములు కలిగి, మీ మీ గోత్రములలో ప్రసిద్ధిచెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి; వారిని మీమీద నియమించెదనని మీతో చెప్పగా మీరు–నీవు చెప్పిన మాటచొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి.౹ కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యి మందికి ఒకడును, నూరుమందికి ఒకడును ఏబదిమందికి ఒకడును, పదిమందికి ఒకడును వారిని, మీమీద నేను నియమించితిని.౹ అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో–మీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతిమనుష్యునికిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను.౹ తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతిగాని ఘనుల సంగతిగాని పక్ష పాతములేకుండ వినవలెను; న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠినవ్యాజ్యెమును నాయొద్దకు తీసికొని రావలెను; నేను దానిని విచారించెదనని వారికాజ్ఞాపించితిని.౹ మరియు మీరు చేయవలసిన సమస్తకార్యములనుగూర్చి అప్పుడు మీకాజ్ఞాపించితిని. మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములోనుండి వచ్చి, అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి.౹ అప్పుడు నేను–మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెమునకు వచ్చియున్నాము.౹ ఇదిగో నీ దేవుడైన యెహోవా యీ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని.౹ అప్పుడు మీరందరు నాయొద్దకు వచ్చి–మనకంటె ముందుగా మనుష్యులను పంపుదము; వారు మనకొరకు ఈ దేశమును వేగు జూచి, తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్లవలసిన త్రోవనుగూర్చియు, మనము చేర వలసిన పురములనుగూర్చియు మనకు వర్తమానము చెప్పుదు రంటిరి.౹ ఆ మాట మంచిదనుకొని నేను గోత్రమొక్కంటికి ఒక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను పిలిపించితిని.౹ వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుజూచి ఆ దేశఫలములను చేతపట్టుకొని మనయొద్దకు తీసికొని వచ్చి–మన దేవుడైన యెహోవా మన కిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి.౹ అయితే మీరు వెళ్లనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సణుగుచు–యెహోవా మనయందు పగపెట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తుదేశములోనుండి మనలను రప్పించియున్నాడు.౹ మనమెక్కడికి వెళ్లగలము? మన సహోదరులు–అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్త రులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశము నంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి.౹ అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి,౹ మీకు ముందర నడుచు చున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని.౹ అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాసముంచలేదు.౹ కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి–నేను మీపితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన యీ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదనని ప్రమాణముచేసెను.౹ మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడి–నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశిం చునుగాని నీవు దానిలో ప్రవేశింపవు.౹ అతడు ఇశ్రాయేలీయులు దాని స్వాధీనపరచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము.౹ ఆ దినమున మంచి చెడ్డలనెరుగని మీ కుమారులు, అనగా–అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు; దానిని వారి కిచ్చెదను; వారు దానిని స్వాధీనపరచుకొందురు.౹ మీరు తిరిగి ఎఱ్ఱసముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను.౹ అందుకు మీరు–మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి; మా దేవుడైన యెహోవా మా కాజ్ఞాపించిన మాటలన్నిటి ననుసరించి మేము పోయి యుద్ధము చేసెదమని నాతో ఉత్తరమిచ్చి, మీరందరు మీ ఆయుధములను కట్టుకొని, ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా యెహోవా నాతో ఇట్లనెను–యుద్ధమునకు పోకుడి; నేను మీ మధ్యనుండను గనుక వెళ్లకుడి; మీరు వెళ్లినను మీ శత్రువులయెదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము.౹ ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్లితిరి.౹ అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి, కందిరీగలవలె మిమ్ము తరిమి హోర్మావరకు శేయీరులో మిమ్ము హతముచేసిరి.౹ తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని యేడ్వగా, యెహోవా మీ మొఱను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు.౹ కాగా మీరు కాదేషులో బహు దినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎఱ్ఱసముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పోయి బహు దినములు శేయీరు మన్నెము చుట్టు తిరిగి తిమి.౹ అంతట యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను —మీరు ఈ మన్నెముచుట్టు తిరిగినకాలము చాలును;౹ ఉత్తరదిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము –శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి.౹ వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను.౹ మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును.౹ నీచేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమియు తక్కువకాదు.౹ అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితిమి. మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను–మోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధముచేయ వద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడినవారు.౹ మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి.౹ పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీన పరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.౹ కాబట్టి–మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటితిమి.౹ మనము కాదేషు బర్నేయలోనుండి బయలుదేరి జెరెదు ఏరు దాటువరకు, అనగా యెహోవావారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరమువారందరు సేనలోనుండకుండ నశించువరకు మనము నడిచిన కాలము ముప్పది యెనిమిది సంవత్సరములు. అంతేకాదు, వారు నశించువరకు సేన మధ్యనుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను. సైనికులైన వారందరు ప్రజలలోనుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను.౹ –నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోవుచున్నావు.౹ [18-19] అమ్మోనీయుల మార్గమున వెళ్లునప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను.౹ *** అదియు రెఫాయీయుల దేశమని యెంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమ్మీయులందురు.౹ వారు అనాకీయులవలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీయుల యెదుటనుండి వారిని వెళ్లగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి చోట నివసించిరి.౹ అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానముకొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి యెదుటనుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటివరకు వారిచోట నివసించుచున్నారు.౹ గాజావరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులోనుండి బయలుదేరి వచ్చిన కఫ్త్తోరీయులు నశింపజేసి వారిచోట నివసించిరి.౹ మీరు లేచి సాగి అర్నోను ఏరుదాటుడి; ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి.౹ నేడు నేను నీవలని భయము నీవలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశములవారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్నుగూర్చిన సమాచారము విని నీయెదుట వణకి మనోవేదన నొందుదురు. అప్పుడు నేను కెదేమోతు అరణ్యములోనుండి హెష్బోనురాజైన సీహోనునొద్దకు దూతలను పంపి –నన్ను నీ దేశముగుండ దాటిపోనిమ్ము, కుడియెడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును.౹ నాయొద్ద రూకలు తీసికొని తినుటకు భోజనపదార్థములు నా కిమ్ము; నాయొద్ద రూకలు తీసికొని త్రాగుటకు నీళ్లిమ్ము.౹ శేయీరులో నివసించు ఏశావు సంతానపువారును ఆరులో నివసించు మోయాబీయులును నాకు చేసినట్లు, మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యొర్దాను దాటువరకు కాలి నడకచేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని.౹ అయితే హెష్బోనురాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్ల నిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను.౹ అప్పుడు యెహోవా–చూడుము; సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టియున్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాని స్వాధీనపరచుకొన మొదలు పెట్టుమని నాతో చెప్పెను.౹ సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా౹ మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతముచేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియులేకుండ నాశనము చేసితిమి.౹ పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి.౹ అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను.౹ అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని యే ప్రాంతమునకైనను ఆ మన్నెములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమున కైనను నీవు సమీపింపలేదు. మనము తిరిగి బాషాను మార్గమున వెళ్లినప్పుడు బాషానురాజైన ఓగును అతని ప్రజలందరును ఎద్రెయీలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి యెదురుగా రాగా యెహోవా నాతో ఇట్లనెను–అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించియున్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలెనని చెప్పెను.౹ అట్లు మన దేవుడైన యెహోవా బాషానురాజైన ఓగును అతని సమస్త జనమును మనచేతికి అప్పగించెను; అతనికి శేషమేమియులేకుండ అతనిని హతము చేసితిమి.౹ ఆ కాలమున అతని పురములన్నిటిని పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురమొకటియులేదు. బాషానులో ఓగురాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న అరువది పురములను పట్టుకొంటిమి.౹ ఆ పురములన్నియు గొప్ప ప్రాకారములు గవునులు గడియలునుగల దుర్గములు. అవియుగాక ప్రాకారములేని పురములనేకములను పట్టు కొంటిమి.౹ మనము హెష్బోనురాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితిమి; ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితిమి;౹ వారి పశువులనన్నిటిని ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసి కొంటిమి.౹ ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండవరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల యిద్దరు రాజులయొద్దనుండి పట్టుకొంటిమి.౹ సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమోరీయులు దానిని శెనీరని అందురు.౹ మైదానమందలి పురములన్నిటిని బాషానునందలి ఓగు రాజ్యపురములైన సల్కా ఎద్రెయీ అనువాటివరకు గిలాదంతటిని బాషా నును పట్టుకొంటిమి.౹ రెఫాయీయులలో బాషానురాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు.౹ అర్నోను లోయలో నున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశమును, దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని.౹ ఓగు రాజు దేశమైన బాషాను యావ త్తును గిలాదులో మిగిలినదానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధ గోత్రమున కిచ్చితిని.౹ మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయా కాతీయులయొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశ మంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి.౹ మాకీరీయులకు గిలాదు నిచ్చితిని.౹ గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్యవరకును, యబ్బోకు నదివరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండ చరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడిన అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. ఆ కాలమందు నేను మిమ్మును చూచి–మీరు స్వాధీన పరచుకొనునట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరు యుద్ధసన్నద్ధులై మీ సహోదరులగు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను.౹ అయితే యెహోవా మీకు విశ్రాంతి నిచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చువరకు,౹ అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారి కిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొనువరకు, మీ భార్యలును మీ పిల్లలును మీ మందలును నేను మీ కిచ్చిన పురములలో నివసింపవలెను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగి రావలెనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియును.౹ ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటిని–మీ దేవుడైన యెహోవా ఈ యిద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులార చూచితివి గదా. నీవు వెళ్లుచున్న రాజ్యముల నన్నిటికిని యెహోవా ఆలాగుననే చేయును.౹ మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధముచేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. మరియు ఆ కాలమున నేను–యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు.౹ ఆకాశమందేగాని భూమి యందేగాని నీవుచేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతి మాలుకొనగా యెహోవా మిమ్మునుబట్టి నామీద కోప పడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను–చాలును; ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు.౹ నీవు ఈ యొర్దానును దాటకూడదుగాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము.౹ యెహోషువకు ఆజ్ఞయిచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నదిదాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీన పరచుకొనచేయును.౹ అప్పుడు మనము బేత్పయోరు యెదుటనున్న లోయలో దిగియుంటిమి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీపితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి.౹ మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు.౹ బయల్పెయోరు విషయములో యెహోవా చేసినదానిని మీరు కన్నులార చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతిమనుష్యుని నీ దేవుడైన యెహోవా నీమధ్యను ఉండకుండ నాశనము చేసెను.౹ మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరును నేటివరకు సజీవులై యున్నారు.౹ నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.౹ ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి–నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేచనలు గల జనమని చెప్పుకొందురు.౹ ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్ర మంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువకయుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండునట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి యుండగా యెహోవా–నా యొద్దకు ప్రజలను కూర్చుము; వారు ఆ దేశముమీద బ్రదుకు దినములన్నియు నాకు భయపడ నేర్చుకొని, తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమునుగూర్చి వారికి తెలుపుము.౹ అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశమువరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్యనుండి మీతో మాటలాడెను. మాటలధ్వని మీరు వింటిరిగాని యే స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి.౹ మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను, అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసెను.౹ అప్పుడు మీరు నదిదాటి స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నా కాజ్ఞా పించెను.౹ హోరేబులో యెహోవా అగ్నిజ్వాలలమధ్యనుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు.౹ కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న యే జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను నేలమీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలి యే చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమనుగాని మగ ప్రతిమనుగాని, యే స్వరూపముగలిగిన విగ్రహమును మీకొరకు చేసికొనకుండునట్లును, ఆకాశమువైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశసైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచిపెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి.౹ యెహోవా మిమ్మును చేపెట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయజనముగా నుండుటకై, ఐగుప్తుదేశములోనుండి ఆ యినుపకొలిమిలోనుండి మిమ్మును రప్పించెను.౹ మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడి నేను ఈ యొర్దాను దాట కూడదనియు, నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చు చున్న యీ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను.౹ కావున నేను ఈ యొర్దాను దాటకుండ ఈ దేశముననే చనిపోదును; మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకొనెదరు.౹ మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసికొనకుండునట్లు మీరు జాగ్రత్తపడవలెను.౹ ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడునై యున్నాడు. మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహు కాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడుచేసికొని, యే స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల యెదుట కీడు చేసినయెడల మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు.౹ మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును; యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు.౹ అక్కడ మీరు మనుష్యుల చేతిపనియైన కఱ్ఱ రాతిదేవతలను పూజిం చెదరు; అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.౹ అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును.౹ ఈ సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవావైపు తిరిగి ఆయన మాట వినినయెడల నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనముచేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.౹ దేవుడు భూమిమీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటె ముందుగానుండినమునుపటి దినములలో ఆకాశముయొక్క యీ దిక్కునుండి ఆకాశముయొక్క ఆ దిక్కువరకు ఇట్టి గొప్ప కార్యము జరిగెనా? దీనివంటి వార్త వినబడెనా? అని నీవు అడుగుము నీవు దేవుని స్వరము అగ్ని మధ్యనుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రదికెనా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నులయెదుట చేసినవాటన్నిటిచొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోను మహత్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహా భయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములోనుండి తనకొరకు ఒక జనమును తీసికొన యత్నము చేసెనా? అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి యొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు అది నీకు చూపబడెను.౹ నీకు బోధించుటకు ఆయన ఆకాశమునుండి తన స్వరమును నీకు వినిపించెను; భూమిమీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్యనుండి ఆయన మాటలను నీవు వింటిని.౹ ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను.౹ నీకంటె బలమైన గొప్ప జనములను నీ ముందరనుండి వెళ్ల గొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడు గానుండి ఐగుప్తులోనుండి తన మహాబలముచేత నిన్ను వెలుపలికి రప్పించెను.౹ కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాని చంపినయెడల చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పుదిక్కున, యొర్దాను ఇవతల మూడు పురములను వేరుపరచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేని లోనికినైనను పారిపోయి బ్రదుకును.౹ అవేవనగా రూబే నీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీ యులకు గిలాదులో నున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే. మోషే ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రము ఇది.౹ ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వెలుపలికి వచ్చుచుండగా యొర్దాను ఇవతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుదేశమందు మోషే ఇశ్రాయేలీయులకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి.౹ మోషేయు ఇశ్రాయేలీయులును ఐగుప్తులోనుండి వచ్చుచు ఆ సీహోనును హతము చేసి అతని దేశమును, యొర్దాను ఇవతల ఉదయదిక్కున నున్న బాషానురాజైన ఓగుయొక్క దేశమును, అర్నోను ఏటి దరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సీయోను కొండవరకున్న అమోరీయుల యిద్దరు రాజులదేశమును,౹ పిస్గా యూటలకు దిగువగా అరాబా సముద్రమువరకు తూర్పుదిక్కున యొర్దాను అవతల అరాబా ప్రదేశమంతయు స్వాధీన పరచుకొనిరి. మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి యిట్ల నెను–ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిననుసరించి నడువుడి.౹ మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను.౹ యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.౹ యెహోవా ఆ కొండమీద అగ్ని మధ్యనుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ యెక్కలేదు.౹ గనుక యెహోవామాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకునుమధ్యను నిలిచి యుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను. –దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి యందేగాని భూమి క్రిందనున్న నీళ్లయందేగాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు.౹ వాటికి నమస్కరింపకూడదు; వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవాయగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు౹ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనువారి విషయములో వేయితరములవరకు కరుణించువాడనై యున్నాను.౹ నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుము.౹ ఆరుదినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను.౹ ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిద యైనను నీ పశువులలో ఏదైనను నీ యిండ్లలోనున్న పర దేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను.౹ నీవు ఐగుప్తుదేశమందు దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడనుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందు చేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువానిమీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు; నీ పొరుగువాని యింటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినినైనను వాని యెద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. ఈ మాటలను యెహోవా ఆ పర్వతముమీద అగ్ని మేఘ గాఢాంధకారములమధ్యనుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి, రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియు చెప్పలేదు. మరియు ఆ పర్వతము అగ్నివలన మండుచున్నప్పుడు ఆ చీకటిమధ్యనుండి ఆ స్వరమును విని మీరు, అనగా మీ గోత్రముల ప్రధానులును మీ పెద్దలును నాయొద్దకు వచ్చి –మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను. అగ్నిమధ్యనుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రదుకుదురని నేడు తెలిసికొంటిమి.౹ కాబట్టి మేము చావనేల? ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును; మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినినయెడల చని పోదుము.౹ మావలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్యనుండి పలుకుట విని బ్రదికెను? నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పినయెడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి.౹ మీరు నాతో మాటలాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను–ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని యున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే.౹ వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లువారు నాయందు భయభక్తులుకలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు.౹ –మీ గుడా రములలోనికి తిరిగి వెళ్లుడని నీవు వారితో చెప్పుము.౹ అయితే నీవు ఇక్కడ నాయొద్ద నిలిచియుండుము. నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని, అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను.౹ వారు స్వాధీనపరచు కొనునట్లు నేను వారికిచ్చుచున్న దేశమందువారు ఆలాగు ప్రవర్తింపవలెను.౹ కాబట్టి మీరు కుడికేగాని యెడమకేగాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్తపడవలెను. మీరు స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలుకలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నియు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్ట డలు విధులు ఇవే.౹ కాబట్టి ఇశ్రాయేలూ, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలుకలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.౹ నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.౹ నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.౹ నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను.౹ అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను.౹ నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమునుబట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యములచేత నింప బడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీ కిచ్చిన తరువాత నీవుతిని తృప్తిపొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్తపడుము.౹ నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను.౹ మీరు ఇతర దేవతలను, అనగా మీ చుట్టునున్న జనముల దేవతలను సేవింపకూడదు.౹ నీమధ్యను నీ దేవుడైన యెహోవా రోషముగల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీమీద రగులుకొని దేశములో నుండకుండ నిన్ను నశింపజేయును. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు.౹ మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను.౹ నీకు మేలు కలుగునట్లును, నీ యెదుటనుండి నీ సమస్త శత్రువులను వెళ్లగొట్టెదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణముచేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాని స్వాధీన పరచుకొనునట్లును, నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ఇకమీదట నీ కుమారుడు–మన దేవుడైన యెహోవా మీకాజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనుము–మనము ఐగుప్తులో ఫరోకు దాసులమైయుండగా యెహోవా బాహుబలముచేత ఐగుప్తులోనుండి మనలను రప్పించెను.౹ మరియు యెహోవా ఐగుప్తుమీదను ఫరో మీదను అతని యింటివారందరి మీదను బాధకరములైన గొప్ప సూచకక్రియలను అద్భుతములను మన కన్నుల యెదుట కనుపరచి,౹ తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశ పెట్టుటకు అక్కడనుండి మనలను రప్పించెను.౹ మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలె మనలను బ్రదికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడలనన్నిటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను.౹ మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనునప్పుడు మనకు నీతి కలుగును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవావారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింపకూడదు,౹ నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.౹ నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.౹ కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను.౹ నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను.౹ మీరు సర్వజనముల కంటె విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కువేగదా.౹ అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములోనుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను.౹ కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడుననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను.౹ ఆయన తన్ను ద్వేషించువాని విషయము ఆలస్యముచేయక బహిరంగముగా వానికి దండన విధించును కాబట్టి నేడు నేను నీకాజ్ఞాపించు ధర్మము, అనగా విధులను కట్టడలను మీరనుసరించి నడుచు కొనవలెను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణముచేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును.౹ ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును.౹ సమస్త జనములకంటె ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికేగాని ఆడుదానికేగాని గొడ్డుతనముండదు, నీ పశువులలోనైన నుండదు.౹ యెహోవా నీయొద్దనుండి సర్వరోగములను తొలగించి, నీవెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరచి, నిన్ను ద్వేషించు వారందరిమీదికే వాటిని పంపించును.౹ మరియు నీ దేవుడైన యెహోవా నీ కప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనముచేయుదువు. నీవు వారిని కటా క్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలయనగా అది నీకు ఉరియగును.౹ ఈ జనములు నాకంటె విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్లగొట్టగల నని నీవనుకొందువేమో, వారికి భయపడకుము.౹ నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తుదేశమంతటికిని చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించి నప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును, చాచిన చేతిని బాగుగ జ్ఞాపకము చేసికొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికి నీ దేవుడైన యెహోవా ఆలాగే చేయును.౹ మరియు మిగిలినవారును నీ కంటబడక దాగినవారును నశించువరకు నీ దేవుడైన యెహోవావారి మీదికి పెద్ద కందిరీగలను పంపును.౹ వారిని చూచి జడియవద్దు; నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు.౹ నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమ కరముకాదు.౹ అయితే నీ దేవుడైన యెహోవావారిని నీకప్పగించి వారిని నశింపజేయువరకు వారిని బహుగా తల్లడిల్లచేయును.౹ ఆయన వారి రాజులను నీ చేతికప్ప గించును. నీవు ఆకాశముక్రిందనుండి వారి నామమును నశింపజేయవలెను; నీవు వారిని నశింపజేయువరకు ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేకపోవును.౹ వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను; వాటి మీదనున్న వెండిబంగారములను అపేక్షింపకూడదు. నీవు దానివలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసికొనకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము.౹ దానివలె నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీయింటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దానియందు బొత్తిగా అసహ్యపడవలెను. మీరు బ్రదికి అభివృద్ధినొంది యెహోవా మీపితరులతో ప్రమాణముచేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకొనునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.౹ మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము.౹ ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ జేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.౹ ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు.౹ ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను.౹ నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలోనుండియు కొండలలోనుండియు పారు ఊటలును అగాధజలములునుగల దేశము.౹ అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లునుగల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము.౹ కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము; అందులో నీకు ఏ లోపముండదు. అది యినుపరాళ్లు గల దేశము; దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును.౹ నీవుతిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను.౹ నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా,౹ నీ పశువులు నీ గొఱ్ఱె మేకలును వృద్ధియై నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి, దాసులగృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర చెదవేమో.౹ తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను,౹ తుదకు నీకు మేలుచేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను.౹ అయితే మీరు–మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో.౹ కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే.౹ నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి యితరదేవతల ననుసరించి పూజించి నమస్కరించినయెడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మునుగూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను.౹ నీ యెదుటనుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయినయెడల మీరును వారివలెనే నశించెదరు. ఇశ్రాయేలూ వినుము; నీకంటె గొప్ప బలముగల జనములను ఆకాశమంటు ప్రాకారములుగల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోవుచున్నావు.౹ ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల యెదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి గదా.౹ కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటి పోవుచున్నాడని నేడు నీవు తెలిసికొనుము. ఆయన వారిని నశింపజేసి నీ యెదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్లగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు.౹ నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి వారిని తోలివేసినతరువాత–నేను ఈ దేశమును స్వాధీన పరచుకొనునట్లుగా యెహోవా నా నీతినిబట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు.౹ నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతియైనను నీ హృదయ యథార్థతయైనను హేతువుకాదు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణముచేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవావారిని నీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్నాడు.౹ మీరు లోబడ నొల్లనివారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచు కొనునట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతినిబట్టి నీకియ్యడని నీవు తెలిసికొనవలెను.౹ అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము, దాని మరువవద్దు. నీవు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరిన దినము మొదలుకొని యీ స్థలమందు మీరు ప్రవేశించువరకు మీరు యెహోవామీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి.౹ హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపజేయునంత కోపము మీమీద తెచ్చుకొనెను.౹ ఆ రాతిపలకలు, అనగా యెహోవా మీతో చేసిన నిబంధనసంబంధమైన పలకలను తీసికొనుటకు నేను కొండెక్కినప్పుడు, అన్నపానములు మాని ఆ కొండమీద నలువది పగళ్లు నలువది రాత్రులుంటిని.౹ అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను యెహోవా నాకప్పగించెను. మీరు కూడివచ్చిన దినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నియు వాటిమీద ఉండెను.౹ ఆ నలువది పగళ్లు నలువది రాత్రులు గడచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతిపలకలను నాకప్పగించి –నీవు లేచి యిక్కడ నుండి త్వరగా దిగుము; నీవు ఐగుప్తులోనుండి రప్పించిన నీ జనము చెడిపోయి, నేను వారికాజ్ఞాపించిన త్రోవలోనుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసికొనిరని నాతో చెప్పెను.౹ మరియు యెహోవా–నేను ఈ ప్రజలను చూచితిని; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.౹ నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండ తుడుపుపెట్టి, నిన్ను వారికంటె బలముగల బహుజనముగా చేసెదనని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని. కొండ అగ్నిచేత కాలుచుండెను, ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను.౹ నేను చూచి నప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసియుంటిరి. పోతదూడను చేయించుకొని యెహోవా మీకాజ్ఞాపించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి యుంటిరి.౹ అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకొని, నా రెండు చేతులలోనుండి మీకన్నుల యెదుట వాటిని క్రిందపడవేసి పగులగొట్టి మీరు యెహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి,మునుపటివలె అన్నపానములు మాని నలువది పగళ్లు నలువది రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని.౹ ఏలయనగా మిమ్ము నశింపజేయవలెనని కోపపడిన యెహోవా కోపో ద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను.౹ మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతనిమీద బహుగా కోప పడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలు కొంటిని అప్పుడు మీరు చేసిన పాపమును, అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి, నలుగగొట్టి, అది ధూళియగునంత మెత్తగా నూరి, ఆ కొండనుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని.౹ మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతుహత్తావాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి.౹ యెహోవా— మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేషు బర్నేయలోనుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటిమాటకు తిరుగబడితిరి, ఆయన మాటను వినలేదు.౹ నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవామీద తిరుగుబాటు చేయుచున్నారు.౹ కాగా నేనుమునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని నలువది పగళ్లు నలువది రాత్రులు సాగిలపడితిని. యెహోవా —మిమ్మును నశింపజేసెదననగా నేను యెహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పితిని–ప్రభువా యెహోవా, నీవు నీ మహిమవలన విమోచించి బాహుబలమువలన ఐగుప్తులోనుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము.౹ నీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకముచేసికొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము;౹ ఏలయనగా నీవు ఏ దేశములోనుండి మమ్మును రప్పించితివో ఆ దేశస్థులు–యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవుటవలనను, వారిని ద్వేషించుటవలనను, అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించెనని చెప్పుకొందురేమో.౹ నీవు నీ అధికబలముచేతను నీవు చాపిన నీ బాహువుచేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలును వీరే. ఆ కాలమందు యెహోవా–మునుపటి వాటి వంటి రెండు రాతిపలకలను నీవు చెక్కుకొని కొండ యెక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కఱ్ఱమందసమును చేసికొనవలెను.౹ నీవు పగులగొట్టిన మొదటి పలకలమీదనున్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను.౹ కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించిమునుపటివాటివంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేతపట్టుకొని కొండ యెక్కితిని.౹ ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలనుమునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.౹ ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకు డాయెను.౹ అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోద నుండి నీటివాగులుగల దేశమైన యొత్బాతాకును ప్రయాణము చేసిరి.౹ నేటివరకు జరుగునట్లు యెహోవా నిబంధనమందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలు చుటకును, ఆయనను సేవించి ఆయన నామమునుబట్టి దీవించుటకును, లేవి గోత్రపువారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను.౹ కాబట్టి తమ సహోదరులతోపాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవావారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము.౹ నేనుమునుపటివలె నలువది పగళ్లును నలువది రాత్రులును కొండమీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప జేయుట మానివేసెను.౹ మరియు యెహోవా నాతో ఇట్లనెను–ఈ ప్రజలు నేను వారికిచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీన పరచుకొనునట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను. కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి,౹ నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే.౹ అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను.౹ కాబట్టి మీరు సున్నతిలేని మీ హృదయమునకు సున్నతి చేసికొని యికమీదట ముష్క రులుకాకుండుడి ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.౹ ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.౹ మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి.౹ నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను.౹ ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే.౹ నీ పితరులు డెబ్బదిమందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించినవాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడు గైకొనవలెను.౹ నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను ఆయన మిహమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయనచేసిన సూచక క్రియలను కార్యములను ఆయన ఐగుప్తుదండు నకును దాని గుఱ్ఱములకును రథములకును చేసిన దానిని, వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎఱ్ఱసముద్రజలమును వారిమీద ప్రవహింపజేసిన దానిని యెహోవా నేటివరకు వారిని నశింపజేసినరీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చువరకు ఎడారిలో మీకొరకు చేసిన దానిని రూబేనీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారియొద్దనున్న సమస్త జీవరాసులను ఇశ్రాయేలీయులందరిమధ్యను మ్రింగివేసిన రీతిని, చూడకయు ఎరుగకయునున్న మీ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలిసికొనుడి.౹ యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా.౹ మీరు బలముగలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్లుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీన పరచుకొనునట్లును యెహోవావారికిని వారి సంతానమునకును దయచేసెదనని మీపితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకాజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటిని మీరు గైకొనవలెను.౹ మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తుదేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి.౹ మీరు నది దాటి స్వాధీన పరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము.౹ అది ఆకాశవర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును. కాబట్టి మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినయెడల మీ దేశమునకు వర్షము, అనగా తొలకరివానను కడవరివానను దాని దాని కాలమున కురి పించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు.౹ మరియు నీవుతిని తృప్తిపొందునట్లు నీ పశువులకొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను.౹ మీ హృదయము మాయలలో చిక్కి త్రోవవిడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ మీరు జాగ్రత్త పడుడి.౹ లేనియెడల యెహోవా మీమీద కోపపడి ఆకాశమును మూసివేయును; అప్పుడు వాన కురియదు, భూమిపండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండ మీరు శీఘ్రముగా నశించెదరు.౹ కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను.౹ నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ యింటి ద్వారబంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.౹ ఆలాగు చేసినయెడల యెహోవా మీపితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములును మీ సంతతివారి దినములును భూమికి పైగా ఆకాశము నిలుచునంతకాలము విస్తరించును.౹ మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గములన్నిటిలోను నడుచుచు, ఆయనను హత్తుకొని, మీరు చేయవలెనని నేను మీకాజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచు కొనవలెను.౹ అప్పుడు యెహోవా మీ యెదుటనుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును; మీరు మీకంటె బలిష్ఠు లైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు.౹ మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.౹ ఏ మనుష్యుడును మీ యెదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీ భయము పుట్టించును.౹ చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను.౹ నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుసరించినయెడల శాపమును మీకు కలుగును. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండమీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను.౹ అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూరవృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా.౹ మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చు చున్న దేశమును స్వాధీనపరచుకొనుటకు ఈ యొర్దానును దాటబోవుచున్నారు. మీరు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించెదరు.౹ అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటిని విధులన్నిటిని మీరు అనుసరించి గైకొనవలెను. మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీ కిచ్చిన దేశమున మీరు భూమిమీద బ్రదుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలును విధులును ఇవి.౹ మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతములమీదనేమి మెట్టలమీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్క డెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను.౹ వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చటలేకుండ నశింపజేయవలెను.౹ వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవానుగూర్చి చేయకూడదు.౹ మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్ప రచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను.౹ అక్కడికే మీరు మీ దహనబలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్ఠితములుగా మీరుచేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱె మేకలలోను తొలిచూలువాటిని తీసికొని రావలెను.౹ మీరును మీ దేవుడైన యెహోవా మిమ్ము నాశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములును మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి మీ చేతిపనులన్నిటియందు సంతోషింపవలెను.౹ నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతిమనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు.౹ నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు.౹ మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టునుండు శత్రువులందరులేకుండ మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందునప్పుడు నేను మీకాజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహనబలులను మీ బలులను మీ దశమభాగములను ప్రతిష్ఠితములుగా మీరుచేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసికొని రావలెను.౹ మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ యిండ్లలోఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.౹ నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహనబలులను అర్పింపకూడదు సుమీ.౹ యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహనబలులను అర్పించి నేను మీకాజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను.౹ అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలదియిండ్ల న్నిటిలో నీ మనస్సు కోరుదానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి యెఱ్ఱజింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును.౹ మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేలమీద పారబోయవలెను.౹ నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి నీ గొఱ్ఱె మేకల మందలోనిదేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛా ర్పణమును ప్రతిష్ఠార్పణమును నీ యింట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ యింట నుండు లేవీయులు, కలిసికొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవుచేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు.౹ నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడువకూడదు సుమీ. నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాటచొప్పున నీ సరిహద్దులను విశాలపరచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినెదననుకొందువు. అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును.౹ నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచు కొను స్థలము మీకు దూరముగా ఉండినయెడల యెహోవా నీకిచ్చిన గోవులలోనిదేగాని మీ గొఱ్ఱె మేకలలోనిదేగాని నేను నీ కాజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించినదాని నీ యింట తినవచ్చును. జింకను దుప్పిని తినునట్లు దాని తినవచ్చును. పవిత్రాపవిత్రులు భేదములేకుండ తినవచ్చును.౹ అయితే రక్తమును తిననే తినకూడదు. భద్రము సుమీ. ఏలయనగా రక్తము ప్రాణము; మాంసముతో ప్రాణాధారమైనదాని తినకూడదు;౹ నీవు దాని తినక భూమిమీద నీళ్లవలె పారబోయవలెను.౹ నీవు యెహోవా దృష్టికి యుక్తమైనదానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతివారికి మేలుకలుగునట్లు దాని తినకూడదు.౹ నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసికొని పోవలెను.౹ నీ దహనబలులను వాటి రక్తమాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠముమీద అర్పింపవలెను. నీ బలుల రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠముమీద పోయవలెను; వాటి మాంసము నీవు తినవలెను.౹ నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతివారికిని నిత్యము మేలుకలుగునట్లు నేను నీకాజ్ఞాపించుచున్న యీ మాటలన్నిటిని నీవు జాగ్ర త్తగా వినవలెను. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్లు చున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి నాశముచేసిన తరువాత, నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని, వారి దేశములో నివసించునప్పుడు, వారు నీ యెదుటనుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్లి చిక్కుబడి,౹ వారి దేవతలను ఆశ్ర యింపగోరి–ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసెదనని అనుకొనకుండ జాగ్రత్తగా ఉండవలెను.౹ తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవానుగూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు గదా.౹ నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు. ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినయెడల అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు.౹ మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను.౹ నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువాని కేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమారుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించినయెడల వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను.౹ చంపుటకు నీ జనులందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను.౹ రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తుదేశములోనుండియు దాస్యగృహములోనుండియు నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాయొద్దనుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు.౹ అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చు చున్న నీ పురములలో ఏదోయొకదానియందు పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని యితర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినినయెడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను.౹ అది నిజమైనయెడల, అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగినయెడల ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి, దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను.౹ దాని కొల్లసొమ్మంతటిని విశాలవీధిలో చేర్చి, నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును దాని కొల్లసొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చి వేయవలెను. అది తిరిగి కట్ట బడక యెల్లప్పుడును పాడుదిబ్బయై యుండును.౹ నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచు నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిచేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్నినుండి మళ్లుకొని నీయందు కని కరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణముచేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు, నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీయొద్ద ఉంచుకొనకూడదు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనినిబట్టి మిమ్మును మీరు కోసికొనకూడదు, మీ కనుబొమ్మలమధ్య బోడిచేసికొనకూడదు.౹ ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. నీవు హేయమైనదేదియు తినకూడదు. మీరు తిన దగిన జంతువులు ఏవేవనగా [4-5] ఎద్దు, గొఱ్ఱెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱె అనునవే.౹ *** జంతువులలో రెండు డెక్కలు గలదై నెమరువేయు జంతువును తినవచ్చును.౹ నెమరువేయువాటిలోనిదే కాని రెండు డెక్కలుగల వాటిలోనిదేకాని నెమరువేసి ఒంటిడెక్కగల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనువాటిని తినకూడదు. అవి మీకు హేయములు.౹ మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరువేయదు గనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు. నీట నివసించువాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చు ననగా, రెక్కలు పొలుసులుగలవాటినన్నిటిని తినవచ్చును.౹ రెక్కలు పొలుసులు లేనిదానిని మీరు తినకూడదు అది మీకు హేయము.౹ [11-20] పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినరానివి ఏవనగా–పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచుపక్షి, పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పగిడికంటె, గుడ్లగూబ, హంస, గూడ బాతు, తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతివిధమైన సంకుబుడికొంగ, కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి. ఎగురు ప్రతి పురుగు మీకు హేయము; వాటిని తినకూడదు, పవిత్రమైన ప్రతి పక్షిని తిన వచ్చును. *** *** *** *** *** *** *** *** *** చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింట నున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును.వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను.౹ నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనునట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలోగాని నీ ద్రాక్షారసములోగాని నీ నూనెలోగాని పదియవ పంతును, నీ పశువులలోగాని గొఱ్ఱె మేకలలోగాని తొలిచూలు వాటిని తినవలెను.౹ మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా నున్నందున, నీవు వాటిని మోయ లేనియెడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు, వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేతపట్టుకొని,౹ నీ దేవుడైన యెహోవా యేర్పరచుకొను స్థలమునకు వెళ్లి నీవు కోరు దేనికైనను ఎద్దులకేమి గొఱ్ఱెలకేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి నిచ్చి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి, నీవును నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను.౹ లేవీ యులను విడువకూడదు; నీమధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైననులేదు. నీ దేవుడైన యెహోవా నీవుచేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు మూడేసి సంవత్సరముల కొకసారి, ఆయేట నీకు కలిగిన పంటలో పదియవ వంతంతయు బయటికి తెచ్చి నీ యింట ఉంచవలెను.౹ అప్పుడు నీమధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులును, నీ యింటనున్న పరదేశులును, తండ్రిలేనివారును, విధవరాండ్రును వచ్చి భోజనముచేసి తృప్తిపొందుదురు. ఏడవ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను ఆ గడువురీతి యేదనగా తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు.౹ అన్యుని నిర్బంధింప వచ్చునుగాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను.౹ నీవు స్వాధీన పరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును.౹ కావున నేడు నేను నీ కాజ్ఞాపించుచున్న యీ ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచు కొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినినయెడల మీలో బీదలు ఉండనే ఉండరు.౹ ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవుగాని అప్పుచేయవు; అనేక జనములను ఏలుదువుగాని వారు నిన్ను ఏలరు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచు కొనకూడదు.౹ నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను.౹ విడుదల సంవత్సరమైన యేడవసంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీదవాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయినయెడల వాడొకవేళ నిన్నుగూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాపమగును.౹ నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవుచేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును.౹ బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను–నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను. నీ సహోదరులలో హెబ్రీయుడేగాని హెబ్రీయురాలేగాని నీకు అమ్మబడి ఆరుసంవత్సరములు నీకు దాస్యము చేసినయెడల ఏడవ సంవత్సరమున వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయవలెను.౹ అయితే వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయునప్పుడు నీవు వట్టిచేతులతో వాని పంపివేయకూడదు.౹ నీవు ఐగుప్తుదేశములో దాసుడవై యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసికొని, నీ మందలోను నీ కళ్లములోను నీ ద్రాక్షగానుగలోను కొంత అవశ్యముగా వాని కియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ కనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను.౹ ఆ హేతువుచేతను నేను ఈ సంగతి నేడు నీ కాజ్ఞాపించియున్నాను.౹ అయితే నీయొద్ద వానికి మేలు కలిగినందున–నిన్నును నీ యింటివారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్దనుండి వెళ్లిపోనని అతడు నీతో చెప్పినయెడల నీవు కదురును పట్టుకొని, తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడైయుండును. ఆలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను.౹ వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలయనగావాడు ఆరుసంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీతముల లాభము నీకు కలిగెను. ఆలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయువాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును. నీ గోవులలోనేమి నీ గొఱ్ఱె మేకలలోనేమి తొలి చూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు. నీ గొఱ్ఱె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు.౹ యెహోవా యేర్పరచుకొను స్థలమున నీవును నీ యింటివారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలెను.౹ దానిలో లోపము, అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండినయెడల నీ దేవుడైన యెహోవాకు దాని అర్పింపకూడదు.౹ జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాని తినవచ్చును. వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్లవలె భూమిమీద దాని పార బోయవలెను. ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను రప్పించెను.౹ యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱె మేకలలోగాని గోవులలోగాని బలి అర్పింపవలెను.౹ పస్కా పండు గలో పొంగినదేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తుదేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశములోనుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.౹ నీ ప్రాంతములన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేది సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయమువరకు మిగిలియుండకూడదు.౹ నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు.౹ నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవేళను, అనగా సూర్యుడు అస్త మించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి, ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్లవలెను. ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను.౹ ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము, అందులో నీవు జీవనోపాధియైన యేపనియు చేయకూడదు. ఏడు వారములను నీవు లెక్కింపవలెను. పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని యేడు వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలది దాని నియ్యవలెను.౹ అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్య నున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.౹ నీవు ఐగుప్తులో దాసుడవై యుండిన సంగతిని జ్ఞాపకముచేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను.౹ ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతో షింపవలెను.౹ నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.౹ ఏటికి మూడు మారులు, అనగా పొంగని రొట్టెలపండుగలోను వారములపండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.౹ వారు వట్టిచేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తికొలది యియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయ కులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమునుబట్టి జనులకు తీర్పుతీర్చవలెను.౹ నీవు న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును.౹ నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనునట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏవిధమైన వృక్షమును నాటకూడదు, దేవతాస్తంభమును ఏర్పరచకూడదు.౹ నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైన నిలువబెట్టకూడదు. నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైననుగల యెద్దునేగాని గొఱ్ఱె మేకలనేగాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు; అది నీ దేవుడైన యెహోవాకు హేయము. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానినిచేయుచు, నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు, అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడేగాని స్త్రీయేగాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైనయెడల, అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీయులలో జరిగియుండుట వాస్తవమైనయెడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషునిగాని స్త్రీనిగాని నీ గ్రామముల వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో చావగొట్టవలెను.౹ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలెను.౹ ఒక్క సాక్షి మాటమీద వానికి విధింపకూడదు.౹ వాని చంపుటకు మొదట సాక్షులును తరువాత జనులందరును వానిమీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. హత్యకు హత్యకు వ్యాజ్యెమునకు వ్యాజ్యెమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యముకాని యెడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు.౹ యెహోవా ఏర్పరచు కొను స్థలమునవారు నీకు తెలుపు తీర్పుచొప్పున నీవు జరి గించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పుతీర్చుటకు జాగ్రత్తపడవలెను.౹ వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పుచొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాటనుండి కుడికిగాని యెడమకుగాని నీవు తిరుగకూడదు.౹ మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనేగాని ఆ న్యాయాధిపతి మాటనేగాని విననొల్లనియెడలవాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీయులలోనుండి పరిహరింపవలెను.౹ అప్పుడు జనులందరు విని భయపడి మూర్ఖ వర్తనము విడిచి పెట్టెదరు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొని అందులో నివసించి —నా చుట్టునున్న సమస్త జనమువలె నామీద రాజును నియమించుకొందుననుకొనినయెడల, నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీమీద రాజుగా నియమించుకొనవలెను.౹ నీ సహోదరులలోనే ఒకని నీమీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడుకాని అన్యుని నీమీద నియమించుకొనకూడదు.౹ అతడు గుఱ్ఱములను విస్తారముగా సంపాదించుకొనవలదు; తాను గుఱ్ఱములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనియ్యకూడదు; ఏలయనగా యెహోవా–ఇకమీదట మీరు ఈ త్రోవను వెళ్లకూడదని మీతో చెప్పెను.౹ తన హృదయము తొలగి పోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు; వెండి బంగారములను అతడు తనకొరకు బహుగా విస్తరింపజేసికొనకూడదు.౹ మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొనవలెను;౹ [19-20] అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులును ఇశ్రాయేలుమధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై *** [21-22] తాను తన సహోదరులమీద గర్వించి, యీ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకుగాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. యాజకులైన లేవీయులకు, అనగా లేవీగోత్రీయులకందరికి ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు, వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు; అది వారి హక్కు.౹ వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు; యెహోవావారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనులవలన, అనగా ఎద్దుగాని గొఱ్ఱెగాని మేకగాని బలిగా అర్పించువారి వలన యాజకులు పొందవలసిన దేదనగా, కుడిజబ్బను రెండు దవడలను పొట్టను యాజకుని కియ్యవలెను.౹ నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొఱ్ఱెల మొదటి బొచ్చును అతని కియ్యవలెను.౹ నిత్యము యెహోవా నామమున నిలిచి సేవచేయుటకు నీ గోత్రములన్నిటిలోను అతనిని అతని సంతతివారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని యున్నాడు. ఒక లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమున తాను విదేశిగా నివసించిన నీ గ్రామములలో ఒకదానినుండి యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపువారు చేయునట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవచేయవలెను.౹ అమ్మబడిన తన పిత్రార్జితమువలన తనకు వచ్చినది గాక అతడు ఇతరులవలె వంతు అనుభవింపవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.౹ తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.౹ వీటినిచేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.౹ నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను.౹ నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.౹ హోరేబులో ఆ సమాజదినమున నీవు–నేను చావక యుండునట్లు మళ్లి నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక,౹ ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీమధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.౹ మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది;౹ వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును.౹ అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణచేసెదను.౹ అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితరదేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను.౹ మరియు —ఏదొకమాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని మీరనుకొనినయెడల,౹ ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగక పోయినయెడలను ఎన్నడును నెరవేరకపోయినయెడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారముచేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. నీ దేవుడైన యెహోవా యెవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని, వారి పట్టణములలోను వారి యిండ్లలోను నివసించునప్పుడు నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో మూడు పురములను వేరుపరచవలెను.౹ ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని, నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశముయొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములు చేయవలెను.౹ పారిపోయి బ్రదుకగల నరహంతకుని గూర్చిన పద్ధతి యేదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువానియందు పగపట్టక పొరబాటున వాని చంపినయెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలివాడు చనిపోయినయెడల,వాడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక వానికి మరణదండన విధిలేదు. అయితే హత్య విషయములో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండు చుండగా, మార్గము దూరమైనందునవాడు నరహంతకుని తరిమి వాని కలిసికొని వాని చావగొట్టకయుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదానియందు జొచ్చి బ్రదుకును.౹ అందుచేతను–మూడు పురములను నీకు ఏర్పరచుకొనవలెనని నేను నీకాజ్ఞాపించుచున్నాను.౹ మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణముచేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరచి, నీ పితరులకు ఇచ్చెదనని చెప్పిన సమస్తదేశమును నీకిచ్చినయెడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకాజ్ఞాపించిన యీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుచు, ఈ మూడు పురములు గాక మరి మూడు పురములను ఏర్పరచుకొనవలెను.౹ ప్రాణము తీసిన దోషము నీమీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషియొక్క ప్రాణము తీయకుండవలెను.౹ ఒకడు తన పొరుగువానియందు పగ పెట్టి వానికొరకు పొంచియుండి వానిమీదపడివాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయినయెడల, వాని ఊరిపెద్దలు మనుష్యులను పంపి అక్కడనుండి వానిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయములో ప్రతిహత్యచేయువానిచేతికి వాని నప్పగింపవలెను.౹ వాని కటాక్షింపకూడదు; నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీయులమధ్యనుండి నిర్దోషి ప్రాణవిషయమైన దోషమును పరిహరింపవలెను. నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వికులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. ఒకడుచేయు సమస్త పాపములలో ఏ అపరాధమునుగూర్చియేగాని యే పాపమునుగూర్చియేగాని ఒక సాక్షియొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.౹ అన్యాయపు సాక్ష్యము ఒకనిమీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడినయెడల ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజకుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువవలెను.౹ ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహోదరునిమీదవాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి యైనయెడల,వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను.౹ అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరించుదురు.౹ మిగిలినవారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు.౹ నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచు నప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.౹ అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించునప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఈలాగు చెప్పవలెను –ఇశ్రాయేలీయులారా, వినుడి; నేడు మీరు మీశత్రువులతో యుద్ధము చేయుటకు సమీ పించుచున్నారు. మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి,౹ వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.౹ మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్తయిల్లు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయినయెడల వేరొకడు దానిలో ప్రవేశిం చును గనుక అట్టివాడు తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.౹ ద్రాక్షతోటవేసి యింక దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయినయెడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.౹ ఒకడు స్త్రీని ప్రధానము చేసికొని ఆమెను ఇంకనుపరిగ్రహింపకమునుపే యుద్ధములో చనిపోయినయెడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.౹ నాయకులు జనులతో —యెవడు భయపడి మెత్తని గుండెగల వాడగునోవాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన యింటికి తిరిగి వెళ్లవచ్చునని చెప్పవలెను.౹ నాయకులు జనులతో మాటలాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను. యుద్ధము చేయుటకు మీరొక పురముమీదికి సమీ పించునప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరచినయెడల దానిలో నున్న జనులందరు నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు.౹ అది మీతో సమాధానపడక యుద్ధమే మంచిదని యెంచినయెడల దాని ముట్టడివేయుడి.౹ నీ దేవుడైన యెహోవా దాని నీ చేతి కప్పగించునప్పుడు దానిలోని మగవారినందరిని కత్తివాత హతము చేయవలెను.౹ అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనున్నది యావత్తును దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించు దువు.౹ [15-18] ఈ జనముల పురములు గాక నీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే యీలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరి గల దేనిని బ్రదుకనియ్యకూడదు. వీరు, అనగా హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులనువారు తమతమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యములరీతిగా మీరు చేసి, నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను. *** *** *** నీవు ఒక పురమును లోపరచుకొనుటకు దానిమీద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడివేయు నప్పుడు, దాని చెట్లు గొడ్డలిచేత పాడుచేయకూడదు; వాటి పండ్లు తినవచ్చునుగాని వాటిని నరికివేయకూడదు; నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా? అట్టి చెట్లను నీవు కొట్టకూడదు.౹ ఏ చెట్లు తినదగిన ఫలములనిచ్చునవికావని నీవెరుగుదువో వాటిని పాడుచేసి నరికి, నీతో యుద్ధముచేయు పురము పడువరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడిదిబ్బ కట్ట వచ్చును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడునప్పుడు, వాని చంపినవాడెవడో అది తెలియక యుండినయెడల నీ పెద్దలును నీ న్యాయాధిపతులును వచ్చి చంపబడినవాని చుట్టునున్న పురముల దూరము కొలిపింపవలెను.౹ ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి యీడ్వని పెయ్యను తీసికొని దున్నబడకయు విత్తబడకయునున్న యేటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొనిపోయి అక్కడ, అనగా ఆ లోయలో ఆ పెయ్యమెడను విరుగ తియ్యవలెను.౹ అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను.౹ అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరు ఆ యేటి లోయలో మెడ విరుగతీయబడిన ఆ పెయ్యపైని తమ చేతులు కడుగుకొని –మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు.౹ యెహోవా, నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము; నీ జనమైన ఇశ్రాయేలీయులమీద నిర్దోషియొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారినిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును.౹ అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయునప్పుడు నీ మధ్యనుండి నిర్దోషియొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించెదవు. నీవు నీ శత్రువులతో యుద్ధముచేయ బోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపెట్టి ఆ చెరపట్టబడినవారిలో రూపవతియైనదానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసికొన మనస్సయి నీ యింట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ యింట నివసించి యొక నెలదినములు తన తండ్రులనుగూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియ్యవలెను. తరువాత నీవు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లిచేసికొనవచ్చును; ఆమె నీకు భార్యయగును.౹ నీవు ఆమెవలన సంతుష్టి నొందనియెడల ఆమె మనస్సువచ్చిన చోటికి ఆమెను సాగనంపవలెనేగాని ఆమెను ఎంతమాత్రమును వెండికి అమ్మకూడదు; నీవు ఆమెను అవమానపరచితివి గనుక ఆమెను దాసివలె చూడకూడదు. ప్రేమింపబడునదొకతెయు ద్వేషింపబడునదొక తెయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వానివలన బిడ్డలు కని జ్యేష్ఠకుమారుడు ద్వేషింపబడినదాని కొడుకైనయెడల, తండ్రి తనకు కలిగినదానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు ద్వేషింపబడినదాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడినదాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు.౹ ద్వేషింపబడినదాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బలప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రిమాటగాని తల్లిమాటగాని వినకయుండి, వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాక పోయినయెడల అతని తలిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవినియొద్ద కూర్చుండు పెద్దలయొద్దకు అతని తీసికొని వచ్చి –మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగబడియున్నాడు; మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయెనని ఊరి పెద్దలతో చెప్పవలెను.౹ అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు. మరణశిక్షకు తగిన పాపము ఒకడుచేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. నీ సహోదరుని యెద్దుగాని గొఱ్ఱెగాని త్రోవ తప్పిపోవుట చూచినయెడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను.౹ నీ సహోదరుడు నీ దగ్గర లేక పోయినయెడలను, నీవు అతని నెరుగకపోయినయెడలను దానిని నీ యింటికి తోలుకొని పోవలెను. నీ సహోద రుడు దాని వెదకుచువచ్చువరకు అది నీ యొద్దనుండవలెను, అప్పుడు అతనికి దాని మరల అప్పగింపవలెను.౹ అతని గాడిదనుగూర్చియు వస్త్రమునుగూర్చియు నీవు ఆలాగుననే చేయవలెను. నీ సహోదరుడు పోగొట్టుకొనినది ఏదైనను నీకు దొరకినయెడల అతడు పోగొట్టుకొనిన దానినిగూర్చి ఆలాగుననే చేయవలెను; నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు.౹ నీ సహోదరుని గాడిదగాని యెద్దుగాని త్రోవలో పడియుండుట నీవు చూచినయెడల వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలెను. స్త్రీ పురుషవేషము వేసికొనకూడదు; పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు; ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు. గుడ్లయినను పిల్లలైననుగల పక్షిగూడు చెట్టుమీదనేగాని నేలమీదనేగాని త్రోవలోనేగాని నీకు కనబడినయెడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్నయెడల పిల్లలతోకూడ తల్లిని తీసికొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసికొనవచ్చును. క్రొత్త యిల్లు కట్టించునప్పుడు దానిమీదనుండి యెవ డైనను పడుటవలన నీ యింటిమీదికి హత్యదోషము రాకుండుటకై నీ యింటి పైకప్పునకు చుట్టు పిట్టగోడ కట్టింపవలెను.౹ నీవు విత్తు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండునట్లు నీ ద్రాక్షతోటలో వివిధమైనవాటిని విత్తకూడదు. ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు.౹ ఉన్నియు జనుపనారయు కలిపినేసిన బట్టను వేసికొనకూడదు. నీవు కప్పుకొను నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసికొనవలెను. ఒకడు స్త్రీని పెండ్లిచేసికొని ఆమెను కూడిన తరువాత ఆమెను ఒల్లక ఆమెమీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరచి–ఈ స్త్రీని నేను పరిగ్రహించి యీమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెయందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పినయెడల ఆ చిన్నదాని తలిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దలయొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వలక్షణములను తీసికొని రావలెను.౹ అప్పుడు ఆ చిన్నదాని తండ్రి–నా కుమార్తెను ఈ మనుష్యునికి పెండ్లిచేయగా ఇదిగో ఇతడీమె నొల్లక–నీ కుమార్తెయందు కన్యాత్వము నాకు కనబడ లేదనియు అవమానక్రియలు చేసినదనియు ఆమెమీద నింద మోపెను; అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపుపెద్దల యెదుట ఆ బట్టను పరచవలెను.౹ అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధముగా వానియొద్ద తీసికొని ఆ చిన్నదాని తండ్రికియ్యవలెను. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్యకను అవమానపరచియున్నాడు. అప్పుడామె అతనికి భార్యయై యుండును; అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడువకూడదు.౹ అయితే ఆ మాట నిజమైనయెడల, అనగా ఆ చిన్నదానియందు కన్యకా లక్షణములు కనబడనియెడల వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆ చిన్నదానిని తీసికొని రావలెను. అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏలయనగా ఆమె తన తండ్రియింట వ్యభిచరించి ఇశ్రాయేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్యనుండి మీరు పరిహరించుదురు. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడినయెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు. కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించినయెడల ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మనుష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడు తనమును మీలోనుండి పరిహరించుదురు. ఒకడు ప్రధానముచేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పెట్టి ఆమెతో శయనించినయెడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను.౹ ఆ చిన్నదాని నేమియు చేయకూడదు, ఆ చిన్నదానియందు మరణపాత్రమైన పాపములేదు. ఒకడు తన పొరుగువాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే యిది జరిగినది.౹ అతడు ఆమెను పొలములో కలిసికొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను.౹ ఒకడు ప్రధానము చేయబడని కన్యకయైన చిన్నదానిని కలిసికొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడినయెడల ఆమెతో శయనించినవాడు ఆ చిన్నదాని తండ్రికి ఏబది వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లిచేసి కొనవలెను. అతడు ఆమెను ఆవమానపరచెను గనుక అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడిచి పెట్టకూడదు. ఎవడును తన తండ్రిభార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు. గాయమునొందిన వృషణములుగలవాడేగాని మర్మాంగము కోయబడినవాడేగాని యెహోవా సమాజములో చేరకూడదు.కుండుడు యెహోవా సమాజములో చేరకూడదు.౹ వానికి పదియవ తరమువాడైనను యెహోవా సమాజములో చేరకూడదు. అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.౹ ఏలయనగా మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసికొని మిమ్మును ఎదుర్కొనరాక, నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోరులోనుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి.౹ అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను.౹ నీ దినములన్నిట ఎన్నడును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు. ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తుదేశములో నీవు పరదేశివై యుంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు.౹ వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరమువారు యెహోవా సమాజములో చేరవచ్చును. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరునప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండ జాగ్రత్త పడవలెను. రాత్రి జరిగినదానివలన మైలపడినవాడు మీలో ఉండినయెడలవాడు పాళెము వెలుపలికి వెళ్లిపోవలెను.౹ అతడు పాళెములో చేరకూడదు; సాయంకాలమున అతడు నీళ్లతో స్నానముచేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును.౹ పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్లవలెను.౹ మరియు నీ ఆయుధములుగాక గసిక యొకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్లునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను.౹ నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. తన యజమానునియొద్దనుండి తప్పించుకొని నీయొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు.౹ అతడు తన యిష్టప్రకారము నీ గ్రామములలో ఒకదానియందు తాను ఏర్పరచుకొనిన చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను; నీవు వాని బాధింపకూడదు. ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతెయు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుష గామిగా ఉండకూడదు.౹ పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. నీవు వెండినేగాని ఆహారద్రవ్యమునేగాని, వడ్డికి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డికియ్యకూడదు.౹ అన్యు నికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవుచేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును.౹ నీవు మ్రొక్కు కొననియెడల నీయందు ఆ పాపముండదు.౹ నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను. నీవు నీ పొరుగువాని ద్రాక్షతోటకు వచ్చునప్పుడు నీ యిష్టప్రకారము నీకు చాలినంతవరకు ద్రాక్షపండ్లు తిన వచ్చునుగాని నీ పాత్రలో వాటిని వేసికొనకూడదు.౹ నీ పొరుగువాని పంటచేనికి వచ్చునప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చునుగాని నీ పొరుగువాని పంటచేనిమీద కొడవలి వేయకూడదు. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లిచేసికొనిన తరువాత ఆమెయందు మానభంగసూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమెమీద అతనికి ఇష్టము తప్పినయెడల, అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమెచేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేయవలెను.౹ ఆమె అతని యింటనుండి వెళ్లినతరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లిచేసికొనవచ్చును.౹ ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేసినయెడల నేమి, ఆమెను పెండ్లిచేసికొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయినయెడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లిచేసికొనుటకై ఆమెను మరల పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండునట్లు మీరు ఆలాగు చేయకూడదు. ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లిచేసికొని సేనలోచేరి పోకూడదు. అతనిపైన యే వ్యాపారభారమును మోపకూడదు. ఏడాదివరకు తీరికగా అతడు తన యింట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టవలెను. తిరగటినైనను తిరగటిమీద దిమ్మనైనను తాకట్టు పెట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పెట్టినట్లే. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొనబడినయెడల అతడు వానిని తన దాసునిగా చేసికొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. ఆలాగు చేసినయెడల ఆ చెడుతనమును మీ మధ్యనుండి పరిహరించుదురు. కుష్ఠరోగవిషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికాజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండుడి.౹ మీరు ఐగుప్తులోనుండి వచ్చి నప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి. నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చినవాడు బయటనున్న నీయొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చియిచ్చును.౹ ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించునట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను.౹ అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి యగును. నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటికూలి ఆ నాడియ్యవలెను.౹ సూర్యుడు అస్తమింపకమునుపు వానికియ్యవలెను.వాడు బీదవాడు గనుక దానిమీద ఆశపెట్టుకొనియుండును.వాడు నిన్నుబట్టి యెహోవాకు మొఱ్ఱపెట్టు నేమో అది నీకు పాపమగును. కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవనిపాపము నిమిత్తమువాడే మరణశిక్ష నొందును. పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసికొనకూడదు.౹ నీవు ఐగుప్తులో దాసుడవైయుండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడనుండి విమోచించె నని జ్ఞాపకము చేసికొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయినయెడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవుచేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీ ఒలీవపండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అవి పరదేశులకును తండ్రిలేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను.౹ నీ ద్రాక్షపండ్లను కోసి కొనునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అది పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును ఉండవలెను.౹ నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై యుంటి వని జ్ఞాపకముచేసికొనుము. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకాజ్ఞాపించుచున్నాను. మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చు నప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషియనియు తీర్పు తీర్చవలెను.౹ ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినయెడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరముకొలది దెబ్బలు లెక్కపెట్టి తనయెదుట వాని కొట్టింపవలెను.౹ నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు. వీటి కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినయెడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. నూర్చెడియెద్దు మూతికి చిక్కము వేయకూడదు. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.౹ చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలోనుండి తుడిచి వేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను.౹ అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లనియెడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి, అనగా పెద్దలయొద్దకు పోయి— నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవరధర్మము చేయ నొల్లడని తెలుపుకొనవలెను.౹ అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాటలాడిన తరువాత అతడు నిలువబడి–ఆమెను పరిగ్రహించుటకు నా కిష్టము లేదనినయెడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా, అతని దాపున పోయి అతని కాలినుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమ్మివేసి–తన సహోదరుని యిల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయబడునని చెప్పవలెను.౹ అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని యిల్లని వానికి పేరు పెట్టబడును. మనుష్యులు ఒకనితో నొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్నవాని చేతిలోనుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానము పట్టుకొనినయెడల ఆమె చేతిని ఛేదింపవలెను.౹ నీ కన్ను కటాక్షింపకూడదు. హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు.౹ హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు.౹ నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘా యుష్మంతుడవగునట్లు తక్కువవికాని న్యాయమైన తూనికె రాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువదికాని న్యాయమైన తూము నీకు ఉండవలెను.౹ ఆలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయముచేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసినదానిని జ్ఞాపకము చేసికొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీ కెదురుగా వచ్చి నీవు ప్రయాసవడి అలసియున్నప్పుడు నీవారిలో నీ వెనుక నున్న బలహీనులనందరిని హతముచేసెను.౹ కాబట్టి నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపెట్లనున్న నీ సమస్త శత్రువులనులేకుండచేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలోనుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసికొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి ఆ దినములలోనుండు యాజకునియొద్దకు పోయి–యెహోవా మన పితరుల కిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చియున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను.౹ యాజకుడు ఆ గంపను నీ చేతిలోనుండి తీసికొని నీ దేవుడైన యెహోవా బలిపీఠమునెదుట ఉంచగా నీవు–నా తండ్రి నశించుచున్న అరామీదేశస్థుడు; అతడు ఐగుప్తునకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయెను.౹ ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మనమీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి నప్పుడు యెహోవా మన మొఱ్ఱను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను.౹ అప్పుడు యెహోవా బాహుబలమువలనను చాపిన చేతి వలనను మహా భయమువలనను సూచక క్రియలవలనను మహత్కార్యములవలనను ఐగుప్తులోనుండి మనలను రప్పించి యీ స్థలమునకు మనలను చేర్చి, పాలు తేనెలు ప్రవహించు దేశమైయున్న యీ దేశమును మనకిచ్చెను.౹ కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమియొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిపెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారముచేసి, నీకును నీ యింటివారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులును నీ దేశములో ఉన్న పరదేశులును సంతోషింపవలెను. పదియవ భాగమిచ్చు సంవత్సరమున, అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో పదియవ వంతును చెల్లించి, అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలోతిని తృప్తిపొందినతరువాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని–నీవు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా యింటనుండి ప్రతిష్ఠితమైనదానిని తీసివేసి, లేవీయులకును పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును నేనిచ్చియున్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరచిపోలేదు.౹ నేను దుఃఖములోనుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై యుండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయినవారి విషయమై దానిలో ఏదియు నేనియ్య లేదు, నా దేవుడైన యెహోవా మాట విని నీవు నా కాజ్ఞాపించినట్లు సమస్తము జరిపి యున్నాను.౹ నీ పరిశుద్ధాలయమగు ఆకాశములోనుండి చూచి, నీ జనులైన ఇశ్రాయేలీయులను–పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించియున్నాడు గనుక నీవు నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటిననుసరించి నడుచుకొనవలెను.౹ యెహోవాయే నీకు దేవుడై యున్నాడనియు, నీవు ఆయన మార్గములయందు నడిచి, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి, ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట యిచ్చితివి.౹ మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమైయుండి తన ఆజ్ఞలన్నిటిని గైకొందువనియు,౹ తాను సృజించిన సమస్త జనముల కంటె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిం చుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును ప్రజలతో.. ఇట్లనిరి–నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరాచరింపవలెను.౹ మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్దరాళ్లను నిలువబెట్టి వాటిమీద సున్నము పూసి నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటినతరువాత ఈ ధర్మశాస్త్రవాక్యములన్నిటిని వాటిమీద వ్రాయవలెను.౹ మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీ కాజ్ఞాపించినట్టు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను.౹ అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను; వాటిమీద ఇనుపపనిముట్టు పడకూడదు.౹ చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యెహోవాకు దహనబలులనర్పింపవలెను.౹ మరియు నీవు సమాధానబలులనర్పించి అక్కడ భోజనముచేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.౹ ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటిని ఆ రాళ్లమీద బహు విశదముగా వ్రాయవలెను. మరియు మోషేయు యాజకులైన లేవీయులును ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరి–ఇశ్రాయేలీయులారా, మీరు ఊరకొని ఆలకించుడి.౹ నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించిన దేమనగా —మీరు యొర్దాను దాటినతరువాత షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు యోసేపు బెన్యామీను గోత్రములవారు ప్రజలనుగూర్చి దీవెనవచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను.౹ రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువవలెను.౹ అప్పుడు లేవీయులు –యెహోవాకు హేయముగా శిల్పిచేతులతో మలి చిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోను చెప్పగా–ఆమేన్ అనవలెను. –తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను. –తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను. –గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను. –పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికేగాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను. –తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుకవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను. –ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తు డని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను. –తన సహోదరితో, అనగా తన తండ్రికుమార్తెతోగాని తన తల్లికుమార్తెతోగాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను. –తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను. –చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను. –నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చు కొనువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను. –ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.౹ నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.౹ నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింపబడుదువు;౹ నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును;౹ నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును.౹ నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.౹ నీ మీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలుదేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవుదురు.౹ నీ కొట్లలోను నీవుచేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.౹ నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనినయెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠితజనముగా నిన్ను స్థాపించును.౹ భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు.౹ మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును.౹ యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవుచేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనములకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు నేడు నేను మీకాజ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికిగాని యెడమకుగాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు. నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.౹ పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు;౹ నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;౹ నీ గర్భఫలము నీ భూమిపంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును;౹ నీవు లోపలికి వచ్చునప్పుడు శపింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడుదువు.౹ నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయ బూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును.౹ నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింప జేయువరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును.౹ యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గముచేతను కంకికాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.౹ నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును.౹ యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును.౹ యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గమున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటిలోనికి యిటు అటు చెదరగొట్టబడుదువు.౹ నీ కళేబరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు.౹ యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్ఠుచేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు.౹ వెఱ్ఱితనముచేతను గ్రుడ్డి తనముచేతను హృదయ విస్మయముచేతను యెహోవా నిన్ను బాధించును.౹ అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు; నీ మార్గములను వర్ధిల్లచేసికొనలేవు; నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు; నిన్ను తప్పించు వాడెవడును లేకపోవును,౹ స్త్రీని ప్రధానము చేసికొందువుగాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు.౹ నీ యెద్దు నీ కన్నులయెదుట వధింపబడునుగాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ యెదుటనుండి బలాత్కారముచేత కొనిపోబడి నీ యొద్దకు మరల తేబడదు. నీ గొఱ్ఱె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించువాడెవడును ఉండడు.౹ నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచి చూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.౹ నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు.౹ నీ కన్నులయెదుట జరుగుదానిని చూచుటవలన నీకు వెఱ్ఱియెత్తును.౹ యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తివరకు మోకాళ్లమీదను తొడలమీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును.౹ యెహోవా నిన్నును నీవు నీమీద నియమించు కొను నీ రాజును, నీవేగాని నీ పితరులేగాని యెరుగని జనమున కప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను రాతిదేవతలను పూజించెదవు యెహోవా నిన్ను చెదర గొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు.౹ విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చు కొందువు; ఏలయనగా మిడతలు దాని తినివేయును.౹ ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షలరసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును.౹ ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండునుగాని తైలముతో తల నంటుకొనవు; నీ ఒలీవ కాయలు రాలిపోవును.౹ కుమారులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్టబడుదురు.౹ మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును.౹ నీ మధ్యనున్న పరదేశి నీకంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు.౹ అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు.౹ నీవు నాశనము చేయబడువరకు ఈ శాపములన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞా పించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు.౹ మరియు అవి చిరకాలమువరకు నీ మీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును.౹ నీకు సర్వసమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు.౹ యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును,౹ క్రూరముఖము కలిగి వృద్ధులను యౌవనస్థులను కటా క్షింపని జనమును గద్ద యెగిరివచ్చునట్లు నీమీదికి రప్పిం చును.౹ నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయువరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునేగాని పశువుల మందలనేగాని గొఱ్ఱె మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు.౹ మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశ మందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు.౹ అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారులయొక్కయు నీ కుమా ర్తెలయొక్కయు మాంసమును తిందువు.౹ మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మనుష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్య యెడలను తాను చంపక విడుచు తన కడమపిల్లలయెడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లలమాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటియందు మిమ్మును ఇరుకు పరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలిన దేమియు ఉండదు.౹ [56-57] నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమా రముచేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారునియెడలనైనను తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును.౹ *** నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును.౹ నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును.౹ మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును.౹ నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశనక్షత్రములవలె విస్తారములైన మీరు, లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలియుందురు.౹ కాబట్టి మీకు మేలుచేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతో షించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు.౹ దేశముయొక్క యీ కొనమొదలుకొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు.౹ ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయకంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును.౹ నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును.౹ నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువాటిచేతను ఉదయమున–అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున–అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.౹ మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడలమీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మ జూపుకొనువారుందురుగాని మిమ్మును కొనువాడొకడైన నుండడు. యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబుదేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి వారితో ఇట్లనెను–యెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికిని అతని సమస్త జనమునకును చేసినదంతయు, అనగా ఆ గొప్ప శోధనలను సూచకక్రియలను మహత్కార్యములను మీరు కన్నులార చూచితిరి.౹ అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటివరకు మీకిచ్చి యుండలేదు.౹ నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటిమీద పాతగిలిపోలేదు; మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలి పోలేదు.౹ మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమేగాని మద్యమేగాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోనురాజైన సీహోనును బాషానురాజైన ఓగును యుద్ధమునకు మనమీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపువారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి.౹ కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచు కొనవలెను. [10-13] నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను, నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు, అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకు లేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు.౹ *** *** *** నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతోకూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారితోను ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను.౹ మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనములమధ్యనుండి మనమెట్లు దాటివచ్చితిమో మీరెరుగుదురు.౹ వారి హేయక్రియలను, కఱ్ఱతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరిగదా.౹ ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవాయొద్ద నుండి తొలగు హృదయముగల పురుషుడేగాని స్త్రీయేగాని కుటుంబమేగాని గోత్రమేగాని నేడు మీలో ఉండకుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును, నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను.౹ అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును.౹ అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయ బడిన శాపములన్నియువానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును.౹ ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటినిబట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి వాని వేరుపర చును.౹ కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతివారును దూరదేశమునుండి వచ్చు పరదేశులును సమస్త జనములును ఆ దేశముయొక్క తెగుళ్లను యెహోవా దానిమీదికి తెప్పించిన సంకటములను చూచి వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకముచేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి –యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు.౹ మరియు వారు–వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్క రించిరి గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను.౹ యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములోనుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను.౹ రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు. నేను నీకు వినిపించిన యీ సంగతులన్నియు, అనగా దీవెనయు శాపమును నీమీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్లగొట్టించిన సమస్త జనములమధ్యను వాటిని జ్ఞాపకము చేసికొని, నీ దేవుడైన యెహోవావైపు తిరిగి, నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్తమునుబట్టి నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతివారును వినినయెడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును.౹ మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్లగొట్టబడినను అక్కడనుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడనుండి రప్పిం చును.౹ నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును.౹ మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేయును.౹ అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువులమీదికిని నిన్ను ద్వేషించినవారిమీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పిం చును.౹ నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని, నేను నేడు నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొను చుందువు.౹ [9-10] మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవావైపు మళ్లునప్పుడు యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలుచేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును. *** నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు.౹ మనము దానిని విని గైకొనునట్లు, ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మనయొద్దకు దాని తెచ్చును? అని నీ వనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు;౹ మనము దాని విని గైకొనునట్లు, ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవను కొననేల? అది సముద్రపు అద్దరి మించునది కాదు.౹ నీవు దాని ననుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది; నీ హృదయమున నీ నోట నున్నది. చూడుము; నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ యెదుట ఉంచియున్నాను.౹ నీవు బ్రదికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినయెడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును.౹ అయితే నీ హృదయము తిరిగిపోయి, నీవు విననొల్లక యీడ్వబడినవాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించినయెడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు, స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటపోవుచున్న దేశములో మీరు అనేకదినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను.౹ నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా పిలుచుచున్నాను.౹ నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లనెను–నేడు నేను నూట ఇరువది యేండ్లవాడనై యున్నాను.౹ ఇకమీదట నేను వచ్చుచుపోవుచు నుండలేను, యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను.౹ నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ యెదుట నుండకుండ నశింపజేయును, నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చియున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును.౹ యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆప్రకారముగానే యీ జనములకును చేయును.౹ నేను మీకాజ్ఞాపించిన దానినంతటినిబట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుడి భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతోకూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు.౹ మరియు మోషే యెహోషువను పిలిచి–నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణముచేసిన దేశమునకు నీవు వీరితోకూడ పోయి దానిని వారికి స్వాధీన పరచవలెను.౹ నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై యుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయపడకుము విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరియెదుట అతనితో చెప్పెను. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధనమందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికిని దాని నప్పగించి వారితో ఇట్లనెను–ప్రతి యేడవ సంవత్సరాంతమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరు ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించునప్పుడు ఇశ్రాయేలీయులందరి యెదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను.౹ మీ దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను.౹ ఆలాగు నేర్చుకొనినయెడల దాని నెరుగని వారి సంతతివారు దానిని విని, మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశమున మీరు బ్రదుకు దినములన్నియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చు కొందురు. మరియు యెహోవా–చూడుము; నీ మరణదినములు సమీపించెను; నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవియ్యగా,౹ మోషేయు యెహోషువయు వెళ్లి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను; ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారముపైని నిలువగా యెహోవా మోషేతో యిట్లనెను–ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోవుచున్నావు. ఈ జనులు లేచి, యెవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనులమధ్యను వ్యభిచారులై, ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి, నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు.౹ కావున నాకోపము ఆ దినమున వారిమీద రగులు కొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమునవారు, మన దేవుడు మన మధ్యనుండకపోయినందున గదా యీ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు.౹ వారు అన్యదేవతలతట్టు తిరిగి చేసిన కీడంతటినిబట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును.౹ కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయులమీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము.౹ నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత, వారుతిని త్రాగి తృప్తిపొంది క్రొవ్వినవారై అన్యదేవతలతట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు.౹ విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారియెదుట సాక్షిగానుండి సాక్ష్యము పలుకును. అది మరువబడక వారి సంతతివారి నోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టకమునుపే, నేడే వారుచేయు ఆలోచన నేనెరుగుదును అనెను.౹ కాబట్టి మోషే ఆ దినమందే యీ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను.౹ మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను–నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడై యుందును. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సాంతముగా వ్రాయుట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధనమందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా–మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసికొని మీ దేవుడైన యెహోవా నిబంధనమందసపు ప్రక్కన ఉంచుడి.౹ అది అక్కడ నీమీద సాక్ష్యార్థముగా ఉండును.౹ నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంక సజీవుడనై మీతో ఉండగానే, ఇదిగో మీరు యెహోవామీద తిరుగుబాటుచేసితిరి.౹ నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురుకదా. మీ గోత్రముల పెద్దలనందరిని మీ నాయకులను నాయొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారిమీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను.౹ ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకాజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు, ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేనెరుగుదును. మీరుచేయు క్రియలవలన యెహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైనదాని చేయుదురు.౹ అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజముయొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సాంతముగా పలికెను. ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాటలాడుదును భూమండలమా, నా నోటిమాట వినుము. నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు;వారు కళంకులు మూర్ఖతగల వక్రవంశము. బుద్ధిలేని అవివేకజనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును; నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభా గించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే. అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతోకూడ ఉండలేదు. భూమియొక్క ఉన్నతస్థలములమీద వాని నెక్కిం చెను పొలముల పంట వానికి తినిపించెను కొండబండనుండి తేనెను చెకుముకి రాతిబండనుండి నూనెను అతనికి జుఱ్ఱించెను. ఆవు మజ్జిగను గొఱ్ఱెమేకల పచ్చిపాలను గొఱ్ఱెపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షలరసము. యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము పుట్టించిరి హేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమపితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి. యెహోవా దానిని చూచెను. తన కుమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను. ఆయన ఇట్లనుకొనెను— నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదనువారు మూర్ఖచిత్తముగలవారు విశ్వాసములేని పిల్లలు. వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టిం చిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టిం తును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవులబెట్టును. వారికి ఆపదలను విస్తరింపజేసెదనువారిమీద నా బాణములన్నిటిని వేసెదను. వారు కరవుచేత క్షీణించుదురు మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించి పోవుదురు బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారిమీదికి రప్పించెదను. బయట ఖడ్గమును లోపట భయమును యౌవనులను కన్యకలను శిశువులను నెరిసిన తలవెండ్రు కలు గలవారిని నశింపజేయును. వారిని దూరమునకు చెదరగొట్టెదను వారి పేరు మనుష్యులలోలేకుండచేసెదననుకొందునువారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో –ఇదంతయు యెహోవా చేసినదికాదు మా బలముచేత వారిని గెలిచితిమి అని వారనుకొందురేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. వారు ఆలోచనలేని జనమువారిలో వివేచనలేదు. వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయనియెడల యెహోవావారిని అప్పగింపనియెడల ఒక్కడు ఎట్లు వేయిమందిని తరుమును? ఇద్దరు ఎట్లు పదివేలమందిని పారదోలుదురు? వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గమువంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి అది గొమొఱ్ఱా పొలములలో పుట్టినది. వారి ద్రాక్షపండ్లు పిచ్చి ద్రాక్షపండ్లు వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షారసము క్రూరసర్పముల విషము నాగుపాముల క్రూరవిషము. ఇది నాయొద్ద మరుగుపడి యుండలేదా? నా నిధులలో ముద్రింపబడి యుండలేదా? వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించునువారి గతి త్వరగా వచ్చును. వారి కాధారము లేకపోవును. నిర్బంధింపబడినవాడును స్వతంత్రుడును లేకపోవును యెహోవా చూచును తన సేవకులనుగూర్చి సంతాపపడును. నిజముగా తన ప్రజలకు తీర్పుచేయును. ఆయన–వారి నైవేద్యముల క్రొవ్వునుతిని వారి పానీ యార్పణమైన ద్రాక్షారసమును త్రాగినవారి దేవత లేమైరి?వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చునువారు మీకు శరణము కానియ్యుడి అని చెప్పును. ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు [40-41] నేను తళతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొనినయెడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసెదను నన్ను ద్వేషించువారికి ప్రతిఫలమిచ్చెదను రక్తముచేత నా బాణములను మత్తిల్ల చేసెదను. *** చంపబడినవారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశముతట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను. జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతి దండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నియు ప్రజలకు వినిపించిరి.౹ మరియు మోషే యీ మాటలన్నియు ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి మరల వారితో ఇట్లనెను–మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మన స్సులలో పెట్టుకొని, మీ సంతతివారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారికాజ్ఞాపింపవలెను.౹ ఇది మీకు నిరర్థకమైన మాటకాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశములో దీనినిబట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. [48-49] ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను— యెరికో యెదుటనున్న మోయాబుదేశమందలి అబారీమను ఈ పర్వతము, అనగా నెబోకొండ యెక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి *** నీ సహోదరుడైన అహరోను హోరు కొండమీద మృతిబొంది తన స్వజనులయొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండమీద మృతిబొంది నీ స్వజనులయొద్దకు చేరుదువు.౹ ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేషు మెరీబా నీళ్లయొద్ద ఇశ్రాయేలీయులమధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయులమధ్యను నామీద తిరుగుబాటు చేసితిరి.౹ ఎదురుగా ఆ దేశమును చూచెదవు కాని నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. దైవజనుడైన మోషే మృతినొందకమునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది; అతడిట్లనెను— యెహోవా సీనాయినుండి వచ్చెను శేయీరులోనుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ధ సమూహములమధ్యనుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియు చుండెను. ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరు నీ వశమున నుందురువారు నీ పాదములయొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను అది యాకోబు సమాజ స్వాస్థ్యము. జనులలో ముఖ్యులును ఇశ్రాయేలు గోత్రములును కూడగా అతడు యెషూరూనులో రాజు ఆయెను. రూబేను బ్రదికి చావక యుండునుగాక అతనివారు లెక్కింపలేనంతమంది అగుదురు. యూదానుగూర్చి అతడిట్లనెను— యెహోవా, యూదా మనవి విని, అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లుచేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై యుందువు. లేవినిగూర్చి యిట్లనెను— నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి. అతడు–నేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదువారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు యెహోవా, అతని బలమును అంగీకరించుము అతడుచేయు కార్యమును అంగీకరించుమీ అతని విరోధులును అతని ద్వేషించువారును లేవకుండునట్లువారి నడుములను విరుగగొట్టుము. బెన్యామీనునుగూర్చి యిట్లనెను— బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజములమధ్య అతడు నివసించును యోసేపునుగూర్చి యిట్లనెను— ఆకాశ పరమార్థములవలన మంచువలన క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థములవలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థములవలన పురాతన పర్వతముల శ్రేష్ఠపదార్థములవలన నిత్యపర్వతముల శ్రేష్ఠపదార్థములవలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థములవలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు. జెబూలూనునుగూర్చి యిట్లనెను— జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతో షించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలులనర్పింతురువారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు. గాదునుగూర్చి యిట్లనెను— గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడుసింహమువలె పొంచియుండును బాహు వును నడినెత్తిని చీల్చివేయును. అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతోకూడ వచ్చెను యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచ రించెను. దానునుగూర్చి యిట్లనెను— దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును. నఫ్తాలినిగూర్చి యిట్లనెను— కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఆషేరునుగూర్చి యిట్లనెను— ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ దింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్లగొట్టి— నశింపజేయుమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములోనుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు. మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను.౹ అప్పుడు యెహోవా దానువరకు గిలాదు దేశమంతయు నఫ్తాలిదేశమంతయు ఎఫ్రాయిము మనష్షేల దేశమును పశ్చిమ సముద్రమువరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును సోయరువరకు ఈతచెట్లుగల యెరికో లోయ చుట్టు మైదానమును అతనికి చూపించెను.౹ మరియు యెహోవా అతనితో ఇట్లనెను–నీ సంతానమున కిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితినిగాని నీవు నది దాటి అక్కడికి వెళ్లకూడదు.౹ యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాటచొప్పున మోయాబు దేశములో మృతినొందెను.౹ బెత్పయోరు యెదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు.౹ మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల యీడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యములేదు, అతని సత్తువ తగ్గలేదు.౹ ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేనుబట్టి ముప్పది దినములు దుఃఖము సలుపగా మోషేనుగూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను.౹ మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువమీద ఉంచి యుండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను; కాబట్టి ఇశ్రాయేలీయులు అతనిమాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.౹ [10-11] ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని అతని దేశమంతటికిని యే సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో *** వాటి విషయములోను, ఆ బాహుబల మంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల యెదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక వ్రవక్త ఇశ్రాయేలీయులలో ఇదివరకు పుట్టలేదు. యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను–నా సేవకుడైన మోషే మృతినొందెను.౹ కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి.౹ నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను.౹ అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానదియైన యూఫ్రటీసు నదివరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహా సముద్రమువరకును మీకు సరిహద్దు.౹ నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.౹ నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు.౹ అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు.౹ ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.౹ నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించెను–మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి –మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై మూడుదినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపువారికిని యెహోషువ యీలాగు ఆజ్ఞాపించెను.౹ యెహోవా సేవకుడైన మోషే మీ కాజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసికొనుడి; ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు; ఆయన ఈ దేశమును మీకిచ్చును.౹ మీ భార్యలును మీ పిల్లలును మీ ఆస్తియు యొర్దాను అవతల మోషే మీకిచ్చిన యీ దేశమున నివసింపవలెనుగాని, పరాక్రమవంతులును శూరులునైన మీరందరు యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయువరకు, అనగా మీ దేవుడైన యెహోవావారికిచ్చు దేశమును స్వాధీనపరచుకొనువరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరచుకొందురు.౹ అందుకు వారు–నీవు మా కాజ్ఞాపించినదంతయు మేము చేసెదము, నీవు మమ్ము నెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము;౹ మోషే చెప్పిన ప్రతిమాట మేము వినినట్లు నీ మాట విందుము; నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైయుండినట్లు నీకును తోడై యుండును గాక.౹ నీమీద తిరుగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరు మరణశిక్ష నొందుదురు; నీవు నిబ్బరముగలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన యిద్దరు మనుష్యులను పిలిపించి–మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీమునొద్దనుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబను నొక వేశ్యయింట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయులయొద్దనుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను.౹ అతడు–నీయొద్దకు వచ్చి నీ యింట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసికొనిరమ్ము; వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా ఆ స్త్రీ ఆ యిద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి —మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే,౹ వారెక్కడనుండి వచ్చిరో నేనెరుగను; చీకటిపడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్లిరి, వారెక్కడికిపోయిరో నేనెరుగను; మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దెమీదికి ఆ యిద్దరిని ఎక్కించి దానిమీద రాశివేసి యున్న జనుపకట్టెలో వారిని దాచి పెట్టెను.౹ ఆ మనుష్యులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి; తరుమపోయిన మనుష్యులు బయలు వెళ్లినతోడనే గవిని వేయబడెను.౹ ఆ వేగులవారు పండుకొనకమునుపు, ఆమె వారున్న మిద్దెమీదికెక్కి వారితో ఇట్లనెను.౹ –యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరు గుదును.౹ మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి.౹ మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.౹ నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రియింటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములును నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి యున్నవారందరును చావకుండ బ్రదుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయుడనెను.౹ అందుకు ఆ మనుష్యులు ఆమెతో–నీవు మా సంగతి వెల్లడి చేయనియెడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము, యెహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసెదమనిరి.౹ ఆమె యిల్లు పట్టణపు ప్రాకారముమీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడువేసి కిటికిద్వారా వారిని దింపెను.౹ ఆమె–మిమ్మును తరుమబోయినవారు మీకెదు రుగా వచ్చెదరేమో, మీరు కొండలకువెళ్లి తరుమబోయినవారు తిరిగి వచ్చువరకు మూడుదినములు అచ్చట దాగి యుండుడి, తరువాత మీ త్రోవను వెళ్లుడని వారితో అనగా ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి–యిదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయమై మేము నిర్దోషుల మగునట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎఱ్ఱని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి యింటివారినందరిని నీయింట చేర్చుకొనుము.౹ నీ యింటి ద్వారములలోనుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగుదుము. అయితే నీయొద్ద నీ యింటనున్న యెవనికేగాని యే అపాయమైనను తగిలినయెడల దానికి మేమే ఉత్తర వాదులము.౹ నీవు మా సంగతి వెల్లడిచేసినయెడల నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి.౹ అందుకు ఆమె–మీ మాటచొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ల నంపెను. వారు వెళ్లినతరువాత ఆమె ఆ తొగరుదారమును కిటికీకి కట్టెను.౹ వారు వెళ్లి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చువరకు మూడుదినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెద కిరిగాని వారు కనబడలేదు.౹ ఆ యిద్దరు మనుష్యులు తిరిగి కొండలనుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువయొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి.౹ మరియు వారు–ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయముచేత ఆ దేశనివాసులందరికి ధైర్యము చెడి యున్నదని యెహోషువతో ననిరి. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరును షిత్తీమునుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి.౹ మూడుదినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి –మీరు మీ దేవుడైన యెహోవా నిబంధనమందసమును యాజకులైన లేవీయులు మోసికొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములోనుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలెను.౹ మీకును దానికిని దాదాపు రెండువేల కొలమూరల యెడముండవలెను. మీరు వెళ్లుత్రోవ మీరింతకుముందుగా వెళ్లి నది కాదు, మీరు దానిని గురుతుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు.౹ మరియు యెహోషువ–రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.౹ –మీరు నిబంధనమందసమును ఎత్తికొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవియ్యగా వారు నిబంధనమందసమును ఎత్తికొని ప్రజలముందర నడచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను— నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను.౹ మీరు యొర్దాను నీళ్లదరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధనమందసమును మోయు యాజకులకు ఆజ్ఞా పించుము.౹ కాబట్టి యెహోషువ–మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో యిట్లనెను–సర్వలోక నాధుని నిబంధనమందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయులను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసికొందురు.౹ కాబట్టి ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని ఇశ్రాయేలీయుల గోత్రములలోనుండి పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచు కొనుడి.౹ సర్వలోక నాధుడగు యెహోవా నిబంధనమందసమును మోయు యాజకుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.౹ కోత కాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటిమీద పొర్లి పారును; నిబంధనమందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్లగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలోనుండి బయలుదేరిరి.౹ అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగినతరువాత మందసమును మోయు యాజకుల కాళ్లు నీటి అంచునమునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను.౹ జనులు యెరికో యెదుటను దాటగా యెహోవా నిబంధనమందసమును మోయు యాజకులు యొర్దానుమధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరు యొర్దానును దాటుట తుద ముట్టువరకు ఇశ్రాయేలీయులందరు ఆరిన నేలమీద దాటుచు వచ్చిరి. జనులందరు యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను –ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని చొప్పున పన్ని ద్దరు మనుష్యులను ఏర్పరచి యాజకుల కాళ్లు నిలిచిన స్థలమున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బసచేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికాజ్ఞాపించుము కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరచిన పన్నిద్దరు మనుష్యులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిపించి వారితో ఇట్లనెను— యొర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసము నెదుట దాటిపోయి, ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక రాతిని తన భుజముమీద పెట్టుకొని తేవలెను.౹ ఇకమీదట మీ కుమారులు–ఈ రాళ్లెందుకని అడుగునప్పుడు మీరు— యెహోవా మందసము నెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను.౹ అది యొర్దానును దాటుచుండగా యొర్దానునీళ్లు ఆపబడెను గనుక యీ రాళ్లు చిరకాలమువరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగానుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై యుండును,౹ అందుకే దీని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లువారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి.౹ అప్పుడు యెహోషువ నిబంధనమందసమును మోయు యాజకుల కాళ్లు యొర్దాను నడుమ నిలిచిన చోట పండ్రెండు రాళ్లను నిలువ బెట్టించెను. నేటివరకు అవి అక్కడ నున్నవి.౹ ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, నెరవేరువరకు యాజకులు మందసమును మోయుచు యొర్దానునడుమ నిలుచుండగా జనులు త్వర పడి దాటిరి. జనులందరు దాటిన తరువాత వారు చూచుచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి.౹ మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపువారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధసన్నద్ధులై దాటిరి.౹ సేనలో ఇంచుమించు నలువది వేలమంది యుద్ధసన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటివచ్చిరి.౹ ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి యెదుట యెహోషువను గొప్పచేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రదుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి. [15-16] యెహోవా–సాక్ష్యపు మందసమును మోయు యాజకులకు యొర్దానులోనుండి యివతలికి రండని ఆజ్ఞాపించుమని యెహోషువతో సెలవియ్యగా *** యెహోషువ యొర్దానులోనుండి యెక్కి రండని ఆయాజకుల కాజ్ఞా పించెను.౹ యెహోవా నిబంధనమందసమును మోయు యాజకులు యొర్దాను నడుమనుండి యెక్కి వచ్చినప్పుడు ఆయాజకుల అరకాళ్లు పొడినేలను నిలువగానే యొర్దాను నీళ్లు వాటిచోటికి ఎప్పటివలెనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను.౹ మొదటి నెల పదియవ తేదిని జనులు యొర్దానులోనుండి యెక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యొర్దానులోనుండి తెచ్చిన పండ్రెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను–రాబోవు కాలమున మీ సంతతివారు — ఈ రాళ్లెందుకని తమ తండ్రులను అడుగుదురుగదా;౹ అప్పుడు మీరు–ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దానును దాటిరి.౹ ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరు తెలిసికొనుటకును,౹ మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటువరకు మీ దేవుడైన యెహోవా తానే మాయెదుట ఎఱ్ఱసముద్రమును ఎండచేసినట్లు మీరు దాటువరకు మీ యెదుట యొర్దాను నీళ్లను ఎండచేసెనని చెప్పి యీ సంగతి వారికి తెలియపరచవలెను. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి యొర్దానుకు పడమటిదిక్కుననున్న అమోరీయుల రాజులందరును సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరును వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను. ఇశ్రాయేలీయుల భయముచేత వారికిక ధైర్యమేమియు లేక పోయెను. ఆ సమయమున యెహోవా–రాతికత్తులు చేయించుకొని మరల ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతికత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను.౹ యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తులోనుండి బయలుదేరినవారందరిలో యుద్ధసన్నద్ధులైన పురుషులందరు ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి.౹ బయలుదేరిన పురుషులందరు సున్నతి పొందినవారే కాని ఐగుప్తులోనుండి బయలుదేరిన తరువాత అరణ్యమార్గమందు పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొందియుండలేదు.౹ యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదనని వారి పితరులతో ప్రమాణముచేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి యుండెను గనుక ఐగుప్తులోనుండి వచ్చిన ఆ యోధులందరు యెహోవా మాట వినకపోయినందునవారు నశించువరకు ఇశ్రాయేలీయులు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి.౹ ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది యుండలేదు గనుక వారికి సున్నతి చేయించెను; ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరుగలేదు.౹ కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడువరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి.౹ అప్పుడు యెహోవా–నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహోషువతోననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గా లను పేరు. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పదు నాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కాపండుగను ఆచరించిరి.౹ పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడియునున్న భక్ష్యములను తినిరి.౹ మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను; అటుతరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమునవారు కనానుదేశపు పంటను తినిరి. యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, దూసిన కత్తి చేతపట్టుకొనియున్న ఒకడు అతని యెదుట నిలిచియుండెను; యెహోషువ అతనియొద్దకు వెళ్లి–నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా? అని అడుగగా అతడు–కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నాననెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారముచేసి–నా యేలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగెను.౹ అందుకు యెహోవా సేనాధిపతి —నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయుమని యెహోషువతో చెప్పగా యెహోషువ ఆలాగు చేసెను. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికోపట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను.౹ అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను–చూడుము; నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీచేతికి అప్పగించుచున్నాను.౹ మీరందరు యుద్ధసన్నద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దానిచుట్టు తిరుగవలెను.౹ ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవదినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆయాజకులు బూరల నూదవలెను.౹ మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జనులందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను.౹ నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి–మీరు నిబంధనమందసమును ఎత్తికొని మోయుడి; ఏడుగురు యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని నడువవలెనని వారితో చెప్పెను.౹ మరియు అతడు–మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను.౹ యెహోషువ ప్రజల కాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు, ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధనమందసమును వారివెంట నడిచెను.౹ యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలను ఊదుచుండిరి.౹ మరియు యెహోషువ–మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినమువరకు మీరు కేకలువేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటనుండి యే ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.౹ అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని యొకమారు దానిచుట్టు తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి.౹ ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడివచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలు ఊదుచు వచ్చిరి.౹ అట్లు రెండవదినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. ఆరుదినములువారు ఆలాగు చేయుచువచ్చిరి.౹ ఏడవదినమునవారు ఉదయమున చీకటితోనే లేచి యేడుమారులు ఆప్రకారముగానే పట్టణముచుట్టు తిరిగిరి; ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణముచుట్టు తిరిగిరి ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–కేకలువేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు.౹ ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారందరును మాత్రమే బ్రదుకుదురు.౹ శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనినయెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు.౹ వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్రలును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి.౹ వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరిని యెద్దులను గొఱ్ఱెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి.౹ అయితే యెహోషువ–ఆ వేశ్యయింటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగినవారినందరిని అక్కడనుండి తోడుకొని రండని దేశమును వేగుచూచిన యిద్దరు మనుష్యులతో చెప్పగా వేగులవారైన ఆ మనుష్యులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగినవారినందరిని వెలుపలికి తోడుకొని వచ్చిరి; ఆమె యింటివారినందరిని వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెమువెలుపట వారిని నివసింపజేసిరి.౹ అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి; వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుపపాత్రలను మాత్రమే యెహోవామందిర ధనాగారములో నుంచిరి.౹ రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి యుండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి యింటివారిని ఆమెకు కలిగినవారినందరిని బ్రదుకనిచ్చెను. ఆమె నేటివరకు ఇశ్రాయేలీయులమధ్య నివసించుచున్నది. ఆ కాలమున యెహోషువ జనులచేత శపథము చేయించి వారికీలాగు ఆజ్ఞాపించెను–ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును; వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠకుమారుడు చచ్చును; దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ఠకుమారుడు చచ్చును;౹ యెహోవా యెహోషువకు తోడై యుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటుచేసిరి. ఎట్లనగా యూదాగోత్రములో జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడినదానిలో కొంత తీసికొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయులమీద కోపించెను.౹ యెహోషువ–మీరు వెళ్లి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పుదిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికోనుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి హాయి పురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి–జనులందరిని వెళ్లనీయకుము, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకొన వచ్చును, జనులందరు ప్రయాసపడి అక్కడికి వెళ్లనేల? హాయి వారు కొద్దిగానున్నారు గదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేలమంది అక్కడికి వెళ్లిరిగాని వారు హాయివారి యెదుట నిలువలేక పారిపోయిరి.౹ అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరు గురు మనుష్యులను హతము చేసిరి. మరియు తమ గవినియొద్ద నుండి షేబారీమువరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును సాయంకాలమువరకు యెహోవా మందసము నెదుట నేలమీద ముఖములు మోపుకొని తమ తలలమీద ధూళి పోసికొనుచు –అయ్యో, ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీ వెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు.౹ ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీయులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండ తుడిచివేసినయెడల, ఘనమైన నీ నామమునుగూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను–లెమ్ము, నీ వేల యిక్కడ ముఖము నేల మోపికొందువు? ఇశ్రాయేలీయులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొనియున్నారు.౹ కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులయెదుట నిలువలేక తమ శత్రువుల యెదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైనవారు మీ మధ్యనుండకుండ మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను.౹ నీవు లేచి జనులను పరిశుద్ధపఱచి వారితో ఈలాగు చెప్పుము–రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి; ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా–ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైన దొకటికలదు; మీరు దానిని మీ మధ్యనుండకుండ నిర్మూలము చేయువరకు మీ శత్రువుల యెదుట మీరు నిలువలేరు.౹ ఉదయమున మీ గోత్రముల వరుసనుబట్టి మీరు రప్పింపబడుదురు; అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుసప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు వంశము కుటుంబములప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుసప్రకారము దగ్గరకు రావలెను.౹ అప్పుడు శపితమైనది యెవనియొద్ద దొరుకునో వానిని వానికి కలిగినవారినందరిని అగ్నిచేత కాల్చివేయవలెను, ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కా ర్యము చేసినవాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసనుబట్టి దగ్గరకు రప్పించి నప్పుడు యూదాగోత్రము పట్టబడెను.౹ యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయుల వంశము పట్టబడెను. జెరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గ రకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను.౹ అతడును అతని యింటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడెను.౹ అప్పుడు యెహోషువ ఆకానుతో నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి, ఆయన యెదుట ఒప్పుకొని, నీవు చేసినదానిని మరుగుచేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము.౹ దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తులముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను.౹ అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి యుండెను, ఆ వెండి దాని క్రిందనుండెను.౹ కాబట్టి వారు డేరా మధ్యనుండి వాటిని తీసికొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయులయొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి.౹ తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరును జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసికొనివచ్చిరి.౹ అప్పుడు యెహోషువ— నీవేల మమ్మును బాధ పరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరు వానిని రాళ్లతో చావగొట్టిరి;౹ వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారిమీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటివరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచినవాడై మళ్లుకొనెను. అందుచేతను నేటివరకు ఆ చోటికి ఆకోరు లోయ అనిపేరు. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను–భయపడకుము, జడియకుము, యుద్ధసన్నద్ధులైన వారినందరిని తోడుకొని హాయిమీదికి పొమ్ము. చూడుము; నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికప్పగించుచున్నాను.౹ నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు; అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లనుంచుము.౹ యెహోషువయు యోధులందరును హాయిమీదికి పోవలెననియుండగా, యెహోషువ పరాక్రమముగల ముప్పదివేల శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి వారికాజ్ఞాపించినదేమనగా— ఆ పట్టణమునకు పడమటివైపున మీరు దాని పట్టుకొన చూచుచు పొంచియుండవలెను పట్టణమునకు బహుదూరమునకు వెళ్లక మీరందరు సిద్ధపడియుండుడి.౹ నేనును నాతోకూడనున్న జనులందరును పట్టణమునకు సమీపించెదము, వారుమునుపటివలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారియెదుట నిలువక పారి పోదుము.౹ –మునుపటివలె వీరు మనయెదుట నిలువలేక పారిపోదురని వారనుకొని, మేము పట్టణమునొద్దనుండి వారిని తొలగి రాజేయువరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు; మేము వారియెదుట నిలువక పారిపోయి నప్పుడు మీరు పొంచియుండుట మాని లేచి పట్టణమును పట్టుకొనుడి; మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాని నప్పగించును.౹ మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాటచొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను.౹ ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను. ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జనులకు ముందుగా హాయిమీదికి పోయిరి.౹ అతని యొద్దనున్న యోధులందరు పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తరదిక్కున దిగిరి.౹ వారికిని హాయికినిమధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు అయిదు వేలమంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికినిమధ్యను పొంచియుండుటకు ఉంచెను.౹ వారు ఆ జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడ మటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్నవారిని, ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను. హాయి రాజు దాని చూచినప్పుడు అతడును అతని జనులందరును పట్టణస్థులందరును త్వరపడి పెందలకడలేచి మైదానమునెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని, తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధముచేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్నవారు పట్టణమునకు పడమటివైపుననుండిన సంగతి అతడు తెలిసికొనలేదు.౹ యెహోషువయు ఇశ్రాయేలీయులందరును వారి యెదుట నిలువలేక ఓడిపోయినవారైనట్టు అరణ్యమార్గముతట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరు కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి.౹ ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొకడును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీయులను తరుమబోయి యుండిరి.౹ అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను–నీవు చేతపట్టుకొనిన యీటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతి కప్పగింతును, అంతట యెహోషువ తన చేతనున్న యీటెను ఆ పట్టణమువైపు చాపెను.౹ అతడు తన చెయ్యి చాపగా పొంచియున్నవారు మాటులోనుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి.౹ హాయివారు వెనుకవైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణముయొక్క పొగ ఆకాశమున కెక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్నవారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టయినను ఆ తట్టయినను పారిపోవుటకు వారికి వీలులేక పోయెను.౹ పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ యెక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరును చూచి నప్పుడు వారు తిరిగి హాయివారిని హతము చేసిరి.౹ తక్కినవారును పట్టణములోనుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈతట్టు కొందరు ఆతట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కు బడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేసిరి. వారిలో ఒకడును మిగులలేదు; ఒకడును తప్పించుకొనలేదు.౹ వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువయొద్దకు తీసికొనివచ్చిరి. బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా, కత్తివాత కూలక మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరు హాయియొద్దకు తిరిగివచ్చి దానిని కత్తివాతను నిర్మూలము చేసిరి.౹ ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరు పండ్రెండు వేలమంది.౹ యెహోషువ హాయి నివాసులనందరిని నిర్మూలము చేయువరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.౹ యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాటచొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమకొరకు కొల్లగా దోచుకొనిరి.౹ అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను; నేటివరకు అది అట్లే యున్నది.౹ యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడదీసెను. ప్రొద్దు గ్రుంకుచున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది. మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుపపనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధానబలులను అర్పించిరి.౹ మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.౹ అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరుగవలెనని, పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రాయేలీయులందరును వారి పెద్దలును వారి నాయకులును వారి న్యాయాధిపతులును యెహోవా నిబంధనమందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగముమంది గెరిజీము కొండయెదుటను సగము మంది ఏబాలు కొండ యెదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్లలును వారి మధ్యనుండు పరదేశులును వినుచుండగా యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటయొక్క టియులేదు. యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అనువారి రాజులందరు జరిగినదానిని వినినప్పుడు వారు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను యుద్ధము చేయుటకు కూడివచ్చిరి.౹ యెహోషువ యెరికోకును హాయికిని చేసినదానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి, రాయబారులమని వేషము వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెలుకట్టి పాతగిలి చినిగి కుట్ట బడియున్న ద్రాక్షారసపు సిద్దెలు తీసికొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నియు ఎండిన ముక్కలుగా నుండెను.౹ వారు గిల్గాలునందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి–మేము దూరదేశమునుండి వచ్చినవారము, మాతో నొక నిబంధనచేయుడని అతనితోను ఇశ్రాయేలీయులతోను చెప్పగా ఇశ్రాయేలీయులు–మీరు మామధ్యను నివసించుచున్నవారేమో, మేము మీతో ఏలాగు నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో ననిరి.౹ వారు–మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ–మీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చితిరి? అని వారి నడుగగా వారు–నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి నీ దాసులమైన మేము బహుదూరమునుండి వచ్చితిమి; ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరినున్న హెష్బోనురాజైన సీహోను, అష్తారోతులోనున్న బాషానురాజైన ఓగు అను అమోరీయుల యిద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి.౹ అప్పుడు మా పెద్దలును మా దేశ నివాసులందరును మాతో–మీరు ప్రయాణముకొరకు ఆహారము చేతపట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో–మేము మీ దాసులము గనుక మాతో నిబంధనచేయుడి అని చెప్పుడి అనిరి.౹ మీ యొద్దకు రావలెనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా యిండ్లనుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే, యిప్పటికి అవి యెండి ముక్కలాయెను.౹ ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, యిప్పటికి అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులును పాతగిలిపోయెనని అతనితో చెప్పిరి.౹ ఇశ్రాయేలీయులు యెహోవాచేత సెలవుపొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చినవారితో సమాధానపడి వారిని బ్రదుకనిచ్చుటకు వారితో నిబంధనచేసెను. మరియు సమాజప్రధానులు వారితో ప్రమాణము చేసిరి.౹ అయితే వారితో నిబంధన చేసి మూడుదినములైన తరువాత, వారు తమకు పొరుగు వారు, తమ నడుమను నివసించువారే యని తెలిసికొనిరి. ఇశ్రాయేలీయులు సాగి మూడవనాడు వారి పట్టణములకు వచ్చిరి; వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయే రోతు కిర్యత్యారీము అనునవి.౹ సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతోడని వారితో ప్రమాణము చేసియుండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొఱ్ఱపెట్టిరి.౹ అందుకు సమాజ ప్రధానులందరు సర్వసమాజముతో ఇట్లనిరి–మనము ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతోడని వారితో ప్రమాణము చేసితిమి గనుక మనము వారికి హానిచేయకూడదు.౹ మనము వారితో చేసిన ప్రమాణమువలన మనమీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమునుబట్టి వారిని బ్రదుక నియ్యవలెనని చెప్పి వారిని బ్రదుకనియ్యుడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లువారు సర్వసమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి.౹ మరియు యెహోషువ వారిని పిలిపించి యిట్లనెను–మీరు మామధ్యను నివసించువారై యుండియు–మేము మీకు బహు దూరముగా నున్న వారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి? ఆ హేతువుచేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకెన్నడును మానదు, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై యుండకమానరు.౹ అందుకు వారు యెహోషువను చూచి–నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి, మీ యెదుట నిలువకుండ ఈ దేశనివాసులనందరిని నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించెనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీవలన మిక్కిలి భయపడి యీలాగు చేసితిమి.౹ కాబట్టి మేము నీ వశముననున్నాము; మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో యేది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి.౹ కాగా అతడు ఆలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండ వారి చేతులలోనుండి విడిపించెను.౹ అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటుననుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటివరకు వారు ఆ పని చేయువారై యున్నారు. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు; అతడు యెరికోను దాని రాజును నిర్మూలముచేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలముచేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధిచేసికొని వారితో కలిసికొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులును మిగుల భయపడిరి.౹ ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది; అది హాయికంటె గొప్పది, అక్కడి జనులందరు శూరులు. అంతట యెరూషలేము రాజైన అదోనీసెదెకు–గిబియోనీయులు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను సంధిచేసియున్నారు. మీరు నాయొద్దకు వచ్చి నాకు సహాయము చేసినయెడల మనము వారి పట్టణమును నాశనము చేయుదమని [3-4] హెబ్రోనురాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును, లాకీషురాజైన యాఫీయ యొద్దకును ఎగ్లోనురాజైన దెబీరునొద్దకును వర్తమానము పంపెను.౹ *** కాబట్టి అమోరీయుల అయిదుగురు రాజులను, అనగా యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును కూడుకొని, తామును తమ సేనలన్నియు బయలుదేరి, గిబియోను ముందర దిగి, గిబియోనీయులతో యుద్ధముచేసిరి.౹ గిబియోనీయులు–మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరు కూడి మా మీదికిదండెత్తి వచ్చియున్నారు గనుక, నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మాయొద్దకు వచ్చి మాకు సహాయముచేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా యెహో షువయును అతనియొద్దనున్న యోధులందరును పరాక్రమ ముగల శూరులందరును గిల్గాలునుండి బయలుదేరిరి.౹ అప్పుడు యెహోవా–వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించియున్నాను, వారిలో ఎవడును నీ యెదుట నిలువడని యెహోషువతో సెలవియ్యగా యెహోషువ గిల్గాలునుండి ఆ రాత్రి అంతయు నడచి వారిమీద హఠా త్తుగా పడెను.౹ అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహా ఘోరముగా వారిని హతముచేసెను. బేత్‍హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకావరకును మక్కేదావరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి.౹ మరియు వారు ఇశ్రాయేలీయుల యెదుటనుండి బేత్‍హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా, వారు అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశమునుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మంది యయిరి. యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను— సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి యున్నది గదా. –సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచియించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు.౹ యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను.౹ అప్పుడు యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోనున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి. ఆ రాజులయిదుగురు పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగియుండిరి.౹ మక్కేదాయందలి గుహలో దాగియున్న ఆ రాజులయిదుగురు దొరికిరని యెహోషు వకు తెలుపబడినప్పుడు యెహోషువ–ఆ గుహ ద్వారమున కడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుష్యులను ఉంచుడి.౹ మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించియున్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరల వెళ్లనీయకుండ మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటివారిని కొట్టివేయుడనెను.౹ వారు బొత్తిగా నశించువరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును బహుజనసంహారముచేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్నవారు ప్రాకారముగల పట్టణములలో చొచ్చిరి.౹ జనులందరు మక్కేదాయందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాటయైన ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను.౹ యెహోషువ–ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలోనుండి ఆ అయిదుగురు రాజులను నాయొద్దకు తీసికొనిరండని చెప్పగా వారు ఆలాగు చేసి, యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నయిదుగురిని ఆ గుహలోనుండి అతనియొద్దకు తీసికొని వచ్చిరి.౹ వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసికొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి, తనతో యుద్ధమునకు వెళ్లివచ్చిన యోధుల అధిపతులతో–మీరు దగ్గరకు రండి; ఈ రాజుల మెడలమీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడలమీద తమ పాదములనుంచిరి.౹ అప్పుడు యెహోషువ వారితో–మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగానుండుడి; మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికి యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను.౹ తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి అయిదు చెట్లమీద వారిని వ్రేలాడదీసెను; వారి శవములు సాయంకాలమువరకు ఆ చెట్లమీద వ్రేలాడు చుండెను.౹ ప్రొద్దు గ్రుంకు సమయమున యెహోషువ సెలవియ్యగా జనులు చెట్లమీదనుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటివరకున్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతముచేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను; యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి.౹ యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. అంతట యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును లిబ్నానుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషువారితో యుద్ధముచేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలీయులచేతికి అప్పగించెను. వారు రెండవదినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసి నట్లే దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాత హతము చేసిరి. లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతముచేసెను.౹ అప్పుడు యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును లాకీషునుండి ఎగ్లోనునకును వచ్చి దానియెదుట దిగి దాని నివాసులతో యుద్ధముచేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలో నున్నవారినందరిని ఆ దినము నిర్మూలముచేసెను. అప్పుడు యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును ఎగ్లోనునుండి హెబ్రోనుమీదికి పోయి దాని జనులతో యుద్ధముచేసి దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతముచేసిరి. అతడు ఎగ్లో నుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరు దెబీరువైపు తిరిగి దాని జనులతో యుద్ధముచేసి దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతముచేసి దానిలోనున్న వారినందరిని నిర్మూలముచేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు, లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు, అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను. అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణప్రదే శమును షెఫేలాప్రదేశమును చరియలప్రదేశమును వాటి రాజులనందరిని జయించెను. ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియులేకుండ ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను.౹ కాదేషు బర్నేయ మొదలుకొని గాజావరకు గిబియోనువరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను.౹ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల నందరిని వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకొనెను.౹ తరువాత యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి. హాసోరు రాజైన యాబీను జరిగినవాటినిగూర్చి విని మాదోనురాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును ఉత్తరదిక్కుననున్న మన్యదేశములోను కిన్నెరెతు దక్షిణదిక్కుననున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజు లకును తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయులకును అమోరీయులకును హిత్తీయులకును పెరిజ్జీయులకును మన్యములోనున్న యెబూసీయులకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువనుండు హివ్వీయులకును వర్తమానము పంపగా వారు సముద్రతీరమందలి యిసుకరేణువులంత విస్తారముగానున్న తమ సైనికులనందరిని సమకూర్చుకొని, విస్తారమైన గుఱ్ఱములతోను రథములతోను బయలుదేరిరి.౹ ఆ రాజులందరు కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్లయొద్దకు వచ్చి దిగగా యెహోవా —వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడినవారినిగా నేను వారినందరిని అప్పగించెదను. నీవు వారి గుఱ్ఱముల గుదికాలి నరమును తెగ కోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషు వతో సెలవిచ్చెను.౹ కాబట్టి యెహోషువయు అతనితోకూడనున్న యోధులందరును హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారిమీదికి వచ్చి వారిమీద పడగా యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతముచేసి మహాసీదోనువరకును మిశ్రేపొత్మాయిమువరకును తూర్పువైపున మిస్పే లోయవరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి.౹ యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుఱ్ఱముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము.౹ ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతివానిని కత్తివాతను హతముచేసిరి. ఎవరును తప్పించుకొనకుండ యెహోషువ వారినందరిని నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను.౹ యెహోషువ ఆ రాజులనందరిని హతముచేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను; యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను.౹ అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెనుగాని మెట్టలమీద కట్టబడియున్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు.౹ ఆ పట్టణముల సంబంధమైన కొల్లసొమ్మును పశువులను ఇశ్రాయేలీయులు దోచుకొనిరి. నరులలో ఒకనిని విడువకుండ అందరిని నశింపజేయువరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరి.౹ యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను, యెహోషువ ఆలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియు అతడు చేయక విడువలేదు. యెహోషువ శేయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదువరకు ఆ దేశమంతటిని, అనగా మన్యమును దక్షిణదేశమంతటిని గోషేనుదేశమంతటిని షెఫేలాప్రదేశమును మైదానమును ఇశ్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులనందరిని పట్టుకొని వారిని కొట్టిచంపెను.౹ బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులుగాక ఇశ్రాయేలీయులతో సంధిచేసిన పట్టణము మరి ఏదియులేదు. ఆ పట్టణములన్నిటిని వారు యుద్ధములో పట్టుకొనిరి.౹ వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనముచేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవావారి హృదయములను కఠినపరచియుండెను.౹ ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను, అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోను ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను.౹ ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడును మిగిలియుండలేదు; గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశ మంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని నప్ప గించెను. అప్పుడు యుద్ధములేకుండ దేశము సుభిక్షముగా నుండెను. ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోనుకొండవరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా అమోరీయుల రాజైన సీహోను అతడు హెష్బోనులో నివసించి, అర్నోను ఏటి తీరము నందలి అరోయేరునుండి, అనగా ఆ యేటిలోయ నడుమనుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయవరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రమువరకును, తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగా నున్న అరాబా సముద్రమువరకును, దక్షిణదిక్కున పిస్గాకొండచరియల దిగువనున్న మైదానమువరకును ఏలినవాడు. ఇశ్రాయేలీయులు బాషానురాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీయులయొక్కయు మాయకాతీయులయొక్కయు సరిహద్దువరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దువరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యమేలినవాడు.౹ యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులును వారిని హతముచేసి, యెహోవా సేవకుడైన మోషే రూబే నీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాని నిచ్చెను.౹ యొర్దానుకు అవతల, అనగా పడమటిదిక్కున లెబానోను లోయలోని బయ ల్గాదు మొదలుకొని శేయీరు వరకునుండు హాలాకు కొండవరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును జయించిన దేశపురాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను.౹ మన్యములోను లోయలోను షెఫేలాప్రదే శములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణదేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి. వారెవరనగా యెరికో రాజు [9-24] బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తప్పూయ రాజు, హెపెరు రాజు, ఆఫెకు రాజు, లష్షారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెషు రాజు, కర్మెలులో యొక్నెయాము రాజు, దోరుమెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు, ఆ రాజులందరి సంఖ్య ముప్పది యొకటి. యెహోషువ బహుదినములు గడచిన వృద్ధుడుకాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను–నీవు బహు దినములు గడచిన వృద్ధుడవు. స్వాధీనపరచుకొనుటకు అతివిస్తారమైన దేశము ఇంక మిగిలియున్నది.౹ మిగిలిన దేశము ఏదనగా, ఫిలిష్తీయుల ప్రదేశములన్నియు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని యెంచబడిన ఉత్తరదిక్కున ఎక్రోనీయుల సరిహద్దువరకును ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారులకు చేరిన గాజీయులయొక్కయు అష్డోదీయులయొక్కయు అష్కెలోనీయులయొక్కయు గాతీయులయొక్కయు ఎక్రోనీయులయొక్కయు దేశమును దక్షిణదిక్కున ఆవీయుల దేశమును కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దువరకును గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండదిగువ నున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవుమార్గమువరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిమువరకును దేశము మిగిలియున్నది.౹ మన్యపు నివాసుల నందరిని సీదోనీయులనందరిని నేను ఇశ్రాయేలీయుల యెదుటనుండి వెళ్లగొట్టెదను. కావున నేను నీ కాజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను.౹ తొమ్మిది గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచి పెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు గాదీయులు తూర్పుదిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి.౹ అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయమధ్యనున్న పట్టణమునుండి దీబోనువరకు మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దువరకు హెష్బోనులో ఏలికయు అమోరీయుల రాజునైన సీహోనుయొక్క సమస్తపురములును గిలాదును, గెషూరీయులయొక్కయు మాయాకాతీయులయొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కావరకు బాషాను దేశమంతయు రెఫాయీయుల శేషములో అష్తారోతులోను ఎద్రెయీలోను ఏలికయైన ఓగురాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను.౹ అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను మాయాకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులును మాయాకా తీయులును నేటివరకు ఇశ్రాయేలీయులమధ్యను నివసించుచున్నారు.౹ లేవిగోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవావారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములనుబట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్య మిచ్చెను.౹ వారి సరిహద్దు ఏదనగా, అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణమునుండి మేదెబాయొద్దనున్న మైదానమంతయు హెష్బోనును మైదానములోని పట్టణములన్నియు, దీబోను బామోత్బయలు బేత్బయల్మెయోను [18-21] యాహసు కెదేమోతు మేఫాతు కిర్యతాయిము సిబ్మాలోయలోని కొండమీది శెరెత్షహరు బెత్పయోరు పిస్గాకొండచరియలు బెత్యేషిమోతు అను పట్టణములును మైదానములోని పట్టణములన్నియు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించినవాడునైన సీహోను వశముననున్న ఎవీ రేకెము సూరు హోరు రేబ అను మిద్యానురాజుల దేశమును అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. *** *** *** ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కినవారితో పాటు ఖడ్గముతో చంపిరి.౹ యొర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు; అదియు దానిలోని పట్టణములును గ్రామములును రూబేనీయుల వంశముల లెక్కచొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదుగోత్రమునకు, అనగా గాదీయులకు వారి వంశములచొప్పున స్వాస్థ్యమిచ్చెను.౹ వారి సరిహద్దు యాజెరును గిలాదు పట్టణములన్నియు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరువరకు అమ్మోనీయుల దేశములో సగమును హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొ నీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దువరకును లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాపోను, అనగా హెష్బోనురాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యొర్దాను అద్దరిని కిన్నె రెతు సముద్రతీరమువరకునున్న యొర్దాను ప్రదేశమును.౹ వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములును గ్రామములును ఇవి. మోషే మనష్షే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశములచొప్పున మనష్షీయుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము.౹ వారి సరిహద్దు మహనయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషానురాజైన ఓగు సర్వ రాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని అరువది పట్టణములును.౹ గిలాదులో సగమును, అష్తారోతు ఎద్రయియునను బాషానులో ఓగు రాజ్య పట్టణములును మనష్షే కుమారుడైన మాకీరు, అనగా మాకీరీయులలో సగముమందికి వారి వంశములచొప్పున కలిగినవి.౹ యెరికో యొద్ద తూర్పుదిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచి పెట్టిన స్వాస్థ్యములు ఇవి.౹ లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు; ఏలయనగా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవావారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. ఇశ్రాయేలీయులు కనానుదేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి.౹ మోషేద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులును చీట్లు వేసి, తొమ్మిది గోత్రములవారికిని అర్ధగోత్రపువారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి.౹ మోషే రెండు గోత్రములకును అర్ధగోత్రమునకును యొర్దాను అవతలి స్వాస్థ్యముల నిచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు యోసేపు వంశకులగు మనష్షే ఎఫ్రాయిములను రెండు గోత్రములవారు నివసించుటకు పట్టణములును వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీపభూములను మాత్రమేకాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు.౹ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువయొద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవిచేసెను–కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్నుగూర్చియు నిన్నుగూర్చియు చెప్పినమాట నీ వెరుగుదువు.౹ దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలోనుండి నన్ను పంపినప్పుడు నేను నలువది ఏండ్లవాడను; ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని.౹ నాతోకూడ బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని.౹ ఆ దినమున మోషే ప్రమాణము చేసి–నీవు నా దేవుడైన యెహోవాను నిండుమనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడును స్వాస్థ్యముగా ఉండుననెను.౹ యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన యీ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి యున్నాడు; ఇదిగో నేనిప్పుడు ఎనబదియయిదేండ్ల వాడను.౹ మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధముచేయుటకుగాని వచ్చుచు పోవుచునుండుటకుగాని నాకెప్పటియట్లు బల మున్నది.౹ కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన యీ కొండ ప్రదేశమును నాకు దయచేయుము; అనాకీయులును ప్రాకారముగల గొప్ప పట్టణములును అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండినయెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును.౹ యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను.౹ కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటివరకు స్వాస్థ్యముగా నున్నది.౹ పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధములేకుండ నెమ్మదిగా ఉండెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్లవలన వచ్చినవంతు ఎదోము సరిహద్దువరకును, అనగా దక్షిణదిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతమువరకును ఉండెను.౹ దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్రతీరమున దక్షిణదిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను.౹ అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీనువరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోనువరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయువైపు తిరిగి అస్మోనువరకు సాగి ఐగుప్తు ఏటివరకు వ్యాపించెను. ఆతట్టు సరిహద్దు సముద్రమువరకు వ్యాపించెను, అది మీకు దక్షిణపు సరిహద్దు.౹ దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుదవరకు నున్న ఉప్పు సముద్రము. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను తుద నున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను.౹ ఆ సరిహద్దు బేత్‍హోగ్లావరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కువరకు వ్యాపించెను. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతివరకు వ్యాపించెను.౹ ఆ సరిహద్దు ఆకోరులోయనుండి దెబీరువరకును ఏటికి దక్షిణతీరముననున్న అదుమ్మీము నెక్కుచోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తరదిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్‌షేమెషు నీళ్లవరకు వ్యాపించెను. దాని కొన ఏన్‌రోగేలునొద్ద నుండెను.౹ ఆ సరిహద్దు పడమట బెన్‌హిన్నోములోయ మార్గముగా దక్షిణదిక్కున యెబూసీయుల దేశమువరకు, అనగా యెరూషలేమువరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పువరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పునుండియు నెఫ్తోయ నీళ్లయూటయొద్దనుండియు ఏఫ్రోనుకొండ పురములవరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలావరకు సాగెను.౹ ఆ సరిహద్దు పడమరగా బాలానుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీముకొండయొక్క ఉత్తరపు వైపునకుదాటి బేత్షెమెషువరకు దిగి తిమ్నావైపునకు వ్యాపించెను.౹ ఉత్తరదిక్కున ఆ సరిహద్దు ఎక్రోనువరకు సాగి అక్కడనుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి యబ్నెయేలువరకును ఆ సరిహద్దు సముద్రమువరకును వ్యాపించెను.౹ పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దువరకు వ్యాపించెను. యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థులమధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్తయైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను.౹ అక్కడనుండి కాలేబు అనాకుయొక్క ముగ్గురు కుమారులైన షెషయి అహీమాను తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్లగొట్టి వారిదేశమును స్వాధీనపరచుకొనెను.౹ అక్కడనుండి అతడు దెబీరు నివాసులమీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు.౹ కాలేబు–కిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.౹ మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి–నీకేమి కావలెనని ఆమె నడిగెను.౹ అందుకామె–నాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమి యిచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. [20-32] యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. దక్షిణదిక్కున ఎదోము సరిహద్దువరకు యూదా వంశస్థుల గోత్రముయొక్క పట్టణములు ఏవేవనగా–కబ్సెయేలు ఏదెరు యాగూరు కీనాది మోనా అదాదా కెదెషు హాసోరు యిత్నాను జీఫు తెలెము బెయాలోతు క్రొత్త హాసోరు కెరీయోతు హెస్రోను అనబడిన హాసోరు అమాము షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను బేత్పెలెతు హసర్షువలు బెయేర్షెబా బిజ్యోత్యాబాలా ఈయ్యె ఎజెము ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నియు ఇరువది తొమ్మిది. *** *** *** *** *** *** *** *** *** *** *** *** [33-35] మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము యర్మూతు అదుల్లాము శోకో అజేకా *** *** షరాయిము అదీతాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా పదు నాలుగు పట్టణములు.౹ [37-41] సెనాను హదాషా మిగ్దోల్గాదు దిలాను మిస్పే యొక్తయేలు లాకీషు బొస్కతు ఎగ్లోను కబ్బోను లహ్మాసు కిత్లిషు గెదెరోతు బేత్దాగోను నయమా మక్కేదా అనునవి, వాటి పల్లెలు పోగా పదియారు పట్టణములు. *** *** *** *** [42-47] లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నా నెసీబు కెయీలా అక్జీబు మారేషా అనునవి, వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు. ఎక్రోను దాని గ్రామములును పల్లెలును, ఎక్రోను మొదలుకొని సముద్రమువరకు అష్డోదు ప్రాంత మంతయు, దాని పట్టణములును గ్రామములును, ఐగుప్తు ఏటివరకు పెద్ద సముద్రమువరకును అష్డోదును, గాజాను వాటి ప్రాంతమువరకును వాటి గ్రామములును పల్లెలును,౹ *** *** *** *** *** [48-54] మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు శోకో దన్నా కిర్యత్సన్నా అను దెబీరు అనాబు ఎష్టెమో ఆనీము గోషెను హోలోను గిలో అనునవి, వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు. ఆరాబు దూమా ఎషాను యానీము బేత్తపూయ అఫెకా హుమ్తా కిర్యతర్బా అను హెబ్రోను సీయోరు అనునవి, వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు. *** *** *** *** *** *** [55-59] మాయోను కర్మెలు జీఫు యుట్ట యెజ్రెయేలు యొక్దె యాము జానోహ కయీను గిబియా తిమ్నా అనునవి, వాటి పల్లెలు పోగా పది పట్టణములు. హల్హూలు బేత్సూరు గెదోరు మారాతు బేతనోతు ఎల్తెకో ననునవి, వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.౹ *** *** *** *** కిర్యత్యారీమనగా కిర్యత్బయలు రబ్బా అనునవి, వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు. [61-63] అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా నిబ్షాను యీల్మెలహు ఎన్గెదీ అనునవి, వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు. యోసేపు పుత్రులకు చీటివలన వచ్చిన వంతు యెరికో యెదుట యొర్దాను దరినుండెను,౹ [2-3] తూర్పుననున్న ఆ యెరికో యేటివెంబడిగా యెరికోనుండి బేతేలు మన్య దేశమువరకు అరణ్యము వ్యాపించును. అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దువరకు సాగి క్రింది బేత్‌హోరోనువరకును గెజెరు వరకును పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రమువరకు సాగెను.౹ *** అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్‌హోరోనువరకు తూర్పుగా వ్యాపించెను.౹ వారి సరిహద్దు మిక్మెతాతునొద్దనున్న సముద్రమువరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానాత్షీలోనువరకు తూర్పువైపుగా చుట్టు తిరిగి యానోహావరకు తూర్పున దాని దాటి యానోహానుండి అతారోతువరకును నారాతావరకును యెరికోకు తగిలి యొర్దాను నొద్ద తుదముట్టెను.౹ తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా యేటివరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశములచొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము.౹ ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్యబడినపట్టణములు పోగా ఆ పట్టణములన్నియు వాటి గ్రామములును మనష్షీయుల స్వాస్థ్యములో నుండెను.౹ అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు. నేటివరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయులమధ్య నివసించుచు పన్ను కట్టు దాసులైయున్నారు. మనష్షే యోసేపు పెద్దకుమారుడు గనుక అతని గోత్రమునకు, అనగా మనష్షే పెద్దకుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్లవలన వంతువచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను.౹ మనష్షీయులలో మిగిలిన వారికి, అనగా అబియెజెరీయులకును హెలకీయులకును అశ్రీయేలీయులకును షెకెమీయులకును హెపెరీయులకును షెమీదీయులకును వారి వారి వంశములచొప్పున వంతువచ్చెను. వారి వంశములనుబట్టి యోసేపు కుమారుడైన మనష్షేయొక్క మగ సంతానమది. మనష్షే మునిమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడునైన సెలోపె హాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా అనునవి.౹ వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటి కిని నూను కుమారుడైన యెహోషువ యెదుటికిని ప్రధానుల యెదుటికిని వచ్చి–మా సహోదరులమధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించెనని మనవిచేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రియొక్క సహోదరులమధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను. కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానులుగాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చెను.౹ ఏలయనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదుదేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను.౹ మనష్షీయుల సరిహద్దు ఆషేరునుండి షెకెమునకు తూర్పుగానున్న మిక్మెతావరకును దక్షిణమున ఏన్తప్పూయ నివాసులవైపునకు వ్యాపించెను.౹ తప్పూయదేశము మనష్షీయులదాయెను; అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయి మీయులదాయెను.౹ ఆ సరిహద్దు కానాయేటి దక్షిణ దిక్కున ఆ యేటివరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్లలో ఆ ఊళ్లు ఎఫ్రాయిమీయులకు కలిగెను; అయితే మనష్షీయుల సరిహద్దు ఆ యేటికి ఉత్తరముగా సముద్రమువరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకును ఉత్తరభూమి మనష్షీయులకును కలిగెను.౹ సముద్రము వారి సరిహద్దు; ఉత్తరదిక్కున అది ఆషేరీయుల సరిహద్దుకును, తూర్పుదిక్కున ఇశ్శాఖారీయుల సరిహద్దుకును నడిచెను. ఇశ్శాఖారీయుల ప్రదేశములోను ఆషేరీయుల ప్రదేశములోను బేత్షెయాను దాని పురములును ఇబ్లెయామును దాని పురములును దోరు నివాసులును దాని పురములును ఏన్దోరు నివాసులును దాని పురములును తానాకు నివాసులును దాని పురములును మెగిద్దో నివాసులును దాని పురములును, అనగా మూడు కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి యున్నది.౹ కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పెట్టి యుండిరి గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేక పోయిరి.౹ ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు.౹ అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో–మాకేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి? మేము ఒక గొప్ప జనమేగదా? ఇదివరకు యెహోవా మమ్మును దీవించెనని మనవిచేయగా యెహోషువ–మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయులయొక్క మన్యము మీకు ఇరుకుగా నున్నయెడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశములోను రెఫాయీయుల దేశములోను మీకు మీరే చెట్లు నరకుకొనుడని వారితో చెప్పెను.౹ అందుకు యోసేపు పుత్రులు–ఆ మన్యము మాకుచాలదు; అదియుగాక పల్లపుచోటున నివసించు కనానీయులకందరికి, అనగా బేత్షెయానులోనివారికిని దాని పురములలోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి.౹ [17-18] అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను మనష్షీయులను చూచి— మీరు ఒక విస్తారజనము, మీకు అధికబలముగలదు, మీకు ఒక్కవంతు చీటియేకాదు; ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి, అప్పుడు ఆ ప్రదే శము మీదగును; కనానీయులకు ఇనుప రథములుండినను వారు బలవంతులైయుండినను మీరు వారి దేశమును స్వాధీన పరచుకొనగలరనెను. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరు షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి.౹ ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంక పొందని యేడుగోత్రములు ఉండెను.౹ కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను–మీపితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండ మీరెన్నాళ్లు తడవుచేసెదరు? ప్రతి గోత్రమునుండి ముగ్గురేసి మనుష్యులను నాయొద్దకు రప్పించినయెడల నేను వారిని పంపెదను; వారు లేచి దేశసంచారము చేయుచు ఆయా స్వాస్థ్యములచొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసికొనివచ్చెదరు.౹ వారు ఏడువంతులుగా దాని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణదిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను.౹ మీరు ఏడు వంతులుగా దేశవివరమును వ్రాసి నా యొద్దకు తీసికొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతుచీట్లు వేసెదను.౹ లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలుగదు, యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము. గాదీయులును రూబేనీయులును మనష్షే అర్ధగోత్రపువారును యొర్దాను అవతల తూర్పుదిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు. ఆ మనుష్యులు లేచి ప్రయాణముకాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్లబోవు వారితో–మీరు ఆ దేశములోబడి నడుచుచు దాని వివరమును వ్రాసి నాయొద్దకు తిరిగి రండి; అప్పుడు నేను షిలోహులో మీకొరకు యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేయించెద ననగా ఆ మనుష్యులు వెళ్లి దేశసంచారము చేయుచు ఏడువంతులుగా, గ్రామములచొప్పున, దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి.౹ వారికొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేసి వారి వారి వంతులచొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచి పెట్టెను.౹ బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున, వంతుచీటి వచ్చెను; వారి చీటివలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్యనుండెను. ఉత్తరదిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని యెరికోకు ఉత్తరదిక్కున పోయి పడమరగా కొండల దేశమువరకు వ్యాపించెను, దాని సరిహద్దు బేతావెను అరణ్యమువరకు సాగెను.౹ అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అనగా బేతేలను లూజు దక్షిణమువరకు సాగి క్రింది బెత్‌హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతు అద్దారువరకు వ్యాపించెను.౹ అక్కడనుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్‌హోరోనుకును ఎదురుగా నున్న కొండనుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్బాలు అనగా కిర్యత్యారీమువరకు వ్యాపించెను, అది పడమటిదిక్కు.౹ దక్షిణదిక్కున కిర్యత్యారీముకొననుండి దాని సరిహద్దు పడమటిదిక్కున నెఫ్తోయ నీళ్ల యూటవరకు సాగి ఉత్తరదిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్‍హిన్నోము లోయయెదుటనున్న కొండప్రక్కననుండి దక్షిణదిక్కున బెన్‌హిన్నోము లోయమార్గమున యెబూసీయుల ప్రదేశమువరకు సాగి ఏన్‌రోగేలువరకు వ్యాపించెను.౹ అది ఉత్తర దిక్కునుండి ఏన్‌షెమెషువరకు వ్యాపించి అదుమ్మీమునకు ఎక్కుచోటికి ఎదురుగానున్న గెలీలోతువరకు సాగి రూబేనీయుడైన బోహను రాతి యొద్దకు దిగెను.౹ అది ఉత్తరదిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబావరకు దిగి అక్కడనుండి ఆ సరిహద్దు ఉత్తరదిక్కున బేత్‌హోగ్లావరకు సాగెను.౹ అక్కడనుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణదిక్కున ఉప్పు సముద్రముయొక్క ఉత్తరాఖాతమువరకు వ్యాపించెను. అది దక్షిణదిక్కున దానికి సరిహద్దు.౹ తూర్పుదిక్కున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టునున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీయులకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది.౹ బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా యెరికో బేత్‌హోగ్లా యెమెక్కెసీసు బేతరాబా సెమరాయిము బేతేలు ఆవీము పారా ఒఫ్రా [23-26] కెపరమ్మోని ఒప్ని గెబా అనునవి, వాటి పల్లెలు పోగా పండ్రెండు పట్టణములు. గిబియోను రామా బెయేరోతు మిస్పే కెఫీరా మోసా రేకెము ఇర్పెయేలు తరలా *** *** *** సేలా ఎలెపు యెరూషలేము అనబడిన ఎబూసీ గిబియా కిర్యతు అనునవి; వాటి పల్లెలు పోగా పదునాలుగు పట్టణములు.౹ వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము. రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశములచొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశ స్థుల స్వాస్థ్యము మధ్యనుండెను.౹ వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా [4-6] సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా బేత్లెబాయోతు షారూ హెను అనునవి, వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణములు.౹ *** *** అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి; వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు.౹ దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు ఆ పట్టణముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము.౹ షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము; ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి. మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూ నీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను.౹ వారి సరిహద్దు పడమటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబె రతునుండి యాఫీయకు ఎక్కి అక్కడనుండి తూర్పుతట్టు గిత్తహెపెరువరకును ఇత్కా చీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను.౹ దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను.౹ కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును.౹ ఆ పట్టణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూ నీయులకు కలిగిన స్వాస్థ్యము. [17-23] నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యెజ్రెయేలు కెసుల్లోతు షూనేము హపరాయిము షీయోను అనహరాతు రబ్బీతు కిష్యోను అబెసు రెమెతు ఏన్గన్నీము ఏన్‌హద్దా బేత్పస్సెసు అను స్థలములవరకు సాగి తాబోరు షహచీమా బేత్షెమెషు అను స్థలములను దాటి యొర్దానువరకు వ్యాపించెను. వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతోకూడ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. *** *** *** *** *** *** అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను.౹ వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు అలమ్మేలెకు అమాదు మిషెయలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను.౹ అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసావరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపెట్టి సముద్రమువరకు సాగెను.౹ ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతోకూడ అవి యిరువదిరెండు పట్టణములు.౹ వాటి పల్లెలతోకూడ ఆ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను.౹ వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సింధూరవనమును అదామియను కనుమను యబ్నెయేలును మొదలుకొని లక్కూమువరకు సాగి అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరువరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూలూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను.౹ [35-38] కోటగల పట్టణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు అదామా రామా హాసోరు కెదెషు ఎద్రెయీ ఏన్‌హాసోరు ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్షెమెషు అనునవి; వాటి పల్లెలుగాక పందొమ్మిది పట్టణములు.౹ *** *** *** ఆ పట్టణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున నఫ్తా లీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. [40-46] ఏడవ వంతు చీటి వారి వంశములచొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు —జొర్యా ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను అయ్యాలోను యెతా ఏలోను తిమ్నా ఎక్రోను ఎత్తెకే గిబ్బెతోను బాలాతా యెహుదు బెనేబెరకు గత్రిమ్మోను మేయర్కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించెను.౹ *** *** *** *** *** *** దానీయుల సరిహద్దు వారియొద్దనుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమపితరుడైన దాను పేరునుబట్టి ఆ లెషెమునకు దానను పేరుపెట్టిరి.౹ వాటి పల్లెలుగాక యీ పట్టణములు వారి వంశములచొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దులనుబట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచి పెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి.౹ యెహోవా సెలవిచ్చిన దానినిబట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశములోనున్న తిమ్న త్సెరహును అతని కిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను.౹ యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము నొద్ద యెహోవా సన్నిధిని చీట్లవలన పంపకముచేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచి పెట్టుట ముగించిరి. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చిన దేమనగా [2-3] —నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషేనోట మీతో పలికించిన ఆశ్రయ పురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్యవిషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును.౹ *** ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి, ఆ పురముయొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత, వారు పురములోనికి వానిని చేర్చుకొని తమయొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను.౹ హత్యవిషయములో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమినయెడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు; ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపెనుగాని అంతకుమునుపు వానియందు పగపట్టలేదు.౹ అతడు తీర్పునొందుటకై సమాజము నెదుట నిలుచువరకును, తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నొందువరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణమునుండి పారిపోయెనో ఆ పట్టణమునకును తన యింటికిని తిరిగి రావలెను.౹ అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్ఠపరచిరి.౹ తూర్పుదిక్కున యొర్దాను అద్దరిని యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్యములో ని బేసెరును, గాదీయుల గోత్రములోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.౹ పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువకమునుపు అక్కడికి పారిపోయి హత్యవిషయమై ప్రతిహత్యచేయు వానిచేత చంపబడక యుండునట్లు ఇశ్రాయేలీయులకందరికిని వారిమధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులయొద్దకును వచ్చి –మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించెననగా ఇశ్రాయేలీయులు యెహోవా మాటచొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వంతుచీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికులనుండియు, షిమ్యోను గోత్రి కులనుండియు, బెన్యామీను గోత్రికులనుండియు చీట్లవలన వచ్చినవి పదమూడు పట్టణములు.౹ కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు, దాను గోత్రికుల నుండియు, మనష్షే అర్ధ గోత్రపువారినుండియు వంతుచీట్లవలన వచ్చినవి పది పట్టణములు. ఇశ్శాఖారు గోత్రికులనుండియు, ఆషేరు గోత్రికుల నుండియు, నఫ్తాలి గోత్రికులనుండియు, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపువారినుండియు చీట్లవలన గెర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు.౹ రూబేను గోత్రి కులనుండియు, గాదు గోత్రికులనుండియు, జెబూలూను గోత్రికులనుండియు, వారి వంశములచొప్పున మెరారీయులకు కలిగినవి పండ్రెండు పట్టణములు.౹ యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయుల కిచ్చిరి. వారు యూదావంశస్థుల గోత్రములోను షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేరులుగల యీ పట్టణములను ఇచ్చిరి.౹ అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి, ఏలయనగా మొదట చేతికివచ్చిన వంతుచీటి వారిది.౹ యూదావంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టునున్న పొలమును వారి కిచ్చిరి.౹ అయితే ఆ పట్టణముయొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. [13-16] యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును దాని పొలమును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొలమును ఎష్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును దెబీరును దాని పొలమును ఆయినిని దాని పొలమును యుట్టయును దాని పొలమును బేత్షెమెషును దాని పొలమును, అనగా ఆ రెండు గోత్రములవారినుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి.౹ *** *** *** బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.౹ యాజకు లైన అహరోను వంశకుల పట్టణములన్నియు వాటి పొలములు పోగా పదమూడు పట్టణములు. కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అనగా కహాతు సంబంధులలో మిగిలినవారికి వంతుచీట్లవలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రమునుండి వారికియ్యబడెను.౹ నాలుగు పట్టణములను, అనగా ఎఫ్రాయిమీయుల మన్యదేశములో నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమైన షెకెమును దాని పొలమును గెజెరును దాని పొలమును కిబ్సాయిమును దాని పొలమును బేత్‌హోరోనును దాని పొలమును వారికిచ్చిరి.౹ దాను గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా ఎత్తెకేను దాని పొలమును గిబ్బెతోనును దాని పొలమును అయ్యాలోనును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొలమును వారికిచ్చిరి.౹ రెండు పట్టణములును, అనగా మనష్షే అర్ధగోత్రికులనుండి తానాకును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి.౹ వాటి పొలములు గాక కహాతు సంబంధులలో మిగిలినవారికి కలిగిన పట్టణములన్నియు పది. లేవీయుల వంశములలో గెర్షోనీయులకు రెండు పట్టణములను, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును బెయెష్టెరాను దాని పొలమును ఇచ్చిరి.౹ ఇశ్శాఖారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును యర్మూతును దాని పొలమును ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి.౹ ఆషేరు గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా మిషెయలును దాని పొలమును అబ్దోనును దాని పొలమును హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి.౹ నఫ్తాలి గోత్రికులనుండి మూడు పట్టణములను, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును హమ్మోత్దోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి.౹ వారి వంశములచొప్పున గెర్షోనీయుల పట్టణములన్నియు వాటి పొలములుగాక పదమూడు పట్టణములు. లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రములనుండి నాలుగు పట్టణములను, అనగా యొక్నెయాము దాని పొలమును కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి.౹ రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహ సును దాని పొలమును కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి.౹ గాదు గోత్రికుల నుండి నాలుగు పట్టణములును, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును మహనయీమును దాని పొలమును హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి.౹ వారి వారి వంశములచొప్పున, అనగా లేవీయుల మిగిలిన వంశములచొప్పున అవన్నియు మెరారీయులకు కలిగిన పట్టణములు. వంతుచీటివలన వారికి కలిగిన పట్టణములు పండ్రెండు. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణములన్నియు నలువది యెనిమిది.౹ ఆ పట్టణములన్నిటికి పొలములుండెను. ఆ పట్టణములన్నియు అట్లేయుండెను.౹ యెహోవా ప్రమాణము చేసి వారి పితరుల కిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయుల కప్పగించెను. వారు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి.౹ యెహోవావారి పితరులతో ప్రమాణముచేసిన వాటన్నిటి ప్రకారము అన్నిదిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవావారి శత్రువులనందరిని వారి చేతి కప్పగించియుండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలీయులయెదుట నిలువలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను. యెహోషువ రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపువారిని పిలిపించి వారితో ఇట్లనెను –యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించినదంతయు మీరు చేసియున్నారు. మరియు నేను మీ కాజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట వినియున్నారు.౹ బహుదినములనుండి నేటివరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞననుసరించి నడిచియున్నారు.౹ ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి యున్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్లుడి.౹ అయితే మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయనమార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి.౹ అతడీలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్లనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును, యెహోషువ పడమటిదిక్కున యొర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యము లిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్లనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను –మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోను వెండితోను బంగారుతోను ఇత్తడితోను ఇనుముతోను అతివిస్తారమైన వస్త్రములతోను తిరిగి మీ నివాసములకు వెళ్లుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులును కలిసి పంచు కొనుడి. కాబట్టి రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధ గోత్రపువారును యెహోవా మోషేద్వారా సెలవిచ్చిన మాటచొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్యభూమి యైన గిలాదులోనికి వెళ్లుటకు కనాను దేశమందలి షిలో హులోనున్న ఇశ్రాయేలీయుల యొద్దనుండి బయలుదేరిరి. కనానుదేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చి నప్పుడు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధ గోత్రపువారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే.౹ అప్పుడు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల యెదుటివైపున యొర్దానుప్రదేశములో కనానుదేశము నెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను.౹ ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధగోత్రపువారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి.౹ ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని, అనగా పదిమంది ప్రధానులను అతనితోకూడ పంపిరి, వారందరు ఇశ్రాయేలీయుల సమూహములలో తమతమపితరుల కుటుంబములకు ప్రధానులు.౹ వారు గిలాదుదేశములోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధ గోత్రపువారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి –యెహోవా సర్వ సమాజపువారు చెప్పుచున్నదేమనగా–నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని, ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేల తిరుగుబాటు చేయుచున్నారు? పెయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టెను గదా నేటివరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకయున్నాము.౹ మీరు ఈ దినమున యెహోవా వెంబడినుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగబడి ద్రోహము చేసెదరేమి? ఆలాగైతే ఆయన ఇకమీదట ఇశ్రాయేలీయుల సర్వసమాజముమీద కోపపడును గదా? మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండినయెడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మామధ్యను స్వాస్థ్యము తీసికొనుడి, మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగబడకుడి, మా మీద తిరుగబడకుడి,౹ జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దానివిషయములో తిరుగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మీదికి కోపము రాలేదా? తన దోషమువలన ఆ మనుష్యుడొకడే మరణమాయెనా? అందుకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపువారును ఇశ్రాయేలీయుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా –దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు; సంగతి ఆయనకు తెలియును, ఇశ్రాయేలీయులు తెలిసికొందురు, ద్రోహము చేతనైనను యెహోవామీద తిరుగుబాటుచేతనైనను మేము ఈ పని చేసినయెడల నేడు మమ్ము బ్రదుకనియ్యకుడి.౹ యెహోవాను అనుసరింపక తొలగిపోయి, దహనబలినైనను నైవేద్యమునైనను దానిమీద అర్పించుటకేగాని సమాధానబలులను దానిమీద అర్పించుటకేగాని మేము ఈ బలిపీఠమును కట్టినయెడల యెహోవా తానే విమర్శచేయునుగాక. వేరొక హేతువుచేతనే ఈ బలిపీఠమును కట్టితిమి.౹ ఏమనగా రాబోవుకాలమున మీ సంతానపు వారు మా సంతానపువారితో–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెనుగదా యెహోవాయందు మీకు పాలేదియు లేదని చెప్పుటవలన మీ సంతానపువారు మా సంతానపువారిని యెహోవా విషయములో భయభక్తులులేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువుచేతనే దీని చేసితిమి.౹ కాబట్టి మేము–మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పు కొంటిమి; అది దహనబలులనర్పించుటకైనను బలినర్పిం చుటకైనను కాదు.౹ మన దహనబలుల విషయములోను బలుల విషయములోను సమాధానబలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవచేయవలయు ననుటకు–యెహోవాయందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతివారు మా సంతతివారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన మన తరములవారికిని మధ్య సాక్షియైయుండును.౹ అందుకు మేము–ఇకమీదట వారు మాతోనేగాని మా తరముల వారితోనేగాని అట్లు చెప్పినయెడల మేము–మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి; యిది దహనబలినర్పించుటకు కాదు బలినర్పించుటకు కాదు గాని, మాకును మీకును మధ్యసాక్షియై యుండుటకే యని చెప్పుదమని అనుకొంటిమి.౹ ఆయన మందిరము నెదుట నున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహనబలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయినయెడలనేమి యెహోవామీద ద్రోహము చేసినయెడలనేమి మేము శాపగ్రస్తులమగుదుము గాక. ఫీనెహాసను యాజకుడును సమాజ ప్రధానులును, అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులును రూబేనీయులును గాదీయులును మనష్షీయులును చెప్పిన మాటలను విని సంతోషించిరి.౹ అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసు రూబేనీయులతోను గాదీయులతోను మనష్షీయులతోను–మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము; ఇప్పుడు మీరు యెహోవా చేతిలోనుండి ఇశ్రాయేలీయులను విడిపించియున్నారని చెప్పెను. యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసును ప్రధానులును గిలాదులోని రూబేనీయుల యొద్దనుండియు, గాదీయుల యొద్దనుండియు ఇశ్రాయేలీయుల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా ఇశ్రాయేలీయులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి, రూబేనీయులును గాదీయులును నివసించు దేశమును పాడుచేయుటకు వారిమీద యుద్ధము చేయుట మానిరి.౹ రూబేనీయులును గాదీయులును యెహోవాయే దేవుడనుటకు ఇది మనమధ్యను సాక్షియగు నని దానికి ఏద అను పేరు పెట్టిరి. చుట్టునున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండ యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగ జేసినమీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములుగల వృద్ధుడాయెను.౹ అప్పుడతడు ఇశ్రాయేలీయులనందరిని వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను–నేను బహు సంవ త్సరములు గడచిన ముసలివాడను.౹ మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్తజనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే.౹ చూడుడి, యొర్దాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రమువరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యముమధ్య మిగిలియున్న యీ జనముల దేశమును మీకు వంతుచీట్లవలన పంచిపెట్టితిని.౹ మీ దేవుడైన యెహోవాయే వారిని మీ యెదుట నిలువకుండ వెళ్లగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీన పరచుకొందురు.౹ కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసికొని, యెడమకుగాని కుడికిగాని దానినుండి తొలగిపోక మీయొద్ద మిగిలియున్న యీ జనుల సహవాసము చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటివరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని యుండవలెను.౹ యెహోవా బలముగల గొప్ప జనములను మీ యెదుటనుండి కొట్టివేసియున్నాడు, మీ యెదుట నేటివరకును ఏ మనుష్యుడును నిలిచియుండలేదు.౹ మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటచొప్పున తానే మీకొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు వేయిమందిని తరుమును కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే మీరు వెనుకకు తొలగి మీయొద్ద మిగిలియున్న యీ జనములను హత్తుకొని వారితో వియ్యమంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసినయెడల మీ దేవుడైన యెహోవా మీ యెదుటనుండి యీ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి దేశములో ఉండకుండ మీరు నశించువరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కలమీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్లుగాను ఉందురు.౹ ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్లుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచిమాటలన్ని టిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవ పూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.౹ అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన యీ మంచి దేశములో ఉండకుండ ఆయన మిమ్ము నశింపజేయువరకు యెహోవా మీ మీదికి కీడంతయు రాజేయును.౹ మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరించినయెడల యెహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకిచ్చిన యీ మంచి దేశములో నుండకుండ మీరు శీఘ్రముగా నశించి పోవుదురు. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరిని షెకెములో పోగుచేసి, వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి.౹ యెహోషువ జనులందరితో ఇట్లనెను–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా చెప్పునదేమనగా–ఆదికాలమునుండి మీపితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి.౹ అయితే నేను నది అద్దరినుండి మీపితరుడైన అబ్రాహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతట సంచరింపజేసి, అతనికి సంతానమును విస్తరింపజేసి, అతనికి ఇస్సాకును ఇచ్చితిని.౹ ఇస్సాకునకు నేను యాకోబు ఏశావుల నిచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరచుకొనునట్లు వాటిని ఏశావు కిచ్చితిని. యాకోబును అతని కుమారులును ఐగుప్తులోనికి దిగిపోయిరి.౹ తరువాత నేను మోషే అహరోనులను పంపి, దానిమధ్యను నేను చేసిన క్రియలవలన ఐగుప్తీయులను హతముచేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని.౹ నేను ఐగుప్తులోనుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోను రౌతులతోను మీ తండ్రులను ఎఱ్ఱసముద్రమువరకు తరిమిరి.౹ వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారిమీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసినదానిని మీరు కన్నులార చూచితిరి. అటుతరువాత మీరు బహు దినములు అరణ్యములో నివసించితిరి.౹ యొర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు వారు మీతో యుద్ధముచేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని, మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిరి, వారు మీ యెదుట నిలువకుండ వారిని నశింపజేసితిని.౹ తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసి మిమ్ము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చెను. అతనిచేతినుండి నేనే మిమ్మును విడిపించితిని.౹ మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులగు అమోరీయులు పెరిజ్జీయులు కనానీయులు హిత్తీయులు గిర్గాషీయులు హివ్వీయులు యెబూసీయులనువారు మీతో యుద్ధముచేయగా నేను వారిని మీ చేతికప్పగించితిని.౹ మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని; నీ ఖడ్గము కాదు నీ విల్లుకాదుగాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేసెను. మీరు సేద్యముచేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకిచ్చియున్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్షతోటల పండ్లను ఒలీవతోటల పండ్లను తినుచున్నారు.౹ కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీపితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి.౹ యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీపితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.౹ అందుకు ప్రజలు–యెహోవాను విసర్జించి యితరదేవతలను సేవించినయెడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక.౹ ఐగుప్తుదేశమను దాసుల గృహములోనుండి మనలను మన తండ్రులను రప్పించి, మన కన్నులయెదుట ఆ గొప్ప సూచకక్రియలను చేసి, మనము నడిచిన మార్గములన్నిటిలోను, మనము వెళ్లిన ప్రజలందరిమధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు.౹ యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరు మనయెదుట నిలువకుండ వారిని తోలివేసినవాడు; యెహోవానే సేవించెదము; ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు యెహోషువ–యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషముగల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింప లేరు.౹ మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించినయెడల ఆయన మీకు మేలుచేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడుచేసి మిమ్మును క్షీణింప జేయుననగా జనులు–అట్లు కాదు, మేము యెహోవానే సేవించెదమని యెహోషువతో చెప్పిరి.౹ అప్పుడు యెహోషువ–మీరు యెహోవానే సేవించెదమని ఆయనను కోరు కొన్నందుకు మిమ్మునుగూర్చి మీరే సాక్షులై యున్నా రనగా వారు–మేము సాక్షులమే అనిరి.౹ అందుకతడు— ఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను.౹ అందుకు జనులు–మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్రగ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధస్థలములోనున్న సింధూర వృక్షముక్రింద దాని నిలువబెట్టి జనులందరితో ఇట్లనెను–ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాతికి వినబడెను గనుక అది మనమీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించినయెడల అది మీమీద సాక్షిగా ఉండును.౹ అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్లనంపెను. ఈ సంగతులు జరిగినతరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ నూటపది సంవత్సరముల వయస్సుగలవాడై మృతినొందెను.౹ అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిమీయుల మన్యములోని గాయషు కొండకు ఉత్తర దిక్కున నున్నది. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి.౹ ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను.౹ మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతినొందినప్పుడు ఎఫ్రాయీమీయుల మన్యప్రదేశములో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్య బడిన ఫీనెహాసుగిరిలో జనులు అతని పాతిపెట్టిరి. యెహోషువ మృతినొందిన తరువాత ఇశ్రాయేలీయులు–కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థనచేయగా యెహోవా–ఆ దేశమును యూదావంశస్థుల కిచ్చియున్నాను, వారు పోవలెనని సెలవిచ్చెను.౹ అప్పుడు యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో–మనము కనానీయులతో యుద్ధము చేయుటకు–మా వంతులోనికి మాతోకూడ రండి, మేమును మీతోకూడ మీ వంతులోనికి వచ్చెదమని చెప్పగా షిమ్యోనీయులు వారితోకూడ పోయిరి.౹ కనానీయులమీదికి యూదావంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారి కప్పగించెను గనుక వారు బెజెకులో పదివేలమంది మనుష్యులను హతముచేసిరి.౹ వారు బెజెకులో అదోనీ బెజెకును చూచి వానితో యుద్ధముచేసి కనానీయులను పెరిజ్జీయులను హతముచేసిరి.౹ అదోనీ బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలుచేతుల బొట్టన వ్రేళ్లను కోసివేసిరి.౹ అప్పుడు అదోనీ బెజెకు–తమ కాళ్లు చేతుల బొట్టనవ్రేళ్లు కోయబడిన డెబ్బదిమంది రాజులు నా భోజనపు బల్లక్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొనిరాగా అతడు అక్కడ చనిపోయెను. యూదావంశస్థులు యెరూషలేముమీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చి వేసిరి.౹ తరువాత యూదావంశస్థులు మన్యములయందును దక్షిణదేశమందును లోయయందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి.౹ మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయులమీదికి పోయి, షేషయిని అహీమానును తల్మయిని హతముచేసిరి.౹ ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడనుండి వారు దెబీరు నివాసులమీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్సేఫెరు.౹ కాలేబు–కిర్యత్సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.౹ ఆమె తన పెనిమిటి యింట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు–నీకేమి కావలెనని యడిగెను అందుకామె–దీవెన దయచేయుము; నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడ నాకు దయచేయుమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. మోషే మామయైన కేయిను కుమారులు యూదా వంశస్థులతోకూడ ఖర్జూరచెట్ల పట్టణములోనుండి అరాదు దక్షిణదిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి.౹ యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతోకూడ పోయి జెఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలముచేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి.౹ యూదావంశస్థులు గాజాను దాని ప్రదేశమును అష్కె లోనును దాని ప్రదేశమును ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి.౹ యెహోవా యూదావంశస్థులకు తోడై యున్నందునవారు మన్యదేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించువారికి ఇనుపరథములున్నందున వారిని వెళ్లగొట్టలేకపోయిరి.౹ మోషే చెప్పినట్లువారు కాలేబుకు హెబ్రోను నియ్యగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడనుండి పారదోలి దానిని స్వాధీన పరచుకొనెను.౹ యెరూషలేములో నివసించు యెబూసీ యులను బెన్యామీనీయులు వెళ్లగొట్టలేదు; యెబూసీయులు బెన్యామీనీయులతోకూడ నేటివరకు యెరూషలేములో నివసించుచున్నారు. యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవావారికి తోడైయుండెను.౹ పూర్వము లూజనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా ఆ వేగులవారు ఆ పట్టణమునుండి ఒకడు వచ్చుట చూచి–నీవు దయచేసి యీ పట్టణములోనికి వెళ్లు త్రోవను మాకు చూపినయెడల మేము మీకు ఉపకారము చేసెదమని చెప్పిరి.౹ అతడు పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరిగాని ఆ మనుష్యుని వాని కుటుంబికుల నందరిని పోనిచ్చిరి.౹ ఆ మనుష్యుడు హిత్తీయుల దేశమునకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరుపెట్టెను. నేటివరకు దానికదే పేరు. మనష్షీయులు బేత్షెయానును దాని పల్లెలను, తయి నాకును దాని పల్లెలను, దోరునివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను, స్వాధీనపరచుకొనలేదు; ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పెట్టియుండిరి.౹ ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టలేదు. ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్లగొట్టలేదు, గెజెరులో కనానీయులు వారిమధ్యను నివసించిరి.౹ జెబూలూనీయులు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు, కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టిపనులు చేయువారైరి.౹ ఆషేరీయులు అక్కో నివాసులను సీదోను నివాసులను అహ్లాబు వారిని అక్జీబువారిని హెల్బావారిని ఆఫెకువారిని రెహోబు వారిని ఆషేరీయులు దేశనివాసులైన కనానీయులను వెళ్లగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బేత్షెమెషు వారిని బేతనాతువారిని వెళ్లగొట్టలేదుగాని బేత్షెమెషు నివాసులచేతను బేతనాతు నివాసులచేతను వెట్టి పనులు చేయించుకొనిరి.౹ అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనియ్యక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి.౹ అమోరీయులు అయ్యాలోను నందలి హెరెసు కొండలోను షయల్బీములోను నివసింపవలెనని గట్టిపట్టు పెట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారిచేత వెట్టిపనులు చేయించుకొనిరి అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సెలావరకు వ్యాపించెను. యెహోవాదూత గిల్గాలునుండి బయలుదేరి బోకీమునకువచ్చి యీలాగు సెలవిచ్చెను–నేను మిమ్మును ఐగుప్తులోనుండి రప్పించి, మీపితరులకు ప్రమాణముచేసిన దేశమునకు మిమ్మును చేర్చి–నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.౹ మీరు ఈ దేశనివాసులతో నిబంధన చేసి కొనకూడదు; వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితినిగాని మీరు నా మాటను వినలేదు.౹ మీరు చేసినపని యెట్టిది? కావున నేను–మీ యెదుటనుండి ఈ దేశనివాసులను వెళ్లగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను.౹ యెహోవాదూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి యేడ్చిరి; కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. యెహోషువ జనులను వెళ్లనంపినప్పుడు ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి.౹ యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రదికినవారై యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి.౹ నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ నూట పది సంవత్సరముల వయస్సుగల వాడై మృతినొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దు లోనున్న తిమ్నత్సెరహులో జనులతని పాతిపెట్టిరి.౹ అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయషుకొండకు ఉత్తరదిక్కున నున్నది. ఆ తరమువారందరు తమపితరులయొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి.౹ వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి.౹ కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచుకొనువారిచేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి.౹ యెహోవావారితో చెప్పినట్లు, యెహోవావారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవావారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవావారికొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొనువారి చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంక న్యాయాధిపతుల మాట వినక తమపితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గమునుండి త్వరగా తొలగి పోయి యితర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్క రించిరి; తమపితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లువారు నడవకపోయిరి.౹ తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారికొరకు న్యాయాధిపతులను పుట్టించి, ఆయా న్యాయాధిపతులకు తోడైయుండి వారి దినములన్నిటను వారిశత్రువుల చేతులలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను.౹ ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి యితర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుటవలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వికులకంటె మరి మిగుల చెడ్డవారైరి.౹ కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండగా ఆయన ఈలాగు సెలవిచ్చెను–ఈ ప్రజలు నా మాట వినక, వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిననుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిననుసరించి నడుచుదురో లేదో ఆ జనములవలన ఇశ్రాయేలీయులను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి యెదుటనుండి నేను వెళ్లగొట్టను.౹ అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతి కప్పగింపకయు శీఘ్రముగా వెళ్లగొట్ట కయు మాని వారిని ఉండనిచ్చెను. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగినయుద్ధములన్నిటిని చూడనివారందరిని శోధించి [2-4] ఇశ్రాయేలీయుల తరతరములవారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడనివారికి యుద్ధముచేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల జనులును, కనానీయులందరును, సీదోనీయులును, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులును, యెహోవా మోషేద్వారా తమ తండ్రుల కిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలిసికొనునట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను.౹ *** *** కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు ఎబూసీయులను జనులమధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లిచేసికొనుచు, వారి కుమారులకు తమ కుమార్తెల నిచ్చుచు, వారి దేవతలను పూజించుచు వచ్చిరి అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై, తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతాస్తంభములను పూజించిరి.౹ అందునుగూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద మండగా ఆయన అరా మ్నహరాయిముయొక్క రాజైన కూషన్రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరములు కూషన్రిషాతాయిమునకు దాసులుగానుండిరి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజుయొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయులకొరకు నియమించి వారిని రక్షించెను.౹ యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతనిచేతికప్పగించెను, అతడు కూషన్రిషాతాయిమును జయించెను.౹ అప్పుడు నలువది సంవత్సరములు దేశము నెమ్మదిపొందెను. అటుతరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతినొందెను. ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను.౹ అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొనిపోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూరచెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను.౹ ఇశ్రాయేలీయులు పదునెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి.౹ ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పని వాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు మూరెడు పొడవుగల రెండంచుల కత్తిని చేయించుకొని, తన వస్త్రములో తన కుడి తొడమీద దానిని కట్టుకొని, ఆ కప్పము మోయాబురాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు.౹ ఏహూదు ఆ కప్పము తెచ్చి యిచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి గిల్గాలు దగ్గరనున్న పెసీలీమునొద్దనుండి తిరిగి వచ్చి— రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలె ననగా అతడు–తనయొద్ద నిలిచినవారందరు వెలుపలికి పోవువరకు ఊరకొమ్మని చెప్పెను.౹ ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండియుండెను. ఏహూదు–నీతో నేను చెప్ప వలసిన దేవునిమాట ఒకటి యున్నదని చెప్పగా అతడు తన పీఠముమీదనుండి లేచెను.౹ అప్పుడు ఏహూదు తన యెడమచేతిని చాపి తన కుడి తొడమీదనుండి ఆ కత్తి తీసి కడుపుమీద అతని పొడిచెను.౹ పిడియును కత్తివెంబడి దూరగా క్రొవ్వుకత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను, అది వెనుకనుండి బయటికి వచ్చి యుండెను.౹ అప్పుడు ఏహూదు పంచపాళిలోనికి బయలువెళ్లి తన వెనుకను ఆ మేడగది తలుపువేసి గడియ పెట్టెను.౹ అతడు బయలువెళ్లిన తరువాత ఆ రాజు దాసులు లోపలికివచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసియుండెను గనుక వారు–అతడు చల్లని గదిలో శంకానివర్తికి పోయియున్నాడనుకొని తాము సిగ్గువింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను.౹ వారు తడవు చేయుచుండగా ఏహూదు తప్పించుకొని పెసీలీమును దాటి శెయీరాకు పారి పోయెను.౹ అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూరను ఊదగా ఇశ్రాయేలీయులు మన్యప్రదేశమునుండి దిగి అతని యొద్దకు వచ్చిరి.౹ అతడు వారికి ముందుగా సాగి వారితో–నా వెంబడి త్వరగా రండి; మీ శత్రువు లైన మోయాబీయులను యెహోవా మీ చేతి కప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యొర్దాను రేవులను పట్టుకొని యెవనిని దాటనియ్యలేదు.౹ ఆ కాలమునవారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను పదివేలమందిని చంపిరి; ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతిక్రింద అణపబడగా దేశము ఎనుబది సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. అతనితరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో ఆరువందలమందినిమునుకోల కఱ్ఱతో హతముచేసెను; అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. ఏహూదు మరణమైనతరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనానురాజైన యాబీనుచేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా.౹ అతనికి తొమ్మిదివందల ఇనుపరథము లుండెను. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధపెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి. ఆ కాలమున లప్పీదోతునకు భార్యయైన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను.౹ ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమెయొద్దకు వచ్చుచుండిరి.౹ ఆమె నఫ్తాలి కెదెషులోనుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను–నీవువెళ్లి నఫ్తాలీయులలోను జెబూలూనీయులలోను పదివేలమంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము;౹ నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతియైన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటియొద్దకు కూర్చి నీ చేతికి అత నిని అప్పగించెదనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా? అని దెబోరా చెప్పగా బారాకు —నీవు నాతోకూడ వచ్చినయెడల నేను వెళ్లెదనుగాని నీవు నాతోకూడ రాని యెడల నేను వెళ్లనని ఆమెతో చెప్పెను.౹ అప్పుడు ఆమె–నీతో నేను అగత్యముగా వచ్చెదను; అయితే నీవుచేయు ప్రయాణమువలన నీకు ఘనతకలుగదు, యెహోవా ఒక స్త్రీచేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతోకూడ కెదెషునకు వెళ్లెను.౹ బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుష్యులు అతనివెంట వెళ్లిరి;౹ దెబోరాయు అతనితోకూడ పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామయైన హోబాబు సంతతివారైన కయీనీయులనుండి వేరు పడి కెదెషునొద్దనున్న జయనన్నీములోని మస్తకివృక్షము నొద్ద తన గుడారమును వేసికొనియుండెను.౹ అబీనో యము కుమారుడైన బారాకు తాబోరుకొండమీదికిపోయెనని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటిని తన తొమ్మిదివందల ఇనుప రథములను అన్యుల హరోషెతునుండి కీషోను వాగువరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా దెబోరా–లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరునుగదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు కొండమీదినుండి దిగి వచ్చెను.౹ బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను.౹ బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతువరకు తరుమగా సీసెరాయొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలియుండలేదు హాసోరురాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్యయైన యాయేలు గుడారమునకు పారిపోయెను.౹ అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొన బోయి అతనిని చూచి —నా యేలినవాడా నాతట్టు తిరుగుము, తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను.౹ ఆమె గొంగళితో అతని కప్పగా అతడు–దప్పికొనియున్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్లిమ్మని ఆమెనడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు–గుడారపు ద్వారమున నిలిచి యుండుము; ఎవడేకాని లోపలికివచ్చి–యిక్కడ నెవడైననున్నాడా అని నిన్నడిగినయెడల నీవు —ఎవడును లేడని చెప్పవలెననెను.౹ పిమ్మట హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు తీసికొని సుత్తె చేతపట్టుకొని అతనియొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చి–రమ్ము, నీవు వెదకుచున్న మనుష్యుని నీకు చూపిం చెదననగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడియుండెను, ఆ మేకు అతని కణతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయులయెదుట కనానురాజైన యాబీనును అణచెను.౹ తరువాత వారు కనానురాజైన యాబీనును సంహరించువరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనానురాజైన యాబీనుకు విరోధముగా అంత కంతకు హెచ్చుచువచ్చెను. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయులలోయుద్ధశాలులు ధైర్యము కనుపరచిరి ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి యెహోవాకు గానముచేసెదను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను యెహోవా, నీవు శేయీరునుండి బయలుదేరినప్పుడు ఎదోము పొలమునుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములును వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలోనుండి ప్రవాహములు వచ్చెను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాసన్నిధిని సీనాయిలోనుండి ప్రవాహములు వచ్చెను. అనాతు కుమారుడైన షమ్గరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారు లాయెను ప్రయాణస్థులు చుట్టుత్రోవలలోనే నడిచిరి. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపువారు లేకపోయిరి ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను ఇశ్రాయేలీయులలో నలువదివేలమందికి ఒక కేడెమేగాని యీటెయేగాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి.వారియందు నాకు ప్రేమకలదు యెహోవాను స్తుతించుడి. తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రక టించుడి. విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము బారాకూ, కీర్తన పాడుము అబీనోయము కుమారుడా, లెమ్ము చెరపెట్టిన వారిని చెరపట్టుము. ప్రజలవీరులలో శేషించినవారును కూడి వచ్చిరి శూరులలో యెహోవా నాకు సహాయము చేయ వచ్చెను. అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులును నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులును మాకీరునుండి న్యాయాధిపతులును జెబూలూనీయులనుండి నాయకదండము వహించువారును వచ్చిరి. ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులును బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి రూబేనీయుల కాలువలయొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందల యీలలను వినుటకు నీ దొడ్లమధ్యను నీవేల నివసించితివి? రూబేనీయుల కాలువలయొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను దానీయులు ఓడలదగ్గర ఏల నిలిచిరి? ఆషేరీయులు సముద్రతీరమున తమ అఖాతములయొద్ద ఏల నిలిచిరి? జెబూలూనీయులు మరణభయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము నఫ్తాలీయులు భూమి మెట్టలమీద ప్రాణము తృణీక రించిరి. రాజులు వచ్చి యుద్ధముచేసిరి. మెగిద్దో కాలువలయొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధముచేసిరి. వెండి లాభము వారు తీసికొనలేదు నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధముచేసెను నక్షత్రములు తమ మార్గములలోనుండి సీసెరాతో యుద్ధముచేసెను. కీషోను వాగువెంబడి పురాతనపు వాగైన కీషోను వెంబడివారు కొట్టుకొనిపోయిరి. నా ప్రాణమా నీవు బలముపూని సాగుము. గుఱ్ఱముల డెక్కలు శూరులను త్రొక్కెను గుఱ్ఱములు ఎగసి యెగసి శూరులను త్రొక్కెను. యెహోవాదూత యిట్లనెను –మేరోజును శపించుడి దాని నివాసులమీద మహా శాపము నిలుపుడి యెహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతోకూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును గుడారములలోనుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహమడిగెను ఆమె పాలు తెచ్చియిచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మీగడ దెచ్చియిచ్చెను ఆమె మేకును చేతపట్టుకొనెను పనివాని సుత్తెను కుడిచేతపట్టుకొని సీసెరాను కొట్టెను వాని తలను ఆమె పగులగొట్టెను ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడి పరుండెను ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడెను అతడు ఎక్కడ క్రుంగెనో అక్కడనే పడిచచ్చెను. సీసెరా తల్లి కిటికీలోనుండి చూచెను అల్లిక కిటికీలోనుండి చూచి కేకలు వేసెను రాక, అతని రథము తడవుచేయనేల? అతని రథముల చక్రములు ఆలస్యముచేయనేల? ఆమెయొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను— వారికి దొరకెను గదా? దోపుడుసొమ్ము పంచుకొనుచున్నారు గదా? యోధులందరు తలాయొక స్త్రీని తీసికొందురు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు సీసెరాకు రంగువేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరకును రంగువేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరకును రెండువైపుల రంగువేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనినవారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరకును. యెహోవా నీ శత్రువులందరు ఆలాగుననే నశించెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు అనిపాడిరి. తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా యేడేండ్లు వారిని మిద్యానీయుల కప్ప గించెను.౹ మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయులమీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులయెదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యా నీయులును అమాలేకీయులును తూర్పుననుండు వారును తమ పశువులను గుడారములను తీసికొని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి వారి యెదుట దిగి, గాజాకు పోవునంతదూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొఱ్ఱెనుగాని యెద్దునుగాని గాడిదనుగాని జీవనసాధనమైన మరిదేనినిగాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు.౹ వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను.౹ దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి. మిద్యానీయులవలని బాధనుబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయులయొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెను — ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా–నేను ఐగుప్తులోనుండి మిమ్మును రప్పించి, దాసుల గృహములోనుండి మిమ్మును తోడుకొని వచ్చితిని.౹ ఐగుప్తీయుల చేతిలోనుండియు మిమ్మును బాధించిన వారందరిచేతిలోనుండియు మిమ్మును విడిపించి, మీ యెదుటనుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని; మీ దేవుడనైన యెహోవాను నేనే.౹ మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితినిగాని మీరు నా మాట వినకపోతిరి. యెహోవాదూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవా షునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లుగానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా యెహోవాదూత అతనికి కనబడి–పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనగా గిద్యోను–చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.౹ అంతట యెహోవా అతనితట్టు తిరిగి–బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షిం పుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు —చిత్తము నా యేలినవాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా–అయిన నేమి? నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను.౹ అందుకతడు–నాయెడల నీకు కటాక్షము కలిగినయెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలిసి కొనునట్లు ఒక సూచన కనుపరచుము.౹ నేను నీయొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడనుండి వెళ్లకుమీ అని వేడుకొనగా ఆయన–నీవు తిరిగి వచ్చువరకు నేను ఉండెదననెను.౹ అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లనుకుండలో పోసి ఆయనకొరకు ఆ మస్తకివృక్షముక్రిందికి దానిని తీసికొనివచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతిమీద పెట్టి— నీళ్లు పోయుమని అతనితో చెప్పెను.౹ అతడాలాగుచేయగా యెహోవాదూత తన చేతనున్న కఱ్ఱను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోనుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను, అంతట యెహోవాదూత అతనికి అదృశ్య మాయెను.౹ గిద్యోను ఆయన యెహోవాదూత అని తెలిసికొని–అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవాదూతను చూచితిననెను.౹ అప్పుడు యెహోవా–నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను.౹ అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠముకట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను. నేటివరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. మరియు ఆ రాత్రియందే యెహోవా–నీ తండ్రి కోడెను, అనగా ఏడేండ్ల రెండవ యెద్దును తీసికొని వచ్చి, నీ తండ్రికట్టిన బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి, దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి తగిన యేర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠముకట్టి, ఆ రెండవ కోడెను తీసికొనివచ్చి నీవు నరికిన ప్రతిమయొక్క కఱ్ఱతో దహనబలి నర్పించుమని అతనితో చెప్పెను.౹ కాబట్టి గిద్యోను తన పనివారిలో పదిమందిని తీసికొనివచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరివారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేసెను.౹ ఆ ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలుయొక్క బలిపీఠము విరుగగొట్టబడియుండెను, దానికి పైగా నున్న దేవతాస్తంభమును పడద్రోయబడి యుండెను, కట్టబడిన ఆ బలిపీఠముమీద ఆ రెండవ యెద్దు అర్పింప బడి యుండెను.౹ అప్పుడు వారు–ఈ పని యెవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణచేసి వెదకి, యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పనిచేసినట్టు తెలిసికొనిరి.౹ కాబట్టి ఆ ఊరివారు–నీ కుమారుడు బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో–మీరు బయలు పక్షముగా వాదింతురా? మీరు వాని రక్షించుదురా? వానిపక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను; ఎవడో వాని బలిపీఠమును విరుగగొట్టెను గనుక, వాడు దేవతయైనందున తన పక్షమున తానేవాదించ వచ్చును.౹ ఒకడు తన బలిపీఠమును విరుగ గొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టెను. మిద్యానీయులందరును అమాలేకీయులందరును తూర్పు వారందరును కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతని యొద్దకు వచ్చిరి.౹ అతడు మనష్షీ యులందరియొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతనియొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు జెబూలూను నఫ్తాలి గోత్రములవారియొద్దకు దూతలను పంపగా వారును కూడినవారిని ఎదుర్కొనుటకు వచ్చిరి.౹ అప్పుడు గిద్యోను —నీవు సెలవిచ్చినట్లు నాచేత ఇశ్రాయేలీయులను రక్షింప నుద్దేశించినయెడల నేను కళ్లమున గొఱ్ఱెబొచ్చు ఉంచినతరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొఱ్ఱెబొచ్చుమీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను.౹ ఆలాగున జరిగెను; అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండువరకు ఆ బొచ్చునుండి మంచును పిండెను.౹ అప్పుడు గిద్యోను–నీ కోపము నా మీద మండనియ్యకుము; ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటిమీద మంచు పడియుండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు ఆలాగున చేసెను; నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చుమాత్రమే పొడిగానుండెను. అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళెము వారికి కనబడెను.౹ యెహోవా —నీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారిచేతికి మిద్యానీయులను అప్పగింపతగదు; ఇశ్రాయేలీయులు— నా బాహుబలము నాకు రక్షణ కలుగచేసికొనెననుకొని నామీద అతిశయించుదురేమో.౹ కాబట్టి నీవు–ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచితిరిగి వెళ్లవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలోనుండి ఇరువది రెండువేలమంది తిరిగి వెళ్లిపోయిరి. పదివేలమంది నిలిచియుండగా యెహోవా–ఈ జను లింక ఎక్కువమంది, నీళ్లయొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీకొరకు వారిని శోధించెదను. ఇతడు నీతోకూడ పోవలెనని నేను ఎవనిగూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను; ఇతడు నీతో పోకూడదని యెవనిగూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను.౹ అతడు నీళ్లయొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా–కుక్కగతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకుమోకాళ్లూని క్రుంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను.౹ చేతితో నోటికందించుకొని గతికినవారిలెక్క మూడు వందలమంది; మిగిలిన జనులందరు నీళ్లు త్రాగుటకు మోకాళ్లూని క్రుంగిరి.౹ అప్పుడు యెహోవా–గతికిన మూడు వందల మనుష్యులద్వారా మిమ్మును రక్షించెదను; మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను; జనులందరు తమతమ చోట్లకు వెళ్లవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను.౹ ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరిని తమ గుడారములకు వెళ్లనంపెనుగాని ఆ మూడువందలమందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను–నీవు లేచి దండుమీదికి పొమ్ము, నీ చేతికి దాని నప్పగించెదను.౹ పోవుటకు నీకు భయమైనయెడల నీ పనివాడైన పూరాతోకూడ దండుకు దిగిపొమ్ము.౹ వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీచేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పని వాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి.౹ మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతలవలె ఆ మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న యిసుక రేణువులవలె లెక్కలేనివై యుండెను.౹ గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా–నేనొక కలగంటిని, అదేమనగా యవలరొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి యొక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను.౹ అందుకు వాని చెలికాడు–అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమేగాని మరేమికాదు; దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతనిచేతికి అప్పగింప బోవుచున్నాడని ఉత్తరమిచ్చెను. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్లి–లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ మూడువందలమందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆకుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను–నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి;౹ ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలెను.౹ నేనును నాతో నున్నవారందరును బూరలను ఊదునప్పుడు మీరును దండు పాళెమంతటిచుట్టు బూరలను ఊదుచు–యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయ వలెనని చెప్పెను. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరుమందియు దండుపాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్నకుండలను పగులగొట్టిరి.౹ అట్లు ఆ మూడు గుంపులవారు బూరలను ఊదుచు ఆకుండలను పగులగొట్టి, యెడమచేతులలో దివిటీలను కుడిచేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని–యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలువేసిరి.౹ వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టు నిలిచియుండగా ఆ దండువారందరును పరుగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి.౹ ఆ మూడువందలమంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతువైపున నున్న బేత్షిత్తావరకు తబ్బాతునొద్దనున్న ఆబేల్మెహోలా తీరమువరకు పారిపోగా నఫ్తాలి గోత్రములోనుండియు, ఆషేరు గోత్రములోనుండియు, మనష్షే గోత్రమంతటిలోనుండియు పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి.౹ గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికిని దూతలను పంపి–మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి, బేత్బారావరకు వాగులను యొర్దానును వారికంటెముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను గనుక, ఎఫ్రాయిమీయులందరు కూడుకొని బేత్బారావరకు వాగులను యొర్దానును పట్టుకొనిరి.౹ మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అను ఇద్దరిని పట్టుకొని, ఓరేబు బండమీద ఓరే బును చంపిరి, జెయేబు ద్రాక్షల తొట్టియొద్ద జెయేబును చంపి మిద్యానీయులను తరుముకొనిపోయిరి. ఓరేబు జెయేబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోనునొద్దకు తెచ్చిరి. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో–నీవు మా యెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి.౹ అందుకతడు–మీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీ యెజెరు ద్రాక్షపండ్ల కోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిదికాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓర బును జెయేబును మీచేతికి అప్పగించెను; మీరు చేసినట్లు నేను చేయగలనా? అనెను.౹ అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను.౹ గిద్యోనును అతనితోనున్న మూడువందలమందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి.౹ అతడు–నా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా సుక్కోతు అధిపతులు— జెబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకనా మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలెనని యడిగిరి.౹ అందుకు గిద్యోను —ఈ హేతువు చేతను జెబహును సల్మున్నాను యెహోవా నా చేతికప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పెను.౹ అక్కడనుండి అతడు పెనూయేలునకు పోయి ఆలాగుననే వారితోను చెప్పగా సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలువారును అతని కుత్తరమిచ్చిరి గనుక అతడు –నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూ యేలువారితో చెప్పెను.౹ అప్పుడు జెబహును సల్ము న్నాయు వారితోకూడ వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలినయించుమించు పదునైదు వేలమంది మనుష్యులందరును కర్కోరులోనుండిరి. కత్తి దూయు నూట ఇరువదివేలమంది మనుష్యులు పడిపోయిరి.౹ అప్పుడు గిద్యోను నోబహుకును యొగేబ్బెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతముచేసెను.౹ జెబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జెబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను.౹ యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను హెరెసు ఎగువనుండి తిరిగి వచ్చి, సుక్కోతువారిలో ఒక యౌవనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బదియేడుగురు మనుష్యులను పేరు పేరుగా వివరించి చెప్పెను.౹ అప్పుడతడు సుక్కోతువారి యొద్దకు వచ్చి–జెబహు సల్మున్నా అను వారిచేతులు నీ చేతికి చిక్కినవి గనుకనా అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని మీరు ఎవరివిషయము నన్ను దూషించితిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరిపెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజెముడును తీసికొని వాటివలన సుక్కోతువారికి బుద్ధిచెప్పెను.౹ మరియు నతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరివారిని చంపెను.౹ అతడు–మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారు–నీవంటివారే, వారందరును రాజకుమారులను పోలియుండిరనగా అతడు–వారు నా తల్లి కుమారులు నా సహోదరులు; మీరు వారిని బ్రదుకనిచ్చినయెడల యెహోవా జీవముతోడు, మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్దకుమారుడైన యెతెరును చూచి–నీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు.౹ అప్పుడు జెబహు సల్మున్నాలు–ప్రాయముకొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జెబ హును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడలమీదనున్న చంద్రహారములను తీసికొనెను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో–నీవు మిద్యానీయుల చేతిలోనుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏల వలెనని చెప్పిరి.౹ అందుకు గిద్యోను–నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను.౹ మరియు గిద్యోను–మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్య వలెనని మనవిచేయుచున్నాననెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను.౹ అందుకు వారు–సంతోషముగా మేము వాటి నిచ్చెదమని చెప్పి యొక బట్టను పరచి ప్రతివాడును తన దోపుడుసొమ్ములోనుండిన పోగులను దానిమీద వేసెను.౹ మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల యెత్తు వెయ్యిన్ని ఏడువందల తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను.౹ కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని యింటివారికిని ఉరిగానుండెను.౹ మిద్యానీయులు ఇశ్రాయేలీయుల యెదుట అణపబడి అటుతరువాత తమ తలలను ఎత్తికొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన యింట నివసించుటకు పోయెను.౹ గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బదిమంది కుమారులు అతనికుండిరి.౹ షెకెములోనున్న అతని ఉపపత్నియు అతని కొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను.౹ యోవాషు కుమారుడైన గిద్యోను మహా వృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రియైన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టునుండు తమ శత్రువులచేతిలోనుండి తమ్మును విడి పించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనక మరల బయలుల ననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసికొనిరి.౹ మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకార మంతయు మరచి అతని యింటివారికి ఉపకారము చేయక పోయిరి. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరులయొద్దకుపోయి వారితోను తన తల్లి పితరుల కుటుంబికులందరితోను –మీరు దయచేసి షెకెము యజమానులందరు వినునట్లు వారితో మాటలాడి —మీకేది మంచిది? యెరుబ్బయలుయొక్క కుమారులైన డెబ్బదిమంది మనుష్యులందరు మిమ్మును ఏలుటమంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుటమంచిదా? నేను మీ రక్తసంబంధినని జ్ఞాపకముచేసికొనుడి అని పలుకుడనెను.౹ అతని తల్లి సహోదరులు అతనిగూర్చి షెకెము యజమా నులు వినునట్లు ఆ మాటలన్నియు చెప్పగా వారు–ఇతడు మన సహోదరుడనుకొని తమ హృదయము అబీమెలెకుతట్టు త్రిప్పుకొనిరి;౹ అప్పుడు వారు బయల్బెరీతు గుడిలోనుండి డెబ్బది తులముల వెండి తెచ్చి అతనికియ్యగా వాటితో అబీమెలెకు అల్లరిజనమును కూలికి పెట్టుకొనెను, వారు అతని వశముననుండిరి.౹ తరువాత అతడు ఒఫ్రాలో నున్న తన తండ్రి యింటికి పోయి యెరుబ్బయలు కుమారులును తన సహోదరులునైన ఆ డెబ్బదిమంది మనుష్యులను ఒక్క రాతిమీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించు కొనెను.౹ తరువాత షెకెము యజమానులందరును మిల్లో ఇంటివారందరును కూడివచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షముక్రింద దండు పాళెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి.౹ అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకొప్పున నిలిచి యెలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను–షెకెము యజమానులారా, మీరు నా మాట వినినయెడల దేవుడు మీ మాట వినును.౹ చెట్లు తమమీద రాజును ఒకనిని అభిషేకించు కొనవలెనను మనస్సుకలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవచెట్టు నడుగగా ఒలీవచెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యకమాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.౹ అప్పుడు చెట్లు–నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా అంజూరపు చెట్టు–చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా? అని వాటితో అనెను.౹ అటుతరువాత చెట్లు–నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.౹ అప్పుడు చెట్లన్నియు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్లపొదయొద్ద మనవిచేయగా ముండ్ల పొద–మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరినయెడల రండి నా నీడను ఆశ్రయించుడి; లేదా అగ్ని నాలోనుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను.౹ నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించెను.౹ అయితే మీరు నా తండ్రి కుటుంబముమీదికి లేచి, యొక రాతిమీద అతని కుమారులైన డెబ్బదిమంది మనుష్యులను చంపి, అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారిమీద అతనిని రాజుగా నియమించియున్నారు. యెరుబ్బయలు ఎడలను అతని యింటి వారియెడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించినయెడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని యింటివారి యెడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించినయెడల, అబీమెలెకునందు సంతోషించుడి అతడు మీయందు సంతోషించునుగాక.౹ లేనియెడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెమువారిని మిల్లో యింటి వారిని కాల్చివేయునుగాక, షెకెమువారిలోనుండియు మిల్లో యింటినుండియు అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను. అబీమెలెకు మూడు సంవత్సరములు ఇశ్రాయేలీయులమీద ఏలికయైయుండెను.౹ [23-24] అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని, అతడు తన సహోదరులను చంపునట్లు అతనిచేతులను బలపరచిన షెకెము యజమానులమీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్య వారిమీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమా నులు అబీమెలెకును వంచించిరి.౹ *** ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరములమీద అతని కొరకు మాటు గాండ్లను ఉంచి, ఆ మార్గమున తమకు సమీపించినవారినందరిని దోచుకొనిరి; అది అబీమెలెకునకు తెలుపబడెను. ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్రయించిరి.౹ వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతలమందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను–అబీమెలెకు ఏపాటివాడు? షెకెము ఏపాటివాడు? మనము అతనికెందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రియైన హమోరు వారికి దాసులమగుదముగాని మనము అతని కెందుకు దాసులము కావలెను? ఈ జనము నా చేతిలో ఉండినయెడల ఆహా నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను.౹ ఆ పట్టణ ప్రధానియైన జెబులు ఎబెదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను.౹ అప్పుడతడు అబీమెలెకు నొద్దకు రహస్యముగా దూతలను పంపి–ఇదిగో ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును షెకెముకు వచ్చియున్నారు, వారు నీమీదికి ఈ పట్టణమును రేపుచున్నారు.౹ కావున రాత్రి నీవును నీతోనున్న జనులును లేచి పొలములో మాటుగా నుండుడి,౹ ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణముమీద పడవలెను. అప్పుడు అతడును అతనితోనున్న జనులును నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారియెడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను. అబీమెలెకును అతనితోనున్న జనులందరును రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకెముమీద పడుటకు పొంచియుండిరి.౹ ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులును పొంచియుండుట చాలించి లేచిరి.౹ గాలు ఆ జనులను చూచి జెబులుతో–ఇదిగో జనులు కొండశిఖరములమీదనుండి దిగివచ్చుచున్నారనగా, జెబులు–కొండల చాయలు మనుష్యులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను.౹ గాలు–చూడుము, దేశపు ఎత్తయిన స్థలమునుండి జనులు దిగి వచ్చుచున్నారు; ఒక దండు శకునగాండ్ల మస్తకివృక్షపు త్రోవను వచ్చు చున్నదనెను.౹ జెబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడనిన నీమాట యేమాయెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను.౹ అబీమెలెకు అతని తరుమగా అతడు అతని యెదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి.౹ అప్పుడు అబీమెలెకు అరూమాలో దిగెను, గాలును అతని బంధువులును షెకెములో నివసింపకుండ జెబులు వారిని తోలివేసెను.౹ మరునాడు జనులు పొలములలోనికి బయలువెళ్లిరి.౹ అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసికొని మూడు తెగలుగాచేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి; అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారిమీదపడి వారిని హతముచేసెను.౹ అబీమెలెకును అతనితోనున్న తెగలును ఇంకసాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలములలోనున్న వారందరి మీదపడి వారిని హతముచేసిరి.౹ ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధముచేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. షెకెము గోపుర యజమానులందరు ఆ వార్త విని ఏల్ బెరీతు గుడియొక్క కోటలోనికి చొరబడిరి.౹ షెకెము గోపుర యజమానులందరు కూడియున్న సంగతి అబీమెలెకునకు తెలుపబడినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేతపట్టుకొని చెట్లనుండి పెద్దకొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొని–నేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను.౹ అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటివలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు, అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యిమంది చచ్చిరి. తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాని పట్టుకొనెను.౹ ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురముండగా స్త్రీ పురుషులును పట్టణపు యజమానులును అక్కడికి పారిపోయి తలుపులు వేసికొని గోపుర శిఖరము మీదికెక్కిరి.౹ అబీమెలెకు ఆ గోపురము నొద్దకు వచ్చి దానిమీదపడి యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపురద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరుగటి మీదిరాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను.౹ అప్పుడతడు తన ఆయుధములను మోయుబంటును త్వరగా పిలిచి–ఒక స్త్రీ అతని చంపెనని నన్నుగూర్చి యెవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడువగా అతడు చచ్చెను.౹ అబీమెలెకు చనిపోయెనని ఇశ్రాయేలీయులు తెలిసికొనినప్పుడు ఎవరిచోటికి వారు పోయిరి.౹ అట్లు అబీమెలెకు తన డెబ్బదిమంది సహోదరులను చంపుటవలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతనిమీదికి రప్పించెను.౹ షెకెమువారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలలమీదికి మరల రాజేసెను; యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారిమీదికి వచ్చెను. అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయి మీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు.౹ అతడు ఇరువదిమూడు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. అతని తరువాత గిలాదుదేశస్థుడైన యాయీరు నియమింపబడినవాడై యిరువదిరెండు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.౹ అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటివరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.౹ అవి గిలాదు దేశములోనున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్ ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి, బయలులు అష్తారోతులు అను సిరియనుల దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజిం చుచువచ్చిరి.౹ యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతలనున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీయులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి.౹ మరియు అమ్మోనీయులు యూదాదేశస్థులతోను బెన్యామీనీయులతోను ఎఫ్రాయి మీయులతోను యుద్ధముచేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను అప్పుడు ఇశ్రాయేలీయులు–మేము నీ సన్నిధిని పాపము చేసియున్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించియున్నామని యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా —ఐగుప్తీయుల వశములోనుండియు అమోరీయుల వశములోనుండియు అమ్మోనీయుల వశములోనుండియు ఫిలిష్తీయుల వశములోనుండియు మాత్రము గాక సీదోనీయులును అమాలేకీయులును మాయోనీయులును మిమ్మును బాధ పరచినప్పుడు వారి వశములోనుండియు నేను మిమ్మును రక్షించితిని గదా అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షిం పను.౹ పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొఱ్ఱపెట్టుకొనుడి; మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను.౹ అప్పుడు ఇశ్రాయేలీయులు–మేము పాపము చేసియున్నాము, నీ దృిష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము; దయచేసి నేడు మమ్మును రక్షింపుమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి యుండిరి. ఇశ్రాయేలీయులును కూడుకొని మిస్పాలో దిగియుండిరి.౹ కాబట్టి జనులు, అనగా గిలాదు పెద్దలు–అమ్మోనీయులతో యుద్ధముచేయ బూనుకొనువాడెవడో వాడు గిలాదు నివాసులకందరికిని ప్రధానుడగునని యొక నితో నొకడు చెప్పుకొనిరి. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమముగల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు; గిలాదు యెఫ్తాను కనెను.౹ గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్ద వారై యెఫ్తాతో–నీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రియింట నీకు స్వాస్థ్యము లేదనిరి.౹ యెఫ్తా తన సహోదరులయొద్దనుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరిజనము యెఫ్తాయొద్దకు వచ్చి అతనితోకూడ సంచరించుచుండెను. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబుదేశమునుండి యెఫ్తాను రప్పించుటకు పోయి–నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి.౹ అందుకు యెఫ్తా–మీరు నాయందు పగపెట్టి నా తండ్రి యింటనుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగినశ్రమలో మీరు నాయొద్దకు రానేల? అని గిలాదు పెద్దలతో చెప్పెను.౹ అప్పుడు గిలాదు పెద్దలు–అందుచేతనే మేము నీయొద్దకు మళ్లి వచ్చితిమి; నీవు మాతోకూడ వచ్చి అమ్మోనీయులతో యుద్ధముచేసినయెడల, గిలాదు నివాసులమైన మా అందరిమీద నీవు అధికారివవుదువని యెఫ్తాతో అనిరి.౹ అందుకు యెఫ్తా–అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసికొనిపోయినమీదట యెహోవావారిని నా చేతి కప్పగించినయెడల నేనే మీకు ప్రధానుడనవుదునా? అని గిలాదు పెద్దల నడుగగా గిలాదు పెద్దలు–నిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయుదుము; యెహోవా మన యుభయులమధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి.౹ కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతోకూడ పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి యంతయు వినిపించెను. యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలనుపంపి— నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చియున్నావని యడుగగా అమ్మోనీయుల రాజు–ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దానువరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించుమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను.౹ అంతట యెఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి యిట్లనెను –యెఫ్తా సెలవిచ్చినదేమనగా–ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు.౹ ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రమువరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి.౹ అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపి —నీ దేశము గుండ పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని యడుగగా, ఎదోమురాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరిగాని అతడును–నేను సెలవియ్యనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో నివసించిరి.౹ తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దుగదా.౹ మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనను హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి–నీ దేశముగుండ మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతనియొద్ద మనవిచేయగా సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక, తన దేశములోబడి వెళ్లనియ్యక, తన జనులనందరిని సమకూర్చుకొని యాహసులో దిగి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసెను.౹ అప్పుడు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీయుల చేతి కప్పగింపగా వారు ఆ జనమును హతముచేసిన తరువాత ఆ దేశనివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరచుకొని అర్నోను నది మొదలుకొని యబ్బోకువరకును అరణ్యము మొదలుకొని యొర్దానువరకును అమోరీయుల ప్రాంతములన్నిటిని స్వాధీనపరచుకొనిరి.౹ కాబట్టి ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా అమోరీయులను తన జనులయెదుట నిలువకుండ తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించు కొందువా? స్వాధీన పరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావుగదా? మా దేవుడైన యెహోవా మా యెదుటనుండి యెవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము.౹ మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకుకంటె నీవు ఏమాత్రమును అధికుడవు కావుగదా? అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనను కలహించెనా? ఎప్పుడైనను వారితో యుద్ధము చేసెనా? ఇశ్రాయేలీయులు హెష్బోనులోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరులలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను మూడు వందల సంవత్సరములనుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేల వాటిని పట్టుకొనలేదు? ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదుగాని నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుటవలన నాయెడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చును గాక.౹ అయితే అమ్మోనీయులరాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను.౹ అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కు కొనెను, ఎట్లనగా–నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినయెడల నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటిద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహనబలిగా దాని నర్పించెదననెను.౹ అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారియొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనిచేతికి వారినప్పగించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చువరకు ఆబేల్కెరామీమువరకును ఇరువది పట్టణముల వారిని నిశ్శేషముగా హతముచేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ అణచి వేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన యింటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేగాని ఆడుసంతానమేగానిలేదు.౹ కాబట్టి అతడు ఆమెను చూచి, తన బట్టలను చింపుకొని–అయ్యో నా కుమారీ, నీవు నన్ను బహుగా క్రుంగచేసితివి, నీవు నన్ను తల్లడింపచేయువారిలో ఒకతెవైయున్నావు; నేను యెహోవాకు మాట యిచ్చియున్నాను గనుక వెనుకతీయ లేననగా ఆమె–నా తండ్రీ, యెహోవాకు మాట యిచ్చి యుంటివా? నీ నోటినుండి బయలుదేరిన మాటచొప్పున నాకు చేయుము; యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయులమీద పగతీర్చుకొని యున్నాడని అతనితోననెను.౹ మరియు ఆమె–నాకొరకు చేయవలసినదేదనగా రెండు నెలలవరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలును పోయి కొండలమీద ఉండి, నా కన్యాత్వమునుగూర్చి ప్రలాపించెదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మనిచెప్పి రెండు నెలలవరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతోకూడ పోయి కొండలమీద తన కన్యాత్వమునుగూర్చి ప్రలాపించెను.౹ ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రియొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిచొప్పున ఆమెకు చేసెను.౹ ఆమె పురుషుని ఎరుగనేలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదుదేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధిచేయుటకద్దు. ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తరదిక్కునకు. పోయి–నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మునేల పిలువ లేదు? నీవు కాపురమున్న నీ యింటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా యెఫ్తా–నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మును పిలిచితినిగాని మీరు వారి చేతులలోనుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవావారిని నా చేతి కప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను.౹ అప్పుడు యెఫ్తా గిలాదువారినందరిని పోగుచేసికొని ఎఫ్రాయిమీయులతో యుద్ధముచేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారు–ఎఫ్రాయిమీయులకును మనష్షీ యులకునుమధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీ యులయెదుట నిలువక పారిపోయిన వారనిరి.౹ ఎఫ్రాయి మీయులతో యుద్ధముచేయుటకై గిలాదువారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీ యులలో ఎవడో–నన్ను దాటనియ్యుడని చెప్పినప్పుడు గిలాదువారు–నీవు ఎఫ్రాయిమీయుడవా అని అతని నడి గిరి.౹ అందుకతడు–నేను కాను అనినయెడల వారు అతని చూచి–షిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకొని యొర్దానురేవులయొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయి మీయులలో నలువది రెండువేలమంది పడిపోయిరి.౹ యెఫ్తా ఆరుసంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియైయుండెను. గిలాదువాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో నొకదానియందు పాతిపెట్టబడెను. అతని తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను.౹ అతనికి ముప్పదిమంది కుమారులును ముప్పదిమంది కుమార్తెలును ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరనివారికిచ్చి, తన వంశమునకు చేరని ముప్పదిమంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు ఏడేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను.౹ ఇబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతిపెట్టబడెను. అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను; అతడు పదియేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను.౹ జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలో నులో పాతిపెట్టబడెను. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను.౹ అతనికి నలువదిమంది కుమారులును ముప్పదిమంది మనుమలును ఉండిరి. వారు డెబ్బది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు. అతడు ఎనిమిదేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను.౹ పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను. ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిష్తీయులచేతికి అప్పగించెను. ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడునైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.౹ యెహోవాదూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై–ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపులేకపోయెను; అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు.౹ కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము.౹ నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటియొద్దకు వచ్చి —దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను; అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చెనో నేనడుగలేదు, అతడు తనపేరు నాతో చెప్పలేదు గాని–ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చని పోవువరకు దేవునికి నాజీరు చేయబడినవాడైయుండునని నాతో చెప్పెననెను.౹ అందుకు మానోహ–నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకువచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడు కొనగా దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను గనుక, ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవునిదూత ఆమెను దర్శించెను.౹ ఆ సమయమున ఆమె పెనిమిటియైన మానోహ ఆమె యొద్దయుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తి–ఆనాడు నాయొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను.౹ అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుష్యునియొద్దకు వచ్చి–ఈ స్త్రీతో మాటలాడినవాడవు నీవేనా అని అతని నడుగగా అతడు–నేనే అనెను.౹ అందుకు మానోహ–కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా యెహోవాదూత–నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను; ఆమె ద్రాక్షావల్లినుండి పుట్టినదేదియు తినకూడదు,౹ ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు, నేను ఆమె కాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మానోహతో చెప్పెను.౹ అప్పుడు మానోహ–మేము ఒక మేక పిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసికొనుచున్నామని యెహోవాదూతతో చెప్పగా యెహోవాదూత–నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను; నీవు దహనబలి అర్పించ నుద్దేశించినయెడల యెహోవాకు దాని నర్పింపవలెనని మానోహతో చెప్పెను. అతడు యెహోవాదూత అని మానోహకు తెలియలేదు.౹ మానోహ–నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమని యెహోవాదూతను అడుగగా యెహోవాదూత–నీ వేల నాపేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యముకాని దనెను.౹ అంతట మానోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసికొని యొక రాతిమీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక ఆశ్చర్య కార్యము చేసెను.౹ ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవాదూత బలిపీఠముమీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరో హణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి.౹ ఆ తరువాత యెహోవాదూత మానోహకును అతని భార్యకును మరెన్నడు ప్రత్య క్షము కాలేదు.౹ ఆయన యెహోవాదూత అని మానోహ తెలిసికొని–మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య–యెహోవా మనలను చంపగోరినయెడల ఆయన దహనబలిని నైవేద్యమును మనచేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను.౹ తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను.౹ మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. సమ్సోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను.౹ అతడు తిరిగి వచ్చి–తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తలిదండ్రులతో అనగా వారు–నీ స్వజనుల కుమార్తెలలోనేగాని నా జనులలోనేగాని స్త్రీ లేదనుకొని, సున్నతి పొందని ఫిలిష్తీయులలోనుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్లు చున్నావా? అని అతని నడిగిరి. అందుకు సమ్సోను–ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నాకొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను.౹ అయితే ఫిలిప్తీయులకేమైన చేయుటకై యెహోవాచేత అతడు రేపబడెనన్న మాట అతని తలిదండ్రులు తెలిసికొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. అప్పుడు సమ్సోను తన తలిదండ్రులతోకూడ తిమ్నాతు నకుపోయి, తిమ్నాతు ద్రాక్షతోటలవరకు వచ్చినప్పుడు, కొదమసింహము అతని యెదుటికి బొబ్బరించుచువచ్చెను.౹ యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు.౹ అతడు అక్క డికి వెళ్లి ఆ స్త్రీతో మాటలాడినప్పుడు ఆమెయందు సమ్సోనుకు ఇష్టము కలిగెను.౹ కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసికొని వచ్చుటకు తిరిగి వెళ్లుచుండగా, ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆవైపు తిరిగినప్పుడు, సింహపుకళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్లుచు తన తలిదండ్రులయొద్దకు వచ్చి వారికి కొంత నియ్యగా వారును తినిరి. అయితే తాను సింహపుకళేబరములోనుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు.౹ అంతట అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సమ్సోను విందుచేసెను. అచ్చటి పెండ్లికుమారులు అట్లు చేయుట మర్యాద.౹ వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు ముప్పదిమంది స్నేహితులను తోడుకొని వచ్చిరి.౹ అప్పుడు సమ్సోను–మీకిష్టమైనయెడల నేను మీ యెదుట ఒక విప్పుడు కథను వేసెదను; మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపినయెడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీ కిచ్చెదను.౹ మీరు దాని నాకు తెలుపలేక పోయినయెడల మీరు ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను నాకియ్యవలెనని వారితో చెప్పగా వారు–మేము ఒప్పుకొందుము, నీ విప్పుడు కథను వేయుమని అతనితో చెప్పిరి.౹ కాగా అతడు— బలమైనదానిలోనుండి తీపి వచ్చెను, తిను దానిలోనుండి తిండి వచ్చెను అనెను. మూడుదినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. ఏడవదినమునవారు సమ్సోను భార్యతో ఇట్లనిరి–నీ పెనిమిటి ఆ విప్పుడు కథభావమును మాకు తెలుపునట్లు అతని లాలనచేయుము, లేనియెడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి యింటివారిని కాల్చివేసెదము; మా ఆస్తిని స్వాధీన పరచుకొనుటకే మమ్మును పిలిచితిరా? అనిరి.౹ కాబట్టి సమ్సోను భార్య అతని పాదములయొద్దపడి యేడ్చుచు–నీవు నన్ను ద్వేషించితివిగాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుప వైతివి అనగా అతడు–నేను నా తలిదండ్రులకైనను దాని తెలుపలేదు, నీకు తెలుపుదునా? అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతనియొద్ద ఏడ్చుచువచ్చెను.౹ ఏడవదినమున ఆమె అతని తొందరపెట్టినందున అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను.౹ ఏడవదినమున సూర్యుడు అస్తమింపకమునుపు ఆ ఊరివారు— తేనెకంటె తీపియైనదేది? సింహముకంటె బలమైనదేది? అని అతనితో అనగా అతడు— నా దూడతో దున్నకపోయినయెడల నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను. యెహోవా ఆత్మ అతనిమీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పదిమందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పినవారికి బట్టలనిచ్చెను.౹ అతడు కోపించి తన తండ్రి యింటికి వెళ్లగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికాని కియ్యబడెను. కొన్నిదినములైన తరువాత గోధుమల కోతకాలమున సమ్సోను మేకపిల్ల ఒకటి తీసికొని తన భార్యను చూడ వచ్చి–అంతఃపురములోనున్న నా భార్యయొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ల నియ్యక–నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని; ఆమె చెల్లెలు ఆమెకంటె చక్కనిదికాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమనెను.౹ అప్పుడు సమ్సోను–నేను ఫిలిష్తీయులకు హానిచేసినయెడల వారి విషయములో నేనిప్పుడు నిరపరాధినైయుందునని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి రెండేసి తోకలమధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండచేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్షతోటలను ఒలీవతోటలను తగులబెట్టెను.౹ ఫిలిష్తీయులు–ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు, తిమ్నా యుని అల్లుడైన సమ్సోను భార్యను ఆమె తండ్రి తీసికొని అతని స్నేహితుని కిచ్చెను గనుక అతడే చేసియుండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి.౹ అప్పుడు సమ్సోను–మీరు ఈలాగున చేసినయెడల నేను మీమీద పగతీర్చుకొనిన తరువాతనే చాలించెదనని చెప్పి తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటుపిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదాదేశములో దిగి చెదరి, లేహీలో దోపిడికొరకై దండు కూర్చిరి.౹ యూదావారు–మీరేల మా మీదికి వచ్చితిరని అడుగగా ఫిలిష్తీయులు–సమ్సోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుటకే వచ్చితిమనిరి.౹ అందుకు యూదా జనులలో మూడువేలమంది ఏతాములోని బండ యొద్దకు పోయి సమ్సోనును చూచి–ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు–వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితిననెను.౹ అందుకు వారు–మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సమ్సోను–మీరు నామీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను.౹ అందుకు వారు–ఆలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపముగాని నిన్ను గట్టిగా కట్టి వారిచేతికి మేము అప్పగించెదమని చెప్పి రెండు క్రొత్త తాళ్లచేత అతని కట్టి ఆ బండయొద్దనుండి అతని తీసికొనివచ్చిరి.౹ అతడు లేహీకి వచ్చువరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చినందున అతనిచేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనుపనారవలె నాయెను; సంకెళ్లును అతనిచేతులమీదనుండి విడిపోయెను.౹ అతడు గాడిదయొక్క పచ్చి దవడ యెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను.౹ అప్పుడు సమ్సోను గాడిద దవడ యెముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపియున్నాను గాడిద దవడ యెముకతో వెయ్యిమంది నరులను చంపియున్నాను అనెను. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ యెము కను చేతినుండి పారవేసి ఆ చోటికి రామత్లెహీ అను పేరు పెట్టెను.౹ అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొఱ్ఱపెట్టి–నీవు నీ సేవకునిచేతివలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి, సున్నతి పొందనివారి చేతిలోనికి పడవలెనా? అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దానినుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రదికెను. కాబట్టి దానిపేరు నేటివరకు ఏన్హక్కోరె అనబడెను; అది లేహీలో నున్నది.౹ అతడు ఫిలిష్తీయుల దినములలో ఇరువదియేండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియైయుండెను. తరువాత సమ్సోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెను చూచి ఆమెయొద్ద చేరెను.౹ సమ్సోను అక్కడికి వచ్చెనని గాజావారికి తెలిసినప్పుడు వారు మాటుపెట్టి–రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి.౹ సమ్సోను మధ్యరాత్రివరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకఱ్ఱతోటి వాటిని ఊడబెరికి తన భుజములమీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకొనకు వాటిని తీసికొనిపోయెను. పిమ్మట అతడు శోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో–నీవు అతని లాలనచేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువ వచ్చునో తెలిసికొనుము; మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్నినూరు వెండి నాణెములను నీకిచ్చెదమని చెప్పిరి.౹ కాబట్టి దెలీలా–నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపు మని సమ్సోనుతో ననగా సమ్సోను–ఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను.౹ ఫిలిష్తీయుల సర్దారులు ఏడు నిరవంజి చువ్వలను ఆమెయొద్దకు తీసికొని రాగా ఆమె వాటితో అతని బంధించెను.౹ మాటుననుండువారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్నితగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు.౹ అప్పుడు దెలీలా–ఇదిగో నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా అతడు–పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్తతాళ్లతో నన్ను బాగుగా బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను అంతట దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసికొని వాటితో అతని బంధించి— సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండువారు అంతఃపురములోనుండిరి. అతడు తన చేతులమీదనుండి నూలుపోగునువలె ఆ తాళ్లు తెంపెను.౹ అప్పుడు దెలీలా–ఇదివరకు నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా అతడు–నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లినయెడల సరి అని ఆమెతో చెప్పెను.౹ అంతట ఆమె మేకుతో దాని దిగగొట్టి–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్రమేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసికొని పోయెను.౹ అప్పుడు ఆమె–నాయందు నీకిష్టము లేనప్పుడు —నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పు చున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళిచేసి నీ గొప్పబలము దేనిలోనున్నదో నాకు తెలుపక పోతివని అతనితో అనెను.౹ ఆమె అనుదినమును మాటలచేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను.౹ అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి–నేను నా తల్లిగర్భమునుండి పుట్టి నది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై యున్నాను, నా తలమీదికి మంగలకత్తి రాలేదు, నాకు క్షౌరముచేసినయెడల నా బలము నాలోనుండి తొలగి పోయి యితర మనుష్యులవలె అవుదునని ఆమెతో అనెను.౹ అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా యెరిగి, ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి–యీసారికి రండి; ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెననెను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయిలను చేతపట్టుకొని ఆమెయొద్దకు రాగా ఆమె తన తొడమీద అతని నిద్రబుచ్చి, ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని తలమీదియేడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలోనుండి బలము తొలగిపోయెను.౹ ఆమె–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారనగా అతడు నిద్రమేలుకొని–యెప్పటియట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు.౹ అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసికొని వచ్చి యిత్తడి సంకెళ్లచేత అతని బంధించిరి.౹ అతడు బందీగృహములో తిరగలి విసరువాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తలవెండ్రుకలుతిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. ఫిలిష్తీయుల సర్దారులు–మన దేవత మన శత్రువైన సమ్సోనును మనచేతికి అప్పగించియున్నదని చెప్పుకొని, తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి.౹ జనులు సమ్సో నును చూచినప్పుడు–మన దేశమును పాడుచేసినవాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతి కప్పగించియున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి.౹ వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు–మనము పరిహాసము చేయుటకు సమ్సోనును పిలిపించుదము రండని సమ్సోనును బందీ గృహమునుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభములమధ్యను అతని నిలువబెట్టి పరిహాసముచేయగా సమ్సోను తనచేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను–ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటిమీద ఆనుకొందును.౹ ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను, ఫిలిష్తీయుల సర్దారులందరు అక్కడ నుండిరి, వారు సమ్సోనును ఎగతాళిచేయగా గుడి కప్పుమీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేలమంది చూచుచుండిరి.౹ అప్పుడు సమ్సోను —యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బల పరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారులమీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను.౹ అప్పుడు అతని స్వదేశజనులును అతని తండ్రి యింటివారందరును కూడి అతనిని మోసికొనివచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రియైన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను. మీకా అను నొకడు ఎఫ్రాయిమీయుల మన్యదేశ.ములో నుండెను.౹ అతడు తన తల్లిని చూచి–నీ యొద్ద నుండి తీసికొనినరూకలు, అనగా నీవు ప్రమాణముచేసి నా వినికిడిలో మాటలాడిన ఆ వెయ్యిన్నినూరు వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసి కొంటినని ఆమెతో చెప్పగా అతని తల్లి–నా కుమారుడు యెహోవాచేత ఆశీర్వదింపబడును గాక అనెను.౹ అతడు ఆ వెయ్యిన్నినూరు రూకలను తన తల్లికి మరల నియ్యగా ఆమె–పోతవిగ్రహము చేయించుటకై నా కుమారునిచేత తీసికొనిన యీ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరల అది యిచ్చెదననెను.౹ అతడు ఆ రూకలను తన తల్లికియ్యగా ఆమె వాటిలో రెండువందలు పట్టుకొని కంసాలికప్పగించెను. అతడు వాటితో చెక్క బడిన ప్రతిమాస్వరూపమైన పోతవిగ్రహమునుచేయగా అది మీకా యింట ఉంచబడెను.౹ మీకా అను ఆ మనుష్యునికి దేవమందిర మొకటి యుండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను.౹ ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. యూదా బేత్లెహేములోనుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యౌవనుడుండెను. అతడు లేవీయుడు, అతడు అక్కడ నివసించెను.౹ ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బేత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీయుల మన్యదేశముననున్న మీకా యింటికి వచ్చెను.౹ మీకా–నీవు ఎక్కడనుండి వచ్చితివని అతని నడుగగా అతడు–నేను యూదా బేత్లెహేమునుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరుకగల చోట నివసించుటకు పోవు చున్నానని అతనితో అనెను.౹ మీకా–నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము; నేను సంవత్సరమునకు నీకు పది వెండి రూకలును ఒక దుస్తు బట్టలును ఆహారమును ఇచ్చెదనని చెప్పగా ఆ లేవీ యుడు ఒప్పుకొని ఆ మనుష్యునియొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యౌవనుడు అతని కుమారులలో ఒకని వలె నుండెను.౹ మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని యింట నుండెను.౹ అంతట మీకా–లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలుచేయునని యిప్పుడు నాకు తెలియును అనెను. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినమువరకు దానీయులు స్వాస్థ్యము పొంది యుండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదకు కొనుటకై వారు బయలుదేరియుండిరి.౹ ఆ దేశసంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలోనుండి పరాక్రమవంతులైన అయిదుగురు మనుష్యులను జొర్యానుండియు ఎష్తాయోలునుండియు పంపి —మీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా వారు ఎఫ్రాయిమీయుల మన్యముననున్న మీకా యింటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా యింటియొద్ద నున్నప్పుడు, లేవీయుడైన ఆ యౌవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగియున్నదని యడుగగా అతడు మీకా తనకు చేసిన విధముచెప్పి–మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై యున్నానని వారితో చెప్పెను.౹ అప్పుడు వారు–మేము చేయబోవుపని శుభమగునో కాదో మేము తెలిసికొనునట్లు దయచేసి దేవునియొద్ద విచారించుమని అతనితో అనగా ఆయాజకుడు క్షేమముగా వెళ్లుడి, మీరు చేయబోవుపని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను. కాబట్టి ఆ అయిదుగురు మనుష్యులు వెళ్లి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనీయులవలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికారబలముపొందిన వాడెవడును లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడును ఆ దేశములో లేకపోవుటయు, వారు సీదోనీయులకు దూరస్థులై యే మనుష్యులతోను సాంగత్యములేకుండుటయు చూచిరి.౹ వారు జొర్యాలోను ఎష్తాయోలులోనుఉండు తమ స్వజనులయొద్దకు రాగా వారు–మీ తాత్పర్యమేమిటని యడిగిరి.౹ అందుకు వారు–లెండి, వారిమీద పడుదము, ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది, మీరు ఊరకనున్నా రేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి.౹ జనులు నిర్భయముగా నున్నారు గనుక మీరు పోయి వారిమీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది, దేవుడు మీ చేతికి దాని నప్పగించును, భూమిలోనున్న పదార్థములలో ఏదియు అచ్చట కొదువలేదనిరి. అప్పుడు జొర్యాలోను ఎష్తాయోలులోను ఉన్న దానీయులైన ఆరువందలమంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడనుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి.౹ అందుచేతను నేటివరకు ఆ స్థలమునకు దానీయులదండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమట నున్నది.౹ అక్కడనుండి వారు ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశమునకు పోయి మీకా యింటికి వచ్చిరి.౹ కాబట్టి లాయిషుదేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మనుష్యులు తమ సహోదరులను చూచి–ఈ యిండ్లలో ఏఫోదును గృహదేవతలును చెక్క బడిన ప్రతిమయు పోతవిగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలెనో దాని యోచన చేయుడనగా వారు ఆతట్టు తిరిగి లేవీయుడైన ఆ యౌవనుడున్న మీకా యింటికి వచ్చి అతని కుశలప్రశ్నలడిగిరి.౹ దానీయులైన ఆ ఆరువందలమంది తమ యుద్ధాయుధములను కట్టుకొని గవినివాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మనుష్యులు లోపలచొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆయాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ ఆరువందలమంది మనుష్యులతోకూడ గవిని యెదుట వాకిట నిలిచియుండెను.౹ వీరు మీకా యింటికిపోయి చెక్కబడిన ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును పట్టుకొనినప్పుడు ఆయాజకుడు–మీరేమి చేయుచున్నారని వారినడుగగా వారు–నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతోకూడ వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము, ఒకని యింటివారికే యాజకుడవై యుండుట నీకు మంచిదా, ఇశ్రాయేలీయులలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడవైయుం డుట మంచిదా? అని యడిగిరి.౹ అప్పుడు ఆయాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనులమధ్య చేరెను.౹ అట్లువారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామగ్రిని తమకు ముందుగా నడిపించుకొనిపోయిరి.౹ వారు మీకా యింటికి దూరమైనప్పుడు, మీకా పొరుగిండ్లవారు పోగై దానీయులను వెంటాడి కలిసికొని వారిని పిలువగా వారు తమ ముఖములను త్రిప్పుకొని–నీకేమి కావలెను? ఇట్లు గుంపుకూడనేల? అని మీకాను అడిగిరి.౹ అందుకతడు–నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవుచున్నారే, యిక నా యొద్ద ఏమియున్నది? నీకేమి కావలెననుచున్నారే, అదే మన్నమాట అనగా దానీయులు–నీ స్వరము మాలో నెవనికిని వినబడనీయకుము, వారు ఆగ్రహపడి నీమీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ యింటివారి ప్రాణమును పోగొట్టుకొందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్లిరి. వారు తనకంటె బలవంతులని మీకా గ్రహించినవాడై తిరిగి తన యింటికి వెళ్లిపోయెను.౹ మీకా చేసికొనినదానిని, అతని యొద్దనున్న యాజకునిని వారు పట్టుకొని, సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతముచేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి.౹ అది సీదోనుకు దూరమై నందునను, వారికి అన్యులతో సాంగత్యమేమియు లేనందునను వారిలో ఎవడును తప్పించుకొనలేదు. అది బేత్రెహోబునకు సమీపమైన లోయలోనున్నది.౹ వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రియైన దానునుబట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అను పేరు.౹ దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతాననువాడును వాని కుమారులును ఆ దేశము చెరపట్టబడువరకు దానీయుల గోత్రమునకు యాజకులై యుండిరి.౹ దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొనియుండిరి. ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయుడైన యొకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తరభాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లెహేములోనుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బేత్లెహేములోని తన తండ్రి యింటికి పోయి అక్కడ నాలుగు నెలలుండెను.౹ ఆమెతో ప్రియముగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసునిని రెండు గాడిదలను తీసికొని ఆమెయొద్దకు వెళ్లగా ఆమె తన తండ్రి యింట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలిసికొని సంతోషించెను.౹ ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్లనియ్యనందున అతడు మూడుదినములు అతనియొద్ద నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి.౹ నాలుగవ నాడు వారు వేకువను వెళ్లుటకు నిద్రమేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి–నీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్లవచ్చునని తన అల్లునితో అనగా, వారిద్దరు కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రి–దయచేసి యీ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మనుష్యునితో చెప్పి అతడు వెళ్లుటకు లేచినప్పుడు అతని మామ బలవంతముచేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను.౹ అయిదవదినమున అతడు వెళ్లవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి–నీవు నీ ప్రాణము బలపరచుకొనుమని చెప్పినందునవారు ప్రొద్దు వ్రాలువరకు తడవుచేసి యిద్దరు కూడి భోజనముచేసిరి.౹ ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ల లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ–ఇదిగో ప్రొద్దు గ్రుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి యీ రాత్రి యిక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దు గ్రుంకుచున్నది, సంతోషించి యిక్కడ రాత్రి గడు పుము, రేపు నీ గుడారమునకు వెళ్లుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను అతడు అక్కడ ఆ రాత్రి గడప నొల్లక లేచి వెళ్లి, యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన రెండు గాడిదలును అతని ఉపపత్నియు అతనితోకూడ ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు–మనము యెబూసీయులదైన యీ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బసచేయుదము రండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు–ఇశ్రాయేలీయులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము. గిబియావరకు ప్రయాణము చేయుదమనెను.౹ మరియు అతడు–నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనేగాని రామాలోనేగాని యీ రాత్రి బస చేసెదమనెను.౹ అప్పుడు వారు సాగి వెళ్లుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దు గ్రుంకెను.౹ కావునవారు గిబియాలో ఆ రాత్రి గడపుటకు అక్కడికి చేర సాగిరి; అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను, బస చేయుట కెవడును వారిని తన యింటికి పిలువలేదు.౹ ఆ చోటి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పనినుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు.౹ అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్థుడైన ఆ మనుష్యుని చూచి–నీ వెక్కడికి వెళ్లుచున్నావు? నీ వెక్కడనుండి వచ్చితివి? అని అడిగెను.౹ అందుకతడు–మేము యూదా బేత్లెహేమునుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్లుచున్నాము. నేను అక్కడివాడను; నేను యూదా బేత్లెహేమునకు పోయియుంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్లుచున్నాను, ఎవడును తన యింట నన్ను చేర్చుకొనలేదు.౹ అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతోకూడ నున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏదియు తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు–నీకు క్షేమమగునుగాక, నీకేవైన తక్కువైనయెడల వాటిభారము నామీద ఉంచుము.౹ మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి, తన యింట అతని చేర్చుకొని వారి గాడిదలకొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్లు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి.౹ వారు సంతోషించుచుండగా ఆ ఊరివారిలో కొందరు పోకిరులు ఆ యిల్లు చుట్టుకొని తలుపుకొట్టి–నీ యింటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని యింటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా యింటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్లి–నా సహోదరులారా, అదికూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు, ఈ మనుష్యుడు నా యింటికి వచ్చెను గనుక మీరు ఈ వెఱ్ఱిపని చేయకుడి.౹ ఇదిగో కన్యకయైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియు నున్నారు. నేను వారిని బయటికి తీసికొని వచ్చెదను, మీరు వారిని నీచపరచి మీ యిష్టప్రకారముగా వారియెడల జరిగింపవచ్చునుగాని యీ మనుష్యునియెడల ఈ వెఱ్ఱిపని చేయకుడని వారితో చెప్పెనుగాని అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుష్యుడు బయట నున్నవారియొద్దకు తన ఉపపత్నిని తీసికొనిపోగా వారు ఆమెను కూడి ఉదయమువరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్లిరి.౹ ప్రాతఃకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చువరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని యింటిద్వారమున పడియుండెను.౹ ఉదయమున ఆమె యజమానుడు లేచి యింటి తలుపులను తీసి తన త్రోవను వెళ్లుటకు బయలుదేరగా అతని ఉపపత్నియైన ఆ స్త్రీ యింటిద్వారమునొద్దపడి చేతులు గడపమీద చాపి యుండెను.౹ అతడు–లెమ్ము వెళ్లుదమనగా ఆమె ప్రత్యుత్తరమియ్యకుండెను గనుక అతడు గాడిదమీద ఆమెను ఉంచి లేచి తనచోటికి ప్రయాణము చేయ సాగెను.౹ అతడు తన యింటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసికొని, ఆమెను ఆమె కీళ్ల ప్రకారము పండ్రెండు ముక్కలుగా కోసి, ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికి ఆ ముక్కలను పంపెను.౹ అప్పుడు దాని చూచినవారందరు, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు ఈలాటిపని జరుగుటయైనను వినబడుటయైనను లేదు; మీరు ఇది మన స్సుకు తెచ్చుకొని దీనినిబట్టి ఆలోచనచేసి దీనినిగూర్చి మాటలాడుడని ఒకరితో నొకరు చెప్పుకొనిరి. అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.౹ దేవుని జన సమాజమునకు చేరినవారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికి పెద్దలుగా నున్నవారై కత్తిదూయు నాలుగు లక్షల కాలుబలము కూడుకొనిరి.౹ ఇశ్రాయేలీయులు మిస్పాకు వచ్చియున్నారని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీయులు–ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని యడుగగా చంప బడిన స్త్రీ పెనిమిటియైన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా–బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బసచేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చియుండగా గిబియావారు నా మీదికి లేచి రాత్రి నేనున్న యిల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతముచేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రాయేలీయులలో దుష్కార్యమును వెఱ్ఱిపనిని చేసిరని నేను తెలిసికొని, నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని.౹ ఇదిగో ఇశ్రాయేలీయులారా, యిక్కడనే మీరందరు కూడియున్నారు, ఈ సంగతిని గూర్చి ఆలోచనచేసి చెప్పుడనెను.౹ అప్పుడు జనులందరు ఏకీభవించి లేచి–మనలో ఎవడును తన గుడారమునకు వెళ్లడు, ఎవడును ఇంటికి వెళ్లడు,౹ మనము గిబియా యెడల జరిగింపవలసినదానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి ఇశ్రాయేలీయులలో జరిగిన వెఱ్ఱితనము విషయమై పగతీర్చుకొనుటకు వెళ్లువారికొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నూటికి పదిమంది మనుష్యులను, వెయ్యింటికి నూరుమందిని, పదివేలకు వెయ్యిమందిని ఏర్పరచుకొందము రండని చెప్పు కొనిరి.౹ కాబట్టి ఇశ్రాయేలీయులందరు ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరివారితో యుద్ధముచేయుటకు కూడిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరియొద్దకు మనుష్యులను పంపి–మీలో జరిగిన యీ చెడుతనమేమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి; వారిని చంపి ఇశ్రాయేలీయులలోనుండి దోషమును పరిహరింప చేయుదమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులగు ఇశ్రాయేలీయుల మాట విననొల్లక యుద్ధమునకు బయలు దేరవలెనని తమ పట్టణములలోనుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి.౹ ఆ దినమున బెన్యామీనీయులు తమ జన సంఖ్యను మొత్తముచేయగా ఏడువందలమందియైన గిబియా నివాసులుగాక కత్తిదూయ సమర్థులై పట్టణమునుండి వచ్చినవారు ఇరువదియారు వేలమందియైరి.౹ ఆ సమస్త జనములో నేర్పరచబడిన ఏడువందలమంది యెడమచేతి వాటముగలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచ బడిన తలవెండ్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగల వాడు. బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీయులలో ఖడ్గము దూయు నాలుగులక్షలమంది లెక్కింపబడిరి; వీరందరు యోధులు.౹ వీరు లేచి బేతేలుకు పోయి–ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవలెనని దేవునియొద్ద మనవి చేసినప్పుడు యెహోవా— యూదా వంశస్థులు ముందుగా వెళ్లవలెనని సెలవిచ్చెను.౹ కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి.౹ ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధముచేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియామీద పడుటకు యుద్ధపంక్తులు తీర్చగా బెన్యామీనీయులు గిబియాలోనుండి బయటికివచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో ఇరువదిరెండు వేలమందిని నేల గూల్చిరి.౹ అయితే ఇశ్రాయేలీయులు ధైర్యము తెచ్చుకొని, తాము మొదట ఎక్కడ యుద్ధపంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరుగవలెనని తమ్మును తాము యుద్ధపంక్తులుగా తీర్చుకొనిరి.౹ మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలమువరకు యెహోవా ఎదుట ఏడ్చుచు–మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవావారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు రెండవదినమున బెన్యామీనీయులతో యుద్ధము చేయరాగా, ఆ రెండవదినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబి యాలోనుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో పదు నెనిమిది వేలమందిని నేలగూల్చి సంహరించిరి.౹ వీరందరు కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరును జనులందరును పోయి, బేతేలును ప్రవేశించి యేడ్చుచు సాయంకాలమువరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించిరి.౹ ఆ దినములలో యెహోవా నిబంధనమందసము అక్కడనే యుండెను.౹ అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దానియెదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరల–మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా, మానుదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా–వెళ్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను.౹ అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టు మాటు గాండ్రను పెట్టిరి. మూడవదినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధమునకు పోయిమునుపటివలె గిబియావారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములోనుండి తొలగివచ్చిమునుపటివలె ఇశ్రాయేలీయులలో గాయ పరచబడినవారిని ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను రాజమార్గములలో చంపుచువచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి.౹ బెన్యామీనీయులుమునుపటివలె వారు మనయెదుట నిలువలేక కొట్టబడియున్నారని అనుకొనిరిగాని ఇశ్రాయేలీయులు–మనము పారిపోయి వారిని పట్టణములోనుండి రాజమార్గములలోనికి రాజేయుదము రండని చెప్పుకొనియుండిరి.౹ ఇశ్రాయేలీయులందరు తమ చోటనుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగా ఇశ్రాయేలీయుల మాటుగాండ్రును తమ చోటనుండి గిబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చిరి.౹ అప్పుడు ఇశ్రాయేలీయులందరిలోనుండి ఏర్ప రచబడిన పదివేలమంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠినయుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థెమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు.౹ అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులచేత బెన్యామీనీయులను హతముచేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో ఇరువదియయిదు వేల నూరుమంది మనుష్యులను చంపిరి. వీరందరు కత్తి దూయువారు. బెన్యామీనీయులు జరుగుదాని చూచి తమకు అప జయము కలిగినదని తెలిసికొనిరి. ఇశ్రాయేలీయులు తాము గిబియామీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు స్థలమిచ్చిరి.౹ మాటుననున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణములోనివారినందరిని హతముచేసిరి.౹ ఇశ్రాయేలీయులకును మాటు గాండ్రకును నిర్ణయమైన సంకేతమొకటి యుండెను; అదే దనగా వారు పట్టణములోనుండి పొగ గొప్ప మేఘమువలె లేచునట్లు చేయుటయే.౹ ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుకతీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు–వీరు మొదటి యుద్ధములో అపజయమొందినట్లు మనచేత ఓడి పోవుదురుగదా అనుకొని, చంపనారంభించి, ఇశ్రాయేలీయులలో ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను హతము చేసిరి.౹ అయితే పట్టణమునుండి ఆకాశముతట్టు స్తంభ రూపముగా పొగ పైకిలేవ నారంభింపగా బెన్యామీనీయులు వెనుకతట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణ మంతయు ధూమమయమై ఆకాశమున కెక్కుచుండెను.౹ ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలిసికొని విభ్రాంతినొంది యెడారి మార్గముతట్టు వెళ్లుదమని ఇశ్రాయేలీయుల యెదుట వెనుకకు తిరిగిరిగాని, యుద్ధమున తరుమబడగా పట్టణములలోనుండి వచ్చినవారు మధ్య మార్గమందే వారిని చంపిరి.౹ ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పుదిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి.౹ అప్పుడు బెన్యామీనీయులలో పదునెనిమిది వేలమంది మనుష్యులు పడిపోయిరి. వీరందరు పరాక్రమవంతులు.౹ అప్పుడు మిగిలినవారు తిరిగి యెడారిలో నున్న రిమ్మోనుబండకు పారిపోగా, వారు రాజమార్గములలో చెదిరియున్న అయిదువేలమంది మనుష్యులను చీలదీసి గిదోమువరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేలమందిని చంపిరి.౹ ఆ దినమున బెన్యామీనీయులలో పడిపోయినవారందరు కత్తిదూయు ఇరువదియయిదు వేలమంది, వీరందరు పరాక్రమవంతులు.౹ ఆరువందలమంది తిరిగి యెడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండమీద నాలుగు నెలలు నివసించిరి.౹ మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులమీదికి తిరిగి వచ్చి పట్టణనివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతముచేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి. ఇశ్రాయేలీయులు తమలో ఎవడును తన కుమార్తెను. బెన్యామీనీయుని కియ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసికొనియుండిరి.౹ ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలమువరకు కూర్చుండి –యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయెను. ఇది ఇశ్రాయేలీయులకు సంభవింపనేల అని బహుగా ఏడ్చిరి.౹ మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహనబలులను సమాధానబలులను అర్పించిరి.౹ అప్పుడు ఇశ్రాయేలీయులు — ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయినవారెవరని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి.౹ ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనీయులనుగూర్చి పశ్చాత్తాపపడి–నేడు ఒక గోత్రము ఇశ్రాయేలీయులలో నుండకుండ కొట్టివేయబడియున్నది;౹ మిగిలియున్నవారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితిమిగదా; వారి విషయములో ఏమి చేయ గలము? అని చెప్పుకొనిరి.౹ మరియు వారు ఇశ్రాయేలీయుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజమునకుచేరిన యాబేష్గిలాదునుండి సేనలోనికి ఎవడును రాలేదని తేలెను. జన సంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు.౹ కాబట్టి సమాజపువారు పరాక్రమవంతులైన పండ్రెండు వేలమంది మనుష్యులను పంపించి —మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్గిలాదు నివాసులనందరిని కత్తివాతను హతము చేయుడి.౹ మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుషసంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి.౹ యాబేష్గిలాదు నివాసులలో పురుషసంయోగము నెరుగని నాలుగు వందలమంది కన్యలైన స్త్రీలు దొరుకగా కనాను దేశమందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసికొని వచ్చిరి. ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీయులతో మాటలాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా ఆ వేళను బెన్యామీనీయులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్గి లాదు స్త్రీలలో బ్రదుకనిచ్చినవారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్ర్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసి యుండుట జనులు చూచి బెన్యామీనీయులనుగూర్చి పశ్చాత్తాపపడిరి. సమాజప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించియుండుట చూచి మిగిలినవారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదమని యోచించుకొని ఇశ్రాయేలీయులలోనుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనీయులలో తప్పించుకొనిన వారికి స్వాస్థ్య ముండవలెననిరి.౹ ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చినయెడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసియున్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడ దని చెప్పుకొనుచుండిరి.౹ కాగా వారు బెన్యామీనీయులతో ఇట్లనిరి–ఇదిగో బేతేలుకు ఉత్తరదిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణదిక్కున యెహోవాకు పండుగ ఏటేట షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీయులను చూచి –మీరు వెళ్లి ద్రాక్షతోటలలో మాటుననుండి షిలోహు స్త్రీలు నాట్యమాడువారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్షతోటలలోనుండి బయలుదేరివచ్చి పెండ్లి చేసికొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి.౹ తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీయొద్దకు వచ్చినయెడల మేము —ఆ యుద్ధమునుబట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియ్యుడి, ఈ సమయమున వారికిచ్చినయెడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పెదమనిరి.౹ కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలోనుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసికొనిపోయి తమ స్వాస్థ్యమునకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి.౹ అటుపిమ్మట ఇశ్రాయేలీయులలో ప్రతివాడును అక్కడనుండి తమ గోత్రస్థానములకును కుటుంబములకును పోయెను. అందరును అక్కడనుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి.౹ ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబుదేశమున కాపురముండుటకు వెళ్లెను.౹ ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి; అతని యిద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను; వారు యూదా బేత్లెహేమువారైన ఎఫ్రాతీయులు; వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి.౹ నయోమి పెనిమిటియైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె యిద్దరు కుమాళ్లును నిలిచియుండిరి.౹ వారు మోయాబుస్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా రెండవదాని పేరు రూతు.౹ వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి; కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను.౹ వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి.౹ అప్పుడు ఆమెయున్న స్థలమునుండి ఆమెతోకూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదాదేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్లుచుండగా నయోమి తన యిద్దరు కోడండ్రను చూచి —మీరు మీ తల్లులయిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక;౹ మీలో ఒక్కొక్కతె పెండ్లి చేసికొని తన యింట నెమ్మదినొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను.౹ అంతట వారు ఎలుగెత్తి యేడ్చి–నీ ప్రజలయొద్దకు నీతోకూడ వచ్చెదమని ఆమెతో చెప్పగా నయోమి–నా కుమార్తెలారా, మీరు మరలుడి; నాతోకూడ మీరు రానేల? మిమ్మును పెండ్లి చేసికొనుటకై యింక కుమారులు నా గర్భమున నుందురా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్లుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను; నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితోనుండి కుమారులను కనినను వారు పెద్ద వారగువరకు వారికొరకు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారికొరకు కనిపెట్టుకొని పురుషులు లేక యొంటరి కత్తెలైయుందురా? నా కుమార్తెలారా, అదికూడదు; యెహోవా నాకు విరోధియాయెను; అది మిమ్మును నొప్పించినంతకంటె నన్ను మరి యెక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను.౹ వారు ఎలుగెత్తి యేడ్వగా ఓర్పా తన అత్తను ముద్దుపెట్టుకొనెను, రూతు ఆమెను హత్తు కొనెను. ఇట్లుండగా ఆమె–ఇదిగో నీ తోడికోడలు తన జనులయొద్దకును తన దేవునియొద్దకును తిరిగి పోయినదే; నీవును నీ తోడికోడలి వెంబడివెళ్లుమనెను.౹ అందుకు రూతు–నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;౹ నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను.౹ తనతోకూడ వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందునుగురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి.౹ వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చి–ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె–సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి.౹ నేను సమృద్ధిగలదాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అనిపిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను.౹ అట్లు నయోమియు ఆమెతోకూడ మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబుదేశమునుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవలకోత ఆరంభములో బేత్లెహేము చేరిరి. నయోమి పెనిమిటికి బంధువు డొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు.౹ మోయాబీయు రాలైన రూతు–నీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె–నా కుమారీ పొమ్మనెను.౹ కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది.౹ బోయజు బేత్లెహేమునుండి వచ్చి–యెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారు–యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి.౹ అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచి–ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయువారిమీద నుంచబడిన ఆ పనివాడు— ఈమె మోయాబుదేశమునుండి నయోమితోకూడ తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యౌవనురాలు.౹ ఆమె–నేను కోయువారి వెనుకకు పనలమధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిదివరకు ఏరుకొను చుండెను, కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను.౹ అప్పుడు బోయజు రూతుతో— నా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము.౹ వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహమగునప్పుడుకుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను.౹ అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని–ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు–నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను.౹ నీవు నీ తలి దండ్రులను నీ జన్మభూమిని విడిచి, యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి.౹ యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తరమిచ్చెను.౹ అందుకు ఆమె–నా యేలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, నీవు నన్నాదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ గలిగి మాటలాడితివి గనుక నాయెడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను.౹ బోయజు–భోజనకాలమున నీ విక్కడికి వచ్చి భోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయువారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమెతిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను.౹ ఆమె యేరు కొనుటకు లేచినప్పుడు బోయజు–ఆమె పనలమధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి మరియు ఆమెకొరకు పిడికెళ్లు పడవేసి ఆమె యేరుకొనునట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసుల కాజ్ఞాపించెను.౹ కాబట్టి ఆమె అస్తమయమువరకు ఆ చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను.౹ ఆమె వాటిని ఎత్తికొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె యేరు కొనిన వాటిని చూచెను. ఆమెతిని తృప్తిపొందిన తరువాత తాను మిగిల్చినదానిని చూపించి ఆమెకిచ్చెను.౹ అంతట ఆమె అత్త ఆమెతో–నేడు నీవెక్కడ ఏరు కొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచినవాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవనియొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి–ఎవని యొద్ద నేడు పనిచేసితినో అతనిపేరు బోయజు అనెను.౹ నయోమి–బ్రదికియున్నవారికిని చచ్చినవారికిని ఉపకారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి–ఆ మనుష్యుడు మనకు సమీపబంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయాబీయురాలైన రూతు–అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోత అంతయు ముగించువరకు తన పనివారియొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను.౹ అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో–నా కుమారీ, అతని పనికత్తెలతోకూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడక పోవుట మంచిదనెను.౹ కాబట్టి యవలకోతయు గోధు మలకోతయు ముగియువరకు ఆమె యేరుకొనుచు బోయజు పనికత్తెలయొద్ద నిలకడగానుండి తన అత్త యింట నివసించెను. ఆమె అత్తయైన నయోమి–నా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా.౹ ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు.౹ నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము.౹ అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్లమీద నున్న బట్ట తీసి పండుకొనవలెను; నీవు చేయవలసినదానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా ఆమె–నీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను.౹ బోయజు మనస్సున సంతోషించునట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్పయొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను.౹ మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను.౹ అతడు–నీ వెవరవని అడుగగా ఆమె— నేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పుమనగా అతడు–నా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినేగాని గొప్పవారినేగాని యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీమునుపటి సత్ ప్రవర్తనకంటె వెనుకటి సత్ ప్రవర్తన మరి ఎక్కువైనది.౹ కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు.౹ నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే; అయితే నీకు నాకంటె సమీపమైన బంధువు డొకడున్నాడు.౹ ఈ రాత్రి యుండుము; ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేక పోయినయెడల, యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను; ఉదయమువరకు పండుకొనుమని చెప్పెను.౹ కాబట్టి ఆమె ఉదయమువరకు అతని కాళ్లయొద్ద పండుకొని, ఒకని నొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు–ఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను.౹ మరియు అతడు–నీవు వేసికొనిన దుప్పటి తెచ్చిపట్టుకొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు ఆరు కొలల యవలను కొలచి ఆమె భుజముమీద నుంచగా ఆమె పురములోనికి వెళ్లెను.౹ ఆమె తన అత్త యింటికి వచ్చినప్పుడు అత్త–నా కుమారీ, నీ పని యెట్లు జరిగెనని యడుగగా, ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి –నీవు వట్టిచేతులతో నీ అత్త యింటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల యవలను నాకిచ్చెననెను.౹ అప్పుడు ఆమె–నా కుమారీ, యీ సంగతి నేటిదినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక యిది ఏలాగు జరుగునో నీకు తెలియువరకు ఊరకుండుమనెను. బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు–ఓయి, యీతట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను.౹ బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించుకొని, ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి.౹ అతడు–మోయాబు దేశమునుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేనొకసంగతి తెలియజేయవలెనని యున్నాను.౹ ఈ పురనివాసులయెదుటను నా జనుల పెద్దలయెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము; ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనినయెడల విడిపింపుము, దాని విడిపింపనొల్లని యెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు–నేను విడిపించెదననెను.౹ బోయజు–నీవు నయోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవానిపేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయినవాని భార్యయైన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా ఆ బంధువుడు— నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను.౹ ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమునుగూర్చి గాని, క్రయవిక్రయములనుగూర్చిగాని, ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువాని కిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను.౹ ఆ బంధువుడు–నీవు దానిని సంపాదించుకొను మని బోయజుతో చెప్పి తన చెప్పుతీయగా బోయజు —ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లో నుకును కలిగినది యావత్తును నయోమి చేతినుండి సంపా దించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై యున్నారు.౹ మరియు చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయినవాని పేరు అతని సహోదరులలోనుండియు, అతని స్థలముయొక్క ద్వారమునుండియు కొట్టివేయబడక యుండునట్లును, నేను మహ్లోను భార్యయైన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లిచేసికొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులైయున్నారని పెద్దలతోను ప్రజలందరితోను చెప్పెను.౹ అందుకు పురద్వారముననుండిన ప్రజలందరును పెద్దలును–మేము సాక్షులము, యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక;౹ ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక; యెహోవా యీ యౌవనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక అనిరి.౹ కాబట్టి బోయజు రూతును పెండ్లిచేసికొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారునికనెను.౹ అప్పుడు స్త్రీలు–ఈ దినమున నీకు బంధువుడులేకుండ చేయని యెహోవా స్తుతినొందుగాక; ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక.౹ నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీ కెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి.౹ అప్పుడు నయోమి–ఆ బిడ్డను తీసికొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను.౹ ఆమె పొరుగు స్త్రీలు–నయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రియైన యెష్షయియొక్క తండ్రి. [18-19] పెరెసు వంశావళి యేదనగా–పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను,౹ *** నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను,౹ బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్టణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి.౹ వీరిలో ఒకదాని పేరు హన్నా రెండవదాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరిగాని హన్నాకు పిల్లలులేకపోయిరి.౹ ఇతడు షిలోహునందున్న సైన్యములకధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీయొక్క యిద్దరు కుమారులగు హొప్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి.౹ ఎల్కానా తాను బల్యర్పణ చేసిననాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్లు ఇచ్చుచు వచ్చెనుగాని హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను.౹ యెహోవా ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువునుబట్టి, ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను.౹ ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచు నుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను.౹ ఆమె పెనిమిటియైన ఎల్కానా–హన్నా, నీ వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఏల? నీకు మనో విచారమెందుకు కలిగినది? పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా? అని ఆమెతో చెప్పుచు వచ్చెను.౹ వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనముమీద కూర్చునియుండగా బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు –సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్నశ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసి కొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,౹ ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను.౹ ఆమె పెదవులుమాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక యుండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై యున్నదనుకొని –ఎంతవరకు నీవు మత్తురాలవై యుందువు? నీవు ద్రాక్షారసమును నీయొద్దనుండి తీసివేయుమని చెప్పగా హన్నా–అది కాదు, నా యేలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయ లేదుగాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను.౹ నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు; అత్యంతమైన కోపకారణమునుబట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పు కొనుచుంటిననెను.౹ అంతట ఏలీ–నీవు క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో–నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనముచేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను.౹ తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని–నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను.౹ ఎల్కానాయును అతనియింటి వారందరును యెహోవాకు ఏటేట అర్పించు బలినర్పించుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి.౹ అయితే హన్నా–బిడ్డ పాలు విడుచువరకు నేను రాను; వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసికొనివత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్లక యుండెను.౹ కాబట్టి ఆమె పెనిమిటియైన ఎల్కానా–నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము; నీవు వానికి పాలు మాన్పించువరకు నిలిచి యుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనేయుండి తన కుమారునికి పాలు మాన్పించువరకు అతని పెంచుచుండెను.౹ పాలు మాన్పించిన తరువాత అతడు ఇంక చిన్నవాడై యుండగా ఆమె ఆ బాలుని ఎత్తికొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసికొని షిలోహులోని మందిరమునకు వచ్చెను.౹ వారు ఒక కోడెను వధించి, పిల్లవానిని ఏలీయొద్దకు తీసికొనివచ్చి నప్పుడు ఆమె అతనితో ఇట్లనెను –నా యేలినవాడా, నా యేలినవాని ప్రాణముతోడు, నీయొద్దనిలిచి, యెహోవాను ప్రార్థనచేసిన స్త్రీని నేనే.౹ ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నా కనుగ్రహించెను.౹ కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను; తాను బ్రదుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను— నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెను నీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నాను నావిరోధులమీద నేను అతిశయపడుదును. యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియులేదు. యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాటలాడకుడి గర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి. ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు తొట్రిల్లినవారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికి పోవుదురు ఆకలిగొనినవారు ఆకలితీర తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృశించి పోవును. జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే పాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తువాడు ఆయనే. భూమియొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములోనుండి ఆయన వారిపైన ఉరుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును. తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి.౹ జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకునివారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి బొరుసులోగాని తపేలలోగాని గూనలోగానికుండలోగాని అది గుచ్చినపుడు ఆ కొంకిచేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తనకొరకు తీసికొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికిని వీరు ఈలాగున చేయుచువచ్చిరి.౹ ఇదియుగాక వారు క్రొవ్వును దహింపకమునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో— యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీయొద్ద తీసికొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెను.౹ –ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చినంతమట్టుకు తీసికొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పినయెడల వాడు–ఆలాగువద్దు ఇప్పుడే యియ్యవలెను, లేనియెడల బలవంతముచేత తీసికొందుననును.౹ అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పడుటకు ఆ యౌవనులు కారణమైరి, గనుక వారిపాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను.౹ వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి యేటేట బలి అర్పించుటకు తన పెనిమిటితోకూడ వచ్చినప్పుడు దాని తెచ్చి వానికిచ్చుచు వచ్చెను.౹ –యెహోవా సన్నిధిని మనవిచేసికొనగా నీకు దొరకిన యీ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్లిరి.౹ యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియై ముగ్గురు కుమాళ్లను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెదుగుచుండెను. ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవచేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను ఈ జనులముందర మీరు చేసిన చెడ్డకార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, యీలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు.౹ నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవావారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి.౹ బాలుడగు సమూయేలు ఇంకను ఎదు గుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. అంతట దైవజనుడొకడు ఏలీయొద్దకు వచ్చి యిట్లనెను —యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని.౹ అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠముమీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలోనుండి నేనతని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమవస్తువు లన్నిటిని నీ పితరుని యింటివారికిచ్చితిని.౹ నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీ రేల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులుచేయు నైవేద్యములలో శ్రేష్ఠభాగములను పట్టుకొనుచు, నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు.౹ నీ యింటివారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా— నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.౹ ఆలకించుము; రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును. నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును.౹ యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలచిన మేలువిషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికిని నీ యింట ముసలివాడు ఉండడు.౹ నా బలిపీఠమునొద్ద నెవడు ఉండకుండ నేనందరిని నశింపజేయక విడుచు వాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు.౹ నీ యిద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును. ఒక్క నాటియందే వారిద్దరు మరణమవుదురు.౹ తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును.౹ అయితే నీ యింటివారిలో శేషించినవారు ఒక వెండిరూకనైనను రొట్టెముక్కనైనను సంపా దించుకొనవలెనని అతనియొద్దకు వచ్చి దండముపెట్టి–నేను రొట్టెముక్క తినునట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదానియందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు. బాలుడైన సమూయేలు ఏలీయెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు.౹ ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తనస్థలమందు పండు కొనియుండగాను దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండు కొనియుండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు–చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీదగ్గరకు పోయి–నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినాననెను. అతడు–నేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను.౹ యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీయొద్దకు పోయి —చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను.౹ సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు.౹ యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి —చిత్తము నీవు నన్ను పిలిచితివే; యిదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి –నీవు పోయి, పండుకొమ్ము, ఎవరైన నిన్ను పిలిచినయెడల–యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను.౹ తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా–సమూయేలూ సమూయేలూ, అనిపిలువగా సమూయేలు–నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను.౹ అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను–ఇశ్రాయేలులో నేనొకకార్యము చేయబోవుచున్నాను; దానిని వినువారందరి చెవులు గింగురుమనును.౹ ఆ దినమున ఏలీయొక్క యింటివారినిగురించి నేను చెప్పినదంతయు వారిమీదికి రప్పింతును. దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును.౹ తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.౹ కాబట్టి ఏలీ యింటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యముచేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము జేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని.౹ తరువాత సమూయేలు ఉదయమగువరకు పండుకొని, లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని, భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పక పోయెను.౹ అయితే ఏలీ–సమూయేలూ నా కుమారుడా, అని సమూయేలును పిలువగా అతడు— చిత్తము నేనిక్కడ ఉన్నాననెను.౹ ఏలీ–నీతో యెహోవా యేమి సెలవిచ్చెనో మరుగుచేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైన నీవు మరుగుచేసినయెడల అంతకంటె అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా సమూయేలు దేనిని మరుగుచేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని–సెలవిచ్చినవాడు యెహోవా; తన దృిష్టికి అనుకూలమైనదానిని ఆయన చేయునుగాక అనెను.౹ సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు.౹ కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబావరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలుమాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడియాయెను. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి.౹ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులమీద తమ్మును యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే యెక్కువతక్కువ నాలుగు వేలమంది హతులైరి.౹ కాబట్టి జనులు పాళెములోనికి తిరిగిరాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయులముందర ఎందుకు ఓడించెను? షిలోహులో నున్న యెహోవా నిబంధనమందసమును మనము తీసికొని మన మధ్యనుంచుకొందము రండి; అది మన మధ్యనుండినయెడల అది మన శత్రువుల చేతిలోనుండి మనలను రక్షించుననిరి.౹ కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడనుండి కెరూబులమధ్య ఆసీనుడైయుండు సైన్యములకధిపతియగు యెహోవా నిబంధనమందసమును తెప్పించిరి. ఏలీయొక్క యిద్దరు కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధనమందసమునొద్ద ఉండిరి.౹ యెహోవా నిబంధనమందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరు భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్పకేకలు వేసిరి.౹ ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలధ్వని యేమని అడిగి, యెహోవా నిబంధనమందసము దండులోనికి వచ్చెనని తెలిసికొని జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని–అయ్యో మనకు శ్రమ, ఇంతకుమునుపు వారీలాగు సంభ్రమింపలేదు,౹ అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలోనుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్లచేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా.౹ ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండ బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి.౹ ఫిలిష్తీయులు యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను; ఇశ్రాయేలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను.౹ మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీయొక్క యిద్దరు కుమారులు హతులైరి.౹ ఆ నాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలోనుండి పరుగెత్తివచ్చి, చినిగిన బట్టలతోను తలమీద ధూళితోను షిలోహులో ప్రవేశించెను.౹ అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవప్రక్కను పీఠముమీద కూర్చుండి యెదురుచూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరు కేకలు వేసిరి.౹ ఏలీ ఆ కేకలు విని–ఈ గల్లత్తు యేమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను.౹ ఏలీ తొంబది యెనిమిదేండ్లవాడై యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను.౹ ఆ మనుష్యుడు–యుద్ధములోనుండి వచ్చినవాడను నేనే, నేడు యుద్ధములోనుండి పరుగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడు–నాయనా, అక్కడ ఏమి జరిగెనని అడిగెను.౹ అందుకు అతడు–ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులముందర నిలువలేక పారిపోయిరి; జనులలో అనేకులు హతులైరి; హొఫ్నీ ఫీనెహాసు అను నీ యిద్దరు కుమారులు మృతులైరి; మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారముదగ్గర నున్న పీఠము మీదనుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయెను; ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహియైయుండెను. అతడు నలువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చెను.౹ ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులైయుండగా దేవునియొక్క మందసము పట్టబడెననియు, తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులుతగిలి మోకాళ్లమీదికి క్రుంగి ప్రసవమాయెను.౹ ఆమె మృతినొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో–భయపడవద్దు, కుమారుని కంటివనిరిగాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్యపెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను.౹ దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనె జరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి.౹ అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి.౹ ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను. దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడపదగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను.౹ కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటివరకు ఎవరును అష్డోదులో దాగోనుయొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. యెహోవా హస్తము అష్డోదువారిమీద భారముగా ఉండెను. అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతముచేయగా అష్డోదువారు సంభవించినదాని చూచి–ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మనమీదను మన దేవతయగు దాగోనుమీదను బహుభారముగా నున్నదే; ఆయన మందసము మనమధ్యనుండుటయే దీనికి కారణముగదా; అది యిక మన మధ్యనుండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారులందరిని పిలువనంపించి–ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు–ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడనుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడనుండి గాతునకు మోసికొనిపోయిరి.౹ అయితే వారు అష్డోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి, గొప్ప నాశనము జేసెను.౹ వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి–మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసికొని వచ్చిరనిరి.౹ కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరి పిలువనంపించి —ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పెట్టి యుండెను.౹ చావక మిగిలియున్నవారు గడ్డల రోగముచేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను. యెహోవా మందసము ఏడు నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి–యెహోవా మందసమును ఏమి చేయుదుము? ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా వారు–ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ నుద్దేశించినయెడల ఊరకయే పంపక, యే విధముచేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థతనొంది ఆయన హస్తము మీ మీదనుండి యెందుకు తియ్యబడక యుండెనో మీరు తెలిసికొందు రనిరి.౹ ఫిలిష్తీయులు–మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా వారు— మీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక, ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను.౹ కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పంది కొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతలమీదను మీ భూమిమీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు.౹ ఐగుప్తీయులును ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుతకార్యములనుచేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి; ఇశ్రాయేలీయులు వెళ్లిపోయిరి గదా.౹ కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గరనుండి యింటికి తోలి యెహోవా మందసమును ఆ బండిమీద ఎత్తి, అపరా ధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి.౹ అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటినయెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి.౹ వారు ఆలాగున రెండు పాడి ఆవులను తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటిలోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలును పందికొక్కు రూపములునుగల ఆ చిన్న పెట్టెను బండిమీద ఎత్తగా ఆ ఆవులు రాజ మార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దువరకు పోయిరి.౹ బేత్షెమెషు వారు లోయలో తమ గోధుమచేలను కోయుచుండిరి; వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను, దానిని చూచి వారు సంతోషించిరి.౹ ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా, వారు బండియొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి.౹ లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులుగల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతిమీద ఉంచగా, ఆ దినమున బేత్షెమెషువారు యెహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి.౹ ఫిలిష్తీయుల సర్దారులు అయిదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్లిరి. అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదువారి నిమిత్తము ఒకటి, గాజావారి నిమిత్తము ఒకటి, అష్కెలోను వారి నిమిత్తము ఒకటి, గాతువారి నిమిత్తము ఒకటి, ఎక్రోనువారి నిమిత్తము ఒకటి.౹ ప్రాకారముగల పట్టణములవారేమి పొలములోని గ్రామములవారేమి ఫిలిష్తీయుల అయిదు గురు సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యము. నేటివరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములోనున్నది.౹ బేత్షెమెషువారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబదివేల డెబ్బదిమందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖా క్రాంతులైరి.౹ అప్పుడు బేత్షెమెషువారు పరిశుద్ధదేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మనయొద్దనుండి ఆయన ఎవరియొద్దకు పోవలెనని చెప్పి కిర్యత్యారీము కాపురస్థులకు దూతలను పంపి–ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరల తీసికొని వచ్చిరి; మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొని పోవలెనని వర్తమానము పంపిరి. అంతట కిర్యత్యారీమువారు వచ్చి యెహోవా మందసమును తీసికొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములోనుండిన కాలము ఇరువై సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను–మీ పూర్ణహృదయముతో యెహోవాయొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసి వేసి, పట్టుదలగలిగి యెహోవాతట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును.౹ అంతట ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతట సమూయేలు — ఇశ్రాయేలీయులందరిని మిస్పాకు పిలువనంపుడి; నేను మీపక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లుచేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి–యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను.౹ ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడియున్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలుమీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి –మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలోనుండి మనలను రక్షించునట్లుగా మాకొరకు ఆయనను ప్రార్థనచేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.౹ సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయులమీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయులమీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారుచేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి.౹ ఇశ్రాయేలీయులు మిస్పాలోనుండి బయలుదేరి బేత్కారువరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి.౹ అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి–యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను.౹ ఈలాగున ఫిలిష్తీయులు అణపబడినవారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను.౹ మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్దనుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోనునుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలోనుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను.౹ సమూయేలు తాను బ్రదికిన దినములన్నియు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.౹ ఏటేట అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములయందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను.౹ మరియు అతని యిల్లు రామాలోనుండినందున అచ్చటికి తిరిగివచ్చి అచ్చటకూడను న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయులమీద న్యాయాధిపతులుగా నియమించెను.౹ అతని జ్యేష్ఠకుమారుని పేరు యోవేలు; రెండవవాని పేరు అబీయా,౹ వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరు కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి –చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి.౹ –మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను.౹ అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా–జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు.౹ వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము.౹ అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్ని వినిపించి ఈలాగున చెప్పెను–మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, అతడు మీ కుమారులను పట్టుకొని, తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందర పరుగెత్తుదురు.౹ మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధా యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును.౹ మీ కుమార్తెలను భక్ష్యకా రిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారినిగాను పెట్టుకొనును.౹ మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవతోటలలోను శ్రేష్ఠమైనవాటిని తీసికొని తన సేవకులకిచ్చును.౹ మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదియవభాగము తీసి తన పరివారజనమునకును సేవకులకును ఇచ్చును.౹ మీ దాసులను మీ పని కత్తెలను మీ పశువులలోను గార్దభములలోను శ్రేష్ఠమైన వాటిని పట్టుకొని తన పనికొరకు ఉంచుకొనును.౹ మీ మందలో పదియవభాగము పట్టుకొనును, మీమట్టుకు మీరు అతనికి దాసులవుదురు.౹ ఆ దినమున మీరు కోరు కొనిన రాజునుబట్టి మీరు మొఱ్ఱపెట్టినను యెహోవా మీ మొఱ్ఱవినక పోవును అనెను.౹ అయినను జనులు సమూయేలుయొక్క మాట చెవిని బెట్టనొల్లక–ఆలాగున కాదు,౹ జనములు చేయురీతిని మేమును చేయునట్లు మాకు రాజుకావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించుననిరి.౹ సమూయేలు జనులయొక్క మాట లన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను గనుక యెహోవా–నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవియ్యగా సమూయేలు–మీరందరు మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు.౹ అతనికి సౌలు అను నొక కుమారు డుండెను. అతడు బహు సౌందర్యముగల యౌవనుడు, ఇశ్రాయేలీయులలో అతనిపాటి సుందరుడొకడునులేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తు గలవాడు.౹ సౌలు తండ్రియైన కీషుయొక్క గార్దభములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి–మన దాసులలో ఒకని తీసికొనిపోయి గార్దభములను వెదకుమని చెప్పెను.౹ అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషాదేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరిగాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు.౹ అయితే వారు సూపు దేశమునకు వచ్చి నప్పుడు–మనము తిరిగి వెళ్లుదము రమ్ము, గార్దభముల కొరకు చింతింపక, నా తండ్రి మనకొరకు విచారపడు నేమోయని సౌలు తనయొద్దనున్న పనివానితో అనగా వాడు–ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒక డున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్లుదము రండని చెప్పెను.౹ అందుకు సౌలు —మనము వెళ్లునెడల ఆ మనిషికి ఏమి తీసికొనిపోవు దుము? మన సామగ్రిలోనుండు భోజనపదార్థములు సరిపోయినవి; ఆ దైవజనునికి బహుమానము తీసికొనిపోవుటకు మన కేమియు లేదు అని తన పనివానితో చెప్పి— మనయొద్ద ఏమి యున్నదని అడుగగా వాడు సౌలుతో —చిత్తగించుము, నా యొద్ద పావు తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుని కిత్తుననెను.౹ ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి యనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీయులలో దేవునియొద్ద విచారణచేయుటకై ఒకడు బయలుదేరినయెడల–మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక.౹ సౌలు–నీ మాట మంచిది, వెళ్లుదము రమ్మనగా వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లుచేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు–ఇక్కడ దీర్ఘ దర్శియున్నాడా అని అడిగిరి.౹ అందుకు వారు–ఇదిగో అతడు మీ యెదుటనే యున్నాడు, త్వరగా పోయి కలిసికొనుడి; యీ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నతస్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే, అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్లకమునుపే మీరు అతని కనుగొందురు; అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు; అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువ బడినవారు భోజనము చేయుదురు, మీరు ఎక్కిపొండి; అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి.౹ వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను.౹ ఎట్లనగా–నా జనుల మొఱ్ఱ నాయొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించియున్నాను; కాగా ఫిలిష్తీయుల చేతిలోనుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయులమీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములోనుండి ఒక మనుష్యుని నీయొద్దకు రప్పించుదును.౹ సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా–ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను.౹ సౌలు గవినియందు సమూయేలును కలిసికొని–దీర్ఘదర్శి యిల్లు ఏది? దయచేసి నాతో చెప్పుమని అడుగగా సమూయేలు సౌలుతో–నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకుముందు వెళ్లుడి, నేడు మీరు నాతోకూడ భోజనము చేయవలెను, రేపు నీ మనస్సులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్లనిచ్చెదను.౹ మూడుదినముల క్రిందట తప్పిపోయిన నీ గార్దభములనుగూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరియందున్నది? నీయందును నీ తండ్రి యింటి వారియందును గదా అనెను.౹ అందుకు సౌలు–నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనదికాదా? నా యింటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు? అనెను.౹ అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు సాలలోనికి తోడుకొనిపోయి, పిలువబడిన దాదాపు ముప్పదిమందిలో ప్రధానస్థలమందు వారిని కూర్చుండబెట్టి పచనకర్తతో–నేను నీ దగ్గరనుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసికొని రమ్మనగా పచనకర్త జబ్బను దాని మీద నున్నదానిని తీసికొనివచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను–చూడుము, మనము కలిసికొను కాలమునకై దాచియుంచబడిన దానిని నీకు పెట్టియున్నాడు, జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతోకూడ భోజనముచేసెను,౹ పట్టణస్థులు ఉన్నతమైన స్థలముమీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దెమీద మాటలాడు చుండెను.౹ మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు–మిద్దెమీదనున్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరు బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో–మనకంటె ముందుగా వెళ్లుమని యీ పనివానితో చెప్పుము; దేవుడు సెలవిచ్చి నది నేను నీకు తెలియజెప్పువరకు నీవు ఇక్కడ నిలిచి యుండుమనెను; అంతట వాడు వెళ్లెను. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తలమీద తైలముపోసి అతని ముద్దు పెట్టుకొని— యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యముమీద అధిపతిగా నియమించియున్నాడు అని చెప్పి యీలాగు సెలవిచ్చెను –ఈ దినమున నీవు నా యొద్దనుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులోనుండు రాహేలు సమాధిదగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడుదురు. వారు–నీవు వెదకబోయిన గార్దభములు దొరికినవి, నీ తండ్రి తన గార్దభములకొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీకొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు.౹ తరువాత నీవు అక్కడనుండి వెళ్లి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవునియొద్దకు పోవు ముగ్గురు మనుష్యులు నీకు ఎదురుపడుదురు; ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచు వత్తురు.౹ వారు నిన్ను కుశలప్రశ్నలడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు. అవి వారిచేత నీవు తీసి కొనవలెను.౹ ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే, స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటనచేయుచు వత్తురు;౹ యెహోవా ఆత్మ నీమీదికి బలముగా దిగివచ్చును; నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సువచ్చును.౹ దేవుడు నీకు తోడుగానుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచినదాని చేయుము.౹ నాకంటె ముందు నీవు గిల్గాలునకు వెళ్లగా, దహనబలులను బలులను సమాధానబలులను అర్పించుటకై నేను నీయొద్దకు దిగి వత్తును; నేను నీయొద్దకు వచ్చి నీవు చేయవలసినదానిని నీకు తెలియజేయువరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను.౹ అతడు సమూయేలునొద్దనుండి వెళ్లిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. వారు ఆ కొండదగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారిమధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను.౹ పూర్వము అతని నెరిగినవారందరు అతడు ప్రవక్తలతోకూడనుండి ప్రకటించుట చూచి— కీషు కుమారునికి సంభవించిన దేమిటి? సౌలును ప్రవక్తలలో నున్నాడా? అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థల మందుండు ఒకడు–వారి తండ్రి యెవడని యడిగెను. అందుకు సౌలును ప్రవక్తలలో నున్నాడా? అను సామెత పుట్టెను.౹ అంతట అతడు ప్రకటించుట చాలించి ఉన్నతస్థలమునకు వచ్చెను. సౌలుయొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి–మీరిద్దరు ఎక్కడికి పోతిరని అడుగగా అతడు —గార్దభములను వెదకబోతిమి; అవి కనబడక పోగా సమూయేలునొద్దకు పోతిమని చెప్పినప్పుడు సౌలు పిన తండ్రి–సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా సౌలు–గార్దభములు దొరికినవని అతడు చెప్పెనని తన పినతండ్రితో అనెనుగాని రాజ్యమునుగూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలు పలేదు. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను –ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు–నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తుదేశములోనుండి రప్పించి ఐగుప్తీయుల వశములోనుండియు, మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వశములోనుండియు విడిపించితిని.౹ అయినను మీ దుర్దశలన్నిటిని ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి–మామీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు. కాబట్టి యిప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావ లెను.౹ ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిని సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను.౹ బెన్యామీను గోత్రమును వారి యింటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మథ్రీ యింటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని వెదకినప్పుడు అతడు కనబడలేదు.౹ కావునవారు–ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసియున్నదా అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా–ఇదిగో అతడు సామానులో దాగియున్నాడని సెలవిచ్చెను.౹ వారు పరుగెత్తిపోయి అక్కడనుండి అతని తోడుకొనివచ్చిరి; అతడు జనసమూహములో నిలిచి నప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తుగలవాడుగా కనబడెను.౹ అప్పుడు సమూయేలు–జనులందరిలో యెహోవా ఏర్పరచినవానిని మీరు చూచి తిరా? జనులందరిలో అతనివంటివాడొకడును లేడని చెప్పగా, జనులందరు బొబ్బలు పెట్టుచు–రాజు చిరంజీవి యగుగాక అని కేకలువేసిరి. తరువాత సమూయేలు రాజ్యపాలనపద్ధతిని జనులకు వినిపించి, ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతట సమూయేలు జనులందరిని వారి వారి ఇండ్లకు పంపివేసెను.౹ సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయెను. దేవునిచేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్లిరి.౹ పనికిమాలినవారు కొందరు–ఈ మనుష్యుడు మనలను ఏలాగు రక్షింపగల డని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసికొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదు కెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరు–మేము నీకు సేవచేయుదుము, మాతో నిబంధనచేయుమని నాహాషుతో అనిరి.౹ –ఇశ్రాయేలీయులందరి మీదికి నింద తెచ్చునట్లు మీయందరి కుడికన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసెదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు–మేము ఇశ్రాయేలీయుల సరిహద్దు లన్నిటికి దూతలను పంపుటకై యేడు దినముల గడువు మాకిమ్ము; మమ్మును రక్షించుటకు ఎవరును లేక పోయినయెడల మమ్మును మేము నీకప్పగించుకొనెదమనిరి.౹ దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరు బిగ్గరగా ఏడ్చిరి.౹ సౌలు పొలమునుండి పశువులను తోలుకొని వచ్చుచు— జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యాబేషువారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి.౹ సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశము లోని నలుదిక్కులకు దూతలచేత వాటిని పంపి–సౌలుతోను సమూయేలుతోను చేరకుండువాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనులమీదికి వచ్చెను గనుక యొకడైనను నిలువకుండ వారందరు వచ్చిరి.౹ అతడు బెజెకులో వారిని లెక్కపెట్టగా ఇశ్రాయేలువారు మూడు లక్షలమందియు యూదావారు ముప్పదివేలమందియు అయిరి.౹ అప్పుడు–రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేసెను. దూతలు పోయి యాబేషువారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి.౹ కాబట్టి యాబేషువారు నాహాషుయొక్క దూతలతో ఇట్లనిరి–రేపు మేము బయలుదేరి మమ్మును అప్పగించుకొందుము, అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును.౹ మరునాడు సౌలు జనులను మూడు సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండుమధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతముచేయగా వారిలో మిగిలినవారు ఇద్దరేసికూడి పోజాలకుండ చెదరి పోయిరి.౹ జనులు–సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి? మేము వారిని చంపునట్లు ఆ మనుష్యులను తెప్పించుడని సమూయేలుతో అనగా సౌలు–నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దనెను. –మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపరిపాలన పద్ధతిని మరల స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా జనులందరు గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధానబలులను అర్పించి, యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరును అక్కడ బహుగా సంతోషించిరి. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను–ఆలకించుడి; మీరు నాతో చెప్పినమాట నంగీకరించి మీమీద ఒకని రాజుగా నియమించియున్నాను.౹ రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు, మీ మధ్యనున్నారు; బాల్యమునాటినుండి నేటివరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చితిని.౹ ఇదిగో నేనున్నాను, నేనెవని యెద్దునైన తీసికొంటినా? ఎవని గార్దభమునైన పట్టు కొంటినా? ఎవనికైన అన్యాయము చేసితినా? ఎవనినైన బాధపెట్టితినా? న్యాయము నాకు అగపడకుండ ఎవని యొద్దనైన లంచము పుచ్చుకొంటినా? ఆలాగు చేసినయెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తుననెను.౹ –నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు; ఏ మనుష్యునియొద్దగాని నీవు దేనినైనను తీసికొనలేదని వారు చెప్పగా అతడు–అట్టిది నాయొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించినవాడును ఈ దినమున మీ మీద సాక్షులై యున్నారు అని చెప్పినప్పుడు–సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి.౹ మరియు సమూయేలు జనులతో ఇట్లనెను–మోషేను అహరోనును నిర్ణయించి మీపితరులను ఐగుప్తుదేశములోనుండి రప్పించినవాడు యెహోవాయే గదా కాబట్టి యెహోవా మీకును మీపితరులకును చేసిన నీతికార్యములనుబట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించునట్లు మీరు ఇక్కడ నిలిచి యుండుడి.౹ యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీపితరులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందునవారు మీపితరులను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చి యీ స్థలమందు నివసింప జేసిరి.౹ అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరుయొక్క సేనాధిపతియైన సీసెరా చేతికిని ఫిలిష్తీయుల చేతికిని మోయాబు రాజుచేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి.౹ అంతట వారు–మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అష్తారోతు దేవతలను పూజించి నందున పాపము చేసితిమి; మా శత్రువుల చేతిలోనుండి నీవు మమ్మును విడిపించినయెడల మేము నిన్ను సేవించెదమని యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా యెరు బ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి, నలుదిశల మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించి నందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు.౹ అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజైయున్నను–ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి.౹ కాబట్టి మీరు కోరి యేర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీమీద రాజుగా నిర్ణయించియున్నాడు.౹ మీరు యెహోవాయందు భయభక్తులుకలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినయెడల మీకు క్షేమము కలుగును.౹ అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినయెడల యెహోవా హస్తము మీపితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును.౹ మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి.౹ గోధుమ కోతకాలము ఇదే గదా? మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను.౹ సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరు యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి–రాజును నియమించుమని మేము అడుగుటచేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండ నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము.౹ అంతట సమూయేలు జనులతో ఇట్లనెను— భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.౹ ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జించువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అను సరించుదురు. నిజముగా అవి మాయయే.౹ యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.౹ నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.౹ ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.౹ మీరు కీడుచేయువారైతే తప్పకుండ మీరును మీ రాజును నాశనమగుదురు. సౌలు ముప్పది ఏండ్లవాడై యేలనారంభించెను. అతడు రెండు సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను ఇశ్రాయేలీయులలో మూడు వేలమందిని ఏర్పరచు కొనెను. వీరిలో రెండు వేలమంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలునొద్దనుండిరి; వెయ్యిమంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్దనుండిరి; మిగిలినవారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను.౹ యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతముచేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను; మరియు దేశమంతట హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను.౹ సౌలు ఫిలిష్తీయుల దండును హతముచేసినందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడివచ్చిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకై ముప్పదివేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి.౹ ఇశ్రాయేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నతస్థలములలోను కూపములలోను దాగిరి.౹ కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్లి పోయిరిగాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను; జనులందరు భయపడుచు అతని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్దనుండి చెదరిపోవుటయు చూచి — దహనబలులను సమాధానబలులను నా యొద్దకు తీసికొని రమ్మని చెప్పి దహనబలి అర్పించెను.౹ అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసి కొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో–నీవు చేసిన పని యేమని యడిగెను. అందుకు సౌలు–జనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి –ఇంకను యెహోవాను శాంతిపరచకమునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నామీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితిననెను.౹ అందుకు సమూయేలు ఇట్లనెను–నీ దేవుడైన యెహోవా నీ కిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి; నీ రాజ్యమును ఇశ్రాయేలీయులమీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి యుండెను; అయితే నీ రాజ్యము నిలు వదు.౹ యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనులమీద అతనిని అధిపతినిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను; సౌలు తనయొద్దనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు ఆరు వందలమంది యుండిరి.౹ సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గర నున్న వారితోకూడ బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి; ఫిలిష్తీయులు మిక్మషులో దిగియుండిరి.౹ మరియు ఫిలిష్తీయుల పాళెములోనుండి దోపుడుగాండ్రు మూడుగుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున, ఒఫ్రాకు పోవుమార్గమున సంచరించెను.౹ రెండవ గుంపు బేత్‍హోరోనుకు పోవుమార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోయ సరిహద్దు మార్గమున సంచరించెను. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందు రేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతట కమ్మరవాండ్రులేకుండచేసియుండిరి.౹ కాబట్టి ఇశ్రాయేలీయులందరు తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయులదగ్గరకు పోవలసి వచ్చెను.౹ అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లుగల కొంకులకును గొడ్డండ్రకునుమునుకోల కఱ్ఱలు సరిచేయుటకును ఆకురాళ్లు మాత్రము వారియొద్ద నుండెను.౹ కాబట్టి యుద్ధదినమందు సౌలునొద్దను యోనాతాను నొద్దను ఉన్నజనులలో ఒకని చేతిలోనైనను కత్తియేగాని యీటెయేగాని లేకపోయెను, సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి యుండెను.౹ ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమియు చెప్పక తన ఆయుధములను మోయు పడుచువానిని పిలిచి–అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలివారిని హతముచేయ పోదము రమ్మనెను.౹ సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మచెట్టు క్రింద దిగియుండెను, అతని యొద్దనున్న జనులు దాదాపు ఆరు వందలమంది.౹ షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీయొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదుయొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహీయా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్లిన సంగతి జనులకు తెలియకయుండెను.౹ యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలివారున్న స్థలమునకు పో జూచిన దారియగు కనుమల నడుమ ఇవతల ఒక సూది గట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను, వాటిలో ఒకదాని పేరు బొస్సేసు రెండవదానిపేరు సెనే.౹ ఒక దాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపువైపునను, రెండవదాని కొమ్ము గిబియా యెదుట దక్షిణపువైపునను ఉండెను.౹ యోనాతాను — ఈ సున్నతిలేనివారి దండు కాపరులమీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు–నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము. నీ యిష్టాను సారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పెను.౹ అప్పుడు యోనాతాను–మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందము.౹ వారు మనలను చూచి–మేము మీ యొద్దకు వచ్చువరకు అక్కడ నిలువుడని చెప్పినయెడల వారియొద్దకు పోక మనమున్నచోట నిలుచుదము.౹ –మాయొద్దకు రండని వారు చెప్పినయెడల యెహోవావారిని మనచేతికి అప్పగించెనని దానిచేత గుర్తించి మనము పోదమని చెప్పగా వీరిద్దరు తమ్మును తాము ఫిలిష్తీయుల దండుకాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులు–చూడుడి, తాము దాగియుండిన గుహలలోనుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి— మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను–నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోను కాళ్లతోను ప్రాకి యెక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతనివెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను.౹ యోనాతానును అతని ఆయు ధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువదిమంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అరయెకరము నేల పొడుగున అది జరిగెను.౹ దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడు గాండ్రును భీతినొందిరి; నేలయదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి.౹ దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో నున్న సౌలుయొక్క వేగులవారికి కనబడగా సౌలు–మీరు లెక్కపెట్టి మనయొద్ద లేనివారెవరో చూడుడని తనయొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలిసికొనిరి. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయులయొద్ద ఉండగా–దేవుని మందసమును ఇక్కడికి తీసికొనిరమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను.౹ సౌలు యాజకునితో మాటలాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి యెక్కువగా వినబడెను; కాబట్టి సౌలు యాజకునితో— నీ చెయ్యి వెనుకకు తీయుమని చెప్పి తానును తనయొద్దనున్న జనులందరును కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసికొనుచుండిరి.౹ మరియు అంతకుమునుపు ఫిలిష్తీయుల వశముననున్నవారై చుట్టునున్న ప్రాంతములలోనుండి వారితోకూడ దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు నొద్దను యోనాతానునొద్దను ఉన్న ఇశ్రాయేలీయులతో కలిసికొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి.౹ అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి.౹ ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. యుద్ధము బేతావెను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందిరి.౹ –నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనకమునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనులచేత ప్రమాణము చేయించెను, అందువలన జనులు ఏమియు తినకుండిరి.౹ జనులందరు ఒక అడవిలోనికి రాగా అక్కడ నేలమీద తేనె కనబడెను.౹ జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెనుగాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోటపెట్టలేదు.౹ అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము వినలేదు. గనుక తన చేతికఱ్ఱ చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను.౹ జనులలో ఒకడు–నీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించి–ఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను.౹ అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయెను; నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనముచేసినయెడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను.౹ ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోనువరకు హతముచేయగా జనులు బహు బడలిక నొందిరి.౹ జనులు దోపుడుమీద ఎగబడి, గొఱ్ఱెలను ఎడ్లను పెయ్యలను తీసికొని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున –జనులు రక్తముతోనేతిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు–మీరు విశ్వాసఘాతకులైతిరి; పెద్ద రాయి యొకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి –మీరు అక్కడక్కడికి జనులమధ్యకు పోయి, అందరు తమ యెద్దులను తమ గొఱ్ఱెలను నాయొద్దకు తీసికొనివచ్చి యిక్కడ వధించి భక్షింపవలెను; రక్తముతో మాంసముతిని యెహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరు ఆ రాత్రి తమతమ యెద్దులను తీసికొని వచ్చి అక్కడ వధించిరి.౹ మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. అంతట–మనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారువరకు వారిని కలతపెట్టి, శేషించు వాడొకడునులేకుండ చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు —నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతట సౌలు–యాజకుడు ఇక్కడనే యున్నాడు, దేవునియొద్ద విచారణ చేయుదము రండని చెప్పి సౌలు–ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయినయెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవునియొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక యుండెను.౹ అందువలన సౌలు–జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరివలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను.౹ నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీయులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమాణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చినవాడు ఒకడును లేకపోయెను.౹ –మీరు ఒకతట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒకతట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు–నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి.౹ అప్పుడు సౌలు–ఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెనుగాని జనులు తప్పించుకొనిరి.౹ –నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను.౹ –నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను–నా చేతికఱ్ఱకొనతో కొంచెము తేనె పుచ్చుకొన్న మాట వాస్తవమే; కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను.౹ అందుకు సౌలు–యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక అనెను.౹ అయితే జనులు సౌలుతో–ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవముతోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.౹ అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్లిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్లిరి. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోను అమ్మోనీయులతోను ఎదోమీ యులతోను సోబాదేశపు రాజులతోను ఫిలిష్తీయులతోను యుద్ధము చేసెను. ఎవరిమీదికి అతడు పోయెనో వారినందరిని ఓడించెను.౹ మరియు అతడు దండునుకూర్చి అమాలేకీయులను హతముచేసి ఇశ్రాయేలీయులను కొల్ల సొమ్ముగా పెట్టినవారి చేతిలోనుండి వారిని విడిపించెను. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, యోనాతాను ఇష్వీ మెల్కీషూవ; అతని యిద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదానిపేరు మేరబు చిన్న దానిపేరు మీకాలు.౹ సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు, ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు, ఇతడు సౌలునకు పిన తండ్రియైన నేరు కుమారుడు.౹ సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రియగు నేరును అబీయేలు కుమారులు. సౌలు బ్రదికిన దినములన్నియు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరుగగా తాను చూచిన బలాఢ్యుల నందరిని పరాక్రమశాలులనందరిని తనయొద్దకు చేర్చుకొనెను. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులగు తన జనులమీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను; యెహోవా మాట వినుము.౹ సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా–అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే, వారు ఐగుప్తులోనుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారిమీదికి వచ్చిరి గదా.౹ కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతముచేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను. అంతట సౌలు జనులను పోగుచేసి తెలాయీములో వారిని లెక్కపెట్టగా, కాలుబలము రెండు లక్షలమందియు యూదావారు పదివేలమందియు నుండిరి.౹ అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో నొకదానికి వచ్చి లోయలో పొంచియుండి –ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతోకూడ నేను మిమ్మును నాశనము చేయకుండునట్లు మీరు వారిలోనుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలోనుండి వెళ్లిపోయిరి.౹ తరువాత సౌలు అమాలేకీయులను హవీలానుండి ఐగుప్తుదేశపు మార్గముననున్న షూరువరకు తరిమి హతముచేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరిని కత్తిచేత నిర్మూలము చేసెను సౌలును జనులును కూడి అగగును, గొఱ్ఱెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొఱ్ఱెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి, పనికిరాని నీచపశువులన్నిటిని నిర్మూలముచేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –సౌలు నన్ను అనుస రింపక వెనుకతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మొఱ్ఱపెట్టుచుండెను.౹ ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకువచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను.౹ తరువాత అతడు సౌలు నొద్దకురాగా సౌలు–యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు–ఆలాగైతే నాకు వినబడుచున్న గొఱ్ఱెల అరుపులును ఎడ్ల రంకెలును ఎక్కడివి? అని అడిగెను.౹ అందుకు సౌలు–అమాలేకీయుల యొద్దనుండి జనులు వీటిని తీసికొనివచ్చిరి; నీ దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకు జనులు గొఱ్ఱెలలోను ఎడ్లలోను మంచివాటిని ఉండనిచ్చిరి; మిగిలినవాటినన్నిటిని మేము నిర్మూలముచేసితిమనగా సమూయేలు–నీవు మాటలాడ పనిలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలు–చెప్పుమనెను.౹ అందుకు సమూయేలు— నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకించెను.౹ మరియు యెహోవా నిన్ను సాగనంపి–నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగువరకు వారితో యుద్ధము చేయుమని సెలవియ్యగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడుమీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను.౹ అందుకు సౌలు–ఆ మాట అనవద్దు; నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసికొనివచ్చితిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసితిని.౹ అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొఱ్ఱెలలోను ఎడ్లలోను ముఖ్యమైనవాటిని తీసికొనివచ్చిరని సమూయేలుతో చెప్పెను.౹ అందుకు సమూయేలు–తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.౹ తిరుగుబాటు చేయుట సోదెచెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగా సౌలు–జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని.౹ కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతోకూడ తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను.౹ అందుకు సమూయేలు–నీతోకూడ నేను తిరిగి రాను; నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి వెళ్లిపోవలెనని తిరుగగా, సౌలు అతని దుప్పటిచెంగు పట్టుకొనినందున అది చినిగెను.౹ అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను–నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు.౹ మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు.౹ అందుకు సౌలు–నేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దలయెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నన్ను ఘనపరచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతోకూడ తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్లెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత సమూయేలు–అమాలేకీయులరాజైన అగగును నా దగ్గరకు తీసికొనిరండనిచెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి–మరణశ్రమ నాకు గడచిపోయెనే అని చెప్పగా సమూయేలు–నీ కత్తి స్త్రీలకు సంతులేకుండ చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతులేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయెను, సౌలును సౌలు గిబియాలోని తన యింటికి వెళ్లెను.౹ సౌలు బ్రదికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్లలేదుగాని సౌలునుగూర్చి దుఃఖాక్రాంతు డాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయులమీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను — ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.౹ సమూయేలు–నేనెట్లు వెళ్లుదును? నేను వెళ్లిన సంగతి సౌలు వినినయెడల అతడు నన్ను చంపుననగా యెహోవా —నీవు ఒక పెయ్యను తీసికొనిపోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెష్షయిని బల్యర్పణమునకు పిలువుము; అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును; ఎవనిపేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవియ్యగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవుచొప్పున బేత్లెహేమునకు వెళ్లెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి–సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు–సమాధానముగానే వచ్చితిని; మీరు శుద్ధులై నాతోకూడ బలికి రండని చెప్పి, యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను.౹ వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి–నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచియున్నాడని అనుకొనెను అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను–అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసి యున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.౹ యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు–యెహోవా ఇతని కోరుకొన లేదనెను.౹ అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు —యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను.౹ యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు–యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు–ఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు–నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను. అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములుగలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను. అతడు రాగానే–నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దనుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా సౌలు సేవకులు–దేవునియొద్దనుండి వచ్చిన దురాత్మయొకటి నిన్ను వెరపించియున్నది;౹ మా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొకని విచారించుటకై మాకు సెలవిమ్ము దేవుని యొద్దనుండి దురాత్మ వచ్చి నిన్ను పెట్టినప్పుడెల్ల అతడు సితారా చేతపట్టుకొని వాయించుటచేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి సౌలు–బాగుగా వాయింపగల యొకని విచారించి నా యొద్దకు తీసికొని రండని తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు –చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా సౌలు–యెష్షయియొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెలయొద్దనున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపుమనెను.౹ అప్పుడు యెష్షయి ఒక గార్దభముమీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదుచేత సౌలునొద్దకు పంపెను.౹ దావీదు సౌలు దగ్గరకువచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను.౹ అంతట సౌలు–దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవచేయుటకు ఒప్పుకొనుమని యెష్ష యికి వర్తమానము పంపెను.౹ దేవునియొద్దనుండి దురాత్మ వచ్చి సౌలును పెట్టినప్పుడెల్ల దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమ కూర్చి యూదా దేశములోని శోకోలో కూడి ఏఫెస్దమ్మీము దగ్గర శోకోకును అజేకాకునుమధ్యను దిగి యుండగా సౌలును ఇశ్రాయేలీయులును కూడివచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయుల కెదురుగ యుద్ధపంక్తులు తీర్చిరి.౹ ఫిలిష్తీయులు ఆతట్టు పర్వతము మీదను ఇశ్రాయేలీయులు ఈతట్టు పర్వతముమీదను నిలిచియుండగా ఉభయులమధ్యను ఒక లోయయుండెను.౹ గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులోనుండి బయలుదేరు చుండెను. అతడు ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి.౹ అతని తలమీద రాగి శిరస్త్రాణముండెను, అతడు యుద్ధకవచము ధరించియుండెను, ఆ కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది.౹ మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజములమధ్యను రాగి బల్లెమొకటి యుండెను.౹ అతని యీటెకఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; మరియు అతని యీటెకొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను.౹ అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి–యుద్ధపంక్తులు తీర్చుటకై మీ రెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులుకారా? మీ పక్షముగా ఒకనిని ఏర్ప రచుకొని అతని నాయొద్దకు పంపుడి;౹ అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగినయెడల మేము మీకు దాసుల మగుదుము; నేనతని జయించి చంపినయెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు.౹ ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించినయెడలవాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను.౹ సౌలును ఇశ్రాయేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి ఎనమండు గురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను.౹ అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా,౹ దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని దావీదు బేత్లెహేములో తన తండ్రి గొఱ్ఱెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను.౹ ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్నుతాను అగుపరచుకొనుచు వచ్చెను. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి–నీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరులదగ్గరకు త్వరగా పొమ్ము.౹ మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొనిపోయి వారి సహస్రాధిపతి కిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొని రమ్మనిచెప్పి పంపివేసెను.౹ సౌలును వారును ఇశ్రాయేలీయులందరును ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱెలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తన కిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి.౹ సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులును యుద్ధసన్నద్ధులై బయలుదేరుచుండిరి.౹ దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశము చేసి, పరుగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశలప్రశ్నలు తన సహోదరుల నడిగెను.౹ అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములోనుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను.౹ ఇశ్రాయేలీయులందరు ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని యెదుటనుండి పారిపోగా ఇశ్రాయేలీయులలో ఒకడు —వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరు చున్నాడు, వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగాచేయు ననగా దావీదు–జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా జనులు–వాని చంపినవానికి ఇట్లిట్లు చేయబడునని అతని కుత్తరమిచ్చిరి. అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్నయగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితో–నీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను.౹ అందుకు దావీదు–నేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి అతనియొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆప్రకారమే యడుగగా జనులు వానికి అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి.౹ దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియ జెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను.౹ –ఈ ఫిలిష్తీయునిబట్టి యెవరిమనస్సును క్రుంగ నిమిత్తములేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా సౌలు–ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను.౹ అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను–మీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱెపిల్లను ఎత్తికొని పోవుచుండగ నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱెను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని.౹ మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు,౹ సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటియొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు–పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను. పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి, యుద్ధకవ చము తొడిగించెను.౹ ఈ సామగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ల కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు–ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కఱ్ఱ చేతపట్టుకొని యేటి లోయలోనుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేతపట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను.౹ డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గ రకువచ్చి చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను.౹ ఫిలిప్తీయుడు–కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను.౹ –నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశపక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా దావీదు–నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.౹ ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగ వేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును.౹ అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను.౹ ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందునవాడు నేలను బోర్లపడెను.౹ దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను.౹ వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయునిమీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి.౹ అప్పుడు ఇశ్రాయేలువారును యూదావారును లేచి–జయము జయమని అరచుచు లోయవరకును షరాయిము ఎక్రోనువరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి.౹ అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి.౹ అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి–అబ్నేరూ, ఈ యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరు–రాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియ దనెను.౹ అందుకు రాజు–ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలిసికొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.౹ దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొనిపోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొనివచ్చెను.౹ సౌలు అతనిని చూచి–చిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగా దావీదు–నేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.౹ ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్లనియ్యక సౌలు అతనిని చేర్చుకొనెను.౹ దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధనచేసికొనెను.౹ మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడి కట్టును తీసి దావీదున కిచ్చెను.౹ దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి, సుబుద్ధిగలిగి పని చేసికొని వచ్చెను గనుక సౌలు యోధులమీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై యుండెను. దావీదు ఫిలిష్తీయుని హతముచేసితిరిగి వచ్చినప్పుడు, స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్లన్నిటిలోనుండి తంబురలతోను సంభ్రమముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి ఆ స్ర్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు— సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని–వారు దావీదునకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అను కొనెను.౹ కాబట్టి నాటనుండి సౌలు దావీదుమీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవునియొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించు చుండగా దావీదుమునుపటిలాగున వీణచేతపట్టుకొని వాయించెను.౹ ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగా–దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించుకొనెను.౹ యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను.౹ కాబట్టి సౌలు అతని తనయొద్ద నుండనియ్యక సహస్రాధిపతిగా చేసెను; అతడు జనులకు ముందువచ్చుచు పోవుచు నుండెను.౹ మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధిగలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను.౹ దావీదు మిగుల సుబుద్ధిగలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి యధికముగా అతనికి భయపడెను.౹ ఇశ్రాయేలు వారితోను యూదావారితోను దావీదు జనులకు ముందువచ్చుచు, పోవుచునుండుటచేత వారు అతనిని ప్రేమింపగా సౌలు —నా చెయ్యి వానిమీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వానిమీద పడును గాక అనుకొని–దావీదూ, నా పెద్దకుమార్తెయైన మేరబును నీకిత్తును; నీవు నా పట్ల యుద్ధ శాలివై యుండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను.౹ అందుకు దావీదు–రాజునకు అల్లుడనగుటకు నేనెంతటివాడను? నా స్థితియైనను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనెను.౹ అయితే సౌలు కుమార్తెయైన మేరబును దావీదునకు ఇయ్య వలసి యుండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రీయేలుకిచ్చి పెండ్లి చేసెను.౹ అయితే తన కుమార్తెయైన మీకాలు దావీదు మీద ప్రేమ గలిగియుండగా సౌలు విని సంతోషించి,౹ ఆమె అతనికి ఉరిగానుండు నట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతనిమీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని–ఇప్పుడు నీవు మరి యొకదానిచేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి–మీరు దావీదుతో రహస్యముగా మాటలాడి–రాజు నీయందు ఇష్టము గలిగియున్నాడు, అతని సేవకులందరును నీయెడల స్నేహముగా నున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.౹ సౌలు సేవకులు ఆ మాటలనుబట్టి దావీ దుతో సంభాషింపగా దావీదు–నేను దరిద్రుడనై యెన్నిక లేని వాడనై యుండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా? అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియ జేసిరి.౹ అందుకు సౌలు ఫిలిష్తీయులచేత దావీదును పడ గొట్టవలెనన్న తాత్పర్యముగలవాడై–రాజు ఓలిని కోరక రాజు శత్రువులమీద పగతీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పు డనెను.౹ సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియ జేయగా తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై గడువుదాటకమునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందలమందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను.౹ యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు, తన కుమార్తెయైన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి యెక్కువగా భయపడి, యెల్ల ప్పుడును దావీదు మీద విరోధముగా ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలు దేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము గలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటె అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. అంతట సౌలు–మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోను చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదుయందు బహు ఇష్టముగలవాడైయుండి దావీదుతో ఇట్లనెను–నా తండ్రియైన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నముమీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము.౹ నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రియొద్ద నిలిచి నిన్నుగూర్చి అతనితో మాటలాడిన తరువాత నిన్నుగూర్చి నాకేమైన తెలిసినయెడల దానిని నీతో తెలియజెప్పుదుననెను.౹ యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదునుగూర్చిదయగా మాటలాడి–నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలుచేసెను గనుక, రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక.౹ అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవిచేయగా సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి–యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణముచేసెను.౹ అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొనిపోయి ఆ సంగతులన్నియు అతనికి తెలియజేసి దావీదును సౌలునొద్దకు తీసికొనిరాగా దావీదుమునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను.౹ తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధచేయగా యెహోవాయొద్దనుండి దురాత్మ సౌలుమీదికి వచ్చెను. సౌలు ఈటె చేతపట్టుకొని యింట కూర్చుండి యుండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యముగలిగి యీటె విసి రెను. దావీదు అతని యెదుటనుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రియందు తప్పించుకొని పారిపోయెను.౹ ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని యింటికి దూతలను పంపగా దావీదు భార్యయైన మీకాలు —ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనేగాని రేపు నీవు చంపబడుదువని చెప్పి కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను.౹ తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా–అతడు రోగియై యున్నాడని చెప్పెను.౹ దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి–నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసికొని రండని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల యొకటి మంచము మీద కనబడెను.౹ అప్పుడు సౌలు–తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నీలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా మీకాలు–నే నెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. ఆలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో నున్న సమూయేలునొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురముండిరి.౹ దావీదు రామాదగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను; వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారిమీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతలమీదికి వచ్చెను గనుక వారును ప్రకటింప నారంభించిరి.౹ ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెనుగాని వారును అటువలెనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెనుగాని వారును ప్రకటించుచుండిరి.౹ కడవరిసారి తానే రామాకు పోయి సేఖూ దగ్గరనున్న గొప్ప బావియొద్దకు వచ్చి–సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు–రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను.౹ అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామాదగ్గరనున్న నాయోతునకు వచ్చువరకు ప్రకటించుచుండెను,౹ మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆ నాటి రాత్రింబగళ్లు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు, పైబట్టలేనివాడై పడియుండెను. అందువలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టెను. పిమ్మట దావీదు రామాలోని నాయోతునుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి–నేను ఏమి చేసితిని? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమనియడుగగా యోనాతాను–ఆ మాట నీవెన్నటికిని అనుకొనవద్దు, నీవు చావవు; నాకు తెలియజేయకుండ నా తండ్రి చిన్న కార్యమేగాని పెద్దకార్యమేగాని చేయడు; నా తండ్రి ఇదెందుకు నాకు మరుగుచేయుననగా దావీదు–నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలిసికొని, యోనాతానునకు చింత కలుగకుండుటకై యిది అతనికి తెలుపననుకొనుచున్నాడు; అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణముచేయగా యోనాతాను–నీకేమి తోచునో దానినే నేను నీ యెడల జరుపుదుననెను.౹ అందుకు దావీదు–రేపటిదినము అమావాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము.౹ ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. —దావీదు ఇంటివారికి ఏటేట బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నాయొద్ద సెలవుపుచ్చు కొనెను.౹ అతడు–మంచిదని సెలవిచ్చినయెడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును; అతడు బహుగా కోపించినయెడల అతడు నాకు కీడుచేయ తాత్పర్యముగలవాడై యున్నాడని నీవు తెలిసికొని నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను; ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి; నాయందు దోషమేమైన ఉండినయెడల నీ తండ్రియొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతానునొద్ద మనవిచేయగా యోనాతాను–ఆ మాట ఎన్నటికిని అనరాదు; నా తండ్రి నీకు కీడుచేయనుద్దేశము గలిగియున్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును గదా అని అనగా దావీదు–నీ తండ్రి నన్నుగూర్చి నీతో కఠినముగా మాటలాడినయెడల దాని నాకు తెలియజేయువారెవరని యోనాతాను నడిగెను.౹ అందుకు యోనాతాను–పొలములోనికి వెళ్లుదము రమ్మనగా, ఇద్దరును పొలములోనికి పోయిరి. అప్పుడు యోనాతాను–ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి; రేపైనను ఎల్లుండియైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును; అప్పుడు దావీదునకు క్షేమ మవునని నేను తెలిసికొనినయెడల నేను ఆ వర్తమానము నీకు పంపక పోవుదునా? అయితే నా తండ్రి నీకు కీడుచేయనుద్దేశించుచున్నాడని నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్లునట్లు నిన్ను పంపివేయనియెడల యెహోవా నాకు గొప్పఅపాయము కలుగజేయుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక.౹ [14-15] అయితే నేను బ్రదికియుండినయెడల నేను చావకుండ యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపక పోయినయెడలనేమి, నేను చనిపోయినయెడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమిమీద నిలువకుండ నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతివారికి దయ చూపక పోయినయెడలనేమి యెహోవా నిన్ను విసర్జించును గాక.౹ *** ఈలాగున యెహోవా దావీదుయొక్క శత్రువుల చేత దాని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతివారిని బట్టి నిబంధన చేసెను.౹ యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమనుబట్టి దావీదుచేత మరల ప్రమాణము చేయించెను.౹ మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను— రేపటిదినము అమావాస్య; నీ స్థలము ఖాళిగా కనబడును గదా;౹ నీవు మూడుదినములు ఆగి, యీ పని జరుగుచుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్లి ఏసెలు అనుబండ దగ్గర నుండుము గురి చూచి ప్రయో గించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్కకు కొట్టి –నీవు వెళ్లి బాణములను వెదకుమని ఒక పని వానితో చెప్పుదును–బాణములు నీకు ఈతట్టున నున్నవి, పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పినయెడల నీవు బయటికి రావచ్చును; యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును.౹ అయితే–బాణములు నీకు అవతల నున్నవని నేను వానితో చెప్పినయెడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలిసికొని నీవు ప్రయాణమై పోవలెను.౹ అయితే మనమిద్దరము మాటలాడిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము; నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను; అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయకూర్చుండగా మునుపటివలెనే రాజు గోడదగ్గర నున్న స్థలమందు తన ఆసనముమీద కూర్చునియుండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను; అయితే దావీదు స్థలము ఖాళిగా నుండెను.౹ అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడైయుండు నేమో, అతడు అపవిత్రుడైయుండుట యవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమియు అనలేదు.౹ అయితే అమావాస్య పోయిన మరునాడు, అనగా రెండవదినమున దావీదు స్థలములో ఎవడును లేకపోవుట చూచి సౌలు— నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను నడుగగా యోనాతాను–దావీదు బేత్లెహేమునకు పోవలెనని కోరి దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా యింటివారు బలి అర్పింపబోవుచున్నారు–నీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్లి నా సహోదరులను దర్శించునట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నాయొద్ద సెలవు తీసికొనెను; అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్లయొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా సౌలు యోనాతానుమీద బహుగా కోపపడి — ఆ గడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గుకలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షయి కుమారుడు భూమిమీద బ్రదుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా; కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పెను.౹ అంతట యోనాతాను–అతడెందుకు మరణశిక్ష నొందవలెను? అతడు ఏమి చేసెనని సౌలు నడుగగా సౌలు అతనిని పొడువవలెనని యీటె విసిరెను; అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము గలిగియున్నాడని యోనాతాను తెలిసికొని అత్యాగ్రహుడై బల్లయొద్దనుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయముచేసికొనిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను.౹ –నీవు పరుగెత్తికొనిపోయి నేను వేయు బాణములను వెదకుమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరుగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను.౹ అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్నచోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి–బాణము నీ అవతలనున్నదని చెప్పి వాని వెనుక నుండి కేకవేసి–నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను; యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానునియొద్దకు వాటిని తీసికొని వచ్చెనుగాని సంగతి ఏమియు వానికి తెలియక యుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసి యుండెను.౹ యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి–వీటిని పట్టణమునకు తీసికొని పొమ్మనిచెప్పి వాని పంపివేసెను.౹ వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను.౹ అంతట యోనాతాను–యెహోవా నీకును నాకునుమధ్యను నీ సంతతికిని నా సంతతికినిమధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసికొని యున్నాము గనుక మనస్సులో నెమ్మది గలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్లిపోయెను; యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను; అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి–నీవు ఒంటరిగా వచ్చితివేమని అతని నడుగగా దావీదు–రాజు నాకు ఒక పని నిర్ణయించి–నేను నీ కాజ్ఞాపించి పంపిన పని యేదో అదెవనితోనైనను చెప్ప వద్దనెను; నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ల నిర్ణయించితిని;౹ నీయొద్ద ఏమి యున్నది? అయిదు రొట్టెలుగాని మరేమియుగాని యుండినయెడల అది నా కిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా యాజకుడు —సాధారణమైన రొట్టె నాయొద్ద లేదు; పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను.౹ అందుకు దావీదు–నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటినుండి ఈ మూడుదినములు స్త్రీలు మాకు దూరముగానే యున్నారు; పనివారి బట్టలు పవిత్రములే; ఒకవేళ మేముచేయుకార్యము అపవిత్రమైనయెడల నేమి? రాజాజ్ఞనుబట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను.౹ అంతట యెహోవా సన్నిధినుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చనిరొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతని కిచ్చెను. ఆ దినమున సౌలుయొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను; అతని పేరు దోయేగు, అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పసుల కాపరులకు పెద్ద.౹ –రాజు పని వేగిరముగా జరుగవలెనని యెరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీయొద్ద ఖడ్గమైనను ఈటెయైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకు నడుగగా యాజకుడు–ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదువెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమునులేదు, దాని తీసికొనుటకు నీకిష్టమైనయెడల తీసికొనుమనగా దావీదు–దానికి సమమైనదొకటియు లేదు, నా కిమ్మనెను. అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినము ననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషునొద్దకు వచ్చెను.౹ ఆకీషు సేవకులు–ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గానప్రతిగానములు చేయుచు— సౌలు వేలకొలది హతముచేసెననియు, దావీదు పదివేలకొలది హతముచేసెననియు పాడిన పాటలు ఇతనిగూర్చినవే గదా అని అతనినిబట్టి రాజుతో మాటలాడగా దావీదు ఈ మాటలు తన మనస్సులోనుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను.౹ కాబట్టి దావీదు వారి యెదుట తన చర్య మార్చుకొని వెఱ్ఱివానివలె నటించుచు, ద్వారపు తలుపులమీద గీతలు గీయుచు, ఉమ్మి తన గడ్డముమీదికి కార నిచ్చుచు నుండెను. వారతని పట్టుకొనిపోగా అతడు పిచ్చిచేష్టలు చేయుచు వచ్చెను.౹ కావున ఆకీషురాజు— మీరు చూచితిరికదా? వానికి పిచ్చిపెట్టినది, నాయొద్దకు వీని నెందుకు తీసికొని వచ్చితిరి? పిచ్చిచేష్టలుచేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చిచేష్టలు చేయుటకు వీని తీసికొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రా తగునా? అని తన సేవకులతో అనెను. దావీదు అక్కడనుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొనిపోగా అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి.౹ మరియు ఇబ్బందిగలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండు వారందరును, అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతనియొద్దకు ఎక్కువ తక్కువ నాలుగువందలమంది వచ్చియుండిరి.౹ తరువాత దావీదు అక్కడనుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి —దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలిసికొనువరకు నా తలిదండ్రులు వచ్చి నీయొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవిచేసి అతనియొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగియున్న దినములువారు అతనియొద్ద కాపురముండిరి.౹ మరియు ప్రవక్తయగు గాదు వచ్చి–కొండలలో ఉండక యూదాదేశమునకు పారి పొమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారెతు అడవిలో చొచ్చెను. దావీదును అతని జనులును ఫలానిచోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచులవృక్షముక్రింద దిగి యీటె చేతపట్టుకొని యుండెను. అతని సేవకులు అతనిచుట్టు నిలిచియుండగా సౌలు తనచుట్టు నిలిచియున్న సేవకులతో ఇట్లనెను — బెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్షతోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? మీరెందుకు నామీద కుట్రచేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధనచేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియ జేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి యుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపి నను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే.౹ అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి యుండి–యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకురాగా నేను చూచితిని.౹ అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్ద విచారణచేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని కిచ్చెనని చెప్పగా రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరిని పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా సౌలు–అహీటూబు కుమారుడా, ఆలకించుమనగా అతడు–చిత్తము నా యేలినవాడా అనెను.౹ సౌలు–నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవునియొద్ద విచారణచేసి, అతడు నామీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి యుండుటకై అతడును నీవును జతకూడితిరేమని యడుగగా అహీమెలెకు–రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్థుడై, ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనతవహించిన దావీదువంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవునియొద్ద విచారణచేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక; రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటి వారందరిమీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతినిగూర్చి కొద్ది గొప్ప యేమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవిచేయగా రాజు–అహీమెలెకూ, నీకును నీ తండ్రి ఇంటివారికందరికిని మరణము నిశ్చయము అని చెప్పి యెహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసినందునను, అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయక పోయినందునను మీరు వారిమీదపడి చంపుడని తనచుట్టు నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక యుండగా రాజు దోయేగుతో–నీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీదపడి ఏఫోదు ధరించుకొనినయెనుబది యయిదుగురిని ఆ దినమున హతముచేసెను.౹ మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్థులను కత్తివాత హతము చేసెను; మగ వారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దభములనేమి గొఱ్ఱెలనేమి అన్నిటిని కత్తివాత హతముచేసెను.౹ అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అను నొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా దావీదు–ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందునవాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని; నీ తండ్రి యింటివారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడ నైతిని గదా.౹ నీవు భయపడక నాయొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు; నా ప్రాణము తీయ చూచువాడును నీ ప్రాణము తీయచూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను. తరువాత ఫిలిష్తీయులు కెయీలామీద యుద్ధము చేసి కళ్లములమీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను.౹ అంతట దావీదు–నేను వెళ్లి యీ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా–నీవు వెళ్లి ఫిలిష్తీయులను హతముచేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను.౹ దావీదుతోకూడియున్న జనులు— మేము ఇచ్చట యూదా దేశములో ఉండినను మాకు భయముగా నున్నది; ఫిలిష్తీయుల సైన్యములకెదురుగా కెయీలాకు మేము వచ్చినయెడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా దావీదు మరల యెహోవాయొద్ద విచారణ చేసెను–నీవు లేచి కెయీలాకు వెళ్లుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవియ్యగా దావీదును అతని జనులును కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి వారిని లెస్సగా హతముచేసి వారి పశువులను దోచుకొనివచ్చిరి. ఈలాగున దావీదు కెయీలా కాపురస్థులను రక్షించెను. అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేతపట్టుకొని పారిపోయి కెయీలాలోనున్న దావీదునొద్దకు వచ్చెను.౹ దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని —దావీదు ద్వారములును అడ్డుగడలునుగల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి యున్నాడు, దేవుడతనిని నా చేతికి అప్పగించె ననుకొనెను.౹ కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జనులందరిని యుద్ధమునకు పిలువనంపించెను.౹ సౌలు తనకు కీడే యుద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను.౹ అప్పుడు దావీదు–ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్నుబట్టి పట్టణమును పాడు చేయనుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడి యున్నది.౹ కెయీలా జనులు నన్ను అతనిచేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయుమని ప్రార్థింపగా–అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను.౹ –కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరల మనవిచేయగా యెహోవా–వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను.౹ అంతట దావీదును దాదాపు ఆరువందలమందియైన అతని జనులును లేచి కెయీలాలోనుండి తరలి, ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్లిరి. దావీదు కెయీలాలోనుండి తప్పించుకొనిన సంగతి సౌలు విని వెళ్లక మానెను. అయితే దావీదు అరణ్యములోని కొండస్థలములయందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలుచేతికి అతని నప్పగించలేదు.౹ తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరెనని తెలిసికొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను.౹ అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి, వనము లోనున్న దావీదునొద్దకు వచ్చి–నా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు,౹ నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు, నేను నీకు సహకారినౌదును, ఇది నా తండ్రియైన సౌలునకు తెలిసియున్నదని అతనితో చెప్పి దేవునిబట్టి అతని బలపరచెను.౹ వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనిన తరువాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన యింటికి తిరిగి వెళ్లెను.౹ జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చి–యెషీమోనుకు దక్షిణమున నున్న హకీలామన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే.౹ రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము; రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా సౌలు వారితో ఇట్లనెను–మీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వా దము కలుగును గాక.౹ మీరు పోయి అతడుఉండు స్థలము ఏదయినది, అతనిని చూచినవాడు ఎవడయినది నిశ్చయముగా తెలిసికొనుడి; అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక మీరు బహు జాగ్రత్తగా నుండి, అతడుండు మరుగు తావులను కని పెట్టియున్న సంగతి యంత నాకు తెలియజేయుటకై మరల నాయొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతోకూడా వత్తును, అతడు దేశములో ఎక్కడనుండినను యూదావారందరిలో నేను అతని వెదకి పట్టుకొందును.౹ అంతట వారు లేచి సౌలుకంటె ముందు జీఫునకు తిరిగి వెళ్లిరి. దావీదును అతని జనులును యెషీమోనుకు దక్షి ణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా సౌలును అతని జనులును తన్ను వెద కుటకై బయలుదేరిన మాట దావీదు విని, కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమ బోయెను.౹ అయితే సౌలు పర్వతము ఈతట్టునను దావీదును అతని జనులును పర్వతము ఆతట్టునను పోవుచుండగా దావీదు సౌలుదగ్గరనుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులును దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనుచుండిరి.౹ ఇట్లుండగా దూత యొకడు సౌలునొద్దకు వచ్చి–నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడియున్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మలెకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను.౹ తరువాత దావీదు అక్కడనుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగిరాగా దావీదు ఏన్గెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను.౹ అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలోనుండి మూడు వేలమందిని ఏర్పరచుకొని వచ్చి, కొండమేకలకు వాసములగు శిలాపర్వతములమీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను.౹ మార్గముననున్న గొఱ్ఱె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక దావీదు జనులు–అదిగో–నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా; దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండ అతని పైవస్త్రపు చెంగును కోసెను.౹ సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి –ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను.౹ ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను.౹ అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లి–నా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లనెను–దావీదు నీకు కీడుచేయనుద్దే శించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము; ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నాచేతికి అప్పగించెనో అది నీ కండ్లార చూచితివే; కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించి–ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా యేలినవాని చంపనని నేను చెప్పితిని.౹ నా తండ్రీ చూడుము, ఇదిగో, చూడుము. నిన్ను చంపక నీ వస్త్రపుచెంగు మాత్రమే కోసితిని గనుక నావలన నీకు కీడు ఎంతమాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియు, నీవు తెలిసికొనవచ్చును. నీ విషయమై నేను ఏపాపమును చేయనివాడనై యుండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు.౹ నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగతీర్చునుగాని నేను నిన్ను చంపను.౹ పూర్వికులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టునుగాని నేను నిన్ను చంపను.౹ ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా? మిన్నల్లిని గదా? యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక.౹ దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు–దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి [17-18] దావీదుతో ఇట్లనెను — యెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారముచేసిన వాడవై, నా యెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు.౹ *** ఒకనికి తన శత్రువు దొరికినయెడల మేలుచేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసినదానినిబట్టి యెహోవా ప్రతిగా నీకు మేలుచేయునుగాక.౹ నిశ్చయముగా నీవు రాజ వగుదువనియు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియును.౹ కాబట్టి నా తరువాత నా సంతతివారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును, నా తండ్రి ఇంటిలోనుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతట దావీదు సౌలునకు ప్రమాణము చేసెను అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను; అయితే దావీదును అతని జనులును తమ కొండస్థలములకు వెళ్లి పోయిరి. సమూయేలు మృతినొందగా ఇశ్రాయేలీయులందరు. కూడుకొని అతడు చనిపోయెనని ప్రలాపించుచు, రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధిచేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్లెను. కర్మెలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు, అతనికి మూడువేల గొఱ్ఱెలును వెయ్యి మేకలును ఉండెను. అతడు–కర్మెలులో తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుటకై పోయి యుండెను.౹ అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధిగలదై రూపసియైయుండెను. అయితే చర్యలనుబట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై యుండెను. అతడు కాలేబు సంతతివాడు.౹ నాబాలు గొఱ్ఱెలబొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో పదిమందిని పిలిచి వారితో ఇట్లనెను— మీరు కర్మెలునకు నాబాలు నొద్దకు పోయి, నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి ఆ భాగ్యవంతునితో–నీకును నీ యింటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి యీ వర్తమానము తెలియజెప్పవలెను.౹ –నీ యొద్ద గొఱ్ఱెలబొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను; నీ గొఱ్ఱెకాపరులు మా దగ్గరనుండగా మేము వారికి ఏ కీడునుచేసి యుండలేదు; వారు కర్మెలులో నున్నంతకాలము వారేదియు పోగొట్టుకొనలేదు;౹ నీ పనివారిని నీవు అడిగినయెడల వారాలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయ చూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా; నీ కిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము.౹ దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు— దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకు లున్నారు.౹ నేను సంపాదించుకొనిన అన్నపానములను, నా గొఱ్ఱెలబొచ్చు కత్తిరించువారికొరకు నేను వధించిన పశుమాంసమును తీసి, నేను బొత్తిగా ఎరుగని వారి కిత్తునా? అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవపట్టుకొనిపోయి అతనికి ఈ మాటలన్నియు తెలియజేసిరి.౹ అంతట దావీదు వారితో–మీరందరు మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి, దావీదు కూడను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు నాలుగు వందలమంది బయలుదేరగా రెండువందలమంది సామాను దగ్గర నిలిచిరి.౹ పనివాడు ఒకడు నాబాలు భార్యయైన అబీగయీలుతో ఇట్లనెను–అమ్మా, దావీదు అరణ్యములోనుండి, మన యజమానుని కుశల ప్రశ్నలడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాటలాడెను.౹ అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసియున్నారు మేము పొలములో వారిమధ్యను సంచరించుచున్నంత సేపు అపాయముగాని నష్టముగాని మాకు సంభవింపనేలేదు.౹ మేము గొఱ్ఱెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్లు మాచుట్టు ప్రాకారముగా ఉండిరి.౹ అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికందరికిని వారు కీడుచేయ నిశ్చయించియున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినదానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవనిని తనతో మాటలాడ నీయడు అనెను.౹ అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱెల మాంసమును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్ద భములమీద వేయించి –మీరు నాకంటె ముందుగా పోవుడి, నేను మీ వెనుకనుండి వచ్చెదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్దభముమీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా, దావీదును అతని జనులును ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలిసికొనెను.౹ అంతకుమునుపు దావీదు–నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండ ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చితిని; ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికి నేనుండనియ్యను; లేదా దేవుడు మరి గొప్పఅపాయము దావీదు శత్రువులకు కలుగ జేయునుగాక అని ప్రమాణము చేసియుండెను.౹ అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను –నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాల నైన నేను చెప్పుమాటలను ఆలకించుము;౹ నా యేలినవాడా, దుష్టుడైన యీ నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము; నా యేలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు.౹ నా యేలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండ యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించెనన్నమాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులును నా యేలినవాడవైన నీకు కీడుచేయనుద్దేశించు వారును నాబాలువలె ఉందురు గాక.౹ అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నిచ్చును. నీవు బ్రదుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును.౹ నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవాయొద్దనున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును.౹ యెహోవా నా యేలినవాడవగు నిన్నుగూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయులమీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా యేలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకేగాని, నా యేలినవాడవగు నీవు పగతీర్చుకొనినందుకేగాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా యేలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగక పోవునుగాక, యెహోవా నా యేలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగునన్ను జ్ఞాపకము చేసికొనుము అనెను.౹ అందుకు దావీదు–నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.౹ నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.౹ నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనక పోయినయెడల, నీకు హానిచేయకుండ నన్ను ఆటంకపరచిన ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారు లోగా నాబాలునకు మగవాడొకడును విడువబడడన్న మాట నిశ్చయము అని చెప్పి తనయొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమెచేత తీసికొని–నీ మాటలు నేను ఆలకించి నీ మనవి నంగీకరించితిని, సమాధానముగా నీ యింటికి పొమ్మని ఆమెతో చెప్పెను.౹ అబీగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా, రాజులు విందుచేసినట్లు అతడు ఇంటిలో విందుచేసి, త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగానుండెను గనుక తెల్లవారువరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియు చెప్పక ఊరకుండెను.౹ ఉదయమున నాబాలునకు మత్తు తగ్గియున్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయముచేత అతని గుండెపగిలెను, అతడు రాతివలె బిగిసికొనిపోయెను.౹ పది దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను.౹ నాబాలు చనిపోయెనని దావీదు విని–యెహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడుచేయకుండ నన్ను కాపాడి, నాబాలువలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను. తరువాత దావీదు అబీగయీలును పెండ్లి చేసికొనవలెనని ఆమెతో మాటలాడ తగినవారిని పంపెను.౹ దావీదు సేవకులు కర్మెలులోనున్న అబీగయీలు నొద్దకు వచ్చి–దావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లిచేసికొనుటకై తోడుకొనిరండని పంపెననగా ఆమె లేచి సాగిలపడి— నా యేలినవాని చిత్తము; నా యేలినవాని సేవకుల కాళ్లు కడుగుటకు నా యేలినవాని దాసురాలనగు నేను సిద్ధముగా నున్నానని చెప్పి త్వరగా లేచి గార్దభముమీద ఎక్కితన వెనుక నడచుచున్న అయిదుగురు పనికత్తెలతోకూడ దావీదు పంపిన దూతలవెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసికొనెను.౹ మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీయైన అహీనోయమును పెండ్లి చేసికొనియుండెను; వారిద్దరు అతనికి భార్యలుగా ఉండిరి.౹ సౌలు తన కుమార్తెయైన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయీషు కుమారునికి ఇచ్చి యుండెను. అంతట జీఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చి. —దావీదు యెషీమోను ఎదుట హకీలామన్యములో దాగి యున్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన మూడువేలమందిని తీసికొని జీఫు అరణ్యములో దావీదును వెదకుటకు జీఫు అరణ్యమునకు పోయెను.౹ సౌలు యెషీమోను ఎదుటనున్న హకీలామన్యమందు త్రోవ ప్రక్కను దిగగా, దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలెనని సౌలు అరణ్యమునకు వచ్చెనని విని వేగులవారిని పంపి —నిశ్చయముగా సౌలు వచ్చెనని తెలిసికొనెను.౹ తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి, సౌలును సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండియుండగా వారున్నస్థలము కను గొనెను. సౌలు దండు క్రొత్తళములో పండుకొనగా దండువారు అతనిచుట్టు నుండిరి.౹ అప్పుడు దావీదు–పాళెములోనికి సౌలు దగ్గరకు నాతోకూడ ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబీషైని నడుగగా— నీతోకూడ నేనే వత్తునని అబీషై యనెను.౹ దావీదును అబీషైయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తళములో పండుకొని నిద్ర బోవుచుండెను, అతని యీటె అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను, అబ్నేరును జనులును అతని చుట్టు పండుకొనియుండిరి.౹ అప్పుడు అబీషై దావీదుతో–దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించెను; కాబట్టి నీ చిత్తమైతే ఆ యీటెతో ఒక్కపోటు పొడిచి, నేనతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా దావీదు–నీవతని చంపకూడదు, యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము? యెహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయమువలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును;౹ యెహోవాచేత అభిషేకము నొందిన వానిని నేను చంపను; ఆలాగున నేను చేయకుండ యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న యీటెను నీళ్ల బుడ్డిని తీసికొని మనము వెళ్లిపోదము రమ్మని అబీషైతో చెప్పి సౌలు తలగడదగ్గర నున్న యీటెను నీళ్లబుడ్డిని తీసికొని వారిద్దరు వెళ్లిపోయిరి. యెహోవాచేత వారికందరికి గాఢనిద్ర కలుగగా వారిలో ఎవడును నిద్ర మేలుకొనలేదు, ఎవడును వచ్చిన వారిని చూడలేదు, జరిగినదాని గుర్తు పెట్టినవాడొకడును లేడు.౹ తరువాత దావీదు అవతలకుపోయి దూరముగా నున్న కొండమీద నిలిచి, ఉభయులమధ్యను చాలా యెడముండగా జనులును నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు–అబ్నేరూ, నీవు మాటలాడవా? అని కేక వేయగా అబ్నేరు కేకలువేసి–రాజును నిద్రలేపు నీవెవడ వని అడిగెను.౹ అందుకు దావీదు–నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయులలో నీ వంటివాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీ వెందుకు కాపు కాయక పోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే;౹ నీ ప్రవర్తన అను కూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే; యెహోవాచేత అభిషేకము నొందిన నీ యేలినవానికి నీవు రక్షకముగా నుండలేదు; యెహోవా జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజుయొక్క యీటె యెక్కడ నున్నదో చూడుము, అతని తలగడయొద్దనున్న నీళ్లబుడ్డి యెక్కడ నున్నదో చూడుము అని పలికెను.౹ సౌలు దావీదు స్వరము ఎరిగి–దావీదా నాయనా, యిది నీ స్వరమేగదా అని అనగా దావీదు ఇట్లనెను–నా యేలినవాడా నా రాజా, నా స్వరమే.౹ నా యేలినవాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసితిని? నావలన ఏ కీడు నీకు సంభవించును? రాజా నా యేలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నామీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించినయెడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవ రైనను నిన్ను ప్రేరేపించినయెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు–నీవు దేశమును విడిచి అన్యదేవతలను పూజించుమని నాతో చెప్పి, యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండ నన్ను వెలివేయుచున్నారు.౹ నా దేశమునకు దూరముగాను, యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదును గాక. ఒకడు పర్వతములమీద కౌజుపిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజవైన నీవు మిన్నల్లిని వెదకుటకై బయలుదేరి వచ్చితివి.౹ అందుకు సౌలు–నేను పాపము చేసితిని, ఈ దినమున నాప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండినదానిబట్టి నేను నీకిక కీడుచేయను. దావీదా నాయనా, నాయొద్దకు తిరిగిరమ్ము; వెఱ్ఱివాడనై నేను బహు తప్పు చేసితిననగా దావీదు–రాజా, యిదిగో నీ యీటె నాయొద్దనున్నది, పనివారిలో నొకడు వచ్చి దాని తీసికొనవచ్చును.౹ యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందినవానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును.౹ చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలోనుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను.౹ అందుకు సౌలు–దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువు గాక; నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయెను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను. తరువాత దావీదు–నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలుచేత నాశన మగుదును; నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతనిచేతిలోనుండి తప్పించుకొందునని అనుకొని లేచి తనయొద్దనున్న ఆరువందలమందితోకూడ ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను.౹ దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమతమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్యయైయుండిన కర్మెలీయు రాలగు అబీగయీలు అను అతని యిద్దరు భార్యలు దావీదుతోకూడ ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మాని వేసెను.౹ అంతట దావీదు–రాజపురమందు నీయొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేల? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది. దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురముండిన కాల మంత ఒక సంవత్సరము నాలుగు నెలలు.౹ అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయులమీదను గెజెరీయులమీదను అమాలేకీయులమీదను పడిరి. ప్రయాణస్థులు పోవుమార్గమున షూరునుండి ఐగుప్తువరకు నున్న దేశములో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతముచేసి, మగవానినేమి ఆడు దానినేమి యెవరిని సజీవులుగా విడువక గొఱ్ఱెలను ఎడ్లను గార్దభములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను.౹ ఆకీషు–ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదు —యూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను.౹ ఆలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతుక నియ్యలేదు.౹ –దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తనయందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచి–నేను దండెత్తగా నీవును నీ జనులును నాతోకూడ యుద్ధమునకు బయలుదేరి రావలెనని పరిష్కారముగా తెలిసికొనుమనగా దావీదు–నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలిసికొందువనెను. అందుకు ఆకీషు–ఆలాగైతే నిన్ను ఎప్పటికి నాకు సంరక్షకుడుగా నిర్ణయింతుననెను. సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములోనుండి వెళ్లగొట్టి యుండెను.౹ ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా, సౌలు ఇశ్రాయేలీయులందరిని సమకూర్చెను; వారు గిల్బోవలో దిగిరి.౹ సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా స్వప్నముద్వారానైనను ఊరీముద్వారానైనను ప్రవక్తలద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను.౹ అప్పుడు సౌలు–నా కొరకు మీరు కర్ణపిశాచముగల యొక స్త్రీని కనుగొనుడి; నేను పోయి దానిచేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు–చిత్తము, ఏన్దోరులో కర్ణపిశాచము గల యొకతె యున్నదని అతనితో చెప్పిరి.౹ కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని యిద్దరు మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి రాత్రివేళ ఆ స్త్రీయొద్దకు వచ్చి–కర్ణపిశాచముద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా ఆ స్త్రీ— ఇదిగో, సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని అతడు దేశములో ఉండకుండ నిర్మూలముచేసెను గదా. నీవు నా ప్రాణముకొరకు ఉరి యొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను.౹ అందుకు సౌలు–యెహోవా జీవముతోడు దీనినిబట్టి నీకు శిక్ష యెంతమాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణముచేయగా ఆ స్త్రీ–నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడు —సమూయేలును రప్పింపవలెననెను.౹ ఆ స్త్రీ సమూయేలును చూచి నప్పుడు బిగ్గరగా కేకవేసి–నీవు సౌలువే; నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా రాజు–నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా ఆమె–దేవతలలో ఒకడు భూమిలోనుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను.౹ అందుకతడు–ఏ రూపముగా ఉన్నాడని దాని నడిగినందుకు అది–దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు–అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను.౹ సమూయేలు–నన్ను పైకిరమ్మని నీ వెందుకు తొందరపెట్టితివని సౌలు నడుగగా సౌలు— నేను బహు శ్రమలోనున్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నములద్వారానైనను నా కేమియు సెలవియ్యకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిననెను.౹ అందుకు సమూయేలు–యెహోవా నిన్ను ఎడ బాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటవలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్టు నీ చేతినుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాని నిచ్చియున్నాడు.౹ యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక, అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చక పోయిన దానినిబట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు.౹ యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును; యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును; రేపు నీవును నీ కుమారులును నాతోకూడ ఉందురు అని సౌలుతో చెప్పగా సమూయేలు మాటలకు సౌలు బహు భయమొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజన మేమియు చేయక యుండినందున బలహీను డాయెను.౹ అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకువచ్చి, అతడు బహుగా కలవరపడుట చూచి–నా యేలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసితిని.౹ ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము, నేను నీకు ఇంత ఆహారము వడ్డించుదును, నీవు భోజనముచేసి ప్రయాణమై పోవుటకు బలము తెచ్చుకొనుమని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనము చేయననెను; అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై యతని బలవంతముచేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేలనుండి లేచి మంచముమీద కూర్చుండెను.౹ తన యింటిలో క్రొవ్విన పెయ్య ఒకటి యుండగా ఆ స్త్రీ దాని తీసికొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసులేని రొట్టెలు కాల్చి తీసికొని వచ్చి సౌలునకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనముచేసి లేచి ఆ రాత్రి వెళ్లిపోయిరి. అంతలో ఫిలిష్తీయులు దండెత్తి పోయి ఆఫెకులో. దిగియుండిరి; ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జెల దగ్గర దిగియుండిరి.౹ ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును నూరేసిమందిగాను వెయ్యేసిమందిగాను వ్యూహ పరచి వచ్చుచుండగా దావీదును అతని జనులును ఆకీషుతో కలిసి దండు వెనుకతట్టున వచ్చుచుండిరి.౹ ఫిలిష్తీయుల సర్దారులు–ఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషును అడుగగా అతడు–ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నాయొద్దనుండిన ఇశ్రాయేలీయుల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటనుండి నేటివరకు ఇతనియందు తప్పే మియు నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను.౹ అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతనిమీద కోపపడి–ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధియవు నేమో, దేనిచేత అతడు తన యజమానునితో సమాధాన పడును? మనవారి తలలను ఛేదించి తీసికొని పోవుటచేతనే గదా తన యజమానునితో సమాధానపడును. సౌలు వేలకొలదిగాను దావీదు పదివేలకొలదిగాను హతముచేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానముచేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి.౹ కాబట్టి ఆకీషు దావీదును పిలిచి–యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై యున్నావు; దండులో నీవు నాతోకూడ సంచరించుట నా దృష్టికి అనుకూలమే; నీవు నాయొద్దకు వచ్చిన దినమునుండి నేటివరకు నీయందు ఏ దోషమును నాకు కనబడలేదుగాని సర్దారులు నీయందు ఇష్టములేక యున్నారు.౹ ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్లుమని చెప్పగా దావీదు–నేనేమి చేసితిని? నా యేలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధముచేయుటకై నేను రాకుండునట్లు నీయొద్దకు వచ్చిన దినమునుండి నేటివరకు నీ దాసుడనైన నాయందు తప్పేమి కనబడెనని ఆకీషు నడిగెను.౹ అందుకు ఆకీషు–దైవదూతవలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదునుగాని ఫిలిష్తీయుల సర్దారులు–ఇతడు మనతోకూడ యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు.౹ కాబట్టి ఉదయమున నీవును నీతోకూడ వచ్చిన నీ యజమానుని సేవకులును త్వరగా లేవవలెను; ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలెనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను.౹ కావున దావీదును అతని జనులును ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశమునకు పోవలెనని ప్రయాణమైరి; ఫిలిష్తీయులు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,౹ ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసికొని వెళ్లిపోయి యుండిరి.౹ దావీదును అతని జనులును పట్టణమునకు వచ్చి అది కాల్చబడియుండుటయు, తమ భార్యలును కుమారులును కుమార్తెలును చెరలోనికి కొని పోబడి యుండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తిలేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి.౹ యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్యయయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలును చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమతమ కుమారులనుబట్టియు కుమార్తెలనుబట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పు కొనగా దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను.౹ పిమ్మట దావీదు–ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసికొనివచ్చెను.౹ –నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణచేయగా యెహోవా–తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసి కొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను.౹ కాబట్టి దావీదు అతనియొద్దనున్న ఆరువందలమందియును బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో రెండువందలమంది వెనుక దిగవిడువబడిరి.౹ దావీదును నాలుగువందలమందియును ఇంక తరుముచు పోయిరిగాని ఆ రెండువందలమంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ నాలుగు వందలమంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొనివచ్చి, వాడు మూడు రాత్రింబగళ్లు అన్నపానము లేమియు పుచ్చు కొనలేదని తెలిసికొని, వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను రెండు ద్రాక్షగెలలను వానికిచ్చిరి.౹ వాడు భోజనముచేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు–నీవు ఏ దేశపువాడవు? ఎక్కడనుండి వచ్చితివని వాని నడిగెను. అందుకు వాడు —నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొకనికి దాసుడనైతిని; మూడుదినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను.౹ మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితిమని చెప్పెను.౹ –ఆ దండును కలిసికొనుటకై నీవు నాకు దోవచూపుదువా అని దావీదు వానినడుగగా వాడు–నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవునిబట్టి నీవు నాకు ప్రమాణము చేసినయెడల ఆ దండును కలిసి కొనుటకు నీకు దోవచూపుదుననెను.౹ తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశములోనుండియు యూదా దేశములోనుండియు తాము దోచి తెచ్చికొనిన సొమ్ముతో తులదూగుచు, వారు ఆ ప్రదేశమంతట చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి.౹ దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెలమీద ఎక్కి పారిపోయిన నాలుగువందలమంది యౌవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను.౹ ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొనిపోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన యిద్దరు భార్యలను రక్షించెను.౹ కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువకాకుండ దావీదు సమస్తమును రక్షించెను.౹ మరియు దావీదు అమాలేకీయుల గొఱ్ఱెలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.౹ అలసటచేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండువందలమందియొద్దకు దావీదు పోగా వారు దావీదును అతనియొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనులయొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా దావీదుతోకూడ వెళ్లినవారిలో దుర్మార్గులును, పనికి మాలినవారునైన కొందరు–వీరు మనతోకూడ రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరల వచ్చిన దోపుడు సొమ్ములో మన మేమియు వీరికియ్యము; తమ భార్య పిల్లలను వారు తీసికొని పోవచ్చుననిరి.౹ అందుకు దావీదు వారితో ఇట్లనెను–నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మనమీదికి వచ్చిన యీ దండును మనకప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఈలాగున చేయకూడదు.౹ మీరు చెప్పినది యెవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయినవాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట; అందరు సమముగానే పాలు పంచుకొందురు గదా కావున నాటనుండి నేటివరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరచి నియమించెను. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచి— యెహోవా శత్రువులయొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాదసూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను.౹ బేతేలులోను దక్షిణ రామోతులోను యత్తీరులోను అరోయేరులోను షిప్మోతులోను ఎష్తెమోలోను రాకాలులోను యెరహ్మెయేలీయుల గ్రామములలోను కేనీయుల గ్రామములలోను హోర్మాలోను కోరాషానులోను అతాకులోను హెబ్రోనులోను దావీదును అతని జనులును సంచరించిన స్థలములన్నిటిలోను ఉన్న పెద్దలకు దావీదు పంపించెను. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుటనుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతమువరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలుయొక్క కుమారులను హతము చేసిరి.౹ యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులువేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు –సున్నతిలేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీకత్తి దూసి దానిచేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయముచేత ఆలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దానిమీద పడెను.౹ సౌలు మరణమాయెనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తిమీదపడి అతనితోకూడ మరణమాయెను.౹ ఈలాగున సౌలును అతని ముగ్గురు కుమారులును అతని ఆయుధములను మోయువాడును అతని వారందరును ఒక దినముననే మరణమైరి.౹ లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులును, యొర్దాను అవతల నున్నవారును, ఇశ్రాయేలీయులు పారిపోవుటయు, సౌలును అతని కుమారులును చచ్చియుండుటయు చూచి తమ నివాసగ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిష్తీయులు వచ్చివాటిలో కాపురముండిరి. మరునాడు ఫిలిష్తీయులు హతమైనవారిని దోచుకొన వచ్చి గిల్బోవ పర్వతముమీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి.౹ మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవిగుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి.౹ అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దానిగురించిన వార్త యాబేష్గిలాదువారు విని బలశాలులందరు లేచి రాత్రియంత నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనముచేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచులవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉపవాసముండిరి. దావీదు అమాలేకీయులను హతముచేసితిరిగి వచ్చెను. సౌలు మృతినొందిన తరువాత అతడు సిక్లగులో రెండు దినములుండెను.౹ మూడవదినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గిపోసికొనిన యొకడు సౌలునొద్దనున్నదండులోనుండి వచ్చెను.౹ అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారముచేయగా దావీదు–నీ వెక్కడనుండి వచ్చితివని యడిగెను. అందుకు వాడు–ఇశ్రాయేలీయుల సైన్యములోనుండి నేను తప్పించుకొని వచ్చితిననెను.౹ –జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవియ్యగా వాడు–జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి. అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను.౹ –సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీ కేలాగు తెలిసినది అని దావీదు వానినడుగగా వాడిట్లనెను [6-7] —గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను. అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు–చిత్తము నా యేలినవాడా అని నేనంటిని.౹ *** [8-10] — నీవెవడవని అతడు నన్నడుగగా–నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు–నా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధ పడుచున్నాను; నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా, ఈలాగు పడినతరువాత అతడు బ్రదుకడని నేను నిశ్చయించుకొని అతనిదగ్గర నిలిచి అతని చంపితిని; తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసికొని నా యేలినవాడవైన నీయొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను.౹ *** *** దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతనియొద్దనున్నవారందరును ఆలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులును ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలి రని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రమువరకు ఉపవాసముండిరి.౹ తరువాత దావీదు–నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చినవానినడుగగా వాడు–నేను ఇశ్రాయేలుదేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడననెను.౹ [14-16] అందుకు దావీదు–భయపడక యెహోవా అభిషేకించినవానిని చంపుటకు నీవేల అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే; నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది వని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచి–నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. *** *** [17-18] యూదావారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలునుగూర్చియు అతని కుమారుడైన యోనాతానునుగూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానినిబట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి యున్నది. ఎట్లనగా— *** ఇశ్రాయేలూ, నీకు భూషణమగువారు నీ ఉన్నతస్థలములమీద హతులైరి అహహా బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతిలేనివారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక. బలాఢ్యులడాళ్లు అవమానముగ పారవేయబడెను. తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపకుండ బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండ యోనాతాను విల్లు వెనుకతియ్యలేదు ఎవరిని హతముచేయకుండ సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరుగల వారుగాను ఉండిరి తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినవారు కారు వారు పక్షిరాజులకంటె వడిగలవారు సింహములకంటె బలముగలవారు. ఇశ్రాయేలీయుల కుమార్తెలారా, సౌలునుగూర్చి యేడ్వుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింప జేసినవాడు బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారు నీ ఉన్నతస్థలములలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా, యోనాతానా నీవు నాకు అతిమనోహరుడవై యుంటివి నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి యుద్ధసన్నద్ధులు నశించిపోయిరి. ఇది జరిగిన తరువాత–యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగా–పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. —నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా–హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.౹ కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలునకు భార్యయైన అబీగయీలు అను తన యిద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను.౹ మరియు దావీదు తనయొద్ద నున్నవారినందరిని వారి వారి యింటివారిని తోడుకొని వచ్చెను; వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి.౹ అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును పాతిపెట్టినవారు యాబేష్గిలాదువారని దావీదు తెలిసికొని యాబేష్గిలాదువారియొద్దకు దూతలను పంపి–మీరు ఉపకారము చూపి మీ యేలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవాచేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక.౹ యెహోవా మీకు కృపను సత్యస్వభావమును అగపరచును, నేనును మీరు చేసిన యీ క్రియనుబట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను.౹ మీ యజమానుడగు సౌలు మృతినొందెనుగాని యూదావారు నాకు తమమీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై యుండుడని ఆజ్ఞనిచ్చెను. [8-10] నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొనిపోయి, గిలాదువారిమీదను ఆషేరీయులమీదను యెజ్రెయేలుమీదను ఎఫ్రాయి మీయులమీదను బెన్యామీనీయులమీదను ఇశ్రాయేలు వారిమీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు నలువదేండ్లవాడై యేలనారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను; అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి.౹ *** *** దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాల మంతయు ఏడు సంవత్సరముల ఆరు మాసములు. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులును మహనయీములోనుండి బయలుదేరి గిబియోనునకు రాగా సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులును బయలుదేరి వారి నెదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈతట్టునను వారు కొలనునకు ఆతట్టునను దిగి యుండగా అబ్నేరు లేచి–మన యెదుట యౌవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు–వారు చేయవచ్చుననెను.౹ లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన పన్నిద్దరు మంది బెన్యామీనీయులును దావీదు సేవకులలో పన్నిద్దరు మందియును లేచి మధ్య నిలిచిరి.౹ ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము.౹ తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి.౹ సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషైయును అశాహేలును అచ్చటనుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక అతడు కుడితట్టయినను ఎడమతట్టయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి–నీవు అశాహేలువా అని అతనిని నడుగగా అతడు నేను అశాహేలునే యనెను.౹ –నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యౌవనస్థులలో ఒకని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అశాహేలు ఈ తట్టయినను ఆ తట్టయినను తిరుగక అతని తరుమగా అబ్నేరు–నన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపినయెడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలననెను.౹ అతడు–నేను తొలగననగా, అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున యీటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అశాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చినవారందరు నిలువబడిరిగాని యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్యమార్గములోని గీహ యెదుటి అమ్మాయను కొండకు వచ్చిరి; అంతలో సూర్యుడు అస్త మించెను.౹ బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని, ఒక కొండమీద నిలువగా అబ్నేరు కేకవేసి —కత్తి చిరకాలము భక్షించునా? అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీ వెరుగుదువుగదా; తమ సహోదరులను తరుమవద్దని నీ వెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుందు వని యోవాబుతో అనెను.౹ అందుకు యోవాబు— దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక యుండినయెడల జనులందరు తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగి పోయియుందురని చెప్పి బాకా ఊదగా జనులందరు నిలిచి, ఇశ్రాయేలువారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి.౹ అబ్నేరును అతనివారును ఆ రాత్రి అంత మైదానము గుండ ప్రయాణము చేసి యొర్దానునది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి.౹ యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమ కూర్చి లెక్కచూడగా దావీదు సేవకులలో అశాహేలు గాక పందొమ్మండుగురు లేకపోయిరి.౹ అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలోను మూడువందల అరువది మందిని హతము చేసిరి.౹ జనులు అశాహేలును ఎత్తికొనిపోయి బేత్లెహేములోనున్న అతని తండ్రి సమాధియందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతనివారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి. సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంత కంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయు రాలగు అహీనోయమువలన పుట్టెను.౹ కిల్యాబు అను రెండవవాడు కర్మెలీయుడగు నాబాలు భార్యయైన అబీగ యీలు వలన పుట్టెను. మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకావలన పుట్టెను.౹ నాలుగవవాడగు అదోనీయా హగ్గీతువలన పుట్టెను. అయిదవవాడగు షెఫట్య అబీటలువలన పుట్టెను.౹ ఆరవవాడగు ఇత్రెయాము దావీదునకు భార్యయగు ఎగ్లావలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబికులకు బహు సహాయముచేసెను.౹ అయ్యా కుమార్తెయైన రిస్పా యను ఒక ఉపపత్ని సౌలుకుండెను–నా తండ్రికి ఉప పత్నియగు దానిని నీ వెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని–నిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతనిపక్షమున నేను నెరవేర్చని యెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయును గాక; సౌలు ఇంటివారి వశము కాకుండ రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబావరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలువారిమీదను యూదావారిమీదను నేను స్థిరపరచెదననెను.౹ కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి యిక ఏ మాటయు పలుకలేక పోయెను. అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి —ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధనచేసినయెడల నేను నీకు సహాయము చేసి, ఇశ్రాయేలు వారినందరిని నీతట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదు— మంచిది; నేను నీతో నిబంధన చేసెదను.౹ అయితే నీవు ఒకపని చేయవలెను; నా దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను; లేదా నీకు దర్శనము దొరకదనెను.౹ మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి–ఫిలిష్తీయులలో నూరుమంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసికొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా ఇష్బోషెతు దూతను పంపి, లాయీషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటియొద్దనుండి మీకాలును పిలువనంపెను.౹ దాని పెనిమిటి బహూరీమువరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరు–నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి —దావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకుమునుపు కోరితిరి గదా –నా సేవకుడైన దావీదుచేత నా జనులగు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలోనుండియు, వారి శత్రువులందరి చేతిలోనుండియు విమోచించెదనని యెహోవా దావీదునుగూర్చి సెలవిచ్చియున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను.౹ మరియు అబ్నేరు బెన్యామీనీయులతో ఆలాగున మాటలాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియచేసెను.౹ అందునిమిత్తమై అబ్నేరు ఇరువదిమందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతనివారికిని విందుచేయించెను.౹ అంతట అబ్నేరు–నేను పోయి ఇశ్రాయేలువారినందరిని నా యేలినవాడవగు నీ పక్షమున సమకూర్చి, వారు నీతో నిబంధనచేయునట్లును, నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరినదాని అంతటిమీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవుపుచ్చుకొని సమాధానముగా వెళ్లిపోయెను.౹ పిమ్మట దావీదు సేవకులును యోవాబును బందిపోటునుండి బహువిస్తారమైన దోపుడు సొమ్ము తీసికొనిరాగా అబ్నేరు హెబ్రో నులో దావీదునొద్ద లేకపోయెను, దావీదు అతనికి సెలవిచ్చియున్నందున అతడు సమాధానముగా వెళ్లిపోయి యుండెను.౹ అయితే యోవాబును అతనియొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చెననియు, రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు, అతడు సమాధానముగా వెళ్లిపోయెననియు తెలిసికొని యోవాబు రాజునొద్దకు వచ్చి–చిత్తగించుము, నీవు ఏమిచేసితివి? అబ్నేరు నీయొద్దకు వచ్చి నప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపి వేసితివి? నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటిని నీవుచేయు సమస్తమును తెలిసికొనుటకై అతడు వచ్చెనని చెప్పి దావీదునొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరా యను బావిదగ్గరనుండి అతనిని తోడుకొని వచ్చిరి; అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకయుండెను.౹ అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు–సంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను.౹ ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనిన దేమనగా–నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికిని నిరపరాధులమే.౹ ఈ దోషము యోవాబుమీదను అతని తండ్రికి పుట్టిన వారందరిమీదను మోపబడునుగాక. యోవాబు ఇంటివారిలో స్రావముగలవాడైనను కుష్ఠరోగియైనను కఱ్ఱపెట్టుకొని నడుచువాడైనను ఖడ్గముచేత కూలు వాడైనను ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను.౹ ఆలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషైయును, అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అశాహేలును చంపిన దానినిబట్టి అతని చంపిరి. దావీదు–మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారికందరికిని ఆజ్ఞ ఇచ్చెను.౹ రాజును స్వయముగా పాడెవెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధిదగ్గర ఎలుగెత్తి యేడ్చెను, జనులందరును ఏడ్చిరి.౹ మరియు రాజు అబ్నేరునుగూర్చి శోకకీర్తన యొకటి కట్టెను. ఎట్లనగా అబ్నేరూ నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా? నీచేతులకు కట్లులేకుండగను నీ కాళ్లకు సంకెళ్లు వేయబడకుండగను దోషకారి యెదుట ఒకడు పడునట్లు నీవు పడితివే రాజు ఈలాగున కీర్తన యెత్తి పాడగా జనులందరు విని మరియెక్కువగా ఏడ్చిరి.౹ ఇంక వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతి మాలగా దావీదు ప్రమాణముచేసి–సూర్యుడు అస్తమించకమునుపు ఆహారమేమైనను నేను రుచిచూచినయెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక నెను.౹ జనులందరు ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి; రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అను కూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలననైనది కాదని ఆ దినమున జనులందరికిని ఇశ్రాయేలు వారికందరికిని తెలియబడెను.౹ పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఈలాగు సెలవిచ్చెను–నేటిదినమున పడిపోయినవాడు ఇశ్రాయేలువారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది.౹ పట్టాభి షేకము నొందినవాడనైనను, నేడు నేను బలహీనుడ నైతిని. సెరూయా కుమారులైన యీ మనుష్యులు నా కంటె బలముగలవారు, అతడు జరిగించిన దుష్క్రియనుబట్టి యెహోవా కీడుచేసినవానికి ప్రతికీడుచేయునుగాక. హెబ్రోనులో అబ్నేరు చనిపోయెనను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను, ఇశ్రాయేలు వారికందరికి ఏమియు తోచకయుండెను.౹ సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి; వారిలో ఒకని పేరు బయనా, రెండవవానిపేరు రేకాబు; వీరు బెన్యామీనీయులకు చేరిన బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. బెయే రోతుకూడను బెన్యామీనీయుల దేశములో చేరినదని యెంచబడెను.౹ అయితే బెయేరోతీయులు గిత్తయీమునకు పారిపోయి నేటివరకు అక్కడి కాపురస్థులై యున్నారు. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలునుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానమువచ్చి నప్పుడు వాడు అయిదేండ్లవాడు; వాని దాది వానిని ఎత్తి కొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివా డాయెను. వాని పేరు మెఫీబోషెతు. రిమ్మోను కుమారులగు రేకాబును బయనాయును మంచి యెండవేళ బయలుదేరి మధ్యాహ్నకాలమున ఇష్బోషెతు మంచముమీద పండుకొనియుండగా అతని యింటికి వచ్చిరి.౹ [6-8] —గోధుమలు తెచ్చెదమని వేషము వేసికొని వారు ఇంటిలో చొచ్చి, ఇష్బోషెతు పడకటింట మంచము మీద పరుండియుండగా అతనిని కడుపులో పొడిచి తప్పించు కొనిపోయిరి. వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసికొని రాత్రి అంతయు మైదానములో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదునొద్దకు ఇష్బోషెతు తలను తీసికొనివచ్చి–చిత్తగించుము; నీ ప్రాణము తీయచూచిన సౌలుకుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చియున్నాము; ఈ దినమున యెహోవా మా యేలినవాడవును రాజవునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతికారము చేసియున్నాడని చెప్పగా *** *** దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోను బయనాతోను ఇట్లనెను –మంచి వర్తమానము తెచ్చితినని తలంచి యొకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వానిని పట్టుకొని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి, అతని మంచము మీదనే నిర్దోషియగువానిని చంపి నప్పుడు మీచేత అతని ప్రాణదోషము విచారింపక పోవుదునా? లోకములో ఉండకుండ నేను మిమ్మును తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలోనుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాన నని చెప్పి, దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలనుదగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసికొనిపోయి హెబ్రో నులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి. ఇశ్రాయేలువారి సకల గోత్రములవారు హెబ్రో నులో దావీదునొద్దకు వచ్చి–చిత్తగించుము; మేము నీ ఎముకనంటినవారము రక్తసంబంధులము;౹ పూర్వకాలమున సౌలు మామీద రాజై యుండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు–నీవు ఇశ్రాయేలీయులనుబట్టి నా జనులను పాలించి వారిమీద అధిపతివై యుందువని యెహోవా నిన్నుగురించి సెలవిచ్చియున్నాడని చెప్పిరి.౹ మరియు ఇశ్రాయేలువారి పెద్దలందరు హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలువారిమీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు ముప్పది యేండ్లవాడై యేలనారంభించి నలువది సంవత్సరములు పరిపాలనచేసెను.౹ హెబ్రోనులో అతడు యూదా వారందరిమీద ఏడు సంవత్సరముల ఆరు మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరిమీద ముప్పదిమూడు సంవత్సరములు పరిపాలన చేసెను.౹ [6-7] యెబూసీయులు దేశములో నివా సులై యుండగా రాజును అతని పక్షమువారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి–నీవు వచ్చినయెడల ఇచ్చటి గ్రుడ్డి వారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి; అయినను దావీదు పురమన బడిన సీయోను కోటను దావీదు స్వాధీన పరచుకొనెను. ఆ దినమున అతడు *** –యెబూసీయులను హతముచేయు వారందరు నీటి కాలువపైకి వెళ్లి, దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందునుబట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు; అతడు ఇంటిలోనికి రాలేడని సామెతపుట్టెను.౹ దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను. మరియు మిల్లోనుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను.౹ దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరురాజగు హీరాము, దూతలను దేవదారు మ్రానులను వడ్రంగులను కాసెపనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి.౹ ఇశ్రాయేలీయులమీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచెననియు, ఇశ్రాయేలీయులనుబట్టి ఆయన జనుల నిమిత్తము, రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. దావీదు హెబ్రోనునుండి వచ్చిన తరువాత యెరూషలేములోనుండి యింక అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసికొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులును కుమార్తెలును పుట్టిరి [14-16] యెరూషలేములో అతనికి పుట్టినవారెవరనగా షమ్మూయ షోబాబు నాతాను సొలొమోను ఇభారు ఏలీషూవ నెపెగు యాఫీయ ఎలీ షామా ఎల్యాదా ఎలీపేలెటు అనువారు. *** *** జనులు ఇశ్రాయేలీయులమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరు వచ్చిరి. దావీదు ఆ వార్తవిని ప్రాకారస్థలమునకు వెళ్లిపోయెను.౹ ఫిలిష్తీయులు దండెత్తివచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు–నేను ఫిలిష్తీయుల కెదురుగా పోయెదనా? వారిని నా చేతికప్పగింతువా? అని యెహోవా యొద్ద విచారించినప్పుడు–పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను.౹ కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి–అచ్చట వారిని హతముచేసి, జలప్రవాహములు కొట్టుకొనిపోవునట్లు యెహోవా నా శత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమను పేరు పెట్టెను.౹ ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఫిలిష్తీయులు మరల వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవాయొద్ద విచారణ చేసెను.౹ అందుకు యెహోవా–నీవు వెళ్లవద్దు–చుట్టు తిరిగిపోయి, కంబళిచెట్లకు ఎదురుగావారిమీద పడుము. కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతముచేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను.౹ దావీదు యెహోవా తనకాజ్ఞాపించిన ప్రకారము చేసి, గెబనుండి గెజెరువరకు ఫిలిష్తీయులను తరు ముచు హతముచేసెను. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో ముప్పదివేలమంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి, కెరూబులమధ్య నివసించు సైన్యములకధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటనుండి తీసికొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితోకూడ బాయిలా యెహూదాలోనుండి ప్రయాణమాయెను.౹ వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబుయొక్క యింటిలోనుండి తీసికొనిరాగా అబీనాదాబు కుమారులగు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి.౹ దేవుని మందసముగల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటనుండి తీసికొనిరాగా అహ్యో దానిముందర నడిచెను.౹ దావీదును ఇశ్రాయేలీయులందరును సరళవృక్షపు కఱ్ఱతో చేయబడిన నానావిధములైన సితారాలను స్వర మండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి.౹ వారు నాకోను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్దపడి చనిపోయెను.౹ యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అను పేరు పెట్టెను.౹ నేటికిని దానికి అదేపేరు. ఆ దినమున–యెహోవా మందసము నాయొద్ద ఏలాగుండుననుకొని, దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తనయొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటివరకు తీసికొని అచ్చట ఉంచెను.౹ యెహోవా మందసము మూడునెలలు గిత్తీయుడగు ఓబేదె దోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటివారినందరిని ఆశీర్వదించెను.౹ దేవుని మందసము ఉండుటవలన యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసికొని వచ్చెను.౹ [13-14] ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి యడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్వినదూడ ఒకటియు వధింపబడెను, దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్య మాడుచుండెను.౹ *** ఈలాగున దావీదును ఇశ్రాయేలీయులందరును ఆర్భాటముతోను బాకా నాదములతోను యెహోవా మందసమును తీసికొని వచ్చిరి.౹ యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలోనుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపరచెను.౹ వారు యెహోవా మందసమును తీసికొని వచ్చి గుడారముమధ్యను దావీదు దానికొరకు ఏర్పరచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించెను.౹ [18-19] దహనబలులను సమాధానబలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి, సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులగు స్త్రీపురుషులకందరికి ఒక్కొక రొట్టెయు ఒక్కొక భక్ష్యమును ఒక్కొక ద్రాక్షపండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరును తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి. *** తన యింటివారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి–హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి యెంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు –నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనులమీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను యేర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసితిని; యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని.౹ ఇంతకంటె మరి యెక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను. మరణమువరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. యెహోవా నలుదిక్కుల అతని శత్రువులమీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి –నేను దేవదారుమ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా నాతాను–యెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను.౹ అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా –నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము–యెహోవా నీకాజ్ఞ ఇచ్చునదేమనగా–నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులోనుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని.౹ ఇశ్రాయేలీయులతోకూడ నేను సంచరించిన కాల మంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరమొకటి మీరు నాకు కట్టింపక పోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా? కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము–సైన్యములకధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా— గొఱ్ఱెల కాపులోనున్న నిన్ను గొఱ్ఱెలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని.౹ నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను.౹ మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనులమీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధిగల జనులు ఇకను వారిని కష్టపట్టకయుండునట్లుగా చేసి నీ శత్రువులమీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయు నదేమనగా–నేను నీకు సంతానము కలుగజేయుదును.౹ నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతోకూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.౹ అతడు నా నామఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;౹ నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడైయుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతునుగాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.౹ నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.౹ తనకు కలిగిన దర్శన మంతటినిబట్టి యీ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియ జెప్పెను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను–నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నే నెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతినిబట్టి, బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవుదానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగియున్నావు.౹ నీ వాక్కునుబట్టి నీ యిష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీని తెలియజేసితివి.౹ కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు.౹ నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులనుబట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తుదేశములోనుండియు, ఆ జనుల వశములోనుండియు, వారి దేవతల వశములోనుండియు నీవు విమోచించిన ఇశ్రాయేలీయులనునట్టి నీ జనులవంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది.౹ మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవైయుండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై యుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి.౹ దేవా యెహోవా, నీ దాసుడనగునన్నుగూర్చియు నా కుటుంబమునుగూర్చియు నీవు సెలవిచ్చినమాట యెన్నటికి నిలుచునట్లు దృఢపరచి సైన్యములకధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై యున్నాడను మాటచేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చినమాట నెరవేర్చుము.౹ ఇశ్రాయేలీయుల దేవా సైన్యములకధిపతియగు యెహోవా–నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను.౹ యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే; నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము.౹ దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము; యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు; నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరచుకొని వారి వశములోనుండి మెతెగమ్మాను పట్టుకొనెను.౹ మరియు అతడు మోయాబీయులను ఓడించి, (పట్టుబడిన వారిని) నేలపొడుగున పండజేసి, తాడుతో కొలిచి రెండుతాడుల పొడుగుననున్నవారు చావవలెననియు, ఒకతాడు పొడుగున నున్నవారు బ్రతుకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి.౹ సోబారాజును రెహోబు కుమారుడునగు హదదెజెరు యూఫ్రటీసు నదివరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలెనని బయలుదేరగా దావీదు అతని నోడించి అతనియొద్దనుండి వెయ్యిన్ని యేడు వందలమంది గుఱ్ఱపు రౌతులను ఇరువది వేల కాల్బలమును పట్టుకొని, వారి గుఱ్ఱములలో నూటిని ఉంచుకొని, మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను.౹ మరియు దమస్కులోనున్న సిరియనులు సోబారాజగు హదదెజెరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో ఇరువదిరెండు వేలమందిని ఓడించి దమస్కువశముననున్న సిరియదేశమందు దండును ఉంచగా, సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.౹ హదదెజెరు సేవకులకున్న బంగారు డాళ్లు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.౹ మరియు బెతహు బేరోతై అను హదదెజెరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన యిత్తడిని పట్టుకొనెను. దావీదు హదదెజెరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినబడెను.౹ హదదె జెరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదెజెరుతో యుద్ధము చేసి అతనిని ఓడించి యుండుట తోయి విని, తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి దావీదుతోకూడ సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను.౹ రాజైన దావీదు తాను జయించిన జనములయొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటినిచేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను.౹ వాటిని అతడు సిరియనులయొద్దనుండియు మోయాబీయుల యొద్దనుండియు అమ్మోనీయుల యొద్దనుండియు ఫిలిష్తీయుల యొద్దనుండియు అమాలేకీయుల యొద్దనుండియు రెహోబు కుమారుడగు హదదెజెరు అను సోబారాజునొద్ద నుండియు పట్టుకొని యుండెను.౹ దావీదు ఉప్పు లోయలో సిరియనులగు పదునెనిమిది వేలమందిని హతము చేసితిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను.౹ మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులుకాగా ఎదోము దేశమంతట అతడు కావలిదండుంచెను; దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజై తన జనుల నందరిని నీతి న్యాయములనుబట్టి యేలుచుండెను.౹ సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతియైయుండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద నుండెను.౹ అహీ టూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖకుడు;౹ యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి; దావీదు కుమారులు సభా ముఖ్యులు. — యోనాతానునుబట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైన కలడాయని దావీదు అడిగెను.౹ సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు–సీబావు నీవేగదా అని అడుగగా అతడు–నీ దాసుడనైన నేనే సీబాను అనెను.౹ రాజు–యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైననొకడు శేషించియున్నాడా యని అతని నడుగగా సీబా–యోనాతానుకు కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవిచేసెను.౹ –అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా–చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నున్నాడని రాజుతో అనెను.౹ అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో నున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనుండి అతని రప్పించెను.౹ సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారముచేయగా దావీదు–మెఫీబోషెతూ అని అతని పిలిచి నప్పుడు అతడు–చిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను.౹ అందుకు దావీదు–నీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనముచేయుదువని సెలవియ్యగా అతడు నమస్క రించి–చచ్చిన కుక్కవంటివాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను? అనెను.౹ అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి–సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించియున్నాను;౹ కాబట్టి నీవును నీ కుమారులును నీ దాసులును అతనికొరకు ఆ భూమిని సాగుబడిజేసి, నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను; నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడును నా బల్లయొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు పదునైదుమంది కుమారులును ఇరువదిమంది దాసులును ఉండిరి.౹ –నా యేలినవాడగు రాజు తన దాసునికిచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసెదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్లయొద్దనే భోజనముచేయుచుండెను.౹ మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సీబా యింటిలో కాపురమున్నవారందరు మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి.౹ మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్లయొద్ద భోజనముచేయుచుండెను. అతని కాళ్లు రెండును కుంటివి. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను.౹ దావీదు — హానూను తండ్రియైన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనునకు ప్రత్యుపకారము చేతుననుకొని, అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకులచేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా అమ్మోనీయుల ఘనులు తమ రాజగు హానూనుతో ఈలాగు మనవిచేసిరి–నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీయొద్దకు ఓదార్చువారిని పంపెనని నీవనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశము చేయవలెనని దాని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించియున్నాడని నీకు తోచ లేదా? అంతట హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని, సగము గడ్డము గొరిగించి, వారు తొడుగు కొనిన బట్టలను నడిమికి పిఱ్ఱలమట్టుకు కత్తిరించి వారిని వెళ్లగొట్టెను.౹ ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు, ఆ మనుష్యులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుష్యులను పంపించి–మీ గడ్డములు పెరుగువరకు యెరికోపట్టణమందు ఆగి అటుతరువాత రండని వారితో చెప్పుడనెను.౹ –దావీదు దృష్టికి మనలను మనము హేయపరచుకొంటిమని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి, బేత్రెహోబుతోను అరాము సోబాతోను చేరిన సిరియనులలోనుండి యిరువదివేలమంది కాల్బలమును, మయకా రాజు నొద్దనుండి వెయ్యిమంది బంటులను, టోబులోనుండి పండ్రెండు వేలమంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి.౹ దావీదు ఈ సంగతి విని, యోవాబును శూరుల దండంతటిని పంపెను.౹ అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. సోబా సిరియనులును రెహోబు సిరియనులును మయకావారును టోబువారును విడిగా పొలములో నిలిచిరి.౹ యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చియుండుట చూచి, ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొన బోయెను.౹ అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలినవారిని తన సహోదరుడగు అబీషైకి అప్పగించి సిరియనుల బలము నాకు మించినయెడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించినయెడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తనవారిని వ్యూహపరచెను.౹ అప్పుడు–ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చు కొందము, తన దృష్టికి ఏది యనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అబీషైతో చెప్పి యోవాబును అతనితోకూడ నున్నవారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని యెదుట నిలువజాలక పారిపోయిరి.౹ సిరియనులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అబీషై యెదుట నిలువలేక పారిపోయి పట్టణములో చొరబడగా, యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను.౹ అయితే సిరియనులు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని తెలిసి కొని గుంపుకూడిరి.౹ హదదెజెరు నదియవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి.౹ హదదెజెరు సైన్యాధిపతియగు షోబకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చి యొర్దానునది దాటి హేలామునకు వచ్చెను.౹ సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొన వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలీయుల యెదుట నిలువజాలక పారిపోగా, దావీదు సిరియనులలో ఏడు వందలమంది రథికులను నలువదివేలమంది గుఱ్ఱపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను.౹ హదదెజెరునకు సేవకులగు రాజులందరు తాము ఇశ్రాయేలీయుల యెదుట నిలువలేకుండ కొట్టబడియుండుట చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయముచేయుట మానిరి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతనివారిని ఇశ్రాయేలీయులనందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడివేసిరి; అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.౹ ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చి–ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతలచేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.౹ ఆ స్త్రీ గర్భవతియై —నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడగు ఊరియాను నాయొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను.౹ ఊరియా దావీదు నొద్దకురాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధసమాచారమును అడిగెను.౹ తరువాత దావీదు–ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా, ఊరియా రాజ నగరిలోనుండి బయలువెళ్లెను.౹ అతనివెనుక రాజు ఫలాహారము అతనియొద్దకు పంపించెనుగాని ఊరియా తన యింటికి వెళ్లక తన యేలినవాని సేవకులతోకూడ రాజ నగరిద్వారమున పండుకొనెను.౹ ఊరియా తన యింటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి–నీవు ప్రయాణముచేసి వచ్చితివి గదా; యింటికి వెళ్లకపోతివేమని యడుగగా ఊరియా–మందసమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను, నా యధిపతియగు యోవాబును నా యేలినవాడవగు నీ సేవకులును బయట దండులో నుండగను, భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికిపోదునా? నీ తోడు నీ ప్రాణముతోడు నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను.౹ దావీదు–నేడును నీ విక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను.౹ అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను; అతడు బాగుగాతిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను; సాయంత్రమున అతడు బయలు వెళ్లి తన యింటికి పోక తన యేలినవాని సేవకులమధ్య పడకమీద పండుకొనెను.౹ ఉదయమున దావీదు — యుద్ధము మోపుగా జరుగుచున్నచోట ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్దనుండి వెళ్లి పొమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత పంపించెను.౹ యోవాబు పట్టణమును ముట్టడివేయు చుండగా, ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను.౹ ఆ పట్టణపువారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి, హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను.౹ కాబట్టి యోవాబు యుద్ధ సమాచార మంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను –యుద్ధసమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొని–యుద్ధము చేయునప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? గోడమీదనుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియక పోయెనా? ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఏలాగు హతమాయెను? ఒక స్త్రీ తిరుగటిరాతి తునక ఎత్తి గోడమీదనుండి అతని మీద వేసినందున అతడు తేబేసుదగ్గర హతమాయెను గదా? ప్రాకారముదగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగినయెడల నీవు–తమరి సేవకుడగు ఊరియాయు హతమాయెనని చెప్పుమని బోధించి దూతను పంపెను.౹ దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేసెను.౹ ఎట్లనగా — ఆ మనుష్యులు మమ్మును ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మమువరకు వెంటాడి గెలిచితిమి.౹ అప్పుడు ప్రాకారముమీదనుండి విలు కాండ్రు తమ సేవకులమీద అంబులువేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి, తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియా కూడ హతమాయెను.౹ అందుకు దావీదు–నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము–ఆ సంగతినిబట్టి నీవు చింతపడకుము; ఖడ్గము ఒకప్పుడు ఒకనిమీదను ఒకప్పుడు మరియొకనిమీదను పడుట కద్దు; పట్టణముమీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి, నీవు యోవాబును ధైర్యపరచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను.౹ ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్తకొరకు అంగలార్చెను.౹ అంగలార్పుకాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను; అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను–ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి.౹ ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొఱ్ఱెలును గొడ్లును కలిగియుండెను.౹ అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక చిన్న ఆడు గొఱ్ఱెపిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచు కొనుచుండగా అది వానియొద్దను వాని బిడ్డలయొద్దను ఉండి పెరిగి వాని చేతిముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలె ఉండెను.౹ అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱెలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱెపిల్లను పట్టుకొని, తన యొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను.౹ దావీదు ఈ మాట విని ఆ మనుష్యునిమీద బహుగా కోపించుకొని–యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు.౹ వాడు కని కరము లేక యీ కార్యము చేసెను గనుక ఆ గొఱ్ఱెపిల్లకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెపిల్లల నియ్యవలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి–ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలు చేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.౹ నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితి వేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా? నీవు నన్ను లక్ష్యముచేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.౹ నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగా–నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవాని కప్పగించెదను.౹ పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయిం తును అనెను.౹ –నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను–నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.౹ [14-15] అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను. *** యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను.౹ దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడియుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నిక యైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయక యుండెను.౹ ఏడవదినమున బిడ్డ చావగా–బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు మా మాటలు వినక యుండెను.౹ ఇప్పుడు బిడ్డ చనిపోయెనని మనము అతనితో చెప్పినయెడల తనకుతాను హాని చేసికొనునేమో యనుకొని, దావీదు సేవకులు బిడ్డ చనిపోయెనను సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చని పోయెనను సంగతి గ్రహించి–బిడ్డ చనిపోయెనా అని తన సేవకుల నడుగగా వారు–చనిపోయెననిరి.౹ అప్పుడు దావీదు నేలనుండి లేచి స్నానముచేసి తైలము పూసికొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన యింటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి; అప్పుడు అతడు భోజనము చేసెను.౹ అతని సేవకులు–బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దానికొరకు ఏడ్చుచుంటివిగాని అది మరణమైనప్పుడు లేచి భోజనముచేసితివి. నీవీలాగున చేయుట ఏమని దావీదు నడుగగా అతడు–బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రదికించునేమో యనుకొని నేను ఉపవాసముండి యేడ్చు చుంటిని.౹ ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వానియొద్దకు పోవుదునుగాని వాడు నాయొద్దకు మరల రాడని వారితో చెప్పెను.౹ తరువాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చి ఆమెయొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను.౹ యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞనుబట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టెను. యోవాబు రబ్బా అను అమ్మోనీయుల పట్టణముమీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను.౹ దావీదునొద్దకు అతడు దూతలను పంపి–నేను రబ్బామీద యుద్ధముచేసి జలములమీది పట్టణమును పట్టుకొంటిని;౹ నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలెనని వర్తమానముచేయగా దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధముచేసి దానిని పట్టుకొని, వారి రాజు కిరీటమును అతని తలమీదనుండి తీయించగా అది దావీదు తలమీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మణుగులంత యెత్తుండెను.౹ మరియు అతడు పట్టణములోనుండి బహువిస్తారమైన దోపుసొమ్ము పట్టుకొని పోయెను.౹ పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపములచేతను పదును గల యినుప పనిముట్లచేతను ఇనుప గొడ్డండ్లచేతను వారిని తుత్తునియలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటికి అతడు ఈలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరును తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను నొక సుందరవతియగు సహోదరియుండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను.౹ తామారు కన్యయైనందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారునుబట్టి చిక్కిపోయెను.౹ అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటముగలవాడు. అతడు –రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నో నుతో అనగా అమ్నోను–నా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను.౹ యెహోనాదాబు–నీవు రోగివైనట్టు వేషము వేసికొని నీ మంచముమీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు–నా చెల్లెలైన తామారుచేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడకమీద పండుకొనెను.౹ అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడవచ్చి నప్పుడు అమ్నోను–నా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకొరకు రెండు అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవిచేయగా దావీదు–నీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతనికొరకు భోజనము సిద్ధముచేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను.౹ కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను.౹ అతడు పండుకొనియుండగా ఆమె పిండితీసికొని కలిపి అతని యెదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు–నాకు వద్దని చెప్పి–ఉన్నవారందరు నాయొద్ద నుండి అవతలకు పొండనెను.౹ వారందరు బయటికి పోయిన తరువాత అమ్నోను —నీచేతి వంటకము నేను భుజించునట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసికొని గదిలోపలనున్న తన అన్నయగు అమ్నోను నొద్దకు వచ్చెను.౹ అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని–నా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా ఆమె —నా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచు కొందును? నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగుదువు; అయితే ఇందునుగూర్చి రాజుతో మాటలాడుము;౹ అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను.౹ అమ్నోను ఈలాగు చేసిన తరువాత ఆమెయెడల అత్యధికమైన ద్వేషము పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతకంటె అతడు మరి యెక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా ఆమె–నన్ను బయటకు తోసివేయుటవలన నాకు నీవిప్పుడు చేసిన కీడుకంటె మరి యెక్కువకీడుచేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి–దీనిని నాయొద్దనుండి వెళ్లగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను.౹ కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములుగల చీరలు ధరించువారు ఆమె యట్టి చీర యొకటి ధరించి యుండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మరల రాకుండునట్లు తలుపు గడియ వేసెను.౹ అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసికొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములుగల చీరను చింపి నెత్తి మీద చెయ్యిపెట్టుకొని యేడ్చుచు పోగా ఆమె అన్నయగు అబ్షాలోము ఆమెను చూచి–నీ అన్నయగు అమ్నోను నిన్ను కూడినాడు గదా? నా చెల్లీ నీవు ఊరకుండుము; అతడు నీ అన్నే గదా, యిందునుగూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంట నుండెను.౹ ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను.౹ అబ్షాలోము తన అన్నయగు అమ్నో నుతో మంచి చెడ్డ లేమియు మాటలాడక ఊరకుండెను గాని, తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతనిమీద పగయుంచెను. రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను.౹ అబ్షాలోము రాజు నొద్దకు వచ్చి–చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొఱ్ఱెబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను; రాజవైన నీవును నీ సేవకులును విందునకు రావలెనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవిచేయగా రాజు–నా కుమారుడా, మమ్మును పిలువవద్దు; మేము నీకు అధిక భారముగా ఉందుము; మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను.౹ అయితే దావీదు వెళ్ల నొల్లక అబ్షాలోమును దీవించి పంపగా అబ్షాలోము— నీవు రాకపోయినయెడల నా అన్నయగు అమ్నోను మాతోకూడ వచ్చునట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. —అతడు నీయొద్దకు ఎందుకు రావలెనని రాజు అడుగగా అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరును అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను.౹ అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసమువలన సంతోషియై యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి, నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను.౹ అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞచొప్పునవారుచేయగా రాజకుమారులందరును లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయిరి.౹ వారు మార్గములో ఉండగానే యొకడునులేకుండ రాజకుమారులను అందరిని అబ్షాలోము హతముచేసెనని దావీదునకు వార్తరాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడియుండెను; మరియు అతని సేవకులందరు వస్త్రములు చింపుకొని దగ్గర నిలువ బడియుండిరి.౹ దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి–రాజకుమారులైన యౌవనులనందరిని వారు చంపిరని నా యేలినవాడవగు నీవు తలంచవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెను; ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిననాటనుండి అబ్షాలోము అతని చంపవలెనను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటనుబట్టి నిశ్చయించుకొనవచ్చును.౹ కాబట్టి నా యేలినవాడవగు నీవు రాజకుమారులందరును మరణమైరని తలచి విచారపడవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెననెను.౹ అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి యుండెను. కావలియున్న పనివాడు ఎదురుచూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి.౹ యెహోనాదాబు–అదిగో రాజకుమారులు వచ్చియున్నారు; నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారము గానే ఆయెనని రాజుతో చెప్పెను.౹ అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వ సాగిరి, రాజును అతని సేవకులందరును దీనిని చూచి బహుగా ఏడ్చిరి.౹ అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజు నొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయెననుకొని అతనినిగూర్చి యోదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను. రాజు అబ్షాలోముమీద ప్రాణము పెట్టుకొని యున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువనంపించి–ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి నీవు రాజునొద్దకు వచ్చి యీ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను.౹ కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకువచ్చి సాగిలపడి సమస్కారము చేసి–రాజా రక్షించుమనగా రాజు–నీకేమి కష్టము వచ్చెనని అడిగెను. అందుకు ఆమె–నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను;౹ నీ దాసినైన నాకు ఇద్దరు కుమారులు ఉండిరి, వారు పొలములో పెనుగు లాడుచుండగా విడిపించు వాడెవడును లేకపోయినందున వారిలో నొకడు రెండవవాని కొట్టి చంపెను.౹ కాబట్టి నా యింటివారందరును నీ దాసినైన నామీదికి లేచి–తన సహోదరుని చంపినవాని అప్పగించుము; తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కు దారుని నాశనము చేతుమనుచున్నారు. ఈలాగునవారు నా పెనిమిటికి భూమిమీద పేరైనను శేషమైననులేకుండ మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోవుచున్నారని రాజుతో చెప్పగా రాజు–నీవు నీ యింటికి పొమ్ము, నిన్నుగురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను.౹ అందుకు తెకోవ ఊరి స్త్రీ–నా యేలినవాడా రాజా, దోషము నామీదను నాతండ్రి ఇంటివారి మీదను నిలుచునుగాక, రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా రాజు–ఎవడైనను దీనినిగూర్చి నిన్నేమైన అనినయెడల వానిని నాయొద్దకు తోడుకొని రమ్ము; వాడికను నిన్ను ముట్టక యుండునని ఆమెతో చెప్పెను.౹ అప్పుడు ఆమె–రాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజు–యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను.౹ అప్పుడు ఆ స్త్రీ–నా యేలినవాడవగు నీతో ఇంకొక మాటచెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవిచేయగా రాజు–చెప్పుమనెను.౹ అందుకు ఆ స్త్రీ–దేవుని జనులైనవారికి విరోధముగా నీ వెందుకు దీనిని తలపెట్టియున్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుటచేత తాను వెళ్లగొట్టిన తనవాని రానియ్యక తానే దోషియగుచున్నాడు.౹ మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికినమీదట మరల ఎత్తలేని నీటివలె ఉన్నాము; దేవుడు ప్రాణముతీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు.౹ జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనిని గూర్చి నా యేలినవాడవగు నీతో మాటలాడ వచ్చితిని. కాబట్టి నీ దాసురాలనగు నేను–రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండ నన్నును నా కుమారునిని నాశనము చేయదలచిన వాని చేతిలోనుండి తన దాసినగునన్ను విడిపించునేమో అనుకొంటిని.౹ మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు గనుక నా యేలినవాడవును రాజవునగు నీవు దేవుని దూతవంటివాడవై మంచి చెడ్డలన్నియు విచారింప చాలియున్నావు; కాబట్టి నీ దాసినగు నేను నా యేలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటిననెను.౹ రాజు–నేను నిన్ను అడుగు సంగతి నీ వెంతమాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె–నా యేలినవాడవగు నీవు సెలవిమ్మనెను.౹ అంతట రాజు–యోవాబు నీకు బోధించెనా అని ఆమె నడిగినందుకు ఆమె యిట్లనెను–నా యేలినవాడవైన రాజా, నీ ప్రాణముతోడు, చెప్పినదానిని తప్పక గ్రహించుటకు నా యేలినవాడవును రాజవునగు నీవంటివాడొకడును లేడు; నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి యీ మాటలన్నిటిని నీ దాసినగు నాకు నేర్పెను సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా యేలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానమువంటి జ్ఞానము గలవాడవు.౹ అప్పుడు రాజు యోవాబుతో ఈలాగున సెలవిచ్చెను. ఆలకించుము, నీవు మనవి చేసినదానిని నేను ఒప్పుకొనుచున్నాను.౹ తరువాత–యౌవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి–రాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా యేలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను.౹ అయితే రాజు —అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరువుచేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యముగలవాడు ఒకడును లేడు; అరికాలు మొదలుకొని తలవరకు ఏ లోపమును అతనియందు లేకపోయెను.౹ తన తల వెండ్రుకలు భారముగా నున్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను; కత్తిరించునప్పుడెల్ల వాటి యెత్తు రాజు తూనికనుబట్టి రెండువందల తులములాయెను.౹ అబ్షాలోమునకు ముగ్గురు కుమారులును తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి; ఆమె బహు సౌందర్యవతి. అబ్షాలోము రెండు నిండు సంవత్సరములు యెరూషలేములోనుండియు రాజదర్శనము చేయక యుండగా యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అత నిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లక యుండెను. రెండవమారు అతని పిలువనంపినప్పుడు అతడు రానొల్లక పోగా అబ్షాలోము తన పనివారిని పిలిచి–యోవాబు పొలము నా పొలముదగ్గర నున్నది గదా, దానిలో యవల చేలు ఉన్నవి; మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగుల బెట్టగా యోవాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి–నీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడుగగా అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను–గెషూరునుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే యుండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచితిని; రాజదర్శనము నేను చేయవలెను; నాయందు దోషము కనబడినయెడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును.౹ అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా, రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారముచేయగా రాజు అబ్షాలోమును ముద్దుపెట్టుకొనెను. ఇదియైన తరువాత అబ్షాలోము ఒక రథమును గుఱ్ఱములను సిద్ధపరచి, తనయెదుట పరుగెత్తుటకై యేబదిమంది బంటులను ఏర్పరచుకొనెను.౹ ఉదయముననే లేచి బయలుదేరి పట్టణముయొక్క గుమ్మపు మార్గమందు ఒకతట్టున నిలిచి, రాజుచేత తీర్పునొందుటకై వ్యాజ్యెమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచి–నీవు ఏ ఊరివాడవని యడుగుచుండెను–నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో ఫలానిదానికి చేరిన వాడనని వాడు చెప్పగా అబ్షాలోము–నీ వ్యాజ్యెము సరిగాను న్యాయముగాను ఉన్నదిగాని దానిని విచారించుటకై నియమింపబడినవాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి నేను ఈ దేశమునకు న్యాయాధిపతినైయుండుట యెంత మేలు; అప్పుడు వ్యాజ్యెమాడు వారు నాయొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు వచ్చెను.౹ మరియు తనకు నమస్కారము చేయుటకై యెవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దుపెట్టుకొనుచు వచ్చెను.౹ తీర్పునొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకందరికి అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయుల నందరిని తనతట్టు త్రిప్పుకొనెను. [7-8] నాలుగు సంవత్సరములు జరిగినమీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి–నీ దాసుడనైన నేను సిరియ దేశము నందలి గెషూరునందుండగా–యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించినయెడల నేను ఆయనను సేవించె దనని మ్రొక్కు కొంటిని గనుక, నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కు బడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవిచేయగా *** రాజు–సుఖముగా పొమ్మని సెలవిచ్చెను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను.౹ అబ్షాలోము–మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటియొద్దకు వేగుల వారిని పంపెను.౹ విందునకు పిలువబడియుండి రెండువందలమంది యెరూషలేములోనుండి అబ్షాలోముతోకూడ బయలుదేరి యుండిరి, వీరు ఏమియు తెలియక యథార్థమైన మనస్సుతో వెళ్లియుండిరి.౹ మరియు బలి అర్పింపవలెనని యుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు అను దావీదుయొక్క మంత్రిని గీలో అను అతని ఊరినుండి పిలిపించి యుండెను. అబ్షాలోముదగ్గరకు వచ్చిన జనము మరి మరి యెక్కువగుటచేత కుట్ర బహుబలమాయెను. ఇశ్రాయేలీయులు అబ్షాలోముపక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–అబ్షాలోము చేతిలోనుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము; మనము పారిపోదము రండి, అతడు హఠా త్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడుచేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్లిపోదము రండి.౹ అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరి–చిత్తగించుము; నీ దాసులమైన మేము మా యేలినవాడవును రాజవునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము.౹ అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులగు పదిమందిని ఉంచిన మీదట తన యింటివారినందరిని వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను.౹ రాజును అతని యింటివారును బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బసచేసిరి.౹ అతని సేవకులందరును అతని యిరుపార్శ్వముల నడిచిరి; కెరే తీయులందరును పెలేతీయులందరును గాతునుండి వచ్చిన ఆరువందలమంది గిత్తీయులును రాజునకు ముందుగా నడచుచుండిరి.౹ రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని— నీవు నివాసస్థలము కోరు పరదేశివై యున్నావు; నీవెందుకు మాతోకూడ వచ్చుచున్నావు? నీవు తిరిగి పోయి రాజున్న స్థలమున ఉండుము.౹ నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతోకూడ ఈ తిరుగు లాట యెందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము; కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక యని చెప్పగా ఇత్తయి–నేను చచ్చినను బ్రదికినను, యెహోవా జీవముతోడు నా యేలినవాడవును రాజవునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా యేలినవాడవును రాజవునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవిచేసెను.౹ అందుకు దావీదు —ఆలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరును అతని కుటుంబికులందరును సాగిపోయిరి.౹ వారు సాగిపోవుచుండగా జనులందరు బహుగా ఏడ్చుచుండిరి, ఈ ప్రకారము వారందరు రాజుతోకూడ కిద్రోనువాగు దాటి అరణ్యమార్గమున ప్రయాణమై పోయిరి.౹ సాదోకును లేవీయులందరును దేవుని నిబంధనమందసమును మోయుచు అతనియొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములోనుండి జనులందరును దాటిపోవువరకు నిలిచెను.౹ అప్పుడు రాజు సాదోకును పిలిచి–దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసికొనిపొమ్ము; యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినయెడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, —నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాదోకుతో ఇట్లనెను–సాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను.౹ ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్య మందలి రేవులదగ్గర నిలిచి యుందును.౹ కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసికొనిపోయి అక్కడ నిలిచిరి. అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలులేకుండ కాలినడకను వెళ్లెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి.౹ అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు–యెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను.౹ దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొని వచ్చి రాజును దర్శనము చేసెను.౹ రాజు–నీవు నాతోకూడ వచ్చినయెడల నాకు భారముగా ఉందువు;౹ నీవు పట్టణమునకు తిరిగి పోయి–రాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్ట గలవు.౹ అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు; కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడినయెడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాని చెప్పవలెను.౹ సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారుడైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చటనున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను.౹ దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్లిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసికొనివచ్చెను; రెండు వందల రొట్టెలును నూరు ద్రాక్ష గెలలును నూరు అంజూరపు అడలును ద్రాక్షారసపు తిత్తి ఒకటియు వాటిమీద వేసి యుండెను.౹ రాజు–ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా సీబా–గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలును అంజూరపు అడలును పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసటనొందినవారు త్రాగుటకును తెచ్చితిననగా రాజు–నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగెను. అందుకు సీబా —చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి యిప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచియున్నాడనెను.౹ అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేయని సీబాతో చెప్పగా సీబా–నా యేలినవాడా రాజా, నీ దృష్టియందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాననెను. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అను నొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదుమీదను అతని సేవకులందరిమీదను రాళ్లు రువ్వుచు వచ్చెను.౹ ఈ షిమీ–నరహంతకుడా, దుర్మా ర్గుడా ఛీపో, ఛీపో, —నీవేలవలెనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించియున్నాడు; నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి యున్నావని చెప్పి రాజును శపింపగా సెరూయా కుమారుడైన అబీషై–ఈ చచ్చిన కుక్క నా యేలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదననెను.౹ అందుకు రాజు —సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనియ్యుడు, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవియ్యగా–నీవు ఈలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోను తన సేవకులందరితోను పలికినదేమనగా–నా కడుపున బుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వానిజోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనియ్యుడి.౹ యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టు నేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలుచేయునేమో.౹ అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్లిపోయిరి. వారు వెళ్లిపోవుచుండగా షిమీ అతని కెదురుగా కొండప్రక్కను పోవుచు అతని మీదికి రాళ్లు విసరుచు ధూళి యెగరగొట్టుచునుండెను.౹ రాజును అతనితోకూడనున్న జనులందరును బడలినవారై యొకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును అహీతో పెలును యెరూషలేమునకు వచ్చి యుండిరి.౹ దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైయను నతడు అబ్షాలోమునొద్దకువచ్చి అతని దర్శించి–రాజు చిరంజీవి యగును గాక రాజు చిరంజీవియగును గాక అని పలుకగా అబ్షాలోము–నీ స్నేహితునికి నీవుచేయు ఉపకార మింతేనా నీ స్నేహితునితోకూడ నీవు వెళ్లకపోతివేమని అతని నడుగగా హూషై–యెహోవాయును ఈ జనులును ఇశ్రాయేలీయులందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతనియొద్దనే యుందును.౹ మరియు నేనెవనికి సేవచేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవచేయవలెను గదా? నీ తండ్రి సన్నిధిని నేను సేవచేసినట్లు నీ సన్నిధిని నేను సేవచేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను.౹ అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలిసి కొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా అహీతోపెలు–నీ తండ్రిచేత ఇంటికి కావలియుంచబడిన ఉపపత్నులయొద్దకు నీవు పోయినయెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరు తెలిసికొందురు, అప్పుడు నీ పక్షమున నున్నవారందరు ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను.౹ కాబట్టి మేడమీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులకందరికి తెలియునట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను.౹ ఆ దినములలో అహీ తోపెలు చెప్పిన యే యాలోచనయైనను ఒకడు దేవుని యొద్ద విచారణచేసి పొందిన ఆలోచనయైనట్టుగా ఉండెను; దావీదును అబ్షాలోమును దానిని అట్లే యెంచుచుండిరి. దావీదు అలసట నొంది బలహీనముగా నున్నాడు గనుక [2-3] —నేను అతనిమీదపడి అతని బెదరించినయెడల అతని యొద్దనున్న జనులందరు పారిపోదురు; రాజును మాత్రము హతముచేసి జనులందరిని నీతట్టు త్రిప్పెదను; నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరు వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పండ్రెండు వేలమందిని ఏర్పరచుకొనిపోయి యీ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా *** ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలువారి పెద్దలకందరికిని యుక్తముగా కనబడెను. అంతట–అర్కీయుడైన హూషై యేమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా, హూషై అబ్షాలోమునొద్దకు వచ్చెను.౹ అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి–అతని మాటచొప్పున మనము చేయుదమా చేయకుందుమా? నీ యాలోచన యేమైనది చెప్పుమని అతని నడుగగా హూషై అబ్షాలోముతో ఇట్లనెను. ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు.౹ నీ తండ్రియు అతని పక్షమున నున్నవారును మహా బలాఢ్యులనియు, అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంట్ల వంటివారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియును. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతోకూడ బసచేయడు.౹ అతడేదో యొక గుహయందో మరి ఏ స్థలమందో దాగి యుండును. కాబట్టి నీవారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతినిబట్టి అబ్షాలోము పక్షమున నున్నవారు ఓడిపోయిరని చెప్పు కొందురు.౹ నీ తండ్రి మహా బలాఢ్యుడనియు, అతని పక్షపువారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరును ఎరుగుదురు గనుక సింహపుగుండెవంటి గుండెగలవారు సయితము దిగులొందుదురు.౹ కాబట్టి నా ఆలోచన యేమనగా, దానునుండి బెయేర్షెబావరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయుల నందరిని నలుదిశలనుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను.౹ అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో యొకదానియందు అతనిమీద పడుదుము; నేలమీద మంచుపడురీతిగా మనము అతనిమీదికి వచ్చినయెడల అతని పక్షపువారిలో ఒకడును తప్పించుకొనజాలడు.౹ అతడు ఒక పట్టణములో చొచ్చినయెడల ఇశ్రాయేలీయులందరును ఆ పట్టణమునకు త్రాళ్లు తీసికొనివచ్చి యొక చిన్న రాయి అచ్చట కనబడకుండ దానిని నదిలోనికి లాగుదురు.౹ అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పినదానికంటె యుక్తమని యొప్పుకొనిరి; ఏలయనగా యెహోవా అబ్షాలోముమీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థముచేయ నిశ్చయించి యుండెను. కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇశ్రాయేలువారి పెద్దలకందరికిని అహీతోపెలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులగు సాదోకుతోను అబ్యా తారుతోను తెలియజెప్పి –మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దనియు, రాజును అతని సమక్షమందున్న జనులందరును నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్లిపోవుడనియు దావీదునకు వర్తమానము పంపుడని చెప్పెను.౹ తాము పట్టణముతట్టు వచ్చిన సంగతి తెలియబడక యుండునట్లు యోనాతానును అహిమయస్సును ఏన్‌రోగేలు దగ్గర నిలిచియుండగా పని కత్తె యొకతెవచ్చి, హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాని తెలియజెప్పిరి.౹ తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెనుగాని వారిద్దరు వేగిరముగా పోయి బహూరీములో ఒకని యిల్లు చేరి అతని యింటి ముంగిట ఒక బావి యుండగా దానిలో దిగి దాగి యుండిరి.౹ ఆ యింటి యిల్లాలు ముతక గుడ్డ యొకటి తీసికొనివచ్చి బావిమీద పరచి దానిపైన గోధుమపిండి ఆర బోసెను గనుక వారు దాగిన సంగతి యెవరికిని తెలియక పోయెను.౹ అబ్షాలోము సేవకులు ఆ యింటి ఆమెయొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా ఆమె–వారు ఏరుదాటి పోయిరని వారితో చెప్పెను గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.౹ వారు వెళ్లిన తరువాత యోనాతానును అహిమయస్సును బావిలోనుండి బయటికి వచ్చి దావీదునొద్దకు పోయి అహీతోపెలు అతనిమీద చేసిన ఆలోచన తెలియజేసి–నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని యొద్దనున్న జనులందరును లేచి యొర్దానునది దాటిరి, తెల్లవారునప్పటికి నది దాటక యుండినవాడు ఒకడును లేకపోయెను.౹ అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరుగకపోవుట చూచి, గాడిదకు గంతకట్టి యెక్కి తన ఊరనున్న తన యింటికి పోయి తన యిల్లు చక్కబెట్టుకొని ఉరిపోసికొని చనిపోయెను; జనులు అతని తండ్రి సమాధియందు అతనిని పాతిపెట్టిరి. దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరును యొర్దాను నది దాటి వచ్చిరి.౹ అబ్షాలోము యోవాబునకు మారుగా అమాశాను సైన్యాధి పతిగా నియమించెను. ఈ అమాశా ఇత్రా అను ఇశ్రాయేలీయుడు యోవాబు తల్లియైన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తెయైన అబీగయీలు నొద్దకు పోయి నందున పుట్టినవాడు అబ్షాలోమును ఇశ్రాయేలీయులును గిలాదుదేశములో దిగియుండిరి. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపువాడైన నాహాషు కుమారుడగు షోబీయును, లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగెలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయియు అరణ్యమందు జనులు అలసినవారై ఆకలిగొని దప్పిగొనియుందురని తలంచి, పరుపులు పాత్రలుకుండలు గోధుమలు యవలు పిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడు కాయలు పేలాలు తేనె వెన్న గొఱ్ఱెలు జున్నుముద్దలు దావీదును అతనియొద్దనున్న జనులును భోజనము చేయుటకై తీసికొనివచ్చిరి. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను మూడు భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును సెరూయా కుమారుడగు అబీషై అను యోవాబు సహోదరుని చేతిక్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతిక్రింద ఒక భాగమును ఉంచెను. దావీదు–నేను మీతోకూడ బయలుదేరుదునని జనులతో చెప్పగా జనులు–నీవు రాకూడదు, మేము పారిపోయి నను జనులు దానిని లక్ష్యపెట్టరు, మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మావంటి పది వేలమందితో నీవు సాటి; కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలెనని అతనితో చెప్పిరి.౹ అందుకు రాజు–మీ దృష్టికేది మంచిదో దాని చేసెదనని చెప్పి గుమ్మపు ప్రక్కను నిలిచి యుండగా జనులందరును గుంపులై వందల కొలదిగాను వేల కొలదిగాను బయలుదేరిరి.౹ అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి–నా నిమిత్తమై యౌవనుడైన అబ్షాలోమునకు దయ జూపుడని ఆజ్ఞాపించెను. జనులందరు వినుచుండగా రాజు అబ్షాలోమునుగూర్చి అధిపతులకందరికి ఆజ్ఞ ఇచ్చెను.౹ జనులు ఇశ్రాయేలువారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగగా ఇశ్రాయేలువారు దావీదు సేవకుల యెదుట నిలువలేక ఓడిపోయిరి; ఆ దినమున ఇరువది వేలమంది అక్కడ హతులైరి.౹ యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను; మరియు నాటి దినమున కత్తిచేత కూలినవారి కంటె ఎక్కువమంది అడవిలో చిక్కుబడి నాశనమైరి.౹ అబ్షాలోము కంచరగాడిదమీద ఎక్కి పోవుచు దావీదు సేవకులకు ఎదురాయెను; ఆ కంచరగాడిద యొక గొప్పమస్తకి వృక్షముయొక్క చిక్కుకొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికినిమధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను.౹ ఒకడు దానిని చూచి వచ్చి–అబ్షాలోము మస్తకివృక్షమున వ్రేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు యోవాబు–నీవు చూచి యుంటివే, నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపినయెడల పది తులముల వెండియు ఒక నడికట్టును నీకిచ్చియుందు నని తనకు సమాచారము చెప్పినవానితో అనెను.౹ అందుకు వాడు–యౌవనుడైన అబ్షాలోమును ఎవడును ముట్టకుండ జాగ్రత్తపడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ నిచ్చుచుండగా నేను వింటిని; వెయ్యితులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను.౹ మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చినయెడల అది రాజునకు తెలియకపోదు, రాజు సన్నిధిని నీవే నాకు విరోధివగుదువు గదా అని యోవాబుతో అనగా యోవాబు–నీవు చేయువరకు నేను కాచుకొని యుందునా? అని చెప్పి మూడు బాణములు చేతపట్టుకొనిపోయి మస్తకివృక్షమున వ్రేలాడుచు ఇంకను ప్రాణముతో నున్న అబ్షాలోముయొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు పదిమంది చుట్టు చుట్టుకొని యుండగా అబ్షాలోమును కొట్టి చంపెను.౹ అప్పుడు జనులను ఇక హతము చేయక విడువవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలీయులను తరుముకొనిపోయిన జనులు తిరిగి వచ్చిరి.౹ జనులు అబ్షాలోముయొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్దగోతిలో పడవేసి పెద్దరాళ్లకుప్ప దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులందరును తమతమ యిండ్లకు పోయిరి.౹ తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని, అబ్షాలోము తాను బ్రదికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి, అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటివరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు. సాదోకు కుమారుడైన అహిమయస్సు–నేను పరుగెత్తి కొనిపోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదననగా యోవాబు–ఈ దినమున ఈ వర్తమానము చెప్ప తగదు, మరియొక దినమున చెప్పవచ్చును; రాజు కుమారుడు మరణమాయెను గనుక ఈ దినమున వర్తమానము తీసికొని పోతగదని అతనితో చెప్పెను.౹ తరువాత కూషీని పిలిచి —నీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయుమనగా కూషీ యోవాబునకు నమస్కారము చేసి పరుగెత్తికొని పోయెను.౹ అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు–కూషీతోకూడ నేనును పరుగెత్తికొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవిచేయగా యోవాబు–నాయనా నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారమేదియు లేదు గదా అని అతనితో అనగా అతడు–ఏమైనను సరే నేను పరుగెత్తికొని పోవుదుననెను. అందుకు యోవాబు —పొమ్మని సెలవియ్యగా అహిమయస్సు మైదానపు మార్గమున పరుగెత్తికొని కూషీకంటె ముందుగా చేరెను. దావీదు రెండు గుమ్మములమధ్యను నడవలో కూర్చొని యుండెను; కావలికాడు గుమ్మముపైనున్న గోడమీదికి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరుగెత్తికొని వచ్చుచున్న యొకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా రాజు–వాడు ఒంటరిగా ఉండినయెడల ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగుమీద వచ్చుచుండగా కావలికాడు పరుగెత్తికొని వచ్చు మరియొకని కనుగొని–అదిగో మరియొకడు ఒంటరి గానే పరుగెత్తికొని వచ్చుచున్నాడని ద్వారపుతట్టు తిరిగి చెప్పగా రాజు–వాడును వర్తమానము తెచ్చుచున్నా డనెను.౹ కావలికాడు మొదటివాడు పరుగెత్తుట చూడగా —వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు–వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలో అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి–నా యేలినవాడవును రాజవునగు నిన్ను చంప చూచినవారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను.౹ రాజు–బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడుగగా అహిమయస్సు–యోవాబు రాజసేవకుడనైన నీ దాసుడనగునన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరు గుట నేను చూచితినిగాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను.౹ అప్పుడు రాజు–నీవు ప్రక్కకు తొలగి నిలిచియుండుమని వాని కాజ్ఞనియ్యగా వాడు తొలగి నిలిచెను.౹ అంతలో కూషీ వచ్చి–నా యేలిన వాడా రాజా, నేను నీకు శుభసమాచారము తెచ్చితిని; యీ దినమున యెహోవా నీ మీదికి వచ్చినవారినందరిని ఓడించి నీకు న్యాయము తీర్చెనని చెప్పినప్పుడు రాజు–బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడిగెను. అందుకు కూషీ చెప్పినదేమనగా–నా యేలినవాడవును రాజవునగు నీ శత్రువులును నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చినవారందరును ఆ బాలుడున్నట్టుగానే యుందురు గాక.౹ అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కి పోయి యేడ్చుచు, సంచరించుచు–నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను. రాజు తన కుమారునిగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరు విని,౹ [2-5] యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనులవలె వారు నాడు దొంగనడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి; నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని–అబ్షాలోమా నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా నా కుమారుడా, అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా, రాజు అబ్షాలోమునుగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని నగరియందున్న రాజునొద్దకు వచ్చి–నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరిని నేడు సిగ్గుపరచి *** *** *** నీ స్నేహితుల యెడల ప్రేమ చూపక నీ శత్రువులయెడల ప్రేమ చూపుచు, ఈ దినమున అధిపతులును సేవకులును నీకు ఇష్టజనులుకారని నీవు కనుపరచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రదికియుండినయెడల అది నీకు ఇష్టమగునన్న మాట యీ దినమున నేను తెలిసికొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికివచ్చి నీ సేవకులను ధైర్యపరచుము.౹ నీవు బయటికి రాకయుండినయెడల ఈ రాత్రి యొకడును నీయొద్ద నిలువడని యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను; నీ బాల్యమునుండి నేటివరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటె అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవిచేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. రాజు గుమ్మములో కూర్చున్నాడను మాట జనులందరు విని రాజును దర్శింప వచ్చిరిగాని ఇశ్రాయేలువారు తమతమ యిండ్లకు పారిపోయిరి.౹ అంతట ఇశ్రాయేలువారి గోత్రములకు చేరికైన జనులందరు ఇట్లనుకొనిరి–మన శత్రువుల చేతిలోనుండియు, ఫిలిష్తీయుల చేతిలోనుండియు మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశములోనుండి పారిపోయెను.౹ మనమీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయెను. కాబట్టి మనము రాజును మరల తోడుకొని వచ్చుటనుగూర్చి ఏల మాట్లాడక పోతిమి? రాజైన దావీదు ఇది విని యాజకులగు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి–ఇశ్రాయేలువారందరు మాటలాడుకొను సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను గనుక రాజును నగరికి మరల తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు? మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులై యుండగా రాజును తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను.౹ మరియు అమాశా యొద్దకు దూతలను పంపి–నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయ పరచనియెడల దేవుడు గొప్పఅపాయము నాకు కలుగ జేయును గాకని చెప్పుడనెను.౹ అతడు పోయి యెవరును తప్పకుండ యూదావారినందరిని రాజునకు ఇష్టపూర్వకముగా లోబడునట్లు చేయగా–నీవును నీ సేవకులందరును మరల రావలెనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యొర్దాను నదియొద్దకు రాగా యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యివతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి. అంతలో బహూరీమునందున్న బెన్యామీనీయుడగు గెరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితోకూడ వచ్చెను.౹ అతని యొద్ద వెయ్యిమంది బెన్యామీనీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును అతని పదు నయిదుగురు కుమారులును అతని యిరువదిమంది దాసులును వచ్చి రాజు ఎదుట నది దాటిరి; రాజు ఇంటివారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవుపడవను ఇవతలకు తెచ్చి యుండిరి. అంతట గెరా కుమారుడగు షిమీ వచ్చి రాజు యొర్దానునది దాటి పోగానే అతనికి సాష్టాంగపడి –నా యేలినవాడా, నేను చేసిన ద్రోహము నామీద మోప కుము; నా యేలినవాడవును రాజవునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము, మనస్సునందుంచు కొనకుము.౹ నేను పాపము చేసితినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితోకూడ నా యేలినవాడవును రాజవునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చియున్నాననెను.౹ అంతట సెరూయా కుమారుడగు అబీషై–యెహోవా అభిషేకించినవానిని శపించిన యీ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని యనగా దావీదు–సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలువారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? యిప్పుడు నేను ఇశ్రాయేలువారిమీద రాజు నైతినను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమాణముచేసి –నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చెను. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును నెదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటివరకు అతడు కాళ్లు కడుగుకొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకుకొనకయు నుండెను.౹ రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు —మెఫీబోషెతూ, నీవు నాతోకూడ రాకపోతివేమని అతని నడిగెను అందుకతడు–నా యేలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిదమీద గంత కట్టించి యెక్కి రాజుతోకూడ వెళ్లిపోదునని నేనను కొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను.౹ సీబా నీ దాసుడనైన నన్నుగూర్చి నా యేలినవాడవును రాజవునగు నీతో అబద్ధమాడెను. అయితే నా యేలినవాడవును రాజవునగు నీవు దేవదూత వంటివాడవు, నీ దృష్టికి ఏది యనుకూలమో దాని చేయుము.౹ నా తండ్రి యింటి వారందరు నా యేలినవాడవును రాజవునగు నీ దృష్టికి మృతుల వంటివారై యుండగా, నీవు నీ బల్లయొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజవైన నీకు మొఱ్ఱపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా రాజు–నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు? నీవును సీబాయును భూమిని పంచుకొనుడని నేనాజ్ఞ ఇచ్చితిని గదా అనెను.౹ అందుకు మెఫీబోషెతు–నా యేలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చియున్నావు గనుక అతడు అంతయు తీసికొన వచ్చుననెను. మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగెలీమునుండి యొర్దాను అద్దరికి వచ్చి రాజుతోకూడ నది దాటెను.౹ బర్జిల్లయియెనుబది సంవత్సరముల వయస్సుకలిగి బహు ముసలివాడై యుండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచు వచ్చెను.౹ యెరూషలేములో నాయొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతోకూడ నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవియ్యగా బర్జిల్లయి–రాజవగు నీతోకూడ యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకబోవుదును? నేటికి నాకు ఎనుబది యేండ్లాయెను. సుఖదుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలిసికొనగలనా? గాయకులయొక్కయు గాయకురాండ్రయొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా యేలిన వాడవును రాజవునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను? నీ దాసుడనైన నేను నీతోకూడ నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చెదనుగాని రాజవగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేల? నేను నా ఊరియందుండి మరణమై నా తలిదండ్రుల సమాధియందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగి పోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము, నీ దాసుడగు కింహాము నా యేలిన వాడవును రాజవునగు నీతోకూడ వచ్చుటకు సెలవిమ్ము; నీ దృష్టికి ఏది యనుకూలమో దానిని అతనికి చేయుమని మనవిచేయగా రాజు–కింహాము నాతోకూడ రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసెదను, మరియు నావలన నీవు కోరునదంతయు నేను చేసెదనని సెలవిచ్చెను.౹ జనులందరును రాజును నది యవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దుపెట్టుకొని దీవించెను; తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్లిపోయెను. యూదా వారందరును ఇశ్రాయేలువారిలో సగము మందియు రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంటబెట్టుకొని గిల్గాలునకు వచ్చెను.౹ ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరును రాజునొద్దకు వచ్చి–మా సహోదరులగు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని, నీ యింటివారిని నీవారిని యొర్దాను ఇవతలకు తోడుకొని వచ్చిరని యడుగగా యూదా వారందరు–రాజు మీకు సమీపబంధువుడై యున్నాడు గదా, మీకు కోప మెందుకు? ఆలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనను తింటిమా? మాకు యినాము ఏమైన ఇచ్చెనా? అని ఇశ్రాయేలువారితో అనిరి.౹ అందుకు ఇశ్రాయేలు వారు–రాజులో మాకు పది భాగములున్నవి; మీకంటె మేము దావీదునందు అధిక స్వాతంత్యము గలవారము; రాజును తోడుకొని వచ్చుటనుగురించి మీతో ముందుగా మాటలాడినవారము మేమే గదా మీరు మమ్మును నిర్లక్ష్యము చేసితిరేమి? అని యూదా వారితో పలికిరి. యూదావారి మాటలు ఇశ్రాయేలు వారి మాటలకంటె కఠినముగా ఉండెను. బెన్యామీనీయుడగు బిక్రి కుమారుడైన షెబయను పనికిమాలినవాడొకడు అచ్చటనుండెను. వాడు–దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారునియందు మనకు స్వాస్థ్యము ఎంతమాత్రమును లేదు; ఇశ్రాయేలువారలారా, మీరందరు మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటనచేయగా ఇశ్రాయేలువారందరు దావీదును విడిచి బిక్రి కుమారుడైన షెబనువెంబడించిరి. అయితే యొర్దాను నదినుండి యెరూషలేమువరకు యూదావారు రాజును హత్తుకొనిరి.౹ దావీదు యెరూషలేము లోని తన నగరికి వచ్చి, తన యింటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన పదిమంది స్త్రీలను తీసికొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెనుగాని వారియొద్దకు పోకుండెను; వారు కావలియందుంచబడిన వారై బ్రతికినంతకాలము విధవరాండ్రవలె ఉండిరి. తరువాత రాజు అమాశాను పిలువనంపి–మూడుదినములలోగా నీవు నా దగ్గరకు యూదావారినందరిని సమ కూర్చి యిక్కడ హాజరుకమ్మని ఆజ్ఞాపించగా అమాశా యూదా వారిని సమకూర్చుటకై వెళ్లిపోయెను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరి పోయినప్పుడు దావీదు అబీషైని పిలువనంపి–బిక్రి కుమారుడైన షెబ అబ్షాలోముకంటె మనకు ఎక్కువ కీడుచేయును; వాడు ప్రాకారములుగల పట్టణములలో చొచ్చి మనకు దొరకక పోవునేమో గనుక నీవు నీ యేలినవాని సేవకులను వెంట బెట్టుకొనిపోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించెను.౹ కాబట్టి యోవాబు వారును కెరేతీయులును పెలేతీయులును బలాఢ్యులందరును అతనితోకూడ యెరూషలేములోనుండి బయలుదేరి బిక్రి కుమారుడగు షెబను తరుమబోయిరి.౹ వారు గిబియోనులో ఉన్న పెద్ద బండదగ్గరకు రాగా అమాశా వారిని కలియ వచ్చెను; యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించియున్న నడికట్టుకు వరగల కత్తికట్టుకొనియుండగా ఆ వర వదులై కత్తి నేలపడెను.౹ అప్పుడు యోవాబు అమాశాతో–నా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు, అమాశాను ముద్దుపెట్టుకొనునట్లుగా కుడిచేత అతని గడ్డము పట్టుకొని అమాశా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడు కొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చెను; గుచ్చినతోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. యోవాబును అతని సహోదరుడగు అబీషైయును బిక్రి కుమారుడగు షెబను తరుముటకు సాగిపోగా యోవాబు బంటులలో ఒకడు అతనిదగ్గర నిలిచి–యోవాబుకు ఇష్టులైన దావీదు పక్షముననున్నవారందరు యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను.౹ అమాశా రక్తములో పొర్లుచు మార్గమున పడియుండగా అచ్చోటికి వచ్చిన జనులందరు నిలిచి యుండుట ఆ మనుష్యుడు చూచి–అమాశాను మార్గము నుండి చేనిలోనికి లాగి, మార్గస్థులందరు నిలిచి తేరిచూడకుండ శవముమీద బట్ట కప్పెను.౹ శవము మార్గమునుండి తీయబడిన తరువాత జనులందరు బిక్రి కుమారుడగు షెబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్లిరి.౹ అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరియొద్దకును ఆబేలువారియొద్దకును బేత్మయకావారియొద్దకును బెరీయులందరియొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి.౹ ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయకాయందు బిక్రిని ముట్టడివేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరు ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి.౹ అప్పుడు యుక్తిగల యొక స్త్రీ ప్రాకారము ఎక్కి–ఓహో ఆలకించుడి, ఆలకించుడి, నేను అతనితో మాటలాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమెదగ్గరకు వచ్చెను.౹ అంతట ఆమె–యోవాబువు నీవేనా అని అతని నడుగగా అతడు–నేనే అనెను. అందుకామె— నీ దాసురాలనగు నేను నీతో మాటలాడుదునా అని అడుగగా అతడు–మాటలాడ వచ్చుననెను.౹ అంతట ఆమె–పూర్వకాలమున జనులు–ఆబేలునందు సంగతి విచారింపవలెనని చెప్పుట కద్దు; ఆలాగున చేసి కార్యములు ముగించుచు వచ్చిరి.౹ నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్థులలోను యథార్థవంతులలోను చేరికయైనదానను; ఇశ్రాయేలీయుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలెనని నీవు ఉద్దేశించుచున్నావు; యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదు వని చెప్పగా యోవాబు–నిర్మూలము చేయను, లయపరచను, ఆలాగున చేయనే చేయను, సంగతి అది కానే కాదు.౹ బిక్రి కుమారుడగు షెబ అను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదుమీద ద్రోహము చేసియున్నాడు; మీరు వానిని మాత్రము అప్పగించుడి; తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో–చిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పిపోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికి తెలియ జేయగా, వారు బిక్రి కుమారుడగు షెబయొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరును ఆ పట్టణమును విడిచి యెవరి గుడారములకు వారు పోయిరి; యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను. యోవాబు ఇశ్రాయేలు దండువారందరికి అధిపతియైయుండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతియైయుండెను.౹ అదోరాము వెట్టిపనులు చేయువారిమీద అధికారియైయుండెను; అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద ఉండెను; షెవా లేఖకుడు; సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు. దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువకుండ కరవుకలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను–సౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనినిబట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను.౹ గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించినవారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరిగాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారియందు ఆసక్తిగలవాడై వారిని హతము చేయ చూచుచుండెను.౹ రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపి–నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించునట్లు దోష నివృత్తికై దేనిచేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా గిబియోనీయులు–సౌలు అతని యింటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులేగాని ఇశ్రాయేలీయులలో ఎవరినైనను చంపుటయేగాని మేము కోరుట లేదనిరి. అంతట దావీదు మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదు ననగా వారు–మాకు శత్రువులై మమ్మును నాశనముచేయుచు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండ మేము లయమగునట్లు మాకు హానిచేయనుద్దేశించినవాని కుమారులలో ఏడుగురిని మాకప్పగించుము.౹ యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవిచేయగా రాజు–నేను వారిని అప్పగించెదననెను.౹ తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసియున్న హేతువుచేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషె తును అప్పగింపక అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన యిద్దరు కుమారులగు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మెరాబు మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలునకు కనిన అయిదుగురు కుమారులను పట్టుకొని గిబియోనీయుల కప్పగించెను.౹ వారు ఈ యేడుగురిని తీసికొనిపోయి కొండమీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ యేడుగురు ఏకరీతినే చంపబడిరి; కోతకాలమున యవలకోత యారంభమందువారు మరణమైరి.౹ అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసికొని కొండపైన పరచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశమునుండి వర్షము ఆ కళేబరములమీద కురియువరకు అచ్చటనేయుండి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండను రాత్రి అడవిమృగములు దగ్గరకు రాకుండను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను.౹ కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారియొద్దనుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యాబే ష్గిలాదువారు వారి యెముకలను అచ్చటనుండి దొంగిలి తెచ్చి యుండిరి.౹ కావున దావీదు వారియొద్దనుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను, రాజాజ్ఞనుబట్టి ఉరితీయబడినవారి యెముకలను జనులు సమకూర్చిరి.౹ సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి. రాజు ఈలాగు చేసిన తరువాత దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడంగీకరించెను. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరల జరుగగా దావీదు తన సేవకులతోకూడ దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మ సిల్లెను.౹ అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బి బేనోబ అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని యీటె మూడువందల తులముల యెత్తు యిత్తడిగలది–నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను.౹ సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిచూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇకమీదట మాతోకూడ యుద్ధమునకు రావద్దని అతనిచేత ప్రమాణము చేయించిరి. అటుతరువాత ఫిలిష్తీయులతో గోబుదగ్గర మరల యుద్ధము జరుగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సఫును చంపెను.౹ తరువాత గోబుదగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బేత్లెహేమీయుడైన యహరేయోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను; వాని యీటెకఱ్ఱ నేతగాని దోనె అంత గొప్పది.౹ ఇంకొక యుద్ధము గాతుదగ్గర జరిగెను. అక్కడ మంచి యెత్తరి యొకడుండెను, ఒక్కొక చేతికి ఆరేసి వ్రేళ్లును, ఇరువది నాలుగు వ్రేళ్లు అతనికుండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు.౹ అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను.౹ ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారై దావీదువలనను అతని సేవకులవలనను హతులైరి. యెహోవా తన్ను సౌలుచేతిలోనుండియు, తన శత్రువులందరి చేతిలోనుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగము నా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టితిని నా శత్రువుల చేతిలోనుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువుయొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరదపొర్లువలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదరించగను పాతాళపాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను పరమండలపు పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి యుండెను. కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను. గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను. గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింప జేసెను. నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను. ఆయన సన్నిధికాంతిలోనుండి నిప్పుకణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను. తనబాణములను ప్రయోగించి శత్రువులను చెదర గొట్టెను మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను. ఉన్నతస్థలములనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాసులలోనుండి తీసెను. బలవంతులగు పగవారు, నన్ను ద్వేషించువారు, నాకంటె బలిష్ఠులై యుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందువారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమునుబట్టియే నాకు ప్రతిఫల మిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడచినవాడను కాను. ఆయన న్యాయవిధుల నన్నిటిని నేను లక్ష్యపెట్టు చున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడనుకాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినై యుండుట యెహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగలవారియెడల నీవు దయ చూపించుదువు యథార్థవంతులయెడల నీవు యథార్థవంతుడవుగా నుందువు. సద్భావముగల వారియెడల నీవు సద్భావము చూపు దువు మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు. శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేసెదవు యెహోవా, నీవు నాకు దీపమై యున్నావు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయముచేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయమువలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చువారికందరికి ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేయును ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపును. నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు బెట్టును. నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్పచేయును. నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు. నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని నశింపజేయువరకు నేను తిరుగను. నేను వారిని మ్రింగివేయుదును వారిని తుత్తినియలుగా కొట్టుదును వారు నా పాదముల క్రిందపడి లేవలేకయుందురు. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు నామీదికి లేచినవారిని నీవు అణచివేయుదువు. నా శత్రువులను వెనుకకు మళ్లచేయుదువు నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేయుదును. వారు ఎదురు చూతురుగాని రక్షించువాడు ఒకడును లేకపోవును వారు యెహోవాకొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును. నేల ధూళివలె వారిని నలుగగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంటవలె నేను వారిని పారపోసి అణగ ద్రొక్కెదను. నా ప్రజల కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు. అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్నుగూర్చి వినిన మాత్రముచేత నాకు విధే యులగుదురు అన్యులు దుర్బలులై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతు డగును గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండనచేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయనే నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును నామీదికి లేచినవారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానముచేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. దావీదు రచించిన చివరి మాటలు ఇవే; యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి యిదే; యాకోబు దేవునిచేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి యిదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నాద్వారా మాటలాడుచున్నాడు. —మనుష్యులను ఏలు నొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు గలిగియేలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బులేకుండ ఉదయించిన సూర్యునివలెను వర్షము కురిసినపిమ్మట నిర్మలమైన కాంతిచేత భూమిలోనుండి పుట్టిన లేత గడ్డివలెను అతడు ఉండును. నా సంతతివారు దేవునిదృష్టికి అనుకూలురే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఒకడు ముండ్లను చేతపట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండ్లను పట్టుకొనువాడు ఇనుపపనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును గదా మనుష్యులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్నచోటనే కాల్చివేయుదురు. దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెష్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు; అతడు ఒక యుద్ధములో ఎనిమిది వందలమందిని హతము చేసెను.౹ ఇతని తరువాతివాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు, ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడివచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి డీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవువరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడుసొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతనివెనుక వచ్చిరి.౹ ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా; ఫిలిష్తీయులు అలసందెల చేనిలో గుంపుకూడగా జనులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయిరి.౹ అప్పుడితడు ఆ చేనిమధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండ వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుటవలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగ జేసెను.౹ మరియు ముప్పదిమంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి,౹ దావీదు దుర్గములో నుండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బేత్లెహేములో ఉండిరి.౹ దావీదు–బేత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడై నను నాకు తెచ్చి యిచ్చినయెడల ఎంతో సంతోషించెదనని అధికారితో పలుకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలివారిని ఓడించి, దారి చేసికొనిపోయి బేత్లెహేము గవిని దగ్గరనున్న బావినీళ్లు చేది దావీదునొద్దకు తీసికొనివచ్చిరి; అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవా సన్నిధిని పారబోసి —యెహోవా, నేను ఇవి త్రాగను;౹ ప్రాణమునకు తెగించి పోయి తెచ్చినవారి చేతి నీళ్లు త్రాగుదునా? అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి.౹ సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో మూడువందలమందిని హతముచేసి వారిమీద తన యీటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గు రిలో పేరుపొందినవాడు.౹ ఇతడు ఆ ముప్పదిమందిలో ఘనుడై వారికి అధిపతి యాయెనుగాని మొదటి ముగ్గు రితో సమానుడు కాకపోయెను.౹ మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమ శాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను నొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగి యున్న యొక సింహమును చంపి వేసెను.౹ ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డుకఱ్ఱ తీసికొని వానిమీదికి పోయి వాని చేతిలోని యీటె ఊడలాగి దానితోనే వాని చంపెను.౹ ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరుపొంది ఆ ముప్పదిమందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను. ఆ ముప్పదిమంది యెవరనగా, యోవాబు సహోదరుడైన అశాహేలు, బేత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను,౹ హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,౹ పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,౹ అనాతోతీయుడైన అబీ యెజరు, హుషాతీయుడైన మెబున్నయి,౹ అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై నెటోపా తీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి,౹ పిరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి,౹ అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,౹ షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేనుయొక్క కుమారులలో యోనాతాను,౹ హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారునకు పుట్టిన అహీయాము,౹ మాయాకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము,౹ కర్మెతీయుడైన హెసై, అర్బీయుడైన పయరై,౹ సోబావాడగు నాతానుయొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ,౹ అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, యితడు సెరూయా కుమారుడగు యోవాబుయొక్క ఆయుధములను మోయువాడై యుండెను.౹ [38-39] ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా. వారందరు ముప్పదియేడుగురు. ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసి–నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.౹ అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతియైన యోవాబును పిలిచి–జనసంఖ్య యెంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబావరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారముచేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా యోవాబు–జనుల సంఖ్య యెంత యున్నను నా యేలినవాడవును రాజవునగు నీవు బ్రదికి యుండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక; నా యేలినవాడవును రాజవునగు నీకు ఈ కోరిక ఏలపుట్టెననెను.౹ అయినను రాజు యోవా బునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుటచేత యోవాబును సైన్యాధిపతులును ఇశ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజుసముఖమునుండి బయలువెళ్లి యొర్దాను నది దాటి యాజేరుతట్టున గాదు లోయ మధ్యనుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడనుండి గిలాదునకును తహ్తింహోద్షీ దేశమునకును వచ్చిరి; తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి.౹ అక్కడనుండి బురుజులుగల తూరు పట్టణమునకును హివ్వీయులయొక్కయు కనానీయులయొక్కయు పట్టణములన్నిటికిని వచ్చి యూదాదేశపు దక్షిణదిక్కుననున్న బెయేర్షెబావరకు సంచరించిరి.౹ ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమ్మిదినెలల ఇరువది దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.౹ అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను; ఇశ్రాయేలువారిలో కత్తి దూయగల యెనిమిది లక్షలమంది యోధులుండిరి; యూదా వారిలో అయిదు లక్షలమంది యుండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు–నేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని; యెహోవా, కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవిచేయగా ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నీవు పోయి దావీదుతో ఇట్లనుము— యెహోవా సెలవిచ్చునదేమనగా–మూడు విషయములను నీ యెదుట పెట్టుచున్నాను; వాటిలో ఒక దానిని నీవు కోరుకొనినయెడల నేనది నీమీదికి రప్పించెదను.౹ కావున గాదు దావీదునొద్దకు వచ్చి యిట్లని సంగతి తెలియజెప్పెను–నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుము చున్న నీ శత్రువులయెదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు మూడుదినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచనచేసి నన్ను పంపినవానికి నేనియ్యవలసిన యుత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను.౹ అందుకు దావీదు — నా కేమియు తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యతగలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండ యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను.౹ అందుకు యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజకూటపు వేళవరకు అది జరుగుచుండెను; అందుచేత దానునుండి బెయేర్షెబావరకు డెబ్బది వేలమంది మృతినొందిరి.౹ అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు, యెహోవా ఆ కీడునుగూర్చి సంతాపమొంది–అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనముచేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవాదూత యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థిం చెను–చిత్తగించుము; పాపము చేసినవాడను నేనే; దుర్మార్గముగా ప్రవర్తించినవాడను నేనే; గొఱ్ఱెలవంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి యింటివారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి–నీవు పోయి యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లములో యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదుచేత యెహోవా యిచ్చిన ఆజ్ఞచొప్పున పోయెను.౹ అరౌనా రాజును అతని సేవకులును తన దాపునకు వచ్చుటచూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారముచేసి–నా యేలినవాడవును రాజవునగు నీవు నీ దాసుడనైన నాయొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా దావీదు —ఈ తెగులు మనుష్యులకు తగలకుండ నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించుటకై నీయొద్ద ఈ కళ్లమును కొనవలెనని వచ్చితిననెను,౹ అందుకు అరౌనా–నా యేలినవాడవగు నీవు చూచి యేది నీకు అనుకూలమో దాని తీసికొని బలి అర్పించుము; చిత్తగించుము, దహనబలికి ఎడ్లున్నవి, నూర్చుకఱ్ఱ సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును.౹ రాజా, యివన్నియు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి— నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా రాజు–నేను ఆలాగు తీసికొనను, వెల యిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను.౹ అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించి దహనబలులను సమాధానబలులను అర్పించెను; యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచి పోయెను. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్నిబట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక యుండెను.౹ కాబట్టి వారు–మా యేలినవాడవును రాజవునగు నీకొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది; ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి, అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసికొని వచ్చిరి.౹ ఈ చిన్నది బహు చక్కనిదై యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెనుగాని రాజు దానిని కూడలేదు.౹ హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించినవాడై–నేనే రాజునగుదునని అనుకొని, రథములను గుఱ్ఱపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏబదిమంది మనుష్యులను ఏర్ప రచుకొనెను.౹ అతని తండ్రి —నీవు ఈలాగున ఏల చేయుచున్నావని అతనిచేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యముగలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు.౹ అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచనచేయగా వారు అదోనీయా పక్షము వహించి అతనికి సహాయము చేసిరిగాని యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీదుయొక్క శూరులును అదోనీయాతో కలిసికొనక యుండిరి.౹ అదోనీయా ఏన్‌రోగేలు సమీప మందుండు జోహెలేతు అను బండదగ్గర గొఱ్ఱెలను ఎడ్లను క్రొవ్వినదూడలను బలిగా అర్పించి, రాజకుమారులగు తన సహోదరులనందరిని యూదావారగు రాజుయొక్క సేవకులనందరిని పిలిపించెనుగాని ప్రవక్తయగు నాతానును బెనాయాను దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు.౹ అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబతో చెప్పిన దేమనగా–హగ్గీతు కుమారుడైన అదోనీయా యేలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన యేలినవాడైన దావీదునకు తెలియకయే యున్నది.౹ కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను వినుము.౹ నీవు రాజైన దావీదునొద్దకు పోయి —నా యేలినవాడా, రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చితివే; అదోనీయా యేలుచుండుట యేమని అడుగవలెను.౹ రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీవెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పెను.౹ కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టు చుండెను.౹ బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారముచేయగా రాజు–నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె యీలాగు మనవి చేసెను –నా యేలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవాతోడని నీ సేవకు రాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే,౹ ఇప్పుడైతే అదోనీయా యేలుచున్నాడు. ఈ సంగతి నా యేలినవాడవును రాజువునగు నీకు తెలియకయే యున్నది.౹ అతడు ఎడ్లను క్రొవ్వినదూడలను గొఱ్ఱెలను బలిగా అర్పించి రాజ కుమారులనందరిని యాజకుడైన అబ్యాతారును సైన్యాధి పతియైన యోవాబును పిలిపించెనుగాని నీ సేవకుడైన సొలొమోనును పిలువలేదు.౹ నా యేలినవాడవైన రాజా, నా యేలినవాడవైన రాజువగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందునుగూర్చి ఇశ్రాయేలీయులందరును కనిపెట్టియున్నారు.౹ ఇదిగాక నా యేలినవాడ వైన రాజువగు నీవు నీ పితరులతోకూడ నిద్రపొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడుదుము.౹ ఆమె రాజుతో మాటలాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికిరాగా —ప్రవక్తయగు నాతాను వచ్చియున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి.౹ అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి –నా యేలినవాడ వైన రాజా, అదోనీయా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనముమీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా? ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైనయెడ్లను క్రొవ్వినదూడలను గొఱ్ఱెలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు–రాజైన అదోనీయా చిరంజీవి యగునుగాక అని పలుకుచున్నారు.౹ అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు.౹ నా యేలినవాడవును రాజవునగు నీ తరువాత నీ సింహాసనముమీద ఎవడు ఆసీనుడైయుండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పక యుందువా? ఈ కార్యము నా యేలినవాడవును రాజవునగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా? అని యడిగెను.౹ దావీదు బత్షెబను పిలువుమని సెలవియ్యగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను.౹ అప్పుడు రాజు ప్రమాణ పూర్వకముగా చెప్పినదేమనగా–సకలమైన ఉపద్రవములలోనుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసినదానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారము చేసి–నా యేలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రదుకును గాక అనెను.౹ అప్పుడు రాజైన దావీదు–యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నాయొద్దకు పిలువుమని సెలవియ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి.౹ అంతట రాజు–మీరు మీ యేలిన వాడనైన నా సేవకులను పిలుచుకొనిపోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిదమీద ఎక్కించి గిహోనునకు తీసికొనిపోయి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి — రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను.౹ ఇశ్రాయేలు వారిమీదను యూదావారిమీదను నేనతనిని అధికారిగా నియమించియున్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనముమీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను.౹ అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను–ఆలాగు జరుగునుగాక, నా యేలినవాడవును రాజువునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక.౹ యెహోవా నా యేలిన వాడవును రాజవునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగానుండి, నా యేలినవాడైన రాజగు దావీదుయొక్క రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను;౹ కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులును పెలేతీయులునురాజైన దావీదు కంచరగాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొని రాగా యాజకుడైన సాదోకు గుడారములోనుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరును–రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని కేకలువేసిరి మరియు ఆ జనులందరును అతని వెంబడివచ్చి పిల్లనగ్రోవులను ఊదుచు, వాటి నాదముచేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి.౹ అదోనీయాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము విని — పట్టణమునందు ఈ అల్లరి యేమని యడుగగా యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయా — లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభసమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనీయాతో ఇట్లనెను–నిజముగా మన యేలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించియున్నాడు.౹ రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులను పెలేతీయులను అతనితోకూడ పంపగా వారు రాజు కంచరగాడిదమీద అతని నూరేగించిరి;౹ యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి; అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు; అందువలన పట్టణము అల్లరి ఆయెను; మీకు వినబడిన ధ్వని యిదే.౹ మరియు సొలొమోను రాజ్యాసనముమీద ఆసీనుడై యున్నాడు;౹ అందుకై రాజు సేవకులు మన యేలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింప వచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటె సొలొమోనునకు ఎక్కు వైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా రాజు మంచముమీద సాగిలపడి నమస్కారము చేసి యిట్లనెను –నేను సజీవినై యుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనముమీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను.౹ అందుకు అదోనీయా పిలిచినవారు భయపడి లేచి తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి.౹ అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.౹ అదోనీయా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని —రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండ ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా సొలొమోను ఈలాగు సెలవిచ్చెను–అతడు తన్ను యోగ్యునిగా అగుపరచుకొనినయెడల అతని తల వెండ్రుకలలో ఒకటైనను క్రిందపడదుగాని అతనియందు దౌష్ట్యము కనబడినయెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠమునొద్దనుండి అతని పిలువనంపించెను; అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో–నీ యింటికి పొమ్మని సెలవిచ్చెను. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను –లోకులందరు పోవలసిన మార్గమున నేను పోవు చున్నాను; కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము గలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి, ఆయన మార్గముల ననుసరించినయెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధులను శాసనములను గైకొనుము;౹ అప్పుడు–నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నాయెదుట తమ పూర్ణహృదయముతోను పూర్ణమనస్సుతోను సత్యము ననుసరించి నడుచుకొనినయెడల ఇశ్రాయేలీయుల రాజ్యసింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్నుగూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును.౹ అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇశ్రాయేలు సేనాధిపతులగు నేరు కుమారుడైన అబ్నేరు యెతెరు కుమారుడైన అమాశాయను వారిద్దరికి అతడు చేసినదానిని నీ వెరుగుదువు; అతడు వారిని చంపి యుద్ధసమయమందైనట్లుగా సమాధానకాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టుమీదను తన పాదరక్షలమీదను పడజేసెను.౹ నీకు తోచినట్లు అతనికి చేయ వచ్చునుగాని అతని నెరసిన తలవెండ్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనియ్యవద్దు.౹ నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందరనుండి పారిపోగా, గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి, నీవు వారిమీద దయయుంచి నీ బల్లయొద్ద భోజనము చేయువారిలో వారిని చేర్చుము.౹ మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమీ నీయొద్ద నున్నాడు; నేను మహనయీమునకు వెళ్లుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నదియొద్దకు దిగి రాగా–యెహోవాతోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని.౹ వానిని నిర్దోషిగా ఎంచవద్దు; నీవు సుబుద్ధిగలవాడవు గనుక వాని నేమి చేయవలెనో అది నీకు తెలియును; వాని నెరసిన తలవెండ్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము.౹ తరువాత దావీదు తన పితరులతోకూడ నిద్రపొంది, దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను.౹ దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు, హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములును యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును ఏలెను. అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదు సింహాసనముమీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలుకడగా స్థిరపరచబడెను.౹ అంతలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబయొద్దకు రాగా ఆమె —సమాధానముగా వచ్చుచున్నావా అని అతని నడిగెను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి –నీతో చెప్పవలసిన మాటయొకటి యున్నదనెను. ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదై యుండెననియు, నేను ఏలవలెనని ఇశ్రాయేలీయులందరు తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు; అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయెను; అది యెహోవావలన అతనికి ప్రాప్తమాయెను,౹ ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసికొనుచున్నాను, కాదనకుము.౹ ఆమె–చెప్పుమనగా అతడు–రాజగు సొలొమోను షూనేమీయురాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను, అతడు నీతో కాదనిచెప్ప డనెను.౹ బత్షెబ–మంచిది, నిన్నుగూర్చి రాజుతో చెప్పెదననెను.౹ బత్షెబ రాజైన సొలొమోనునొద్దకు అదోనీయా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు, రాజులేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లికొరకు ఆసనము ఒకటి వేయింపగా, ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను.౹ –ఒక చిన్న మనవిచేయ గోరుచున్నాను; నా మాట త్రోసి వేయకుమని ఆమె చెప్పగా రాజు–నా తల్లీ చెప్పుము, నీ మాట త్రోసివేయననగా ఆమె–షూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనీయాకు పెండ్లి కిప్పింపవలెననెను.౹ అందుకు రాజైన సొలొమోను–షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయాకొరకు అడుగుట యేల? అతడు నా అన్న కాబట్టి అతనికొరకును, యాజకుడైన అబ్యాతారుకొరకును, సెరూయా కుమారుడైన యోవాబుకొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను.౹ మరియు రాజైన సొలొమోను— యెహోవా తోడు అదోనీయా పలికిన యీ మాటవలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయినయెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయును గాక.౹ నన్ను స్థిరపరచి, నా తండ్రి సింహాసనముమీద నన్ను ఆసీనునిగా చేసి, తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవముతోడు, అదోనీయా యీ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనీయా మీద పడినందున అతడు చనిపోయెను.౹ తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా అనా తోతులో నీకు కలిగిన పొలములకు వెళ్లుము; నీవు మరణమునకు పాత్రుడవైతివిగాని నీవు నా తండ్రియైన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి, నా తండ్రికి ప్రాప్తించినశ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను.౹ తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండ తీసివేసెను, అందువలన యెహోవా ఏలీ కుటుంబికులనుగూర్చి షిలోహులో ప్రమాణముచేసిన మాట నెరవేరెను.౹ యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపక పోయినను అదోనీయా పక్షము అవలంబించి యుండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.౹ యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునొద్ద నున్నాడను సంగతి రాజగు సొలొమోనునకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి–నీవు వెళ్లి వానిమీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి–రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చెనని యోవాబుతో చెప్పెను. అతడు–అదికాదు, నేనిక్కడనే చచ్చెద ననగా, బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసెను.౹ అందుకు రాజు ఇట్లనెను–అతడు నీతో చెప్పినట్లుగా చేయుము; అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నామట్టుకును నా తండ్రి కుటుంబికులమట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము.౹ నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, యెతెరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాశాయును అను తన కంటె నీతిపరులును యోగ్యులునగు ఈ ఇద్దరు మనుష్యులమీదపడి యోవాబు నా తండ్రియైన దావీదు ఎరుగకుండ కత్తిచేత వారిని చంపి వేసెను గనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తలమీదికే రప్పించును.౹ మరియు వీరు ప్రాణ దోషమునకు యోవాబును అతని సంతతివారును సదా కాలము ఉత్తరవాదులుగాని, దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబికులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవావలన ఎన్నటెన్నటికిని కలిగి యుండును.౹ కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతనిమీదపడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన యింటిలో పాతిపెట్టబడెను.౹ రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను.౹ తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను. —నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనను వెళ్లక అందులో కాపురముండుము.౹ నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలిసికొనుము, నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా షిమీ–తమరు సెలవిచ్చినది మంచిదేను; నా యేలినవారైన రాజగు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైన నేను చేసెదనని రాజుతో చెప్పెను. షిమీ యెరూషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను.౹ అయితే మూడు సంవత్సరములైన తరువాత షిమీయొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజు నొద్దకు చేరిరి. అంతట–నీవారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానము రాగా షిమీ లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకీషునొద్దకు పోయెను. ఈలాగున షిమీ పోయి గాతులోనుండి తన పనివారిని తీసికొనివచ్చెను.౹ షిమీ యెరూషలేములోనుండి గాతునకు పోయి వచ్చెనని సొలొమోనునకు వర్తమానముకాగా రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెను–నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనను వెళ్లుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలిసికొనవలెనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించితిని గదా? మరియు —తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి;౹ కాబట్టి యెహోవాతోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనక పోతివేమి అని అడిగి –నీవు మా తండ్రియైన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియును. నీవు చేసిన కీడు యెహోవా నీ తలమీదికే రప్పించును.౹ అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును, దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవియ్యగా అతడు బయలుదేరి వానిమీదపడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. తరువాత సొలొమోను ఐగుప్తురాజైన ఫరో కుమార్తెను పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టు ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరోకుమార్తెను దావీదు పురమునకు రప్పించెను.౹ ఆ దినములవరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నతస్థలములయందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి.౹ తన తండ్రియైన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమయుంచెనుగాని యున్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నతస్థలమై యుండెను గనుక బలులనర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠముమీద వెయ్యి దహనబలులను అర్పించెను.౹ గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై–నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమో దాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా సొలొమోను ఈలాగు మనవి చేసెను–నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసుగలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతనియెడల పరిపూర్ణ కటాక్ష మగుపరచి, యీ దినమున నున్నట్లుగా అతని సింహాసనముమీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనియందు మహాకృపను చూపియున్నావు.౹ నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;౹ నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనులమధ్య ఉన్నాను; వారు విస్తరించియున్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాలదేశమును తనకీ చేయుటయు అసాధ్యము.౹ ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయుము.౹ సొలొమోను చేసిన యీ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను–దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి.౹ నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములుగల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు.౹ మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడ నీకిచ్చుచున్నాను; అందువలన నీ దినములన్నిటను రాజులలో నీవంటివాడొకడైనను నుండడు.౹ మరియు నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనినయెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను.౹ అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలిసికొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధనగల మందసము ఎదుట నిలువబడి దహనబలులను సమాధానబలులను అర్పించి తన సేవకులందరికిని విందుచేయించెను. తరువాత వేశ్యలైన యిద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి.౹ వారిలో ఒకతె యిట్లు మనవి చేసెను–నా యేలినవాడా చిత్తగించుము, —నేనును ఈ స్త్రీయును ఒక యింటిలో నివసించుచున్నాము; దానితోకూడ ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని.౹ నేను కనిన మూడవదినమున ఇదియు పిల్లను కనెను; మేమిద్దరమును కూడనున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి యెవరును లేరు.౹ అయితే రాత్రియందు ఇది పడకలో తన పిల్లమీద పడగా అది చచ్చెను.౹ కాబట్టి మధ్య రాత్రి యిది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి, నా ప్రక్కలోనుండి నా బిడ్డను తీసికొని తన కౌగిటిలో పెట్టుకొని, చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను.౹ ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చినదాయెను; తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలిసికొంటిని.౹ అంతలో రెండవ స్త్రీ–అది కాదు; బ్రదికియున్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె–కాదు, చచ్చినదే నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజుసముఖమున మనవిచేయగా రాజు–బ్రదికియున్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని యొకతెయు, రెండవది–ఆలాగు కాదు చచ్చినది నీ బిడ్డ బ్రదికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది;౹ గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా రాజు రెండు భాగములుగా బ్రదికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను.౹ అంతట బ్రదికియున్న బిడ్డయొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొనిపోయినదై, రాజునొద్ద–నా యేలినవాడా, బిడ్డను ఎంతమాత్రము చంపక దానికే యిప్పించుమని మనవిచేయగా, ఆ రెండవ స్త్రీ–అది నాదైనను దానిదైనను కాకుండ చెరిసగము చేయుమనెను.౹ అందుకు రాజు–బ్రదికియున్న బిడ్డను ఎంతమాత్రము చంపక మొదటిదాని కియ్యుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను.౹ అంతట ఇశ్రాయేలీయులందరును రాజు తీర్చిన తీర్పునుగూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిమీద రాజాయెను.౹ అతనియొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు;౹ షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖకుడై యుండెను;౹ యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి; సాదోకును అబ్యాతారును యాజకులు.౹ నాతాను కుమారుడైన అజర్యా అధికారులమీద ఉండెను; నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునైయుండెను;౹ అహీషారు గృహ నిర్వాహకుడు; అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయములో అధికారి.౹ ఇశ్రాయేలీయులందరిమీద సొలొమోను పన్నిద్దరు అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను.౹ వారి పేళ్లు ఇవే; ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు;౹ మాకస్సులోను షయల్బీములోను బేత్షెమెషులోను ఏలోన్బెధానానులోను దెకెరు కుమారుడు;౹ అరుబ్బోతులో హెసెదు కుమారుడు; వీనికి శోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను.౹ మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశమంతయు నియమింపబడెను; సొలొమోను కుమార్తెయైన టాపాతు ఇతని భార్య.౹ మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దోయును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతానుండి బేత్షెయాను మొదలుకొని ఆబేల్మేహోలావరకును యొక్నెయాము అవతలి స్థలమువరకును వ్యాపించుచున్నది.౹ గెబెరు కుమారుడు రామోత్గిలాదునందు కాపురముండెను; వీనికి గిలాదులోనుండిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామములును బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింప బడెను; అది ప్రాకారములును ఇత్తడి అడ్డగడలునుగల అరువది గొప్ప పట్టణములుగల ప్రదేశము.౹ ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను.౹ నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను; వీడు సొలొమోను కుమార్తెయైన బాశెమతును వివాహము చేసికొనెను.౹ ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనా యుండెను.౹ ఇశ్శాఖారు దేశమందు పరూయహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను.౹ బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ యుండెను.౹ గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును బాషానురాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను; అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి.౹ అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి. నది (యూఫ్రటీసు) మొదలుకొని ఐగుప్తు సరిహద్దువరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటిమీదను ఫిలిష్తీయుల దేశమంతటిమీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రదికిన దినములన్నియు అతనికి సేవచేయుచు వచ్చిరి.౹ ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి యెంత యనగా, ఆరువందల తూముల సన్నపు గోధుమపిండియు, వేయిన్ని రెండువందల తూముల ముతకపిండియు,౹ క్రొవ్విన యెడ్లు పదియు, విడియెడ్లు ఇరువదియు, నూరు గొఱ్ఱెలును, ఇవియుగాక ఎఱ్ఱదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులును తేబడెను.౹ యూఫ్రటీసునది యివతల తిప్సహు మొదలుకొని గాజావరకును నది యివతలనున్న రాజులందరిమీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను.౹ సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమతమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.౹ సొలొమోను రథములకు నలువదివేల గుఱ్ఱపు శాలలును రౌతులకు పండ్రెండువేల గుఱ్ఱములును ఉండెను.౹ మరియు రాజైన సొలొమోనునకునురాజైన సొలొమోను భోజనపు బల్లయొద్దకు వచ్చిన వారికందరికిని ఏమియు తక్కువకాకుండ అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమునుబట్టి ఆహారము సంగ్రహముచేయుచు వచ్చెను.౹ మరియు గుఱ్ఱములును పాటుపశువులును ఉన్న ఆయాస్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానముకంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటికంటెను అధికమై యుండెను.౹ అతడు సమస్తమైన వారికంటెను, ఎజ్రా హీయుడైన ఏతానుకంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్ద అను వారికంటెను జ్ఞానవంతుడై యుండెను గనుక అతని కీర్తి చుట్టునున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను.౹ అతడు మూడువేలసామెతలు చెప్పెను, వెయ్యిన్ని యయిదు కీర్తనలు రచించెను.౹ మరియు లెబానోనులోఉండు దేవదారు వృక్షమునేగాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనేగాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటినన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను.౹ అతని జ్ఞానపుమాటలు తెలిసికొనుటకై అతని జ్ఞానమునుగూర్చి వినిన భూపతులందరిలోనుండియు, జనులందరిలోనుండియు మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోనునొద్దకు పంపెను; ఏలయనగా హీరాము ఎప్పటికి దావీదుతో స్నేహముగా నుండెను.౹ హీరామునొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను.౹ –యెహోవా నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదములక్రింద అణచువరకు అన్నివైపులను యుద్ధములు అతనికి కలిగియుండెను.౹ తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరమును కట్టింప వీలులేక పోయె నన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడునులేకుండను అపాయమేమియు కలుగకుండను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసియున్నాడు.౹ కాబట్టి–నీ సింహాసనముమీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రియైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై యున్నాను.౹ లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము; నా సేవకులును నీ సేవకులును కలిసి పని చేయుదురు; మ్రానులను నరుకుటయందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు తెలియును గనుక నీ యేర్పాటుచొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చెదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానముగల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను–నీవు నాయొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులనుగూర్చియు సరళపు మ్రానులనుగూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.౹ నా సేవకులు వాటిని లెబానోనునుండి సముద్రమునొద్దకు తెచ్చెదరు; అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రముమీద చేరునట్లు చేసి, అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును, నీవు వాటిని తీసికొందువు. ఇందునుగూర్చి నీవు నాకోరిక చొప్పున జరిగించి నా యింటివారి సంరక్షణకొరకు ఆహారము ఇచ్చెదవు.౹ హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా సొలొమోను హీరామునకును అతని యింటి వారి సంరక్షణకును ఆహారముగా రెండులక్షల తూముల గోధుమలను మూడువేల ఎనిమిదివందల పళ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచువచ్చెను.౹ యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను; మరియు హీరామును సొలొమోనును సంధిచేయగా వారిద్దరికి సమాధానము కలిగియుండెను. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టి పని చేయువారైరి,౹ వీరిని అతడు వంతులచొప్పున నెలకు పది వేలమందిని లెబానోనునకు పంపించెను; ఒక నెల లెబా నోనులోను రెండు నెలలు ఇంటియొద్దను వారు ఉండిరి; ఆ వెట్టివారిమీద అదోనీరాము అధికారియైయుండెను.౹ మరియు సొలొమోనునకు బరువులు మోయువారు డెబ్బది వేలమందియు పర్వతములందు మ్రానులు నరకువారు ఎను బది వేలమందియు నుండిరి.౹ వీరు కాక పనిమీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు మూడువేల మూడువందలమంది; వీరు పనివారిమీద అధికారులై యుండిరి.౹ రాజు సెలవియ్యగా వారు మందిరముయొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి.౹ ఈలాగున సొలొమోను పంపినవారును గిబ్లీయులును, హీరాము శిల్పకారులును మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరచిరి. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నాలుగువందల ఎనుబదియవ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీప్ అను రెండవ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప నారంభించెను.౹ రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము అరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై యుండెను.౹ పరిశుద్ధస్థలము ఎదుట నున్న ముఖమంటపము మందిరముయొక్క వెడల్పునుబట్టి యిరువది మూరల పొడవు, మందిరము ముందర అది పది మూరల వెడల్పు.౹ అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను.౹ మరియు మందిరపు గోడచుట్టు గదులు కట్టించెను; మందిరపు గోడలకును పరిశుద్ధస్థలమునకును గర్భాలయమునకును చుట్టు నలుదిశల అతడు గదులు కట్టించెను.౹ క్రింది అంతస్తుగది అయిదు మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది ఆరు మూరల వెడల్పు, మూడవ అంతస్తుగదియేడు మూరల వెడల్పు; ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండ మందిరపు గోడచుట్టు బయటితట్టున చిమ్మురాళ్లు ఉంచబడెను.౹ అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను, మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలి మొదలైన యినుప పనిముట్ల ధ్వని యెంత మాత్రమును వినబడలేదు.౹ మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్వమున ఉండెను, మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలోనుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కి పోవుటకు చుట్టును మెట్ల చట్రముండెను.౹ ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోను పలకలతోను కప్పించెను.౹ మరియు మందిరమునకు చుట్టు గదులను కట్టిం చెను; ఇవి అయిదు మూరల యెత్తుగలవై దేవదారు దూలములచేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే; నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనినయెడల నీ తండ్రియైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను;౹ నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారిమధ్య నివాసము చేసెదను. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను.౹ అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పువరకు దేవదారు పలకలచేత కట్టించెను; లోపల వాటిని సరళపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను.౹ మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్ధమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను.౹ అయితే దాని ముందరనున్న పరిశుద్ధస్థలము నలువది మూరల పొడుగై యుండెను.౹ మందిరములోపలనున్న దేవదారు పలకలమీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడి యుండెను; అంతయు దేవదారుకఱ్ఱ పనియే, రాయి యొకటైన కనబడలేదు.౹ యెహోవా నిబంధనమందసము నుంచుటకై మందిరములోపల గర్భాలయమును సిద్ధపరచెను.౹ గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ఇరువది మూరల యెత్తును గలదై యుండెను, దీనిని మేలిమి బంగారముతో పొది గించెను, అర్జకఱ్ఱతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననే పొదిగించెను.౹ ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులుగల తెర చేయించి బంగారముతో దాని పొదిగించెను.౹ ఏ భాగమును విడువకుండ మందిరమంతయు బంగారముతో పొదిగించెను; గర్భా లయము నొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొది గించెను.౹ మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల యెత్తుగల రెండు కెరూబులను ఒలీవ కఱ్ఱతో చేయించెను;౹ ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు.౹ రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను.౹ ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను.౹ అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని యుండెను.౹ ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను.౹ మరియు మందిరపు గోడ లన్నిటిమీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను.౹ మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను.౹ గర్భాలయపు ద్వారములకు ఒలీవకఱ్ఱతో తలుపులు చేయించెను; ద్వారబంధముమీది కమ్మియు నిలువు కమ్ములును గోడ వెడల్పులో అయిదవభాగము వెడల్పు ఉండెను.౹ రెండు తలుపులును ఒలీవ కఱ్ఱవి; వాటిమీద కెరూబులను తమాల వృక్షములను విక సించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను; కెరూబులమీదను తమాల వృక్షములమీదను బంగారము పొదిగించెను.౹ మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవకఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతు వెడ ల్పుగా నుండెను.౹ రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను.౹ వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.౹ మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోను ఒక వరుసను దేవదారు దూలములతోను కట్టించెను.౹ నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను;౹ పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాసమున దాని యేర్పాటుచొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను. ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. సొలొమోను పదమూడు సంవత్సరములు తన నగ రును కట్టించుచుండి దానినంతటిని ముగించెను.౹ మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను; దీని పొడుగు నూరు మూరలు, వెడల్పు ఏబది మూరలు, ఎత్తు ముప్పది మూరలు; నాలుగు వరుసల దేవదారు స్తంభములమీద దేవదారు దూలములు వేయబడెను.౹ మరియు నలువదియైదు స్తంభములమీద ప్రక్కగదులపైన దేవదారు కఱ్ఱలతో అది కప్పబడెను; ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను.౹ మూడు వరుసల కిటికీలు ఉండెను; మూడు వరుసలలో కిటికీలు ఒక దాని కొకటి యెదురుగా ఉండెను.౹ తలుపులయొక్కయు కిటికీలయొక్కయు స్తంభములు చచ్చౌకముగా ఉండెను; మూడు వరుసలలోను కిటికీలు ఒకదాని కొకటి యెదురుగా ఉండెను.౹ మరియు అతడు స్తంభములుగల యొక మంటపమును కట్టించెను; దాని పొడుగు ఏబది మూరలు, వెడల్పు ముప్పది మూరలు; ఒక మంటపమును వాటి యెదుట ఉండెను; స్తంభములును లావుగల దూలములును వాటి యెదుట నుండెను.౹ తరువాత తాను తీర్పుతీర్చ కూర్చుండుటకై యొక అధికార మంటపమును కట్టించెను; దాని నట్టిల్లు కొనమొదలు దేవదారు కఱ్ఱతో కప్పబడెను.౹ లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపమువంటి యొక నగరును కట్టించెను.౹ ఈ కట్టడములన్నియు పునాది మొదలుకొని గోడ చూరువరకు లోపలను వెలుపలను వాటి పరిమాణప్రకారముగా తొలవబడినట్టివియు, రంపములచేత కోయబడినట్టివియు, మిక్కిలి వెలగలరాళ్లతో కట్టబడెను; ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపుననున్న వెలుపలి భాగమును ఉండెను.౹ దాని పునాది పదేసి యెనిమిదేసి మూరలుగల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను.౹ పైతట్టున పరిమాణప్రకారముగా చెక్క బడిన మిక్కిలి వెలగల రాళ్లును దేవదారు కఱ్ఱలును కలవు.౹ గొప్ప ఆవరణమునకు చుట్టును మూడు వరుసల చెక్కిన రాళ్లును, ఒక వరుస దేవదారు దూలములును కలవు; యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను. రాజైన సొలొమోను తూరు పట్టణములోనుండి హీరామును పిలువనంపించెను.౹ ఇతడు నఫ్తాలిగోత్రపు విధవరాలి కుమారుడై యుండెను; ఇతని తండ్రి తూరు పట్టణపువాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తడితోచేయు సమస్తమైన పనులలోను బహు చమత్కారపు పనివాడునై యుండెను; అతడు సొలొమోనునొద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను.౹ ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోతపోసెను; ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివిగలది, ఒక్కొక్కటి పండ్రెండు మూరల కైవారము గలది.౹ మరియు స్తంభములమీద ఉంచుటకై యిత్తడితో రెండు పీటలు పోతపోసెను; ఒకపీటయొక్క యెత్తు అయిదు మూరలు, రెండవ పీటయొక్క యెత్తు అయిదు మూరలు.౹ మరియు స్తంభములమీదనున్న పీటలకు అల్లిక పనివంటి పనియు, గొలుసు పని దండలును చేయబడెను; అవి పీటకు ఏడేసి కలిగి యుండెను.౹ ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లికపని రెండు వరుసలు దానిమ్మపండ్లతో చేసెను; ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను.౹ మరియు స్తంభములమీది పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పమువంటి పనిగలవై యుండెను.౹ మరియు రెండు స్తంభములమీదనున్న పీటలమీది అల్లికపని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను; రెండువందల దానిమ్మ పండ్లు ఆ పీటమీద వరుస వరుసలుగా చుట్టు నుండెను.౹ ఈ స్తంభములను అతడు పరిశుద్ధస్థలపు మంటపములో ఎత్తించెను; కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను, ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను.౹ ఈ స్తంభములమీద తామరపుష్పములవంటి పని యుండెను; ఈలాగున స్తంభములయొక్క పని సమాప్తమాయెను.౹ మరియు అతడు పోతపనితో ఒక సముద్రమును చేసెను; అది ఈతట్టు పై అంచు మొదలుకొని ఆతట్టు పై అంచువరకు పది మూరలు, అది అయిదుమూరల యెత్తుగలదై గుండ్రముగా ఉండెను; దాని కైవారము ముప్పది మూరలు.౹ దాని పై అంచునకు క్రింద చుట్టును గుబ్బలుండెను; మూరకు పది గుబ్బలచొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టును ఆవరించియుండెను; అది పోతపోయబడినప్పుడు ఆ గుబ్బలు రెండు వరుసలుగా పోతపోయబడెను.౹ అది పండ్రెండు ఎడ్లమీద నిలువబడియుండెను; వీటిలో మూడు ఉత్తరదిక్కును మూడు పడమర దిక్కును మూడు దక్షిణదిక్కును మూడు తూర్పుదిక్కును చూచుచుండెను. వీటిమీద ఆ సముద్రము ఎత్తబడి యుండెను. వాటి వెనుకటి భాగములన్నియు లోపలితట్టు త్రిప్పబడి యుండెను.౹ అది బెత్తెడు దళసరిగలదై యుండెను; దాని పై అంచు పాత్రకు పై అంచువలె తామర పుష్పములవంటి పని కలిగి యుండెను; అది తొమ్మిది గరిసెలు పట్టును.౹ మరియు అతడు పది యిత్తడి స్తంభములు చేసెను; ఒక్కొక్క స్తంభము నాలుగు మూరల పొడుగు, నాలుగు మూరల వెడల్పు, మూడు మూరల యెత్తు కలిగి యుండెను.౹ ఈ స్తంభముల పని రీతి యేదనగా, వాటికి ప్రక్క పలకలు కలవు, ఆ ప్రక్కపలకలు జవలమధ్య ఉండెను.౹ జవలమధ్యనున్న ప్రక్కపలకలమీద సింహములును ఎడ్లును కెరూబులును ఉండెను; మరియు జవలమీద ఆలాగుండెను; సింహములక్రిందను ఎడ్ల క్రిందను వ్రేలాడు దండలవంటి పని కలిగి యుండెను.౹ మరియు ప్రతి స్తంభమునకు నాలుగేసి యిత్తడి చక్రములు ఇత్తడి యిరుసులును కలిగి యుండెను; దాని నాలుగు మూలలను దిమ్మలు కలవు; ఈ దిమ్మలు తొట్టిక్రింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోతపోయబడెను.౹ మరియు దాని మూతి పైపీటయందును మీదను మూరెడు నిడివి; అయితే మూతి క్రింద స్తంభము పనిచొప్పున గుండ్రముగా ఉండి మూర న్నర నిడివి. మరియు ఆ మూతిమీద ప్రక్కలుగల చెక్కిన పనులు గలవు; ఇవి గుండ్రనివిగాక చచ్చౌకముగా ఉండెను.౹ మరియు ప్రక్కపలకల క్రింద నాలుగు చక్రములు కలవు; చక్రముల యిరుసులు స్తంభములతో అతకబడి యుండెను; ఒక్కొక్క చక్రము మూరెడునర నిడివి గలదై యుండెను.౹ ఈ చక్రముల పని రథచక్రముల పనివలె ఉండెను, వాటి యిరుసులును అడ్డలును పూటీలును ఆకులును పోతపనివై యుండెను.౹ ఒక్కొక్క స్తంభపు నాలుగు మూలలను నాలుగు దిమ్మలు కలవు; ఈ దిమ్మలును స్తంభమును ఏకాండముగా ఉండెను.౹ మరియు స్తంభమును పైని చుట్టును జేనెడు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి యుండెను; మరియు స్తంభమును పైనున్న జవలును ప్రక్క పలకలును దానితో ఏకాండముగా ఉండెను.౹ దాని జవల పలకలమీదను, దాని ప్రక్క పల కలమీదను, అతడు కెరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్కదాని చోటునుబట్టి చుట్టును దండలతో వాటిని చెక్కెను.౹ ఈ ప్రకారము అతడు పది స్తంభములను చేసెను; అన్నిటి పోతయును పరిమాణమును రూపమును ఏకరీతిగా ఉండెను.౹ తరువాత అతడు పది యిత్తడి తొట్లను చేసెను; ప్రతి తొట్టి యేడువందల ఇరువది తూములు పట్టునది; ఒక్కొక్క తొట్టి నాలుగు మూరలు; ఒక్కొక్క స్తంభముమీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను.౹ మందిరపు కుడిపార్శ్వమున అయిదు స్తంభములను మందిరముయొక్క యెడమ పార్శ్వమున అయిదు మట్లను అతడు ఉంచెను; సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పుతట్టున మందిరముయొక్క కుడిపార్శ్వమున ఉంచెను.౹ మరియు హీరాము తొట్లను చేటలను గిన్నెలను చేసెను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞనుబట్టి యెహోవా మందిరపు పనియంతయు ముగించెను.౹ రెండు స్తంభములను, ఆ రెండు స్తంభములమీదనున్న పైపీటల పళ్లెములను ఆ స్తంభములను పై పీటల పళ్లెములను కప్పిన రెండు అల్లికలను,౹ ఆ స్తంభములమీదనున్న పైపీటల రెండు పళ్లెములను కప్పిన అల్లికయొక్కటింటికి రెండు వరుసలచొప్పున రెండు అల్లికలకును నాలుగు వందల దానిమ్మపండ్లను,౹ పది స్తంభములను, స్తంభములమీద పది తొట్లను,౹ ఒక సముద్రమును, సముద్రముక్రింద పండ్రెండు ఎడ్లను,౹ బిందెలను, చేటలను, గిన్నెలను వీటినన్నిటిని రాజైనసొలొమోను ఆజ్ఞనుబట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నియు మెరుగుపెట్టిన యిత్తడివై యుండెను.౹ యొర్దాను మైదానమందు సుక్కోతునకును సారెతానునకును మధ్య జిగట భూమియందు రాజు వాటిని పోతపోయించెను.౹ అయితే ఈ ఉపకరణములు అతివిస్తారములైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను; ఇత్తడియొక్క యెత్తు ఎంతైనది తెలియబడకపోయెను.౹ మరియు సొలొమోను యెహోవామందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటిని చేయించెను, అనగా బంగారపు బలిపీఠమును సముఖపు రొట్టెలనుంచు బంగారపు బల్లలను,౹ గర్భాలయము ముందర కుడిపార్శ్వమున అయిదును, ఎడమ పార్శ్వమున అయిదును, పది బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదెలను, కారులను,౹ మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూపకలశములను, అంతర్మందిరమను అతి పరిశుద్ధమైన స్థలముయొక్క తలుపులకును మందిరమను ఆల యపు తలుపులకును కలిగిన బంగారపు బందులను, వీటన్నిటిని చేయించెను, ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్త మాయెను. మరియు సొలొమోను తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. అప్పుడు సీయోను అను దావీదు పురములోనుండి యెహోవా నిబంధనమందసమును పైకి తీసికొని వచ్చుటకు యెరూషలేములోనుండు రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను గోత్రప్రధానులను, అనగా ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తనయొద్దకు సమకూర్చెను.౹ కాబట్టి ఇశ్రాయేలీయులందరును ఏతనీ మను ఏడవ మాసమందు పండుగకాలమున రాజైన సొలొమోను నొద్దకు కూడుకొనిరి.౹ ఇశ్రాయేలీయుల పెద్దలందరును రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాని తీసికొనివచ్చిరి. ప్రత్యక్షపు గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులును లేవీయులును తీసికొనిరాగా రాజైన సొలొమోనును అతనియొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులగు సమాజకులందరును మందసము ముందర నిలువబడి, లెక్కింప శక్యముగాని గొఱ్ఱెలను ఎడ్లను బలిగా అర్పించిరి.౹ మరియు యాజకులు యెహోవా నిబంధనమందసమును తీసికొని దాని స్థలములో, అనగా మందిరపు గర్భా ల యమగు అతిపరిశుద్ధ స్థలములో, కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి.౹ కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను, ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను.౹ వాటి కొనలు గర్భాల యము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడ వుగా ఆ దండెలుంచబడెనుగాని యివి బయటికి కనబడలేదు. అవి నేటివరకు అక్కడనే యున్నవి.౹ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు యెహోవావారితో నిబంధనచేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరి ఏమియు లేక పోయెను.౹ యాజకులు పరిశుద్ధస్థలములోనుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను.౹ కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజకులు సేవచేయుటకు నిలువలేక పోయిరి. సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.౹ నీవు నివాసము చేయుటకు నేను మందిరముకట్టించియున్నాను; సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొకస్థలము ఏర్పరచియున్నాను అని చెప్పి తన ముఖమును ప్రజలతట్టు త్రిప్పుకొని, ఇశ్రాయేలీయుల సమాజమంతయు నిలిచియుండగా ఇశ్రాయేలీయుల సమా జకులందరిని ఈలాగు దీవించెను.౹ నా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి దాని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక.౹ –నేను ఇశ్రాయేలీయులగు నా జనులను ఐగుప్తులోనుండి రప్పించిన నాటనుండి నా నామము దానియందుండు నట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదుగాని ఇశ్రాయేలీయులగు నా జనులమీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చెను.౹ ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రియైన దావీదునకు మనస్సు పుట్టగా యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చినదేమనగా–నా నామఘనతకు ఒక మందిరముకట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి యున్నావు, ఆ తాత్పర్యము మంచిదే;౹ అయినను నీవు మందిరమును కట్టించకూడదు; నీ నడుములోనుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును.౹ తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చియున్నాడు. నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా నియమింపబడి, యెహోవా సెలవుచొప్పున ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడనైయుండి, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించియున్నాను.౹ అందులో యెహోవా నిబంధనమందసమునకు స్థలమును ఏర్పరచితిని, ఐగుప్తుదేశములోనుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే యున్నది. ఇశ్రాయేలీయుల సమాజకులందరు చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలువబడి ఆకాశముతట్టు చేతులెత్తి యిట్లనెను –యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమియందైనను నీవంటి దేవుడొకడును లేడు; పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కని కరము చూపుచు ఉండువాడవై యున్నావు,౹ నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి, నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు.౹ యెహోవా ఇశ్రాయేలీయుల దేవా–నీ కుమారులు సత్ ప్రవర్తనగలవారై, నీవు నా యెదుట నడచినట్లు నా యెదుట నడచినయెడల, నా దృష్టికి అనుకూ లుడై ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిర పరచుము.౹ ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము.౹ నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి, యీ దినమున నీ దాసుడనైన నేనుచేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము.౹ నీ దాసుడనైన నేనుచేయు ప్రార్థనను దయతో అంగీ కరించునట్లు–నా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక.౹ మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము.౹ ఎవడైనను తన పొరుగువానికి అన్యాయముచేయగా అతనిచేత ప్రమాణము చేయించుటకు అతనిమీద ఒట్టు పెట్టబడినయెడల, అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టు నప్పుడు నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయము తీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతిచొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము.౹ మరియు ఇశ్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపముచేయుటచేత తమ శత్రువులయెదుట మొత్తబడినప్పుడు, వారు నీతట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని యీ మందిరమందు నిన్నుగూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్ల నీవు ఆకాశమందు విని, ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము.౹ మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేక పోగా, నీవు వారిని ఈలాగునశ్రమపెట్టుటవలనవారు నీ నామమును ఒప్పు కొని తమ పాపములను విడిచి యీ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసినయెడల నీవు ఆకాశమందు విని, నీ దాసులైన ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన సన్మార్గమును వారికి చూపించి, నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము.౹ దేశమందు క్షామముగాని తెగులుగాని గాడ్పుదెబ్బగాని చిత్తపట్టుటగాని మిడ తలుగాని చీడపురుగుగాని కలిగినను, వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులుగాని వ్యాధిగాని కలిగినను,౹ ఇశ్రాయేలీయులగు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలిసికొనును గదా; ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరముతట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసినయెడల ప్రతి మనిషియొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ నివాసస్థలమందు విని, క్షమించి దయచేసి యెవరి ప్రవర్తననుబట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రదుకు దినములన్నిటను వారు నీయందు భయభక్తులు కలిగియుండునట్లు చేయుము; నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలిసికొని యున్నావు.౹ మరియు ఇశ్రాయేలీయులగు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమునుబట్టి దూరదేశమునుండి వచ్చి నీ ఘనమైన నామమునుగూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసి ద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి యీ మందిరముతట్టు తిరిగి ప్రార్థన చేసినయెడల ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము ననుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరును నీ నామమును ఎరిగి, ఇశ్రాయేలీయులగు నీ జనులవలెనే నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టించిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడిన దని తెలిసికొందురు.౹ మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనను బయలుదేరునప్పుడు, నీవు కోరుకొనిన పట్టణముతట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరముతట్టును యెహోవావగు నీకు వారు ప్రార్థన చేసినయెడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని, వారికార్యమును నిర్వహించుము.౹ పాపము చేయనివాడు ఒకడును లేడు, వారు నీకు విరోధముగా పాపము చేసినయెడల నేమి, నీవు వారిమీద కోపగించుకొని వారిని శత్రువులచేతికి అప్పగించినయెడలనేమి, వారు వీరిని దూరమైనట్టిగాని దగ్గరయైనట్టిగాని ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని–మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితిమని చెప్పి, తమ్మును చెరగా కొనిపోయిన వారిదేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసినయెడల తమ్మును చెరగా కొనిపోయిన వారియొక్క దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను వారు నీతట్టు తిరిగి, నీవు వారి పితరులకు దయచేసిన దేశముతట్టును నీవు కోరుకొనిన పట్టణముతట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరముతట్టును నిన్నుగూర్చి ప్రార్థనచేసినయెడల ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారికార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పులచేత నీ విషయమై అపరాధు లైరో ఆ తప్పులను వారికి క్షమించి, వారిని చెరలోనికి కొనిపోయినవారు వారిని కనికరించునట్లు వారియెడల కని కరము పుట్టించుము.౹ వారు ఐగుప్తుదేశములోనుండి ఆ ఇనుపకొలిమిలోనుండి నీవు రప్పించిన నీ జనులును నీ స్వాస్థ్యమునై యున్నారు.౹ కాబట్టి నీ దాసుడనైన నేనుచేయు విన్నపముమీదను, ఇశ్రాయేలీయులగు నీ జనులుచేయు విన్నపముమీదను, దృష్టియుంచి, వారు ఏ విషయములయందు నిన్ను వేడుకొందురో ఆ విషయములయందు వారి విన్నపముల నాలకించుము.౹ ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులోనుండి రప్పించి నప్పుడు నీవు నీ దాసుడైన మోషేద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులంద రిలోనుండి వారిని ప్రత్యేకించితివి గదా. సొలొమోను ఈలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశముతట్టు తన చేతులను చాపి, యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్లూనుట మాని, లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటిని దీవించెను.౹ ఎట్లనగా —తాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పిపోయినదికాదు కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను, మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లుగాను, తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనునట్లుగాను, మన హృదయములను తనతట్టు త్రిప్పుకొనును గాక.౹ ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇశ్రాయేలీయులగు తన జనుల కార్యమును అవసరముచొప్పున, ఎల్లప్పుడును నిర్వహించునట్లుగా నేను యెహోవా యెదుట విన్నపము చేసిన యీ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండును గాక.౹ అప్పుడు లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలిసికొందురు.౹ కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచు కొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటను, మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక.౹ అంతట రాజును, అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా ఇరువది రెండువేల యెడ్లను, లక్ష యిరువదివేల గొఱ్ఱెలను సొలొమోను సమాధానబలులగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయులందరును యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి.౹ ఆ దినమున యెహోవా సముఖమందున్న యిత్తడి బలిపీఠము ఆ దహనబలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను గనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవరణము మధ్యనుండు స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహనబలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించెను.౹ మరియు ఆ సమయమున సొలొమోనును అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును హమాతునకు పోవుమార్గము మొదలుకొని ఐగుప్తునదివరకు నున్న సకల ప్రాంతములనుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు, అనగా పదునాలుగు దినములు యెహోవా సముఖమందు ఉత్సవముచేసిరి.౹ ఎనిమిదవదినమున అతడు జనులకు సెలవియ్యగా, వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీయులగు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమతమ గుడారములకు వెళ్లిపోయిరి. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు, తాను చేయకోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవమారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఈలాగు సెలవిచ్చెను–నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన యీ మందిరమును పరిశుద్ధపరచియున్నాను; నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడు అక్కడ ఉండును.౹ నీ తండ్రియైన దావీదు నడిచినట్లు నీవును యథార్థహృదయుడవై నీతిని బట్టి నడుచుకొని, నేను నీకు సెలవిచ్చిన దంతటిప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించినయెడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడై యుండక మానడని నీ తండ్రియైన దావీదునకు నేను సెలవిచ్చియున్నట్లు ఇశ్రాయేలీయులమీద నీ సింహాసనమును చిరకాలమువరకు స్థిరపరచుదును.౹ అయితే మీరేగాని మీ కుమారులేగాని యేమాత్రమై నను నన్ను వెంబడించుట మాని, నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక యితరమైన దేవతలను కొలిచి పూజించినయెడల నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన యీ దేశములో వారిని ఉండనియ్యక వారిని నిర్మూలము చేసి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సముఖములోనుండి కొట్టివేసెదను; ఇశ్రాయేలీయులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు.౹ ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యని–యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలాగున ఎందుకు చేసెనని యడుగగా జనులిట్లందురు–ఐగుప్తు దేశములోనుండి తమపితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి యితర దేవతలను ఆధారము చేసికొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నాడు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని యిరువది సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంతమట్టుకు దేవదారు మ్రానులను సరళ వృక్షపు మ్రానులను బంగారమును అతనికిచ్చియున్నందున సొలొమోను గలిలయ దేశమందున్న యిరువది పట్టణములను హీరాము కప్పగించెను.౹ హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరునుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక నా సహోదరుడా, నీవు నాకిచ్చిన యీ పట్టణములు ఏపాటివనెను. నేటివరకు వాటికి కాబూల్ అని పేరు.౹ హీరాము రెండువందల నలువది మణుగుల బంగారమును రాజునకు పంపించెను. యెహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను, యెరూషలేముయొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టి వారిని పెట్టెను.౹ ఐగుప్తు రాజైన ఫరో గెజెరుమీదికి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తెయైన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను.౹ సొలొమోను గెజెరును కట్టించెను, మరియు దిగువను బేత్‍హోరోనును,౹ బయలతును అరణ్యములోనున్న తద్మోరునును,౹ సొలొమోను భోజనపదార్థములకు ఏర్పాటైన పట్టణములను, రథములకు ఏర్పాటైన పట్టణములను, రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలిన దేశమంతటియందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను.౹ అయితే ఇశ్రాయేలీయులుకాని అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారిలో శేషించినవారుండిరి.౹ ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించియున్న వారి పిల్లలను సొలొమోను దాసత్వముచేయ నియమింపగా నేటివరకు ఆలాగు జరుగుచున్నది.౹ అయితే ఇశ్రాయేలీయులలో ఎవనినైనను సొలొమోను దాసునిగా చేయలేదు; వారు రాణువవారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి.౹ సొలొమోనుయొక్క పనిమీదనున్న ప్రధానులు ఐదువందల ఏబదిమంది; వీరు పనివాండ్లమీద అధికారులుగా ఉండిరి.౹ ఫరో కుమార్తె దావీదు పురమునుండి సొలొమోను తనకు కట్టించిన నగరునకెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను.౹ మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠముమీద ఏడాదిలో మూడు మారులు దహనబలులను సమాధానబలులను యెహోవాకు అర్పించుచు, యెహోవా సముఖమందున్న పీఠముమీద ధూపద్రవ్యము వేయు చుండెను; పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను. మరియు రాజైన సొలొమోను ఎదోముదేశపు ఎఱ్ఱ సముద్రతీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెబెరునందు ఓడలను కట్టించెను.౹ సొలొమోను సేవకులతోకూడ హీరాము సముద్రప్రయాణముచేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడలమీద పంపెను.౹ వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటనుండి యెనిమిది వందల నలువది మణుగుల బంగారమునురాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి. షేబదేశపురాణి యెహోవా నామమునుగూర్చియు, సొలొమోనునకు కలిగిన కీర్తినిగూర్చియు విని, గూఢార్థముగల మాటలచేత అతనిని శోధించుటకై వచ్చెను.౹ ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదానినంతటినిబట్టి అతనితో మాటలాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికి సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను; రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసినవాటన్నిటి భావము చెప్పెను.౹ షేబరాణి సొలొమోనుయొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును,౹ అతని బల్లమీదనున్న భోజనద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించువారిని, యెహోవామందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను–నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే;౹ అయినను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని; ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని యిప్పుడు నేను తెలిసికొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించియున్నవి;౹ నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులును భాగ్యవంతులు.౹ నీయందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతిన్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగిం చుటకు ఆయన నిన్ను నియమించెను అనెను.౹ మరియు ఆమె రాజునకు రెండువందల నలువది మణుగుల బంగారమును, బహువిస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు.౹ మరియు ఓఫీరు దేశమునుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరునుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను.౹ ఈ చందనపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు.౹ సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబదేశపు రాణికిచ్చినదిపోగ ఆమె కోరినప్రకారము ఆమె యిచ్ఛాపూర్తిగా ఆమె కిచ్చెను; అప్పుడు ఆమెయు ఆమె సేవకులును తమ దేశమునకు తిరిగి వెళ్లిరి. ఏటేట సొలొమోనునకువచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పదిరెండు మణుగుల యెత్తు.౹ ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకులయొద్దనుండియు అరబి రాజులయొద్ద నుండియు దేశాధికారులయొద్ద నుండియు అతనికి చాలా వచ్చుచుండెను.౹ రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; డాలు ఒకటింటికి ఆరువందల తులముల యెత్తు బంగారముండెను.౹ మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు మూడువందల కేడెములను చేయించెను; కేడెము ఒకటింటికి మూడు వందల బంగారపు తులములయెత్తు బంగారముండెను; వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను.౹ మరియు రాజు దంతముచేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాని పొదిగించెను.౹ ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను; సింహాసనము మీది భాగపు వెనుకతట్టు గుండ్రముగా ఉండెను; ఆసనమునకు ఇరుపార్శ్వములయందు ఊతలుండెను; ఊతలదగ్గర రెండు సింహములు నిలిచియుండెను.౹ ఇరుప్రక్కల ఆరుమెట్లమీద పండ్రెండు సింహములు నిలిచియుండెను; అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు.౹ మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపువై యుండెను; లెబా నోను అరణ్య మందిరపు పాత్రలును బంగారపువే, వెండిది యొకటియు లేదు; సొలొమోను దినములలో వెండి యెన్నికకు రాలేదు.౹ సముద్రమందు హీరాము ఓడలతోకూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగి యుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.౹ ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనముచేతను జ్ఞానముచేతను భూపతులందరిలో అధికుడై యుండెను.౹ అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరును అతని చూడగోరిరి.౹ ఏర్పాటైన ప్రతిమనిషి వెండివస్తువులుగాని, బంగారపు వస్తువులుగాని, వస్త్రములుగాని, యుద్ధాయుధములుగాని, గంధవర్గములుగాని, గుఱ్ఱములుగాని, కంచరగాడిదలుగాని, తన తన వంతుచొప్పున కట్నములను ఏటేట తీసికొని వచ్చుచుండెను.౹ మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను; అతడు వెయ్యిన్ని నాలుగువందల రథములును పండ్రెండువేల రౌతులునుగలవాడై యుండెను; వీటిని అతడు రథములకై యేర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునొద్దను ఉంచ నిర్ణయించెను.౹ రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను; దేవదారు మ్రానులను షెఫేలా ప్రదేశముననున్న మేడిచెట్లవలె విస్తరింప జేసెను.౹ సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను; రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియా మకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగ కొనితెప్పించిరి.౹ వారు ఐగుప్తులోనుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరు వందల తులముల వెండియు, గుఱ్ఱమొకటింటికి నూట ఏబది తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజులందరికొరకును అరాము రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి. మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.౹ అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందలమంది ఉప పత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి.౹ సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.౹ సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.౹ ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.౹ సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.౹ తమ దేవతలకు ధూపము వేయుచు బలులనర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను. ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై –నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్దనుండి తొలగిపోయెను. యెహోవా తన కిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి –సెలవిచ్చినదేమనగా — నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండకుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను.౹ అయినను నీ తండ్రియైన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను ఆలాగున చేయక నీ కుమారుని చేతిలోనుండి దాని తీసివేసెదను.౹ రాజ్యమంతయు తీసివేయను; నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చెదను. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను; అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు.౹ దావీదు ఎదోము దేశముమీద యుద్ధము చేయుచుండగా, సైన్యాధిపతియైన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్లి యున్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారినందరిని హతము చేసెను.౹ ఎదోములోనున్న మగవారినందరిని హతము చేయువరకు ఇశ్రాయేలీయులందరితోకూడ యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను.౹ అంతట హదదును అతనితోకూడ అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులును ఐగుప్తు దేశములోనికి పారిపోయిరి; హదదు అప్పుడు చిన్న వాడై యుండెను.౹ వారు మిద్యాను దేశములోనుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి, పారాను దేశము నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తురాజగు ఫరోనొద్దకు రాగా, ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను.౹ హదదు ఫరో దృష్టికి బహు దయపొందగా తాను పెండ్లిచేసికొనిన రాణియైన తహ్పెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లిచేసెను.౹ ఈ తహ్పెనేసుయొక్క సహోదరి అతనికిగెనుబతు అను కుమారుని కనెను; ఫరోయింట తహ్పెనేసు వీనికి పాలు విడిపించెను గనుకగెనుబతు ఫరో కుటుంబికులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను.౹ అంతట దావీదు తన పితరులతోకూడ నిద్రపొందిన సంగతిని, సైన్యాధిపతియైన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని–నేను నా స్వదేశమునకు వెళ్లుటకు సెలవిమ్మని ఫరోతో మనవిచేయగా ఫరో–నీవు నీ స్వదేశమునకు వెళ్ల కోరుటకు నాయొద్ద నీకేమి తక్కు వైనది అని యడిగెను. అందుకు హదదు–తక్కువైన దేదియు లేదుగాని యేలాగుననైనను నన్ను వెళ్లనిమ్మనెను. మరియు దేవుడు అతనిమీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు సోబా రాజైన హదదెజరు అను తన యజమానుని యొద్దనుండి పారిపోయినవాడు.౹ దావీదు సోబావారిని హతము చేసి నప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి, కూడిన యొక సైన్యమునకు అధిపతియై దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయెను.౹ హదదు చేసిన యీ కీడు గాక సొలొమోను బ్రదికిన దినములన్నియు ఇతడు అరాముదేశమందు ఏలినవాడై ఇశ్రాయేలీయులకు విరో ధియైయుండి ఇశ్రాయేలీయులయందు అసహ్యతగలవాడై యుండెను. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజుమీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయీమీయుడైన నెబాతు కుమారుడు, ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు.౹ ఇతడు రాజుమీదికి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రియైన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగుచేయుచుండెను.౹ అయితే యరొబాము అను ఇతడు మహా బలాఢ్యుడైయుండగా యౌవనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొని, యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను.౹ అంతట యరొబాము యెరూషలేములోనుండి బయలు వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కను గొనెను; అహీయా క్రొత్తవస్త్రము ధరించుకొని యుండెను, వారిద్దరు తప్ప పొలములో మరి యెవడును లేకపోయెను.౹ అంతట అహీయా తాను ధరించుకొని యున్న క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండు తున కలుగా చింపి యరొబాముతో ఇట్లనెను–ఈ పది తునకలను నీవు తీసికొనుము;౹ [31-33] ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–జనులు నన్ను విడిచి పెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును కెమోషు అను మోయాబీయుల దేవతకును మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి, సొలొమోను తండ్రియైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచిన మార్గములలో నడవకయు నున్నారు గనుక సొలొమోను చేతిలోనుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును, నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీయుల గోత్రములలోనుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును.౹ *** *** రాజ్యము వానిచేతిలోనుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసికొని అతని దినములన్నియు అతనిని అధికారిగా ఉండనిత్తును.౹ అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రముల నిచ్చెదను;౹ నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.౹ నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక యంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలువారిమీద రాజవై యుందువు.౹ నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గముల ననుసరించి నడచుచు, నా దృష్టికి అనుకూలమైనదానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినయెడల, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు అప్పగించెదను.౹ వారు చేసిన క్రియలనుబట్టి నేను దావీదు సంతతివారిని బాధ పరచుదునుగాని నిత్యము బాధింపను.౹ జరిగినదానిని విని సొలొమోను యరొబామును చంప చూడగా యరొబాము లేచి ఐగుప్తుదేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్ద చేరి సొలొమోను మరణమగువరకు ఐగుప్తులోనే యుండెను. సొలొమోను చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమునుగూర్చియు, సొలొమోను కార్యములనుగూర్చిన గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹ సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిని ఏలిన కాలము నలువది సంవత్సరములు.౹ అంతట సొలొమోను తన పితరులతోకూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధిచేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీయులందరును షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను.౹ నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్దనుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను; యరొబాము ఇంక ఐగుప్తులోనేయుండి ఆ సమాచారము వినెను.౹ జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజ మంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి.౹ –నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెను; నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినయెడల మేము నీకు సేవచేయుదుము.౹ అందుకు రాజు–మీరు వెళ్లి మూడుదినములైన తరువాత నాయొద్దకు తిరిగి రండని సెలవియ్యగా జనులు వెళ్లిపోయిరి.౹ అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను బ్రదికియున్న ప్పుడు అతని సముఖమందు సేవచేసిన పెద్దలతో ఆలోచనచేసి–ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చెదనని వారి నడుగగా వారు–ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవచేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తర మిచ్చినయెడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి.౹ అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, తనతోకూడ పెరిగిన యౌవనులను పిలిచి ఆలోచన నడిగి, వారికీలాగు ప్రశ్నవేసెను –మామీద నీ తండ్రి యుంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన యీ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితోకూడ ఎదిగిన ఆ యౌవనస్థులు ఈ ఆలోచన చెప్పిరి–నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెనుగాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన యీ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్ము–నా తండ్రి నడుముకంటె నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును.౹ నా తండ్రి మీమీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంక బరువుగా చేయుదును; నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను సరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.౹ –మూడవ దినమందు నాయొద్దకు రండని రాజు నిర్ణయము చేసియున్నట్లు యరొబామును జనులందరును మూడవదినమున రెహబాము నొద్దకు వచ్చిరి.౹ అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యౌవనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తర మిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను –నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెనుగాని నేను మీ కాడిని మరి బరు వుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెనుగాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.౹ జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపక పోయెను. షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఈలాగున జరిగించెను.౹ కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరి— దావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీమీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి.౹ అయితే యూదా పట్ణణములలోనున్న ఇశ్రాయేలువారిని రెహబాము ఏలెను.౹ తరువాత రాజైన రెహబాము వెట్టిపనివారిమీద అధికారియైన అదోరామును పంపగా ఇశ్రాయేలువారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను, కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథముమీద త్వరగా ఎక్కెను.౹ ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి.౹ మరియు యరొబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరు విని, సమాజముగా కూడి, అతని పిలువనంపించి ఇశ్రాయేలువారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి; యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవా రెవరును లేకపోయిరి. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రాయేలువారితో యుద్ధముచేసి, రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరల వచ్చునట్లు చేయుటకై యూదావారందరిలోనుండియు బెన్యామీను గోత్రీయులలోనుండియు యుద్ధప్రవీణులైన లక్షయెనుబది వేలమందిని పోగు చేసెను.౹ అంతట దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నీవు సొలొమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతోను యూదావారందరితోను బెన్యామీనీయులందరితోను శేషించినవారందరితోను ఇట్లనుము –యెహోవా సెలవిచ్చునదేమనగా–జరిగినది నావలననే జరిగెను; మీరు ఇశ్రాయేలువారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్లక, అందరును మీ మీ యిండ్లకు తిరిగి పోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానినిబట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. తరువాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణముకట్టించి అచ్చట కాపురముండి అచ్చటనుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను.౹ –ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవామందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండినయెడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానునితట్టు తిరుగును; అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరల చేరుదురు; రాజ్యము మరల దావీదు సంతతివారిదగును అని యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచి–యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;౹ ఇశ్రాయేలువారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.౹ దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను.౹ మరియు అతడు ఉన్నతస్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియమించెను.౹ మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించు చుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను.౹ ఈ ప్రకారము అతడు యోచించినదానినిబట్టి యెనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను; మరియు ఇశ్రాయేలువారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. అంతట దైవజనుడైన యొకడు యెహోవాచేత సెలవు నొంది యూదాదేశమునుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి యుండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటనచేసెను–బలిపీఠమా బలి పీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగా–దావీదు సంత తిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నతస్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును.౹ ఈ బలిపీఠము బద్దలైపోయి దానిమీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన యొకటి యిచ్చెను.౹ బేతేలునందున్న బలిపీఠమునుగూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని, బలిపీఠముమీదనుండి తన చెయ్యి చాపి, వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి యెండి పోయెను; దానిని వెనుకకు తీసికొనుటకు అతనికి శక్తిలేక పోయెను.౹ మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచనచొప్పున బలిపీఠము బద్దలుకాగా బుగ్గి దానిమీదనుండి ఒలికిపోయెను.౹ అప్పుడు రాజు— నా చెయ్యిమునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగైమునుపటివలె ఆయెను.౹ అప్పుడు రాజు–నీవు నా యింటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చెదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను–నీ యింటిలో సగము నీవు నాకిచ్చినను నీతోకూడ నేను లోపలికి రాను; ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను;౹ –అన్నపానములు పుచ్చుకొన వద్దనియు, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కుచేత నాకు సెలవాయెనని రాజుతో అనెను.౹ అంతట అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్లక మరియొక మార్గమున తిరిగిపోయెను. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటిని, అతడు రాజుతో పలికిన మాటలన్నిటిని తమ తండ్రితో తెలియ జెప్పగా వారి తండ్రి–అతడు ఏ మార్గమున వెళ్లిపోయె నని వారినడిగెను; అంతట అతని కుమారులు యూదాదేశములోనుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్లిపోయి నది తెలిపిరి.౹ పిమ్మట అతడు తన కుమారులను పిలిచి–నాకొరకు గాడిదకు గంతకట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంతకట్టిరి. అతడు దానిమీద ఎక్కి దైవజనుని కనుగొనవలెనని పోయి మస్తకివృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి–యూదాదేశములోనుండి వచ్చిన దైవజనుడవు నీవేనా? అని అడుగగా అతడు–నేనే అనెను.౹ అప్పుడు అతడు–నా యింటికి వచ్చి భోజనము చేయుమనగా అతడు–నేను నీతోకూడ మరలి రాజాలను, నీ యింట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను –నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరుగవద్దనియు యెహోవా వాక్కుచేత నాకు సెలవాయెనని చెప్పెను.౹ అందుకతడు–నేనును నీవంటి ప్రవక్తనే; మరియు దేవదూత యొకడు–యెహోవా చేత సెలవుపొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ యింటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితోకూడ మరలిపోయి అతని యింట అన్నపానములు పుచ్చుకొనెను.౹ వారు భోజనముచేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్ష మాయెను.౹ అంతట అతడు యూదాదేశములోనుండి వచ్చిన దైవజనుని పిలిచి–యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినదానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి, నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనముచేసియున్నావు గనుక, నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని యెలుగెత్తి చెప్పెను.౹ అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిదమీద గంత కట్టించెను.౹ అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచి యుండెను, సింహమును శవముదగ్గర నిలిచి యుండెను.౹ కొందరు మనుష్యులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండుటయు, సింహము శవముదగ్గర నిలిచియుండుటయు చూచి, ఆ ముసలిప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి.౹ మార్గములోనుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు— యెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే; యెహోవా సింహమునకు అతని అప్పగించియున్నాడు; యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి తన కుమారులను పిలిచి —గాడిదకు నాకొరకు గంత కట్టుడని చెప్పెను. వారు అతనికొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడియుండుటయు, గాడిదయు సింహమును శవముదగ్గర నిలిచి యుండుటయు, సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక యుండుటయు చూచి దైవజనుని శవము ఎత్తి గాడిదమీద వేసికొని తిరిగి వచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను.౹ అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు–కటకటా నా సహోదరుడా అని యేడ్చిరి.౹ మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి–నేను మరణమైనప్పుడు దైవజనుడైన యితడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి; నా శల్యములను అతని శల్యముదగ్గర ఉంచుడి,౹ యెహోవా మాటనుబట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను, షోమ్రోను పట్టణములోనున్న ఉన్నతస్థలములలోని మందిరములన్నిటికి విరోధము గాను, అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను. ఈ సంగతియైన తరువాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక, సామాన్యజనులలో కొందరిని ఉన్నతస్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నతస్థలములకు యాజకులుగా నియమించెను.౹ యరొబాము సంతతివారిని నిర్మూలము చేసి భూమిమీద ఉండకుండ నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను. ఆ కాలమున యరొబాము కుమారుడైన అబీయా కాయిలాపడగా యరొబాము తన భార్యతో ఇట్లనెను —నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండ మారువేషము వేసికొని షిలోహునకు పొమ్ము; ఈ జనులమీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియ జెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు.౹ కాబట్టి నీవు పది రొట్టెలును అప్పములును ఒక బుడ్డి తేనెయు చేతపట్టుకొని అతని దర్శించుము. బిడ్డయేమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా యరొబాము భార్య ఆప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా యింటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యముచేత కండ్లు కానరాని వాడై యుండెను.౹ అంతట యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా–యరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతనిగూర్చి నీచేత విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది ఆమె మారువేషము వేసికొని మరియొకతెయైనట్టుగా వచ్చు చున్నది గనుక నేను నీకు సెలవిచ్చునట్టు నీవు ఆమెతో చెప్పవలెను.౹ అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు నామె కాలిచప్పుడు విని ఆమెతో ఇట్లనెను— యరొబాము భార్యా, లోపలికి రమ్ము; నీవు వేషము వేసికొని వచ్చుటయేల? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞయాయెను.౹ నీవు వెళ్లి యరొబాముతో చెప్ప వలసినదేమనగా–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు–నేను నిన్ను జనులలోనుండి తీసి హెచ్చింపజేసి, ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారియొద్దనుండి రాజ్యమును తీసి నీకిచ్చి యుండినను, నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటె ముందుగా ఉండిన వారందరికంటెను అధికముగా కీడుచేసియున్నావు; నన్ను బొత్తిగా విసర్జించి యితర దేవతలను పోతవిగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించియున్నావు.౹ కాబట్టి యరొబాము సంతతి వారిమీదికి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులుగాని ఘనులుగానిలేకుండ మగవారినందరిని యరొబాము వంశమునుండి నిర్మూలముచేసి,పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యరొబాము సంతతిలో శేషించినవారిని నేను ఊడ్చివేయుదును.౹ పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగువారిని కుక్కలు తినును; బయట భూమిలో మరణమగువారిని ఆకాశపక్షులు తినును; యెహోవా మాటయిచ్చియున్నాడు.౹ కాబట్టి నీవు లేచి నీ యింటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చని పోవును;౹ అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును.౹ ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలువారిమీద రాజుగా నియమింపబోవుచున్నాడు; ఆ దినముననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలము చేయును; కొద్దికాలములోనే ఆయన అతని నియమింపబోవును.౹ ఇశ్రాయేలువారు దేవతాస్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించియున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచి దేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదర గొట్టును.౹ మరియు తానే పాపముచేసి ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడైన యరొబాము పాపములనుబట్టి ఆయన ఇశ్రాయేలువారిని అప్పగింప బోవుచున్నాడు.౹ అప్పుడు యరొబాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను; ఆమె లోగిటి ద్వారపు గడపయొద్దకు రాగానే ఆ చిన్నవాడు చని పోయెను.౹ జనులు అతనిని సమాధిలోపెట్టి, యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహీయాద్వారా సెలవిచ్చిన ప్రకారముగ ఇశ్రాయేలువారందరును అతనికొరకు అంగలార్చిరి.౹ యరొబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు జరిగించిన యుద్ధములనుగూర్చియు, ప్రభుత్వమునుగూర్చియు ఇశ్రాయేలువారి రాజులవృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹ యరొబాము ఏలిన దినములు ఇరువది రెండు సంవత్సరములు; అతడు తన పితరులతోకూడ నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయెను. యూదాదేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము నలువదియొక సంవత్సరములవాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామము నుంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి యెహోవా కోరుకొనిన యెరూషలేమను పట్టణమందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను; అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా.౹ యూదావారు యెహోవా దృష్టికి కీడుచేసి తమపితరులు చేసినదానంతటిని మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి.౹ ఎట్లనగా వారును ఎత్తయిన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షముక్రిందను బలిపీఠములను కట్టి, విగ్రహములను నిలిపి, దేవతాస్తంభములను ఉంచిరి.౹ మరియు పురుషగాములు సహా దేశమందుండిరి. ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులుచేయు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయుచు వచ్చిరి.౹ రాజైన రెహబాముయొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తురాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను, రాజనగరుయొక్క ఖజానాలోని పదార్థములను, ఎత్తికొని పోయెను, అతడు సమస్తమును ఎత్తికొని పోయెను; సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తికొని పోయెను.౹ రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి, రాజనగరు ద్వారపాలకులైన తన దేహసంరక్షకుల అధిపతుల వశము చేసెను.౹ రాజు యెహోవా మందిరమునకు వెళ్లునప్పుడెల్ల రాజదేహ సంరక్షకులు వాటిని మోసికొనిపోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి.౹ రెహబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదారాజులయొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹ వారు బ్రదికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.౹ రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని తల్లి నయమా యను ఒక అమ్మోనీయురాలు; అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయెను. నెబాతు కుమారుడును రాజునైన యరొబాము ఏలు బడిలో పదునెనిమిదవ సంవత్సరమున అబీయాము యూదా వారిని ఏలనారంభించెను.౹ అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను; అతని తల్లి పేరు మయకా; ఆమె అబీషాలోము కుమార్తె.౹ అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపమార్గములన్ని టిలో నడిచెను; తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవాయెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు.౹ దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును, యెరూషలేమును స్థిరపరచుటకును, అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండ నిచ్చెను.౹ రెహబాము బ్రదికిన దినములన్నియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.౹ అబీ యాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగి యుండెను.౹ అబీయాము తన పితరులతోకూడ నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధిచేసిరి; అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను. ఇశ్రాయేలువారికి రాజైన యరొబాము ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరమున ఆసా యూదావారిని ఏల నారంభించెను.౹ అతడు నలువదియొక సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వపేరు మయకా, యీమె అబీషాలోము కుమార్తె.౹ ఆసా తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములోనుండి వెళ్ల గొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటిని పడ గొట్టెను.౹ మరియు తన అవ్వ యైన మయకా అసహ్యమైన యొకదాని చేయించి, దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును ఛిన్నాభిన్నములుగా కొట్టించి, కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవికాకుండ ఆమెను తొలగించెను.౹ ఆసా తన దినములన్నియు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెనుగాని ఉన్నతస్థలములను తీసివేయకపోయెను.౹ మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను.౹ వారు బ్రది కిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలురాజైన బయె షాకును యుద్ధము జరుగుచుండెను.౹ ఇశ్రాయేలురాజైన బయెషా యూదావారికి విరోధియైయుండి, యూదా రాజైన ఆసాయొద్దనుండి యెవరును రాకుండను అతని యొద్దకు ఎవరును పోకుండను, రామాపట్టణమును కట్టించెను.౹ కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరుయొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకులచేతి కప్ప గించి, హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజునైయున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా –నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగి యుండవలెను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను; నీవు వచ్చి ఇశ్రాయేలురాజైన బయెషా నాయొద్దనుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను.౹ కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణములమీదికి పంపి ఈయోనును దానును ఆబేల్బేత్మయకాను కిన్నెరెతును నఫ్తాలీ దేశమును పట్టుకొని కొల్లపట్టెను.౹ అది బయెషాకు వర్తమానముకాగా రామాపట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను.౹ అప్పుడు రాజైన ఆసా యెవరును నిలిచిపోకుండ యూదాదేశపు వారందరు రావలెనని ప్రకటనచేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామాపట్టణపు రాళ్లను కఱ్ఱలను ఎత్తికొని వచ్చిరి. రాజైన ఆసా వాటిచేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను.౹ ఆసా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని బలమంతటిని గూర్చియు, అతడు చేసిన సమస్తమునుగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు యూదారాజుల వృత్తాం తముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగము పుట్టెను.౹ అంతట ఆసా తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను. యరొబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా యేలుబడిలో రెండవ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలువారిని రెండు సంవత్సరములు ఏలెను.౹ అతడు యెహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి, అతడు దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడాయెనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను.౹ ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడునైన బయెషా అతనిమీద కుట్రచేసెను. నాదాబును ఇశ్రాయేలు వారం దరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపెను.౹ రాజైన ఆసా యేలుబడిలో మూడవ సంవత్సరమందు బయెషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను.౹ తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారినందరిని హతముచేసెను; ఎవనినైన యరొబామునకు సజీవునిగా ఉండనియ్యక అందరిని నశింపజేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయాద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను.౹ తాను చేసిన పాపములచేత ఇశ్రాయేలువారు పాపముచేయుటకు కారకుడై యరొబాము ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను.౹ నాదాబు చేసిన ఇతర కార్యములనుగూర్చియు, అతడు చేసినదానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ వారి దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలురాజైన బయెషాకును యుద్ధము జరుగుచుండెను. యూదారాజైన ఆసా యేలుబడిలో మూడవ సంవ త్సరమందు అహీయా కుమారుడైన బయెషా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి యిరువది నాలుగు సంవత్సరములు ఏలెను.౹ ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యరొబాము దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడాయెనో దానినంతటిని అనుసరించి ప్రవర్తించెను. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయెషానుగూర్చి యీలాగు సెలవిచ్చెను –నేను నిన్ను మంటిలోనుండి తీసి హెచ్చింప జేసి ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా చేసితిని, అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు, ఇశ్రాయేలువారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై, వారి పాపములచేత నాకు కోపము పుట్టించియున్నావు.౹ కాబట్టి బయెషా సంతతివారిని అతని కుటుంబికులను నేను సమూల ధ్వంసముచేసి, నెబాతు కుమారుడైన యరొబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతివారికిని చేయబోవుచున్నాను.౹ పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను కుక్కలు తినును; బీడుభూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశపక్షులు తినును అనెను.౹ బయెషా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు, అతని బలమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.౹ బయెషా తన పితరులతోకూడ నిద్రించి తిర్సాలో సమాధిచేయబడెను; అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను.౹ మరియు బయెషా యరొబాము సంతతి వారివలెనేయుండి తన కార్యములచేత యెహోవా దృష్టికి కీడుచేసి ఆయనకు కోపము పుట్టించిన దానినంతటినిబట్టియు, అతడు తన రాజును చంపుటనుబట్టియు, అతనికిని అతని సంతతివారికిని విరోధముగ యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమాయెను. యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువదియారవ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను.౹ తిర్సాలో తనకు గృహనిర్వాహకుడగు అర్సాయింట అతడు త్రాగి మత్తుడై యుండగా, యుద్ధ రథముల అర్ధభాగముమీద అధికారియైన జిమ్రీ అతని మీద కుట్రచేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయెను. ఇది యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువది యేడవ సంవత్సరమున సంభవించెను.౹ అతడు సింహాసనాసీనుడై యేలనారంభించిన తోడనే బయెషా సంతతివారందరిలో ఏ పురుషునేగాని అతని బంధువులలోను మిత్రులలోను ఎవరినేగాని మిగుల నియ్యక అందరిని హతముచేసెను.౹ బయెషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపముచేసి, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకులై, తాము పెట్టుకొనిన దేవతలచేత ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు కోపము పుట్టించిరి గనుక వారు చేసిన పాపములనుబట్టి ప్రవక్తయైన యెహూద్వారా బయెషానుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయెషా సంతతివారినందరిని నాశనముచేసెను.౹ ఏలా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువదియేడవ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో ఏడు దినములు ఏలెను. జనులు ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా జిమ్రీ కుట్రచేసి రాజును చంపించెనను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇశ్రాయేలువారందరును ఆ దినమున సైన్యాధిపతియైన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారిమీద రాజుగా పట్టాభిషేకము చేసిరి.౹ వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరును తిర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి.౹ పట్టణము పట్టుబడెనని జిమ్రీ తెలిసికొని, తాను రాజనగరునందు జొచ్చి తనతోకూడ రాజనగరును తగలబెట్టుకొని చనిపోయెను.౹ యరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడు తనము చేయువాడైయుండి తానే పాపముచేయుచు, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగున జరిగెను.౹ జిమ్రీచేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన రాజద్రోహమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది. అప్పుడు ఇశ్రాయేలువారు రెండు జట్లుగా విడి పోయి, జనులలో సగముమంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను, సగముమంది ఒమ్రీ పక్షమునను చేరిరి.౹ ఒమ్రీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపువారిని జయింపగా తిబ్నీ చంప బడెను; ఒమ్రీ రాజాయెను.౹ యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియొకటవ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను; ఆ పండ్రెండింటిలో ఆరుసంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను.౹ అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండమీద పట్టణ మొకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరునుబట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను.౹ ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, తన పూర్వికులందరికంటె మరి దుర్మార్గముగా ప్రవర్తించెను.౹ అతడు నెబాతు కుమారుడైన యరొబాము దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు కోపము పుట్టించెనో, దానిని అనుసరించి ప్రవర్తించెను.౹ ఒమ్రీ చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు అగుపరచిన బలమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ ఒమ్రీ తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయెను. యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియెనిమిదవ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలువారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఇరువదిరెండు సంవత్సరములు ఏలెను.౹ ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వికులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను.౹ నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచు కొనుట స్వల్పసంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కు చునుండెను.౹ షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను.౹ మరియు అహాబు దేవతాస్తంభమొకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వికులైన ఇశ్రాయేలురాజులందరికంటె ఎక్కువగా పాపముచేసి ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.౹ అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాదివేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను; దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున సంభవించెను. అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీ యుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి–ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారముగాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను.౹ పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై –నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;౹ ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను.౹ అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.౹ కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము;౹ నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెలవిచ్చితిని.౹ అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి–త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.౹ ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచి–నాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.౹ అందుకామె–నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవేగాని అప్పమొకటైనలేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.౹ అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను–భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము.౹ భూమి మీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాటచొప్పునచేయగా అతడును ఆమెయు ఆమె యింటివారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి.౹ యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.౹ అటుతరువాత ఆ యింటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగియై ప్రాణము నిలువ జాలనంత వ్యాధిగలవాడాయెను.౹ ఆమె ఏలీయాతో —దైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవిచేయగా అతడు–నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, ఆమె కౌగిటిలోనుండి వానిని తీసికొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచముమీద వాని పరుండబెట్టి –యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొఱ్ఱపెట్టి ఆ చిన్నవానిమీద ముమ్మారు తాను పారచాచుకొని–యెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.౹ ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి–ఇదిగో నీ కుమారుడు; వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలీయాతో–నీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదుననెను. అనేకదినములైన తరువాత మూడవ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై–నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను; నీవు వెళ్లి అహాబును దర్శించుమని సెలవియ్యగా,౹ అహాబును దర్శించుటకై ఏలీయా వెళ్లిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగియుండగా అహాబు తన గృహనిర్వాహ కుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవాయందు బహు భయభక్తులుగలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.౹ అహాబు–దేశములోని ఉదకధారలన్నిటిని నదులన్నిటిని చూడబోయి, పశువులన్నిటిని పోగొట్టుకొనకుండ గుఱ్ఱములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలిసికొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను.౹ కాబట్టి వారు దేశమంతట సంచరింపవలెనని చెరియొక పాలు తీసికొని, అహాబు ఒంట రిగా ఒక వైపునకును ఓబద్యా ఒంటరిగా నింకొక వైపునకును వెళ్లిరి.౹ ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలీయా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా యితని నెరిగి నమస్కారము చేసి–నా యేలినవాడవైన ఏలీయావు నీవే గదా యని అడుగగా అతడు–నేనేయని చెప్పి–నీవు నీ యేలిన వాని దగ్గరకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని తెలియజేయుమనెను.౹ అందుకు ఓబద్యా–నేను చావవలెనని నీ దాసుడనైన నన్ను అహాబుచేతికి నీవు అప్పగింప నేల? నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా యేలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్యమొకటైనను లేదు; అతడు ఇక్కడ లేడనియు, అతని చూడలేదనియు, వారు ఆయా జనములచేతను రాజ్యములచేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి.౹ నీవు–నీ యేలినవానిచెంతకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే;౹ అయితే నేను నీయొద్దనుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును, అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని యెడల అతడు నన్ను చంపివేయును, ఆలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు, నీ దాసుడనైన నేను బాల్యమునుండి యెహోవాయందు భయభక్తులు నిలిపిన వాడను.౹ యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా యేలినవాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో నూరు మందిని గుహకు ఏబదేసి మందిచొప్పున దాచి, అన్నపానములిచ్చి వారిని పోషించితిని.౹ ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లుగా–నీ యేలినవాని దగ్గరకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవిచేయగా ఏలీయా–ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాననెను.౹ అంతట ఓబద్యా అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలీయాను కలిసికొనుటకై అహాబు బయలుదేరెను.౹ అహాబు ఏలీయాను చూచి–ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా అతడు–నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును, నీ తండ్రి యింటివారును ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువారై యున్నారు.౹ అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారినందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి ప్రవక్త లైన నాలుగువందలమందిని నాయొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను.౹ అహాబు ఇశ్రాయేలువారందరియొద్దకు దూతలను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను.౹ ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి —యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపులమధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిననుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి.౹ అప్పుడు ఏలీయా— యెహోవాకు ప్రవక్తలైనవారిలో నేను ఒకడనే శేషించియున్నాను; అయితే బయలునకు ప్రవక్తలు నాలుగువందల ఏబదిమంది యున్నారు.౹ మాకు రెండు ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచవలెను, రెండవ యెద్దును నేను సిద్ధము చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచుదును.౹ తరువాత మీరు మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరల జనులతో చెప్పగా జనులందరును–ఆ మాట మంచిదని ప్రత్యుత్తర మిచ్చిరి.౹ అప్పుడు ఏలీయా బయలు ప్రవక్తలను పిలిచి–మీరు అనేకులైయున్నారు గనుక మీరే మొదట ఒక యెద్దును కోరుకొని సిద్ధముచేసి మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; అయితే మీరు అగ్నియేమియు క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన యెద్దును తీసికొని సిద్ధముచేసి, ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు–బయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరిగాని యొక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగా, వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులువేయ మొదలుపెట్టిరి.౹ మధ్యాహ్నముకాగా ఏలీయా–వాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానముచేయుచున్నాడేమో, దూరముననున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసియున్నదేమో అని అపహాస్యముచేయగా వారు మరి గట్టిగా కేకలువేయుచు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసికొనుచు నుండిరి.౹ ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయమువరకు వారు ప్రకటనముచేయుచు వచ్చిరి గాని, మాటయైనను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యముచేసినవాడైనను లేక పోయెను.౹ అప్పుడు ఏలీయా–నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరును అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడ ద్రోయబడియున్న యెహోవా బలిపీఠమును బాగుచేసి,౹ యెహోవావాక్కు ప్రత్యక్షమై — నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి యెద్దును తునకలుగా కోసి ఆ కట్టెలమీద ఉంచి, జనులు చూచుచుండగా–మీరు నాలుగు తొట్లనిండ నీళ్లు నింపి దహనబలి పశుమాంసముమీదను కట్టెలమీదను పోయుడని చెప్పెను అదియైన తరువాత–రెండవ మారు ఆప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును ఆలాగు చేసిరి; —మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి; అప్పుడు ఆ నీళ్లు బలిపీఠముచుట్టును పొర్లి పారెను; మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను.౹ అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెను — యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయులమధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము.౹ యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీతట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.౹ అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.౹ అంతట జనులందరును దాని చూచి సాగిలపడి–యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.౹ అప్పుడు ఏలీయా–ఒకనినైన తప్పించుకొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలీయా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను.౹ పిమ్మట ఏలీయా–విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీదపడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను.౹ తరువాత అతడు తన దాసుని పిలిచి–నీవు పైకిపోయి సముద్రమువైపు చూడుమనగా వాడు మెరకయెక్కి పార జూచి ఏమియు కనబడలేదనగా అతడు–ఇంక ఏడు మారులు పోయి చూడుమని చెప్పెను.౹ ఏడవ మారు అతడు చూచి–అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయా–నీవు అహాబు దగ్గరకు పోయి–నీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను.౹ అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను; మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్లిపోయెను.౹ యెహోవా హస్తము ఏలీయాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబుకంటె ముందుగా పరుగెత్తికొనిపోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. ఏలీయా చేసినదంతయును అతడు ఖడ్గముచేత ప్రవక్తలనందరిని చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను–రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక.౹ కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొని, లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి, యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి, అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణాపేక్షగలవాడై — యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను.౹ అతడు బదరీవృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి–నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను.౹ అతడు చూచినంతలో అతని తలదగ్గర నిప్పులమీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనముచేసితిరిగి పరుండెను.౹ అయితే యెహోవాదూత రెండవమారు వచ్చి అతని ముట్టి–నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనముచేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రిం బగళ్లు ప్రయాణముచేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక గుహలోచేరి బసచేసెను. యెహోవావాక్కు అతనికి ప్రత్యక్షమై— ఏలీయా, యిచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా అతడు–ఇశ్రాయేలువారు నీ నిబంధనను త్రోసి వేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషముగలవాడనై నేను ఒక డనుమాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడ తీసివేయుటకై చూచుచున్నారని మనవిచేసెను.౹ అందుకాయన–నీవు పోయి పర్వతముమీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నాభిన్నములాయెనుగాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెనుగాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు.౹ ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెనుగాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను.౹ ఏలీయా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో —ఏలీయా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని యొకడు పలికిన మాట అతనికి వినబడెను.౹ అందుకతడు–ఇశ్రాయేలువారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవాకొరకు మహారోషముగలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను.౹ అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చిన దేమనగా–నీవు మరలి అరణ్యమార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశముమీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము;౹ ఇశ్రాయేలు వారిమీద నింషీకుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము.౹ హజాయేలుయొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని యెహూ హతముచేయును; యెహూయొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని ఎలీషా హతము చేయును.౹ అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు.౹ ఏలీయా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేరబోయి తన దుప్పటి అతనిమీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలీయావెంట పరుగెత్తి–నేను పోయి నా తలి దండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబ డించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు–పోయి రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను.౹ అందుకతడు అతనిని విడిచి వెళ్లి కాడియెడ్లను తీసి, వధించి వాటిమాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డించెను. వారు భోజనముచేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను. తనయొద్ద గుఱ్ఱములను రథములను సమకూర్చుకొనిన ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియారాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దానిమీద యుద్ధము చేసెను.౹ అతడు పట్టణమందున్న ఇశ్రాయేలురాజైన అహాబునొద్దకు దూతలను పంపి –నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యముగలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారిచేత వర్తమానము తెలియజేసెను.౹ అందుకు ఇశ్రాయేలురాజు —నా యేలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవుప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశముననున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి–బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి–నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీయొద్దకు నా సేవకులను పంపియున్నాను.౹ రేపు ఈ వేళకు వారు నీ యింటిని నీ సేవకులయిండ్లను పరిశోధించుదురు; అప్పుడు నీ కంటికి ఏది యింపుగా నుండునో దానిని వారు చేతపట్టుకొని తీసికొని పోవుదురు.౹ కాగా ఇశ్రాయేలురాజు దేశపు పెద్దలనందరిని పిలువనంపించి–బెన్హదదు–నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు; ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలిసికొనుడనెను.౹ –నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలును జనులందరును అతనితో చెప్పిరి,౹ గనుక అతడు–మీరు రాజైన నా యేలినవానితో తెలియజెప్పవలసినదేమనగా— నీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చిపంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని, నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదునొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా బెన్హదదు మరల అతని యొద్దకు దూతలను పంపి–నాతోకూడ వచ్చిన వారందరును పిడికెడు ఎత్తికొని పోవుటకు షోమ్రోనుయొక్క ధూళి చాలినయెడల దేవతలు నాకు గొప్పఅపాయము కలుగజేయుదురు గాక అని వర్తమానము చేసెను.౹ అందుకు ఇశ్రాయేలురాజు–తన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దానివిప్పి తీసి వేసినవానివలె అతిశయపడకూడదని చెప్పుడనెను.౹ బెన్హదదును ఆ రాజులును గుడారములయందు విందు జరిగించుకొనుచుండగా, ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా ప్రవక్తయైన యొకడు ఇశ్రాయేలురాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను— యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే; నేను యెహోవానని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీచేతి కప్పగించెదను.౹ –ఇది యెవరిచేత జరుగునని అహాబు అడుగగా అతడు–రాజ్యాధిపతులలో ఉన్న యౌవనులచేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. —యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడుగగా అతడు–నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను.౹ వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్కచూడగా వారు రెండువందల ముప్పది ఇద్దరైరి. తరువాత జనులను, అనగా ఇశ్రాయేలు వారినందరిని లెక్కింపగా వారు ఏడువేలమందియైరి.౹ మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారు లైన ఆ ముప్పది ఇద్దరు రాజులును గుడారములలో త్రాగి మత్తులై యుండిరి.౹ రాజ్యాధిపతులలోనున్న ఆ యౌవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలిసికొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. —షోమ్రోనులోనుండి కొందరు వచ్చియున్నారని బంటులు తెలియజేయగా అతడు–వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయ వచ్చినను వారిని సజీవులుగా పట్టుకొనిరండని ఆజ్ఞాపించెను.౹ రాజ్యాధిపతులలోనున్న ఆ యౌవనులును వారితోకూడనున్నదండువారును పట్టణములోనుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలువారు వారిని తరుముచుండగా సిరియారాజైన బెన్హదదు గుఱ్ఱమెక్కి రౌతులతో గూడ తప్పించుకొని పోయెను.౹ అంతట ఇశ్రాయేలురాజు బయలుదేరి గుఱ్ఱములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను.౹ అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలురాజునొద్దకు వచ్చి–నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి యుండుము, ఏడాదినాటికి సిరియారాజు నీమీదికి మరల వచ్చునని అతనితో చెప్పెను. అయితే సిరియారాజు సేవకులు అతనితో ఈలాగు మనవి చేసిరి–వారి దేవతలు కొండదేవతలు గనుక వారు మనకంటె బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసినయెడల నిశ్చయముగా వారిని గెలుచుదుము.౹ ఇందుకు మీరు చేయవలసినదేమనగా, ఆ రాజులలో ఒక్కొక్కని వాని వాని ఆధిపత్యములోనుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును, గుఱ్ఱములకు గుఱ్ఱములను రథములకు రథములను లెక్కించి పోగు చేయుము; అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధము చేసినయెడల అవశ్యముగా మనము వారిని గెలుతుమని మనవిచేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆప్రకారము చేసెను.౹ కాబట్టి మరుసంవత్సరము బెన్హదదు సిరియనులను సమకూర్చి లెక్కచూచి బయలుదేరి పోయి ఇశ్రాయేలువారితో యుద్ధము చేయుటకై ఆఫెకునకు వచ్చెను.౹ ఇశ్రాయేలు వారందరును పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరిరి. ఇశ్రాయేలువారు మేకపిల్లల మందలు రెంటివలె వారియెదుట దిగియుండిరిగాని దేశము సిరియనులచేత కప్పబడి యుండెను.౹ అప్పుడు దైవజనుడైన యొకడు వచ్చి ఇశ్రాయేలురాజుతో ఇట్లనెను — యెహోవా సెలవిచ్చున దేమనగా–సిరియనులు యెహోవా కొండలకు దేవుడేగాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు; అయితే నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను.౹ వారు ఎదురుముఖములుగా ఏడుదినములు గుడారములు వేసికొని యుండిన తరువాత ఏడవ దినమందు యుద్ధమునకు కలిసికొనగా ఇశ్రాయేలువారు ఒక దినమందే సిరియనుల కాల్బలము లక్షమందిని హతము చేసిరి.౹ తక్కినవారు ఆఫెకు పట్టణములోనికి పారిపోగా అచ్చటనున్న యొక ప్రాకారము శేషించినవారిలో ఇరువదియేడు వేలమంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదులలో చొరగా అతని సేవకులు —ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైనయెడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్లు వేసికొని ఇశ్రాయేలురాజునొద్దకు పోవుదుము; అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మ తించెను.౹ కావునవారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్లు వేసికొని ఇశ్రాయేలురాజు నొద్దకు వచ్చి–నీ దాసుడైన బెన్హదదు–దయచేసి నన్ను బ్రదుకనిమ్మని మనవి చేయుటకై మమ్మును పంపెనని చెప్పగా అతడు–బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకను సజీవుడై యున్నాడా అని యడిగెను.౹ అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఏలాగున నున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటనుబట్టి— బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు–మీరు వెళ్లి అతనిని తోడుకొని రండనెను. బెన్హదదు తనయొద్దకు రాగా అతడు తన రథముమీద అతని ఎక్కించుకొనెను.౹ అంతట బెన్హదదు–తమ తండ్రి చేతిలోనుండి నా తండ్రి తీసికొనిన పట్టణములను నేను మరల అప్పగించెదను; మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకొనినట్లు దమస్కులో తమకొరకు తమరు వీధులను కట్టించు కొనవచ్చును అని అతనితో చెప్పగా అహాబు— ఈ ప్రకారముగా నీతో సంధిచేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధిచేసి అతని పోనిచ్చెను. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో–నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు–నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను. అతడు వెళ్లిపోగానే సింహమొకటి అతనికి ఎదురై అతనిని చంపెను.౹ తరువాత మరియొకడు అతనికి కనబడినప్పుడు అతడు–నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయ పరచెను.౹ అప్పుడు ఆ ప్రవక్త పోయి, కండ్లమీద పాగా కట్టుకొని మారు వేషము వేసికొని, మార్గమందు రాజుయొక్క రాకకై కనిపెట్టుకొని యుండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఈలాగు మనవి చేసికొనెను–నీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయియుండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నాయొద్దకు తోడుకొని వచ్చి యీ మనుష్యుని కనిపెట్టుము; ఏ విధముగానైనను వాడు తప్పించుకొనిపోయినయెడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణముపోవును; లేదా నీవు రెండు మణుగుల వెండిని ఇయ్యవలెననెను.౹ అయితే నీ దాసుడనైన నేను పనిమీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయెను. అప్పుడు ఇశ్రాయేలురాజు–నీకు నీవే తీర్పు తీర్చుకొంటివి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవియ్యగా అతడు త్వరపడి తన కండ్లమీది పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను.౹ అప్పుడు అతడు–యెహోవా సెలవిచ్చునదేమనగా–నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలోనుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులును అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇశ్రాయేలురాజు మూతి ముడుచుకొనినవాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోనురాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలువాడైన నాబోతునకు ఒక ద్రాక్షతోట కలిగియుండగా అహాబు నాబోతును పిలిపించి–నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని యున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైనయెడల దానిని క్రయమునకిమ్మని అడిగెను.౹ అందుకు నాబోతు–నా పిత్రార్జితమును నీ కిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా –నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పినదానినిబట్టి అహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచముమీద పరుండి యెవరితోను మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను.౹ అంతట అతని భార్యయైన యెజెబెలు వచ్చి–నీవు మూతి ముడుచుకొనినవాడవై భోజనము చేయక యుండెదవేమని అతని నడుగగా అతడు ఆమెతో ఇట్లనెను–నీ ద్రాక్షతోటను క్రయమునకు నాకిమ్ము; లేక నీకు అనుకూలమైనయెడల దానికి మారుగా మరియొక ద్రాక్షతోట నీకిచ్చెదనని, యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు–నా ద్రాక్షతోట నీకియ్యననెను.౹ అందు కతని భార్యయైన యెజెబెలు–ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుటలేదా? లేచి భోజనముచేసి మనస్సులో సంతోషముగా ఉండుము; నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించెదనని అతనితో చెప్పి అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను.౹ ఆ తాకీదులో వ్రాయించిన దేమనగా–ఉపవాసదినము జరుగవలెనని మీరు చాటించి నాబోతును జనులయెదుట నిలువబెట్టి –నీవు దేవునిని రాజును దూషించితివని అతనిమీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన యిద్దరు మనుష్యులను సిద్ధపరచుడి; తీర్పు అయినమీదట అతని బయటికి తీసికొనిపోయి రాళ్లతో చావగొట్టుడి.౹ అతని పట్టణపు పెద్దలును పట్టణమందు నివసించు సామంతులును యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి.౹ ఎట్లనగా వారు ఉపవాసదినము చాటించి నాబోతును జనుల యెదుట నిలువబెట్టిరి.౹ అప్పుడు పనికిమాలిన యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని యెదుట కూర్చుండి— నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతుమీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసికొనిపోయి రాళ్లతో చావగొట్టిరి.౹ నాబోతు రాతిదెబ్బలచేత మరణమాయెనని వారు యెజె బెలునకు వర్తమానము పంపగా నాబోతు రాతి దెబ్బలచేత మరణమాయెనని యెజెబెలు విని–నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లక పోయిన అతని ద్రాక్షతోటను స్వాధీనపరచుకొనుమని అహాబుతో చెప్పెను.౹ నాబోతు చనిపోయెనని అహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీన పరచుకొనబోయెను. అప్పుడు యెహోవావాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలురాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము, అతడు నాబోతుయొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు; అతడు దానిని స్వాధీనపరచు కొనబోయెను.౹ నీవు అతని చూచి యీలాగు ప్రకటించుము–యెహోవా సెలవిచ్చునదేమనగా–దీని స్వాధీన పరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా. యెహోవా సెలవిచ్చునదేమనగా–ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను.౹ అంతట అహాబు ఏలీయాను చూచి–నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా? అని పలుకగా ఏలీయా ఇట్లనెను— యెహోవా దృష్టికి కీడుచేయుటకు నిన్ను నీవే అమ్ముకొని యున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి.౹ అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను–నేను నీ మీదికి అపాయము రప్పించెదను; నీ సంతతివారిని నాశముచేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలో అహాబు పక్షమున ఎవరునులేకుండ పురుషులనందరిని నిర్మూలముచేతును.౹ ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ మరియు యెజెబెలునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగా — యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును.౹ పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును; బయటిభూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి కీడుచేయ తన్నుతాను అమ్ముకొనిన అహాబువంటివాడు ఎవ్వడును లేడు.౹ ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను.౹ అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి, గోనెపట్టమీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుటచేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండ ఆపి, అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికులమీదికి నేను దాని రప్పించెదను. సిరియనులును ఇశ్రాయేలువారును మూడు సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి.౹ మూడవ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలురాజునొద్దకు రాగా ఇశ్రాయేలురాజు తన సేవకులను పిలిపించి–రామోత్గిలాదు మనదని మీరెరుగుదురు; అయితే మనము సిరియా రాజు చేతిలోనుండి దాని తీసికొనక ఊరకున్నామని చెప్పి –యుద్ధము చేయుటకు నాతోకూడ నీవు రామోత్గిలాదునకు వచ్చెదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు–నేను నీవాడనే; నా జనులు నీ జనులే నా గుఱ్ఱములును నీ గుఱ్ఱములే అని ఇశ్రాయేలురాజుతో చెప్పెను.౹ పిమ్మట యెహోషాపాతు–నేడు యెహోవా యొద్ద విచారణచేయుదము రండని ఇశ్రాయేలురాజుతో అనగా ఇశ్రాయేలురాజు దాదాపు నాలుగు వందలమంది ప్రవక్తలను పిలిపించి–యుద్ధము చేయుటకు రామోత్గిలాదుమీదికి పోదునా పోకుందునా అని వారి నడిగెను. అందుకు–యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరిగాని యెహోషాపాతు–విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను.౹ అందుకు ఇశ్రాయేలురాజు–ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు; అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చును గాని, అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతు–రాజైన మీరు ఆలాగనవద్దనెను.౹ అప్పుడు ఇశ్రాయేలురాజు తన పరివారములో ఒకనిని పిలిచి–ఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను.౹ ఇశ్రాయేలురాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని, షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెలమీద ఆసీనులై యుండి, ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా కెనయనా కుమారుడైన సిద్కియా యినుప కొమ్ములు చేయించుకొని వచ్చి–వీటిచేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.౹ ప్రవక్తలందరును ఆ చొప్పుననే ప్రకటన చేయుచు— యెహోవా రామోత్గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి.౹ మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచిమాటలు పలుకుచు న్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా మీకాయా–యెహోవా నాకు సెలవిచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదుననెను.౹ అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు–మీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదుమీదికి పోదుమా పోకుందుమా అని యడుగగా అతడు–యెహోవా దానిని రాజవైన నీ చేతికి నప్పగించును గనుక నీవు దానిమీదికిపోయి జయమొందుదువని రాజుతో అనెను.౹ అందుకు రాజు–నీచేత ప్రమాణము చేయించి యెహోవా నామమునుబట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా అతడు–ఇశ్రాయేలీయులందరును కాపరిలేని గొఱ్ఱెలవలెనే కొండలమీద చెదరి యుండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు; ఎవరి యింటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను.౹ అప్పుడు ఇశ్రాయేలురాజు యెహోషాపాతును చూచి–ఇతడు నన్నుగూర్చి మేలుపలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా మీకాయా యిట్లనెను–యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనా సీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని –అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి.౹ అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి–నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా —ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.౹ అందుకతడు–నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన–నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.౹ యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.౹ మీకాయా యిట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి— నీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏవైపుగా పోయెనని చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను.౹ అందుకు మీకాయా–దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడునాడు అది నీకు తెలియ వచ్చునని అతనితో చెప్పెను.౹ అప్పుడు ఇశ్రాయేలురాజు–మీకాయాను పట్టుకొని తీసికొనిపోయి పట్టణపు అధికారియైన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషు నకును అప్పగించి –బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను.౹ అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను —సకలజనులారా, నా మాట ఆలకించుడని చెప్పెను–రాజువైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు. ఇశ్రాయేలురాజును యూదారాజగు యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా ఇశ్రాయేలురాజు–నేను మారువేషము వేసికొని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసికొని యుద్ధమందు ప్రవేశించెను.౹ సిరియారాజు తన రథములమీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి–అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడ వద్దు; ఇశ్రాయేలురాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా రథాధిపతులు యెహోషాపాతును చూచి — యితడే ఇశ్రాయేలు రాజనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలువేయగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజు కానట్టు గురుతుపెట్టి అతని తరుముట మానివేసిరి.౹ పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలురాజుకు కవచపుకీలుమధ్యను తగిలెను గనుక అతడు–నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములోనుండి నన్ను అవతలకు తీసికొని పొమ్మని తన సారధితో చెప్పెను.౹ నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల యెదుట అతని రథముమీద నిలువ బెట్టిరి; అస్తమయమందు అతడు మరణమాయెను; తగిలిన గాయములోనుండి అతని రక్తము కారి రథములో మడుగు గట్టెను.౹ సూర్యాస్తమయ సమయమందు దండువారందరు తమతమ పట్టణములకును దేశములకును వెళ్లి పోవచ్చునని ప్రచురమాయెను.౹ ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను.౹ వేశ్యలు స్నానముచేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను.౹ అహాబు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానంతటినిగూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటినిగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ అహాబు తన పితరులతోకూడ నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను. ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలురాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను.౹ యెహోషాపాతు ఏల నారంభించినప్పుడు అతడు ముప్పది యయిదేండ్లవాడై యెరూషలేములో యిరువదియైదేండ్లు ఏలెను; అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీకుమార్తెయైయుండెను.౹ అతడు తన తండ్రియైన ఆసాయొక్క మార్గములన్నిటి ననుసరించి, యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తిం చుచు వచ్చెను. అయితే ఉన్నతస్థలములను తీసివేయ లేదు; ఉన్నతస్థలములలో జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి.౹ యెహోషాపాతు ఇశ్రాయేలురాజుతో సంధిచేసెను.౹ యెహోషాపాతు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు కనుపరచిన బలమునుగూర్చియు, అతడు యుద్ధముచేసిన విధమునుగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ తన తండ్రియైన ఆసా దినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములోనుండి వెళ్లగొట్టెను.౹ ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను; ప్రధానియైన యొకడు రాజ్యపాలనముచేయుచుండెను.౹ యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరుదేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలై పోయెను.౹ అహాబు కుమారుడైన అహజ్యా–నా సేవకులను నీ సేవకులతోకూడ ఓడలమీద పోనిమ్మని యెహోషాపాతు నడుగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు.౹ పిమ్మట యెహోషాపాతు తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదుపురమందు తన పితరులతోకూడ పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయెను. అహాబు కుమారుడైన అహజ్యా యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి రెండు సంవ త్సరములు ఇశ్రాయేలును ఏలెను.౹ అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, తన తలిదండ్రులిద్దరి ప్రవర్తనను, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను.౹ అతడు బయలుదేవతను పూజిం చుచు, వానికి నమస్కారముచేయుచు, తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలువారిమీద తిరుగబడిరి.౹ అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియై–మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి–ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థ పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా యెహోవాదూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను–నీవులేచి షోమ్రోనురాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము–ఇశ్రాయేలువారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవెక్కిన మంచము మీదనుండి దిగిరాకుండ నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలీయా వారితో చెప్పి వెళ్లిపోయెను.౹ తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. —మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారి నడుగగా వారు–ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి–మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి— యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకు నీవు దూతలను పంపు చున్నావే; నీవెక్కిన మంచముమీద నుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా –మిమ్మును ఎదుర్కొనవచ్చి యీ మాట చెప్పినవాడు ఏలాటివాడని రాజు అడిగెను.౹ అందుకు వారు–అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనినవాడని ప్రత్యుత్తరమియ్యగా–ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను.౹ వెంటనే రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని యేబదిమందితోకూడ ఏలీయా యొద్దకు పంపెను. అతడు కొండమీద కూర్చుని యుండగా అధిపతి యెక్కి అతని సమీపమునకు పోయి–దైవజనుడా, నీవు దిగిరావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను.౹ అందుకు ఏలీయా— నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండిదిగి వానిని వాని యేబదిమందిని దహించెను.౹ మరల రాజు ఏబదిమందిమీద అధిపతియైన మరియొకనిని వాని యేబదిమందితోకూడ పంపగా వీడువచ్చి–దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను.౹ అందుకు ఏలీయా–నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశమునుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.౹ ఇంకను రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని ఏబదిమందితోకూడ పంపగా ఏబదిమంది మీద అధిపతియైన ఆ మూడవవాడు వచ్చి ఏలీయా యెదుట మోకాళ్లూని–దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీదాసులైన యీ యేబదిమంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము.౹ చిత్తగించుము; ఆకాశమునుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వానివాని యేబదిమందితోకూడ దహించెను; అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవిచేయగా యెహోవాదూత–వానికి భయపడక వానితోకూడ దిగిపొమ్మని ఏలీయాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి వానితోకూడ రాజునొద్దకు వచ్చెను.౹ అతడు వచ్చి రాజును చూచి–విచారణచేయుటకు ఇశ్రాయేలు వారిమధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకై దూతలను పంపితివే; నీవెక్కిన మంచముమీదనుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను.౹ ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాటప్రకారము అతడు చనిపోయెను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజాయెను.౹ అహజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీ షాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా ఏలీయా— యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా–యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి.౹ బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి–నేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు–నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను.౹ పిమ్మట ఏలీయా–ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి.౹ యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి–నేడు యెహోవా నీయొద్ద నుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు–నేనెరుగుదును మీరు ఊరకుండుడనెను.౹ అంతట ఏలీయా–యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు–యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్లిరి.౹ ప్రవక్తల శిష్యులలో ఏబదిమంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యొర్దానునదిదగ్గర నిలిచిరి.౹ అంతట ఏలీయా తన దుప్పటి తీసికొని మడత పెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయిరి.౹ వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి–నేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా–నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను.౹ అందుకతడు–నీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినయెడల ఆప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవునని చెప్పెను.౹ వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఎలీషా అది చూచి–నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని కేకలువేసెను; అంతలో ఏలీయా అతనికి మరల కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను.౹ మరియు ఏలీయా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసికొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టి–ఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను.౹ యెరికోదగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి–ఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లనిరి–ఇదిగో నీ దాసులమైన మా యొద్ద ఏబదిమంది బలముగలవారున్నారు; మా మీద దయయుంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము; యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక పర్వతము మీదనైనను లోయయందైనను వేసియుండునేమో అని మనవిచేయగా అతడు–ఎవరిని పంపవద్దనెను.౹ అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు ఏబదిమందిని పంపిరి. వీరు వెళ్లి మూడుదినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను.౹ వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషాయొద్దకు తిరిగి రాగా అతడు–వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. అంతట ఆ పట్టణపువారు–ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నదిగాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సా రమై యున్నదని ఎలీషాతో అనగా అతడు–క్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, — యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ నీటిని నేను బాగుచేసియున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.౹ కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది. అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చి —బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యముచేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమునుబట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చి వేసెను.౹ అతడు అచ్చటనుండి పోయి కర్మెలు పర్వతమునకు వచ్చి అచ్చటనుండి పోయి షోమ్రోనునకు తిరిగివచ్చెను. అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను.౹ ఇతడు తన తలి దండ్రులు చేసిన ప్రకారము చేయక, తన తండ్రి నిలిపిన బయలుదేవతాస్తంభమును తీసివేసెనుగాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను. మోయాబు రాజైన మేషా అనేకమైన మందలుగల వాడై లక్ష గొఱ్ఱెపిల్లలను బొచ్చుగల లక్ష గొఱ్ఱెపొట్టేళ్లను ఇశ్రాయేలురాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు.౹ అయితే అహాబు మరణమైన తరువాత మోయాబురాజు ఇశ్రాయేలురాజుమీద తిరుగుబాటుచేయగా యెహోరాము షోమ్రోనులోనుండి బయలుదేరి ఇశ్రాయేలువారినందరిని సమకూర్చెను.౹ యూదారాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి–మోయాబురాజు నామీద తిరుగుబాటు చేసియున్నాడు; నీవు వచ్చి నాతోకూడ మోయాబీయులతో యుద్ధము చేసెదవా అని యడుగగా అతడు–నేను నీవాడనైయున్నాను, నా జనులు నీ జనులే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే; నేను బయలుదేరి వచ్చెదనని ప్రత్యుత్తరమిచ్చెను.౹ –మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడు–ఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను.౹ ఇశ్రాయేలురాజును యూదారాజును ఎదోమురాజును బయలుదేరి యేడు దినములు చుట్టు తిరిగిన తరువాత, వారితోకూడనున్నదండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను.౹ ఇశ్రాయేలురాజు–కటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా యెహోషాపాతు–అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణచేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని యడిగెను. అంతట ఇశ్రాయేలురాజు సేవకులలో ఒకడు–ఏలీయా చేతులమీద నీళ్లుపోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు —యెహోవా ఆజ్ఞ యితనిద్వారా మనకు దొరుకుననెను. ఇశ్రాయేలురాజును యెహోషాపాతును ఎదోమురాజును అతని యొద్దకుపోగా ఎలీషా ఇశ్రాయేలురాజును చూచి–నాతో నీకు నిమిత్తమేమి? నీ తలిదండ్రులుంచుకొనిన ప్రవక్తలయొద్దకు పొమ్మని చెప్పెను. —ఆలాగనవద్దు, మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా, రాజులమైన మాముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలురాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను–ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయనియెడల నిన్ను చూచుట కైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును.౹ నాయొద్దకు వీణె వాయించగల యొకనిని తీసికొనిరమ్ము. వాద్యకు డొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను.౹ — యెహోవా సెలవిచ్చినదేమనగా — ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి;౹ యెహోవా సెలవిచ్చునదేమనగా–గాలియేగాని వర్షమేగాని రాక పోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును.౹ ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును.౹ మీరు ప్రాకారములుగల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి, మంచి చెట్లనెల్ల నరికి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను.౹ ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను.౹ తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని, అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరిని సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి.౹ ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా, అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తమువలె కనబడెను గనుక వారు–అది రక్తము సుమా; రాజులు ఒకరినొకరు హతము చేసికొని నిజముగా హతులైరి; మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి.౹ వారు ఇశ్రాయేలువారి దండుదగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారియెదుట నిలువలేక పారిపోయిరి; ఇశ్రాయేలీయులు వారి దేశములో చొరబడి మోయాబీయులను హతము చేసిరి.౹ మరియు వారు పట్టణములను పడగొట్టి, సమస్తమైన మంచి భూభాగములమీదను తలయొక రాయి వేసి నింపి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, మంచి చెట్లన్నిటిని నరికివేసిరి. కీర్హరెశెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచి యుండెనుగాని వడిసెలలు విసరువారు దాని చుట్టుకొని రాళ్లు విసరుచు వచ్చిరి.౹ మోయాబురాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తిదూయు ఏడువందలమందిని ఏర్పరచుకొని, ఎదోమురాజునొద్దకు తీసికొని పోవుటకు యత్నించెనుగాని అది వారివలన కాకపోయెను.౹ అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠకుమారుని తీసికొని, పట్టణపు ప్రాకారముమీద దహనబలిగా అర్పింపగా ఇశ్రాయేలువారిమీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య–నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవాయందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనిపోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా ఎలీషా–నా వలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియ జెప్పుమనెను. అందుకామె–నీ దాసురాలనైన నా యింటిలో నూనెకుండ యొకటి యున్నది; అది తప్ప మరేమియు లేదనెను.౹ అతడు–నీవు బయటికి పోయి, నీ యిరుగు పొరుగు వారందరియొద్ద దొరుకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరవు పుచ్చుకొనుము;౹ అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపలనుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొకతట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా ఆమె అతని యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను.౹ పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు–మరేమియు లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచి పోయెను.౹ ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు–నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ–భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనముచేయుచువచ్చెను.౹ కాగా ఆమె తన పెనిమిటిని చూచి–మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును.౹ కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పు డెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను.౹ ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను.౹ పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి–ఈ షూనేమీయురాలిని పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు అతడు–నీవు ఇంత శ్రద్ధా భక్తులు మాయందు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్నుగూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆప్రకారము ఆమెతో అనెను. అందుకామె–నేను నా స్వజనులలో కాపురమున్నాననెను.౹ ఎలీషా–ఆమె నేనేమి చేయకోరుచున్నదని వానినడుగగా గేహజీ–ఆమెకు కుమారుడు లేడు; మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను.౹ అందుకతడు–ఆమెను పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా —మరుసటియేట ఈ రుతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని–దైవజనుడవైన నా యేలినవాడా, ఆలాగు పలుకవద్దు; నీ దాసురాల నైన నాతో అబద్ధమాడవద్దనెను.౹ పిమ్మట ఆ స్త్రీ గర్భవతియై మరుసటియేట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను.౹ ఆ బిడ్డ యెదిగిన తరువాత ఒకనాడు కోత కోయువారియొద్దనున్న తన తండ్రి దగ్గరకుపోయి అక్కడ ఉండగా వాడు–నా తలపోయెనే నా తల పోయెనే, అని తన తండ్రితో చెప్పెను.౹ అతడు వానిని ఎత్తుకొని తల్లియొద్దకు తీసికొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తికొని వాని తల్లియొద్దకు తీసికొనిపోయెను. పిల్లవాడు మధ్యాహ్నమువరకు తల్లి తొడమీద పండుకొని యుండి చనిపోయెను.౹ అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచముమీద పెట్టి తలుపువేసి బయటికి వచ్చి –ఒక పనివానిని ఒక గాడిదను నాయొద్దకు పంపుము; నేను దైవజనునియొద్దకు పోయి వచ్చెదనని తన పెనిమిటితో ఆమె యనగా అతడు–నేడు అమావాస్య కాదే; విశ్రాంతిదినముకాదే; అతనియొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమె–నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంతకట్టించి తాను ఎక్కి తన పని వానితో–శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనేగాని నిమ్మళముగా తోలవద్దనెను.౹ ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనునియొద్దకు వచ్చెను. దైవజనుడు దూరమునుండి ఆమెను చూచి— అదిగో ఆ షూనేమీయురాలు;౹ నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి–నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకామె— సుఖముగా ఉన్నామని చెప్పెను.౹ పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనునియొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టుకొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు — ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను; ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను.౹ అప్పుడు ఆమె–కుమారుడు కావలెనని నేను నా యేలిన వాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా? అని అతనితో మనవిచేయగా అతడు–నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము; ఎవరైనను నీకు ఎదురుపడినయెడల వారికి నమస్కరింపవద్దు; ఎవరైనను నీకు నమస్కరించినయెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖముమీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను.౹ తల్లి ఆ మాట విని–యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతోకూడ పోయెను.౹ గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెనుగాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి — బాలుడు మేలుకొనలేదని చెప్పెను.౹ ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడి యుండుట చూచి తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి మంచముమీద ఎక్కి బిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటిమీదను తన కండ్లు వాని కండ్లమీదను తన చేతులు వాని చేతులమీదను ఉంచి, బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను.౹ తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను.౹ అప్పుడతడు గేహజీని పిలిచి–ఆ షూనేమీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతనియొద్దకు రాగా అతడు–నీ కుమారుని ఎత్తికొనుమని ఆమెతో చెప్పెను.౹ అంతట ఆమె లోప లికివచ్చి అతని కాళ్లమీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తికొనిపోయెను. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి యుండగా అతడు తన పనివానిని పిలిచి —పెద్దకుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటచేయుమని సెలవిచ్చెను.౹ అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొని వచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను.౹ తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి —దైవజనుడా,కుండలో విషమున్నదని కేకలువేసి దానిని తినక మానిరి.౹ అతడు–పిండి కొంత తెమ్మనెను. వారు తేగా–కుండలో దాని వేసి, జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగాకుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. మరియు ఒకడు బయల్షాలిషానుండి మొదటి పంట బాపతు యవలపిండితో చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసికొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను.౹ అయితే అతని పనివాడు–నూరుమందికి వడ్డించుటకు ఇవి యెంతవని చెప్పగా అతడు–వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను.౹ పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. సిరియారాజు సైన్యాధిపతియైన నయమాను అను నొక డుండెను. అతనిచేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలియైయుండెనుగాని అతడు కుష్ఠరోగి.౹ సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలుదేశముమీదికి పోయి యుండిరి. వారచ్చటనుండి యొక చిన్నదాని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను.౹ అది–షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను.౹ నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు–నేను ఇశ్రాయేలురాజునకు దూతచేత పత్రిక పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు ఇరువది మణుగుల వెండియు లక్ష యిరువది వేల రూపాయిల బంగారును పది దుస్తుల బట్టలను తీసికొనిపోయి ఇశ్రాయేలురాజునకు పత్రికను అప్పగించెను.౹ ఆ పత్రికలో ఉన్న సంగతి యేదనగా–నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగుచేయవలెనని యీ పత్రి కను అతనిచేత నీకు పంపించియున్నాను.౹ ఇశ్రాయేలురాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని— చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నాయొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను.౹ ఇశ్రాయేలురాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు–నీ వస్త్రములు నీ వెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను.౹ నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారము ముందర నిలిచియుండగా ఎలీషా–నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను.౹ అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను–అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, తన దేవుడైన యెహోవా నామమునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని.౹ దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలుదేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను.౹ అయితే అతని దాసులలో ఒకడు వచ్చి–నాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయకుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులుమునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.౹ అప్పుడతడు తన పరివారముతోకూడ దైవజనునిదగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచి–చిత్తగించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగుదును; ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసికొనవలసినదని అతనితో చెప్పగా ఎలీషా —ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియు తీసి కొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతి మాలినను అతడు ఒప్పక పోయెను.౹ అప్పుడు–యెహోవాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను; రెండు కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించ కూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతిమీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారముచేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా ఎలీషా–నెమ్మదిగలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషాయొద్దనుండి వెళ్లి కొంత దూరము సాగిపోయెను. అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ— సిరియనుడైన యీ నయమాను తీసికొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని, యెహోవా జీవముతోడు నేను పరుగెత్తికొనిపోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందుననుకొని నయమానును కలిసికొనుటకై పోవుచుండగా, నయమాను తన వెనుకనుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథముమీదనుండి దిగి వానిని ఎదుర్కొని— క్షేమమా అని అడిగెను. అతడు–క్షేమమే అని చెప్పి –నా యజమానుడు నాచేత వర్తమానము పంపి–ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను.౹ అందుకు నయమాను–నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి, తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొనిపోయిరి.౹ మెట్లదగ్గరకు వారు రాగానే వారి యొద్దనుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి.౹ అతడు లోపలికి పోయి తన యజమానుని ముందరనిలువగా ఎలీషా వానిని చూచి–గేహజీ, నీవెచ్చటనుండి వచ్చితివని అడిగినందుకు వాడు–నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలే దనెను.౹ అంతట ఎలీషా వానితో–ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుటనుండి బయటికి వెళ్లెను. అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి— ఇదిగో నీయొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది;౹ నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలయొక మ్రాను అచ్చటనుండి తెచ్చుకొని మరియొకచోట నివా సము కట్టుకొందుమని మనవిచేయగా అతడు–వెళ్లుడని ప్రత్యుత్తరమిచ్చెను.౹ ఒకడు–దయచేసి నీ దాసులమైన మాతోకూడ నీవు రావలెనని కోరగా అతడు–నేను వచ్చెదనని చెప్పి వారితోకూడ పోయెను; వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి.౹ ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి పోగా వాడు–అయ్యో నా యేలినవాడా, అది యెరవు తెచ్చినదని మొఱ్ఱపెట్టెను గనుక ఆ దైవజనుడు— అదెక్కడపడెనని అడిగెను; వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను.౹ అతడు–దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. సిరియారాజు ఇశ్రాయేలుతో యుద్ధముచేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచనచేసి–ఫలానిస్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను.౹ అయితే ఆ దైవ జనుడు ఇశ్రాయేలురాజునకు వర్తమానము పంపి–ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి యున్నారని తెలియజేసెను గనుక ఇశ్రాయేలురాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరికచేసిన స్థలమునకు పంపి సంగతి తెలిసికొని తనవారిని రక్షించుకొనెను. ఈలాగు మాటిమాటికి జరుగుచు వచ్చినందున సిరియారాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి–మనలో ఇశ్రాయేలురాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్ప రాదా అని వారి నడుగగా అతని సేవకులలో ఒకడు— రాజవైన నా యేలినవాడా, ఇశ్రాయేలురాజు పక్షమున ఎవరును లేరుగాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలురాజునకు తెలియజేయుననెను.౹ అందుకు రాజు–మేము మనుష్యులను పంపి అతని తెప్పించునట్లు నీవు వెళ్లి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవియ్యగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను.౹ కాబట్టి రాజు అచ్చటికి గుఱ్ఱములను రథములను గొప్పసైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చి నప్పుడు గుఱ్ఱములును రథములునుగల సైన్యము పట్టణమును చుట్టుకొని యుండుట కనబడెను. అంతట అతని పనివాడు–అయ్యో నా యేలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా అతడు–భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పి –యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.౹ ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా–ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషాచేసిన ప్రార్థనచొప్పున వారిని అంధత్వముతో మొత్తెను.౹ అప్పుడు ఎలీషా–ఇది మార్గముకాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చినయెడల మీరు వెదకువానియొద్దకు మిమ్మును తీసికొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను.౹ వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు–యెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థనచేయగా యెహోవావారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి.౹ అంతట ఇశ్రాయేలురాజు వారిని పారజూచి–నాయనా వీరిని కొట్టుదునా, కొట్టుదునా? అని ఎలీషాను అడుగగా అతడు–నీవు వీరిని కొట్టవద్దు; నీ కత్తిచేతను నీ వింటిచేతను నీవు చెరపెట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారుతిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్లుదురని చెప్పెను.౹ అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవుపొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటినుండి సిరియనులదండువారు ఇశ్రాయేలుదేశములోనికి వచ్చుట మానిపోయెను. అటుతరువాత సిరియారాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను.౹ అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి యుండగా గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును, అరపావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మ బడెను; వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి.౹ అంతట ఇశ్రాయేలురాజు పట్టణపు ప్రాకారముమీద సంచారముచేయగా ఒక స్త్రీ రాజును చూచి–రాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని –యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్లములోనుండి యైనను ద్రాక్షగానుగలోనుండియైనను దేనినైనను ఇచ్చి సహాయముచేయ వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమనియడుగగా అది–ఈ స్త్రీ నన్ను చూచి— నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంటచేసికొని తింటిమి. అయితే మరునాటియందు నేను దాని చూచి–నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితినిగాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను.౹ రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని యింక ప్రాకారముమీద నడిచి పోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను.౹ తరువాత రాజు–షాపాతు కుమారుడైన ఎలీషాయొక్క తల యీ దినమున అతనిపైన నిలిచియున్నయెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక అనెను.౹ అయితే ఎలీషా తన యింట కూర్చునియుండగా పెద్దలును అతనితోకూడ కూర్చుండి యున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడినవాడు ఎలీషాదగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి–ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టియుండి, ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండ తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసి వేయుడి; వాని యజమానుని కాళ్లచప్పుడు వానివెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతనియొద్దకు వచ్చెను. అంతట రాజు–ఈ కీడు యెహోవా వలననైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి యుండవలెననెను. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను–యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా— రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.౹ అందుకు ఎవరిచేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి–యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు— నీవు కన్నులార దానిని చూచెదవుగాని దానిని తినకుందు వని అతనితో చెప్పెను. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగు లుండగా వారు ఒకరినొకరు చూచి–మనము చచ్చిపోవువరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదమనుకొంటిమా పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము; ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము; పదండి, సిరియనులదండుపేట లోనికి, పోవుదము రండి, వారు మనలను బ్రదుకనిచ్చిన బ్రదుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని సందెచీకటియందు సిరియనులదండు పేటలోనికి పోవలెనని లేచి, సిరియనులదండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడక పోయిరి.౹ యెహోవా రథముల ధ్వనియు గుఱ్ఱముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనులదండునకు వినబడునట్లుచేయగా వారు–మనమీదికి వచ్చుటకై ఇశ్రాయేలురాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చియున్నాడని సిరియనులు ఒకరితో నొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుఱ్ఱములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్నవాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని, సందె చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయియుండిరి.౹ కాబట్టి ఆ కుష్ఠ రోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి యొక గుడారము జొచ్చి భోజనపానములుచేసి, అచ్చటనుండి వెండి బంగారములను బట్టలను ఎత్తికొనిపోయి దాచిపెట్టి, తిరిగి వచ్చి మరియొక గుడారము జొచ్చి అచ్చటనుండి సొమ్ము ఎత్తికొనిపోయి దాచిపెట్టిరి.౹ వారు–మనము చేయునది మంచి పనికాదు, నేటిదినము శుభవర్తమానముగల దినము, మనము ఊరకొననేల? తెల్లవారువరకు మనము ఇచ్చటనుండినయెడల ఏదైన నొక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి–మేము సిరియనులదండుపేటకు పోతిమి. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైననులేదు. కట్టబడిన గుఱ్ఱములును కట్టబడిన గాడిదలును ఉన్నవిగాని గుడారముల దగ్గర ఎవరును లేరని వానితో అనగా వాడు ద్వారపాల కుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటివారితో ఆ సమాచారము తెలియజెప్పగా రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి–సిరియనులు మనకు చేసినదానిని నేను మీకు చూపింతును; మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనుక–వారు పట్టణములోనుండి బయటకు వచ్చినయెడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచనచేసి, పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను.౹ అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవిచేసెను–ఇంతకుముందు ఇశ్రాయేలువారలలో బహు మంది మనుష్యులు లయమై పోయిరి గదా ఇక అయిదు గురు లయమై పోవుట అబ్బురమా? నీకు అనుకూలమైనయెడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో అయిదు గురిని తీసికొని పోనిమ్ము; మనము వారిని పంపి చూచెదమని చెప్పెను.౹ వారు జోడు రథములను వాటి గుఱ్ఱములను తీసికొనగా–సిరియనుల సైన్యమువెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను.౹ కాబట్టి వారు వారివెనుక యొర్దాను నదివరకు పోయి, సిరియనులు తొందరగా పోవుచు, పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి, ఆ దూతలు తిరిగివచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియనులదండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాటచొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను.౹ ఎవని చేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవ జనునియొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పినప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడుచేత అతడు మరణమాయెను.౹ మరియు–రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్ననిపిండియు, రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను.౹ ఆ యధిపతి–యెహోవా ఆకాశమందు కిటి కీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు–నీవు కన్నులార చూచెదవుగాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పెను.౹ జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. ఒకనాడు ఎలీషా తాను బ్రదికించిన బిడ్డకు తల్లియైన ఆమెను పిలిచి–యెహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు; ఏడు సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి–నీవు లేచి, నీవును నీ యింటివారును ఎచ్చటనుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాటచొప్పున చేసి, తన యింటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి యేడు సంవత్సరములు అక్కడ వాసముచేసెను.౹ అయితే ఆ యేడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములోనుండి వచ్చి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను.౹ రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాటలాడి–ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి యుండెను.౹ అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రదికించిన బిడ్డ తల్లి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవిచేయ వచ్చెను. అంతట గేహజీ–నా యేలినవాడ వైన రాజా ఆ స్త్రీ యిదే; మరియు ఎలీషా తిరిగి బ్రదికించిన యీమెబిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటినుండి నేటివరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చెను. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియారాజైన బెన్హదదు రోగియైయుండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలిసికొని హజాయేలును పిలిచి–నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొన బోయి–ఈ రోగముపోయి నేను బాగుపడుదునా లేదా అని అతనిద్వారా యెహోవాయొద్ద విచారణ చేయుమని ఆజ్ఞ ఇచ్చిపంపెను.౹ కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసికొని అతనిని ఎదుర్కొన బోయి అతని ముందర నిలిచి–నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు–నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపె నని చెప్పెను.౹ అప్పుడు ఎలీషా–నీవు అతని యొద్దకు పోయి–నిశ్చయముగా నీకు స్వస్థతకలుగవచ్చుననిచెప్పుము. అయినప్పటికిని అతనికి అవశ్యముగ మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసెనని పలికి హజాయేలు ముఖము చిన్నబోవునంతవరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను.౹ హజాయేలు–నా యేలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని నడుగగా ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెను–ఇశ్రాయేలువారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు; వారి యౌవనస్థులను కత్తిచేత హతము చేయుదువు; వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు; వారి గర్భిణుల కడుపులను చింపి వేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగియుండుటచేత కన్నీళ్లు రాల్చుచున్నాను.౹ అందుకు హజాయేలు–కుక్కవంటివాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా–నీవు సిరియామీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచియున్నాడనెను.౹ అతడు ఎలీషాను విడిచి వెళ్లి తన యజమానుని యొద్దకు రాగా అతడు–ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడు— నిజముగా నీవు బాగుపడుదువని అతడు చెప్పెననెను.౹ అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసికొని నీటిలో ముంచి రాజు ముఖముమీద పరచగా అతడు చచ్చెను; అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను. అహాబు కుమారుడును ఇశ్రాయేలువారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో అయిదవ సంవత్సరమందు యెహోషాపాతు యూదారాజై యుండగా యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏల నారంభించెను.౹ అతడు ఏల నారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడైయుండి యెరూషలేమందు ఎనిమిది సంవ త్సరములు ఏలెను.౹ ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసికొని యుండెను గనుక అహాబు కుటుంబికులవలెనే ఇతడును ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹ అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట యిచ్చి యుండెను గనుక అతని జ్ఞాపకముచేత యూదాను నశింప జేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను.౹ ఇతని దినములలో ఎదోమీయులు యూదారాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున యెహోరాము తన రథములన్నిటిని తీసికొనిపోయి జాయీరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టునున్న ఎదో మీయులను రథములమీది అధిపతులను హతముచేయగా జనులు తమతమ గుడారములకు పారిపోయిరి.౹ అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదావారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగబడెను.౹ యెహోరాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹ యెహోరాము తన పితరులతోకూడ నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.౹ అహాబు కుమారుడును ఇశ్రాయేలురాజునైన యెహోరాము ఏలు బడిలో పండ్రెండవ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా యేలనారంభించెను.౹ అహజ్యా యేలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడైయుండి యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను. అతని తల్లిపేరు అతల్యా; ఈమె ఇశ్రాయేలురాజైన ఒమ్రీ కుమార్తె.౹ అతడు అహాబు కుటుంబికుల ప్రవర్తనను అనుసరించుచు, వారివలెనే యెహోవా దృష్టికి చెడు తనము జరిగించెను; అతడు అహాబు ఇంటివారికి అల్లుడు.౹ అతడు అహాబు కుమారుడైన యెహోరాముతోకూడ రామోత్గిలాదునందు సిరియారాజైన హజాయేలుతో యుద్ధముచేయ బయలుదేరగా సిరియనులు యెహోరామును గాయపరచిరి.౹ రాజైన యెహోరాము సిరియారాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనులవలన తాను పొందిన గాయములను బాగుచేసికొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగియాయెనని తెలిసికొని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను. అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెను–నీవు నడుము బిగించుకొని యీ తైలపుగిన్నె చేతపట్టుకొని రామో త్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెక్కడ నున్నాడని తెలిసికొని అతనిని దర్శించి, అతని సహోదరులమధ్యనుండి అతనిని చాటుగా రప్పించి, లోపలి గదిలోకి అతనిని పిలుచుకొనిపోయి తైలపుగిన్నె తీసికొని అతని తలమీద తైలము పోసి–నేను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపుతీసి పారి పొమ్ము.౹ యౌవనుడైన ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చునప్పటికి సైన్యాధిపతులు కూర్చుని యుండిరి.౹ అప్పుడతడు–అధిపతీ, నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా యెహూ–యిందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు–అధిపతీ నిన్నుగూర్చినదే యనెను; అందుకు యెహూ లేచి యింటిలో ప్రవేశించెను.౹ అప్పుడు ఆ యౌవనుడు అతని తలమీద తైలము పోసి అతనితో ఇట్లనెను–ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–యెహోవా జనులైన ఇశ్రాయేలు వారిమీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను.౹ కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసినదానినిబట్టియు, యెహోవా సేవకులందరిని హతము చేసిన దానినిబట్టియు, యెజెబెలునకు ప్రతికారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతివారిని హతముచేయుము.౹ అహాబు సంతతివారందరును నశింతురు; అల్పులలోనేమి ఘనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండ అందరిని నిర్మూలము చేయుము.౹ నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబికులను అహీయా కుమారుడైన బయెషా కుటుంబికులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబికులను నేను అప్పగించుదును.౹ యెజెబెలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కలచేత తినివేయబడును. ఆ యౌవనుడు ఈ మాటలు చెప్పి తలుపుతీసి పారిపోయెను.౹ యెహూ బయలుదేరి తన యజమానుని సేవకులయొద్దకు రాగా ఒకడు–ఏమి సంభవించినది? ఆ వెఱ్ఱివాడు నీయొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా, అతడు–వానిని వాని మాటలు మీరెరిగే యున్నారని చెప్పెను.౹ కాబట్టి వారు–అదంతయు వట్టిది; జరిగినదానిని మాకు తెలియజెప్పుమనగా అతడిట్లనెను— నను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను.౹ అంతట వారు అతివేగిరముగా తమతమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతని క్రింద పరచి బాకా ఊదించి–యెహూ రాజైయున్నాడని చాటించిరి.౹ ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాముమీద కుట్రచేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలువారందరును సిరియారాజైన హజాయేలును ఎదిరించుటకై రామో త్గిలాదు దగ్గర కావలియుండిరి.౹ అయితే యెహోరాము సిరియారాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనులవలన తాను పొందిన గాయములను బాగు చేసి కొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతట యెహూ–నీకనుకూలమైతే ఈ సంగతి తెలియ బడకుండునట్లు ఈ పట్టణములోనుండి యెవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనియ్యకుమని ఆజ్ఞ ఇచ్చి రథముయెక్కి, యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పెట్టియుండగా అచ్చటికి పోయెను మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చి యుండెను.౹ యెజ్రెయేలు గోపురముమీద కావలివాడు నిలిచి యుండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి–సైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి–వారిని ఎదుర్కొనబోయి–సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమని వానితో సెలవిచ్చెను.౹ కాబట్టి యొకడు గుఱ్ఱమెక్కిపోయి అతనిని ఎదుర్కొని — సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ–సమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు–పంపబడినవాడు వారిని కలిసికొనెనుగాని తిరిగి రాక నిలిచెనని సమాచారము తెలిపెను.౹ రాజు రెండవ రౌతును పంపగా వాడు వారియొద్దకు వచ్చి–సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ–సమాధానముతో నీకేమి పని? నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను.౹ అప్పుడు కావలివాడు–వీడును వారిని కలిసికొని తిరిగిరాక నిలిచెను మరియు అతడు వెఱ్ఱి తోలడము తోలుచున్నాడు గనుక అది నింషీకుమారుడైన యెహూ తోలడమువలెనే యున్న దనెను.౹ –రథము సిద్ధముచేయుమని యెహోరాము సెలవియ్యగా వారు అతని రథము సిద్ధముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోరామును యూదారాజైన అహజ్యాయును తమతమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి.౹ అంతట యెహోరాము యెహూను చూచి–యెహూ సమాధానమా? అని అడుగగా యెహూ–నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమాధాన మెక్కడనుండి వచ్చుననెను.౹ యెహోరాము రథము త్రిప్పి–అహజ్యా, ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను.౹ అప్పుడు యెహూ తన బలముకొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజములమధ్య కొట్టగా బాణము అతని గుండెగుండ దూసి పోయెను గనుక అతడు తన రథమునందే యొరిగెను.౹ కాగా యెహూ తన అధిపతియైన బిద్కరును పిలిచి యిట్లనెను–అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము; మనమిద్దరమును అతని తండ్రియైన అహాబు వెనుక గుఱ్ఱములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతనిమీద ఈ శిక్షమోపిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.౹ అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతికారము చేయుదును; ఇదే యెహోవా వాక్కు కాబట్టి నీవు యెహోవా మాటచొప్పున అతని ఎత్తి యీ భూభాగమందు పడవేయుము అనెను.౹ యూదారాజైన అహజ్యా జరిగిన దాని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను; అయినను యెహూ అతని తరిమి, రథమునందు అతని హతముచేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను.౹ అప్పుడు అతని సేవకులు అతనిని రథముమీద వేసి యెరూషలేమునకు తీసికొనిపోయి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి. అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము ఏలు బడిలో పదకొండవ సంవత్సరమందు యూదాను ఏల నారంభించెను. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజె బెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసికొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోనుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మముద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి–నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తలయెత్తి కిటికీతట్టు చూచి–నా పక్షమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచిరి.౹ –దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడమీదను గుఱ్ఱములమీదను చిందెను. మరియు గుఱ్ఱములచేత అతడు దానిని త్రొక్కించెను.౹ అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత–ఆ శాపగ్రస్తు రాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దానిని పాతిపెట్ట బోయిరి; అయితే దాని కపాలమును పాదములును అర చేతులును తప్ప మరి ఏమియు కనబడలేదు.౹ వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను —ఇది యెజెబెలని యెవరును గుర్తుపట్టలేకుండ యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును.౹ యెజెబెలుయొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగ మందున్న పెంటవలెనుండును అని తన సేవకుడును తిష్బీ యుడునగు ఏలీయాద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున యిది జరిగెను. షోమ్రోనులో అహాబునకు డెబ్బదిమంది కుమారు లుండిరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులోనుండు యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచినవారికిని పంపి ఆజ్ఞ ఇచ్చిన దేమనగా–మీ యజమానుని కుమారులు మీయొద్ద నున్నారు;౹ మరియు మీకు రథములును గుఱ్ఱములును ప్రాకారముగల పట్టణమును ఆయుధ సామగ్రియును కలవు గదా కాబట్టి యీ తాకీదు మీకు ముట్టినవెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన యొకని కోరుకొని, తన తండ్రి సింహాసనముమీద అతనిని ఆసీనునిగా చేసి, మీ యజమానుని కుటుంబికుల పక్షమున యుద్ధమాడుడి.౹ వారు ఇది విని బహు భయపడి–ఇద్దరు రాజులు అతనిముందర నిలువజాలక పోయిరే, మనమెట్లు నిలువగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలును పిల్లలను పెంచినవారును కూడి యెహూకు వర్తమానము పంపి–మేము నీ దాసులము; నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించెదము; మేము ఎవనిని రాజుగా చేసికొనము; నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుమని తెలియజేసిరి.౹ అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి–మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనినయెడల మీ యజమానుని కుమారుల తలలను తీసికొని, రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నాయొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. డెబ్బదిమంది రాజకుమారులును వారిని పెంచిన పట్టణపు పెద్దలయొద్ద ఉండిరి.౹ కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బదిమంది రాజకుమారులను పట్టుకొని చంపి, వారి తలలను గంపలలో పెట్టి, యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపిరి.౹ దూత అతనియొద్దకు వచ్చి–రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు–ఉదయమువరకు ద్వారము బయటిస్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడనెను.౹ ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి, జనులందరిని చూచి–మీరు నిర్దోషులు, నేను నా యజమానునిమీద కుట్రచేసి అతని చంపితిని; అయితే వీరందరిని ఎవరు చంపిరి? అహాబు కుటుంబికులనుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరక పోదు; తన సేవకుడైన ఏలీయాద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పెను.౹ ఈ ప్రకారము యెహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబికులందరిని, అతని సంబంధులగు గొప్పవారినందరిని అతని బంధువులనందరిని, అతడు నియమించిన యాజకులను హతముచేసెను; అతనికి ఒకనినైనను ఉండనియ్యలేదు.౹ అప్పుడతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గమందు అతడు గొఱ్ఱెవెండ్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి యూదారాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని— మీరు ఎవరని వారి నడుగగా వారు–మేము అహజ్యా సహోదరులము; రాజకుమారులను రాణికుమారులను దర్శించుటకు వెళ్లుచున్నామని చెప్పిరి.౹ వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని యొకనినైన విడువక గొఱ్ఱె వెండ్రుకలు కత్తి రించు ఇంటి గోతిదగ్గర నలువది ఇద్దరిని చంపిరి. అచ్చటినుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశలప్రశ్నలడిగి–నీయెడల నాకున్న ట్టుగా నాయెడల నీకున్నదా అని అతని నడుగగా యెహో నాదాబు–ఉన్నదనెను. —ఆలాగైతే నా చేతిలో చెయ్యి వేయుమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యివేసెను. గనుక యెహూ తన రథముమీద అతనిని ఎక్కించుకొని –యెహోవానుగూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడ రమ్మనగా యెహూ రథముమీద వారతని కూర్చుండబెట్టిరి.౹ అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించియున్న వారినందరిని చంపి, ఏలీయాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి, అహాబును నిర్మూలము చేయువరకు హతముచేయుట మానకుండెను.౹ తరువాత యెహూ జనులందరిని సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను–అహాబు బయలుదేవతకు కొద్ది గానే పూజచేసెను. యెహూ అను నేను అధికముగా పూజచేయబోవుచున్నాను,౹ కావున ఒకడైనను తప్పకుండ బయలు ప్రవక్తలనందరిని వాని భక్తులనందరిని వారి యాజకులనందరిని నాయొద్దకు పిలువనంపించుడి; నేను బయలునకు గొప్ప బలి అర్పింప బోవుచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రదుకనియ్యనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను.౹ మరియు యెహూ–బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారాలాగు చాటించిరి.౹ యెహూ ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరును వచ్చిరి, రానివాడు ఒకడును లేడు; వారు వచ్చి బయలు గుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటులేకుండ బయలు గుడి ఈతట్టునుండి ఆతట్టువరకు నిండిపోయెను.౹ అప్పుడతడు వస్త్రశాలమీద ఉన్న అధికారిని పిలిచి–బయలునకు మ్రొక్కువారికందరికి వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను.౹ యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలు గుడిలో ప్రవేశింపగా యెహూ — యెహోవా భక్తులలో ఒకనినైనను ఇచ్చట మీ యొద్దనుండనియ్యక బయలునకు మ్రొక్కువారుమాత్రమే యుండునట్లు జాగ్రత్తచేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను.౹ బలులను దహనబలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యెహూయెనుబదిమందిని బయట కావలియుంచి–నేను మీ వశముచేసినవారిలో ఒకడైన తప్పించుకొనిపోయినయెడల వాని ప్రాణమునకు బదులుగా వానిపోనిచ్చినవాని ప్రాణముతీతునని వారితో చెప్పి యుండెను.౹ దహనబలులనర్పించుట సమాప్తికాగా యెహూ–మీరు లోపల చొచ్చి యొకడైనను బయటికి రాకుండ వారిని చంపుడని తన కావలివారితోను అధిపతులతోను చెప్పగా వారు అందరిని హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులును వారిని బయటవేసి, బయలు గుడియున్న పట్టణమునకు పోయి బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసికొని వచ్చి వాటిని కాల్చివేసిరి.౹ మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటయిల్లుగా చేసిరి. నేటివరకు అది ఆలాగే యున్నది ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలువారిమధ్యనుండకుండ నాశనము చేసెను.౹ అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యెహూ కూడ అందుకు కారకుడై, బేతేలు దాను అను స్థలములందున్న బంగారుదూడలను అనుసరించుట మానలేదు.౹ కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను–నీవు నా హృదయాలోచనయంతటిచొప్పున అహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైనదాని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు నాల్గవ తరమువరకు ఇశ్రాయేలురాజ్యసింహాసనముమీద ఆసీనులగుదురు.౹ అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన యరొబాముచేసిన పాపములను యెహూ యేమాత్రమును విసర్జించనివాడై ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణహృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయెను. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలువారిని తగ్గించ నారంభించెను.౹ హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలో నున్న యొర్దాను తూర్పుదిక్కున గాదీయులకును రూబే నీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను, అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశములోను, అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను.౹ యెహూచేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹ అంతట యెహూ తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో సమాధిచేయబడెను; అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను.౹ షోమ్రోనులో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలము ఇరువది యెనిమిది యేండ్లు. అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు మృతి బొందెనని తెలిసికొని లేచి రాజకుమారులనందరిని నాశనము చేసెను.౹ రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును, హతమైన రాజకుమారులతోకూడ చంపబడకుండ అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుటచేత అతడు చంపబడకుండెను.౹ అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరుసంవత్సరములు యెహోవామందిరమందు దాదితోకూడ దాచబడి యుండెను. ఏడవ సంవత్సరమందు యెహోయాదా కావలికాయు వారిమీదను రాజదేహ సంరక్షకులమీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి, యెహోవా మందిరములోనికి వారిని తీసికొనిపోయి, యెహోవామందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధనచేసి, వారికి ఆ రాజు కుమారుని కనుపరచి యీలాగు ఆజ్ఞాపించెను –మీరు చేయవలసినదేమనగా, విశ్రాంతిదినమున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై యుండవలెను;౹ ఒక భాగము సూరు గుమ్మముదగ్గర కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను, ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని యుండవలెను.౹ మరియు విశ్రాంతిదినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను.౹ మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని రాజుచుట్టు కాచుకొని యుండవలెను, ఎవడైనను పంక్తులలో ప్రవేశించినయెడల వాని చంపవలెను, రాజు బయలుదేరి సంచరించునప్పుడెల్ల మీరు అతనియొద్ద ఉండవలెను.౹ శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమ కిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి, ప్రతి మనిషి తన తన మనుష్యులను తీసికొని విశ్రాంతిదినమున లోపల ప్రవేశింపవలసిన వారితోను, విశ్రాంతిదినమున బయలుదేరవలసిన వారితోను కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను.౹ యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపు కాయువారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని బలిపీఠముచెంతను మందిరముచెంతను మందిరము కుడికొన మొదలుకొని యెడమకొనవరకు రాజుచుట్టు నిలిచిరి.౹ అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మశాస్త్రగ్రంథమును అతనిచేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టి–రాజు చిరంజీవి యగునుగాకని చాటించిరి.౹ అతల్యా, కాయువారును జనులును కేకలువేయగా విని, యెహోవామందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభముదగ్గర నిలుచుటయు, అధిపతులును బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు, దేశపు వారందరును సంతోషించుచు శృంగధ్వనిచేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని — ద్రోహము ద్రోహము అని కేక వేయగా యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాధిపతులకు — యెహోవామందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్లగొట్టుడి; ఆమె పక్షపువారిని ఖడ్గముచేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక రాజమందిరములోనికి గుఱ్ఱములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్లిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి. అప్పుడు యెహోయాదా–జనులు యెహోవావారని ఆయన పేరట రాజుతోను జనులతోను నిబంధన చేయిం చెను, మరియు అతడు రాజుపేరట జనులతో నిబంధన చేయించెను.౹ అప్పుడు దేశపు జనులందరును బయలు గుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతి మలను ఛిన్నాభిన్నములుచేసి, బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించెను.౹ అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయువారిని దేశపు జనులందరిని పిలిపింపగా వారు యెహోవా మందిరములోనున్న రాజునుతీసికొని, కాపుకాయువారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనముమీద ఆసీనుడాయెను.౹ మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గముచేత చంపిన తరువాత దేశపు జనులందరును సంతోషించిరి, పట్టణమును నిమ్మళముగా ఉండెను.౹ యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు. యెహూ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో నలువది సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా.౹ యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధినేర్పువాడైయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను.౹ అయితే ఉన్నతస్థలములు కొట్టివేయబడక నిలిచెను; జనులు ఇంకను ఉన్నతస్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి. యోవాషు యాజకులను పిలిపించి–యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలాచేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతుచొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును, స్వేచ్ఛచేత నెవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును,౹ యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారియొద్ద తీసికొని, మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై యున్నదో అచ్చటనెల్ల దానిని బాగుచేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను.౹ అయితే యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమువరకును యాజకులు మందిరముయొక్క శిథిలమైన స్థలములను బాగుచేయకయే యుండిరి గనుక యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగి లిన యాజకులను పిలిపించి–మందిరములో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగుచేయక పోతిరి? ఇకను మీ మీ నెలవైన వారియొద్ద ద్రవ్యము తీసికొనక, మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయుటకై మీరు అంతకుముందు తీసికొనినదాని నప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి యుండెను.౹ కాబట్టి యాజకులు–మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయుట మా వశములేదు గనుక జనులయొద్ద ద్రవ్యము ఇక తీసికొనమని చెప్పిరి.౹ అంతట యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి, బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాని నుంచగా ద్వారముకాయు యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి.౹ పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియ జేయగా రాజుయొక్క ప్రధానమంత్రియును ప్రధానయాజకుడును వచ్చి, యెహోవామందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి.౹ తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు, అనగా పనిచేయించు వారి కప్పగించిరి; వీరు యెహోవామందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసెపనివారికిని రాతిపనివారికిని యెహోవామందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్లనేమి కొనుటకును, మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికిని, ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి.౹ యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకా లైనను, బంగారు పాత్రలైనను, వెండిపాత్రలైనను చేయబడలేదుగాని మరమ్మతు పనిచేయువారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరల బాగుచేయించిరి.౹ మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనినవారు నమ్మకస్థులని వారిచేత లెక్క అడుగలేదు.౹ అపరాధ పరిహారార్థ బలులవలనను పాప పరిహారార్థ బలులవలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు, అది యాజకులదాయెను. అంతట సిరియారాజైన హజాయేలు గాతు పట్టణము మీదికి పోయి యుద్ధముచేసి దాని పట్టుకొనిన తరువాత అతడు యెరూషలేముమీదికి రాదలచియుండగా యూదారాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు యెహోరాము అహజ్యా అను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటిని, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరములోను రాజనగరులోనున్న పదార్థములలోను కనబడిన బంగారమంతయు తీసికొని సిరియారాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేమునొద్దనుండి తిరిగిపోయెను.౹ యోవాషు చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹ అతని సేవకులు లేచి కుట్రచేసి సిల్లా అను చోటకి పోవుమార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి.౹ ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులును అతనిమీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి; అతని కుమారుడైన అమజ్యా అతనికి మారుగా రాజాయెను. యూదారాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి పదునైదు సంవత్సరములు ఏలెను.౹ ఇతడు ఇశ్రాయేలువారు పాపముచేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹ కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలువారిమీద రగులుకొనగా ఆయన సిరియారాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలువారిని వారి కప్పగించెను.౹ అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజుచేత బాధనొందిన ఇశ్రాయేలువారిని కనికరించి అతని మనవి నంగీకరించెను.౹ కావున యెహోవా ఇశ్రాయేలువారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతనిచేత ఇశ్రాయేలువారు సిరియనుల వశములోనుండి తప్పించుకొనిమునుపటివలె స్వస్థానములలో కాపురముండిరి.౹ అయినను ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబికులు చేసిన పాపములను వారు విడువక వాటిననుసరించుచు వచ్చిరి. మరియు ఆ దేవతాస్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను.౹ రౌతులలో ఏబదిమందియు రథములలో పదియు కాల్బలములో పదివేలమందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి; మిగిలినవారిని సిరియా రాజు దుళ్లకొట్టిన ధూళివలె నాశనముచేసి యుండెను.౹ యెహోయాహాజు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదానినంతటినిగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ యెహోయాహాజు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను. యూదారాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది యేడవ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారం భించి పదునారుసంవత్సరములు ఏలెను.౹ ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక వాటి ననుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹ యెహోయాషు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని అంతటినిగూర్చియు, యూదారాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరచిన పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹ యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించిన తరువాత యరొబాము అతని సింహాసనముమీద ఆసీనుడాయెను; యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలురాజుల సమాధియందు పాతిపెట్టబడెను. అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడై యుండగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు–నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను.౹ అందుకు ఎలీషా–నీవు వింటిని బాణములను తీసికొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసికొనెను.౹ –నీ చెయ్యి వింటిమీద ఉంచుమని అతడు ఇశ్రాయేలురాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటిమీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతులమీద వేసి –తూర్పువైపున నున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా —బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను అతడు–ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనులచేతిలోనుండి మిమ్మును రక్షించు బాణము; సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతముచేయుదు వని చెప్పి,౹ బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతట అతడు ఇశ్రాయేలురాజుతో–నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను.౹ అందునిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించి–నీవు అయిదుమారులైన ఆరుమారులైన కొట్టినయెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు; అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను. తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను. యెహోయాహాజు దినములన్నియు సిరియారాజైన హజాయేలు ఇశ్రాయేలువారిని బాధపెట్టెను.౹ గాని యెహోవావారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టక యుండెను.౹ సిరియారాజైన హజాయేలు మరణముకాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను.౹ అంతట యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రియైన యెహోయాహాజు చేతిలోనుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరల తీసి కొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరల వశపరచుకొనెను. ఇశ్రాయేలురాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను.౹ అతడు ఏలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేమునందు ఇరువదితొమ్మిది సంవత్సరములు ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలైన యెహోయద్దాను.౹ ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయక పోయినను, యెహోవా దృష్టికి నీతిగలవాడై తన తండ్రియైన యోవాషు చేసిన ప్రకారము చేసెను.౹ అయితే అతడు ఉన్నతస్థలములను కొట్టివేయ లేదు; జనులు ఇంకను ఉన్నతస్థలములలో బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి.౹ రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను.౹ అయితే— కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపమునిమిత్తము వాడే మరణశిక్ష నొందును, అని మోషే వ్రాసియిచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా యిచ్చిన ఆజ్ఞనుబట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు.౹ మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో పదివేలమందిని హతముచేసి, సెల అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను; నేటివరకు దానికి అదే పేరు. అంతట అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి–మనము ఒకరి నొకరము దర్శించునట్లు నన్ను కలియ రమ్మని వర్తమానముచేయగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెను–లెబానోనులోనున్న ముండ్ల చెట్టొకటి–నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానో నులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.౹ నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే; యిప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతనుబట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతోకూడ యూదావారును కూలునట్లుగా నీవెందుకు అపాయములో దిగుదువని చెప్పినను అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలురాజైన యెహోయాషు బయలుదేరి, యూదా సంబంధమైన బేత్షెమెషు పట్టణముదగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలిసికొనగా యూదావారు ఇశ్రాయేలువారియెదుట నిలువలేక అపజయమొంది అందరును తమతమ గుడారములకు పారిపోయిరి.౹ మరియు ఇశ్రాయేలురాజైన యెహోయాషు అహజ్యాకుపుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బేత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి, ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మమువరకు యెరూషలేము ప్రాకారమును నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.౹ మరియు యెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్తవస్తువులను పట్టణస్థులలో కుదవ పెట్టబడినవారిని తీసికొని షోమ్రోనునకు వచ్చెను.౹ యెహోయాషు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమునుగూర్చియు ఇశ్రాయేలురాజులవృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ అంతట యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలురాజుల సమాధియందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజాయెను. యూదారాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత పదునయిదు సంవత్సరములు బ్రదికెను.౹ అమజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడి యున్నది.౹ అతనిమీద యెరూషలేములో జనులు కుట్రచేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెనుగాని వారు లాకీషునకు అతనివెంట కొందరిని పంపిరి.౹ వారు అక్కడ అతనిని చంపి గుఱ్ఱములమీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి.౹ అప్పుడు యూదా జనులందరును పదునారు సంవత్సరములవాడైన అజర్యాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా పట్టాభి షేకము చేసిరి.౹ ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరల అప్పగించెను. యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా యేలుబడిలో పదునయిదవ సంవత్సరమందు ఇశ్రాయేలురాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము షోమ్రోనులో ఏలనారంభించి నలువదియొక సంవత్సరములు ఏలెను.౹ ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹ గత్హేపరు ఊరివాడైన అమిత్త యికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్తద్వారా ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున ఇతడు హమాతునకుపోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రమువరకు ఇశ్రాయేలువారి సరిహద్దును మరల స్వాధీనము చేసికొనెను.౹ ఏలయనగా అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారికి సహాయులెవరును లేకపోయిరి.౹ యెహోవా ఇశ్రాయేలువారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలను పేరు ఆకా శము క్రిందనుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చి యుండెను గనుక యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా వారిని రక్షించెను.౹ యరొబాము చేసిన యితరకార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు, అతడు చేసిన యుద్ధమునుగూర్చియు, దమస్కు పట్టణమును యూదావారికి కలిగియున్న హమాతు పట్టణమును ఇశ్రాయేలువారి కొరకై అతడు మరల పట్టుకొనిన సంగతిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹ యరొబాము తన పితరులైన ఇశ్రాయేలురాజులతోకూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన జెకర్యా అతనికి మారుగా రాజాయెను. ఇశ్రాయేలురాజైన యరొబాము ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యూదారాజైన అమజ్యా కుమారుడైన అజర్యా యేలనారంభించెను.౹ అతడు పదునారేండ్లవాడై యేలనారంభించి యెరూషలేమునందు ఏబది రెండు సంవత్సరములు రాజుగా ఉండెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలైన యెకొల్యా.౹ ఇతడు తన తండ్రియైన అమజ్యా చర్యయంతటిప్రకారము యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను.౹ ఉన్నతస్థలములను మాత్రము కొట్టి వేయలేదు; ఉన్నతస్థలములయందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి.౹ యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగువరకు కుష్ఠరోగియై ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరుమీద అధికారియై దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను.౹ అజర్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹ అజర్యా తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురములో తన పితరుల సమాధియందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయెను. యూదారాజైన అజర్యా యేలుబడిలో ముప్పది యెనిమిదవ సంవత్సరమందు యరొబాము కుమారుడైన జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఆరునెలలు ఏలెను.౹ ఇతడు ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు, తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరి గించెను.౹ యాబేషు కుమారుడైన షల్లూము అతనిమీద కుట్రచేసి, జనులు చూచుచుండగా అతనిమీదపడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను.౹ జెకర్యా చేసిన కార్యములనుగూర్చి ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ –నీ కుమారులు నాలుగవ తరమువరకు ఇశ్రాయేలు సింహాసనముమీద ఆసీనులైయుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాటచొప్పున ఇది జరిగెను. యూదారాజైన ఉజ్జియా యేలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెలదినములు ఏలెను.౹ గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలోనుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులోనుండు యాబేషు కుమారుడైన షల్లూముమీదపడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను.౹ షల్లూము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన కుట్రనుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.౹ మెనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినందరిని హతము చేసి, తిర్సాను దాని చేరువ గ్రామములనన్నిటిని కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను. యూదారాజైన అజర్యా యేలుబడిలో ముప్పదితొమ్మిదవ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలువారిని ఏలనారంభించి షోమ్రోనులో పది సంవత్సరములు ఏలెను.౹ ఇతడును తన దినములన్నియు ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక యనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹ అష్షూరు రాజైన పూలు దేశముమీదికి రాగా, మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలుచేత సంధి చేయించుకొనవలెనని రెండువేల మణుగుల వెండి పూలునకు ఇచ్చెను.౹ మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను ఏబదేసి తులముల వెండి వసూలుచేసి యీ ద్రవ్యమును అష్షూరు రాజునకిచ్చెను గనుక అష్షూరురాజు దేశమును విడిచి వెళ్లిపోయెను.౹ మెనహేము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ మెనహేము తన పితరులతోకూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయెను. యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదియవ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను.౹ ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹ ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకహు కుట్ర చేసి, తనయొద్దనున్న గిలాదీయులైన యేబదిమందితోను, అర్గోబుతోను, అరీహేనుతోను కలిసికొని షోమ్రోనులో నున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి, పెకహ్యాకు మారుగా రాజాయెను.౹ పెకహ్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదానినంతటినిగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదిరెండవ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి యిరువది సంవత్సరములు ఏలెను.౹ ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹ ఇశ్రాయేలురాజైన పెకహు దినములలో అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చటనున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొని పోయెను.౹ అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహుమీద కుట్రచేసి, అతనిమీదపడి అతని చంపి, యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదియవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను.౹ పెకహు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది. ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యూదారాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను.౹ అతడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేమునందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తెయైన యెరూషా.౹ ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రియైన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను.౹ అయినను ఉన్నతస్థలములను కొట్టివేయకుండెను; జనులు ఉన్నతస్థలములందు ఇంకను బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న యెత్తయిన ద్వారమును కట్టించెను.౹ యోతాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹ ఆ దినములో యెహోవా సిరియారాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును యూదా దేశముమీదికి పంపనారంభించెను.౹ యోతాము తన పితరులతోకూడ నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను. రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు యూదారాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను.౹ ఆహాజు ఏలనారంభించి నప్పుడు ఇరువది యేండ్లవాడై యెరూషలేమునందు పదునారు సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను.౹ అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలుచేయుచు, తన కుమారుని అగ్నిగుండమును దాటించెను.౹ మరియు అతడు ఉన్నతస్థలములలోను కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షములక్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.౹ సిరియారాజైన రెజీనును ఇశ్రాయేలురాజైన రెమల్యా కుమారుడగు పెకహును యెరూషలేముమీదికి యుద్ధమునకువచ్చి అక్కడ నున్న ఆహాజును పట్టణమును ముట్టడివేసిరిగాని అతనిని జయింపలేక పోయిరి.౹ ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల వశముచేసి, ఏలతులోనుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటివరకును వారచ్చటనే యున్నారు.౹ ఇట్లుండగా ఆహాజు యెహోవామందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసికొని అష్షూరురాజునకు కానుకగా పంపి –నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియు ఇశ్రాయేలురాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలనంపగా అష్షూరు రాజు అతనిమాట అంగీకరించి, దమస్కు పట్టణముమీదికి వచ్చి దాని పట్టుకొని, రెజీనును హతముచేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసికొని పోయెను.౹ రాజైన ఆహాజు అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరును కలిసికొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి, దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి, దాని పోలికెను, మచ్చును, దాని పని విధ మంతయును యాజకుడైన ఊరియాకు పంపెను.౹ కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కుపట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక బలిపీఠమును కట్టించి, రాజైన ఆహాజు దమస్కునుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను.౹ అంతట రాజు దమస్కునుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి, తాను అర్పించిన సమాధానబలిపశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను.౹ మరియు యెహోవా సన్నిధినున్న యిత్తడి బలిపీఠమును మందిరము ముంగిటిస్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్యనుండి తీయించి, తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను.౹ అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించిన దేమనగా–ఈ పెద్ద బలిపీఠముమీద ఉదయము అర్పించు దహనబలులను, సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజుచేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరు అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి, యే దహనబలి జరిగినను, ఏ బలిజరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ యిత్తడి బలిపీఠము దేవునియొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను.౹ కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయుచేసెను.౹ మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటిమీద నున్న తొట్టిని తొలగించెను, ఇత్తడి యెడ్లమీద నున్న సముద్రమును దింపి రాతి కట్టుమీద దానిని ఉంచెను.౹ మరియు అతడు అష్షూరు రాజునుబట్టి విశ్రాంతిదినపు ఆచరణకొరకై మందిరములో కట్టబడిన మంటపమును, రాజు ఆవరణముగుండ పోవు ద్వారమును యెహోవా మందిరమునుండి తీసివేసెను.౹ ఆహాజుచేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹ ఆహాజు తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను. యూదారాజైన ఆహాజు ఏలుబడిలో పండ్రెండవ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములు ఏలెను.౹ అతడు తన పూర్వికులైన ఇశ్రాయేలురాజులు చెడుతనము చేసినంతమట్టుకు చేయకపోయినను, యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను.౹ అతని మీదికి అష్షూరురాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను.౹ అతడు ఐగుప్తురాజైన సోనొద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటేట ఇచ్చుచు వచ్చినట్లు అష్షూరురాజునకు పన్ను ఇయ్యకపోగా, హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలిసికొని అతనికి సంకెళ్లు వేయించి బందీగృహములో ఉంచెను.౹ అష్షూరురాజు దేశమంతటిమీదికిని షోమ్రోనుమీదికిని వచ్చి మూడు సంవత్సరములు షోమ్రో నును ముట్టడించెను.౹ హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరురాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెర గొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను.౹ ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండియు, ఐగుప్తురాజైన ఫరోయొక్క బలము క్రిందనుండియు, తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపముచేసి యితర దేవతలయందు భయభక్తులు నిలిపి తమయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలురాజులు నిర్ణ యించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి.౹ మరియు ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము గలిగి దుర్బోధలు బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములుగల పట్టణనివాసులును తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని యెత్తయిన కొండలన్నిటిమీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి, అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతాస్తంభములను నిలిపి తమ యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులవాడుక చొప్పున ఉన్నతస్థలములలో ధూపము వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి –చేయకూడదని వేటినిగూర్చి యెహోవా తమ కాజ్ఞాపించెనో వాటినిచేసి పూజించుచుండిరి.౹ అయినను–మీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీపితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్తలందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రాయేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను,౹ వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమపితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.౹ వారు ఆయన కట్టడలను, తమపితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణ యించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుసరించుచు, వ్యర్థులై–వారి వాడుకలచొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి.౹ వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని యనుసరింపక పోతవిగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశసమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి.౹ మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుకచేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టించిరి.౹ కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్ల గొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.౹ అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టినవారై ఇశ్రాయేలువారు చేసికొనిన కట్టడలను అనుసరించిరి.౹ అంతట యెహోవా ఇశ్రాయేలువారి సంతతివారినందరిని విసర్జించి, వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికప్పగించి, వారిని తన సముఖమునుండి వెళ్లగొట్టెను.౹ ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటివారిలోనుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసికొనిరి. ఈ యరొబాము ఇశ్రాయేలువారు యెహోవాను అనుసరింపకుండ ఆయనమీద వారిని తిరుగబడచేసి, వారు ఘోరపాపము చేయుటకు కారకుడాయెను.౹ ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటి ననుసరించుచు వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున, ఆయన ఇశ్రాయేలువారిని తన సముఖములోనుండి వెళ్లగొట్టెను. ఆ హేతువుచేత వారు తమ స్వదేశములోనుండి అష్షూరు దేశములోనికి చెరగొని పోబడిరి; నేటివరకు వారచ్చట ఉన్నారు. అష్షూరురాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అను తన దేశములలోనుండి జనులనురప్పించి, ఇశ్రాయేలువారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి.౹ అయితే వారు కాపురముండ నారంభించినప్పుడు యెహోవాయందు భయభక్తులు లేనివారు గనుక యెహోవావారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను.౹ –తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియ కున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరురాజుతో మనవిచేయగా అష్షూరు రాజు–అచ్చటనుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొనిపోవుడి; అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను.౹ కాగా షోమ్రోనులోనుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి, యెహోవాయందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెనుగాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నతస్థలములమందిరములలో వాటిని ఉంచుచువచ్చిరి; మరియు వారు తమతమ పురములలో తమకు దేవతలను కలుగజేసికొనిరి.౹ బబులోనువారు సుక్కోత్బెనోతు దేవతను, కూతావారు నెర్గలు దేవతను, హమాతువారు అషీమా దేవతను,౹ ఆవీయులు నిబ్హజు దేవతను తర్తాకు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకొనుచుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మెలెకు అనెమ్మెలెకు అను సెపర్వయీముయొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి.౹ మరియు జనులు యెహోవాకు భయపడి, ఉన్నతస్థలములనిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసికొనగా వారు జనులపక్షమున ఉన్నతస్థలములలో కట్టబడిన మందిరములయందు బలులు అర్పించుచుండిరి.౹ ఈ ప్రకారముగా వారు యెహోవాయందు భయభక్తులుగలవారైయుండి, తాము ఏ జనులలోనుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి.౹ నేటివరకు తమ పూర్వమర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు; యెహోవాయందు భయభక్తులు పూనక —వారితో నిబంధనచేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు, వాటికి నమస్కరింపకయు, పూజ చేయకయు, బలులు అర్పింపకయు,౹ మహాధికారము చూపి బాహు బలముచేత ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాయందు భయభక్తులుకలిగి ఆయనకు మాత్రమే నమస్కారముచేసి బలులు అర్పింపవలెనని ఇశ్రాయేలని పేరుపెట్టబడిన యాకోబు సంతతివారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలనుగాని విధులనుగాని ధర్మశాస్త్రమునుగాని ధర్మమందు దేనినిగాని అనుసరింపకయు ఉన్నారు.౹ మరియు–ఇతర దేవతలను పూజింపక మీరు బ్రదుకు దినములన్నియు మోషే మీకు వ్రాసియిచ్చిన కట్టడలను విధులను, అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను.౹ నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను.౹ మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు గలవారై యుండినయెడల ఆయన మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాటవినక తమ పూర్వపు మర్యాదచొప్పుననే జరిగించుచు వచ్చిరి.౹ ఆ ప్రజలు ఆలాగున యెహోవాయందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. మరియు తమపితరులు చేసినట్లు వారి యింటివారును వారి సంతతివారును నేటివరకు చేయుచున్నారు. ఇశ్రాయేలురాజును ఏలా కుమారుడునైన హోషేయ యేలుబడిలో మూడవ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా యేలనారంభించెను.౹ అతడు ఏలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేమునందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె; ఆమెకు అబీ అని పేరు.౹ తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిననుసరించెను.౹ ఉన్నతస్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషేచేసిన యిత్తడి సర్పమును ఛిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరుపెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి యుండిరి అతడు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాయందు విశ్వాసముంచినవాడు; అతని తరువాత వచ్చిన యూదారాజులలోను అతని పూర్వికులైన రాజులలోను అతనితో సమమైనవాడు ఒకడునులేడు.౹ అతడు యెహో వాతో హత్తుకొని, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొను చుండెను.౹ కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను; తాను వెళ్లిన చోట నెల్ల అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవచేయకుండ అతనిమీద తిరుగబడెను.౹ మరియు గాజా పట్టణమువరకు దాని సరిహద్దులవరకు కాపరుల గుడిసెలయందేమి, ప్రాకారములుగల పట్టణములయందేమి, అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను. రాజైన హిజ్కియా యేలుబడిలో నాలుగవ సంవత్సరమందు, ఇశ్రాయేలురాజైన ఏలా కుమారుడగు హోషేయ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు, అష్షూరురాజైన షల్మ నేసెరు షోమ్రోను పట్టణముమీదికి వచ్చి ముట్టడివేసెను.౹ మూడు సంవత్సరములు పూర్తియైన తరువాత అష్షూరీయులు దాని పట్టుకొనిరి. హిజ్కియా యేలుబడిలో ఆరవ సంవత్సరమందు, ఇశ్రాయేలురాజైన హోషేయయేలు బడిలో తొమ్మిదవ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను.౹ తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించి యుండిరి.౹ అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి తీసికొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను. రాజైన హిజ్కియా యేలుబడిలో పదునాలుగవ సంవ త్సరమందు అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి–నావలన తప్పు వచ్చినది; నాయొద్దనుండి తిరిగి నీవు వెళ్లిపోయినయెడల నామీద నీవు మోపినదానిని నేను భరించుదునని వర్తమానముచేయగా, అష్షూరురాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరు వందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను.౹ కావున హిజ్కియా యెహోవామందిరమందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండియంతయు అతనికిచ్చెను.౹ మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకిచ్చెను.౹ అంతట అష్షూరురాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేను లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియామీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేముమీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా హిల్కీయా కుమారుడును గృహనిర్వాహకుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, రాజ్యపుదస్తావేజులమీద నున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి.౹ అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను —ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు–మహా రాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా–నీవు ఈలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి? యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వానిచేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొను వారికందరికిని అట్టివాడే.౹ –మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే. —యెరూషలేమందున్న యీ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా యెవని ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా? కావున చిత్తగించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండువేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్నయెడల నేను వాటిని నీకిచ్చెదను.౹ అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకనిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకొంటివే.౹ యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదు; —ఆ దేశముమీదికి పోయి దాని పాడు చేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను.౹ హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము షెబ్నా యోవాహు అనువారు–చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము; ప్రాకారముమీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా రబ్షాకే–ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానునియొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద కూర్చున్నవారియొద్దకును నన్ను పంపెనుగదా అని చెప్పి గొప్పశబ్దముతో యూదాభాషతో ఇట్లనెను–మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా –హిజ్కియాచేత మోసపోకుడి; నా చేతిలోనుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.౹ యెహోవానుబట్టి మిమ్మును నమ్మించి–యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అష్షూరురాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.౹ హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవద్దు; అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా–నాతో సంధిచేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతిమనిషి తన ద్రాక్షచెట్టు ఫలమును తన అంజూరపుచెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును.౹ అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా మేము వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును, ఒలీవతైలమును తేనెయునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున–యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు.౹ ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరురాజు చేతిలోనుండి విడిపించెనా? హమాతు దేవతలు ఏమాయెను? అర్పాదు దేవతలు ఏమాయెను? సెపర్వయీము దేవతలు ఏమాయెను? హేన ఇవ్వా అనువారి దేవతలు ఏమాయెను? (షోమ్రోను దేశపు) దేవత మాచేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా? యెహోవా మాచేతిలోనుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మాచేతిలోనుండి విడిపించినది కలదా అని చెప్పెను.౹ అయితే–అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుటచేత జనులు ఎంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకుండిరి.౹ గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును, బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి, రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయాయొద్దకు పంపెను.౹ వీరు గోనెపట్ట కట్టుకొని అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి–హిజ్కియా సెలవిచ్చునదేమనగా–ఈ దినము శ్రమయు శిక్షయు దూష ణయు గల దినము; పిల్లలు పుట్టవచ్చిరిగాని కనుటకు శక్తి చాలదు.౹ జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.౹ రాజైన హిజ్కియా సేవకులు యెషయాయొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను–మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి–యెహోవా సెలవిచ్చునదేమనగా —అష్షూరురాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.౹ అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్లి పోవును; తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును. అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.౹ అంతట కూషురాజైన తిర్హాకా తనమీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు, అతడు ఇంకొకసారి హిజ్కియాయొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను.౹ యూదారాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి — యెరూషలేము అష్షూరురాజుచేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.౹ ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవుమాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారుగాని హారానువారు గాని, రెజెపులుగాని, తెలశ్శారులోనుండిన ఏదె నీయులుగాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా? హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? హిజ్కియా దూతలచేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను–యెహోవా, కెరూబులమధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకలరాజ్యములకు దేవుడవైయున్నావు.౹ యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను చెవిని బెట్టుము.౹ యెహోవా, అష్షూరురాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి.౹ యెహోవా మా దేవా; లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలిసికొనునట్లుగా అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము. అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను–ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా — అష్షూరురాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను.౹ అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట యేదనగా–సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణచేయుచున్నది; నిన్ను అపహాస్యము చేయుచున్నది; యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది.౹ నీవు ఎవనిని తిరస్కరించితివి? ఎవనిని దూషించితివి? నీవు గర్వించి యెవనిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినేగదా నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవేగదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖర ములకును లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసి యున్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను. నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్ని టిని ఎండిపో జేసియున్నాను. నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతనకాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బ లుగా చేయుట నావలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి. నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి. నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినదేమనగా — హిజ్కియా, నీ కిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనమువిత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము అనుభవించుదురు. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.౹ శేషించు వారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు; తప్పించుకొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును.౹ కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా–అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడిదిబ్బ కట్టడు.౹ ఈ పట్టణములోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు.౹ నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవాదూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్షయెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి.౹ అష్షూరురాజైన సన్హెరీబు తిరిగి పోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరా రాతు దేశములోనికి తప్పించు కొనిపోయిరి; అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతనియొద్దకు వచ్చి–నీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని –యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.౹ యెషయా నడిమి శాలలోనుండి అవతలకు వెళ్లకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను.౹ –నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము–నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగా–నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవదినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.౹ ఇంక పదునయిదు సంవత్సరముల ఆయు ష్యము నీకిచ్చెదను; మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపా డుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండ నేను విడిపించెదను.౹ పిమ్మట యెషయా–అంజూరపుపండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపుమీద వేసినతరువాత అతడు బాగుపడెను.౹ –యెహోవా నన్ను స్వస్థపరచు ననుటకును, నేను మూడవదినమున ఆయన మందిరమునకు ఎక్కి పోవుదుననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లనెను –తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ పదిమెట్లు ముందుకు నడిచెనుగదా? అది పదిమెట్లు వెనుకకు నడిచినయెడల అవునా? అందుకు హిజ్కియా యిట్లనెను–నీడ పదిమెట్లు ముంద రికి నడుచుట అల్పముగాని నీడ పది గడులు వెనుకకు నడుచుట చాలును.౹ ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పదిమెట్లు ముందరికి నడిచిన నీడ పదిమెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను. ఆ కాలమందు బబులోనురాజును బలదాను కుమారుడునైన బెరోదక్బలదాను హిజ్కియా రోగియైయుండిన సంగతి విని, పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా, దూతలు వచ్చినమాట విని వారిని లోపలికి రప్పించి, తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగుచేయక తన పదార్థములుగల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను.౹ పిమ్మట ప్రవక్తయైన యెషయా రాజైన హిజ్కియాయొద్దకు వచ్చి–ఆ మనుష్యులు ఏమనిరి? నీయొద్దకు ఎక్కడనుండి వచ్చిరి? అని అడుగగా హిజ్కియా–బబులోనను దూరదేశమునుండి వారువచ్చియున్నారని చెప్పెను.౹ –నీ యింటిలో వారు ఏమేమి చూచిరని అతడడుగగా హిజ్కియా–నా పదార్థములలో దేనిని మరుగుచేయక నా యింటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నాననెను.౹ అంతట యెషయా హిజ్కియాతో ఇట్లనెను–యెహోవా సెలవిచ్చుమాట వినుము –వచ్చు దినములలో ఏమియు మిగులకుండ నీ నగరునందున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోనురాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొని పోవుదురు.౹ అందుకు హిజ్కియా–నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞచొప్పున జరుగుట మేలే; నా దినములలో సమాధానము సత్యము కలిగినయెడల మేలేగదా అని యెషయాతో అనెను.౹ హిజ్కియా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని పరాక్రమమంతటిని గూర్చియు, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించినదానిని గూర్చియు, యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹ హిజ్కియా తన పితరులతోకూడ నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను. మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్ల వాడై యెరూషలేములో ఏబదియయిదు సంవత్సరములు ఏలెను; అతని తల్లిపేరు హెఫ్సిబా.౹ అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను.౹ తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలురాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించు చుండెను.౹ మరియు — నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవామందిరమందు బలిపీఠములను కట్టించెను.౹ మరియు యెహోవా మందిరమునకున్న రెండుసాలలలో ఆకాశసమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను.౹ అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, జ్యోతిషమును శకునములను వాడుకచేసి, యక్షిణిగాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి–ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలోనుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవామందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను.౹ మరియు–ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించినదంతటిని, నా సేవకుడగు మోషే వారికి వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనినయెడల వారి పితరులకు నేనిచ్చిన దేశములోనుండి వారి పాదములను ఇక తొలగి పోనియ్యనని యెహోవా సెలవిచ్చినమాట వారు వినక ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా లయముచేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను.౹ కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఈలాగు సెలవిచ్చెను.౹ — యూదారాజైన మనష్షే యీ హేయమైన కార్యములను చేసి, తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరచి, తాను పెట్టుకొనిన విగ్రహములవలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను.౹ కావున ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా— వినువాని రెండు చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు నేను షోమ్రోనును కొలిచిన నూలును, అహాబు కుటుంబికులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేముమీద సాగలాగుదును; ఒకడు పళ్లెమును తుడుచునప్పుడు దాని బోర్లించి తుడుచునట్లు నేను యెరూషలేమును తుడిచి వేసెదను.౹ మరియు నా స్వాస్థ్యములో శేషించినవారిని నేను త్రోసివేసి వారి శత్రువులచేతికి వారిని అప్పగించెదను.౹ వారు తమపితరులు ఐగుప్తుదేశములోనుండి వచ్చిన నాటనుండి నేటివరకు నా దృష్టికి కీడుచేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువులందరిచేత దోచబడి నష్టము నొందుదురు.౹ మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడతనడిచి, యూదా వారిని పాపములో దింపినదిగాక యెరూషలేమును ఈ కొననుండి ఆ కొనవరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను.౹ మనష్షే చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు, అతడు చేసిన దోషమునుగూర్చియు, యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹ మనష్షే తన పితరులతోకూడ నిద్రించి ఉజ్జాయొక్క తోటలో తన నగరుదగ్గర సమాధిచేయబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను. ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యెరూషలేమునందు రెండు సంవత్సరములు ఏలెను. అతని తల్లి యొట్బయూరివాడగు హారూసు కుమార్తెయైన మెషుల్లెమెతు.౹ అతడు తన తండ్రియైన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను.౹ [21-22] తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు, తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను.౹ *** ఆమోను సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందు అతని చంపగా దేశపు జనులురాజైన ఆమోనుమీద కుట్రచేసిన వారినందరిని చంపి అతని కుమారుడైన యోషీయాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి.౹ ఆమోను చేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ ఉజ్జాయొక్క తోటలో అతనికి కలిగిన సమాధియందు అతడు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యోషీయా అతనికి మారుగా రాజాయెను. యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేమునందు ముప్పదియొక సంవత్సరములు ఏలెను, అతని తల్లి బొస్కతు ఊరి వాడగు అదాయాకు కుమార్తెయైన యెదీదా.౹ అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు, కుడి యెడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు, మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రియునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మనిచెప్పి రాజు అతనితో ఈలాగు సెలవిచ్చెను.౹ –నీవు ప్రధానయాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి, ద్వారపాలకులు జనులయొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము.౹ యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించువారిచేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత–యెహోవామందిర మందలి శిథిలమైన స్థలములను బాగుచేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దాని నియ్యవలెననియు వడ్లవారికిని శిల్పకారులకును కాసెపనివారికిని మందిరమును బాగుచేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఇయ్యవలెననియు తెలియ జెప్పుము.౹ ఆ అధికారులు నమ్మకస్థులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమునుగూర్చి వారియొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి.౹ అంతట ప్రధానయాజకుడైన హిల్కీయా— యెహోవామందిరమందు ధర్మశాస్త్రగ్రంథము నాకు దొరికెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి–మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పనివిషయములో అధికారులై పని జరిగించువారిచేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను.౹ రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపుమాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను.౹ తరువాత రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అశాయా అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా –మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలనుగూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణచేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది.౹ కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, అశాయాయును ప్రవక్తియగు హుల్దాయొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో రెండవ భాగమందు కాపురస్థురాలై యుండెను. ఈమెయొద్దకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లనెను— మిమ్మును నాయొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియ జెప్పుడి –యెహోవా సెలవిచ్చునదేమనగా–యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడియున్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండ నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని రప్పింతును.౹ ఈ జనులు నన్ను విడిచి యితరదేవతలకు ధూపము వేయుచు, తమ సకల కార్యములచేత నాకు కోపము పుట్టించియున్నారు గనుక నాకోపము ఆరిపోకుండ ఈ స్థలముమీద రగులుకొనుచున్నది.౹ యెహోవాయొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి –ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చున దేమనగా–ఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్థులు దూషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, మెత్తని మనస్సుకలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవుచేయు మనవిని నేను అంగీ కరించియున్నాను.౹ నేను నిన్ను నీ పితరులయొద్ద చేర్చుదును; నీవు నెమ్మది నొందినవాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలముమీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు; ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానమును రాజు నొద్దకు తెచ్చిరి. అప్పుడు రాజు యూదా పెద్దలనందరిని యెరూషలేము పెద్దలనందరిని తనయొద్దకు పిలువనంపించి యూదావారినందరిని యెరూషలేము కాపు రస్థులనందరిని, యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరిని పిలుచుకొని, యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా, యెహోవామందిరమందు దొరకిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటిని చదివించెను.౹ రాజు ఒక స్తంభముదగ్గర నిలిచి— యెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధనచేయగా జనులందరు ఆ నిబంధనకు సమ్మతించిరి.౹ రాజు–బయలుదేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటిని యెహోవా ఆలయములోనుండి ఇవతలకు తీసికొని రావలెనని ప్రధానయాజకుడైన హిల్కీయాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి, బూడిదెను బేతేలు ఊరికి పంపి వేసెను.౹ మరియు యూదా పట్టణములయం దున్న ఉన్నతస్థలములలోను యెరూషలేము చుట్టునున్న చోట్లలోను ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి, అతడు అందరిని నిలిపి వేసెను.౹ యెహోవామందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను.౹ మరియు యెహోవామందిరమందున్న పురుషగాములయిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి.౹ యూదా పట్టణములోనున్న యాజకులనందరిని అతడు అవతలికి వెళ్లగొట్టెను, గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపమువేసిన ఉన్నతస్థలములను అతడు అపవిత్రపరచి, పట్టణములో ప్రవేశించువాని యెడమపార్శ్వమున పట్టణపు అధికారియైన యెహోషువ గుమ్మముదగ్గరనుండు ఉన్నతస్థలములను పడగొట్టించెను.౹ అయినప్పటికి ఆ ఉన్నతస్థలములమీద నియమింపబడిన యాజకులు యెరూషలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరులయొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు.౹ మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్‍హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను.౹ ఇదియుగాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుఱ్ఱములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకుయొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్దనుండి తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చి వేసెను.౹ మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు రెండు సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి ఛిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను.౹ యెరూషలేము ఎదుట నున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్తా రోతు అను సీదోనీయుల విగ్రహమునకును, కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలురాజైన సొలొమోను కట్టించిన ఉన్నతస్థలములను రాజు అపవిత్రపరచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను.౹ బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నతస్థలమును, అనగా ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాముకట్టించిన ఆ ఉన్నతస్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి, ఆ ఉన్నతస్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను.౹ యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవ జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముమీద కాల్చి దాని అపవిత్రపరచెను.౹ అంతట అతడు–నాకు కనబడుచున్న ఆ సమాధి యెవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు–అది యూదాదేశము నుండి వచ్చి నీవు, బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధియని చెప్పిరి.౹ అందుకతడు–దానిని తప్పించుడి, యెవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణమునుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి.౹ మరియు ఇశ్రాయేలురాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నతస్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటిని యోషీయా తీసివేసి, తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను.౹ అచ్చట అతడు ఉన్నతస్థలములకు నియమింపబడిన యాజకులనందరిని బలిపీఠములమీద చంపించి వాటిమీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అంతట రాజు–నిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞా పింపగా ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినములనుండి ఇశ్రాయేలురాజులయొక్కయు యూదారాజులయొక్కయు దినములన్నిటివరకు ఎన్నడును జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కాపండుగ ఆచరింపబడెను.౹ ఈ పండుగ రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను.౹ మరియు కర్ణపిశాచిగలవారిని సోదెచెప్పువారిని గృహ దేవతలను విగ్రహములను, యూదాదేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవామందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను.౹ అతనికి పూర్వమున్న రాజులలో అతనివలె పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణబలముతోను యెహోవావైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రముచొప్పున చేసినవాడు ఒకడును లేడు; అతని తరువాతనైనను అతనివంటివాడు ఒకడును లేడు.౹ అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమునుబట్టి ఆయన కోపాగ్ని యింకను చల్లారకుండ యూదామీద మండుచునే యుండెను.౹ కాబట్టి యెహోవా — నేను ఇశ్రాయేలువారిని వెళ్లగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి, నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును, నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించెదనని అనుకొనియుండెను.౹ యోషీయా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ అతని దినములయందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరురాజుతో యుద్ధముచేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను.౹ అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూషలేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తెయగు హమూటలు.౹ ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.౹ ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండ ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి, దేశముమీద ఏబది మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజును ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను.౹ యెహోయాకీము ఫరో యిచ్చిన ఆజ్ఞచొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచువచ్చెను. దేశపు జనులయొద్దనుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలుచేసి అతడు ఫరో నెకోకు చెల్లించెను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేమున పదకొండు సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా.౹ ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడతనడిచెను. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తరువాత అతనిమీద తిరుగుబాటుచేయగా యెహోవా అతనిమీదికిని, తన సేవకులైన ప్రవక్తలద్వారా తాను సెలవిచ్చిన మాటచొప్పున యూదాదేశమును నాశనముచేయుటకై దానిమీదికిని, కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబీయుల సైన్యములను ఆమ్మోనీయుల సైన్యములను రప్పించెను.౹ మనష్షే చేసిన క్రియలన్నిటినిబట్టియు, అతడు నిరపరాధులను హతముచేయుటనుబట్టియు, యూదావారు యెహోవా సముఖమునుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞవలన ఇది వారిమీదికి వచ్చెను.౹ అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను.౹ యెహోయాకీము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు జరిగించినదానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ యెహోయాకీము తన పితరులతోకూడ నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను.౹ బబులోనురాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తురాజు వశమున నున్న భూమియంతటిని పట్టుకొనగా ఐగుప్తురాజు ఇక నెన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు పదునెనిమి దేండ్లవాడై యెరూషలేమునందు మూడు మాసములు ఏలెను. యెరూషలేమువాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి.౹ అతడు తన తండ్రి చేసినదానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.౹ ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరుయొక్క సేవకులు యెరూషలేముమీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి.౹ వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దానిమీదికి వచ్చెను.౹ అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులును అతని క్రింది అధిపతులును అతని పరివారమును బయలువెళ్లి బబులోనురాజు నొద్దకురాగా బబులోనురాజు యేలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను.౹ మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును, పట్టుకొని ఇశ్రాయేలురాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటిని యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున తునకలుగా చేయించి యెత్తికొని పోయెను.౹ అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైనవారు తప్ప మరి ఎవరునులేకుండ యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేలమందిని, వీరు గాక కంసాలివారిని కమ్మరివారిని చెరతీసికొని పోయెను.౹ అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపెట్టి యెరూషలేమునుండి బబులోను పురమునకు తీసికొనిపోయెను.౹ ఏడు వేలమంది పరాక్రమశాలులను వెయ్యిమంది కంసాలివారిని కమ్మరివారిని యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులనందరిని బబులోనురాజు చెరపెట్టి బబులోనుపురమునకు తీసికొనివచ్చెను.౹ మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను. సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువదియొక సంవత్సరములవాడు; అతడు యెరూషలేమునందు పదకొండు సంవత్సరములు ఏలెను.౹ అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయాయొక్క కుమార్తెయగు హమూటలు. యెహోయాకీముయొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడునడత నడిచెను.౹ యూదావారిమీదను యెరూషలేమువారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమునుబట్టి తన సముఖములోనుండి వారిని తోలివేయుటకై బబులోనురాజు మీద సిద్కియా తిరుగబడెను. అతని యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడి దిబ్బలు కట్టిరి.౹ ఈ ప్రకారము రాజైన సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరమువరకు పట్టణము ముట్టడివేయబడియుండగా నాల్గవ నెల తొమ్మిదవ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను, దేశపు జనులకు ఆహారము లేకపోయెను.౹ కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడలమధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి.౹ అయితే కల్దీయులు పట్టణముచుట్టు ఉండగా రాజు మైదానమునకు పోవుమార్గమున వెళ్లి పోయెను; కల్దీయుల సైన్యము రాజును తరిమి, అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున యెరికో మైదానమందు అతని పట్టుకొనిరి.౹ వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసికొనిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను.౹ సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి యిత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసికొనిపోయిరి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో పందొమ్మిదవ సంవత్సరమందు అయిదవ నెలయేడవదినమున రాజదేహసంరక్షకులకు అధిపతియు బబులోనురాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న యిండ్లన్నిటిని గొప్పవారి యిండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించెను.౹ మరియు రాజదేహసంరక్షకుల అధిపతియొద్దనున్న కల్దీయుల సైనికులందరును యెరూషలేము చుట్టునున్న ప్రాకారములను పడగొట్టిరి.౹ పట్టణమందు మిగిలియుండిన వారిని, బబులోనురాజు పక్షము చేరిన వారిని, సామాన్యజనులలో శేషించినవారిని రాజదేహసంరక్షకుల అధిపతియైన నెబూజరదాను చెరగొని పోయెనుగాని వ్యవసాయదారులును ద్రాక్షతోట వారును ఉండవలెనని దేశపు బీదజనములో కొందరిని ఉండనిచ్చెను.౹ మరియు యెహోవామందిరమందున్న యిత్తడి స్తంభములను మట్లను యెహోవామందిరమందున్న యిత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి, ఆ యిత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోయిరి.౹ సేవకొరకై యుంచబడిన పాత్రలను చేటలను ముండ్లను ధూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసికొనిపోయిరి.౹ అగ్నిపాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహసంరక్షకుల అధిపతి తీసికొనిపోయెను.౹ మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసికొనిపోయెను. ఈ యిత్తడి వస్తువులయెత్తు లెక్కకు మించియుండెను.౹ ఒక్కొక స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు. దాని పైపీట యిత్తడిది, పైపీట నిడివి మూడు మూరలు. మరియు ఆ పైపీటచుట్టు ఉన్న అల్లికలును దానిమ్మపండ్లును ఇత్తడివి; రెండవ స్తంభమును వీటివలె అల్లికపని కలిగియుండెను.౹ రాజదేహసంరక్షకుల అధిపతి ప్రధానయాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను.౹ మరియు ఆయుధస్థులమీద నియమింపబడియున్న అధిపతిని, పట్టణములోనుండి తీసికొని, రాజుసముఖమును కనిపెట్టుకొని యుండువారిలో పట్టణమందు దొరకిన అయిదుగురిని, దేశపుజనులను సంఖ్య చేయువారి అధిపతియొక్క లేఖికుని, సామాన్యజనులలో పట్టణమందు దొరకిన అరువదిమందిని పట్టుకొనెను.౹ రాజదేహసంరక్షకుల అధిపతియగు నెబూజరదాను వీరిని తీసికొని రిబ్లా పట్టణమందున్న బబులోనురాజునొద్దకు రాగా బబులోనురాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఈ రీతిగా యూదావారు తమ దేశములోనుండి ఎత్తికొని పోబడిరి.౹ బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండ నిచ్చిన వారిమీద అతడు షాఫానునకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను. యూదావారి సైన్యాధిపతులందరును వారి జనులందరును బబులోనురాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని, మిస్పాపట్టణమందున్న గెదల్యాయొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు శెరాయాయును, మాయకాతీయుడైన యొకనికి పుట్టిన యజన్యాను కూడి రాగా గెదల్యావారితోను వారి జనులతోను ప్రమాణముచేసి–కల్దీయులకు మనము దాసులమైతిమని జడియవద్దు, దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవచేసినయెడల మీకు మేలు కలుగునని చెప్పెను.౹ అయితే ఏడవ మాసమందు రాజ వంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు పదిమంది మనుష్యులను పిలుచుకొని వచ్చి గెదల్యామీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతముచేసెను.౹ అప్పుడు కొద్దివారేమి గొప్ప వారేమి జనులందరును, సైన్యాధిపతులును, లేచి కల్దీయుల భయముచేత ఐగుప్తుదేశమునకు పారిపోయిరి. యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన ముప్పదియేడవ సంవత్సరమున పండ్రెండవనెల యిరువది యేడవదినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీగృహములోనుండి యూదారాజైన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాటలాడి, అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠములకంటె ఎత్తుచేసెను.౹ కాగా అతడు తన బందీగృహ వస్త్రములనుతీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రదికిన దినములన్నియు రాజు సన్నిధిని భోజనముచేయుచు వచ్చెను.౹ మరియు అతని బత్తెము ఏనాటికి ఆనాడు రాజుచేత నిర్ణయింపబడినదై అతడు బ్రదికినన్నాళ్లు ఆ చొప్పున అతని కియ్యబడు చుండెను. ఆదాము షేతు ఎనోషు కేయినాను మహలలేలు యెరెదు హనోకు మెతూషెల లెమెకు నోవహు షేము హాము యాపెతు. యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.౹ గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.౹ యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దోదా నీము. హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.౹ కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షేబ దదాను.౹ కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరాక్రమశాలులలో మొదటివాడు.౹ లూదీయులు అనామీయులు లెహాబీయులు నప్తుహీయులు పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.౹ కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.౹ యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు హివ్వీయులు అర్కీయులు సీనీయులు అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.౹ అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.౹ ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.౹ యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును హదోరమును ఊజాలును దిక్లానును ఏబాలును అబీమా యేలును షేబను ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు. షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ సెరూగు నాహోరు తెరహు అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.౹ అబ్రాహాము కుమారులు, ఇస్సాకు ఇష్మాయేలు.౹ వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము మిష్మా దూమా మశ్శా హదదు తేమా [30-31] యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు. *** అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదాను మిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబ దెదాను.౹ మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు.౹ ఏశావు కుమారులు ఏలీఫజు రెయూవేలు యెయూషు యాలాము కోరహు.౹ ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.౹ రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.౹ శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.౹ లోతాను కుమారులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.౹ శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.౹ అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.౹ ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.౹ ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.౹ బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.౹ యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపువాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.౹ హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.౹ హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.౹ శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.౹ షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.౹ బయల్‌హానాను చనిపోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదునకు పుట్టినది.౹ హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,౹ అహొలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,౹ కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,౹ మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయకుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు. ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు. యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను.౹ మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు.౹ పెరెసు కుమారులు హెస్రోను హామూలు.౹ జెరహు కుమారులు అయిదుగురు, జిమ్రీ ఏతాను హేమాను కల్కోలు దార.౹ కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను.౹ ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.౹ హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.౹ రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు యూదావారికి పెద్దైయెన నయస్సోనును కనెను.౹ నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను,౹ బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,౹ యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.౹ సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.౹ అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.౹ అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.౹ హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను.౹ తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను.౹ సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్టణములుండెను.౹ మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణములను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.౹ కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.౹ హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా.౹ అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి.౹ యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు.౹ ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు.౹ అబీషూరు భార్యపేరు అబీహయిలు, అది అతనికి అహ్బానును, మొలీదును కనెను.౹ నాదాబు కుమారులు సెలెదు అప్పయీము. సెలెదు సంతానములేకుండ చనిపోయెను అప్పయీము కుమారులలో ఇషీ అను ఒక డుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను,౹ షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు యోనాతాను; యెతెరు సంతానములేకుండ చనిపోయెను.౹ యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మెయేలునకు పుట్టినవారు.౹ షేషానునకు కుమార్తెలేగాని కుమారులు లేకపోయిరి; ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.౹ అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,౹ జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,౹ ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,౹ అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,౹ ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను,౹ షల్లూము యెకమ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.౹ యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.౹ హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.౹ షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.౹ షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.౹ కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానును మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.౹ యెహ్దయి కుమారులు రెగెము యోతాము గేషాను పెలెటు ఏయిఫా షయపు.౹ కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను.౹ మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బేనాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.౹ ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,౹ బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారేపును.౹ కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవరనగా హారోయే హజీహమ్మీను హోతు.౹ కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మాతీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయులును ఎష్తాయులీయులును కలిగిరి.౹ శల్మా కుమారులెవరనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును.౹ యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును శూకోతీయులును; వీరు రేకాబు ఇంటి వారికి తండ్రియైన హమాతువలన పుట్టిన కేనీయుల సంబంధులు. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు; కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు,౹ గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనీయా నాల్గవవాడు,౹ అబీటలు కనిన షెఫట్య అయిదవవాడు, అతని భార్యయైన ఎగ్లా కనిన ఇత్రెయాము ఆరవవాడు,౹ ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను,౹ యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీయేలు కుమార్తెయైన బత్షెబవలన కలిగిన షిమ్యా షోబాబు నాతాను సొలొమోను అను నలుగురు [6-8] ఇభారు ఎలీషామా ఎలీ పేలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అను తొమ్మండ్రు కుమారులు.౹ *** *** ఉపపత్నులవలన కలిగినవారుగాక వీరందరు దావీదునకు జననమైరి; తామారు వీరికి సహోదరి.౹ సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా. అబీయాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమారుడు యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు,౹ యోవాషునకు అమజ్యా కుమారుడు, అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు యోతామునకు ఆహాజు కుమారుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనష్షే కుమారుడు,౹ మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషీయా కుమారుడు.౹ యోషీయా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్గవవాడు షల్లూము.౹ యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా.౹ యెకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు మల్కీ రాము పెదాయా షెనజ్జరు యెకమ్యా హోషామా నెదబ్యా.౹ పెదాయా కుమారులు జెరుబ్బాబెలు షిమీ; జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము హనన్యా; షెలో మీతు వారికి సహోదరి.౹ హషుబా ఓహెలు బెరెక్యా హసద్యా యూషబెస్హెదు అను మరి యయిదుగురుండిరి.౹ హనన్యా కుమారులు పెలట్యా యెషయా, రెఫాయా కుమారులును అర్నాను కుమారులును ఓబద్యా కుమారులును షెకన్యా కుమారులును.౹ షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను; షెమయా కుమారులు ఆరుగురు. హట్టూషు ఇగాలు బారియహు నెయర్యా షాపాతు.౹ నెయర్యా కుమారులు ముగ్గురు. ఎల్యో యేనై హిజ్కియా అజ్రీకాము;౹ ఎల్యోయేనై కుమారులు ఏడుగురు; హోదవ్యా ఎల్యాషీబు పెలాయా అక్కూబు యోహానాను దెలాయ్యా అనాని. యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.౹ శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు.౹ అబీయేతాము సంతతివా రెవరనగా యెజ్రెయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని.౹ మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.౹ తెకోవ తండ్రియైన అష్షూరునకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి.౹ నయరా అతనికి అహుజామును హెపెరును తేమనీని హాయ హష్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమారులు.౹ హెలా కుమారులెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.౹ కోజు ఆనూబును జోబేబాను హారుము కుమారుడైన అహర్హేలుయొక్క వంశములను కనెను.౹ యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను–వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.౹ యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టి–నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసినదానిని అతనికి దయచేసెను.౹ షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను.౹ ఎష్తోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రియైన తెహిన్నాను కనెను, వీరు రేకావారు.౹ కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను.౹ మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవాబును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి.౹ యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను.౹ యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు.౹ ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను.౹ అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరెదును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.౹ మరియు నహము సహోదరియైన హూదీయా భార్యయొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయీలా మాయకాతీయుడైన ఎష్టెమో.౹ షీమోను కుమారులు అమ్నోను రిన్నా బెన్హానాను తీలోను. ఇషీ కుమారులు జోహేతు బెన్జోహేతు.౹ యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును యోకీ మీయులకును కోజేబాయీయులకును యోవాషువారికిని మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును యాషూబిలెహెమువారికిని అతడు పితరుడు; ఇవి పూర్వ కాలపు సంగతులే.౹ వారు కుమ్మరివాండ్లయి నెతాయీమునందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమముచేత అతనిపని విచారించుటకై అచ్చట కాపురముండిరి. షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారీబు జెరహు షావూలు.౹ షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్శాము కుమారుడు, మిబ్శామునకు మిష్మా కుమారుడు.౹ మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు; హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు.౹ షిమీకి పదునారుగురు కుమారులును ఆరుగురు కుమార్తెలును కలిగిరి; అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలుగ లేదు; యూదావారు వృద్ధియైనట్లు వారి వంశములన్నియు వృద్ధికాలేదు.౹ వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను [29-31] బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడివరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి.౹ *** *** ఏతాము అయీను రిమ్మోను తోకెను ఆషాను అనువారి ఊళ్లు అయిదు.౹ బయలువరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను; ఇవి వారి నివాసస్థలములు, వంశావళి పట్టీలు వారికుండెను.౹ వారు మెషోబాబు యమ్లేకు అమజ్యా కుమారుడైన యోషా,౹ యోవేలు అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహూ.౹ ఎల్యోయేనై యహకోబా యెషోహాయా అశాయా అదీయేలు యెశీమీయేలు బెనాయా;౹ షెమయాకు పుట్టిన షిమ్రీ కుమారుడైన యెదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు.౹ పేళ్లవరుసను వ్రాయబడిన వీరు తమతమ వంశములలో పెద్దలైయుండిరి; వీరి పితరులయిండ్లు బహుగా వర్ధిల్లెను.౹ వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపుస్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమునుగల విశాలదేశమును కనుగొనిరి; పూర్వమందు హాముయొక్క వంశపువారు అక్కడ కాపురముండిరి.౹ పేళ్లవరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడినవారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతముచేసి, అచ్చట తమ గొఱ్ఱెలకు తగిన మేత కలిగియుండుటచేత నేటివరకు వారి స్థానములను ఆక్రమించుకొని యున్నారు.౹ షిమ్యోను కుమారులైన వీరిలో ఐదువందలమంది తమపైని ఇషీ కుమారులైన పెలట్యాను నెయర్యాను రెఫాయాను ఉజ్జీయేలును అధిపతులగా నిర్ణయించుకొని శేయీరు మన్నెమునకు పోయి అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతముచేసి నేటివరకు అచ్చట కాపురమున్నారు. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై యుండెనుగాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మస్వాతంత్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలుచేయబడలేదు.౹ యూదా తన సహోదరులకంటె హెచ్చినవాడాయెను, అతనినుండి ప్రముఖుడు బయలువెడలెను, అయినను జన్మస్వాతంత్యము యోసేపు దాయెను.౹ ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హనోకు పల్లు హెస్రోను కర్మీ.౹ యోవేలు కుమారులలో ఒకడు షెమయా, షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు,౹ షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు,౹ బయలునకు బెయేర కుమారుడు, ఇతడు రూబేనీయులకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెరతీసికొని పోయెను.౹ వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యెహీయేలును, జెకర్యాయును,౹ యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెలయును. బెల వంశపువారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోనువరకును కాపురముండిరి.౹ వారి పశువులు గిలాదుదేశమందు అతివిస్తారముకాగా తూర్పున యూఫ్రటీసునది మొదలుకొని అరణ్యపు సరిహద్దువరకును వారు కాపురముండిరి.౹ సౌలు దినములలో వారు హగ్రీయీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి. గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి.౹ వారిలో యోవేలు తెగ వారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి.౹ వారి పితరుల యింటివారైన వారి సహోదరులు ఏడుగురు, మిఖాయేలు మెషుల్లాము షేబ యోరై యకాను జీయ ఏబెరు.౹ వీరు హూరీ అను వానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యరోయ గిలాదునకు గిలాదు మిఖాయేలునకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి.౹ గూనీ కుమారుడైన అబ్దీయేలునకు పుట్టిన అహీ వారి పితరులయిండ్లవారికి పెద్ద.౹ వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామములయందును దాని ప్రాంతములవరకు కాపురముండిరి.౹ వీరందరు యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలురాజైన యరోబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధ గోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి.౹ వీరు హగ్రీయీలతోను యెతూరువారితోను నాపీషు వారితోను నోదాబువారితోను యుద్ధముచేసిరి.౹ యుద్ధమందువారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబదివేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱెలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి.౹ యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులు పడిపోయిరి; తాము చెరతీసికొని పోబడువరకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రమువారును వీరి స్థానములయందు కాపురముండిరి. మనష్షే అర్ధగోత్రమువారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు, బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును శెనీరువరకును హెర్మోను పర్వతమువరకును వ్యాపించిరి.౹ వారి పితరులయిండ్లకు పెద్దలైనవారెవరనగా ఏఫెరు ఇషీ ఎలీయేలు అజ్రీయేలు యిర్మీయా హోదవ్యా యహదీయేలు; వీరు కీర్తిపొందిన పరాక్రమశాలులై తమపితరులయిండ్లకు పెద్దలైరి.౹ అయితే వారు తమపితరుల దేవునిమీద తిరుగుబాటుచేసి, దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి.౹ కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రమువారిని చెరపెట్టి నేటికిని కనబడు చున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను నదీప్రాంతములకును వారిని కొనిపోయెను. లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.౹ కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.౹ అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.౹ ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవను కనెను,౹ అబీషూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను,౹ ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను,౹ మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,౹ అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,౹ అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను,౹ యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు.౹ అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,౹ అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను,౹ షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,౹ అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.౹ యెహోవా నెబుకద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొనిపోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను.౹ లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.౹ గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.౹ కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.౹ మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,౹ జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయి.౹ కహాతు కుమారులలో ఒకడు అమ్మీనాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,౹ అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు,౹ అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు.౹ ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు.౹ ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,౹ నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా.౹ సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు.౹ మెరారి కుమారులలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు షిమీ, షిమీ కుమారుడు ఉజ్జా ఉజ్జా కుమారుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా. నిబంధనమందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవామందిరమందు సంగీత సేవకొరకు దావీదు నియమించినవారు వీరే.౹ సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించువరకు వీరు సమాజపు గుడారముయొక్క ముంగిట సంగీతసేవను ఆచరించుచుం డిరి; వారు వంతులచొప్పున తమ పని చూచుకొనుచుండిరి.౹ ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు సమూయేలు ఎల్కా నాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయహునకు పుట్టెను,౹ తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను,౹ అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను,౹ జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను,౹ కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను.౹ హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు,౹ షిమ్యా మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు బయశేయా కుమారుడు, బయశేయా మల్కీయా కుమారుడు,౹ మల్కీయా యెత్నీ కుమారుడు, యెత్నీ జెరహు కుమారుడు, జెరహు అదాయా కుమారుడు,౹ అదాయా ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమీ కుమారుడు,౹ షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు. మెరారీయులు ఎడమప్రక్కను నిలుచువారు; వారిలో ఏతాను కీషీ కుమారుడు, కీషీ అబ్దీ కుమారుడు, అబ్దీ మల్లూకు కుమారుడు, మల్లూకు హషబ్యా కుమారుడు,౹ హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు,౹ హిల్కీయా అమ్జీ కుమారుడు, అమ్జీ బానీ కుమారుడు, బానీ షమెరు కుమారుడు,౹ షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.౹ వీరి సహోదరు లైన లేవీయులు దేవుని మందిరస్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి. అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపుచుండ వలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండ వలెననియు వారికి నిర్ణయమాయెను.౹ అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ,౹ అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య,౹ జెరహ్య కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు,౹ అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు. అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావు లనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి.౹ యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను.౹ అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను.౹ అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,౹ హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు,౹ ఆషాను దాని గ్రామములు, బేత్షెమెషు దాని గ్రామములు.౹ మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లె మెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు. కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్రస్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్రస్థానములోనుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను. గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శాఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థానములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములోనుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను.౹ మెరారీయులకు వారి వంశములచొప్పున రూబేను గోత్రస్థానములోనుండియు, గాదు గోత్రస్థానములోనుండియు, జెబూలూను గోత్రస్థానములోనుండియు చీటిచేత పండ్రెండు పట్టణములు ఇయ్యబడెను.౹ ఈ ప్రకారముగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి.౹ వారు చీటివేసి యూదావారి గోత్రస్థానములోనుండియు, షిమ్యోనీయుల గోత్రస్థానములోనుండియు, బెన్యామీనీయుల గోత్రస్థానములోనుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి.౹ కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను.౹ ఆశ్రయ పట్టణములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దాని గ్రామములును, గెజెరును దాని గ్రామములును,౹ యొక్మె యామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును,౹ అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను.౹ మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.౹ మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలాను దాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,౹ ఇశ్శాఖారుగోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు,౹ రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు,౹ ఆషేరు గోత్రస్థానములోనుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు,౹ హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు;౹ నఫ్తాలి గోత్రస్థానములోనుండి గలిలయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను.౹ మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూలూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు,౹ యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగాఉండు రూబేను గోత్రస్థానములోనుండి అర ణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు,౹ కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,౹ గాదు గోత్రస్థానములోనుండి గిలాదుయందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు,౹ హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు ఇయ్యబడెను. ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు తోలా కుమారులు ఉజ్జీ రెఫాయా యెరీయేలు యహ్మయి యిబ్శాము షెమూయేలు; తోలాకు పుట్టిన వీరు తమపితరులయిండ్లకు పెద్దలు; వీరు తమ తరములలో పరాక్రమశాలులై యుండిరి; దావీదు దినములలో వీరి సంఖ్య యిరు వది రెండువేల ఆరువందలు.౹ ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు ఓబద్యా యోవేలు ఇష్షీయా; వీరు అయిదుగురు పెద్దలై యుండిరి.౹ వారికి బహుమంది భార్యలును పిల్లలును కలిగి యుండుటచేత వారి పితరులయిండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరినవారు ముప్పది ఆరువేలమంది యుండిరి.౹ మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరు తమ వంశావళుల చొప్పున ఎనుబదియేడువేలమంది యుండిరి. బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయ వేలు.౹ బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమపితరులయిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు.౹ బేకరు కుమారులు జెమీరా యోవాషు ఎలీయెజెరు ఎల్యోయేనై ఒమ్రీ యెరీమోతు అబీయా అనాతోతు ఆలెమెతు; వీరందరును బేకరు కుమారులు.౹ వీరు తమపితరులయిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు, వీరందరును ఇరువదివేల రెండువందలు.౹ యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు బెన్యామీను ఏహూదు కెనయనా జేతాను తర్షీషు అహీషహరు.౹ యెదీయవేలు కుమారులైన వీరందరును తమపితరులయిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి.౹ షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను.౹ నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము. మనష్షే కుమారులలో అశ్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను, అది గిలాదునకు పెద్దైయెన మాకీరును కూడ కనెను.౹ మాకీరు, హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి యాడెను. దాని సహోదరి పేరు మయకా, రెండవవానికి సెలోపెహాదని పేరు, ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి.౹ మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరుపెట్టెను, ఇతని సహోదరుని పేరు షెరెషు, అతని కుమారులు ఊలాము రాకెము.౹ ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను; వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు.౹ మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు ఇషోదును అబీ యెజెరును మహలాను కనెను.౹ షెమీదా కుమారులు అహెయాను షెకెము లికీ అనీయాము. ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒక డుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు,౹ తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు ఏజెరు ఎల్యాదు అనువారు పుట్టిరి; వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొనిపోవుటకు దిగి రాగా ఆ గాతీయులు వారిని చంపిరి.౹ వారి తండ్రియైన ఎఫ్రాయిము అనేకదినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి.౹ తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి యొక కుమారుని కనెను; తన యింటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను.౹ అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్‍హోరోనును దక్షిణపు బేత్‍హోరోనును ఉజ్జెన్‌షెయెరాను కట్టించెను.౹ వాని కుమారులు రెపహు రెషెపు; రెపహు కుమారుడు తెలహు, తెలహు కుమారుడు తహను,౹ తహను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు, అమీహూదు కుమారుడు ఎలీషామా,౹ ఎలీషామా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ.౹ వారికి స్వాస్థ్యములైన నివాసస్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంతవరకు వ్యాపించెను.౹ మరియు మనష్షీయుల ప్రక్కనున్న బేత్షెయాను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను, ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతివారు కాపురముండిరి. ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి.౹ బెరీయా కుమారులు హెబెరు మల్కీ యేలు, మల్కీయేలు బిర్జాయీతునకు తండ్రి.౹ హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరియైన షూయాను కనెను.౹ యప్లేటు కుమారులెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు.౹ షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము.౹ వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు.౹ జోపహు కుమారులు సూయ హర్నెపెరు షూయాలు బేరీ ఇమ్రా బేసెరు హోదు షమ్మా షిల్షా ఇత్రాను బెయేర.౹ ఎతెరు కుమారులు యెఫున్నె పిస్పా అరా.౹ ఉల్లా కుమారులు ఆరహు హన్నియేలు రిజెయా.౹ ఆషేరు సంతతివారైన వీరందరును తమపితరులయిండ్లకు పెద్దలును ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులును అధిపతులలో ముఖ్యులునైయుండిరి. ఆ వంశపువారిలో యుద్ధమునకు పోతగినవారి లెక్క యిరువది యారువేలు. బెన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,౹ మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.౹ బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు అబీషూవ నయమాను అహోయహు గెరా షెపూపాను హూరాము.౹ ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;౹ నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొనిపోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.౹ వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమపితరులయిండ్లకు పెద్దలుగా ఉండిరి.౹ హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.౹ ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.౹ బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.౹ అహ్యో షాషకు యెరేమోతు జెబద్యా అరాదు ఏదెరు మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.౹ జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.౹ యాకీము జిఖ్రీ జిబ్ది ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.౹ అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు.౹ [22-25] ఇష్పాను ఏబెరు ఎలీయేలు అబ్దోను జిఖ్రీ హానాను హనన్యా ఏలాము అంతోతీయా ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.౹ *** *** *** షంషెరై షెహర్యా అతల్యా యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.౹ వీరు తమతమ తరములన్నిటిలో పితరులయిండ్లకు పెద్దలును, ప్రముఖులునైయుండి యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్యపేరు మయకా;౹ ఇతని పెద్దకుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు గెదోరు అహ్యో జెకెరు అనువారు.౹ మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతోకూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి.౹ నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనా దాబును ఎష్బయలును కనెను.౹ యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.౹ మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.౹ ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాదా ఆలెమెతును అజ్మావెతును జిమ్రీని కనెను, జిమ్రీ మోజాను కనెను.౹ మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.౹ ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీ కాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.౹ అతని సహోదరుడైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.౹ ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణు లైన పరాక్రమశాలులు; వీరికి నూటయేబదిమంది కుమారులును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యామీనీయులు. ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడినమీదట వారిపేళ్లు ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదావారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొని పోబడిరి.౹ తమ స్వాస్థ్యములైన పట్టణములలోమునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును నెతీనీయులును.౹ యూదావారిలోను బెన్యామీనీయులలోను ఎఫ్రాయిము మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారుడైన ఇమ్రీకి పుట్టిన ఒమ్రీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతైయు.౹ షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలును.౹ జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబదిమంది,౹ బెన్యామీనీయులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు,౹ యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రికి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నీయా కుమారుడైన రగూవేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడగు మెషుల్లాము.౹ వీరును వీరి సహోదరులును తమతమ వంశముల పట్టీల చొప్పున తొమ్మిదివందల ఏబది ఆరుగురు; ఈ మనుష్యులందరును తమపితరుల వంశములనుబట్టి తమపితరులయిండ్లకు పెద్దలు. యాజకులలో యెదాయా యెహోయారీబు యాకీను,౹ దేవుని మందిరములో అధిపతియైన అహీటూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కీయా కుమారుడైన అజర్యా;౹ మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.౹ మరియు తమపితరులయిండ్లకు పెద్దలైన వెయ్యిన్ని యేడువందల అరువది మంది కుటుంబికులు. వీరు దేవుని మందిరసేవా సంబంధమైన కార్యములయందు మంచి గట్టివారు.౹ మరియు లేవీయులలో మెరారి సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా,౹ బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా,౹ యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా.౹ ద్వారపాలకులు ఎవరనగా షల్లూము అక్కూబు టల్మోను అహీమాను అనువారును వారి సహోదరులును. వీరిలో షల్లూము పెద్ద.౹ లేవీయుల సమూహములలో వీరు తూర్పుననుండు రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురము చేయుచున్నారు.౹ మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని యింటివారును వాని సహోదరులగు కోరహీయులును సేవాసంబంధమైన పనిమీద నుండి గుడారమునకు ద్వారపాలకులై యుండిరి; వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారై యుండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి.౹ ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసుమునుపు వారిమీద అధికారియైయుండెను, యెహోవా అతనితోకూడ నుండెను.౹ మరియు మెషె లెమ్యా కుమారుడైన జెకర్యా సమాజపు గుడారముయొక్క ద్వారమునకు కావలి.౹ గుమ్మములయొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరు రెండువందల పన్నిద్దరు; వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళిచొప్పున సరిచూడ బడిరి; వీరు నమ్మదగినవారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి.౹ వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు, అనగా గుడారపు మందిరముయొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలికాయు పని గలిగియుండెను.౹ గుమ్మముల కావలి వారు నాలుగు దిశలను, అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమునను ఉండిరి.౹ వారి సహోదరులు తమ గ్రామములలోనుండి యేడేసి దినముల కొకసారి వారియొద్దకు వచ్చుటకద్దు.౹ లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై యుండిరి; దేవుని మందిరపు గదులమీదను బొక్కసములమీదను ఆ లేవీయులు ఉంచబడియుండిరి.౹ వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దానిచుట్టు ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచుపనివారిదే.౹ వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టు వారు, వారు లెక్కచొప్పున వాటిని లోపలికి కొని పోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసికొని రావలెను.౹ మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూప వర్గమును వారి అధీనము చేయబడెను.౹ యాజకుల కుమారులలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయుదురు.౹ లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్దకుమారుడైన మత్తిత్యా పిండివంటలమీద నుంచబడెను.౹ వారి సహోదరులగు కహాతీయులలో కొందరికి విశ్రాంతిదినమున సముఖపు రొట్టెలు సిద్ధముచేయుపని కలిగియుండెను.౹ లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్లు పని విచారణ కలిగి యున్న హేతువుచేత వారు కడమ పనుల విచారణలేకుండ తమ గదులలోనుండిరి.౹ వీరు తమ వంశపట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైనవారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి.౹ గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా.౹ ఇతని పెద్దకుమారుడు అబ్దోను; సూరు కీషు బయలు నేరు నాదాబు గెదోరు అహ్యో జెకర్యా మిక్లోతు తరువాత పుట్టినవారు.౹ మిక్లోతు షిమ్యాను కనెను. వీరు యెరూషలేము వాసులగు తమ సహోదరులతోకూడ తమ సహోదరులకు ఎదురుగా నున్న యిండ్లలోనే కాపురముండిరి.౹ నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూ వను అబీనాదాబును ఎష్బయలును కనెను.౹ యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.౹ మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ (ఆహాజు.) ఆహాజు యరాను కనెను; యరా ఆలెమె తును అజ్మావెతును జిమ్రీని కనెను, జిమ్రీ మోజాను కనెను.౹ మోజా బిన్యాను కనెను, రెఫాయా బిన్యాకు కుమారుడు, ఎలాశా రెఫాయాకు కుమారుడు, ఆజేలు ఎలాశాకు కుమారుడు.౹ ఆజేలునకు ఆరుగురు కుమారు లుండిరి; వారు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను అను పేళ్లుగలవారు; వీరు ఆజేలు కుమారులు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి.౹ ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును మల్కీషూవను హతముచేసిరి.౹ యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను.౹ అప్పుడు సౌలు–ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండ నీవు నీ కత్తిదూసి నన్ను పొడిచివేయుమని తన ఆయుధములను మోయువానితోననగా, వాడు బహుగా భయపడి ఆలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తిమీదపడెను.౹ సౌలు చనిపోయెనని ఆయుధములను మోయువాడు తెలిసి కొని తానును కత్తిని పట్టుకొని దానిమీదపడి చచ్చెను.౹ ఆప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులును చచ్చిరి. మరియు అతని యింటివారందరును చచ్చిరి.౹ జనులు పారిపోయిరనియు, సౌలును అతని కుమారులును చనిపోయిరనియు, లోయలోని ఇశ్రాయేలీయులందరు తెలిసికొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చివాటిలో కాపురముండిరి. హతులైనవారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులును గిల్బోవ పర్వతమందు చచ్చిపడియుండుట చూచి అతని కవచమును దోచుకొని, అతని తలను అతని ఆయుధములను తీసికొనిపోయి ఫిలిష్తీయుల దేశమంతట వాటిని త్రిప్పి, జరిగినదానిని విగ్రహములకును జనులకును చాటించిరి.౹ వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి.౹ [11-12] ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదువారు వినినప్పుడు పరాక్రమశాలులైనవారందరును లేచిపోయి, సౌలు శవమును అతని కుమారుల శవములను తీసికొని యాబేషునకువచ్చి వారి యెముకలను యాబేషునందలి సింధూరవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉపవాసముండిరి.౹ *** ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచములయొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హత మాయెను.౹ అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులందరును హెబ్రోనులో నుండు దావీదునొద్దకు కూడి వచ్చి–చిత్తగించుము, మేము నీకు ఎముకనంటినవారము రక్తసంబంధులము.౹ ఇంతకు ముందు సౌలు రాజైయున్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై యుంటివి–నా జనులగు ఇశ్రాయేలీయులను నీవు ఏలి వారిమీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవిచేసిరి.౹ ఇశ్రాయేలీయుల పెద్దలందరును హెబ్రోనులోనున్న రాజు నొద్దకురాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధనచేసెను; అప్పుడు వారు సమూయేలుద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకము చేసిరి.౹ తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరును యెరూషలే మనబడిన యెబూసునకు పోయిరి; ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి.౹ అప్పుడు–నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్థులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను.౹ ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవియ్యగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటె ముందుగా ఎక్కి ఆయాధిపత్యమును పొందెను.౹ తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపుర మను పేరు కలిగెను.౹ దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను.౹ సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోను ఇశ్రాయేలీయులందరితోను కూడి సహాయముచేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు.౹ దావీదు నొద్దనుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోనివారు ముప్పదిమంది; వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడు వందలమందిని చంపి వారిమీద ఈటె ఆడించినవాడు.౹ ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదోకుమారుడైన ఎలియాజరు; ఇతడు పరాక్రమశాలులని పేరుపొందిన ముగ్గురిలో ఒకడు.౹ ఫిలిష్తీయులు దానినిండ యవలుగల చేను ఉన్న పస్దమ్మీములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతోకూడ అచ్చట ఉండెను.౹ వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతముచేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను.౹ ముప్పదిమంది పరాక్రమశాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టురాతికొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి యుండెను.౹ దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బేత్లెహేమునందుండెను.౹ దావీదు ఆశపడి–బేత్లెహేమునందలి ఊరి గవినియొద్ద బావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చియిచ్చునని అనగా ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి పోయి బేత్లెహేము ఊరి గవినియొద్ద బావినీళ్లు చేదుకొని దావీదునొద్దకు తీసికొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి –నేను ఈలాగు చేయకుండ నా దేవుడు నన్ను కాచునుగాక; ప్రాణమునకు తెగించి యీ నీళ్లు తెచ్చిన యీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను; ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి.౹ యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడువందలమందిని హతముచేసి తన యీటె వారిమీద ఆడించినవాడై యీ ముగ్గురిలోను పేరుపొందిన వాడాయెను.౹ ఈ ముగ్గురిలోను కడమ యిద్దరికంటె అతడు ఘనతనొందినవాడై వారికి అధిపతియాయెనుగాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు.౹ మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియలవలన గొప్ప వాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారులనిద్దరిని చంపెను; మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపి వేసెను.౹ అయిదు మూరల పొడవుగల మంచియెత్తరియైన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను; ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనెవంటి యీటె యొకటి యుండగా ఇతడు ఒక దుడ్డుకఱ్ఱ చేతపట్టుకొని వానిమీదికిపోయి ఆ యీటెను ఐగుప్తీయుని చేతిలోనుండి ఊడలాగి దానితో వానిని చంపెను.౹ యెహోయాదా కుమారుడైన బెనాయా యిట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనొందిన వాడాయెను.౹ ముప్పదిమందిలోను ఇతడు వాసికెక్కెనుగాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు; దావీదు ఇతనిని తన దేహసంరక్షకులకధిపతిగా ఉంచెను. మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు లెవరనగా యోవాబు తమ్ముడైన అశాహేలు; బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను,౹ హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,౹ తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,౹ హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,౹ నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,౹ బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా,౹ గాయషులోయవాడైన హూరై, అర్బా తీయుడైన అబీయేలు,౹ బహరూమీయుడైన అజ్మావెతు, షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా,౹ గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను,౹ హరారీయుడైన శాకారు కుమారుడగు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,౹ మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,౹ కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,౹ నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,౹ అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబుయొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,౹ ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,౹ హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,౹ రూబేనీయుడైన షీజా కుమారుడును రూబే నీయులకు పెద్దయునైన అదీనా, అతనితోటివారగు ముప్పదిమంది,౹ మయకా కుమారుడైన హానాను, మిత్నీ యుడైన యెహోషాపాతు,౹ ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కుమారులగు షామా యెహీయేలు,౹ షిమ్రీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా,౹ మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా,౹ ఎలీయేలు ఓబేదు, మెజో బాయా ఊరివాడైన యహశీయేలు. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి యింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.౹ వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైనవారు.౹ వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి; ఇతని తరువాతివాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ,౹ ముప్పదిమందిలో పరాక్రమశాలియు ముప్పదిమందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు,౹ ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా,౹ కోరహీయులగు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,౹ గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.౹ మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములుగలవారు, కొండలలోనుండు జింకలంతపాద వేగము గలవారు.౹ వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,౹ నాల్గవవాడు దుష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,౹ ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు,౹ ఎనిమిదవ వాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు,౹ పదియవవాడు యిర్మీయా, పదకొండవవాడు మక్బన్నయి.౹ గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై యుండిరి; వారిలో అత్యల్పుడైనవాడు నూరుమందికి అధిపతి, అత్య ధికుడైనవాడు వెయ్యిమందికి అధిపతి,౹ యొర్దాను గట్టులమీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పులోయలలోను పడమటిలోయలలోను ఉన్న వారినందరిని తరిమివేసినవారు వీరే.౹ మరియు బెన్యామీనీయులలో కొందరును యూదా వారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి.౹ దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను–మీరు సమాధానము కలిగి నాకు సహాయముచేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగి యుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.౹ అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడై–దావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలు కగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.౹ సౌలుమీద యుద్ధముచేయబోయిన ఫిలిష్తీయులతోకూడ దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షముచేరిరి; దావీదు ఫిలిష్తీయులకు సహాయము చేయకపోయెను, ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయునని యెంచి ఫిలిష్తీయుల అధికారులు అతని పంపివేసిరి.౹ అంతట అతడు సిక్లగునకు తిరిగి పోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపువారికి అధిపతులు అతని పక్షముచేరిరి.౹ వారందరును పరాక్రమశాలులును సైన్యాధిపతులునైయుండిరి; ఆ దండును హతముచేయుటకు వారు దావీదునకు సహాయముచేసిరి.౹ దావీదు దండు దేవుని సైన్యమువలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతనియొద్దకు వచ్చుచుండిరి. యెహోవా నోటిమాట ప్రకారము సౌలుయొక్క రాజ్యమును దావీదుతట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతనియొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్కయెంతయనగా యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై యున్నవారు ఆరువేల ఎనిమిదివందలమంది.౹ షిమ్యోనీయులలో యుద్ధమునకు తగినశూరులు ఏడువేల నూరుమంది.౹ లేవీయులలో అట్టివారు నాలుగువేల ఆరువందలమంది.౹ అహరోను సంతతివారికి యెహోయాదా అధిపతి, అతనితోకూడ ఉన్నవారు మూడువేల ఏడువందలమంది.౹ పరాక్రమశాలియైన సాదోకు అను యౌవనునితోకూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.౹ సౌలు సంబంధులగు బెన్యామీనీయులు మూడువేలమంది; అప్పటివరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు గాపాడుచుండిరి.౹ తమపితరుల యింటివారిలో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రా యిమీయులలో ఇరువదివేల ఎనిమిది వందలమంది.౹ మనేష్షయొక్క అర్ధగోత్రపువారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరు పేరుగా నియమింపబడినవారు పదునెనిమిదివేలమంది.౹ ఇశ్శాఖారీయులలో సమయో చిత జ్ఞానముకలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు; వీరి గోత్రపు వారందరును వీరి యాజ్ఞకు బద్ధులైయుండిరి.౹ జెబూలూ నీయులలో సకలవిధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగినవారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరపులేకుండ యుద్ధము చేయగలవారును ఏబదివేలమంది.౹ నఫ్తాలీయులలో వెయ్యిమంది అధిపతులు, వారితోకూడ డాలును ఈటెను పట్టుకొనినవారు ముప్పదియేడువేలమంది.౹ దానీయులలో యుద్ధ సన్నద్ధులైనవారు ఇరువది యెనిమిదివేల ఆరు వందలమంది.౹ ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలువది వేలమంది.౹ మరియు యొర్దాను నది అవతలనుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకలవిధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన యీ యోధులందరు దావీదును ఇశ్రాయేలుమీద రాజుగా నియమించవలె నన్న కోరిక హృదయమందు కలిగినవారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి.౹ ఇశ్రాయేలులో కడమ వారందరును ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలెనని కోరియుండిరి.౹ వారి సహోదరులు వారి కొరకు భోజనపదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతోకూడ అచ్చట మూడుదినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి.౹ ఇశ్రాయేలీయులకు సంతో షము కలిగియుండెను గనుక ఇశ్శాఖారు జెబూలూను నఫ్తాలి అనువారి పొలిమేరలవరకు వారికి సమీపమైనవారు గాడిదలమీదను ఒంటెలమీదను కంచరగాడిదలమీదను ఎద్దులమీదను ఆహారవస్తువులైన పిండివంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్షపండ్లగెలలను ద్రాక్షారసమును నూనెను గొఱ్ఱెలను పశువులను విస్తారముగా తీసికొనివచ్చిరి. దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచనచేసి, సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను –ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగినయెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతోకూడుకొనునట్లు వారియొద్దకు పంపి మన దేవుని మందసమును మరల మనయొద్దకు కొంచు వత్తము రండి; సౌలు దినములలో దానియొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి.౹ ఈ కార్యము సమా జకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరును ఆప్రకారము చేయుదుమనిరి.౹ కాగా దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తీసికొని వచ్చుటకు దావీదు ఐగుప్తుయొక్క షీహోరునది మొదలుకొని హమాతునకు పోవుమార్గమువరకునుండు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చెను.౹ కెరూబులమధ్య నివాసముచేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలోనుండు కిర్యత్యారీము అనబడిన బాలానుండి తీసికొనివచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరును అచ్చటికి పోయిరి.౹ వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండిమీద ఎక్కించి, అబీనాదాబు ఇంటనుండి తీసికొనివచ్చిరి; ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి.౹ దావీదును ఇశ్రాయేలీయులందరును తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి.౹ వారు కీదోను కళ్లమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయిచాపగా యెహోవా కోపము అతనిమీద రగులుకొనెను, అతడు తన చేయి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను.౹ యెహోవా ఉజ్జాను వినాశము చేయుటచూచి దావీదు వ్యాకులపడెను; అందుచేత ఆ స్థలమునకు నేటివరకు పెరెజ్ ఉజ్జా అని పేరు.౹ ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమొంది–దేవుని మందసమును నాయొద్దకు నేను ఏలాగు తీసికొని పోవుదుననుకొని, మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసికొనిపోక, దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను.౹ దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను, అతనికి ఒక యిల్లు కట్టుటకై దేవదారు మ్రానులను, కాసెపనివారిని వడ్లవారిని పంపెను.౹ తన జనులగు ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగాస్థిరపరచెనని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంక కొందరు స్త్రీలను వివాహము చేసికొని యింక కుమారులను కుమార్తెలను కనెను.౹ యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరులేవనగా, షమ్మూయ షోబాబు నాతాను సొలొమోను [5-7] ఇభారు ఏలీషూవ ఎల్పాలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా బెయెల్యెదా ఎలీపేలెటు. *** *** దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా అభిషేకము చేయబడెనని విని, ఫిలిష్తీయులందరు దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను.౹ ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలోదిగిరి.౹ ఫిలిష్తీయులమీదికి నేను పోయినయెడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా? అని దావీదు దేవునియొద్ద విచారణచేయగా యెహోవా —పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెలవిచ్చెను.౹ వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతముచేసి–జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరుపెట్టెను.౹ వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చి వేయవలెనని దావీదు సెలవిచ్చెను.౹ ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవునియొద్ద విచారణచేసెను. అందుకు దేవుడు–నీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టు తిరిగి కంబళిచెట్లకు ఎదురుగా నిలిచి కంబళిచెట్ల కొనలయందు కాళ్లచప్పుడు నీకు వినబడునప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారిమీద పడుము; ఆ చప్పుడు వినబడునప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్లియున్నాడని తెలిసికొనుమని సెలవిచ్చెను.౹ దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదుచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజెరువరకు తరిమి హతముచేసిరి.౹ కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతట ప్రసిద్ధియాయెను; యెహోవా అతని భయము అన్యజనులకందరికి కలుగజేసెను. దావీదు తనకొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను; దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి, దానిమీద గుడారమొకటి వేయించెను.౹ –మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవచేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి–వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను.౹ అంతట దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తీసికొనివచ్చుటకై ఇశ్రాయేలీయులనందరిని యెరూషలేమునకు సమాజముగా కూర్చెను.౹ [4-5] అహరోను సంతతివారిని లేవీయులైన కహాతు సంతతివారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో నూట ఇరువదిమందిని,౹ *** మెరారీయులలో అధిపతియైన అశాయాను వాని బంధువులలో రెండువందల ఇరువది మందిని,౹ గెర్షోను సంతతివారికధిపతియగు యోవేలును వాని బంధువులలో నూట ముప్పదిమందిని,౹ ఎలీషా పాను సంతతివారికధిపతియగు షెమయాను వాని బంధు వులలో రెండువందలమందిని,౹ హెబ్రోను సంతతివారి కధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో ఎనుబదిమందిని ఉజ్జీయేలు సంతతివారికధిపతియగు అమ్మీనా దాబును వాని బంధువులలో నూట పండ్రెండుగురిని దావీదు సమకూర్చెను.౹ అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమ్మీనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.౹ –లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై యున్నారు.౹ ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మందసమును మోయక యుండుటచేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధినిబట్టి విచారణచేయకుండుటచేతను, ఆయన మనలో నాశనము కలుగజేసెను; కావున ఇప్పుడు మీరును మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలెను.౹ అప్పుడు యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి.౹ తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటనుబట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజములమీదికి ఎత్తికొనిరి.౹ అంతట దావీదు–మీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్యవిశేషములతో గంభీర ధ్వనిచేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటుచేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.౹ కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును,౹ వీరితోకూడ రెండవ వరుసగానున్న తమ బంధువులైన జెకర్యా బేను యహజీయేలు షెమీరా మోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు బెనాయా మయ శేయా మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు లనువారిని ద్వారపాలకులగు ఓబేదెదోమును యెహీయేలును పాటకు లనుగా నియమించిరి.౹ పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి.౹ జెకర్యా అజీయేలు షెమీరామోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు మయశేయా బెనాయా అనువారు హెచ్చు స్వరముగల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి.౹ మరియు మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు ఓబేదెదోము యెహీయేలు అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి.౹ లేవీయుల కధిపతియైన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను.౹ బెరెక్యాయును ఎల్కానాయును మందసమునకు ముందునడుచు కావలివారుగాను షెబన్యా యెహోషాపాతు నెతనేలు అమాశై జెకర్యా బెనాయా ఎలీయెజెరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఓబేదెదోమును యెహీయాయును వెనుకతట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి.౹ దావీదును ఇశ్రాయేలీయుల పెద్దలును సహస్రాధిపతులును యెహోవా నిబంధనమందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి.౹ యెహోవా నిబంధనమందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయముచేయగా వారు ఏడు కోడెలను ఏడు గొఱ్ఱెపొట్టేళ్లను బలులుగా అర్పించిరి.౹ దావీదును మందసమును మోయు లేవీయులందరును పాట కులును పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపునారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని యుండిరి, దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించియుండెను.౹ ఇశ్రాయేలీయులందరును ఆర్భా టముచేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధనమందసమును తీసికొనివచ్చిరి.౹ యెహోవా నిబంధనమందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తెయైన మీకాలు కిటికీలోనుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసికొని వచ్చి, దావీదు దానికొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహనబలులను సమాధానబలులను అర్పించిరి.౹ దహనబలులను సమాధానబలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్షపండ్ల అడను పంచి పెట్టెను. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవచేయుచు, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను.౹ వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెహీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.౹ బెనాయా యహజీయేలు అను యాజకులు ఎప్పుడును దేవుని నిబంధనమందసము ఎదుట బూరలు ఊదువారు. ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటనచేయుడి ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి యెహోవాను వెదకువారు హృదయమునందు సంతో షించుదురు గాక. యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారా ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసి కొనుడి ఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి. మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్పసంఖ్యగల జనులు గాను కనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి. వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్యనిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు. వారు జనమునుండి జనమునకును రాజ్యమునుండి రాజ్యమునకును తిరుగులాడుచుండగా నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడుచేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్యలేదువారి నిమిత్తము రాజులను గద్దించెను. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు. ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమాబలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయనయెదుట సాగిలపడుడి. భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక పొలములును వాటియందుండు సర్వమును సంతో షించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయు చున్నాడు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతర ముండును. ఆయనను స్తుతించుడి. దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము మమ్మును చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగునవారు పాడగా జనులందరు ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదినసేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధనమందసముమీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదె దోమును వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను.౹ గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.౹ యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతిచేయుటకై వీరితోకూడ హేమానును యెదూతూనును పేళ్లవరుసను ఉదాహరింపబడిన మరి కొందరిని నియమించెను.౹ బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతములను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను. మరియు యెదూతూను కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించెను.౹ తరువాత జనులందరును తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి; దావీదును తన యింటి వారిని దీవించుటకై వారియొద్దకు పోయెను. దావీదు తన యింటనుండి ప్రవక్తయైన నాతానును పిలిపించి–నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధనమందసము తెరలచాటున నున్నదని చెప్పగా నాతాను —దేవుడు నీకు తోడైయున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అనెను.౹ ఆ రాత్రియందు దేవునివాక్కు నాతానునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము–యెహోవా సెలవిచ్చునదేమనగా నా నివాసమునకై యొక ఆలయముకట్టించుట నీచేతకాదు.౹ ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు నేను ఒక యింటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని.౹ నేను ఇశ్రాయేలీయులందరిమధ్యను సంచరించిన కాలమంతయు–మీరు నాకొరకు దేవదారుమ్రానులతో ఆలయము కట్ట కుంటిరేమియని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాటయైన పలికియుంటినా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా–సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు–నీవు నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతివై యుండునట్లు, గొఱ్ఱెలవెంబడి తిరుగుచున్న నిన్ను గొఱ్ఱెల దొడ్డినుండి తీసికొని నీవువెళ్లిన చోట్లనెల్ల నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవారిని నీ ముందర నిలువనియ్యక నిర్మూలము చేసితిని; లోకములోని ఘనులకు కలిగియున్న పేరువంటి పేరు నీకు కలుగ జేయుదును మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును, వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు, పూర్వమందు జరిగినట్లును, నా జనులైన ఇశ్రాయేలీయులమీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచు వచ్చినట్లును, దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు;౹ నీ పగవారినందరిని నేను అణచి వేసెదను. అదియుగాక–యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని.౹ నీ జీవిత దినములు తీరి నీ పితరులయొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారులవలన కలుగు నీ సంతతిని నేను స్థాపనచేసి అతని రాజ్యమును స్థిరపరచెదను.౹ అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను.౹ నేను అతనికి తండ్రినైయుందును, అతడు నాకు కుమారుడైయుండును; నీకంటె ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను.౹ నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికిని స్థిరముగానుండునని అతనికి తెలియజేయుము. నాతాను తనకు ప్రత్యక్షమైనదానిబట్టి యీ మాట లన్నిటిని దావీదునకు తెలియజేయగా రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను–దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటివాడను? నా యిల్లు ఏమాత్రపుది? దేవా, యిది నీ దృష్టికి స్వల్పవిషయమే; దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలమువరకు నీ సేవకుని సంతతినిగూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాటలాడునట్లు దయ పాలించి నాతో మాటలాడి, నా సంతతి ఘనతజెందునని మాట యిచ్చియున్నావు.౹ నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతనుగూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవిచేసెదను? నీవు నీ దాసుని ఎరుగుదువు.౹ యెహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు, అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు.౹ యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు.౹ నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులోనుండి నీవు విమోచించిన నీ జనులయెదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీ వాలాగున చేసితివి; యెహోవావైన నీవు వారికి దేవుడవై యున్నావు యెహోవా, ఇప్పుడు నీ దాసునిగూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక.౹ ఇశ్రాయేలీయులదేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడైయున్నాడని నీ పేరు ఎన్నటి కిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక; మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ యెదుట స్థిరపరచబడునుగాక.౹ దేవా —నీకు సంతతి కలుగజేసెదనని నీ దాసునికి నీవు తెలియ జేసియున్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను.౹ యెహోవా, నీవు దేవుడవైయుండి నీ దాసునికి ఈ మేలు దయచేసెదనని సెలవిచ్చియున్నావు.౹ ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించియున్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించినయెడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి యుండును. ఇదియైన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి, వారిని లోపరచి, గాతు పట్టణమును దాని గ్రామములును ఫిలిష్తీయుల వశమున నుండకుండ వాటిని పట్టుకొనెను.౹ అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పముకట్టు దాసులైరి.౹ సోబా రాజైన హదదెజెరు యూఫ్రటీసునదివరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి అతని యొద్దనుండి వెయ్యి రథములను ఏడువేల గుఱ్ఱపు రౌతులను ఇరువదివేల కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో నూరింటికి కావలసిన గుఱ్ఱములను ఉంచుకొని కడమవాటికన్నిటికి చీలమండ నరములు తెగవేయించెను.౹ సోబారాజైన హదదెజెరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియనులురాగా దావీదు ఆ సిరియనులలో ఇరువదిరెండువేలమందిని హతముచేసెను.౹ తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను; సిరియనులు దావీదునకు కప్పముకట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతనికి సహాయముచేయుచు వచ్చెను.౹ మరియు హదదెజెరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసికొని యెరూషలేమునకు చేర్చెను.౹ హదదెజెరుయొక్క పట్టణములైన టిబ్హతులోనుండియు, కూనులోనుండియు దావీదు బహువిస్తారమైన యిత్తడిని తీసికొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములును ఇత్తడి వస్తువులను చేయించెను.౹ దావీదు సోబారాజైన హదదెజెరుయొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హమాతురాజైన తోహూకు వినబడెను.౹ హదదెజెరునకును తోహూకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదదెజెరుతో యుద్ధముచేసి అతని నోడించినందుకై దావీదుయొక్క క్షేమము తెలిసికొనుటకును, అతనితో శుభవచనములు పలుకుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి, తోహూ తన కుమారుడైన హదోరమును అతనియొద్దకు పంపెను.౹ ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదో మీయులయొద్ద నుండియు, మోయాబీయులయొద్ద నుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయుల యొద్దనుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.౹ మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో పదునెనిమిది వేలమందిని హతము చేసెను.౹ దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను, ఎదోమీయులందరును అతనికి సేవకులైరి, దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతని రక్షించెను. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరిమీదను రాజైయుండి తన జనులందరికిని నీతిన్యాయములను జరిగించెను.౹ సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధి పతియైయుండెను; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపుదస్తావేజులమీద నుండెను;౹ అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు, షవ్షా శాస్త్రి;౹ యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతియైయుండెను; మరియు దావీదుయొక్క కుమారులు రాజునకు సహాయులై యుండిరి. ఇదియైన తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను.౹ అప్పుడు దావీదు–హానూను తండ్రియైన నాహాషు నా యెడల దయ చూపించెను గనుక నేను అతనికుమారుని యెడల దయ చూపెదనని యనుకొని, అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల యధిపతులు హానూనుతో–నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని ఘనపర చుటకే అని నీవనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకేగదా అతని సేవకులు నీయొద్దకు వచ్చియున్నారు అని మనవిచేయగా హానూను దావీదు సేవకులను పట్టుకొని, వారిని గొరిగించి, వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసెను.౹ ఆ మనుష్యులు ఇంటికి వచ్చుచుండగా కొందరువచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి; వారు బహు లజ్జాక్రాంతులై యుండిరి గనుక వారికి ఎదురుగా మనుష్యులను పంపి–మీ గడ్డములు పెరుగుదనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమాన మంపెను.౹ అమ్మోనీయులు దావీదునకు తమయందు అసహ్యము పుట్టించితిమని తెలిసికొనినప్పుడు హానూనును అమ్మోనీయులును అరామ్నహరయీము నుండియు, సిరియా మయకానుండియు సోబానుండియు రథములను గుఱ్ఱపురౌతులను రెండువేల మణుగుల వెండి ఇచ్చి బాడిగెకు కుదుర్చుకొనిరి.౹ ముప్పది రెండువేల రథములతో వచ్చునట్లు జీతమిచ్చి మయకారాజును అతని జనులను కుదుర్చుకొనిరి; వీరు వచ్చి మేదెబా ముందరితట్టున దిగిరి, అమ్మోనీయులు తమతమ పట్టణములలోనుండి కూడుకొని యుద్ధముచేయుటకు వచ్చిరి.౹ దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలుల నందరిని పంపెను.౹ అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యొద్ద యుద్ధపంక్తులు తీర్చిరి, వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి.౹ తాను రెండు సైన్యములమధ్యను చిక్కుబడి యుండుట చూచి, యోవాబు ఇశ్రాయేలీయులలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని, సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి,౹ కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరచి, తన సహోదరుడైన అబీషైకి అప్పగించి యిట్లనెను సిరియనుల బలమునకు నేను నిలువలేకపోయినయెడల నీవు నాకు సహాయము చేయవలెను, అమ్మోనీయుల బలమునకు నీవు నిలువలేకపోయినయెడల నేను నీకు సహాయము చేయుదును.౹ ధైర్యము కలిగి యుండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము; యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక.౹ ఆప్రకారము యోవాబును అతనితోకూడ నున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువలేక అతని యెదుటనుండి తిరిగి పారిపోయిరి.౹ సిరియనులు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషైముందర నిలువలేక తిరిగి పారిపోయి పట్టణములో చొచ్చిరి, యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను.౹ తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని సిరియనులు తెలిసికొనినప్పుడు వారు దూతలను పంపి, యేటి ఆవలి సిరియనులను పిలిపించుకొనిరి, హదదెజెరుయొక్క సైన్యాధిపతియైన షోపకు వారికి నాయకుడాయెను.౹ దావీదు ఆ సంగతి తెలిసికొని ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చి యొర్దాను దాటి వారికి ఎదురుపడి వారియెదుట సైన్యములను వ్యూహపరచెను, దావీదు సిరియనులకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి.౹ అయితే సిరియనులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువక తిరిగి పారిపోయిరి; దావీదు సిరియనులలో ఏడువేల రథికులను నలుబది వేలకాల్బలమును హతముచేసి సైన్యాధిపతియైన షోపకును చంపి వేసెను.౹ తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని హదదెజెరుయొక్క సేవకులు తెలిసికొనినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటి నుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనస్సులేక యుండిరి. మరుసటియేట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమకూర్చి, అమ్మోనీయుల దేశమును పాడుచేసివచ్చి రబ్బాకు ముట్టడివేసెను; దావీదు యెరూషలేములోనేయుండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతముచేసెను.౹ దావీదు వచ్చి వారి రాజు తలమీదనున్న కిరీటమును తీసి కొనెను; దాని యెత్తు రెండు మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కియుండెను, దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహువిస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణములోనుండి తీసికొనిపోయెను.౹ దానియందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి, వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుపదంతెలతో చీరించెను; కొందరిని గొడ్డళ్లతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికిని చేసెను, అంతట దావీదును జనులందరును యెరూషలేమునకు తిరిగివచ్చిరి. అటుతరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను నొకని హతము చేసెను, అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి.౹ మరల ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగా యాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని యీటె నేతగాని దోనెయంత పెద్దది.౹ మరల గాతులో యుద్ధము జరిగెను; మంచి యెత్తరియగు ఒకడు అచ్చట ఉండెను, వానికి చేతిచేతికి కాలికాలికి ఆరేసి చొప్పున ఇరువది నాలుగు వ్రేళ్లుండెను, వాడు రెఫాయీయుల సంతతివాడు.౹ వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను.౹ గాతులోనున్న రెఫాయీయుల సంతతివారగు వీరు దావీదుచేతను అతని సేవకులచేతను హతులైరి. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనులయొక్క అధిపతులకును–మీరు వెళ్లి బెయేర్షెబా మొదలుకొని దానువరకుఉండు ఇశ్రాయేలీయులను ఎంచి, వారి సంఖ్య నాకు తెలియుటకై నాయొద్దకు దాని తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చెను.౹ అందుకు యోవాబు–రాజా నా యేలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్నవారికంటె నూరంతలు ఎక్కువమందిని చేయునుగాక; వారందరు నా యేలినవాని దాసులుకారా? నా యేలినవానికి ఈ విచారణ యేల? ఇది జరుగవలసిన హేతువేమి? జరిగినయెడల ఇశ్రాయేలీయులకు శిక్షకలుగును అని మనవిచేసెను.౹ అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతట సంచరించితిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను.౹ ఇశ్రాయేలీయులందరిలో కత్తిదూయువారు పదకొండు లక్షలమందియు యూదా వారిలో కత్తిదూయువారు నాలుగు లక్షల డెబ్బదివేలమందియు సంఖ్యకు వచ్చిరి.౹ రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్రసంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు.౹ ఈ కార్యము దేవునిదృష్టికి ప్రతికూలమగుటచేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను.౹ దావీదు–నేను ఈ కార్యముచేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొఱ్ఱపెట్టగా యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెను–నీవు వెళ్లి దావీదుతో ఇట్లనుము.౹ — యెహోవా సెలవిచ్చునదేమనగా–మూడు విషయములు నేను నీయెదుట నుంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొనినయెడల దాని నీకు చేయుదును.౹ కావున గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లనెను –మూడేండ్ల పాటు కరవు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువలేక నశించిపోవుట, మూడుదినములపాటు దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు నిలుచుటచేత యెహోవాదూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగ జేయుట, అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు; కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచించుము.౹ అందుకు దావీదు–నేను మిక్కిలి యిరుకులో చిక్కియున్నాను; యెహోవా మహా కృపగలవాడు, నేను మనుష్యులచేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను.౹ కావున యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో డెబ్బదివేలమంది చచ్చిరి.౹ యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతో–చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవియ్యగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్లము నొద్ద నిలిచెను.౹ దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యాకాశములమధ్యను నిలుచుచు, వరదీసిన కత్తి చేతపట్టుకొని దానిని యెరూషలేముమీద చాపిన యెహోవాదూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా దావీదు— జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనేగదా? పాపముచేసి చెడుతనము జరిగించినవాడను నేనేగదా? గొఱ్ఱెలవంటివారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనులమీద నుండకుండ నామీదను నా తండ్రి యింటివారిమీదను ఉండ నిమ్మని దేవునితో మనవిచేసెను.౹ యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవాదూత గాదునకు సెలవియ్యగా యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను.౹ ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చు చుండెను; అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు, అతడును అతనితోకూడనున్న అతని నలుగురు కుమారులును దాగుకొనిరి.౹ దావీదు ఒర్నానునొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి, కళ్లములోనుండి వెలుపలికి వచ్చి, తల నేలమట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను.౹ –ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్లపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా ఒర్నాను–రాజైన నా యేలినవాడు దాని తీసికొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయును గాక; ఇదిగో దహనబలులకు ఎద్దులు కట్టెలకై నురిపిడి సామగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి; ఇదియంతయు నేనిచ్చెదనని దావీదుతో అనెను.౹ రాజైన దావీదు–అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసికొని యెహోవాకు దహనబలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాని తీసికొందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి ఆరువందల తులముల బంగారమును అతని కిచ్చెను.౹ పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహనబలులను సమాధానబలులను అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశములోనుండి దహనబలిపీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను.౹ యెహోవాదూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలిసికొని అచ్చటనే బలి అర్పించెను మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహనబలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను.౹ దావీదు యెహోవాదూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవునియొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్లలేకుండెను. మరియు–దేవుడైన యెహోవా నివాసస్థలము ఇదేయని ఇశ్రాయేలీయులర్పించు దహనబలులకు పీఠము ఇదే యని దావీదు సెలవిచ్చెను.౹ తరువాత దావీదు ఇశ్రాయేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లు చెక్కువారిని నియమించెను.౹ వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన యినుమును తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఎంచనలవికానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను; సీదోనీయులును తూరీయులును దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసికొని వచ్చుచుండిరి.౹ –నా కుమారుడైన సొలొమోను పిన్నవయస్సుగల లేతవాడు; యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తినిబట్టియు అందమునుబట్టియు సకల దేశములలో ప్రసిద్ధిచెందునట్లుగా అది చాలా ఘనమైనదై యుండవలెను; కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచెదనని చెప్పి, దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి యుంచెను. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.౹ మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను–నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవానామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసికొనియుండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను— నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేలమీదికి ఓడ్చితివి.౹ నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును; చుట్టుఉండు అతని శత్రువులనందరిని నేను తోలివేసి అతనికి సమాధానము కలుగ జేతును; అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును; అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును.౹ అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడైయుండును, నేనతనికి తండ్రినై యుందును, ఇశ్రాయేలీయులమీద అతని రాజ్యసింహాసనమును నిత్యము స్థిరపరచుదును.౹ నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక; నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక.౹ నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించునట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయులమీద నీకు అధికారము దయచేయును గాక.౹ యెహోవా ఇశ్రాయేలీయులనుగూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్తపడినయెడల నీవు వృద్ధిపొందుదువు; ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము; భయపడకుము దిగులుపడకుము.౹ ఇదిగో నేను నా కష్టిస్థతిలోనే ప్రయాసపడి యెహోవా మందిరముకొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తారమైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రానులను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపా దించుదువుగాక.౹ మరియు పనిచేయతగిన విస్తారమైన శిల్పకారులును కాసెపనివారును వడ్రవారును ఏవిధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీయొద్ద ఉన్నారు.౹ లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి; కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలీయుల యధిపతులకందరికిని ఆజ్ఞాపించెను.౹ ఎట్లనగా–మీ దేవుడైన యెహోవా మీతోకూడ ఉన్నాడు గదా? చుట్టునున్న వారివలన తొందరలేకుండ ఆయన మీకు నెమ్మది యిచ్చియున్నాడుగదా? దేశనివాసులను ఆయన నాకు వశపరచియున్నాడు, యెహోవా భయమువలనను ఆయన జనుల భయమువలనను దేశము లోపరచబడియున్నది.౹ కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరచుకొని, ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామముకొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించెను.౹ మరియు అతడు ఇశ్రాయేలీయుల యధిపతులందరిని యాజకులను లేవీయులను సమకూర్చెను.౹ అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురు షులు.౹ వీరిలో ఇరువది నాలుగువేలమంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, ఆరు వేలమంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి.౹ నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి నాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి.౹ గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.౹ [7-8] లద్దాను కుమారులు ముగ్గురు; పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు *** షిమీ కుమారులు ముగ్గురు, షెలోమీతు హజీయేలు హారాను, వీరు లద్దాను వంశముయొక్క పితరుల పెద్దలు.౹ యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు.౹ యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమారులు అనేకులు లేకపోయిరి గనుక తమపితరుల యింటి వారిలో వారు ఒక్కవంశముగా ఎంచబడిరి.౹ కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.౹ అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమునుబట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి.౹ దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.౹ మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.౹ గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.౹ ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడుతప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.౹ ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.౹ హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.౹ ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు.౹ మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.౹ ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.౹ మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.౹ వీరు తమపితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరులయిండ్లకు పెద్దలైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమతమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయుపనివారైయుండిరి.౹ –ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు లేవీయులు కూడ ఇక మీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను.౹ దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి.౹ వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పనిచూచుటకును, వారి వశముననున్న యెహోవామందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును,౹ సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చుదానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములుగలవాటిని కొలతగలవాటిని విచారించుటకును,౹ అనుదినము ఉదయ సాయంకాలములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింప వలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి.౹ సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు, యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను. అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.౹ నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియాజరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.౹ దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతా మారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.౹ వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమపితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమతమపితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి.౹ ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.౹ లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరులయిండ్లపద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను. మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదాయాకు,౹ మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీమునకు,౹ అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,౹ [10-12] ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు, తొమ్మిదవది యేషూవకు పదియవది షెకన్యాకు పద కొండవది ఎల్యాషీబునకు, పండ్రెండవది యాకీమునకు,౹ *** *** పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబు నకు,౹ పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరు నకు,౹ పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు,౹ పందొమ్మిదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు,౹ ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు,౹ ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను.౹ ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవావారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను. శేషించిన లేవీ సంతతివారెవరనగా — అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,౹ రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును,౹ ఇస్హారీయులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,౹ హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,౹ ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును,౹ ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,౹ మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.౹ యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ.౹ మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.౹ కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.౹ మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు, వీరు తమపితరులయిండ్లనుబట్టి లేవీయులు.౹ వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లురాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరులయిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి. మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అష ర్యేలా అనువారు.౹ యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా షిమీ హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.౹ హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమ్తీయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు.౹ వీరందరును దేవుని వాక్కువిషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమానుయొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు పదునలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి యుండెను.౹ వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానముచేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి.౹ యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతోకూడనున్న ప్రవీణులైన గాయకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది.౹ తాముచేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదములేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.౹ మొదటి చీటి ఆసాపువంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు.౹ మూడవది జక్కూరు పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ నాలుగవది యిజ్రీ పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ అయిదవది నెతన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ ఆరవది బక్కీయాహు పేరటపడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ ఏడవది యెషర్యేలా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ ఎనిమిదవది యెషయా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ తొమ్మిదవది మత్తన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ పదియవది షిమీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ పదకొండ వది అజరేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ పండ్రెండవది హషబ్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండు గురు.౹ పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ పదునాలుగవది మత్తిత్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ పదునయిదవది యెరేమోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ పదునారవది హనన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండు గురు.౹ పదునేడవది యొష్బెకాషా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ పదు నెనిమిదవది హనానీపేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ పందొమ్మిదవది మల్లోతి పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ ఇరువదియవది ఎలీయ్యాతా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ ఇరువది యొకటవది హోతీరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ ఇరువది రెండవది గిద్దల్తీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ ఇరువది మూడవది మహజీయోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹ ఇరువది నాలుగవది రోమమ్తీయెజెరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. ద్వారపాలకుల విభాగమునుగూర్చినది. ఆసాపు. కుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు.౹ మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జెకర్యా జ్యేష్ఠుడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాల్గవవాడు,౹ ఏలాము అయిదవవాడు, యెహోహనాను ఆరవవాడు, ఎల్యో యేనై యేడవవాడు.౹ దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను; వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాల్గవవాడు, నెత నేలు అయిదవవాడు,౹ అమ్మీయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై యెనిమిదవవాడు.౹ వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి; వారు పరాక్రమశాలులైయుండి తమ తండ్రి యింటివారికి పెద్దలైరి.౹ షెమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు సెమక్యా.౹ ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమారులును వీరి సహోదరులును అరువది యిద్దరు, వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు.౹ మెషెలెమ్యాకు కలిగిన కుమారులును సహోదరులును పరాక్రమశాలులు, వీరు పదునెనిమిది మంది.౹ మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమ్రీ; వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను,౹ రెండవవాడగు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా, హోసా కుమారులును సహోదరులును అందరు కలిసి పదుముగ్గురు.౹ ఈలాగున ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయునట్లు సేవచేయుటకు ఈ ద్వారపాల కులు, అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి.౹ చిన్నలకేమి పెద్దలకేమి పితరుల యింటి వరుసనుబట్టియొక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లువేసిరి.౹ తూర్పుతట్టు కావలి షెలెమ్యాకు పడెను, వివేకముగల ఆలోచన కర్తయైన అతని కుమారుడగు జెకర్యాకు చీటివేయగా, ఉత్తరపుతట్టు కావలి వానికి పడెను,౹ ఓబేదెదోమునకు దక్షిణపువైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటికావలియు పడెను.౹ షుప్పీమునకును హోసాకును పడమటితట్టున నున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచుటకు చీటి పడెను.౹ తూర్పున లేవీయులైన ఆరుగురును, ఉత్తరమున దినమునకు నలుగురును, దక్షిణమున దినమునకు నలుగురును, అసుప్పీము నొద్ద ఇద్దరిద్దరును,౹ బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గము నొద్దను నలుగురును, వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి.౹ కోరే సంతతివారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టువారికి ఈలాగు వంతులాయెను. కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను.౹ లద్దాను కుమారులనుగూర్చినది–గెర్షోనీయుడైన లద్దాను కుమారులు, అనగా గెర్షోనీయులై తమపితరులయిండ్లకు పెద్దలైయున్నవారిని గూర్చినది.౹ యెహీయేలీ కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలికాయువారు.౹ అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది.౹ మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్క సముమీద ప్రధానిగా నియమింపబడెను.౹ ఎలీయెజెరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు.౹ [26-27] యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల యింటి పెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులును కావలి కాయు వారైరి.౹ *** దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలో మీతుచేతిక్రిందను వాని సహోదరుల చేతిక్రిందను ఉంచబడెను.౹ ఇస్హారీయులనుగూర్చినది–వారిలో కెనన్యాయును వాని కుమారులును బయటిపని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి.౹ హెబ్రోనీయులనుగూర్చినది. హషబ్యాయును వాని సహోదరులును పరాక్రమశాలులును వేయిన్ని యేడు వందల సంఖ్యగలవారు, వీరు యొర్దాను ఈవల పడమటి వైపుననుండు ఇశ్రాయేలీయులమీద యెహోవా సేవనుగూర్చిన వాటన్నిటి విషయములోను రాజు నియమించిన పనివిషయములోను పైవిచారణకర్తలుగా నియమింపబడిరి.౹ హెబ్రోనీయులనుగూర్చినది. హెబ్రోనీయుల పితరుల యింటి పెద్దలందరికి యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో నలువదియవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్నవారు పరాక్రమశాలులుగా కనబడిరి.౹ పరాక్రమశాలులగువాని సహోదరులు రెండువేల ఏడువందలమంది యింటి పెద్దలుగా కనబడిరి, దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను రూబే నీయులమీదను గాదీయులమీదను మనష్షే అర్ధగోత్రపు వారిమీదను వారిని నియమించెను. జనసంఖ్యనుబట్టి ఇశ్రాయేలీయుల పితరుల యింటిపెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కనుగూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేట నెలవంతున రాజునకు సేవచేసినవారిని గూర్చినది. వీరి సంఖ్య యిరువది నాలుగు వేలు.౹ మొదటి నెలను మొదటి భాగముమీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను; వాని భాగములో ఇరువది నాలుగు వేలమంది యుండిరి.౹ పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికి అధిపతిగా ఉండెను.౹ రెండవనెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపువారిదియు ఆయెను; అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹ మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹ ఈ బెనాయా ఆ ముప్పదిమంది పరాక్రమశాలులలో ఒకడై ఆ ముప్పదిమందికి అధిపతియైయుండెను; అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాబాదు ఉండెను.౹ నాలుగవనెలను యోవాబు సహోదరుడైన అశాహేలు నాలుగవ అధిపతిగా ఉండెను; అతని కుమారుడైన జెబద్యా అతని తరువాత అధిపతియాయెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹ అయిదవ నెలను ఇశ్రాహే తీయుడైన షవ్హుూతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹ ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹ ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడునైన హేలెస్సు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹ ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడును హుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹ తొమ్మిదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజెరు అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹ పదియవ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపా తీయుడునైన మహరై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹ పద కొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతో నీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹ పండ్రెండవనెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది. మరియు ఇశ్రాయేలీయుల గోత్రములమీదనున్నవారి వివరమేదనగా, జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు రూబే నీయులకు అధిపతిగా ఉండెను, మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను,౹ కెమూయేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను, సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను.౹ దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారుడైన ఒమ్రీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,౹ ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉండెను, అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను,౹ అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను, మనష్షే అర్ధగోత్రపువారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను,౹ గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపువారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను, బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహశీయేలు అధిపతిగా ఉండెను,౹ దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు.౹ ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంతమందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను గనుక ఇరువదియేండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్యయందు చేర్చలేదు.౹ జన సంఖ్యచేయు విషయమున ఇశ్రాయేలీయులమీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనేగాని దాని ముగింపకపోయెను; కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. రాజు బొక్కసములమీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను; అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోనుఉండు ఆస్తిమీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియ మింపబడెను.౹ పొలములో పనిచేయువారిమీదను, భూమి దున్ను వారిమీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను.౹ ద్రాక్షతోటలమీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువచేయు కొట్లమీద షిప్మీయుడైన జబ్దియు నియమింపబడిరి.౹ షెఫేలా ప్రదేశముననుండు ఒలీవ చెట్లమీదను మేడిచెట్లమీదను గెదేరీయుడైన బయల్ హనాను నియమింపబడెను; నూనె కొట్లమీద యోవాషు నియమింపబడెను.౹ షారోనులో మేయు పశువులమీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపా తును నియమింపబడిరి.౹ ఒంటెలమీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదలమీద మేరోనోతీయుడైన యెహె ద్యాహును నియమింపబడిరి.౹ గొఱ్ఱెలమీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరు దావీదు రాజు కున్న ఆస్తిమీద నియమింపబడిన యధిపతులు. దావీదు పినతండ్రియైన యోనాతాను వివేకముగల ఆలోచనకర్తయైయుండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను, హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజు కుమారులయొద్ద ఉండుటకు నియమింపబడెను.౹ అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు.౹ అహీతోపెలు చనిపోయినమీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యా తారును మంత్రులైరి; యోవాబు రాజుయొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను. గోత్రముల పెద్దలను, వంతులచొప్పున రాజునకు సేవచేయు అధిపతులను సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజుకుమారులకును కలిగియున్న యావత్తు చరాస్తిమీదను స్థిరాస్తిమీదను ఉన్న అధిపతులను, అనగా ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని రాజునొద్దనున్న పరివారమును పరాక్రమశాలులను సేవా సంబంధు లైన పరాక్రమశాలులనందరిని రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను.౹ అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఈలాగు సెలవిచ్చెను–నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి; యెహోవా నిబంధనమందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమస్థానముగా ఉండుటకు ఒక మందిరముకట్టించ వలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసికొని సమస్తము సిద్ధపరచితిని.౹ అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించినవాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను.౹ ఇశ్రాయేలీయులమీద నిత్యము రాజునైయుండుటకు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నా తండ్రి యింటివారందరిలోను నన్ను కోరుకొనెను, ఆయన యూదాగోత్రమును, యూదాగోత్రపువారిలో ప్రధానమైనదిగా నా తండ్రి యింటిని నా తండ్రి యింటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించియున్నాడు.౹ యెహోవా నాకు అనేకమంది కుమారులను దయచేసియున్నాడు, అయితే ఇశ్రాయేలీయులపైని యెహోవా రాజ్యసింహాసనముమీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను –నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని యున్నాను, నేను అతనికి తండ్రినైయుందును అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును.౹ మరియు నేటిదినమున చేయుచున్నట్లు అతడు ధైర్యమువహించి నా ఆజ్ఞలను నా న్యాయవిధులను అనుసరించినయెడల, నేనతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును.౹ కాబట్టి మీరు ఈ మంచిదేశమును స్వాస్థ్యముగా అనుభవించి, మీ తరువాత మీ సంతతివారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించునట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యాజ్ఞలన్నియు ఎట్టివో తెలిసికొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీయులందరు చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను.౹ సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.౹ పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టునున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటుచేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను.౹ మరియు యాజకులును లేవీయులును సేవచేయవలసిన వంతుల పట్టీయును, యెహోవా మందిరపు సేవనుగూర్చిన పట్టీయును, యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టీయును దావీదు అతనికప్పగించెను.౹ మరియు ఆయా సేవాక్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తుప్రకారము బంగారమును, ఆయా సేవా క్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తు ప్రకారము వెండిని దావీదు అతని కప్పగించెను.౹ బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదెలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదెలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారము గాను, వెండి దీపస్తంభములలో ఒక్కొక దీపస్తంభమునకును, దాని దాని ప్రమిదెలకును కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను,౹ సన్నిధిరొట్టెలు ఉంచు ఒక్కొక బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండిబల్లలకు కావలసినంత వెండిని,౹ ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను,౹ ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధనమందసమును కప్పు కెరూబుల వాహనముయొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతని కప్పగించెను.౹ ఇవియన్నియు అప్పగించి–యెహోవా హస్తము నామీదికి వచ్చి యీ మచ్చుల పనియంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను.౹ మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన దేమనగా–నీవు బలముపొంది ధైర్యము తెచ్చుకొని యీ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతోకూడ నుండును; యెహోవా మందిరపు సేవనుగూర్చిన పనియంతయు నీవు ముగించువరకు ఆయన నిన్ను ఎంతమాత్రమును విడువక యుండును.౹ దేవుని మందిర సేవయంతటికిని యాజకులును లేవీయులును వంతులప్రకారము ఏర్పాటైరి; నీ యాజ్ఞకు బద్ధులైయుండి యీ పనియంతటిని నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రవీణు లైనవారును మనఃపూర్వకముగా పనిచేయువారును అధిపతులును జనులందరును నీకు సహాయులగుదురు. తరువాత రాజైన దావీదు సర్వసమాజముతో ఈలాగు సెలవిచ్చెను–దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయముగల బాలుడై యున్నాడు, కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది.౹ నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండిపనికి వెండిని, యిత్తడిపనికి ఇత్తడిని, యినుపపనికి ఇనుమును, కఱ్ఱపనికి కఱ్ఱలను, గోమేధికపురాళ్లను, చెక్కుడురాళ్లను, వింతైన వర్ణములుగల పలువిధములరాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్లచలువరాయి విశేషముగా సంపాదించితిని.౹ మరియు నా దేవుని మందిరముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులుగాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.౹ గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండిపనికి వెండిని పనివారుచేయు ప్రతివిధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారమును పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా? అప్పుడు పితరులయిండ్లకు అధిపతులును ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులును సహస్రాధిపతులును శతాధిపతులును రాజు పనిమీద నియమింపబడిన అధిపతులును కలసి మనః పూర్వకముగా దేవుని మందిరపుపనికి పదివేల మణుగుల బంగారమును ఇరువదివేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువదివేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల యిత్తడిని రెండులక్షల మణుగుల యినుమును ఇచ్చిరి.౹ తమయొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసముమీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి.౹ వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనః పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను–మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు.౹ యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.౹ ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.౹ మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.౹ ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము.౹ మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామముయొక్క ఘనతకొరకు మందిరమును కట్టించుటకై మేము సమ కూర్చిన యీ వస్తుసముదాయమును నీవలన కలిగినదే, అంతయు నీదియై యున్నది.౹ నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచు న్నాను.౹ అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము; వారి హృదయమును నీకు అనుకూలపరచుము.౹ నా కుమారుడైన సొలొమోను నీ యాజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటిని అనుసరించునట్లును, నేను కట్టదలచిన యీ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము.౹ ఈలాగు పలికిన తరువాత దావీదు–ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరును తమపితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి.౹ తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహనబలిగా వెయ్యి యెద్దులను వెయ్యి గొఱ్ఱె పొట్టేళ్లను వెయ్యి గొఱ్ఱెపిల్లలను వాటి పానార్పణలతోకూడ ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి.౹ ఆ దినమునవారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి.౹ అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని యాజ్ఞకు బద్ధులై యుండిరి.౹ అధిపతులందరును యోధులందరునురాజైన దావీదు కుమారులందరునురాజైన సొలొమోనునకు లోబడిరి.౹ యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి యెదుటను బహుగా ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన యే రాజునకైనను కలుగని రాజ్యప్రభావమును అతని కనుగ్రహించెను. యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజైయుండెను.౹ అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను.౹ అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముది మిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను.౹ రాజైన దావీదునకు జరిగినవాటన్నిటినిగూర్చియు, అతని రాజరిక మంతటినిగూర్చియు, పరాక్రమమునుగూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములనుగూర్చియు,౹ దీర్ఘదర్శి సమూయేలు మాటలనుబట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలనుబట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలనుబట్టియు వ్రాయబడి యున్నది. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితోకూడ ఉండి అతనిని బహుఘనుడైన రాజునుగా చేసెను.౹ యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందుండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరులయిండ్లకు పెద్దలైనవారికందరికిని, అనగా ఇశ్రాయేలీయులకందరికిని ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరును సొలొమోనుతోకూడ కలసి గిబియోనునందుండు బలిపీఠము నొద్దకు పోయిరి; దావీదు దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తెప్పించి యెరూషలేమునందు దానికొరకు గుడారమువేసి తాను సిద్ధపరచిన స్థలమున నుంచెను.౹ హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన యిత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాసస్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపువారును దానియొద్ద విచారణ చేసిరి.౹ సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధినుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలొమోను పోయి దానిమీద వెయ్యి దహనబలులను అర్పించెను. ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై–నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగు మని సెలవియ్యగా సొలొమోను దేవునితో ఈలాగు మనవిచేసెను–నీవు నా తండ్రియైన దావీదుయెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించియున్నావు గనుక దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము; నేల ధూళియంత విస్తారమైనజనులమీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు? నేను ఈ జనులమధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము.౹ అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చెను–నీవు ఈ ప్రకారము యోచించుకొని, ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారిమీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి యున్నావు.౹ కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును, నీకన్న ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను.౹ పిమ్మట సొలొమోను గిబియోనులోనుండు సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచుండెను. సొలొమోను రథములను గుఱ్ఱపు రౌతులను సమకూర్చెను, వెయ్యిన్ని నాలుగువందలు రథములును పండ్రెండువేల గుఱ్ఱపు రౌతులును అతనికి ఉండెను; వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను, కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను.౹ రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను, సరళ మ్రానులను షెఫేల ప్రదేశముననున్న మేడిచెట్లంత విస్తారముగాను సమకూర్చెను.౹ సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను, రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి.౹ వారు ఐగుప్తునుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరువందల తులముల వెండియు గుఱ్ఱమొకటింటికి నూటఏబది తులముల వెండియు నిచ్చిరి; హిత్తీయుల రాజులందరికొరకును సిరియా రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి. సొలొమోను యెహోవా నామఘనతకొరకు ఒక మందిరమును తన రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసికొని బరువులు మోయుటకు డెబ్బది వేలమందిని, కొండలమీద మ్రానులు కొట్టుటకు ఎనుబదివేల మందిని ఏర్పరచుకొని వీరిమీద మూడువేల ఆరువందలమందిని అధిపతులుగా ఉంచెను.౹ సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతలచేత ఈ వర్తమానము పంపెను–నా తండ్రియైన దావీదు నివాసమునకై యొక నగరును కట్టతలచియుండగా నీవు అతనికి సరళ మ్రానులను సిద్ధముచేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము.౹ నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలములయందును, విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను.౹ నేను కట్టించు మందిరము గొప్పదిగానుండును; మా దేవుడు సకలమైన దేవతలకంటె మహనీయుడు గనుక ఆకాశములును మహాకాశములును ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపువాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్ట దలచియున్నాను.౹ నా తండ్రియైన దావీదు నియమించి యూదాదేశములోను యెరూషలేములోను నాయొద్ద ఉంచిన ప్రజ్ఞగలవారికి సహాయకుడై యుండి, బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను నీలి నూలుతోను చేయుపనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుష్యునొకని నాయొద్దకు పంపుము.౹ మరియు లెబానోనునందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసేయున్నది.౹ కాగా లెబానోనునుండి సరళమ్రానులను దేవదారుమ్రానులను చందనపుమ్రానులను నాకు పంపుము; నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితోకూడ పోవుదురు.౹ మ్రానులుకొట్టు మీ పనివారికి నాలుగువందల గరిసెల దంచిన గోధుమలను ఎనిమిదివందల పుట్ల యవలను నూట నలువదిపుట్ల ద్రాక్షారసమును నూట నలువదిపుట్ల నూనెను ఇచ్చెదను. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు వ్రాసిపంపిన ఉత్తరమేమనగా–యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారిమీద రాజుగా నియమించియున్నాడు.౹ యెహోవాఘనతకొరకు ఒక మందిరమును నీ రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియుగల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన, భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక.౹ తెలివియు వివేచనయుగల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీయొద్దకు పంపు చున్నాను.౹ అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైనవాడు, అతడు బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను రాళ్లతోను మ్రానులతోను ఊదా నూలుతోను నీలి నూలుతోను సన్నపు నూలుతోను ఎఱ్ఱ నూలుతోను పని చేయగల నేర్పరియైనవాడు. సకలవిధముల చెక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తికలిగి, నీ పనివారికిని నీతండ్రియైన దావీదు అను నా యేలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారియై వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గల వాడు.౹ ఇప్పుడు నా యేలినవాడు చెప్పియున్న గోధుమలను యవలను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతి కిచ్చి వారిని సాగనంపినయెడల మేము నీకు కావలసిన మ్రానులన్నియు లెబానోనునందు కొట్టించి వాటిని నీకొరకు సముద్రముమీద తెప్పలుగా యొప్పేకు కొనివచ్చెదము, తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొన వచ్చును అని వ్రాసెను. సొలొమోను తన తండ్రియైన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్యజాతివారినందరిని, ఎన్నిక వేయించిన యెన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు లక్షయెనుబదిమూడువేల ఆరువందలమందియైరి.౹ వీరిలో బరువులు మోయుటకు డెబ్బది వేలమందిని పర్వతములందు మ్రానులు కొట్టుటకు ఎనుబదివేల మందిని, జనులమీద అధిపతులుగానుండి పనిచేయించుటకు మూడువేల ఆరు వందలమందిని అతడు ఏర్పరచెను. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రియైన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరీయా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారం భించెను.౹ తన యేలుబడిలో నాలుగవ సంవత్సరము రెండవనెల రెండవదినమందు దాని కట్టనారంభించెను.౹ దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను, పూర్వపు కొలల ప్రకారము పొడవు అరువది మూరలు, వెడల్పు ఇరువది మూరలు.౹ మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగునుబట్టి యిరువది మూరలు వెడల్పు, నూట ఇరువది మూరలు ఎత్తు, దాని లోపలిభాగమును ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించెను.౹ మందిరపు పెద్ద గదిని దేవదారుపలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపుచెట్లవంటి పనియు గొలుసులవంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీమునుండి వచ్చినది.౹ మందిరపు దూలములను స్తంభములను దాని గోడలను దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడలమీద కెరూబులను చెక్కించెను.౹ మరియు అతడు పరిశుద్ధ స్థలమొకటి కట్టించెను; దాని పొడవు మందిరపు వెడల్పునుబట్టి యిరువది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు, వెయ్యిన్ని రెండు వందల మణుగుల మేలిమి బంగారుతో అతడు దాని పొదిగించెను.౹ మేకుల యెత్తు ఏబది తులముల బంగారు; మీది గదులను బంగారముతో పొదిగించెను.౹ అతిపరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల రెండు కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను.౹ [11-12] ఆ కెరూబుల రెక్కల పొడవు ఇరువది మూరలు, ఒక్కొక్క రెక్క అయిదు మూరల పొడుగు, అది మందిరపు గోడకు తగులుచుండెను, రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను.౹ *** ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు ఇరువది మూరలు వ్యాపించెను, కెరూబులు పాదములమీద నిలువబడెను, వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి యుండెను.౹ అతడు నీలి నూలుతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను సన్నపు నారనూలుతోను ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను కుట్టించెను.౹ ఇదియుగాక మందిరము ముందర ఉండుటకై ముప్పదియయిదు మూరల యెత్తుగల రెండు స్తంభములను వాటిమీదికి అయిదు మూరల యెత్తుగల పీటలను చేయించెను.౹ గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభముల పైభాగమున దాని ఉంచి, నూరు దానిమ్మపండ్లను చేయించి ఆ గొలుసు పనిమీద తగిలించెను.౹ ఆ రెండు స్తంభములను దేవాలయము ఎదుట కుడితట్టున ఒకటియు ఎడమతట్టున ఒకటియు నిలువబెట్టించి, కుడితట్టు దానికి యాకీను అనియు, ఎడమతట్టు దానికి బోయజు అనియు పేళ్లు పెట్టెను. అతడు ఇరువది మూరలు పొడవును ఇరువది మూరలు వెడల్పును పది మూరలు ఎత్తునుగల యొక యిత్తడి బలిపీఠమును చేయించెను.౹ పోతపోసిన సముద్రపు తొట్టి యొకటి చేయించెను, అది యీ యంచుకు ఆ యంచుకు పది మూరల యెడము గలది; దానియెత్తు అయిదు మూరలు, దాని కైవారము ముప్పదిమూరలు,౹ దాని క్రిందితట్టున ఎద్దులు రూపింపబడియుండెను, అవి ఒక్కొక్క మూరకు పదేసియుండెను, అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను; ఎద్దులు రెండు వరుసలు తీరి యుండెను, అవి తొట్టితోకూడనే పోతపోయబడెను.౹ అది పండ్రెండు ఎద్దులమీద నిలువబడెను, మూడు ఎద్దులు ఉత్తరపుతట్టు మూడు పడమటితట్టు మూడు దక్షిణపుతట్టు మూడు తూర్పుతట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై నుంచ బడెను, వాటి వెనుకటి పార్శ్వములన్నియు లోపలికి తిరిగి యుండెను.౹ అది బెత్తెడు దళముగలది, దాని అంచు గిన్నెయంచువంటిదై తామరపుష్పములు తేల్చబడియుండెను; అది ముప్పది పుట్ల నీళ్లు పట్టును. మరియు దహనబలులుగా అర్పించువాటిని కడుగుటకై కుడితట్టుకు అయిదును ఎడమతట్టుకు అయిదును పది స్నానపు గంగాళములను చేయించెను; సముద్రమువంటి తొట్టియందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు.౹ మరియు వాటినిగూర్చిన విధిననుసరించి పది బంగారపు దీపస్తంభములను చేయించి, దేవాలయమందు కుడితట్టున అయిదును ఎడమతట్టున అయిదును ఉంచెను.౹ పది బల్లలను చేయించి దేవాలయమందు కుడితట్టున అయిదును ఎడమతట్టున అయిదును ఉంచెను; నూరు బంగారపు తొట్లను చేయించెను.౹ అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను.౹ సముద్రపు తొట్టిని తూర్పుతట్టున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను.౹ హూరాము పాత్రలను బూడిదె నెత్తు చిప్పకోలలను తొట్లను చేసెను; రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పనియంతయు హూరాము సమాప్తిచేసెను.౹ దాని వివరమేమనగా, రెండు స్తంభములు, వాటి పళ్లెములు, వాటి పైభాగమునకు చేసిన పీటలు, వీటి పళ్లెములు, ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పుటకైన రెండు అల్లికలు,౹ ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు రెండేసి వరుసలుగా చేయబడిన నాలుగు వందల దానిమ్మపండ్లు.౹ మట్లు, మట్లమీదనుండు తొట్లు,౹ సముద్రపుతొట్టి దాని క్రింద నుండు పండ్రెండు ఎద్దులు,౹ పాత్రలు, బూడిదె నెత్తు చిప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము యెహోవా మందిరముకొరకు మంచి వన్నెగల యిత్తడితో చేసెను.౹ యొర్దాను మైదానమందు సుక్కో తునకును జెరేదాతాకునుమధ్యను జిగటమంటి భూమియందు రాజు వాటిని పోతపోయించెను.౹ ఎత్తు చూడ లేనంత యిత్తడి తన యొద్ద నుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటిని బహు విస్తారముగా చేయించెను.౹ దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటిని బంగారపు పీఠమును సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను,౹ వాటినిగూర్చిన విధిప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను,౹ పుష్పములను ప్రమిదెలను కత్తెరలను కారులను తొట్లను గిన్నెలను ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను.౹ మరియు మందిరద్వారము లోపలి తలుపులును అతి పరిశుద్ధ స్థలముయొక్క లోపలి తలుపులును దేవాలయపు తలుపులును అన్నియు బంగారముతో చేయబడెను. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనియంతయు సమాప్తముచేసి, తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటిని దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను.౹ తరువాత యెహోవా నిబంధనమందసమును సీయోను అను దావీదు పురమునుండి తీసికొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయే లీయుల పెద్దలను ఇశ్రాయేలీయుల వంశములకు అధికారులగు గోత్రముల పెద్దలనందరిని యెరూషలేమునందు సమకూర్చెను.౹ ఏడవ నెలను పండుగ జరుగుకాలమున ఇశ్రాయేలీయులందరును రాజునొద్దకు వచ్చిరి.౹ ఇశ్రాయేలీయుల పెద్దలందరును వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి రాజైన సొలొమోనును ఇశ్రాయేలీయుల సమాజకులందరును సమకూడి, లెక్కింప శక్యముకాని గొఱ్ఱెలను పశువులను బలిగా అర్పించిరి.౹ లేవీయులును యాజకులును మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటిని తీసికొని వచ్చిరి.౹ మరియు యాజకులు యెహోవా నిబంధనమందసమును తీసికొని గర్భాలయమగు అతి పరిశుద్ధస్థలమందు కెరూబుల రెక్కలక్రింద దానిని ఉంచిరి.౹ మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ రెండు రెక్కలను చాచుకొని మందసమును దాని దండెలను కమ్మెను.౹ వాటి కొనలు గర్భా లయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచ బడెనుగాని అవి బయటికి కనబడలేదు. నేటివరకు అవి అచ్చటనే యున్నవి.౹ ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేదు.౹ యాజకులు పరిశుద్ధస్థలమునుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడియున్న యాజకులందరును తమ వంతులు చూడకుండ తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి.౹ ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధమైనవారును, వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాటకులైన లేవీయులందరును, సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తంబురలను సితారాలను చేతపట్టుకొని బలిపీఠమునకు తూర్పుతట్టున నిలిచిరి;౹ వారితోకూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాట కులును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానముచేయగా యాజకులు పరిశుద్ధస్థలములోనుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి–యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రముచేసిరి.౹ అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండ నిండెను; యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవచేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువలేకపోయిరి. అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేసెను— గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.౹ నీవు నిత్యము కాపురముండుటకై నిత్యనివాసస్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించియున్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజలతట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరును నిలుచుచుండగా వారిని దీవించెను.౹ మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను–నా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి, తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక.౹ ఆయన సెలవిచ్చినదేమనగా–నేను నా జనులను ఐగుప్తుదేశములోనుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముండుటకై యొక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు, నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతిగా నుండుటకై యే మనుష్యునియైనను నేను నియమింపలేదు.౹ ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని.౹ ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రియైన దావీదు మనోభిలాష గలవాడాయెను.౹ అయితే యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చిన దేమనగా–నా నామఘనతకొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదేగాని నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును.౹ అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు, యెహోవా సెలవుప్రకారము నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దానియందు ఉంచితినని చెప్పి ఇశ్రాయేలీయులందరు సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. తాను చేయించిన అయిదు మూరల పొడవును అయిదు మూరల వెడల్పును మూడు మూరల యెత్తునుగల యిత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి, దానిమీద నిలిచియుండి, సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీయులందరి యెదుటను మోకాళ్లూని, చేతులు ఆకాశమువైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థనచేసెను.౹ –యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమియందైనను లేడు.౹ నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చినమాట నెరవేర్చియున్నావు; నీవు వాగ్దానముచేసి యీ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు.౹ –నీవు నాముందర నడచి నట్లుగా నీ కుమారులును తమ ప్రవర్తన కాపాడుకొని, నా ధర్మశాస్త్రముచొప్పున నడచినయెడల ఇశ్రాయేలీయుల సింహాసనముమీద కూర్చుండువాడు నా యెదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చినమాట, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నెరవేర్చుము.౹ ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక.౹ మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధినిచేయు ప్రార్థనయందును విన్న పమునందును లక్ష్యముంచి, నీ సేవకుడనైన నేనుచేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము.౹ నీ సేవకులు ఈ స్థలముతట్టు తిరిగిచేయు విన్నపములను వినుటకై— నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న యీ మందిరముమీద నీ కనుదృష్టి రాత్రిం బగళ్లు నిలుచునుగాక.౹ నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము, ఆకాశముననున్న నీ నివాసస్థలమందు ఆలకించుము, ఆలకించునప్పుడు క్షమించుము.౹ ఎవడైనను తన పొరుగువానియెడల తప్పుచేసినప్పుడు అతనిచేత ప్రమాణము చేయించుటకై అతనిమీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయముతీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము.౹ నీజనులైన ఇశ్రాయేలీయులు నీ దృిష్టి యెదుట పాపము చేసినవారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు, వారు నీయొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని, యీ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసినయెడల ఆకాశమందు నీవు విని, నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించుదువుగాక.౹ వారు నీ దృష్టియెదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియ కున్నప్పుడు, వారు ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసి నీ నామమును ఒప్పుకొని, నీవు వారిని శ్రమపెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగినయెడల ఆకాశ మందున్న నీవు ఆలకించి, నీ సేవకులును నీ జనులునగు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన మంచిమార్గము వారికి బోధించి, నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక.౹ దేశమునందు కరవుగాని తెగులుగాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుటగాని తగిలినప్పుడైనను, మిడతలుగాని చీడపురుగులుగాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడివేసినప్పుడైనను, ఏ బాధగాని యే రోగముగాని వచ్చినప్పుడైనను ఎవడైనను ఇశ్రాయేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, ఈ మందిరముతట్టు చేతులు చాపిచేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందువారు తమ జీవితకాల మంతయు నీయందు భయభక్తులుకలిగి నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా.౹ మరియు నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమునుగూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, చాచిన చేతులనుగూర్చియు వినినవారై, దూరదేశము నుండి వచ్చి ఈ మందిరముతట్టు తిరిగి విన్నపముచేసినపుడు నీ నివాసస్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక.౹ నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేర నుద్దేశించి, నీవు కోరు కొనిన యీ పట్టణముతట్టును నీ నామమునకు నేను కట్టించిన యీ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసినయెడల ఆకాశమునుండి నీవు వారి విన్నపమును ప్రార్థ నను ఆలకించి వారికార్యమును నిర్వహించుదువుగాక.౹ పాపము చేయనివాడెవడును లేడు గనుక వారు నీ దృష్టి యెదుట పాపము చేసినప్పుడు నీవు వారిమీద ఆగ్ర హించి, శత్రువులచేతికి వారిని అప్పగింపగా, చెరపట్టు వారు వారిని దూరమైనట్టిగాని సమీపమైనట్టిగాని తమ దేశములకు పట్టుకొనిపోగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని–మేము పాపముచేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను నీయొద్దకు మళ్లుకొని, తమపితరులకు నీవిచ్చిన తమ దేశముమీదికిని, నీవు కోరుకొనిన యీ పట్టణముమీదికిని, నీ నామఘనతకొరకు నేను కట్టించిన యీ మందిరముమీదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసినయెడల నీ నివాసస్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారికార్యమును నిర్వహించి, నీ దృష్టియెదుట పాపముచేసిన నీ జనులను క్షమించుదువుగాక.౹ నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి యుంచు దువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక.౹ నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.౹ దేవా యెహోవా, నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాఙ్ముఖుడవై యుండకుము, నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానముచేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము. సొలొమోను తానుచేయు ప్రార్థనను ముగించి నప్పుడు అగ్ని ఆకాశమునుండి దిగి దహనబలులను ఇతరమైన బలులను దహించెను; యెహోవా తేజస్సు మందిరమునిండ నిండెను,౹ యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి.౹ అగ్నియు యెహోవా తేజస్సును మందిరముమీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరును సాష్టాంగనమస్కారము చేసి–యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి.౹ రాజును జనులందరును యెహోవా ఎదుట బలులు అర్పించిరి.౹ రాజైన సొలొమోను ఇరువది రెండువేల పశువులను లక్ష యిరువది వేల గొఱ్ఱెలను బలులుగా అర్పించెను; యాజకులు తమతమ సేవాధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారిచేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయులందరును నిలిచియుండగను రాజును జనులందరును కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠచేసిరి. మరియు తాను చేయించిన యిత్తడి బలిపీఠము దహనబలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి, అక్కడ దహనబలులను సమాధాన బలిపశువుల క్రొవ్వును అర్పించెను.౹ ఆ సమయమందు సొలొమోనును, అతనితోకూడ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నదివరకున్న దేశములోనుండి బహు గొప్ప సమూహముగా కూడివచ్చిన ఇశ్రాయేలీయులందరును ఏడు దినములు పండుగ ఆచరించి యెనిమిదవనాడు పండుగ ముగించిరి; ఏడు దినములు బలిపీఠమును ప్రతిష్ఠచేయుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి. ఏడవ నెల యిరువది మూడవ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును, ఎవరి గుడారములకు వారు వెళ్లునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను.౹ ఆప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి, యెహోవామందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపములేకుండ నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–నేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని.౹ వాన కురియకుండ నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనులమీదికి తెగులు రప్పించినప్పుడే గాని,౹ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.౹ ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును,౹ నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును.౹ నీ తండ్రియైన దావీదు నడచినట్లుగా నీవును నా కనుకూల వర్తనుడవై నడచి, నేను నీకాజ్ఞాపించిన దానియంతటి ప్రకారముచేసి, నా కట్టడలను నా న్యాయవిధులను అనుసరించినయెడల ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతతివాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రియైన దావీదుతో చేసియున్న నిబంధననుబట్టి నేను నీ రాజ్యసింహాసనమును స్థిరపరచుదును.౹ అయితే మీరు త్రోవ తప్పి, నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి, యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసినయెడల నేను మీకిచ్చిన నా దేశములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసి వేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును.౹ అప్పుడు ప్రఖ్యాతి నొందిన యీ మందిరమార్గమున పోవు ప్రయాణస్థులందరును విస్మయమొంది–యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసెనని యడుగగా జనులు–ఈ దేశస్థులు తమపితరులను ఐగుప్తు దేశమునుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విస ర్జించి యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన యిరువది సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను. తరువాత సొలొమోను హమాతుసొబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను.౹ మరియు అరణ్యమందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను.౹ ఇదియుగాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‍హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకారపట్టణములుగా కట్టించెను.౹ బయలతును, ఖజానా ఉంచు పట్టణములన్నిటిని, రథములుంచు పట్టణములన్నిటిని, గుఱ్ఱపు రౌతులుండు పట్టణములన్నిటిని కట్టించెను. మరియు యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటియందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పట్టణములన్నిటిని సొలొమోను కట్టించెను.౹ ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలోనుండియు అమోరీయులలోనుండియు, పెరిజ్జీయులలోనుండియు, హివ్వీయులలోనుండియు, యెబూసీయులలోనుండియు, శేషించియున్న సకల జనులను ఇశ్రాయేలీయులు నాశనముచేయక వదలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటివరకును తనకు వెట్టిపనులు చేయువారినిగా చేసికొనియుండెను.౹ అయితే ఇశ్రాయేలీయులలో ఒకనినైనను సొలొమోను తన పనిచేయుటకు దాసునిగా నియమింపలేదు; వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుఱ్ఱపు రౌతులకును అధిపతులుగాను నియమించెను.౹ వీరిలో శ్రేష్ఠులైన రెండువందల ఏబదిమంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజలమీద అధికారులై యుండిరి.౹ ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసముచేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి, సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణమునుండి తాను ఆమెకొరకు కట్టించిన నగరునకు రప్పించెను. అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠముమీద దహనబలులు అర్పించుచు వచ్చెను. అతడు అనుదిన నిర్ణయముచొప్పున మోషే యిచ్చిన ఆజ్ఞనుబట్టి విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, నియామక కాలములయందును, సంవత్సరమునకు ముమ్మారుజరుగు పండుగలయందును, అనగా పులియనిరొట్టెల పండుగయందును వారముల పండుగయందును పర్ణశాలల పండుగయందును యెహోవాకు దహనబలులు అర్పించుచు వచ్చెను.౹ అతడు తన తండ్రియైన దావీదు చేసిన నిర్ణయమునుబట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును, కట్టడనుబట్టి అను దినమున యాజకుల సముఖమున స్తుతిచేయుటకును, ఉప చారకులుగా ఉండుటకును, వంతులచొప్పున లేవీయులను, ద్వారములన్నిటి దగ్గర కావలియుండుటకై వారి వారి వంతులచొప్పున ద్వారపాలకులను నియమించెను; దైవ జనుడైన దావీదు ఆలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను.౹ ఏ విషయమునుగూర్చియేగాని బొక్కసములనుగూర్చియేగాని రాజు యాజకులకును లేవీయులకును చేసియున్న నిర్ణ యమునుబట్టి వారు సమస్తమును జరుపుచువచ్చిరి యెహోవా మందిరమునకు పునాదివేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగువరకు సొలొమోను పనియంతయు చేయించెను; అప్పుడు యెహోవా మందిరము సమాప్త మాయెను. సొలొమోను ఎదోము దేశముయొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలతునకును పోగా హీరాము తన పనివారిద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తి గల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితోకూడ ఓఫీరునకు పోయి అక్కడనుండి తొమ్మిదివందల మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి. షేబదేశపు రాణి సొలొమోనునుగూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నలచేత సొలొమోనును శోధింపవలెనని కోరి, మిక్కిలి గొప్ప పరివారమును వెంట బెట్టుకొని, గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సు లోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను.౹ సొలొమోను ఆమె ప్రశ్నలన్నియు ఆమెకు విడదీసి చెప్పెను; సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట యేదియు లేకపోయెను.౹ షేబదేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును,౹ అతని బల్లమీది భోజనపదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని యుపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, అతనికి గిన్నెల నందించువారిని వారి వస్త్రములను, యెహోవామందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచినప్పుడు, ఆమె విస్మయ మొంది రాజుతో ఇట్లనెను –నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని, నేను వచ్చి దాని కన్నులార చూచువరకు వారి మాటలను నమ్మకయుంటిని.౹ నీ యధిక జ్ఞానమునుగూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్నుగూర్చి నేను వినినదానికంటె నీ కీర్తి యెంతో హెచ్చుగానున్నది.౹ నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడును నీ సముఖమున నిలిచి నీ జ్ఞానసంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది.౹ నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనముమీద ఆసీనుడవై యుండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతిన్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించెను అని చెప్పెను.౹ ఆమె రాజునకు రెండువందల నలుబది మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను; షేబదేశపు రాణి రాజైన సొలొమోనున కిచ్చిన గంధవర్గములతో సాటియైన దేదియులేదు.౹ ఇదియుగాక ఓఫీరునుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములను కూడ కొనివచ్చిరి.౹ ఆ చందనపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సోపానములను, గాయకులకు తంబురలను సితారాలను చేయించెను, అటువంటి పని అంతకుముందు యూదాదేశమందు ఎవ్వరును చూచియుండలేదు.౹ షేబ దేశపు రాణి రాజునకు తీసికొనివచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములుగాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమె కిచ్చెను; తరువాత ఆమె తన సేవకులను వెంట బెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్లిపోయెను. గంధవర్గములు అమ్ము వర్తకులును ఇతర వర్తకులును కొని వచ్చు బంగారముగాక సొలొమోనునకు ఏటేట వచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పది రెండు మణుగులయెత్తు.౹ అరబీదేశపు రాజులందరును దేశాధిపతులును సొలొమోనునొద్దకు బంగారమును వెండియు తీసికొని వచ్చిరి.౹ రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; ఒక్కొక డాలునకు ఆరువందల తులముల బంగారము పట్టెను.౹ మరియు సాగగొట్టిన బంగారముతో మూడు వందల కేడెములను చేయించెను; ఒక్కొక కేడెమునకు మూడువందల తులముల బంగారము పట్టెను; వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను.౹ మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాని పొదిగించెను.౹ ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న ఆరు బంగారపు సోపానములును సింహాసనమునకు కట్టి యున్న బంగారపు పాదపీఠమును ఉండెను, కూర్చుండుచోటికి ఇరుప్రక్కల ఊతలుండెను, ఊతలదగ్గర రెండు సింహములుండెను;౹ ఆయారు సోపానములమీద ఇరుప్రక్కల పండ్రెండు సింహములు నిలిచియుండెను, ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు.౹ మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నియును బంగారపువై యుండెను; లెబా నోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నియు బంగారముతో చేసినవి; హీరాముయొక్క పనివారితోకూడ రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, యేనుగుదంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక సొలొమోను దినములలో వెండియెన్నికకు రానిదాయెను రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను.౹ దేవుడు సొలొమోనుయొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరును అతని ముఖదర్శనము చేయగోరిరి.౹ మరియు ప్రతివాడును ఏటేట వెండివస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధవర్గములను గుఱ్ఱములను కంచరగాడిదలను కానుకలుగా తీసికొనివచ్చెను. రథములు నిలువయుంచు పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు నాలుగువేల గుఱ్ఱపు సాలలును రథములును పండ్రెండువేల గుఱ్ఱపు రౌతులును కలిగి యుండెను.౹ యూఫ్రటీసునది మొదలుకొని ఫిలిష్తీయుల దేశమువరకును ఐగుప్తు సరిహద్దువరకునుఉండు రాజులందరి పైని అతడు ఏలుబడి చేసెను.౹ రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును, దేవదారు మ్రానులు షెఫేలా ప్రదేశముననున్న మేడివృక్షములంత విస్తారముగా నుండునట్లును చేసెను.౹ ఐగుప్తునుండియు సకల దేశములనుండియు సొలొమోనునకు గుఱ్ఱములు తేబడెను.౹ సొలొమోను చేసిన కార్యములన్నిటినిగూర్చి ప్రవక్తయైన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామునుగూర్చి దీర్ఘదర్శియైన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి యున్నది.౹ సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిమీద నలుబది సంవత్సరములు ఏలుబడి చేసెను.౹ తరువాత సొలొమోను తన పితరులతోకూడ నిద్రించి తన తండ్రియైన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీయులందరును షెకెమునకు వెళ్లగా రెహబాము షెకెమునకు పోయెను.౹ రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తునుండి తిరిగిరాగా జనులు అతని పిలిపించిరి.౹ యరొబామును ఇశ్రాయేలువారందరును కూడి వచ్చి–నీ తండ్రి మా కాడిని బరువుచేసెను;౹ నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మామీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులుకన చేసినయెడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవిచేయగా అతడు–మీరు మూడుదినములు తాళి మరల నాయొద్దకు రండని చెప్పెను గనుక జనులు వెళ్లిపోయిరి.౹ అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను సజీవియై యుండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి–యీ జనులకు నేనేమి ప్రత్యుత్తర మియ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగగా వారు–నీవు ఈ జనులయెడల దయా దాక్షిణ్యములు చూపి వారితో మంచిమాటలాడినయెడల వారు ఎప్పటికిని నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి.౹ అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసి వేసి, తనతోకూడ పెరిగి తన యెదుటనున్న యౌవనస్థులతో ఆలోచనచేసి –నీ తండ్రి మామీద ఉంచిన కాడిని చులుకన చేయుమని నన్నడిగిన యీ జనులకు ప్రత్యుత్తరమేమి ఇయ్యవలెనని మీరు యోచింతురో చెప్పుడని వారినడుగగా అతనితోకూడ పెరిగిన యీ యౌవనస్థులు అతనితో ఇట్లనిరి–నీ తండ్రి మా కాడిని బరువుచేసెను, నీవు దానిని చులుకన చేయుమని నీతో పలికిన యీ జనులతో నీవు చెప్పవలసినదేమనగా–నా చిటికెన వ్రేలు నా తండ్రియొక్క నడుముకంటె బరువుగా ఉండును;౹ నా తండ్రి బరువైన కాడి మీమీద మోపెనుగాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెనుగాని నేను కొరడాలతో మిమ్మును దండించెదనని చెప్పుము.౹ –మూడవ దినమందు నాయొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరును మూడవ దినమందు రెహబామునొద్దకు రాగా రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి, యౌవనస్థులు చెప్పిన ప్రకారము వారితో మాటలాడి వారికి కఠినమైన ప్రత్యుత్తర మిచ్చెను; ఎట్లనగా–నా తండ్రి మీ కాడిని బరువుచేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించెదనని చెప్పెను.౹ యెహోవా షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించక పోయెను.౹ రాజు తాము చేసిన మనవి అంగీకరింపక పోవుట చూచి జనులు–దావీదులో మాకు భాగము ఏది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీ గుడారమునకు పోవుడి; దావీదూ, నీ సంతతివారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరమిచ్చి ఇశ్రాయేలువారందరును ఎవరి గుడారమునకు వారు వెళ్లిపోయిరి.౹ అయితే యూదాపట్టణములలో కాపురముండు ఇశ్రాయేలువారిమీద రెహబాము ఏలుబడి చేసెను.౹ రాజైన రెహబాము వెట్టిపనివారిమీద అధికారియైన హదోరమును పంపగా ఇశ్రాయేలువారు రాళ్లతో అతని చావ గొట్టిరి గనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని త్వరపడి తన రథము ఎక్కెను.౹ ఇశ్రాయేలువారు ఇప్పటికిని దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసి నేటివరకును వారికి లోబడకయున్నారు. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలువారితో యుద్ధము చేయుటకును, రాజ్యమును తనకు మరల రప్పించుకొనుటకును అతడు యూదావారిలోనుండియు బెన్యామీనీయులలోనుండియు ఏర్పరచబడిన యుద్ధ శాలులను లక్షయెనుబదివేలమందిని సమకూర్చగా దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నీవు యూదారాజును సొలొమోను కుమారుడునగు రెహబాముతోను, యూదాయందును బెన్యామీనీయుల ప్రదేశమందునుఉండు ఇశ్రాయేలు వారందరితోను ఈ మాట ప్రకటించుము –ఈ కార్యము నావలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక, బయలుదేరకుండను మీ సహోదరులతో యుద్ధము చేయకుండను మీరందరును మీ మీ యిండ్లకు తిరిగి పోవుడి అని చెప్పెను. కావునవారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయుట మాని వెళ్లిపోయిరి. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను.౹ [6-9] అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవ, బేత్సూరు, శోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీఫు, అదోరయీము, లాకీషు, అజేకా,౹ *** *** *** జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారపురములను కట్టించి దుర్గములను బల పరచి, వాటిలో అధిపతులను ఉంచి, ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను.౹ మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులును అతని పక్షముననుండిరి. ఇశ్రాయేలువారి మధ్యనుండు యాజకులును లేవీయులును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి.౹ యరొబామును అతని కుమారులును యెహోవాకు యాజకసేవ జరుగకుండ లేవీయులను త్రోసి వేయగా, వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడచి, యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి.౹ యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను.౹ వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రములయం దంతటను ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనినవారు తమపితరుల దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి.౹ దావీదును సొలొమోనును నడచిన మార్గమందు మూడు సంవత్సరములువారు నడచి, యూదా రాజ్యమును బలపరచి మూడు సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. రెహబాము, దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయగు మహలతును యెష్షయి కుమారుడైన ఏలీయాబు కుమార్తెయగు అబీహాయిలును వివాహము చేసికొనెను.౹ అతనికి యూషు షెమర్యా జహము అను కుమారులు కలిగిరి.౹ పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తెయైన మయ కాను వివాహము చేసికొనగా ఆమె అతనికి అబీయాను అత్తయిని జీజాను షెలోమీతును కనెను.౹ రెహబాము పదునెనిమిదిమంది భార్యలను పెండ్లిచేసికొని అరువదిమంది ఉపపత్నులను తెచ్చుకొని యిరువది యెనిమిదిమంది కుమారులను అరువదిమంది కుమార్తెలను కనెను; అయితే తన భార్యలందరికంటెను ఉపపత్నులందరికంటెను అబ్షాలోము కుమార్తెయైన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను.౹ రెహబాము మయకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజును చేయతలచి, అతని సహోదరులమీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించెను.౹ అతడు మంచి మెలకువగలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపురములయందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండ్లు చేసెను. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన. తరువాత అతడును ఇశ్రాయేలీయులందరును యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి.౹ వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున రాజైన రెహబాముయొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు వెయ్యిన్ని రెండువందల రథములతోను అరువదివేల గుఱ్ఱపు రౌతులతోను యెరూషలేముమీదికి వచ్చెను.౹ అతనితోకూడ ఐగుప్తునుండి వచ్చిన లూబీయులు సుక్కీయులు కూషీయులు అనువారు లెక్కకు మించియుండిరి.౹ అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకొని యెరూషలేమువరకు రాగా ప్రవక్తయైన షెమయా రెహబామునొద్దకును, షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి–మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.౹ అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులును రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి.౹ వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనముచేయక, షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేముమీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను.౹ అయితే నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులై యుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లువారు అతనికి దాసులగుదురు. ఐగుప్తురాజైన షీషకు యెరూషలేముమీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరు లోని బొక్కసములన్నిటిని దోచుకొని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసికొనిపోయెను.౹ వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరుయొక్క ద్వారమును కాయు సేవకులయొక్క అధిపతులకు అప్పగించెను.౹ రాజు యెహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడెల్ల నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరల గదిలో ఉంచుచు వచ్చిరి.౹ అతడు తన్నుతాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలముచేయక, యూదావారు కొంత మట్టుకు మంచితనము ననుసరించుట చూచి తన కోపము అతనిమీదనుండి త్రిప్పుకొనెను. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి యేలుబడి చేసెను; రెహబాము ఏలనారంభించినప్పుడు నలుబదియొక సంవత్సరముల యీడుగల వాడై యుండెను; తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేమునందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను, అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు.౹ అతడు తన మనస్సు యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడుక్రియలు చేసెను. రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శియైన ఇద్దో రచించిన వంశావళియందును వ్రాయబడియున్నది.౹ రెహ బామునకును యరొబామునకును యుద్ధము యెడతెగక జరిగెను. రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదుపట్టణమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజాయెను. రాజైన యరొబాము ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు అబీయా యూదావారిమీద ఏలనారం భించెను.౹ అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను; అతని తల్లిపేరు మీకాయా, ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె. అబీయాకును యరొబామునకును యుద్ధము కలుగగా అబీయా నాలుగు లక్షలమంది పరాక్రమశాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధముచేసెను; యరొబామును ఎనిమిది లక్షలమంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను.౹ అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు సెమరాయిము కొండమీద నిలిచి ప్రకటించినదేమనగా — యరొబామా, ఇశ్రాయేలువారలారా, మీరందరును నాకు చెవియొగ్గుడి.౹ ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడును ఏలునట్లుగా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతివారితోను భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలిసికొందురు గదా.౹ అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునగు యరొబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానునిమీద తిరుగుబాటు చేసెను.౹ సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్యదశలోనుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తిలేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి.౹ ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధముచేయ తెగించెదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు; యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలును మీయొద్ద ఉన్నవి.౹ మీరు అహరోను సంతతివారైన యెహోవా యాజకులను, లేవీయులను త్రోసివేసి, అన్యదేశముల జనులు చేయునట్లు మీకొరకు యాజకులను నియమించు కొంటిరిగదా? ఒక కోడెతోను ఏడు గొఱ్ఱె పొట్టేళ్లతోను తన్ను ప్రతిష్ఠించుటకైవచ్చు ప్రతివాడు, దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు.౹ అయితే యెహోవా మాకు దేవుడైయున్నాడు; మేము ఆయనను విసర్జించిన వారము కాము; అహరోను సంతతివారు యెహోవాకు సేవచేయు యాజకులై యున్నారు; లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు.౹ వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టిం చుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పరచిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాముగాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి.౹ ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదు నట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు; ఇశ్రాయేలువారలారా, మీపితరుల దేవుడైన యెహోవాతో యుద్ధముచేయకుడి, చేసినను మీరు జయమొందరు. యరొబాము వారి వెనుకటి భాగమందు మాటు గాండ్రను కొందరిని ఉంచి, సైన్యము యూదావారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుకను ఉండునట్లు చేసెను.౹ యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలిసికొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులును బూరలు ఊదిరి.౹ అప్పుడు యూదావారు ఆర్భటించిరి; యూదావారు ఆర్భటించి నప్పుడు యరొబామును ఇశ్రాయేలువారందరును అబీయా యెదుటను యూదావారి యెదుటను నిలువలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలువారు యూదా వారి యెదుటనుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదా వారిచేతికి అప్పగించినందున అబీయాయును అతని జనులును వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో అయిదు లక్షలమంది పరాక్రమశాలులు హతులైరి.౹ ఈ ప్రకారము ఇశ్రాయేలువారు ఆ కాలమందు తగ్గింపబడిరిగాని యూదావారు తమపితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువుచేత జయమొందిరి.౹ అబీయా యరొబామును తరిమి, బేతేలును దాని గ్రామములను యెషానాను దాని గ్రామములను ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకొనెను. అబీయా బ్రదికిన కాలమున యరొబాము మరల బలము పొందలేదు, యెహోవా అతని మొత్తినందుచేత అతడు మరణ మొందెను.౹ అబీయా వృద్ధినొందెను, అతడు పదునాలుగు మంది భార్యలను వివాహము చేసికొని యిరువది యిద్దరు కుమారులను పదునారుగురు కుమార్తెలను కనెను.౹ అబీయా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని చర్యనుగూర్చియు, అతని కాలమున జరిగిన సంగతులనుగూర్చియు ప్రవక్తయైన ఇద్దో రచించిన సటీక గ్రంథమునందు వ్రాయ బడియున్నది. అబీయా తన పితరులతోకూడ నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి; అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను.౹ ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచినవాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నతస్థలములను పాడుచేసి ప్రతిమలను పగుల గొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమునుబట్టియు విధినిబట్టియు క్రియలు జరిగించుటకును, యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నతస్థలములను సూర్య దేవతాస్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనుండి తీసివేసెను. అతని యేలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను.౹ ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుటచేత దేశములో నెమ్మదికలిగియుండెను; యెహోవా అతనికి విశ్రాంతి దయచేసియుండగా అతడు యూదా దేశమున ప్రాకారములుగల పట్టణములను కట్టించెను. అతడు యూదావారికి ఈలాగు ప్రకటనచేసెను–మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్ర యించినందున ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసి యున్నాడు; దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగ వచ్చును, మనము ఈ పట్టణములను కట్టించి, వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధినొందిరి.౹ ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను మూడు లక్షలమంది యూదావారును, కేడెములు ధరించి విల్లువేయు రెండులక్షల ఎనుబదివేల మంది బెన్యామీనీయులును కూడిన సైన్యము ఆసాకు ఉండెను; వీరందరును పరాక్రమశాలులై యుండిరి.౹ కూషీయుడైన జెరహు వారిమీద దండెత్తి వేయి వేల సైన్యమును మూడువందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషావరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను.౹ వారు మారేషానొద్ద జెపాతా అను పల్లపుస్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి — యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొనియున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆసాయెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందునవారు పారిపోయిరి.౹ ఆసాయును అతనితోకూడనున్నవారును గెరారువరకు వారిని తరుమగా కూషీయులు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయముచేతను ఆయన సైన్యపు భయముచేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకొనిరి.౹ గెరారు చుట్టునున్న పట్టణములలోని వారందరిమీదికి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటిని కొల్లపెట్టి, వాటిలోనున్న మిక్కుటమైన కొల్లసొమ్మంతయు దోచుకొనిరి.౹ మరియు వారు పసులసాలలను పడగొట్టి విస్తారమైన గొఱ్ఱెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యామీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి యీలాగు ప్రకటించెను –ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును,౹ నిజమైన దేవుడైనను ఉపదేశముచేయు యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలాదినములు ఇశ్రాయేలీయులకులేకుండ పోవును.౹ తమ శ్రమయందువారు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా యొద్దకు మళ్లుకొని ఆయనను వెదకి నపుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను.౹ ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానములేకుండెను.౹ దేవుడు జనములను సకలవిధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును, పాడు చేసెను.౹ కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన యీ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటినుండియు, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలోనుండియు హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి, యెహోవా మంటపము ఎదుటనుండు యెహోవా బలిపీఠమును మరల కట్టించి యూదా వారినందరిని బెన్యామీనీయుల నందరిని, ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్రస్థానములలోనుండి వచ్చి వారిమధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై యుండుట చూచి ఇశ్రాయేలువారిలోనుండి విస్తారమైనజనులు అతని పక్షము చేరిరి.౹ ఆసా యేలుబడియందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసికొనివచ్చిన కొల్లసొమ్ములోనుండి ఆ దినమున ఏడువందల యెద్దులను ఏడువేల గొఱ్ఱెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను తమపితరుల దేవుడైన యెహోవాయొద్ద తాము విచారణచేయుదుమనియు పిన్నలేగాని పెద్దలేగాని పురుషులేగాని స్త్రీలేగాని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాయొద్ద విచారణ చేయనివారికందరికిని మరణము విధించుదుమనియు నిష్కర్షచేసికొనిరి.౹ వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోను బూరల నాదముతోను భేరీధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి.౹ ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరును సంతోషించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణముచేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవావారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములులేకుండ వారికి నెమ్మది కలుగజేసెను.౹ మరియు తన తల్లియైన మయకా అసహ్యమైన యొక దేవతాస్తంభమును నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైన ఆసా ఆమెను త్రోసివేసి, ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి ఛిన్నాభిన్నము చేసి కిద్రోను వాగుదగ్గర దాని కాల్చివేసెను.౹ ఆసా ఉన్నతస్థలములను ఇశ్రాయేలీయులలోనుండి తీసివేయలేదుగాని యితడు బ్రదికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను.౹ తన తండ్రి ప్రతిష్ఠించినట్టియు, తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసికొని దేవుని మందిరమునందుంచెను.౹ ఆసా యేలుబడియందు ముప్పది యయిదవ సంవత్సరమువరకు యుద్ధములు జరుగలేదు. ఆసా యేలుబడియందు ముప్పది ఆరవ సంవత్సరమున ఇశ్రాయేలురాజైన బయెషా యూదావారిమీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసాయొద్దకు రాక పోకలు జరుగకుండునట్లు రామాను కట్టింపగా ఆసా యెహోవామందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి, దమస్కులో నివాసముచేయు సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతలచేత పంపించి –నా తండ్రికిని నీ తండ్రికిని కలిగియున్నట్లు నాకును నీకును సంధి కలిగియున్నది, వెండిని బంగారమును నీకు పంపియున్నాను; ఇశ్రాయేలురాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చేయుమని వర్తమానము చేసెను.౹ బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి, తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలువారి పట్టణములమీదికి పంపగా వీరు ఈయోనును దానును ఆబేల్మాయీమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టిరి.౹ బయెషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను.౹ అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరిని సమకూర్చెను; వీరు పోయి బయెషా కట్టించు చుండిన రామాపట్టణపు రాళ్లను దూలములను తీసికొని వచ్చిరి, వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకారపురములుగా కట్టించెను. ఆ కాలమందు దీర్ఘదర్శియైన హనానీ యూదా రాజైన ఆసాయొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను–నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే? సిరియా రాజుయొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొనిపోయెను.౹ బహువిస్తారమైన రథములును గుఱ్ఱపు రౌతులునుగల కూషీయులును లూబీయులును గొప్ప దండై వచ్చిరిగదా? అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీచేతికప్పగించెను.౹ తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.౹ ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రముచూపి అతనిని బందీగృహములో వేసెను, ఇదియుగాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను.౹ ఆసా చేసిన కార్యములన్నిటినిగూర్చి యూదా ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణచేయక వైద్యులను పట్టుకొనెను.౹ ఆసా తన పితరులతోకూడ నిద్రించి తన యేలుబడియందు నలువది యొకటవ సంవత్సరమున మృతి నొందగా అత్తరు పనివారిచేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళద్రవ్యములతోను నిండిన పడకమీద జనులు అతని ఉంచి, అతని నిమిత్తము బహువిస్తారమైన గంధవర్గములను దహించి, దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధియందు అతని పాతిపెట్టిరి. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన. యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండ తన రాజ్యమును బలపరచుకొనెను.౹ అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటియందును సైన్యములను ఉంచి, యూదా దేశమందును తన తండ్రియైన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణములయందును కావలి బలములను ఉంచెను.౹ యెహోవా అతనికి సహాయుడై యుండగా యెహోషాపాతు తన తండ్రియైన దావీదు ప్రారంభదినములలో నడచిన మార్గమందు నడచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు, ఇశ్రాయేలువారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలననుసరించి నడిచెను.౹ కాబట్టి యెహోవా అతనిచేత రాజ్యమును స్థిరపరచెను, యూదావారందరును యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వ ర్యమును ఘనతయు మెండుగా కలిగెను.౹ యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనినవాడై ఉన్నతస్థలములను దేవతాస్తంభములను యూదాలోనుండి తీసివేసెను. తన యేలుబడియందు మూడవ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును ఓబద్యాను జెకర్యాను నెతనేలును మీకాయాను షెమయా నెతన్యా జెబద్యా అశాహేలు షెమిరామోతు యెహోనాతాను అదోనీయా టోబీయా టోబదోనీయా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను యెహోరామును బంపెను.౹ వారు యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చేతపుచ్చుకొని యూదావారిమధ్య ప్రకటనచేయుచు, యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి.౹ యూదాదేశము చుట్టుఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందునవారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి.౹ ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచు వచ్చిరి; అరబీయులును అతనికి ఏడువేల ఏడు వందల గొఱ్ఱె పొట్టేళ్లను ఏడువేల ఏడు వందల మేకపోతులను తెచ్చుచు వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామగ్రిని నిలువచేయు పట్టణములను కట్టించెను.౹ యూదాదేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి.౹ వీరి పితరుల వంశములచొప్పున వీరి సంఖ్య యెంతనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నాయొద్ద మూడు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.౹ రెండవవాడగు యెహోహానాను అను అధిపతియొద్ద రెండులక్షల ఎనుబదివేలమంది యుండిరి.౹ మూడవవాడు జిఖ్రీ కుమారుడై యెహోవాకు తన్నుతాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా; అతనియొద్ద రెండు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.౹ బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి యొకడుండెను; వీనియొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు రెండు లక్షలమంది యుండిరి.౹ రెండవవాడు యెహోజాబాదు; వీనియొద్ద లక్షయెనుబదివేలమంది యుద్ధసన్నద్ధులుండిరి.౹ రాజు యూదాయందంతటనుండు ప్రాకారపురములలో ఉంచినవారు గాక వీరు రాజుయొక్క పరివారములో చేరినవారై యుండిరి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో వియ్యమంది కొన్ని సంవత్సరములు గతించినమీదట షోమ్రోనులో నుండు అహాబునొద్దకు పోయెను; అహాబు అతని కొరకును అతని వెంటవచ్చిన జనులకొరకును అనేకమైన గొఱ్ఱెలను పశువులను కోయించి, తనతోకూడ రామోత్గిలాదు మీదికిపోవుటకు అతని ప్రేరేపించెను.౹ ఇశ్రాయేలురాజైన అహాబు యూదారాజైన యెహోషాపాతును చూచి–నీవు నాతోకూడ రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా యెహోషాపాతు–నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతోకూడ యుద్ధమునకు వచ్చెదమని చెప్పెను.౹ మరియు యెహోషాపాతు ఇశ్రాయేలురాజుతో–నేడు యెహోవాయొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా ఇశ్రాయేలురాజు నాలుగువందలమంది ప్రవక్తలను సమకూర్చి–నేను రామోత్గిలాదుమీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారి నడిగెను. అందుకువారు–పొమ్ము, దేవుడు రాజు చేతికి దానినప్పగించునని చెప్పిరి.౹ అయితే యెహోషాపాతు–మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా? అని యడుగగా ఇశ్రాయేలురాజు–యెహోవాయొద్ద విచారణచేయుటకు ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు నన్నుగూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వానియందు పగ గలిగియున్నాననగా యెహోషాపాతు–రాజు ఆలాగనవద్దనెను.౹ అప్పుడు ఇశ్రాయేలురాజు తన పరివారములోనున్న యొకని పిలిపించి–ఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చెను.౹ ఇశ్రాయేలురాజును యూదారాజగు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమతమ వస్త్రములను ధరించుకొని తమతమ సింహాసనములమీద కూర్చునియుండగా ప్రవక్తలందరును వారి ముందర ప్రవచించుచుండిరి.౹ అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా యినుపకొమ్ములు చేయించుకొనివచ్చి–సిరియనులు నిర్మూల మగువరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను.౹ ప్రవక్తలందరును ఆప్రకారముగానే ప్రవచించుచు–యెహోవా రామో త్గిలాదును రాజు చేతికి అప్పగించును, దానిమీదికిపోయి జయమొందుము అనిరి.౹ మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని–ప్రవక్తలు రాజు విషయమై యేక ముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరచి మేలునే ప్రవ చింపుమనగా మీకాయా–యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చునదేదో దానినే ప్రవచింతునని చెప్పెను.౹ అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూచి–మీకాయా, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదుమా, మానుదుమా అని యడుగగా అతడు–పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను.౹ అప్పుడు రాజు–యెహోవా నామమునుబట్టి అబద్ధముకాక సత్యమే పలుకుమని నేను ఎన్నిమారులు నీచేత ఒట్టు పెట్టించుకొందునని అతనితో అనగా అతడు–కాపరిలేని గొఱ్ఱెలవలెనే ఇశ్రాయేలు వారందరును పర్వతములమీద చెదరిపోవుట చూచితిని; —వీరికి యజమానుడు లేడనియు, వీరిలో ప్రతివాడు తన తన యింటికి సమాధానముగా పోవలెననియు యెహోవా సెలవిచ్చియున్నాడనెను.౹ ఇశ్రాయేలురాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను —ఇతడు కీడునేగాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని యనగా మీకాయా— యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడైయుండుటయు, పరమండల సైన్యమంతయు ఆయన కుడిప్రక్కను ఎడమప్రక్కను నిలువబడుటయు నేను చూచితిని.౹ –ఇశ్రాయేలురాజైన అహాబు రామో త్గిలాదుమీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి.౹ అప్పుడు ఒక ఆత్మవచ్చి యెహోవాయెదుట నిలువబడి–నేను అతని ప్రేరేపించెదనని చెప్పగా యెహోవా–దేనిచేతనని అతని నడిగెను.౹ అందుకు ఆయాత్మ–నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా యెహోవా–నీవు అతనిని ప్రేరేపించి జయిం తువు, పోయి ఆప్రకారముగా చేయుమని సెలవిచ్చెను.౹ యెహోవా నీ ప్రవక్తలగు వీరినోట అబద్ధములాడు ఆత్మను ఉంచియున్నాడు, యెహోవా నీమీద కీడు పలికించియున్నాడని చెప్పెను. అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంపమీద కొట్టి–నీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏ మార్గమున పోయెననెను.౹ అందుకు మీకాయా–దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్లు దినమున దాని తెలిసికొందువని చెప్పెను.౹ అప్పుడు ఇశ్రాయేలురాజు–పట్టణపు అధిపతియైన ఆమోనునొద్దకును రాజు కుమారుడైన యోవాషునొద్దకును —మీరు మీకాయాను తీసికొనిపోయి వారితో రాజు మీకిచ్చిన సెలవు ఇదియే యనుడి,౹ –నేను సురక్షితముగా తిరిగి వచ్చువరకు వీనిని చెరలోపెట్టి క్లేశాన్న పానములు ఇయ్యుడి.౹ అప్పుడు మీకాయా యిట్ల నెను–నీవు సురక్షితముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నా ద్వారా పలుకనే లేదనిచెప్పి, సమస్తజనులారా ఆలకించుడనెను.౹ అంతట ఇశ్రాయేలురాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్గిలాదుమీదికి పోయిరి.౹ ఇశ్రాయేలురాజు–నేను మారువేషమువేసికొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసి కొనెను, తరువాత వారు యుద్ధమునకు పోయిరి.౹ సిరియా రాజు–మీరు ఇశ్రాయేలురాజుతోనే యుద్ధము చేయుడి, అధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతోకూడనున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చియుండెను.౹ కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి,గాని యెహోషాపాతు మొఱ్ఱపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను, దేవుడు అతని యొద్దనుండి వారు తొలగిపోవునట్లు చేసెను.౹ ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజుకాడని తెలిసికొని అతని తరుముట మాని తిరిగిపోయిరి.౹ అప్పుడు ఒకడు గురిచూడకయే తన వింటిని ఎక్కుబెట్టి, ఇశ్రాయేలురాజును అతని కవచపు బందులసందున కొట్టగా అతడు— నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులోనుండి నన్ను కొనిపొమ్మని తన సారధితో అనెను.౹ ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను; అయినను ఇశ్రాయేలురాజు అస్తమయమువరకు సిరియనులకెదురుగా తన రథమునందు నిలిచెను, ప్రొద్దుగ్రుంకువేళ అతడు చని పోయెను. యూదారాజైన యెహోషాపాతు ఏ యపాయమును చెందకుండ యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగిరాగా దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి, రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటనచేసెను–నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా? అందువలన యెహోవా సన్నిధినుండి కోపము నీమీదికి వచ్చును.౹ అయితే దేశములోనుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవునియొద్ద విచారణచేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబానుండి ఎఫ్రాయిము మన్యమువరకు జనులమధ్యను సంచరించుచు, వారి పితరుల దేవుడైన యెహోవావైపునకు వారిని మళ్లించెను.౹ మరియు అతడు ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదావారున్న బురుజులుగల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికీలాగున ఆజ్ఞాపించెను –మీరు యెహోవా నియమమునుబట్టియేగాని మనుష్యుల నియమమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; ఆయన మీతోకూడనుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్ర త్తగా చేయుడి.౹ యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.౹ మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణ యించిన న్యాయమును జరిగించుటకును, సందేహాంశములను పరిష్కరించుటకును, యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరులయిండ్ల పెద్దలలోను కొందరిని నియమించి వారికీలాగున ఆజ్ఞాపించెను–యెహోవాయందు భయభక్తులు కలిగినవారై, నమ్మకముతోను యథార్థమనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను.౹ నరహత్యనుగూర్చియు, ధర్మశాస్త్రమునుగూర్చియు, ధర్మమునుగూర్చియు, కట్టడలనుగూర్చియు, న్యాయవిధులనుగూర్చియు, ఆయాపట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినేగాని మీరు విమ ర్శించునప్పుడు, మీమీదికిని మీ సహోదరులమీదికిని కోపము రాకుండునట్లువారు యెహోవాదృష్టికి ఏ అపరాధమును చేయకుండ వారిని హెచ్చరిక చేయవలెను; మీరాలాగు చేసినయెడల అపరాధులు కాకయుందురు.౹ మరియు ప్రధానయాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీమీద ఉన్నాడు, యూదా సంతతివారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలుచేయుటకై యెహోవా మీతోకూడ ఉండును. ఇది యయిన తరువాత మోయాబీయులును అమ్మోనీయులును మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతుమీదికి వచ్చిరి.౹ అంతలో కొందరు వచ్చి–సముద్రము ఆవలనుండు సిరియనులతట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది; చిత్తగించుము, వారు హససోన్‌తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి.౹ అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా యూదావారు యెహోవావలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవాయొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోనుండి జనులు వచ్చిరి.౹ యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలయెదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనులమధ్యను నిలువబడి –మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు.౹ నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే.౹ వారు అందులో నివాసముచేసి, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను, మామీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొఱ్ఱపెట్టినయెడల నీవు ఆలకించి మమ్మును రక్షిం చుదువని అనుకొని, యిచ్చట నీ నామఘనతకొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా.౹ ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయాబీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్దనుండి తొలగి పోయిరి.౹ మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్యములోనుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము.౹ మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను.౹ యూదావారందరును తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి.౹ అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతనిమీదికి రాగా అతడీలాగు ప్రకటిం చెను –యూదావారలారా, యెరూషలేము కాపు రస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును.౹ రేపు వారిమీదికి పోవుడి; వారు జీజు అను ఎక్కుడుమార్గమున వచ్చెదరు, మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగుకొనదగ్గర వారిని కనుగొందురు.౹ ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడుడి; మీతోకూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతోకూడ ఉండును.౹ అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను; యూదావారును యెరూషలేము కాపురస్థులును యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి.౹ కహాతీయుల సంతతివారును కోరహీయుల సంతతివారునగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను స్తుతించిరి.౹ అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి–యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహోవాను నమ్ము కొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను.౹ మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచు–యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను.౹ వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయులమీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి.౹ అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి.౹ యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు.౹ యెహోషాపాతును అతని జనులును వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవములయొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను; వారు తమకిష్టమైనంతమట్టుకు తీసికొని తాము కొనిపోగలిగినంతకంటె ఎక్కువగా ఒలుచుకొనిరి; కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు మూడుదినములు పట్టెను.౹ నాల్గవదినమునవారు బెరాకా లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటివరకును ఆ చోటికి బెరాకా లోయ యని పేరు.౹ ఈలాగున యెహోవావారి శత్రువులమీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేమువారును వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్లిరి;౹ వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచువచ్చిరి.౹ ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరు వినగా దేవుని భయము వారందరిమీదికి వచ్చెను.౹ ఈ ప్రకారము అతని దేవుడు చుట్టునున్నవారిని జయించి అతనికి నెమ్మది ననుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను. యెహోషాపాతు యూదారాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు ముప్పదియయిదు సంవత్సరములవాడై యెరూషలేములో ఇరువదియయిదు సంవత్సరములు ఏలెను; అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా,౹ అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రియైన ఆసా మార్గమందు నడచుచు దానిలోనుండి తొలగిపోకుండెను.౹ అయితే అప్పటి కింకను జనులు తమపితరుల దేవుని వెదకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు, అతడు ఉన్నతస్థలములను తీసివేయలేదు.౹ యెహోషాపాతు చేసిన కార్యములన్నిటినిగూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడియున్నది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలురాజుల గ్రంథమందు కనబడుచున్నది.౹ ఇది యయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలురాజైన అహజ్యాతో స్నేహము చేసెను.౹ తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహముచేయగా వారు ఎసోన్గె బెరులో ఆ ఓడలను చేయించిరి.౹ అప్పుడు మారేషావాడును దోదావాహు కుమారుడునగు ఎలీయెజెరు–నీవు అహజ్యాతో స్నేహము చేసికొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతుమీద ప్రవచనమొకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లజాలకుండ బద్దలైపోయెను. యెహోషాపాతు తన పితరులతోకూడ నిద్రించి తన పితరులచెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను.౹ యెహోషాపాతు కుమారులైన అజర్యా యెహీయేలు జెకర్యా అజర్యా మిఖాయేలు షెఫట్య అను వారు ఇతనికి సహోదరులు; వీరందరును ఇశ్రాయేలురాజైన యెహోషాపాతు కుమారులు.౹ వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్తవస్తువులనేకములను యూదా దేశములో ప్రాకారముగల పట్టణములను వారికిచ్చెను; అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను.౹ యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని, తన సహోదరులనందరిని ఇశ్రాయేలీయుల అధిపతులలో కొందరిని హతముచేసెను.౹ యెహోరాము ఏలనారంభించి నప్పుడు ముప్పది రెండేండ్లవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలెను.౹ అతడు అహాబు కుమార్తెను పెండ్లిచేసికొని అహాబు సంతతివారు నడచిన ప్రకారముగా ఇశ్రాయేలురాజుల మార్గమందు నడచెను; అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను.౹ అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును, అతనికిని అతని కుమారులకును నిత్యము దీప మిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సులేక యుండెను.౹ అతని దినములలో ఎదోమీయులు తిరుగబడి యూదావారి అధికారము త్రోసివేసి తమకు ఒకరాజును చేసికొనగా యెహోరాము తన చేతిక్రిందనున్న అధికారులను వెంట బెట్టుకొని, తన రథములన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తన్ను చుట్టుకొనిన ఎదోమీయులను రథాధిపతులను హతముచేసెను.౹ కాగా నేటివరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదావారి చేతిక్రింద నుండక తిరుగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతనిచేతి క్రిందనుండి తిరుగబడెను.౹ మరియు అతడు యూదా పర్వతములయందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్థులు దేవుని విసర్జించునట్లు చేసెను. యూదావారిని విగ్రహపూజకు లోపరచెను. అంతట ప్రవక్తయైన ఏలీయా యొక పత్రిక వ్రాసి అతనియొద్దకు పంపెను–నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన ఆసా మార్గములందైనను నడువక ఇశ్రాయేలురాజుల మార్గమందు నడచి అహాబు సంతతివారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్థులను వ్యభిచరింపజేసి, నీకంటె యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు.౹ కాబట్టి గొప్ప తెగులుచేత యెహోవా నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తువాహనములన్నిటిని మొత్తును.౹ నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై యుందువు; దిన క్రమేణ ఆ వ్యాధిచేత నీ పేగులు పడిపోవును.౹ మరియు యెహోవా యెహోరాముమీదికి ఫిలిష్తీయులను కూషీయుల చేరువనున్న అరబీయులను రేపగా వారు యూదా దేశముమీదికి వచ్చి దానిలో చొరబడి రాజ నగరునందు దొరకిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొనిపోయిరి; అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు.౹ ఇదియంతయు అయినతరువాత యెహోవా కుదరచాలని వ్యాధిచేత అతనిని ఉదరమున మొత్తినందున రెండు సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధిచేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తరక్రియలు అతనికి చేయలేదు.౹ అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు; యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలి యెవరికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను; రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరుచోట జనులు అతని పాతిపెట్టిరి. అరబీయులతోకూడ దండు విడియుచోటికి వచ్చినవారు పెద్దవారినందరిని చంపిరి గనుక యెరూషలేము కాపురస్థులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజునుచేసిరి. ఈ ప్రకారము యూదారాజగు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము బొందెను.౹ అహజ్యా యేలనారంభించినప్పుడు నలువది రెండేండ్లవాడై యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను; అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడును అహాబు సంతతివారి మార్గములందు నడచెను.౹ అహాబు సంతతివారివలెనే అతడు యెహోవా దృష్టికి చెడునడత నడచెను; అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశమునకు కారకులైరి.౹ వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి, రామోత్గిలాదులో సిరియారాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై అహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజగు యెహోరాముతోకూడ పోయెను; సిరియనులచేత యెహోరామునకు గాయములు తగిలెను.౹ సిరియారాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగుచేసికొనుటకై అతడు యెజ్రెయేలునకు మరలి వచ్చెను. అహాబు కుమారుడైన యెహోరాము రోగియైయున్నాడని విని యూదా రాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను.౹ యెహోరాము నొద్దకు అతడు వచ్చుటచేత దేవునివలన అతనికి నాశము కలిగెను; ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతివారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీకుమారుడైన యెహూమీదికి అతడు యెహోరాముతోకూడ పోగా యెహూ అహాబు సంతతివారిమీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను, అహజ్యాకు పరిచారకులుగా నున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతముచేసెను.౹ అతడు అహజ్యాను వెదకెను. అతడు షోమ్రోనులో దాగియుండగా వారు అతని పట్టుకొని యెహూనొద్దకు తీసికొనివచ్చిరి; వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి; కాగా రాజ్యమేలుటకు అహజ్యా యింటివారు ఇక నెవరును లేకపోయిరి. అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు చనిపోయె నని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులగు రాజవంశజులనందరిని హతము చేసెను.౹ అయితే రాజునకు కుమార్తెయైన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలోనుండి దొంగిలించి, అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనబడకుండ అతని దాచిపెట్టెను గనుక ఆమె అతని చంప లేకపోయెను; ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి.౹ ఆరుసంవత్సరములు అతడు వారితోకూడ దేవుని మందిరములో దాచబడియుండెను; ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను. అంతట ఏడవ సంవత్సరమందు యెహోయాదా. ధైర్యము తెచ్చుకొని, శతాధిపతులతోను యెరోహాము కుమారుడైన అజర్యాతోను యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోను ఓబేదు కుమారుడైన అజర్యాతోను అదాయా కుమారుడైన మయశేయాతోను జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతుతోను నిబంధనచేయగా వారు యూదా దేశమందంతటను సంచరించి, యూదావారి పట్టణములన్నిటిలోనుండి లేవీయులను ఇశ్రాయేలీయుల పితరులయిండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి.౹ జనులందరు సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసికొనినప్పుడు అతడు వారితో ఇట్లనెను–యెహోవా దావీదు కుమారులనుగూర్చి యిచ్చిన సెలవుచొప్పున రాజకుమారుడు రాజ్య మేలవలెను.౹ కాబట్టి మీరు చేయవలసినదేమనగా, మీలో యాజకులైనవారేమి లేవీయులైనవారేమి విశ్రాంతిదినమున లోపల ప్రవేశించువారు మూడు భాగములై, యొక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను.౹ ఒక భాగము రాజనగరునొద్ద ఉండవలెను. ఒక భాగము పునాది గుమ్మము నొద్ద ఉండవలెను, జనులందరు యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను.౹ యాజకులును లేవీయులలో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిరము లోపలికి మరి ఎవరును రాకూడదు, వారు ప్రతిష్ఠింపబడినవారు గనుక వారు లోపలికి రావచ్చునుగాని జనులందరు యెహోవా ఇచ్చిన ఆజ్ఞచొప్పున బయట ఉండవలెను.౹ లేవీయులందరు తమతమ ఆయుధములను చేతపట్టుకొని రాజుచుట్టును ఉండవలెను, మందిరము లోపలికి మరి ఎవరైనను వచ్చినయెడల ఆ వచ్చినవారికి మరణశిక్ష విధించుడి; రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్లునప్పుడేమి మీరు అతనితోకూడ ఉండవలెను.౹ కాబట్టి లేవీయులును యూదావారందరును యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ యంతటి ప్రకారము చేసిరి; యాజకుడైన యెహోయాదా వంతులవారికి సెలవియ్యలేదు గనుక ప్రతివాడు విశ్రాంతిదినమున బయటికి వెళ్ల వలసిన తనవారిని ఆ దినమున లోపలికి రావలసిన తనవారిని తీసికొనివచ్చెను. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను.౹ అతడు ఆయుధము చేతపట్టుకొనిన జనులందరిని మందిరపు కుడివైపునుండి యెడమవైపువరకు బలిపీఠము ప్రక్కను మందిరముప్రక్కను రాజుచుట్టును ఉంచెను.౹ అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి, అతనిమీద కిరీటముంచి, ధర్మశాస్త్ర గ్రంథమును అతనిచేతికిచ్చి అతనికి పట్టాభి షేకము చేసిరి; యెహోయాదాయును అతని కుమారులును అతనిని అభిషేకించి–రాజు చిరంజీవియగునుగాక యనిరి. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులుచేయు ధ్వని అతల్యా విని యెహోవామందిరమందున్న జనులయొద్దకు వచ్చి ప్రవేశస్థలముదగ్గర నున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలువబడియుండుటయు, అధిపతులును బూరలు ఊదువారును రాజునొద్దనుండుటయు, దేశపు జనులందరును సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు, గాయకులును వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని–ద్రోహము ద్రోహమని అరచెను.౹ అప్పుడు యాజకుడైన యెహోయాదా–యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు తీసుకొనివెళ్ళి ఆమె పక్షము పూనువారిని కత్తిచేత చంపుడని సైన్యముమీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.౹ కాబట్టి వారు ఆమెకు దారియిచ్చి, రాజనగరునొద్దనున్న గుఱ్ఱపు గుమ్మముయొక్క ప్రవేశస్థలమునకు ఆమె వచ్చి నప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి.౹ అప్పుడు యెహోయాదా జనులందరు యెహోవావారై యుండవలెనని జనులందరితోను రాజుతోను నిబంధనచేసెను.౹ అంతట జనులందరును బయలుదేవతయొక్క గుడికి పోయి దాని పడగొట్టి, బలిపీఠములను విగ్రహములను తుత్తునియలుగా విరుగగొట్టి, బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి.౹ మరియు మోషే యిచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడినదానినిబట్టి ఉత్సాహముతోను గానముతోను యెహోవాకు అర్పింపవలసిన దహనబలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు, లేవీయులైన యాజకుల చేతిక్రింద నుండునట్టియు, యెహోవామందిరమందు దావీదు పనులు పంచివేసినట్టియునైన యెహోవా మందిరపు కావలివారికి యెహోయాదా నిర్ణయించెను.౹ యెహోవా మందిరములోనికి దేనిచేతనైనను అంటుతగిలినవారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారములయొద్ద ద్వారపాలకులను ఉంచెను.౹ మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులనందరిని వెంటబెట్టుకొని యెహోవా మందిరములోనుండి రాజును తోడుకొని వచ్చెను; వారు ఎత్తయిన ద్వారముగుండ రాజ నగరుచొచ్చి రాజ్యసింహాసనముమీద రాజును ఆసీనునిచేయగా దేశజనులందరు సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. యోవాషు ఏలనారంభించినప్పుడు ఏడు సంవత్స. రముల యీడుగలవాడై యెరూషలేములో నలువది ఏండ్లు ఏలెను; అతని తల్లి బెయేర్షెబా కాపురస్థురాలైన జిబ్యా.౹ యాజకుడైన యెహోయాదా బ్రదికిన దినములన్నియు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోయాదా అతనికి యిద్దరు భార్యలను పెండ్లి చేసెను; అతడు కుమారులను కుమార్తెలను కనెను.౹ అంతట యెహోవా మందిరమును బాగుచేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక అతడు యాజకులను లేవీయులను సమకూర్చి–మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగుచేయుటకై ఇశ్రాయేలీయులందరియొద్దనుండి ధనమును ఏటేట సమకూర్చుచు, ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికాజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయి నందున రాజు ప్రధానయాజకుడగు యెహోయాదాను పిలిచి–ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడుచేసి, యెహోవామందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణముల నన్నిటిని బయలుదేవతపూజకు ఉప యోగించిరి.౹ సాక్ష్యపు గుడారమును బాగుచేయుటకై యూదాలోనుండియు యెరూషలేములోనుండియు ఇశ్రాయేలీయుల సమాజముచేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీ వెందుకు చెప్పి తెప్పించలేదని యడిగెను.౹ కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పునవారు ఒక పెట్టెను చేయించి యెహోవామందిరద్వారము బయట ఉంచిరి.౹ మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణ యించిన కానుకను యెహోవాయొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి.౹ కాగా అధిపతులందరును జనులందరును సంతోషముగా కానుకలను తీసికొని వచ్చి చాలినంతమట్టుకు పెట్టెలో వేసిరి.౹ లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచు వచ్చిరి; అందులో ద్రవ్యము విస్తారముగా నున్నట్టు కనబడినప్పుడెల్ల, రాజుయొక్క ప్రధానమంత్రియు ప్రధానయాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి, పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథాస్థానమందు దానిని ఉంచుచు వచ్చిరి; వారీచొప్పున పలుమారు చేయుటచేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను.౹ అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయువారికి దానినిచ్చి, యెహోవా మందిరమును బాగుచేయుటకై కాసెవారిని వడ్లవారిని, యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుపపని యిత్తడిపని చేయువారిని కూలికి కుదిర్చిరి.౹ ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరచిరి.౹ అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసికొనిరాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడునట్లును, దహనబలులనర్పించుటయందు ఉపయోగపడునట్లును, ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న యన్నిదినములు యెహోవా మందిరములో దహనబలులు నిత్యమును అర్పింపబడెను. యెహోయాదా దినములు గడచిన వృద్ధుడై చని పోయెను; అతడు చనిపోయినప్పుడు నూట ముప్పది ఏండ్ల వాడు.౹ అతడు ఇశ్రాయేలీయులలో దేవునిదృష్టికిని తన యింటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజులదగ్గర అతని పాతిపెట్టిరి.౹ యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను.౹ జనులు తమపితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి, దేవతాస్తంభములకును విగ్రహములకును పూజచేసిరి; వారు చేసిన యీ యప రాధము నిమిత్తము యూదావారిమీదికిని యెరూషలేము కాపురస్థులమీదికిని కోపము వచ్చెను.౹ తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవావారియొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారిమీద సాక్ష్యము పలికిరిగాని వారు చెవియొగ్గక యుండిరి.౹ అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడి–మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను.౹ అందుకు వారతనిమీద కుట్రచేసి, రాజు మాటనుబట్టి యెహోవా మందిరపు ఆవరణములోపల రాళ్లు రువ్వి అతని చావగొట్టిరి.౹ ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను; అతడు చనిపోవునప్పుడు–యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక యనెను. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను; వారు యూదాదేశముమీదికిని యెరూషలేముమీదికిని వచ్చి, శేషములేకుండ జనుల అధిపతుల నందరిని హతముచేసి, తాము పట్టుకొనిన కొల్లసొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి.౹ సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవావారి చేతికి అతివిస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను.౹ వారు యోవాషును విడచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగియైయుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్యదోషము నిమిత్తము అతని సేవకులు అతనిమీద కుట్రచేసి, అతడు పడకమీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరిగాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు.౹ అతనిమీద కుట్రచేసినవారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమ్రీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు.౹ అతని కుమారులనుగూర్చియు, అతనిమీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులనుగూర్చియు, అతడు దేవుని మందిరమును బాగుచేయుటనుగూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడి యున్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను. అమజ్యా యేలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యిరువది తొమ్మిది సంవత్సరములు యెరూషలేములో ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థు రాలు, ఆమె పేరు యెహోయద్దాను.౹ అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెనుగాని పూర్ణహృదయముతో ఆయనను అనుసరింపలేదు.౹ రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను.౹ అయితే–తండ్రులు పిల్లలకొరకును పిల్లలు తండ్రులకొరకును చావకూడదు, ప్రతి మనిషి తన పాపముకొరకు తానే చావవలెనని మోషే గ్రంథ మందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడియున్న యెహోవా ఆజ్ఞనుబట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. అమజ్యా యూదావారినందరిని సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీనీయుల దేశమంతటను వారివారి పితరులయిండ్లనుబట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయముగల వారిని లెక్కింపగా, ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు మూడులక్షలమంది కనబడిరి.౹ మరియు అతడు ఇశ్రాయేలువారిలోనుండి లక్షమంది పరాక్రమశాలులను రెండువందల మణుగుల వెండికి కుదిర్చెను.౹ దైవజనుడైన యొకడు అతనియొద్దకు వచ్చి–రాజా, ఇశ్రాయేలువారి సైన్యమును నీతోకూడ తీసికొనిపోవద్దు, యెహోవా ఇశ్రాయేలువారగు ఎఫ్రాయిమీయులలో ఎవరికిని తోడుగా ఉండడు.౹ ఆలాగు పోవలెనని నీకున్నయెడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును; నిలువబెట్టుటయు పడవేయు టయు దేవునివశమేగదా అని ప్రకటింపగా అమజ్యా దైవజనుని చూచి–ఇశ్రాయేలువారి సైన్యమునకు నేనిచ్చిన రెండువందల మణుగుల వెండికి ఏమి చేసెదమని అడిగినందుకు–దీనికంటె మరి యధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చెను.౹ అప్పుడు అమజ్యా ఎఫ్రాయిములోనుండి తనయొద్దకు వచ్చిన సైన్యమును వేరుపరచి–మీ యిండ్లకు తిరిగి వెళ్లు డని వారికి సెలవిచ్చెను; అందుకు వారి కోపము యూదావారిమీద బహుగా రగులుకొనెను, వారు ఉగ్రులై తమ యిండ్లకు తిరిగి పోయిరి.౹ అంతట అమజ్యా ధైర్యము తెచ్చుకొని తన జనులతోకూడ బయలుదేరి ఉప్పుపల్లపు స్థలమునకు పోయి శేయీరువారిలో పదివేలమందిని హతము చేసెను.౹ ప్రాణముతోనున్న మరి పదివేలమందిని యూదావారు చెరపట్టుకొని, వారిని ఒక పేటుమీదికి తీసికొనిపోయి ఆ పేటుమీదనుండి వారిని పడవేయగా వారు తుత్తునియలైపోయిరి.౹ అయితే తనతోకూడ యుద్ధమునకు రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బేత్‌హోరోనువరకు ఉన్న యూదాపట్టణములమీదపడి వారిలో మూడు వేలమందిని హతముచేసి విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకొనిపోయిరి. అమజ్యా ఎదోమీయులను ఓడించితిరిగి వచ్చిన తరువాత అతడు శేయీరువారి దేవతలను తీసికొనివచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను.౹ అందుకొరకు యెహోవా కోపము అమజ్యామీద రగులుకొనెను. ఆయన అతనియొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు–నీ చేతిలోనుండి తమ జనులను విడిపింప శక్తిలేని దేవతలయొద్ద నీవెందుకు విచారణ చేయుదువని అమజ్యాతోననెను.౹ అతడు అమజ్యాతో మాటలాడుచుండగా రాజు అతని చూచి–నీవు రాజుయొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా? ఊరకొనుము; నేను నిన్ను చంపనేల అని చెప్పగా ఆ ప్రవక్త–నీవు ఈలాగున చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపజేయనుద్దేశించియున్నాడని నాకు తెలియునని చెప్పి యూరకొనెను. అప్పుడు యూదారాజైన అమజ్యా ఆలోచనచేసికొని —రమ్ము మనము ఒకరి ముఖమును ఒకరము చూచుకొందమని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలురాజునైన యెహోయాషునొద్దకు వర్తమానము పంపెను.౹ కాగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు తిరుగ వర్తమానము పంపెను–నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులో నున్న ముండ్లచెట్టు లెబానోనులోనున్న దేవదారువృక్షమునకు వర్తమానము పంపగా లెబానోనులో సంచరించు ఒక దుష్టమృగము ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.౹ –నేను ఎదోమీయులను ఓడించితిని గదా యని నీవను కొనుచున్నావు; నీ హృదయము నీవు గర్వించి ప్రగ ల్భము లాడునట్లు చేయుచున్నది; యింటియొద్ద నిలిచి యుండుము; నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకొనుట యెందుకు? నీవును నీతోకూడ యూదావారును అపజయ మొందుట యెందుకు? జనులు ఎదోమీయుల దేవతలయొద్ద విచారణ చేయుచు వచ్చిరి గనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడునట్లు దేవుని ప్రేరణవలన అమజ్యా ఆ వర్తమానమును అంగీకరింపక పోయెను.౹ ఇశ్రాయేలురాజైన యెహోయాషు బయలుదేరగా యూదా దేశమునకు చేరిన బేత్షెమెషులో అతడును యూదా రాజైన అమజ్యాయును ఒకరి ముఖము ఒకరు చూచుకొనిరి.౹ యూదావారు ఇశ్రాయేలువారియెదుట నిలువలేక ఓడిపోగా ప్రతివాడును తన తన గుడారమునకు పారిపోయెను.౹ అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోయాషు యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదారాజునైన అమజ్యాను బేత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసికొని వచ్చి, యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మమువరకు నాలుగువందల మూరల పొడుగున పడ గొట్టెను.౹ అతడు దేవుని మందిరములో ఓబేదెదోము నొద్దనున్న వెండియంతయు బంగారమంతయు ఉపకరణములన్నియు రాజు నగరునందున్న సొమ్మును కుదవపెట్ట బడినవారిని తీసికొని షోమ్రోనునకు తిరిగి వెళ్లెను. ఇశ్రాయేలురాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు మరణమైన తరువాత యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా పదునయిదు సంవత్సరములు బ్రదికెను.౹ అమజ్యా చేసిన యితర కార్యములు యూదా ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నవి.౹ అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతనిమీద కుట్రచేయగా అతడు లాకీషునకు పారి పోయెను.౹ అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుష్యులను పంపి అతని అక్కడ చంపి, గుఱ్ఱములమీద అతని శవము ఎక్కించి తీసికొనివచ్చి యూదాపట్టణమందు అతని తండ్రులయొద్ద అతని పాతిపెట్టిరి. అంతట యూదా జనులందరును పదునారేండ్ల వాడైన ఉజ్జియాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి.౹ అతడు ఏలతును కట్టించి, రాజగు తన తండ్రి అతని పితరులతోకూడ నిద్రించిన తరువాత అది యూదావారికి తిరిగి వచ్చునట్లు చేసెను. ఉజ్జియా యేలనారంభించినప్పుడు పదునారేండ్లవాడై యెరూషలేములో ఏబది రెండు సంవత్సరములు ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలు, ఆమె పేరు యెకొల్యా.౹ అతడు తన తండ్రియైన అమజ్యా చర్యయంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.౹ దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధిల్ల జేసెను.౹ అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి గాతు ప్రాకారమును యబ్నె ప్రాకారమును అష్డోదు ప్రాకారమును పడగొట్టి, అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను.౹ ఫిలిష్తీయులతోను గూర్బయలులో నివసించిన అరబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధముచేయగా దేవుడు అతనికి సహాయము చేసెను.౹ అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను.౹ మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను, పల్లపుస్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను, దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను.౹ అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్షగలవాడు గనుక పర్వతములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులును ద్రాక్ష తోట పనివారును కలిగియుండిరి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగియుండెను; అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యా అనువాని చేతిక్రిందనుండిరి. ఖజానాదారుడగు మయ శేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై యుండిరి.౹ వారి పితరులయిండ్ల పెద్దల సంఖ్యనుబట్టి పరాక్రమశాలులు రెండువేల ఆరువందలమంది యైరి.౹ రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరుపొందిన పరాక్రమశాలు లైన మూడులక్షల ఏడువేల ఐదువందలమందిగల సైన్యము వారి చేతిక్రింద ఉండెను.౹ ఉజ్జియా యీ సైన్యమంతటికి డాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలలను చేయించెను.౹ మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయ శాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడువరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపమువేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహముచేయగా యాజకుడైన ఆజర్యాయు అతనితోకూడ ధైర్యవంతులైన యెహోవా యాజకులు ఎనుబదిమందియు అతని వెంబడి లోపలికి పోయిరి.౹ వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి —ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠముప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను.౹ ప్రధానయాజకుడైన అజర్యాయును యాజకులందరును అతనివైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై యుండెను. గనుక వారు తడవుచేయక అక్కడనుండి అతనిని బయటికి వెళ్లగొట్టిరి; యెహోవా తన్ను మొత్తెనని యెరిగి బయటికి వెళ్లుటకు తానును త్వరపడెను.౹ రాజైన ఉజ్జియా తన మరణదినమువరకు కుష్ఠరోగియైయుండెను. కుష్ఠరోగియై యెహోవా మందిరములోనికి పోకుండ ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక యింటిలో నివసించుచుండెను; అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతియై దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను.౹ ఉజ్జియా చేసిన యితర కార్యములనుగూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయు నైన యెషయా వ్రాసెను.౹ ఉజ్జియా తన పితరులతోకూడ నిద్రించెను. అతడు కుష్ఠరోగియని రాజుల సంబంధమైన శ్మశానభూమిలో అతని పితరులదగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను. యోతాము ఏలనారంభించినప్పుడు ఇరువది. యయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను; అతని తల్లి సాదోకు కుమార్తె; ఆమె పేరు యెరూషా.౹ యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రియైన ఉజ్జియాయొక్క చర్యయంతటి ప్రకారముచేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను; అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి.౹ అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గరనున్న గోడ చాలమట్టుకు కట్టించెను.౹ మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను.౹ అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధముచేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మణుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల యవలను ఇచ్చిరి; ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి.౹ ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను.౹ యోతాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చియు, అతని చర్యనుగూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ అతడు ఏలనారం భించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను.౹ యోతాము తన పితరులతోకూడ నిద్రించెను; అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను. ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది సంవత్సరములవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు.౹ అతడు ఇశ్రాయేలురాజుల మార్గములందు నడచి, బయలుదేవతా రూపములుగా పోతవిగ్రహములను చేయించెను.౹ మరియు అతడు బెన్‌హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలచొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను.౹ అతడు ఉన్నతస్థలములలోను కొండలమీదను ప్రతి పచ్చనిచెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.౹ అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజుచేతి కప్పగించెను. సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలమందిని చెరపట్టుకొని దమస్కునకు తీసికొనిపోయిరి. అతడును ఇశ్రాయేలురాజుచేతికి అప్పగింపబడెను; ఆ రాజు అతని లెస్సగా ఓడించెను. రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్ష ఇరువదివేలమందిని ఒక్కనాడు హతముచేసెను. వారు తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టి గతి పట్టెను.౹ పరాక్రమ శాలియైన ఎఫ్రాయిమీయుడగు జిఖ్రీ రాజసంతతివాడైన మయశేయాను సభాముఖ్యుడైన అజ్రీకామును ప్రధానమంత్రియైన ఎల్కొనానును హతము చేసెను.౹ ఇదియుగాక ఇశ్రాయేలువారు తమ సహోదరులైన వీరిలోనుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి రెండు లక్షలమందిని చెరతీసికొనిపోయిరి. మరియు వారియొద్దనుండి విస్తారమైన కొల్లసొమ్ము తీసికొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి.౹ యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికిపోయి వారితో ఈలాగు చెప్పెను–ఆలకించుడి, మీపితరుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను; మీరు ఆకాశమునంటునంత రౌద్రముతో వారిని సంహరించితిరి.౹ ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము కాపురస్థులను మీకొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరచుకొన దలచియున్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా? యెహోవా మహోగ్రత మీమీద రేగియున్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరులలోనుండి మీరు చెరపెట్టిన వీరిని విడచి పెట్టుడి. అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్యా మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా షల్లూము కుమారుడైన యెహిజ్కియా హద్లాయి కుమారుడైన అమాశా అనువారు యుద్ధమునుండి వచ్చినవారికి ఎదురుగా నిలువబడి వారితో ఇట్లనిరి –యెహోవా మన మీదికి అపరాధశిక్ష రప్పించునట్లు మీరు చేసియున్నారు. చెరపెట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపుజేయుటకు మీరు పూనుకొని యున్నారు; మన అపరాధము అధికమై యున్నది. ఇశ్రాయేలువారమైన మన మీద మహోగ్రత రేగియున్నది.౹ కాగా అధిపతులును సమాజముగా కూడినవారును కన్నులార చూచుచుండగా ఆయుధస్థులు చెరపెట్టినవారిని కొల్లసొమ్మును విడచిపెట్టిరి.౹ పేళ్లు ఉదాహరింపబడినవారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపెట్టి దోపుసొమ్ముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదలమీద ఎక్కించి ఖర్జూరవృక్షములుగల పట్టణమగు యెరికోకు వారి సహోదరులయొద్దకు వారిని తోడుకొనివచ్చిరి; తరువాత వారు షోమ్రోనునకు మరలి వెళ్లిరి. ఆ కాలమందు ఎదోమీయులు మరల వచ్చి యూదా దేశమును పాడుచేసి కొందరిని చెరపట్టుకొని పోగా రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజులయొద్దకు వర్తమానము పంపెను.౹ ఫిలిష్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణములమీదను యూదా దేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణములమీదను పడి బేత్షెమెషును అయ్యాలోనును గెదెరోతును శోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిమ్జోనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి.౹ ఆహాజు యూదాదేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసియుండెను గనుక యెహోవా ఇశ్రాయేలురాజైన ఆహాజు చేసిన దానినిబట్టి యూదావారిని హీనపరచెను.౹ అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు అతనియొద్దకు వచ్చి అతని బాధపరచెనేగాని అతని బలపరచలేదు.౹ ఆహాజు భాగము లేర్పరచి, యెహోవా మందిరములోనుండి యొక భాగమును, రాజనగరులోనుండి యొక భాగమును, అధిపతులయొద్ద నుండి యొక భాగమును తీసి అష్షూరు రాజున కిచ్చెనుగాని అతడు అతనికి సహాయము చేయలేదు.౹ ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి యధికముగా అతిక్రమములు జరిగించెను; అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే.౹ ఎట్లనగా–సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదననుకొని, తన్ను ఓడించిన దమస్కువారి దేవతలకు బలులు అర్పించెను; అయితే అవి అతనికిని ఇశ్రాయేలువారికిని నష్టమునకే హేతువులాయెను.౹ ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతట బలిపీఠములను కట్టించెను.౹ యూదా దేశములోని పట్టణములన్నిటిలోను అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి, తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.౹ అతడుచేసిన యితర కార్యములనుగూర్చియు, అతని చర్యయంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ ఆహాజు తన పితరులతోకూడ నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతిపెట్టబడెనుగాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను. హిజ్కియా యేలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యిరువదితొమ్మిది సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా.౹ అతడు తన పితరుడగు దావీదు చర్యయంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.౹ అతడు తన యేలుబడియందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి,౹ యాజకులను లేవీయులను పిలువనంపి, తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను–లేవీయులారా, నా మాట ఆలకించుడి; ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, మీపితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధస్థలములోనుండి నిషిద్ధ వస్తువుల నన్నిటిని బయటికి కొనిపోవుడి.౹ మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడతలు నడచి ఆయనను విసర్జించి, ఆయన నివాసమునకు పెడ ముఖము పెట్టుకొని దానిని అలక్ష్యముచేసిరి.౹ మరియు వారు మంటపముయొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి, పరిశుద్ధస్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహనబలులను అర్పింపకయు ఉండిరి.౹ అందుచేత యెహోవా యూదావారిమీదను యెరూషలేము కాపురస్థులమీదను కోపించి, మీరు కన్నులార చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగాచేసెను.౹ కాబట్టి మన తండ్రులు కత్తిచేత పడిరి; మన కుమారులును కుమార్తెలును భార్యలును చెరలోనికి కొనపోబడిరి.౹ ఇప్పుడు మనమీద నున్న ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను.౹ నా కుమారులారా, తనకు పరిచారకులైయుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధచేయకుడి. అప్పుడు కహాతీయులలో అమాశై కుమారుడైన మహతు అజర్యా కుమారుడైన యోవేలు, మెరారీయులలో అబ్దీ కుమారుడైన కీషు యెహాల్లెలేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యోవాహు యోవాహు కుమారుడైన ఏదేను ఎలీషాపాను సంతతి వారిలో షిమ్రీ యెహీయేలు, ఆసాపు కుమారులలో జెకర్యా మత్తన్యా హేమాను సంతతివారిలో యెహీయేలు షిమీ, యెదూతూను సంతతివారిలో షెమయా ఉజ్జీయేలు అను లేవీయులు నియమించబడిరి.౹ వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలనుబట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి.౹ పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధవస్తువులన్నిటిని యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసికొనిరాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి.౹ మొదటి నెల మొదటి దినమునవారు ప్రతిష్ఠచేయ నారంభించి, ఆ నెల యెనిమిదవదినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు ఎనిమిది దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల పదునారవదినమున సమాప్తి చేసిరి. అప్పుడు వారు రాజైన హిజ్కియాయొద్దకు పోయి— మేము యెహోవామందిరమంతటిని దహనబలిపీఠమును ఉపకరణములన్నిటిని సన్నిధి రొట్టెలుంచు బల్లను పవిత్రపరచియున్నాము.౹ మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహముచేసి పారవేసిన ఉపకరణములన్నిటిని మేము సిద్ధపరచి ప్రతిష్ఠించియున్నాము, అవి యెహోవా బలిపీఠము ఎదుట ఉన్నవని చెప్పిరి. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడలేచి, పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను.౹ రాజ్యముకొరకును పరిశుద్ధస్థలముకొరకును యూదావారికొరకును పాపపరిహారార్థబలి చేయుటకై యేడు కోడెలను ఏడు పొట్టేళ్లను ఏడు గొఱ్ఱెపిల్లలను ఏడు మేకపోతులను వారు తెచ్చియుంచిరి గనుక అతడు —యెహోవా బలిపీఠముమీద వాటిని అర్పించుడని అహరోను సంతతివారగు యాజకులకు ఆజ్ఞాపించెను.౹ పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసికొని బలిపీఠముమీద ప్రోక్షించిరి. ఆప్రకారము వారు పొట్లేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠముమీద ప్రోక్షించిరి. వారు గొఱ్ఱెపిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠముమీద ప్రోక్షించిరి.౹ పాపపరిహారార్థబలికై రాజు ఎదుటికిని సమాజము ఎదుటికిని మేకపోతులను తీసికొనిరాగా, వారు తమ చేతులను వాటిమీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేలీయులందరికొరకు దహనబలియు పాపపరిహారార్థబలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించి యుండెను గనుక, ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయ శ్చి త్తము చేయుటకై బలిపీఠముమీద వాటి రక్తమును పోసి, పాపపరిహారార్థబలి అర్పించిరి.౹ మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతా నును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా ఆజ్ఞాపించి యుండెను.౹ దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులును బూరలు ఊదుటకు యాజకులును నియమింపబడిరి.౹ బలిపీఠముమీద దహనబలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి యర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలురాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను.౹ అంత సేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదముచేయుచుండిరి, దహనబలియర్పణ సమాప్తమగువరకు ఇదియంతయు జరుగుచుండెను.౹ వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితోకూడనున్నవారందరును తమ తలలు వంచి ఆరాధించిరి.౹ –దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులును లేవీయులకు ఆజ్ఞా పింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి. అంతట హిజ్కియా — మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి; దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసికొనిరండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపువారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసికొని వచ్చిరి, దహనబలులనర్పించుటకు ఎవరికి ఇష్టముపుట్టెనో వారు దహనబలిద్రవ్యములను తీసికొని వచ్చిరి.౹ సమాజపువారు తీసికొని వచ్చిన దహనబలి పశువులెన్నియనగా, డెబ్బది కోడెలును నూరు పొట్టేళ్లును రెండువందల గొఱ్ఱెపిల్లలును; ఇవియన్నియు యెహోవాకు దహనబలులుగా తేబడెను.౹ ప్రతిష్ఠింపబడినవి ఆరువందల ఎద్దులును మూడువేల గొఱ్ఱెలును.౹ యాజకులు కొద్దిగా ఉన్నందునవారు ఆ దహనబలి పశువులన్నిటిని ఒలువలేకపోగా, పని సంపూర్ణమగువరకు కడమయాజకులు తమ్మును ప్రతిష్ఠించుకొనువరకు వారి సహోదరులగు లేవీయులు వారికి సహాయము చేసిరి; తమ్మును ప్రతిష్ఠించుకొనుటయందు యాజకులకంటె లేవీయులు యథార్థహృదయులై యుండిరి.౹ సమాధానబలి పశువుల క్రొవ్వును దహనబలి పశువులును దహనబలులకు ఏర్పడిన పానార్పణలును సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవామందిరసేవ క్రమముగా జరిగెను.౹ ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరచినదానిని చూచి హిజ్కియాయును జనులందరును సంతోషించిరి. మరియు హిజ్కియా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలువారికందరికిని యూదావారికందరికిని వర్తమానములను, ఎఫ్రాయిమీయులకును మనష్షేవారికిని పత్రికలను పంపెను.౹ సేవకు చాలినంతమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుటచేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండుటచేతను, మొదటినెలయందు పస్కాపండుగ జరుగకపోగా రాజును అతని అధిపతులును యెరూషలేములోనున్న సమాజపువారందరును దానిని రెండవనెలలో ఆచరింపవలెనని యోచనచేసిరి.౹ ఈ సంగతి రాజుకును సమాజపువారికందరికిని అనుకూల మాయెను.౹ కావున బహుకాలమునుండి వారు వ్రాయ బడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కాపండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దానువరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయముచేసిరి.౹ కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతులయొద్దను తాకీదులు తీసికొని, యూదా ఇశ్రాయేలుదేశములందంతట సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరి–ఇశ్రాయేలువారలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవావైపు తిరుగుడి; మీరు తిరిగినయెడల మీలో అష్షూరురాజుల చేతిలోనుండి తప్పించుకొని శేషించినవారివైపు ఆయన తిరుగును.౹ తమపితరుల దేవుడైన యెహోవాయెడల ద్రోహముగా ప్రవర్తించిన మీపితరులవలెను మీ సహోదరులవలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశమునకు అప్పగించెను.౹ మీపితరులవలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతముగా పరిశుద్ధపర చిన ఆయన పరిశుద్ధమందిరములో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీదినుండి తొలగి పోవునట్లు ఆయనను సేవించుడి.౹ మీరు యెహోవావైపు తిరిగినయెడల మీ సహోదరులయెడలను మీ పిల్లల యెడలను చెరతీసికొనిపోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణాకటాక్షములుగలవాడు గనుక మీరు ఆయనవైపు తిరిగినయెడల ఆయన మీయందు ప్రసన్ను డగును. అంచెవాండ్రు జెబూలూను దేశమువరకును, ఎఫ్రాయిము మనష్షేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరిగాని అచ్చటివారు ఎగతాళిచేసి వారిని అపహ సించిరి.౹ అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశములవారిలోనుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి.౹ యెహోవా ఆజ్ఞనుబట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోనివారికి మనస్సు ఏకముచేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను.౹ కావున రెండవనెలయందు పులియని రొట్టెలపండుగ ఆచరించుటకై అతివిస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి.౹ వారు దాని చేపెట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి, కిద్రోను వాగులో వాటిని పారవేసిరి.౹ రెండవనెల పదునాల్గవదినమునవారు పస్కాపశువును వధించిరి; యాజకులును లేవీయులును సిగ్గునొంది, తమ్మును ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యెహోవా మందిరములోనికి తీసికొని వచ్చిరి.౹ దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధినిబట్టి వారు తమ స్థలమందు నిలువబడగా, యాజకులు లేవీయుల చేతిలోనుండి రక్తమును తీసికొని దానిని ప్రోక్షించిరి.౹ సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారనేకు లుండుటచేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతివాని నిమిత్తము పస్కాపశువులను వధించుపని లేవీయుల కప్పగింపబడెను.౹ ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించు కొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధస్థలముయొక్క శుద్ధీకరణముచొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను.౹ యెరూషలేములోనున్న ఇశ్రాయేలువారు బహు సంతోష భరితులై పులియనిరొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి. లేవీయులును యాజకులును యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదముగల వాద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచు ఉండిరి.౹ యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను; వారు సమాధానబలులు అర్పించుచు, తమపితరుల దేవుడైన యెహోవా దేవుడని యొప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.౹ యూదా రాజైన హిజ్కియా సమాజపువారికి బలియర్పణల నిమిత్తము వెయ్యి కోడెలను ఏడువేల గొఱ్ఱెల నిచ్చుటయు, అధిపతులు వెయ్యి కోడెలను పదివేల గొఱ్ఱెల నిచ్చుటయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు సమాజపు వారందరును చూచి నప్పుడు, మరి ఏడు దినములు పండుగ ఆచరింపవలెనని యోచనచేసికొని మరి ఏడు దినములు సంతోషముగా దాని ఆచరించిరి.౹ అప్పుడు యాజకులును లేవీయులును యూదావారిలోనుండియు ఇశ్రాయేలువారిలోనుండియు వచ్చిన సమాజపువారందరును, ఇశ్రాయేలుదేశములోనుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులును సంతోషించిరి.౹ యెరూషలేము కాపురస్థులకు మిక్కిలి ఆనం దము కలిగెను. ఇశ్రాయేలురాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగి యుండలేదు.౹ అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారిమాటలు వినబడెను; వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న. ఇశ్రాయేలువారందరును యూదా పట్టణములకు పోయి, యూదాదేశమంతటను, బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశముల యందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలముచేసి, దేవతాస్తంభములను ముక్కలుగా నరికి, ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టిరి; తరువాత ఇశ్రాయేలువారందరును తమతమ పట్టణములలోనున్న తమతమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్లిరి అంతట హిజ్కియా యెవరి సేవాధర్మము వారు జరుపుకొనునట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను; దహనబలులను సమాధానబలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకును, యెహోవా పాళెపు ద్వారములయొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను.౹ మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయ బడియున్న విధినిబట్టి జరుగు ఉదయాస్తమయముల దహనబలులను విశ్రాంతిదినములకును అమావాస్యలకును నియా మకకాలములకును ఏర్పడియున్న దహనబలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలోనుండి రాజు ఒక భాగమును ఏర్పాటుచేసెను.౹ మరియు యెహోవా ధర్మశాస్త్రమునుబట్టి యాజకులును లేవీయులును ధైర్యము వహించి తమ పని జరుపుకొనునట్లు ఎవరి భాగములను వారికి ఇయ్య వలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను.౹ ఆయాజ్ఞ వెల్లడియగుటతోడనే ఇశ్రాయేలీయులు ప్రథమఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసికొని వచ్చిరి. సమస్తమైన వాటిలోనుండియు పదియవ వంతులను విస్తారముగా తీసికొని వచ్చిరి.౹ యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలువారును యూదావారును ఎద్దులలోను గొఱ్ఱెలలోను పదియవవంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదియవ వంతును తీసికొని వచ్చి కుప్పలుగా కూర్చిరి.౹ వారు మూడవ మాసమందు కుప్పలువేయ నారంభించి ఏడవ మాసమందు ముగించిరి.౹ హిజ్కియాయును అధిపతులును వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి.౹ హిజ్కియా ఆ కుప్పలనుగూర్చి యాజకులను లేవీయులను ఆలోచన యడిగినందుకు సాదోకు సంతతివాడును ప్రధానయాజకుడునగు అజర్యా –యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటినుండి మేము సమృద్ధిగా భోజనముచేసినను చాలా మిగులు చున్నది; యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్పరాశి మిగిలినదని రాజుతోననగా హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చెను.౹ వారు వాటిని సిద్ధపరచి ఏమియు అపహరింపకుండ కానుకలను పదియవభాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి; లేవీయుడైన కొనన్యా వాటిమీద విచారణకర్తగా నియమింప బడెను; అతని సహోదరుడైన షిమీ అతనికి సహకారిగా ఉండెను.౹ మరియు యెహీయేలు అజజ్యాహు నహతు అశాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మక్యాహు మహతు బెనాయాలనువారు రాజైన హిజ్కియా వలనను, దేవుని మందిరమునకు అధిపతియైన అజర్యా వలనను, తాము పొందిన ఆజ్ఞచొప్పున కొనన్యా చేతి క్రిందను, అతని సహోదరుడగు షిమీ చేతిక్రిందను కని పెట్టువారై యుండిరి.౹ తూర్పుతట్టు ద్వారమునొద్ద పాలకుడును ఇమ్నా కుమారుడునగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతిపరిశుద్ధమైనవాటిని పంచి పెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణలమీద నియమింపబడెను.౹ అతనిచేతిక్రింద ఏదెను మిన్యామీను యేషూవ షెమయా అమర్యా షెకన్యా అనువారు నమ్మకమైనవారు గనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతులచొప్పున భాగము లిచ్చుటకు నియమింపబడిరి.౹ ఇదియుగాక గోత్రములలో మూడు సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారికందరికిని, వంతులచొప్పున సేవచేయుటకై ప్రతిదినము యెహోవా మందిరములోనికి వచ్చువారందరికిని,౹ ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై వంతుల చొప్పున సేవచేయుటకు తమతమపితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు,౹ అనగా నమ్మకమైనవారై తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీ యులకును, తమ పిల్లలతోను భార్యలతోను కుమారులతోను కుమార్తెలతోను సమాజమంతటను సరిచూడబడిన వారికిని, ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును, వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి యుండిరి. పేళ్లచేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికిని, లేవీయులలో వంశములచొప్పున సరిచూడబడిన వారికందరికిని వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి.౹ హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను.౹ తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవవిషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటివిషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత. అష్షూరురాజైన సన్హెరీబు వచ్చి, యూదాదేశములో చొర బడి ప్రాకారపురములయెదుట దిగి వాటిని లోపరచుకొన జూచెను.౹ సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేముమీద యుద్ధముచేయనుద్దేశించియున్నాడని హిజ్కియాచూచి పట్టణముబయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి, తన యధిపతులతోను పరాక్రమశాలులతోను యోచనచేయగా వారతనికి సహాయము చేసిరి.౹ –బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేల? విస్తారమైనజలము వారికి దొరుక నేల? అనుకొని ఊటలన్నిటిని దేశమధ్యముగుండ పారు చున్న కాలువను అడ్డిరి.౹ మరియు రాజు ధైర్యము తెచ్చుకొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగుచేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.౹ జనులమీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరికచేసెను –మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతనితోకూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు.౹ మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి. ఇదియైన తరువాత అష్షూరురాజైన సన్హెరీబు తన బలగ మంతటితో లాకీషును ముట్టడివేయుచుండి, యెరూషలేమునకు యూదారాజైన హిజ్కియా యొద్దకును, యెరూషలేమునందున్న యూదావారందరియొద్దకును తన సేవకులను పంపి ఈలాగు ప్రకటన చేయించెను –అష్షూరురాజైన సన్హెరీబు సెలవిచ్చునదేమనగా— దేని నమ్మి మీరు ముట్టడివేయబడియున్న యెరూషలేములో నిలుచుచున్నారు? కరవుచేతను దాహముచేతను మిమ్మును చంపుటకై–మన దేవుడైన యెహోవా అష్షూరురాజు చేతిలోనుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు గదా? ఆ హిజ్కియా, మీరు ఒక్క బలిపీఠము ఎదుట నమస్కరించి దానిమీద ధూపము వేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, యెహోవా ఉన్నతస్థలములను బలిపీఠములను తీసి వేసినవాడుకాడా? నేనును నా పితరులును ఇతరదేశముల జనులకందరికిని ఏమేమి చేసితిమో మీరెరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలోనుండి యేమాత్రమైనను రక్షింప చాలియుండెనా? మీ దేవుడు మిమ్మును నా చేతిలోనుండి విడిపింపగలడనుకొనుటకు, నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోను తన జనులను నా చేతిలోనుండి విడిపింపగలిగిన దేవుడొకడైన యుండెనా? కాబట్టి యిప్పుడు హిజ్కియాచేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి, యే జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలోనుండి గాని నా పితరుల చేతిలోనుండి గాని విడిపింపలేక పోగా, మీ దేవుడు నా చేతిలోనుండి మిమ్మును మొదలే విడిపింపలేక పోవునుగదా అనెను.౹ అతని సేవకులు దేవుడైన యెహోవామీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి.౹ అదియుగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలోనుండి యేలాగున విడిపింపలేకపోయిరో ఆలాగున హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలోనుండి విడిపింప లేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును, ఆయనమీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను.౹ అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలెనన్న యోచనతో, ప్రాకారము మీదనున్న యెరూషలేము కాపురస్థులను బెదరించుటకును నొప్పించుటకును, యూదాభాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి.౹ మరియు వారు మనుష్యుల చేతిపనియైన భూజనుల దేవతలమీద తాము పలికిన దూషణలను యెరూషలేముయొక్క దేవునిమీద కూడను పలికిరి. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశముతట్టు చూచి మొఱ్ఱపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనముచేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతట అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తిచేత చంపిరి.౹ ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్థులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలోనుండియు అందరిచేతిలోనుండియు రక్షించి, అన్నివైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి యిచ్చిరి. అందువలన అతడు అప్పటినుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను. ఆ దినములలో హిజ్కియా రోగియై మరణదశలో నుండెను. అతడు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన యొకటి దయచేసెను.౹ అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారిమీదికిని కోపము రాగా హిజ్కియా హృదయగర్వము విడచి, తానును యెరూషలేము కాపురస్థులును తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనులమీదికి రాలేదు.౹ హిజ్కియాకు అతివిస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధద్రవ్యములను డాళ్లను నానా విధములగు శ్రేష్ఠమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను.౹ ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలువిధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను.౹ మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొఱ్ఱెలమందలను పసులమందలను అతడు సంపాదించెను.౹ ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాని తెప్పించెను, హిజ్కియా తాను పూనుకొనిన సర్వప్రయత్నములయందును వృద్ధిపొందెను.౹ అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధినొందుటనుగూర్చి విచారించి తెలిసికొనుటకై బబులోను అధిపతులు అతనియొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి, అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలిసికొనవలెనని దేవుడతని విడచిపెట్టెను. హిజ్కియా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చూపిన భక్తినిగూర్చియు, ప్రవక్తయును ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమునందును యూదా ఇశ్రాయేలుల రాజుల గ్రంథమునందును వ్రాయబడియున్నది.౹ హిజ్కియా తన పితరులతోకూడ నిద్రించగా జనులు దావీదు సంతతివారి శ్మశానభూమియందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణ మొందినప్పుడు యూదావారందరును యెరూషలేము కాపురస్థులందరును అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను. మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబది యయిదు సంవత్సరములు ఏలెను.౹ ఇతడు ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా వెళ్లగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి, యెహోవా దృష్టికి చెడునడత నడచెను.౹ ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను నిలిపి, దేవతాస్తంభములను చేయించి, ఆకాశనక్షత్రములన్నిటిని పూజించి కొలిచెను.౹ మరియు–నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమునుగూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవామందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను.౹ మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశనక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను.౹ బెన్‌హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలోగుండ దాటించి, ముహూర్తములను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిశాచములతోను సోదెగాండ్రతోను సాంగత్యముచేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయనకు కోపము పుట్టించెను.౹ [7-8] —ఇశ్రాయేలీయుల గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను, నేను మోషేద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడచుకొనుటకై వారు జాగ్రత్తపడినయెడల, మీపితరులకు నేను ఖాయపరచిన దేశమునుండి ఇశ్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోను అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక, ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను.౹ *** ఈ ప్రకారము మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్థులను మోసపుచ్చిన వాడై, ఇశ్రాయేలీయులయెదుట ఉండకుండ యెహోవా నశింపజేసిన అన్యజనులకంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించునట్లు చేయుటకు కారకుడాయెను. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి.౹ కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొనిపోయిరి.౹ అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను. ఇదియైన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మమువరకు ఓపెలు చుట్టును బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను ఉంచెను.౹ మరియు యెహోవా మందిరమునుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి, యెరూషలేమునందును యెహోవామందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను.౹ ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగుచేసి, దానిమీద సమాధానబలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను సేవించుడని యూదావారికి ఆజ్ఞ ఇచ్చెను.౹ అయినను జనులు ఉన్నతస్థలములయందు ఇంకను బలులు అర్పించుచు వచ్చిరిగాని ఆ యర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి.౹ మనష్షే చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు దేవునికి పెట్టిన మొరలనుగూర్చియు, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలనుగూర్చియు, ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ అతడు చేసిన ప్రార్థననుగూర్చియు, అతని మనవి వినబడుటనుగూర్చియు, అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చియు, తాను గుణపడకముందు ఉన్నతస్థలములను కట్టించి దేవతాస్తంభములను చెక్కినవిగ్రహములను అచ్చట నిలుపుటనుగూర్చియు, దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయ బడియున్నది.౹ మనష్షే తన పితరులతోకూడ నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను. ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యెరూషలేములో రెండు సంవత్సరములు ఏలెను.౹ అతడు తన తండ్రియైన మనష్షే నడచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడచెను; తన తండ్రియైన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికి బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రియైన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను, ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను చేయుచు వచ్చెను.౹ అతని సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందే అతని చంపగా దేశ జనులు ఆమోను రాజుమీద కుట్రచేసిన వారినందరిని హతముచేసి అతని కుమారుడైన యోషీయాను అతని స్థానమందు రాజుగా నియమించిరి. యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్లవాడై యెరూషలేములో ముప్పది యొక సంవత్సరము ఏలెను.౹ అతడు యెహోవా దృష్టికి నీతి ననుసరించుచు, కుడికైనను ఎడమకైనను తొలగకుండ తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను.౹ తన యేలుబడియందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడై యుండగానే అతడు తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొనినవాడై, పండ్రెండవయేట ఉన్నతస్థలములను దేవతాస్తంభములను పడగొట్టి, చెక్కినవిగ్రహములను పోతవిగ్రహములను తీసివేసి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రముచేయ నారంభించెను.౹ అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి, వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞచొప్పున నరికివేసి, దేవతాస్తంభములను చెక్కినవిగ్రహములను పోతవిగ్రహములను తుత్తునియలుగా కొట్టి చూర్ణముచేసి, వాటికి బలులు అర్పించినవారి సమాధులమీద చల్లి వేసిరి.౹ బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠములమీద అతడు కాల్పించి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రపరచెను.౹ ఆప్రకారము అతడు మనష్షే ఎఫ్రాయిము షిమ్యోను దేశములవారి పట్టణములలోను, నఫ్తాలి మన్యమునందును, చుట్టుపెట్లనున్న పాడుస్థలములన్నిటను బలిపీఠములను పడ గొట్టెను.౹ బలిపీఠములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కినవిగ్రహములను చూర్ణముచేసి, ఇశ్రాయేలీయుల దేశమంతటనున్న సూర్యదేవతా విగ్రహములన్నిటిని నరికి వేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అతని యేలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున, దేశమును మందిరమును పవిత్రపరచుటయైన తరువాత, అతడు అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణాధిపతియైన మయశేయాను, రాజ్యపు దస్తావేజులమీదనున్న యోహాహాజు కుమారుడగు యోవాహాజును, తన దేవుడైన యెహోవా మందిరమును బాగుచేయుటకై పంపెను.౹ వారు ప్రధానయాజకుడైన హిల్కీయాయొద్దకు వచ్చి, ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశములయందు ఇశ్రాయేలువారిలో శేషించియున్న వారందరియొద్దనుండియు, యూదా బెన్యామీనీయులందరి యొద్దనుండియుకూర్చి, దేవుని మందిరములోనికి తీసికొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి.౹ వారు దానిని యెహోవా మందిరపు పనిమీదనున్న పైవిచారణకర్తల కియ్యగా, దాని బాగుచేయుటకును, యూదారాజులు పాడుచేసిన యిండ్లకు దూలములను అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపుపనికి మ్రానులను కొనుటకై యెహోవా మందిరమునందు పనిచేయువారికిని శిల్పకారులకును దాని నిచ్చిరి.౹ ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారిమీది పైవిచారణకర్తలు ఎవరనగా, మెరా రీయులైన లేవీయులగు యహతు ఓబద్యా అనువారును, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులగు జెకర్యా మెషుల్లాము అనువారును, లేవీయులలో వాద్యప్రవీణులైనవారు వారితోకూడ ఉండిరి.౹ మరియు బరువులు మోయు వారిమీదను, ప్రతివిధమైన పని జరిగించువారిమీదను ఆ లేవీయులు పైవిచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీయులలో లేఖకులును పరిచారకులును ద్వారపాలకులు నైనవారు ఆయా పనులమీద నియమింపబడిరి.౹ యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసికొని వచ్చినప్పుడు, మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముగలగ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను.౹ అప్పుడు హిల్కీయా–యెహోవామందిరమందు ధర్మశాస్త్రముగలగ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను.౹ షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసికొనిపోయి రాజుతో ఇట్లనెను–నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు.౹ యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగుచేసి పైవిచారణ కర్తల చేతికిని పనివారి చేతికిని దాని అప్పగించియున్నారు.౹ మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవిచేసికొని, శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దానినుండి చదివి వినిపించెను.౹ అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కీయాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆశాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను — మీరు వెళ్లి దొరకిన యీ గ్రంథములోని మాటలవిషయమై నాకొరకును, ఇశ్రాయేలు యూదావారిలో శేషించియున్నవారికొరకును యెహోవాయొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడియున్న సమస్తమును అనుసరింపకయు, యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మనమీదికి అత్యధికముగా వచ్చియున్నది. అప్పుడు హిల్కీయాయును రాజు నియమించినవారును సంగతినిగూర్చి విచారణచేయుటకై హర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పైవిచారణకర్తయునగు షల్లూముయొక్క భార్యయైన హుల్దా అను ప్రవక్తియొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన యుప భాగములో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా –ఆలకించుడి, నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడియున్న శాపములన్నిటిని రప్పించెదను.౹ వారు నన్ను విసర్జించి యితర దేవతలకు ధూపము వేసి, తమ చేతిపనులవలన నాకు కోపము పుట్టించియున్నారు గనుక నాకోపము ఈ స్థలముమీద మితిలేకుండ కుమ్మరింపబడును. నాయొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి.౹ మరియు యెహోవాయొద్ద విచారించుడని మిమ్మును పంపిన యూదారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి–నీవు ఎవనిమాటలు విని యున్నావో ఇశ్రాయేలీయులదేవుడైన ఆ యెహోవా సెలవిచ్చునదేమనగా –నీ మనస్సు మెత్తనిదై యీ స్థలముమీదను దాని కాపురస్థులమీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని.౹ నేను నీ పితరులయొద్ద నిన్ను చేర్చుదును; నెమ్మదిగలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు; ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులార చూడవు. వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసికొనిరాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరిని పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును, యూదా వారందరును, యెరూషలేము కాపురస్థులును, యాజకులును, లేవీయులును, జనులలో పిన్నపెద్దలందరును యెహోవా మందిరమునకు రాగా యెహోవామందిరమందు దొరకిన నిబంధన గ్రంథపు మాటలన్నియు వారికి వినిపింపబడెను.౹ పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి —నేను యెహోవాను అనుసరించుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు, ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదు నని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను.౹ మరియు అతడు యెరూషలేమునందున్న వారినందరిని బెన్యామీనీయులనందిరిని అట్టి నిబంధనకు ఒప్పుకొనజేసెను గనుక యెరూషలేము కాపురస్థులు తమపితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి.౹ మరియు యోషీయా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలోనుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి, ఇశ్రాయేలీయులందరును తమ దేవుడైన యెహోవాను సేవించునట్లు చేసెను. అతని దినములన్నియు వారు తమపితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. మరియు యోషీయా యెరూషలేమునందు యెహోవాకు పస్కాపండుగ ఆచరించెను. మొదటి నెల పదునాల్గవదినమున జనులు పస్కాపశువును వధించిరి.౹ అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి, యెహోవామందిరసేవను జరిగించుటకై వారిని ధైర్య పరచి ఇశ్రాయేలీయులకందరికి బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీయులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజములమీద మోయక, ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి, మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీయులకును సేవ జరిగించుడి.౹ ఇశ్రాయేలీయుల రాజైన దావీదు వ్రాసియిచ్చిన క్రమముచొప్పు నను అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ మీపితరులయిండ్లకు ఏర్పాటైన వరుసలనుబట్టి మిమ్మును సిద్ధపరచుకొనుడి.౹ జనుల ఆయా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి, వారి వారి పితరుల కుటుంబముల వరుసలనుబట్టి జనులైన మీ సహోదరులకొరకు సేవచేయుడి.౹ ఆప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతి ష్ఠించుకొని, మోషేద్వారా యెహోవా యిచ్చిన ఆజ్ఞలను అనుసరించి, దానిని మీ సహోదరులకొరకు సిద్ధపరచుడి.౹ మరియు యోషీయా తన స్వంత మందలో ముప్పది వేల గొఱ్ఱెపిల్లలను మేకపిల్లలను మూడువేల కోడెలను అక్కడ నున్న జనులకందరికి పస్కాపశువులుగా ఇచ్చెను.౹ అతని అధిపతులును జనులకును యాజకులకును లేవీయులకును మనఃపూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు, జెకర్యాయు, యెహీయేలును పస్కాపశువులుగా యాజకులకు రెండువేల ఆరువందల గొఱ్ఱెలను మూడువందల కోడెలను ఇచ్చిరి.౹ కొనన్యాయు, అతని సహోదరులైన షెమయాయు, నెతనేలును, లేవీయులలో నధిపతులగు హషబ్యాయు, యెహీయేలును యోజాబాదును పస్కాపశువులుగా లేవీయులకు అయిదువేల గొఱ్ఱెలను ఐదువందల కోడెలను ఇచ్చిరి.౹ ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞనుబట్టి యాజకులు తమ స్థలములోను లేవీయులు తమ వరుసలలోను నిలువబడిరి.౹ లేవీయులు పస్కాపశువులను వధించి రక్తమును యాజకుల కియ్యగా వారు దాని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను ఒలువగా మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసికొనిరి.౹ వారు ఎడ్లను కూడ ఆప్రకారముగానే చేసిరి. వారు విధిప్రకారము పస్కాపశు మాంసమును నిప్పుమీద కాల్చిరిగాని యితరమైన ప్రతిష్ఠార్పణలనుకుండలలోను బొరుసులలోను పెనములలోను ఉడికించి జనులకందరికి త్వరగా వడ్డించిరి.౹ తరువాత లేవీయులు తమకొరకును యాజకులకొరకును సిద్ధముచేసిరి. అహరోను సంతతి వారగు యాజకులు దహనబలి పశుమాంసమును క్రొవ్వును రాత్రివరకు అర్పింపవలసివచ్చెను గనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతివారగు యాజకులకొరకును సిద్ధపరచిరి.౹ మరియు ఆసాపు సంతతివారగు గాయకులును, ఆసాపు హేమానులును, రాజునకు దీర్ఘదర్శియగు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి; ద్వారములన్నిటియొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్లిపోకుండునట్లు వారి సహోదరులగు లేవీయులు వారికొరకు సిద్ధపరచిరి.౹ ఈ ప్రకారము రాజైన యోషీయా యిచ్చిన ఆజ్ఞనుబట్టి వారు పస్కా పండుగ ఆచరించి, యెహోవా బలిపీఠముమీద దహనబలులను అర్పించుటచేత ఆ దినమున ఏమియు లోపములేకుండ యెహోవా సేవ జరిగెను.౹ అక్కడ నున్న ఇశ్రాయేలీయులు, ఆ కాలమందు పస్కాను పులియనిరొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి.౹ ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయులలో పస్కాపండుగ అంత ఘనముగా ఆచరింపబడి యుండలేదు. యోషీయాయు, యాజకులును, లేవీయులును, అక్కడనున్న యూదా ఇశ్రాయేలువారందరును, యెరూషలేము కాపురస్థులును ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలురాజులందరిలో ఒక్కడైనను పస్కాపండుగను ఆచరించి యుండలేదు.౹ యోషీయా యేలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున ఈ పస్కాపండుగ జరిగెను. ఇదంతయు అయిన తరువాత యోషీయా మందిరమును సిద్ధపరచినప్పుడు ఐగుప్తురాజైన నెకో యూఫ్రటీసు నదియొద్దనున్న కర్కెమీషుమీదికి దండెత్తి వెళ్లుచుండగా యోషీయా అతనిమీదికి బయలుదేరెను.౹ అయితే రాజైన నెకో అతనియొద్దకు రాయబారులను పంపి— యూదారాజా నీతో నాకేమి? పూర్వమునుండి నాకు శత్రువులగువారిమీదికేగాని నేడు నీమీదికి నేను రాలేదు. దేవుడు త్వరచేయుమని నాకు ఆజ్ఞాపించెను గనుక దేవుడు నాతోకూడ ఉండి నిన్ను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దనిచెప్ప నాజ్ఞా పించెను.౹ అయినను యోషీయా అతనితో యుద్ధము చేయగోరి, అతనియొద్దనుండి తిరిగి పోక మారువేషము ధరించుకొని, యెహోవా నోటిమాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయయందు యుద్ధము చేయ వచ్చెను.౹ విలుకాండ్రు రాజైన యోషీయామీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి–నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడనుండి నన్ను కొని పోవుడని చెప్పెను.౹ కావున అతని సేవకులు రథము మీదనుండి అతని దింపి, అతనికున్న వేరు రథముమీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసికొని వచ్చిరి. అతడు మృతిబొంది తన పితరుల సమాధులలో ఒకదానియందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరును యోషీయా చనిపోయెనని ప్రలాపము చేసిరి.౹ యిర్మీయాయు యోషీయానుగూర్చి ప్రలాప వాక్యము చేసెను, గాయకులందరును గాయకురాండ్రంద రును తమ ప్రలాపవాక్యములలో అతని గూర్చి పలికిరి; నేటివరకు యోషీయానుగూర్చి ఇశ్రాయేలీయులలో ఆలాగు చేయుట వాడుక ఆయెను. ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడియున్నవి.౹ యోషీయా చేసిన యితర కార్యములన్నిటిని గూర్చియు, యెహోవా ధర్మశాస్త్రవిధులననుసరించి అతడు చూపిన భయభక్తులనుగూర్చియు,౹ అతడు చేసిన సమస్త క్రియలనుగూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి.౹ యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు నెలలు ఏలెను.౹ ఐగుప్తురాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి, ఆ దేశమునకు రెండువందల మణుగుల వెండిని రెండు మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదామీదను యెరూషలేముమీదను రాజుగా నియమించి, అతనికి యెహోయాకీము అను మారుపేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసికొని పోయెను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడచుటచేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసికొని పోవుటకై గొలుసులతో బంధించెను.౹ మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసికొనిపోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను.౹ యెహోయాకీము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు హేయదేవతలను పెట్టుకొనుటనుగూర్చియు, అతని సకల ప్రవర్తననుగూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయెను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేములో మూడు నెలల పది దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను ఏడాదినాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి, అతని సహోదరుడైన సిద్కియాను యూదామీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువది యొక టేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను.౹ అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడచుచు, ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు, తన్నుతాను తగ్గించుకొనకయు ఉండెను.౹ మరియు దేవుని నామమునుబట్టి తనచేత ప్రమాణముచేయించిన నెబుకద్నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవావైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను.౹ అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగువారు, అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి.౹ వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షముగలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచువచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరిం చుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనులమీదికి వచ్చెను.౹ ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధస్థలముగానున్న మందిరములోనే వారి యౌవనులను ఖడ్గముచేత సంహరించెను. అతడు యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతనిచేతికప్ప గించెను.౹ మరియు బబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను.౹ అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి.౹ ఖడ్గముచేత హతులు కాకుండ తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసికొనిపోయెను. రాజ్యము పారసీకులదగువరకు వారు అక్కడనేయుండి అతనికిని అతని కుమారులకును దాసులైరి.౹ యిర్మీయాద్వారా పలుక బడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతిదినములను దేశము అనుభవించువరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరములకాలము అది విశ్రాంతిదినముల ననుభవించెను. పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపురాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమం దంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను –పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞా పించునదేమనగా–ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు; కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేర వచ్చును; వారి దేవుడైన యెహోవావారికి తోడుగా నుండునుగాక. పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపుచేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను –పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా — ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.౹ కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడై యుండునుగాక.౹ మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోనివారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను.౹ అప్పుడు యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును, యాజకులును లేవీయులును, ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు వారితోకూడుకొని వచ్చి, యెరూషలేములోఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి.౹ మరియు వారి చుట్టు నున్నవారందరును స్వేచ్ఛగా అర్పించినవిగాక, వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి.౹ మరియు నెబుకద్నెజరు యెరూషలేములోనుండి తీసికొని వచ్చి తన దేవతలయొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములనురాజైన కోరెషు బయటికి తెప్పించెను.౹ పారసీకదేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతుద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి, యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను.౹ వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమ్మిది కత్తులును ముప్పది బంగారుగిన్నెలును నాలుగువందలపది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలును, మరి యితరమైన ఉపకరణములును వెయ్యియైయుండెను.౹ బంగారు వస్తువులును వెండి వస్తువులును అన్నియు అయిదువేల నాలుగు వందలు. షేష్బజ్జరు బబులోను చెరలోనుండి విడిపింపబడినవారితోకూడ కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసికొని వచ్చెను. బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదాదేశమునకును తమతమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితోకూడ వచ్చిన ఇశ్రాయేలీయులయొక్క లెక్కయిది.౹ పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు,౹ షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు,౹ ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు,౹ పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,౹ ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,౹ జత్తూ వంశస్థులు తొమ్మిదివందల నలువది యయిదుగురు, జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మంది,౹ [9-11] బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు, బేబైవంశస్థులు ఆరువందల ఇరువది ముగ్గురు,౹ *** *** అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు,౹ అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు,౹ బిగ్వయి వంశస్థులు రెండువేల ఏబది ఆరుగురు;౹ ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు,౹ అటేరు వంశస్థులు హిజ్కియాతోకూడ తొంబది ఎనమండుగురు,౹ బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు,౹ యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు,౹ హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు,౹ గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు,౹ బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,౹ నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు,౹ అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,౹ [24-25] అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు, కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,౹ *** రామా, గెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువదియొక్కరు,౹ మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,౹ బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,౹ [29-31] నెబో వంశస్థులు ఏబది ఇద్దరు, మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు, ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,౹ *** *** హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది,౹ లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువదియయిదుగురు,౹ యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,౹ సెనాయా వంశస్థులు మూడువేల ఆరు వందల ముప్పదిమంది,౹ యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,౹ పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువదియేడుగురు,౹ హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడు గురు,౹ లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,౹ గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,౹ ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు,౹ నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,౹ కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశస్థులు,౹ లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు,౹ హాగాబు వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాను వంశస్థులు,౹ గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు,౹ రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు,౹ ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు,౹ అస్నా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు,౹ బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు,౹ బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు,౹ బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు,౹ నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు,౹ సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు,౹ యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు,౹ షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు,౹ నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థులును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు.౹ మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమపితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందునవారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను.౹ వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు.౹ మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లయియొక్క కుమార్తెలలో ఒకతెను పెండ్లిచేసికొని వారి పేళ్లనుబట్టి బర్జిల్లయి అనిపిలువబడినవాని వంశస్థులు.౹ వీరు వంశావళి లెక్కలో తమతమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచ బడిరి.౹ మరియు పారసీకుల అధికారి–ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడువరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికాజ్ఞాపించెను.౹ సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను.౹ వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడువేల మూడువందల ముప్పదియేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి.౹ వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు,౹ వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను.౹ కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి.౹ పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారువేల మూడువందల తులముల బంగారమును రెండులక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి.౹ యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమతమ పట్టణములందు కాపురము చేసిరి. ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమతమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు కలిగినవారై యెరూషలేములో కూడి,౹ యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి.౹ వారు దేశమందు కాపురస్థులైనవారికి భయపడుచు, ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి, దానిమీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహనబలులు అర్పించుచు వచ్చిరి మరియు గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి, ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి.౹ తరువాత నిత్యమైన దహనబలిని, అమావాస్యలకును యెహోవాయొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి.౹ ఏడవ నెల మొదటి దినమునుండి యెహోవాకు దహనబలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరముయొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు.౹ మరియు వారు కాసెవారికిని వడ్రవారికిని ద్రవ్యము నిచ్చిరి. అదియుగాక పారసీకదేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రముమీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరువారికిని భోజనపదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. యెరూషలేములోనుండు దేవునియొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవనెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యేషూవయును, చెరలోనుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చినవారందరును పని ఆరంభించి, యిరువది సంవత్సరములు మొదలుకొని పై యీడుగల లేవీయులను యెహోవా మందిరముయొక్క పనికి నిర్ణయించిరి.౹ యేషూవయు అతని కుమారులును అతని సహోదరులును, కద్మీయేలును అతని కుమారులును, హోదవ్యా కుమారులును, హేనాదాదు కుమారులును, వారి కుమారులును, లేవీయులైనవారి బంధువులును, దేవుని మందిరములో పనివారిచేత పనిచేయించుటకు నియమింపబడిరి.౹ శిల్పకారులు యెహోవా మందిరముయొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలురాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయితాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి వీరు వంతు చొప్పున కూడి–యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి.౹ మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు, ఇప్పుడు వేయబడిన యీ మందిరముయొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషముచేత బహుగా అరచిరి.౹ ఏది సంతోష శబ్దమో యేది దుఃఖశబ్దమో జనులు తెలిసికొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. అంతట యూదావంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైనవారు, చెరనివారణయయినవారు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానులయొద్దకును వచ్చి–మీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోనుయొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి.౹ అందుకు జెరుబ్బాబెలును యేషూవయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులును–మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు; మేమే కూడుకొని పారసీకదేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞప్రకారము ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి.౹ దేశపు జనులు యూదావంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరచిరి.౹ మరియు పారసీకదేశపు రాజైన కోరెషుయొక్క దినములన్నిటిలోను పారసీకదేశపు రాజైన దర్యావేషుయొక్క పరిపాలనకాలమువరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి.౹ మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదాదేశస్థులనుగూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారిమీద తప్పు మోపిరి. అర్తహషస్తయొక్క దినములలో బిష్లామును మిత్రి దాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కినవారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసిపంపిరి. ఆ యుత్తరము సిరియాభాషలో వ్రాయబడి సిరియాభాషలోనే తాత్పర్యము చేయబడినది.౹ మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్షయియు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతినిగూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్తయొద్దకు పంపిరి.౹ అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్షయియు వారి పక్షముగానున్న తక్కినవారైన దీనాయీయులును అపర్స త్కాయ్యులును టర్పెలాయేలును అపార్సాయులును అర్కెవాయులును బబులోనువారును షూషన్కాయులును దెహావేయులును ఏలామీయులును ఘనుడును, శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యివతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములును, నది యివతలనున్న తక్కినవారును ఉత్తరము ఒకటి వ్రాసిరి.౹ వీరు రాజైన అర్తహ షస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యివతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయునదేమనగా తమ సన్నిధినుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి, తిరుగుబాటుచేసిన ఆ చెడుపట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు.౹ కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువ బెట్టినయెడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని యియ్యకయుందురు, అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును.౹ మేము రాజుయొక్క ఉప్పుతిన్నవారము గనుక రాజునకు నష్టమురాకుండ మేము చూడవలెనని ఈ యుత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియ జేసితిమి.౹ మరియు తమ పూర్వికులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచినయెడల, ఈ పట్టణపువారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదు రనియు, అందువలననే యీ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజులవలననే తమకు తెలియ వచ్చును.౹ కావున రాజవైన తమకు మేము రూఢిపరచునదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడినయెడల నది యివతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు.౹ అప్పుడు రాజు–మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షిమ్షయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవతలనుండు తక్కినవారికిని–మీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చిన దేమనగా –మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకొన్నాము.౹ అందువిషయమై మా యాజ్ఞనుబట్టి వెదకగా, ఆదినుండి ఆ పట్టణపువారు రాజులమీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది.౹ మరియు యెరూషలేముపట్టణమందు బలమైనరాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది యవతలి దేశములన్నిటిని ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను.౹ కాబట్టి యిప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి, మేము సెలవిచ్చువరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి.౹ ఇది తప్పకుండ చేయుటకు మీరు జాగ్రత్తపడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరుగకుండ చూడుడి అని సెలవిచ్చెను.౹ రాజైన అర్తహషస్త పంపించిన యుత్తరముయొక్క ప్రతి రెహూమునకును షిమ్షయికిని వీరిపక్షముగా నున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదులయొద్దకు వచ్చి, బలవంతముచేతను అధికారముచేతను వారు పని ఆపునట్లుచేయగా యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీకదేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరమువరకు ఆ పని నిలిచిపోయెను. ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బా బెలును యోజాదాకు కుమారుడైన యేషూవయునులేచి యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టనారం భించిరి. మరియు దేవునియొక్క ప్రవక్తలు వారితోకూడ నుండి సహాయము చేయుచువచ్చిరి.౹ అంతట నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షముననున్నవారును యూదులయొద్దకు వచ్చి–ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా ఈ కట్టడమును చేయించినవారి పేరులు మొదైలైన సంగతులను మేము వారితో చెప్పితిమి.౹ యూదుల దేవుడు వారి పెద్దలమీద తన దృష్టియుంచినందున ఆ సంగతినిగూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనొందువరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బో జ్నయియును, నది యివతల నుండువారి పక్షముగానున్న అపర్సెకాయులును, రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు –రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగునుగాక.౹ రాజవైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్లితిమి, అక్కడ మహాదేవునియొక్క మందిరము ఉన్నది; అది గొప్ప రాళ్లచేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారిచేతిలో వృద్ధియగుచున్నది.౹ ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి.౹ వారిలో అధికారులైన వారిపేళ్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేళ్లను అడుగగా వారు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చిరి–మేము భూమ్యాకాశముల దేవునియొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలో నొక గొప్పరాజు కట్టించి నిలిపిన మందిరమును మరల కట్టుచున్నాము.౹ మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరను బబులోను రాజుచేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనముచేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను.౹ అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను.౹ మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములోనుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములనురాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములోనుండి తెప్పించి తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అను నతనికి అప్పగించి— నీవు ఈ ఉపకరణములను తీసికొని యెరూషలేము పట్టణ మందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోనుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటినుండి నేటివరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తికాకుండ ఉన్నది.౹ కాబట్టి రాజవైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజుయొక్క ఖజానాలో వెదకించి, యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయముచేసెనో లేదో అది తెలిసికొని, రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి యీ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయ గోరుచున్నాము. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజుకొట్టులో వెదకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానాయను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడియున్న యీ సంగతి కనబడెను. –రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములోఉండు దేవుని మందిరమునుగూర్చి నిర్ణయించినది–బలులు అర్పింపతగిన స్థలముగా మందిరముకట్టింపబడవలెను; దాని పునాదులు గట్టిగా వేయబడవలెను; దాని నిడివి అరువది మూరలును దాని వెడల్పు అరువది మూరలును ఉండవలెను;౹ మూడు వరుసలు గొప్ప రాళ్లచేతను ఒక వరుస క్రొత్త మ్రానులచేతను కట్టింపబడవలెను; దాని వ్యయమును రాజుయొక్క ఖజానాలోనుండి యియ్యవలెను.౹ మరియు యెరూషలేములోనున్న ఆలయములోనుండి నెబుకద్నెజరు బబులోనునకు తీసికొని వచ్చిన దేవుని మందిరముయొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి, యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి, దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. కావున రాజైన దర్యావేషు ఈలాగు సెలవిచ్చెను— నది యవతల అధికారియైన తత్తెనై అను నీవును, షెతర్బోజ్నయి అను నీవును నది యవతల మీతోకూడ నున్న అపర్సెకాయులును యూదులజోలికి పోక దేవుని మందిరపు పని జరుగనిచ్చి, వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింప నియ్యుడి.౹ మరియు దేవుని మందిరమును కట్టించునట్లుగా యూదులయొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమునుగూర్చి మేము నిర్ణయించినదేమనగా–రాజుయొక్క సొమ్ములోనుండి, అనగా నది యవతలనుండి వచ్చిన పన్నులోనుండి వారు చేయుపని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసినదాని ఇయ్యవలెను.౹ మరియు ఆకాశమందలి దేవునికి దహనబలులు అర్పించుటకై కోడెలేగాని గొఱ్ఱెపొట్టేళ్లేగాని గొఱ్ఱెపిల్లలేగాని గోధుమలేగాని ఉప్పేగాని ద్రాక్షారసమేగాని నూనెయేగాని, యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి, రాజును అతని కుమారులును జీవించునట్లు ప్రార్థనచేయు నిమిత్తమై వారు చెప్పినదానినిబట్టి ప్రతిదినమును తప్పకుండ వారికి కావలసినదంతయు ఇయ్యవలెను.౹ ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచినయెడల వాని యింటివెన్నుగాడి ఊడ దీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింపబడును, ఆ తప్పునుబట్టి వాని యిల్లు పెంటరాశి చేయబడును.౹ ఏ రాజులేగాని యేజనులేగాని యీ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యిచాపినయెడల, తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే యీ ఆజ్ఞ ఇచ్చితిని. మరియు అది అతివేగముగా జరుగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. అప్పుడు నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షమున నున్నవారునురాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి.౹ యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీకదేశపురాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి.౹ రాజైన దర్యావేషు ఏలుబడియందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయబడెను.౹ అప్పుడు ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును చెరలోనుండి విడుదలనొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి.౹ దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱెపిల్లలను ఇశ్రాయేలీయులకందరికిని పాపపరిహారార్థబలిగా ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేకపోతులను అర్పించిరి.౹ మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషేయొక్క గ్రంథమందు వ్రాసిన దానినిబట్టి తరగతులచొప్పున యాజకులను వరుసలచొప్పున లేవీయులను నిర్ణయించిరి. చెరలోనుండి విడుదలనొందినవారు మొదటి నెల పదునాలుగవదినమున పస్కాపండుగ ఆచరించిరి.౹ యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తరువాత, చెరలోనుండి విడుదలనొందిన వారందరికొరకును తమ బంధువులైన యాజకులకొరకును తమకొరకును పస్కాపశువును వధించిరి.౹ కావున చెరలోనుండి విడుదలనొంది తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులును, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రతనుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరును వచ్చి,తిని పులియనిరొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆచరించిరి.౹ ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరురాజు హృదయమునువారివైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. ఈ సంగతులు జరిగినపిమ్మట పారసీకదేశపు రాజైన అర్తహషస్తయొక్క యేలుబడిలో ఎజ్రా బబులోను దేశమునుండి యెరూషలేముపట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయా కుమారుడైయుండెను, శెరాయా అజర్యా కుమారుడు అజర్యా హిల్కీయా కుమారుడు హిల్కీయా షల్లూము కుమారుడు షల్లూము సాదోకు కుమారుడు సాదోకు అహీటూబు కుమారుడు అహీటూబు అమర్యా కుమారుడు అమర్యా అజర్యా కుమారుడు అజర్యా మెరాయోతు కుమారుడు మెరాయోతు జెరహ్యా కుమారుడు జెరహ్యా ఉజ్జీ కుమారుడు ఉజ్జీ బుక్కీ కుమారుడు బుక్కీ అబీషూవ కుమారుడు అబీషూవ ఫీనెహాసు కుమారుడు ఫీనెహాసు ఎలియాజరు కుమారుడు ఎలియాజరు ప్రధానయాజకుడైన అహరోను కుమారుడు.౹ ఈ ఎజ్రా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషేయొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును.౹ మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు ఏడవ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి.౹ రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరము అయిదవ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను.౹ మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశమునుండి బయలుదేరి, తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున అయిదవ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను.౹ ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను. యెహోవా ఆజ్ఞల వాక్యములయందును, ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడలయందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త యిచ్చిన తాకీదు నకలు –రాజైన అర్తహషస్త, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము, మొదలగు మాటలు వ్రాసి యీలాగు సెలవిచ్చెను –చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమునుబట్టి యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు విమర్శచేయుటకు నీవు రాజుచేతను అతని యేడుగురు మంత్రులచేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయ మేమనగా,౹ మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్లుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరు నీతోకూడ వెళ్లవచ్చును.౹ మరియు యెరూషలేములో నివాసముగల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతనియొక్క మంత్రులును స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసికొని పోవలెను.౹ మరియు బబులోను ప్రదేశమందంతట నీకు దొరకు వెండి బంగారములంతయును, జనులును యాజకులును యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసికొని పోవలెను.౹ తడవు చేయక నీవు ఆ ద్రవ్యముచేత ఎడ్లను పొట్లేళ్లను గొఱ్ఱెపిల్లలను, వాటితోకూడ ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలనుకొని, యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము.౹ మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికిని యుక్తమని తోచినదానిని చేయ వచ్చును.౹ మరియు నీ దేవుని మందిరపు సేవకొరకు నీకియ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని యెదుట అప్పగింపవలెను.౹ నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసినయెడల అది రాజుయొక్క ఖజానాలోనుండి నీకియ్యబడును.౹ మరియు–రాజునైన అర్తహషస్త అను నేనే నది యవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ యేదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైన అడిగినయెడల ఆలస్యముకాకుండ మీరు దాని చేయవలెను.౹ వెయ్యి తూముల గోధుమలు రెండువందల మణుగుల వెండి మూడువందల తూముల ద్రాక్షారసము మూడువందల తూముల నూనె లెక్కలేకుండ ఉప్పును ఇయ్యవలెను.౹ ఆకాశమందలి దేవునిచేత ఏది నిర్ణయమాయెనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింప వలసినది. రాజుయొక్క రాజ్యముమీదికిని అతని కుమారులమీదికిని కోపమెందుకు రావలెను? మరియు యాజకులును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును, దేవుని మందిరపు సేవకులునైన వారందరిని గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తుగాని సుంకముగాని పన్నుగాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి.౹ మరియు ఎజ్రా, నది యవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానముచొప్పున నీవు నీ దేవునియొక్క ధర్మశాస్త్రవిధులను తెలిసికొనినవారిలో కొందరిని అధికారులగాను న్యాయాధిపతులగాను ఉంచవలెను, ఆ ధర్మశాస్త్రవిషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను.౹ నీ దేవుని ధర్మశాస్త్రముగాని, రాజుయొక్క చట్టము గాని, గైకొననివాడెవడో త్వరగా విచారణచేసి, మరణశిక్షయైనను స్వదేశత్యాగమైనను ఆస్తి జప్తియైనను ఖైదునైనను వానికి విధింపవలెను. యెరూషలేములోనుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులును రాజుయొక్క మహాధిపతులును నాకు దయ అనుగ్రహింపజేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.౹ నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి, నాతోకూడ వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశమునుండి నాతోకూడ వచ్చిన యింటి పెద్దల వంశావళి.౹ –ఫీనెహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హట్టూషును,౹ షెకన్యా పరోషుల వంశములలో జెకర్యాయు వంశా వళికి నూట ఏబదిమంది పురుషులును లెక్కింపబడిరి.౹ పహత్మోయాబు వంశములో జెరహ్య కుమారుడైన ఎల్యో యేనైయు రెండు వందలమంది పురుషులును షెకన్యా వంశములో యహజీయేలు కుమారుడును మూడువందలమంది పురుషులును ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును ఏబదిమంది పురుషులును ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు డెబ్బదిమంది పురుషులును షెఫట్య వంశములో మిఖాయేలు కుమారుడైన జెబద్యాయు ఎనుబదిమంది పురుషులును యోవాబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబ ద్యాయు రెండువందల పదునెనిమిదిమంది పురుషులును షెలోమీతు వంశములో యోసిప్యా కుమారుడును నూట అరువదిమంది పురుషులును బేబై వంశములో బేబై కుమారుడైన జెకర్యాయు ఇరువది ఎనిమిదిమంది పురుషులును అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును నూటపదిమంది పురుషులును అదోనీ కాముయొక్క చిన్న కుమారులలో ఎలీపేలెటును యెహీయేలును షెమయాయు అరువదిమంది పురుషులును బిగ్వయి వంశములో ఊతైయును జబ్బూదును డెబ్బదిమంది పురుషులును. వీరిని నేను అహవా వైపునకు పారు నదియొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము మూడుదినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనికీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు.౹ అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజెరు అరీయేలు షెమయా ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జెకర్యా మెషుల్లాము అను వారిని, ఉపదేశకులగు యోయారీబు ఎల్నాతానులను పిలువనంపించి –కాసిప్యా అను స్థల మందుండు అధికారియైన ఇద్దోయొద్దకు వారిని పంపి, మా దేవుని మందిరమునకు పరిచారకులను మాయొద్దకు తీసికొని వచ్చునట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోను అతని బంధువులైన నెతీనీయులతోను చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని.౹ మా దేవుని కరుణా హస్తము మాకు తోడుగా ఉన్నందునవారు ప్రజ్ఞావంతుడైన ఒక నిని షేరేబ్యాను అతని కుమారులను సహోదరులను, పదు నెనిమిదిమందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు; ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు.౹ హషబ్యాను అతనితోకూడ మెరారీయుడగు యెషయాను అతని బంధువులును వారి కుమారులునైన యిరువదిమందిని వారు తోడుకొని వచ్చిరి.౹ మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులును నిర్ణయించిన నెతీనీయులలో రెండువందల ఇరువదిమంది వచ్చిరి. వీరందరును పేర్లు ఉదాహరింపబడి నియమింపబడినవారు.౹ అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నదిదగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని.౹ –మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తముతోడుగా ఉండునుగాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను.౹ మేము ఉపవాసముండి ఆ సంగతినిబట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను గనుక నేను యాజకులలోనుండి ప్రధానులైన పండ్రెండు మందిని, అనగా షేరేబ్యాను హషబ్యాను వీరి బంధువులలో పదిమందిని ఏర్పరచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును అతని మంత్రులును అధిపతులును అక్కడ నున్న ఇశ్రాయేలీయులందరును ప్రతిష్ఠించిన వెండిబంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని.౹ వెయ్యిన్ని మూడువందల మణుగుల వెండిని రెండువందల మణుగుల వెండి ఉపకరణములను, రెండువందల మణుగుల బంగారమును,౹ ఏడువేల తులములుగల యిరువది బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి వారిచేతికి అప్పగించి–మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడినవారు, పాత్రలును ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారములును మీపితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై యున్నవి.౹ కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో, యాజకులయొక్కయు లేవీయులయొక్కయు ఇశ్రాయేలు పెద్దలయొక్కయు ప్రధానులైన వారియెదుట, వాటిని తూచి అప్పగించువరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని.౹ కాబట్టి యాజకులును లేవీయులును వాటి యెత్తు ఎంతో తెలిసికొని, యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసికొనిరి. మేము మొదటి నెల పండ్రెండవదినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నదినుండి బయలుదేరగా, మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి, శత్రువుల చేతిలోనుండియు మార్గమందు పొంచియున్నవారి చేతిలోనుండియు మమ్మును తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి మూడుదినములు అక్కడ బసచేసితిమి.౹ నాలుగవదినమున వెండి బంగారములును పాత్రలును మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతుచేత తూనిక వేయబడెను. అతనితోకూడ ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను; వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడనుండిరి.౹ సంఖ్యచొప్పునను ఎత్తుచొప్పునను అన్నిటిని సరిచూచిన తరువాత వాటి యెత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి.౹ మరియు చెరలోనికి కొనిపోబడినవారికి పుట్టి చెరనుండి విడుదలనొంది తిరిగి వచ్చినవారు ఇశ్రాయేలీయుల దేవునికి దహనబలులు అర్పించిరి. ఇశ్రాయేలీయులందరికొరకు పండ్రెండు ఎడ్లను తొంబది యారు పొట్టేళ్లను డెబ్బదియేడు గొఱ్ఱెపిల్లలను, పాపపరిహారార్థబలిగా పండ్రెండు మేకపోతులను తెచ్చి అన్నిటిని దహనబలిగా యెహోవాకు అర్పించిరి.౹ వారు రాజుయొక్క నిర్ణయములను రాజుయొక్క సేనాధిపతులకును నది యివతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి–ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును, కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూసీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలోనుండి తమ్మును తాము వేరు పరచుకొనక, వారుచేయు అసహ్యమైన కార్యములను తామేచేయుచు,౹ వారి కుమార్తెలను పెండ్లి చేసికొనుచు, తమ కుమారులకును తీసికొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనినవారైరి. ఈ అపరాధము చేసినవారిలో పెద్దలును అధికారులును నిజముగా ముఖ్యులై యుండిరని చెప్పిరి.౹ నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని, నా తల వెండ్రుకలను నా గడ్డపు వెండ్రుకలను పెరికి వేసికొని విభ్రాంతిపడి కూర్చుంటిని.౹ చెరపట్ట బడినవారి అపరాధమును చూచి, ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరును నాయొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళవరకు కూర్చుంటిని.౹ సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి, నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్లమీద పడి, నా దేవుడైన యెహోవాతట్టు చేతులెత్తి –నా దేవా నా దేవా, నా ముఖము నీవైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది.౹ మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మేమును మా రాజులును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినముననున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందినవార మైతిమి.౹ అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి, మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల జేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండ నిచ్చినట్లుగాను, తన పరిశుద్ధస్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మాయెడల దయ చూపియున్నాడు.౹ నిజముగా మేము దాసులమైతిమి; అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక, పారసీకదేశపు రాజులయెదుట మాకు దయ కనుపరచి, మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి, దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుటకును, యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించితివి.౹ మా దేవా, యింత కృపనొందిన తరువాత మేమేమి చెప్ప గలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసులద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి గదా.౹ వారు–మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అప విత్రతచేతను వారుచేయు అసహ్యమైన వాటిచేతను అపవిత్రమాయెను, వారు జరిగించిన అసహ్యమైన వాటిచేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయెను.౹ కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకియ్యకుడి. వారి కుమార్తెలను మీ కుమారులకొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమభాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికిని కోరకుండినయెడల, మీరు బలముగానుండి, ఆ దేశముయొక్క సుఖమును అనుభవించి, మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాని నప్పగించెదరని చెప్పిరి.౹ అయితే మా దుష్క్రియలనుబట్టియు మా గొప్ప అపరాధములనుబట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్యకార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసికొనినయెడల, మేము నాశనమగువరకు శేషమైననులేకుండునట్లును, తప్పించుకొనుటకు సాధనమైననులేకుండునట్లును, నీవు కోపపడుదువు గదా.౹ యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై యున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసితిని. ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట. సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను —మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవునిదృష్టికి పాపము చేసితిమి; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడ వడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు.౹ కాబట్టి యీ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచ ననుబట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచననుబట్టియు, ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసికొనెదము.౹ లెమ్ము ఈ పని నీ యధీనములోనున్నది, మేమును నీతోకూడ నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా ఎజ్రా లేచి, ప్రధానయాజకులును లేవీయులును ఇశ్రాయేలీయులందరును ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసికొనగా ఎజ్రా దేవుని మందిరము ఎదుటనుండి లేచి, ఎల్యాషీబు కుమారుడైన యోహానానుయొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి, చెరపట్టబడినవారి అపరాధమునుబట్టి దుఃఖించుచు, భోజనమైనను పానమైనను చేయకుండెను.౹ చెరనుండి విడుదల నొందినవారందరు యెరూషలేమునకు కూడి రావలెనని యూదా దేశమంతటియందును యెరూషలేము పట్టణమందును ప్రకటనచేయబడెను.౹ మరియు మూడుదినములలోగా ప్రధానులును పెద్దలును చేసిన యోచనచొప్పున ఎవడైనను రాకపోయినయెడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు, వాడు విడుదల నొందినవారి సమాజములోనుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి.౹ యూదా వంశస్థులందరును బెన్యామీనీయులందరును ఆ మూడుదినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది తొమ్మిదవ నెల; ఆ నెల యిరువదియవ దినమున జనులందరును దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాలచేత తడియుచు, ఆ సంగతిని తలం చుటవలన వణకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను —మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లిచేసికొని, ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి.౹ కాబట్టి యిప్పుడు మీపితరులయొక్క దేవుడైన యెహోవా యెదుట మీ పాపమును ఒప్పుకొని, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి, దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని యుండుడి.౹ అందుకు సమాజకులందరు ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి–నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది.౹ అయితే జనులు అనేకులై యున్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము, ఈ పని యొకటి రెండు దినములలో జరుగునది కాదు; ఈ విషయములో అనేకులము అపరాధులము; కాబట్టి సమాజపు పెద్దలనందరిని యీ పనిమీద ఉంచవలెను,౹ మన పట్టణములయందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లిచేసికొనిరో వారందరును నిర్ణయకాలమందు రావలెను; మరియు ప్రతి పట్టణముయొక్క పెద్దలును న్యాయాధిపతులును ఈ సంగతినిబట్టి మామీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మామీదికి రాకుండ తొలగి పోవునట్లుగా వారితోకూడ రావలెను అనిచెప్పెను.౹ అప్పుడు అశాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణ యింప బడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతైయును వారికి సహాయులై యుండిరి.౹ చెరనుండి విడుదలనొందినవారు అట్లుచేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులును వారి పితరుల యింటి పేరులనుబట్టి తమతమ పేరుల ప్రకారము అందరిని వేరుగా ఉంచి, పదియవ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి.౹ మొదటి నెల మొదటి దినమున అన్యస్త్రీలను పెండ్లి చేసికొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యున్నట్లు కనబడినవారు ఎవరనగా — యోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరులలోను మయశేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును.౹ వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట యిచ్చిరి. మరియు వారు అపరాధులై యున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి.౹ ఇమ్మేరు వంశములో హనానీ జెబద్యా హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా,౹ పషూరు వంశములో ఎల్యో యేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా,౹ లేవీయులలో యోజాబాదు షిమీ కెలిథా అను కెలాయా పెతహయా యూదా ఎలీయెజెరు,౹ గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షల్లూము తెలెము ఊరి అనువారు.౹ ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్యా యిజ్జీయా మల్కీయా మీయామిను ఎలియేజరు మల్కీయా, బెనాయా,౹ ఏలాము వంశములో మత్తన్యా జెకర్యా యెహీయేలు అబ్దీ యెరేమోతు ఏలీయ్యా.౹ జత్తూ వంశములో ఎల్యోయేనై ఎల్యాషీబు మత్తన్యా యెరేమోతు జాబాదు అజీజా.౹ బేబై వంశములో యెహోహానాను హనన్యా జబ్బయి అత్లాయి,౹ బానీ వంశములో మెషుల్లాము మల్లూకు అదాయా యాషూబు షెయాలు రామోతు, పహత్మో యాబు వంశములో అద్నా కెలాలు బెనాయా మయ శేయా మత్తన్యా బెసలేలు బిన్నూయి మనష్షే,౹ హారిము వంశములో ఎలీయెజెరు ఇష్షీయా మల్కీయా షెమయా షిమ్యోను బెన్యామీను మల్లూకు షెమర్యా,౹ హాషుము వంశములో మత్తెనై మత్తత్తా జాబాదు ఎలీపేలెటు యెరేమై మనష్షే షిమీ,౹ బానీ వంశములో మయదై అమ్రాము ఊయేలు బెనాయా బేద్యా కెలూహు వన్యా మెరేమోతు ఎల్యాషీబు మత్తన్యా మత్తెనై యహశావు బానీ బిన్నూయి షిమీ [37-42] షిలెమ్యా నాతాను అదాయా మక్నద్బయి షామై షారాయి అజరేలు షెలెమ్యా షెమర్యా షల్లూము అమర్యా యోసేపు *** *** *** *** *** నెబో వంశములో యెహీయేలు మత్తిత్యా జాబాదు జెబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు.౹ వీరందరును అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు. హకల్యా కుమారుడైన నెహెమ్యాయొక్క చర్యలు. ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులనుగూర్చియు, యెరూషలేమునుగూర్చియు నేను వారి నడుగగా వారు–చెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందు చున్నారు; మరియు యెరూషలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చ బడినవని నాతో చెప్పిరి.౹ ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.౹ ఎట్లనగా–ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా,౹ నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేనుచేయు ప్రార్థన అంగీ కరించుము. నీకు విరోధముగ పాపముచేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి యింటివారును పాపము చేసియున్నాము.౹ నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనక పోతిమి.౹ నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చినమాటను జ్ఞాపకము తెచ్చుకొనుము; అదేదనగా–మీరు అపరాధము చేసినయెడల జనులలోనికి మిమ్మును చెదర గొట్టుదును.౹ అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినయెడల, భూదిగంతములవరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మునుకూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా.౹ చిత్తగించుము, నీవు నీ మహా ప్రభావమును చూపి, నీ బాహుబలముచేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే.౹ యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని. అటుతరువాత అర్తహషస్త రాజు ఏలుబడికాలమున ఇరువదియవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసికొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడును అతనియెదుట విచారముగా ఉండలేదు.౹ కాగా రాజు–నీకు వ్యాధిలేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయదుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి–రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి యుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని.౹ అప్పుడు రాజు —ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో–నీ సముఖమందు నేను దయపొందినయెడల, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని.౹ అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునియుండగా–నీ ప్రయాణము ఎన్నిదినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవని అడిగెను. నేను ఇంత కాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తముగలవాడాయెను.౹ ఇదియుగాక రాజుతో నేనిట్లంటిని — రాజున కనుకూలమైతే యూదాదేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది యవతలనున్న అధికారులకు తాకీదులను,౹ పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను.౹ తరువాత నేను నది యవతలనున్న అధికారులయొద్దకు వచ్చి వారికి రాజుయొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతోకూడ సేనాధిపతులను గుఱ్ఱపురౌతులను పంపించెను. హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.౹ అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడుదినములు అక్కడనేయుండి రాత్రియందు నేనును నాతోకూడ నున్న కొందరును లేచితిమి. యెరూషలేమునుగూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువుతప్ప మరి యే పశువును నాయొద్ద ఉండలేదు.౹ నేను రాత్రికాలమందు లోయద్వారముగుండ భుజంగపు బావియెదుటికిని పెంటద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేముయొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.౹ తరువాత నేను బుగ్గగుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్లితిని గాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను.౹ నేను రాత్రియందు మడుగు దగ్గరనుండి పోయి ప్రాకారమును చూచినమీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చితిని.౹ అయితే నేను ఎచ్చటికి వెళ్లినది యేమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకేగాని యాజకులకేగాని యజమానులకేగాని అధికారులకేగాని పనిచేయు ఇతరమైనవారికేగాని నేను ఆ సంగతి చెప్పి యుండలేదు.౹ అయితే వారితో నేనిట్లంటిని–మనకు కలిగినశ్రమ మీకు తెలిసియున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చ బడెనో మీరు చూచియున్నారు, మనకు ఇకమీదట నింద రాకుండ యెరూషలేముయొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి.౹ ఇదియుగాక నాకు సహాయముచేయు దేవుని కరుణాహస్తమునుగూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నియు నేను వారితో చెప్పితిని. అందుకు వారు–మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి యీ మంచికార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి.౹ అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబీయా అనువాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి–మీరు చేయుపనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి.౹ అందుకు నేను–ఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము, యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనయైనను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని. ప్రధానయాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరు లైన యాజకులును లేచి గొఱ్ఱెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయా గోపురమువరకును హనన్యేలు గోపురమువరకును ప్రాకారమునుకట్టి ప్రతిష్ఠించిరి.౹ అతని ఆనుకొని యెరికో పట్టణపువారు కట్టిరి; వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను;౹ మత్స్యపు గుమ్మమును హస్సెనాయా వంశస్థులుకట్టిరి; మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి.౹ వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజబెయేలునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయనా కుమారుడైన సాదోకును,౹ వారిని ఆనుకొని తెకోవీయులును బాగుచేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనక పోయిరి.౹ పాత గుమ్మమును బాగుచేయువారు ఎవరనగా పాసెయ కుమారుడైన యెహోయాదాయును బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి.౹ వారిని ఆనుకొని గిబియో నీయులును మిస్పావారును గిబియోనీయుడైన మెలట్యాయును మేరోనోతీయుడైన యాదోనును ఏటి యివతలనున్న అధికారి న్యాయపీఠముంచబడు స్థలమువరకు బాగు చేసిరి.౹ వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి యైన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేయువాడై యుండెను. అతని ఆనుకొని ఔషధజ్ఞానియగు హనన్యా పని జరుపుచుండెను. యెరూషలేముయొక్క వెడల్పు గోడవరకు దాని నుండనిచ్చిరి.౹ వారిని ఆనుకొని యెరూషలేములో సగముభాగమునకు అధిపతియైన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేసెను.౹ వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా హరూమపు కుమారుడైన యెదాయా బాగుచేసెను, అతని ఆనుకొని హషబ్నెయా కుమారుడైన హట్టూషు పని జరుపువాడై యుండెను.౹ రెండవభాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హష్షూ బును బాగుచేసిరి.౹ వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతియైన హల్లోహషు కుమారుడైన షల్లూమును ఆతని కుమార్తెలును బాగుచేసిరి.౹ లోయద్వారమును హానూనును జానోహ కాపురస్థులును బాగుచేసి కట్టినతరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంటద్వారమువరకుండు గోడ వెయ్యిమూరలదనుక వారుకట్టిరి.౹ బేత్‌హక్కెరెము ప్రదేశమునకు అధిపతియైన రేకాబు కుమారుడైన మల్కీయా పెంటగుమ్మమును బాగు చేసెను, ఆతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతియైన కొల్హోజె కుమారుడైన షల్లూము ధారయొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణమునుండి క్రిందకు పోవు మెట్లవరకు రాజు తోటయొద్దనున్న సిలోయము మడుగుయొక్క గోడను అతడు కట్టెను.౹ అతని ఆనుకొని బేత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడునైన నెహెమ్యా బాగుచేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలములవరకును కట్టబడిన కోనేటివరకును పరాక్రమశాలులయిండ్ల స్థలమువరకును కట్టెను.౹ అతని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేసెను; అతని ఆనుకొని తన భాగములో కెయిలాయొక్క సగముభాగమునకు అధిపతియైన హషబ్యా బాగుచేయువాడాయెను.౹ అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేసెను. అతడు కెయీలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను.౹ అతని ఆనుకొని మిస్పాకు అధిపతియు యేషూవకు కుమారుడునైన ఏజెరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరియొక భాగమును బాగు చేసెను.౹ అతని ఆనుకొని ఆ గోడ మలుపునుండి ప్రధానయాజకుడైన ఎల్యాషీబు ఇంటిద్వారమువరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను.౹ అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారము నుండి ఆ యింటి కొనవరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేసెను.౹ అతనిని ఆనుకొని యొర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగుచేయువారైరి.౹ వారిని ఆనుకొని తమ యింటి కెదురుగా బెన్యామీను హష్షూబు అను వారు బాగుచేసిరి; వారిని ఆనుకొని తన యింటియొద్ద అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను.౹ అతని ఆనుకొని అజర్యా యిల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరియొక భాగమును బాగుచేసెను.౹ అతని ఆనుకొని గోడ మళ్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహా గోపురమువరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేయువాడాయెను; అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగుచేసెను.౹ ఓపెలులోనున్న నెతీనీయులు తూర్పువైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసిరి.౹ వారిని ఆనుకొని ఓపెలు గోడవరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియొక భాగమును తెకోవీయులు బాగుచేసిరి.౹ గుఱ్ఱపు గుమ్మమునకు పైగా యాజకులందరు తమయిండ్ల కెదురుగా బాగుచేసిరి.౹ వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను; అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను.౹ అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు ఆరవ కుమారుడైన హానూనును మరియొక భాగమును బాగుచేయు వారైరి; వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను.౹ అతని ఆనుకొని నెతీ నీయుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగా నున్న వర్తకుల స్థలముయొక్క మూలవరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగుచేసెను.౹ మరియు మూలకును గొఱ్ఱెల గుమ్మమునకునుమధ్యను బంగారపు పనివారును వర్తకులును బాగుచేసిరి. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళిచేసి షోమ్రోను దండువారి యెదుటను తన స్నేహితుల యెదుటను ఇట్లనెను–దుర్బలులైన యీ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే యీ పని ముగింతురా? బలులు అర్పించి బలపరచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగాపడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబీయా అతనియొద్దను ఉండి–వారు కట్టినదానిపైకి ఒక నక్క యెగిరినట్టయిన వారి రాతిగోడ పడిపోవుననెను.౹ –మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము; వారి నింద వారి తలలమీదికి వచ్చునట్లుచేసి, వారు చెరపట్టబడినవారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము.౹ వారు కట్టువారినిబట్టి నీకు కోపము పుట్టించి యుండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము, నీయెదుట వారి పాపమును తుడిచి వేయకుము.౹ అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగియుండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి యుండెను. సన్బల్లటును టోబీయాయును అరబీయులును అమ్మోనీయులును అష్డోదీయులును, యెరూషలేముయొక్క గోడలు కట్టబడెననియు, బీటలన్నియు కప్పబడెననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి, పని ఆటంకపరచవలెనని వారందరు కట్టుకట్టి మమ్మును కలతపరచగా,౹ మేము మా దేవునికి ప్రార్థనచేసి, వారి భయముచేత రాత్రింబగళ్లు కావలియుంచితిమి.౹ అప్పుడు యూదావారు — బరువులు మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా,౹ మా విరోధులును — వారు తెలిసికొనకుండను చూడకుండను మనము వారిమధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి.౹ మా శత్రువులయొద్ద నివాసులైయున్న యూదులు వచ్చి–నలు దిక్కులనుండి మీరు మా సహాయమునకు రావలెనని మాటి మాటికి మాతో చెప్పగా అందునిమిత్తము గోడవెనుక నున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోను వారి యీటెలతోను వారి విండ్లతోను నిలిపితిని.౹ అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను–వారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి యోచన మాకు తెలియబడెననియు, దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా, మాలో ప్రతివాడును తన పనికి గోడదగ్గరకు వచ్చెను.౹ అయితే అప్పటినుండి నా పనివారిలో సగము మంది పనిచేయుచు వచ్చిరి, సగముమంది యీటెలును బల్లెములును విండ్లును కవచములును ధరించినవారై వచ్చిరి; అధికారులు యూదులలో ఆయా యింటివారి వెనుక నిలిచిరి.౹ గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి.౹ మరియు కట్టువారిలో ఒక్కొకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను, బాకా ఊదువాడు నాయొద్ద నిలిచెను.౹ అప్పుడు నేను ప్రధానులతోను అధికారులతోను మిగిలినవారితోను ఇట్లంటిని–పని మిక్కిలి గొప్పది, మనము గోడమీద ఒకరొకరికి చాల యెడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును.౹ ఆప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి; సగముమంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు ఈటెలు పట్టుకొనిరి.౹ మరియు ఆ కాలమందు నేను జనులతో— ప్రతివాడు తన పనివానితోకూడ యెరూషలేములో బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని.౹ ఈలాగున నేనుగాని నా బంధువులుగాని నా పనివారుగాని నా వెంబడియున్న పారావారుగాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. తమ సహోదరులైన యూదులమీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదుచేసిరి.౹ ఏదనగా కొందరు —మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకు లము. అందుచేత మేముతిని బ్రదుకుటకు ధాన్యము మీయొద్ద తీసికొందుమనిరి.౹ మరికొందరు–క్షామ మున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువ పెట్టితిమి గనుక మీయొద్ద ధాన్యము తీసికొందు మనిరి.౹ మరికొందరు–రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములమీదను మా ద్రాక్షతోటలమీదను మేము అప్పు చేసితిమి.౹ మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను; ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములోనున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని.౹ అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించి–మీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి –అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితిమి, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి.౹ మరియు నేను–మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింప కూడదా? నేనును నా బంధువులును నా దాసులును కూడ ఆలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి; ఆ అప్పు పుచ్చుకొనకుందము.౹ ఈ దినములోనే వారియొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్షతోటలను ఒలీవతోటలను వారి యిండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను నూరవభాగమును వారికి మరల అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని.౹ అందుకు వారు–నీవు చెప్పినప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని.౹ మరియు నేను నా ఒడిని దులిపి–ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన యింటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును; ఇటువలె వాడు దులిపి వేయబడి యేమియు లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా, సమాజకులందరు ఆలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరును ఈ మాటచొప్పుననే జరిగించిరి.౹ మరియు నేను యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడినకాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరము మొదలుకొని ముప్పదిరెండవ సంవత్సరమువరకు పండ్రెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేనుగాని నా బంధువులుగాని తీసికొనలేదు.౹ అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనులమీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయముచేత నేనాలాగున చేయలేదు.౹ ఇదియుగాక నేను ఈ గోడపనిచేయగా నా పనివారును ఆ పనిచేయుచు వచ్చిరి.౹ భూమి సంపాదించుకొనినవారము కాము; నా భోజనపు బల్లయొద్ద మా చుట్టునున్న అన్యజనులలోనుండి వచ్చినవారు గాక యూదులును అధికారులును నూట ఏబదిమంది కూర్చునియుండిరి.౹ నా నిమిత్తము ప్రతిదినము ఒక యెద్దును శ్రేష్ఠమైన ఆరు గొఱ్ఱెలును సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను, పదిరోజులకు ఒకమారు నానావిధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసితిని. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు.౹ నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములనుబట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపకముందుగా దానిలో బీటలులేకుండ సంపూర్ణముగా గోడను కట్టియుండగా, సన్బల్లటును టోబీయాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలినవారును విని సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి–ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలిసికొందము రండని నాయొద్దకు వర్తమానము పంపిరి.౹ అందుకు నేను–నేను చేయుపని గొప్పది, దానివిడిచి మీయొద్దకు వచ్చుటకై నేను దాని నెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని.౹ వారు ఆలాగున నాలుగు మారులు నాయొద్దకు వర్తమానము పంపగా ఆప్రకారమే నేను మరల ప్రత్యుత్తరమిచ్చితిని.౹ అంతట అయిదవమారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న యొక పత్రికను నాయొద్దకు పంపెను.౹ అందులో–వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులును రాజుమీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు,౹ యూదులకు రాజుగా ఉన్నాడని నిన్నుగూర్చి ప్రకటనచేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలును–రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలును, —అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసెదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతియనియు, దానిని గెషెము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను.౹ ఈ పని చేయలేకుండ మేమశక్తులమగుదుమనుకొని వారందరు మమ్మును బెదరింప జూచిరిగాని నేను–ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారముకాము, వీటిని నీ మనస్సులోనుండి నీవు కల్పించుకొంటివని అతనియొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. అటుతరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయాయొక్క యింటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండ నిర్బంధింపబడెను. అతడు–రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక, దేవుని మందిర గర్భాలయములోపలికి మనము పోయి తలుపులు వేసికొనెదము రండని చెప్పగా నేను–నావంటివాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింప వచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని.౹ అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబీయాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై యీ ప్రకటన చేసెననియు తేటగ కనుగొంటిని ఇందువలన నాకు భయము పుట్టగా, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని, నామీద నింద మోపునట్లుగా నన్నుగూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి యుండిరి.౹ నా దేవా, వారి క్రియలనుబట్టి టోబీయాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి యున్న ప్రవక్తలను, నోవద్యా అను ప్రవక్తిని జ్ఞాపకము చేసికొనుము. ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరువదియయిదవ దినమందు, అనగా ఏబదిరెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను.౹ అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టునుండు అన్యజనులందరు జరిగినపని చూచినప్పుడును, వారు బహుగా అధైర్య పడిరి; ఏలయనగా ఈ పని మా దేవునివలన జరిగినదని వారు తెలిసికొనిరి.౹ ఆ దినములలో యూదుల ప్రధానులు టోబీయా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచు వచ్చిరి; అతడును వారికి పత్రికలు పంపుచుండెను.౹ అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసికొనియుండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి.౹ వారు నా యెదుట అతని గుణాతిశయములనుగూర్చి మాటలాడుచువచ్చిరి, నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టు టకే టోబీయా పత్రికలు పంపెను. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులుగలవాడు.౹ అప్పుడు నేను–బాగుగా ప్రొద్దెక్కువరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు; మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థులందరు తమతమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.౹ అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, యిండ్లు ఇంక కట్టబడలేదు.౹ జనసంఖ్యచేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చినవారినిగూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి.౹ జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలురాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమతమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయులయొక్క జనసంఖ్య యిదే.౹ అది ఏలాగనగా పరోషువంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును ౹ ఆరహు వంశస్థులు ఆరువందల ఏబది యిద్దరును యేషూవ యోవాబు సంబంధు లైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిదిమందియు ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును.౹ జత్తూవంశస్థులు ఎనిమిది వందల నలువది యయిదుగురును జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మందియు బిన్నూయి వంశస్థులు ఆరువందల నలువది యెనమండుగురును బేబై వంశస్థులు ఆరువందల ఇరువది యెనమండుగురును అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువదియేడుగురును బిగ్వయి వంశస్థులు రెండువేల అరువదియేడుగురును ఆదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు తొంబది యెనమండుగురును హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును హారీపు వంశస్థులు నూటపండ్రెండుగురును గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండుగురును అనాతోతువారు నూట ఇరువది యెనమండుగురును బేతజ్మావెతువారు నలువది యిద్దరును కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును మిక్మషువారు నూట ఇరువది యిద్దరును బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును రెండవ నెబోవారు ఏబది యిద్దరును [32-34] రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును *** *** హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును సెనాయా వంశస్థులు మూడువేల తొమ్మిది వందల ముప్పదిమందియు యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల డెబ్బది ముగ్గురును ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువదియేడుగురును హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూటముప్పది యెనమండుగురును నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూ షేసీము వంశస్థులు.౹ బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు [56-57] సొలొమోను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు *** యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు.౹ ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు. తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొద లైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి.౹ వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానులు.౹ వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి.౹ కాగా అధికారి–ఊరీము తుమ్మీము అనువాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతిపరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను.౹ సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది.౹ వీరు గాక వీరి పనివారును పనికత్తెలును ఏడువేల మూడు వందల ముప్పదియేడుగురును, గాయకులలో స్త్రీ పురు షులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి.౹ వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదును వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరువేల ఏడువందల ఇరువదియునై యుండెను. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను.౹ మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తులముల వెండిని వేసిరి.౹ మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తులముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి.౹ అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయులందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి. ఏడవ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై యుండిరి. అప్పుడు జనులందరును ఏక మనస్కులై, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి —యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రగ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన ఎజ్రా యేడవ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింపశక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి యెదుటను ఆ ధర్మశాస్త్రగ్రంథము తీసికొనివచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, తెలివితో వినగలవారికందరికిని చదివి వినిపించుచు వచ్చెను, ఆ జనులందరును ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠము మీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి.౹ అప్పుడు ఎజ్రా అందరికంటె ఎత్తుగా నిలువబడి జనులందరును చూచుచుండగా గ్రంథమును విప్పెను, విప్ప గానే జనులందరు నిలువబడిరి.౹ ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తి— ఆమేన్ ఆమేన్ అని పలుకుచు, నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి.౹ జనులు ఈలాగు నిలువబడుచుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాలును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియ జెప్పిరి.౹ ఇటువలెనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి.౹ జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులును–మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి.౹ మరియు అతడు వారితో నిట్లనెను–పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి,యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు.౹ ఆలాగున లేవీయులు జనులందరిని ఓదార్చి —మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధదినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి.౹ ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి. రెండవదినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైనవారును యాజకులును లేవీయులును ధర్మశాస్త్రగ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రియైన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి.౹ యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుట కనుగొనెను మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియ జేయవలసినదేమనగా–మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను.౹ ఆప్రకారమే జనులుపోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమతమ యిండ్లమీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి.౹ మరియు చెరలోనుండి తిరిగి వచ్చినవారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అదివరకు ఇశ్రాయేలీయులు ఆలాగున చేసియుండలేదు; అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను.౹ ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినమువరకు అను దినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి విని పించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును ఏడు దినములవరకు ఆచరించిన తరువాత విధిచొప్పున ఎనిమిదవదినమునవారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. ఈ నెల యిరువది నాలుగవ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తలమీద ధూళి పోసికొని కూడి వచ్చిరి.౹ ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలోనుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి, తమ పాపములను తమపితరుల పాపములను ఒప్పుకొనిరి.౹ మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువ బడి, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చదువుచు వచ్చిరి, ఒక జాముసేపు తమ పాపములను ఒప్పు కొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి.౹ లేవీయులలో యేషూవ బానీ కద్మీయేలు షెబన్యా బున్నీ షేరేబ్యా బానీ కెనానీ అనువారు మెట్లమీద నిలువబడి, యెలుగెత్తి, తమ దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టిరి.౹ అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారు–నిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి–సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక.౹ నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశసైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.౹ దేవా యెహోవా, అబ్రామును ఏర్పరచుకొని, కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇవతలకు అతని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టినవాడవు నీవే.౹ అతడు నమ్మకమైన మనస్సుగల వాడని యెరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు అతనితో నిబంధన చేసినవాడవు నీవే.౹ నీవు నీతిమంతుడవై యుండి నీ మాటచొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందినశ్రమను నీవు చూచితివి, ఎఱ్ఱసముద్రమునొద్ద వారి మొఱ్ఱను నీవు వింటివి.౹ ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారియెడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారియెదుట సూచకక్రియలను మహత్కార్యములను చూపించితివి. ఆలాగున చేయుటవలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధినొందితివి.౹ మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందునవారు సముద్రము మధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి.౹ ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రికాలమందువారు వెళ్లవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండినవాడవును అయి యుండి వారిని తోడుకొనిపోతివి.౹ సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలు కరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి.౹ వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతిదినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషేద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి.౹ వారి ఆకలి తీర్చుటకు ఆకాశమునుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలోనుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణముచేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికాజ్ఞాపించితివి.౹ అయితే వారును మా పితరులును గర్వించి, లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గక పోయిరి.౹ వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచుకొని, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగు బాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవునైయుండి వారిని విసర్జింపలేదు.౹ వారు ఒక పోతదూడను చేసికొని–ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి, నీకు బహు విసుకు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహువిస్తారమైన కృప కలిగినవాడవై వారిని విసర్జింపలేదు; మార్గముగుండ వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలు గిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపైనుండి వెళ్లిపోక నిలిచెను.౹ వారికి బోధించుటకు నీ యుపకారాత్మను దయ చేసితివి, నీ విచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు; వారి దాహమునకు ఉదకమిచ్చితివి.౹ నిజముగా అరణ్యములో ఏమియు తక్కువ కాకుండ నలువది సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకువాపు రాలేదు.౹ ఇదియుగాక రాజ్యములను జనములను వారికప్పగించి, వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక, వారు సీహోను అను హెష్బోను రాజుయొక్క దేశమును బాషానునకు రాజైన ఓగుయొక్క దేశమును స్వతంత్రించుకొనిరి.౹ వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి, ప్రవేశించి స్వతంత్రించుకొనునట్లు వారి పితరులకు నీవు వాగ్దానముచేసిన దేశములోనికి వారిని రప్పింపగా ఆ సంతతివారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కనానీయులను ఆ దేశవాసులను జయించి, తమకు మనస్సువచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశజనులను వారి చేతికి అప్పగించితివి.౹ అప్పుడు వారు ప్రాకారములుగల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని, సకలమైన పదార్థములతో నిండియున్న యిండ్లను త్రవ్విన బావులను ద్రాక్షతోటలను ఒలీవతోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొనిరి. ఆలాగునవారుతిని తృప్తిపొంది మదించి నీ మహోపకారమునుబట్టి బహుగా సంతోషించిరి.౹ అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటుచేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి, నీతట్టు తిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి.౹ అందుచేత నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందువారు నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి, వారి శత్రువుల చేతిలోనుండి వారిని తప్పించుటకై నీ కృపాసంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి.౹ వారు నెమ్మదిపొందిన తరువాత నీ యెదుట మరల ద్రోహులుకాగా నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి; వీరు వారిమీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృపచొప్పున అనేకమారులు వారిని విడిపించితివి.౹ నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించినయెడల వాటివలనవాడు బ్రదుకునుగదా. వారు మరల నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచునట్లు నీవు వారిమీద సాక్ష్యము పలికినను, వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకొని నీ మాట వినకపోయిరి.౹ నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి, నీ ప్రవక్తలద్వారా నీ ఆత్మచేత వారిమీద సాక్ష్యము పలికితివిగాని వారు వినక పోయిరి; కాగా నీవు ఆయా దేశములలోనున్న జనులచేతికి వారిని అప్పగించితివి.౹ అయితే నీవు మహోప కారివై యుండి, వారిని బొత్తిగా నాశనముచేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపాకనికరములుగల దేవుడవైయున్నావు.౹ చేసిన నిబంధనను నిలు పుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడవునగు మా దేవా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని యీ దినములవరకు మా మీదికిని మా రాజులమీదికిని ప్రధానులమీదికిని మా పితరులమీదికిని నీ జనులందరిమీదికిని వచ్చినశ్రమయంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక.౹ మా మీదికి వచ్చినశ్రమ లన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే; నీవు సత్యము గానే ప్రవర్తించితివి కాని మేము దుర్మార్గులమైతిమి.౹ మా రాజులుగాని మా ప్రధానులుగాని మా యాజకులుగాని మా పితరులుగాని నీ ధర్మశాస్త్రము ననుసరించి నడువలేదు. నీవు వారిమీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి.౹ వారు తమ రాజ్య పరిపాలనకాలమందు నీవు తమ యెడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలువిడిచి మారుమనస్సు పొందరైరి.౹ చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించునట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమియందు మేము దాసులమై యున్నాము.౹ మా పాపములనుబట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతివిస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరములమీదను మా పశువులమీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాల శ్రమలు కలుగుచున్నవి. మేము ఒప్పుకొని చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధన చేసికొని వ్రాయించుకొనగా, మా ప్రధానులును లేవీయులును యాజకులును దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసినవారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కీయా శెరాయా అజర్యా యిర్మీయా [3-5] పషూరు అమర్యా మల్కీయా హట్టూషు షెబన్యా మల్లూకు. హారిము మెరేమోతు ఓబద్యా *** *** [6-8] దానియేలు గిన్నెతోను బారూకు మెషుల్లాము అబీయా మీయామిను మయజ్యా బిల్గయి షెమయా. వీరందరును యాజకులుగా ఉండువారు *** *** లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషూవ హేనాదాదు కుమారులైన బిన్నూయి కద్మీయేలు వారి సహోదరులైన షెబన్యా హోదీయా కెలీటా పెలాయా హానాను మీకా రెహోబు హషబ్యా జక్కూరు షేరేబ్యా షెబన్యా [13-14] హోదీయా బానీ బెనీను అనువారు. జనులలో ప్రధాను లెవరనగా పరోషు పహత్మోయాబు ఏలాము జత్తూ బానీ *** బున్నీ అజ్గాదు బేబై అదోనీయా బిగ్వయి ఆదీను [16-17] అటేరు హిజ్కియా అజ్జూరు *** హోదీయా హాషుము బేజయి హారీపు అనాతోతు నేబై మగ్పీయాషు మెషుల్లాము హెజీరు మెషేజ బెయేలు సాదోకు యద్దూవ పెలట్యా హానాను అనాయా హోషేయ హనన్యా హష్షూబు హల్లోహైషు పిల్హా షోబేకు రెహూము హషబ్నా మయశేయా అహీయా హానాను ఆనాను [25-26] మల్లూకు హారిము బయనా అనువారు.౹ *** [27-28] అయితే జనులలో మిగిలినవారు, అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషేద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి.౹ *** వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవా రెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి.౹ మరియు–మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు దేశపు జనులు విశ్రాంతిదినమందు అమ్మకపు వస్తువులనేగాని భోజన పదార్థములనేగాని అమ్ముటకు తెచ్చినయెడల విశ్రాంతిదినమునగాని పరిశుద్ధ దినములలోగాని వాటిని కొనకుందుమనియు, ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి.౹ మరియు మన దేవుని మందిరపు సేవనిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి.౹ సవరింపబడిన రొట్టెవిషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహనబలి విషయములోను, విశ్రాంతిదినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థబలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.౹ మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించు కొంటిమి.౹ మరియు మా భూమియొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను, ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.౹ ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకల విధమైనవృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొద లైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొద్దకు తీసికొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.౹ లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితోకూడ ఉండ వలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి,౹ ఇశ్రాయేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వారపాలకులును గాయకులును వాటిని తీసికొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధపట్టణమగు యెరూషలేమునందు పదిమందిలో ఒకడు నివసించునట్లును, మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి.౹ యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనినవారిని జనులు దీవించిరి.౹ యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే, యూదాపట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును నెతీనీయులును సొలొమోనుయొక్క దాసుల వంశస్థులును నివాసము చేసిరి.౹ మరియు యెరూషలేములో యూదులలో కొందరును బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా, జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, యితడు షెఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు, వీడు షెఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు.౹ మరియు షిలోనికి పుట్టిన జెకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజెకు పుట్టిన బారూకు కుమారుడైన మయశేయా నివసించెను.౹ యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరును బలవంతులైన నాలుగువందల అరువది ఎనమండుగురు. బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మయశేయా ఈతీయేలు యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు.౹ అతని తరువాత గబ్బయి సల్లయి; వీరందరును తొమ్మిదివందల ఇరువది యెనమండుగురు;౹ జిఖ్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణముమీద రెండవ అధికారియైయుండెను.౹ యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదా యాయు యాకీనును శెరాయా దేవుని మందిరమునకు అధిపతియైయుండెను. ఇతడు మెషుల్లాము సాదోకు మెరాయోతు అహీటూబులను పితరుల వరుసలో హిల్కీయాకు పుట్టెను.౹ ఇంటిపని చేసినవారి సహోదరులు ఎనిమిదివందల ఇరువది యిద్దరు. మరియు పితరులైన మల్కీయా పషూరు జెకర్యా అమ్జీ పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా.౹ పెద్దలలో ప్రధాను లైన ఆ అదాయా బంధువులు రెండువందల నలువది యిద్దరు. మరియు ఇమ్మేరు మెషిల్లేమోతె అహజైయను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమష్షయి.౹ బలవంతులైనవారి బంధువులు నూట ఇరువది యెనమండుగురు. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను; ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు.౹ లేవీయులలో ఎవరనగా, షెమయా. ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యాకనిన అజ్రీ కాము కుమారుడైన హష్షూబునకు పుట్టినవాడు.౹ లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బెతైయును యోజా బాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణచేయు అధికారము పొందిరి.౹ ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు; తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతనిచేతిక్రింది వారు పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీయులందరు రెండువందల ఎనుబది నలుగురు.౹ ద్వారపాలకులైన అక్కూబు టల్మోను గుమ్మములు కాయువారును నూట డెబ్బది యిద్దరు.౹ ఇశ్రాయేలీయులలో శేషించిన యాజకులు లేవీయులు మొదలైనవారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి.౹ నెతీనీయులు ఓపెలులో నివసించిరి. జీహాయు గిష్పాయును నెతీనీయులకు ప్రధానులు.౹ యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు; ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరముయొక్క పనిమీద అధికారులు వారిని గూర్చిన విధి యేదనగా, గాయకులు వంతులప్రకారము ఒప్పందముమీద తమ పనిచేయవలెను, లేవీయులు రాజుయొక్క ఆజ్ఞనుబట్టి దినక్రమేణ జరుగు పనులు చూడవలెను.౹ మరియు యూదాదేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజబెయేలు కుమారుడగు పెతహయా జనులనుగూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను.౹ వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను యెకబ్సెయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను యేషూవలోను మెలాదాలోను బేత్పెలెతులోను హజర్షువలులోను బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను ఏన్రిమ్మోనులోను జొర్యాలోను యర్మూతులోను జానోహలోను అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయవరకు వారు నివసించిరి.౹ గెబ నివాసులగు బెన్యామీనీయులు మిక్మషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను అనాతోతులోను నోబులోను అనన్యాలోను హాసోరులోను రామాలోను గిత్తయీములోను హాదీదులోను జెబోయిములోను నెబల్లాటులోను లోదులోను పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి.౹ మరియు లేవీయుల సంబంధమైనవారిలో యూదా వంశస్థులలోనివారు బెన్యామీనీయులమధ్య భాగములు పొందిరి. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోకూడ వచ్చిన యాజకులును లేవీయులును వీరే. యేషూవ శెరాయా యిర్మీయా ఎజ్రా అమర్యా మళ్లూకు హట్టూషు [3-5] షెకన్యా రెహూము మెరేమోతు ఇద్దో గిన్నెతోను అబీయా. మీయామిను మయద్యా బిల్గా *** *** [6-7] షెమయా యోయారీబు యెదాయా సల్లూ ఆమోకు హిల్కీయా యెదాయా అనువారు. వారందరును యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి.౹ *** మరియు లేవీయులలో యేషూవ బిన్నూయి కద్మీయేలు షేరేబ్యా యూదా స్తోత్రాది సేవవిషయములో ప్రధానియైన మత్తన్యాయు అతని బంధువులును.౹ మరియు బక్బుక్యాయు ఉన్నీయును వారి బంధువులును వారికి ఎదురు వరుసలోనుండి పాడువారు.౹ యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయా దాను కనెను.౹ యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను.౹ యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైనవారు యాజకులై యుండిరి. వారెవరనగా, శెరాయా యింటివారికి మెరాయా, యిర్మీయా యింటివారికి హనన్యా ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహో హానాను మెలీకూ యింటివారికి యోనాతాను, షెబన్యా యింటివారికి యోసేపు హారిము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి ఇద్దో యింటివారికి జెకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము అబీయా యింటివారికి జిఖ్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా యింటివారికి పిల్టయి.౹ బిల్గా యింటివారికి షమ్మూయ, షెమయా యింటివారికి యెహో నాతాను యోయారీబు ఇంటివారికి మత్తెనై యెదాయా యింటివారికి ఉజ్జీ సల్లయి యింటివారికి కల్లయి ఆమోకు ఇంటివారికి ఏబెరు హిల్కీయా యింటివారికి హషబ్యా, యెదాయా యింటివారికి నెతనేలు.౹ ఎల్యాషీబు దినములలో లేవీయుల విషయములో యోయాదా యోహానాను యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడికాలములో వారే యాజకకుటుంబ ప్రధానులుగా దాఖలైరి.౹ ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినములవరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందువారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి.౹ లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు షేరేబ్యాయును కద్మీయేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతోకూడ దైవజనుడైవ దావీదుయొక్క ఆజ్ఞనుబట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి.౹ మత్తన్యా బక్బుక్యా ఓబద్యా మెషుల్లాము టల్మోను అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టులయొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి.౹ వీరు యోజాదాకునకు పుట్టిన యేషూవ కుమారుడైన యోయాకీము దినములలోను అధికారియైన నెహెమ్యాదినములలోను యాజకుడును శాస్త్రి యునగు ఎజ్రా దినములలోను ఆ పని జరువుచువచ్చిరి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూను కొనిరి అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టునున్న మైదాన భూమిలోనుండియు నెటోపాతియొక్క గ్రామములలోనుండియు కూడుకొని వచ్చిరి.౹ మరియు గిల్గాలుయొక్క యింటిలోనుండియు, గెబయొక్కయు అజ్మావెతుయొక్కయు పొలములలోనుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టును గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని యుండిరి.౹ యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్రపరచిరి.౹ అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను.౹ వారివెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగముమందియును వెళ్లిరి.౹ మరియు అజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును యూదాయు బెన్యామీనును షెమ యాయును యిర్మీయాయు అనువారు పోయిరి.౹ యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచు పోయిరి; వారెవరనగా, ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జెకర్యాయు అతని బంధువులగు షెమయా అజరేలు మిలలై గిలలై మాయి నెతనేలు యూదా హనానీ అనువారు. వీరు దైవజనుడగు దావీదుయొక్క వాద్యములను వాయించుచు పోయిరి; వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను.౹ వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మముదగ్గర దావీదుపురముయొక్క మెట్లమీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మమువరకు పోయిరి.౹ స్తోత్రగీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను, వారివెంబడి నేనును వెళ్లితిని. ప్రాకారముమీదనున్న సగముమంది కొలుముల గోపురము అవతలనుండి వెడల్పు ప్రాకారమువరకు వెళ్లిరి.౹ మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతలనుండియు, పాత గుమ్మము అవతలనుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురమునుండియు, మేయా గోపురమునుండియు, గొఱ్ఱెల గుమ్మమువరకు వెళ్లి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి.౹ ఆప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి రెండు సమూహములును నేనును, నాతోకూడ ఉన్న అధికారులలో సగముమందియు నిలిచియుంటిమి.౹ యాజకులగు ఎల్యాకీము మయశేయా మిన్యామీను మీకాయా ఎల్యోయేనై జెకర్యా హనన్యా బాకాలు పట్టుకొనిరి.౹ ఇజ్రహయా అనువాడు నడిపింపగా మయశేయా షెమయా ఎలియాజరు ఉజ్జీ యెహోహానాను మల్కీయా ఏలాము ఏజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి.౹ మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమునవారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడ సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను. ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్ఠార్పణలకును ప్రథమ ఫలములకును పదియవవంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదులమీద కొందరు నియమింపబడిరి, వారు యాజకుల కొరకును లేవీయులకొరకును ధర్మశాస్త్రాను సారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలములనుండి సమకూర్చుటకు నియమింపబడిరి; సేవచేయుటకు నియమింపబడిన యాజకులనుబట్టియు, లేవీయులనుబట్టియు యూదులు సంతోషించిరి.౹ మరియు గాయకులును ద్వారపాలకులును దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవునిగూర్చిన పనులను తమ శుద్ధినిగూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి.౹ పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రగీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు.౹ జెరుబ్బాబెలు దినములలోనేమి నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీయులందరును వారి వంతులచొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజనపదార్థములను అనుదినము ఇచ్చుచు వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతి ష్ఠించుచు వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. ఆ దినమందువారు మోషేగ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో–అమ్మోనీయులుగాని మోయాబీయులుగాని దేవునియొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు.౹ వారు అన్నపానములు తీసికొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను.౹ కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలీయులలోనుండి వెలివేసిరి. ఇంతకుముందు మన దేవుని మందిరపు గదిమీద నిర్ణ యింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబీయాతో బంధుత్వము కలుగజేసికొని నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదియవభాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద, అతనికి ఒక గొప్ప గదిని సిద్ధముచేసి యుండెను.౹ ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త యేలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్నిదినములైన తరువాత రాజునొద్ద సెలవుపుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబీయాకు ఒక గది యేర్పరచి చేసిన కీడంతయు తెలిసికొని బహుగా దుఃఖపడి ఆ గదిలోనుండి టోబీయాయొక్క సామగ్రియంతయు అవతల పారవేసి, గదులన్నియు శుభ్రముచేయుడని ఆజ్ఞాపింపగా వారాలాగు చేసిరి.౹ పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరల తెప్పించితిని.౹ మరియు లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందక పోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరని తెలిసికొని నేను అధిపతులతో పోరాడి —దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి, వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని.౹ అటు తరువాత యూదులందరును ధాన్య ద్రాక్షారసతైలములలో పదియవభాగమును ఖజానాలోనికి తెచ్చిరి.౹ నమ్మకముగల మనుష్యులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానామీద నేను కాపరులగా నియమించితిని; వారి చేతిక్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను; మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పనివారికి నియమింపబడెను.౹ నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపక ముంచుకొని, నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతిదినమున ద్రాక్షతొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతిదినమున యెరూషలేములోనికి తీసికొని వచ్చుటయు చూచి, యీ ఆహారవస్తువులను ఆ దినమున అమ్మినవారిని గద్దించితిని.౹ తూరుదేశస్థులును కాపురముండి, యెరూషలేములోను విశ్రాంతిదినములో యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి.౹ అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి–విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి మీ రెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీపితరులును ఇట్లు చేసి దేవునియొద్దనుండి మనమీదికిని యీ పట్టణస్థులమీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని.౹ మరియు విశ్రాంతిదినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతిదినము గడచువరకు వాటిని తియ్యకూడదనియు నేనాజ్ఞాపించితిని మరియు విశ్రాంతిదినమున ఏ బరువైనను లోపలికి రాకుండ గుమ్మములయొద్ద నా పనివారిలో కొందరిని కావలియుంచితిని.౹ వర్తకులును నానావిధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు యెరూషలేము అవతల బసచేసికొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని–మీరు గోడచాటున ఎందుకు బసచేసి కొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసినయెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని; అప్పటినుండి విశ్రాంతిదినమునవారు మరి రాలేదు.౹ అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతిదినమును ఆచరిం చుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, యిందునుగూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. ఆ దినములలో అష్డోదు అమ్మోను మోయాబు సంబంధు లైన స్త్రీలను వివాహము చేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి.౹ వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆయా భాషలు మాటలాడువారుగాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.౹ అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసి–మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి –ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతనివంటి రాజు లేకపోయినను, అతడు తన దేవునిచేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా నియమింపబడినను, అన్యస్త్రీలు అతనిచేత సహా పాపము చేయించలేదా? కాగా ఇంత గొప్పకీడుచేయునట్లును, మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్యస్త్రీలను వివాహము చేసికొనిన మీవంటివారి మాటలను మేము ఆలకింపవచ్చునా? అని అడిగితిని.౹ ప్రధానయాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానినిబట్టి నేను అతని నాయొద్దనుండి తరిమితిని.౹ నా దేవా, వారు యాజక ధర్మమును, యాజకధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము.౹ ఈలాగునవారు ఏ పరదేశులలోను కలియకుండ వారిని పవిత్రపరచి, ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవచేయునట్లు నియమించితిని.౹ మరియు కావలసి వచ్చినప్పుడెల్ల కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసికొని వచ్చునట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము: హిందూదేశము మొదలుకొని కూషు దేశమువరకు నూట ఇరువదియేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను.౹ ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలోనుండి రాజ్యపరిపాలన చేయుచుండగా తన యేలుబడియందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందుచేయించెను. పారసీక దేశముయొక్కయు మాద్య దేశముయొక్కయు పరాక్రమశాలులును ఘనులును సంస్థానాధిపతులును అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యముయొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు, అనగా నూట ఎనుబది దినములు కనుపరచెను.౹ ఆ దినములు గడచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందుచేయించెను.౹ అక్కడ ధవళ ధూమ్రవర్ణములుగల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభములమీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను.౹ అచ్చట కూడినవారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు, రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి.౹ ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటనుబట్టి యెవరును బలవంతము చేయలేదు; ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలెనని తన కోటపనివారికి రాజు ఆజ్ఞ నిచ్చి యుండెను.౹ రాణియైన వష్తి కూడ రాజైన అహష్వే రోషు కోటలో స్త్రీలకు ఒక విందుచేయించెను. ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతో షముగా నున్నప్పుడు, కూడివచ్చిన జనమునకును, అధిపతులకును రాణియైన వష్తియొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారముచేయు మెహూమాను బిజ్తా హర్బోనా బిగ్తా అబగ్తా జేతరు కర్కసు అను ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి.౹ రాణియైన వష్తి నపుంసకులచేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులుకొనెను.౹ విధిని రాజ్యధర్మమును ఎరిగినవారందరిచేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి–రాణియైన వష్తి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకులచేత ఇచ్చిన ఆజ్ఞప్రకారము చేయక పోయినందున ఆమెకు విధినిబట్టి చేయవలసినదేమని వారి నడిగెను.౹ అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు, రాజ్యమందు ప్రథమపీఠములమీద కూర్చుండు పారసీకులయొక్కయు మాదీయులయొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగా–కర్షెనా షెతారు అద్మాతా తర్షీషు మెరెసు మర్సెనా మెమూకాను అనువారు.౹ మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల యెదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను–రాణియైన వష్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషుయొక్క సకల సంస్థానములలోనుండు అధిపతులందరి యెడలను జనులందరియెడలను నేరస్థురాలాయెను.౹ ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణియైన వష్తిని తన సన్నిధికి పిలుచుకొని రావలెనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరు దాని విని, ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు.౹ మరియు పారసీకులయొక్కయు మాదీయులయొక్కయు నాయకపత్నులు రాణి చేసినదాని సమాచారము విని, రాణి పలికినట్లు ఈ దినమందు రాజుయొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును.౹ రాజునకు సమ్మతి ఆయెనా వష్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమయొద్దనుండి యొక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకులయొక్కయు మాదీయులయొక్కయు న్యాయముచొప్పున నియమింపవలెను. మరియు వష్తికంటె యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను.౹ మరియు రాజుచేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతట ప్రకటించినయెడల, ఘను రాలుగాని అల్పురాలుగాని స్త్రీలందరు తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను.౹ ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను.౹ ప్రతి పురుషుడు తన యింటిలో అధికారిగా నుండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాషననుసరించి తన యింటివారితో మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాతప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషుయొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని ఆమె చేసినదానిని ఆమెకు నిర్ణయింపబడినదానిని తలంచగా యౌవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి–అందమైన కన్యకలను రాజుకొరకు వెదకనగును,౹ అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరిని సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజుయొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యముయొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధికొరకు సుగంధద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వష్తికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయెను గనుక అతడు ఆలాగు జరిగించెను. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దకై అను ఒక యూదుడుండెను.౹ బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను పట్టుకొనిపోయినప్పుడు ఇతడు యెకోన్యాతోకూడ యెరూషలేము నుండి చెరపట్టబడినవారిలో ఒకడు.౹ తన పినతండ్రి కుమార్తెయైన హదస్సా అను ఎస్తేరు తలిదండ్రులు లేనిదై యుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమునుగలదై యుండెను. ఆమె తలిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను.౹ రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురముచేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగుచేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజుయొక్క నగరునకు తేబడి, స్త్రీలను కాయు హేగేవశమునకు అప్పగింపబడెను.౹ ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనివలన దయపొందెను; కాబట్టి ఆమె పరిమళక్రియలకొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజనపదార్థములను, రాజు ఇంటిలోనుండి ఆమెకు ఇయ్యదగిన యేడుగురు ఆడుపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్ఠమైన స్థలమందుంచెను.౹ మొర్దకై–నీ జాతిని నీ వంశమును కనుపరచ కూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు.౹ ఎస్తేరు ఏలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలిసికొనుటకై అంతఃపురముయొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దకై తిరుగులాడు చుండెను.౹ ఆరుమాసములు గోపరస తైలముతోను, ఆరు మాసములు సుగంధవర్గములతోను, స్త్రీల పరిమళక్రియలకొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళక్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. పండ్రెండు మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్లుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చి నప్పుడు ఒక్కొక చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను, ఏమనగా ఆ తీరునవారు పరిమళక్రియలు చేయుకాలము సంపూర్ణమగుచుండెను.౹ మరియు అంతఃపురములోనుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె యేమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుటకద్దు.౹ సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజుయొక్క షండుడైన షయష్గజు అను అతని వశములోనున్న రెండవ అంతఃపురమునకు తిరిగివచ్చును. ఆమెయందు రాజు సంతోషించి ఆమెను పేరుపెట్టి పిలిచితేనేగాని ఆమె రాజు నొద్దకు మరల వెళ్లకుండెను.౹ మొర్దకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రియైన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్లుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజుయొక్క షండుడైన హేగే నిర్ణ యించిన అలంకారముగాక ఆమె మరి ఏమియు కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికి ఆమెయందు దయపుట్టెను.౹ ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు ఏడవ సంవత్సరమున టెబేతు అను పదియవ నెలలో రాజ నగరులోనికి అతనియొద్దకు పోగా స్త్రీలందరికంటె రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటె ఆమె అతనివలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్యకిరీటమును ఆమె తలమీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించెను.౹ అప్పుడు రాజు తన అధిపతులకందరికిని సేవకులకందరికిని ఎస్తేరు విషయమై యొక గొప్పవిందుచేయించి, సంస్థానములలో సెలవుదినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను.౹ రెండవమారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దకై రాజు గుమ్మములో కూర్చుని యుండెను.౹ ఎస్తేరు మొర్దకైయొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక యుండెను.౹ ఆ దినములలో మొర్దకై రాజు గుమ్మములో కూర్చుని యుండగా రాజుయొక్క యిద్దరు షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలో చించుకొని యుండిరి.౹ ఈ సంగతి మొర్దకైకి తెలియబడి నందున అతడు దానిని రాణియైన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దకై పేరట రాజునకు దాని తెలియ జేసెను.౹ ఈ సంగతినిగూర్చి విచారణకాగా అది నిజ మాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడెను. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరచి వాని హెచ్చించి, వాని పీఠమును తన దగ్గర నున్న అధిపతులందరికంటె ఎత్తుగా నుంచెను.౹ కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరును రాజాజ్ఞాను సారముగా మోకాళ్లూని హామానునకు నమస్కరించిరి. మొర్దకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు–నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దకైని అడిగిరి.౹ ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయెను గనుక వారు–మొర్దకైయొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు–నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి యుండెను.౹ మొర్దకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని యెంచి, మొర్దకైయొక్క జనులు ఎవరైనది తెలిసికొని, అహష్వేరోషుయొక్క రాజ్యమందంతటనుండు మొర్దకై స్వజనులగు యూదులనందరిని సంహరించుటకు ఆలో చించెను.౹ రాజైన అహష్వేరోషుయొక్క యేలుబడియందు పండ్రెండవ సంవత్సరమున నీసాను మాసమున, అనగా ప్రథమమాసమునవారు హామాను ఎదుట పూరు, అనగా చీటిని దినదినమునకును నెల నెలకును అదారు అను పండ్రెండవనెలవరకు వేయుచు వచ్చిరి.౹ అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా —మీ రాజ్య సంస్థా నములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరి యున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజుయొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు.౹ రాజునకు సమ్మతియైతే వారు హతము చేయబడునట్లును, నేను ఆ పనిచేయువారికి ఇరువదివేల మణుగుల వెండిని రాజుయొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును, చట్టము పుట్టించుమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామానున కిచ్చి –ఆ వెండి నీకియ్య బడియున్నది; నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి యున్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు.౹ మొదటి నెల పదమూడవ దినమందు రాజుయొక్క లేఖికులు పిలువబడిరి; హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానములమీద నుంచ బడిన రాజుయొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములలోని జనములమీద నుంచబడిన అధిపతులకును అధికారులకును, వారి వారి లిపినిబట్టియు, ఆయా జనములభాషనుబట్టియు, రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికులచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను.౹ అదారు అను పండ్రెండవనెల పదమూడవ దినమందు యౌవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరిని ఒక్కదినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారిచేత రాజ్య సంస్థానములన్నిటికిని పంపబడెను.౹ మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను.౹ అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్లిరి. ఆయాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను, దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి. జరిగినదంతయు తెలియగానే మొర్దకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహా శోకముతో రోద నముచేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను; గోనె కట్టుకొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు.౹ రాజుయొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాస ముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగినవారైరి, అనేకులు గోనెను బూడిదెను వేసికొని పడియుండిరి.౹ ఎస్తేరుయొక్క పనికత్తెలును ఆమెదగ్గరనున్న షండులును వచ్చి జరిగినదాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై–మొర్దకై కట్టుకొని యున్న గోనెపట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి, కట్టించు కొనుటకై అతనియొద్దకు వస్త్రములు పంపెనుగాని అతడు వాటిని తీసికొనలేదు.౹ అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి యుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి–అది ఏమియైనది, ఎందుకైనది తెలిసి కొనుటకు మొర్దకైయొద్దకు వెళ్లుమని ఆజ్ఞ నిచ్చెను.౹ హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొర్దకైయొద్దకు పోగా మొర్దకై తనకు సంభవించిన దంతయు, యూదులను నాశనము చేయుటకుగాను హామాను వారినిబట్టి రాజు ఖజానాకు తూచి యిచ్చెదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత యనియును అతనికి తెలిపి –వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతనియొద్దకు పోవలెనని చెప్పుమనియు దాని నతని కిచ్చెను. హతాకు వచ్చి మొర్దకైయొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను.౹ అంతట ఎస్తేరు మొర్దకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చిన దేమనగా [10-11] —పిలువబడక పురుషుడేగాని స్త్రీయేగాని రాజుయొక్క అంతర్గృహమున ప్రవేశించినయెడల బ్రదుకునట్లుగా రాజు తన బంగారపుదండమును ఎవరితట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికిని అతని సంస్థానములలోనున్న జనులకందరికిని తెలిసే యున్నది. నేటికి ముప్పది దినములనుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను.౹ *** వారు ఎస్తేరుయొక్క మాటలు మొర్దకైకి తెలుపగా మొర్దకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తర మిచ్చి— రాజ నగరులో ఉన్నంతమాత్రముచేత యూదులందరికంటె నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు;౹ నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్నయెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు. నీవు ఈ సమయమునుబట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను.౹ అప్పుడు ఎస్తేరు మొర్దకైతో మరల ఇట్లనెను.౹ –నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని సమాజమందిరమునకు సమకూర్చి, నా నిమిత్తము ఉపవాసముండి మూడుదినములు అన్నపానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను.౹ అటువలెనే మొర్దకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన యంతటి ప్రకారముగా జరిగించెను. మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, రాజునగరుయొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనముమీద రాజు కూర్చుని యుండెను.౹ రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండముయొక్క కొన ముట్టెను.౹ రాజు — రాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకను గ్రహించెదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినయెడల నేను రాజుకొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను.౹ ఎస్తేరు మాటప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవియ్యగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి.౹ రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక యేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? అది రాజ్యములో సగముమట్టుకైనను చేయబడునని చెప్పగా ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను— రాజవైన తమ దృష్టికి నా యెడల దయకలిగి నా మనవి చొప్పునను నా కోరికచొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును; ఇదే నా మనవియు నా కోరికయుననెను.౹ ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసముగలవాడై బయలువెళ్లి, రాజుగుమ్మముననుండు మొర్దకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దకైమీద బహుగా కోపగించెను.౹ అయితే హామాను కోపము అణచుకొని తన యింటికిపోయి తన స్నేహితులను తన భార్యయైన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమునుగూర్చియు, చాలామంది పిల్లలు తనకుండుటనుగూర్చియు, రాజు తన్ను ఘనపరచి రాజు క్రిందనుండు అధిపతులమీదను సేవకులమీదను తన్ను ఏలాగున పెద్దగాచేసెనో దానిని గూర్చియు వారితో మాటలాడెను.౹ మరియు అతడు–రాణియైన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి యెవనిని పిలిపించలేదు, రేపటి దినమున కూడ రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను.౹ అయితే యూదుడైన మొర్దకై రాజుగుమ్మమున కూర్చునియుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటివలన నాకు ప్రయోజన మేమియు లేదని అతడు చెప్పగా అతని భార్యయైన జెరెషును అతని స్నేహితులందరును–ఏబది మూరల ఎత్తుగల యొక ఉరికొయ్య చేయించుము; దాని మీద మొర్దకై ఉరితీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము; తరువాత నీవు సంతోషముగా రాజుతోకూడ విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య యొకటి సిద్ధము చేయించెను. ఆ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను.౹ ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు అను రాజుయొక్క యిద్దరు నపుంసకులురాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దకై తెలిపినట్టు అందులో వ్రాయబడి యుండెను.౹ రాజు ఆ సంగతి విని–ఇందు నిమిత్తము మొర్దకైకి బహుమతి యేదై నను ఘనత యేదైనను చేయబడెనా అని యడుగగా రాజు సేవకులు–అతనికేమియు చేయబడలేదని ప్రత్యుత్తర మిచ్చిరి.౹ అప్పుడు–ఆవరణములో ఎవరో యున్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్యమీద మొర్దకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరుయొక్క ఆవరణములోనికి వచ్చియుండెను.౹ రాజ సేవకులు–ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణములో నిలువబడియున్నాడని రాజుతో చెప్పగా రాజు–అతని రానియ్యుడని సెలవిచ్చి నందున హామాను లోపలికి వచ్చెను.౹ –రాజు ఘనపరచ నపేక్షించువానికి ఏమిచేయవలెనని రాజు అతని నడుగగా హామాను–నన్ను గాక మరి ఎవరిని రాజు ఘనపరచ నపే క్షించునని తనలో తాననుకొని రాజుతో ఇట్లనెను –రాజు ఘనపరచ నపేక్షించువానికి చేయ తగినదేమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు ఎక్కు గుఱ్ఱమును రాజు తన తలమీద ఉంచుకొను రాజకిరీటమును ఒకడు తీసికొని రాగా ఘనులైన రాజుయొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును పట్టుకొని, రాజు ఘనపరచ నపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింప జేసి ఆ గుఱ్ఱముమీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు–రాజు ఘనపరచ నపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతనిముందర చాటింపవలెను.౹ అందుకు రాజు–నీవు చెప్పినప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును తీసికొని, రాజు గుమ్మమునొద్ద కూర్చునియున్న యూదుడైన మొర్దకైకి ఆలాగుననే చేయుము; నీవు చెప్పినదానిలో ఒకటియు విడువక అంతయు చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను.౹ ఆప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును తీసికొని, మొర్దకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుఱ్ఱము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు, రాజు ఘనపరచ నపేక్షించువానికి ఈ ప్రకారము చేయ తగునని అతనిముందర చాటించెను.౹ తరువాత మొర్దకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను; అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన యింటికి త్వరగా వెళ్లి పోయెను.౹ హామాను తనకు సంభవించినదంతయు తన భార్యయైన జెరెషుకును తన స్నేహితులకందరికిని తెలు పగా, అతనియొద్దనున్న జ్ఞానులును అతని భార్యయైన జెరెషును–ఎవనిచేత నీకు అధికారనష్టము కలుగుచున్నదో ఆ మొర్దకై యూదుల వంశపువాడైనయెడల అతనిమీద నీకు జయము కలుగదు, అతనిచేత అవశ్యముగా చెడి పోదువని ఆతనితో అనిరి.౹ వారు ఇంక మాటలాడుచుండగా రాజుయొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి. రాజును హామానును రాణియైన ఎస్తేరునొద్దకు విందునకు రాగా రాజు–ఎస్తేరు రాణీ, నీ విజ్ఞాపన మేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? రాజ్యములో సగముమట్టుకైనను నీకనుగ్రహించెదనని రెండవ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణియైన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను —రాజా, నీ దృష్టికి నేను దయపొందినదాననైనయెడల రాజవైన తమకు సమ్మతియైతే, నా విజ్ఞాపననుబట్టి నా ప్రాణమును, నా మనవినిబట్టి నా జనులును, నా కనుగ్ర హింపబడుదురు గాక.౹ సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును, నేనును నా జనులును కూడ అమ్మబడినవారము. మేము దాసులముగాను దాసు రాండ్రముగాను అమ్మబడినయెడల నేను మౌనముగా నుందును; ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు.౹ అందుకు రాజైన అహష్వేరోషు–ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరచుకొన్నవాడెవడు? వాడేడి? అని రాణియగు ఎస్తేరు నడుగగా ఎస్తేరు–మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన యీ హామానే అనెను. అంతట హామాను రాజు ఎదుటను రాణి యెదుటను భయాక్రాంతుడాయెను.౹ రాజు ఆగ్రహమొంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హానిచేయనుద్దేశించెనని హామాను తెలిసికొని, రాణియైన ఎస్తేరు ఎదుట తన ప్రాణముకొరకు విన్నపము చేయుటకై నిలిచెను.౹ నగరు వనములోనుండి ద్రాక్షారసపు విందుస్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండియున్న శయ్యమీద హామాను బడియుండుట చూచి–వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా? అని చెప్పెను; ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుకు వేసిరి.౹ రాజు ముందరనుండు షండులలో హర్బోనా అనునొకడు–ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తు గల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడి యున్న దనగా రాజు–దానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను.౹ కాగా హామాను మొర్దకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజుయొక్క ఆగ్రహము చల్లారెను. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణియైన ఎస్తేరున కిచ్చెను. ఎస్తేరు మొర్దకై తనకు ఏమి కావలెనో రాజునకు తెలియ జేసినమీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలోనుండి తీసికొనిన తన ఉంగరమును మొర్దకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను.౹ మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసికొని, అతని పాదములమీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరుతట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి — రాజవైన తమకు సమ్మతియైనయెడలను, తమ దృష్టికి నేను దయపొందినదాననై రాజవైన తమ యెదుట ఈ సంగతి యుక్తముగా తోచినయెడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాననైనయెడలను, రాజవైన తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనముచేయవలెనని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులచొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి.౹ నా జనులమీదికి రాబోవు కీడును, నా వంశముయొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింపగలనని మనవిచేయగా రాజైన అహష్వేరోషు రాణియైన ఎస్తేరునకును యూదుడైన మొర్దకైకిని ఈలాగు సెలవిచ్చెను–హామాను ఇంటిని ఎస్తేరున కిచ్చియున్నాను; అతడు యూదులను హతముచేయుటకు ప్రయత్నించి నందున అతడు ఉరికొయ్యమీద ఉరితీయబడెను.౹ అయితే రాజుపేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింప బడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు; కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాని ముద్రించుడి. సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; మొర్దకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని కూషుదేశమువరకు వ్యాపించియున్న నూట ఇరువదియేడు సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.౹ రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుఱ్ఱములమీద, అనగా రాజనగరుపనికి పెంచబడిన బీజాశ్వములమీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీ దులను వారిచేత పంపెను.౹ రాజైన అహష్వేరోషుయొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా అదారు అను పండ్రెండవనెల పదమూడవ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని, తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలోనుండి తమకు విరోధులగు జనుల సైనికులనందరిని, శిశువులను స్త్రీలను కూడ, సంహరించి హతముచేసి నిర్మూల పరచి వారి వస్తువులను కొల్లపట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దానియందు వ్రాయబడెను.౹ మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములలోని జనులకందరికి పంపించవలెననియు, యూదులు తమ శత్రువులమీద పగతీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలెననియు ఆజ్ఞ ఇయ్యబడెను.౹ రాజ నగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద నెక్కిన అంచె గాండ్రు రాజు మాటవలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను.౹ అప్పుడు మొర్దకై ఊదావర్ణమును తెలుపువర్ణమునుగల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజుసముఖమునుండి బయలుదేరెను; అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోష మొందెను.౹ మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను.౹ రాజుచేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను, అది శుభదినమని విందుచేసికొనిరి. మరియు దేశజనులలో యూదులయెడల భయముకలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పండ్రెండవనెల పదమూడవదినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను.౹ యూదులురాజైన అహష్వేరోషుయొక్క సంస్థానములన్నిటిలో నుండు పట్టణములయందు తమకు కీడుచేయవలెనని చూచినవారిని హతముచేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలువలేకపోయిరి.౹ మొర్దకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానములయొక్క అధిపతులును అధికారులును ప్రభువులును రాజు పని నడిపించువారును యూదులకు సహాయముచేసిరి.౹ మొర్దకై రాజుయొక్క నగరులో గొప్పవాడాయెను. ఈ మొర్దకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుటచేత అతని కీర్తి సంస్థానములన్నిటియందు వ్యాపించెను.౹ యూదులు తమ శత్రువులనందరిని కత్తివాత హతముచేసి వారిని నాశనముచేసి మనస్సు తీర తమ విరోధులకు చేసిరి.౹ షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనముచేసిరి.౹ హమ్మెదాతా కుమారుడై యూదులకు శత్రువగు హామానుయొక్క పదిమంది కుమారులైన పర్షందాతా దల్పోను అస్పాతా పోరాతా అదల్యా అరీదాతా పర్మష్తా అరీసై అరీదై వైజాతా అను వారిని చంపిరి; అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు.౹ ఆ దినమున షూషను కోటయందు చంపబడినవారి లెక్క రాజునకు తెలియ జెప్పగా రాజు రాణియైన ఎస్తేరుతో–యూదులు షూషను కోటయందు ఐదువందలమందిని హామానుయొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు; రాజుయొక్క కొదువ సంస్థానములలో వారు ఏమిచేసి యుందురో; ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకనుగ్ర హింపబడును, నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడునని సెలవియ్యగా ఎస్తేరు–రాజవైన తమకు సమ్మతమైనయెడల ఈ దినము జరిగిన చొప్పున షూషనునందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామానుయొక్క పదిమంది కుమారులు ఉరికొయ్యమీద ఉరితీయింపబడునట్లుగాను సెలవియ్యుడనెను.౹ ఆలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను; హామానుయొక్క పదిమంది కుమారులు ఉరి తీయింపబడిరి.౹ షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు.౹ రాజు సంస్థానములయందుండు తక్కిన యూదులు కూడుకొని, తమ ప్రాణములను రక్షించు కొనుటకై పూనుకొని అదారు మాసము పదమూడవ దినమందు తమ విరోధులలో డెబ్బది యయిదువేలమందిని చంపివేసి, తమ పగవారివలన బాధలేకుండ నెమ్మదిపొందిరి; అయితే వారును కొల్లసొమ్ముపట్టుకొనలేదు.౹ పదునాలుగవ దినమందును వారు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతో షముగా నుండిరి.౹ షూషనునందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదునాలుగవ దినమందును కూడుకొని పదునైదవ దినమందు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతోషముగా నుండిరి.౹ కాబట్టి ప్రాకారములులేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసు లైన యూదులు అదారు మాసము పదునాలుగవ దినమందు సంతోషముగానుండి–అది విందుచేయదగిన శుభదినమను కొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి. మొర్దకై యీ సంగతులనుగూర్చి రాజైన అహష్వే రోషుయొక్క సంస్థానములన్నిటికి సమీపముననేమి దూరముననేమి నివసించియున్న యూదులకందరికి పత్రికలను పంపి –యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదిన మనియు, ప్రతి సంవత్సరము అదారు నెలయొక్క పదు నాలుగవదినమును పదునైదవ దినమును వారు ఆచరించుకొనుచు విందుచేసికొనుచు సంతోషముగానుండి ఒకరి కొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను, పంప తగిన దినములనియు వారికి స్థిరపరచెను.౹ అప్పుడు యూదులు తాము ఆరంభించినదానిని మొర్దకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని యొప్పుకొనిరి.౹ యూదులకు శత్రువగు హమ్మెదాతా కుమారుడైన అగా గీయుడగు హామాను యూదులను సంహరింప దలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెనని, పూరు, అనగా చీటి, వేయించియుండగా ఎస్తేరు, రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తల పెట్టిన చెడుయోచన తన తలమీదికే వచ్చునట్లుగా చేసి,వాడును వాని కుమారులును ఉరికొయ్యమీద ఉరితీయబడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను.౹ కావున ఆ దినములు పూరు అను పేరునుబట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటినిబట్టియు, ఈ సంగతినిబట్టియు, తాము చూచినదానినంతటినిబట్టియు తమమీదికి వచ్చినదానినిబట్టియు యూదులు ఈ రెండు దినములనుగూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమునుబట్టి వాటిని ఆచరించెదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడునట్లుగా ఆచరించెదమనియు,౹ పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు, తమ సంతతివారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని, ఆ సంగతిని మరచి పోకుండునట్లు, తమమీదను, తమ సంతతివారిమీదను, తమతో కలిసికొనిన వారిమీదను ఇది యొక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి.౹ అప్పుడు పూరీమునుగూర్చి వ్రాయబడిన యీ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దకైయును ఖండితముగా వ్రాయించిరి.౹ మరియు యూదుడైన మొర్దకైయును రాణియైన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానినిబట్టి వారు ఉపవాస విలాపకాలములు ఏర్పరచుకొని, అది తమమీదను తమ వంశపు వారిమీదను ఒక బాధ్యతయని యెంచుకొని వాటిని జరిగించెదమని యొప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీము అను పండుగదినములను స్థిరపరచుటకు అతడు అహష్వే రోషుయొక్క రాజ్యమందుండు నూట ఇరువదియేడు సంస్థానములలోనున్న యూదులకందరికి వారి క్షేమము కోరునట్టియు, విశ్వాసార్థములగునట్టియు మాటలుగల పత్రికలు పంపెను.౹ ఈలాగున ఎస్తేరుయొక్క ఆజ్ఞచేత ఈ పూరీముయొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములును పన్ను చెల్లింప నిర్ణయించెను.౹ మొర్దకైయొక్క బలమునుగూర్చియు, అతడు సామర్థ్యముచేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు, రాజు అతనిని ఘనపరచిన సంగతిని గూర్చియు మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ యూదుడైన మొర్దకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగానుండి, తనవారందరితో సమాధానముగా మాటలాడుచు, తన జనులయొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి. అతనికి ఏడువేల గొఱ్ఱెలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమతమ యిండ్లలో విందుచేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి వారి విందుదినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా–నీవు ఎక్కడనుండి వచ్చితివని వానినడుగగా అపవాది–భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తర మిచ్చెను. అందుకు యెహోవా–నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు అని అడుగగా అపవాది–యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతనిచేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా యెహోవా–ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికిమాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను. ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానముచేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి –ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీదపడి వాటిని పట్టుకొనిపోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి–దేవుని అగ్ని ఆకా శమునుండి పడి గొఱ్ఱెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి–కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీదపడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి— నీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానముచేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది యౌవనులమీద పడినందునవారు చనిపోయిరి; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను –నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా, వారితోకూడ అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా —నీవు ఎక్కడనుండి వచ్చితివని వానినడుగగా అపవాది —భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా–నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతు డునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా అపవాది–చర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను. అందుకు యెహోవా–అతడు నీ వశముననున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్లు గోకుకొనుటకై చిల్లపెంకు తీసికొని బూడిదెలో కూర్చుండగా అతని భార్య వచ్చి–నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు–మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటిమాటతోనైనను పాపము చేయలేదు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమతమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు, అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశముతట్టు తలలమీద ధూళి చల్లుకొని యెలుగెత్తి యేడ్చిరి. అతని బాధ అత్యధికముగానుండెనని గ్రహించి యెవరును అతనితో ఒక్క మాటయైనను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితోకూడ నేలను కూర్చుండిరి. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఈలాగు అనెను— నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక. ఆ దినము అంధకారమగును గాక పైనుండి దేవుడు దాని నెంచకుండును గాక వెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసికొనును గాక. మేఘము దాని కమ్మును గాక పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదరించును గాక అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక సంవత్సరపు దినములలో నేనొకదాననని అది హర్షింపకుండును గాక మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక ఆ రాత్రి యెవడును జననము కాకపోవును గాక దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక దినములు అశుభదినములని చెప్పువారు దానిని శపించుదురు గాక భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురు గాక. అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాక వెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు లేకపోవును గాక అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక పుట్టుకలోనే నేనేల చావకపోతిని? గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువక పోతిని? మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి? నేనేల స్తనములను కుడిచితిని? లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందును నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును తమకొరకు బీడుభూములయందు భవనములు కట్టించు కొనిన భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించియుందును. బంగారము సంపాదించి తమ యిండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును. అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటి వాడనై లేకపోయి యుందును. వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయి యుందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు విశ్రాంతినొందుదురు బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు అల్పులేమి ఘనులేమి అందరు నచ్చటనున్నారు దాసులు తమ యజమానుల వశమునుండి తప్పించుకొని స్వతంత్రులై యున్నారు. దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల? దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల? వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారుగాని అదివారికి దొరకక యున్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల? భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను— ఎవడైన ఈ సంగతి యెత్తి నీతో మాటలాడినయెడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు. నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను. క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడు ఎప్పుడైన నశించెనా? యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా? నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. దేవుడు ఊదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసమువలనవారు లేక పోవుదురు. సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలును విరిగిపోవును. ఎర లేనందున ఆడుసింహము నశించును సింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును. నా కొకమాట రహస్యముగా తెలుపబడెను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢనిద్ర మనుష్యులకు వచ్చుసమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెను మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని ఏమనగా–దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా? తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు. జిగటమంటి యిండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును? ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురు ఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు. వారి డేరాత్రాడు తెగవేయబడునువారు బుద్ధికలుగకయే మృతినొందుదురు. ఆలాగుననే జరుగుచున్నది గదా. నీవు మొరలిడినయెడల నీకు ఉత్తరమీయగలవాడెవడైన నుండునా? పరిశుద్ధదూతలలో ఎవనితట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలన మూఢులు నశించెదరు బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు. మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను అయినను తోడనే అతని నివాసస్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు గుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు. ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురు ముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురు బోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి శ్రమ ధూళిలోనుండి పుట్టదు. బాధ భూమిలోనుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవము నకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని నాశ్రయించుదును. దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమిమీద వర్షము కురిపించువాడు పొలములమీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నతస్థలములలో నుంచును దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండ ఆయన వారి ఉపాయములను భంగపరచును జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును పగటివేళ వారికి అంధకారము తారసిల్లును రాత్రి ఒకడు తడవులాడునట్లు మధ్యాహ్నకాలమునవారు తడవులాడుదురు బలాఢ్యుల నోటి ఖడ్గమునుండి, వారి చేతిలోనుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసికొనును. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థ పరచును. ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణమునుండియు యుద్ధమున ఖడ్గ బలమునుండియు ఆయన నిన్ను తప్పించును. నోటిమాటలచేత కలుగు నొప్పి నీకు తగులకుండ ఆయన నిన్ను చాటుచేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసికొని యుందువు అడవిమృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు అడవిమృగములకు నీవు ఏమాత్రమును భయపడవు నీ డేరా క్షేమనివాసమని నీకు తెలిసియుండును నీ యింటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి యుండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబికులు భూమిమీద పచ్చికవలె విస్తరించుదు రనియు నీకు తెలియును. వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు పూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది ఆలాగే యున్నది. ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను— నా దుఃఖము చక్కగా తూచబడును గాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల ఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నది దేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా? ఎద్దు మేత చూచి రంకెవేయునా? ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డు లోని తెలుపులో రుచికలదా? నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను. ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక నేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొన కుండ లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల? నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల? నా బలము రాళ్ల బలమువంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ యేమియు లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా. క్రుంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడనివారైరి. మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును వేసవి రాగానే అవి మాయమై పోవును వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియు లేకుండ అవి యింకిపోవును. సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు షేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలె మీరు లేనట్టుగానే యున్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. –ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా? పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా? బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడని యడిగితినా? నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదమని మీరనుకొందురా? నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా. మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు, మీ స్నేహితులమీద బేరము సాగింతురు. దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయములేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును. నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా? భూమిమీద నరుల కాలము యుద్ధకాలము కాదా?వారి దినములు కూలివాని దినములవంటివి కావా? నీడను మిగుల నపేక్షించు దాసునివలెను కూలినిమిత్తము కనిపెట్టుకొను కూలివానివలెను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసివచ్చెను. ఆయాసముతోకూడిన రాత్రులు నాకు నియమింపబడియున్నవి. నేను పండుకొనునప్పుడెల్ల –ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా? అని యనుకొందును. తెల్లవారువరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్ప బడియున్నది. నా చర్మము మాని మరల పగులుచున్నది. నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు. నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు. నీ కన్నులు నాతట్టు చూచునుగాని నేనుండక పోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునురాడు అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు. కావున నేను నా నోరు మూసికొనను నా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదను నా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను. నేనొక సముద్రమునా? సముద్రములోని భుజంగ మునా? నీవెందుకు నా మీద కావలియుంచెదవు? –నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేననుకొనగా నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవు దర్శనములవలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నాను ఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము. అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదు నా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు. మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల? ప్రతి పగలు నీవతని దర్శింపనేల? ప్రతి క్షణమున నీవతని శోధింపనేల? ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ యెడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురి పెట్టితివి? నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు? నేనిప్పుడు మంటిలో పండుకొనెదను నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవుగాని నేను లేక పోయెదను. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను –ఎంత కాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను. దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టియెదుట పాపముచేసి రేమో కావుననే వారు చేసిన తిరుగుబాటునుబట్టి ఆయనవారిని అప్పగించెనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు భూమిమీద మన దినములు నీడవలె నున్నవి. మునుపటి తరమువారి సంగతులు విచారించుమువారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసికొనుము. వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపుదురు గదావారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా. బురదలేకుండ జమ్ము పెరుగునా? నీళ్లులేకుండ రెల్లు మొలచునా? అది కోయబడకముందు బహు పచ్చగానున్నది కాని యితర మొక్కలన్నిటికంటె త్వరగా వాడిపోవును. దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును భక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే. అతడు తన యింటిమీద ఆనుకొనగా అది నిలువదు. అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపెట్టి బలియును అతని తీగెలు అతని తోటమీద అల్లుకొనును. అతని వేళ్లు గట్టుమీద చుట్టుకొనును రాళ్లుగల తన నివాసమును అతడు తేరిచూచును. దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టిన యెడల అది–నేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడ లేదనును. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళినుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసి వేయడు. ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు దుష్టుల గుడారము ఇక నిలువకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగజేయును. ప్రహర్షముతో నీ పెదవులను నింపును. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను –వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును. నరుడు దేవునిదృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడల వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు? వాటికి తెలియకుండ పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రతకలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే భూమిని దాని స్థలములోనుండి కదలించువాడు ఆయనే దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచు వాడు సముద్రతరంగములమీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్రరాసులను చేసినవాడు. ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయనచేయు చున్నాడు. ఇదిగో ఆయన నా సమీపముగ గడచిపోవుచున్నాడు గాని నేనాయనను కనుగొనలేను నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవా డెవడు? –నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవా డెవడు? దేవుని కోపము చల్లారదు రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకు టకు నేనేపాటివాడను? నేను నిర్దోషినైయుండినను ఆయనకు ప్రత్యుత్త రము చెప్పజాలను న్యాయకర్తయని నేనాయనను బతిమాలుకొనదగును. నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడు నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయు చున్నాడు ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా–నేనే యున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా–ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని ఆయన యనును? నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును నేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదు నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే. కావున–యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూలధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును. భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నదివారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును. ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరి ఎవడు? పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగా గతించుచున్నవి క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును ఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును. –నా శ్రమను మరచిపోయెదననియు దుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగా నుండెదననియు నేను అనుకొంటినా? నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగియున్నాను నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల? నేను హిమముతో నన్ను కడుగుకొనినను సబ్బుతో నా చేతులు కడుగుకొనినను నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును. ఆయన నావలె నరుడు కాడు నేను ఆయనతో వ్యాజ్యెమాడజాలను మేము కలిసి న్యాయవిమర్శకు పోలేము. మా యిద్దరిమీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు. ఆయన తన దండమును నామీదనుండి తీసివేయ వలెను నేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహా త్మ్యమును నాకు కనుపరచకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను, ఏలయనగా నేను అట్టివాడను కాననుకొను చున్నాను. నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డులేకుండ అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను నా మీద నేరము మోపకుండుము నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయాదృష్టియుంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రములవంటివా? నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించు వాడవా? నీ జీవితకాలము నరుల జీవిత కాలమువంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? నేను దోషిని కాననియు నీ చేతిలోనుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు ఎరిగియుండియు నీవేల నా దోషమునుగూర్చి విచారణచేయు చున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణముచేసి నన్ను రూపించియున్నను నీవు నన్ను మ్రింగివేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుము నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా? ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివిగదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేర బెట్టితివి గదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయ ములో ఆలోచించితివి ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును. నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువు నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధ కలుగును నేను నిర్దోషినైయుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను సంతోషించినయెడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు ఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు ఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు. గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి? అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము విడిచి యుండినయెడల మేలు; అప్పుడు నేను లేనట్లే యుండియుందును గర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును. నా దినములు కొంచెమే గదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు అంధకారము మరణాంధకారముగల దేశమునకు కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను— ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా? నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండవలెనా? ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యము చేయుదువా? –నా ఉపదేశము నిర్దోషమనియు దేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే. దేవుడు నీతో మాటలాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలిసికొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయి యున్నాడని తెలిసికొనుము. దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా? సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగు దువు? దాని పరిమాణము భూమికంటె అధికమైనది దాని వెడల్పు సముద్రముకంటె అధికమైనది ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యెమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింప గలవాడెవడు? పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదా పరిశీలనచేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలిసికొనును గదా. అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని బుద్ధిహీనుడు వివేకికాడు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడల నీచేతులు ఆయనవైపు చాపినయెడల పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దాని విడిచినయెడల నీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినయెడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లు నీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు. అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ యింటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండు కొందువు. ఎవరి భయములేకుండ నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవునువారికి ఆశ్రయమేమియు ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు చూచుచుందురు. అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తర. మిచ్చెను— నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును. అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగి యున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసివచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పద ముగా నుండవలసి వచ్చెను. దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమనుకొందురు. కాలుజారువారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురువారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు. అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియ జేయును. భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు బోధించును సముద్రములోని చేపలును నీకు దాని వివరించును వీటి అన్నిటినిబట్టి యోచించుకొనినయెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొన లేనివాడెవడు? జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా. అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా? వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరల కట్టజాలరు ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు. ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచి వేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావలక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు. ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును. రాజుల అధికారమును ఆయన కొట్టివేయునువారి నడుములకు గొలుసులు కట్టును. యాజకులను వస్త్రహీనులనుగాచేసి వారిని తోడుకొనిపోవును స్థిరముగా నాటుకొనినవారిని ఆయన పడగొట్టును. వాక్చాతుర్యముగలవారి పలుకును ఆయన నిరర్థకము చేయును పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును. అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును జనములను విస్తరింపజేయును నిర్మూలముచేయును సరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థక పరచును త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును. వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు మత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూల చేయును. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను. నా చెవి దాని విని గ్రహించియున్నది మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది నేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను. నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరు చున్నాను దేవునితోనే వాదింప గోరుచున్నాను మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరు పనికిమాలిన వైద్యులు. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును. దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెము నాలకించుడి. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదనచేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయనయెడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు ఆయనను మోసముచేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు. మీ వాదములు మంటివాదములు నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడి నామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను? చేసికొననుగాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును. ఇదియు నాకు రక్షణార్థమైనదగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు. నా వాఙ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొర నీయుడి. ఆలోచించుడి నేను నా వ్యాజ్యెమును సరిచేసికొని యున్నాను నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియును. నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు? ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొని ప్రాణము విడిచెదను. ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను. నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము నీ భయము నన్ను బెదరింపనీయకుము అప్పుడు నీవు పిలిచినయెడల నేను నీ కుత్తర మిచ్చెదను నేను పలికెదను నీవు నా కుత్తరమిమ్ము నా దోషములెన్ని? నా పాపములెన్ని? నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము. నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి? నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు? ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు వేధించెదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? నీవు నాకు కఠినమైన శిక్ష విధించియున్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించియున్నావు బొండలలో నా కాళ్లు బిగించియున్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్లచుట్టు గిఱిగీసియున్నావు మురిగి క్షీణించుచున్న వానిచుట్టు చిమ్మటకొట్టిన వస్త్రమువంటివానిచుట్టు గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టివానిమీద నీవు కనుదృష్టి యుంచియున్నావు తీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించి యున్నావు. పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? ఆలాగున ఎవడును పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించియున్నావు కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకువారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడక యుండుము. వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు. దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసనమాత్రముచేత అది చిగుర్చును లేత మొక్కవలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచినతరువాత వారేమై పోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతో మేలు నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచిన యెడల ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరు చున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు. పర్వతమైనను పడిపోయి నాశనమగును కొండయైనను దాని స్థానము తప్పును. జలము రాళ్లను అరగదీయును దాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టు కొనిపోవును నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు. నీవు వారిని ఎల్లప్పుడు గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురు నీవు వారికి ముఖవికారము కలుగజేసి వారిని వెళ్ల గొట్టుచున్నావు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అదివారికి తెలియకపోవును.వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టెనని వారు గ్రహింపకయుందురు. తమమట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు తమమట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను— జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తర మియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొన దగునా? వ్యర్థసంభాషణచేత వ్యాజ్యెమాడ దగునా? నిష్‌ప్రయోజనమైన మాటలచేత వాదింప దగునా? నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవునిగూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచనసభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు? నెరసిన వెండ్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులును మాలో నున్నారు నీ తండ్రికంటెను వారు చాల పెద్దవారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా నున్నదా? నీ హృదయము ఏల క్రుంగిపోయెను? నీ కన్నులు ఏల ఎఱ్ఱబారుచున్నవి? దేవునిమీద నీవేల ఆగ్రహపడుచున్నావు? నీ నోటనుండి అట్టి మాటలేల రానిచ్చుచున్నావు? శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? ఆలోచించుము ఆయన తన దూతలయందు నమ్మిక యుంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా. నా మాట ఆలకింపుము నీకు తెలియజేతును నేను చూచినదానిని నీకు వివరించెదను. జ్ఞానులు తమపితరులయొద్ద నేర్చుకొని మరుగుచేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడు బాధనొందును. భీకరమైన ధ్వనులు వాని చెవులలోబడును, క్షేమ కాలమున పాడుచేయువారు వాని మీదికి వచ్చెదరు. తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు తిరుగులాడును. అంధకారదినము సమీపించుచున్నదని వానికి తెలియును. శ్రమయు వేదనయు వానిని బెదరించును. యుద్ధముచేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనునట్లు అవి వానిని పట్టుకొనును. వాడు దేవునిమీదికి చేయి చాపును సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును. మూర్ఖుడై ఆయనను మార్కొనును తన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును. వాని ముఖము క్రొవ్వు పెట్టియున్నది వాని చిరుప్రక్కలపైని క్రొవ్వుకండలు పెరిగి యున్నవి. అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు ఎవరును నివసింపకూడని యిండ్లలో దిబ్బలు కావలసియున్న యిండ్లలో నివసించెదరు కావునవారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలువదు.వారి సస్యసంపద పంట బరువై నేలకు వంగదు వారు చీకటిని తప్పించుకొనరు అగ్నిజ్వాల వారి లేతకొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరిచేత వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకొనకుందురు గాక; వారు మోసపోయినవారు మాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును. ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురువారి కడుపున కపటము పుట్టును. అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను— ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు. ఈ గాలిమాటలు ముగిసిపోయెనా? నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు? నాస్థితిలో మీరుండినయెడల నేనును మీవలె మాట లాడవచ్చును. నేనును మీమీద మాటలు కల్పింపవచ్చును మీవైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బల పరచుదును నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును? ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసి యున్నాడు నా బంధువర్గమంతయు నీవు పాడు చేసియున్నావు నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావు. ఇది కూడ నామీద సాక్ష్యముగా నున్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపముచేత నామీదపడి నన్ను చీల్చెను. ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను. జనులు నామీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు.వారు ఏకీభవించి నామీద గుంపు కూడుదురు దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు. నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తునియలుగా చేసియున్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి కనికరములేక నా తుండ్లను పొడిచెను నా పైత్యరసమును నేలను పారబోసెను. కన్నముమీద కన్నమువేసి ఆయన నన్ను విరుగ గొట్టెను పరుగులెత్తి శూరునివలె నామీద పడెను. నా చర్మముమీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని నా కొమ్మును ధూళితో మురికిచేసితిని. నాచేత బలాత్కారము జరుగకపోయినను నా ప్రార్థన యథార్థముగా నుండినను ఏడ్పుచేత నా ముఖము ఎఱ్ఱబడియున్నది నా కనురెప్పలమీద మరణాంధకారము నిలుచుచున్నది. భూమీ, నా రక్తమును కప్పివేయకుము నా మొఱ్ఱకు విరామము కలుగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షియైనవాడు పరలోకములో నున్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమం దున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళిచేయుచున్నారు. నరునివిషయమై యొకడు దేవునితో వ్యాజ్యెమాడ వలెననియు నర పుత్రునివిషయమై వాని స్నేహితునితో వ్యాజ్యె మాడవలెననియు కోరి నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహ ముగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్లుదును. నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను. సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది. ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారువారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగా నున్నవి. ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము మరి యెవడు నా నిమిత్తము పూటపడును? నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి యున్నాడు నలుగురు నా ముఖముమీద ఉమ్మివేయుదురు. నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెను నా అవయవములన్నియు నీడవలె ఆయెను యథార్థవంతులు దీనినిచూచి ఆశ్చర్యపడుదురు నిర్దోషులు భక్తిహీనులస్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. మీరందరు నాయొద్దకు రండి, మరల దయచేయుడి మీలో జ్ఞానవంతు డొక్కడైనను నాకు కనబడడు. నా దినములు గతించెను నా యోచన నిరర్థకమాయెను నా హృదయ వాంఛ భంగమాయెను. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ యేదైన నాకుండినయెడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను –నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణాధారమేది? నా నిరీక్షణ యెవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను— మాటలలో చిక్కుపరచుటకై మీ రెంతసేవు వెదకుదురు? మీరు ఆలోచనచేసి ముగించినయెడల మేము మాటలాడెదము. మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుట ఏల? కోపముచేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడునువారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములో వెలుగు అంధకారమగునువారియొద్దనున్న దీపము ఆరిపోవును వారి పటుత్వముగల నడకలు అడ్డగింపబడునువారి స్వకీయాలోచన వారిని కూల్చును. వారు వాగురలమీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమెను పట్టుకొనును వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడునువారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగ జేయును భయములు వారిని వెంటాడి తరుమును. వారి బలము క్షీణించిపోవునువారిని కూల్చుటకు ఆపద కాచియుండును. అది వారి దేహ అవయవములను భక్షించును మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికి వేయబడుదురువారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు. వారికి అన్యులైనవారు వారి గుడారములో నివాసము చేయుదురు వారి నివాసస్థలముమీద గంధకము చల్లబడును. క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును. భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరు మైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు. జనులు వారిని వెలుగులోనుండి చీకటిలోనికి తోలుదురు భూలోకములోనుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరువారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు ఒకడైనను ఉండడు. తర్వాత వచ్చినవారు వారిమీద పడిన శిక్షనుచూచి విస్మయమొందుదురు పూర్వముండినవారు దానిని చూచి దిగులుపడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును దేవుని ఎరుగనివారి స్థలము ఇట్టిది. అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను— ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు? పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పుచేసినయెడల నా తప్పు నా మీదికే వచ్చును గదా? మిమ్మును మీరు నామీద హెచ్చించుకొందురా? నా నేరము నామీద మీరు మోపుదురా? ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరు తెలిసికొనుడి. నామీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీక రింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసియున్నాడు. నా త్రోవలను చీకటి చేసియున్నాడు ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు తలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమై పోతిని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణా ధారమును పెల్లగించెను. ఆయన నామీద తన కోపమును రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరివారు నామీద ముట్టడిదిబ్బలు వేసిరి నా గుడారముచుట్టు దిగిరి. ఆయన నా సోదరజనమును నాకు దూరముచేసి యున్నాడు నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయియున్నారు. నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినై యున్నాను. నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండ నున్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచినయెడల బాలురు నామీద దూషణలు పలికెదరు. నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతిని నేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు. నా యెముకలు నా చర్మముతోను నా మాంసము తోను అంటుకొని యున్నవి దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడియున్నది దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీద జాలిపడుడి. నా శరీరమాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు? నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరు చున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి యినుపపోగరతో బండమీద చెక్కబడి సీస ముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీర ముతో నేను దేవుని చూచెదను. నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి జరిగినదాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు–మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచినయెడల మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పుకలుగునని మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను— ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది. నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచి యున్నది. దుష్టులకు విజయము కొద్దికాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును. ఆదినుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగినను మేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు.వారిని చూచినవారు–వారేమైరని యడుగుదురు. కల యెగసిపోవునట్లువారు గతించి కనబడక పోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లువారు తరిమి వేయ బడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదువారి స్థలమునవారు మరి ఎప్పుడును కనబడరు వారి సంతతివారు దరిద్రుల దయను వెదకెదరువారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి యెముకలలో యౌవనబలము నిండియుండునుగాని అదియు వారితోకూడ మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెనువారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి. దాని పోనియ్యక భద్రముచేసికొనిరి, నోట దాని నుంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మ్రింగివేసిరి గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురు. వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు. దేనికొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరువారు సంపాదించిన ఆస్తికొలది వారికి సంతోషముండదు వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారువారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించు కొనినను దానిని కట్టి పూర్తిచేయరు. వారు ఎడతెగక ఆశించినవారు తమ యిష్టవస్తువులలో ఒకదానిచేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. వారు మ్రింగివేయనిది ఒకటియు లేదు గనుక వారి క్షేమస్థితి నిలువదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమునవారు ఇబ్బందిపడుదురు దురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికి వచ్చును. వారు కడుపు నింపుకొననైయుండగా దేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించునువారు తినుచుండగా దాని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారి పోగా ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడుచును. అది దేహమును చీల్చి వారి శరీరములోనుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములోనుండి పైత్యపు తిత్తి వచ్చును, మరణభయము వారి మీదికి వచ్చును. వారి ధననిధులు అంధకారపూర్ణములగును ఊదనక్కరలేని అగ్ని వారిని మ్రింగివేయును వారి గుడారములో మిగిలినదానిని అది కాల్చి వేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారిమీదికి లేచును. వారి యింటికివచ్చిన ఆర్జన కనబడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవునివలన దుష్టులైన నరులకు ప్రాప్తించుభాగము దేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను— నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణమాటకు ప్రతిగా నుండుగాక. నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును. నేను మనుష్యునిగురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు? నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి నోటిమీద చేయి వేసికొనుడి. నేను దాని మనస్సునకు తెచ్చుకొనినయెడల నాకే మియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది. భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు? వారుండగానే వారితోకూడ వారి సంతానమువారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచ బడుచున్నది. వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవి దేవుని దండము వారిమీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురువారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురు ఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు–నీ మార్గములనుగూర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగానుండును గాక. భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా.వారిమీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా. వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెను గాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా. వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారు చేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక వారే కన్నులార తమ నాశనమును చూతురుగాక సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురు గాక. తమ జీవితకాలము సమాప్తమైన తరువాత తాము పోయిన తరువాత తమ ఇంటిమీద వారికి చింత ఏమి? ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా. ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన యెముకలలో మూలుగ బలిసియుండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతినొందును వేరొకడు ఎన్నడును క్షేమమనుదాని నెరుగక మనో దుఃఖముగలవాడై మృతినొందును. వారు సమానముగ మంటిలో పండుకొందురు పురు గులు వారిద్దరిని కప్పును. మీ తలంపులు నేనెరుగుదును మీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నా గములు నాకు తెలిసినవి. –అధిపతులమందిరము ఎక్కడ నున్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే. దేశమున సంచరించువారిని మీరడుగలేదా?వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్ట లేదా? అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడ బడుదురు ఉగ్రతదినమందువారు తోడుకొని పోబడుదురు. వారి ప్రవర్తననుబట్టి వారితో ముఖాముఖిగా మాట లనగలవాడెవడు?వారు చేసినదానినిబట్టి వారికి ప్రతికారముచేయు వాడెవడు? వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలికాయబడును పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగా నున్నవి మనుష్యులందరు వారివెంబడి పోవుదురు ఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగా పోయిరి. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు ఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగునన్ను ఓదార్చ జూచెదరు? అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను— నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు; బుద్ధిమంతులు తమమట్టుకు తామే ప్రయోజనకారులైయున్నారు నీవు నీతిమంతుడవై యుండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభ కరమా? ఆయనయందు భయభక్తులు కలిగియున్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులనుబట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి దప్పిచేత ఆయాసపడినవారికి నీళ్లియ్యవైతివి ఆకలిగొనినవానికి అన్నము పెట్టకపోతివి. బాహుబలముగల మనుష్యునికే భూమి ప్రాప్తించును ఘనుడని యెంచబడినవాడు దానిలో నివసించును. విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివి తండ్రిలేనివారి చేతులు విరుగగొట్టితివి. కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదరించుచున్నది. నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుటలేదా? నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు చూచుటలేదా? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంత పైగా నున్నవి? దేవునికి ఏమి తెలియును? గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కను గొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేడు ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవను కొనుచున్నావు. పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా? వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను. ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను –మాయొద్దనుండి తొలగిపొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై యుండునుగాక. –మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియువారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు నీతిమంతులు దాని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళనచేయుదురు. ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడల నీ గుడారములలోనుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణ మును పారవేయుము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవు దేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థనచేయగా ఆయన నీ మనవి నాలకించును నీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గములమీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు–మీదు చూచెదనందువు వినయముగలవానిని ఆయన రక్షించును. నిర్దోషికానివానినైనను ఆయన విడిపించును. అతడు నీచేతుల శుద్ధివలన విడిపింపబడును. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను— నేటివరకు నేను మొరలిడుచు తిరుగుబాటుచేయు చున్నాను నా వ్యాధి నా మూలుగుకంటె భారముగా నున్నది ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియ బడును గాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశద పరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలిసికొందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా? ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడ వచ్చును. కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలన శిక్ష నొందకపోవుదును. నేను తూర్పుదిశకు వెళ్లినను ఆయన అచ్చట లేడు పడమటిదిశకు వెళ్లినను ఆయన కనబడుట లేదు ఆయన పనులు జరిగించు ఉత్తరదిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణదిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు నేనాయనను కనుగొనలేను. నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను సరించితిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని. అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. నాకు విధింపబడినదానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై యున్నాడు. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించునప్పుడెల్ల ఆయనకు భయపడు చున్నాను. దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను. అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనముచేయబడి యుండలేదు. సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు ఏర్పాటుచేయడు? ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరువారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు వారు మార్గములోనుండి దరిద్రులను తొలగించి వేయుదురు దేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసివచ్చెను. అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురు దుష్టుల ద్రాక్షతోటలలో పరిగ ఏరుదురు. బట్టలులేక రాత్రి అంతయు పండుకొనియుందురు చలిలో వస్త్రహీనులై పడియుందురు. పర్వతములమీది జల్లులకు తడిసియుందురు చాటులేనందున బండను కౌగలించుకొందురు. తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరువారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు దరిద్రులు వస్త్రహీనులై బట్టలులేక తిరుగులాడుదురు ఆకలిగొని పనలను మోయుదురు. వారు తమ యజమానుల గోడలలోపల నూనె గానుగలను ఆడించుదురు ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారై యుందురు. జనముగల పట్టణములో మూలుగుదురు గాయపరచబడినవారు మొఱ్ఱపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు. వెలుగుమీద తిరుగబడువారు కలరు వీరు దాని మార్గములను గురుతుపట్టరు దాని త్రోవలలో నిలువరు. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును వాడు దరిద్రులను లేమిగలవారిని చంపును రాత్రియందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి–ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నము వేయుదురు పగలు దాగుకొందురువారు వెలుగు చూడనొల్లరు వారందరు ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి యున్నది. జలములమీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు వారి స్వాస్థ్యము భూమిమీద శాపగ్రస్తము ద్రాక్షతోటల మార్గమునవారు ఇకను నడువరు. అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు పాతాళము పాపముచేసినవారిని పట్టుకొనును. కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయునువారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురు విధవరాండ్రకు మేలుచేయరు. ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడు చున్నాడు కొందరు ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు ఆయన వారి మార్గములమీద తన దృష్టి నుంచును వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయ బడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు. ఇప్పుడు ఈలాగు జరుగని యెడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు? అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగున ప్రత్యు త్తరమిచ్చెను— అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి ఆయన తన ఉన్నతస్థలములలో సమాధానము కలుగ జేయును. ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరిమీదనైనను ఉదయింపకుండునా? నరుడు దేవునిదృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగువంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను— శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి? జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచనచెప్పితివి? సంగతిని ఎంత చక్కగా వివరించితివి? నీవు ఎవనియెదుట మాటలను ఉచ్చరించితివి? ఎవని ఊపిరి నీలోనుండి బయలుదేరినది? జలములక్రిందను వాటి నివాసులక్రిందనుఉండు ప్రేతలు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నది నాశనకూపము బట్టబయలుగా నున్నది. శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను. వాటిక్రింద మేఘములు చినిగిపోకుండ ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దానిమీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. వెలుగు చీకటుల సరిహద్దులవరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశవిశాల స్తంభములు విస్మయ మొంది అదరును తన బలమువలన ఆయన సముద్రమును రేపును తన వివేకమువలన రాహాబును పగులగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు అందమువచ్చును. ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? యూబు ఇంకను ఉపమానరీతిగా ఇట్లనెను— నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. నాకు శత్రువులైనవారు దుష్టులుగా కనబడుదురు గాక నన్నెదిరించువారు నీతిలేనివారుగా కనబడుదురు గాక. దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినునా? వాడు సర్వశక్తునియందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? దేవుని హస్తమునుగూర్చి నేను మీకు ఉపదేశించెదను సర్వశక్తుడుచేయు క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతివాడు దాని చూచియున్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైనవాటిని భావించు చుందురు? దేవునివలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తునివలన పొందు స్వాస్థ్యము వారి పిల్లలు విస్తరించినయెడల అది ఖడ్గముచేత పడుటకే గదావారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. వారికి మిగిలినవారు తెగులువలన చచ్చి పాతిపెట్ట బడెదరువారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధ పరచుకొనినను వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు. పురుగుల గూళ్లవంటి యిండ్లువారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లువారు కట్టుకొందురు. వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు. భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టు కొనును రాత్రివేళ తుపాను వారిని ఎత్తికొనిపోవును. తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవుదురు అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయునువారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు. మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురువారి స్థలములోనుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. వెండికి గని గలదు పుటమువేయు సువర్ణమునకు స్థలము గలదు. ఇనుమును మంటిలోనుండి తీయుదురు రాళ్లు కరగించి రాగి తీయుదురు. మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచువారు భూమ్యంతములవరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలములకు చాల దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురువారు పైసంచరించువారిచేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగానుండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమినుండి ఆహారము పుట్టును దాని లోపలిభాగము అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్లు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి. ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు డేగ కన్నులు దాని చూడలేదు గర్వముగల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు మనుష్యులు స్ఫటికమువంటి బండను పట్టుకొందురు పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల ద్రోయుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురువారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు ఓడిగిలిపోకుండ వారు జలధారలకు గట్టు కట్టుదురు మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది? నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము–అది నాలో లేదనును సముద్రము–నాయొద్ద లేదనును. సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు. జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు. అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది. మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన మును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును. ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతోకూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను. మరియు–యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను— పూర్వకాలముననున్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడు చుంటిని. నా పరిపక్వదినములలో ఉండినట్లు నేనుండినయెడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగానుండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను నా పిల్లలు నా చుట్టునుండిరి నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను బండనుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు యౌవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి. అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యి వేసికొనిరి. ప్రధానులు మాటలాడక ఊరకొనిరివారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట వంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్య మిచ్చెను. ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రిలేనివారిని సహాయములేనివారిని నేను విడి పించితిని. నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను. గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని. దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగనివారి వ్యాజ్యెమును నేను శ్రద్ధగా విచా రించితిని. దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని.వారి పళ్లలోనుండి దోపుడుసొమ్మును లాగివేసితిని. అప్పుడు నేనిట్లనుకొంటిని–నా గూటియొద్దనే నేను చచ్చెదను హంసవలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును. నా వేళ్లచుట్టు నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మలమీద నిలుచును. నాకు ఎడతెగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికిని బలముగా నుండును. మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి. నేను మాటలాడిన తరువాత వారు మారుమాట పలుకకుండిరి. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారిమీద పడెను. వర్షముకొరకు కనిపెట్టునట్లువారు నాకొరకు కని పెట్టుకొనిరి కడవరి వానకొరకైనట్లువారు వెడల్పుగా నోరు తెరచుకొనిరి. వారు ఆశారహితులై యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని నా ముఖప్రకాశములేకుండ వారేమియు చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని సేనలో రాజువలెను దుఃఖించువారిని ఓదార్చువానివలెను నేనుంటిని. ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని. వారి చేతుల బలము నా కేమి ప్రయోజనమగును?వారి పౌరుషము పోయినది. దారిద్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి. వారు నరులమధ్యనుండి తరిమివేయబడినవారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులువారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర ముండవలసి వచ్చెను. తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్లచెట్లక్రింద వారు కూడియుందురు. వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని పుట్టినవారువారు దేశములోనుండి తరుమబడినవారు. అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను. వారు నన్ను అసహ్యించుకొందురు నా యొద్ద నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావునవారు నాకు లోబడక కళ్లెము వదలించు కొందురు. నా కుడిప్రక్కను అల్లరిమూక లేచునువారు నా కాళ్లను తొట్రిల్లచేయుదురు పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నామీద సాగింతురు. వారు నిరాధారులైనను నా మార్గమును పాడుచేయుదురు నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము కలుగ జేయుదురు గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లువారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు. భీకరమైనవి నామీద పడెను గాలి కొట్టివేయునట్లువారు నా ప్రభావమును కొట్టి వేయుదురు మేఘమువలె నా క్షేమము గతించిపోయెను. నా ఆత్మ నాలో కరిగిపోయి యున్నది ఆపద్దినములు నన్ను పట్టుకొనియున్నవి రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడు నట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును మెడచుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను. నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తర మేమియు నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు గాలిచేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు తుపానుచేత నన్ను హరించివేయుచున్నావు మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజమందిరమునకు నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియును. ఒకడు పడిపోవునెడల వాడు చెయ్యిచాపడా? ఆపదలో నున్నవాడు తప్పింపవలెనని మొఱ్ఱపెట్టడా? బాధలోనున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. నా పేగులు మానక మండుచున్నవి అపాయదినములు నన్నెదుర్కొనెను. సూర్యుని ప్రకాశములేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను సమాజములో నిలువబడి మొఱ్ఱపెట్టుచున్నాను. నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని. నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను. నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది. నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును? ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ యేమగును? ఉన్నతస్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును? దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా. ఆయన నా ప్రవర్తన నెరుగును గదా నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును గదా అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల మోసముచేయుటకై నా కాలు త్వరపడినయెడల నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి కొనునట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవవిడిచి నడచినయెడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన యెడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినయెడల నేను విత్తినదానిని వేరొకడు భుజించును గాక నేను నాటినది పెరికివేయబడును గాక. నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను కూడుదురు గాక. అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరము అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యె మాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడ పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా. బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్రకన్నులు క్షీణింపజేసినయెడలను తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచె మైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనముచేసినయెడలను ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలనువారు నా గొఱ్ఱెలబొచ్చుచేత వేడిమి పొందకపోయిన యెడలను గుమ్మములో సహాయము దొరకుననుకొనిన తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక. నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను. సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను –నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించినయెడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడివారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టినయెడలను పరముననున్న దేవునిదృష్టికి నేను వేషధారి నవుదును. అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర మగును. నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించినయెడలను నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనేలేదు. –అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి పొందనివానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకనియెడలను పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగానుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొనినయెడల పరముననున్న దేవునిదృష్టికి నేను వేషధారి నవుదును నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను; ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక. నిశ్చయముగా నేను నా భుజముమీద దానిని వేసి కొందును నాకు కిరీటముగా దానిని ధరించుకొందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను, రాజు వలె నేనాయనయొద్దకు వెళ్లెదను. నా భూమి నామీద మొఱ్ఱపెట్టినయెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన యెడలను గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను. యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతనిమీద బహుగా కోపగించెను. మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపినందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను. వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టి యుండెను. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తర మేమియు ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను. కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాటలాడసాగెను— నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతువుచేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు. వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము బోధింపతగునని నేననుకొంటిని; అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు. కావున నేను–నా మాట నంగీకరించుడని మనవి చేసికొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును. ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు. కావున–మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింపనేరరనియు మీరు పలుకకూడదు. అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలనుబట్టి నేనతనికి ప్రత్యుత్తర మియ్యను. వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు పలుకుటకు వారికి మాటయొకటియులేదు. కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పకయున్నారువారు మాటలాడక పోవుట చూచి నేను ఊరకుందునా? నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను నేనును నా తాత్పర్యము తెలిపెదను. నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె నున్నది క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా నున్నది. నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను. మీరు దయచేసి వినుడి నేను ఎవరియెడలను పక్ష పాతినై యుండను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను ముఖస్తుతి చేయుట నా చేత కాదు అట్లు చేసినయెడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము. ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది. నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను నీ చేతనైనయెడల నాకుత్తరమిమ్ము నా యెదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యె మాడుము. దేవునియెడల నేనును నీవంటివాడను నేనును జిగటమంటితో చేయబడినవాడనే నావలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి నీమీద బరువుగా నుండదు. నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఏమనగా–నేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను. ఆయన నామీద తప్పులు పెట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీ వను చున్నావు. ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను. తన క్రియలలో దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తర మియ్యడు దేవుడు నరులశక్తికి మించినవాడు, నీవేల ఆయనతో పోరాడుదువు? దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు మంచముమీదకునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో [16-18] —నరులు గర్విష్ఠులు కాకుండచేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండ వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయునువారికొరకు ఉపదేశము సిద్ధపరచును. *** *** వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచు కొని వచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులయొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియ జేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్య వర్తియైయుండినయెడల దేవుడు వానియందు కరుణ జూపి— పాతాళములోనికి దిగి వెళ్లకుండ వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలుకొనినయెడల ఆయన వానిని కటాక్షించును కావునవాడు ఆయన ముఖము చూచి సంతోషిం చును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. అప్పుడు వాడు మనుష్యులయెదుట సంతోషించుచు ఇట్లని పలుకును— యథార్థమైనదానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని అయినను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడ లేదు కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది. [29-30] ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగుచేత వెలిగింపబడునట్లు కూపములోనుండి వారిని మరల రప్పింపవలెనని మానవులకొరకు రెండు సారులు మూడు సారులు ఈ క్రియలన్నిటిని దేవుడు చేయువాడైయున్నాడు. *** యోబూ, చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను మాటలాడెదను. చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరు చున్నాను. మాట యేమియు లేనియెడల నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించె దను. అప్పుడు ఎలీహు మరల ఈలాగు చెప్పసాగెను –జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును. న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసి కొందము రండి. –నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను న్యాయవంతుడనైయుండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు. యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానము చేయుచున్నాడు. అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను. –నరులు దేవునితో సహవాసము చేయుటవారి కేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫల మిచ్చును. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎవడైన భూమిని ఆయనకు అప్పగింతపెట్టెనా? ఎవడైన సర్వప్రపంచ భారమును ఆయన కప్పగించెనా? ఆయన తన మనస్సు తనమీదనే ఉంచుకొనినయెడల తన శ్వాసనిశ్వాసములను తనయొద్దకు తిరిగి తీసికొనినయెడల శరీరులందరు ఏకముగా నశించెదరు నరులు మరల ధూళియై పోవుదురు. కావున దీని విని వివేచించుము నా మాటల నాలకింపుము. న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయసంపన్నుడైనవానిమీద నేరము మోపుదువా? నీవు పనికిమాలినవాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా? రాజులయెడల పక్షపాతము చూపనివానితోను బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వాని తోను ఆలాగు పలుకుట తగునా? వారందరు ఆయన నిర్మించినవారు కారా? వారు నిమిషములో చనిపోవుదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునొంది నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు. ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది ఆయన వారినడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు. దుష్‌క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైననులేదు. ఒకడు న్యాయవిమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణచేయుట దేవునికి అగత్యములేదు. విచారణలేకుండనే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడువారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. వారి క్రియలను ఆయన తెలిసికొనుచున్నాడు రాత్రియందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు. దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి. బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి. ఆయన సమాధానము కలుగజేసినయెడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొనినయెడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులనుగూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చిన దైనను ఒకటే భక్తిహీనులు రాజ్యపరిపాలన చేయకుండునట్లువారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతు లను ఆయన నిర్మూలము చేయుచున్నాడు ఒకడు–నేను శిక్షనొందితిని నేను ఇకను పాపము చేయను నాకు తెలియనిదానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము చేసియున్నయెడల ఇకను చేయనని దేవునితో చెప్పునా? నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతికారముచేయునా? లేనియెడల నీవుందువా? నేను కాదు నీవేనిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము. వివేచనగలవారు జ్ఞానముగలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు— యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చు కొనుచున్నాడు మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు. మరియు ఎలీహు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను –నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభముకన్న నా నీతివలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి? అని నీవు చెప్పుచున్నావే? ఇదే న్యాయమని నీకు తోచినదా?— దేవుని నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుకొను చున్నావా? నీతోను నీతోకూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను. ఆకాశమువైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు చూడుము. నీవు పాపముచేసినను ఆయనకు నీవేమైన చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైన చేసితివా? నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చు చున్నావా? ఆయన నీచేత ఏమైనను తీసికొనునా? నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును. అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలువేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు. అయితే–రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరే పించుచు భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగ జేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అను కొనువారెవరును లేరు. కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమునుబట్టి మొఱ్ఱపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తర మిచ్చుటలేదు. నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని బెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. –ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము ఆయనయెదుటనే యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను. ఆయన కోపముతో దండింపక పోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు. మరియు ఎలీహు ఇంక యిట్లనెను –కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేసెదను. ఏలయనగా దేవునిపక్షముగా నేనింకను మాటలాడ వలసియున్నది. దూరమునుండి నేను జ్ఞానము తెచ్చుకొందును నన్ను సృజించినవానికి నీతిని ఆరోపించెదను. నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొకడు నీ యెదుట నున్నాడు. ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహుబలమైనది. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును. నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనముమీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టునువారు ఘనపరచబడుదురు. వారు సంకెళ్లతో కట్టబడినయెడలను బాధాపాశములచేత పట్టబడినయెడలను అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారికార్యములను వారి వారి దోషము లను వారికి తెలియజేయును. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు. వారు ఆలకింపనియెడల వారు బాణములచేత కూలి నశించెదరు. జ్ఞానములేక చనిపోయెదరు. అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేనివారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు. కావునవారు యౌవనమందే మృతినొందుదురువారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును. శ్రమపడువారిని వారికి కలిగినశ్రమవలన ఆయన విడిపించును. బాధవలన వారిని విధేయులుగా చేయును. అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొనిపోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయవిమర్శయు తీర్పును కూడుకొనియున్నవి. నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయెదవేమో జాగ్రత్తపడుము. నీవు మొఱ్ఱపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బాధనొందకుండ నిన్ను తప్పించునా? జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము. జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవముకన్న అది మంచిదని నీవు వాని కోరు కొనియున్నావు. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించినవాడెవడు? –నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును? మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము. మనుష్యులందరు దాని చూచెదరు నరులు దూరమున నిలిచి దాని చూచెదరు. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతోకూడిన వర్షమువలె అవి పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యులమీదికి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములోనుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా? ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును. వీటివలన ఆయన ఆయా ప్రజలకు తీర్పుతీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధిచేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును. దీనినిబట్టి నా హృదయము వణకుచున్నది దాని స్థలములోనుండి అది కదలింపబడుచున్నది. ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోటనుండి బయలువెళ్లు ధ్వని నాలకించుడి. ఆకాశవైశాల్యమంతటి క్రింద ఆయనదాని వినిపించును భూమ్యంతములవరకు తన మెరుపును కనబడజేయును. దాని తరువాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్పకార్యములను ఆయన చేయును. –నీవు భూమిమీద పడుమని హిమముతోను వర్షముతోను మహా వర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును తెలిసికొనునట్లు ప్రతిమనుష్యుని చేతినిబిగించి ఆయన ముద్రవేసియున్నాడు. జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో వసించును. మరుగుస్థానములోనుండి తుపాను వచ్చును ఉత్తరదిక్కునుండి చలి వచ్చును దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును. [12-13] ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును. *** యోబూ, ఈ మాట ఆలకింపుము ఊరకుండి దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని యెట్లు తీర్మానముచేయునో నీకు తెలియునా? మేఘములను తేలచేయుటయు పరిపూర్ణజ్ఞానము గలవాని మహా కార్యములును నీకు తెలియునా? దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా? పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా? మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమియు తోచక యున్నది నేను పలుకుదునని యెవడైన ఆయనతో చెప్పదగునా? ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరునా? ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ యిప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కను పరచును. ఉత్తరదిక్కున సువర్ణప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని యున్నాడు. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులుకలిగి యుందురు. తాము జ్ఞానులమనుకొనువారిని ఆయన ఏమాత్రమును లక్ష్యపెట్టడు. అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను— జ్ఞానములేని మాటలు చెప్పి–ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు –నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? [12-13] అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించునట్లును అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? *** ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కన బడును. దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసినయెడల చెప్పుము. [19-20] వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా? *** ఇదంతయు నీకు తెలిసియున్నది గదా. నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి. నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ దినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును? నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును పాడైన యెడారిని తృప్తిపరచుటకును లేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించు వాడెవడు? వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా? జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలువెళ్లి –చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివి నిచ్చినవాడెవడు? జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు వాడెవడు? ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా? సింహపుపిల్లలు తమతమ గుహలలో పండుకొనునప్పుడు తమ గుహలలో పొంచి యుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? అవి మోయు మాసములను నీవు లెక్కపెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా? అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును. వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు. అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా? పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట గలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా? దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా? అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా? నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా? లేదుసుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును. దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను అడవిజంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయే యున్నది. తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండ లేదు. అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించును. గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా? మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. మైదానములో అది కాలు దువ్వి తన బలమునుబట్టి సంతోషించును అది ఆయుధధారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొంద కుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు. అంబుల పొదియు తళతళలాడు ఈటెలును బల్లెమును దానిమీద గలగలలాడించబడునప్పుడు ఉద్దండకోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడెల్ల అది అహా అహా అనుకొని దూరమునుండి యుద్ధవాసన తెలిసి కొనును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఫెూషను వినును. డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా? అది రాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును. అక్కడనుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చును హతులైనవారు ఎక్కడనుందురో అక్కడనే అది యుండును. మరియు యెహోవా యోబునకు ఈలాగు. ప్రత్యుత్తరమిచ్చెను— ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర మియ్యవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను— చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును. ఒక మారుమాటలాడితిని నేను మరల నోరెత్తను. రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను. అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను— పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము నేను నీకు ప్రశ్నవేసెదను నీవు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అప రాధము మోపుదువా? దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింప గలవా? ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము గౌరవప్రభావములను ధరించుకొనుము. నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్ఠులైన వారినందరిని చూచి వారిని క్రుంగజేయుము. గర్విష్ఠులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగ ద్రొక్కుము. కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము. అప్పుడు నీ దక్షిణహస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్నుగూర్చి ఒప్పుకొనెదను. నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలె అది గడ్డి మేయును. దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి యున్నవి. దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి దాని ప్రక్క టెముకలు ఇనుపకమ్ములవలె ఉన్నవి అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది దాని సృజించినవాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. పర్వతములలో దానికి మేత మొలచును అరణ్యజంతువులన్నియు అచ్చట ఆడుకొనును. తామర చెట్లక్రిందను జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను అది పండుకొనును తామరచెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజిచెట్లు దాని చుట్టుకొనియుండును. నదీప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యొర్దానువంటి ప్రవాహము పొంగి దానినోటియొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు. అది చూచుచుండగా ఎవరైన దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా?. దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా? నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసికొనునట్లు అది నీతో నిబంధనచేయునా? నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆట లాడెదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా? బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా?వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా? దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసికొనిన యెడల నీవు మరల ఆలాగున చేయకుందువు. దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచు కొందుమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రముచేతనే యెవరికైనను గుండెలు అవిసిపోవును గదా. దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా యెదుట నిలువగలవాడెవడు? నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా దాని అవయవములనుగూర్చియైనను దాని మహాబల మునుగూర్చియైనను దాని చక్కని తీరునుగూర్చి యైనను పలుకక మౌనముగా నుండను. ఎవడైన దాని పై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైన రాగలడా? దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్లచుట్టు భయకంపములు కలవు దాని గట్టిపొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతనచేయబడి యున్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని యున్నవి. వాటి మధ్యకు గాలి యేమాత్రమును జొరనేరదు. ఒకదానితో ఒకటి అతకబడి యున్నవి భేదింప శక్యము కాకుండ అవి యొకదానితో నొకటి కలిసికొని యున్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పలవలె నున్నవి దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దానినుండి లేచును. ఉడుకుచున్న కాగులోనుండి, జమ్ముమంటమీద కాగు చున్న బానలోనుండి పొగ లేచునట్లు దాని నాసికారంధ్రములలోనుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలమునకు స్థానము భయము దానియెదుట తాండవమాడుచుండును దాని ప్రక్కలమీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు. దాని గుండె రాతివలె గట్టిగా నున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము. అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయముచేత వారు మైమరతురు. దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈట్లైనను బాణములైనను పంట్రకోలలైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కఱ్ఱగాను ఎంచును. బాణము దానిని పారదోలజాలదు వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలె ఉన్నవి. దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును. దాని క్రిందిభాగములు కరుకైన చిల్లపెంకు లవలె ఉన్నవి. అది బురదమీద నురిపిడికొయ్యవంటి తన దేహమును పరచుకొనును. కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగ జేయును సముద్రమును తైలమువలె చేయును. అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింప జేయును చూచినవారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా తోచును. అది భయములేనిదిగా సృజింపబడినది భూమిమీద దానివంటిదేదియు లేదు. అది గొప్పవాటినన్నిటిని తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికి అది రాజు. అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యు త్తరమిచ్చెను— నీవు సమస్తక్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని. జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు? ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని. నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియ జెప్పుము. వినికిడిచేత నిన్నుగూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచు చున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను— నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నాకోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితులమీదను మండుచున్నది. కాబట్టి యేడుఎడ్లను ఏడుపొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక లేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి, యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవావారిపక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరును అతని అక్కచెల్లెండ్రందరును అంతకుముందు అతనికి పరిచయులైనవారును వచ్చి, అతనితోకూడ అతని యింట అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతనిమీదికి రప్పించిన సమస్తబాధనుగూర్చి యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగు వేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను. మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి. అతడు పెద్దదానికి యెమీమా అనియు రెండవదానికి కెజీయా అనియు మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్య వతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను. దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? –మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును –నేను నా పరిశుద్ధపర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను –నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి. భయభక్తులుకలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు. అబ్షాలోమను తన కుమారుని యెదుటనుండి పారిపోయి నప్పుడు దావీదు రచించిన కీర్తన. [1] యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నామీదికి లేచువారు అనేకులు. –దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదని నన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా.) యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధపర్వతమునుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహ రించినను నేను భయపడను యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టు వాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా.) ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. దావీదు కీర్తన. [1] నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమాన ముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొను చున్నాడని తెలిసికొనుడి. నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును. భయమునొంది పాపము చేయకుడి మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.) నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి –మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతో షముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ప్రధాన గాయకునికి. పిల్లనగ్రోవితో పాడదగినది. దావీదు కీర్తన. [1] యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము. నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహో వాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములో ప్రవేశించెదను నీయెడల భయభక్తులుకలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను యెహోవా, నాకొఱకు పొంచియున్న వారినిబట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. వారి నోట యథార్థత లేదువారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధివారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీమీద తిరుగబడియున్నారువారిని అపరాధులనుగా తీర్చుము.వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాకవారు చేసిన అనేక దోషములనుబట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చి ఉల్లసింతురు. ప్రధాన గాయకునికి. అష్టమశృతిమీద తంతివాద్యములతో పాడదగినది. దావీదు కీర్తన. [1] యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృశించియున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను బాగుచేయుము నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము నీ కృపనుబట్టి నన్ను రక్షించుము. మరణమైనవారికి నిన్నుగూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపముచేయువారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును. నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారువారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు. బెన్యామీను వంశస్థుడైన కూషుచెప్పిన మాటల విషయమై దావీదు యెహోవానుగూర్చి పాడినది. వీణనాదసహిత గీతము. [1] యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి యున్నాను నన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యముచేసిన యెడల నాచేత పాపము జరిగినయెడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడు చేసినయెడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించితిని గదా. (సెలా.) యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనునప్పుడువారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగలవారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై యున్నాడు. న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదునుపెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచియున్నాడు వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడుచేటును గర్భమున ధరించినవాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ప్రధానగాయకునికి. గిత్తీత్ రాగమునుబట్టి పాడతగినది. దావీదు కీర్తన. [1] యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహి మను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై నీ విరోధులనుబట్టి బాలురయొక్కయు చంటి పిల్లలయొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు. నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసి యున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చియున్నావు. గొఱ్ఱెలనన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్రమార్గములలో సంచరించువాటినన్నిటిని వాని పాదములక్రింద నీవు ఉంచియున్నావు. యెహోవా మా ప్రభువా భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది! ప్రధానగాయకునికి. ముత్లబ్బేను అను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన. [1] నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివ రించెదను. మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించియున్నావు, దుష్టులను నశింపజేసి యున్నావు వారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టి యున్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడు నుండకుండ నిర్మూలమైరి నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండ బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై యున్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు. యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగినవారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు సీయోను వాసియైన యెహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమునుగూర్చి విచారణచేయునప్పుడు బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనును వారి మొఱ్ఱను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచు సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణనుబట్టి హర్షించునట్లు యెహోవా, నన్ను కరుణించుము. మరణద్వారమున ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించు వాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి యున్నాడు. దుష్టులు తాముచేసికొనినదానిలో చిక్కియున్నారు (హిగ్గాయోన్ సెలా.) దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు గాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక. యెహోవా, వారిని భయపెట్టుము తాము నరమాత్రులమని జనులు తెలిసికొందురు గాక. (సెలా.) యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచు చున్నావు? ఆపత్కాలములలో నీ వెందుకు దాగి యున్నావు? దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడువారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కు కొందురు గాక దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అంద కుండును.వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరిం తురు. –మేము కదల్చబడము, తరతరములవరకు ఆపదచూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నది వారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచి యుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును. గుహలోని సింహమువలె వారు చాటైన స్థలములలో పొంచి యుందురు బాధపడువారిని పట్టుకొన పొంచి యుందురు బాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురువారి బలాత్కారమువలన నిరాధారులు కూలుదురు. –దేవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అనివారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా బాధపడువారిని మరువక నీ చెయ్యి యెత్తుము దుష్టులు దేవుని తృణీకరించుట యేల? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అను కొనుటయేల? నీవు దీనిని చూచియున్నావు గదా, వారికి ప్రతి కారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు దుష్టుల భుజమును విరుగగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవువరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజై యున్నాడు ఆయన దేశములోనుండి అన్యజనులు నశించి పోయిరి. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండు నట్లు బాధపడువారి కోరికను నీవు విని యున్నావు తండ్రిలేనివారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. [1] యెహోవా శరణుజొచ్చియున్నాను –పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల? దుష్టులు విల్లెక్కుపెట్టి యున్నారు చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అస హ్యులు, దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియువారి పానీయభాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు వాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ప్రధానగాయకునికి. అష్టమశ్రుతిమీద పాడదగినది. దావీదు కీర్తన. [1] యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి. అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును. –మా నాలుకలచేత మేము సాధించెదము మా పెదవులుమావి, మాకు ప్రభువు ఎవడని వారను కొందురు. –బాధపడువారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు ఈ తరమువారి చేతిలోనుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. [1] యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును? ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించు కొనును? యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకు ఉత్తరమిమ్ము నేను మరణనిద్ర నొందకుండను–వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింప కుండను నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచియున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను. ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. [1] —దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మ్రింగు నట్లు నా ప్రజలను మ్రింగుచు పాపము చేయువారికందరికిని తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవావారికి ఆశ్రయమై యున్నాడు. సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతో షించును. దావీదు కీర్తన. [1] యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధపర్వతముమీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలి కానికి కీడుచేయడు తన పొరుగువానిమీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చ బడడు. దావీదు రసికకావ్యము. [1] దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము. –నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును నేనీలాగందును–భూమిమీదనున్న భక్తులే శ్రేష్ఠులు;వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపనువారి పేళ్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపు చున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడ సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచి పెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు. దావీదు ప్రార్థన. [1] యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱ నంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెద వులనుండి వచ్చునదికాదు. నీ సన్నిధినుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటిమాటచేత నేను అతిక్రమింపను మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటిమాటనుబట్టి నన్ను నేను కాపాడుకొని యున్నాను. నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొఱ్ఱపెట్టుకొనియున్నాను దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చినవారిని వారిమీదికి లేచువారి చేతి లోనుండి నీ కుడిచేత రక్షించువాడా, [8-9] నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువులచేత చిక్క కుండను నీ రెక్కల నీడక్రింద నన్ను దాచుము. *** వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారువారి నోరు గర్వముగా మాటలాడును. మా అడుగుజాడలను గురుతుపెట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని యున్నారు మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహమువలెను చాటైన స్థలములలో పొంచు కొదమసింహమువలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడ గొట్టుము దుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము లోకులచేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండి నీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావువారు కుమారులుకలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు. నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ప్రధానగాయకునికి. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలోనుండియు, సౌలు చేతిలోనుండియు యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి, అతడు ఇట్లనెను. [1] యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షిం చును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీదపడి బెదరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రములనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను నిప్పుకణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదములక్రింద గాఢాంధకారము కమ్మి యుండెను. కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను. గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింప జేసెను జలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసికొనెను. ఆయన సన్నిధి కాంతిలోనుండి మేఘములును వడ గండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జనచేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరపించి వారిని ఓడగొట్టెను. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నతస్థలమునుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను. బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటె బలిష్ఠులైయుండగావారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందువారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతినిబట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టు చున్నాను ఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగానుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపు దువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును. నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్పచేసెను. నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందునువారిని నశింపజేయువరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురువారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగ ద్రొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదికి లేచినవారిని నా క్రింద అణచివేసితివి నా శత్రువులను వెనుకకు నీవు మళ్లచేసితివి నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేసితిని వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేక పోయెను యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయనవారి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టితిని వీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలుచేయు కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు లగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు నిస్తాణగలవారై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండనచేయు దేవుడు జనములను నాకు లోబరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును. నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను నీ నామకీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. [1] ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము విన బడదు. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు శూరుడు పరుగెత్త నుల్లిసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లిసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవ లము న్యాయమైనవి. అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి. వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండ నిందా రహితుడనగుదును. యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. [1] ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము చేయును గాక సీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాక నీ దహనబలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తు చున్నాము నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు తెలియును రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములోనుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము. వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. [1] యెహోవా, రాజు నీ బలమునుబట్టి సంతోషించు చున్నాడు నీ రక్షణనుబట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. (సెలా.) శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచి యున్నావు. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతని కనుగ్రహించియున్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి యున్నావు. నీ రక్షణవలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి యున్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించియున్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లిసింపజేసి యున్నావు. ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక యుంచు చున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించు కొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె అగుదురు తన కోపమువలన యెహోవావారిని నిర్మూలము చేయును అగ్ని వారిని దహించును. భూమిమీద నుండకుండ వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు నరులలో నుండకుండ వారి సంతానమును నశింప జేసెదవు. వారు నీకు కీడుచేయవలెనని ఉద్దేశించిరిదురు పాయము పన్నిరి కాని దానిని కొనసాగింప లేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖముమీద కొట్టుదువు. యెహోవా, నీ బలమునుబట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానముచేయుచు నీ పరాక్రమమును కీర్తించె దము. ప్రధానగాయకునికి. అయ్యలెత్ షహరు అను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన. [1] నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు? నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలుచేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు. మా పితరులు నీయందు నమ్మిక యుంచిరివారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీక రింపబడిన వాడను. నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు. –యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు నేమో అందురు. గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా నేను నా తల్లియొద్ద స్తన్యపానముచేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందుమైనమువలె కరగియున్నది. నా బలము యెండిపోయి చిల్లపెంకు వలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నది నీవు నన్ను ప్రేతల భూమిలోపడవేసి యున్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నా యెముకలన్నియు నేను లెక్కింపగలనువారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములువారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చియున్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ నను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను. మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడె దను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును. భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమిమీద వర్ధిల్లుచున్నవారందరు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరు ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవుతరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు. వారు వచ్చి–ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. దావీదు కీర్తన. [1] యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివా సము చేసెదను. దావీదు కీర్తన. [1] భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే. ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును. ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. (సెలా.) గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి. మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి. మహిమగల యీ రాజు ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే. ఆయనే యీ మహిమగల రాజు. దావీదు కీర్తన. [1] యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను. నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసికొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వమునుండి యున్నవే గదా. నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము. యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగి యున్నది ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను నావైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడ నియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. దేవా, వారి బాధలన్నిటిలోనుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. దావీదు కీర్తన. [1] యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించు చున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను నమ్మిక యుంచియున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షిం చుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశో ధించుము. నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను పనికిమాలినవారితో నేను సాంగత్యముచేయను వేషధారులతో పొందుచేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యముచేయను నిర్దోషినని నా చేతులు కడుగుకొందును యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్యకార్యములను వివరింతును. యెహోవా, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించు చున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవువారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యెహోవాను స్తుతించెదను. దావీదు కీర్తన. [1] యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడువారు తొట్రిల్లికూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నామీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆల యములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవామందిర ములో నివసింప గోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటె ఎత్తుగా నా తలయెత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని యెత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా –యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నాకొరకు పొంచియున్నవారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధసాక్షులును క్రూరత్వము వెళ్లగ్రక్కువారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకుము సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము. దావీదు కీర్తన. [1] యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును. నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయు నట్టు నన్ను లాగి వేయకుము.వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడు దురు వారి క్రియలనుబట్టి వారి దుష్టక్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయుము.వారు చేసిన పనినిబట్టి వారికి ప్రతికారము చేయుమువారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్త కృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపనధ్వని ఆలకించియున్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వ దింపుమువారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దావీదు కీర్తన. [1] దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును కదలించును యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నియు ఆయనకే ప్రభా వము అనుచున్నవి. యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు. యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును. గృహప్రతిష్టాపనగానము. దావీదు కీర్తన. [1] యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతో షింపనియ్యక నీవు నన్నుద్ధరించియున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళములోనుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండ నీవు నన్ను బ్రదికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమునుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును. –నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అను కొంటిని. యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిర పరచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత జెందితిని యెహోవా, నీకే మొఱ్ఱపెట్టితిని నా ప్రభువును బతిమాలుకొంటిని. –నేను గోతిలోనికి దిగినయెడల నా ప్రాణమువలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమునుగూర్చి అది వివరించునా? యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము యెహోవా, నాకు సహాయుడవై యుండుము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించె దను. ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. [1] యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారముగల యిల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలోనుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొనియున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అస హ్యులు. నీవు నా బాధను దృష్టించియున్నావు నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి యున్నావు కావున నీ కృపనుబట్టి నేను ఆనందభరితుడనై సంతో షించెదను. నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించుచున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనైయున్నాను నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను నా నెళవరులకు భీకరుడనై యున్నాను వీధిలో నన్ను చూచువారు నాయెదుటనుండి పారి పోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని. అనేకులు నామీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారువారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను –నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొఱ్ఱపెట్టియున్నాను నన్ను సిగ్గు నొందనియ్యకుము భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక; పాతాళమునందువారు మౌనులైయుందురు గాక. అబద్ధికుల పెదవులు మూయబడును గాక.వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి మంతులమీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచు చున్నావు ప్రాకారముగల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్తుతినొందును గాక. భీతిచెందినవాడనై–నీకు కనబడకుండ నేను నాశన మైతిననుకొంటిని అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి యెహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతి కారము చేయును. యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. దావీదు కీర్తన. దైవధ్యానము. [1] తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు. నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా.) నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని –యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు కొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా.) కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవ రించుచున్నది. నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి. నీతిమంతులారా, యెహోవానుబట్టి ఆనంద గానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయననుగూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు. తానున్న నివాసస్థలములోనుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు. రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు. వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారిమీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధనామమందు నమ్మిక యుంచియున్నాము. ఆయననుబట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు. యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీదనుండును గాక. దావీదు అబీమెలెకు ఎదుట వెఱ్ఱివానివలె ప్రవర్తించి అతనిచేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. [1] నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతోకూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెనువారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువా డెవడైన నున్నాడా? చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము. కీడుచేయుట మాని మేలుచేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్‌క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది. నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించునువారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును. విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపిం చును. ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచ బడుదురు యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధు లుగా ఎంచబడరు. దావీదు కీర్తన. [1] యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యె మాడుము నాతో పోరాడువారితో పోరాడుము. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము –నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింప బడి లజ్జపడుదురు గాక. యెహోవాదూత వారిని పారదోలును గాకవారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురు గాక. యెహోవాదూత వారిని తరుమును గాకవారి త్రోవ చీకటియై జారుడుగానుండును గాక. నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడును గాక. అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును. అప్పుడు–యెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడి పించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును. కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడుచేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలెవారు నా మీద పండ్లుకొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు?వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షిం పుము నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహుజనులలో నిన్ను నుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైనవారిని నన్నుగూర్చి సంతోషింపనియ్యకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీట నియ్యకుము. వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచు కొనుచున్నారు. –ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడి నదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌన ముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యె మాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము తీర్చుము నన్నుబట్టి వారు సంతోషింపకుందురు గాక. –ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అను కొనకపోదురు గాక –వాని మ్రింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురు గాక నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక –తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును. ప్రధానగాయకునికి. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. [1] భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నది వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడువరకు అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతిచేయు చున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసి యున్నాడు. వాడు మంచముమీదనే పాపయోచనను యోచిం చును వాడు కానినడతలు నడచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరముయొక్క సమృద్ధివలనవారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు చున్నావు. నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచు చున్నాము. నిన్ను ఎరిగినవారియెడల నీ కృపను యథార్థహృదయులయెడల నీ నీతిని ఎడతెగక నిలు పుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనులచేతిని నన్ను పారదోలనియ్యకుము. అదిగో పాపముచేయువారు అక్కడ పడియున్నారు లేవలేకుండ వారు పడద్రోయబడి యున్నారు. దావీదు కీర్తన. [1] చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగునువలె నీ నీతిని మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము కీడుచేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురువారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురువారినిచూచి పండ్లు కొరుకుదురు. వారి కాలమువచ్చుచుండుట ప్రభువు చూచు చున్నాడు.వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరునువారి విండ్లు విరువబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్ఠము. భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడువారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందువారు సిగ్గునొందరు కరవు దినములలో వారు తృప్తిపొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి యుందురు అది కనబడకపోవునట్లువారు పొగవలె కనబడక పోవుదురు. భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించినవారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు. నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గానివారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురువారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు. కీడుచేయుట మాని మేలుచేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్న టెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురువారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించునువారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడువారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషు లుగా ఎంచడు. యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలముకాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి యుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవావారికి సహాయుడై వారిని రక్షించునువారు యెహోవా శరణుజొచ్చియున్నారు గనుక ఆయన భక్తిహీనులచేతిలోనుండి వారిని విడిపించి రక్షించును. జ్ఞాపకార్థమైనది. దావీదు కీర్తన. [1] యెహోవా, కోపోద్రేకముచేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతచేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది. నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు. నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి. నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి యెడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను –నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ పడుదురని నేననుకొనుచున్నాను. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక. నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమునుగూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైనవారును బలవంతులునైయున్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడుచేయుచున్నారు నేను ఉత్తమమైనదాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యెహోవా, నన్ను విడువకుము నా దేవా, నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ప్రధానగాయకుడైన యెదూతూనునకు. దావీదు కీర్తన. [1] నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమియు మాటలాడక మౌనినైతిని క్షేమమునుగూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని –యెహోవా, నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొన గోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి యున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. (సెలా.) మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు.వారు తొందరపడుట గాలికే గదావారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను. నా అతిక్రమములన్నిటినుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని. నీవు పంపిన తెగులు నా మీదనుండి తొలగింపుము. నీ చేతి దెబ్బవలన నేను క్షీణించుచున్నాను. దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడ గొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా.) యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథివంటివాడను నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను నేను వెళ్లిపోయి లేకపోకమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. [1] యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను. నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగఊబిలోనుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను. తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహనబలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు–పుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊర కుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగుచేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల యెత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తలవెండ్రుకలను మించియున్నవి నా హృదయము అధైర్యపడి యున్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక నాకు కీడుచేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక. నన్ను చూచి–ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయ మొందుదురు గాక. నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక నీ రక్షణ ప్రేమించువారు–యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. [1] బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. –యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసి యున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట లాడుచున్నారు –వాడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు మాసిపోవును? అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చినయెడల వాడు అబద్ధ మాడును వాని హృదయము పాపమును పోగుచేసికొనుచున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుస లాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలో చించుచున్నారు. –కుదురని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచితిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజ నము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతికారము చేసెదను. నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుటచూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను. నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింప బడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రధానగాయకునికి. కోరహు కుమారులు రచించినది. దైవధ్యానము. [1] దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవముగల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను? –నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను. జనసమూహముతో పండుగచేయుచున్న సమూహ ముతో నేను వెళ్లిన సంగతిని సంతోషముకలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది. నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది కావున యొర్దాను ప్రదేశమునుండియు హెర్మోను పర్వతమునుండియు మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను. నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున–నీవేల నన్ను మరచియున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. –నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు.వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను. దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యె మాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితి వేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప నేల? నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధపర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందసంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించెదను నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను. ప్రధానగాయకునికి కోరహు కుమారులు చేసినది. దైవధ్యానము. [1] దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసినపనినిగూర్చి మేము చెవులార విని యున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలముచేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచు కొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియేవారికి విజయము కలుగజేసెను. దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము. నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కి వేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించు వాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. (సెలా.) అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు. శత్రువులయెదుట నిలువకుండ మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టమువచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు. భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱెలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే నీవే నీ ప్రజలను అమ్మి యున్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పద ముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణ ముగాను మమ్మును ఉంచియున్నావు. అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు. [15-16] నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులనుబట్టియు పగ తీర్చుకొనువారినిబట్టియు నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. *** ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మా చేతులు చాపియున్నయెడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడు చున్నాము ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము. నీ ముఖమును నీ వేల మరుగుపరచియున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి యున్నావు? మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పెట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము. ప్రధానగాయకునికి షోషనీయులను రాగముమీద పాడదగినది. కోరహు కుమారులు రచించిన దైవధ్యానము. ప్రేమనుగూర్చిన గీతము. [1] ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజునుగూర్చి రచించినదానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలె నున్నది. నరులకంటె నీవు అతిసుందరుడవై యున్నావు నీ పెదవులమీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలు దేరుము నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి ప్రజలు నీచేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు. నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసికొనివచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు. అంతఃపురములోనుండు రాజుకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసికొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీయొద్దకు తీసికొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమియందంతట నీవు వారిని అధికారులనుగా నియమించెదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ప్రధానగాయకునికి. కోరహు కుమారులది. అలామోతు అను రాగముమీద పాడదగినది. గీతము. [1] దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడిసముద్రము లలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. (సెలా.) ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయముచేయు చున్నాడు. జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగి పోవుచున్నది. సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు. యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు వాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. –ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమిమీద నేను మహోన్నతుడనగుదును సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు. ప్రధానగాయకునికి. కోరహు కుమారులు చేసినది. గీతము. [1] సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు. ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పద ముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు దేవుడు తన పరిశుద్ధిసంహాసనముమీద ఆసీనుడై యున్నాడు. జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయెను. కోరహు కుమారులది. గీతము. [1] మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధపర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై యున్నాడు. ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్ష మగుచున్నాడు. రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి. వారచ్చటనుండగా వణకును ప్రసవించు స్త్రీ వేద నయు వారిని పట్టెను. తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు. సైన్యములకధిపతియగు యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి యున్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు. (సెలా.) దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతములవరకు అంత గొప్పది నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది. నీ న్యాయవిధులనుబట్టి సీయోను పర్వతము సంతోషించును గాక యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోనుచుట్టు తిరుగుచు దానిచుట్టు సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణమువరకు ఆయన మనలను నడిపించును. ప్రధానగాయకునికి. కోరహు కుమారులది. గీతము. [1] సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు విజ్ఞానవిషయములను పలుకును నా హృదయధ్యానము పూర్ణవివేకమునుగూర్చినదై యుండును. గూఢార్థముగలదానికి నేను చెవియొగ్గెదను సితారా తీసికొని నా మరుగు మాట బయలుపరచె దను. నాకొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టు కొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతనుబట్టి పొగడుకొనువారికి నేనేల భయపడవలెను? ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండ పోదు మూర్ఖులును పశుప్రాయులును ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ యిండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారను కొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు. ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకునువారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియై యుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురువారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములోనుండి ఆయన నా ప్రాణమును విమోచించును. (సెలా.) ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని యింటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము. వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు వాని ఘనత వానివెంట దిగదు. –నీకు నీవే మేలు చేసికొంటివని మనుష్యులు నిన్ను స్తుతించినను తన జీవితకాలమున నొకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెనువారు మరి ఎన్నడును వెలుగు చూడరు. ఘనత నొంది యుండియు బుద్ధిహీనులైనవారు నశించు జంతువులను పోలియున్నారు. ఆసాపు కీర్తన. [1] దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులోనుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయనచుట్టు ప్రచండవాయువు విసరుచున్నది. [4-5] ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై –బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. *** దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. (సెలా.) నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను ఆల కించుడి ఇశ్రాయేలూ, ఆలకింపుము నేను దేవుడను నీ దేవు డను నేను నీ మీద సాక్ష్యము పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహనబలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి. నీ యింటనుండి కోడెనైనను నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను. అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు –నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యముగదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరునిమీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారునిమీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ప్రధానగాయకునికి. దావీదు బత్షెబయొద్దకు వెళ్లిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. [1] దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయుము. దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము. నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులును నీతట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము యెరూషలేముయొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులును దహనబలులును సర్వాంగ హోమములును నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠముమీద కోడెల నర్పించెదరు. ప్రధానగాయకునికి. ఎదోమీయుడైన దోయేగు సౌలునొద్దకు వచ్చి–దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చియున్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము. [1] శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయ పడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తివలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది మేలుకంటె కీడుచేయుటయు నీతి పలుకుటకంటె అబద్ధము చెప్పుటయు నీకిష్టము. (సెలా.) కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును. (సెలా.) నీతిమంతులు చూచి భయభక్తులుకలిగి –ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనసమృద్ధియందు నమ్మిక యుంచి తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పు కొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను. ప్రధానగాయకునికి. మాహలతు అను రాగముమీద పాడదగినది. దావీదు రచించినది. దైవధ్యానము. [1] దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు మేలుచేయువాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను. వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థనచేయక ఆహారము మ్రింగునట్లుగా నా ప్రజలను మ్రింగు పాపాత్ములకు తెలివిలేదా? భయకారణము లేనిచోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడివేయువారి యెముకలను దేవుడు చెదర గొట్టియున్నాడు దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి. సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణకలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇశ్రాయేలు సంతోషించును. ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. జీఫీయులు వచ్చి–దావీదు మాలో దాగియున్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము. [1] దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమునుబట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము. అన్యులు నా మీదికి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారువారు తమయెదుట దేవుని ఉంచుకొన్నవారు కారు. (సెలా.) ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులుచేయు కీడు ఆయన వారిమీదికి రప్పించును నీ సత్యమునుబట్టి వారిని నశింపజేయుము స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించి యున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ప్రధానగాయకునికి. తంతివాద్యములమీద పాడదగినది. దావీదు రచించినది. దైవధ్యానము. [1] దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము. [2-3] నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమునుబట్టియు దుష్టుల బలాత్కారమునుబట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు చున్నాను.వారు నామీద దోషము మోపుచున్నారు ఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు. *** నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచివేసెను. ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అను కొంటిని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్లువారు పట్టణపు ప్రాకారములమీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దానిమధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపెట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును. ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠిచేసి యున్నవారము ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిర మునకు పోయి యున్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగము నందును ఉన్నది అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు. పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు, మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తర మిచ్చును. తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచియున్నాను. ప్రధానగాయకునికి. యోనతేలెమ్ రెహోకీమ్ అను రాగముమీద పాడదగినది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. అనుపదగీతము. [1] దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మ్రింగవలెనని యున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మ్రింగ వలెనని యున్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్ర యించుచున్నాను. దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మికయుంచియున్నాను నేను భయ పడను శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపుకూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. తాముచేయు దోషక్రియలచేత వారు తప్పించు కొందురా? దేవా, కోపముచేత జనములను అణగగొట్టుము నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా. నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియును. దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను యెహోవానుబట్టి ఆయన వాక్యమును కీర్తించెదను నేను దేవునియందు నమ్మికయుంచియున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములోనుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించు నట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించి యున్నావు. నేను నీకు మ్రొక్కుకొని యున్నాను నేను నీకు స్తుతియాగముల నర్పించెదను. ప్రధానగాయకునికి. అల్ తష్హేతు అను రాగముమీద పాడదగినది. గుహలో దావీదు సౌలునొద్దనుండి పారిపోయినప్పుడు, అతడు రచించినది. అనుపదగీతము. [1] నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చియున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చియున్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలముచేయు దేవునికి నేను మొఱ్ఱ పెట్టుచున్నాను. ఆయన ఆకాశమునుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మ్రింగగోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. (సెలా.) నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకులమధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులువారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము క్రుంగియున్నది. నా యెదుట గుంట త్రవ్వి దానిలో తామేపడిరి. (సెలా.) నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘమండలమువరకు వ్యాపించియున్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము. ప్రధానగాయకునికి. అల్‌తష్హేతు అను రాగముమీద పాడదగినది. దావీదు రచించిన కీర్తన. అనుపదగీతము. [1] అధిపతులారా, మీరు నీతి ననుసరించి మాటలాడుదు రన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమునుబట్టి తీర్పు తీర్చు దురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించిననువారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొనునట్టి చెవిటి పామువలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము యెహోవా, కొదమ సింహముల కోరలను ఊడ గొట్టుము. పారు నీళ్లవలె వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలై పోవును. వారు కరగిపోయిన నత్తవలె నుందురు సూర్యుని చూడని గర్భస్రావమువలె నుందురు. మీకుండలకు ముళ్లకంపల సెగ తగలకమునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగర గొట్టుచున్నాడు, ప్రతి దండన కలుగగా నీతిమంతులు చూచి సంతో షించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున–నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగు ననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. ప్రధానగాయకునికి. అల్‌తష్హేతు అను రాగముమీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపినవారు ఇంటియొద్ద పొంచియున్నప్పుడు అతడు రచించినది. అనుపదగీతము. [1] నా దేవా, నా శత్రువులచేతిలోనుండి నన్ను తప్పిం పుము. నామీద పడువారికి చిక్కకుండ నన్ను ఉద్ధరించుము. పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు యెహోవా, నా దోషమునుబట్టి కాదు నా పాప మునుబట్టికాదు ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి యున్నారు. నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగు లెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము. సైన్యములకధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రా యేలు దేవా, అన్యజనులందరిని శిక్షించుటకై మేల్కొనుము అధికద్రోహులలో ఎవరిని కనికరింపకుము. (సెలా.) సాయంకాలమునవారు మరల వచ్చెదరు కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు. వినువారెవరును లేరనుకొని వారు తమ నోటనుండి మాటలు వెళ్లగ్రక్కుదురు.వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరిని నీవు అపహసించుదువు. నా బలమా, నీకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనెను నాకొరకు పొంచియున్నవారికి సంభవించినదానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో. మాకేడెమైన ప్రభువా, నీ బలముచేత వారిని చెల్లా చెదరు చేసి అణగగొట్టుము. వారి పెదవుల మాటలనుబట్టియు వారి నోటి పాప మునుబట్టియువారు పలుకు శాపములనుబట్టియు అబద్ధములనుబట్టియువారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. కోపముచేత వారిని నిర్మూలము చేయుమువారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతములవరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము. (సెలా.) సాయంకాలమునవారు మరల వచ్చెదరు కుక్కవలె మొఱుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు తిండికొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలుగనియెడల రాత్రి అంతయు ఆగుదురు. నీవు నాకు ఎత్తయిన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమునుగూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీకృపనుగూర్చిఉత్సాహగానము చేసెదను దేవుడు నాకు ఎత్తయిన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా, నిన్నే కీర్తించెదను. ప్రధానగాయకునికి. షూషనేదూతుమీద పాడదగినది. దావీదు అరమ్నహరాయీమీయులతోను అరమోజబాయీయులతోను యుద్ధము చేయగా యోవాబు ఉప్పుపల్లములో పండ్రెండు వేలమంది ఎదోమీయులను చంపి తిరిగివచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించినది. అనుపదగీతము. [1] దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదర గొట్టి యున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము. నీవు దేశమును కంపింపజేసియున్నావు దానిని బద్దలు చేసియున్నావు అది వణకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠినకార్యములు చేసితివి తూలునట్లుచేయు మద్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులుగలవారికి నీవొక ధ్వజము నిచ్చియున్నావు. (సెలా.) నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము తన పరిశుద్ధతతోడని దేవుడు మాట యిచ్చి యున్నాడు నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము ఎదోముమీద నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియా, నన్నుగూర్చి ఉత్సాహధ్వనిచేయుము. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొనిపోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావు గదా? మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయ చేయుము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. దావీదు కీర్తన. [1] దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నేను ఎక్కలేనంతయెత్తయిన కొండపైకి నన్ను ఎక్కిం చుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటిని. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా.) దేవా, నీవు నా మ్రొక్కుబడుల నంగీకరించి యున్నావు నీ నామమునందు భయభక్తులుగలవారి స్వాస్థ్యము నీవు నాకనుగ్రహించియున్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక అతని సంవత్సరములు తరతరములుగడచును గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమిం చుము. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించు నట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ప్రధానగాయకునికి. యెదూతూను అను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన. [1] నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనవలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తయిన నాకోట ఆయనే, నేను అంతగా కదలింప బడను. ఎన్నాళ్లు మీరు ఒకనిపైబడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడ ద్రోయునట్లు మీ రందరు ఎన్నాళ్లు ఒకని పడ ద్రోయ చూచుదురు? అతని ఔన్నత్యమునుండి అతని పడద్రోయుటకేవారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషమువారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. (సెలా.) నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము నా యాశ్రయము దేవునియందే యున్నది. జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము. (సెలా.) అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకొనుటచేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి. –బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది. దావీదు యూదా అరణ్యములోనుండగా రచించిన కీర్తన. [1] దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకు దును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లులేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది. నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానముచేయుచున్నది కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారువారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కలపాలగుదురు. రాజు దేవునిబట్టి సంతోషించును. ఆయనతోడని ప్రమాణముచేయు ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడువారి నోరు మూయబడును. ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. [1] దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయమునుండి నా ప్రాణమును కాపాడుము. కీడుచేయువారి కుట్రనుండి దుష్టక్రియలు చేయువారి అల్లరినుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టునట్లువారు తమ నాలుక లకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదుమాటలను బాణములుగా సంధించుదురు.వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరచుకొందురు చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు –మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలిసికొనుటకు ప్రయత్నిం తురు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు ప్రతివాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టునువారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచువారందరు తల ఊచుదురు మనుష్యులందరు భయముకలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించు కొందురు నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు యథార్థహృదయులందరు అతిశయిల్లుదురు. ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. గీతము. [1] దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసియున్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు నామీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకందరికిని దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైనవాడా, నీవు నీతినిబట్టి భీకరక్రియలచేత మాకు ఉత్తరమిచ్చు చున్నావు బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై తన శక్తిచేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులును భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష భరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాతవారి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లులచేత దానిని పదునుచేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాని నాశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని యున్నవి. పచ్చికపట్లు మందలను వస్త్రమువలె ధరించియున్నవి. లోయలు సస్యములతో కప్పబడియున్నవి అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి అన్నియు గానముచేయుచున్నవి. ప్రధానగాయకునికి. కీర్తన. గీతము. [1] సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. –నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమునుబట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమునుబట్టి నిన్ను కీర్తించును. (సెలా.) దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై యున్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా జేసెను జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయనయందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమమువలన నిత్యము ఏలుచున్నాడు? అన్యజనులమీద ఆయన తన దృష్టియుంచియున్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. (సెలా.) జనములారా, మా దేవుని సన్నుతించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనియ్యడు. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి. నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృద్ధిగలచోటికి మమ్ము రప్పించి యున్నావు. దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి వచ్చెదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొఱ్ఱెలను తీసికొని నీకు దహనబలులు అర్పించెదను. ఎద్దులను పోతుమేకలను అర్పించెదను. (సెలా). దేవునియందు భయభక్తులుగలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను విని పించెదను. ఆయనకు నేను మొఱ్ఱపెట్టితిని అప్పుడే నా నోట శ్రేష్ఠమైన కీర్తన యుండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినయెడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి యున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక. ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. గీతము. [1] భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక. (సెలా.) దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు. (సెలా.) జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును భూదిగంత నివాసులందరు ఆయనయందు భయభక్తులు నిలుపుదురు. ప్రధానగాయకునికి. దావీదు రచించినది. గీతము. [1] దేవుడు లేచును గాక ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధినుండి పారి పోవుదురు గాక. పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికిమైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురు గాక. నీతిమంతులు సంతోషించుదురు గాకవారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాకవారు మహదానందము పొందుదురు గాక దేవునిగూర్చిపాడుడి ఆయన నామమునుబట్టి స్తోత్ర గానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణముచేయు దేవునికొరకు ఒక రాజమార్గము చేయుడి యెహోవా అను ఆయన నామమునుబట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేనివారి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడినవారిని విడిపించి వారిని వర్ధిల్ల జేయువాడు విశ్వాసఘాతకులు నిర్జలదేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజలముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు (సెలా.) భూమి వణకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగ జారెను ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి. నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహముచేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడుసొమ్ము పంచుకొనును. గొఱ్ఱెల దొడ్లమధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది వాటి యీకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్ప బడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోనుమీద హిమము కురిసినట్లాయెను. బాషాను పర్వతము దేవపర్వతము బాషాను పర్వతము శిఖరములుగల పర్వతము. శిఖరములుగల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకొన్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు సహస్రసహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని పోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసి కొని యున్నావు. ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై యున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగుల గొట్టును. మానక దోషములు చేయువారి వెండ్రుకలుగల నడి నెత్తిని ఆయన పగులగొట్టును. ప్రభువు సెలవిచ్చినదేమనగా–నేను బాషానులోనుండి వారిని రప్పించెదను అగాధ సముద్రములలోనుండి వారిని రప్పించెదను. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు. చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి ఇశ్రాయేలులోనుండి ఉద్భవించినవారలారా, ప్రభు వును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను, వారి యేలిక అచ్చట నున్నాడు. యూదా అధిపతుల పరివారమచ్చట నున్నది జెబూలూను అధిపతులును నఫ్తాలి అధిపతులును ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించియున్నాడు. దేవా, నీవు మాకొరకు చేసినదానిని బలపరచుము యెరూషలేములోని నీ ఆలయమునుబట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడలవంటి జనములును లొంగి, వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు. ఐగుప్తులోనుండి ప్రధానులు వచ్చెదరు కూషీయులు దేవునితట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తివచ్చెదరు. భూరాజ్యములారా, దేవునిగూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి. (సెలా.) అనాదిగానున్న ఆకాశాకాశవాహన మెక్కువానిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయము నారోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలుమీద ఏలు చున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమ ముల ననుగ్రహించుచున్నాడు దేవుడు స్తుతినొందును గాక. ప్రధానగాయకునికి. షోషన్నీయులను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన. [1] దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము. నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొఱ్ఱపెట్టుటచేత అలసియున్నాను నా గొంతుక యెండిపోయెను నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు క్షీణించిపోయెను. నిర్నిమిత్తముగా నామీద పగపట్టువారు నా తలవెండ్రుకలకంటె విస్తారముగా ఉన్నారు అబద్ధమునుబట్టి నాకుశత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు నేను దోచుకొననిదానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకధిపతివగు యెహోవా, నీకొరకు కనిపెట్టుకొనువారికి నావలన సిగ్గు కలుగ నియ్యకుము ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకువారిని నావలన అవమానము నొంద నియ్యకుము. నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించినవారి నిందలు నామీద పడియున్నవి. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడువారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాటలాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి నీ రక్షణ సత్యమునుబట్టి నాకుత్తరమిమ్ము. నేను దిగిపోకుండ ఊబిలోనుండి నన్ను తప్పించుము నా పగవారిచేతిలోనుండి అగాధజలములలోనుండి నన్ను తప్పించుము. నీటివరదలు నన్ను ముంచనియ్యకుము అగాధసముద్రము నన్ను మ్రింగనియ్యకుము గుంట నన్ను మ్రింగనియ్యకుము. యెహోవా, నీ కృప ఉత్తమత్వమునుబట్టి నాకు ఉత్తర మిమ్ము నీ వాత్సల్యబాహుళ్యతనుబట్టి నాతట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై యుండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నాయొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెనని నీకు తెలిసియున్నది. నా విరోధులందరు నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవ రును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగానుండును గాకవారు నిర్భయులై యున్నప్పుడు అది వారికి ఉరిగానుండును గాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాకవారి నడుములకు ఎడతెగని వణకు పుట్టించుము. వారిమీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక వారి పాళెము పాడవును గాకవారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు. దోషముమీద దోషము వారికి తగులనిమ్ము నీ నీతి వారికి అందనీయకుము. జీవగ్రంథములోనుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము. నేను బాధపడినవాడనై వ్యాకులపడుచున్నాను దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను ఎద్దుకంటెను, కొమ్ములును డెక్కలునుగల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము బాధపడువారు దాని చూచి సంతోషించుదురు దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. యెహోవా దరిద్రుల మొఱ్ఱ ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించు వాడు కాడు. భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక సముద్రములును వాటియందు సంచరించు సమస్త మును ఆయనను స్తుతించును గాక. దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించు కొనును ఆయన నామమును ప్రేమించువారు అందులో నివ సించెదరు. ప్రధానగాయకునికి. దావీదు రచించినది. జ్ఞాపకార్థమైన కీర్తన. [1] దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడుచేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక. –ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయ మొందుదురుగాక నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణను ప్రేమించువారందరు –దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నారక్షణకర్తవు నీవే యెహోవా, ఆలస్యము చేయకుమీ. యెహోవా, నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము. నీ నీతినిబట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు. నా దేవా, భక్తిహీనులచేతిలోనుండి నన్ను రక్షిం పుము. కీడుచేయువారి పట్టులోనుండి బలాత్కారుని పట్టులోనుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే బాల్యమునుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై యుంటివి తల్లిగర్భమునుండి నన్ను ఉద్భవింపజేసినవాడవు నీవే నిన్నుగూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోను నీ ప్రభావవర్ణనతోను దినమంతయు నా నోరు నిండియున్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. నా శత్రువులు నన్నుగూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణముకొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. –దేవుడు వానిని విడిచెను తప్పించువారెవరును లేరు వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు. దేవా, నాకు దూరముగా ఉండకుము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము నా ప్రాణవిరోధులు సిగ్గుపడి నశించుదురు గాక. నాకు కీడుచేయ జూచువారు నిందపాలై మాన భంగము నొందుదురుగాక. నేను ఎల్లప్పుడు నిరీక్షింతును నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన యెహోవాయొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను నీ నీతినిమాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమునుగూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమునుగూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండు వరకు నన్ను విడువకుము. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటియైన వాడెవడు? అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసినవాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు భూమియొక్క అగాధ స్థలములలోనుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధిచేయుము నాతట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము నా దేవా, నేను కూడ నీ సత్యమునుబట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించె దను. నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడుచేయజూచువారు సిగ్గుపడియున్నారువారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును. సొలొమోను కీర్తన. [1] దేవా, రాజునకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతినిబట్టి నీ ప్రజలకును న్యాయవిధులనుబట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతినిబట్టి పర్వతములును చిన్నకొండలును ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందువారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును. సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలుచునంతకాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు. గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజ యము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు. రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరు అతని సేవించెదరు. దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనిక రించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణ మును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థనచేయు దురు దినమంతయు అతని పొగడుదురు. దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడు చుండును నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చు చుండును అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్. ఆమేన్. యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. ఆసాపు కీర్తన. [1] ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవువారు పుష్టిగా నున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు. క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవివారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు. ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురువారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారిపక్షము చేరునువారు జలపానము సమృద్ధిగా చేయుదురు. –దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను కొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు. నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. –ఈలాగు ముచ్చటింతునని నేననుకొనినయెడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడ నగుదును. అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయివారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావువారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీక రింతువు. నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు. నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించువారినందరిని నీవు సంహ రించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను. ఆసాపు కీర్తన. దైవధ్యానము. [1] దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొఱ్ఱెలమీద నీ కోపము పొగరాజు చున్నదేమి? నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపా దించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపక మునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సీయోను పర్వతమును జ్ఞాపక మునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడుచేసియున్నారు నిత్యము పాడైయుండు చోట్లకు విజయము చేయుము. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన చెట్ల గుబురుమీద జనులు గొడ్డండ్ల నెత్తి నట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామమందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరచు దురు. –దేవుని మందిరములను బొత్తిగా అణగద్రొక్కుద మనుకొని దేశములోని వాటినన్నిటిని వారు కాల్చియున్నారు. సూచకక్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడును లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా? నీ హస్తమును నీ దక్షిణహస్తమును నీవెందుకు ముడుచు కొని యున్నావు? నీ రొమ్ములోనుండి దాని తీసి వారిని నిర్మూలము చేయుము. పురాతనకాలము మొదలుకొని దేవుడు నా రాజై యున్నాడు దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగుల గొట్టితివి. మకరముయొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టి తివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక జేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి. యెహోవా, శత్రువులు నిన్ను దూషణచేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము. దుష్టమృగమునకు నీ గువ్వయొక్క ప్రాణము నప్ప గింపకుము శ్రమనొందు నీవారిని నిత్యము మరువకుము. లోకములోనున్న చీకటిగల చోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసికొనుము నలిగినవానిని అవమానముతో వెనుకకు మరల నియ్యకుము. శ్రమ నొందువారును దరిద్రులును నీ నామము సన్నుతించుదురు గాక. దేవా, లెమ్ము నీ వ్యాజ్యెము నడుపుము అవివేకులు దినమెల్ల నిన్ను నిందించు సంగతి జ్ఞాప కము చేసికొనుము. నీమీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులుచేయు గల్లత్తును మరువకుము. ప్రధానగాయకునికి. అల్‌తష్హేతు అను రాగముమీద పాడదగినది. ఆసాపు కీర్తన. గీతము. [1] దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. (సెలా.) –అహంకారులై యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. –కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరుపెట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పునుండియైనను పడమటినుండియైనను అరణ్యమునుండియైనను హెచ్చుకలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి మ్రింగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురముచేయు దును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరుగగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. ఆసాపు కీర్తన. గీతము. [1] యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది. అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను. (సెలా.) దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు. కఠినహృదయులు దోచుకొనబడి యున్నారువారు నిద్రనొంది యున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను. నీవు, నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై న్యాయపుతీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. (సెలా.) నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు. ప్రధానగాయకునికి. యెదూతూను అను రాగముమీద పాడదగినది. ఆసాపు కీర్తన. [1] నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గువరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది. దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా.) నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి పోయెనా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? (సెలా.) అందుకు–నేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొను టకు నాకు కలిగినశ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీమార్గము పరిశుద్ధమైనది. దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని యున్నావు. నీ బాహుబలమువలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు. దేవా, జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను అగాధజలములు గజగజలాడెను. మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను. మోషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి. ఆసాపు కీర్తన. దైవధ్యానము. [1] నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్య ములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగు నట్లునువారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియ లను మరువకయుండి యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సులేనివారై తమపితరులవలె తిరుగబడకయు మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలి యుండకయువారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియ మించెను ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము ననుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెననివారికాజ్ఞాపించెను విండ్లను పట్టుకొని యుద్ధసన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతివారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపముచేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి. వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచ గలడా యనుచువారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్నిరాజెను ఇశ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము పుట్టెను. వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక యుంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞా పించెను. అంతరిక్షద్వారములను తెరచెను ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారి కనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను. వారి దండుమధ్యను వారి నివాసస్థలములచుట్టును ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపార తిని తనిసిరివారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంక వారి నోళ్లలో నుండగానే దేవుని కోపము వారిమీదికి దిగెనువారిలో బలిసినవారిని ఆయన సంహరించెను ఇశ్రాయేలులో యౌవనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకను పాపముచేయుచు ఆయన ఆశ్చర్యకార్యములనుబట్టి ఆయనను నమ్ముకొనక పోయిరి. కాబట్టి ఆయన, వారి దినములు ఊపిరివలె గడచి పోజేసెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరివారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియువారు జ్ఞాపకము చేసికొనిరి. అయినను వారి హృదయము ఆయనయెడల స్థిరముగానుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతిచేసిరి తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడైవారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు. కాగా–వారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను. అరణ్యమునవారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైననువారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమునువారు జ్ఞిప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండ నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెనువారి కష్టఫలములను మిడతలకప్పగించెను. వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలుచేసెను.వారి మందలను పిడుగుల పాలుచేసెను. ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను మరణమునుండి వారి ప్రాణమును తప్పింపకవారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను. అయితే గొఱ్ఱెలవలె ఆయన తన ప్రజలను తోడు కొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయనవారిని నడిపించెను వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను.వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణహస్తము సంపాదించిన యీ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను. వారియెదుటనుండి అన్యజనులను వెళ్లగొట్టెను. కొలనూలుచేత వారి స్వాస్థ్యమును వారికి పంచి యిచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివ సింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనముల ననుసరింపకపోయిరి. తమపితరులవలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లువారు తొలగి పోయిరి. వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగ జేసిరి. దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను. షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థా పన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యముమీద ఆగ్రహించెను అగ్ని వారి యౌవనస్థులను భక్షించెనువారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలుకాగావారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించు కొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధమందిరమును కట్టించెను తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱెల దొడ్లలోనుండి అతని పిలిపించెను. పాడిగొఱ్ఱెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రా యేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను. ఆసాపు కీర్తన. [1] దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడియున్నారువారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచియున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశపక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి యున్నారు. ఒకడు నీళ్లుపోసినట్లు యెరూషలేముచుట్టు వారి రక్తము పారబోసియున్నారువారిని పాతిపెట్టువారెవరును లేరు. మా పొరుగువారికి మేము అసహ్యులమైతిమి మా చుట్టునున్నవారు మమ్ము నపహసించి యెగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడును కోపపడుదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడును మండునా? నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థనచేయని రాజ్యములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మ్రింగివేసియున్నారువారి నివాసమును పాడుచేసియున్నారు మేము బహుగా క్రుంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసికొని నీవు మామీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయముచేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. –వారి దేవుడెక్కడ నున్నాడని అన్యజనులు పలుక నేల? మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్త మునుగూర్చిన ప్రతి దండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్నవాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడినవారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి యెదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొఱ్ఱెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరములవరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. ప్రధానగాయకునికి. షోషన్నీమ్ ఏదూత్ అను రాగముమీద పాడదగినది. ఆసాపు కీర్తన. [1] ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి యెదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపరమ్ము. దేవా, చెరలోనుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్లు నీ కోపము పొగరాజనిచ్చెదవు? కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు చున్నావు. మా పొరుగువారికి మమ్ము కలహకారణముగా జేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అప హాస్యము చేయుచున్నారు. సైన్యములకధిపతివగు దేవా, చెరలోనుండి మమ్ము రప్పించుము. మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీవు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపిం చెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవ రించెను. దాని తీగెలు సముద్రమువరకు వ్యాపించెను యూఫ్రటీసు నదివరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి? అడవిపంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోనుండి మరల చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీకొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్నిచేత కాల్చబడియున్నది నరకబడియున్నది నీ కోపదృష్టివలన జనులు నశించుచున్నారు. నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీకొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. అప్పుడు మేము నీ యొద్దనుండి తొలగిపోము నీవు మమ్మును బ్రదికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొఱ్ఱపెట్టుదుము యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. ప్రధానగాయకునికి. గిత్తీత్ అను రాగముమీద పాడదగినది. ఆసాపు కీర్తన. [1] మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవునిబట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశసంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజమునుండి నేను బరువును దింపగావారి చేతులు మోతగంపల నెత్తకుండ విడుదలపొందెను. ఆపత్కాలమునందు నీవు మొఱ్ఱపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము దాగు చోటులోనుండి నీకు ఉత్తరమిచ్చితిని మెరీబా జలములయొద్ద నిన్ను శోధించితిని. (సెలా.) నా ప్రజలారా, ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇశ్రాయేలూ, నీవు మా మాట వినినయెడల ఎంత మేలు! అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజచేయ కూడదు. ఐగుప్తీయుల దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయాలోచనలనుబట్టి నడుచు కొనునట్లు వారి హృదయకాఠిన్యమునకు నేను వారినప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంతమేలు! అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగ ద్రొక్కుదునువారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురువారి కాలము శాశ్వతముగా నుండును. అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఆసాపు కీర్తన. [1] దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవములమధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపు దురు? (సెలా.) పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనులచేతిలోనుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదువారు గ్రహింపరువారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నియు కదలుచున్నవి. –మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెల విచ్చియున్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరు నీకే స్వాస్థ్యముగా ఉందురు. ఆసాపు కీర్తన. గీతము. [1] దేవా, ఊరకుండకుము దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరిచేయుచున్నారు నిన్ను ద్వేషించువారు తల యెత్తి యున్నారు. నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగుజొచ్చిన వారిమీద ఆలోచనచేయుచున్నారు వారు–ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాక పోవునట్లు జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏకమనస్సుతో వారు ఆలోచనచేసికొనియున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. [6-7] గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును మోయాబీయులును హగ్రీయీలును గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు. *** అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. (సెలా.) మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము. వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి. ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లువారి సకల రాజులకును చేయుము. –దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించు కొందమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళివలెను గాలి యెదుటి వగుడాకులవలెను వారిని చేయుము అగ్ని అడవిని కాల్చునట్లు కారుచిచ్చు కొండలను తగుల పెట్టునట్లు నీ తుపానుచేత వారిని తరుముము నీ సుడిగాలిచేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదకునట్లువారికి పూర్ణావమానము కలుగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాకవారు భ్రమసి నశించుదురు గాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక. ప్రధానగాయకునికి గిత్తీత్ అను రాగముమీద పాడదగినది. కోరహు కుమారుల కీర్తన. [1] సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు యెహోవామందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులువారు నిత్యము నిన్ను స్తుతించుదురు. (సెలా.) నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలోబడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా, చెవియొగ్గుము. (సెలా.) దేవా, మా కేడెమా, దృష్టించుము నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దిన ములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు. సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు. ప్రధానగాయకునికి. కోరహు కుమారుల కీర్తన. [1] యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి యున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు. నీ ప్రజల దోషమును పరిహరించియున్నావువారి పాపమంతయు కప్పివేసి యున్నావు (సెలా.) నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకొని యున్నావు మా రక్షణకర్తవగు దేవా, మావైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మామీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రదికింపవా? యెహోవా, నీ కృప మాకు కనుపరచుము నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చుమాటను నేను చెవిని బెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభ వచనము సెలవిచ్చునువారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక. మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది. కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి. భూమిలోనుండి సత్యము మొలుచును ఆకాశములోనుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడచును ఆయన అడుగుజాడలలో అది నడచును. దావీదు కీర్తన. [1] యెహోవా, నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకుత్తరమిమ్ము నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్ల నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నన్ను కరుణింపుము ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము. ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవి యొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము, నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొఱ్ఱపెట్టె దను. ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్య ములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును ఘనపరచుదురు యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచు కొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తు తులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించి యున్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణము తీయ జూచుచున్నారువారు నిన్ను లక్ష్యపెట్టనివారై యున్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించు చున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. కోరహు కుమారుల కీర్తన. గీతము. [1] ఆయన పట్టణపు పునాది పరిశుద్ధపర్వతములమీద వేయబడియున్నది యాకోబు నివాసములన్నిటికంటె సీయోను గుమ్మ ములు యెహోవాకు ప్రియములై యున్నవి దేవుని పట్టణమా, మనుష్యులు నిన్నుగూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. (సెలా.) రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము వీరు అచ్చట జన్మించిరనియందురు. ప్రతి జనము దానిలోనే జన్మించెననియు సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచెననియు సీయోనునుగూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు –ఈ జనము అక్కడ జన్మించెనని సెలవిచ్చును. (సెలా.) పాటలు పాడుచు వాద్యములు వాయించుచు –మా ఊటలన్నియు నీయందే యున్నవని వారం దురు. ప్రధాన గాయకునికి. మహలతు లయన్నోత్ అను రాగముమీద పాడదగినది. ఎజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానము. కోరహు కుమారుల కీర్తన. గీతము. [1] యెహోవా, నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక నా మొఱ్ఱకు చెవి యొగ్గుము నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేనివానివలె అయితిని. చచ్చినవారిలో విడువబడినవాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె అయితిని నీవిక స్మరింపనివారివలె అయితినివారు నీ చేతిలోనుండి తొలగిపోయి యున్నారు గదా. అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి యున్నావు. నీ ఉగ్రత నామీద బరువుగా నున్నది నీ తరంగములన్నియు నన్ను ముంచుచున్నవి. (సెలా.) నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచి యున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్లగాకుండ నేను బంధింపబడి యున్నాను బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యెహోవా, ప్రతిదినము నేను నీకు మొఱ్ఱపెట్టు చున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? (సెలా.) సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా? నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పు కొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడుచుట యేల? నీ ముఖము నాకు చాటు చేయుట యేల? బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహా భయములు నన్ను సంహరించియున్నవి. నీళ్లు ఆవరించునట్లు అవి దినమంత నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూర చుట్టుకొని యున్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయెను. ఎజ్రాహీయుడైన ఏతాను రచించినది. దైవధ్యానము. [1] యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను. –కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేననుకొనుచున్నాను. –నేను ఏర్పరచుకొనినవానితో నిబంధన చేసి యున్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి యున్నాను. (సెలా.) యెహోవా, ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యము లను స్తుతించుచున్నది పరిశుద్ధదూతల సమాజములో నీ విశ్వాస్యతనుబట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు? పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు. యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు. సముద్రపు పొంగు నణచువాడవు నీవే దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచి వేయుచున్నావు. చంపబడినదానితో సమానముగా నీవు రహబును, ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలముచేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమునుబట్టి ఉత్సాహ ధ్వని చేయుచున్నవి. పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది. నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచు కొనుచున్నారు. నీ నామమునుబట్టి వారు దినమెల్ల హర్షించుచున్నారు. నీ నీతిచేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీదయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడెము యెహోవావశము మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి –నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధైతెలముతో అతని నభిషేకించియున్నాను. నా చెయ్యి యెడతెగక అతనికి తోడై యుండును నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతనిమీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు. అతనియెదుట నిలువకుండ అతని విరోధులను నేను పడగొట్టెదను. అతనిమీద పగపట్టువారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును. నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రముమీద అతనిచేతిని నదులమీద అతని కుడిచేతిని ఉంచెదను. –నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగాచేయు దును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును. శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయవిధుల నాచరింపనియెడల వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొననియెడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనువారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను. కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చి యుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు నీ అభిషిక్తునిమీద నీవు అధికకోపము చూపి యున్నావు. నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచి యున్నావు. అతని కంచెలన్నియు నీవు తెగగొట్టియున్నావు అతని కోటలు పాడుచేసియున్నావు త్రోవను పోవువారందరు అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను. అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించియున్నావు అతని శత్రువులనందరిని నీవు సంతోషపరచి యున్నావు అతని ఖడ్గము ఏమియు సాధింపకుండ చేసియున్నావు యుద్ధమందు అతని నిలువబెట్టకున్నావు అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు అతని యౌవనదినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు (సెలా.) యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యముదాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసికొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి యున్నావు? మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాస్యతతోడని నీవు దావీదుతో ప్రమా ణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడ? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసికొనుము బలవంతులైన జనులందరిచేతను నా యెదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసికొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషిక్తుని నడతలమీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతినొందును గాక ఆమేన్ ఆమేన్. దైవజనుడైన మోషేచేసిన ప్రార్థన. [1] ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు –నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి. వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దునవారు పచ్చ గడ్డివలె చిగిరింతురు ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము. మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము. మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్నయెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును? మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనుపరచుమువారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీదనుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. –ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేలమంది కూలినను అపాయము నీ యొద్దకురాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును –యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండవారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను. విశ్రాంతిదినమునకు తగిన కీర్తన. గీతము. [1] యెహోవాను స్తుతించుట మంచిది [2-3] మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. *** ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతిగంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు. నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశిం చెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు. గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకువిరోధముగా లేచినదుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్యువేయుదురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు యెహోవా మందిరములో నాటబడినవారైవారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతు డనియు ఆయనయందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టు కొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది. పురాతనకాలమునుండి నీ సింహాసనము స్థిరమాయెను సదాకాలము ఉన్నవాడవు నీవే వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము. యెహోవా, ప్రతికారముచేయు దేవా, ప్రతికారముచేయు దేవా, ప్రకాశింపుము భూలోక న్యాయాధిపతీ లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరు బింకములాడుచున్నారు. –యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రిలేనివారిని హతముచేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది. యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడువరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపుతీర్పు జరుగును యథార్థహృదయులందరు దాని ననుసరించెదరు. దుష్టులమీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును. –నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది. కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగునా? దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారిమీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తయిన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారిదోషము వారిమీదికి రప్పించునువారి చెడుతనమునుబట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవావారిని సంహరించును. రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వనిచేయు దము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానముచేయు దము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహా దేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వతశిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు దము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీపితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి –వారు హృదయమున తప్పిపోవు ప్రజలువారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి–వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతిం చుడి అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవిశాలమును సృజించినవాడు. ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి మహిమబలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసికొని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారముచేయుడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి యెహోవా వేంచేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించును గాక సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దానియందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నియు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయు చున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతనుబట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూ లోకము ఆనందించునుగాక ద్వీపములన్నియు సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయనచుట్టునుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడచుచున్నది అది చుట్టునున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములుమైనమువలె కరగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడు దురు సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును. యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై యున్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్న త్యము పొందియున్నావు. యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతులకొరకు వెలుగును యథార్థహృదయులకొరకు ఆనందమును విత్తబడి యున్నవి. నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. గీతము. [1] యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయననుగూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది. యెహోవా తన రక్షణను వెల్లడిచేసియున్నాడు అన్యజనులయెదుట తన నీతిని బయలుపరచి యున్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్య తలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి. సితారాస్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి సితారా తీసికొని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును. సీయోనులో యెహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను.వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను. మేఘస్తంభములోనుండి ఆయన వారితో మాట లాడెనువారు ఆయన శాసనముల ననుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి యెహోవా మా దేవా, నీవు వారికుత్తరమిచ్చితివివారిక్రియలనుబట్టి ప్రతికారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధపర్వతము ఎదుట సాగిలపడుడి. స్తుత్యర్పణ కీర్తన. [1] సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానముచేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును. దావీదు కీర్తన. [1] నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను యెహోవా, నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు? నా యింట యథార్థహృదయముతో నడుచుకొం దును నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్య ములు అవి నాకు అంటనియ్యను మూర్ఖచిత్తుడు నా యొద్దనుండి తొలగిపోవలెను దౌష్ట్యమును నేననుసరింపను. తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైనవారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకు లగుదురు. మోసము చేయువాడు నా యింట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు. యెహోవా పట్టణములోనుండి పాపము చేయువారినందరిని నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను సంహరించెదను. దుఃఖముచేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొఱ్ఱ. [1] యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తర మిమ్ము. పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి. ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను. నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహ మునకు అంటుకొనిపోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పైడికంటెవలె నున్నాను. రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను. దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నామీద వెఱ్ఱికోపముగలవారు నా పేరు చెప్పి శపిం తురు. నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరము లుండును. నీవు లేచి సీయోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను. దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములువారు దాని మంటిని కనికరించుదురు అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపకవారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు. యెహోవాను సేవించుటకై జనములును రాజ్యములును కూర్చబడునప్పుడు మనుష్యులు సీయోనులో యెహోవా నామఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించు నట్లు చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడినవారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమునుండి వంగి చూచెననియు ఆకాశమునుండి భూమిని దృష్టించెననియు వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ వలెను సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నాబలము క్రుంగజేసెను నా దినములు కొద్దిపరచెను. నేనీలాగు మనవిచేసితిని–నా దేవా, నాదినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురువారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. దావీదు కీర్తన. [1] నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడువారికందరికి న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర పరచియున్నాడు. తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను చున్నాడు. నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుస రించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిర పరచియున్నాడు. ఆయన అన్నిటిమీద రాజ్యపరిపాలనచేయుచున్నాడు. యెహోవాదూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతిం చుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించిన వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు. వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనముచేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసికొనియున్నాడు. భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను. దానిమీద అగాధజలములను నీవు వస్త్రమువలె కప్పితివి. కొండలకుపైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును. అవి అడవిజంతువులన్నిటికి దాహమిచ్చును. వాటివలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలోనుండి ఆయన కొండలకు జలధారల నిచ్చును నీ క్రియల ఫలముచేత భూమి తృప్తిపొందుచున్నది. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు అందుమూలమున భూమిలోనుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తిపొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసముచేయుచున్నవి. గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియ మించెను సూర్యునికి తన అస్తమయకాలము తెలియును నీవు చీకటి కలుగచేయగా రాత్రియగుచున్నది అప్పుడు అడవిజంతువులన్నియు తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలోనుండి తీసికొన జూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలమువరకు పాటుపడి తమ పనులను జరుపు కొనుటకై మనుష్యులు బయలువెళ్లుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది. అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరము లున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి పరచబడును. నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగానుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను. పాపులు భూమిమీదనుండి లయమగుదురు గాక భక్తిహీనులు ఇక నుండకపోదురు గాక నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము యెహోవాను స్తుతించుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతో షించుదురుగాక. యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా ఆయన యేర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసికొనుడి ఆయన చేసిన సూచక క్రియలను ఆయననోటి తీర్పు లను జ్ఞాపకముచేసికొనుడి ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరములవరకు అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును— నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై యుండగను –కొలవబడిన స్వాస్థ్యముగా కనానుదేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి యున్నాడు. వారు జనమునుండి జనమునకును ఒక రాజ్యమునుండి మరియొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా –నేనభిషేకించినవారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడుచేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్య లేదు ఆయన వారికొరకు రాజులను గద్దించెను. దేశముమీదికి ఆయన కరవు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదలచేసెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధిచెప్పుటకును తన యింటికి యజమానునిగాను తన యావదాస్తిమీద అధికారిగాను అతని నియ మించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాముదేశమందు పరదేశిగా నుండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానవృద్ధి కలుగ జేసెను వారి విరోధులకంటె వారికి అధికబలము దయచేసెను. తన ప్రజలను పగజేయునట్లును తన సేవకులయెడల కుయుక్తిగా నడచునట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. వారు ఐగుప్తీయులమధ్యను ఆయన సూచక క్రియలను హాముదేశములో మహత్కార్యములను జరిగించిరి ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెనువారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి చేపలను చంపెను. వారి దేశములో కప్పలు నిండెను అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెనువారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించెను.వారి దేశములో అగ్నిజ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్షతీగెలను వారి అంజూరపు చెట్లను పడ గొట్టెను వారి ప్రాంతములయందలి వృక్షములను విరుగకొట్టెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలును లెక్కలేని చీడపురుగులును వచ్చెను, అవి వారిదేశపు కూరచెట్లన్నిటినివారి భూమి పంటలను తినివేసెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులనువారి ప్రథమసంతానమును ఆయన హతముచేసెను. అక్కడనుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను వారి గోత్రములలో నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్క డైనను లేకపోయెను. వారివలన ఐగుప్తీయులకు భయము పుట్టెనువారు బయలు వెళ్లినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములోనుండి ఆహారమునిచ్చి వారిని తృప్తి పరచెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను ఎడారులలో అవి యేరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తనసేవకుడైన అబ్రాహామును జ్ఞాపకము చేసికొని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనినవారిని ఉత్సాహధ్వనితోను వెలు పలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనునట్లును తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమకార్యములను ఎవడు వర్ణింప గలడు? ఆయన కీర్తి యంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయము ననుసరించువారు ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకొనినవారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతో షించుచు నీ స్వాస్థ్యమైనవారితోకూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపక మునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరులవలెనే మేము పాపము చేసితిమి దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగు బాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించెను. ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలము లలో నడిపించెను. వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెనువారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను. వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మ్రింగెను అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. అప్పుడు ఆయన–నేను వారిని నశింపజేసెదననెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి యెహోవా మాట ఆలకింపకవారు తమ గుడారములో సణుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారిమీద చెయ్యి యెత్తెను. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని, చచ్చినవారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగావారిలో తెగులు రేగెను. ఫీనెహాసు లేచి పరిహారముచేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను. యెహోవావారికి ఆజ్ఞాపించినట్లువారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కనానుదేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను. తమ క్రియలవలనవారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించినవారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజలమీద రగులుకొనెను ఆయన తనస్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనులచేతికి అప్పగించెనువారి పగవారు వారిని ఏలుచుండిరి. వారి శత్రువులు వారిని బాధపెట్టిరివారు శత్రువులచేతి క్రింద అణపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగు బాటు చేయుచువచ్చిరి. తమ దోషముచేత హీనదశనొందిరి. అయినను వారిరోదనము తనకు వినబడగావారికి కలిగినశ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికందరికివారియెడల కనికరము పుట్టించెను. యెహోవా మాదేవా, మమ్మును రక్షింపుము మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నిన్ను స్తుతించుచు మేమతిశయించునట్లును అన్యజనులలోనుండి మమ్మును పోగుచేయుము. ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినొందును గాక ప్రజలందరు–ఆమేన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి దక్షిణము నుండియు నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును ఆమాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడుచుండిరి. నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను. ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలిగొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింప బడినవారై చీకటిలోను మరణాంధకారములోను నివాసముచేయువారి హృదయమును ఆయన ఆయాసముచేత క్రుంగజేసెను.వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములోనుండియు వారిని రప్పించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి యున్నాడు ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు. బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధతెచ్చుకొందురు. భోజనపదార్థములన్నియు వారి ప్రాణమునకు అసహ్యమగునువారు మరణద్వారములను సమీపించుదురు. కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయనవారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు దురుగాక. ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు మహాజలములమీద సంచరించుచు వ్యాపారముచేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయనచేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశమువరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైనవారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరివారు ఎటుతోచక యుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను. ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరివారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక దేశనివాసుల చెడుతనమునుబట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను. అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనునట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్షతోటలు నాటి వాటివలన సస్యఫలసమృద్ధి పొందునట్లును ఆయన ఆకలిగొనినవారిని అచ్చట కాపురముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధిక ముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు వారు బాధవలనను ఇబ్బందివలనను దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడ జేయు వాడు. అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను. యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరును మౌనముగా నుందురు. బుద్ధిమంతుడైనవాడు ఈ విషయములను ఆలోచించును యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. గీతము. దావీదు కీర్తన. [1] దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానముచేయును. స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. [5-6] దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. *** తన పరిశుద్ధత తోడని దేవుడు మాట యిచ్చియున్నాడు నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజ దండము. మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము ఎదోముమీదికి నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియనుబట్టి జయోత్సవము చేసియున్నాను. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొనిపోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మును విడనాడి యున్నావుగదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావుగదా? మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము దేవునివలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ప్రధానగాయకునికి. దావీదు కీర్తన [1] నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారువారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పెట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడుచేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేష ముంచుచున్నారు. వానిమీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడిప్రక్కను నిలుచును గాక. వాడు విమర్శలోనికి తేబడునప్పుడు దోషియని తీర్పునొందును గాక వాని ప్రార్థన పాపమగునుగాక వాని జీవితదినములు కొద్దివగును గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసికొనును గాక. వాని బిడ్డలు తండ్రిలేనివారవుదురు గాక వాని భార్య విధవరాలగును గాక వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురు గాక పాడుపడిన తమ యిండ్లకు దూరముగా జీవనము వెదకుదురు గాక వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించు కొందురు గాక వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక వానికి కృప చూపువారు లేకపోదురు గాక తండ్రిలేనివాని బిడ్డలకు దయచూపువారు ఉండక పోదురు గాక వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక వాని పితరులదోషము యెహోవా జ్ఞాపకములోనుంచు కొనును గాక వాని తల్లి పాపము తుడుపుపెట్టబడక యుండును గాక ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టి వేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడు చుండునుగాక. ఏలయనగా కృప చూపవలెనన్నమాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చి యున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలోచేరియున్నది తాను కప్పుకొను వస్త్రమువలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండును గాక. నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట లాడువారికి ఇదే యెహోవావలన కలుగు ప్రతికారము. యెహోవా ప్రభువా, నీ నామమునుబట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చ బడియున్నది. సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీనమాయెను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతినివారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు [26-27] యెహోవా నాదేవా, యిది నీచేత జరిగినదనియు యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియు నట్లు నాకు సహాయము చేయుము నీ కృపనుబట్టి నన్ను రక్షింపుము. *** వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువువారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక తమ సిగ్గునే నిలువుటంగీవలె కప్పుకొందురు గాక నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అనేకులమధ్యను నేనాయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతి లోనుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడిప్రక్కను నిలుచుచున్నాడు. దావీదు కీర్తన. [1] ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు –నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు –మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాలదేశముమీది ప్రధానుని ఆయన నలుగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును. యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి వాటియందు ఇష్టముగలవారందరు వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములుగలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును. ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు తనయందు భయభక్తులుగలవారికి ఆయన ఆహారమిచ్చియున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించియున్నాడు తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడిచేసి యున్నాడు. ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి యున్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించు వాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది. యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు కలిమియు సంపదయు వాని యింటనుండును వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునువారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు. దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగానుండును వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరువరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాని చూచి చింతపడుదురువారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యెహోవాను స్తుతించుడి యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి యున్నది ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహో వాను పోలియున్నవాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగిచూడనను గ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఐగుప్తులోనుండి ఇశ్రాయేలు అన్యభాషగల జనులలోనుండి యాకోబు బయలు వెళ్లినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధస్థలమాయెను ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను యొర్దాను నది వెనుకకు మళ్లెను. కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱెపిల్లలవలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించి నది? యొర్దానూ, నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్లేళ్లవలెను గుట్టలారా, మీరు గొఱ్ఱెపిల్లలవలెను గంతులు వేయు టకు మీకేమి సంభవించినది? భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్ని ధిని వణకుము ఆయన బండను నీటిమడుగుగాను చెకుముకి రాతిబండను నీటి ఊటలుగానుచేయు వాడు. మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక –వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయనచేయు చున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమ్మిక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము. యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థుల నాశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును. భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు. ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు. మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు–యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని. యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యతగలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప జేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను ఆలాగు మాటలాడి నమ్మిక యుంచితిని. నేను మిగుల బాధపడినవాడను. నేను తొందరపడినవాడనై –ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును? రక్షణపాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా, నీమధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ స్థులు అందురు గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులుగలవారు అందురు గాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను యెహోవా నా పక్షముననున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లువారు నశించి పోయిరి యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుల గుడారములలో రక్షణనుగూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను చేయును. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ రించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు చున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను గ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆలెఫ్. [1] యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు. ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడియుండిన నెంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము. బేత్. యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్దిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. గీమెల్. నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ దయారసము చూపుము నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతు లను చూచునట్లు నా కన్నులు తెరువుము. నేను భూమిమీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము. నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనముల ననుసరించుచున్నాను. నామీదికి రాకుండ నిందను తిరస్కారమును తొల గింపుము. అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాట లాడుకొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి. దాలెత్. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను. వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయుము సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను నీ న్యాయవిధులను నేను నాయెదుట పెట్టుకొని యున్నాను యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని యున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞలమార్గమున పరుగెత్తెదను. హే. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయ చేయుము అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకా రము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము. లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృద యము త్రిప్పుము. వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికిం పుము. నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము. నీ న్యాయవిధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము. వావ్. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరమీయ గలను ఏలయనగా నీమాట నమ్ముకొనియున్నాను. నా నోటనుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసి వేయకుము నీ న్యాయవిధులమీద నా ఆశ నిలిపియున్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును నేను నిత్యము దాని ననుసరించుదును నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధములేక నడుచుకొందును సిగ్గుపడక రాజులయెదుట నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను. నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతు లెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదును. జాయిన్. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసికొనుము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు. నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రమునుండి నేను తొలగక యున్నాను. యెహోవా, పూర్వకాలమునుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసికొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణచేయు చున్నాను నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది. హేత్. యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను. కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలనచేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని. భక్తిహీనులపాశములు నన్ను చుట్టుకొని యున్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను. నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలి కాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము. తేత్. యెహోవా, నీ మాటచొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమకలుగకమునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను. నీవు దయాళుడవై మేలుచేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశ ములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమునుబట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను. వేలకొలది వెండి బంగారు నాణెములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. యోద్. నీచేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయ చేయుము. నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతో షింతురు యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకువారు సిగ్గుపడుదురు గాక. నీయందు భయభక్తులుగలవారును నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున నుందురు గాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక. కఫ్. నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను –నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను? నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట యెప్పుడు? నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము. భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము. లామెద్. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది. మేమ్. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు. నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి. నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను. నూన్. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక రించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము. సామెహ్. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి. నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక. నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను. నీ కట్టడలను మీరిన వారినందరిని నీవు నిరాకరించు దువువారి కపటాలోచన మోసమే. భూమిమీదనున్న భక్తిహీనులనందరిని నీవు మష్టువలె లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. అయిన్. నేను నీతిన్యాయముల ననుసరించుచున్నాను. నన్ను బాధించువారివశమున నన్ను విడిచిపెట్టకుము. మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు గాక. నీ రక్షణకొరకు నీతిగల నీ మాటకొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృపచొప్పున నీ సేవకునికి మేలుచేయుము నీ కట్టడలను నాకు బోధింపుము నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగజేయుము జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసియున్నారు యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు. పే. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము. నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలాత్కారమునుండి నన్ను విమోచిం పుము. నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. సాదె. యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పెట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము. ఖొఫ్. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్నురక్షింపుము. తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును. నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను. రేష్. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. నన్ను తరుమువారును నా విరోధులును అనేకులు అయినను నీ న్యాయశాసనములనుండి నేను తొలగక యున్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును. షీన్. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్యభయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపుసొమ్ము సంపాదించినవానివలె నీవిచ్చిన మాటనుబట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయవిధులనుబట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదువారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు యెహోవా, నీ రక్షణకొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములనుబట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నియు నీయెదుట నున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. తౌ. యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాటచొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమునుగూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను నీ చెయ్యి నాకు సహాయమగును గాక. యెహోవా, నీ రక్షణకొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రదికింపుము నేను నిన్ను స్తుతించెదను నీ న్యాయవిధులు నాకు సహాయములగును గాక తప్పిపోయిన గొఱ్ఱెవలె నేను త్రోవవిడిచితిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. యాత్రకీర్తన. [1] నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును? తంగేడునిప్పులతోకూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును అయ్యో, నేను మెషెకులో పరదేశినై యున్నాను. కేదారు గుడారములయొద్ద కాపురమున్నాను. కలహప్రియునియొద్ద నేను చిరకాలము నివసించినవాడను. నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. యాత్రకీర్తన. [1] కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడుకునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడుకునుకడు నిద్రపోడు యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును యాత్ర కీర్తన. దావీదుది. [1] —యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమునుబట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి యున్నవి. యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమి త్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను. యాత్రకీర్తన. [1] ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీతట్టు నా కన్ను లెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మామీదికి అధికముగా వచ్చియున్నవి. మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము. యాత్రకీర్తన. దావీదుది. [1] మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడలవారు మనలను ప్రాణముతోనే మ్రింగివేసియుందురు జలములు మనలను ముంచివేసియుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లి పారి యుండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము. భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామమువలననే మనకు సహాయము కలుగుచున్నది. యాత్రకీర్తన. [1] యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు. యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాప కుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా, మంచివారికి మేలుచేయుము యథార్థహృదయులకు మేలుచేయుము. తమ వంకరత్రోవలకు తొలగిపోవువారిని పాపముచేయువారితోకూడ యెహోవా కొనిపోవును ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక. యాత్రకీర్తన. [1] సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు–యెహోవా వీరికొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతిమి. దక్షిణదేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా, చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానముచేయుచు పనలు మోసికొనివచ్చును. యాత్రకీర్తన. సొలొమోనుది. [1] యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే. మీరువేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు. వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యాత్రకీర్తన. [1] యెహోవాయందు భయభక్తులుకలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు. నిశ్చయముగా నీవు నీచేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలెనుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు. యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక. యాత్రకీర్తన. [1] ఇశ్రాయేలు ఇట్లనును –నా యౌవనకాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి నా యౌవనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపుమీద దున్నిరివారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు. సీయోను పగవారందరు సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక. వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగకమునుపే అది వాడిపోవును కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు. దారిన పోవువారు–యెహోవా ఆశీర్వాదము నీమీదనుండునుగాక –యెహోవా నామమున మేము మిమ్ము దీవించు చున్నాము అని అనకయుందురు. యాత్రకీర్తన. [1] యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును. యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను. కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము యెహోవాయొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును. యాత్రకీర్తన. దావీదుది. [1] యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచునవి కావు నాకు అందనివాటియందైనను గొప్పవాటియందైనను నేను అభ్యాసము చేసికొనుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మళ పరచుకొనియున్నాను సముదాయించుకొని యున్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నాయొద్ద నున్నది. ఇశ్రాయేలూ, ఇదిమొదలుకొని నిత్యము యెహోవామీదనే ఆశపెట్టుకొనుము. యాత్రకీర్తన. [1] యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట యిచ్చి [3-5] యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను నేను పరుండు మంచముమీది కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను. *** *** అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను. ఆయన నివాసస్థలములకు పోదము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి. యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము. –నీ గర్భఫలమును నీ రాజ్యముమీద నేను నియ మింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనినయెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించినయెడల వారి కుమారులు కూడ నీ సింహాసనముమీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు. యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు. ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగానుండును ఇక్కడనే నేను నివసించెదను దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింప జేసెదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి యున్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను అతని కిరీటము అతనిమీదనేయుండి తేజరిల్లును అనెను. యాత్రకీర్తన. దావీదుది. [1] సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలెనుండును సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు. యాత్రకీర్తన. [1] యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువార లారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్ను తించుడి. భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక. యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము. యెహోవా తనకొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచు కొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతలకంటె గొప్పవాడనియు నేనెరుగుదును. ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును. ఐగుప్తులో మనుష్యుల తొలిచూలులను పశువుల తొలి చూలులను ఆయన హతముచేసెను. ఐగుప్తూ, నీమధ్యను ఫరోయెదుటను అతని ఉద్యో గస్థుల యెదుటను ఆయనే సూచకక్రియలను మహత్కార్యములను జరి గించెను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. అమోరీయుల రాజైన సీహోనును, బాషానురాజైన ఓగును హతము చేసెను కనాను రాజ్యములన్నిటిని పాడుచేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. యెహోవా, నీ నామము నిత్యము నిలుచును యెహోవా, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరము లుండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులనుబట్టి ఆయన సంతాపము నొందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు. వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైనలేదు. వాటినిచేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి అహరోను వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవారలారా, యెహో వాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సీయోనులోనుండి సన్నుతింపబడును గాక యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్లమీద పరచినవాడు ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తుదేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. వారి మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలముచేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును. ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపో జేసెను ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును. అరణ్యమార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధినొందిన రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. బాషానురాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు చుంటిమి. వాటిమధ్యనున్న నిరవంజిచెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు–ఒక కీర్తనపాడుడి అనిరి మనలను బాధించినవారు –సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల, నా ముఖ్య సంతోషముకంటె నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసికొనుము యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. –దానిని నాశనముచేయుడి సమూలధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా. పాడు చేయబడబోవు బబులోను కుమారీ, నీవు మాకు చేసిన క్రియలనుబట్టి నీకు ప్రతికారము చేయువాడు ధన్యుడు నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకువేసి కొట్టు వాడు ధన్యుడు. దావీదు కీర్తన. [1] నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల యెదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారముచేయు చున్నాను నీ నామమంతటికంటె నీవిచ్చిన వాక్యమును నీవు గొప్పచేసియున్నావు. నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకు కృతజ్ఞతా స్తుతులు నేను చెల్లించెదను. నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. యెహోవా, భూరాజులందరు నీవు సెలవిచ్చిన మాటలువిని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. –యెహోవా మహా ప్రభావముగలవాడనివారు యెహోవా మార్గములనుగూర్చి గానము చేసె దరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి యున్నను నీవు నన్ను బ్రదికించెదవు నా శత్రువుల కోపమునుండి నన్ను రక్షించుటకై నీవు నీచేయి చాపెదవు నీ కుడిచేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును నీ చేతికార్యములను విడిచిపెట్టకుము. ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. [1] యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు. ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు. నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును –అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనినయెడల చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను. దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు నరహంతకులారా, నాయొద్దనుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్నుగూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమునుబట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించు చున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా! వారియందు నాకు పూర్ణద్వేషము కలదువారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము. ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. [1] యెహోవా, దుష్టుల చేతిలోనుండి నన్ను విడి పింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండ నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచ నలు చేయుదురువారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు. పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురువారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.) యెహోవా, భక్తిహీనులచేతిలోపడకుండ నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దే శించుచున్నారు. గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారువారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా.) అయినను నేను యెహోవాతో ఈలాగు మనవిచేయు చున్నాను –యెహోవా, నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణదుర్గము యుద్ధదినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుమువారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొన సాగింపకుము. (సెలా.) నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడలవారి పెదవుల చేటు వారిని ముంచును గాక కణకణలాడు నిప్పులు వారిమీద వేయబడును గాకవారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక. బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యెమాడు ననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞ తాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దావీదు కీర్తన. [1] యెహోవా నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నాయొద్దకు త్వరపడి రమ్ము నేను మొఱ్ఱపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితోకూడ నేను దుర్నీతికార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుమువారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారమువారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక.వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండ పేటుమీదనుండి పడ ద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మాయెముకలు పాతాళద్వారమున చెదరియున్నవి. యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీతట్టు చూచుచున్నవి నీ శరణుజొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయ కుము. నా నిమిత్తము వారు ఒడ్డిన వలనుండి పాపము చేయువారి ఉచ్చులనుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురు గాక. గుహలో నున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. దైవధ్యానము. [1] నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొను చున్నాను. నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నా కుడిప్రక్కను నిదానించి చూడుము నన్నెరిగినవాడు ఒకడును నాకు లేకపోయెను ఆశ్రయమేదియు నాకు దొరకలేదు నాయెడల జాలిపడువాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని. నేను చాలా క్రుంగియున్నాను నా మొఱ్ఱకు చెవి యొగ్గుము నన్ను తరుమువారు నాకంటె బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు చెరసాలలోనుండి నా ప్రాణమును తప్పింపుము అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్నుబట్టి అతిశయపడుదురు. దావీదు కీర్తన. [1] యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపములకు చెవి యొగ్గుము నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యెమాడకుము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారువారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలముక్రిందట చనిపోయిన వారితోపాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో క్రుంగియున్నది నాలో నా హృదయము విస్మయమొందెను. పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను. నేను నీచేతుల పని యోచించుచున్నాను నీతట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశ పడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము నీయందు నేను నమ్మిక యుంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీవైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము. యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపింపుము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. యెహోవా, నీ నామమునుబట్టి నన్ను బ్రదికిం పుము నీ నీతినిబట్టి నా ప్రాణమును శ్రమలోనుండి తప్పిం పుము. నేను నీ సేవకుడను నీ కృపనుబట్టి నా శత్రువులను సంహరింపుము నా ప్రాణమును బాధపరచువారినందరిని నశింపజేయుము. దావీదు కీర్తన. [1] నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింప బడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు. ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నే నాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరచువాడైయున్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నికచేయుటకు మనష్యులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలియున్నారువారి దినములు దాటిపోవు నీడవలె నున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహా జలములలోనుండి అన్యులచేతిలోనుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది. దేవా, నిన్నుగూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు దుష్టుల ఖడ్గమునుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు నన్ను తప్పింపుము అన్యుల చేతిలోనుండి నన్ను విడి పింపుమువారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది. మా కుమారులు తమ యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలువిధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొఱ్ఱెలు వేలకొలదిగాను పదివేలకొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా యెడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుట యైనను లేదు వాటిలో శ్రమగలవారి మొఱ్ఱ వినబడుటయైనను లేదు ఇట్టి స్థితిగలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. స్తుతికీర్తన. దావీదుది. [1] రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను నీ భీకరకార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. నీ మహా దయాళుత్వమునుగూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు యెహోవా దయాదాక్షిణ్యములుగలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు. యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి. యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వతరాజ్యము నీ రాజ్యపరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొఱ్ఱపెట్టువారికందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెర వేర్చునువారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపా డును అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించె దను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదువారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగు దురు.వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించు వాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును సీయోనూ, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడువారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతములమీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు నరులకాలిసత్తువయందు ఆయన ఆనందించడు. తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము సీయోనూ, నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచియున్నాడు నీమధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును. గొఱ్ఱెబొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిదవంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును, ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతించుడి సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియు దాని నతిక్రమింపదు. భూమిమీదనున్న మకరములారా, అగాధజలములారా, యెహోవాను స్తుతించుడి అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షము లారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షు లారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమిమీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధి పతులారా, యెహోవాను స్తుతించుడి. యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి యున్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంతజేరిన జనులగు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతోషించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టి ఆనందించుదురు గాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక. యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాకవారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక. వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి. అన్యజనులకు ప్రతి దండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకునువారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములనుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమునుబట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి. దావీదు కుమారుడును ఇశ్రాయేలురాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధికుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించుటకును యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలి వికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. –మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము పాతాళము మనుష్యులను మ్రింగివేయునట్లు వారిని జీవముతోనే మ్రింగివేయుదము సమాధిలోనికి దిగువారు మ్రింగబడునట్లువారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మ్రింగివేయు దము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. –పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము. కీడుచేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది –ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు? నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను. అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగానుండును. నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకినయెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు. న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగానుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్నురక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థమార్గములను విడిచిపెట్టెదరు కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు. వారు నడుచుకొను త్రోవలు వంకరవివారు కుటిలవర్తనులు మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యౌవనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది. దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినినయెడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవునిదృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగానుండును నీ గానుగలలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును. జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు. పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు. దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి. దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు. దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు. జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను. ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించుచున్నవి మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు. పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము. ద్రవ్యము నీయొద్ద నుండగా –రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడుచేయు క్రియలను ఏమాత్రమును చేయ గోరవద్దు కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యేక కుమారుడనైయుంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను — నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటిమాటలను మరువకుము. వాటినుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీకరించినయెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను. నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము. దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు. కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము. దొరికినవారికి అవి జీవమునువారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును. నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు అది రెండంచులుగల కత్తియంత పదునుగలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము. వెళ్లినయెడల పరులకు నీ యౌవనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను? నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంఘములమధ్యనుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలు గుచు నుందువు. నీ సొంతకుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా? అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా. నీ ఊట దీవెన నొందును. నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము. నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు? నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును. శిక్షలేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవతప్పి పోవును. నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకుకునుకుపాటైనను రానియ్యకుము. వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము. సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును దుష్టుడునై యున్నాడు వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగచేయును వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతిమూర్ఖ స్వభావముగలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగలేకుండ ఆ క్షణమందే నలుగగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడుచేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము. వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా. వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారముచేయు కాలమందు అట్టివాడు కనికర పడడు. ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము జ్ఞానముతో–నీవు నాకు అక్కవనియు తెలివితో–నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీయొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును. నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానములేనివారిమధ్యను యౌవనులమధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను. –సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగు చుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను. అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు. ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును. అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను –సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను. నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను. ఉదయమువరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదమురమ్ము. పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు అతడు సొమ్ముసంచి చేతపట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను— అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వధకు పోవునట్లును పరుల చేజిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను. నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది నిలుచుచున్నది గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది — మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి బుద్ధిహీనులారా, బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు అవియన్నియు వివేకికి తేటగాను తెలివినొందినవారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును. యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నావలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమునుబట్టి పాలనచేయుదురు. నావలన అధిపతులును లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నాయొద్ద నున్నవి. మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడిదొడ్డది. నీతిమార్గమునందును న్యాయమార్గములయందును నేను నడచుచున్నాను. నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదునువారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో షించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి. అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజనపదార్థములను సిద్ధపరచియున్నది తన పనికత్తెలచేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టలమీద అది నిలిచి — జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివిలేనివారితో అది ఇట్లనుచున్నది — వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానముచేయుడి ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమియు తెలివిలేదు. అది తన ఇంటివాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్లువారిని చూచి — జ్ఞానములేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచి–దొంగి లించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్లువారు పాతాళకూపములో ఉన్నారనియువారి ఎంతమాత్రమును తెలియలేదు. సొలొమోను చెప్పిన సామెతలు. జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణమునుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు భక్తిహీనుని ఆశను భంగముచేయును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకర మగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును జ్ఞానచిత్తుడు ఉపదేశము నంగీకరించును పనికిమాలిన వదరుబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికిమాలిన వదరుబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును. వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూఢుల నోరు అప్పుడే నాశనముచేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆయాశీర్వాదము ఎక్కువ కాదు. చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు. సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును. యథార్థవంతునికి యెహోవా యేర్పాటు ఆశ్రయదుర్గము పాపముచేయువారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును. ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణమునుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశవలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును. నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును. మేలుచేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడుచేయ గోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతం త్రించుకొనును మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతి ఫలము పొందుదురు గదా? శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును దురాలోచనలుగలవాడు నేరస్థుడని ఆయన తీర్పుతీర్చును. భక్తిహీనతవలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల యిల్లు నిలుచును. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకముకొలది పొగడబడును కుటిలచిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వానికంటె దాసుడుగల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైనవాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడుసొమ్మును అపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవులవలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలముచేత తృప్తిగా మేలుపొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును. కీడు కల్పించువారి హృదయములో మోసముకలదు సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకియైనవాడు తన విద్యను దాచి పెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును. గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును. కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు. బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ బెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులుగలవాడు కుటిలచిత్తుడు ఆయనను తిరస్కరించువాడు, మూఢుల నోట బెత్తమువంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు ఎద్దుల బలముచేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము. తెలివిగలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని యెదుటనుండి వెళ్లిపొమ్ము జ్ఞానవచనములు వానియందు కనబడవు గదా? తమ ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత. మూఢులుచేయు అపరాధపరిహారార్థబలి వారిని అపహాస్యము చేయును యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయ చూపుదురు. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. భక్తిహీనుల యిల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండ వచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలుగలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. చెడ్డవారు మంచివారి యెదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టిమాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపుఊట అది మరణపాశములలోనుండి విడిపించును జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును. బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు అవమానకరముగా నడచువానిమీద రాజు కోపించును మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలముమీదనుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని యిల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము నీతి ననుసరించువానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచినవానికి కఠినశిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. పాతాళమును అగాధకూపమును యెహోవాకు కన బడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కన బడును గదా? అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు. సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును. నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతోకూడ కొంచెము కలిగియుండుట మేలు. పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుటకంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుటమేలు. కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును. సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము. జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము వివేకముగలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును. సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము! క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచుకొనును గర్విష్ఠుల యిల్లు యెహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. దురాలోచనలు యెహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోభి తన యింటివారిని బాధపెట్టును లంచము నసహ్యించుకొనువాడు బ్రదుకును. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర మిచ్చు టకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్షనొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకియగును. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలుగును. ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశనదినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయముచేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా యొక్క యేర్పాటులు సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత జ్ఞానియైనవాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగునువారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపా దించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు. ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును. తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును. కష్టము చేయువాని ఆకలి వానికొరకు వానిచేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును. పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును. బలాత్కారి తన పొరుగువానిని లాలనచేయును కానిమార్గములో వాని నడిపించును. కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసికొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును. పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము. రుచియైన భోజన పదార్థములున్నను కలహముతోకూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద ఏలుబడిచేయును అన్నదమ్ములతోపాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడునడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధి కుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యమువలెనుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదముచేయును. బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడుచేయుటకే కోరును అట్టివానివెంట క్రూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటిని ఎదుర్కొన వచ్చును గాని మూర్ఖపుపనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు మేలుకు ప్రతిగా కీడుచేయువాని యింటనుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండ నేల? వానికి బుద్ధి లేదు గదా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు. కుటిలవర్తనుడు మేలుపొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివిలేనివాని తండ్రికి సంతోషము లేదు. సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలోనుండి లంచము పుచ్చుకొనును. జ్ఞానము వివేకముగలవాని యెదుటనే యున్నది బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతనుబట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతో షించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నింద వచ్చును. మనుష్యుని నోటి మాటలు లోతు నీటివంటివి అవి నదీప్రవాహమువంటివి జ్ఞానపు ఊటవంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనులయెడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమముకాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును. పనిలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగానుండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును. సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారియెదుటికి వానిని రప్పించును వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును. చీట్లు వేయుటచేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరచుకొనుటకంటె ఒకనిచేత అన్యాయమునొందిన సహోదరుని వశ పరచు కొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు. ఒకని నోటి ఫలముచేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయముచేత వాడు తృప్తిపొందును. జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసికొనును ధనవంతుడుదురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహి తుడు కలడు. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివిలేకుండుట మంచిది కాదు తొందరపడి నడచువాడు దారి తప్పిపోవును. ఒకనిమూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయమున యెహోవామీద కోపించును. ధనముగలవానికి స్నేహితులు అధికముగానుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరు స్నేహితులే. బీదవాడు తన చుట్టములందరికి అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్థులగుదురు వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు. బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును. భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. రాజు కోపము సింహగర్జనవంటిది అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచు వంటిది. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము. సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరివాడు పస్తు పడియుండును. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రతగా నుండువాడు చచ్చును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు. మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండును. నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికునికంటె దరిద్రుడే మేలు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయములేకుండ బ్రదుకును. సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు. తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము. వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. అపహాసకులకు తీర్పులును బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి. ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు. రాజువలని భయము సింహగర్జనవంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును. దయ చూపువానిని కలిసికొనుట అనేకులకు తట స్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. — నా హృదయమును శుద్ధపరచుకొని యున్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు? వేరువేరు తూనికె రాళ్లు వేరువేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును. వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొనియుండినయెడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు–జబ్బుది జబ్బుది అనును అవతలికి వెళ్లి దాని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చుకొనుము పరులకొరకు వానినే కుదువపెట్టించుము మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. — కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన గలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించు టయు ఒకనికి ఉరియగును. జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టునువారిమీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును. కృపాసత్యములు రాజును కాపాడును కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచు కొనును. యౌవనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము గాయములుచేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగిం చును. యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతిన్యాయముల ననుసరించి నడచుకొనుట బలులనర్పించుటకంటె యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు. భక్తిహీనులు న్యాయము చేయనొల్లరువారుచేయు బలాత్కారము వారిని కొట్టుకొనిపోవును. దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము పవిత్రుల కార్యము యథార్థము. గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు. భక్తిహీనుని మనస్సు కీడుచేయ గోరును వాడు తన పొరుగువానికైనను దయ తలచడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానముగలవాడు ఉపదేశమువలన తెలివినొందును. నీతిమంతుడైనవాడు భక్తిహీనుని యిల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలోనుంచబడిన కానుక మహా క్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము. వివేకమార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు. నీతిమంతునికొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞానియైన యొకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకార మెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును. సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును. దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు. కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము. గొప్ప ఐశ్వర్యముకంటె మంచిపేరును వెండి బంగారములకంటె దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులును దరిద్రులును కలిసియుందురు వారందరిని కలుగజేసినవాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయ మునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమను దండము కాలిపోవును. దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దీవెననొందును. తిరస్కారబుద్ధిగలవాని తోలివేసినయెడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానముగలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. సోమరి —బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును. వేశ్య నోరు లోతైనగొయ్యి యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును. లాభమునొందవలెనని దరిద్రులకు అన్యాయముచేయు వానికిని ధనవంతుల కిచ్చువానికిని నష్టమే కలుగును. చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతోమంచిది పోకుండ అవి నీ పెదవులమీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించునట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి యున్నాను? నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తర మిచ్చునట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియుగల శ్రేష్ఠమైన సామెతలు నేను నీకొరకు రచించితిని. దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవావారి పక్షమున వ్యాజ్యెమాడును ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచుకొనును. కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము. చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపోనేల? నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు. నీవు తినినను తినినదానిని కక్కి వేయుదువు నీవు పలికిన యింపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును. ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినయెడల నా హృదయము కూడ సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాని కొని యుంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని యుంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును. నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము, వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట. దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచి యుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును. ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు? ఎవరికి మంద దృష్టి? ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు నీవు నడిసముద్రమున పండుకొనువానివలె నుందువు ఓడకొయ్య చివరను పండుకొనువానివలె నుందువు. –నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు. దుర్జనులను చూచి మత్సరపడకుమువారి సహవాసము కోరకుము వారి హృదయము బలాత్కారము చేయ యోచించునువారి పెదవులు కీడునుగూర్చి మాటలాడును. జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును. తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానముగలవాడు బలవంతుడుగానుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకముగల నాయకుడవై యుద్ధముచేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులైయుందురు. కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి యుండకుము వాని విశ్రమస్థలమును పాడుచేయకుము. నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లిసింపకుము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వానిమీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయెడల మత్సరపడకుము. దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము ఆలాగు చేయనివారి జోలికి పోకుము. అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించునువారి కాలము ఎప్పుడు ముగియునో యెవరికి తెలియును? ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే –న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు –నీయందు దోషములేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు జనులు అట్టివానియందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును. సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దుపెట్టుకొనినట్లుండును. బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువానిమీద సాక్ష్యము పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? –వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెద నను కొనకుము. సోమరివాని చేను నేను దాటి రాగా తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసి యుండెను. దూలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతి గోడ పడియుండెను. నేను దాని చూచి యోచన చేసికొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంక కొంచెము నిద్ర యింక కొంచెముకునుకుపాటు పరుండుటకై యింక కొంచెము చేతులు ముడుచు కొనుట వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును. ఇవియును సొలొమోను సామెతలే యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. –సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశముల యెత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు. వెండిలోని మష్టు తీసివేసినయెడల పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును. రాజు ఎదుటనుండి దుష్టులను తొలగించినయెడల అతని సింహాసనము నీతివలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము. నీ కన్నులు చూచిన ప్రధానియెదుట ఒకడు నిన్ను తగ్గించుటకంటె –ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు గదా. ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి–దాని అంత మున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యెమాడవచ్చును గాని పరునిగుట్టు బయటపెట్టకుము. బయటపెట్టినయెడల వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి యెన్నటికిని పోకుండును. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది. బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానముగల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనమువంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల జేయును. కపటమనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు. దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించ వచ్చును సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును. తేనె కనుగొంటివా? తగినంతమట్టుకే త్రాగుము అధికముగా త్రాగినయెడల కక్కి వేయుదువేమో మాటిమాటికి నీ పొరుగువాని యింటికి వెళ్లకుము అతడు నీవలన విసికి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువానిమీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోను కీలు వసిలిన కాలుతోను సమానము. దుఃఖచిత్తునికి పాటలు వినుపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోను సురేకారముమీద చిరకపోయువానితోను సమానుడు. నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాళితో పెద్ద యింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశమునుండి వచ్చిన శుభసమాచారము అట్లుండును. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. తేనె నధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే. ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోయిలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును. గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్యకుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు. వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమానుడు. కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటిలేకుండును బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండ కట్టువానితో సమానుడు. –మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాని చేతిలోముల్లు గుచ్చుకొన్నట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖునివలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును. తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు. సోమరి–దారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును. ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు. తెగులు అమ్ములు కొఱవులు విసరు వెఱ్ఱివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు. కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును. వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు. వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగగొట్టినవారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును. రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు. క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు? లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును. కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కివేయును. ఆకలిగొనినవానికి చేదువస్తువైనను తియ్యగా నుండును. తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచు నట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచి పెట్టకుము నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి వెళ్లకుము దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృద యమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివానికొరకు పూటబడినవాని వస్త్రము పుచ్చుకొనుము పరులకొరకు పూటబడినవానివలన కుదువపెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను తన కుడిచేత నూనె పట్టుకొనువానితోను సమానుడు. ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరియొకని మనస్సు కనబడును. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు ఆలాగున నరుల దృష్టి తృప్తికానేరదు. మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును. మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదలిపోదు. నీ పశువులస్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామివేయబడెను పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి యేరబడియున్నది నీ వస్త్రములకొరకు గొఱ్ఱెపిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును నీ ఆహారమునకు నీ యింటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును. ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు. దేశస్థుల దోషమువలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధిజ్ఞానములుగలవారిచేత దాని అధికారము స్థిర పరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహారవస్తువులను ఉండనియ్యక కొట్టుకొనిపోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడు చుందురు ధర్మశాస్త్రము ననుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించినవానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశము నంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించువానికొరకు దాని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైనదానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకముగల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు. వివేకములేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారీ, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరును అట్టివానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యము చేసికొనువానికి కడుపునిండ అన్నము దొరకును వ్యర్థమైనవాటిని అనుసరించువారికి కలుగు పేదరికము ఇంతంతకాదు. నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్కకొరకు ఒకడు దోషముచేయును. చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును. తన తలిదండ్రుల సొమ్ము దోచుకొని–అది ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు. పేరాసగలవాడు కలహమును రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసికొనువానికి బహు శాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురువారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోష పరచును వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడుచేయును. న్యాయము జరిగించుటవలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడు చేయును. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బీదలకొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ జూతురు. బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును. అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు బీదలును వడ్డికిచ్చువారును కలిసికొందురు ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలునువారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచెదరు. నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోష పరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండనచేత గుణపడడు తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును దొంగతో పాలుకూడువాడు తనకుతానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. దేవోక్తి, అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును, ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పినమాట. నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను పరిశుద్ధ దేవునిగూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా? దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొను చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము; వ్యర్థమైనవాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి –యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చినవారి తరము కలదు.వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి! దేశములో ఉండకుండ వారు దరిద్రులను మ్రింగు నట్లును మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయు నట్లును ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లునుగల వారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తిపడనివి మూడు కలవు–చాలును అని పలుకనివి నాలుగు కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ నడచుజాడ, కన్యకతో పురుషుని జాడ. జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు తుడుచుకొని –నేను ఏ దోషము ఎరుగననును. భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయ లేనివి నాలుగు కలవు. అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై యుండి పెండ్లియైన స్త్రీ, యజమాను రాలికి హక్కు దారురాలైన దాసి. భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానముగలవి. చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును. డంబముగా నడుచునవి మూడు కలవు ఠీవితో నడుచునవి నాలుగు కలవు–అవేవనగా ఎల్లమృగములలో పరాక్రమముగలదై ఎవనికైన భయపడి వెనుకకు తిరుగని సింహము శోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడియుండినయెడల కీడు యోచించి యుండినయెడల నీ చేతితో నోరు మూసికొనుము. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతని కుపదేశించిన దేవోక్తి, నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనే మందును? నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలూ, అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగినయెడల వారు కట్టడలను మరతురు దీనులకందరికి అన్యాయము చేయుదురు ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి. వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచకుందురు. మూగవారికిని దిక్కులేనివారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలుచేయును గాని కీడేమియు చేయదు. ఆమె గొఱ్ఱెబొచ్చును అవిసెనారను వెదకును తన చేతులార వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసికొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట యొకటి నాటించును. ఆమె నడికట్టుచేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపారలాభము అనుభవముచే తెలిసికొనును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేతపట్టుకొనును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన యింటివారికి చలి తగులునని భయపడదు ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోకూడ కూర్చుండును గవినియొద్ద పేరుగొనినవాడైయుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన యింటివారి నడతలను బాగుగా కని పెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు — చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించియున్నారు గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునైయుండిన ప్రసంగి పలికిన మాటలు. –వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే.౹ సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి? తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది.౹ సూర్యుడుదయించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును.౹ గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును.౹ నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును ఎడతెరిపిలేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింప జాలరు; చూచుటచేత కన్ను తృప్తిపొందకున్నది, వినుటచేత చెవికి తృప్తికలుగుట లేదు.౹ మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది;మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు.౹ ఇది నూతనమైనదని యొకదానిగూర్చి యొకడు చెప్పును; అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే.౹ పూర్వులు జ్ఞాపకమునకు రారు; పుట్టబోవువారి జ్ఞాపకము ఆ తరువాత నుండ బోవువారికి కలుగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులమీద రాజునైయుంటిని.౹ ఆకాశముక్రింద జరుగునది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది.౹ సూర్యునిక్రింద జరుగుచున్న క్రియల నన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి.౹ వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు, లోపముగలది లెక్కకు రాదు.౹ యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటెను నేను చాల ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనస్సులో నేననుకొంటిని.౹ నా మనస్సు నిలిపి, జ్ఞానాభ్యాసమును వెఱ్ఱితనమును మతిహీనతను తెలిసికొనుటకు ప్రయత్నించితిని; అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలిసికొంటిని.౹ విస్తారమైన జ్ఞానాభ్యాసముచేత విస్తారమైన దుఃఖము కలుగును; అధిక విద్య సంపాదించినవానికి అధిక శోకము కలుగును. కానీ నిన్ను సంతోషముచేత శోధించి చూతును; —నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్న మాయెను.౹ నవ్వుతో— నీవు వెఱ్ఱిదానవనియు, సంతోష ముతో–నీచేత కలుగునదేమియనియు నేవంటిని.౹ నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రదుకుకాలమంతయు మనుష్యులు ఏమిచేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి, నా దేహమును ద్రాక్షారసముచేత సంతోషపరచుకొందుననియు, మతి హీనతయొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసికొంటిని.౹ నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని.౹ నాకొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకలవిధములైన ఫలవృక్షములను నాటించితిని.౹ వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని.౹ పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని; నా యింట పుట్టిన దాసులు నాకుండిరి; యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱె మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని.౹ నాకొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని; నేను గాయకులను గాయకురాండ్రను మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచు కొంటిని.౹ నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని; నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు.౹ నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు; మరియు నా హృదయము నా పనులన్నిటినిబట్టి సంతో షింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము.౹ అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. రాజు తరువాత రాబోవువాడు, ఇదివరకు జరిగిన దాని విషయము సయితము ఏమి చేయునో అనుకొని, నేను జ్ఞానమును వెఱ్ఱితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని.౹ అంతట చీకటికంటె వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనతకంటె జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలిసికొంటిని.౹ జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటియందు నడుచుచున్నాడు; అయినను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని.౹ కావున–బుద్ధిహీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందనుకొంటిని. ఇదియు వ్యర్థమే.౹ బుద్ధిహీనులనుగూర్చినట్లుగానే జ్ఞానులనుగూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని యుంచబడదు; రాబోవు దినములలో వారందరును మరువబడినవారై యుందురు; జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతి నొందు విధమట్టిదే.౹ ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను–అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రదుకుట నా కసహ్యమాయెను. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని.౹ వాడు జ్ఞానము గలవాడైయుండునో బుద్ధిహీనుడైయుండునో అది ఎవ నికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాస పడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే.౹ కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస మంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని.౹ ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయ వలసి వచ్చును; ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై యున్నది.౹ సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస మంతటిచేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది? వాని దినములన్నియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రియందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు; ఇదియువ్యర్థమే. అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జి తముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు. ఇదియును దేవునివలన కలుగునని నేను తెలిసి కొంటిని.౹ ఆయన సెలవులేక భోజనముచేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టు డగువాని కిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయుపనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.౹ పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు,౹ చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు;౹ ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;౹ రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగ లించుటకు కౌగలించుట మానుటకు;౹ వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు;౹ చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;౹ ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు.౹ కష్టపడినవారికి తమ కష్టమువలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని.౹ దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.౹ కావున సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసి కొంటిని.౹ మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చు కొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని.౹ దేవుడుచేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని; దాని కేదియు చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు; మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు.౹ ముందు జరిగినదే ఇప్పుడును జరుగును; జరుగబోవునది పూర్వమందు జరిగి నదే; జరిగిపోయినదానిని దేవుడు మరల రప్పించును. మరియు లోకమునందు విమర్శస్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను.౹ ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని.౹ కాగా తాము మృగములవంటివారని నరులు తెలిసికొనునట్లును, దేవుడు వారిని విమర్శించునట్లును ఈలాగు జరుగుచున్నదని అనుకొంటిని.౹ నరులకు సంభవించునది యేదో అదే మృగములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము.౹ సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.౹ నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో యెవరికి తెలియును? కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపి కొనిపోవువాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటె వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలిసికొంటిని; ఇదే వారి భాగము. పిమ్మట సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.౹ కాబట్టి యింకను బ్రదుకుచున్నవారి కంటె ఇంతకుముందు కాలము చేసినవారే ధన్యులను కొంటిని.౹ ఇంకను పుట్టనివారు సూర్యునిక్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువుచేత ఈ ఉభయులకంటెను వారే ధన్యులనుకొంటిని. మరియు కష్టమంతయు నేర్పుతోకూడిన పను లన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకైచేయు ప్రయత్నమువలెనున్నది.౹ బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును.౹ శ్రమయును గాలికైన యత్నములును రెండు చేతులనిండ నుండుటకంటె ఒక చేతినిండ నెమ్మదికలిగి యుండుట మేలు. నేనాలోచింపగా వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను.౹ ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడు— సుఖమను నది నేనెరుగక ఎవరినిమిత్తము కష్టపడుచున్నానని అను కొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును.౹ ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలముకలుగును గనుక ఒంటిగాడైయుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు.౹ వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేక పోవును.౹ ఇద్దరు కలిసి పండుకొనినయెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును? ఒంటరియగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా? మూఢత్వముచేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజుకంటె బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్న వాడే శ్రేష్ఠుడు.౹ అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలోనుండి బయలువెళ్లును.౹ సూర్యునిక్రింద సంచరించు సజీవులందరు గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్న వాని పక్షమున నుందురని నేను తెలిసికొంటిని.౹ అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు, అయినను తరువాత రాబోవువారు వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము; బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుటకంటె సమీపించి ఆలకించుట శ్రేష్ఠము; వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు.౹ నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచు కొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను.౹ విస్తారమైన పనిపాటులవలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును.౹ నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము; బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు.౹ నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొనకుండుటయే మేలు.౹ నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటివలన జరుగనియ్యకుము; అది పొరపాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము; నీ మాటలవలన దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు? అధికమైన స్వప్నములును మాటలును నిష్‌ప్రయోజనములు; నీమట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కనబడినయెడల దానికి ఆశ్చర్యపడకుము; అధికారము నొందినవారిమీద మరి ఎక్కువ అధికారము నొందినవా రున్నారు; మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా నున్నాడు.౹ ఏ దేశములో రాజు భూమివిషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వవిషయములయందు మేలు కలుగును. ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తి నొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తి నొందడు; ఇదియు వ్యర్థమే.౹ ఆస్తి యెక్కువైనయెడల దాని భక్షించువారును ఎక్కువ అగుదురు; కన్నులార చూచుటయేగాక ఆస్తిపరునికి తన ఆస్తివలని ప్రయోజన మేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధిచేత నిద్రపట్టదు. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించు కొనును.౹ అయితే ఆ ఆస్తి దురదృష్టమువలన నశించి పోవును; అతడు పుత్రులుగలవాడైనను అతనిచేతిలో ఏమియు లేకపోవును.౹ వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆప్రకారముగానే తాను వచ్చి నట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాస పడి చేసికొనినదానిలో ఏదైనను చేతపట్టుకొనిపోడు;౹ అతడు వచ్చిన ప్రకారముగానే మరల పోవును; గాలికి ప్రయాసపడి సంపాదించినదానివలన వానికి లాభమేమి? ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే, తన దినములన్నియు అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును. మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటయైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటివలన క్షేమముగా బ్రదుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము.౹ మరియు దేవుడు ఒకనికి ధనధాన్యసమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసినయెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదమువలన కలిగినదను కొనవలెను.౹ అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసియున్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసికొనడు. సూర్యుని క్రింద దురవస్థ యొకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువకాకుండును; అయినను దాని ననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహింపడు, అన్యుడు దాని ననుభవించును; ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది.౹ ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండముయొక్క గతి మేలని నేననుకొనుచున్నాను అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటిచేత కమ్మబడెను.౹ అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతికంటె దాని గతి నెమ్మదిగలది.౹ అట్టివాడు రెండువేల సంవత్సరములు బ్రదికియు మేలు కానకయున్నయెడల వానిగతి అంతే; అందరును ఒక స్థలమునకే వెళ్లుదురు గదా.౹ మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా; అయినను వారి మనస్సు సంతుష్టినొందదు.౹ బుద్ధిహీనులకంటె జ్ఞానుల విశేషమేమి? సజీవులయెదుట బ్రదుకనేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాశలుకలిగి తిరుగు లాడుటకన్న ఎదుట నున్నదానిని అనుభవించుట మేలు; ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ముందుండినది బహుకాలముక్రిందనే తెలియబడెను; ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయ మాయెను; తమకంటె బలవంతుడైనవానితో వారు వ్యాజ్యెమాడజాలరు.౹ పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాల ఉండును; వాటివలన నరులకేమి లాభము? నీడవలె తమ దినములన్నియు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రదుకునందు ఏది వారికి క్షేమకరమైనదో యెవరికి తెలియును? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? సుగంధతైలముకంటె మంచిపేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు.౹ విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు.౹ నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును.౹ జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును; అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును.౹ బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు.౹ ఏలయనగా బానక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే; ఇదియు వ్యర్థము.౹ అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు; లంచము పుచ్చుకొనుటచేత మనస్సు చెడును.౹ కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.౹ ఈ దినములకంటెమునుపటి దినములు ఏల క్షేమకరములు అని యడుగవద్దు; ఈ ప్రశ్నవేయుట జ్ఞానయుక్తము కాదు జ్ఞానము స్వాస్థ్యమంత యుపయోగము; సూర్యుని క్రింద బ్రదుకువారికి అది లాభకరము.౹ జ్ఞానము ఆశ్ర యాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.౹ దేవుని క్రియలను ధ్యానించుము; ఆయన వంకరగా చేసినదానిని ఎవడు చక్కపరచును? సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము; తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు. నా వ్యర్థసంచారముల కాలములో నేను వీటినన్నిటిని చూచితిని; నీతి ననుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై యుండియు చిరాయువులైన దుష్టులును కలరు.౹ అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధికముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసి కొందువు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు; నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు? నీవు దీని పట్టుకొనియుండుటయు దానిని చేయివిడువకుండుటయు మేలు; దేవునియందు భయభక్తులు గలవాడు వాటినన్నిటిని కొనసాగించును. పట్టణమందుండు పదిమంది అధికారులకంటె జ్ఞానము గలవానికి జ్ఞానమే యెక్కువైన ఆధారము.౹ పాపము చేయక మేలుచేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.౹ నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము.౹ నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి యున్నది గదా. ఇది అంతయు జ్ఞానముచేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసికొందునని నేననుకొంటిని గాని అది నాకు దూరమాయెను.౹ సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు వివేచించుటకును పరిశోధించుటకును, జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతులయొక్క హేతువులను తెలిసికొనుటకును, భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెఱ్ఱితన మనియు గ్రహించుటకును, రూఢి చేసికొని నా మనస్సు నిలిపితిని.౹ మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ; దేవునిదృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు.౹ సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పు చున్నాను; అయితే నేను తరచి చూచినను నాకు కనబడ నిది ఒకటి యున్నది.౹ అదేదనగా వెయ్యిమంది పురుషులలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు.౹ ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు. జ్ఞానులతో సములైనవారెవరు? జరుగువాటి భావమును ఎరిగినవారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సు నిచ్చును, దానివలన వారి మోటుతనము మార్చబడును.౹ నీవు దేవునికి ఒట్టుపెట్టుకొంటివని జ్ఞాపకము చేసికొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పు చున్నాను.౹ రాజుల సముఖమునుండి అనాలోచనగా వెళ్లకుము; వారు తాము కోరినదెల్ల నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకుము.౹ రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయుపని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మము నాచరించువారికి కీడేమియు సంభవింపదు; సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలిసికొందురు.౹ ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడియున్నది; లేనియెడల మనుష్యులుచేయు కీడు బహు భారమగును.౹ సంభవింప బోవునది నరులకు తెలియదు; అది ఏలాగు సంభవించునో వారికి తెలియజేయువారెవరు? గాలి విసరకుండ చేయుటకు గాలిమీద ఎవరికిని అధికారములేదు; మరణదినము ఎవరికిని వశముకాదు. ఈ యుద్ధమందు విడుదల దొర కదు; దౌష్ట్యము దాని ననుసరించువారిని తప్పింపదు.౹ సూర్యుని క్రింద జరుగు ప్రతి పనినిగూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు. మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతినొందుటయు, న్యాయముగా నడుచుకొన్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థులవలన మరువ బడియుండుటయు నేను చూచితిని; ఇదియు వ్యర్థమే.౹ దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్ క్రియలు చేయుదురు.౹ పాపాత్ములు నూరు మారులు దుష్కార్యముచేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులుకలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు,౹ భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగుదును.౹ వ్యర్థమైనది మరియొకటి సూర్యునిక్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది; నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది; ఇదియును వ్యర్థమే అని నేననుకొంటిని.౹ అన్నపానములు పుచ్చుకొని సంతోషించుటకంటె మనుష్యులకు లాభకరమైనదొకటియు లేదు గనుక నేను సంతోషమును పొగడితిని; బ్రదికి కష్టపడ వలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది.౹ జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్రకానకుండ మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా దేవుడు జరిగించునదంతయు నేను కనుగొంటిని; మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు, కనుగొనవలెనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాని తెలిసికొనవలెనని జ్ఞానులు పూను కొనినను వారైన కనుగొనజాలరనియు నేను తెలిసి కొంటిని. నీతిమంతులును జ్ఞానులును వారి క్రియలును దేవుని వశమను సంగతిని, స్నేహము చేయుటయైనను ద్వేషించుట యైనను మనుష్యుల వశమున లేదను సంగతిని, అది యంతయు వారివలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప బూనుకొంటిని.౹ సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభవించును; నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించువారికిని బలులనర్పింపనివారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననో పాపాత్ములకును ఆలాగుననే తటస్థించును; ఒట్టు పెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడువారికిని ఆలాగుననే జరుగును.౹ అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యునిక్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖ కరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రదుకుకాలమంతయు వారి హృదయమందు వెఱ్ఱితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము.౹ బ్రదికి యుండువారితో కలిసిమెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా.౹ బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.౹ వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము; ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను.౹ ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువచేయకుము.౹ దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము, ఈ బ్రదుకునందు నీవు కష్టపడి చేసికొనిన దాని యంతటికి అదే నీకు కలుగు భాగము.౹ చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపములేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయమొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుటవలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి.౹ తమకాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు; చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టుబడునట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి యిది జ్ఞానమని తలంచితిని, యిది నా దృష్టికి గొప్పదిగా కనబడెను.౹ ఏమనగా ఒక చిన్న పట్టణముండెను, దానియందు కొద్ది మంది కాపురముండిరి; దానిమీదికి గొప్పరాజు వచ్చి దాని ముట్టడివేసి దానియెదుట గొప్ప బురుజులు కట్టించెను;౹ అయితే అందులో జ్ఞానముగల యొక బీదవాడుండి తన జ్ఞానముచేత ఆ పట్టణమును రక్షించెను, అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు.౹ కాగా నేనిట్లను కొంటిని–బలముకంటె జ్ఞానము శ్రేష్ఠమేగాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు.౹ బుద్ధిహీనులలో ఏలువాని కేకలకంటె మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్ఠములు.౹ యుద్ధా యుధములకంటె జ్ఞానము శ్రేష్ఠము; ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. బుక్కా వాని తైలములో చచ్చిన యీగలు పడుట చేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేల గొట్టును.౹ జ్ఞానియొక్క హృదయము అతని కుడిచేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును.౹ బుద్ధిహీనుడు తన ప్రవర్తననుగూర్చి అధైర్య పడి–తాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును.౹ ఏలువాడు నీమీద కోపపడినయెడల నీ ఉద్యోగమునుండి నీవు తొలగిపోకుము; ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగకుండ చేయును.౹ పొరపాటున అధిపతిచేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు ఘనులు క్రింద కూర్చుండుటయు పనివారు గుఱ్ఱములమీద కూర్చుండుటయు అధిపతులు సేవకులవలె నేలను నడుచుటయు నాకగపడెను.౹ గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును; కంచె కొట్టువానిని పాము కరుచును.౹ రాళ్లు దొర్లించువాడు వాటిచేత గాయమునొందును; చెట్లు నరుకువాడు దానివలన అపాయము తెచ్చుకొనును.౹ ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయనియెడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను; అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము.౹ మంత్రపు కట్టులేక పాము కరిచినయెడల మంత్రగానిచేత ఏమియు కాదు.౹ జ్ఞానుని నోటిమాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మ్రింగివేయును.౹ వాని నోటిమాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెఱ్ఱితనము.౹ కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు; నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో యెవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవ యెరుగనివారై బుద్ధిహీనులు తమ ప్రయాసచేత ఆయాస పడుదురు.౹ దేశమా, దాసుడు నీకు రాజై యుండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై యుండుటయు నీకు అశుభము.౹ దేశమా, నీ రాజు గొప్పయింటి వాడైయుండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలము నొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువారై యుండుటయు నీకు శుభము.౹ సోమరితనముచేత ఇంటికప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకముచేత ఇల్లు కురియును.౹ నవ్వులాటలు పుట్టించుటకై వారు విందుచేయుదురు, ద్రాక్షారసపానము వారి ప్రాణమునకు సంతోషకరము; ద్రవ్యము అన్నిటికి అక్కరకు వచ్చును.౹ నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు; ఏలయనగా ఆకాశపక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలుగలది సంగతి తెలుపును. నీ ఆహారమును నీళ్లమీద వేయుము, చాలాదినములైన తరువాత అది నీకు కనబడును.౹ ఏడుగురికిని ఎనమండు గురికిని భాగము పంచిపెట్టుము, భూమిమీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు.౹ మేఘములు వర్షముతో నిండి యుండగా అవి భూమిమీద దాని పోయును; మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే యుండును.౹ గాలిని గురుతు పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు.౹ చూలాలి గర్భమందు ఎముకలు ఏరీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి యే త్రోవను వచ్చునో నీవెరుగవు, ఆలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు.౹ ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీ వెరుగవు.౹ వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కింపుగా నున్నది.౹ ఒకడు చాలా సంవత్సరములు బ్రదికినయెడల చీకటిగల దినములు అనేకములు వచ్చునని యెరిగియుండి తాను బ్రదుకుదినములన్నియు సంతోషముగా ఉండవలెను, రాబోవునదంతయు వ్యర్థము. యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటినిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;౹ లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. దుర్దినములు రాకముందే–ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,౹ తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.౹ ఆ దినమున ఇంటి కావలివారు వణకుదురు బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది యగుటచేత పని చాలించుకొందురు, కిటికీలలోగుండ చూచువారు కానలేకయుందురు.౹ తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్టయొక్క కూతకు ఒకడు లేచును; సంగీతమునుచేయు స్త్రీలు, నాదము చేయువారందరును నిశ్శబ్దముగా ఉంచబడుదురు.౹ ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డబుడుసర కాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలా పించువారు వీధులలో తిరుగుదురు.౹ వెండి త్రాడు విడి పోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధారయొద్దకుండ పగిలిపోవును, బావియొద్ద చక్రము పడిపోవును.౹ మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞానియైయుండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను; అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను.౹ ప్రసంగి యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను.౹ జ్ఞానులు చెప్పు మాటలుములుకోలలవలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి; అవి ఒక్క కాపరివలన అంగీకరింపబడినట్టున్నవి.౹ ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము; పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు; విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.౹ గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. సొలొమోను రచించిన పరమగీతము. నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును గాక నీ ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము. నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించె దము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకువేసికొనినదాననై నీ జతకాండ్ల మందలయొద్ద నేనెందుకుండవలెను? నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా? మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారములయొద్ద నీ మేకపిల్లలను మేపుము. నా ప్రియురాలా, ఫరోయొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణములచేత నీ చెక్కిళ్లును హారములచేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. వెండి పువ్వులుగల బంగారు సరములు మేము నీకు చేయింతుము రాజు విందుకు కూర్చుండియుండగా నా పరిమళతైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్ముననుండు గోపరసమంత సువాసనగలవాడు నాకు నా ప్రియుడు ఏన్గెదీ ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు. నా ప్రియుడా, నీవు సుందరుడవు అతిమనోహరుడవు మన శయనస్థానము పచ్చనిచోటు మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు మన వాసములు సరళపు మ్రానులు. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మమువంటిదానను. బలురక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లుచున్నాను ద్రాక్షపండ్ల యడలుపెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లుపెట్టి నన్నాదరించుడి అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆలకించుడి; నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు మెట్టలమీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు లేడిపిల్లవలె నున్నాడు అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీగుండ చూచుచున్నాడు కిటికీకంతగుండ తొంగి చూచుచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు. దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలముచేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. అంజూరపుకాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపెట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్షతోటలు పూతపెట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి. నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు చల్లనిగాలి వీచువరకు నీడలు లేకపోవువరకు ఇఱ్ఱివలెను లేడిపిల్లవలెను కొండబాటలమీద త్వరపడి రమ్ము. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను. నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగి తిని నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధ మైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారమువారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు. దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపెనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంక రించిరి. సీయోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి వివాహదినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము. నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరుస కత్తెరవేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలుకలిగి ఒకదానినైన పోగొట్టుకొనక సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నది. నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి. నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధర సమానము. నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో మేయు కవలను పోలియున్నవి. ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును. నా ప్రియురాలా, నీవు అధికసుందరివి నీయందు కళంకమేమియు లేదు. ప్రాణేశ్వరీ, లెబానోను విడిచి నాతోకూడ రమ్ము లెబానోను విడిచి నాతోకూడ రమ్ము అమానపర్వతపు శిఖరమునుండి శెనీరు హెర్మోనుల శిఖరమునుండి సింహ వ్యాఘ్రములుండు గుహలుగల కొండలపైనుండి నీవు క్రిందికి చూచెదవు. నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నీవు నా హృదయమును వశపరచుకొంటివి ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదానిచేత నన్ను వశపరచుకొంటివి. సహోదరీ, ప్రాణేశ్వరీ, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసముకన్న నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గములకన్న సంతోషకరము. ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకుచున్న ట్టున్నవి నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది. నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము. నీ చిగురులు దాడిమవనము వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూరవృక్షములు జటామాంసి వృక్షములు జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు. నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ, నీవు ఉద్యానజలాశయము ప్రవాహజలకూపము లెబానోను పర్వతప్రవాహము. ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక. నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొను చున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహితద్రాక్షారసము పానముచేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని యున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలకింపుము నా తల మంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలితట్టు చున్నాడు. నేను వస్త్రము తీసివేసితిని నేను మరల దాని ధరింపనేల? నా పాదములు కడుగుకొంటిని నేను మరల వాటిని మురికిచేయనేల? తలుపుసందులో నా ప్రియుడు చెయ్యియుంచగా నా అంతరంగము అతనియెడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నా చేతులనుండియు నా వ్రేళ్లనుండియు జటామాంసి గడియలమీద స్రవించెను నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్లిపోయెను అతనిమాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేనతని వెదకినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలివారు నా కెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి ప్రాకారముమీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినయెడల ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీచేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి? నీవు మాచేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును అతని శిరస్సు అపరంజివంటిది అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె నల్లనివి అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి. అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగ ములు అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును. అతని కరములు తర్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది. అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు యెరూషలేము కూమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు. స్త్రీలలో అధిక సుందరివగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడేదిక్కునకు తిరిగెను? మనము పోయి యతని వెదకుదము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను అతడును నావాడు. నా సఖీ, నీవు తిర్సాపట్టణమువలె సుందరమైన దానవు. యెరూషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యమువలె భయము పుట్టించు దానవు నీ కనుదృష్టి నామీద ఉంచకుము అది నన్ను వశపరచుకొనును నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకలమందను పోలియున్నవి. నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి యప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలుకలిగి ఒకదానినైన పోగొట్టు కొనక సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నవి. నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె అగపడుచున్నవి. అరువదిమంది రాణులును ఎనుబదిమంది ఉపపత్ను లును లెక్కకు మించిన కన్యకలును కలరు. నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్నతల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు రాణులును ఉపపత్నులును దాని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో దాడిమవృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్లితిని. తెలియకయే నా జనులలో ఘనులగువారి రథములను నేను కలిసికొంటిని. షూలమ్మీతీ, రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగిరమ్ము, తిరిగి రమ్ము. షూలమ్మీతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది? అమె మహనయీము నాటకమంత వింతయైనదా? రాజకుమార పుత్రికా, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచు చున్నావు! నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలె ఆడుచున్నవి. నీ నాభీదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలితిపడకుండును గాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమరాశి నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి. నీ కంధర దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మెలు పర్వతరూపము నీ తలవెండ్రుకలు ధూమ్రవర్ణముగలవి. రాజు వాటి యుంగరములచేత బద్ధుడగుచున్నాడు. నా ప్రియురాలా, ఆనందకరమైనవాటిలో నీవు అతిసుందరమైనదానవు అతి మనోహరమైనదానవు. నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది. నీ నోరు శ్రేష్ఠద్రాక్షారసమువలె నున్నది ఆ శ్రేష్ఠద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యధరములు ఆడజేయును. నేను నా ప్రియునిదానను అతడు నాయందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము. పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షావల్లులు చిగిరించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దాడిమచెట్లు పూతపట్టెనో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమసూచనలు నీకు చూపెదను పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీకొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధములమీద వ్రేలాడుచున్నవి. నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరుని వలె నీవు నాయెడలనుండిన నెంతమేలు! అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శినౌదును నా తల్లియింట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమఫలరసమును నేను నీకిత్తును. అతని యెడమచెయ్యి నా తలక్రింద నున్నది అతని కుడిచెయ్యి నన్ను కౌగిలించుచున్నది యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్ఛపుట్టువరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీచేత ప్రమాణము చేయించుకొందును. తన ప్రియునిమీద ఆనుకొని అరణ్యమార్గమున వచ్చునది ఎవతె? జల్దరువృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీవలన ప్రసవవేదన కలిగెను నిన్ను కనిన తల్లి యిచ్చటనే ప్రసవవేదన పడెను. ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు అది యెహోవా పుట్టించు జ్వాల నీ హృదయముమీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధసముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంత ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దానివిషయమై యేమి చేయుదుము? అది ప్రాకారమువంటిదాయెనా? మేము దానిపైన వెండి గోపురమొకటి కట్టుదుము. అది కవాటమువంటిదాయెనా? దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము నేను ప్రాకారమువంటిదాననైతిని నా కుచములు దుర్గములాయెను అందువలన అతనిదృష్టికి నేను క్షేమము నొందదగినదాననైతిని. బయలు హామోనునందు సొలొమోను కొక ద్రాక్షావనము కలదు అతడు దానిని కాపులకిచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వేయి రూపాయిలు తేవలెను. నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది సొలొమోనూ, ఆ వేయి రూపాయిలు నీకే చెల్లును. దానిని కాపుచేయువారికి రెండువందలు వచ్చును. ఉద్యానవనములలో పెంచబడినదానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడుము లఘువైన యిఱ్ఱివలె ఉండుము గంధవర్గవృక్ష పర్వతములమీద గంతులువేయు లేడిపిల్లవలె ఉండుము. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు ఆమోజు కుమారుడగు యెష యాకు కలిగిన దర్శనము. యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. –నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితినివారు నామీద తిరుగబడియున్నారు. ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకు శ్రమ.వారు యెహోవాను విసర్జించియున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను మీ యెదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు అన్యులకు తటస్థించు నాశనమువలె అది పాడైపోయెను. ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని పాకవలెను ముట్టడి వేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది. సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమాన ముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆల కించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే –విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల గింపుడి. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు –రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను. నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరు లంచము కోరుదురు బహుమానములకొరకు కనిపెట్టుదురు తండ్రిలేనివారిపక్షమున న్యాయము తీర్చరు, విధవ రాండ్ర వ్యాజ్యెము విచారించరు. కావున ప్రభువును ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు— ఆహా, నా శత్రువులనుగూర్చి నేనికను ఆయాసపడను నా విరోధులమీద నేను పగ తీర్చుకొందును. నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను. మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియ మించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. సీయోనుకు న్యాయముచేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును. అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇచ్ఛయించిన మస్తకివృక్షమునుగూర్చి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన తోటలనుగూర్చి మీ ముఖ ములు ఎఱ్ఱబారును మీరు ఆకులు వాడు మస్తకివృక్షమువలెను నీరులేని తోటవలెను అగుదురు. బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్ని కణమువలెనుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును. యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి— అంత్యదినములలో పర్వతములపైన యెహోవామందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి –యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చునువారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారువారు ఫిలిష్తీయులవలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించియున్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండియున్నదివారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథ ములకు మితిలేదు. వారి దేశము విగ్రహములతో నిండియున్నదివారు తమ చేతిపనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింపబడు దురు కాబట్టి వారిని క్షమింపకుము. యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము. నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సింధూర వృక్షములకన్నిటికిని ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు. [20-21] ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. *** తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును? ఆలకించుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదెకాండ్రను పెద్దలను పంచదశాధిపతులను ఘనత వహించినవారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగినవారిని మాంత్రికులను యెరూషలేములోనుండియు యూదాదేశములో నుండియు తీసివేయును. బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదనువారు బాలచేష్టలుచేసి జనులను ఏలెదరు. ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును. ఒకడు తన తండ్రియింట తన సహోదరుని పట్టుకొని –నీకు వస్త్రము కలదు నీవు మామీద అధిపతివై యుందువు ఈ పాడుస్థలము నీ వశముండనిమ్మనును అతడు ఆ దినమున కేకవేసి–నేను సంరక్షణ కర్తనుగా ఉండనొల్లను నాయింట ఆహారమేమియు లేదు వస్త్రమేమియు లేదు నన్ను జనాధిపతిగా నియమింపరాదనును. యెరూషలేము పాడైపోయెను యూదా నాశన మాయెను యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటుచేయు నంతగా వారి మాటలును క్రియలును ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగుచేయక సొదొమవారివలె దాని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడుచేసికొని యున్నారు వారికి శ్రమ –మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుమువారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజలవిషయమై నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారువారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలువబడియున్నాడు జనములను విమర్శించుటకు లేచియున్నాడు యెహోవా తన జనుల పెద్దలను వారి యధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. మీరే ద్రాక్షలతోటను తినివేసితిరి మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ యిండ్లలోనే యున్నది నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు? అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా— సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించుచున్నారు; కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవావారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను [19-20] కర్ణభూషణములను కడియములను నాణెమైన ముసుకు లను కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణెలను *** రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును. ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును. ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టు కొని — మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయు మని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూష ణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణము గాను ఉండును. సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖ లైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును. నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొక ద్రాక్షతోట యుండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దానిమధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను కావున యెరూషలేము నివాసులారా, యూదావార లారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చ వలెనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి వేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసియుండును దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చెదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను. స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చు కొను మీకు శ్రమ. నేను చెవులార వినునట్లు సైన్యములకధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెల విచ్చెను. –నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు అనేకములు నివాసులులేక పాడైపోవును. పది ఎకరముల ద్రాక్షతోట ఒక కుంచెడు రస మిచ్చును తూమెడుగింజల పంట ఒక పడి యగును. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించువరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశపెట్టుకొని అపరి మితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు. అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును సైన్యములకధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధపరచు కొనును. అది మేతబీడుగానుండును గొఱ్ఱెపిల్లలు అచ్చట మేయును గర్వించినవారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు. భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొనువారికి శ్రమ. బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమవారు ఇట్లనుకొనుచున్నారు –ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని ఆలోచన మాకు తెలియబడునట్లు అది మా యెదుట కనబడనిమ్ము కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొనువారి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచు కొనువారికి శ్రమ. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతినొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువగలవారికిని శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు. సైన్యములకధిపతియగు యెహోవాయొక్క ధర్మ శాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని వాక్కును తృణీక రించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయు నట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్లిపోవునువారి పువ్వు ధూళివలె పైకి ఎగిరిపోవును. దానినిబట్టి యెహోవా కోపము ఆయన ప్రజలమీద మండుచున్నది. ఆయన వారిమీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణకుచున్నవి. వీధులమధ్యను వారి కళేబరములు పెంటవలె పడి యున్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది. ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజము నెత్తును భూమ్యంతమునుండి వారిని రప్పించుటకు ఈల గొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. వారిలో అలసినవాడైనను తొట్రిల్లువాడైనను లేడు. వారిలో ఎవడును నిద్రపోడుకునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షలవారు తెగిపోదు. వారి బాణములు వాడిగలవివారి విండ్లన్నియు ఎక్కు పెట్టబడియున్నవి వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమాన ములువారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును ఆడుసింహము గర్జించినట్లువారు గర్జించుదురు కొదమసింహము గర్జించినట్లు గర్జనచేయుచు వేటను పట్టుకొని అడ్డమేమియులేకుండ దానిని ఎత్తుకొని పోవుదురు విడిపింపగలవాడెవడును ఉండడు. వారు ఆ దినమున సముద్రఘోషవలె జనముమీద గర్జనచేయుదురు ఒకడు భూమివైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అంతట ఆ దేశముమీది వెలుగు మేఘములచేత చీకటి యగును. రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.౹ ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.౹ వారు–సైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.౹ వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమముచేత నిండగా నేను–అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనులమధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.౹ అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి –ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.౹ అప్పుడు–నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను–చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన–నీవు పోయి యీ జనులతో ఇట్లనుము —మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.౹ వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.౹ — ప్రభువా, ఎన్నాళ్లవరకని నేనడుగగా ఆయన–నివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును యెహోవా మనుష్యులను దూరముగా తీసికొనిపోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగువరకును ఆలాగున జరుగును.౹ దానిలో పదియవభాగము మాత్రము విడువ బడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును; అట్టి మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియారాజైన రెజీనును ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేముమీదికి వచ్చిరి గాని అది వారివలన కాకపోయెను అప్పుడు–సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. అప్పుడు యెహోవా యెషయాతో ఈలాగు సెలవిచ్చెను–ఆహాజు నెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయార్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువకడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము –భద్రముసుమీ, నిమ్మళించుము; పొగరాజుచున్న యీ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు, రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియ నీయకుము.౹ సిరియాయు, ఎఫ్రాయిమును, రెమల్యా కుమారుడును నీకు కీడుచేయవలెనని ఆలోచించుచు మనము యూదా దేశముమీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబెయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి.౹ అయితే ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆ మాట నిలువదు, జరుగదు.౹ దమస్కు సిరియాకు రాజధాని; దమస్కునకు రెజీను రాజు; అరువదియయిదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండ నాశనమగును.౹ షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని; షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు; మీరు నమ్మకుండినయెడల స్థిరపడక యుందురు. [10-11] యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను— నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే.౹ *** ఆహాజు–నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా అతడు–ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసికించుట చాలదను కొని నా దేవుని కూడ విసికింతురా? కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.౹ కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును.౹ కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివిరాకమునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయబడును.౹ యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపువారి మీదికిని శ్రమదినములను, ఎఫ్రాయిము యూదానుండి తొలగిన దినము మొదలుకొని నేటివరకు రాని దినములను రప్పించును; ఆయన అష్షూరు రాజును నీమీదికి రప్పించును. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరుదేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.౹ అవి అన్నియు వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బీళ్లన్నిటిలోను దిగి నిలుచును. ఆ దినమున యెహోవా నది (యూఫ్రటీసు) అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజు చేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డముకూడను గీచివేయును. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొఱ్ఱెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును; ఏలయనగా ఈ దేశములో విడువ బడిన వారందరును పెరుగు తేనెలను తిందురు. ఆ దినమున వెయ్యి వెండి నాణెముల విలువగల వెయ్యి ద్రాక్షచెట్లుండు ప్రతి స్థలమున గచ్చపొదలును బలు రక్కసి చెట్లును పెరుగును.౹ ఈ దేశమంతయు గచ్చ పొదలతోను బలురక్కసి చెట్లతోను నిండియుండును గనుక బాణములను విండ్లను చేతపట్టుకొని జనులు అక్క డికి పోవుదురు.౹ పారచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయముచేతను గచ్చ పొదల భయముచేతను జనులు అక్కడికి పోరు; అది యెడ్లను తోలుటకును గొఱ్ఱెలు త్రొక్కుటకును ఉప యోగమగును. మరియు యెహోవా–నీవు గొప్పపలక తీసికొని మహేరు షాలాల్, హాష్ బజ్, అను మాటలు సామాన్యమైన అక్షరములతో దానిమీద వ్రాయుము.౹ నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యాయు కుమారుడైన జెకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో చెప్పగా నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా యెహోవా— అతనికి మహేరు షాలాల్ హాష్ బజ్ అను పేరు పెట్టుము.౹ ఈ బాలుడు–నాయనా అమ్మా అని అననేరకమునుపు అష్షూరురాజును అతని వారును దమస్కుయొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తికొని పోవుదురనెను. [5-6] మరియు యెహోవా ఇంకను నాతో ఈలాగు సెలవిచ్చెను–ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనునుబట్టియు రెమల్యా కుమారునిబట్టియు సంతోషించుచున్నారు.౹ *** కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డు లన్నిటిమీదను పొర్లి పారును.౹ అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును. జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. ఆలోచనచేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు. ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను –ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడివారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు పడకుడి. సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును. అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ ములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఈ ప్రమాణవాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యుల కప్పగింపుము. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసి కొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచు చున్నాను ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయులమధ్య ఉన్నాము. వారు మిమ్మును చూచి–కర్ణపిశాచిగలవారియొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞులయొద్దకును వెళ్లి విచారించు డని చెప్పునప్పుడు జనులు తమ దేవునియొద్దనే విచారింప వద్దా? సజీవులపక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్ల దగునా? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.౹ అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశసంచారము చేయుదురు. ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు;౹ భూమితట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు. అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావువారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లువారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు. యుద్ధపుసందడిచేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలువరకు దిగివచ్చియున్నది. అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును ప్రజలకందరికి తెలియవలసియున్నది. వారు–ఇటికలతో కట్టినది పడిపోయెను చెక్కిన రాళ్లతో కట్టుదము రండి; రావికఱ్ఱతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కఱ్ఱను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. యెహోవా వానిమీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు. తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును నోరు తెరచి ఇశ్రాయేలును మ్రింగివేయవలెననియున్నారు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది. అయినను జనులు తమ్ము కొట్టినవానితట్టు తిరుగుట లేదు సైన్యములకధిపతియగు యెహోవాను వెదకరు. కావున యెహోవా ఇశ్రాయేలులోనుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును. పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారిచేత మ్రింగివేయబడు దురు. వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యౌవనస్థులను చూచి సంతో షింపడు వారిలో తలిదండ్రులు లేనివారియందైననువారి విధవరాండ్రయందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది. భక్తిహీనత అగ్నివలె మండుచున్నది అది గచ్చపొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలె చుట్టుకొనుచు పైకి ఎగయును. సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతవలన దేశము కాలిపోయెను. జనులును అగ్నికి కట్టెలవలె నున్నారువారిలో ఒకనినొకడు కరుణింపడు. కుడిప్రక్కన ఉన్నదాని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొని యుందురు; ఎడమప్రక్కన ఉన్నదాని భక్షించుదురు గాని ఇంకను తృప్తిపొందక యుందురు వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును మనష్షే ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనష్షేను భక్షించును వీరిద్దరు ఏకీభవించి యూదామీద పడుదురు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది. విధవరాండ్రు తమకు దోపుడుసొమ్ముగా ఉండవలె ననియు తలిదండ్రులులేనివారిని కొల్లపెట్టుకొనవలెననియు కోరి న్యాయవిమర్శ జరిగింపకుండ దరిద్రులను తొలగించు టకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించువారికిని బాధకరమైన శాసనములను వ్రాయించువారికిని శ్రమ. దర్శనదినమున దూరమునుండి వచ్చు ప్రళయదినమున మీరేమి చేయుదురు? సహాయమునొందుటకు ఎవరియొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు? వారు చెరపట్టబడినవారి క్రింద దాగుకొనుచున్నారు హతులైనవారి క్రింద కూలుచున్నారు ఈలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది. అష్షూరీయులకు శ్రమవారు నాకోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది. భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను. అయితే అతడు ఆలాగనుకొనడు అది అతని ఆలోచనకాదు; నాశనము చేయవలెననియు చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన. అతడిట్లనుకొనుచున్నాడు –నా యధిపతులందరు మహారాజులు కారా? కల్నో కర్కెమీషువలె నుండలేదా? హమాతు అర్పాదువలె నుండలేదా? షోమ్రోను దమస్కువలె నుండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహములకంటె ఎక్కువైనవి గదా? షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసి నట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయక పోదునా అనెను. కావున సీయోను కొండమీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని శిక్షింతును. అతడు–నేను వివేకిని నా బాహుబలముచేతను నాబుద్ధిచేతను ఆలాగుచేసితిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని మహా బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని పక్షిగూటిలో ఒకడు చెయ్యివేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనునప్పుడు రెక్కను ఆడించునదియైనను నోరు తెరచునదియైనను కిచకిచలాడునదియైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొను చున్నానని అనుకొనును. గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కఱ్ఱకానివానిని ఎత్తినట్లును ఉండును గదా? ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయులమీదికి క్షయరోగము పంపునువారిక్రింద అగ్నిజ్వాలలుగల కొరవికట్టె రాజును. ఇశ్రాయేలుయొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును; అది అష్షూరుయొక్క బలురక్కసిచెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్కదినమున వాటిని మ్రింగివేయును. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతోకూడ అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును. అతని అడవిచెట్ల శేషము కొంచెమగును బాలుడు వాటిని లెక్కపెట్టవచ్చును. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవునివైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకవలె ఉండి నను దానిలో శేషమే తిరుగును, సమూలనాశనము నిర్ణ యింపబడెను. నీతి ప్రవాహమువలె వచ్చును ఏలయనగా తాను నిర్ణయించిన సమూలనాశనము ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సర్వలోకమున కలుగజేయును. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –సీయోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కఱ్ఱతో నిన్ను కొట్టి నీమీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తరువాత నాకోపము చల్లారునువారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండయొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకధిపతియగు యెహోవా తన కొరడాలను వానిమీద ఆడించును. ఆయన దండము సముద్రమువరకు వచ్చును ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును. ఆ దినమున నీ భుజముమీదనుండి అతని బరువు తీసి వేయబడును. నీ మెడమీదనుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును. అష్షూరీయులు ఆయాతుమీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామా వణకుచున్నది గెబలో బసచేతము రండని అనుచున్నారు సౌలుగిబ్యా నివాసులు పారిపోవుదురు. గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి లాయిషా, ఆలకింపుము అయ్యయ్యో, అనాతోతు మద్మేనా జనులు పారిపోవుదురు గిబానివాసులు పారిపోదురు ఈ దినమే దండు నోబులో దిగును ఈ దినమే సీయోను కుమారి పర్వతమను యెరూష లేము కొండమీద వారు తమ చెయ్యి ఆడించుదురు చూడుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి యెత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుపకత్తితో కొట్టివేయును లెబానోను బలవంతుడైన యొకనిచేత కూలిపోవును. యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును [3-4] యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దండముచేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును *** అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆటలాడును మిడినాగు పుట్టమీద పాలువిడచిన పిల్ల తన చెయ్యిచాచును నా పరిశుద్ధపర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులోనుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును యూదా విరోధులు నిర్మూలమగుదురు ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు యూదా ఎఫ్రాయిమును బాధింపడు వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమ్మోనీయులు వారికి లోబడుదురు మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును. కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును ఆ దినమున మీరీలాగందురు –యెహోవా, నీవు నామీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి యున్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావు లలోనుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరీలాగందురు –యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చు కొనుడి. యెహోవానుగూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను భూమియందంతటను ఇది తెలియబడును. సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోనుగూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి— జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లులేని కొండమీద ధ్వజము నిలువబెట్టుడి ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి. నాకు ప్రతిష్ఠితులైనవారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను నాకోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలు రను పిలిపించియున్నాను నా ప్రభావమునుబట్టి హర్షించువారిని పిలిపించి యున్నాను. బహుజనులఘోషవలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములుచేయు అల్లరి శబ్దము వినుడి సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు సర్వలోకమును పాడుచేయుటకై ఆయన దూరదేశమునుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధ ములును వచ్చుచున్నారు. యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును. అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురువారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును. యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట కును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము తోను అది వచ్చును. ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు చున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను. బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండ జేసెదను. సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పు నట్లును నేను చేసెదను. అప్పుడు తరుమబడుచున్న జింకవలెను పోగుచేయని గొఱ్ఱెలవలెను జనులు తమతమ స్వజనులతట్టు తిరుగుదురు తమతమ స్వదేశములకు పారిపోవుదురు. పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగ గొట్టబడుదురు వారి యిండ్లు దోచుకొనబడునువారి భార్యలు చెరుపబడుదురు. వారిమీద పడుటకు నేను మాదీయులను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణము కూడ వారికి రమ్యమైనది కాదు వారి విండ్లు యౌవనస్థులను నలుగగొట్టును గర్భఫలమందువారు జాలిపడరు పిల్లలను చూచి కరుణింపరు. అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశ యాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును. అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొఱ్ఱెలకాపరులు తమ మందలను అక్కడ పరుండ నియ్యరు నక్కలు అక్కడ పండుకొనును గురుపోతులు వారి యిండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాసమందిర ములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులువారిని కలిసికొందురువారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమునవారిని ప్రవేశపెట్టుదురు ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు కొందురువారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి తమ్మును బాధించినవారిని ఏలుదురు. [3-4] నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను? *** దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనము లను లోబరచిరి. భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటినుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని నిన్నుగూర్చి తమాలవృక్షములు లెబానోను దేవదారువృక్షములు హర్షించును నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరిని వారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది వారందరు నిన్ను చూచి–నీవును మావలె బలహీనుడ వైతివా? నీవును మాబోటివాడవైతివా? అందురు. నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి? –నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. [16-17] నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు –భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా? లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపెట్టినవారిని తమ నివాసస్థలమునకు పో నియ్యనివాడు ఇతడేనా? *** జనముల రాజులందరు ఘనత వహించినవారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్ప బడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలె నున్నావు నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణము లతో లోకమును నింపకుండునట్లు తమపితరుల దోషమునుబట్టి అతని కుమారులను వధిం చుటకు దొడ్డి సిద్ధపరచుడి. సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే –నేను వారిమీదికి లేచి బబులోనునుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టి వేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను దానిని ముళ్ళ పందికి స్వాధీనముగాను నీటి మడు గులగాను చేయుదును. నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వ కముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశములో అష్షూరును సంహరించెదను నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును వాని భారము వారి భుజముమీదనుండి తొలగింప బడును. సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించి యున్నాడు రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు? రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి –ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడెనని అంతగా సంతోషింపకుము సర్పబీజమునుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతిబీదలైనవారు భోజనము చేయుదురు దరిద్రులు సురక్షితముగా పండుకొందురు కరవుచేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చేయును. గుమ్మమా, ప్రలాపింపుమీ, పట్టణమా, అంగలార్పుమీ. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావు ఉత్తరదిక్కునుండి పొగ లేచుచున్నది వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకడును లేడు. జనముల దూత కియ్యవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సీయోనును స్థాపించియున్నాడు ఆయన జనులలో శ్రమనొందినవారు దాని ఆశ్ర యింతురు అని చెప్పవలెను. మోయాబునుగూర్చిన దేవోక్తి –ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురువారి మేడలమీదను వారి విశాలస్థలములలోను వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయు దురు. హెష్బోనును ఏలాలేయును మొఱ్ఱపెట్టుచున్నవి యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీయుల యోధులు కేకలువేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితిమేయని యెలుగెత్తి కేకలు వేయుచు హొరొ నయీము త్రోవను పోవుదురు. ఏలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయెను అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి యెండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడను కనబడదు ఒక్కొకడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని పోవుదురు. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లయీమువరకును బెయేరేలీమువరకును వినబడెను. ఏలయనగా దీమోను జలములు రక్తములాయెను. మరియు నేను దీమోనుమీదికి ఇంకొకబాధను రప్పిం చెదను. మోయాబీయులలోనుండి తప్పించుకొనినవారి మీదికిని ఆ దేశములో శేషించినవారి మీదికిని సింహమును రప్పించెదను. అరణ్యపుతట్టుననున్న సెలనుండి దేశము నేలువానికి తగిన గొఱ్ఱెపిల్లలను కప్పముగా సీయోనుకుమార్తె పర్వతమునకు పంపుడి గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కన బడుదురు. ఆలోచన చెప్పుము విమర్శచేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనియ్యుము. చెదరినవారిని దాచిపెట్టుము పారిపోయినవారిని పెట్టియ్యకుము నేను వెలివేసినవారిని నీతో నివసింపనిమ్ము దోచుకొనువారు వారిమీదికి రాకుండునట్లు మోయా బీయులకు ఆశ్రయముగా ఉండుము బలాత్కారులు ఓడిపోయిరి సంహారము మాని పోయెను. అణగద్రొక్కువారు దేశములోలేకుండ నశించిరి. కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. మోయాబీయులు బహు గర్వముగలవారని మేము విని యున్నామువారి గర్వమునుగూర్చియు వారి అహంకార గర్వక్రోధములనుగూర్చియు విని యున్నాము.వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీయులు మోయాబునుగూర్చి అంగలార్చుదురు అందరును అంగలార్చుదురు మోయాబీయులారా కేవలము పాడైయున్న కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షా వల్లులు వాడిపోయెను దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అణగద్రొక్కిరి. అవి యాజరువరకు వ్యాపించెను అరణ్యములోనికి ప్రాకెను దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షా వల్లుల నిమిత్తము ఏడ్చెదను హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లచేత నిన్ను తడిపె దను ఏలయనగా ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలములమీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనందసంతోషములు ఫలభరితమైన పొలమునుండి మానిపోయెను ద్రాక్షలతోటలో సంగీతము వినబడదు ఉత్సాహ ధ్వని వినబడదు గానుగులలో ద్రాక్షగెలలను త్రొక్కువాడెవడును లేడు ద్రాక్షలతొట్టి త్రొక్కువాని సంతోషపుకేకలు నేను మాన్పించియున్నాను. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది కీర్హరెశెతు నిమిత్తము నా ఆంత్రములు సితారావలె వాగుచున్నవి. మోయాబీయులు ఉన్నతస్థలమునకు వచ్చి ఆయాస పడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించునప్పుడువారికేమియు దొరకకపోవును. పూర్వకాలమున యెహోవా మోయాబునుగూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే; అయితే యెహోవా ఇప్పుడీలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు –కూలివాని లెక్కప్రకారము మూడేండ్లలోగా మోయాబీయులయొక్క ప్రభావమును వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడును శేషము బహు కొద్దిగా మిగులును అది అతి స్వల్ప ముగా నుండును. దమస్కునుగూర్చిన దేవోక్తి — దమస్కు పట్టణము కాకపోవలసివచ్చెను అది పాడై దిబ్బగానగును అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొఱ్ఱెల మందలు మేయు తావులగును ఎవడును వాటిని బెదరింపకుండ మందలు అచ్చట పండుకొనును. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును దమస్కునకు రాజ్యములేకుండును ఇశ్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించినవారికి జరుగును సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెల విచ్చుచున్నాడు. ఆ దినమున యాకోబుయొక్క ప్రభావము క్షీణించిపోవును వాని క్రొవ్విన శరీరము కృశించిపోవును చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుం డును అయినను ఒలీవచెట్లు దులుపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు మూడు నాలుగు పండ్లు మిగిలియుండునట్లు దానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవు డైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమునవారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు దేవతాస్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురువారి కన్నులు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు ఇశ్రాయేలీయుల భయముచేత అడవిలోను కొండ శిఖరముమీదను జనులు విడిచిపోయిన స్థలముల వలెనగును. ఆ దేశము పాడగును ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసికొన లేదు అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చి తివి వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి నీవు నాటిన దినమున దాని చుట్టు కంచె వేసితివి ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింప జేసితివి గొప్ప గాయములును మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. ఓహో బహుజనములు సముద్రముల ఆర్భాటమువలె ఆర్భటించును. జనములు ప్రవాహజలముల ఘోషవలె ఘోషించును జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించునువారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసవు ఎగిరిపోవునట్లువారును తరుమబడుదురు. సాయంకాలమున తల్లడిల్లుదురు ఉదయము కాకమునుపు లేకపోవుదురు ఇదే మమ్మును దోచుకొనువారి భాగము, మా సొమ్ము దొంగిలువారికి పట్టు గతి యిదే. ఓహో కూషు నదుల అవతల తటతట కొట్టుకొను చున్న రెక్కలుగల దేశమా! అది సముద్రమార్గముగా జలములమీద జమ్ము పడవ లలో రాయబారులను పంపుచున్నది –వేగిరపడు దూతలారా, యెత్తయినవారును నునుపైన చర్మముగలవారునగు జనమునొద్దకు దూరములోనున్న భీకరజనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశముగలవారును దౌష్టికులై జన ములను త్రొక్కు చుండువారునగు జనము నొద్దకు పోవుడి. పర్వతములమీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు భూమిమీద కాపురముండు మీరు చూడుడి బాకా ఊదునప్పుడు ఆలకించుడి. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు –ఎండ కాయుచుండగాను వేసవికోతకాలమున మేఘ ములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును. కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరు వాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తులచేత ద్రాక్షతీగెలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును. అవి కొండలలోని క్రూరపక్షులకును భూమిమీదనున్న మృగములకును విడువబడును వేసవికాలమున క్రూరపక్షులును శీతకాలమున భూమి మీదనున్న మృగములును వాటిని తినును. ఆ కాలమున ఎత్తయినవారును నునుపైనచర్మముగలవారును దూరములోనున్న భీకరమైనవారును నదులు పారు దేశము గలవారునైయున్న దౌష్టికులగు ఆ జనులు సైన్యములకధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాసస్థలముగానుండు సీయోను పర్వతమునకు తేబడుదురు. ఐగుప్తునుగూర్చిన దేవోక్తి –యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది నేను ఐగుప్తీయులమీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరులమీదికి సహోదరులు పొరుగువారిమీదికి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించునువారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను కావునవారు విగ్రహములయొద్దకును గొణుగువారి యొద్దకును కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును విచారింప వెళ్లుదురు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించె దను బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును. నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును. జాలరులును దుఃఖించెదరు నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించె దరు జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు దువ్వెనతో దువ్వబడు జనుపనారపని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు. ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకధిపతియగు యెహోవా ఐగుప్తునుగూర్చి నిర్ణయించినదానిని వారు గ్రహించి నీతో చెప్ప వలెను గదా? సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి యెహోవా ఐగుప్తుమీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించి యున్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసియున్నారు తలయైనను తోకయైనను కొమ్మయైనను రెల్లు అయినను ఐగుప్తులో పని సాగింపువారెవరును లేరు ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలవంటివారగుదురు. సైన్యములకధిపతియగు యెహోవావారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయ పడుదురు. యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును తమకు విరోధముగా సైన్యములకధిపతియగు యెహోవా ఉద్దేశించినదానినిబట్టి ఒకడు ప్రస్తాపించినయెడల ఐగుప్తీయులు వణకుదురు. ఆ దినమున కనానుభాషతో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణముచేయు అయిదు పట్టణములు ఐగుప్తుదేశములో ఉండును, వాటిలో ఒకటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తుదేశముమధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును. అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసి కొందురువారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు. యెహోవావారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టునువారు యెహోవావైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరున కును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవిర చెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగనుండును. సైన్యములకధిపతియగు యెహోవా –నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వ దించును. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు. అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధముచేసి వారిని పట్టుకొనెను.౹ ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెను–నీవు పోయి నీ నడుముమీది గోనె పట్ట విప్పి నీ పాదములనుండి జోళ్లు తీసివేయుము. అతడాలాగు చేసి దిగంబరియై జోళ్లు లేకయే నడచుచుండగా యెహోవా–నా సేవకుడైన యెషయా ఐగుప్తునుగూర్చియు కూషునుగూర్చియు సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరియై జోడు లేకయే నడచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశమునుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను పెద్దలను, దిగంబరులనుగాను చెప్పులు లేనివారినిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదులమీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును.౹ వారు తాము నమ్ముకొనిన కూషీయులనుగూర్చియు, తాము అతిశయకారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులనుగూర్చియు విస్మయమొంది సిగ్గుపడుదురు.౹ ఆ దినమున సముద్రతీర నివాసులు–అష్షూరు రాజు చేతిలోనుండి విడిపింపబడ వలెనని సహాయముకొరకు మనము పారిపోయి ఆశ్ర యించిన వారికి ఈలాగు సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు. సముద్రతీరముననున్న అడవిదేశమునుగూర్చిన దేవోక్తి –దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది. కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అను గ్రహింపబడియున్నది. మోసముచేయువారు మోసము చేయుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలామూ, బయలుదేరుము మాద్యా, ముట్టడివేయుము వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పెట్టి యున్నది బాధచేత నేను వినలేకుండ నున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది మహా భయము నన్ను కలవరపరచుచున్నది నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను. వారు భోజనపు బల్లను సిద్ధముచేయుదురు తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి; ప్రభువు నాతో ఇట్లనెను –నీవు వెళ్లి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను. జతజతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు గాడిదలును వరుసలుగావచ్చు ఒంటెలును అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును సింహము గర్జించునట్టు కేకలు వేసి –నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను పడవేసియున్నాడు ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అని చెప్పుచు వచ్చెను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చ బడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను. దూమానుగూర్చిన దేవోక్తి –కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు –ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరినయెడల విచారించుడి మరల రండి అనుచున్నాడు. అరేబియానుగూర్చిన దేవోక్తి –దెదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను. తేమాదేశనివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి ఖడ్గ భయముచేతను దూసిన ఖడ్గ భయముచేతను ఎక్కు పెట్టబడిన ధనుస్సుల భయముచేతను క్రూరయుద్ధ భయముచేతను వారు పారిపోవుచున్నారు ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడు–కూలివారు ఎంచునట్లుగా ఒక యేడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు. ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు. దర్శనపులోయనుగూర్చిన దేవోక్తి –ఏమివచ్చి నీలోనివారందరు మేడలమీది కెక్కియున్నారు? అల్లరితో నిండి కేకలువేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైనవారు ఖడ్గముచేత హతముకాలేదు యుద్ధములో వధింపబడలేదు. నీ అధిపతులందరు కూడి పారిపోగా విలుకాండ్లచేత కొట్టబడకుండ పట్టబడినవారైరి. మీలో దొరికినవారందరు పట్టబడి దూరమునకు పారిపోయిరి నేను సంతాపము కలిగి యేడ్చుచున్నాను నాకు విముఖులై యుండుడి నా జనమునకు కలిగిన నాశనమునుగూర్చి నన్ను ఓదార్చుటకు తీవరపడకుడి. దర్శనపు లోయలో సైన్యములకధిపతియు ప్రభువు నగు యెహోవా అల్లరిదినమొకటి నియమించి యున్నాడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగజేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబులపొదిని వహించియున్నది. కీరు డాలు పై గవిసెన తీసెను అందుచేత అందమైన నీ లోయలనిండ రథములున్నవి గుఱ్ఱపురౌతులు గవినియొద్ద వ్యూహమేర్పరచుకొనుచున్నారు. అప్పుడు యూదానుండి ఆయన ముసుకు తీసివేసెను ఆ దినమున నీవు అరణ్యగృహమందున్న ఆయుధము లను కనిపెట్టితివి. దావీదుపట్టణపు ప్రాకారము చాలామట్టుకు పడి పోయినదని తెలిసికొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేము యిండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టితిరి పాత కోనేటినీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాని చేయించిన వానివైపు మీరు చూచినవారు కారు పూర్వకాలమున దాని నిర్మించినవానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, యెడ్లను వధించుచు గొఱ్ఱెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు కాగా ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు–మీరు మరణము కాకుండ ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్తయొద్దకు పోయి అతనితో ఇట్లనుము –ఇక్కడ నీ కేమి పని? ఇక్కడ నీ కెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల? ఎత్తయినస్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు ఇదిగో బలాఢ్యుడొకని విసరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును ఆయన నిన్ను మడిచి యొకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసరివేయును. నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చిన వాడా, అక్కడనే నీవు మృతిబొందెదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును నీ స్థితినుండి యెహోవానగు నేను నిన్ను తొలగించె దను నీ ఉద్యోగమునుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టుచేత అతని బలపరచి నీ అధికారమును అతనికిచ్చెదను; అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును. నేను దావీదు ఇంటితాళపు అధికారభారమును అతని భుజముమీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు దిట్టమైనచోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిర పరచెదను అతడు తన పితరులకుటుంబమునకు మాన్యతగల సింహాసనముగా నుండును. గిన్నెలవంటి పాత్రలను బుడ్లవంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులగు పిల్లజల్ల లందరిని అతనిమీద వ్రేలాడించెదరు. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును దానిమీదనున్న భారము నాశనమగును ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. తూరునుగూర్చిన దేవోక్తి –తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్రతీరవాసులారా, అంగలార్చుడి సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సర కులతో నిన్ను నింపిరి. షీహోరు నది ధాన్యము నైలునది పంట సముద్రముమీద నీలోనికి తేబడుచుండెను తూరువలన జనములకు లాభము వచ్చెను. సీదోనూ, సిగ్గుపడుము, సముద్రము సముద్రదుర్గము మాటలాడుచున్నది –నేను ప్రసవవేదనపడనిదానను పిల్లలు కననిదానను యౌవనస్థులను పోషింపనిదానను కన్యకలను పెంచనిదానను. ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరునుగూర్చి మిక్కిలి దుఃఖింతురు. తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగ లార్చుడి. నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలముననుండిన పట్టణమిదేనా? పరదేశనివాసముచేయుటకు దూరప్రయాణముచేసిన దిదేనా? దాని వర్తకులు రాజసమానులు దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయ నెవడు ఉద్దేశించెను? సర్వసౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుట కును భూమిమీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయ నుద్దేశించెను. తర్షీషుకుమారీ, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను నైలునది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము. ఆయన సముద్రముమీద తన చెయ్యి చాపెను రాజ్యములను కంపింపజేసెను కనానుకోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను. మరియు ఆయన –సీదోను కన్యకా, చెరపబడినదానా, నీకికను సంతోషముండదు నీవు లేచి కిత్తీముకు దాటి పొమ్ము అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు ఇదిగో కల్దీయుల దేశమును చూడుము వారికను జన ముగా ఉండరు అష్షూరీయులు దానిని అడవిమృగములకు నివాసముగా చేసియున్నారు.వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు. తర్షీషు ఓడలారా, అంగలార్చుడి, మీ దుర్గము పాడై పోయెను. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున డెబ్బది సంవత్సరములు మరవబడును డెబ్బది సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును, ఏమనగా మరవబడిన వేశ్యా, సితారాతీసికొని పట్టణములో తిరుగులాడుము నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయిం చుము అనేక కీర్తనలు పాడుము. డెబ్బది సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును అది వేశ్యజీతమునకు మరల భూమిమీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. వేశ్యజీతముగా ఉన్నదాని వర్తకలాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు యెహోవా సన్నిధిని నివసించువారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును. ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొను వారికి కలుగును వడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి తీసుకొనువారికి కలు గును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును అది కేవలము కొల్లసొమ్మగును. యెహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడు –దేశము వ్యాకులముచేత వాడిపోవుచున్నది లోకము దుఃఖముచేత క్షీణించిపోవుచున్నది భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించియున్నారు కట్టడను మార్చి నిత్యనిబంధనను మీరియున్నారు. దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనముచేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశనివాసులు కాలిపోయిరి శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు. క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్షావల్లి క్షీణించుచున్నది సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను ఉల్లసించువారి ధ్వని మానిపోయెను సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు పానము చేయువారికి మద్యము చేదాయెను నిరాకారమైనపట్టణము నిర్మూలము చేయబడెను ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడి యున్నది. ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు సంతోషమంతయు అస్తమించెను దేశములో ఆనందము లేదు. పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరుగగొట్టబడెను. ఒలీవ చెట్టును దులుపునప్పుడును ద్రాక్షఫలములకోత తీరినతరువాత పరిగె పండ్లను ఏరు కొనునప్పుడును జరుగునట్లుగా భూమిమధ్య జనములలో జరుగును. శేషించినవారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు యెహోవా మహాత్మ్యమునుబట్టి సముద్రతీరమున నున్నవారు కేకలువేయుదురు. అందునుబట్టి తూర్పుదిశనున్నవారలారా, యెహో వాను ఘనపరచుడి సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతమునుండి సంగీత ములు మనకు వినబడెను. అప్పుడు నేను–అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు. భూనివాసీ, నీమీదికి భయము వచ్చెను గుంటయు ఉరియు నీకు తటస్థించెను తూములు పైకి తీయబడియున్నవి భూమి పునాదులు కంపించుచున్నవి భూమి బొత్తిగా బద్దలై పోవుచున్నది భూమి కేవలము తునకలై పోవుచున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది పాకవలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది అది పడి యికను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమిమీదనున్న భూరాజులను దండించును చెరపట్టపడినవారు గోతిలో చేర్చబడునట్లుగావారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును. యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించె దను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుస రించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగినశ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి మేఘచ్ఛాయవలన ఎండ అణచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును. ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును. సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఆ దినమున జనులీలాగు నందురు –ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము. యెహోవా హస్తము ఈ పర్వతముమీద నిలుచును పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లువారు దానిమధ్యను తమ చేతులను చాపుదురు వారెన్ని తంత్రములు పన్నినను యెహోవావారి గర్వమును అణచివేయును. మోయాబూ, నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన క్రుంగగొట్టును వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలుచేయును. ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు— బలమైన పట్టణమొకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు. సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తయిన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరాళముచేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరువారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. యెహోవా, నీ హస్తమెత్తబడి యున్నదిగాని జనులు దాని చూడనొల్లరు జనులకొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడు దురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మ్రింగివేయును. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షముననుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు. యెహోవా, మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి ఇప్పుడు నిన్నుబట్టియే నీ నామమును స్మరింతుము చచ్చినవారు మరల బ్రదుకరు ప్రేతలు మరలలేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి వారికను స్మరణకు రాకుండ నీవు వారిని తుడిచి వేసితివి. యెహోవా, నీవు జనమును వృద్ధిచేసితివి జనమును వృద్ధిచేసితివి. దేశముయొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారిమీద పడినందునవారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి యెహోవా, ప్రసూతికాలము సమీపింపగా గర్భవతి వేదనపడి కలిగిన వేదనలచేత మొఱ్ఱపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము. మేము గర్భము ధరించి వేదనపడితిమి గాలిని కన్నట్టు ఉంటిమి మేము లోకములో రక్షణ కలుగజేయకపోతిమి లోకములో నివాసులు పుట్టలేదు. మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు లను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చు చున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును దానిగూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. నాయందు క్రోధము లేదు గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన యెడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఈలాగున జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింప వలెను నాతో సమాధానపడవలెను వారు నాతో సమాధాన పడవలెను. రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇశ్రా యేలు చిగిర్చి పూయును.వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. అతని కొట్టినవారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా? అతనివలన చంపబడినవారు చంపబడినట్లు అతడు చంపబడెనా? నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాని తొలగించితివి కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయ శ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాపపరిహారమునకు కలుగు ఫలము. ఛిన్నాభిన్నములుగా చేయబడు సున్నపురాళ్లవలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరల లేవవు. ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువ బడును విసర్జింపబడిన నివాసస్థలముగానుండును అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్లకొమ్మలను తినును. దానికొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు.వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు.వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు. ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలు కొని ఐగుప్తునదివరకు యెహోవా తన ధాన్య మును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు. ఆ దినమున పెద్ద బూర ఊదబడును అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును, వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహో వాకు నమస్కారము చేయుదురు. త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ. కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పమువంటివారి సుందర భూషణ మునకు శ్రమ ద్రాక్షారసమువలన కూలిపోయినవారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి, బలపరాక్రమములుగలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లును ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు ఆయన తన బలముచేత పడద్రోయువాడు. త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును. ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పమువంటిదాని సుందరభూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూ రపు పండువలె అగును దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని చేతిలో పడినవెంటనే అది మ్రింగివేయబడును. ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషిం చిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగానుండును సౌందర్యముగల మకుటముగా నుండును. ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును. అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు మద్యమువలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మ్రింగివేయుచున్నది మద్యమువలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పుతీర్చుకాలమున తత్తరపడుదురు. వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషముల తోను నిండియున్నవి అవి లేనిచోటు లేదు. వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియ జేయును? తల్లిపాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా? ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు. నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు. అయినను వారు విననొల్లైరెరి. కావునవారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కు బడి పట్టబడునట్లు ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి –మేము మరణముతో నిబంధన చేసికొంటిమి పాతాళముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు –సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును. మరణముతో మీరు చేసికొనిన నిబంధన కొట్టివేయ బడును పాతాళముతో మీరు చేసికొనిన ఒడంబడిక నిలు వదు ప్రవాహమువలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దానిచేత త్రొక్కబడిన వారగు దురు వచ్చునప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొనిపోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము పుట్టును. పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్య మును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు యెహోవా లేచును గిబియోనులోయలో ఆయన రేగినట్లు రేగును. మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాస కులై యుండకుడి భూమియందంతట నాశనము ఖండితముగా నియమింప బడెను ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను దాని సమాచారము వింటిని చెవియొగ్గి నా మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా? అతడు దుక్కి పెల్లలు నిత్యము బద్దలగొట్టునా? అతడు నేల చదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ చల్లును తెల్ల జీలకఱ్ఱ చల్లును గోధుమలు వరుసగా విత్తును యవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మెరపమొలకలు వేయును గదా? వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకఱ్ఱ పదునుగల యంత్రముచేత నూర్చడు బండిచక్రములను జీలకఱ్ఱమీద నడిపింపడు గాని కఱ్ఱచేత నల్ల జీలకఱ్ఱను చువ్వచేత జీలకఱ్ఱను దుళ్ల గొట్టును గదా? మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా? సేద్యగాడును ఎల్లప్పుడు దాని నూర్చుచుండడు ఎల్లప్పుడును అతడు బండిచక్రమును గుఱ్ఱములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపడు గదా! జనులు సైన్యములకధిపతియగు యెహోవాచేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధిక బుద్ధియు అనుగ్ర హించువాడు ఆయనే అరీయేలుకు శ్రమ దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరుగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధముచేయుచు నీచుట్టు శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును. అప్పుడు నీవు అణపబడి నేలనుండి పలుకుచుందువు నీ మాటలు నేలనుండి యొకడు గుసగుసలాడు నట్లుం డును కర్ణపిశాచి స్వరమువలె నీ స్వరము నేలనుండి వచ్చును నీ పలుకు ధూళిలోనుండి గుసగుసలుగా వినబడును. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగానుండును బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలెనుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే యిది సంభ వించును. ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను సుడిగాలి తుపానులతోను దహించు అగ్నిజ్వాలల తోను సైన్యములకధిపతియగు యెహోవా దాని శిక్షించును. అరీయేలుతో యుద్ధముచేయు సమస్త జనుల సమూహ మును దానిమీదను దాని కోటమీదను యుద్ధము చేయువారును దాని బాధపరచువారందరును రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు. ఆకలిగొన్నవాడు కలలో భోజనముచేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును దప్పిగొనినవాడు కలలో పానముచేసి మేల్కొనగా సొమ్మసిల్లినవాని ప్రాణము ఇంకను ఆశగొని యున్నట్లును సీయోను కొండమీద యుద్ధముచేయు జనముల సమూహమంతటికి సంభవించును. జనులారా, తేరి చూడుడి విస్మయమొందుడి మీ కండ్లను చెడగొట్టుకొనుడి గ్రుడ్డివారగుడి ద్రాక్షారసము లేకయే వారు మత్తులైయున్నారు మద్యపానము చేయకయే తూలుచున్నారు. యెహోవా మీమీద గాఢనిద్రాత్మను కుమ్మరించి యున్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి యున్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకు వేసి యున్నాడు. దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములవలె ఉన్నది ఒకడు–నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలిసినవానికి వానిని అప్పగించును; అతడు–అది నావలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు–నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు–అక్షరములు నాకు తెలియవనును. ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు –ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారువారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి. కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతునువారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగునువారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలో పల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలి యును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరి గించువారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చి–ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చి–ఇతనికి బుద్ధిలేదనవచ్చునా? ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని యెంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు. బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు. కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమునుబట్టి యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని ఉరి నొడ్డుచు మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెల విచ్చుచున్నాడు –ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇకమీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపువారు తమ మధ్య నేనుచేయు కార్యమును చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు యాకోబు పరిశుద్ధదేవుని పరిశుద్ధపరచుదురు ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు. యెహోవా వాక్కు ఇదే –లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచనచేయుదురు నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు వారు నా నోటి మాట విచారణచేయక ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయా ణము చేయుదురు. ఫరోవలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును. యాకోబువారి అధిపతులు సోయనులో కనబడునప్పుడువారి రాయబారులు హానేసులో ప్రవేశించునప్పుడు వారందరును తమకు అక్కరకు రాక యే సహాయ మునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. దక్షిణ దేశములోనున్న క్రూరమృగములనుగూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించు కొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొని పోవుదురు. ఐగుప్తువలని సహాయము పనికిమాలినది, నిష్పయోజన మైనది అందుచేతను–ఏమియు చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథ ములో లిఖింపుము వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును –యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయాదర్శనములను కనుడి అడ్డము రాకుండుడి త్రోవనుండి తొలగుడి ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సంగతి మా యెదుట ఎత్తకుడి అని భవిష్యద్ జ్ఞానులతో పలుకువారునై యున్నారు. అందుచేతను ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు –మీరు ఈ వాక్యమువద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసికొంటిరి గనుక ఈ దోషము మీకు ఎత్తయిన గోడ నుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. కుమ్మరికుండ పగులగొట్టబడునట్లు ఆయన ఏమియు విడిచిపెట్టక దాని పగులగొట్టును పొయిలోనుండి నిప్పు తీయుటకు గాని గుంటలోనుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ప్రభువును ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –మీరు మరలి వచ్చి ఊరకుండుటవలన రక్షింప బడెదరు మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము కలుగును. అయినను మీరు సమ్మతింపక–అట్లు కాదు, మేము గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుఱ్ఱములను ఎక్కి పోయెదమంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు. మీరు పర్వతముమీదనుండు కొయ్యవలెను కొండమీదనుండు జెండావలెను అగువరకు ఒకని గద్దింపునకు మీలో వెయ్యిమంది పారిపోయెదరు అయిదుగురి గద్దింపునకు మీరు పారిపోయెదరు. కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యమువేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు యెహోవా న్యాయముతీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు. సీయోనులో యెరూషలేములోనే యొక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరు ణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును ఇకమీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను –ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును. చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతురు హేయములని వాటిని పారవేయుదురు. –లేచిపొమ్మని దానితో చెప్పుదురు. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడియైన ఆహారద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదై యుండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో మేయును. భూమి సేద్యముచేయు ఎడ్లును లేత గాడిదలును చేట తోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. గోపురములు పడు మహా హత్యదినమున ఉన్నతమైన ప్రతి పర్వతముమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను వాగులును నదులును పారును. యెహోవా తన జనుల గాయముకట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతోకూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది. ఆయన ఊపిరి కుతికలలోతు వచ్చు ప్రవాహమైన నదివలె ఉన్నది వ్యర్థమైనవాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనము లను గాలించును త్రోవ తప్పించు కళ్లెము జనుల దవడలలో ఉండును. రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవాయొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయసంతోషము కలుగును. యెహోవా తన ప్రభావముగల స్వరమును విని పించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును. యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినొందును. యెహోవా అష్షూరుమీద పడవేయు నియామక దండమువలని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును ఆయన తన బాహువును వానిమీద ఆడించుచు యుద్ధము చేయును. పూర్వమునుండి తోఫెతు సిద్ధపరచబడియున్నది అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసి యున్నాడు అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును. ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యు లనియువారిని ఆశ్రయించువారికి శ్రమ. అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల యింటివారిమీదను కీడుచేయువారికి తోడ్పడువారిమీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు యెహోవా తన చెయ్యిచాపగా సహాయముచేయు వాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు –తప్పించుటకై గొఱ్ఱెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమసింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్య పడకయు తనకు దొరికినదానిమీద గర్జించునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగి వచ్చును. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవనిమీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయనవైపు తిరుగుడి. మీకు మీరు పాపము కలుగజేసికొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును. నరునిది కాని ఖడ్గమువలన అష్షూరీయులు కూలు దురు మనుష్యునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గ మెదుటనుండివారు పారిపోవుదురు వారి పడుచువారు దాసులగుదురు భీతిచేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతినొంది వెనుక దీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సీయోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు. మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును. చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును. చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును. మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయములేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు. మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. ఘనులు ఘనకార్యములు కల్పించుదురువారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు. సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి. నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు. సుఖాసక్తిగల కన్యలారా, వణకుడి నిర్విచారిణులారా, తొందరపడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి. రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షా వల్లుల విషయమైవారు రొమ్ము కొట్టుకొందురు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు [14-15] నగరి విడువబడును జనసమూహముగల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహ లుగా ఉండును అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగానుండును. *** అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫల భరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు [18-19] అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును పట్టణము నిశ్చయముగా కూలిపోవును. *** సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొన బడెదవు నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచించెదరు. యెహోవా, నీకొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుము ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. మహాఘోషణ విని జనములు పారిపోవును నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు. చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచ బడును మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడు దురు యెహోవా మహాఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను. నీకాలములో నియమింపబడినది స్థిరముగానుండును రక్షణ బాహుళ్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధియు కలుగును యెహోవా భయము వారికి ఐశ్వర్యము. వారి శూరులు బయట రోదనముచేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు. రాజమార్గములు పాడైపోయెను త్రోవను నడచువారు లేకపోయిరి అష్షూరు నిబంధన మీరెను పట్టణములను అవమాన పరచెను నరులను తృణీకరించెను. దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయెను బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. యెహోవా ఇట్లనుకొనుచున్నాడు –ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్పచేసికొనెదను. ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు. మీ ఊపిరియే అగ్నియైనట్టు మిమ్మును దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపుబట్టీలవలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్లవలెను అగును. దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి సమీపస్థులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి. సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింప గలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివ సించును? నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాట లాడుచు నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నతస్థలమున నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచె దవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కన బడును. నీ హృదయము భయంకరమైనవాటినిబట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు? నాగరికములేని ఆ జనమును గ్రహింపలేని గంభీరభాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. ఉత్సవకాలములలో మనము కూడుకొనుచున్న సీయోను పట్టణమును చూడుము నిమ్మళమైన కాపురముగాను తియ్యబడని గుడారముగాను నీ కన్నులు యెరూష లేమును చూచును దాని మేకులెన్నడును ఊడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటియైనను తెగదు. అచ్చట యెహోవా ప్రభావముగలవాడై మన పక్షముననుండును, అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ యేదియు నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు. యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును. నీ ఓడత్రాళ్లు వదలిపోయెను ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడుసొమ్ము పంచుకొందురు. నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. రాష్టములారా, నాయొద్దకు వచ్చి వినుడి జనములారా, చెవి యొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినును గాక. యెహోవా కోపము సమస్త జనములమీదికి వచ్చుచున్నది వారి సర్వ సైన్యములమీద ఆయన క్రోధము వచ్చుచున్నది ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. వారిలో చంపబడినవారు బయట వేయబడెదరువారి శవములు కంపుకొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును. ఆకాశసైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోముమీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనముమీద తీర్పుతీర్చుటకు అది దిగును యెహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱెపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్టేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్ప బడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును. వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడె లును దిగిపోవుచున్నవి ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నదివారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది. అది యెహోవా ప్రతిదండనచేయు దినము సీయోను వ్యాజ్యెమునుగూర్చిన ప్రతికార సంవత్సరము. ఎదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును. అది రేయింబగళ్లు ఆరక యుండును దాని పొగ నిత్యము లేచును అది తరతరములు పాడుగానుండును ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు గూడబాతులును ముళ్ళ పందులును దాని ఆక్రమించు కొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును. రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు దాని అధిపతులందరు గతమైపోయిరి. ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును అడవిపిల్లులును నక్కలును అచ్చట కలిసికొనును అచ్చట అడవిమేక తనతోటి జంతువును కనుగొనును అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును చిత్తగూబ గూడు కట్టుకొనును అచ్చట గుడ్లుపెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతిపక్షులతోకూడు కొనును. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏదియు లేక యుండదు దేని జతపక్షి దానియొద్ద ఉండక మానదు నా నోటనుండి వచ్చిన ఆజ్ఞ యిదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగుచేయును. అవి రావలెనని ఆయన చీట్లువేసెను ఆయన కొలనూలు చేతపట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును. అవి నిత్యము దాని ఆక్రమించుకొనును యుగయుగములు దానిలో నివసించును. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి –భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు వారి తలలమీద నిత్యానందముండునువారు ఆనందసంతోషములుగలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సరమున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను.౹ అంతట అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకి రేవు మార్గమందున్న మెరకకొలను కాలువయొద్ద ప్రవేశింపగా హిల్కీయా కుమారుడును రాజు గృహనిర్వాహకుడునునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారియొద్దకు పోయిరి.౹ అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను — ఈ మాట హిజ్కియాతో తెలియ జెప్పుడి–మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా —నీవీలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్ర యాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి? యుద్ధవిషయములో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా; ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొనువారికందరికి అట్టివాడే.౹ మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే; యెరూషలేమందున్న యీ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా యెవని ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా.౹ కావున చిత్త గించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండువేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి యున్నయెడల నేను వాటిని నీకిచ్చెదను.౹ లేనియెడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించు కొంటివే.౹ యెహోవా సెలవు నొందకయే యీ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదు–ఆ దేశముమీదికి పోయి దాని పాడుచేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను.౹ ఎల్యాకీము షెబ్నా యోవాహు అను వారు–చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము, ప్రాకారముమీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా రబ్షాకే–ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానునియొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద ఉన్న వారియొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదాభాషతో ఇట్లనెను–మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చునదేమనగా– హిజ్కియాచేత మోసపోకుడి; మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.౹ యెహోవానుబట్టి మిమ్మును నమ్మించి–యెహోవా మనలను విడిపించును; ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.౹ హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవలదు; అష్షూరురాజు సెలవిచ్చున దేమనగా నాతో సంధి చేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచునుండును.౹ అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా నేను వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును మిమ్మును తీసికొనిపోదును; యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు.౹ ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలోనుండి విడిపించెనా? హమాతు దేవతలేమాయెను? అర్పాదు దేవతలేమాయెను? సెపర్వయీము దేవతలేమాయెను? షోమ్రోను దేశపు దేవత నా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా? యెహోవా నా చేతిలోనుండి యెరూషలేమును విడిపించు ననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలోనుండి విడిపించినది కలదా? అని చెప్పెను.౹ అయితే–అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుటచేత వారెంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకొనిరి.౹ గృహనిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకుపోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయు నైన యెషయాయొద్దకు పంపెను.౹ వీరు గోనెపట్ట కట్టుకొనినవారై అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి— హిజ్కియా సెలవిచ్చునదేమనగా–ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు.౹ జీవముగల దేవుని దూషించుటకై అష్షూరురాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.౹ రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను–మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా–అష్షూరురాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.౹ అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును; వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును. అతని దేశమందు ఖడ్గముచేత అతనిని కూలజేయుదును. అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.౹ అంతట కూషురాజైన తిర్హాకా తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియాయొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను.౹ –యూదా రాజగు హిజ్కి యాతో ఈలాగు చెప్పుడి–యెరూషలేము అష్షూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.౹ అష్షూరురాజులు సకలదేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవుమాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూ లముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులుగాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులుగాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా? హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? అని వ్రాసిరి హిజ్కియా దూతలచేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను– యెహోవా, కెరూబులమధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకలరాజ్యములకు దేవుడవై యున్నావు.౹ సైన్యములకధిపతివగు యెహోవా, చెవి యొగ్గి ఆలకించుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము.౹ యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లుగాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి.౹ యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా వని సమస్త జనులు తెలిసికొనునట్లు అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము. అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను–ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా–అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట ప్రార్థన చేసితివే.౹ అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట ఏదనగా— సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణచేయు చున్నది ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి యెవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవునినే గదా? నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి నీ వీలాగు పలికితివి నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖర ములమీదికిని లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవి లోనికిని ప్రవేశించియున్నాను. నేను త్రవ్వి నీళ్లు పానముచేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపోచేసియున్నాను నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బ లుగా చేయుట నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి. విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి. నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి. నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినదేమనగా–హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనమువిత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము ననుభవించుదురు.౹ యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.౹ శేషించు వారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు, తప్పించుకొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును.౹ కాబట్టి అష్షూరురాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా–అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడి దిబ్బ కట్టడు.౹ ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు.౹ నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.౹ అంతట యెహోవాదూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్షయెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబరములుగా ఉండిరి.౹ అష్షూరురాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతుదేశములోనికి తప్పించు కొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతనియొద్దకు వచ్చి–నీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తనముఖమును గోడతట్టు త్రిప్పుకొని –యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము–నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున దేమనగా–నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను;౹ ఇంక పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండ విడిపించెదను.౹ యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవావలన నీకు కలిగిన సూచన;౹ ఆహాజు ఎండ గడియారముమీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల పదిమెట్లు ఎక్క జేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను. యూదారాజైన హిజ్కియా రోగియై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచియించినది. –నా దినములమధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొని యున్నాను. యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక పోవుదునని నేననుకొంటిని. నా నివాసము పెరికివేయబడెను గొఱ్ఱెలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తి కొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు. ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తిచేయుదువు మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణిం చెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట బడి యుండుము. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమునుబట్టి నా సంవత్సరములన్నియు నేను మెల్లగా నడచు కొందును. ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయు దువు మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పార వేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయిం చరు. సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు మన జీవితదినములన్నియు యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము. మరియు యెషయా–అంజూరపుపండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను.౹ మరియు హిజ్కియా–నేను యెహోవా మందిరమునకు పోయెదననుటకు గురుతేమని యడిగి యుండెను. ఆ కాలమందు బబులోనురాజును బలదాను కుమారుడునైన మెరోదక్బలదాను హిజ్కియా రోగియై బాగు పడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన యింటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్తవస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములుగల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించెను.౹ పిమ్మట ప్రవక్తయైన యెషయా రాజైన హిజ్కియాయొద్దకు వచ్చి–ఆ మనుష్యులు ఏమనిరి? నీయొద్దకు ఎక్కడనుండి వచ్చిరి? అని యడుగగా హిజ్కియా–బబులోనను దూరదేశమునుండి వారు వచ్చియున్నారని చెప్పెను.౹ నీ యింట వారేమేమి చూచిరని అతడడుగగా హిజ్కియా–నా పదార్థములలో దేనిని మరుగుచేయక నా యింటనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నాననెను.౹ అంతట యెషయా హిజ్కియాతో నిట్లనెను–యెహోవా సెలవిచ్చు మాట వినుము –రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ యింటనున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమ కూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొనిపోవుదురు.౹ అందుకు హిజ్కియా–నీవు తెలియజేసిన యెహోవాఆజ్ఞ చొప్పున జరుగుట మేలే; నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో అనెను. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, –నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా–అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ పరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండ వలెను. యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు –నేనేమి ప్రకటింతునని మరియొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వువాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సీయోనూ, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి –ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనున్నది ఆయనచేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడచుచున్నది. గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయమార్గమునుగూర్చి ఆయనకు నేర్పినవాడెవడు? ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు? జనములు చేదనుండి జారు బిందువులవంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి. సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానేయుండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును విలువగలదానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని వాని వెదకి పిలుచుకొనును. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరు దాని గ్రహింపలేదా? ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. రాజులను ఆయనలేకుండచేయును భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపు లుగా చేయును. వారు నాటబడగనే విత్తబడగనేవారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులుపెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయనయొక్కటియైనను విడిచిపెట్టడు. యాకోబూ–నా మార్గము యెహోవాకు మరుగై యున్నది నా న్యాయము నా దేవునిదృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురువారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి. జనములారా, నూతనబలము పొందుడి.వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోబరచుచున్నాడు ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు చున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకుముందు వెళ్లనిత్రోవనే సురక్షితముగ దాటిపోవుచున్నాడు. ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను. ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి భూదిగంతములు వణకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు వారు ఒకనికొకడు సహాయము చేసికొందురు ధైర్యము వహించుమని యొకనితో ఒకడు చెప్పు కొందురు. అతుకుటనుగూర్చి –అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును సుత్తెతో నునుపుచేయువాడు దాగలి మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండ పనివాడు మేకులతో దాని బిగించును. నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, [9-10] భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును. *** నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందె దరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు నీతో కలహించువారిని నీవు వెదకుదువుగాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను–భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రా యేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడిచేయు దువు కొండలను పొట్టువలె చేయుదువు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు. దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకకవారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించు నట్లు చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం చెదను అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి వృక్షములను నాటెదను. –వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పు చున్నాడు. జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి. ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయాసంతానము మీ కార్యము శూన్యము మిమ్మును కోరుకొనువారు హేయులు. ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కు నట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. మేము ఒప్పుకొనునట్లు జరిగినదానిని ఆదినుండియు తెలియజెప్పినవాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వ కాలమున దానిని తెలియజెప్పినవాడెవడు? దాని తెలియజెప్పువాడెవడును లేడు వినుపించు వా డెవడును లేడు మీ మాటలు వినువాడెవడును లేడు. ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పిన వాడను నేనే యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితిని. నేను చూడగా ఎవడును లేకపోయెను నేను వారిని ప్రశ్నవేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త యెవడును లేకపోయెను. వారందరు మాయాస్వరూపులువారి క్రియలు మాయ వారి పోతవిగ్రహములు శూన్యములు అవి వట్టిగాలియై యున్నవి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును. భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచువారి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. [6-7] గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను. *** యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను. మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రము లోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను సెల నివాసులు సంతోషించుదురు గాక పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక. ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొని యాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక యెహోవా శూరునివలె బయలుదేరును యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించునువారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును. చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంత ముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు నున్నాను. పర్వతములను కొండలను పాడుచేయుదును వాటిమీది చెట్టుచేమలన్నిటిని ఎండిపోచేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుగులను ఆరిపోచేయుదును. వారెరుగనిమార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును చెక్కినవిగ్రహములను ఆశ్రయించి పోతవిగ్రహ ములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు. చెవిటివారలారా, వినుడి గ్రుడ్డివారలారా, మీరు గ్రహించునట్లు ఆలో చించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావువారు చెవి యొగ్గిరిగాని వినకున్నారు. యెహోవా తన నీతినిబట్టి సంతోషముగలవాడై ఉపదేశక్రమమొకటి ఘనపరచి గొప్పచేసెను. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరును తప్పించుకొనకుండ వారందరు గుహలలో చిక్కుపడియున్నారువారు బందీగృహములలో దాచబడియున్నారు దోపుడుపాలైరి విడిపించువాడెవడును లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడును లేడు. మీలో ఎవడు దానికి చెవి యొగ్గును? రాబోవుకాలమునకై ఎవడు ఆలకించి వినును? యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమివారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొనువారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా? కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను అది వానిచుట్టు అగ్ని రాజచేసెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు. అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు –నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించు చున్నాను. భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే. కన్నులుండి అంధులైనవారిని చెవులుండి బధిరులైనవారిని తీసికొని రండి సర్వజనులారా, గుంపుకూడి రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించు దురు? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షు లను తేవలెను లేదా, విని సత్యమే యని యొప్పుకొనవలెను. మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు. ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలోనుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు— మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారినందరిని పారిపోవునట్లు చేసెదనువారి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. [16-17] సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును రథమును గుఱ్ఱమును సేనను శూరులను నడిపించువాడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరు ఏకముగా పండుకొని లేవకయుందురువారు లయమై జనుపనారవలె ఆరిపోయిరి. *** మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్య ములో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబూ, నీవు నాకు మొఱ్ఱపెట్టుటలేదు ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా. దహనబలులుగా గొఱ్ఱెమేకల పిల్లలను నాయొద్దకు తేలేదు నీ బలులచేత నన్ను ఘనపరచలేదు నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు. నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి. నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను. నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యెమును వివరించుము. నీ మూలపితరుడు పాపముచేసినవాడే, నీ మధ్యవర్తులు నామీద తిరుగుబాటు చేసినవారే. కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను అపవిత్ర పరచితిని యాకోబును శపించితిని ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని. అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము. నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను. నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లువారు ఎదుగుదురు. ఒకడు–నేను యెహోవావాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను. మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను. విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారువారికిష్టమైన విగ్రహములు నిష్‌ప్రయోజనములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగు చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మసిల్లును వడ్లవాడు నూలు వేసి చీరణముతో గీత గీచి చిత్రిక లతో దాని చక్కచేయును కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల దానిగాను నరసౌందర్యముగలదానిగాను చేయును. ఒకడు దేవదారుచెట్లను నరుకవలెనని పూనుకొనును శ్మశానవృక్షమును గాని సరళవృక్షమును గాని సింధూరవృక్షములనుగాని అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసికొనును ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును ఒకడు పొయ్యికట్టెలకు వాటి నుపయోగించును వాటిలో కొంతతీసికొని చలి కాచుకొనును నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహముచేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగ ముతో మాంసము వండి భక్షించియున్నాడు తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు ఆహా, చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అను కొనుచున్నాడు దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు –నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును. వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయ బడెను. ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనముచేసితిని మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును ఆలోచింపడు యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు. వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవుచున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అను కొనుటకు వానికి బుద్ధి చాలదు. యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్న తునిగా కనుపరచుకొనును గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థముచేయు వాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను –యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే. నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను కోరెషుతో–నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో–నీవు కట్టబడుదువనియు దేవాలయ మునకు పునాదివేయబడుననియు నేను చెప్పు చున్నాను. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. –నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల ములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు వాడను. ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా, మహావర్షము వర్షించుము భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును గాక యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను. మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమిచేయు చున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు –రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులనుగూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. నీతినిబట్టి కోరెషును రేపితిని అతని మార్గములన్నియు సరాళముచేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చు కొనకయు నేను వెలివేసినవారిని అతడు విడిపించును యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు –ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన సెబాయీయులును నీయొద్దకు వచ్చి నీవారగుదురువారు నీవెంట వచ్చెదరు సంకెళ్లు కట్టుకొని వచ్చి నీ యెదుట సాగిలపడుదురు –నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవైయున్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి వారందరు విస్మయము పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు. యెహోవావలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది యున్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొంద కయు నుందురు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా— యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు. అంధకారదేశములోని మరుగైనచోటున నేను మాట లాడలేదు –మాయాస్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే. కూడి రండి జనములలో తప్పించుకొనినవారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్యవిగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు. మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ జేయుడి జనులు కూడుకొని ఆలోచనచేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు? చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు? యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు భూదిగంతముల నివాసులారా, నావైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. –నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు. యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరు నీతిమంతులుగా ఎంచబడినవారై యతిశయపడుదురు. బేలు కూలుచున్నది నెబో క్రుంగుచున్నది వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను మోయబడుచున్నవి మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి అవి క్రుంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడి పించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచినుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు. వారు భుజముమీద దాని నెక్కించుకొందురు దాని మోసికొనిపోయి తగినచోట నిలువబెట్టుదురు ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి యెవనిని రక్షింపదు. దీని జ్ఞాపకము చేసికొని ధైర్యముగా నుండుడి అతిక్రమము చేయువారలారా, దీని ఆలోచించుడి చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను. తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెర వేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను. కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించు చున్నాను. కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో. కూర్చుండుము కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు. తిరుగటిదిమ్మలు తీసికొని పిండి విసరుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీది బట్ట తీసి నదులు దాటుము. నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము వెల్లడియగును నేను ప్రతి దండన చేయుచు నరులను మన్నింపను. సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు. కల్దీయుల కుమారీ, మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దొరసానియని యికమీదట జనులు నిన్నుగూర్చి చెప్పరు. నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్ర పరచి వారిని నీ చేతికి అప్పగించితిని నీవు వారియందు కనికరపడక వృద్ధులమీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు –నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరును లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము –ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభ వించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధార ముగా చేసికొనినను ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నన్ను చూడడని అనుకొంటివి –నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవను కొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. కీడు నీమీదికివచ్చును నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు ఆ కీడు నీమీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదు రేమో ఆలోచించుము. వారు కొయ్యకాలువలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొన లేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పుకాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీవు ఎవరికొరకు ప్రయాసపడి అలసితివో వారికి ఆలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారముచేయువారు తమతమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు నిన్ను రక్షించువాడొకడైన నుండడు. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు. కలిగినవారలారా, యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి. వారు–మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టు కొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాల కాలముక్రిందట తెలియజేసితిని ఆ సమాచారము నా నోటనుండి బయలుదేరెను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభ వించెను. నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి –నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోతవిగ్రహము దీని నియమించెననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమా చారము నీకు తెలియజేసితిని అది జరుగకమునుపే దానిని నీకు ప్రకటించితిని నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలో చించుము అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా? తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనికమీదట నీకు తెలియజేయుచున్నాను అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు, ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండ లేదు. అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అని పించుకొంటివని నాకు తెలియును. నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామ మునుబట్టి నాకోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టు కొనుచున్నాను. నేను నిన్ను పుటమువేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను. యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును. మీరందరు కూడివచ్చి ఆలకించుడి వాటిలో ఏది యీ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకా రము బబులోనునకు చేయును అతని బాహుబలము కల్దీయులమీదికి వచ్చును. నేను, నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను, నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును. నాయొద్దకు రండి యీ మాట ఆలకించుడి ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరు చున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును. నీ సంతానము ఇసుకవలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువులవలె విస్తరించును వారి నామము నా సన్నిధినుండి కొట్టివేయబడదు మరువబడదు బబులోనునుండి బయలువెళ్లుడి కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించె నను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూదిగంతములవరకు అది వినబడునట్లు దాని ప్రక టించుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతికొండలోనుండి వారికొరకు ఆయన నీళ్లు ఉబుక జేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చు చున్నాడు. ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు. ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. అయినను–వ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమియులేకుండ నా బలమును వృథాగా వ్యయ పరచియున్నాననుకొంటిని నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే యున్నది. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకో బును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు –నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు –యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. –బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను –బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములలో వారు మేయుదురు చెట్లులేని మిట్టలన్నిటిమీద వారికి మేపు కలుగును వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు. నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడుడి వీరు దూరమునుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు వచ్చుచున్నారు వీరు సీనీయుల దేశమునుండి వచ్చుచున్నారు. శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి. అయితే సీయోను–యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనముచేసి నిన్ను పాడుచేసినవారు నీలో నుండి బయలు వెళ్లుచున్నారు. కన్నులెత్తి నలుదిశల చూడుము వీరందరు కూడుకొనుచు నీయొద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరిని ఆభరణముగా ధరించుకొందువు పెండ్లికుమార్తె ఒడ్డాణము ధరించుకొనునట్లు నీవువారిని అలంకారముగా ధరించుకొందువు నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము చేయబడిన నీ భూమియువారికి ఇరుకుగా ఉండును నిన్ను మ్రింగివేసినవారు దూరముగా ఉందురు. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమా రులు –ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. అప్పుడు నీవు–నేను నా పిల్లలను పోగొట్టుకొని, సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా? వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవా డెవడు? నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి? అని నీ మనస్సులో నీవనుకొందువు. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను జనములతట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నానువారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరువారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు. బలాఢ్యుని చేతిలోనుండి కొల్లసొమ్ము ఎవడు తీసికొన గలడు? భీకరులు చెరపెట్టినవారు విడిపింపబడుదురా? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –బలాఢ్యులు చెరపెట్టినవారు సహితము విడిపింప బడుదురు భీకరులు చెరపెట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యు లందరు ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించె దను క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండనేల? నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా? విడిపించుటకు నాకు శక్తిలేదా? నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును. ఆకాశమున చీకటి కమ్మజేయుచున్నాను అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు వినకుండ నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్ప గించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్నికొరవులను మీచుట్టు పెట్టుకొనువారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదనగలవారై పండుకొనెదరు. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలో చించుడి మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలో చించుడి మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలెనగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును నా ప్రజలారా, నా మాట ఆలకించుడి నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నాయొద్దనుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియ మింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పుతీర్చును ద్వీపవాసులు నాతట్టు చూచి నిరీక్షణ గలవా రగుదురువారు నా బాహువును ఆశ్రయింతురు. ఆకాశమువైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రమువలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలె చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు. నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులుపడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తర తరములుండును. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి నట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా? అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా? విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా? యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండునువారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకుసిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను? క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడనైన యెహోవాను సముద్రముయొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను. యెరూషలేమా, లెమ్ము లెమ్ము యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చు కొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూప గలవాడెవడును లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయి పట్టు కొనువాడెవడును లేకపోయెను. ఈ రెండు అపాయములు నీకు సంభవించెను నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు నాశనము కరవు ఖడ్గము నీకు ప్రాప్తించెను, నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు దుప్పి వలలో చిక్కు పడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు. యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోనువారు నిండియున్నారు. ద్రాక్షారసములేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట వినుము. నీ ప్రభువగు యెహోవా తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు –ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను నీవికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమనివారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదావారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను. సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్ర ములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారీ, నీ మెడకట్లు విప్పివేసికొనుము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –మీరు ఊరకయే అమ్మబడితిరి గదా రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు. దేవుడైన యెహోవా అనుకొనుచున్న దేమనగా తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచెను. నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలిసికొందురు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దిన మున తెలిసికొందురు. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి. ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు. యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి యెహోవా తన జనులను ఆదరించెను యెరూష లేమును విమోచించెను. సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు. పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును. నిన్ను చూచి యే మనిషిరూపముకంటె అతని ముఖ మును, నరరూపముకంటె అతని రూపమును చాల వికారమని చాలమంది యేలాగు విస్మయమొందిరో ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు తమకు తెలియజేయబడని సంగతులువారు చూచెదరు తాము విననిదానిని గ్రహింతురు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ మును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను. గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తననెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార మగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు. నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు –విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురు షుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యౌవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చు చున్నాడు. ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు దును. నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూర ముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరాదు. జనులు గుంపుకూడినను వారు నావలన కూడరు నీకు విరోధముగా గుంపుకూడువారు నీ పక్షపు వారగు దురు. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పని ముట్టుచేయు కమ్మరిని సృజించువాడను నేనే నాశనము చేయుటకై పాడుచేయువాని సృజించు వాడను నేనే నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనియ్యుడి. చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని నీవెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవానుబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిబట్టి నీయొద్దకు పరుగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెనువారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడునువారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును. మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును. ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలు చును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదు గును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతిదినమును అపవిత్రపరచ కుండ దానిని అనుసరించుచు ఏ కీడుచేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకొను అన్యుడు— నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడు–నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు నాకిష్టమైనవాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధపర్వతమునకు తోడుకొని వచ్చెదను నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలు లును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును. ఇశ్రాయేలీయులలో వెలివేయబడినవారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే –నేను సమకూర్చిన ఇశ్రాయేలువారికిపైగా ఇతరు లను కూర్చెదను. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి. వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు తెలివిలేనివారు వారందరు మూగకుక్కలు మొరుగలేరు కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచా రించుకొందురు. వారిట్లందురు–నేను ద్రాక్షారసము తెప్పించెదను మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సున పెట్టరు భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు కీడు చూడకుండ నీతిమంతులుకొనిపోబడుచున్నారని యెవనికిని తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరక్కడికి రండి. మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా? మస్తచావృక్షములను చూచి పచ్చని ప్రతిచెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతిసందులక్రింద పిల్లలను చంపువార లారా, నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా? ఉన్నతమైన మహాపర్వతముమీద నీ పరుపు వేసి కొంటివి బలి అర్పించుటకు అక్కడికే యెక్కితివి తలుపువెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపకచిహ్నము ఉంచితివి నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి నీ పరుపు వెడల్పుచేసికొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమిం చితివి. నీవు తైలము తీసికొని రాజునొద్దకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసికొని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాళమంత లోతుగా నీవు లొంగితివి నీ దూరప్రయాణముచేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్క రింపకపోతివి? నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసికొనకపోతివి బహుకాలమునుండి నేను మౌనముగానుండినందుననే గదా నీవు నాకు భయపడుట లేదు? నీ నీతి యెంతో నేనే తెలియజేసెదను, నీ క్రియలు నీకు నిష్‌ప్రయోజనములగును. నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు కొందురు నా పరిశుద్ధపర్వతమును స్వాధీనపరచుకొందురు. –ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములోనుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు –నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణిం చును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితినివారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతునువారిలో దుఃఖించువారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమా ధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చు చున్నాడు. భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును. దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలువేయుమువారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయుము తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నాయొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడు గుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛ యింతురు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయ ముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా? [7-8] నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. *** అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన–నేనున్నాననును. ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక లను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. పూర్వకాలమునుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు విరుగబడినదానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడ వనియు నీకు పేరు పెట్టబడును. నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ ములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది. నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష సర్పము పుట్టును. వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదువారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియో గింపదు వారి క్రియలు పాపక్రియలేవారు బలాత్కారము చేయువారే. వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి శాంతవర్తనమును వారెరుగరువారి నడవడులలో న్యాయము కనబడదువారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొనుచున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కలిసికొనుటలేదు వెలుగుకొరకు మేముకనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము గోడ కొరకు గ్రుడ్డివారివలె తడవులాడుచున్నాము కన్నులు లేనివారివలె తడవులాడుచున్నాము సంధ్యచీకటియందువలెనే మధ్యాహ్నకాలమున కాలు జారి పడుచున్నాము బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారి వలె ఉన్నాము. మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది మేము చేసిన తిరుగుబాటుక్రియలు నీ యెదుట విస్త రించియున్నవి మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటుక్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపుమాటలు పలు కుటయు ఇవియే మావలన జరుగుచున్నవి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంతవీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తిలేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను వారి క్రియలనుబట్టి ఆయన ప్రతి దండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతికారము చేయును ద్వీపస్థులకు ప్రతికారము చేయును. పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు యెహోవా పుట్టించుగాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ జలమువలె ఆయన వచ్చును. సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యెహోవా వాక్కు. నేను వారితోచేయు నిబంధన యిది –నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీవైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటె లును నీ దేశముమీద వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగము లగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము లను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురువారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లువారి రాజులు జయోత్సవముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షములును సరళవృక్షములును గొంజిచెట్లును నీయొద్దకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరచెదను. నిన్ను బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడుటనుబట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును. నీ జనులందరు నీతిమంతులైయుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లువారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమునువారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును. చాలకాలమునుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు తరతరములనుండి శిథిలములైయున్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు పరదేశులు మీకు వ్యవసాయకులును మీ ద్రాక్షతోట కాపరులును అగుదురు మీరు యెహోవాకు యాజకులనబడుదురు –వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురువారి ప్రభావమును పొంది అతిశయింతురు మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందు దురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించివారు సంతోషింతురువారు తమ దేశములోరెట్టింపుభాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము. సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచువారితో నిత్యనిబంధన చేయుదును. జనములలో వారి సంతతి తెలియబడును జనములమధ్యను వారి సంతానము ప్రసిద్ధినొందును –వారు యెహోవా ఆశీర్వదించిన జనమనివారిని చూచినవారందరు ఒప్పుకొందురు శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది భూమి మొలకను మొలిపించునట్లుగాను తోటలో విత్తబడినవాటిని అది మొలిపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప జేయును. సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును రాజులందరు నీ మహిమను చూచెదరు యెహోవా నియమింపబోవు క్రొత్తపేరు నీకు పెట్ట బడును. నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును. యౌవనుడు కన్యకను వరించి పెండ్లిచేసికొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరు పెండ్లికుమారుడు పెండ్లికూతురినిచూచి సంతోషించు నట్లు నీ దేవుడు నిన్నుగూర్చి సంతోషించును. యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలివారిని ఉంచియున్నాను రేయైన పగలైనవారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడ నియు యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను –నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చినవారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయమంటపములలో దాని త్రాగుదురు. గుమ్మములద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి. ఆలకించుడి, భూదిగంతములవరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు ఇదిగో రక్షణ నీయొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనే యున్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చుచున్నా డని సీయోను కుమార్తెకు తెలియజేయుడి. పరిశుద్ధప్రజలనియు యెహోవా విమోచించిన వార నియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చు చున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యిత డెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్న వేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్ట లన్నియు డాగులే. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను. కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితినివారి రక్తమును నేల పోసివేసితిని. యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రము లను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను. –వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జను లను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములో నుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి? [12-13] తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగావారు పడకుండ అగాధజలములలో నడిపించిన వాడేడి? యనుకొనిరి *** పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడి పించితివి పరమునుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసస్థలమునుండి దృష్టించుము నీ ఆసక్తి యేది? నీ శౌర్యకార్యములేవి? నాయెడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగి పోయెనే. మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము నెరుగక పోయినను ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా, నీవే మా తండ్రివి అనాదికాలమునుండి మా విమోచకుడని నీకు పేరే గదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. నీ పరిశుద్ధజనులు స్వల్పకాలమే దేశమును అనుభ వించిరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు. నీ పరిపాలన నెన్నడును ఎరుగనివారివలెనైతిమి నీ పేరెన్నడును పెట్టబడనివారివలెనైతిమి. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను నీవు దిగివచ్చెదవు గాక. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు. నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించు చున్నావు. చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి బహుకాలమునుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా? మేమందరము అపవిత్రులవంటివారమైతిమి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు. యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము. యెహోవా, అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసి కొనకుము చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమంద రము నీ ప్రజలమే గదా. నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను. యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగానుందువా? అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా? నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు. రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. –నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు నా భయములేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి వారు–మా దాపునకురావద్దు ఎడముగా ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు; వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నా యెదుట గ్రంథములో అది వ్రాయబడి యున్నది ప్రతికారముచేయక నేను మౌనముగా నుండను నిశ్చయముగా వారనుభవించునట్లు నేను వారికి ప్రతి కారము చేసెదను. నిశ్చయముగా మీ దోషములనుబట్టియు మీపితరుల దోషములనుబట్టియు అనగా పర్వతములమీద ఈ జనులు ధూపమువేసిన దానినిబట్టియు కొండలమీద నన్ను దూషించినదానినిబట్టియు మొట్టమొదట వారి ఒడిలోనేవారి ప్రతికారము కొలిచి పోయుదును. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –ద్రాక్షగెలలో క్రొత్తరసము కనబడునప్పుడు జనులు–ఇది దీవెనకరమైనది దాని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా? నా సేవకులనందరిని నేను నశింపజేయకుండునట్లువారినిబట్టి నేనాలాగే చేసెదను. యాకోబునుండి సంతానమును యూదానుండి నా పర్వతములను స్వాధీనపరచుకొనువారిని పుట్టించె దను నేను ఏర్పరచుకొనినవారు దాని స్వతంత్రించు కొందురు నా సేవకులు అక్కడ నివసించెదరు. నన్నుగూర్చి విచారణచేసిన నా ప్రజలనిమిత్తము షారోను గొఱ్ఱెల మేతభూమియగును ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధపర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైనదాని చేసితిరి నాకిష్టము కానిదాని కోరితిరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును మీరందరు వధకు లోనగుదురు. కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు –ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనె దరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనోదుఃఖముచేత ప్రలాపించెదరు. నేనేర్పరచుకొనినవారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు ప్రభువగు యెహోవా నిన్ను హతముచేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరు వాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని కోరుకొనును దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన బడవు. అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు కాలమునిండని ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చని పోవుదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రదుకును జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభ వింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరువారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ వింతురు వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరువారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురువారి సంతానపువారు వారియొద్దనే యుందురు. వారికీలాగున జరుగునువారు వేడుకొనకమునుపు నేను ఉత్తరమిచ్చెదనువారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశన మైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది? అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చు చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే.వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరివారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేక పోయెను నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేక పోయెను నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి నాకిష్టము కానిదాని కోరుకొనిరి కావున నేనును వారిని మోసములో ముంచుదునువారు భయపడువాటిని వారిమీదికి రప్పించెదను. యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమునుబట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు –మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు వారే సిగ్గునొందుదురు. ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది దేవాలయమునుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ప్రసవవేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది. అట్టివార్త యెవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా? అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా? అని నీ దేవుడడుగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించె దరు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను పరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును. ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారము చేయుట కును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపానువలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గముచేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడును యెహోవాచేత అనేకులు హతులవుదురు. తోటలోనికి వెళ్లవలెనని మధ్యనిలుచున్న యొకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు కొనుచున్నవారై పందిమాంసమును హేయవస్తు వును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండ నశించెదరు ఇదే యెహోవా వాక్కు. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట లాడువారిని సమకూర్చెదనువారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదనువారిలో తప్పించుకొనినవారిని విలుకాండైన తర్షీషు పూలు లూదు అను జనులయొద్ద కును తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపె దను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహి మను చూడనట్టియు దూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదనువారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్య మును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుఱ్ఱములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలోనుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగావారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చు చున్నాడు. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు— నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినము నను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చె దరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబర ములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు –ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజై యుండగా అతని యేలుబడి పదుమూడవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్ష మాయెను.౹ మరియు యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజైయుండగాను, యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై యుండగాను, అతని యేలుబడి పదునొకండవ సంవత్సరాంతమువరకును, అనగా ఆ సంవత్సరమున అయిదవ నెలలో యెరూషలేము చెరదీసికొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. [4-5] యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.౹ *** అందుకు–అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకీలాగు సెలవిచ్చెను— నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెను.౹ వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు.౹ అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెను–ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.౹ పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనములమీదను రాజ్యములమీదను నిన్ను నియమించియున్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై —యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు — బాదముచెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా యెహోవా–నీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతుర పడుచున్నాననెను.౹ రెండవమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై–నీకేమి కనబడుచున్నదని సెలవియ్యగా నేను–మసలుచున్న బాన నాకు కనబడుచున్నది; దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగియున్నదంటిని.౹ అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను–ఉత్తర దిక్కునుండి కీడు బయలుదేరి యీ దేశనివాసులందరిమీదికి వచ్చును.౹ ఇదిగో నేను ఉత్తరదిక్కున నున్న రాజ్యముల సర్వవంశస్థులను పిలిచెదను, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను, యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటికి ఎదురుగాను, యూదాపట్టణములన్నిటికి ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు.౹ అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి, తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటయను తమ చెడుతనమంతటినిబట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును.౹ కాబట్టి నీవు నడుముకట్టుకొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటనచేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును.౹ యూదారాజుల యొద్దకు గాని ప్రధానులయొద్దకు గాని యాజకులయొద్దకు గాని దేశనివాసులయొద్దకు గాని, యీ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ప్రాకారముగల పట్టణముగాను ఇనుపస్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించియున్నాను.౹ వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందునవారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగనిదేశములోను, నన్ను వెంబడించుచు నీ యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను.౹ అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయపరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును; ఇదే యెహోవా వాక్కు. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి.౹ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నాయందు ఏ దుర్నీతి చూచి మీపితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి? ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు.౹ దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి.౹ యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్‍ప్రయోజనమైనవాటిని అనుసరింతురు కావున నేనికమీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యెమాడెదను; ఇది యెహోవా వాక్కు.౹ కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి.౹ ఆకాశమా, దీనిబట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.౹ నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.౹ ఇశ్రాయేలు కొనబడిన దాసుడా? యింటపుట్టిన దాసుడా? కాడు గదా; అతడేల దోపుడుసొమ్మాయెను? కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను, అవి అతని దేశమును పాడుచేసెను, అతని పట్టణములు నివాసులులేక పాడాయెను.౹ నోపు, తహపనేసు అను పట్టణములవారు నీ నెత్తిని బద్దలు చేసిరి.౹ నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుటవలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా.౹ నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది.౹ నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులులేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ పూర్వకాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని–నేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.౹ శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటితిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టు వంటిదానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీ వెట్లు భ్రష్టసంతానమైతివి? నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది; ఇది ప్రభువగు యెహోవా వాక్కు.౹ –నేను అపవిత్రత నొందినదానను కాను, బయలుదేవతల ననుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసినదాని తెలిసికొనుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు,౹ అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతవలన గాలి పీల్చును, కలిసికొనునప్పుడు దాని త్రిప్పగల వాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి యుండదు, దాని మాసములో అది కనబడును.౹ జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పిగొనకుండునట్లు జాగ్రత్తపడుము అని నేను చెప్పినను నీవు–ఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు.౹ దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు–నీవు మా తండ్రివని మ్రానుతోను —నీవే నన్ను పుట్టించితివని రాతితోను చెప్పుచు, వారును వారి రాజులును వారి అధిపతులును వారి యాజకులును వారి ప్రవక్తలును అవమానము నొందుదురు.౹ వారు నాతట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి; అయినను ఆపత్కాలములో–లేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు.౹ నీకు నీవు చేసికొనిన దేవతలు ఎక్కడ నున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో; యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నియే గదా. మీరందరు నామీద తిరుగుబాటు చేసినవారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు.౹ నేను మీ పిల్లలను హతముచేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది.౹ ఈ తరమువారలారా, యెహోవా సెలవిచ్చుమాట లక్ష్యపెట్టుడి–నేను ఇశ్రాయేలునకు అరణ్యమువలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతిమి; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పు చున్నారు? కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.౹ కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు; అందువలన నీ కార్యములు చేయుటకు చెడుస్త్రీలకు నేర్పితివి గదా.౹ మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగులమీద కనబడుచున్నది; కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటిమీదను కనబడు చున్నది.౹ అయినను నీవు–నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నామీదనుండి తొలగిపోయెనని చెప్పు కొనుచున్నావు. ఇదిగో–పాపము చేయలేదని నీవు చెప్పిన దానిబట్టి నీతో నాకు వ్యాజ్యెము కలిగినది.౹ నీ మార్గము మార్చుకొనుటకు నీవేల ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారము చేసికొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసికొని సిగ్గుపడెదవు.౹ చేతులు నెత్తిని బెట్టుకొని ఆ జనమునొద్దనుండి బయలు వెళ్లెదవు; యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటివలన నీకు క్షేమము కలుగదు. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతనియొద్దనుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమెయొద్దకు తిరిగిచేరునా? ఆలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా; అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నాయొద్దకు తిరిగిరమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ చెట్లులేని కొండప్రదేశమువైపు నీ కన్నులెత్తి చూడుము; నీతో ఒకడు శయనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబిదేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారికొరకు త్రోవలలో కూర్చుండియున్నావు; నీ వ్యభిచారములచేతను నీ దుష్కార్యములచేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు.౹ కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి యున్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యమువంటి ధైర్యముగలదు, సిగ్గు పడనొల్లకున్నావు.౹ అయినను ఇప్పుడు నీవు–నా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవే యని నాకు మొఱ్ఱపెట్టుచుండవా? ఆయన నిత్యము కోపించునా? నిరంతరము కోపము చూపునా? అని నీవనుకొనినను నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుచునే యున్నావు. మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెను — ద్రోహినియగు ఇశ్రాయేలు చేయుకార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది.౹ ఆమె యీ క్రియలన్నిటిని చేసినను, ఆమెను నాయొద్దకు తిరిగి రమ్మని నేను సెలవియ్యగా ఆమె తిరిగిరాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా దాని చూచెను.౹ ద్రోహినియగు ఇశ్రాయేలు వ్యభిచారముచేసిన హేతువుచేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చు చున్నది.౹ రాళ్లతోను మొద్దులతోను వ్యభిచారము చేసెను; ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను.౹ ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా పైవేషమునకే గాని తన పూర్ణహృదయముతో నాయొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ కాగా విశ్వాసఘాతకురాలగు యూదాకంటె ద్రోహినియగు ఇశ్రాయేలు తాను నిర్దోషినియని ఋజువుపరచుకొని యున్నది.౹ నీవు వెళ్లి ఉత్తరదిక్కున ఈ మాటలు ప్రకటింపుము–ద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము; ఇదే యెహోవా వాక్కు. మీమీద నాకోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను; ఇదే యెహోవా వాక్కు.౹ –నీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటుచేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము; ఇదే యెహోవా వాక్కు.౹ భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.౹ నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు.౹ మీరు ఆ దేశములో అభివృద్ధిపొంది విస్తరించు దినములలో జనులు–యెహోవా నిబంధనమందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సులోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇకమీదట దాని చేయరాదు; ఇదే యెహోవా వాక్కు.౹ ఆ కాలమున–యెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు; జనములన్నియు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమునుబట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు.౹ ఆ దినములలో యూదావంశస్థులును ఇశ్రాయేలు వంశస్థులును కలిసి ఉత్తరదేశములోనుండి ప్రయాణమై, మీపితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు.౹ నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని, రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చెద ననుకొనియుంటిని. నీవు–నా తండ్రీ అని నాకు మొఱ్ఱపెట్టి నన్ను మానవనుకొంటిని గదా? అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి; ఇదే యెహోవా వాక్కు.౹ ఆలకించుడి, చెట్లులేని మెట్టలమీద ఒక స్వరము వినబడుచున్నది; ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచినదానినిబట్టి ఇశ్రాయేలీయులుచేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి.౹ భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి; మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను; నీవే మాదేవుడవైన యెహోవావు, నీయొద్దకే మేము వచ్చుచున్నాము,౹ నిశ్చయముగా కొండలమీద జరిగినది మోస కరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్‌ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవావలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును.౹ అయినను మా బాల్యమునుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొఱ్ఱెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మ్రింగివేయుచున్నది.౹ సిగ్గునొందినవారమై సాగిలపడుదము రండి, మనము కనబడకుండ అవమానము మనలను మరుగుచేయును గాక; మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులును మన బాల్యము నుండి నేటివరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినవారము. ఇదే యెహోవా వాక్కు–ఇశ్రాయేలూ, నీవు తిరిగి రానుద్దేశించినయెడల నా యొద్దకే రావలెను, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమునుబట్టియు న్యాయమునుబట్టియు నీతినిబట్టియు యెహోవా జీవముతోడని ప్రమాణముచేసినయెడల జనములు ఆయనయందు తమకు ఆశీర్వా దము కలుగుననుకొందురు, ఆయనయందే అతిశయపడుదురు. యూదావారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ముళ్లపొదలలో విత్తనములు చల్లక మీ బీడుపొలమును దున్నుడి.౹ అవిధేయులై యుండుట మానుకొని మీ దుష్టక్రియలనుబట్టి యెవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి.౹ యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగా–ప్రాకారముగల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి.౹ సీయోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి; పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి; యెహోవానగు నేను ఉత్తరదిక్కునుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను,౹ పొదలలోనుండి సింహము బయలుదేరియున్నది; జనముల వినాశ కుడు బయలుదేరియున్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచియున్నాడు, నీ పట్టణములు పాడై నిర్జనముగానుండును.౹ ఇందుకై గోనెపట్ట కట్టుకొనుడి; రోదనము చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మనమీదికి రాకుండ మానిపోలేదు;౹ ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున రాజును అధిపతులును ఉన్మత్తులగుదురు యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయ మొందుదురు.౹ అప్పుడు నేనిట్లంటిని — కటకటా, యెహోవా ప్రభువా, ఖడ్గము హత్యచేయుచుండగా నీవు–మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి.౹ ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఈలాగు చెప్పబడును–అరణ్యమందు చెట్లులేని మెట్టలమీదనుండి వడగాలి నా జనుల కుమార్తెతట్టు విసరుచున్నది; అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు.౹ అంతకంటె మిక్కుటమైన గాలి నామీద కొట్టుచున్నది. ఇప్పుడు వారిమీదికి రావలసిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు.౹ మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు, ఆయన రథములు సుడిగాలివలె నున్నవి, ఆయన గుఱ్ఱములు గద్దలకంటె వేగముగలవి, అయ్యో, మనము దోపుడు సొమ్మయితిమి.౹ యెరూష లేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనము కడిగివేసికొనుము, ఎన్నాళ్లవరకు నీ దుష్టాభి ప్రాయములు నీకు కలిగియుండును? దాను ప్రదేశమున నొకడు ప్రకటన చేయుచున్నాడు, కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండలయందొకడు చాటించుచున్నాడు,౹ ముట్టడివేయువారు దూరదేశమునుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమునుగూర్చి ప్రకటనచేయుడి, జనములకు తెలియజేయుడి.౹ ఆమె నామీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేనికాపరులవలె దానిచుట్టు ముట్టడివేతురు; ఇదే యెహోవా వాక్కు.౹ నీ ప్రవర్తనయు నీ క్రియలును వీటిని నీమీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగానున్నది గదా, నీ హృదయము నంటుచున్నది గదా? నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నా కెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఫెూష నీకు వినబడుచున్నది గదా? కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములును హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచు కొనబడియున్నవి.౹ నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచు చుండవలెను బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను? నా జనులు అవివేకులువారు నన్నెరుగరు, వారు మూఢు లైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియును గాని మేలుచేయుటకు వారికి బుద్ధి చాలదు. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను.౹ పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదులుచున్నవి.౹ నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షు లన్నియు ఎగిరిపోయియుండెను.౹ నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను.౹ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను.౹ దానినిబట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మియున్నది, అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని, నేను పశ్చాత్తాప పడుటలేదు రద్దుచేయుటలేదు.౹ రౌతులును విలు కాండ్రునుచేయు ధ్వని విని పట్టణస్థులందరు పారిపోవు చున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు, ప్రతి పట్టణము నిర్జనమాయెను వాటిలో నివాసులెవరును లేరు,౹ దోచుకొన బడినదానా, నీవేమి చేయుదువు? రక్త వర్ణవస్త్రములు కట్టుకొని సువర్ణభూషణములు ధరించి కాటుకచేత నీ కన్నులు పెద్దవిగా చేసి కొనుచున్నావే; నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే; నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు.౹ ప్రసవవేదనపడు స్త్రీ కేకలువేయునట్లు, తొలికానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలువేయునట్లు సీయోనుకుమార్తె–అయ్యో, నాకు శ్రమ, నరహంతకులపాలై నేను మూర్ఛిల్లుచున్నాను అని యెగరోజుచు చేతులార్చుచు కేకలువేయుట నాకు వినబడుచున్నది. యెరూషలేము వీధులలో ఇటు అటు పరుగెత్తుచు చూచి తెలిసికొనుడి; దాని రాజవీధులలో విచారణ చేయుడి; న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినయెడల నేను దాని క్షమించుదును.౹ యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు.౹ యెహోవా, యథార్థతమీదనే గదా నీవు దృిష్టి యుంచుచున్నావు? నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు; వారిని క్షీణింప జేసియున్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతికంటె తమ ముఖములను కఠినముగా చేసికొనియున్నారు, మళ్లుటకు సమ్మతింపరు.౹ నేనిట్లనుకొంటిని–వీరు ఎన్నికలేనివారై యుండి యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై యున్నారు.౹ ఘనులైనవారియొద్దకు పోయెదను వారితో మాటలాడెదను, వారు యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరిగినవారై యుందురుగదా అని నేననుకొంటిని. అయితే ఒకడును తప్పకుండ వారు కాడిని విరిచినవారుగాను కట్లను తెంపు కొనినవారుగాను ఉన్నారు.౹ వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచియుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.౹ నీ పిల్లలు నన్ను విడిచి దైవము కానివాటి తోడని ప్రమాణము చేయుదురు; నేను వారిని తృప్తిగ పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు; నేనెట్లు నిన్ను క్షమించుదును? బాగుగా బలిసిన గుఱ్ఱములవలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్యవెంబడి సకిలించును అట్టి కార్యములనుబట్టి నేను దండింపకుందునా? అట్టి జనముమీద నాకోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు. దాని ప్రాకారములెక్కి నాశనముచేయుడి, అయినను నిశ్శేషముగా నాశనముచేయకుడి, దాని శాఖలను కొట్టి వేయుడి. అవి యెహోవావి కావు.౹ ఇశ్రాయేలు వంశస్థులును యూదా వంశస్థులును బహుగా విశ్వాసఘాతకము చేసియున్నారు; ఇదే యెహోవా వాక్కు.౹ వారు— పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరవునైనను చూడ మనియు,౹ ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు.౹ కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.౹ ఇశ్రాయేలు కుటుంబమువారలారా, ఆలకించుడి, దూరముననుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను, అది బలమైన జనము పురాతనమైన జనము; దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకుమాటలు నీకు బోధపడవు.౹ వారి అమ్ముల పొది తెరచిన సమాధి, వారందరు బలాఢ్యులు,౹ వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు, నీ గొఱ్ఱెలను నీ పశువులను నాశనముచేయుదురు, నీ ద్రాక్షచెట్ల ఫలమును నీ అంజూరపుచెట్ల ఫలమును నాశనము చేయుదురు, నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములుగల పట్టణములను వారు కత్తిచేత పాడు చేయుదురు.౹ అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషములేకుండ నశింపజేయను; ఇదే యెహోవా వాక్కు.౹ –మన దేవుడైన యెహోవా దేనినిబట్టి ఇవన్నియు మాకు చేసెనని వారడుగగా నీవు వారితో ఈలాగనుము–మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచి నందుకు, మీదికాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి –కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకములేని మూఢులారా, ఈ మాట వినుడి.౹ సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.౹ ఈ జనులు తిరుగుబాటును ద్రోహమునుచేయు మనస్సుగల వారు, వారు తిరుగుబాటుచేయుచు తొలగి పోవుచున్నారు.౹ వారు–రండి మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించు వాడు గదా; నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు.౹ మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.౹ నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి యుండునట్లువారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.౹ పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్య వంతులును అగుదురు.౹ వారు క్రొవ్వి బలిసియున్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు, తండ్రిలేనివారు గెలువకుండునట్లు వారి వ్యాజ్యెమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యెమును తీర్పునకు రానియ్యరు.౹ అట్టి వాటిని చూచి నేను శిక్షింపక యుందునా? అట్టి జనులకు నేను ప్రతి దండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. ఘోరమైన భయంకరకార్యము దేశములో జరుగుచున్నది.౹ ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు? బెన్యామీనీయులారా, యెరూషలేములోనుండి పారిపోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి, కీడు ఉత్తర దిక్కునుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది.౹ సుందరియు సుకుమారియునైన సీయోను కుమార్తెను పెల్ల గించుచున్నాను.౹ గొఱ్ఱెల కాపరులు తమ మందలతో ఆమెయొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టు తమ గుడారములను వేయుదురు, ప్రతివాడును తన కిష్టమైనచోట మందను మేపును.౹ ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి; లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ, ప్రొద్దు గ్రుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి.౹ లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము.౹ సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడిదిబ్బ కట్టుడి, ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడచునది గనుక శిక్ష నొందవలసి వచ్చెను.౹ ఊట తన జలమును పైకి ఉబుక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబుకచేయుచున్నది, బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది, గాయములును దెబ్బలును నిత్యము నాకు కనబడుచున్నవి.౹ యెరూషలేమా, నేను నీయొద్దనుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ద్రాక్షచెట్టు ఫలమును ఏరుకొనునట్లు మనుష్యులు ఏమియు మిగులకుండ ఇశ్రాయేలు శేషమును ఏరుదురు; ద్రాక్షపండ్లను ఏరువాడు చిన్న తీగెలను ఏరుటకై తన చెయ్యి మరల వేయునట్లు నీ చెయ్యివేయుము.౹ విందురని నేనెవరితో మాటలాడెదను? ఎవరికి సాక్ష్య మిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు.౹ కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణచుకొని అణచుకొని నేను విసికియున్నాను, ఒకడు తప్పకుండ వీధిలోనున్న పసిపిల్లలమీదను యౌవనుల గుంపుమీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను, భార్యా భర్తలును వయస్సుమీరినవారును వృద్ధులును పట్టుకొనబడెదరు.౹ ఏమియు మిగులకుండ వారి యిండ్లును వారి పొలములును వారి భార్యలును ఇతరులకు అప్పగింపబడుదురు, ఈ దేశనివాసులమీద నేను నా చెయ్యి చాపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు –అల్పులేమి ఘనులేమి వారందరు మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు.౹ సమాధానములేని సమయమున–సమాధానము సమాధానమని చెప్పుచు, నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు.౹ వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడి పోవువారితో వారు పడిపోవుదురు, నేను వారిని విమ ర్శించు కాలమునవారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు–మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు.౹ మిమ్మును కాపుకాయుటకు నేను కావలివారిని ఉంచియున్నాను; ఆలకించుడి, వారుచేయు బూరధ్వని వినబడుచున్నది.౹ అయితే మేము వినమని వారనుచున్నారు; అన్యజనులారా, వినుడి; సంఘమా, వారికి జరిగిన దానిని తెలిసికొనుము.౹ భూలోకమా, వినుము; ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను.౹ షేబనుండి వచ్చు సాంబ్రాణి నాకేల? దూరదేశమునుండి వచ్చు మధురమైన చెరుకు నాకేల? మీ దహనబలులు నాకిష్టమైనవి కావు, మీ బలులయందు నాకు సంతోషము లేదు.౹ కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్లు వేయుదును; తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు; ఇరుగుపొరుగువారును నశించెదరు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఉత్తర దేశమునుండి యొక జనము వచ్చుచున్నది, భూదిగంతములలోనుండి మహా జనము లేచి వచ్చుచున్నది.౹ వారు వింటిని ఈటెను వాడనేర్చినవారు, అది యొక క్రూర జనము; వారు జాలిలేనివారు, వారి స్వరము సముద్ర ఘోషవలె నున్నది, వారు గుఱ్ఱములెక్కి సవారిచేయు వారు; సీయోను కుమారీ, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధులవలె వ్యూహము తీరియున్నారు.౹ దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి, ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము.౹ పొలములోనికి పోకుము, మార్గములో నడువకుము, శత్రువులు కత్తిని ఝుళిపించుచున్నారు, నలు దిక్కుల భయము తగులుచున్నది.౹ నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మామీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిదె చల్లుకొనుము; ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము.౹ నీవు నా జనుల మార్గమును తెలిసి కొని పరీక్షించునట్లు నిన్ను వారికి వన్నెచూచువానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించియున్నాను.౹ వారందరు బహు ద్రోహులు, కొండె గాండ్రు, వారు మట్టిలోహము వంటివారు, వారందరు చెరుపువారు.౹ కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది; వ్యర్థము గానే చొక్కముచేయుచు వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు.౹ యెహోవావారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండియని వారికి పేరు పెట్టబడును. యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు –నీవు యెహోవామందిర ద్వారమున నిలువ బడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము–యెహోవాకు నమస్కారముచేయుటకై యీ ద్వారములలోబడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి.౹ సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి –ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే; యీ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి.౹ ఆలాగనక, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని, ప్రతివాడు తన పొరుగువానియెడల తప్పక న్యాయము జరిగించి.౹ పరదేశులను తండ్రిలేనివారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీపితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును.౹ ఇదిగో అబద్ధపుమాటలను మీరు నమ్ముకొనుచున్నారు. అవి మీకు నిష్‌ప్రయోజనములు.౹ ఇదేమి? మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధసాక్ష్యము పలుకుచు బయలునకు ధూపమువేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే; అయినను నా నామము పెట్టబడిన యీ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదలనొందియున్నామని మీరు చెప్పుదురు; ఈ హేయక్రియలన్నియు జరిగించుటకేనా మీరు విడుదలనొందితిరి? నాదని చాటబడిన యీ మందిరము మీ దృష్టికి దొంగలగుహ యైనదా? ఆలోచించుడి, నేనే యీ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.౹ పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమునుబట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి; ఇదే యెహోవా వాక్కు.౹ నేను మీతో మాటలాడినను పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండినవారై యీ క్రియలన్నిటిని చేసితిరి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామముపెట్టబడిన యీ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును.౹ ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరిని నేను వెళ్లగొట్టినట్లు మిమ్మును నా సన్నిధినుండి వెళ్లగొట్టుదును.౹ కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థనచేయకుము, వారికొరకు మొఱ్ఱనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలుకొనకుము, నేను నీ మాట వినను. యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా.౹ నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్యదేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు.౹ –నాకే కోపము పుట్టించునంతగా వారు దాని చేయుచున్నారా? తమకే అవమానము కలుగు నంతగా చేయుచున్నారు గదా, యిదే యెహోవా వాక్కు.౹ అందువలన ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ స్థలముమీదను నరులమీదను జంతువులమీదను పొలముల చెట్లమీదను భూమిపంట మీదను నాకోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్పశక్యము కాకుండ అది మండును. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీ దహనబలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి.౹ నేను ఐగుప్తు దేశములోనుండి మీపితరులను రప్పించిన దినమున దహనబలులనుగూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చితిని ఏదనగా–నా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులైయుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.౹ అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలనుబట్టి తమ దుష్ట హృదయకాఠిన్యము ననుసరించి నడుచుచు వచ్చిరి.౹ మీపితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.౹ వారు నా మాట వినకయున్నారు చెవియొగ్గకయున్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు; వారు తమపితరులకంటె మరి దుష్టులైరి. నీవు ఈ మాటలన్నియు వారితో చెప్పినను వారు నీ మాటలంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకుత్తర మియ్యరు గనుక నీవు వారితో ఈలాగు చెప్పుము–వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనొల్లనివారు, కాబట్టి నమ్మకము వారిలోనుండి తొలగిపోయియున్నది, అది వారి నోట నుండకుండ కొట్టి వేయబడియున్నది. తనకు కోపము తెప్పించు తరమువారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు; సీయోనూ నీ తలవెండ్రు కలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లులేని మెట్టలమీద ప్రలాపవాక్య మెత్తుము.౹ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–యూదావారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు, నా నామముపెట్టబడిన మందిరము అపవిత్రపడునట్లువారు దానిలో హేయ వస్తువులను ఉంచియున్నారు.౹ నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్‍హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.౹ కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్‌హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టు టకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతిపెట్టబడును; ఇదే యెహోవా వాక్కు.౹ ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహార మగును, వాటిని తోలివేయువాడు లేకపోవును.౹ ఉల్లాస ధ్వనియు ఆనందధ్వనియు పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోనులేకుండచేసెదను; ఈ దేశము తప్పక పాడైపోవును. యెహోవా వాక్కు — ఆ కాలమున శత్రువులు యూదారాజుల యెముకలను అధిపతుల యెముకలను యాజకుల యెముకలను ప్రవక్తల యెముకలను యెరూషలేము నివాసుల యెముకలను సమాధులలోనుండి వెలుపలికి తీసి వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంటవలె పడియుండును.౹ అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న యీ చెడ్డ వంశములో శేషించిన వారందరు జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము–మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగిరారా? యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్ర యము చేసికొని తిరిగి రామని యేల చెప్పుచున్నారు? నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికిమాలిన మాటలు వారాడుకొనుచున్నారు–నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమునుగూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేక పోయెను? యుద్ధమునకు చొరబడు గుఱ్ఱమువలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు.౹ ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తిపిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.౹ –మేము జ్ఞానులమనియు, యెహోవా ధర్మశాస్త్రము మాయొద్దనున్నదనియు మీరేల అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది.౹ జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయమొంది చిక్కున పడియున్నారు, వారు యెహోవా వాక్యమును నిరాక రించినవారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు? గనుక వారి భార్యలను అన్యుల కప్పగింతును, వారిని జయించువారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి ఘనులేమి అందరును మోసముచేసి దోచుకొనువారు; ప్రవక్తలేమి యాజకులేమి అందరును వంచకులు.౹ సమాధానము లేని సమయమున–సమాధానము సమాధానము అని వారు చెప్పుచు, నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు.౹ తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెనుగాని వారేమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవువారిలో వారు పడిపోవుదురు; నేను వారిని విమర్శించుకాలమునవారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు ద్రాక్షచెట్టున ఫలములులేకుండునట్లును, అంజూరపుచెట్టున అంజూరపు పండ్లులేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను; వారిమీదికి వచ్చు వారిని నేనాలాగున పంపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.౹ మనమేల కూర్చుండియున్నాము? మనము పోగు బడి ప్రాకారములుగల పట్టణములలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి; యెహోవాయే మనలను నాశనముచేయుచున్నాడు, ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు.౹ మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదాయెను; క్షేమముకొరకు కనిపెట్టుచున్నాముగాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు.౹ దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను, వారి గుఱ్ఱముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది, వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనముచేయుదురు, పట్టణమును అందులో నివసించువారిని నాశనము చేయుదురు.౹ నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సీయో నులో లేకపోయెనా? ఆమె రాజు ఆమెలో లేకపోయెనా? అని బహు దూరదేశమునుండి నా ప్రజల రోదనశబ్దము వినబడుచున్నది; వారి విగ్రహములచేతను అన్యమైన మాయా రూపములచేతను నాకేల కోపము తెప్పించిరి? –కోత కాలము గతించియున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణనొందకయే యున్నాము అని చెప్పుదురు.౹ నా జనుల వేదననుబట్టి నేను వేదనపడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోరభయము నన్ను పెట్టియున్నది.౹ గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యు డును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవు చున్నది? నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.౹ నా జనులందరు వ్యభిచారులును ద్రోహుల సమూహమునై యున్నారు. అహహా, అరణ్యములో బాటసారులబస నాకు దొరికిన ఎంత మేలు? నేను నా జనులను విడిచి వారియొద్దనుండి తొలగిపోవుదును.౹ విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉప యోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడుచేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.౹ మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.౹ సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధము లాడుట తమ నాలుకలకు అభ్యాసముచేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.౹ నీ నివాసస్థలము కాపట్యము మధ్యనే యున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు. కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలకింపుము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరగించుచున్నాను, నా జనులనుబట్టి నేను మరేమి చేయుదును? వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును.౹ నేను ఈ సంగతులను తెలిసికొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతి దండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును; అరణ్యములోని మేతస్థలములనుబట్టి విలా పము చేయుదును; అవి పాడాయెను. సంచారము చేయువాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశపక్షులును జంతువులును పారిపోయి యున్నవి, అవి తొలగిపోయి యున్నవి.౹ యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను, యూదాపట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను.౹ ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని యెవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను?ఎవడును సంచరింపకుండ ఆ దేశము ఎడారివలె ఏల కాలిపోయి పాడాయెను? అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు— వారు నా మాట వినకయు దాని ననుసరింపకయు, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయమూర్ఖతచొప్పున జరిగించుటకై తమపితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను.౹ సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును.౹ తామైనను తమపితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టు దును, వారిని నిర్మూలముచేయువరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలోచింపుడి, రోదనముచేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.౹ మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పలనుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను.౹ మనము వలసబోతిమే సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసివచ్చెనే అని సీయోనులో రోదనధ్వని వినబడు చున్నది.౹ స్త్రీలారా, యెహోవా మాట వినుడి–మీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.౹ వీధులలో పసిపిల్లలులేకుండను, రాజ మార్గములలో యౌవనులులేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.౹ యెహోవా వాక్కు ఇదే–నీవీమాట చెప్పుము–చేలమీద పెంటపడునట్లు పంట కోయు వాని వెనుక పిడికిళ్లు పడునట్లు ఎవడును సమకూర్చకుండ మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపోవును. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.౹ అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ అన్యజనులందరును సున్నతిపొందనివారు గనుక, ఇశ్రాయేలీయులందరు హృదయ సంబంధమైన సున్నతినొందినవారుకారు గనుక, రాబోవుదినములలో సున్నతిపొందియు సున్నతిలేని వారివలెనుండు ఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మునుగూర్చి సెలవిచ్చిన మాట వినుడి.౹ యెహోవా సెలవిచ్చు చున్నదేమనగా–అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి.౹ జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని.౹ వెండి బంగారములచేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక యుండునట్లు మేకులుపెట్టి సుత్తెలతో బిగగొట్టి దాని నిలుపుదురు.౹ అవి తాటిచెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడువనేరవు గనుక వాటిని మోయవలసివచ్చెను; వాటికి భయపడకుడి అవి హానిచేయనేరవు మేలుచేయుట వాటివలనకాదు.౹ యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహా త్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘనమైనదాయెను.౹ జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీవంటివాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము.౹ జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు; బొమ్మల పూజవలన వచ్చు జ్ఞానము వ్యర్థము.౹ తర్షీషునుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాజునుండి బంగారమును తెత్తురు, అది పని వాని పనియేగదా; పోతపోయువాడు దాని చేసెను, నీల ధూమ్రవర్ణములుగల వస్త్రములు వాటికున్నవి, అవన్నియు నేర్పరులగు పనివారి పనియే.౹ యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఈలాగు చెప్పవలెను–ఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండకుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును. ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.౹ ఆయన ఆజ్ఞ నియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనా గారములలోనుండి గాలిని రావించును.౹ తెలివిలేని ప్రతిమనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమునుబట్టి అవమానము నొందు చున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు.౹ అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు, విమర్శకాలములో అవి నశించి పోవును.౹ యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్యములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు. నివాసినీ, ముట్టడివేయబడుచున్న దేశము విడిచి వెళ్లుటకై నీ సామగ్రిని కూర్చుకొనుము.౹ యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసరివేయుచున్నాను, వారు పట్టబడవలెనని వారిని ముట్టడి వేయించుచున్నాను.౹ కటకటా, నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే —ఈ దెబ్బ నాకు తగినదే యనుకొని నేను దాని సహించుదును.౹ నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్లన్నియు తెగిపోయెను, నా పిల్లలు నాయొద్దనుండి తొలగిపోయి యున్నారు, వారు లేకపోయిరి, ఇకమీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడును లేడు.౹ కాపరులు పశుప్రాయులై యెహోవాయొద్ద విచారణచేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు, వారి మందలన్నియు చెదరిపోవుచున్నవి.౹ ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది, యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును, నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తరదేశమునుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది.౹ యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.౹ యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమునుబట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపుము.౹ నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థిం పని వంశములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము; వారు యాకోబును మ్రింగివేయుచున్నారు, నిర్మూలము చేయవలెనని వారు అతని మ్రింగివేయుచున్నారు, వాని నివాసమును పాడుచేయుచున్నారు. యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు –మీరు ఈ నిబంధనవాక్యములను వినుడి; యూదా మనుష్యులతోను యెరూషలేము నివాసులతోను నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను –ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా–ఈ నిబంధన వాక్యములను విననొల్లనివాడు శాపగ్రస్తుడగును.౹ ఐగుప్తుదేశములోనుండి, ఆ యినుప కొలిమిలోనుండి నేను మీపితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని–నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీపితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు, మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటినిబట్టి యీ నిబంధన వాక్యముల ననుసరించినయెడల మీరు నాకు జనులైయుందురు నేను మీకు దేవుడనైయుందును.౹ అందుకు–యెహోవా, ఆప్రకారము జరుగును గాకని నేనంటిని. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా — నీవు యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటిని ప్రకటింపుము — మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిననుసరించి నడుచుకొనుడి.౹ ఐగుప్తులోనుండి మీపితరులను రప్పించిన దినము మొదలుకొని నేటివరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచు వచ్చితిని; నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచు వచ్చితిని అయినను వారు తమ దుష్టహృదయములో పుట్టు మూర్ఖతచొప్పున నడుచుచు వినకపోయిరి; చెవి యొగ్గినవారు కాకపోయిరి, వారు అనుసరింపవలెనని నేను వారికాజ్ఞాపించిన యీ నిబంధన మాటలన్నిటి ననుసరించి నడువలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటిని వారిమీదికి రప్పించుచున్నాను. మరియు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను— యూదావారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది.౹ ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమపితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు; మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు, వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులును యూదావంశస్థులును భంగము చేసియున్నారు.౹ కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు — తాము తప్పించుకొనజాలని కీడు వారిమీదికి రప్పింపబోవుచున్నాను, వారు నాకు మొఱ్ఱపెట్టినను నేను వారి మొఱ్ఱను వినకుందును.౹ యూదాపట్టణస్థులును యెరూషలేము నివాసులును పోయి తాము ధూపార్పణముచేయు దేవతలకు మొఱ్ఱపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు.౹ యూదా, నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా? యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దానిపేరట బలిపీఠములను స్థాపించితిరి.౹ కావున నీవు ఈ ప్రజలనిమిత్తము ప్రార్థనచేయకుము; వారి నిమిత్తము మొఱ్ఱపెట్టకుము ప్రార్థనచేయకుము, వారు తమ కీడును బట్టి నాకు మొఱ్ఱపెట్టునప్పుడు నేను వినను. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్లచేతను ప్రతిష్ఠిత మాంసము తినుటచేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టు కొందువా? ఆలాగైతే నీవు ఉత్సహించుదువు.౹ అది చక్కని ఫలముగల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను; గొప్ప తుపాను ధ్వనితో దానిమీద మంటపెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి.౹ ఇశ్రాయేలు వంశస్థులును యూదా వంశస్థులును బయలునకు ధూపార్పణముచేసి నాకు కోపము పుట్టించుటచేత తమం తట తామే చేసిన చెడుతనమునుబట్టి మిమ్మును నాటిన సైన్యములకధిపతియగు యెహోవా మీకు కీడుచేయ నిర్ణయించుకొని యున్నాడు. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని; ఆయన వారి క్రియలను నాకు కనుపరచెను.౹ అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱెపిల్లవలె ఉంటిని; మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని.౹ నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించు వాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవుచేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము.౹ కావున —నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారినిగూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు –సైన్యములకధిపతియగు యెహోవావారినిగూర్చి సెలవిచ్చునదేమనగా — నేను వారిని శిక్షింపబోవుచున్నాను, వారి యౌవనులు ఖడ్గముచేత చంపబడెదరు, వారి కుమారులును కుమార్తెలును క్షామమువలన చచ్చెదరు;౹ వారికి శేషమేమియు లేకపోవును, నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారిమీదికి రప్పింతును. యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల? నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలముల నిచ్చుచున్నారు; వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు.౹ యెహోవా, నీవు నన్నెరిగియున్నావు; నన్ను చూచుచున్నావు; నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు; వధకు ఏర్పడిన గొఱ్ఱెలనువలె వారిని హతముచేయుము, వధదినమునకు వారిని ప్రతిష్ఠించుము.౹ భూమి యెన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారి చెడుతనమువలన జంతువులును పక్షులును సమసిపోవుచున్నవి.౹ –నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా? నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావుగదా? యొర్దాను ప్రవాహముగా వచ్చునప్పుడు నీవేమి చేయుదువు? నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు; నీ వెంబడి గేలిచేయుదురు, వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు. నా మందిరమును నేను విడిచియున్నాను, నా స్వాస్థ్యమును విసర్జించియున్నాను; నా ప్రాణప్రియురాలిని ఆమె శత్రువులచేతికి అప్పగించియున్నాను.౹ నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహమువంటిదాయెను; ఆమె నామీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని.౹ నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయెనా? క్రూరపక్షులు దానిచుట్టు కూడుచున్నవా? రండి అడవిజంతువులన్నిటిని పోగు చేయుడి; మ్రింగివేయుటకై అవి రావలెను.౹ కాపరులనేకులు నా ద్రాక్షతోటలను చెరిపివేసియున్నారు, నా సొత్తును త్రొక్కివేసియున్నారు; నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసియున్నారు.౹ వారు దాని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది; దానిగూర్చి చింతించువాడొకడును లేడు గనుక దేశమంతయు పాడాయెను.౹ పాడుచేయువారు అరణ్య మందలి చెట్లులేని మెట్టలన్నిటిమీదికి వచ్చుచున్నారు; దేశముయొక్క యీ కొననుండి ఆ కొనవరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది; శరీరులకు క్షేమ మేమియు లేదు.౹ జనులు గోధుమలు చల్లి ముండ్లపంట కోయుదురు; వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను; యెహోవా కోపాగ్నివలన కోతకు పంటలేక మీరు సిగ్గుపడుదురు. నేను నాజనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరచిన స్వాస్థ్యము నాక్రమించుకొను దుష్టులగు నా పొరుగు వారినిగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —నేను వారి దేశములోనుండి వారిని పెల్లగింతును; మరియు వారి మధ్యనుండి యూదావారిని పెల్లగింతును.౹ వారిని పెల్లగించిన తరువాత నేను మరల వారియెడల జాలిపడుదును; ఒక్కొకని తన స్వాస్థ్యమునకును ఒక్కొకని తన దేశమునకును వారిని రప్పింతును.౹ బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవముతోడని నా నామమునుబట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజలమార్గములను జాగ్రత్తగా నేర్చుకొనినయెడల వారు నా ప్రజలమధ్య వర్ధిల్లుదురు.౹ అయితే వారు నా మాట విననొల్లని యెడల నేను ఆ జనమును వేరుతో పెల్లగించి బొత్తిగా నాశనము చేతును; ఇదే యెహోవా వాక్కు. యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను–నీవు వెళ్లి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్లలో దాని వేయకుము.౹ కావున యెహోవా మాటచొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని.౹ రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై –నీవు కొని నడుమున కట్టుకొనిన నడి కట్టును తీసికొని, లేచి యూఫ్రటీసునొద్దకు పోయి అక్కడ నున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా యెహోవా నాకాజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసునొద్ద దాని దాచిపెట్టితిని.౹ అనేక దినములైన తరువాత యెహోవా— నీవు లేచి యూఫ్రటీసునొద్దకు పోయి, నేను అక్కడ దాచి పెట్టుమని నీకాజ్ఞాపించిన నడికట్టును అక్కడనుండి తీసికొనుమని నాతో చెప్పగా నేను యూఫ్రటీసునొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచి పెట్టినచోటనుండి దాని తీసికొంటిని; నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి యుండెను; అది దేనికిని పనికిరానిదాయెను.౹ కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు —ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును.౹ అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిననుసరించుచు, నా మాటలు విన నొల్లక తమ హృదయకాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని యీ నడికట్టువలె అగుదురు.౹ నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల నందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి యున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడును. —ప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనినయెడల నీవు వారితో ఈ మాట చెప్పుము —యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ దేశనివాసుల నందరిని, దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులనందరిని నేను మత్తులుగా చేయబోవుచున్నాను.౹ అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరిని ఏకముగా ఒకనిమీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు; వారిని కరుణింపను శిక్షింపక పోను; వారియెడల జాలిపడక నేను వారిని నశింప జేసెదను. చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి.౹ ఆయన చీకటి కమ్మజేయకమునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకమునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.౹ అయినను మీరు ఆ మాట విననొల్లని యెడల మీ గర్వమునుబట్టి నేను చాటున ఏడ్చుదును; యెహోవామంద చెరపట్టబడి నందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును.౹ రాజును తల్లియైన రాణిని చూచి ఇట్లనుము–మీ శిరోభూషణములును తలమీదనున్న మీ సుందరకిరీటమును పడిపోయెను; క్రుంగి కూర్చుండుడి.౹ దక్షిణదేశ పట్టణములు మూయబడియున్నవి; వాటిని తెరువగలవాడెవడును లేడు; యూదావారందరు చెరపట్ట బడిరి; ఏమియులేకుండ సమస్తము కొనిపోబడెను. కన్నులెత్తి ఉత్తరమునుండి వచ్చుచున్నవారిని చూడుడి; నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడ నున్నది? నీవు నీకు స్నేహితులుగా చేసికొనినవారిని ఆయన నీమీద అధిపతులుగా నియమించునప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నిన్ను పట్టును గదా? నీవు–ఇవి నా కేల సంభవించెనని నీ మనస్సులో అనుకొనినయెడల నీవు చేసిన విస్తారమైన దోషములనుబట్టి నీ బట్టచెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గు నొందెను.౹ కూషుదేశస్ధుడు తన చర్మమును మార్చు కొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును.౹ కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను.౹ నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నాచేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను.౹ నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేనెరుగుదును; పొలములలో నున్న మెట్టలమీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి; యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచుకొననొల్లవు; ఇక నెంత కాలము ఈలాగు జరుగును? కరవుకాలమున జరిగినదానిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.౹ –యూదా దుఃఖించు చున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేముచేయు అంగలార్పు పైకెక్కుచున్నది.౹ వారిలో ప్రధానులు బీద వారిని నీళ్లకు పంపుచున్నారు, వారు చెరువులయొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు, వట్టికుండలు తీసికొని వారు మరల వచ్చుచున్నారు, సిగ్గును అవమానము నొందినవారై తమ తలలు కప్పుకొనుచున్నారు.౹ దేశములో వర్షము కురువక పోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు.౹ లేళ్లు పొలములో ఈని గడ్డిలేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి.౹ అడవి గాడిదలును చెట్లులేని మెట్టలమీద నిలువబడి నక్కలవలె గాలి పీల్చుచున్నవి, మేత ఏమియు లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపముచేసితిమి; మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి; నీ నామమునుబట్టి నీవే కార్యము జరిగించుము.౹ ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీ వేల పరదేశివలెనున్నావు? ఏల రాత్రివేళను బసచేయుటకు గుడారమువేయు ప్రయాణస్థునివలె ఉన్నావు;౹ భ్రమసియున్నవానివలెను రక్షింపలేని శూరునివలెను నీవేల ఉన్నావు? యెహోవా, నీవు మామధ్య నున్నావే; మేము నీ పేరుపెట్టబడినవారము; మమ్మును చెయ్యి విడువకుము. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఈ జనులు తమ కాళ్లకు అడ్డములేకుండ తిరుగులాడుటకు ఇచ్ఛగలవారు గనుక యెహోవావారిని అంగీకరింపడు; ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసికొనును; వారి పాపములనుబట్టి వారిని శిక్షిం చును.౹ మరియు యెహోవా నాతో ఇట్లనెను–వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయ కుము.౹ వారు ఉపవాసమున్నప్పుడు నేను వారి మొఱ్ఱను వినను; వారు దహనబలియైనను నైవేద్యమైనను అర్పించు నప్పుడు నేను వాటిని అంగీకరింపను; ఖడ్గమువలనను క్షామమువలనను తెగులువలనను వారిని నాశము చేసెదను అందుకు నేను–అయ్యో, ప్రభువైన యెహోవా–మీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకిచ్చెదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారవి నేననగా యెహోవా నాతో ఇట్లనెను–ప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.౹ కావున నేను వారిని పంపకపోయినను, నా నామమునుబట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధప్రవచనములు ప్రకటించు ప్రవక్తలనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆ ప్రవక్తలు ఖడ్గమువలనను క్షామమువలనను లయమగుదురు.౹ వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయ బడెదరు; నేను వారి చెడుతనమును వారిమీదికి రప్పించెదను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతిపెట్టువాడెవడును లేక పోవును.౹ నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా–నా జనుల కన్యక గొప్ప ఉపద్రవమువలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందియున్నది; దివారాత్రము మానక నా కన్నులనుండి కన్నీరు కారుచున్నది.౹ పొలములోనికి నేను పోగా ఖడ్గముచేత హతులైనవారు కనబడుదురు, పట్టణములో ప్రవేశింపగా క్షామపీడితులు అచ్చట నుందురు; ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశమునకు పోవలెనని ప్రయాణమైయున్నారు. నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సీయోను నీకు అసహ్యమాయెనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేల మమ్మును కొట్టితివి? మేము సమాధానముకొరకు కని పెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు; చికిత్స కలుగు కాలముకొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది.౹ యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము; నీకు విరో ధముగా పాపము చేసియున్నాము.౹ నీ నామమునుబట్టి మమ్మును త్రోసివేయకుము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనుము, దాని భ్రష్టపరచకుమీ.౹ జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా? మా దేవుడవైన యెహోవా, నీవేగదా దాని చేయుచున్నావు? నీవే యీ క్రియలన్నియు చేయుచున్నావు; నీకొరకే మేముకనిపెట్టుచున్నాము. అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను— మోషేయు సమూయేలును నాయెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నా సన్నిధి నుండకుండ వారిని వెళ్లగొట్టుము.౹ మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగినయెడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–చావునకు నియమింపబడినవారు చావునకును, ఖడ్గమునకు నియమింప బడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడినవారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెరకును పోవలెను.౹ యెహోవా వాక్కు ఇదే–చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను.౹ యూదారాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలనుబట్టి భూమిమీదనున్న సకలరాజ్యములలోనికి యిటు అటు చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను.౹ యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీయందు జాలిపడువాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవవిడిచి నీయొద్దకు వచ్చును? యెహోవా వాక్కు ఇదే–నీవు నన్ను విసర్జించియున్నావు వెనుకతీసియున్నావు గనుక నిన్ను నశింప జేయునట్లు నేను నీ మీదికి నాచేతిని చాచియున్నాను; సంతాపపడి పడి నేను విసికియున్నాను.౹ దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పారపట్టుచున్నాను, నా జనులు తమ మార్గములను విడిచి నాయొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయు చున్నాను.౹ వారి విధవరాండ్రు సముద్రపు ఇసుకకంటె విస్తారముగా ఉందురు; మధ్యాహ్నకాలమున యౌవనుల తల్లిమీదికి దోచుకొనువారిని నేను రప్పింతును; పరితాపమును భయములను ఆకస్మాత్తుగా వారిమీదికి రాజేతును.౹ ఏడుగురిని కనిన స్త్రీ క్షీణించుచున్నది; ఆమె ప్రాణము విడిచియున్నది; పగటివేళనే ఆమెకు ప్రొద్దు గ్రుంకి యున్నది. ఆమె సిగ్గుపడి అవమానము నొందియున్నది; వారిలో శేషించిన వారిని తమ శత్రువులయెదుట కత్తి పాలు చేసెదను; ఇదే యెహోవా వాక్కు. అయ్యో నాకు శ్రమ; నా తల్లీ, జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేల నన్ను కంటివి? వడ్డికి నేను బదులియ్యలేదు, వారు నాకు బదు లిచ్చినవారు కారు అయినను వారందరు నన్ను శపించుచున్నారు.౹ అందుకు యెహోవా–నిశ్చయముగా నీకు మేలుచేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను. ఇనుమునైనను ఉత్తరమునుండి వచ్చు యినుమునైనను కంచునైనను ఎవడైన విరువగలడా? నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరుచేయు సమస్త పాపములనుబట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయములేకుండ నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను.౹ నీవెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును, నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును. యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది; నన్ను జ్ఞాపకము చేసికొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించువారికి నాకొరకై ప్రతి దండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగినవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలిసికొనుము.౹ నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యములకధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.౹ సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి యున్నావు గనుక, నీ హస్తమునుబట్టి నేను ఏకాకినై కూర్చుంటిని.౹ నా బాధ యేల యెడతెగనిదాయెను? నా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థత నొందకపోనేల? నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా? నిలువని జలములవవుదువా? కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను–నీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపెట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారితట్టునకు తిరుగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించెదను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ దుష్టుల చేతిలోనుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలోనుండి నిన్ను విమో చించెదను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –ఈస్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొనకూడదు.౹ ఈ స్థలమందు పుట్టు కుమారులనుగూర్చియు, కుమార్తెలనుగూర్చియు, వారిని కనిన తల్లులనుగూర్చియు, ఈ దేశములో వారిని కనిన తండ్రులనుగూర్చియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంటవలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును.౹ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనియ్యకయు వారియెడల నా కృపావాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనముచేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారినిగూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్లకుము; ఇదే యెహోవా వాక్కు.౹ ఘనులేమి అల్పులేమి యీ దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు, వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసికొనకుందురు, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసికొనకుందురు.౹ చచ్చినవారినిగూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు; ఒకని తండ్రియైనను తల్లియైనను చనిపోయెనని యెవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనియ్యకుందురు.౹ వారియొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందు శాలలో ప్రవేశింపకూడదు.౹ సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండ మాన్పించెదను.౹ నీవు ఈ మాటలన్నియు ఈ ప్రజలకు తెలియ జెప్పిన తరువాత వారు–దేనిబట్టి యెహోవా మాకు ఈ ఘోరబాధ అంతయు నియమించెను? మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి? మాపాప మేమి? అని నిన్నడుగగా నీవు వారితో ఇట్లనుము— యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–మీపితరులు నన్ను విడిచి అన్యదేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటనుబట్టియే గదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి.౹ ఆలకించుడి; మీరందరు నా మాట వినకుండ కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు; మీరు మీపితరులకంటె విస్తారముగా చెడుతనము చేసియున్నారు.౹ కాబట్టి నేను మీయందు ఏమాత్రమును దయయుంచక, యీ దేశమునుండి మీరైనను మీపితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్లగొట్టుచున్నాను; అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు. [14-15] యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా–నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించెదను గనుక రాబోవు దినములలో–ఐగుప్తు దేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని ఇకమీదట అనక–ఉత్తరదేశములోనుండియు ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలోనుండియు ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు.౹ *** ఇదే యెహోవా వాక్కు— వారిని పట్టుకొనుటకు నేను చాలమంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతముమీదనుండియు ప్రతి కొండమీద నుండియు మెట్టల సందులలోనుండియు వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను.౹ ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగైయుండదు.౹ వారు తమ హేయదేవతల కళేబరములచేత నా దేశమును అపవిత్రపరచియున్నారు, తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమునుబట్టియు వారి పాపమునుబట్టియు రెండంతలుగా వారికి ప్రతికారము చేసెదను.౹ యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చి— మా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్‌ప్రయోజనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు.౹ నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు.౹ కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలిసికొనునట్లు నేను ఈ సారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. వారి కుమారులు తాముకట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టుక్రిందనున్న దేవతాస్తంభములను జ్ఞాపకము చేసికొనుచుండగా యూదా పాపము ఇనుపగంట ముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయములనెడి పలకలమీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ములమీదను చెక్కబడియున్నది.౹ పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవుచేయు నీ పాపమునుబట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటిని నీ బలిపీఠములను దోపుడుసొమ్ముగా నేనప్పగించుచున్నాను.౹ మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక, నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడ వగుదువు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. —నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు.౹ వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.౹ యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.౹ వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.౹ హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.౹ న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించు కొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలె నున్నాడు; సగము ప్రాయములో వాడు దానిని విడువ వలసి వచ్చును; అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించి వారందరు సిగ్గునొందుదురు. నాయెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుకమీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు.౹ యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడు దును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతు డవు.౹ వారు–యెహోవా వాక్కు ఎక్కడనున్నది? దాని రానిమ్మని యనుచున్నారు.౹ నేను నిన్ను అనుసరించు కాపరినైయుండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు, నీకే తెలిసియున్నది. నా నోటినుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది.౹ ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము.౹ నన్ను సిగ్గుపడనియ్యక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులుపడనియ్యక వారిని దిగులు పడనిమ్ము, వారిమీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయుము. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు–నీవు వెళ్లి యూదారాజులు వచ్చుచు పోవుచునుండు జనుల గుమ్మము నను యెరూషలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీని ప్రకటన చేయుము –యూదారాజులారా, యూదావారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైనవారలారా, యెహోవా మాట వినుడి.౹ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —మీ విషయములో జాగ్రత్తపడుడి, విశ్రాంతిదినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండ ఏ బరువును తీసికొని రాకుడి.౹ విశ్రాంతిదినమున మీ యిండ్లలోనుండి యే బరువును మోసికొని పోకుడి, యే పనియు చేయకుడి, నేను మీపితరుల కాజ్ఞాపించినట్లు విశ్రాంతిదినమును ప్రతిష్ఠితదినముగా ఎంచుకొనుడి.౹ అయితే వారు వినకపోయిరి, చెవినిబెట్టక పోయిరి, వినకుండను బోధనొందకుండను మొండికి తిరిగిరి.౹ మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను–మీరు నామాట జాగ్రత్తగా విని, విశ్రాంతిదినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నెంచి, విశ్రాంతిదినమున ఈ పట్టణపు గుమ్మములలోగుండ ఏ బరువును తీసికొని పోకుండినయెడల దావీదు సింహాసనమందు ఆసీనులై, రథములమీదను గుఱ్ఱములమీదను ఎక్కి తిరుగుచుండు రాజులును అధిపతులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులును యూదావారును యెరూషలేము నివాసులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు; మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును.౹ మరియు జనులు దహనబలులను బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసికొని యూదా పట్టణములలోనుండియు, యెరూషలేము ప్రాంతములలోనుండియు, బెన్యామీను దేశములోనుండియు, మైదానపు దేశములోనుండియు, మన్యములోనుండియు, దక్షిణదేశములోనుండియు వచ్చె దరు; యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసికొని వచ్చెదరు.౹ అయితే మీరు విశ్రాంతిదినమును ప్రతిష్ఠితదినముగా నెంచి, ఆ దినమున బరువులు మోసి కొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు విననియెడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును. యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన. వాక్కు –నీవు లేచి కుమ్మరి యింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును.౹ నేను కుమ్మరి యింటికి వెళ్లగా వాడు తన సారెమీద పని చేయుచుండెను.౹ కుమ్మరి జిగటమంటితో చేయుచున్నకుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసికొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొకకుండ చేసెను. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –ఇశ్రాయేలువారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? యిదే యెహోవా వాక్కు — జిగటమన్ను కుమ్మరిచేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలువారలారా, మీరు నా చేతిలో ఉన్నారు.౹ దాని పెల్లగింతుననియు, విరుగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమునుగూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనముచేయుట మానినయెడల నేను వారికి చేయనుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును.౹ మరియు కట్టెదననియు, నాటెదననియు ఒక జనమునుగూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా ఆ జనము నా మాట వినకుండ నా దృష్టికి కీడుచేసినయెడల దానికి చేయదలచిన మేలునుగూర్చి నేను సంతాపపడుదును.౹ కాబట్టి నీవు వెళ్లి యూదావారితోను యెరూషలేము నివాసులతోను ఇట్లనుము–యెహోవా సెలవిచ్చినమాట ఏదనగా–మీమీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచనచేయుచున్నాను, మీరందరు మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి.౹ అందుకు వారు–నీ మాట నిష్ ప్రయోజనము; మేము మా ఆలోచనల చొప్పున నడుచు కొందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అనియందురు. కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–అన్యజనులను అడిగి తెలిసికొనుడి; ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైన వినెనా? ఇశ్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసియున్నది.౹ లెబానోను పొలము లోని బండమీద హిమముండుట మానునా? దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారకమానునా? అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, మెరకచేయబడని దారిలో తాము నడువవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్రిల్ల చేసికొనుచున్నారు.౹ వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగానుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును.౹ తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువులయెదుట నిలువకుండ వారిని నేను చెదరగొట్టెదను; వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును. అప్పుడు జనులు–యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము విని పించక మానడు, జ్ఞాని యోచనలేకుండ నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండ మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పు కొనుచుండిరి. యెహోవా, నా మొఱ్ఱ నాలకించుము, నాతో వాదించువారి మాటను వినుము.౹ వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు; చేసిన మేలునకు ప్రతిగా కీడుచేయవలెనా? వారికి మేలు కలుగవలెనని వారిమీదనుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారిపక్షముగా మాటలాడిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.౹ వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలు లేనివారై విధవరాండ్రగుదురుగాక, వారి పురుషులు మరణహతులగుదురుగాక, వారి యౌవనులు యుద్ధములో ఖడ్గముచేత హతులగుదురు గాక.౹ నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్లకు ఉరులనొగ్గిరి; వారిమీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుటవలన వారి యిండ్లలోనుండి కేకలు వినబడును గాక.౹ యెహోవా, నాకు మరణము రావలెనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసేయున్నది, వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనియ్యకుము, నీ సన్నిధినుండి వారి పాపమును తుడిచివేయకుము; వారు నీ సన్నిధిని తొట్రిల్లుదురుగాక, నీకు కోపము పుట్టు కాలమున వారికి తగినపని చేయుము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– నీవు వెళ్లి కుమ్మరిచేయు మంటి కూజానుకొని, జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా నున్న బెన్‌హిన్నోము లోయలోనికిపోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము.౹ నీ విట్లనుము —యూదారాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి; సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలకించుడి, దాని సమాచారము వినువారందరికి చెవులు గింగురుమనునంత కీడును నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవుచున్నాను.౹ ఏలయనగా వారు నన్ను విసర్జించి యీ స్థలములో అపచారము చేసియున్నారు, వారైనను వారి తండ్రులైనను యూదారాజులైనను ఎరుగని అన్యదేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తముచేత ఈ స్థలమును నింపిరి నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనస్సునకు తోచ నిదియునైన ఆచారము నాచరించిరి; తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి.౹ ఇందునుబట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా–రాబోవు దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫెతు అనియైనను బెన్‍హిన్నోము లోయ అనియైనను పేరు వాడబడదు.౹ తమ శత్రువుల యెదుట ఖడ్గముచేతను, తమ ప్రాణములను తీయ వెదకువారిచేతను వారిని కూలజేసి, ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి, ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్థము చేసెదను.౹ ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్య పడి దానికి కలిగిన యిడుమలన్నిటిని చూచి అప హాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసెదను.౹ వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను; తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బందికలిగించుటకై వేయు ముట్టడినిబట్టియు దానివలన కలిగిన యిబ్బందినిబట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును.౹ ఈ మాటలు చెప్పినతరువాత నీతోకూడ వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగులగొట్టి వారితో ఈలాగనవలెను –సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మరల బాగుచేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్ట బోవుచున్నాను; తోఫెతులో పాతిపెట్టుటకు స్థలములేక పోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు.౹ యెహోవా వాక్కు ఇదే–ఈ పట్టణమును తోఫెతువంటి స్థలముగా నేను చేయుదును, ఈ స్థలమునకును దాని నివాసులకును నేనాలాగున చేయుదును.౹ యెరూషలేము ఇండ్లును యూదారాజుల నగరులును ఆ తోఫెతు స్థలమువలెనే అపవిత్రములగును; ఏ యిండ్లమీద జనులు ఆకాశసమూహమను దేవతలకు ధూపము వేయుదురో, లేక అన్యదేవతలకు పానార్పణములనర్పించుదురో ఆ యిండ్లన్నిటికి ఆలాగే జరుగును. ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులోనుండి యిర్మీయా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఈలాగు చెప్పెను.౹ –సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఈ జనులు నా మాటలు వినకుండ మొండికి తిరిగియున్నారు గనుక ఈ పట్టణమునుగూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికిని దానితో సంబంధించిన పట్టణములన్నిటిమీదికిని రప్పించుచున్నాను. యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని ప్రవక్తయైన యిర్మీయాను కొట్టి, యెహోవామందిరమందున్న బెన్యామీనుమీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను.౹ మరునాడు పషూరు యిర్మీయాను బొండలోనుండి విడిపింపగా యిర్మీయా అతనితో ఇట్లనెను–యెహోవా నీకు పషూరను పేరు పెట్టడు గాని మాగోర్‌మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును.౹ యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నీకును నీ స్నేహితులకందరికిని నీవే భయ కారణముగా నుండునట్లు చేయుచున్నాను; నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గముచేత కూలెదరు, మరియు యూదావారినందరిని బబులోను రాజుచేతికి అప్పగింతును, అతడు వారిని చెరపెట్టి బబులోనునకు తీసికొనిపోవును, ఖడ్గముచేత వారిని హతముచేయును.౹ ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభ మంతయు దాని అమూల్యవస్తువులన్నియు యూదారాజుల నిధులన్నియు నేనప్పగింతును, వారి శత్రువుల చేతికే వాటి నప్పగింతును, శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసికొనిపోవుదురు.౹ పషూరూ, నీవును నీ యింట నివసించువారందరును చెరలోనికి పోవుదురు, నీవును నీవు ప్రవచనములచేత మోసపుచ్చిన నీ స్నేహితులందరును బబులోనునకు వచ్చెదరు, అక్కడనే చనిపోయెదరు అక్కడనే పాతిపెట్టబడెదరు. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని; నీవు బలవంతముచేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వులపాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు.౹ ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను.౹ ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమునుబట్టి ప్రకటింపను, అని నేననుకొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.౹ నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు–దుర్మార్గు డని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొనియున్నారు.౹ అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు.౹ సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశో ధించువాడవు నీవే; అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే; నా వ్యాజ్యెమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికిచేయు ప్రతి దండన నేను చూతును గాక యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలోనుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక;౹ –నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తు డగును గాక;౹ నా తల్లి నాకు సమాధిగానుండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగానుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా యేమాత్రమును సంతాపములేక నశింపజేసిన పట్టణములవలె ఆ మనుష్యుడు ఉండును గాక; ఉదయమున ఆర్తధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములోనుండి వెడలితిని? రాజైన సిద్కియా మల్కీయా కుమారుడైన పషూరును యాజకుడగు మయశేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి –బబులోను రాజైన నెబుకద్రెజరు మనమీద యుద్ధముచేయుచున్నాడు; అతడు మనయొద్దనుండి వెళ్లి పోవునట్లు యెహోవా తన అద్భుతకార్యములన్నిటిని చూపి మనకు తోడైయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు యిర్మీయాయొద్దకు వారిని పంపగా యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. యిర్మీయా వారితో ఇట్లనెను–మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి –ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–బబులోను రాజుమీదను, మిమ్మును ముట్టడివేయు కల్దీయులమీదను, మీరుపయో గించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయటనుండి తీసికొని యీ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను.౹ కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగినవాడనై, బాహుబలముతోను, చాచిన చేతితోను నేనే మీతో యుద్ధము చేసెదను.౹ మనుష్యులనేమి పశువులనేమి యీ పట్టణపు నివాసులనందరిని హతము చేసెదను; గొప్ప తెగులుచేత వారు చచ్చెదరు.౹ అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్థులను, తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను, బబులోను రాజైన నెబుకద్రెజరుచేతికి, వారి ప్రాణములను తీయజూచువారి శత్రువులచేతికి అప్పగించెదను. అతడు వారియందు అనుగ్రహముంచకయు, వారిని కరుణింపకయు, వారి యెడల జాలిపడకయు వారిని కత్తివాత హతముచేయును.౹ ఈ ప్రజలతో నీవిట్లనుము–యెహోవా సెలవిచ్చునదేమనగా–జీవమార్గమును మరణమార్గమును నేను మీ యెదుట పెట్టుచున్నాను.౹ ఈ పట్టణములో నిలుచువారు కత్తివలన గాని క్షామమువలనగాని తెగులువలనగాని చచ్చెదరు, మేలుచేయుటకుకాదు కీడుచేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్లి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రదుకుదురు; దోపుడుసొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును.౹ ఈ పట్టణము బబులోను రాజుచేతికి అప్పగింపబడును, అతడు అగ్నిచేత దాని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు. యూదారాజు ఇంటివారలకు ఆజ్ఞ యిదే–యెహోవా మాట వినుడి.౹ దావీదు వంశస్థులారా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, ఆలాగు చేయనియెడల మీ దుష్టక్రియలనుబట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి, యెవడును ఆర్పలేకుండ మిమ్మును దహించును.౹ యెహోవా వాక్కు ఇదే–లోయలో నివసించుదానా, మైదానమందలి బండవంటిదానా, —మా మీదికి రాగలవాడెవడు, మా నివాసస్థలములలో ప్రవేశించువాడెవడు? అనుకొనువారలారా,౹ మీ క్రియల ఫలములనుబట్టి మిమ్మును దండించెదను, నేను దాని అరణ్యములో అగ్ని రగుల బెట్టెదను, అది దాని చుట్టునున్న ప్రాంతములన్నిటిని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీవు. యూదారాజు నగరుదిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము దావీదు సింహాసనముమీద కూర్చుండు యూదా రాజా, నీవును ఈ గుమ్మములద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్థులును నీ జనులును యెహోవా మాట వినుడని ప్రకటింపుము.౹ యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు —మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడి పించుడి, పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవ రాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.౹ మీరు నిశ్చయముగా ఈలాగున చేసినయెడల దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులు రథములను గుఱ్ఱములను ఎక్కి తిరుగుచు, ఉద్యోగస్థుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారములగుండ ప్రవేశింతురు.౹ మీరు ఈ మాటలు విననియెడల ఈ నగరుపాడై పోవును, నా తోడని ప్రమాణము చేయుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.౹ యూదారాజు వంశస్థులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నా యెన్నికలో నీవు గిలాదువలెనున్నావు, లెబానోను శిఖరమువలె ఉన్నావు; అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును.౹ నీమీదికి వచ్చుటకైయొక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను, వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్ఠమైనవాటిని నరికి అగ్నిలో పడ వేతురు.౹ అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు —యెహోవా యెందునిమిత్తము ఈ గొప్పపట్టణమును ఈలాగు చేసెనని యొకని నొకడు అడుగగా అచ్చటి వారు–వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు. చనిపోయినవానిగూర్చి యేడవవద్దు, వానిగూర్చి అంగలార్చవద్దు; వెళ్లిపోవుచున్నవానిగూర్చి బహు రోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు.౹ తన తండ్రియైన యోషీయాకు ప్రతిగా ఏలిన వాడై యీ స్థలములోనుండి వెళ్లిపోయిన యూదారాజైన యోషీయా కుమారుడగు షల్లూమునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–అతడు ఇక్కడికి తిరిగి రాడు;౹ ఈ దేశమునిక చూడక వారు అతని తీసికొనిపోయిన స్థలమునందే అతడు చచ్చును. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.౹ వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతో రంగువేయుచు నున్నాడే;౹ నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుటచేత రాజవగుదువా? నీ తండ్రి అన్నపానములుకలిగి నీతిన్యాయముల ననుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసికొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.౹ అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు.౹ కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు — జనులు— అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతని గూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగలార్చరు.౹ అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును. నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలువేయుము; బాషానులో బిగ్గరగా అరువుము, అబారీమునుండి కేకలువేయుము.౹ నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గాని–నేను విననని నీవంటివి; నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు వాడుక.౹ నీ కాపరులందరు గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు, నీ చెడుతనమంతటినిబట్టి నీవు అవమానమునొంది సిగ్గుపడుదువు.౹ లెబానోను నివాసినీ, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనినదానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదనవంటి కష్టము నీకు వచ్చునప్పుడు నీవు బహుగా కేకలువేయుదువు గదా! యెహోవా సెలవిచ్చునదేమనగా — యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడిచేతికి శిఖా ఉంగరముగా ఉండినను దానిమీదనుండియు నిన్ను ఊడదీసివేసెదనని నాతోడని ప్రమాణముచేయుచున్నాను.౹ నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను.౹ నిన్నును నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మ భూమికాని పరదేశములోనికి విసరివేసెదను, మీరు అక్కడనే చచ్చెదరు.౹ వారు తిరిగి రావలెనని బహుగా ఆశ పడు దేశమునకు వారు తిరిగి రారు.౹ కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి? దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినుము.౹ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–సంతానహీనుడనియు, తన దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుష్యునిగూర్చి వ్రాయుడి; అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు. యెహోవా వాక్కు ఇదే–నా మందలో చేరిన. గొఱ్ఱెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.౹ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులనుగూర్చి యీలాగున సెలవిచ్చుచున్నాడు —మీరు నా గొఱ్ఱెలనుగూర్చి విచారణచేయక, నేను మేపుచున్న గొఱ్ఱెలను చెదరగొట్టి పారదోలితిరి; ఇదిగో మీ దుష్‌క్రియలనుబట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.౹ మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలోనుండి నా గొఱ్ఱెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను; అవి అభివృద్ధిపొంది విస్తరించును.౹ నేను వాటి మీద కాపరులను నియమించెదను; ఇకమీదట అవి భయపడకుండను బెదరి పోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొఱ్ఱెలను మేపెదరు; ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.౹ అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.౹ కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి రప్పించిన యెహోవా జీవము తోడని యిక ప్రమాణముచేయక ఉత్తర దేశములోనుండియు, నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలోనుండియు వారిని రప్పించిన యెహోవానగు నాతోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు; మరియు వారు తమ దేశములో నివసింతురు. ప్రవక్తలనుగూర్చినది. యెహోవానుగూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలనుగూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా యెముకలన్నియు కదలుచున్నవి, నేను మత్తిల్లినవానివలెను ద్రాక్షారసవశుడైన బలాఢ్యునివలెను ఉన్నాను.౹ దేశము వ్యభిచారులతో నిండియున్నది, జనుల నడవడి చెడ్డదాయెను, వారి శౌర్యము అన్యాయమున కుపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది; అడవిబీళ్లు ఎండిపోయెను.౹ ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు; నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను; ఇదే యెహోవా వాక్కు.౹ వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేలవలె వారి మార్గముండును; దానిలో వారు తరుమబడి పడిపోయెదరు; ఇదే యెహోవా వాక్కు.౹ షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని; వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి.౹ యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి. కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈ ప్రవక్త లనుగూర్చి సెలవిచ్చునదేమనగా–యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చుచున్నాను.౹ సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు.౹ వారు నన్ను తృణీకరించు వారితో–మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు; ఒకడు తన హృదయమూర్ఖత చొప్పున నడవగా వానితో–మీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకుదురు.౹ యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు? ఇదిగో యెహోవాయొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్లుచున్నది; అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తలమీదికి పెళ్లున దిగును.౹ తన కార్యమును సఫలపరచువరకును తన హృదయా లోచనలను నెరవేర్చువరకును యెహోవా కోపము చల్లారదు; అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు.౹ నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు.౹ వారు నా సభలో చేరిన వారైనయెడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియ జేతురు, దుష్‌క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచి పెట్టునట్లు వారిని త్రిప్పియుందురు; ఇదే యెహోవా వాక్కు.౹ –నేను సమీపముననుండు దేవుడనుమాత్ర మేనా? దూరముననుండు దేవుడనుకానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా–నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైనకలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.౹ –కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను.౹ ఇక నెప్పటివరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయకాపట్యమునుబట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని నాలో చింపరా? బయలును పూజింపవలెనని తమపితరులు నా నామమును మరచినట్లు వీరందరు తమ పొరుగువారితో చెప్పు కలలచేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా? కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.౹ నా మాట అగ్నివంటిదికాదా? బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా? కాబట్టి తమ జతవానియొద్దనుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.౹ స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవో క్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.౹ మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరో ధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు.౹ మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము–మీరే ఆయనకు భారము; మిమ్మును ఎత్తి పారవేతును; ఇదే యెహోవా వాక్కు. మరియు –ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను, వానిని వాని యింటివారిని నేను దండించెదను.౹ అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా యేమని చెప్పుచున్నాడు? అని మీరు మీ పొరుగువారితోను సహోదరులతోను ప్రశంసించవలెను.౹ యెహోవా భారమను మాట మీరికమీదట జ్ఞాపకము చేసికొనవద్దు; జీవముగల మన దేవుని మాటలను, సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా మాటలను, మీరు అపార్థముచేసితిరి; కాగా ఎవనిమాట వానికే భారమగును.౹ యెహోవా నీకేమని ప్రత్యుత్తర మిచ్చుచున్నాడనియు, యెహోవా యేమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడుగవలెను గాని యెహోవా భారమను మాట మీరెత్తినయెడల అందునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీరు యెహోవా భారమను మాట యెత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట యెత్తుచునే యున్నారు.౹ కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను, మీకును మీపితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధినుండి పారవేయుచున్నాను.౹ ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీమీదికి రప్పించెదను. బబులోను రాజైన నెబుకద్రెజరు యూదారాజైన యెహోయాకీము కుమారుడగు యెకోన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసికొనిపోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను.౹ ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లవంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను; అవి తిన శక్యముకానంతగా జబ్బువి.౹ యెహోవా–యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని నన్నడుగగా నేను–అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తిన శక్యముకానంత జబ్బువిగాను కనబడుచున్నవంటిని.౹ అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–వారికి మేలుకలుగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను, ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టునట్లు లక్ష్యపెట్టుచున్నాను.౹ వారికి మేలు కలుగునట్లు నేను వారిమీద దృష్టియుంచుచు, ఈ దేశమునకు వారిని మరల తీసికొనివచ్చి, పడగొట్టక వారిని కట్టెదను, పెల్ల గింపక వారిని నాటెదను.౹ వారు పూర్ణహృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారి కిచ్చెదను.౹ మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించువారిని, మిక్కిలి జబ్బువై నందున తినశక్యముకాని ఆ జబ్బు అంజూరపుపండ్లవలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోను, నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోను, వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను.౹ నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండ వారు పాడైపోవువరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోకి పంపెదను. యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము నాలుగవ సంవత్సరమున, అనగా బబులోనురాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.౹ ప్రవక్తయైన యిర్మీయా యూదా ప్రజలందరితోను యెరూషలేము నివాసులందరితోను ఆ వాక్కును ప్రకటించెను.౹ ఆమోను కుమారుడును యూదారాజు నైన యోషీయా పదుమూడవ సంవత్సరము మొదలుకొని నేటివరకు ఈ యిరువది మూడు సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచువచ్చెను; నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి.౹ [4-6] —మీ చేతిపనులవలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ జేయకుండునట్లును, అన్యదేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారముచేయుటయు మాని, మీరందరు మీ చెడ్డమార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగినయెడల, యెహోవా మీకును మీపితరులకును నిత్యనివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై, యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి.౹ *** *** అయితే–మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనులవలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ [8-9] సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తరదేశములోనున్న సర్వజనములను, నా సేవకుడైన నెబుకద్రెజరను బబులోనురాజును పిలువనంపించుచున్నాను; ఈ దేశముమీదికిని దీని నివాసులమీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మ యాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.౹ *** సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండ చేసెదను.౹ ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోనురాజునకు దాసులుగా ఉందురు.౹ యెహోవా వాక్కు ఇదే–డెబ్బది సంవత్సరములు గడచిన తరువాత వారి దోషములనుబట్టి నేను బబులోనురాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును; ఆ దేశము ఎప్పుడు పాడుగనుండునట్లు నియమింతును.౹ నేను ఆ దేశమునుగూర్చి సెలవిచ్చిన మాటలన్నియు యిర్మీయా ఈ జనములన్నిటినిగూర్చి ప్రకటింపగా, ఈ గ్రంథములో వ్రాయ బడినదంతయు ఆ దేశముమీదికి రప్పించెదను.౹ ఏలయనగా నేను వారి క్రియలనుబట్టియు వారి చేతి కార్యములనుబట్టియు వారికి ప్రతికారముచేయునట్లు అనేక జనములును మహారాజులును వారిచేత సేవ చేయించు కొందురు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు–నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలోనుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికి దాని త్రాగింపుము.౹ వారు దాని త్రాగి సొక్కి సోలుచు నేను వారిమీదికి పంపుచున్న ఖడ్గమునుబట్టి వెఱ్ఱివాండ్రగుదురు.౹ అంతట యెహోవా చేతిలోనుండి నేను ఆ పాత్రను తీసికొని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటికి దాని త్రాగించితిని.౹ నేటివలెనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని.౹ మరియు ఐగుప్తురాజైన ఫరోయును అతని దాసులును అతని ప్రధానులును అతని జనులందరును సమస్తమైన మిశ్రిత జనులును ఊజుదేశపు రాజులందరును ఫిలి ష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజయును, ఎక్రోనును అష్డోదు శేషపువారును ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులును తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులును దదానీయులును తేమానీయులును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొనువారందరును అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును జిమ్రీ రాజులందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులందరును సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవా రేమి ఉత్తరదేశముల రాజులందరును భూమిమీదనున్న రాజ్యములన్నియు దానిలోనిది త్రాగుదురు; షేషకురాజు వారి తరువాత త్రాగును.౹ నీవు వారితో ఈలాగు చెప్పుము–ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు నైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను మీమీదికి పంపబోవు యుద్ధముచేత త్రాగి మత్తిల్లి కక్కు కొనినవారివలెనేయుండి మీరు మరల లేవకుండ పడుదురు.౹ మేము త్రాగమని వారు నీ చేతిలోనుండి ఆ పాత్రను తీసికొననొల్లని యెడల నీవు వారితో ఇట్లనుము —మీరు అవశ్యముగా దాని త్రాగవలెనని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడుచేయ మొదలుపెట్టగా మీకు శిక్షలేకుండ పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరిమీదికి నేను ఖడ్గమును రప్పించుచున్నాను; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.౹ కాబట్టి నీవు ఈ మాటలన్నిటిని వారికి ప్రకటించి, ఈలాగు చెప్పవలెను–ఉన్నతస్థలములోనుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయములోనుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మంద మేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు, ద్రాక్షగానుగను త్రొక్కువారివలె అరచుచు ఆయన భూలోక నివాసులకందరికి విరోధముగా ఆర్భటించుచున్నాడు.౹ భూమ్యంతమువరకు సందడి వినబడును, యెహోవా జనములతో వ్యాజ్యెమాడుచున్నాడు, శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడుచున్నాడు, ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు; ఇదే యెహోవా వాక్కు. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–జనమునుండి జనమునకు కీడు వ్యాపించు చున్నది, భూదిగంతములనుండి గొప్ప తుపాను బయలు వెళ్లుచున్నది.౹ ఆ దినమున యెహోవాచేత హతులైనవారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు. ఎవరును వారినిగూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలె వారి శవములు నేలమీద పడియుండును.౹ మందకాపరులారా, గోలలెత్తుడి, మొఱ్ఱపెట్టుడి; మందలోని ప్రధానులారా, బూడిద చల్లుకొనుడి. మీరు మరణమునొందుటకై దినములు పూర్తియాయెను, నేను మిమ్మును చెదరగొట్టెదను, రమ్యమైన పాత్రవలె మీరు పడుదురు.౹ మందకాపరులకు ఆశ్రయస్థలము లేకపోవును, మందలోని శ్రేష్ఠమైన వాటికి రక్షణ దొరకకపోవును,౹ ఆలకించుడి, మంద కాపరుల మొఱ్ఱ వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోలవినబడుచున్నది, యెహోవావారి మేతభూమినిపాడు చేసియున్నాడు.౹ నెమ్మదిగల మేతస్థలములు యెహోవా కోపాగ్నిచేత పాడాయెను;౹ క్రూరమైన ఖడ్గముచేతను ఆయన కోపాగ్నిచేతను వారి దేశము పాడుకాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను. యోషీయా కుమారుడును యూదారాజునగు. యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్దనుండి వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవామందిరావరణములో నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాట లన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.౹ వారి దుర్మార్గమునుబట్టి వారికి చేయదలచిన కీడును చేయక నేను సంతాప పడునట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదు రేమో.౹ నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చునదేమనగా –మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము ననుసరించి నడుచు కొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులగు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి.౹ మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసెదను, ఈ పట్టణమును భూమిమీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను.౹ యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులును ప్రవక్తలును జనులందరును వినిరి.౹ జనులకందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరువాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొని–నీవు మరణశిక్ష నొందక తప్పదు.౹ యెహోవా నామమునుబట్టి ఈ మందిరము షిలోహువలెనగుననియు, ఈ పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీవేల ప్రకటించుచున్నావు అనుచు, ప్రజలందరు యెహోవా మందిరములో యిర్మీయాయొద్దకు కూడివచ్చిరి. యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరులోనుండి యెహోవా మందిరమునకు వచ్చి, యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా యాజకులును ప్రవక్తలును అధిపతులతోను సమస్త ప్రజలతోను ఈలాగనిరి–మీరు చెవులార వినియున్న ప్రకారము, ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు; గనుక ఇతడు మరణమునకు పాత్రుడు.౹ అప్పుడు యిర్మీయా అధిపతులందరితోను జనులందరితోను ఈ మాట చెప్పెను–ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటిని ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు.౹ కాబట్టి యెహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడునుగూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి.౹ ఇదిగో నేను మీ వశములోనున్నాను, మీ దృష్టికేది మంచిదో యేది యుక్తమైనదో అదే నాకు చేయుడి.౹ అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీయొద్దకు నన్ను పంపియున్నాడు గనుక, మీరు నన్ను చంపినయెడల మీరు మీమీదికిని ఈ పట్టణముమీదికిని దాని నివాసులమీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి.౹ కాగా అధిపతులును జనులందరును యాజకులతోను ప్రవక్తలతోను ఇట్లనిరి–ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమునుబట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు.౹ మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి.౹ –యూదారాజైన హిజ్కియా దినములలో మోరష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను–సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.౹ అట్లు పలికినందున యూదారాజైన హిజ్కియాయైనను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవావారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాప పడునట్లు రాజు యెహోవాయందు భయభక్తులుకలిగి యెహోవా దయను వేడుకొనెను గదా? మనము ఈ కార్యము చేసినయెడల మనమీదికే గొప్పకీడు తెచ్చు కొందుము అని చెప్పిరి. మరియు కిర్యత్యారీము వాడైన షెమయా కుమారుడగు ఊరియాయను ఒకడు యెహోవా నామమునుబట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని యీ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను.౹ రాజైన యెహోయాకీమును అతని శూరులందరును ప్రధానులందరును అతని మాటలు వినినమీదట రాజు అతని చంపజూచుచుండగా, ఊరియా దాని తెలిసికొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను.౹ అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను;౹ వారు ఐగుప్తులోనుండి ఊరియాను తీసికొనివచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా, ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్యజనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను.౹ ఈలాగు జరుగగా షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడైయున్నందున అతని చంపుటకు వారు జనులచేతికి అతనిని అప్పగింప లేదు. యూదారాజైన యోషీయా కుమారుడగు. యెహోయాకీము ఏల నారంభించినప్పుడు యెహోవా యొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు— నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము.౹ వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియాయొద్దకు వచ్చిన దూతలచేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము.౹ మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని యీ ఆజ్ఞ వారితో చెప్పుము–మీరు మీ యజమానులకు తెలియ జేయవలెనని సైన్యములకధిపతియైన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చునదేమనగా –అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను.౹ ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులను కూడ అతని వశము చేయుచున్నాను.౹ అతని స్వదేశమునకు కాలమువచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.౹ ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాస్యము చేయనొల్లక బబులోనురాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతనిచేత బొత్తిగా నాశనముచేయించువరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.౹ కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునపుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి.౹ మీరు మీ భూమిని అనుభవింపకుండ మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్లగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు.౹ అయితే ఏ జనులు బబులోనురాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండ నిచ్చెదను. వారు తమ భూమిని సేద్య పరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును; ఇదే యెహోవా వాక్కు. నేను ఆ మాటలనుబట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లంటిని — బబులోనురాజుయొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని, అతనికిని అతని జనులకును దాసులైనయెడల మీరు బ్రదుకుదురు బబులోనురాజునకు దాసులుకానొల్లని జనులవిషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలును చావనేల? కావున— మీరు బబులోనురాజునకు దాసులుకాకుందురని మీతోచెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారి మాటల నంగీకరింపవద్దు, ఇదే యెహోవా వాక్కు.౹ నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలును నశించునట్లును, వారు నా నామమునుబట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు. మరియు యాజకులతోను ఈ ప్రజలందరితోను నేను ఈ మాటలు చెప్పితిని –యెహోవా సెలవిచ్చునదేమనగా–యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోనునుండి మరల తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు, వారి మాటలకు చెవియొగ్గకుడి.౹ వారి మాట వినకుడి; బబులోను రాజునకు దాసులైనయెడల మీరు బ్రదుకుదురు; ఈ పట్టణము పాడైపోనేల? వారు ప్రవక్తలైనయెడల, యెహోవా వాక్కు వారికి తోడైయుండినయెడల, యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపో బడకుండునట్లువారు సైన్యములకధిపతియగు యెహోవాను బతిమాలుకొనుట మేలు.౹ బబులోను రాజైన నెబుకద్రె జరు యెరూషలేములోనుండి యెహోయాకీము కుమారుడైన యెకోన్యాను యూదా యెరూషలేముల ప్రధానుల నందరిని బబులోనునకు చెరగా తీసికొనిపోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములనుగూర్చియు సముద్రమునుగూర్చియు గడమంచెలనుగూర్చియు ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములనుగూర్చియు సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.౹ యెహోవా మందిరములోను యూదారాజు నగరులోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములనుగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు ననే సెలవిచ్చుచున్నాడు –అవి బబులోనునకు తేబడును, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి యీ స్థలములో వాటిని మరల నుంచు కాలమువరకు అవి అక్కడ నుండవలెను; ఇదే యెహోవా వాక్కు. యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభమున. నాల్గవ సంవత్సరము అయిదవ నెలలో గిబియోనువాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్యా యాజకుల యెదుటను ప్రజలందరియెదుటను యెహోవా మందిరములో నాతో ఈలాగనెను –ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు — నేను బబులోనురాజు కాడిని విరిచియున్నాను.౹ రెండు సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ స్థలములోనుండి బబులోనునకు తీసికొనిపోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని ఇచ్చటికి మరల తెప్పించెదను.౹ బబులోను రాజు కాడిని విరుగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజునైన యెకోన్యాను, బబులోనునకు చెరగొని పోయిన యూదులనందరిని, యీ స్థలమునకు తిరిగి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.౹ అప్పుడు ప్రవక్తయైన యిర్మీయా యాజకులయెదుటను యెహోవా మందిరములో నిలుచుచున్న ప్రజలందరియెదుటను ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెను –ఆలాగున జరుగునుగాక, యెహోవా ఆలాగుననే చేయునుగాక, యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని, చెరగొనిపోబడిన వారినందరిని యెహోవా బబులోనులోనుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక.౹ అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్నమాటను చిత్తగించి వినుము.౹ నాకును నీకును ముందుగా నున్న ప్రవక్తలు, అనేకదేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులుకలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి.౹ అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త యున్నాడే, అతని మాట నెరవేరినయెడల యెహోవా నిజముగా అతని పంపెనని యొప్పుకొనదగునని ప్రవక్తయైన యిర్మీయా చెప్పగా ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనుండి ఆ కాడిని తీసి దాని విరిచి ప్రజలందరి యెదుట ఇట్లనెను–యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడమీద నుండి తొలగించి దాని విరిచివేసెదను; అంతట ప్రవక్తయైన యిర్మీయా వెళ్లిపోయెను. ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనున్న కాడిని విరిచినతరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను — నీవు పోయి హనన్యాతో ఇట్లనుము — యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు — నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలెను.౹ ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ జనులందరును బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావలెనని వారి మెడమీద ఇనుపకాడి యుంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతువులను కూడ నేను అతనికప్పగించియున్నాను.౹ అంతట ప్రవక్తయైన యిర్మీయా ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెను–హనన్యా వినుము; యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు.౹ కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–భూమిమీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటుచేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను.౹ ఆ సంవత్సరమే యేడవ నెలలో ప్రవక్తయైన హనన్యా మృతినొందెను. రాజైన యెకోన్యా తల్లియగు రాణియు, రాజ పరివారమును,౹ [2-3] యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులును, శిల్పకారులును, కంసాలులును యెరూషలేమును విడిచి వెళ్లిన తరువాత ప్రవక్తయైన యిర్మీయా పత్రికలో లిఖించి, యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరునొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశాచేతను, హిల్కీయా కుమారుడైన గెమర్యాచేతను, యెరూషలేములోనుండి చెరపట్టబడిపోయినవారి పెద్దలలో శేషించినవారికిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేమునుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికిని పంపించిన మాటలు ఇవే *** –ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా తన ప్రేరేపణచేత బబులోనునకు చెరతీసికొని పోబడినవారికందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు –ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి,౹ పెండ్లిండ్లు చేసికొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమియు మీకు తక్కువలేకుండ అభివృద్ధిపొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి.౹ నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముయొక్క క్షేమముకోరి దానికొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును.౹ ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు— మీ మధ్యనున్న ప్రవక్తలచేతనైనను మంత్రజ్ఞులచేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి.౹ వారు నా నామమునుబట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు; ఇదే యెహోవా వాక్కు.౹ యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును.౹ నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.౹ మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.౹ మీరు నన్ను వెదకినయెడల, పూర్ణమనస్సుతో నన్నుగూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కను గొందురు,౹ నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపెట్టి యే జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.౹ బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించియున్నాడని మీరు చెప్పుకొంటిరే,౹ సరే, దావీదు సింహాసనమందు కూర్చునియున్న రాజునుగూర్చియు, మీతోకూడ చెరలోనికిపోక యీ పట్టణములో నివసించు ప్రజలనుగూర్చియు, మీ సహోదరులనుగూర్చియు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను వారిమీదికి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను; కుళ్లి కేవలము చెడిపోయి తినశక్యముకాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేనువారిని అప్పగించుచున్నాను;౹ యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లనివారై, నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులచేత వారియొద్దకు పంపిన నా మాటలను ఆలకింపక పోయిరి.౹ గనుక నేను ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును; నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయకారణముగాను అపహాస్యా స్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ నేను యెరూషలేములోనుండి బబులోనునకు చెరగొని పోయినవారలారా, మీరందరు యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. నా నామమునుబట్టి మీకు అబద్ధప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన అహాబునుగూర్చియు, మయశేయా కుమారుడైన సిద్కియానుగూర్చియు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు, తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు, నేను వారికాజ్ఞాపింపని అబద్ధపుమాటలను నా నామమునుబట్టి ప్రకటించుచువచ్చిరి, నేనే యీ సంగతిని తెలిసికొనిన వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్రెజరుచేతికి వారిని అప్పగించుచున్నాను, మీరు చూచుచుండగా అతడు వారిని హతముచేయును;౹ చెరపట్టబడి బబులోనులోనున్న యూదావారందరును బబులోనురాజు అగ్నిలో కాల్చిన సిద్కియావలెను అహాబువలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు; ఇదే యెహోవా వాక్కు. నెహెలామీయుడైన షెమయాకు నీవీమాట తెలియజేయుము –ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– వెఱ్ఱివారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారిని నీవు సంకెళ్లచేత బంధించి బొండలో వేయించినట్లుగా, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవామందిర విషయములలో పైవిచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములోనున్న ప్రజలకందరికిని యాజకుడగు మయశేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే.౹ అనాతోతీయుడైన యిర్మీయాను నీవేల గద్దింపకపోతివి? అతడు తన్నుతాను మీకు ప్రవక్త నుగా చేసికొనెనుగదా అదియుగాక–దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై యిండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి, అని బబులోనులో నున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు,౹ అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్తయైన యిర్మీయా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను అంతట యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను చెరలోనున్న వారికందరికి నీవు పంపవలసిన వర్తమానమేమనగా యెహోవా నెహెలామీయుడైన షెమయానుగూర్చి యీలాగు సెలవిచ్చుచున్నాడు–నేను అతని పంపకపోయినను షెమయా మీకు ప్రవచింపుచు అబద్ధపుమాటలను నమ్మునట్లు చేసెను గనుక యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.౹ –నెహెలామీయుడైన షెమయా యెహోవామీద తిరుగుబాటు చేయుదమని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను; ఈ జనులలో కాపురముండువాడొకడును అతనికి మిగిలియుండడు, నా ప్రజలకు నేనుచేయు మేలును అతడు చూడడు; ఇదే యెహోవా వాక్కు. యెహోవాయొద్దనుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.౹ ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము. యెహోవా ఇశ్రాయేలువారినిగూర్చియు యూదా వారినిగూర్చియు సెలవిచ్చినమాటలివి.౹ యెహోవా యిట్లనెను–సమాధానములేనికాలమున భీతిచేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము.౹ మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.౹ సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీకున్న కాడి నీ మెడ నుండకుండ ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను; ఇకను అన్యులు యాకోబు సంతతివారిచేత దాస్యము చేయించు కొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారిమీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు.౹ మరియు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము, నేను దూరముననుండు నిన్నును, చెరలోనికి పోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడులేకుండ యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును.౹ యెహోవా వాక్కు ఇదే–నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూలనాశనము చేసెదను గాని నిన్ను సమూల నాశనము చేయను, అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండనే నిన్ను మితముగా శిక్షించుదును. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది;౹ నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమునుబట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగినమందు నీకు లేదు.౹ నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్నుగూర్చి విచారింపరు.౹ నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్త రించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను.౹ నిన్ను మ్రింగువారందరు మ్రింగి వేయబడుదురు, నిన్ను బాధించువారందరు ఎవడును తప్పకుండ చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకొనువారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించువారినందరిని దోపుడు సొమ్ముగా అప్పగించెదను.౹ వారు–ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.౹ యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు— యాకోబు నివాసస్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలోనుండి రప్పింతును; అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును.౹ వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమపడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.౹ వారి కుమారులుమునుపటివలెనుందురు, వారి సమాజము నా యెదుట స్థాపింపబడును, వారిని బాధపరచువారినందరిని శిక్షించెదను.౹ వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారిమధ్యను పుట్టినవాడొకడు వారి నేలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవా వాక్కు.౹ అప్పుడు మీరు నాకు ప్రజలైయుందురు నేను మీకు దేవుడనై యుందును. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టులమీద పెళ్లున దిగును.౹ తన కార్యము ముగించువరకు తన హృదయాలోచనలను నెరవేర్చువరకు యెహోవా కోపాగ్ని చల్లారదు, అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు. యెహోవా వాక్కు ఇదే–ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలైయుందురు.౹ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఖడ్గమును తప్పించుకొనినవారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతినొందునట్లు నేను వెళ్లుదుననుచున్నాడు.౹ చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను— శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.౹ ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు.౹ నీవు షోమ్రోను కొండలమీద ద్రాక్షావల్లులను మరల నాటెదవు, నాటు వారు వాటి ఫలములను అనుభవించెదరు.౹ ఎఫ్రాయిము పర్వతములమీద కావలివారు కేకవేసి–సీయోనునకు మన దేవుడైన యెహోవాయొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను.౹ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–యాకోబునుబట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమునుబట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి స్తుతిచేయుడి–యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమీ అని బతిమాలుడి.౹ ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించుచున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అందరిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువలయొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడి–ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱెలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.౹ యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటె బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవాచేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమునుబట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.౹ వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆద రించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.౹ క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు — ఆలకించుడి, రామాలో అంగలార్పును మహా రోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలనుగూర్చి యేడ్చు చున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.౹ యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము; నీ క్రియ సఫలమై, జనులు శత్రువుని దేశములోనుండి తిరిగి వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.౹ రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.౹ నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పినయెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.౹ –నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలిసికొని తొడ చరుచుకొంటిని, నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని.౹ ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుమారీ, సరిహద్దురాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నీవు వెళ్లిన రాజమార్గముతట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము; ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము.౹ నీవు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–చెరలోనుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదాదేశములోను దాని పట్టణములలోను జనులు–నీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు.౹ అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృశించిన వారినందరిని నింపుదును.౹ కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరును పట్టణస్థులందరును వారి దేశములో కాపురముందురు.౹ అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోద మాయెను.౹ యెహోవా వాక్కు ఇదే — ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి.౹ వారిని పెల్లగించుటకును విరుగగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేనేలాగు కనిపెట్టియుంటినో ఆలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును; ఇదే యెహోవా వాక్కు.౹ ఆ దినములలో–తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనను మాట వాడుకొనరు.౹ ప్రతివాడు తన దోషముచేతనే మృతినొందును; ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్లే పులియును. –ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధనచేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.౹ అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.౹ ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.౹ నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డును–యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు.౹ పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.౹ –ఆ నియమములు నా సన్నిధి నుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జనముగా ఉండకుండపోవును; ఇదే యెహోవా వాక్కు.౹ యెహోవా సెలవిచ్చునదేమనగా — పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునా దులను పరిశోధించుటయు శక్యమైనయెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమునుబట్టి నేను వారినందరిని తోసి వేతును; యెహోవా వాక్కు ఇదే.౹ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మమువరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును.౹ కొలనూలు దాని కెదు రుగా గారేబుకొండవరకు పోవుచు గోయావరకు తిరిగి సాగును.౹ శవములును బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగువరకును గుఱ్ఱముల గవినివరకును తూర్పుదిశనున్న పొలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడును పెల్లగింపబడదు, పడద్రోయబడదు. యూదారాజైన సిద్కియా యేలుబడి పదియవ. సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి పదునెనిమిదవ సంవత్సరమున యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.౹ ఆ కాలమున బబులోనురాజు దండు యెరూషలేమునకు ముట్టడివేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా — యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును,౹ యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుండి తప్పించుకొనక బబులోనురాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును, సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులార అతని చూచును,౹ అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించువరకు అతడక్కడనే యుండును; ఇదే యెహోవా వాక్కు;౹ మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు, అను మాటలు నీవేల ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి యుండెను; కాగా ప్రవక్తయైన యిర్మీయా యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను. అంతట యిర్మీయా ఇట్లనెను–యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి — అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును.౹ కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హన మేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చి–బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసికొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమునుకొని, పదియేడు తులముల వెండి తూచి అతనికిచ్చితిని.౹ నేను క్రయపత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని.౹ అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదులందరియెదుటను, నేను మహసేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల యెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించితిని.౹ ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా –ఈ పత్రములను, అనగా ముద్రగల యీ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును, నీవు తీసికొని అవి బహు దినములుండునట్లు మంటికుండలో వాటిని దాచిపెట్టుము.౹ ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇండ్లును పొలములును ద్రాక్షతోటలును ఇంక ఈ దేశములో కొనబడును. నేరీయా కుమారుడైన బారూకుచేతికి ఆ క్రయ పత్రమును నేనప్పగించిన తరువాత యెహోవాకు ఈలాగున ప్రార్థన చేసితిని –యెహోవా, ప్రభువా సైన్యములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.౹ నీవు వేవేలమందికి కృపచూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు.౹ ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియా ఫలమునుబట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నర పుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.౹ నీవు ఐగుప్తుదేశములో చేసినట్టు నేటివరకు ఇశ్రాయేలు వారిమధ్యను ఇతర మనుష్యులమధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు.౹ సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహా బలముకలిగి, చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి, ఐగుప్తు దేశములోనుండి నీ ప్రజలను రప్పించి మీ కిచ్చెదనని వారి పితరులకు ప్రమాణముచేసి, పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారి కిచ్చితివి.౹ వారు ప్రవేశించి దాని స్వతంత్రించుకొనిరి గాని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయిరి. వారు చేయవలెనని నీవాజ్ఞాపించినవాటిలో దేనిని చేయకపోయిరి గనుక ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నావు.౹ ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి, ఖడ్గము క్షామము తెగులు వచ్చుటవలన దానిమీద యుద్ధముచేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును; నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాని చూచుచున్నావు గదా? యెహోవా ప్రభువా–ధనమిచ్చి యీ పొలమును కొను క్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెలవిచ్చితివి, అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది. అంతట యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నేను యెహోవాను, సర్వశరీ రులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా? కావున యెహోవా ఈమాట సెలవిచ్చుచున్నాడు —ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికిని బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అప్పగింపబోవుచున్నాను; అతడు దాని పట్టుకొనగా ఈ పట్టణము మీద యుద్ధముచేయు కల్దీయులు వచ్చి, యీ పట్టణమునకు అగ్ని ముట్టించి, యే మిద్దెలమీద జనులు బయలునకు ధూపార్పణచేసి అన్యదేవతలకు పానార్పణములనర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటిని కాల్చివేసెదరు.౹ ఏలయనగా ఇశ్రాయేలువారును యూదావారును తమ బాల్యము మొదలుకొని నాయెదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు, తమ చేతుల క్రియవలనవారు నాకు కోపమే పుట్టించువారు; ఇదే యెహోవా వాక్కు.౹ [31-32] నాకోపము రేపుటకు ఇశ్రాయేలువారును యూదావారును వారి రాజులును వారి ప్రధానులును వారి యాజకులును వారి ప్రవక్తలును యూదా జనులును యెరూషలేము నివాసులును చూపిన దుష్‌ప్రవర్తన అంతటినిబట్టి, నా యెదుటనుండి వారి దుష్‌ప్రవర్తనను నేను నివారణచేయ ఉద్దేశించునట్లు, వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను.౹ *** నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధ నంగీకరింపకపోయిరి, వారు నాతట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పు కొనిరి.౹ మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైనవాటిని పెట్టిరి.౹ వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలెనని బెన్‍హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి, ఆలాగు చేయుటకు నేను వారికాజ్ఞాపింప లేదు, యూదావారు పాపములో పడి, యెవరైన నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నా కెన్నడును తోచలేదు. కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమునుగూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు–అది ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను పీడింపబడినదై బబులోనురాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణమునుగూర్చి చెప్పుచున్నారు గదా.౹ ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకముచేతను మహా రౌద్రముచేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలోనుండి వారిని సమకూర్చి యీ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను.౹ వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.౹ మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏకమార్గమును దయచేయుదును.౹ నేను వారికి మేలుచేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.౹ వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను.౹ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను ఈ ప్రజలమీదికి ఇంత గొప్పకీడు రప్పించిన రీతినే నేను వారినిగూర్చి చెప్పిన మేలంతటిని వారిమీదికి రప్పింపబోవుచున్నాను.౹ ఇది పాడై పోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు, ఇది కల్దీయులచేతికి ఇయ్యబడియున్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును.౹ నేను వారిలో చెరపోయినవారిని రప్పింపబోవుచున్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములుకొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్రవేయుదురు, సాక్షులను పెట్టుదురు; ఇదే యెహోవా వాక్కు. మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంక ఉంచబడియుండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.౹ ముట్టడిదిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని యిండ్లన్నియు యూదారాజుల నగరులును శిథిలమై పోయెనుగదా. వాటినిగూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా కల్దీయులతో యుద్ధము చేసి, వారి చెడుతనమునుబట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపముచేత హతులై, తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తికలిగించుటకై వారు వచ్చుచుండగా –నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.౹ చెరలోనుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించుచున్నాను, మొదటనుండినట్లు వారిని స్థాపించుచున్నాను.౹ వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండ వారిని పవిత్రపరతును, వారు నాకు విరోధముగాచేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటిని క్షమించెదను.౹ భూజనులందరియెదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్రకారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు, నేను వారికిచేయు సకల ఉపకారములనుగూర్చిన వర్తమానమును జనులువిని నేను వారికి కలుగజేయు సమస్తక్షేమమునుబట్టియు సమస్తమైన మేలునుబట్టియు భయపడుచు దిగులు నొందుదురు.౹ [10-11] యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే, మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే, సంతోషస్వరమును ఆనంద శబ్దమును పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును–యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును;మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు *** సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —మనుష్యులైనను జంతువులైనను లేక పాడైయున్న యీ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొఱ్ఱెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు.౹ మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్కపెట్టువారిచేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా వాక్కు ఇదే–ఇశ్రాయేలు వంశస్థులనుగూర్చియు యూదా వంశస్థులనుగూర్చియు నేను చెప్పిన మంచిమాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి.౹ ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.౹ ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును.౹ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇశ్రాయేలువారి సింహాసనముమీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు.౹ ఎడతెగక దహనబలులను అర్పించుటకును నైవేద్యముల నర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు.౹ మరియు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగినయెడల నా సేవకుడైన దావీదు సింహాసనముమీద కూర్చుండి రాజ్యపరిపాలనచేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థ మగును; మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజకులతోను నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును.౹ ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును.౹ మరియు యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా.౹ యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు — పగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల భూమ్యాకాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను. బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారముక్రిందనున్న భూరాజ్యములన్నియు జనములన్నియు కూడి యెరూషలేముమీదను దాని పురములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు.౹ –ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు — నీవు వెళ్లి యూదారాజైన సిద్కియాతో ఈలాగు చెప్పుము–యెహోవా సెలవిచ్చునదేమనగా— నేను ఈ పట్టణమును బబులోను రాజుచేతికి అప్పగించుచున్నాను, అతడు మంటపెట్టి దాని కాల్చివేయును.౹ నీవు అతనిచేతిలోనుండి తప్పించుకొనజాలక నిశ్చయముగా పట్టబడి అతనిచేతి కప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులార చూచెదవు, అతడు నీతో ముఖాముఖిగా మాటలాడును, నీవు బబులోనునకు పోవుదువు.౹ యూదా రాజవైన సిద్కియా, యెహోవా మాట వినుము —నిన్నుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —నీవు ఖడ్గమువలన మృతిబొందక నెమ్మదిగానే మృతి బొందెదవు.౹ నీకంటె ముందుగానుండిన పూర్వరాజులైన నీ పితరులకొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు–అయ్యో నా యేలినవాడా, అని నిన్నుగూర్చి అంగలార్చుచు జనులు నీకొరకును ధూపద్రవ్యము కాల్చుదురు; ఆలాగు కావలెనని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ [6-7] యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములుగల పట్టణములుగా మిగిలి యున్నవి, బబులోనురాజు దండు యెరూషలేముమీదను మిగిలిన యూదా పట్టణములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్తయైన యిర్మీయా యెరూషలేములో యూదా రాజైన సిద్కియాకు ఈ మాట లన్నిటిని ప్రకటించుచు వచ్చెను. *** [8-9] యూదులచేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీయులనుగాని హెబ్రీయు రాండ్రనుగాని అందరిని విడిపించునట్లు విడుదలచాటింపవలెనని రాజైనసిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవాయొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు *** –ఆ నిబంధననుబట్టి అందరును తమకు దాస దాసీజనముగా నున్న వారిని విడిపించుదుమనియు, ఇకమీదట ఎవరును వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని, ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరును ప్రజలందరును విధేయులై వారిని విడిపించిరి.౹ అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని, తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీజనులను మరల దాసులుగాను దాసీలుగాను లోపరచుకొనిరి.౹ కావున యెహోవాయొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా— దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నేను మీపితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసితిని.౹ –నీకు అమ్మబడి ఆరుసంవత్సరములు కొలువుచేసిన హెబ్రీయులగు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను; అయితే మీపితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపక పోయిరి.౹ మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకొనియొక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతమని చెప్పి, నా పేరు పెట్టబడిన యీ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి.౹ పిమ్మట మీరు మనస్సు మార్చుకొని నా నామమును అపవిత్రపరచితిరి వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత, అందరును తమ దాసదాసీలను మరల పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపరచుకొంటిరి కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికిని విడుదల ప్రకటింపవలెనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే; ఆలోచించుడి, విడుదల కావలెనని నేనే చాటించుచున్నాను, అది ఖడ్గ క్షామసంకటముల పాలగుటకైన విడుదలయే; భూరాజ్యములన్నిటిలోను ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్ము నప్పగించుచున్నాను.౹ [18-19] మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను; అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారములోని వారిని యాజకులను దేశజనులనందరిని ఆ దూడయొక్క రెండు భాగములమధ్య నడచినవారినందరిని ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను.౹ *** వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచువారి చేతి కిని వారి నప్పగించుచున్నాను, వారి కళేబరములు ఆకాశపక్షులకును భూమృగములకును ఆహారముగా నుండును.౹ యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారిచేతికిని మీయొద్దనుండి వెళ్లిపోయిన బబులోనురాజు దండు చేతికిని అప్పగించుచున్నాను.౹ యెహోవా వాక్కు ఇదే–నేను ఆజ్ఞ ఇచ్చి యీ పట్టణమునకు వారిని మరల రప్పించుచున్నాను, వారు దానిమీద యుద్ధముచేసి దాని పట్టుకొని మంటపెట్టి దాని కాల్చివేసెదరు; మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగానుచేయుదును. యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్దనుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై –నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాటలాడి, యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి, త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవియ్యగా నేను, యిర్మీయా కుమారుడును యజన్యా మనుమడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారుల నందరిని, అనగా రేకాబీయుల కుటుంబికులనందరిని, తోడుకొని వచ్చితిని.౹ యెహోవా మందిరములో దైవ జనుడగు యిగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసికొని వచ్చితిని. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయశేయా గదికి పైగా ఉండెను.౹ నేను రేకాబీయుల యెదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి — ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వారు–మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనా దాబు–మీరైనను మీ సంతతివారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకాజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము.౹ మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్షతోట నాటవద్దు, అది మీకుండనేకూడదు; మీరు పరవాసముచేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నియు గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకాజ్ఞా పించెను.౹ కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటనుబట్టి మేముగాని మా భార్యలుగాని మా కుమారులుగాని మా కుమార్తెలుగాని ద్రాక్షారసము త్రాగుటలేదు.౹ మా తండ్రియైన యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్తమునుబట్టి మేము విధేయులమగు నట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు, ద్రాక్షా వనములుగాని పొలములుగాని సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు గుడారములలోనే నివసించుచున్నాము.౹ అయితే బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ దేశములో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియనులదండునకును భయపడి, మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి. అంతట యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యిలాగు సెలవిచ్చెను–ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా –నీవు వెళ్లి యూదావారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము–యెహోవా వాక్కు ఇదే–మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? యిదే యెహోవా వాక్కు.౹ ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారుల కాజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి, నేటివరకు తమపితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు; అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు.౹ మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీయొద్దకు పంపుచు — ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనినయెడలను, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండినయెడలను, నేను మీకును మీపితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి రేకాబు కుమారుడైన యెహోనా దాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని యీ ప్రజలు నా మాట వినకయున్నారు.౹ కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నేను వారితో మాటలాడితిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరమియ్యకపోయిరి గనుక యూదావారిమీదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని రప్పించెదనని నేను చెప్పిన కీడంతయు వారిమీదికి రప్పించుచున్నాను.౹ మరియు యిర్మీయా రేకాబీయులను చూచి యిట్లనెను–ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు— మీరు మీ తండ్రియైన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటిని గైకొని అతడు మీకాజ్ఞా పించిన సమస్తమును అనుసరించుచున్నారు.౹ కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడునుండక మానడు. యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము నాలుగవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను — నీవు పుస్తకపుచుట్ట తీసికొని నేను నీతో మాటలాడిన దినము మొదలుకొని, అనగా యోషీయా కాలము మొదలుకొని నేటివరకు ఇశ్రాయేలువారినిగూర్చియు యూదావారిని గూర్చియు సమస్త జనములనుగూర్చియు నేను నీతో పలి కిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.౹ నేను యూదావారికి చేయనుద్దేశించు కీడంతటినిగూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో.౹ యిర్మీయా నేరీయా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నిటిని యిర్మీయా నోటిమాటలనుబట్టి ఆ పుస్తకములో వ్రాసెను.౹ యిర్మీయా బారూకునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–నేను యెహోవా మందిరములోనికి రాకుండ నిర్బంధింపబడితిని.౹ కాబట్టి నీవు వెళ్లి ఉపవాసదినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడునట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము, తమ పట్టణములనుండి వచ్చు యూదా జనులందరికిని వినబడునట్లుగా వాటిని చదివి వినిపింపవలెను.౹ ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒక వేళ వారు తమ చెడుమార్గము విడుతురేమో, నిజముగా ఈ ప్రజలమీదికి ఉగ్రతయు మహా కోపమును వచ్చునని యెహోవా ప్రకటించియున్నాడు.౹ ప్రవక్తయైన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరీయా కుమారుడైన బారూకు గ్రంథము చేతపట్టుకొని యెహోవా మాటలన్నిటిని యెహోవా మందిరములో చదివి వినిపించెను. యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏలుబడియందు అయిదవ సంవత్సరము తొమ్మిదవ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరును యూదా పట్టణములలోనుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరును యెహోవాపేరట ఉపవాసము చాటింపగా బారూకు యెహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరు వినునట్లు యిర్మీయా చెప్పిన మాటలను గ్రంథములోనుండి చదివి వినిపించెను.౹ షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మీకాయా ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నిటిని విని రాజనగరులోనున్న లేఖికుని గదిలోనికి వెళ్లగా ప్రధానులందరును లేఖికుడైన ఎలీషామా షెమాయా కుమారుడైన దెలాయ్యా అక్బోరు కుమారుడైన ఎల్నాతాను షాఫాను కుమారుడైన గెమర్యా హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరును అక్కడ కూర్చుండి యుండిరి.౹ బారూకు ప్రజలందరికి వినబడునట్లు ఆ పుస్తకములోనుండి చదివి వినిపించిన మాటలన్నిటిని మీకాయా వారికి తెలియ జెప్పగా ప్రధానులందరు కూషీకి ఇనుమనుమడును షెలెమ్యాకు మనుమడును నెతన్యాకు కుమారుడునైన యెహూదిని బారూకు నొద్దకు పంపి–నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేతపట్టుకొని రమ్మని ఆజ్ఞ నియ్యగా నేరీయా కుమారుడగు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకొని వచ్చెను.౹ అతడు రాగా వారు–నీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారూకు దాని చదివి వినిపించెను.౹ వారు ఆ మాటలన్నిటిని విన్నప్పుడు భయపడి యొకరి నొకరు చూచుకొని–మేము నిశ్చయముగా ఈ మాట లన్నిటిని రాజునకు తెలియజెప్పెదమని బారూకుతో ననిరి.౹ మరియు–ఈ మాటలన్నిటిని అతడు చెప్పుచుండగా నీవు ఎట్లు వ్రాసితివి? అది మాకు తెలియజెప్పుమని వారడుగగా బారూకు–అతడు నోటనుండియే యీ మాటలన్నిటిని పలుకగా నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరమిచ్చెను.౹ నీవును యిర్మీయాయును పోయి దాగియుండుడి, మీరున్నచోటు ఎవరికిని తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి శాలలోనున్న రాజునొద్దకు తామే వెళ్లి ఆ మాటలన్నిటిని రాజు చెవులలో వినిపించిరి గాని ఆ పుస్తకపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి.౹ ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖకుడైన ఎలీ షామా గదిలోనుండి దాని తీసికొని వచ్చి రాజు వినికిడిలోను రాజనొద్దకు నిలిచియున్న అధిపతులందరి వినికిడిలోను దాని చదివెను.౹ తొమ్మిదవ మాసమున రాజు శీత కాలపు నగరులో కూర్చుండియుండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను.౹ యెహూది మూడు నాలుగు పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో నున్న అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయెను గాని రాజైనను ఈ మాట లన్నిటిని వినిన యతని సేవకులలో ఎవరైనను భయపడ లేదు, తమ బట్టలు చింపుకొనలేదు.౹ –గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయ్యాయును గెమర్యాయును రాజుతో మనవిచేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయెను.౹ లేఖకుడైన బారూకును ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు యెరహ్మెయేలునకును అజ్రీయేలు కుమారుడైన శెరాయాకును అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవావారిని దాచెను. యిర్మీయా నోటిమాటనుబట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నీవు మరియొక గ్రంథము తీసికొని యూదారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.౹ మరియు యూదా రాజైన యెహోయాకీమునుగూర్చి నీవీమాట చెప్పవలెను–యెహోవా సెలవిచ్చునదేమనగా–బబులోనురాజు నిశ్చయముగా వచ్చి యీ దేశమును పాడుచేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండ చేయునని ఇందులో నీవేల వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే;౹ అందుచేతను యూదారాజైన యెహోయాకీమునుగూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–దావీదుయొక్క సింహాసనముమీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలునగును.౹ నేను వారి దోషమునుబట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారినిగూర్చి చెప్పిన కీడంతయు వారిమీదికిని యెరూషలేము నివాసులమీదికిని యూదా జనులమీదికిని రప్పించుచున్నాను; అయినను వారు వినినవారుకారు.౹ యిర్మీయా యింకొక గ్రంథమును తీసికొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకుచేతికి అప్పగింపగా అతడు యిర్మీయా నోటిమాటలనుబట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటిని వ్రాసెను; మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. బబులోను రాజైన నెబుకద్రెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యముచేయుచుండెను.౹ అతడైనను అతని సేవకులైనను దేశప్రజలైనను యెహోవా ప్రవక్తయైన యిర్మీయాచేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు. రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహు కలును యాజకుడైన మయశేయా కుమారుడగు జెఫన్యాను ప్రవక్తయైన యిర్మీయాయొద్దకు పంపి–దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుమని మనవిచేసెను.౹ అప్పటికి వారు యిర్మీయాను చెరసాలలో నుంచియుండ లేదు; అతడు ప్రజలమధ్య సంచరించుచుండెను.౹ ఫరో దండు ఐగుప్తులోనుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడివేయుచున్న కల్దీయులు సమాచారము విని యెరూషలేము దగ్గరనుండి బయలుదేరిరి.౹ అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–నాయొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీ వీలాగు చెప్పవలెను–మీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చు చున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్లును.౹ కల్దీయులు తిరిగి వచ్చి యీ పట్టణముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చివేయుదురు.౹ యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–కల్దీయులు నిశ్చయముగా మాయొద్దనుండి వెళ్లెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్లనే వెళ్లరు.౹ మీతో యుద్ధముచేయు కల్దీయుల దండువారినందరిని మీరు హతముచేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలోనుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుటనుండి వెళ్లిపోగా యిర్మీయా బెన్యామీను దేశములో తనవారియొద్ద భాగము తీసికొనుటకై యెరూషలేమునుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా ఇరీయా అను కావలివారి అధిపతి అక్కడ నుండెను. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొని–నీవు కల్దీయులలో చేరబోవుచున్నావని చెప్పగా యిర్మీయా–అది అబద్ధము, నేను కల్దీయులలో చేరబోవుటలేదనెను. అయితే అతడు యిర్మీయామాట నమ్మనందున ఇరీయా యిర్మీయాను పట్టుకొని అధిపతులయొద్దకు తీసికొని వచ్చెను.౹ అధిపతులు యిర్మీయామీద కోపపడి అతని కొట్టి, తాము బందీగృహముగా చేసియున్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి.౹ [16-17] యిర్మీయా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను; పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి, అతని తన యింటికి పిలిపించి–యెహోవాయొద్దనుండి ఏ మాటై నను వచ్చెనా అని యడుగగా యిర్మీయా–నీవు బబులోను రాజుచేతికి అప్పగింపబడెదవను మాటవచ్చెననెను.౹ *** మరియు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇట్లనెను–నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి? బబులోను రాజు మీమీది కైనను ఈ దేశముమీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు? రాజా, నా యేలినవాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్ని ధికి రానిమ్ము, నేను అక్కడ చనిపోకుండునట్లు లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరల పంపకుము.౹ కాబట్టి రాజైన సిద్కియా సెలవియ్యగా బంటులు బందీగృహ శాలలో యిర్మీయాను వేసి, పట్టణములో రొట్టెలున్నంతవరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి; ఇట్లు జరుగగా యిర్మీయా బందీగృహశాలలో నివసించెను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులుచేతనైనను చత్తురు గాని కల్దీయులయొద్దకు బయలు వెళ్లువారు బ్రదుకుదురు, దోపుడుసొమ్ముదక్కించు కొనునట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రదుకుదురు.౹ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ పట్టణము నిశ్చయముగా బబులోనురాజు దండుచేతికి అప్పగింపబడును, అతడు దాని పట్టుకొనును అని యిర్మీయా ప్రజలకందరికి ప్రకటింపగా [3-4] మత్తాను కుమారుడైన షెఫట్యయును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకలును మల్కీయా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగా–ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరు వాడేగాని క్షేమము కోరువాడుకాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనముచేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము.౹ *** అందుకు రాజైన సిద్కియా— అతడు మీవశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా వారు యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను.౹ [7-8] రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటి లోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండుడు, వారు యిర్మీయాను గోతిలో వేసిరను సంగతి విని, రాజు నగరులోనుండి బయలువెళ్లి రాజుతో ఈలాగు మనవి చేసెను *** రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము; అతడున్న చోటను అతడు ఆకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టె లేమియు లేవు.౹ అందుకు రాజు–నీవు ఇక్కడనుండి ముప్పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి, ప్రవక్తయైన యిర్మీయా చావకమునుపు ఆ గోతిలోనుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవియ్యగా [11-12] ఎబెద్మెలెకు ఆ మనుష్యులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి, అచ్చటనుండి పాతవైన చింకిబట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసికొనిపోయి, ఆ గోతిలోనున్న యిర్మీయా పట్టుకొనునట్లుగా త్రాళ్లచేత వాటినిదింపి–పాతవై చిరిగి చీరాకులైన యీ బట్టలను త్రాళ్లమీద నీ చంకలక్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను.౹ *** యిర్మీయా ఆలాగు చేయగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలోనుండి వెలుపలికి తీసిరి; అప్పుడు యిర్మీయా బందీగృహశాలలో నివసించెను. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములోనున్న మూడవ ద్వారములోనికి ప్రవక్తయైన యిర్మీయాను పిలువనంపించి అతనితో ఇట్లనెను–నేను ఒకమాట నిన్నడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాని చెప్పుమనగా యిర్మీయా–నేను ఆ సంగతి నీకు తెలియజెప్పినయెడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు, నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు.౹ కావున రాజైన సిద్కియా–జీవాత్మను మన కనుగ్రహించు యెహోవాతోడు నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచుచున్న యీ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపను అని యిర్మీయాతో రహ స్యముగా ప్రమాణము చేసెను.౹ అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇట్లనెను–దేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీవు బబులోనురాజు అధిపతులయొద్దకు వెళ్లినయెడల నీవు బ్రదికెదవు, ఈపట్టణము అగ్నిచేత కాల్చ బడదు, నీవును నీ యింటివారును బ్రదుకుదురు.౹ అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్లనియెడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్నిచేత దాని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలవు.౹ అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను–కల్దీయుల పక్షముగాఉండు యూదులకు భయపడుచున్నాను; ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించినయెడల వారు నన్ను అపహ సించెదరు.౹ అందుకు యిర్మీయా–వారు నిన్నప్పగింపరు, నీవు బ్రదికి బాగుగానుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతినిగూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము.౹ నీవు ఒకవేళ బయలు వెళ్లక పోయినయెడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను.౹ –యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్ర్రీలు నిన్ను చూచి–నీ ప్రియస్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరనియందురు.౹ నీ భార్యలందరును నీ పిల్లలును కల్దీయులయొద్దకు కొనిపోబడుదురు, నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలక బబులోను రాజుచేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు.౹ అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను–నీవు మరణశిక్ష నొందకుండునట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియనియ్యకుము.౹ నేను నీతో మాటలాడిన సంగతి అధిపతులు వినినయెడల వారు నీయొద్దకు వచ్చి–మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగుచేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా నీవు–యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండ అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసికొనబోతినని వారితో చెప్పుమని రాజు యిర్మీయాతో అనెను.౹ అంతట అధిపతులందరు యిర్మీయాయొద్దకు వచ్చి యడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయ నందునవారు అతనితో మాటలాడుట మానిరి.౹ యెరూషలేము పట్టబడువరకు యిర్మీయా బందీగృహశాలలో ఉండెను. యూదారాజైన సిద్కియా యేలుబడియందు. తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికివచ్చి దాని ముట్టడివేయగా సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవదినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను.౹ యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్‌షరేజరు సమ్గర్నెబో షండుల కధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్‌షరేజరు మొదలైన బబులోనురాజు అధిపతులందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి.౹ యూదులరాజైన సిద్కియాయు అతని యోధులందరును వారినిచూచి పారిపోయి, రాజు తోటమార్గమున రెండు గోడలమధ్యనున్న గుమ్మపుమార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయెను.౹ అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని, రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గర నున్న బబులోను రాజైన నెబుకద్రెజరునొద్దకు వారు సిద్కియాను తీసికొనిపోయిరి బబులోనురాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను, మరియు బబులోనురాజు యూదా ప్రధానులందరిని చంపించెను.౹ అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను.౹ కల్దీయులు రాజనగరును ప్రజలయిండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి.౹ అప్పుడు రాజదేహ సంరక్షకులకధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచియున్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరినవారిని, శేషించిన ప్రజలనందరిని బబులోనునకు కొనిపోయెను.౹ అయితే రాజదేహసంరక్షకులకధిపతియైన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదాదేశములో నుండనిచ్చి, వారికి ద్రాక్షతోటలను పొలములను నియమించెను.౹ [11-12] మరియు యిర్మీయానుగూర్చి బబులోను రాజైన నెబుకద్రెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను–నీవు ఇతనికి హాని చేయక దగ్గరనుంచుకొని పరామర్శించి, ఇతడు నీతో చెప్పునట్లు చేయవలెను.౹ *** కావున రాజదేహసంరక్షకులకు అధిపతియైన నెబూజరదానును షండులకు అధిపతియగు నెబూషజ్బానును జ్ఞానులకు అధిపతియగు నేర్గల్‌షరే జరును బబులోనురాజు ప్రధానులందరును దూతలను పంపి బందీగృహశాలలోనుండి యిర్మీయాను తెప్పించి, అతనిని యింటికి తోడుకొనిపోవుటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతని నప్పగించిరి, అప్పుడతడు ప్రజలమధ్య నివాసముచేసెను. యిర్మీయా బందీగృహశాలలోనుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నీవు వెళ్లి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము–ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మేలుచేయుటకైకాక కీడుచేయుటకై నేను ఈ పట్టణమునుగూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను; నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును.౹ ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యులచేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ నీవు నన్ను నమ్ము కొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను, నీవు ఖడ్గముచేత పడవు, దోపుడుసొమ్ము దక్కించుకొనునట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు; ఇదే యెహోవా వాక్కు. రాజదేహసంరక్షకులకధిపతియైన నెబూజరదాను యెరూషలేములోనుండియు యూదాలోనుండియు బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలోనుండి, సంకెళ్లచేత కట్టబడియున్న యిర్మీయాను తీసికొని రామాలోనుండి పంపివేయగా, యెహోవా యొద్దనుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు.౹ రాజదేహసంరక్షకులకధిపతి యిర్మీయాను అవతలికి తీసికొనిపోయి అతనితో ఈలాగు మాటలాడెను–ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసెదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా.౹ తాను చెప్పిన ప్రకారము యెహోవా దాని రప్పించి చేయించెను, మీరు యెహోవాకు విరోధముగా పాపముచేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకీగతి పెట్టినది.౹ ఆలకించుము, ఈ దినమున నేను నీచేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను, నాతోకూడ బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచినయెడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను; అయితే బబులోనునకు నాతోకూడ వచ్చుట మంచిదికాదని నీకు తోచినయెడల రావద్దు, దేశమంతట నీకేమియు అడ్డములేదు, ఎక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో, యెక్కడికి వెళ్లుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్లుము.౹ ఇంకను అతడు తిరిగి వెళ్లక తడవు చేయగా రాజదేహసంరక్షకులకధిపతి అతనితో ఈలాగు చెప్పెను–బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీ కాము కుమారుడగు గెదల్యాను యూదాపట్టణములమీద నియమించియున్నాడు, అతని యొద్దకు వెళ్లుము; అతని యొద్ద నివసించి ప్రజలమధ్యను కాపురముండుము, లేదా యెక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లుము. మరియు రాజదేహసంరక్షకులకధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా యిర్మీయా మిస్పాలోనుండు అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వెళ్లి అతనితోకూడ దేశములో మిగిలిన ప్రజలమధ్య కాపురముండెను. అయితే అచ్చటచ్చటనుండు సేనల యధిపతులందరును వారి పటాలపువారును, బబులోనురాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశముమీద అధికారిగా నియమించి, బబులోనునకు చెరగొని పోబడక నిలిచినవారిలో స్త్రీలను పురుషులను పిల్లలను, దేశములోని అతినీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి.౹ కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారులైన యోహానాను యోనాతానులును తన్హుమెతు కుమారుడైన శెరాయాయును నెటోపాతీయుడైన ఏపయి కుమారులును మాయ కాతీయుడైనవాని కుమారుడగు యెజన్యాయును వారి పటాలపువారును మిస్పాలోనుండిన గెదల్యాయొద్దకు వచ్చిరి.౹ అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణముచేసి వారితోను వారి పటాలపువారితోను ఈలాగు చెప్పెను–మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి, దేశములో కాపురముండి బబులోనురాజును సేవించినయెడల మీకు మేలు కలుగును.౹ నేనైతేనో నాయొద్దకు వచ్చు కల్దీయుల యెదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును గాని మీరు ద్రాక్షారసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని, మీ పాత్రలలో వాటిని పోసికొని మీరు స్వాధీనపరచుకొనిన పట్టణములలో కాపురముండుడి.౹ మోయాబులోనేమి అమ్మోనీయులమధ్యనేమి ఎదోములోనేమి యే యే ప్రదేశములలోనేమి యున్న యూదులందరు బబులోనురాజు యూదాలో జనశేషమును విడిచెననియు, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారిమీద నియమించెననియు వినినప్పుడు అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు గెదల్యాయొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి. మరియు కారేహ కుమారుడైన యోహానానును, అచ్చ టచ్చటనున్న సేనల యధిపతులందరును మిస్పా లోనున్న గెదల్యాయొద్దకు వచ్చి –నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీసు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీ కాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు.౹ కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను–నీయొద్దకు కూడివచ్చిన యూదులందరు చెదరిపోవునట్లును, యూదా జనశేషము నశించు నట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంప నేల? దయచేసి నన్ను వెళ్లనిమ్ము, ఎవనికి తెలియకుండ నేను వానిని చంపెదను.౹ అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడైన యోహానానుతో–ఇష్మాయేలునుగూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవాకార్యము చేయకూడదనెను. ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజుయొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలనువాడును, అతనితో పదిమంది మనుష్యులును, మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వచ్చి అక్కడ అతనితోకూడ మిస్పాలో భోజనముచేసిరి.౹ అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితోకూడనున్న ఆ పదిమంది మనుష్యులును లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గముచేత హతముచేసిరి; బబులోనురాజు ఆ దేశముమీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి.౹ మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులనందరిని, అక్కడ దొరికిన యోధులగు కల్దీయులను ఇష్మాయేలు చంపెను.౹ అతడు గెదల్యాను చంపిన రెండవనాడు అది ఎవరికిని తెలియబడకమునుపు గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనినయెనుబదిమంది పురుషులు యెహోవా మందిరమునకు తీసికొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెము నుండియు షిలోహునుండియు షోమ్రోనునుండియు రాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు, వారిని ఎదుర్కొనుటకు మిస్పాలోనుండి బయలు వెళ్లి వారిని కలిసికొని వారితో–అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండనెను.౹ అయితే వారు ఆ పట్టణముమధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితోకూడ ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి.౹ అయితే వారిలో పదిమంది మనుష్యులు ఇష్మాయేలుతో–పొలములలో దాచబడిన గోధుమలు యవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మును చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతోకూడ వారిని చంపక మానెను.౹ ఇష్మాయేలు గెదల్యాతోకూడ చంపిన మనుష్యుల శవములన్నిటిని పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలురాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే; నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడినవారి శవములతో దాని నింపెను.౹ అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేష మంతటిని రాజ కుమార్తెలనందరిని అనగా రాజదేహసంరక్ష కుల కధిపతియైన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరిని, చెరతీసికొనిపోయెను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసికొనిపోయి అమ్మోనీయులయొద్దకు చేరవలెనని ప్రయత్నపడుచుండగా కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనాధిపతులందరును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములనుగూర్చిన వార్త విని పురుషులనందరిని పిలుచుకొని, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి, గిబియోనులోనున్న మహా జలముల దగ్గర అతని కలిసికొనిరి.౹ ఇష్మాయేలుతోకూడనున్న ప్రజలందరు కారేహ కుమారుడైన యోహానానును, అతనితోకూడనున్న సేనాధిపతులనందరిని చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయేలు మిస్పాలోనుండి చెరగొనిపోయిన ప్రజలందరు అతని విడిచి కారేహ కుమారుడైన యోహానానుతో కలిసిరి.౹ అయినను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎనమండుగురు మనుష్యులును యోహానాను చేతిలోనుండి తప్పించుకొని అమ్మోనీయుల యొద్దకు పారిపోయిరి.౹ [16-18] అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత, కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనల యధిపతులందరును మిస్పాదగ్గరనుండి ఇష్మాయేలు నొద్దనుండి జనశేషమంతటిని, అనగా గిబియోను దగ్గరనుండి ఇష్మాయేలుకొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను, రాజపరివారమును మరల రప్పించిరి; అయితే వారు బబులోనురాజు దేశముమీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందునవారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్లుదమనుకొని బేత్లెహేముదగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి. అంతలో సేనాధిపతులందరును కారేహ కుమారుడైన యోహానానును హోషేయా కుమారుడైన యెజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరును ప్రవక్తయైన యిర్మీయా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవి చేసిరి –మేము ఎంత కొంచెము మంది మిగిలియున్నామో నీవు చూచుచున్నావు గదా? చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి, శేషించియున్న మా యందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థనచేయుము.౹ మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక.౹ కాగా ప్రవక్తయైన యిర్మీయా వారికి ఉత్తరమిచ్చినదేమనగా–మీరు చేసిన మనవి నేనంగీకరించుచున్నాను, మీ మాటలనుబట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును, ఏమియు మీకు మరుగుచేయక యెహోవా మిమ్మునుగూర్చి సెలవిచ్చునదంతయు మీకు తెలియజేతును.౹ అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లనిరి–నిన్ను మా యొద్దకు పంపి, నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలనుబట్టి మరుమాటలేకుండ మేము జరిగించని యెడల యెహోవా మామీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక.౹ మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట విను వారమై, అది మేలేగాని కీడేగాని మేము ఆయనయొద్దకు నిన్ను పంపువిషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము. పది దినములైన తరువాత యెహోవా వాక్కు యిర్మీ యాకు ప్రత్యక్షమాయెను గనుక అతడు కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనలయధపతులనందరిని, అల్పులనేమి ఘనులనేమి ప్రజలనందరిని పిలిపించి వారితో ఇట్లనెను –ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా? ఆయన సెలవిచ్చునదేమనగా –నేను మీకు చేసిన కీడునుగూర్చి సంతాపమొందియున్నాను, మీరు తొందరపడక యీ దేశములో కాపురమున్నయెడల, పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెల్లగింపక నాటెదను.౹ మీరు బబులోనురాజునకు భయపడుచున్నారే; అతనికి భయపడకుడి, అతనిచేతిలోనుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై యున్నాను, అతనికి భయపడకుడి,౹ మరియు అతడు మీయెడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీయెడల నేనతనికి జాలి పుట్టించెదను.౹ [13-14] అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట విననివారై యీ దేశమందు కాపురముండక–మనము ఐగుప్తు దేశమునకు వెళ్లుదము, అక్కడ యుద్ధము చూడకయు బూరధ్వని వినకయు ఆహారపు లేమిచేత ఆకలిగొనకయు నుందుము గనుక అక్కడనే కాపురముందమని మీరనుకొనినయెడల *** యూదావారిలో శేషించినవారలారా, యెహోవా మాట ఆలకించుడి; ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఐగుప్తునకు వెళ్లవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండు టకు మీరు వెళ్లినయెడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టుకొనును; మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలిసికొనును, అక్కడనే మీరు చత్తురు,౹ నేను వారిమీదికి రప్పించు కీడునుండి వారిలో శేషించువాడైనను తప్పించుకొనువాడైనను ఉండడు, ఐగుప్తులో నివసింపవలెనని అక్కడికి వెళ్ల నిశ్చయించుకొను మనుష్యులందరు ఖడ్గముచేతను క్షామముచేతను తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు.౹ ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నాకోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసులమీదికి వచ్చినట్లు, మీరు ఐగుప్తునకు వెళ్లినయెడల నా ఉగ్రత మీమీదికిని వచ్చును, మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు, ఈ స్థలమును మరి యెప్పుడును చూడరు.౹ యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్లకూడదని యెహోవా మీకాజ్ఞనిచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్య మిచ్చితినని మీరే నిశ్చయముగా తెలిసికొనుచున్నారు.౹ మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థనచేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియ జెప్పినయెడల మేమాలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు.౹ నేడు నేను మీకు దాని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీయొద్దకు నాచేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి.౹ కాబట్టి కాపురముండవలెనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను చత్తురని నిశ్చయముగా తెలిసికొనుడి. అతడు ప్రజలకందరికి ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము యిర్మీయా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటిని వారికి ప్రకటించి చాలింపగా హోషేయా కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరును యిర్మీయాతో ఇట్లనిరి–నీవు అబద్ధము పలుకుచున్నావు–ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ల కూడ దని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.౹ మమ్మును చంపుటకును, బబులోనునకు చెరపట్టుకొని పోవుటకును, కల్దీయులచేతికి మమ్మును అప్పగింపవలెనని నేరీయా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు. (అని చెప్పిరి) కాగా కారేహ కుమారుడైన యోహానానును సేనలయధిపతులందరును ప్రజలందరును యూదాదేశములో కాపురముండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి.౹ [5-6] మరియు కారేహ కుమారుడైన యోహానానును సేనల యధిపతులందరును యెహోవా మాట విననివారై, యూదాదేశములో నివసించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును, అనగా రాజదేహసంరక్షకులకధిపతియగు నెబూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తయగు యిర్మీయాను నేరీయా కుమారుడగు బారూకును తోడుకొనిపోయి *** ఐగుప్తుదేశములో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా –యెహోవా వాక్కు తహపనేసులో యిర్మీయాకు ప్రత్యక్షమై యిలాగు సెలవిచ్చెను –నీవు పెద్ద రాళ్లను చేతపట్టుకొని, యూదా మనుష్యులు చూచుచుండగా తహపనేసులో నున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకీమాట ప్రకటింపుము –ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను పిలువనంపించి తీసికొనివచ్చి, నేను పాతిపెట్టిన యీ రాళ్లమీద అతని సింహాసనము ఉంచెదను, అతడు రత్నకంబళిని వాటిమీదనే వేయిం చును.౹ అతడువచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగు లునకును, చెరకు నిర్ణయమైనవారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైనవారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీ యులను హతముచేయును.౹ ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజ బెట్టుచున్నాను, వాటిని నెబుకద్రెజరు కాల్చివేయును, ఆ దేవతలను చెరగొనిపోవును, గొఱ్ఱెలకాపరి తన వస్త్రమును చుట్టుకొనునట్లు అతడు ఐగుప్తుదేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడనుండి సాగి పోవును.౹ అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతాపట్టణములోని సూర్యప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును. మిగ్దోలులోగాని తహపనేసులోగాని నొపులోగాని పత్రోసులోగాని ఐగుప్తుదేశవాసముచేయుచున్న యూదులనందరినిగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే యున్నారు.౹ మీరైనను మీపితరులైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయుచు వచ్చుటవలన వాటి నివాసులు తాము చేసికొనిన దోషముచేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులులేకుండ అవి పాడుపడి యున్నవి గదా.౹ మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని వారు ఆలకింపక పోయిరి, అన్యదేవతలకు ధూపార్పణముచేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడువకపోయిరి చెవి యొగ్గకపోయిరి.౹ కావున నా ఉగ్రతయు నాకోపమును కుమ్మరింపబడి, యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను రగులుకొనెను, గనుక నేడున్నట్లుగా అవి పాడై యెడారి ఆయెను.౹ కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు అజ్ఞ ఇచ్చుచున్నాడు–ఏమియు శేషములేకుండ స్త్రీ పురుషులును శిశువులును చంటిబిడ్డలును యూదా మధ్యనుండకుండ నిర్మూలముచేయబడునట్లుగా మీరేల ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసికొనుచున్నారు? మీకు మీరే సమూలనాశనము తెచ్చుకొనునట్లును, భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణపాలై తిరస్క రింపబడునట్లును, మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్యదేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేల యీలాగున చేయుచు మీ చేతిక్రియలచేత నాకు కోపము పుట్టించుచున్నారు? వారు యూదాదేశములోను యెరూషలేము వీధులలోను జరిగించిన క్రియలను అనగా మీపితరులు చేసిన చెడుతనమును యూదారాజులు చేసిన చెడుతనమును వారి భార్యలు చేసిన చెడుతనమును, మీమట్టుకు మీరు చేసిన చెడుతనమును మీ భార్యలు చేసిన చెడుతనమును మరచి పోతిరా? నేటివరకు వారు దీనమనస్సు ధరింపకున్నారు, భయము నొందకున్నారు, నేను మీకును మీపితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే యున్నారు.౹ [11-12] కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీకు కీడుచేయునట్లు, అనగా యూదావారినందరిని నిర్మూలము చేయునట్లు, నేను మీకు అభిముఖుడనగుదును; ఐగుప్తు దేశములో కాపురముందుమని అచ్చటికి వెళ్ల నిశ్చయించు కొను యూదాశేషులను నేను తోడుకొని పోవుదును, వారందరు ఐగుప్తు దేశములోనే నశించెదరు; అల్పులేమి ఘనులేమి వారందరు కూలుదురు, ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను నశింతురు, ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను వారు చత్తురు, శాపాస్పదమును భీతి పుట్టించు వారుగాను దూషణపాలుగాను తిరస్కారము నొందినవారుగాను ఉందురు.౹ *** యెరూషలేము నివాసులను నేనేలాగు శిక్షించితినో ఆలాగే ఐగుప్తుదేశములో నివసించు వీరిని ఖడ్గముచేతగాని క్షామముచేతగాని తెగులుచేతగాని శిక్షించెదను.౹ కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారిపోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు. [15-16] అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని యెరిగియున్న పురుషులందరును, అక్కడ నిలిచియున్న స్త్రీలును, మహా సమాజముగా కూడినవారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చిరి–యెహోవా నామమునుబట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము,౹ *** మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చ బోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.౹ మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గముచేతను క్షామముచేతను క్షీణించుచున్నాము.౹ మేము ఆకాశ రాణికి ధూపము వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను, మా పురుషుల సెలవులేకుండ ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా? ఆమెకు పానార్పణములు పోయుచున్నామా? అని వారు చెప్పగా యిర్మీయా ఆ స్త్రీ పురుషులందరితో, అనగా తనకు అట్లు ప్రత్యుత్తర మిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును మీపితరులును మీ రాజులును మీ యధిపతులును దేశప్రజలును ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకముచేసికొనలేదా? అదే గదా ఆయన మనస్సునకు వచ్చెను.౹ యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరుచేయు హేయకృత్యములను ఎంచి యికను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను.౹ యెహోవా మాట వినక, ఆయన ధర్మశాస్త్రమునుబట్టియు కట్టడలనుబట్టియు ఆయన తనకు సాక్ష్యార్థముగా ఇచ్చిన ఆజ్ఞనుబట్టియు నడువక, మీరు ధూపమువేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. మరియు యిర్మీయా ప్రజలనందరిని స్త్రీలనందరిని చూచి వారితో ఇట్లనెను–ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి.౹ ఇశ్రాయేలు దేవుడును, సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు — ఆకాశరాణికి ధూపము వేయుదుమనియు, ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు, మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలును మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే; నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు.౹ కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవా మాటవినుడి–యెహోవా సెలవిచ్చునదేమనగా —ప్రభువగు యెహోవా అను నేను నా జీవముతోడు ప్రమాణముచేయుచు, ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరును ఇకమీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణము చేయుచున్నాను.౹ మేలుచేయుటకు కాక కీడుచేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను; వారు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను క్షీణించిపోవుచు, ఐగుప్తుదేశములోనున్న యూదావారందరు శేషములేకుండ చత్తురు.౹ ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తుదేశములోనుండి యూదాదేశమునకు తిరిగి వచ్చెదరు, అప్పుడు ఐగుప్తుదేశములో కాపురముండుటకు వెళ్లిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలిసికొందురు.౹ మీకు కీడు సంభవించునట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును, నేను ఈ స్థలమందు మిమ్మును శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా నుండును; ఇదే యెహోవా వాక్కు.౹ అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన నెబుకద్రెజరను బబులోను రాజుచేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తురాజైన ఫరోహొఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచువారి చేతికి అప్పగించెదను. యూదారాజును యోషీయా కుమారుడునైన. యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున యిర్మీయా నోటిమాటనుబట్టి నేరీయా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్తయైన యిర్మీయా అతనితో చెప్పినది –బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్నుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు –కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను అని నీవనుకొనుచున్నావు.౹ నీవు అతనికి ఈ మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు — నేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించుచున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పు చున్నాను.౹ నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకు చున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్లు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను; ఇదే యెహోవా వాక్కు. అన్యజనులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు. ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఐగుప్తునుగూర్చిన మాట, అనగా యోషీయా కుమారు డును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసునదిదగ్గర ఓడించిన ఫరోనెకో దండునుగూర్చిన మాట. డాలును కేడెమును స్థిరపరచుకొనుడి యుద్ధమునకు రండి గుఱ్ఱములను కట్టుడి, రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకొనుడి ఈటెలకు పదును పెట్టుడి కవచములు వేసికొనుడి. నాకేమి కనబడుచున్నది?వారు ఓడిపోవుచున్నారు వెనుకతీయుచున్నారు వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు తిరిగిచూడక వేగిరముగా పారిపోవుచున్నారు ఎటుచూచిన భయమే; యెహోవా మాట యిదే. త్వరగ పరుగెత్తువారు పారిపోజాలకున్నారు బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు ఉత్తరదిక్కున యూఫ్రటీసు నదీతీరమందువారు తొట్రిల్లిపడుచున్నారు. నైలునదీప్రవాహమువలె వచ్చు నితడెవడు? ఇతని జలములు నదులవలె ప్రవహించుచున్నవి ఐగుప్తీయుల దండు నైలునదివలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణకునట్లుగా అది వచ్చుచున్నది. –నేనెక్కి భూమిని కప్పెదను పట్టణమును దాని నివాసులను నాశనము చేసెదను. గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి బలాఢ్యులారా, బయలుదేరుడి డాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును విలుకాండైన లూదీయులును బయలుదేరవలెను. ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహో వాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండనచేయును ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసునదియొద్ద ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలి జరి గింప బోవుచున్నాడు. ఐగుప్తుకుమారీ, కన్యకా, గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకొనుము విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కలుగదు నీకు సిగ్గుకలిగిన సంగతి జనములకు వినబడెను నీ రోదనధ్వని దేశమందంతట వినబడుచున్నది బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుచున్నారు ఒకనిమీద ఒకడు పడి అందరు కూలుదురు. బబులోను రాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతముచేయుటనుగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నొపులోను తహపనేసులోను ప్రకటనచేయుడి ఏమనగా–ఖడ్గము నీ చుట్టునున్న ప్రదేశములను మ్రింగివేయుచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి. నీలో బలవంతులైన వారేల తుడుపు పెట్టబడుచున్నారు? యెహోవావారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు. ఆయన అనేకులను తొట్రిల్ల జేయుచున్నాడు వారొకనిమీద ఒకడు కూలుచు –లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి మన స్వజనులయొద్దకు మన జన్మభూమికి వెళ్లుదము రండి అని వారు చెప్పుకొందురు. ఐగుప్తురాజగు ఫరో యుక్తసమయము పోగొట్టుకొను వాడనియు వట్టిధ్వని మాత్రమేయని వారచ్చట చాటించిరి. పర్వతములలో తాబోరు ఎట్టిదో సముద్రప్రాంతములలో కర్మెలు ఎట్టిదో నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును రాజును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నొపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసినవాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తరదిక్కుననుండి జోరీగ వచ్చుచున్నది వచ్చే యున్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు వారేగదా వెనుకతట్టు తిరిగిరి యొకడును నిలువకుండ పారిపోయిరివారి ఆపద్దినము వచ్చియున్నది శిక్షాదినము వారికాసన్నమాయెను. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు మ్రానులు నరుకువారివలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది యెహోవా వాక్కు ఇదే— లెక్కలేనివారై మిడతలకన్న విస్తరింతురు చొర శక్యముకాని ఆమె అరణ్యమును నరికివేయు దురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును ఉత్తరదేశస్థులకు ఆమె అప్పగింపబడును ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నోలోనుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని నాశ్రయించువారిని నేను దండించు చున్నాను. వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబు కద్రెజరుచేతికిని అతని సేవకులచేతికిని వారిని అప్పగించుచున్నాను ఆ తరువాత అదిమునుపటివలెనే నివాసస్థలమగును ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము ఇశ్రాయేలూ, జడియకుము దూరములోనుండి నిన్ను రక్షించుచున్నానువారున్న చెరలోనుండి నీ సంతతివారిని రక్షించు చున్నాను ఎవరి భయమునులేకుండ యాకోబు తిరిగివచ్చును అతడు నిమ్మళించి నెమ్మదినొందును. నా సేవకుడవైన యాకోబూ, నేను నీకు తోడై యున్నాను భయపడకుము నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనముచేసెదను అయితే నిన్ను సమూల నాశనముచేయను నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమునుబట్టి నిన్ను శిక్షించెదను ఇదే యెహోవా వాక్కు. ఫరో గాజాను కొట్టకమునుపు ఫిలిష్తీయులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు –యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —జలములు ఉత్తరదిక్కునుండి పొర్లి వరదలై మనుష్యులు మొఱ్ఱపెట్టునట్లుగాను దేశనివాసులందరు అంగలార్చునట్లుగాను, దేశముమీదను అందున్న సమస్తముమీదను పట్టణము మీదను దానిలో నివసించువారిమీదను ప్రవహించును.౹ వారి బలమైన గుఱ్ఱముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లలతట్టు తిరిగి చూడరు.౹ ఫిలిష్తీయులనందరిని లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండ అందరిని నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును,౹ గాజా బోడియాయెను, మైదానములో శేషించిన అష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్లవరకు నిన్ను నీవే గాయపరచుకొందువు? యెహోవా ఖడ్గమా, యెంతవరకు విశ్రమింపక యుందువు? నీ వరలోనికి దూరి విశ్ర మించి ఊరకుండుము.౹ అష్కెలోనుమీదికిని సముద్ర తీరముమీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గదా; నీవేలాగు విశ్రమించుదువు? —అచ్చ టికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. మోయాబునుగూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు. –నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు. హెష్బోనులో వారు–అది ఇకను జనము కాకపోవు నట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడుచేయనుద్దేశించుచున్నారు మద్మేనా, నీవును ఏమియు చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది. ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభ వించుచున్నది. మోయాబు రాజ్యము లయమై పోయెను దాని బిడ్డల రోదనధ్వని వినబడుచున్నది. హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదనధ్వని వినబడుచున్నది జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు ఏడ్చుచు ఎక్కుచున్నారు. పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి అరణ్యములోని అరుహవృక్షమువలె ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ముకొంటివి నీవును పట్టుకొనబడెదవు, కెమోషుదేవత చెరలోనికిపోవును ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చునట్లు సంహారకుడు ప్రతి పట్టణముమీదికి వచ్చును ఏ పట్టణమును తప్పించుకొనజాలదు లోయ కూడ నశించును మైదానము పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి యెవడునులేకుండ దాని పట్టణములు పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక రక్తము ఓడ్చకుండ ఖడ్గము దూయువాడు శాపగ్రస్తు డగును గాక. మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను ఈకుండలోనుండి ఆకుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది దాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –రాగల దినములలో నేను దానియొద్దకు కుమ్మరించు వారిని పంపెదను.వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితిచేసివారి జాడీలను పగులగొట్టెదరు. ఇశ్రాయేలువారు తామాశ్రయించిన బేతేలునుబట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులును కెమోషునుబట్టి సిగ్గుపడుచున్నారు –మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు? మోయాబు పాడైపోవుచున్నది శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు వారి యౌవనులలో శ్రేష్ఠులు వధకు పోవుచున్నారు సైన్యములకధిపతియగు యెహోవా అను పేరుగల రాజు సెలవిచ్చినమాట యిదే. మోయాబునకు సమూలనాశనము సమీపించుచున్నది దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దానిచుట్టునున్న మీరందరు దానినిగూర్చి అంగలార్చుడి దాని కీర్తినిగూర్చి విననివారలారా, అంగలార్చుడి బలమైన రాజదండము ప్రభావముగల రాజదండము విరిగిపోయెనే యని చెప్పుకొనుడి. దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు చున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము ఎండినదేశములో కూర్చుండుము. ఆరోయేరు నివాసీ, త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవుచున్న వారియొద్ద విచారించుము తప్పించుకొనిపోవుచున్నవారిని అడుగుము ఏమి జరిగినదో వారివలన తెలిసికొనుము. మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది యున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును నెబోకును బేత్–దిబ్లాతయీమునకును కిర్యతాయిమున కును బేత్గామూలునకును బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు మోయాబుదేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడి యున్నది. మోయాబు శృంగము నరికివేయబడియున్నది దాని బాహువు విరువబడియున్నది యెహోవా వాక్కు ఇదే. మోయాబు యెహోవాకు విరోధముగా తన్నుతాను గొప్పచేసికొనెను దాని మత్తిల్లజేయుడి మోయాబు తన వమనములో పొర్లుచున్నది అది అపహాస్యమునొందును. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతనిగూర్చి పలుకునప్పుడెల్ల తల ఆడించుచు వచ్చితివి మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వలవలె కొండలో కాపురముండుడి. [29-30] మోయాబీయుల గర్వమునుగూర్చి వింటిమి,వారు బహు గర్వపోతులు వారి అతిశయమునుగూర్చియు గర్వమునుగూర్చియు అహంకారమునుగూర్చియు పొగరునుగూర్చియు మాకు సమాచారము వచ్చెనువారి తామసమును వచించరాని వారి ప్రగల్భము లును నాకు తెలిసేయున్నవి చేయదగని క్రియలువారు బహుగా చేయుచున్నారు ఇదే యెహోవా వాక్కు *** కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చు చున్నాను మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నానువారు కీర్హరెశు జనులు లేకపోయిరని మొఱ్ఱపెట్టుచున్నారు. సిబ్మా ద్రాక్షవల్లీ, యాజెరునుగూర్చిన యేడ్పును మించునట్లు నేను నిన్నుగూర్చి యేడ్చుచున్నాను నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అవి యాజెరుసముద్రమువరకు వ్యాపించెను నీ వేసవికాల ఫలములమీదను ద్రాక్షగెలలమీదను పాడుచేయువాడు పడెను. ఫలభరితమైన పొలములోనుండియు మోయాబు దేశములోనుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్షగానుగలలో ద్రాక్షారసమునులేకుండచేయు చున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయెను. నిమ్రీములో నీళ్లు సహితము ఎండిపోయెను హెష్బోను మొదలుకొని ఏలాలేవరకును యాహసు వరకును సోయరు మొదలుకొని హొరొనయీమువరకును ఎగ్లాత్షాలిషావరకును జనులు కేకలువేయుచున్నారు. ఉన్నతస్థలమున బలులు అర్పించువారిని దేవతలకు ధూపమువేయువారిని మోయాబులోలేకుండజేసెను ఇదే యెహోవా వాక్కు. వారు సంపాదించినదానిలో శేషించినది నశించి పోయెను మోయాబునుగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె నాదము చేయుచున్నది కీర్హరెశెతువారినిగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె వాగుచున్నది. నిశ్చయముగా ప్రతి తల బోడియాయెను ప్రతి గడ్డము గొరిగింపబడెను చేతులన్నిటిమీద నరుకులును నడుములమీద గోనెపట్టయు నున్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటిమీదను దాని వీధులలోను అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టునట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను ఇదే యెహోవా వాక్కు. అంగలార్చుడి మోయాబు సమూలధ్వంసమాయెను మోయాబూ, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టునున్న వారికందరికి అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును. యెహోవా సెలవిచ్చునదేమనగా –పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడియున్నవి దుర్గములు పట్టబడి యున్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును. మోయాబు యెహోవాకంటె గొప్పవాడనని అతిశయ పడగా అది జనము కాకుండ నిర్మూలమాయెను. మోయాబు నివాసీ, భయమును గుంటయు ఉరియు నీమీదికి వచ్చియున్నవి ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో పడుదురు గుంటలోనుండి తప్పించుకొనువారు ఉరిలో చిక్కు కొందురు మోయాబుమీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులగువారు బలహీనులై హెష్బోను నీడలో నిలిచియున్నారు. హెష్బోనులోనుండి అగ్నియు సీహోను మధ్యనుండి జ్వాలలును బయలుదేరి మోయాబు శిరస్సును, సందడిచేయువారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబూ, నీకు శ్రమ కెమోషుజనులు నశించియున్నారు నీ కుమారులు చెరపట్టబడిరి చెరపట్టబడినవారిలో నీ కుమార్తెలున్నారు. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబువారిని నేను తిరిగి రప్పించెదను ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబునుగూర్చిన శిక్షావిధి ముగిసెను. అమ్మోనీయులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయెనా? మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు? కాగా–యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు–రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదికి వచ్చు యుద్ధముయొక్క ధ్వని వినబడజేసెదను; అది పాడుదిబ్బ యగును, దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును, దాని వారసులకు ఇశ్రాయేలీయులు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ హెష్బోనూ, అంగలార్చుము, హాయి పాడాయెను, మల్కోమును అతని యాజకులును అతని యధిపతులును చెరలోనికి పోవు చున్నారు; రబ్బా నివాసినులారా, కేకలువేయుడి, గోనెపట్ట కట్టుకొనుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి.౹ విశ్వాసఘాతకురాలా–నా యొద్దకు ఎవడును రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసికొన్నదానా,౹ నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని, నీవేల నీ లోయలనుగూర్చి యతిశయించుచున్నావు? ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను నీ చుట్టునున్న వారందరివలన నీకు భయము పుట్టించుచున్నాను; మీరందరు శత్రువుని కెదురుగా తరుమబడుదురు, పారిపోవువారిని సమకూర్చు వాడొకడును లేక పోవును, అటుతరువాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. సైన్యములకధిపతియగు యెహోవా ఎదోమునుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు — తేమానులో జ్ఞానమిక నేమియులేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయెనా? వారి జ్ఞానము వ్యర్థమాయెనా? ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను; దదానీయులారా, పారిపోవుడి వెనుకకు మళ్లుడి బహులోతున దాగు కొనుడి.౹ ద్రాక్షపండ్లు ఏరువారు నీయొద్దకు వచ్చినయెడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చినయెడల తమకు చాలునంత దొరుకువరకు నష్టము చేయుదురు గదా? నేను ఏశావును దిగంబరినిగా చేయుచున్నాను, అతడు దాగియుండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను, అతని సంతానమును అతని స్వజాతివారును అతని పొరుగువారును నాశన మగుచున్నారు, అతడును లేకపోవును.౹ అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.౹ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు — న్యాయముచేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే, నీవుమాత్రము బొత్తిగా శిక్షనొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు.౹ బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణములన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ యెహోవా యొద్దనుండి నాకు వర్తమానము వచ్చెను; జనముల యొద్దకు దూత పంపబడి యున్నాడు, కూడికొని ఆమెమీదికి రండి యుద్ధమునకు లేచి రండి.౹ జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను.౹ నీవు భీకరు డవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నతస్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.౹ ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు.౹ సొదొమయు గొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బసచేయడు.౹ చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములోనుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దాని యొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్న వాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింప గల కాపరియేడి? ఎదోమునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులనుగూర్చి ఆయన ఉద్దేశించినదాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాస స్థలము వారినిబట్టి ఆశ్చర్యపడును.౹ వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను; భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎఱ్ఱసముద్రముదనుక వినబడెను.౹ శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు; ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును. దమస్కునుగూర్చిన వాక్కు. –హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గు పడుచున్నవి అవి పరవశములాయెను సముద్రముమీద విచారము కలదు దానికి నెమ్మదిలేదు. దమస్కు బలహీనమాయెను. పారిపోవలెనని అది వెనుకతీయుచున్నది వణకు దానిని పట్టెను ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాసవేదనలు దానిని పట్టెను. ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడువబడెను నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడువ బడెను. ఆమె యౌవనులు ఆమె వీధులలో కూలుదురు ఆ దినమున యోధులందరు మౌనులైయుందురు ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను అది బెన్హదదు నగరులను కాల్చివేయును. బబులోను రాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును గూర్చియు హాసోరు రాజ్యములనుగూర్చియు యెహోవా సెల విచ్చినమాట –లేచి కేదారునకు వెళ్లుడి తూర్పుదేశస్థులను దోచు కొనుడి. వారి గుడారములను గొఱ్ఱెల మందలను శత్రువులు కొనిపోవుదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టు కొందురు నఖముఖాల భయమని వారు దానిమీద చాటింతురు హాసోరు నివాసులారా, బబులోను రాజైన నెబు కద్రెజరు మీమీదికి రావలెనని ఆలోచనచేయు చున్నాడు మీమీద పడవలెనను ఉద్దేశముతో ఉన్నాడు యెహోవా వాక్కు ఇదే –పారిపోవుడి బహులోతున వెళ్లుడి అగాధస్థలములలో దాగుడి మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనముమీద పడుడి. వారి ఒంటెలు దోపుడుసొమ్ముగా ఉండునువారి పశువులమందలు కొల్లసొమ్ముగా ఉండును గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొనువారిని నఖముఖాల చెదరగొట్టుచున్నాను నలుదిక్కులనుండి ఉపద్రవమును వారిమీదికి రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు, హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థల ముగా ఉండును అక్కడ ఏ మనుష్యుడును కాపురముండడు ఏ నరుడును దానిలో బసచేయడు. [34-35] యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామునుగూర్చి ఈలాగు సెలవిచ్చెను–సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా–నేను ఏలాముయొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను.౹ *** నలుదిశలనుండి నాలుగు వాయువులను ఏలాముమీదికి రప్పించి, నలుదిక్కులనుండి వచ్చు వాయు వులవెంట వారిని చెదరగొట్టుదును, వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు.౹ మరియు వారి శత్రువులయెదుటను వారి ప్రాణము తీయజూచు వారియెదుటను ఏలామును భయపడజేయుదును, నా కోపాగ్నిచేత కీడును వారి మీదికి నేను రప్పించుదును, వారిని నిర్మూలము చేయువరకు వారివెంట ఖడ్గము పంపు చున్నాను; ఇదే యెహోవా వాక్కు.౹ నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములోనుండి రాజును అధిపతులను నాశనముచేయుదును; ఇదే యెహోవా వాక్కు.౹ అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరల రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. బబులోనునుగూర్చియు కల్దీయుల దేశమునుగూర్చియు ప్రవక్తయైన యిర్మీయాద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు –జనములలో ప్రకటించుడి సమాచారము తెలియజేయుడి ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి బబులోను పట్టబడును బేలు అవమానము నొందును మెరోదకు నేల పడవేయబడును బబులోను విగ్రహములు అవమానము నొందును దాని బొమ్మలు బోర్లద్రోయబడును ఉత్తరదిక్కునుండి దానిమీదికి ఒక జనము వచ్చుచున్నది ఏ నివాసియులేకుండ అది దాని దేశమును పాడు చేయును మనుష్యులేమి పశువులేమి అందరును పారిపోవుదురు అందరును తరలిపోవుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలువారును యూదావారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవాయొద్ద విచారించుటకై వచ్చెదరు ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సీయోనుతట్టు అభిముఖులై అచ్చటికి వెళ్లు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవతప్పిన గొఱ్ఱెలుగా ఉన్నారువారి కాపరులు కొండలమీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి జనులు కొండకొండకు వెళ్లుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. కనుగొనినవారందరు వారిని భక్షించుచు వచ్చిరివారి శత్రువులు–మేము అపరాధులము కాము వీరు న్యాయమునకు నివాసమును తమపితరులకు నిరీక్షణాధారమునగు యెహోవామీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురు. బబులోనులోనుండి పారిపోవుడి కల్దీయులదేశములోనుండి బయలువెళ్లుడి మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి. ఉత్తరదేశమునుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దానిమీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారు వారి మధ్యనుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడుసొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును. కల్దీయుల దేశము దోపుడుసొమ్మగును దాని దోచుకొను వారందరు సంతుష్టి నొందెదరు ఇదే యెహోవా వాక్కు. నా స్వాస్థ్యమును దోచుకొనువారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడిచేయుచు పెయ్యవలె గంతులువేయుచు బలమైన గుఱ్ఱములవలె మీరు సకిలించుచున్నారే? మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మును కన్నది తెల్ల బోవును ఇదిగో అది జనములన్నిటిలో అతినీచ జనమగును అది యెడారియు ఎండినభూమియు అడవియునగును. యెహోవా రౌద్రమునుబట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నియు చూచి–ఆహా నీకీగతి పెట్టి నదా? అందురు ఆమె యెహోవాకు విరోధముగా పాపముచేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు యుద్ధపంక్తులు తీర్చుడి ఎడతెగక దానిమీద బాణములు వేయుడి చుట్టు కూడి దానినిబట్టి కేకలువేయుడి అది లోబడ నొప్పుకొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి ఇది యెహోవాచేయు ప్రతికారము. దానిమీద పగతీర్చుకొనుడి అది చేసినట్టే దానికి చేయుడి. బబులోనులో నుండకుండ విత్తువారిని నిర్మూలము చేయుడి కోతకాలమున కొడవలి పట్టుకొనువారిని నిర్మూలము చేయుడి క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరు తమ ప్రజలయొద్దకు వెళ్లుచున్నారు తమతమ దేశములకు పారిపోవుచున్నారు. ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱెలు సింహములు వారిని తొలగగొట్టెను మొదట అష్షూరురాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి యెముకలను నలుగగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోనురాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలువారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి రప్పించెదనువారు కర్మెలుమీదను బాషానుమీదను మేయుదురు ఎఫ్రాయిము కొండలమీదను గిలాదులోను మేయుచు సంతుష్టినొందును. ఆ కాలమున ఆ నాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యూదా పాపములు వెదకిను అవి దొరుకవు శేషింపజేసినవారిని నేను క్షమించెదను ఇదే యెహోవా వాక్కు. దండెత్తి మెరాతయీయుల దేశముమీదికి పొమ్ము పెకోదీయుల దేశముమీదికి పొమ్ము వారిని హతముచేయుమువారు శాపగ్రస్తులని ప్రకటించుము నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటినిబట్టి చేయుము. ఆలకించుడి, దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది అధిక నాశనధ్వని వినబడుచున్నది సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగ గొట్టబడెను అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను. బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి యున్నాను తెలియకయే నీవు పట్టబడియున్నావు యెహోవాతో నీవు యుద్ధముచేయ బూనుకొంటివి నీవు చిక్కుపడి పట్టబడియున్నావు. కల్దీయులదేశములో ప్రభువును సైన్యములకధిపతియు నగు యెహోవాకు పనియున్నది యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపముతీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చు చున్నాడు. నలుదిక్కులనుండి వచ్చి దానిమీద పడుడి దాని ధాన్యపుకొట్లను విప్పుడి కసవు కుప్పలువేసినట్లు దానిని కుప్పలువేయుడి శేషమేమియులేకుండ నాశనము చేయుడి దాని యెడ్లన్నిటిని వధించుడి అవి వధకు పోవలెను అయ్యో, వారికి శ్రమ వారి దినము ఆసన్నమాయెను వారి దండనకాలము వచ్చెను. ఆలకించుడి, పారిపోయి బబులోను దేశములోనుండి తప్పించుకొని వచ్చుచున్నవారి శబ్దము వినబడుచున్నది మన దేవుడగు యెహోవాచేయు ప్రతికార సమా చారమును తన ఆలయము విషయమై ఆయనచేయు ప్రతికార సమాచారమును సీయోనులో ప్రకటించుడి.వారు వచ్చుచున్నారు. బబులోనునకు రండని విలుకాండ్రను పిలువుడి విల్లు త్రొక్కువారలారా, మీరందరు దానిచుట్టు దిగుడి. అది యెహోవామీద గర్వపడినది ఇశ్రాయేలు పరిశుద్ధునిమీద గర్వపడినది దానిలో నొకడును తప్పించుకొనకూడదు దాని క్రియలనుబట్టి దానికి ప్రతికారము చేయుడి అది చేసిన పనియంతటినిబట్టి దానికి ప్రతికారము చేయుడి. కావున ఆ దినమున దాని యౌవనస్థులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరు తుడిచివేయబడుదురు ఇదే యెహోవా వాక్కు. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే –గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై యున్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించుకాలమువచ్చుచున్నది గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును అతని లేవనెత్తువాడెవడును లేకపోవును నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను అది అతని చుట్టుపెట్టులన్నిటిని కాల్చివేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు –ఒకడును తప్పకుండ ఇశ్రాయేలువారును యూదావారును బాధింపబడిరి వారిని చెరపెట్టినవారందరు వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ ముట్టించును. యెహోవా మాట యిదే కల్దీయులును బబులోను నివాసులును దాని అధిపతులును జ్ఞానులును కత్తిపాలగుదురు ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగు దురు. బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును ఖడ్గము వారి గుఱ్ఱములమీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారిమీదికి దిగుటచేత దానిలోనున్న పరదేశులు స్త్రీలవంటివారగుదురు అది దాని నిధులమీద పడగా అవి దోచుకొనబడును. నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు. అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివ సించును నిప్పుకోళ్లును దానిలో నివాసముచేయును ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరును కాపురముండరు. యెహోవా వాక్కు ఇదే –సొదొమను గొమొఱ్ఱాను వాటి సమీపపట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురముండకపోవును ఏ నరుడును దానిలో బసచేయడు. జనులు ఉత్తరదిక్కునుండి వచ్చుచున్నారు మహాజనమును అనేక రాజులును భూదిగంతములనుండి రేపబడెదరు. వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరువారు క్రూరులు జాలిపడనివారు వారి స్వరము సముద్రఘోషవలె ఉన్నదివారు గుఱ్ఱములను ఎక్కువారు బబులోను కుమారీ, ఒకడు యుద్ధపంక్తులు తీర్చు రీతిగా వారందరు నీమీద పంక్తులు తీర్చుచున్నారు. బబులోనురాజు వారి సమాచారము విని దుర్బలు డాయెను అతనికి బాధ కలిగెను ప్రసవ స్త్రీ వేదనవంటి వేదన అతనికి సంభవించెను. చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములోనుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషములోనే నేను వారిని దానియొద్దనుండి తోలి వేయుదును నేనెవని ఏర్పరతునో వానిని దానిమీద నియమించెదను నన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణచేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? బబులోనునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి కల్దీయుల దేశమునుగూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి నిశ్చయముగా మందలోని అల్పులైనవారిని వారు లాగు దురు నిశ్చయముగా వారినిబట్టి వారి నివాసస్థలము విస్మయ మొందును. బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపు రముచేసి నాకు విరోధముగలేచిన వారిమీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను. అన్యదేశస్థులను బబులోనునకు పంపుచున్నానువారు ఆ దేశమును తూర్పారపెట్టి దాని వట్టిదిగా చేయుదురు ఆపద్దినమునవారు నలుదిక్కులనుండి దానిమీదికి వచ్చెదరు. విలుకానిమీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను కవచము వేసికొనువానిమీదికిని విల్లు త్రొక్కవలెను కల్దీయులదేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును యౌవనులను కొట్టక మానకుడి దాని సర్వసైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి. తమ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇశ్రాయేలువారిని యూదావారిని విసర్జింపలేదు గాని ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారిదేశము నిండి యున్నది. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులోనుండి పారిపోవుడి మీ ప్రాణములు రక్షించుకొనుడి ఇది యెహోవాకు ప్రతికారకాలము అది చేసిన క్రియలనుబట్టి ఆయన దానికి ప్రతికారము చేయుచున్నాడు. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారుపాత్రయైయుండెను. దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లియున్నారు. బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియ లాయెను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థతనొందునేమో దాని నొప్పికొరకు గుగ్గిలము తీసికొని రండి. మనము బబులోనును స్వస్థపరచగోరితిమి అయితే అది స్వస్థత నొందలేదు దాని విడిచి పెట్టుడి. మన మన దేశములకు వెళ్లుదము రండి దాని శిక్ష ఆకాశమంత యెత్తుగా సాగుచున్నది అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది యెహోవా మన న్యాయమును రుజువుపరచు చున్నాడు రండి సీయోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదము. బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించు చున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపు చున్నాడు. అది యెహోవాచేయు ప్రతి దండన తన మందిరమునుగూర్చి ఆయనచేయు ప్రతి దండన. బబులోను ప్రాకారములమీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి కావలి బలముచేయుడి కావలివారిని పెట్టుడి మాటు లను సిద్ధపరచుడి బబులోను నివాసులనుగూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానముచేసిన పని తాను జరిగింపబోవుచున్నాడు. విస్తారజలములయొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది అన్యాయలాభము నీకిక దొరకదు. గొంగళిపురుగులంత విస్తారముగా మనుష్యులతో నేను నిన్ను నింపినను శత్రువులు నీమీద కేకలు వేయు దురు నా జీవముతోడని సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాసులు ఆకాశమండల ములో పుట్టును. భూమ్యంతభాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలోనుండి గాలిని రావించును. తెలివిలేక ప్రతిమనుష్యుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమొందును అతడు పోతపోసినది మాయారూపము దానిలో ప్రాణమేమియు లేదు. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు విమర్శకాలమున అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు యుద్ధాయుధమువంటివాడవు నీవలన నేను జనములను విరుగగొట్టుచున్నాను నీవలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను. నీవలన గుఱ్ఱములను రౌతులను విరుగగొట్టుచున్నాను. నీవలన రథములను వాటి నెక్కినవారిని విరుగగొట్టు చున్నాను. నీవలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను నీవలన ముసలివారిని బాలురను విరుగగొట్టుచున్నాను నీవలన యౌవనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను. నీవలన గొఱ్ఱెలకాపరులను వారి గొఱ్ఱెలమందలను విరుగగొట్టుచున్నాను నీవలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరుగ గొట్టుచున్నాను నీవలన ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను. బబులోనును కల్దీయుల దేశనివాసులును మీ కన్నులయెదుట సీయోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతికారము చేయుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. –సర్వభూమిని నశింపజేయు నాశనపర్వతమా, నేను నీకు విరోధిని ఇదే యెహోవా వాక్కు. నేను నీమీదికి నా చేయి చాపి శిలలపైనుండి నిన్ను క్రిందికి దొరలించుదును చిచ్చుపెట్టిన కొండవలె ఉండజేయుదును. మూలకుగాని పునాదికిగాని నీలోనుండి యెవరును రాళ్లు తీసికొనరు నీవు చిరకాలము పాడై యుందువు ఇదే యెహోవా వాక్కు. దేశములో ధ్వజములనెత్తుడి జనములలో బాకానాదము చేయుడి దానిమీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి దానిమీద పడుటకై అరారాతు మిన్నీ అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి దానిమీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియ మించుడి రోమముగల గొంగళిపురుగులంత విస్తారముగా గుఱ్ఱము లను దానిమీదికి రప్పించుడి. దానిమీదికిపోవుటకై మాదీయుల రాజులను వారి అధిపతులను వారి యేలికలను అతడు ఏలుచుండు సర్వదేశమును జనులనందరిని ప్రతిష్ఠించుడి భూమి కంపించుచున్నది నొప్పిచేత అది గిజగిజలాడు చున్నది ఒక్క నివాసియులేకుండ బబులోను దేశమును పాడుగా చేయవలెనని బబులోనునుగూర్చిన యెహోవా ఉద్దేశము స్థిర మాయెను. [30-32] బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మాను దురువారు తమ కోటలలో నిలుచుచున్నారువారి పరాక్రమము బలహీనత ఆయెనువారును స్త్రీలవంటివారైరివారి నివాసస్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయెను అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దూలము లును జమ్మును అగ్నిచేత కాల్చబడును దాని యోధులు దిగులుపడిరి అని బంట్రౌతు వెంబడి బంట్రౌతును దూతవెంబడి దూతయు పరుగెత్తుచు బబులోను రాజు నకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయెను. *** *** ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–బబు లోనుపురము చదరముచేయబడిన కళ్లమువలె ఆయెను ఇంక కొంతసేపటికి దానికి కోతకాలమువచ్చును. బబులోను రాజైన నెబుకద్రెజరు మమ్మును మ్రింగివేసెను మమ్మును నుగ్గుచేసెను, మమ్మును వట్టికుండవలె ఉంచి యున్నాడు భుజంగము మ్రింగునట్లు మమ్మును మ్రింగెను మా శ్రేష్ఠపదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసియున్నాడు. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోనుమీదికి ప్రతికారరూపముగా దిగును గాక యని సీయోను నివాసి యనుకొనును నా ఉసురు కల్దీయదేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు — ఆల కించుము, నీ వ్యాజ్యెమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగతీర్చుకొందును దాని సముద్రమును నేనెండకట్టుదును దాని ఊటను ఇంకిపోజేయుదును. బబులోను నిర్జనమై కసవు దిబ్బలుగా ఉండును నక్కలకు నివాసస్థలమగును అది పాడై యెగతాళికి కారణముగా ఉండును.వారు కూడి సింహములవలె బొబ్బరింతురు సింహముల పిల్లలవలె గుఱ్ఱుపట్టుదురు. వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పిగొనగా వారికి మద్యము నిచ్చి వారిని మత్తిల్లజేసెదను ఇదే యెహోవా వాక్కు. గొఱ్ఱెపిల్లలు వధకు పోవునట్లును మేకపోతులును పొట్టేళ్లును వధకు పోవునట్లును వారిని వధకు రప్పించెదను. షేషకు పట్టబడెను జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను బబులోను జనములకు విస్మయాస్పదమాయెను. సముద్రము బబులోనుమీదికి వచ్చెను ఆమె దాని తరంగములధ్వనితో నిండుకొనెను. దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను ఏ నరుడును దానిమీదుగా ప్రయాణము చేయడు. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను వాడు మ్రింగినదానిని వానినోటనుండి కక్కించు చున్నాను ఇకమీదట జనములు వానియొద్దకు సమూహములుగా కూడి రావు బబులోను ప్రాకారము కూలును; నా జనులారా, మీరు దానిలోనుండి బయటకు వెళ్లుడి యెహోవా కోపాగ్నినుండి తప్పించుకొనుడి మీ ప్రాణములను రక్షించుకొనుడి ఏటేట వదంతి పుట్టుచువచ్చును దేశములో బలాత్కారము జరుగుచున్నది ఏలికమీద ఏలిక లేచుచున్నాడు దేశములో వినబడు వదంతికి భయపడకుడి మీ హృదయములలో దిగులు పుట్టనియ్యకుడి. రాబోవు దినములలో నేను బబులోనుయొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును దాని దేశమంతయు అవమానము నొందును జనులు హతులై దానిమధ్యను కూలెదరు దానిని పాడుచేయువారు ఉత్తరదిక్కునుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతినిగూర్చి సంతోషించును ఇదే యెహోవా వాక్కు బబులోను ఇశ్రాయేలులో హతులైనవారిని కూలజేసి నట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైనవారు కూలుదురు ఖడ్గమును తప్పించుకొనినవారలారా, ఆలస్యముచేయక వెళ్లుడి, దూరమునుండి మీరు యెహోవాను జ్ఞాపకముచేసికొనుడి యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానియ్యుడి. మేము దూషణవాక్యము విని సిగ్గుపడియున్నాము అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధస్థలములలోనికి వచ్చియున్నారు మా ముఖములు తెల్లబోవుచున్నవి ఇదే యెహోవా వాక్కు. –రాబోవు దినములలో నేను బబులోనుయొక్క విగ్రహములను శిక్షింతును ఆమె దేశమందంతటను గాయపరచబడినవారు మూల్గు దురు. బబులోను తన బలమైన ఉన్నతస్థలములను దుర్గములుగా చేసికొని ఆకాశమునకు ఎక్కినను పాడుచేయువారు నాయొద్దనుండి వచ్చి దానిమీద పడుదురు ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి, బబులోనులోనుండి రోదనధ్వని వినబడుచున్నది కల్దీయులదేశములో మహా నాశనధ్వని వినబడుచున్నది. యెహోవా బబులోనును పాడుచేయుచున్నాడు దాని మహాఘోషను అణచివేయుచున్నాడు వారి తరంగములు ప్రవాహజలములవలె ఘోషించుచున్నవివారి ఆర్భాటము వినబడుచున్నది. బబులోనుమీదికి పాడుచేయువాడు వచ్చుచున్నాడు దాని బలాఢ్యులు పట్టబడియున్నారు వారి విండ్లు విరిగిపోయినవి యెహోవా ప్రతికారముచేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధి పతులను బలాఢ్యులను మత్తిల్లజేసెదనువారు చిరకాల నిద్రనొంది మేలుకొనకపోదురు ఇదే రాజు వాక్కు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెల విచ్చుచున్నాడు విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడ గొట్టబడును దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయ బడును –జనములు వృథాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు ప్రజలు చూచి అలయుచున్నారు. సిద్కియా యేలుబడియందు నాలుగవ సంవత్సరమున శెరాయా దండు భోజనసామగ్రికి అధికారియైయుండి సిద్కియాతోకూడ బబులోనునకు వెళ్లినప్పుడు నేరీయా కుమారుడును మహసేయా మనుమడునైన ఆ శెరాయాకు యిర్మీయా ఆజ్ఞాపించిన మాట.౹ యిర్మీయా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటిని, అనగా బబులోనునుగూర్చి వ్రాయబడిన యీ మాటలన్నిటిని గ్రంథములో వ్రాసెను.౹ కాగా యిర్మీయా శెరాయాతో ఇట్లనెను— నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటిని చదివి వినిపించవలెను.౹ ఈలాగున నీవు ప్రకటింపవలెను— యెహోవా, మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదురనియు, అది నిత్యము పాడుగా నుండుననియు దానినిగూర్చి నీవు సెలవిచ్చితివి.౹ ఈ గ్రంథమును చదివి చాలించినతరువాత నీవు దానికి రాయికట్టి యూఫ్రటీసునదిలో దాని వేసి నేను దాని మీదికి రప్పింపబోవుచున్న అపాయములచేత బబులోను మరల పైకి రాలేక ఆలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయాయొక్క మాటలు ఇంతటితో ముగిసెను. సిద్కియా యేలనారంభించినప్పుడు అతడు ఇరువదియొక్క సంవత్సరములవాడు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను, అతని తల్లిపేరు హమూటలు; ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె.౹ యెహోయాకీము నడిచిన చెడ్డనడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డనడత నడిచెను.౹ యెహోవా కోపపడి తనయెదుట నుండకుండ వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటుచేయగా అతని యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదియవదినమున బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేముమీదికి వచ్చి, దానికి ఎదురుగా దండు దిగి నప్పుడు పట్టణమునకు చుట్టు కోటలు కట్టిరి.౹ ఆలాగు జరుగగా సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవ త్సరమువరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను.౹ నాల్గవ నెల తొమ్మిదవదినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను.౹ పట్టణప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరు పారిపోయి రాజుతోటకు దాపైన రెండు గోడలమధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములోనుండి బయలు వెళ్లిరి; కల్దీయులు పట్టణమును చుట్టుకొని యుండగా సైనికులు యొర్దానునది మార్గముగా తరలిపోయిరి.౹ కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలిసికొనగా అతని దండంతయు అతనియొద్దనుండి చెదరిపోయెను.౹ వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లాపట్టణమున నున్న బబులోను రాజునొద్దకు అతని తీసికొనిపోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్షవిధించెను.౹ బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను; మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతుల నందరిని చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడ దీయించి రెండు సంకెళ్లతో అతని బంధించి, బబులోనునకు అతని తీసికొనిపోయి, మరణమగువరకు చెరసాలలో అతనిపెట్టించెను. అయిదవ నెల పదియవ దినమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడియందు పందొమ్మిదవ సంవత్సరమున బబులోనురాజు ఎదుట నిలుచు నెబూజర దానను రాజదేహసంరక్షకుల యధిపతి యెరూషలేమునకు వచ్చెను.౹ [13-14] అతడు యెహోవా మందిరమును రాజునగరును యెరూషలేములోని గొప్పవారి యిండ్లనన్నిటిని కాల్చి వేసెను. మరియు రాజదేహసంరక్షకుల యధిపతితోకూడ నుండిన కల్దీయుల సేనాసంబంధులందరు యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి *** మరియు రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ప్రజలలో కడుబీదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోనురాజు పక్షము చేరినవారిని, గట్టి పనివారిలో శేషించినవారిని చెరగొని పోయెను.౹ అయితే రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడుబీదలలో కొందరిని ఉండనిచ్చెను.౹ మరియు యెహోవా మందిరములోనుండిన ఇత్తడి స్తంభములను మందిరములోనుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు గొనిపోయిరి.౹ అదియుగాక వారు బిందెలనుకుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవచేయు ఇత్తడి ఉపకరణములన్నిటిని గొనిపోయిరి.౹ మరియు పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను, బంగారు వాటిని బంగారునకును వెండివాటిని వెండికిని చేర్చుకొని రాజదేహసంరక్షకుల యధిపతి గొనిపోయెను.౹ రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లక్రిందనుండిన పండ్రెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను. వీటి కన్నిటికున్న ఇత్తడి యెత్తువేయుటకు అసాధ్యము.౹ వాటిలో ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల యెత్తుగలది, పండ్రెండు మూరల నూలు దాని చుట్టు తిరుగును, దాని దళసరి నాలుగు వ్రేళ్లు; అది గుల్లది.౹ దానిమీద ఇత్తడి పైపీట యుండెను; ఒక్క పైపీట అయి దేసి మూరల ఎత్తుగలది, పైపీటకు చుట్టు అల్లిన వల అల్లి కయు దానిమ్మ పండ్లును ఉండెను; అవి యన్నియు ఇత్త డివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును ఆలాగుననే దానిమ్మ పండ్లుండెను.౹ ప్రక్కలయందు తొంబది యారు దానిమ్మపండ్లుండెను; చుట్టు ఉండిన వల అల్లికమీద దానిమ్మపండ్లన్నియు నూరు.౹ మరియు రాజదేహసంరక్ష కుల యధిపతి ప్రధానయాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను.౹ అతడు పట్టణములోనుండి యోధులమీద నియమింపబడిన యొక ఉద్యోగస్థుని, పట్టణములో దొరికిన రాజసన్నిధిలో నిలుచు ఏడుగురు మనుష్యులను, దేశ సైన్యాధిపతియగువానియొక్క లేఖరిని, పట్టణపుమధ్యను దొరికిన అరువదిమంది దేశప్రజలను పట్టుకొనెను.౹ రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను వీరిని పట్టుకొని రిబ్లాలోనుండిన బబులోనురాజు నొద్దకు తీసికొని వచ్చెను.౹ బబులోనురాజు హమాతుదేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశములోనుండి చెరగొనిపోయెను.౹ నెబుకద్రెజరు తన యేలుబడియందు ఏడవ సంవత్సరమున మూడువేల ఇరువది ముగ్గురు యూదులను చెరగొనిపోయెను నెబుకద్రెజరు ఏలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున అతడు యెరూషలేమునుండి ఎనిమిదివందల ముప్పది యిద్దరిని చెరగొని పోయెను.౹ నెబుకద్రెజరు ఏలుబడియందు ఇరువది మూడవ సంవత్సరమున రాజదేహసంరక్షకుల యధిపతియగు నెబూజరదాను యూదులలో ఏడువందల నలుబది యయిదుగురు మనుష్యులను చెరగొనిపోయెను; ఆ మనుష్యుల వెరసి నాలుగువేల ఆరువందలు. యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన ముప్పది యేడవ సంవత్సరమున పండ్రెండవనెల యిరువదియైదవదినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన యేలుబడియందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీనునకు దయచూపి, బందీగృహములోనుండి అతని తెప్పించి అతనితో దయగా మాటలాడి అతనితోకూడ బబులోనులోనుండు రాజుల సింహాసనముకంటె ఎత్తయిన సింహాసనము అతనికి నియమించెను.౹ మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనముచేయుచువచ్చెను.౹ మరియు అతడు చనిపోవువరకు అతడు బ్రతికిన దినములన్నియు అనుదినము అతని పోషణకై బబులోనురాజుచేత భోజనపదార్థములు ఇయ్యబడుచుండెను. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖా క్రాంతమాయెను? అది విధవరాలివంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తెయైనది ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను? రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొక డును లేడు దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరివారు దానికి శత్రువులైరి. యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతినొందక పోయెను దానితరుమువారందరు ఇరుకుచోట్లదాని కలిసికొందురు. నియామక కూటములకు ఎవరును రారు గనుక సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకులభరితురాలాయెను. దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొనిపోయిరి సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని యధిపతులు మేతలేని దుప్పులవలె ఉన్నారువారు బలహీనులై తరుమువారియెదుట నిలువలేక పారి పోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సు నంతటిని జ్ఞాపకము చేసికొనుచున్నది దానికి కలిగినశ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయువారెవరును లేక దాని జనము శత్రువుచేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతిదినములనుబట్టి దాని నపహాస్యము చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపముచేసెను అందుచేతను అది అపవిత్రురాలాయెను దాని ఘనపరచిన వారందరు దాని మానమును చూచి దాని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది దాని యపవిత్రత దాని చెంగులమీద నున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసికొనక యుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దాని నాదరించువాడొకడును లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత నాకు కలిగినశ్రమను దృష్టించుము. దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించి యుండుట అది చూచుచునేయున్నది దాని కాపురస్థులందరు నిట్టూర్పు విడుచుచు ఆహా రము వెదకుదురు తమ ప్రాణసంరక్షణకొరకు తమ మనోహరమైన వస్తువుల నిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని దృష్టించి చూడుము. త్రోవనునడుచువారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండకోప దినమున నాకు కలుగజేసినశ్రమవంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరమునుండి ఆయన నా యెముకలమీదికి అగ్ని ప్రయోగించియున్నాడు అది యెడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కు పరచుటకై వలనొగ్గి యున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడుచేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల జేసియున్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా యపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువులచేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారియెదుట లేవలేకపోతిని. నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యుల నందరిని కొట్టివేసెను నా యౌవనులను అణగద్రొక్కవలెనని ఆయన నామీద నియామక కూటముకూడను చాటిం చెను. యెహోవా కన్యకయైన యూదా కుమారిని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు. వీటినిబట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసినవారు నాకు దూరస్థులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి. ఆదరించువాడులేక సీయోను చేతులు చాపుచున్నది యెహోవా యాకోబునకు చుట్టునున్నవారిని విరోధులైయుండ నియమించియున్నాడు యెరూషలేము వారికి హేయమైనదాయెను. యెహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితిని సకల జనములారా, చిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకలును నా యౌవనులును చెరలోనికిపోయియున్నారు నా విటకాండ్రను నేను పిలువనంపగావారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులును నా పెద్దలును ప్రాణసంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచినవారైరి. యెహోవా, దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమునుబట్టి నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువా డొకడును లేడాయెను నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరు విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు. వారు చేసిన దుష్కార్యములన్నియు నీ సన్నిధినుండును నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను నా మనస్సు క్రుంగిపోయెను నేను చేసిన అపరాధములన్నిటినిబట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము. ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశమునుండి భూమిమీదికి పడవేసెను కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసికొనకపోయెను. ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటిని నాశనముచేసియున్నాడు మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి యున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యమును దాని యధిపతులను ఆయన అపవిత్ర పరచియున్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగ మును ఆయన విరుగగొట్టియున్నాడు శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు నఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసి యున్నాడు. శత్రువువలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధివలె కుడి చెయ్యి చాపియున్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటిని నాశనముచేసి యున్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారములమీద కుమ్మరించి యున్నాడు. ప్రభువు శత్రువాయెను ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటిని నాశనముచేసియున్నాడు దాని కోటలను పాడుచేసియున్నాడు యూదా కుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు. ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి యున్నాడు తన సమాజస్థలమును నాశనము చేసియున్నాడు యెహోవా సీయోనులో నియామక కాలము విశ్రాంతిదినము మరువబడునట్లు చేసియున్నాడు కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి యున్నాడు. ప్రభువు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధస్థలమునందు అసహ్యించుకొనెను దాని నగరుల ప్రాకారములను శత్రువులచేతికి అప్ప గించెనువారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవామందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. సీయోను కుమారియొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను నాశనముచేయుటకు తన చెయ్యి వెనుకతీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీనిగూర్చి మూల్గుచున్నవి అవి యేకరీతిగా క్షీణించుచున్నవి. పట్టణపు గవునులు భూమిలోనికి క్రుంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడు చేసెను దాని రాజును అధికారులును అన్యజనులలోనికి పోయియున్నారు అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుట లేదు. సీయోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు తలలమీద బుగ్గి పోసికొందురు గోనెపట్ట కట్టు కొందురు యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచు కొందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది. శిశువులును చంటిబిడ్డలును పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. గాయమొందినవారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని–అన్నము ద్రాక్షారసము ఏదియని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచె దరు. యెరూషలేము కుమారీ, ఎట్టిమాటలచేత నిన్ను హెచ్చ రించుదును? దేనితో నిన్ను సాటిచేయుదును? సీయోను కుమారీ, కన్యకా, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థదర్శనములు చూచియున్నారు నీవు చెరలోనికి పోకుండ తప్పించుటకైవారు నీ దోషములను నీకు వెల్లడిచేయలేదు.వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవతప్పించు దర్శనములు చూచినవారైరి. త్రోవను వెళ్లువారందరు నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరువారు యెరూషలేము కుమారిని చూచి –పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరియనియు జనులు ఈ పట్టణమునుగూర్చియేనా చెప్పిరి? అని యనుకొనుచు గేలిచేసి తల ఊచెదరు నీ శత్రువులందరు నిన్ను చూచి నోరు తెరచెదరువారు ఎగతాళిచేసి పండ్లు కొరుకుచు –దాని మ్రింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టినదినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించి యున్నాడు పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి యున్నాడు శేషములేకుండ నిన్ను పాడుచేసియున్నాడు నిన్నుబట్టి శత్రువులు సంతోషించునట్లు చేసి యున్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొఱ్ఱ పెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీప్రవాహమువలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనియ్యకుము నీ కంటిపాపను విశ్రమింపనియ్యకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయ మును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీచేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో యెహోవా, దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరి శుద్ధాలయమునందు హతులగుట తగునా? యౌవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు నా కన్యకలును నా యౌవనులును ఖడ్గముచేత కూలియున్నారు నీ ఉగ్రతదినమున నీవు వారిని హతము చేసితివి దయ తలచక వారినందరిని వధించితివి. ఉత్సవదినమున జనులు వచ్చునట్లుగా నలుదిశలనుండి నీవు నామీదికి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రతదినమున ఎవడును తప్పించుకొనలేక పోయెను శేషమేమియు నిలువకపోయెను నేను చేతులలో ఆడించి సాకినవారిని శత్రువులు హరించివేసియున్నారు. నేను ఆయన ఆగ్రహదండముచేత బాధననుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప జేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి యున్నాడు పూర్వకాలమున చనిపోయినవారు నివసించునట్లు ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసి యున్నాడు ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు నాకు త్రోవలేకుండచేసి నా యవయవములను విడదీసి యున్నాడు నాకు దిక్కులేకుండ చేసియున్నాడు విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు తన అంబులపొదిలోని బాణములన్నియు ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను. నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడ నైతిని. చేదువస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను. నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి యున్నాడు మేలు ఎట్టిదో నేను మరచియున్నాను. నాకు బలము ఉడిగెను అనుకొంటిని యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా. నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు. నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు. అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ వలెను. నిరీక్షణాధారము కలుగునేమో యని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప వలెను. అతడు నిందతో నింపబడవలెను ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి పడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు. దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద త్రొక్కుటయు మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొల గించుటయు ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు ప్రభువు మెచ్చుకార్యములు కావు. ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవా డెవడు? మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా? సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు? మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము. ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము. మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు. కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుము చున్నావు దయ తలచక మమ్మును చంపుచున్నావు. మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు. జనములమధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టి యున్నావు. మా శత్రువులందరు మమ్మును చూచి యెగతాళి చేసెదరు. భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు. వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నాపైన రాయి యుంచిరి నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని. యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి నేను నీ నామమునుబట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నాయొద్దకు వచ్చితివి –భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెము లను వాదించితివి నా జీవమును విమోచించితివి. యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము. పగతీర్చుకొనవలెనని వారు నామీదచేయు ఆలోచన లన్నియు నీవెరుగుదువు. యెహోవా, వారి దూషణయువారు నామీదచేయు ఆలోచనలన్నిటిని నామీదికి లేచినవారు పలుకు మాటలును దినమెల్ల వారు నామీదచేయు ఆలోచనయు నీవు వినియున్నావు. వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కని పెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని. యెహోవా, వారి చేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీ కారము చేయుదువు. వారికి హృదయకాఠిన్యము నిత్తువువారిని శపించుదువు. నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవాయొక్క ఆకాశముక్రింద నుండకుండ వారిని నశింపజేయుదువు. బంగారము ఎట్లు మందగిలినది? మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది? ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయ బడియున్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సీయోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటికుండలుగా ఎంచబడుచున్నారు? నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని ఉష్టపక్షులవలె క్రూరురాలాయెను. దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటు కొనును పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడును వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపముకంటె అధికము ఎవరును దానిమీద చెయ్యివేయకుండనే నిమిషములో ఆ పట్టణము పాడుచేయబడెను. దాని ఘనులు హిమముకన్న శుద్ధమైనవారువారు పాలకంటె తెల్లనివారు వారి శరీరములు పగడములకంటె ఎఱ్ఱనివివారి దేహకాంతి నీలమువంటిది. అట్టివారి ఆకారము బొగ్గుకంటె నలుపాయెనువారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్ట జాలరు. వారి చర్మము వారి యెముకలకు అంటుకొనియున్నది అది యెండి కఱ్ఱవంటిదాయెను. క్షామహతులు భూఫలములు లేక పొడువబడి క్షీణించి పోయెదరు ఖడ్గహతులు క్షామహతులకన్న భాగ్యవంతులు. వాత్సల్యముగల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలువారికి ఆహారమైరి. యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను సీయోనులో ఆయన అగ్ని రాజబెట్టెను అది దాని పునాదులను కాల్చివేసెను. బాధించువాడుగాని విరోధిగాని యెరూషలేము గవునులలోనికి వచ్చునని భూరాజులకైనను లోకనివాసులందరిలో మరి ఎవరి కైనను తోచియుండలేదు. దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములనుబట్టియు దాని యాజకుల దోషమునుబట్టియు జనులు వీధులలో అంధులవలె తిరుగులాడెదరువారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు. –పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో ననిరి.వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైనవారు –ఇకను వారిక్కడ కాపురముండకూడదని చెప్పు కొనిరి యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇకమీదట వారిని లక్ష్యపెట్టడు యాజకులయెడల జనులు గౌరవము చూపకపోయిరి పెద్దలమీద దయ చూపకపోయిరి. వ్యర్థసహాయముకొరకు మేముకనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేముకనిపెట్టుచు రక్షింపలేని జనముకొరకు ఎదురు చూచుచుంటిమి. రాజవీధులలో మేము నడువకుండునట్టు విరోధులు మా జాడలనుబట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయెను మా దినములు తీరిపోయినవి మా అంత్యదశ వచ్చే యున్నది. మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్న వడిగలవారు పర్వతములమీద వారు మమ్మును తరుముదురు అరణ్యమందు మాకొరకు పొంచియుందురు. మాకు నాసికారంధ్రముల ఊపిరివంటివాడు యెహోవాచేత అభిషేకము నొందినవాడువారు త్రవ్విన గుంటలలో పట్టబడెను. –అతని నీడక్రిందను అన్యజనులమధ్యను బ్రదికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోము కుమారీ, సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసికొందువు సీయోను కుమారీ, నీ దోషశిక్ష సమాప్తమాయెను ఇకమీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు ఎదోము కుమారీ, నీ దోషమునకు ఆయన శిక్ష విధిం చును నీ పాపములను ఆయన వెల్లడిపరచును. యెహోవా, మాకు కలిగినశ్రమ జ్ఞాపకము చేసికొనుము దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను. మా యిండ్లు అన్యుల స్వాధీనమాయెను. మేము దిక్కులేనివారము తండ్రిలేనివారము మా తల్లులు విధవరాండ్రయిరి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. మమ్మును తరుమువారు మా మెడలమీదికి ఎక్కియున్నారు మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి యనునది మాకు లేదు. పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును లోబడియున్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైరివారి వశమునుండి మమ్మును విడిపింపగలవాడెవడును లేడు. ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. మహాక్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను. శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు. యౌవనులు తిరుగటిరాయి మోసిరి బాలురు కట్టెలమోపు మోయజాలక తడబడిరి. పెద్దలు గుమ్మములయొద్ద కూడుట మానిరి యౌవనులు సంగీతము మానిరి. సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది. మా తలమీదనుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ. దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలెను. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు నీ సింహాసనము తరతరములుండును. నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఏల? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏల? యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము. నీవు మమ్మును బొత్తిగా విసర్జించియున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది. ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల అయిదవదినమున నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవునిగూర్చిన దర్శనములు నాకు కలిగెను.౹ [2-3] యెహోయాకీను చెరపట్టబడిన అయిదవ సంవత్సరము ఆ నెలలో అయిదవదినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షముకాగా అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను.౹ *** నేను చూడగా ఉత్తర దిక్కునుండి తుపాను వచ్చు చుండెను; మరియు గొప్ప మేఘమును గోళమువలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతి దానిచుట్టు ఆవరించియుండెను; ఆ అగ్నిలోనుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటి దొకటి కనబడెను.౹ దానిలోనుండి నాలుగు జీవుల రూపములుగల యొకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది.౹ ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్కలునుగలవు.౹ వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్లు పెయ్యకాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను.౹ వాటి నాలుగు ప్రక్కలరెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను, నాలు గింటికిని ముఖములును రెక్కలును ఉండెను.౹ వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను.౹ ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.౹ వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను, ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి యుండెను; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను.౹ అవన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మ యే వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండెను.౹ ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోను దివిటీలతోను సమానములు; ఆ అగ్ని జీవులమధ్యను ఇటు అటు వ్యాపించెను, ఆ అగ్ని అతికాంతిగా ఉండెను, అగ్నిలోనుండి మెరుపు బయలుదేరుచుండెను.౹ మెరుపు తీగెలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను.౹ ఈ జీవులను నేను చూచుచుండగా నేలమీద ఆ నాలుగింటి యెదుట ముఖముల ప్రక్కను చక్రమువంటిదొకటి కనబడెను.౹ ఆ చక్రములయొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలె నుండెను, ఆ నాలుగును ఒక్క విధముగానే యుండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను.౹ అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను, వెనుకకు తిరుగకయే జరుగుచుండెను.౹ వాటి కైవారములు మిక్కిలి యెత్తుగలవై భయంకరముగా ఉండెను, ఆ నాలుగు కైవారములు చుట్టు కండ్లతో నిండి యుండెను.౹ ఆ జీవులు కదలగా ఆ చక్రములును వాటి ప్రక్కను జరిగెను, అవి నేలనుండి లేచినప్పుడు చక్రములు కూడ లేచెను.౹ ఆత్మ యెక్కడికి పోవునో అక్క డికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను; జీవికున్న ఆత్మ, చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను.౹ జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములును జరుగుచుండెను, అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి నేలనుండి లేవగా ఇవియు వాటితోకూడ లేచెను.౹ మరియు జీవుల తలలపైన ఆకాశమండలము వంటి విశాలతయున్నట్టుండెను. అది తళతళలాడు స్ఫటిక ముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి యుండెను.౹ ఆ మండలమువంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి యొకదానిప్రక్క ఒకటి పైకి చాప బడియుండెను; రెండేసి వాటి దేహములు కప్పుచుండెను, ఈతట్టుననున్న జీవులకును ఆతట్టుననున్న జీవులకును, అనగా ప్రతిజీవికిని ఆలాగున రెక్కలుండెను.౹ అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని; అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడగు దేవుని స్వరమువలెను దండువారుచేయు ధ్వనివలెను ఉండెను, అవి నిలుచునప్పుడెల్ల తమ రెక్కలను వాల్చుకొనుచుండెను.౹ అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశమండలమువంటి దానిలోనుండి శబ్దము పుట్టెను.౹ వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను.౹ చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను.౹ వర్ష కాలమున కనబడు ఇంద్రధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను. — నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలెను అని ఆయన నాతో మాటలాడి నప్పుడు ఆత్మ నాలోనికివచ్చి నన్ను నిలువబెట్టెను; అప్పుడు నాతో మాటలాడినవాని స్వరము వింటిని.౹ ఆయన నాతో ఇట్లనెను–నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనులయొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను; వారును వారి పితరులును నేటివరకును నామీద తిరుగుబాటు చేసినవారు.౹ వారు సిగ్గుమాలినవారును కఠినహృదయులునై యున్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటుచేయు వారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలిసికొనునట్లు–ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను.౹ [5-6] నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్లమధ్య నివసించుచున్నావు; అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము.౹ *** వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము.౹ నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరుతెరచి నేనిచ్చు దాని భుజించుము అనెను.౹ నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన యొక చెయ్యి నా యొద్దకు చాపబడెను.౹ ఆయన దాని నాముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై యుండెను; మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడియుండెను. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను–నరపుత్రుడా, నీకు కనబడినదానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయులయొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము.౹ నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి –నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా నుండెను. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను–నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము.౹ నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు జనులయొద్దకు కాదు ఇశ్రాయేలీయులయొద్దకే నిన్ను పంపుచున్నాను.౹ నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్యజనులయొద్దకు నిన్ను పంపుటలేదు, అట్టివారి యొద్దకు నేను నిన్ను పంపినయెడల వారు నీ మాటలు విందురు.౹ అయితే ఇశ్రాయేలీయులందరు సిగ్గుమాలినవారును కఠినహృదయులునై, నేను చెప్పిన మాటల నాలకింపనొల్లక యున్నారు గనుక నీ మాటలు విననొల్లరు.౹ ఇదిగో వారి ముఖమువలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసెదను, వారి నుదురువలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసెదను.౹ నీ నుదురు చెకుముకి రాతికంటె కఠినముగాఉండు వజ్రమువలె చేసెదను; వారికి భయపడకుము, వారందరు తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము.౹ మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పుమాటలన్నిటిని చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనులయొద్దకు పోయి యీ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. అంతలో ఆత్మ నన్నెత్తికొనిపోగా–యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దమొకటి ఆయన యున్న స్థలమునుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని.౹ మరియు ఆ జంతువుల రెక్కలు ఒక దానికొకటి తగులుటవలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడెను ఆత్మ నన్నెత్తి తోడుకొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు, యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను.౹ నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడినవారి యొద్దకు వచ్చి, వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి యేమియు చెప్పకయు కదలకయు నున్నవాడనై యేడు దినములు వారి మధ్యనుంటిని. ఆ యేడు దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను — నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము.౹ అవశ్యముగా నీవు మరణ మవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండినయెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమునుబట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.౹ అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతనుండి దుష్‌క్రియలనుండియు మరలనియెడల అతడు తన దోషమునుబట్టి మరణమవును గాని నీవు (ఆత్మను) తప్పించుకొందువు.౹ మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయని యెడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండ అతడు తన దోషమునుబట్టి మరణమవును, అయితే అతని ప్రాణవిషయములో నిన్ను ఉత్తర వాదిగా ఎంచుదును.౹ అయితే–పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరికచేయగా అతడు హెచ్చరింపబడి పాపముచేయక మానినయెడల అతడు అవశ్యముగా బ్రదుకును, నీ మట్టుకు నీవును (ఆత్మను) తప్పించు కొందువు. అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి, —నీవు లేచి మైదానపు భూమికి వెళ్లుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను.౹ నేను లేచి మైదానపు భూమికి వెళ్లగా, కెబారునది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్ష మాయెను.౹ నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువ బెట్టిన తరువాత యెహోవా నాతో మాటలాడి ఈలాగు సెలవిచ్చెను–నరపుత్రుడా, వారు నీ మీద పాశములువేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి యొద్దకు వెళ్లక యింటికిపోయి దాగియుండుము.౹ [25-26] వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక యుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన జేసెదను.౹ *** అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను, వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారియొద్దకు పోయి–వినువాడు వినునుగాక విననొల్లనివాడు విననొల్లకయుండును గాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసికొనివచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేముపట్టణపు రూపమును దాని మీద వ్రాయుము.౹ మరియు అది ముట్టడి వేయబడి నట్లును దానియెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసి నట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము.౹ మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును. మరియు నీ యెడమప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలువారి దోషమును దానిమీద మోపవలెను; ఎన్ని దినములు నీవు ఆతట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు.౹ ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడువందల తొంబది దినములు నిర్ణయించియున్నాను.౹ ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణ యించియున్నాను.౹ ఈలాగు నీవుండగా యెరూషలేము ముట్టడివేయబడినట్లు తేరిచూచుచు, చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానినిగూర్చి ప్రకటింపవలెను.౹ పట్టణము ముట్టడివేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదేపాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును.౹ మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్లజిలకరను తెచ్చుకొని, యొక పాత్రలో ఉంచి, నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను, మూడువందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనముచేయుచు రావలెను;౹ నీవు తూనికె ప్రకారము, అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను, వేళవేళకు తినవలెను,౹ నీళ్లు కొలప్రకారము అరపడిచొప్పున ప్రతిదినము త్రాగవలెను, వేళవేళకు త్రాగవలెను;౹ యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్యమలముతో కాల్చి భుజింపవలెను;౹ నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను.౹ అందుకు–అయ్యో, ప్రభువా, యెహోవా, నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే, బాల్యమునుండి నేటివరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేననగా ఆయన–చూడుము, మనుష్యమలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించియున్నాను; దీనితో నీవు నీ భోజనము సిద్ధపరుచుకొనుమని సెలవిచ్చి –నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేనులేకుండ చేసినందునవారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయ మొందుదురు.౹ అన్నపానములు లేకపోయినందునవారు శ్రమనొంది విభ్రాంతిపడి యొకనినొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలన నశించిపోవుదురు. మరియు నరపుత్రుడా, నీవు మంగలకత్తివంటి వాడిగల కత్తియొకటి తీసికొని నీ తలను గడ్డమును క్షౌరముచేసికొని, త్రాసు తీసికొని ఆ వెండ్రుకలను తూచి భాగములు చేయుము.౹ పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవభాగమును కాల్చి, రెండవభాగమును తీసి ఖడ్గముచేత హతముచేయు రీతిగా దానిని చుట్టు విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము; నేను ఖడ్గముదూసి వాటిని తరుముదును.౹ అయితే వాటిలో కొన్నిటిని తీసికొని నీ చెంగున కట్టుకొనుము;౹ పిమ్మట వాటిలో కొన్నిటిని మరల తీసి అగ్నిలోవేసి కాల్చుము; దానినుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరిని తగులబెట్టును. మరియు ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చెను —ఇది యెరూషలేమే గదా, అన్యజనులమధ్య నేను దాని నుంచితిని, దానిచుట్టు రాజ్యములున్నవి.౹ అయితే వారు నా విధులను తృణీకరించి, నా కట్టడల ననుసరింపక దుర్మార్గతననుసరించుచు, నా విధులను కట్టడలను త్రోసి వేసి తమ చుట్టునున్న అన్యజనుల కంటెను దేశస్థులకంటెను మరి యధికముగా దుర్మార్గులైరి కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నా కట్టడల ననుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై, మీ చుట్టునున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక, మీరు మీ చుట్టునున్న దేశస్థులకంటె మరి యధికముగా కఠినహృదయులైతిరి.౹ కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును.౹ నీ హేయ కృత్యములనుబట్టి పూర్వమందు నేను చేయనికార్యమును, ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును.౹ కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు, ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశల చెదరగొట్టుదును.౹ నీ హేయదేవత లన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచితివి గనుక కరుణాదృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింప జేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు కరవు వచ్చి యుండగా నీలో మూడవభాగము తెగులుచేత మరణమవును, మూడవభాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును.౹ నాకోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొనుకాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసి కొందురు ఆలాగు నీ చుట్టునున్న అన్యజనులలో నిన్ను చూచువారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును.౹ కావున నీ పోషణాధారము తీసివేసి, నీమీదికి నేను మహాక్షామము రప్పించి, నీవారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి, కోపముచేతను క్రోధముచేతను కఠినమైన గద్దిం పులచేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టునున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు; యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను.౹ ఈ ప్రకారము నేను నీమీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును, అవి నీకు పుత్ర హీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీమీదికి ఖడ్గమును రప్పించెదను; యెహోవానగు నేనే యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతములతట్టు చూచి వాటివిషయమై యీ మాటలు ప్రకటించుము –ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి; పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నతస్థలములను నాశనము చేసెదను.౹ మీ బలిపీఠములు పాడై పోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్నములవును, మీ బొమ్మల యెదుట మీ జనులను నేను హతము చేసెదను.౹ ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మలయెదుట పడవేసి, మీ యెముకలను మీ బలిపీఠములచుట్టు పారవేయుదును.౹ నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు ఛిన్నా భిన్నములగును, సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడ గొట్టబడును, మీ పనులు నాశనమగును, మీ నివాస స్థలములన్నిటిలో నున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నతస్థలములు విడువబడును,౹ మీ జనులు హతులై కూలుదురు.౹ అయినను మీరు ఆయా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యజనులమధ్య ఉండనిచ్చెదను.౹ మరియు నన్ను విసర్జించినవారి విశ్వాసఘాతకమైన వ్యభిచారమనస్సును, విగ్రహముల ననుసరించిన వ్యభిచారదృష్టిని నేను మార్చి నాతట్టు తిరుగజేయగా, చెరపట్టబడినవారై శేషించినవారు అన్యజనులమధ్య నన్ను జ్ఞాపకము చేసికొని, తామనుసరించిన హేయకృత్యములన్నిటినిబట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు; ఈ కీడు వారికి చేసెదనని నేను చెప్పినమాట వ్యర్థము కాదు. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా — నీచేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములనుబట్టి అయ్యో అని అంగలార్చుము; ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారు కూలుదురు.౹ దూరముననున్నవారు తెగులుచేత చత్తురు, దగ్గర నున్నవారు ఖడ్గముచేత కూలుదురు, శేషించి ముట్టడి వేయబడినవారు క్షామముచేత చత్తురు; ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును.౹ తమ విగ్రహములమధ్యను తాముకట్టిన బలిపీఠములచుట్టును ఎత్తయిన కొండలన్నిటిమీదను సకల పర్వతముల నడి కొప్పులమీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను, పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటిక్రిందను, తమ విగ్రహములన్నిటికి పరిమళ ధూపమువేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులైయుండు కాలమున నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.౹ నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటె మరి నిర్జనముగాను పాడుగానుచేయగా నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, ప్రకటింపుము; ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చియున్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది.౹ నాకోపము నీమీద తెప్పించు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించుచున్నాను.౹ నీయెడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నేను యెహోవానై యున్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసెదను, నీ హేయ కృత్యములు నీ మధ్యనే యుండనిత్తును. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా — దుర దృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది,౹ అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయెను.౹ దేశ నివాసులారా, మీమీదికి దుర్దినము వచ్చుచున్నది, సమ యము వచ్చుచున్నది, దినము సమీపమాయెను, ఉత్సాహ ధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతములమీద వినబడు చున్నది.౹ ఇంక కొంతసేపటికి నేను నా క్రోధమును నీమీద కుమ్మరింతును, నీమీద నాకోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీ సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించెదను.౹ యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై యున్నానని నీవెరుగునట్లు నీ యెడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసెదను, నీ హేయకృత్యములు నీ మధ్యనుండనిత్తును.౹ ఇదిగో యిదే ఆ దినము, అది వచ్చేయున్నది, ఆ దుర్దినము ఉదయించు చున్నది, ఆ దండము పూచియున్నది, ఆ గర్వము చిగి రించియున్నది, బలాత్కారము పుట్టి దుష్టులను దండించున దాయెను.౹ వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావములోనైనను ఏమియు శేషింపదు.౹ కాలమువచ్చుచున్నది, దినము సమీప మాయెను, వారి సమూహమంతటిమీద ఉగ్రత నిలిచియున్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు.౹ వారు బ్రదికి యున్నను అమ్మువాడు అమ్మినదానికి తిరిగి రాడు, ఈ దర్శనము వారి సమూహమంతటికి చెందును, అది తప్పక జరుగును, వారందరు దోషులైరి గనుక తమ ప్రాణము రక్షించు కొనుటకు వారిలో ఎవరును ధైర్యము చేయరు.౹ వారు సర్వసిద్ధులై బాకా నాదము చేయుదురు గాని వారి సమూహమంతటిమీదికి నా ఉగ్రత వచ్చియున్నది గనుక యుద్ధమునకు పూనుకొనువాడొకడును ఉండడు.౹ బయట ఖడ్గమున్నది లోపట తెగులును క్షామమును ఉన్నవి, బయటనున్నవారు ఖడ్గముచేత చత్తురు, పట్టణములోనున్న వారిని క్షామమును తెగులును మ్రింగును.౹ వారిలో ఎవ రైనను తప్పించుకొనినయెడల వారందరును లోయలోని గువ్వలవలె పర్వతములమీదనుండి తమ దోషములనుబట్టి మూల్గులిడుదురు.౹ అందరిచేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్లు నీళ్లవలె తత్తరిల్లును.౹ వారు గోనెపట్టకట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును, అందరు సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును.౹ తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని యెంచుదురు, యెహోవా ఉగ్రతదినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించ జాలదు, అది వారి దోషక్రియలు విడువకుండ అభ్యంతరమాయెను గనుక దానివలనవారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొనజాలకపోదురు.౹ శృంగారమైన ఆయాభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి, దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసెదను,౹ వారు దాని అపవిత్రపరచునట్లు అన్యులచేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించెదను.౹ వారిని చూడకుండ నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధిస్థానమును అపవిత్రపరచుదురు, దొంగలు చొరబడి దానిని అపవిత్ర పరచుదురు.౹ దేశము రక్తముతో నిండియున్నది, పట్టణము బలాత్కారముతో నిండి యున్నది. సంకెళ్లు సిద్ధపరచుము.౹ బలాఢ్యుల యతి శయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధస్థలములు అపవిత్రములగునట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించెదను; ఆ దుష్టులు వారి యిండ్లను స్వతంత్రించుకొందురు.౹ సమూలధ్వంసము వచ్చేయున్నది, జనులు సమాధానము కొరకు విచారించుచున్నారుగాని అది వారికి దొరకదు.౹ నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది; వారు ప్రవక్తయొద్ద దర్శనముకొరకు విచారణచేయుదురుగాని యాజకులు ధర్మశాస్త్రజ్ఞానులు కాకపోయిరి, పెద్దలు ఆలోచన చేయకయే యున్నారు.౹ రాజు వ్యాకులపడుచున్నాడు, అధికారులు భీతినొందుచున్నారు, సామాన్య జనులు వణకుచున్నారు; నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు వారి ప్రవర్తనఫలము నేను వారి మీదికి రప్పింపబోవుచున్నాను, వారు చేసిన దోషములనుబట్టి వారికి తీర్పు తీర్చబోవుచున్నాను. ఆరవ సంవత్సరము ఆరవ నెల అయిదవదినమున నేను నా యింట కూర్చునియుండగాను యూదా పెద్దలు నా యెదుట కూర్చుండియుండగాను ప్రభువైన యెహోవా హస్తము నామీదికి వచ్చెను.౹ అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను, నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజియైనట్టుగాను ఆయన నాకు కనబడెను.౹ మరియు చెయ్యివంటిది ఒకటి ఆయన చాపి నా తలవెండ్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశములమధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరపువైపుననున్న ఆవరణ ద్వారముదగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను.౹ అంతట లోయలో నాకు కనబడిన దర్శనరూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను.౹ –నరపుత్రుడా, ఉత్తరపువైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరపువైపు తేరి చూచితిని; ఉత్తరపువైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను.౹ అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను–నరపుత్రుడా, వారుచేయు దానిని నీవు చూచుచున్నావు గదా; నా పరిశుద్ధస్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడచేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? యీతట్టు తిరిగినయెడల వీటికంటె మరి యధికమైన హేయక్రియలు చూచెదవు.౹ అప్పుడు ఆవరణద్వారముదగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను.౹ –నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవియ్యగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను.౹ –నీవు లోపలికి చొచ్చి, యిక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవియ్యగా నేను లోపలికి పోయి చూచితిని; అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములును హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నియు గోడమీద చుట్టును వ్రాయబడియున్నట్టు కనబడెను.౹ మరియు ఒక్కొకడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బది మందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆయాకారములకు ఎదురుగా నిలిచి యుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను.౹ అప్పుడా యన నాకు సెలవిచ్చినదేమనగా — నరపుత్రుడా — యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా.౹ మరియు ఆయన–నీవు ఈతట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములువారు చేయుట చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతనుగూర్చి యేడ్చుట చూచితిని.౹ అప్పుడాయన–నరపుత్రుడా, యిది చూచితివి గాని నీవు తిరిగి చూచినయెడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకునుమధ్యను ఇంచుమించు ఇరువదియయిదుగురు మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయముతట్టును వారి ముఖములు తూర్పుతట్టును తిరిగి యుండెను; వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి.౹ అప్పుడాయన నాతో ఇట్లనెను–నరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు.౹ కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింప కుందును. మరియు నేను చెవులార వినునట్లు ఆయనగట్టిగా ఈ మాటలు ప్రకటించెను–ఒక్కొకడు తాను హతముచేయు ఆయుధమును చేతపట్టుకొని–పట్టణపు కావలి వారందరును ఇక్కడికి రండి అనెను.౹ అంతలో ఒక్కొ కడు తాను హతముచేయు ఆయుధమును చేతపట్టుకొని, ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గముగా ఆరుగురు మనుష్యులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు, అవిసె నారబట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని యుండెను; వారు ఆలయమున ప్రవేశించి యిత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి.౹ ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపైనుండి దిగి మందిరపు గడప దగ్గరకువచ్చి నిలిచి, అవిసె నారబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా యెహోవా–యెరూషలేమను ఆ పట్టణములో ప్రవేశించి చుట్టు తిరిగి, దానిలో జరిగిన హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారి లలాటముల గురుతు వేయుమని వారికాజ్ఞాపించి నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెను–మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను కనికరమైననులేకుండ అందరిని హతము చేయుడి.౹ అందరు నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని, ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతముచేయ మొదలు పెట్టగా ఆయన–మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైనవారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణములోనివారిని హతము చేయసాగిరి.౹ నేను తప్ప మరి ఎవరును శేషింపకుండ వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని–అయ్యో, ప్రభువా, యెహోవా, యెరూషలేముమీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించినవారినందరిని నశింపజేయుదువా? అని మొఱ్ఱపెట్టగా ఆయన నాకీలాగు సెలవిచ్చెను–ఇశ్రాయేలు వారియొక్కయు యూదావారియొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది; వారు–యెహోవా దేశమును విసర్జించెననియు ఆయన మమ్మును కానడనియు ననుకొని, దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటుతోను నింపియున్నారు.౹ కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారనుభవింపజేసెదను.౹ అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనినవాడు వచ్చి–నీవు నాకాజ్ఞాపించినట్లు నేను చేసితినని మనవి చేసెను. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశమండలమువంటిదానిలో నీలకాంతమయమైన సింహాసనమువంటి దొకటి అగుపడెను.౹ అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనినవానితో యెహోవా–కెరూబు క్రింద నున్న చక్రములమధ్యకు పోయి, కెరూబులమధ్యనున్న నిప్పులు చేతులనిండ తీసికొని పట్టణముమీద చల్లుమని సెలవియ్యగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను.౹ అతడు లోపలికిపోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను; మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను.౹ యెహోవా మహిమ కెరూబులపైనుండి ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను.౹ దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమువరకు వినబడెను.౹ –కెరూబులమధ్యనుండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసికొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకొనినవానికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రముదగ్గర నిలిచెను.౹ కెరూబులలో ఒకడు కెరూబులమధ్య నున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనారబట్ట ధరించుకొనిన వాని చేతిలోనుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను;౹ అంతలో కెరూబుల రెక్కలక్రింద మానవహస్తరూప మొకటి కనబడెను;౹ నేను చూచుచుండగా ఒక్కొక కెరూబు దగ్గర ఒక చక్రముచొప్పున నాలుగు చక్రములు కనబడెను; ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను.౹ ఆ నాలుగు చక్రములు ఏకరీతిగానుండియొక్కొక చక్రమునకులోగా మరియొక చక్రమున్నట్టుగా కనబడెను.౹ అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచున్నట్లుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను, తల యేతట్టు తిరుగునో అవి ఆ తట్టే దానివెంట పోవుచుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను.౹ ఆ నాలుగు కెరూబులయొక్క శరీరములును వీపులును చేతులును రెక్కలును ఆ చక్రములచుట్టును కన్నులతో నిండియుండెను; నాలు గింటికి చక్రములుండెను.౹ నేను వినుచుండగా–తిరుగు డని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.౹ కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖములుండెను; మొదటిది కెరూబుముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజుముఖము.౹ ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే.౹ కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు.౹ జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను యెహోవా మహిమ మందిరపు గడపదగ్గరనుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితోకూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.౹ కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపెట్టితిని.౹ ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్కలును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను.౹ మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను. పిమ్మట ఆత్మ నన్నుఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మము నొద్దకు చేర్చి నన్నుదింపగా గుమ్మపు వాకిట ఇరువదియైదుగురు మనుష్యులు కనబడిరి; వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు బెనాయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి.౹ అప్పుడాయన నాకీలాగు సెలవిచ్చెను–నరపుత్రుడా— యీ పట్టణము పచనపాత్రయనియు, మనము మాంస మనియు, ఇండ్లు కట్టుకొన అవసరములేదనియు చెప్పు కొనుచు ఈ పట్ణణములో పాపము యోచించి దురా లోచన చేయువారు వీరే.౹ కావున వారికి విరోధముగా ప్రవచింపుము; నరపుత్రుడా, ప్రవచింపుము.౹ అంతట యెహోవా ఆత్మ నామీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చిన దేమనగా —నీవు ఈ మాట వారికి తెలియజేయుము, యెహోవా సెలవిచ్చిన మాట యిదే–ఇశ్రాయేలీయులారా, మీరీ లాగున పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభి ప్రాయములు నాకు తెలిసేయున్నవి.౹ ఈ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించితిరి, మీచేత హతులైన వారితో వీధులు నిండియున్నవి.౹ కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా — మీరు హతముచేసి పట్టణములో పడవేసిన శవములే మాంసము, ఈ పట్టణమే పచనపాత్ర, యీ పట్టణములోనుండి మిమ్మును వెళ్ల గొట్టుదును.౹ మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే, నేనే మీమీదికి ఖడ్గము రప్పించెదను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ మరియు మీకు శిక్ష విధించి పట్టణములోనుండి మిమ్మును వెళ్లగొట్టి అన్యులచేతికి మిమ్ము నప్పగించుదును.౹ ఇశ్రాయేలు సరిహద్దులలోగానే మీరు ఖడ్గముచేత కూలునట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.౹ మీరు దాని మధ్య మాంసముగా ఉండునట్లు ఈ పట్టణము మీకు పచనపాత్రగా ఉండదు; నేను ఇశ్రాయేలు సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతును.౹ అప్పుడు మీ చుట్టు నున్న అన్యజనుల విధుల నాచరించుటకై మీరు ఎవని కట్టడల ననుసరింపక మానితిరో యెవని విధులను ఆచరింపకపోతిరో, ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలిసికొందురు.౹ నేను ఆప్రకారము ప్రవచింపుచుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి యెలుగెత్తి–అయ్యో, ప్రభువా, యెహోవా, ఇశ్రాయేలీయుల శేషమును నీవు నిర్మూలము చేయుదువా? అని మొఱ్ఱపెట్టితిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నరపుత్రుడా, యెరూషలేము పట్టణపువారు–ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్య బడెను, మీరు యెహోవాకు దూరస్థులుగా నుండుడి, అని యెవరితో చెప్పుచున్నారో వారందరు ఇశ్రాయేలీయులై నీకు సాక్షాద్బంధువులును నీచేత బంధుత్వధర్మము నొందవలసినవారునై యున్నారు.౹ కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్లిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును.౹ కాగా నీవు ఈ మాట ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఆయా జనములమధ్యనుండి నేను మిమ్మును సమకూర్చి, మీరు చెదరగొట్టబడిన దేశములలోనుండి మిమ్మును రప్పించి, ఇశ్రాయేలుదేశమును మీ వశము చేసెదను.౹ వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచియున్న విగ్రహములను తీసివేసి, తాము చేసియున్న హేయక్రియలు చేయుట మానుదురు.౹ వారు నా కట్ట డలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.౹ అప్పుడు వారు నాకు జనులైయుందురు నేను వారికి దేవుడనై యుందును.౹ అయితే తమ విగ్రహములను అనుసరించుచు, తాము చేయుచు వచ్చిన హేయక్రియలను జరిగింప బూనువారిమీదికి తమ ప్రవర్తన ఫలము రప్పింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములును వాటి ప్రక్కనుండెను అంతలో ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైన నుండెను.౹ మరియు యెహోవా మహిమ పట్టణములోనుండి పైకెక్కి పట్టణపు తూర్పుదిశనున్న కొండకుపైగా నిలిచెను.౹ తరువాత ఆత్మ నన్నుఎత్తి, నేను దైవాత్మవశుడను కాగా, దర్శనములో నైనట్టు కల్దీయులదేశమునందు చెరలో ఉన్నవారియొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండ పైకెక్కెను.౹ అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరచిన వాటినన్నిటిని చెరలో ఉన్నవారికి నేను తెలియజేసితిని. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారిమధ్య నీవు నివసించుచున్నావు; వారు ద్రోహులై యుండి, చూచుకన్నులు కలిగియు చూడక యున్నారు; విను చెవులు కలిగియు వినకయున్నారు.౹ నరపుత్రుడా, దేశాంతరము పోవువానికి తగిన సామగ్రిని మూటకట్టుకొని, పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై, నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరియొక స్థలమునకు పొమ్ము; వారు తిరుగుబాటు చేయువారు, అయినను దీని చూచి విచారించు కొందురేమో దేశాంతరము పోవువాడు తన సామగ్రిని తీసికొనునట్లువారు చూచుచుండగా నీ సామగ్రిని పగటియందు బయటికి తీసికొనివచ్చి వారు చూచుచుండగా అస్తమయమున ప్రయాణమై పరదేశమునకు పోవువాని వలె నీవు బయలుదేరవలెను వారు చూచుచుండగా గోడకు కన్నమువేసి నీ సామగ్రిని తీసికొని దాని ద్వారా బయలుదేరుము వారు చూచుచుండగా రాత్రియందు మూట భుజముమీద పెట్టుకొని నేల కనబడకుండ నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము, నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించితిని.౹ ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను చేసితిని, ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటియందు నా సామగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామగ్రిని తీసికొని మూట భుజముమీద పెట్టుకొంటిని ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, నీవు చేయునదేమని తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము –ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీయులకందరికిని చెందును కాబట్టి వారికీమాట చెప్పుము–నేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినది వారికి కలుగును, వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు మరియు వారిలో ప్రధాను డగువాడు రాత్రియందు సామగ్రిని భుజముమీద పెట్టుకొని తానే మోసికొని పోవుటకై తన సామగ్రిని బయటికి తెచ్చు కొనవలెనని గోడకు కన్నమువేసి నేల చూడకుండ ముఖము కప్పుకొని పోవును అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీయుల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను, అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును మరియు వారికి సహాయులై వచ్చినవారినందరిని అతని దండు వారినందరిని నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తిదూసి వారిని తరిమెదను నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్లగొట్టిన తరువాత నేనే యెహో వానైయున్నానని వారు తెలిసికొందురు అయితే నేను యెహోవానైయున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయకృత్యములన్నిటిని వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గముచేత కూలకుండను క్షామమునకు చావకుండను తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, వణకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లుత్రాగి దేశములోని జనులకీలాగు ప్రకటించుము–యెరూషలేము నివాసులనుగూర్చియు ఇశ్రాయేలుదేశమునుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా — దానిలో నున్న కాపురస్థులందరును చేసిన బలాత్కారమునుబట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసి కొనునట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడగును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా దినములు జరిగి పోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత యేమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయుము —ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇకమీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండ నేను దానిని నిరర్థకము చేసెదను గనుక నీవు వారితో ఇట్లనుము–దినములు వచ్చుచున్నవి, ప్రతిదర్శనము నెర వేరును వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదె గాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను ఉండవు.౹ యెహోవానైన నేను మాటయిచ్చుచున్నాను, నే నిచ్చు మాట యికను ఆలస్యములేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాటయిచ్చి దాని నెరవేర్చెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా–వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరుగవలెననియు బహు కాలము జరిగినతరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు గదా కాబట్టి నీవు వారితో ఇట్లనుము— ఇకను ఆలస్యములేక నేను చెప్పిన మాటలన్నియు జరుగును, నేను చెప్పినమాట తప్పకుండ జరుగును, ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, ప్రవచించు చున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవ చించి, మనస్సువచ్చినట్లు ప్రవచించువారితో నీవీలాగు చెప్పుము–యెహోవా మాట ఆలకించుడి.౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–దర్శనమేమియు కలుగ కున్నను స్వబుద్ధిననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ.౹ ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు.౹ యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచునట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు.౹ వారు వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపక పోయినను, తాము చెప్పినమాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు.౹ నేను సెలవియ్యకపోయినను–ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పినయెడల మీరు కనినది వ్యర్థమైన దర్శనముగదా? మీరు నమ్మదగని సోదెగాండ్రయితిరి గదా? కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ వ్యర్థమైన దర్శనములు కనుచు, నమ్మదగని సోదెగాండ్రయిన ప్రవక్తలకు నేను పగవాడను, వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరినవారు కాక పోదురు, వారు ఇశ్రాయేలీయుల దేశములోనికి తిరిగి రారు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలిసికొందురు.౹ సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు.౹ ఇందువలననే పూయుచున్న వారితో నీ విట్లనుము–వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుపాను దాని పడగొట్టగా అది పడిపోవును.౹ ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి–మీరు పూసిన పూత యేమాయెనని అడుగుదురు గదా? ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా — నేను రౌద్రము తెచ్చుకొని తుపానుచేత దానిని పడగొట్టుదును, నాకోపమునుబట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమునుబట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును,౹ దాని పునాది కనబడునట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను, అది పడిపోగా దానిక్రింద మీరును నాశనమగుదురు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలిసికొందురు.౹ ఈలాగున ఆ గోడమీదను దానిమీద గచ్చుపూత పూసినవారిమీదను నాకోపము నేను తీర్చుకొని, ఆ గోడకును దానికి పూత పూసినవారికిని పనితీరెనని మీతో చెప్పుదును.౹ యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయువారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, మనస్సునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెలమీద కఠినదృష్టియుంచి వారికి విరోధముగా ఈలాగు ప్రవచింపుము –ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–మనుష్యులను వేటాడ వలెనని చేతుల కీళ్లన్నిటికిని గుడ్డలుకుట్టి, యెవరి యెత్తు చొప్పున వారి తలలకు ముసుకులుచేయుస్త్రీలారా, మీకు శ్రమ; మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు.౹ అబద్ధపుమాటల నంగీకరించు నా జనులతో అబద్ధపుమాటలు చెప్పుచు, చేరెడు యవలకును రొట్టెముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు, బ్రదుకుటకు అపాత్రులైన వారిని బ్రదికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు.౹ కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధములచేత మీరు దుఃఖింపజేయుదురు, దుర్మార్గులు తమ దుష్‌ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించు కొనకుండ మీరు వారిని ధైర్యపరతురు గనుక మనుష్యులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను, మీ కౌగిటిలోనుండి వారిని ఊడ బెరికి, మీరు వేటాడు మనుష్యులను నేను విడిపించి తప్పించుకొననిచ్చెదను.౹ మరియు నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలోనుండి నా జనులను విడిపించెదను, వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు.౹ మీరికను వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, సోదె చెప్పక యుందురు; నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు నా జనులను మీ వశమునుండి విడిపించెదను. అంతట ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, యీ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమయెదుటనే పెట్టుకొని యున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి యీలాగు చెప్పుము— ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–తమ విస్తారమైన విగ్రహములనుబట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని తమ యెదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్తయొద్దకువచ్చు ఇశ్రాయేలీయులందరు తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరచునట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరమిచ్చుచున్నాను.౹ కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా— మీ విగ్రహములను విడిచిపెట్టి మీరుచేయు హేయ కృత్యములన్నిటిని మాని మనస్సు త్రిప్పుకొనుడి ఇశ్రాయేలీయులలోను వారి దేశములో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని అభ్యంతరమును తమయెదుట పెట్టుకొని తమ నిమిత్తమై నాయొద్ద విచారణచేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చినయెడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదను.౹ ఆ మనుష్యులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలోనుండి నేను వారిని నిర్మూలము చేసెదను.౹ మరియు ప్రవక్త యొకడు మోసపోయి ఒకమాట చెప్పినయెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలోనుండి వానిని నిర్మూలముచేసెదను ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాముచేయు అతిక్రమములన్నిటిచేత తమ్మును అపవిత్రపరచుకొనకయు నుండి, నా జనులగునట్లును నేను వారికి దేవుడనైయుండు నట్లును వారు ఆలాగున తమకు కలుగజేసికొనిన దోషమునకు శిక్షనొందుదురు, ప్రవక్తయొద్ద విచారించువాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును, ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపముచేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారములేకుండ జేసి కరవు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టిదేశములోనుండినను వారు తమ నీతిచేత తమ్మునుమాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ బాటసారులు సంచరింపకుండ ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దానిమీదికి దుష్ట మృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును; నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ నేను అట్టి దేశముమీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి–నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞ ఇచ్చినయెడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ అట్టి దేశములోనికి తెగులు పంపి మనుష్యులును పశువులును నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మ రించినయెడల నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించు కొందురుగాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గముచేతను క్షామముచేతను దుష్టమృగములచేతను తెగులుచేతను ఈ నాలుగు విధముల యెరూషలేముమీద తీర్పుతీర్చినయెడల అట్టి వారుండినను వారు దాని రక్షింపలేరు దానిలో కుమాళ్ల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును, వారు బయటికి రప్పింపబడెదరు, మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లువారు బయలుదేరి మీ యొద్దకు వచ్చెదరు, దాని గుర్తుపెట్టి యెరూషలేముమీదికి నేను రప్పించిన కీడునుగూర్చియు దానికి నేను సంభవింప జేసినదంతటిని గూర్చియు మీరు ఓదార్పు నొందుదురు మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలిసికొని ఓదార్పు నొందుదురు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, ద్రాక్షచెట్టుకఱ్ఱ అడవిచెట్లలోనున్న ద్రాక్షచెట్టుకఱ్ఱ తక్కినచెట్లకఱ్ఱకంటెను ఏమైన శ్రేష్ఠమా? యే పనికైనను దాని కఱ్ఱను తీసికొందురా? యేయొక ఉపకరణము తగిలించుటకై యెవరైన దాని కఱ్ఱతో మేకునైనను చేయుదురా? అది పొయ్యికే సరిపడును గదా? అగ్నిచేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా? కాలక ముందు అది యే పనికిని తగక పోయెనే; అగ్ని దానియందు రాజి దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా? కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను అగ్ని కప్పగించిన ద్రాక్షచెట్టు అడవి చెట్లలో ఏలాటిదో యెరూషలేము కాపురస్థులును ఆలాటివారే గనుక నేను వారిని అప్పగింపబోవుచున్నాను.౹ నేను వారిమీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును; వారి యెడల నేను కఠిన దృష్టిగలవాడనై యుండగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.౹ వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడుచేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయకృత్యములను దానికి తెలియజేసి నీవీలాగు ప్రకటింపుము –ప్రభువైన యెహోవా యెరూషలేమునుగూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు–నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశసంబంధమైనవి; నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు.౹ నీ జననవిధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభిసూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి బట్టచుట్టకపోయిరి.౹ ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని యెవరును కటాక్షింపలేదు, నీయందు జాలిపడినవాడొకడును లేక పోయెను; నీవు పుట్టిననాడే బయటనేలను పారవేయబడి, చూడ అసహ్యముగా ఉంటివి.౹ అయితే నేను నీ యొద్దకు వచ్చి, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి— నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రదుకుమని నీతో చెప్పితిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రదుకుమని నీతో చెప్పితిని.౹ మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణభూషితురాలవైతివి; దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనము లేర్పడెను, తలవెండ్రుకలు పెరిగెను.౹ మరియు నేను నీయొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి యుండెను గనుక నీకు అవమానము కలుగకుండ నిన్ను పెండ్లిచేసికొని నీతో నిబంధనచేసికొనగా నీవు నా దాన వైతివి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీమీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపెని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని, సన్నమైన యెఱ్ఱని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని, సన్నపు అవిసెనారబట్ట నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని.౹ మరియు ఆభరణములచేత నిన్ను అలంకరించి నీచేతులకు కడియములుపెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని.౹ ఈలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి, సన్నపు అవిసె నారయు పట్టును విచిత్రపు కుట్టుపెనియుగల బట్టలును నీకు ధరింపజేసి, గోధుమలును తేనెయు నూనెయు నీ కాహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి.౹ నేను నీ కను గ్రహించిన నా ప్రభావముచేత నీ సౌందర్యము పరిపూర్ణముకాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశం సించుచు వచ్చిరి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసికొని, నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారినిపోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితోనెల్ల పోతివి.౹ మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి, చిత్రముగా అలంకరింపబడిన ఉన్నతస్థలములను ఏర్పరచి, వాటిమీద పండుకొని వ్యభిచారము చేసితివి; అట్టి కార్యములు ఎంతమాత్రమును జరుగకూడనివి, అట్టివియునిక జరుగవు.౹ నేను నీకిచ్చిన బంగారువియు వెండివియునైన ఆభరణములను తీసికొని నీవు పురుషరూప విగ్రహములను చేసికొని వాటితో వ్యభిచరించితివి.౹ మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపజేసి, నా తైలమును నా ధూపమును వాటికర్పించితివి.౹ భోజనమునకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసికొని యింపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి, ఆలాగున జరిగెను గదా? యిదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ [20-21] మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మ్రింగివేయునట్లు వాటి పేరట వారిని వధించితివి, నీ జారత్వము చాలకపోయెననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి యప్పగించితివి.౹ *** నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగానుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనస్సునకు తెచ్చు కొనక ఇన్ని హేయక్రియలను ఇంక జారత్వమును చేయుచు వచ్చితివి.౹ ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ నీకు శ్రమ; యిదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ నీవు వీధి వీధిని గుళ్లు కట్టితివి, యెత్తయిన బలిపీఠములను ఏర్పరచితివి,౹ ప్రతి అడ్డదోవను నీ బలిపీఠముకట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చినవారికందరికిని నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి.౹ మరియు నీవు మదించియున్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వక్రియలను పెంపుచేసి నాకు కోపము పుట్టించితివి.౹ కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువచేసి, నీ కామవికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను.౹ అంతటితో తృప్తినొందక అష్షూరువారితోను నీవు వ్యభిచరించితివి, వారితోకూడి జారత్వము చేసినను తృప్తినొందకపోతివి.౹ కనానుదేశము మొదలుకొని కల్దీయదేశమువరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తినొందలేదు.౹ నీ హృదయమెంత బలహీన మాయెను! సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటినన్నిటిని జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను గుళ్లను ప్రతి రాజవీధిని యొక బలిపీఠమును కట్టుచు, వేశ్యచేయునట్లు చేయక, జీతము పుచ్చుకొననొల్లక యుంటివి. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి [32-33] అన్యులను చేర్చుకొనును గదా? పురుషులు వేశ్యలకు పడుపుసొమ్మిచ్చెదరు గదా? నీ విటకాండ్రు నలుదిక్కులనుండి వచ్చి నీతో వ్యభిచరించునట్లు వారికందరికి నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి, బహుమానముల నిచ్చుచు వచ్చితివి.౹ *** నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయు లేదు, నీకు పడుపుసొమ్మిచ్చుటయు లేదు, నీవే యెదురు జీత మిచ్చితివి, ఇదే నీకును వారికిని కలిగిన భేదము; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వేశ్యా, యెహోవా మాట ఆలకింపుము –ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీ విటకాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరచి నీవు వ్యభిచారము చేసి నీ మానము నీవు కనుపరచుకొనిన దానినిబట్టియు, నీ విటకాండ్రనుబట్టియు, హేయ విగ్రహములనుబట్టియు, నీవు వాటికప్పగించిన నీ బిడ్డల రక్తమునుబట్టియు,౹ నీవు సంభోగించిన నీ విటకాండ్రనందరిని నీకిష్టులైన వారినందరిని నీవు ద్వేషించు వారినందరిని నేను పోగుచేయుచున్నాను; వారిని నీ చుట్టు పోగుచేసి సమకూర్చి వారికి నీ మానము కనబడునట్లు నేను దాని బయలుపరచెదను.౹ జారిణులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి, క్రోధముతోను రోషముతోను నీకు రక్తము నియమింతును.౹ వారి చేతికి నిన్ను అప్పగించెదను, నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి నీవు నిలువబెట్టిన బలిపీఠములను ఊడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసికొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు.౹ వారు నీమీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు, కత్తులచేత నిన్ను పొడిచి వేయుదురు.౹ వారు నీ యిండ్లను అగ్నిచేత కాల్చుదురు, అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు, ఈలాగు నేను నీ వేశ్యాత్వమును మాన్పింపగా నీవికను పడుపు సొమ్మియ్యక యుందువు;౹ ఈ విధముగా నీమీదనున్న నా క్రోధమును చల్లార్చుకొందును, నా రోషము నీయెడల మాని పోవును, ఇకను ఆయాసపడకుండ నేను శాంతము తెచ్చు కొందును.౹ నీ యౌవనదినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసికించితివి, గనుక నీవు చేసియున్న హేయక్రియలన్నిటికంటెను, ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించకుండునట్లు నీ ప్రవర్తననుబట్టి నేను నీకు శిక్ష విధింతును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సామెతలు చెప్పువారందరును–తల్లి యెట్టిదో బిడ్డయు అట్టిదే యని నిన్నుగూర్చియందురు.౹ పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు, పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్కచెల్లెండ్రతో నీవు సాటి దానవు; నీ తల్లి హిత్తీయురాలు నీ తండ్రి అమోరీయుడు,౹ నీ యెడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలును నీకు అక్కలు, నీ కుడిప్రక్కను నివసించు సొదొమయు దాని కుమార్తెలును నీకు చెల్లెండ్రు.౹ అయితే వారి ప్రవర్తన ననుసరించుటయు, వారుచేయు హేయక్రియలు చేయుటయు స్వల్పకార్యమని యెంచి, వారి నడతలను మించునట్లుగా నీవు చెడుమార్గములయందు ప్రవర్తించితివి.౹ నీవును నీ కుమార్తెలును చేసినట్లు నీ చెల్లెలైన సొదొమయైనను దాని కుమార్తెలైనను చేసినవారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను.౹ వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్లగొట్టితిని.౹ షోమ్రోను సహా నీ పాపములలో సగమైన చేయలేదు, అది చేసినవాటి కంటె నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి; నీవు ఇన్ని హేయక్రియలుచేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనుపరచితివి.౹ నీవు వారికంటె అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు; నీవు వారికి విధించిన అవమానశిక్ష నీకే రావలెను; నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునొందుము.౹ నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చునట్లు అపాయమునొందిన సొదొమను దాని కుమార్తెలను షోమ్రోనును దాని కుమార్తెలను వారివలెనే అపాయమొందిన నీ వారిని మరల స్థాపించెదరు.౹ సొదొమయు దాని కుమార్తెలును తమ పూర్వస్థితికి వచ్చెదరు, షోమ్రో నును దాని కుమార్తెలును తమ పూర్వస్థితికి వచ్చెదరు, నీవును నీ కుమార్తెలును మీ పూర్వస్థితికి వచ్చెదరు.౹ నీ చుట్టు ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కుమార్తెలును సిరియా కుమార్తెలును నిన్ను అవమానపరచగా నీదుర్మార్గము వెల్లడి చేయబడకముందు నీవు గర్వించియున్నప్పుడు నీ చెల్లెలగు సొదొమ ప్రస్తావమెత్తక పోతివి.౹ నీవు చేసిన మోసమును నీ హేయకృత్యములను నీవే భరించితివి; ఇదే యెహోవా వాక్కు ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు — చేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీక రించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను.౹ నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును.౹ నీ అక్కచెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనునప్పుడు నీ వ్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు.౹ నేను యెహోవానని నీవు తెలిసికొనునట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను.౹ నీవు చేసినది అంతటినిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, నీవు ఉపమానరీతిగా విప్పుడు కథ యొకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా — ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నానావిధములగు విచిత్ర వర్ణములుగల రెక్కలును ఈకెలును పొడుగైన పెద్ద రెక్కలునుగల యొక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి యొక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను.౹ అది దాని లేతకొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక పురమందు దానిని నాటెను.౹ మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసికొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను.౹ అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయెను; దాని కొమ్మలు ఆ పక్షిరాజువైపున అల్లుకొనుచుండెను, దాని వేళ్లు క్రిందికి తన్నుచుండెను; ఆలాగున ఆ ద్రాక్షచెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలువేసెను.౹ పెద్ద రెక్కలును విస్తారమైన యీకెలునుగల యింకొక గొప్ప పక్షి రాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి, బహుగా ఫలించుమంచి ద్రాక్షావల్లి యగునట్లుగా అది విస్తార జలముగల మంచి భూమిలో నాటబడియుండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పాదులకాలువ లోనుండి అది యా పక్షితట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను.౹ [8-9] కావున నీవీలాగు ప్రకటింపుము —ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–అట్టి ద్రాక్షావల్లి వృద్ధినొందునా? అది యెండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు, దాని చిగుళ్లు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగిరింపవు.౹ *** అది నాటబడినను వృద్ధి పొందునా? తూర్పుగాలి దానిమీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును, అది నాటబడిన పాదిలోనే యెండి పోవును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుము–ఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండుటకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను.౹ [13-14] మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి, ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేకయుండునట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుటవలన అది నిలిచియుండునట్లును, అతనితో నిబంధనచేసి అతనిచేత ప్రమాణముచేయించి, దేశములోని పరాక్రమవంతులను తీసికొనిపోయెను.౹ *** అయితే అతడు తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యము నిచ్చి సహాయముచేయవలెనని యడుగుటకై ఐగుప్తుదేశమునకు రాయబారులను పంపి బబులోనురాజు మీద తిరుగుబాటు చేసెను; అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసినవాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు ఎవనికి తాను ప్రమాణముచేసి దాని నిర్లక్ష్యపెట్టెనో, యెవనితో తానుచేసిన నిబంధనను అతడు భంగముచేసెనో, యెవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతినొందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ యుద్ధము జరుగగా అనేక జనులను నిర్మూలము చేయవలెనని కల్దీయులు దిబ్బలువేసి బురుజులు కట్టిన సమయమున, ఫరో యెంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రము చేయజాలడు.౹ తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను, తన చెయ్యి యిచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఎంతమాత్రమును తప్పించుకొనడు.౹ ఇందుకు ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు— అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరచిన నిబంధన నేను చేసినదే గదా, నా జీవముతోడు ఆ దోషశిక్ష అతని తలమీదనే మోపు దును,౹ అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి యతని చిక్కించుకొని బబులోనుపురమునకు అతని తీసికొనిపోయి, నామీద అతడు చేసియున్న విశ్వాసఘాతకమునుబట్టి అక్కడనే అతనితో వ్యాజ్యెమాడుదును.౹ మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితినని మీరు తెలిసికొనునట్లు అతని దండువారిలో తప్పించుకొని పారిపోయినవారందరును ఖడ్గముచేత కూలుదురు, శేషించినవారు నలుదిక్కుల చెదరిపోవుదురు. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఎత్తయిన దేవదారువృక్షపు పైకొమ్మ యొకటి నేను తీసి దాని నాటుదును, పైగా నున్నదాని శాఖలలో లేతదాని త్రుంచి అత్యున్నతపర్వతముమీద దాని నాటుదును.౹ ఇశ్రాయేలుదేశములోని యెత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్ఠమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులును దానిలో గూళ్లు కట్టుకొనును.౹ దాని కొమ్మల నీడను అవి దాగును; మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవు నట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమియందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చెదను. మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే; ఇశ్రాయేలీయుల దేశమునుగూర్చి ఈ సామెత మీ రెందుకు పలికెదరు? నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు; పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును.౹ ఒకడు నీతిపరుడై నీతిన్యాయములను అనుసరించువాడైయుండి పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టయైనదానిని కూడకయు,౹ ఎవనినైనను బాధపెట్టకయు, ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయునుండు వాడై, ఆకలిగలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి వడ్డికి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధుల ననుసరించుచుండినయెడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రదుకును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై, చేయరాని క్రియలలో దేనినైనను చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయకయుండినయెడల, అనగా పర్వతములమీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు,౹ దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారముచేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహములతట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు,౹ అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రిచేసిన పాపములన్నిటిని చూచి, ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకయుండినయెడల, అనగా పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు,౹ ఎవనినైనను బాధపెట్టకయు, తాకట్టు ఉంచు కొనకయు, బలాత్కారముచేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి బీదవాని మీద అన్యాయముగా చెయ్యివేయక లాభముకొరకు అప్పియ్యకయు, వడ్డి పుచ్చుకొనకయు నుండినవాడై, నా విధుల నాచరించుచు నా కట్టడల ననుసరించుచు నుండినయెడల అతడు తన తండ్రిచేసిన దోషమునుబట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రదుకును.౹ అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారముచేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమునుబట్టి మరణము నొందును.౹ అయితే మీరు–కుమారుడు తన తండ్రియొక్క దోషశిక్షను ఏల మోయుటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతిన్యాయముల ననుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవ శ్యముగా బ్రదుకును.౹ పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోషశిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోషశిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును.౹ అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును.౹ అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును.౹ దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులుచేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణము నొందును.౹ అయితే–యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే మీ మార్గమే గదా అన్యాయమైనది? నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసినయెడల అతడు దానినిబట్టి మరణము నొందును; తాను పాపము చేయుటనుబట్టియేగదా అతడు మరణమునొందును? మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరిగించినయెడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమక్రియలన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును.౹ అయితే ఇశ్రాయేలీయులు–యెహోవా మార్గము న్యాయముకాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమేగాని మీ మార్గము న్యాయము కాదు.౹ కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి.౹ మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సుత్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులనుగూర్చి ప్రలాపవాక్యము నెత్తి ఇట్లు ప్రకటింపుము –నీ తల్లి ఎటువంటిది? ఆడుసింహము వంటిది, ఆడుసింహములమధ్య పండుకొనెను, కొదమ సింహములమధ్య తన పిల్లలను పెంచెను;౹ వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించున దాయెను.౹ అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తుదేశమునకు దాని తీసికొనిపోయిరి.౹ తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమాయెనని తెలిసికొని, తన పిల్లలలో మరియొక దాని చేపెట్టి దాని పెంచి కొదమసింహముగా చేసెను.౹ ఇదియు కొదమసింహమై కొదమ సింహములతోకూడ తిరుగులాడి వేటాడనేర్చుకొని మనుష్యులను భక్షించునదై వారి నగరులను అవమానపరచి వారి పట్టణములను పాడుచేసెను; దాని గర్జనధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను.౹ నలుదిక్కుల దేశపు జనులందరు దాని పట్టుకొనుటకు పొంచియుండి ఉరి నొగ్గగా అది వారి గోతిలో చిక్కెను.౹ అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునొద్దకు తీసికొనిపోయి అతనికి అప్పగించిరి; దాని గర్జనము ఇశ్రాయేలీయుల పర్వతములమీద ఎన్నటికిని వినబడకుండునట్లువారు దానిని గట్టి స్థలమందుంచిరి. మరియు నీకు క్షేమము కలిగియుండగా నీ తల్లి ఫల భరితమై తీగెలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లివలె నుండెను.౹ భూపతు లకు దండములైనట్టి గట్టిచువ్వలు దానికి కలిగియుండెను, అది మేఘములనంటునంతగా పెరిగెను, విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను.౹ అయితే బహు రౌద్రముచేత అది పెరికివేయబడినదై నేలమీద పడవేయ బడెను, తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టిచువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను.౹ [13-14] ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి యెండిపోయి నిర్జలస్థలములలో నాట బడియున్నది. మరియు దాని కొమ్మల చువ్వలలోనుండి అగ్ని బయలు దేరుచు దాని పండ్లను దహించుచున్నది గనుక రాజదండమునకు తగిన గట్టిచువ్వ యొకటియు విడువబడ లేదు. ఇదియే ప్రలాపవాక్యము, ఇదియే ప్రలాపమునకు కారణమగును. ఏడవ సంవత్సరము అయిదవ నెల పదియవదినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణచేయుటకై నా యొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనుము — ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే. నా జీవముతోడు నావలన ఏ ఆలోచనయైనను మీకు దొరకదు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయకృత్యములను వారికి తెలియజేయుము.౹ ఎట్లనగా ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణముచేసిన నాడును, ఐగుప్తుదేశమందు నన్ను వారికి ప్రత్యక్ష పరచుకొని ప్రమాణముచేసి నేను మీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి వారికొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియు, సకల దేశములకు ఆభరణమై నదియునైన దేశములోనికి తోడుకొని పోయెదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని.౹ అప్పుడు–నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడు తన కిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుటచేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించితిని.౹ అయితే వారు నా మాట విననొల్లక నామీద తిరుగుబాటు చేసి, తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారిమీద కుమ్మరించి నాకోపము వారి మీద తీర్చుకొందునని యనుకొంటిని.౹ అయితే ఏ అన్యజనులయెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో, యే అన్యజనులమధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామఘనతకొరకు నేను వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించితిని.౹ వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని. ఎవడైన వాటిననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును.౹ మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతిదినములను వారికి సూచనగా నేను నియమించితిని.౹ అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుసరింపక, తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా, అరణ్యమందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని.౹ అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో యే అన్యజనులలోనుండి నేను వారిని రప్పించితినో వారి యెదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని.౹ మరియు తమకిష్టమైన విగ్రహముల ననుసరింపవలెనని కోరి, వారు నా విధులను తృణీకరించి నా కట్టడల ననుసరింపక నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా ఇచ్చెదనని నేను సెలవిచ్చినట్టియు, పాలు తేనెలు ప్రవహించునట్టియునైన సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసితిని.౹ అయినను వారు నశించి పోకుండునట్లు వారియందు కనికరించి, అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయక పోతిని.౹ వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితిని–మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు, వారి పద్ధతులనుబట్టి ప్రవర్తింపకయు, వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి.౹ మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడల ననుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుడి.౹ నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు ఆ విశ్రాంతిదినములు నాకును మీకునుమధ్యను సూచనగా ఉండును.౹ అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి, తామనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు, నా విధులను గైకొనకయు, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచిరి గనుక, వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి నాకోపము వారిమీద తీర్చుకొందునని యనుకొంటిని.౹ అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనులమధ్య నా నామమునకు దూషణ కలుగకుండునట్లు ఏ జనులలోనుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని.౹ [23-24] మరియు వారు నా విధుల ననుసరింపక నా కట్టడలను తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచి, తమపితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింప గోరగా, అన్యజనులలో వారిని చెదరగొట్టి సకలదేశములలోనికి వారిని వెళ్లగొట్టుదునని ప్రమాణము చేసితిని.౹ *** నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలముకాని కట్టడలను తాము బ్రదుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితిని.౹ తొలిచూలిని అగ్నిగుండముదాటించి బలి దానముల నిచ్చుటచేత తమ్మును తాము అపవిత్రపరచు కొననిచ్చితిని. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాటలాడి ఇట్లు ప్రకటింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీపితరులు నాయెడల అతిక్రమముచేసి నన్ను దూషించి వారికిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశములోనికి నేను వారిని రప్పించిన తరువాత, ఎత్తయిన యొక కొండనేగాని, దట్టమైన యొక వృక్షమునేగాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు, అర్పణలను అర్పించుచు, అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు, పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి.౹ మీరు పోవుచున్న ఉన్నతస్థలములేమిటని నేనడిగితిని; కాబట్టి ఉన్నతస్థలమను పేరు నేటివరకు వాడుకలో నున్నది.౹ కావున ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–మీపితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే;౹ నేటివరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించునప్పుడు, మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటికి పూజజేసి అపవిత్రులగుచున్నారే; ఇశ్రాయేలీయులారా, నాయొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవముతోడు నావలన ఆలోచన మీకు దొరుకదు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు –అన్యజనులేమి భూమిమీది యేజనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజచేతుమని మీరనుకొనుచున్నారే. మీరు ఇచ్ఛయించినదాని ప్రకారమెన్నటికిని జరుగదు.౹ నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు, బాహుబలముతోను చాచిన చేతితోను నేను మీపైన అధికారము చేసెదను.౹ మరియు నేను రౌద్రము కుమ్మరించుచు, బాహుబలముతోను చాచిన చేతితోను మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలోనుండియు జనులలోనుండియు నేను మిమ్మును సమ కూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి, అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యెమాడెదను; ఇదే యెహోవా వాక్కు.౹ ఐగుప్తీయులదేశపు అరణ్యములో నేను మీపితరులతో వ్యాజ్యెమాడినట్టు మీతోను వ్యాజ్యె మాడెదను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ చేతి కఱ్ఱక్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను.౹ మరియు నామీద తిరుగబడువారిని దోషము చేయువారిని మీలో ఉండకుండ ప్రత్యేకించెదను, తాము కాపురమున్న దేశములోనుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లువారు ఇశ్రాయేలుదేశములో ప్రవేశించరు.౹ ఇశ్రాయేలు యింటివారలారా, మీరు నామాట వినని యెడల మీరు పెట్టుకొనిన విగ్రహములను, మీ కిష్టమైనట్టుగా పూజించుకొనుడి, గాని మీ అర్పణలచేతను మీ విగ్రహములచేతను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధపర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలీయులందరును నాకు సేవచేయుదురు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన యర్పణలను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములగు మీ కానుకలనన్నిటిని నేనంగీకరించెదను.౹ జనములలోనుండి నేను మిమ్మును రప్పించునప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలోనుండి మిమ్మును సమకూర్చునప్పుడును, పరిమళధూపముగా మిమ్మును అంగీకరించెదను, అన్యజనులయెదుటను మీమధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును.౹ మీపితరులకిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేలీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించునప్పుడు నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.౹ అచ్చట చేరి మీ ప్రవర్తనను, మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనిన మీ క్రియలన్నిటిని మనస్సునకు తెచ్చుకొని, మీరు చేసిన దుష్‌క్రియలనుబట్టి మిమ్మును మీరే అసహ్యించుకొందురు.౹ ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతనుబట్టియు మీ కాని చేష్టలనుబట్టియు కాక నా నామమునుబట్టియే నేను మీకీలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు. ఇదే యెహోవా వాక్కు మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపుతట్టు త్రిప్పుకొని దక్షిణదేశమునకు ప్రకటింపుము, దక్షిణదేశపు అరణ్యమునుగూర్చి ప్రవచించి ఇట్లనుము –దక్షిణదేశమా, యెహోవా మాట ఆలకించుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటిని ఎండిన చెట్లన్నిటిని దహించును, అది ఆరిపోకుండనుండును, దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును.౹ అది ఆరిపోకుండ యెహోవానైన నేను దానిని రాజబెట్టితినని సమస్తమైనజనులకు తెలియబడును.౹ అయ్యో ప్రభువా యెహోవా–వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్నుగూర్చి చెప్పుదురని నేనంటిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, యెరూషలేముతట్టు నీ ముఖము త్రిప్పుకొని, పరిశుద్ధస్థలములనుబట్టి ఇశ్రాయేలీయులదేశమునుగూర్చి ప్రవచించి ఇట్లనుము –యెహోవా సెలవిచ్చునదేమనగా–నేను నీకు విరోధినై తిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు నుండకుండ అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము ఒరదూసి యున్నాను.౹ నీతిపరులేమి దుష్టులేమి యెవరును మీలో ఉండకుండ దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని ఒరలోనుండి బయలుదేరియున్నది.౹ యెహోవానైన నేను నా ఖడ్గము మరల ఒరలోపడకుండ దాని దూసియున్నానని జనులందరు తెలిసికొందురు.౹ కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము.౹ –నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా నీవు —శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడి నది, అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్లు నీరవును, ఇంతగా కీడు వచ్చుచున్నది; అది వచ్చేయున్నది అని చెప్పుము; ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటనచేసి ఇట్లనుము–యెహోవా సెలవిచ్చున దేమనగా–అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది, అది పదునుగలదై మెరుగుపెట్టియున్నది.౹ అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టియున్నది, తళతళలాడునట్లు అది మెరుగుపెట్టియున్నది; ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించునది అని చెప్పి మనము సంతోషించెదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువానియొద్ద నుంచబడియుండెను, హతము చేయువాడు పట్టుకొనునట్లుగా అది పదునుగలదై మెరుగు పెట్టబడియున్నది.౹ –నరపుత్రుడా అంగలార్చుము, కేకలువేయుము, అది నా జనులమీదికిని ఇశ్రాయేలీయుల ప్రధానులమీదికిని వచ్చుచున్నది, ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరచుకొనుము.౹ శోధనకలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి? ఇదే యెహోవా వాక్కు.౹ నరపుత్రుడా, చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము, ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతముచేయునదై యున్నది, అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది.౹ వారి గుండెలు కరిగిపోవునట్లును, పడద్రోయు అడ్డములు అధికములగునట్లును, వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను; అయ్యయ్యో అది తళతళలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడియున్నది.౹ ఖడ్గమా, సిద్ధపడియుండుము; కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని యుండునో అక్కడికి తిరుగుము నేను కూడ నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును; యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గమువచ్చుటకు రెండు మార్గములను ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశములోనుండి వచ్చునట్లు సూచించుటకై యొక హస్తరూపము గీయుము, పట్టణపు వీధి కొనను దాని గీయుము.౹ ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యూదాదేశమం దున్న ప్రాకారములుగల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము.౹ బాటలు చీలుచోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలిసికొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు; అతడు బాణములను ఇటు అటు ఆడించుచు, విగ్రహములచేత విచారణచేయుచు, కార్యమునుబట్టి శకునము చూచుచున్నాడు.౹ –యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టుయంత్రములు పెట్టుమనియు, హతముచేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టుయంత్రములు ఉంచుమనియు, దిబ్బలు వేయుమనియు, ముట్టడి దిబ్బలు కట్టు మనియు యెరూషలేమునుగూర్చి తన కుడితట్టున శకునము కనబడెను.౹ ప్రమాణములు చేసికొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును; అయితే వారు పట్టబడునట్లువారు చేసికొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును. కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీ అతిక్రమములు బయలుపడుటవలన మీ సమస్త క్రియలలోనుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీరు మనస్సునకు తెచ్చుకొనినందునను, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినందునను మీరు చెయ్యి చిక్కియున్నారు.౹ గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతీ, దోషసమాప్తికాలమున నీకు తీర్పువచ్చియున్నది.౹ ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము, ఇది యికను ఇట్లుండదు. ఇకమీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయుము.౹ నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడ ద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము —అమ్మోనీయులనుగూర్చియు, వారుచేయు నిందనుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా— హతము చేయుటకు ఖడ్గము ఖడ్గమే దూయబడియున్నది, తళతళలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వధచేయుటకు దూయబడియున్నది.౹ శకునగాండ్రు నీకొరకు మాయా దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోషసమాప్తి కాలమున శిక్షనొంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడ వేయును.౹ ఖడ్గమును ఒరలోవేయుము; నీవు సృష్టింప బడిన స్థలములోనే నీవు పుట్టిన దేశములోనే నేను నీకు శిక్ష విధింతును.౹ అచ్చటనే నా రౌద్రమును నీమీద కుమ్మరించెదను, నా ఉగ్రతాగ్నిని నీమీద రగుల బెట్టెదను, నాశనము చేయుటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను.౹ అగ్ని నిన్ను మ్రింగును, నీ రక్తము దేశములో కారును, నీ వెన్నటికిని జ్ఞాపకమునకు రాకయుందువు; యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ నరపుత్రుడా, ప్రాణహానిచేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పుతీర్చునెడల అదిచేయు హేయక్రియలన్నిటిని దానికి తెలియజేసి యీలాగున ప్రకటింపవలెను.౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీ కాలమువచ్చునట్లు నరహత్యలుచేయు పట్టణమా, నిన్ను అపవిత్ర పరచుకొనునట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యలచేత నీకు నీవే నేరస్థాపన చేసికొంటివి, నీవు పెట్టుకొనిన విగ్రహములచేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి,౹ నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను, సకలదేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను.౹ సమీపస్థులేమి దూరస్థులేమి అందరును అపకీర్తి పొందినదానవనియు అల్లరితో నిండినదానవనియు నిన్ను అపహసింతురు.౹ నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరును తమ శక్తికొలది నరహత్యచేయుదురు,౹ నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,౹ నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతిదినములను నీవు అపవిత్రపరచుచున్నావు.౹ కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు, పర్వతములమీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామవికార చేష్టలు జరుగుచున్నవి.౹ తమ తండ్రి మానాచ్ఛాదనము తీయు వారు నీలో నున్నారు, అశుచియై బహిష్టయైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు.౹ ఒకడు తన పొరుగువాని భార్యనుకూడి హేయక్రియలు చేయును, మరియొకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపర చును, నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు.౹ నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరచుకొనుచున్నాను.౹ నేను నీకు శిక్ష విధింపబోవుకాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా తీసి వేయుటకై అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్లగొట్టుదును.౹ అచ్చట అన్యజనుల ఎదుటనే నీ అంతట నీవే భ్రష్టుడవై నేను యెహోవానని నీవు తెలిసికొందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసము నైరి, వారు వెండి మష్టువంటివారైరి.౹ కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–మీరందరును మష్టువంటివారైతిరి. నేను మిమ్మును యెరూషలేముమధ్యను పోగుచేసెదను, ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగుచేసి కొలిమిలో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు నాకోపముచేతను రౌద్రముచేతను మిమ్మును పోగుచేసి అక్కడ మిమ్మును కరిగింతును.౹ మిమ్మును పోగుచేసి నా కోపాగ్నిని మీమీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు.౹ కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవుదురు, అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీమీద కుమ్మరించితినని మీరు తెలిసికొందురు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, యెరూషలేమునకు నీవీమాట ప్రకటింపుము–నీవు పవిత్రము కాని దేశ మువై యున్నావు ఉగ్రతదినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్రచేయుదురు, గర్జించుచుండు సింహము వేటను చీల్చునట్లువారు మనుష్యులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగాచేయుదురు,౹ దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాక రించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్ర పరచుదురు, ప్రతిష్ఠితమైనదానికిని సాధారణమైనదానికిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలిసికొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతిదినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను.౹ దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్లవలె ఉన్నారు.౹ మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు, యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు–ప్రభువైన యెహోవా యీలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు, వట్టిసోదెగాండ్రయి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూత పూయువారైయున్నారు.౹ మరియు సామాన్య జనులు బలాత్కారముచేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు.౹ నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు.౹ కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మ రింతును, వారి ప్రవర్తన ఫలము వారిమీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన యిద్దరు స్త్రీలు కలరు.౹ వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి.౹ వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను కుమార్తెలను కనిరి–ఒహొలాయను పేరు షోమ్రో నునకును, ఒహొలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి.౹ ఒహొలా నాకు పెండ్లిచేయబడినను వ్యభిచారముచేసి తన విటకాండ్రమీద బహుగా ఆశపెట్టుకొని, ధూమ్రవర్ణముగల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులును అధికారులును అందముగల యౌవనులును గుఱ్ఱములెక్కు రౌతులును అగు అష్షూరువారిని మోహించెను.౹ అది కాముకురాలిరీతిగా అష్షూరువారిలో ముఖ్యులగు వారందరియెదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటిని పూజించుచు అపవిత్రురాలాయెను.౹ మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చ టనే దాని యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి.౹ కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను, అది మోహించిన అష్షూరువారికి దానిని అప్పగించియున్నాను.౹ వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గముచేత చంపిరి; యీలాగున ఆమె స్త్రీలలో అపకీర్తిపాలై శిక్ష నొందెను. దాని చెల్లెలైన ఒహొలీబా దానిని చూచి కాము కత్వమందు దానిని మించి అక్కచేసిన జారత్వములకంటె మరి ఎక్కువగా జారత్వము చేసెను.౹ ప్రశస్త వస్త్రములు ధరించినవారును సైన్యాధిపతులును అధికారులును గుఱ్ఱములెక్కు రౌతులును సౌందర్యముగల యౌవనులును అగు అష్షూరువారైన తన పొరుగువారిని అది మోహించెను.౹ అది అపవిత్రురాలాయెననియు, వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను.౹ మరియు అది యధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై, మొలలకు నడికట్లును తలలమీద చిత్రవర్ణము గల పాగాలును పెట్టుకొని రాచకళలుగలవారై సిందూరముతో పూయబడి గోడమీద చెక్కబడినవారై, తమ జన్మదేశమైన కల్దీయులదేశపు బబులోను వారివంటి కల్దీయుల పటములను చూచి మోహించెను.౹ అది వారిని చూచినవెంటనే మోహించి కల్దీయదేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరివచ్చి జారత్వముచేత దానిని అపవిత్రపరచిరి; వారిచేత అది అపవిత్రపరచబడిన తరువాత, దాని మనస్సు వారికి యెడమాయెను.౹ ఇట్లు అది జారత్వము అధికముగాచేసి తన మానాచ్ఛాదనము తీసి వేసికొనెను గనుక దాని అక్క విషయములో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయములోను ఆశాభగ్నుడ నైతిని.౹ మరియు యౌవనదినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనస్సునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచు వచ్చెను.౹ గాడిద గుఱ్ఱములవంటి సిగ్గుమాలిన మోహముగల తన విటకాండ్రయందు అది మోహము నిలుపుచుండెను.౹ యౌవనకాలమందు నీవు ఐగుప్తీయులచేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసికొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి. కావున ఒహొలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీ మనస్సునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీమీదికి రప్పించెదను.౹ గుఱ్ఱములనెక్కు బబులోనువారిని కల్దీయులను అధిపతులను ప్రధానాధికారులనందరిని అష్షూరీయులను సౌందర్యముగల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను శూరులను మంత్రులను అందరిని నీమీదికి నేను రప్పించుచున్నాను.౹ ఆయుధములు పట్టుకొని చక్రములుగల రథములతోను గొప్ప సైన్యముతోను వారు నీమీదికి వచ్చి, కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీమీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు, వారు తమ మర్యాదచొప్పున నిన్ను శిక్షించునట్లు నేను నిన్నుగూర్చిన తీర్పు వారికప్పగింతును.౹ ఉగ్రతతో వారు నిన్ను శిక్షించునట్లు నా రోషము నీకు చూపుదును, నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు, నీలో శేషించినవారు ఖడ్గముచేత కూలుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు, నీలో శేషించినవారు అగ్నిచేత దహింపబడుదురు.౹ నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు.౹ ఐగుప్తును నీవిక కోరకయు, అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనస్సునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తుదేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండ ఈలాగున మాన్పించెదను.౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవు ద్వేషించినవారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను.౹ ద్వేషముచేత వారు నిన్ను బాధింతురు, నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు; అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములును నీ జారత్వమును వెల్లడియగును.౹ నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమునుబట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకొనుటనుబట్టియు నీకు ఇవి సంభవించును; నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను.౹ [31-32] ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీ అక్క పానము చేసిన, లోతును వెడల్పునుగల పాత్రలోనిది నీవును పానము చేయవలెను. అందులో పానము చేయ వలసినది చాలయున్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను.౹ *** నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది, నీవు దానిలో నిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు.౹ అడుగుమట్టునకు దాని పానముచేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు; నేనే మాటయిచ్చియున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు. మరియు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను–నర పుత్రుడా, ఒహొలాకును ఒహొలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయుము.౹ వారు వ్యభిచారిణులును నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి, నాకు కనిన కుమారులను విగ్రహములు మ్రింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి.౹ వారీలాగున నాయెడల జరిగించుచున్నారు; అదియుగాక ఆ దినమందే, వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతిదినములను సామాన్యదినములుగా ఎంచిరి.౹ తాము పెట్టుకొనిన విగ్రహములపేరట తమ పిల్లలను చంపిననాడే వారు నా పరిశుద్ధస్థలములో చొచ్చి దాని నపవిత్రపరచి, నామందిరములోనే వారీలాగున చేసిరి.౹ మరియు దూరముననున్నవారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి; వారు రాగా వారికొరకు నీవు స్నానముచేసి కన్నులకు కాటుకపెట్టుకొని ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచముమీద కూర్చుండి బల్లను సిద్ధపరచి దానిమీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి.౹ ఆలాగున జరుగగా, అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహముయొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారియొద్దకు ఎడారి మార్గమునుండి వచ్చిరి, వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి.౹ వ్యభిచారము చేయుటచేత బలహీనురాలైన దీనితో నేనీలాగంటిని–అది మరెన్నటికిని వ్యభిచారముచేయక మానదు.౹ వేశ్యతో సాంగత్యముచేయునట్లువారు దానితో సాంగత్యము చేయుదురు, ఆలాగుననే వారు కాముకురాండ్రయిన ఒహొలాతోను ఒహొలీబాతోను సాంగత్యము చేయుచువచ్చిరి.౹ అయితే వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైనవారు వీరికి తగినట్టుగా విధింతురు; వారు వ్యభిచారిణులే, నరహత్యచేయ యత్నించుదురు.౹ ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–వారిమీదికి నేను సైన్యమును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును.౹ ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు, ఖడ్గముచేత హతము చేయుదురు, వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి యిండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు.౹ స్త్రీలందరు మీ కామాతురతచొప్పున చేయకూడదని నేర్చుకొనునట్లు మీ కామాతురతను దేశములో నుండకుండ మాన్పించుదును.౹ నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. తొమ్మిదియవ సంవత్సరము పదియవ నెల పదియవదినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, ఈదినము పేరు వ్రాసి యుంచుము, నేటిదినము పేరు వ్రాసి యుంచుము, ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చుచున్నాడు.౹ మరియు తిరుగుబాటుచేయు ఈ జనులనుగూర్చి యుపమానరీతిగా ఇట్లు ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యిమీద పెట్టుము.౹ తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నియు చేర్చి అందులో వేసి, మంచి యెముకలను ఏరి దాని నింపుము.౹ మందలో శ్రేష్ఠమైనవాటిని తీసికొనుము, అందున్న యెముకలు ఉడుకునట్లు చాల కట్టెలు పోగుచేయుము, దానిని బాగుగా పొంగించుము, ఎముకలను చాలునంతగా ఉడికించుము. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నరహంతకులున్న పట్టణమునకు శ్రమ; మడ్డిగలకుండా, మానకుండ మడ్డిగలిగియుండుకుండా, నీకు శ్రమ; చీటి దాని వంతున పడలేదు, వండినదానిని ముక్కవెంబడి ముక్కగా దానిలోనుండి తీసికొని రమ్ము.౹ దానిచేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది, మట్టితో దాని కప్పివేయునట్లు దానిని నేలమీద కుమ్మరింపక వట్టి బండమీద దానిని చిందించెను.౹ కావున నా క్రోధము రానిచ్చి, నేను ప్రతికారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండ దానిని వట్టిబండమీద నేనుండ నిచ్చితిని.౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా —నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను.౹ చాల కట్టెలు పేర్చుము, అగ్ని రాజబెట్టుము, మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమియు ఉండకుండ ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దింపుము.౹ తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడియై మెరుగు పట్టువరకు వట్టిచట్టి పొయ్యిమీదనే యుంచుము.౹ అలసట పుట్టువరకు ఇంతగా శ్రద్ధపుచ్చుకొనినను దాని విస్తారమైన మష్టు పోదాయెను, మష్టుతోకూడ దానిని అగ్నిలో వేయుము,౹ నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే; నిన్ను శుభ్ర పరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీమీద తీర్చుకొనువరకు నీవు శుభ్ర పడకయుందువు.౹ యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను నేను వెనుకతీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తననుబట్టియు నీ క్రియలనుబట్టియు నీకు శిక్ష విధింపబడును, ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్దనుండి ఒక్కదెబ్బతో తీసివేయ బోవుచున్నాను, నీవు అంగలార్చవద్దు ఏడువవద్దు కన్నీరు విడువవద్దు.౹ మృతులకై విలాపముచేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము, నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను, నీ పెదవులు మూసికొన వద్దు జనుల ఆహారము భుజింపవద్దు ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని, సాయంతనమున నా భార్య చనిపోగా ఆయన నా కాజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని.౹ –నీవు చేసినవాటివలన మేము తెలిసికొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్నడుగగా నేను వారితో ఇట్లంటిని— యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –ఇశ్రాయేలీయులకు నీవీలాగున ప్రకటిం పుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా— మీకు అతిశయాస్పదముగాను, మీ కన్నులకు ముచ్చటగాను, మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను, మీరు వెనుక విడిచిన మీ కుమారులును కుమార్తెలును అక్కడనే ఖడ్గముచేత కూలుదురు.౹ అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు, మీ పెదవులు మూసికొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు.౹ మీ శిరో భూషణములను తలలమీదనుండి తీయకయు, మీ పాద రక్షలను పాదములనుండి తీయకయు, అంగలార్చకయు, ఏడ్వకయు నుందురు, ఒకని నొకరుచూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములనుబట్టి మీరు క్షీణించి పోవుదురు.౹ యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు, ఇది సంభవించునప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నుల కింపైనదానిని వారు ఇచ్ఛయించు దానిని, వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమునందు నీకు సమాచారము తెలియజేయుటకై తప్పించుకొని వచ్చిన యొకడు నీయొద్దకు వచ్చును.౹ [26-27] ఆ దినముననే నీవికను మౌనముగా ఉండక, తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాటలాడుదువు; నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, అమ్మోనీయులతట్టు ముఖము త్రిప్పుకొని వారినిగూర్చి యీ మాట ప్రవచింపుము.౹ –అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నా పరిశుద్ధస్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలీయుల దేశము పాడుచేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు, మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక నేను మిమ్మును తూర్పుననుండు మనుష్యులకు స్వాస్థ్యముగా అప్పగించెదను, వారు తమ డేరాలను మీ దేశములోవేసి మీ మధ్య కాపురముందురు, వారు మీ పంటలు తిందురు మీ పాలు త్రాగుదురు.౹ నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసెదను, అమ్మోనీయుల దేశమును గొఱ్ఱెల దొడ్డిగా చేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.౹ మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా— మీరు చేతులు చరచుకొని కాళ్లతో నేలతన్ని ఇశ్రాయేలీయుల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు నేను మీకు విరోధినై, మిమ్మును జనములకు దోపుడుసొమ్ముగా అప్పగింతును, అన్యజనులలో ఉండకుండ మిమ్మును నిర్మూలము చేతును, జనము కాకుండ మిమ్మును నశింపజేతును సమూలధ్వంసము చేతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఇతర జనములన్నిటికిని యూదావారికిని భేద మేమి యని మోయాబీయులును శేయీరు పట్టణపు వారును అందురు గనుక తూర్పుననున్న వారిని రప్పించి, దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యేషీమోతును బయల్మెయోనును కిర్యతాయిమును మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటిని, అమ్మోనీయులనందరిని వారికి స్వాస్థ్యముగా అప్పగింతును;౹ జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు.౹ నేను యెహోవానై యున్నానని మోయాబీయులు తెలిసి కొనునట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఎదోమీయులు యూదావారిమీద పగతీర్చు కొనుచున్నారు, తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా –ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువు లేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.౹ నా జనులైన ఇశ్రాయేలీయులచేత ఎదోము వారిమీద నా పగ తీర్చుకొందును, ఎదోమీయుల విషయమై నాకోపమునుబట్టియు నా రౌద్రమునుబట్టియు నేను ఆలోచించినదానిని వారు నెరవేర్చుదురు, ఎదో మీయులు నా క్రోధము తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఫిలిష్తీయులు పగతీర్చుకొనుచు నాశముచేయుచు, మానని క్రోధముగలవారై తిరస్కారము చేయుచు పగతీర్చుకొనుచున్నారు గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఫిలిష్తీయులమీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలముచేసెదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసెదను.౹ క్రోధముతో వారిని శిక్షించి వారిమీద నా పగ పూర్తిగా తీర్చుకొందును; నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, యెరూషలేమునుగూర్చి–ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నావశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–తూరుపట్టణమా, నేను నీకు విరోధినైతిని, సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేకజనములను నీ మీదికి రప్పించెదను.౹ వారు వచ్చి తూరుయొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు, నేను దానిమీదనున్న మంటిని తుడిచి వేయుదును, దానిని వట్టిబండగా చేసెదను.౹ సముద్రము దాని నావరించును, అది వలలు పరచుటకు చోటగును, నేనే మాట యిచ్చితిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అది జనములకు దోపుడుసొమ్మగును.౹ బయటి పొలములోనున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–రారాజగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను తూరుపట్టణము మీదికి రప్పించుచున్నాను, అతడు గుఱ్ఱములతోను రథములతోను రౌతులతోను గుంపులు గుంపులుగానున్న సైన్యముతోను ఉత్తరదిక్కునుండివచ్చి బయటిపొలము లోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి, నీ కెదురుగా బురుజులు కట్టించి దిబ్బవేయించి నీ కెదురుగా డాలు నెత్తును.౹ మరియు అతడు నీ ప్రాకారములను పడ గొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును.౹ అతనికి గుఱ్ఱములు బహు విస్తారముగా ఉన్నవి, అవి ధూళి యెగరగొట్టగా అది నిన్ను కమ్మును, బీటసందులుగల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించునప్పుడు రౌతులయొక్కయు చక్రములయొక్కయు రథములయొక్కయు ధ్వనిచేత నీ ప్రాకారములు కంపించును.౹ అతడు తన గుఱ్ఱముల డెక్కలచేత నీ వీధులన్నియు అణగద్రొక్కించును, నీ జనులను ఖడ్గముతో హతము చేయును, నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును.౹ వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహ రింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడుచేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు.౹ ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారానాద మికను వినబడదు,౹ నిన్ను వట్టిబండగా చేయుదును, వలలు పరచుకొనుటకు చోటగుదువు నీవికను కట్టబడక యుందువు. నేనే మాట యిచ్చియున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తూరునుగూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చు నదేమనగా–నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు, హతు లగుచున్నవారి కేకలును, నీలో జరుగు గొప్పవధయు ద్వీపములు విని కంపించును.౹ సముద్రపు అధిపతులందరును తమ సింహాసనములమీదనుండి దిగి, తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి, దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడ వణకుచు నిన్ను చూచి విస్మయపడుదురు.౹ వారు నిన్నుగూర్చి అంగలార్పు వచన మెత్తి ఈలాగున అందురు–సముద్ర నివాసమైనదానా, ఖ్యాతినొందిన పట్ణణమా, నీవెట్లు నాశనమైతివి? సముద్ర ప్రయాణము చేయుటవలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను, సముద్రవాసులందరిని భీతిల్లచేసినది ఇదే.౹ ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్లిపోవుట చూచి సముద్రద్వీపములు కదలుచున్నవి.౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నివాసులులేని పట్టణములవలెనే నేను నిన్ను పాడుచేయునప్పుడు మహా సముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధజలములను రప్పించెదను, పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయినవారియొద్ద నీ వుండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనములేని దానవగుటకై పురాతనకాలములో పాడైన జనులయొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును, పాతాళములోనికి దిగి పోవువారితోకూడ నిన్ను నివసింప జేసెదను.౹ మరియు సజీవులు నివసించు భూమిమీద నేను మహాఘనకార్యము కలుగజేతును;౹ నిన్ను భీతికి కారణముగా జేతును, నీవు లేకపోవుదువు, ఎంత వెదకినను నీవెన్నటికిని కనబడక యుందువు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నరపుత్రుడా, తూరు పట్టణముగూర్చి అంగలార్పు వచనమెత్తి దానికీలాగు ప్రకటన చేయుము –సముద్రపురేవులమీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణముచేయు వర్తకజనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా — తూరు పట్టణమా–నేను సంపూర్ణ సౌందర్యము కలదాననని నీవను కొనుచున్నావే;౹ నీ సరిహద్దులు సముద్రములమధ్య ఏర్పడెను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యముగలదానిగా చేసియున్నారు.౹ నీ ఓడలను శెనీరుదేశపు సరళవృక్షపు మ్రానుతో కట్టుదురు, లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడకొయ్యలు చేయుదురు.౹ బాషానుయొక్క సింధూరమ్రానుచేత నీ కోలలుచేయుదురు, కిత్తీయుల ద్వీపములనుండి వచ్చిన గుంజుమ్రానునకు దంతపు చెక్కడపుపని పొదిగి నీకు పీటలు చేయుదురు.౹ నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తునుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయబడును; ఎలీషాద్వీపములనుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములుగల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు తూరుపట్ట ణమా, సీదోను నివాసులును అర్వదు నివాసులును నీకు ఓడకళాసులుగా ఉన్నారు, నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞా వంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు.౹ గెబలు పనివారిలో పనితెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయు వారుగా నున్నారు, సముద్రమందు నీ సరకులు కొనుటకై సముద్రప్రయాణముచేయు నావికుల యోడలన్నియు నీ రేవులలో ఉన్నవి.౹ పారసీకదేశపువారును లూదు వారును పూతువారును నీ సైన్యములలోచేరి నీకు సిపా యిలుగా ఉన్నారు, వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారిచేత నీకు తేజస్సు కలిగెను.౹ అర్వదువారు నీ సైన్యములోచేరి చుట్టు నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టు నీ ప్రాకారములమీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణ పరచెదరు.౹ నానా విధమైన సరకులు నీలో విస్తారముగా నున్నందున తర్షీషు వారు నీతో వర్తకముచేయుచు, వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.౹ గ్రేకేయులును తుబాలువారును మెషెకువారును నీలో వర్తకవ్యాపారముచేయుచు, నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు,౹ తోగర్మావారు గుఱ్ఱములను యుద్ధాశ్వములను కంచరగాడిదలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు;౹ దదానువారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు, చాల ద్వీపముల వర్తకములు నీ వశమున నున్నవి; వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.౹ నీచేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తకవ్యాపారము చేయుదురు, వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరకులు కొను క్కొందురు.౹ మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులును నీలో వర్తక వ్యాపారముచేయుచు, మిన్నీతు గోధుమలును మిఠాయిలును తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.౹ దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరకులును దినుసులును కొనుక్కొందురు.౹ దదానువారును గ్రేకేయులును నూలు ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. ఇనుపపనిముట్టును కత్సీయా కెనయా అను సుగంధద్రవ్యములును నీ సరకులకు బదులియ్యబడును.౹ దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసికొని అమ్ముదురు.౹ అరబీయులును కేదారు అధిపతులందరును నీతో వర్తకము చేయుదురు, వారు గొఱ్ఱెపిల్లలను పొట్టే ళ్లను మేకలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు, వీటి నిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు.౹ షేబ వర్తకులును రామా వర్తకులును నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.౹ హారానువారును కన్నేవారును ఏదెను వారును షేబ వర్తకులును అష్షూరు వర్తకులును కిల్మదు వర్తకులును నీతో వర్తకము చేయుదురు.౹ వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను ధూమ్రవర్ణముగలవియు కుట్టుపెనితో చేయబడినవియునగు బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.౹ తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైనదానవై మహాఘనముగా సముద్రముమీద కూర్చున్నావు.౹ నీ కోలలు వేయు వారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్రమధ్యమందు నిన్ను బద్దలుచేయును.౹ అప్పుడు నీ ధనమును నీ సరకులును నీవు బదులిచ్చు వస్తువులును నీ నావికులును నీ ఓడనాయకులును నీ ఓడలు బాగుచేయువారును నీతో వర్తకము చేయువారును నీలోనున్న సిపాయిలందరును నీలోనున్న జనసమూహములన్నియు నీవు కూలు దినమందే సముద్రమధ్యమందు కూలుదురు.౹ నీ ఓడనాయకులు వేసిన కేకలవలన నీ ఉపగ్రామములు కంపించును;౹ కోలలు పట్టుకొను వారందరును నావికులును ఓడనాయకులును తమ ఓడలమీదనుండి దిగి తీరమున నిలిచి నిన్నుగూర్చి మహా శోకమెత్తి ప్రలాపించుచు, తమ తలలమీద బుగ్గి పోసికొనుచు, బూడిదెలో పొర్లుచు నీకొరకు తలలు బోడి చేసికొని మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చింతగలవారై నిన్నుగూర్చి బహుగా అంగలార్చుదురు.౹ వారు నిన్నుగూర్చి ప్రలాపవచనమెత్తి–తూరు పట్టణమా, నీతో సాటియైన పట్టణమేది? సముద్రములో మునిగి లయమై పోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? సముద్రముమీద వచ్చిన నీ సరకులను పంపించి చాల జనములను తృప్తిపరచితివి, విస్తారమైన నీ పదార్థములచేతను నీ వర్తకముచేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి.౹ ఇప్పుడు అగాధజలములలో మునిగి సముద్రబలముచేత బద్దలైతివే, నీ వర్తకమును నీ యావత్సమూహమును నీతోకూడ కూలెనే యని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు.౹ నిన్నుబట్టి ద్వీపనివాసులందరు విభ్రాంతి నొందుదురు, వారి రాజులు వణకుదురు, వారి ముఖములు చిన్నబోవును.౹ జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–గర్విష్ఠుడవై–నే నొక దేవతను, దేవతనైనట్టు సముద్రముమధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొనుచున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభి ప్రాయము కలిగియున్నావు, నీవు దానియేలునకంటె జ్ఞానవంతుడవు,౹ నీకు మర్మమైనదేదియు లేదు.౹ నీ జ్ఞానముచేతను నీ వివేకముచేతను ఐశ్వర్యమునొందితివి, నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి.౹ నీకు కలిగిన జ్ఞానాతిశయముచేతను వర్తకముచేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించినవాడవైతివి.౹ కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నవాడా, ఆలకించుము;౹ నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను, వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి నీ సౌందర్యమును నీచపరతురు,౹ నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చినవారివలెనే నీవు చత్తువు.౹ –నేను దేవుడనని నిన్ను చంపువానియెదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువానిచేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా.౹ సున్నతిలేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశులచేత చత్తువు, నేనే మాట యిచ్చియున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, తూరు రాజునుగూర్చి అంగలార్పువచనమెత్తి ఈలాగు ప్రకటింపుము— ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–పూర్ణజ్ఞానమును సంపూర్ణసౌందర్యమునుగల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్యరత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.౹ అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి.౹ నీవు నియమింప బడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడువరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి.౹ అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండకుండ నేను నిన్ను అపవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని.౹ నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను.౹ నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసికొనిన విస్తార దోషములచేత నీవు నీ పరిశుద్ధస్థలములను చెరుపుకొంటివి గనుక నీలోనుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును, జనులందరు చూచుచుండగా దేశముమీద నిన్ను బూడిదెగా చేసెదను.౹ జనులలో నిన్ను ఎరిగిన వారందరును నిన్నుగూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణమువైపు త్రిప్పుకొని దానిగూర్చి యీ సమాచారము ప్రవచింపుము — ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా –సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీమధ్యను ఘనత నొందుదును, నేను దాని మధ్య తీర్పుతీర్చుచు దానినిబట్టి నన్ను పరిశుద్ధపరచు కొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసి కొందురు.౹ నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును, నలుదిక్కుల దానిమీదికి వచ్చు ఖడ్గముచేత వారు హతు లగుదురు, నేను ప్రభువగు యెహోవానని ఇశ్రాయేలీయులు తెలిసికొనునట్లు వారి చుట్టునుండి వారిని తిరస్క రించుచు వచ్చిన వారిలో ఎవరును ఇక వారికి గుచ్చుకొను ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి, జనుల సమక్షమున వారిమధ్యను నన్ను నేను పరిశుద్ధపరచు కొందును, అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశములో వారు నివసించెదరు.౹ వారు అందులో నిర్భయముగా నివసించి యిండ్లు కట్టుకొని ద్రాక్షతోటలు నాటుకొందురు, వారి చుట్టు ఉండి వారిని తిరస్కరించుచు వచ్చినవారికందరికి నేను శిక్షవిధించిన తరువాత వారు నిర్భయముగా నివసించుకాలమున నేను తమ దేవుడైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. పదియవ సంవత్సరము పదియవ నెల పండ్రెండవ. దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తురాజైన ఫరోవైపు త్రిప్పుకొని అతనిగూర్చియు ఐగుప్తు దేశ మంతటినిగూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా –ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; —నైలునది నాది, నేనే దాని కలుగ జేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే;౹ నేను నీ దవుడ లకు గాలములు తగిలించి, నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి, నైలులోనుండి నిన్నును నీ పొలుసు లకు అంటిన నైలు చేపలన్నిటిని బయటికి లాగెదను.౹ నిన్నును నైలునది చేపలన్నిటిని అరణ్యములో పారబోసెదను, ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరపనేలమీద పడుదువు, అడవిమృగములకును ఆకాశపక్షులకును ఆహారముగా నిచ్చెదను.౹ అప్పుడు నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులందరు తెలిసికొందురు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లవంటి చేతికఱ్ఱ ఆయెను;౹ వారు నిన్ను చేతపట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి, వారు నీమీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి.౹ కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నేను నీమీదికి ఖడ్గము రప్పించి, మనుష్యులను పశువులను నీలోనుండి నిర్మూలము చేసెదను,౹ ఐగుప్తుదేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. —నైలునది నాది, నేనే దాని కలుగజేసితినని అతడనుకొనుచున్నాడు గనుక నేను నీకును నీ నదికిని విరోధినైతిని, ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు కూషు సరిహద్దువరకు బొత్తిగా పాడుచేసి యెడారిగా ఉంచెదను.౹ దానిలో మనుష్యులు సంచరించరు, పశువులు తిరుగవు; నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును.౹ నిర్మానుష్యముగానున్న దేశములమధ్యను ఐగుప్తుదేశమును పాడగునట్టుగా చేసెదను, పాడైపోయిన పట్టణములమధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడైయుండును, ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ల గొట్టుదును.౹ ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నలువది సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలోనుండి నేను వారిని సమకూర్చెదను.౹ చెరలోనుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరల రప్పించెదను, అక్కడ వారు హీనమైన యొక రాజ్యముగా ఉందురు,౹ వారికను జనములమీద అతిశయపడకుండునట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు; వారు ఇక రాష్టములమీద ప్రభుత్వము చేయకుండునట్లు నేను వారిని తగ్గించెదను.౹ ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారితట్టు తిరిగినయెడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. ఇరువదియేడవ సంవత్సరము మొదటినెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నరపుత్రుడా, తూరు పట్టణముమీద బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యముచేత బహు ఆయాసకరమైన పని చేయించెను, వారందరి తలలు బోడి వాయెను, అందరి భుజములు కొట్టుకొని పోయెను; అయినను తూరుపట్టణముమీద అతడు చేసిన కష్టమునుబట్టి అతనికైనను, అతని సైన్యమునకైనను కూలి యెంత మాత్రమును దొరకకపోయెను.౹ కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఐగుప్తుదేశమును బబులోను రాజైన నెబుకద్రెజరునకు నేను అప్పగించుచున్నాను, అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపట్టును, అది అతని సైన్యమునకు జీతమగును.౹ తూరుపట్టణముమీద అతడు చేసినది నా నిమిత్తమే చేసెను గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను; ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగిరింప జేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, సమాచార మెత్తి ప్రవచింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చు నదేమనగా–ఆహా శ్రమదినము వచ్చెనే, అంగలార్చుడి, శ్రమదినము వచ్చెనే,౹ యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము.౹ ఖడ్గము ఐగుప్తు దేశముమీద పడును, ఐగుప్తీయులలో హతులు కూలగా కూషుదేశస్థులు వ్యాకులపడుదురు, శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు.౹ కూషీయులును పూతీయులును లూదీయులును కూబీయులును నిబంధన దేశపువారును మిశ్రిత జనులందరును ఖడ్గముచేత కూలుదురు. యెహోవా సెలవిచ్చునదేమనగా–ఐగుప్తును ఉద్ధరించు వారు కూలుదురు, దాని బలగర్వము అణగిపోవును, మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు జనులు ఖడ్గముచేత కూలుదురు.౹ పాడైపోయిన దేశములమధ్య ఐగుప్తీయులు దిక్కులేనివారుగా నుందురు, నలుదిక్కుల పాడైపోయిన పట్టణములమధ్య వారి పట్టణము లుండును.౹ ఐగుప్తుదేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులులేకుండ చేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.౹ ఆ దినమందు దూతలు నా యెదుటనుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు, ఐగుప్తునకు విమర్శకలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును, అదిగో అది వచ్చే యున్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఐగుప్తీయులుచేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్రెజరుచేత నేను మాన్పించెదను.౹ జనములలో భయంకరులగు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరుచుటకు అతడు వచ్చును, ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను ఒరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు.౹ నైలునదిని ఎండిపోజేసి నేనాదేశమును దుర్జనులకు అమ్మి వేసెదను, పరదేశులచేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడుచేయించెదను, యెహోవానైన నేను మాట యిచ్చియున్నాను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–విగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తుదేశములో అధిపతిగా ఉండుట కెవడును లేకపోవును, ఐగుప్తుదేశములో భయము పుట్టించెదను.౹ పత్రోసును పాడుచేసెదను. సోయనులో అగ్నియుంచెదను, నోలో తీర్పులు చేసెదను.౹ ఐగుప్తునకు కోటగా నున్న సీనుమీద నా క్రోధము కుమ్మ రించెదను, నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను ఐగుప్తుదేశములో నేను అగ్ని యుంచగా సీనునకు మెండుగ నొప్పిపట్టును, నోపురము పడగొట్టబడును, పగటివేళ శత్రువులు వచ్చి నొపుమీద పడుదురు.౹ ఓనువారిలోను పిబేసెతువారిలోను యౌవనులు ఖడ్గముచేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు.౹ ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు.౹ నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. పదకొండవ సంవత్సరము మొదటి నెలయేడవదినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, నేను ఐగుప్తురాజైన ఫరో బాహువును విరిచితిని, అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు, అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరును దానికి బద్దకట్టరు; కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా –నేను ఐగుప్తురాజైన ఫరోకు విరోధినైయున్నాను, బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులను విరిచి, అతనిచేతిలోనుండి ఖడ్గము జారిపడజేసెదను.౹ ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.౹ మరియు బబులోను రాజుయొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతనిచేతికిచ్చెదను, ఫరోయొక్క చేతులను నేను విరిచినందున బబులోనురాజు చూచుచుండగా ఫరో చావుదెబ్బతినినవాడై మూల్గులిడును.౹ బబులోను రాజుయొక్క చేతులను బలపరచి ఫరోచేతులను ఎత్తకుండచేసి, ఐగుప్తుదేశముమీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోనురాజు చేతికియ్యగా నేను యెహోవానైయున్నానని ఐగుప్తీయులు తెలిసికొందురు.౹ నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్లగొట్టుదును. మరియు పదకొండవ సంవత్సరము మూడవ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లనుము–ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు? అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దానికొన బహు ఎత్తయినందున మేఘములకు అంటెను.౹ నీళ్లుండుటవలన అది మిక్కిలి గొప్పదాయెను, లోతైన నది ఆధారమై నందున అది మిక్కిలి యెత్తుగా పెరిగెను, అది యుండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికిని ప్రవహించెను.౹ కాబట్టి అది ఎదిగి పొలము లోని చెట్లన్నిటికంటె ఎత్తుగలదాయెను, దాని శాఖలు బహు విస్తారములాయెను, నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్లు పెద్దకొమ్మలాయెను.౹ ఆకాశపక్షులన్నియు దాని శాఖలలో గూళ్లుకట్టుకొనెను, భూజంతువులన్నియు దాని కొమ్మలక్రింద పిల్లలు పెట్టెను, దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను.౹ ఈలాగున అది పొడుగైన కొమ్మలుకలిగి దానివేరు విస్తార జలమున్న చోట పారుటవలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయెను.౹ దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను, సరళవృక్షములు దాని శాఖలంత గొప్పవికావు, అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవికావు, దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికిని లేదు.౹ విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నియు దాని సొగసు చూచి దానియందు అసూయపడెను. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నీ యెత్తునుబట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేఘములకంటజేసి తన యెత్తునుబట్టి అతడు గర్వించెను.౹ కాబట్టి యతని దుష్టత్వమునుబట్టి యతనిని తరిమి వేసి, జనములలో బలముగల జనమునకు నేనతని నప్పగించెదను; ఆ జనము అతనికి తగినపని చేయును.౹ జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి, కొండలలోను లోయలన్నిటిలోను అతని కొమ్మలు పడెను, భూమియందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడెను, భూజనులందరును అతని నీడను విడిచి అతనిని పడియుండ నిచ్చిరి.౹ పడిపోయిన అతని మోడుమీద ఆకాశపక్షు లన్నియు దిగి వ్రాలును, అతని కొమ్మలమీద భూజంతువు లన్నియు పడును.౹ నీరున్నచోటున నున్న వృక్షములన్నిటిలో ఏదియు తన యెత్తునుబట్టి అతిశయపడి, తన కొనను మేఘముల కంటజేసి, యే వృక్షముగాని దాని యెత్తునుబట్టి గర్వింపకుండునట్లు, క్రిందిలోకమునకుపోవు నరుల యొద్దకు దిగువారితోకూడ మరణము పాలైరి. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసితిని, అగాధజలములు అతని కప్పజేసితిని, అనేక జలములను ఆపి అతనినిబట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని, అతనికొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసితిని, ఫలవృక్షములన్నియు అతనిగూర్చి వ్యాకులపడెను, పాతాళములోనికి నేనతని దింపగా గోతిలోనికి పోవువారియొద్దకు అతని పడ వేయగా అతని పాటు ధ్వనిచేత జనములను వణకజేసి తిని, నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠవృక్షములన్నియు ఏదెను వృక్షములన్నియు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి.౹ అన్యజనులమధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులగువారు అతనితోకూడ పాతాళమునకు అతడు హతము చేసినవారి యొద్దకు దిగిరి. కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి, ఘనులై అక్కడికి దిగిపోయిన రాజులయొద్ద ఉందువు; ఖడ్గముచేత హతులైన వారి యొద్దను సున్నతినొందనివారియొద్దను నీవు పడియున్నావు. ఫరోకును అతని సమూహమునకును ఈలాగు సంభవించును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు పండ్రెండవ సంవత్సరము పండ్రెండవనెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, ఐగుప్తురాజైన ఫరోనుగూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము–జనములలో కొదమ సింహమువంటివాడవని నీవు ఎంచబడితివి, జలములలో మొసలివంటివాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి, వాటి వాగులను బురదగా చేసితివి.౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీమీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు.౹ నేను నిన్ను నేల పడవేసి తెరపనేలమీద పారవేసెదను, ఆకాశపక్షులన్నియు నీమీద వ్రాలునట్లుచేసి నీవలన భూజంతువులన్నిటిని కడుపార తిననిచ్చెదను,౹ నీ మాంసమును పర్వతములమీద వేసెదను, లోయలన్నిటిని నీ కళేబరములతో నింపెదను.౹ మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతములవరకు నేను తడుపుదును, లోయలు నీతో నింపబడును.౹ నేను నిన్ను ఆర్పివేసి ఆకాశమండలమును మరుగు చేసెదను, నక్షత్రములను చీకటి కమ్మజేసెదను, సూర్యుని మబ్బుచేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును.౹ నిన్నుబట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల కన్నిటికిని అంధకారము కమ్మజేసెదను, నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్లగొట్టి, జనములలో నీకు సమూలధ్వంసము కలుగజేసి బహుజనములకు కోపము పుట్టింతును,౹ నా ఖడ్గమును నేను వారిమీద ఝుళిపించెదను, నిన్నుబట్టి చాలమంది జనులు కలవరించుదురు, వారి రాజులును నిన్నుబట్టి భీతులగుదురు, నీవు కూలు దినమున వారందరును ఎడతెగక ప్రాణభయముచేత వణకుదురు.౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–బబులోనురాజు ఖడ్గము నీమీదికి వచ్చును,౹ శూరుల ఖడ్గములచేత నేను నీ సైన్యమును కూల్చెదను, వారందరును జనములలో భయంకరులు; వారు ఐగుప్తీయుల గర్వము నణచివేయగా దాని సైన్య మంతయు లయమగును.౹ మరియు గొప్ప ప్రవాహముల దరినున్న పశువులనన్నిటిని నేను లయపరచెదను, నరుని కాలైనను పశువుకాలైనను వాటిని కదలింపకయుండును.౹ అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండజేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరిని నిర్మూలముచేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.౹ ఇది అంగలార్పు వచనము, వారు దానిని యెత్తి పాడుదురు, అన్యజనుల కుమార్తెలు దానిని యెత్తి పాడుదురు; ఐగుప్తునుగూర్చియు అందులోని సమూహమునుగూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. పండ్రెండవ సంవత్సరము నెల పదునైదవదినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, అల్లరిచేయు ఐగుప్తీయుల సమూహమునుగూర్చి అంగలార్చుము, ప్రసిద్ధినొందిన జనముల కుమార్త్తెలు భూమిక్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుము.౹ సౌందర్యమందు నీవు ఎవనిని మించిన వాడవు? దిగి సున్నతి నొందని వారియొద్ద పడియుండుము.౹ ఖడ్గముచేత హతమైన వారిమధ్య వారు కూలుదురు, అది కత్తిపాలగును, దానిని దాని జనులను లాగి పడవేయుడి.౹ వారు దిగిపోయిరే, సున్నతినొందని వీరు ఖడ్గముచేత హతమై అక్కడ పడియుండిరే, అనియందురు; పాతాళములోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులనుగూర్చియు అందురు.౹ అష్షూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి, దాని చుట్టును వారి సమాధులున్నవి, వారందరు కత్తిపాలై చచ్చియున్నారు.౹ దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి, దాని సమూహము దాని సమాధిచుట్టు నున్నది, వారందరు సజీవులలోకములో భయంకరులైనవారు, వారు కత్తిపాలై చచ్చిపడియుండిరి.౹ అక్కడ ఏలామును దాని సమూహమును సమాధిచుట్టు నున్నవి; అందరును కత్తిపాలై చచ్చిరి; వారు సజీవులలోకములో భయంకరులైనవారు, వారు సున్నతిలేనివారై పాతాళములోనికి దిగిపోయిరి, గోతిలోనికి దిగిపోయినవారితోకూడ వారు అవమానము నొందుదురు.౹ హతులైన వారిమధ్య దానికిని దాని సమూహమునకును పడకయొకటి ఏర్పడెను, దాని సమాధులు దానిచుట్టు నున్నవి; వారందరును సున్నతి లేనివారై హతులైరి; వారు సజీవులలోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయినవారితోకూడ వారును అవమానము నొందుదురు, హతులైన వారిమధ్య అది యుంచబడును.౹ అక్కడ మెషెకును తుబాలును దాని సమూహమును ఉన్నవి; దాని సమాధులు దాని చుట్టునున్నవి. వారందరు సున్నతిలేనివారు, సజీవులలోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి, ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగి పోయిరి.౹ అయితే వీరు సున్నతిలేని వారిలో పడిపోయిన శూరులదగ్గర పండుకొనరు; వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి, తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు; వీరు సజీవులలోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి యెముకలకు తగిలెను.౹ నీవు సున్నతిలేనివారి మధ్య నాశనమై కత్తిపాలైనవారియొద్ద పండుకొందువు.౹ అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతులందరును ఉన్నారు; వారు పరాక్రమవంతులైనను కత్తి పాలైన వారియొద్ద ఉంచబడిరి; సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయినవారియొద్దను వారును పండు కొనిరి.౹ అక్కడ ఉత్తరదేశపు అధిపతులందరును సీదో నీయులందరును హతమైన వారితో దిగిపోయియున్నారు; వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవ మానము నొందియున్నారు; సున్నతి లేనివారై కత్తిపాలైన వారిమధ్య పండుకొనియున్నారు; గోతిలోనికి దిగిపోయిన వారితోపాటు వారును అవమానము నొందుదురు.౹ కత్తిపాలైన ఫరోయు అతనివారందరును వారినిచూచి తమ సమూహమంతటినిగూర్చి ఓదార్పు తెచ్చుకొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ సజీవులలోకములో అతనిచేత భయము పుట్టించితిని గనుక ఫరోయు అతని వారందరును కత్తిపాలైనవారియొద్ద సున్నతిలేనివారితోకూడ పండుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము–నేను ఒకానొక దేశముమీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించినయెడల అతడు దేశముమీదికి ఖడ్గము వచ్చుట చూచి, బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్తపడనందున ఖడ్గమువచ్చి వాని ప్రాణము తీసినయెడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది బాకానాదము వినియును వాడు జాగ్రత్తపడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది; ఏలయనగా వాడు జాగ్రత్తపడినయెడల తనప్రాణమును రక్షించుకొనును.౹ అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు, బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించినయెడల వాడు తన దోషమునుబట్టి పట్టబడినను, నేను కావలివానియొద్ద వాని ప్రాణమునుగూర్చి విచారణచేయుదును.౹ నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను.౹ –దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవియ్యగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మార్గుడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని అతని ప్రాణమునుగూర్చి నిన్ను విచారణచేయుదును.౹ అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువనియెడల అతడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము–మా పాపదోషములు మామీద పడియున్నవి, వాటివలన మేము క్షీణించుచున్నాము, మనమెట్లు బ్రదుకుదుమని మీరు చెప్పుకొనుమాట నిజమే.౹ కాగా వారితో ఇట్లనుము–నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతో షము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పు కొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయుము–నీతిమంతుడు పాపము చేసిన దినమున అదివరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనస్సు త్రిప్పుకొనిన దినమున తాను చేసియున్న చెడు తనమునుబట్టివాడు పడిపోడు, ఆలాగుననే నీతిమంతుడు పాపముచేసిన దినమున తన నీతినిబట్టి అతడు బ్రదుక జాలడు.౹ నీతిమంతుడు నిజముగా బ్రదుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారముచేసికొని పాపము చేసినయెడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు, తాను చేసిన పాపమునుబట్టి యతడు మరణము నొందును.౹ మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవియ్యగా అతడు తన పాపము విడిచి, నీతి న్యాయములను అనుసరించుచు కుదువసొమ్మును మరల అప్పగించుచు, తాను దొంగిలినదానిని మరల ఇచ్చివేసి పాపము జరిగింపక యుండి, జీవాధారములగు కట్టడలను అనుసరించినయెడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రదుకును.౹ అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు, అతడు నీతిన్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రదుకును.౹ అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని యనుకొందురు; అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయమైనది? నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపము చేసినయెడల ఆ పాపమునుబట్టి అతడు మరణము నొందును.౹ మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతిన్యాయములను అనుసరించినయెడల వాటినిబట్టి అతడు బ్రదుకును.౹ యెహోవా మార్గము న్యాయము కాదని మీరనుకొనుచున్నారే; ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధించెదను. మనము చెరలోనికి వచ్చిన పండ్రెండవ సంవత్సరము పదియవ నెల అయిదవదినమున ఒకడు యెరూషలేములోనుండి తప్పించుకొని నాయొద్దకు వచ్చి పట్టణము కొల్లపెట్టబడెనని తెలియజేసెను.౹ తప్పించుకొనినవాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నామీదికి వచ్చెను; ఉదయమున అతడు నాయొద్దకు రాకమునుపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను, అప్పటినుండి నేను మౌనిని కాకయుంటిని.౹ మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, ఇశ్రాయేలుదేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు–అబ్రాహాము ఒంటరియై యీ దేశమును స్వాస్థ్యముగా పొందెను గదా; అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు.౹ కాబట్టి వారికీమాట ప్రకటనచేయుము —ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు, మీ విగ్రహములవైపు దృష్టియుంచు మీరు, నరహత్యచేయు మీరు, ఈ దేశమును స్వతంత్రించుకొందురా? మీరు ఖడ్గము నాధారము చేసికొనువారు, హేయక్రియలు జరిగించు వారు, పొరుగువాని భార్యను చెరుపువారు; మీవంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా? నీవీలాగున వారికి చెప్పుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా –నా జీవముతోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గముచేత కూలుదురు, బయట పొలములోఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చెదను, కోటలలోనివారును గుహలలోనివారును తెగులుచేత చచ్చెదరు.౹ ఆ దేశమును నిర్జనముగాను పాడుగానుచేసి దాని బలాతిశయమును మాన్పించెదను, ఎవరును వాటిలో సంచరింపకుండ ఇశ్రాయేలీయుల మన్యములు పాడవును.౹ వారు చేసిన హేయక్రియలన్నిటినిబట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహో వానై యున్నానని వారు తెలిసికొందురు.౹ మరియు నరపుత్రుడా; నీ జనుల గోడదగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్నుగూర్చి మాటలాడుదురు, ఒకరి నొకరు చూచి–పోదము రండి, యెహోవాయొద్దనుండి బయలుదేరు మాట యెట్టిదో చూతము రండి అని చెప్పు కొనుచున్నారు.౹ నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది.౹ నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచుమంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు, వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు.౹ అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త యొకడు తమ మధ్యనుండెనని వారు తెలిసికొందురు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా–తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను మేపవలెను గదా.౹ మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు,౹ బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.౹ కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.౹ నా గొఱ్ఱెలు పర్వతములన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడుచున్నవి, నా గొఱ్ఱెలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువాడొకడును లేడు.౹ కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి –కాపరులులేకుండ నా గొఱ్ఱెలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహార మాయెను; కాపరులు నా గొఱ్ఱెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి.౹ –ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొఱ్ఱెలనుగూర్చి వారియొద్ద విచారించెదను, వారు గొఱ్ఱెలు మేపుట మాన్పించెదను, ఇకను కాపరులు తమ కడుపు నింపుకొనజాలక యుందురు; నా గొఱ్ఱెలు వారికి తిండికాకుండ వారి నోటనుండి వాటిని తప్పించెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును.౹ తమ గొఱ్ఱెలు చెదరిపోయి నప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱెలను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను.౹ నేను మంచి మేతగలచోట వాటిని మేపెదను, ఇశ్రాయేలుయొక్క ఉన్నతస్థలములమీద వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండు కొనును, ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును,౹ నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.౹ నా మందా, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా— గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్యను, గొఱ్ఱెలకును పొట్టేళ్లకును మధ్యను, గొఱ్ఱెలకును మేకపోతులకునుమధ్యను భేదము కనుగొని నేను తీర్పుతీర్చెదను.౹ విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరుత్రాగి మిగిలినదానిని కాళ్లతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్లతో త్రొక్కినదానిని నా గొఱ్ఱెలు మేయవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపినదానిని అవి త్రాగవలెనా? కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఇదిగో నేను నేనే క్రొవ్విన గొఱ్ఱెలకును చిక్కిపోయిన గొఱ్ఱెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును.౹ మీరు భుజముతోను ప్రక్కతోను త్రోసి, కొమ్ములతో రోగముగల వాటినన్నిటిని పొడిచి చెదర గొట్టెదరు.౹ నా గొఱ్ఱెలు ఇక దోపుడు కాకుండ గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్య తీర్పుతీర్చి నేను వాటిని రక్షించెదను.౹ వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.౹ యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను.౹ మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములోలేకుండచేయుదును.౹ వారిని నా పర్వతము చుట్టుపెట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును,౹ ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసినవారి చేతిలోనుండి వారిని విడిపింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.౹ ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారినిక భక్షింపవు, ఎవరివలనను భయములేకుండ వారు సురక్షితముగా నివసించెదరు.౹ మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారి కవమానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతికొరకై తోట యొకటి నే నేర్పరచెదను.౹ అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులైయున్నారనియు వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ నా గొఱ్ఱెలును నేను మేపుచున్న గొఱ్ఱెలునగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, శేయీరు పర్వతమువైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట యెత్తి ఈలాగు ప్రవచింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని, నా హస్తము నీమీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసెదను.౹ నీవు నిర్జనముగాఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను, నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై యున్నానని నీవు తెలిసికొందువు.౹ ఇశ్రాయేలీయులయెడల ఎడతెగని పగకలిగి, వారి దోషసమాప్తికాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమున కప్పగించితివి గనుక నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసెదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకిష్టమాయెను గనుక రక్తమే నిన్ను తరుమును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ వచ్చువారును పోవువారునులేకుండ అందరిని నిర్మూలముచేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును.౹ అతని పర్వతములను హతమైనవారితో నింపుదును, నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగులన్నిటిలోను వారు ఖడ్గముచేత హతులై కూలుదురు.౹ నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు నీ పట్టణములు మరల కట్టబడకుండ ఎల్లప్పుడును పాడుగా ఉండజేయుదును.౹ –యెహోవా అక్కడనుండినను ఆ రెండు జనములును ఆ రెండు దేశములును మనవే; మనము వాటిని స్వాధీనపరచుకొందము రండని నీవనుకొంటివే;౹ నా జీవముతోడు నీవు వారి యెడల పెట్టిన పగవలన వారికి చూపిన అసూయచొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పనిచేసి, నిన్ను శిక్షించుటవలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును.౹ –అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములనుగురించి పలికిన దూషణమాటలన్నియు యెహోవానగు నాకు వినబడెనని నీవు తెలిసికొందువు.౹ పెద్దనోరు చేసికొని మీరు నామీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను.౹ ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–లోకమంతయు సంతోషించునప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను.౹ ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆప్రకారము గానే చేసెదను; శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు, ఎదోము దేశము యావత్తును పాడైపోవును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వత.ములకు ఈ మాట ప్రవచింపుము–ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి,౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా — ఆహా ప్రాచీనములైన ఉన్నతస్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి.౹ వచనమెత్తి ఈలాగు ప్రవచింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించువారిచేత జనుల దృష్టికి మీరు అపహాస్యా స్పదమగునట్లుగాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మును పట్టుకొన నాశించి మిమ్మును పాడుచేసియున్నారు.౹ కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–శేషించిన అన్యజనులకు అపహాస్యా స్పదమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను పాడైన స్థలములతోను నిర్జనమైన పట్టణములతోను ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా — సంతుష్టహృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరచుకొనిన ఎదోమీయులనందరినిబట్టియు, శేషించిన అన్యజనులనుబట్టియు నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను.౹ కాబట్టి ఇశ్రాయేలుదేశమునుగూర్చి ప్రవచనమెత్తి, పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ఈ మాట తెలియజెప్పుము— ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–మీరు అన్యజనులవలన అవమానము నొందితిరి గనుక రోషముతోను కోపముతోను నేను మాట ఇచ్చియున్నాను.౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–మీ చుట్టునున్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను.౹ ఇశ్రాయేలు పర్వతములారా, యిక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులగు నా జనులు వచ్చె దరు, మీరు చిగురుపెట్టి వారికొరకు మీ ఫలములు ఫలించుదురు.౹ నేను మీ పక్షముననున్నాను, నేను మీతట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు.౹ మీ మీద మానవ జాతిని, అనగా ఇశ్రాయేలీయులనందరిని, విస్తరింప జేసెదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరల కట్టబడును.౹ మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి,మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.౹ మానవజాతిని, అనగా నా జనులగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురు, మీ రికమీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు.౹ ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా–దేశమా, నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారే.౹ నీవు మనుష్యులను భక్షిం పవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు నిన్నుగూర్చి అన్యజనులుచేయు అపహాస్యము నీకిక వినబడకుండ చేసెదను, జనములవలన కలుగు అవమానము నీవికభరింపవు, నీవు నీ జనులను పుత్రహీనులగా చేయకయుందువు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి, దుష్‌ప్రవర్తనచేతను దుష్‌క్రియలచేతను దానిని అపవిత్రపరచిరి, వారి ప్రవర్తన బహిష్టయైన స్త్రీయొక్క అపవిత్రతవలె నా దృష్టికి కనబడుచున్నది.౹ కాబట్టి దేశములో వారు చేసిన నర హత్య విషయమైయును, విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచినదాని విషయమైయును నేను నా క్రోధమును వారిమీద కుమ్మరించి వారి ప్రవర్తననుబట్టియు వారి క్రియలనుబట్టియు వారిని శిక్షించి, నేను అన్యజనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయిరి.౹ వారు తాము వెళ్లిన స్థలములలోని జనులయొద్ద చేరగా ఆ జనులు–వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములోనుండి వచ్చినవారే గదా, అని చెప్పుటవలన నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి.౹ కాగా ఇశ్రాయేలీయులు పోయిన యెల్లచోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని.౹ కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటనచేయుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీచేత దూషణనొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానిని చేయుదును.౹ అన్యజనులమధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి యెదుట మీయందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ నేను అన్యజనులలోనుండి మిమ్మును తోడుకొని, ఆయా దేశములలోనుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను.౹ మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.౹ నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.౹ నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.౹ నేను మీపితరుల కిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులైయుందురు నేను మీ దేవుడనై యుందును.౹ మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరవురానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును.౹ అన్యజనులలో కరవునుగూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములను భూమిపంటను నేను విస్తరింపజేసెదను.౹ అప్పుడు మీరు మీ ద్షు ప్రవర్తనను మీరు చేసిన దుష్‌క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములనుబట్టియు హేయక్రియలనుబట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు.౹ మీ నిమిత్తము నేను ఈలాగున చేయుటలేదని తెలిసి కొనుడి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తననుగూర్చి చిన్నబోయి సిగ్గు పడుడి.౹ మీ దోషములవలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింప జేయునాడు పాడైపోయిన స్థలములు మరల కట్టబడును.౹ మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును.౹ పాడైన భూమి ఏదెను వనమువలె ఆయెననియు, పాడుగాను నిర్జనముగానున్న యీ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములుగలవాయెననియు జనులు చెప్పుదురు.౹ అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టు శేషించిన అన్యజనులు తెలిసి కొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దాని నెరవేర్తును. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులకు నేను ఈలాగుచేయు విషయములో వారిని నాయొద్ద విచారణచేయనిత్తును, గొఱ్ఱెలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపజేసెదను.౹ నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు ప్రతిష్ఠితములగు గొఱ్ఱెలంత విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొఱ్ఱెలంత విస్తారముగాను వారి పట్టణములయందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించునట్లు నేను చేసెదను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి.౹ ఆయన–నర పుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగా–ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని.౹ అందుకాయన–ప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము–ఎండిపోయిన యెముకలారా, యెహోవా మాట ఆలకించుడి.౹ ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను;౹ చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.౹ ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను.౹ నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక పోయెను.౹ అప్పుడు ఆయన–నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా— జీవాత్మా, నలుదిక్కులనుండివచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము.౹ ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి.౹ అప్పుడాయన నాతో ఇట్లనెను —నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు — మన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతిమి అని యనుకొనుచున్నారు కాబట్టి ప్రవచన మెత్తి వారితో ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోనుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలుదేశములోనికి తోడుకొని వచ్చెదను.౹ నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, నీవు కఱ్ఱతునక యొకటి తీసికొని దానిమీద యూదావారిదనియు, వారి తోటివారగు ఇశ్రాయేలీయులదనియు పేళ్లు వ్రాయుము. మరియొక తునక తీసికొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారితోటి వారగు ఇశ్రాయేలువారిదనియు వ్రాయుము.౹ అప్పు డది యేకమైన తునకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునక యగును.౹ –ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా? అని నీ జనులు నిన్నడుగగా ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఎఫ్రాయిము చేతిలో నున్న తునక, అనగా ఏ తునకమీద ఇశ్రాయేలువారందరి పేళ్లును వారితోటివారి పేళ్లును నేను ఉంచితినో యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని యొకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసెదను.౹ ఇట్లుండగా వారికీలాగు చెప్పుము –ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా — ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆయా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతములమీద వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలనగాని తాము చేసియున్న హేయక్రియలవలనగాని యే అతి క్రమక్రియలవలనగాని వారికమీదట తమ్మును అపవిత్ర పరచుకొనరు; తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండ వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై యుందును.౹ నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరియొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్ట డలను గైకొని ఆచరింతురు.౹ మీపితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును.౹ నేను వారితో సమాధా నార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను.౹ నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు.౹ మరియు వారి మధ్య నా పరిశుద్ధస్థలము నిత్యముఉండు టనుబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలిసికొందురు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, మాగోగు దేశపువాడగు గోగు, అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియైనవానితట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట యెత్తి ప్రవచింపుము –ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–రోషునకును మెషెకు నకును తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినై యున్నాను.౹ నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవుడలకు గాలములు తగిలించి, నిన్నును నీ సైన్యమంతటిని గుఱ్ఱములను నానావిధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరిని, కవచములును డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరిని, మహాసైన్యముగా బయలు దేరదీసెదను.౹ నీతోకూడిన పారసీకదేశపు వారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిర స్తాణములను ధరించు వారినందరిని నేను బయలుదేరదీసెదను.౹ గోమెరును అతని సైన్యమంతయును ఉత్తరదిక్కులలోనుండు తోగర్మాయును అతని సైన్యమును జనము లనేకములు నీతోకూడ వచ్చును.౹ నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతోకూడ కలిసిన సమూహ మంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలియై యుండవలెను.౹ చాలదినములైన తరువాత నీవు శిక్షనొందుదువు; సంవత్సరముల అంతములో నీవు ఖడ్గమునుండి తప్పించుకొని, ఆయా జనములలో చెదరిపోయి యెడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతములమీద నివసించుటకై మరల సమకూర్చబడిన జనులయొద్దకును, ఆయా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరియొద్దకును నీవు వచ్చెదవు.౹ గాలి వాన వచ్చి నట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదికి వచ్చె దవు, నీవును నీ సైన్యమును నీతోకూడిన బహు జనమును దేశముమీద వ్యాపింతురు.౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఆ కాలమందు నీ మనస్సులో అభి ప్రాయములు పుట్టును,౹ నీవు దురాలోచనచేసి ఇట్లను కొందువు — నేను ప్రాకారములులేని గ్రామములుగల దేశముమీదికి పోయెదను, ప్రాకారములును అడ్డగడియలును గవనులునులేని దేశము మీదికి పోయెదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించువారి మీదికి పోయెదను.౹ వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను, ఆయా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులునుగలిగి, భూమి నట్టనడుమ నివసించు జనులమీదికి తిరిగి పోయెదను.౹ సెబావారును దదాను వారును తర్షీషు వర్తకులును కొదమ సింహముల వంటివారైన దానివారందరును నిన్ను చూచి–సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చి తివా? బహుగా దోపు దోచుకొని, వెండి బంగారములను పశువులను సరకులను పట్టుకొనిపోవుటకు చాల దోపుడు దోచుకొనుటకు వచ్చితివా? అని నిన్నడుగుదురు. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా జనులగు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలిసికొందువుగదా? ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలోనుండి నీవును నీతోకూడ జనము లనేకములును గుఱ్ఱములెక్కి బహువిస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనులమీద పడెదరు; అంత్య దినములందు అది సంభవించును, అన్యజనులు నన్ను తెలిసి కొనునట్లు నిన్నుబట్టి వారి యెదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున, గోగూ, నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను.౹ ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నిన్ను వారిమీదికి రప్పించెదనని పూర్వమందు ఏటేట ప్రవచించుచువచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకులద్వారా నేను సెలవిచ్చినమాట నిన్నుగూర్చినదే గదా? ఆ దినమున, గోగు ఇశ్రాయేలీయుల దేశము మీదికి రాబోవు ఆ దినమున, నాకోపము బహుగా రగులుకొనును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు కాబట్టి నేను రోషమును మహా రౌద్రమును గలిగినవాడనై యీలాగు ప్రమాణముచేసితిని. ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును.౹ సముద్రపు చేపలును ఆకాశపక్షులును భూజంతువులును భూమిమీద ప్రాకుపురుగులన్నియు భూమిమీదనుండు నరులందరును నాకు భయపడి వణకుదురు, పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నియు నేలపడును నా పర్వతములన్నిటిలో అతనిమీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరునిమీద పడును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారి మీదను అతనితోకూడిన జనములనేకములమీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును.౹ నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును. మరియు నరపుత్రుడా, గోగునుగూర్చి ప్రవచన మెత్తి ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతివైన గోగూ, నేను నీకు విరోధినైయున్నాను.౹ నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి, ఉత్తరదిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతములకు రప్పించి నీ యెడమచేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను, నీ కుడిచేతిలోనున్న బాణములను క్రింద పడవేసెదను,౹ నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరును ఇశ్రాయేలు పర్వతములమీద కూలుదురు, నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చెదను.౹ నీవు పొలముమీద కూలుదువు, నేనే మాట యిచ్చియున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించువారిమీదికిని అగ్ని పంపెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసి కొందురు.౹ నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనియ్యక, నా జనులగు ఇశ్రాయేలీయులమధ్య దానిని బయలుపరచెదను.౹ ఇదిగో అది వచ్చుచున్నది, కలుగబోవుచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి, కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసికొని పొయ్యిలో కాల్చుదురు, వాటివలన ఏడు సంవత్సరములు అగ్ని మండును.౹ వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరుకకయునుండి, ఆయుధములు పొయ్యిలో కాల్చు చుందురు, తమ్మును దోచుకొనినవారిని తామే దోచుకొందురు, తమ సొమ్ము కొల్లపెట్టినవారి సొమ్ము తామే కొల్లపట్టుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్థులు పోవు లోయలో ఇశ్రాయేలుదేశమున నేనొక స్థలము ఏర్పరచెదను; గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్థులు పోవుటకు వీలులేకుండును, ఆ లోయకు హమోన్గోగు అను పేరు పెట్టుదురు.౹ దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు.౹ నేను ఘనత వహించు దినమున దేశపు జనులందరు వారిని పాతిపెట్టుదురు; దానివలనవారు కీర్తి నొందెదరు; ఇదే యెహోవా వాక్కు.౹ దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టువారిని, దేశమును సంచరించి చూచుచు వారితోకూడ పోయి పాతిపెట్టువారిని నియమించెదరు. ఏడు నెలలైన తరువాత దేశమునందు తనికీ చేసెదరు.౹ దేశమును సంచరించి చూచువారు తిరుగు లాడుచుండగా మనుష్యశల్యమొకటియైనను కనబడినయెడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టువరకు అక్కడ వారేదైన ఒక ఆనవాలు పెట్టుదురు.౹ మరియు హమోనా అను పేరుగల ఒక పట్టణ ముండును. ఈలాగునవారు దేశమును పవిత్రపరచుదురు. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–సకలజాతుల పక్షులకును భూమృగముల కన్ని టికిని యీ సమాచారము తెలియజేయుము–నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కులనుండి కూడి రండి; ఇశ్రాయేలీయుల పర్వతములమీద నొక గొప్ప బలి జరుగును, మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు;౹ బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును, బాషానులో క్రొవ్విన పొట్లేళ్లయొక్కయు గొఱ్ఱెపిల్లలయొక్కయు మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తము త్రాగుదురు.౹ నేను మీ కొరకు బలి వధింప బోవుచున్నాను, మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు.౹ నే నేర్పరచిన పంక్తిని కూర్చుండి గుఱ్ఱములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్థులను మీరు కడుపార భక్షింతురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ నా ఘనతను అన్యజనులలో అగుపరచెదను, నేను చేసిన తీర్పును వారిమీద నేను వేసిన నా హస్తమును అన్యజనులందరు చూచెదరు.౹ ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యెహో వానైయున్నానని ఇశ్రాయేలీయులు తెలిసికొందురు.౹ మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమునుబట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతుకులైనందున నేను వారికి పరాఙ్ముఖుడనై వారు ఖడ్గముచేత కూలు నట్లుగా వారిని బాధించువారికి అప్పగించితిననియు అన్యజనులు తెలిసికొందురు.౹ వారి యపవిత్రతనుబట్టియు అతిక్రమ క్రియలనుబట్టియు నేను వారికి పరాఙ్ముఖుడనై వారికి ప్రతికారము చేసితిని. కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా —నా పరిశుద్ధ నామమునుబట్టి రోషముకలిగినవాడనై యాకోబు సంతతివారిని చెరలోనుండి రప్పించెదను, ఇశ్రాయేలీయులందరియెడల జాలిపడెదను.౹ వారు నాయెడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలోనుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశములోనుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశములో నివసించునప్పుడు వారియందు అన్యజనులనేకముల యెదుట నన్ను పరిశుద్ధపరచుకొందును.౹ అన్యజనులలోనికి వారిని చెరగా పంపి, వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనియ్యక తమ దేశమునకు వారిని సమ కూర్చిన సంగతినిబట్టి నేను తమ దేవుడైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.౹ అప్పుడు ఇశ్రాయేలీయులమీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాఙ్ముఖుడనై యుండను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మనము చెరలోనికి వచ్చిన యిరువదియైదవ సంవత్సరము మొదటి నెల పదియవ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన పదునాలుగవ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను.౹ దేవుని దర్శనవశుడనైన నన్ను ఇశ్రాయేలీయుల దేశములోనికి తోడుకొని వచ్చి, మిగుల ఉన్నతమైన పర్వతముమీద ఉంచెను. దానిపైన దక్షిణపుతట్టున పట్టణమువంటి దొకటి నాకగు పడెను.౹ అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడి వలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేతపట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను.౹ ఆ మనుష్యుడు నాతో ఇట్లనెను–నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటిని కన్నులార చూచి చెవులార విని మనస్సులో ఉంచుకొనుము; నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి, నీకు కనబడు వాటినన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజేయుము. నేను చూడగా నలుదిశలమందిరముచుట్టు ప్రాకార ముండెను, మరియు ఆ మనుష్యునిచేతిలో ఆరు మూరల కొలకఱ్ఱయుండెను, ప్రతిమూర మూరెడు బెత్తెడు నిడివి గలది, ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని యెత్తును బారన్నర తేలెను.౹ అతడు తూర్పుతట్టున నున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను.౹ మరియు కావలిగది నిడివియు వెడల్పును బారన్నర, కావలి గదులకు మధ్య అయిదేసి మూరల యెడముండెను. గుమ్మముయొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు బారన్నర యెడము.౹ గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను.౹ గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను.౹ తూర్పు గుమ్మపు ద్వారముయొక్క కావలి గదులు ఇటు మూడును, అటు మూడును ఉండెను, మూడు గదులకు కొలత యొకటే. మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత యొకటే.౹ ఆయా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు పది మూరలును నిడివి పదుమూడు మూరలును తేలెను.౹ కావలి గదులముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కల నుండెను, ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ యుండెను; గదులైతే ఇరుప్రక్కలను ఆరుమూరల ఎత్తుగలవి.౹ ఒకగది కప్పునుండి రెండవదాని కప్పువరకు గుమ్మమును కొలువగా ఇరువదియయిదు మూరల వెడల్పు తేలెను, రెండు వాకిండ్లమధ్య గోడను అదే కొలత.౹ అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టునున్న ఆవరణము స్తంభములవరకు వ్యాపించెను.౹ బయటి గుమ్మమునొద్దనుండి లోపటి గుమ్మపుద్వారమువరకు ఏబదిమూరలు.౹ కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టు నున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను, గోడలోని స్తంభములకును కిటికీలుండెను; ప్రతి స్తంభముమీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి యుండెను. అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట గదులును చప్టాయు కనబడెను. చప్టామీద ముప్పది చిన్నగదులు ఏర్పడియుండెను.౹ ఈ చప్టా గుమ్మములవరకుండి వాటి వెడల్పున సాగియుండెను. అది క్రింది చప్టా ఆయెను.౹ క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణమువరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను నూరు మూరలాయెను.౹ మరియు ఉత్తరపువైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్యగోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను, అనగా నిడివి ఏబదిమూరలు వెడల్పు ఇరువదియైదుమూరలు కనబడెను.౹ వాటి కిటికీలును వాటి మధ్యగోడలును ఖర్జూరపుచెట్లవలె రూపింప బడిన వాటి అలంకారమును తూర్పుద్వారముయొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై యేడు మెట్లుండెను, ఎదుటనుండి దాని మధ్యగోడలు కనబడుచుండెను.౹ ఉత్తరద్వారమున కెదురుగా ఒక టియు, తూర్పుద్వారమున కెదురుగా ఒకటియు, లోపటి ఆవరణమునకు పోవు రెండు గుమ్మములుండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా నూరుమూరల యెడము కనబడెను.౹ అతడు నన్ను దక్షి ణపుతట్టునకు తోడుకొని పోగా దక్షిణపుతట్టున గుమ్మ మొకటి కనబడెను. దాని స్తంభములను మధ్యగోడలను కొలువగా అదే కొలత కనబడెను.౹ మరియు వాటి కున్నట్టుగా దీనికిని దీని మధ్యగోడలకును చుట్టు కిటికీ లుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరవదియైదు మూరలు.౹ ఎక్కుటకు ఏడు మెట్లును ఎదురుగా కనబడు మధ్యగోడలును ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను లోపటి ఆవరణమునకు దక్షిణపుతట్టున గుమ్మమొకటి యుండెను, దక్షిణపుతట్టును గుమ్మమునుండి గుమ్మమువరకు ఆయన కొలువగా నూరు మూరలాయెను. అతడు దక్షిణమార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను; దాని కొలత అదే.౹ మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీ లుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు చుట్టు మధ్యగోడల నిడివి ఇరువది యైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు.౹ దాని మధ్య గోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.౹ తూర్పుతట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను.౹ దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; నిడివి యేబది మూరలు, వెడల్పు ఇరువది యైదు మూరలు.౹ దాని మధ్యగోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకార ముండెను, ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.౹ ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొనిపోయి దాని కొలు వగా అదే కొలత యాయెను.౹ దాని కావలిగదులకును స్తంభములకును దాని మధ్యగోడలకును అదే కొలత; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; దాని నిడివి యేబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు.౹ దాని స్తంభములు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; ఆ స్తంభములమీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను. గుమ్మముల స్తంభములయొద్ద వాకిలిగల గదియుండెను; అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు.౹ మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల రెండేసి బల్లలుంచబడెను; వీటిమీద దహనబలి పశువులును పాప పరిహారార్థబలిపశువులును అపరాధపరిహారార్థబలిపశువులును వధింపబడును.౹ గుమ్మముయొక్క వాకిలిదగ్గర ఉత్తరపుదిక్కున మెట్లు ఎక్కుచోటున ఇరుప్రక్కల రెండేసి బల్లలుండెను. అనగా గుమ్మపు రెండుప్రక్కల నాలుగేసి బల్లలుండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడి యుండెను.౹ [41-42] దహనబలి పశువులు మొదలగు బలిపశువులను వధించుటకై వినియోగించు ఉపకరణము లుంచదగిన యెనిమిది బల్లలు ఈతట్టు నాలుగు ఆతట్టు నాలుగు మెట్లదగ్గర నుండెను. అవి మూరెడున్నర నిడి వియు మూరెడున్నర వెడల్పును మూరెడు ఎత్తును గలిగి మలిచిన రాతితో చేయబడి యుండెను.౹ *** చుట్టుగోడకు అడుగడుగు పొడుగుగల మేకులు నాటబడియుండెను; అర్పణ సంబంధమైన మాంసము బల్లలమీద ఉంచుదురు.౹ లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణములో ఉత్తరపు గుమ్మముదగ్గరనుండి దక్షిణముగా చూచు నొకటియు, తూర్పు గుమ్మము దగ్గరనుండి ఉత్తరముగా చూచు నొక టియు రెండు గదులుండెను.౹ అప్పుడతడు నాతో ఇట్లనెను–దక్షిణపుతట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది.౹ ఉత్తరపుతట్టు చూచు గది బలిపీఠమునకు కావలివారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతివారై సేవచేయుటకై యెహోవా సన్ని ధికి వచ్చువారు.౹ అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరుమూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠముంచబడెను. అతడు మందిరముయొక్క మంటపములోనికి నన్ను తోడుకొని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్కదాని కొలువగా అది ఇరుప్రక్కల అయిదేసి మూరలుండెను, గుమ్మము ఇరుప్రక్కల మూడేసి మూరల వెడల్పు.౹ మంటపమునకు నిడివి యిరువది మూరలు; ఎక్కుటకై యుంచబడిన మెట్లదగ్గర దాని వెడల్పు పదకొండు మూరలు, స్తంభములదగ్గర ఇరు ప్రక్కల ఒక్కొక్కటిగా కంబములుంచబడెను. తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని. వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి ఆరు మూరలాయెను, ఇది గుడారపు వెడల్పు.౹ వాకిలి వెడల్పు పది మూరలు, తలుపు ఇరుప్రక్కల అయిదేసి మూరలు, దాని నిడివిని కొలువగా నలుబది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు.౹ అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయెను, వాకిలి ఆరుమూరలు; వెడల్పు ఏడు మూరలు.౹ –ఇది అతి పరిశుద్ధస్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలును ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు ఇరువది మూరలునాయెను.౹ తరువాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మూరలాయెను, మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా నాలుగేసి మూరలాయెను.౹ ఈ మేడగదులు మూడేసి అంతస్థులు గలవి. ఈలాగున ముప్పది గదులుండెను, ఇవి మేడ గదులచోటున మందిరమునకు చుట్టు కట్టబడిన గోడతో కలిసియుండెను; ఇవి మందిరపుగోడను ఆనుకొనియున్న ట్టుండి ఆనుకొనక యుండెను.౹ ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను, పైకెక్కిన కొలది మందిరముచుట్టునున్న యీ మేడగదుల అంతస్థులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను; పైకెక్కిన కొలది అంతస్థులు మరి వెడల్పుగా ఉండెను.౹ మరియు నేను చూడగా మందిరము చుట్టునున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను, ఏలయనగా ఆ మేడగదులకు ఆరు పెద్దమూరలుగల పునాది యుండెను.౹ మేడగదులకు బయటనున్న గోడ అయిదు మూరల వెడల్పు; మరియు మందిరపు మేడగదుల ప్రక్కలనున్న స్థలము ఖాలీగా విడువబడి యుండెను గదులమధ్య మందరిముచుట్టు నలుదిశల ఇరువది మూరల వెడల్పున చోటు విడువబడి యుండెను మేడగదుల వాకిండ్లు ఖాలీగానున్న స్థలముతట్టు ఉండెను; ఒక వాకిలి ఉత్తరపుతట్టునను ఇంకొక వాకిలి దక్షిణపుతట్టునను ఉండెను. ఖాలీగా నున్న స్థలముచుట్టు అయిదు మూరల వెడల్పుండెను.౹ ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్టడము పడమటితట్టు డెబ్బది మూరల వెడల్పు, దాని గోడ అయిదు మూరల వెడల్పు; గోడ నిడివి తొంబది మూరలు.౹ మందిరముయొక్క నిడివిని అతడు కొలు వగా నూరు మూరలాయెను, ప్రత్యేకింపబడిన స్థలమును దాని కెదురుగానున్న కట్టడమును దానిగోడలను కొలువగా నూరు మూరలాయెను.౹ మరియు తూర్పుతట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా నూరు మూరలాయెను.౹ ఈలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమున కెదురుగా నున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా నూరు మూరలాయెను.౹ మరియు గర్భాలయమును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములుగల కిటికీలను ఎదుటి మూడు అంతస్థుల చుట్టునున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగుచేయబడెను, గడపలకెదురుగా నేలనుండి కిటికీలవరకు బల్లకూర్పుండెను వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగోడయు వెలిగోడయు చుట్టుగోడయు కొలతప్రకారము కట్టబడియుండెను.౹ కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను; దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపుచెట్టు ఒకటియుండెను; ఒక్కొక్క కెరూబునకు రెండేసి ముఖము లుండెను.౹ ఎట్లనగా ఈతట్టు ఖర్జూరపు చెట్టువైపున మనుష్యముఖమును ఆతట్టు ఖర్జూరపుచెట్టువైపున సింహముఖమును కనబడెను; ఈ ప్రకారము మందిరమంతటిచుట్టు నుండెను.౹ నేల మొదలుకొని వాకిలిపైవరకు మందిరపు గోడకు కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను.౹ మందిరపు ద్వారబంధములు చచ్చౌకములు, పరిశుద్ధస్థలపు ద్వారబంధములును అట్టివే.౹ బలిపీఠము కఱ్ఱతో చేయబడెను, దాని యెత్తు మూడు మూరలు, నిడివి రెండు మూరలు, దాని పీఠమును మూలలును ప్రక్కలును మ్రానితో చేయబడినవి; ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను.౹ మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను.౹ ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది.౹ మరియు గోడలమీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్లమీదను కెరూబులును ఖర్జూరపుచెట్లును చెక్కబడి యుండెను, బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటుపని కనబడెను.౹ మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును ఒరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారమును ఉండెను. అతడు ఉత్తరమార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకొని వచ్చి ఖాలీచోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను.౹ ఆ కట్టడము నూరు మూరల నిడివిగలదై ఉత్తరదిక్కున వాకిలికలిగి యేబది మూరల వెడల్పుగలది.౹ ఇరువది మూరలుగల లోపటి ఆవరణమున కెదురుగాను బయటి ఆవరణపు చప్టా కెదురుగాను మూడవ అంతస్థు లోని వసారాలు ఒకదానికొకటి యెదురుగా ఉండెను.౹ గదులకెదురుగా పదిమూరల వెడల్పుగల విహారస్థలముండెను, లోపటి ఆవరణమునకు పోవుచు ఉత్తరదిక్కు చూచు వాకిండ్లు గల విహారస్థలమొకటి యుండెను, అది మూరెడు వెడల్పు.౹ వాకిండ్లకు వసారాలుండుటవలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్యగదులు ఇరుకుగానుండి కురచవాయెను.౹ మూడవ అంతస్థులో ఉండినవి ఆవరణములకున్న వాటివంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రిందిగదులకంటెను మధ్యగదులకంటెను చిన్నవిగా కట్టబడియుండెను.౹ మరియు గదుల వరుసనుబట్టి బయటి ఆవరణముతట్టు గదులకెదురుగా ఏబది మూరల నిడివిగల యొక గోడ కట్టబడియుండెను.౹ బయటి ఆవరణములోనున్న గదుల నిడివి యేబది మూరలుగాని మందిరపు ముందటి ఆవరణము నూరుమూరల నిడివిగలదై యుండెను.౹ ఈ గదులు గోడక్రిందనుండి లేచినట్టుగా కనబడెను, బయటి ఆవరణములోనుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముండెను.౹ విడిచోటునకు ఎదురుగాను కట్టడమున కెదురుగాను ఆవరణపుగోడ మందములో తూర్పుతట్టుకొన్ని గదులుండెను.౹ మరియు వాటి యెదుటనున్న మార్గము ఉత్తరపుతట్టునున్న గదుల మార్గము వలె నుండెను, వాటి నిడివిచొప్పునను వెడల్పు చొప్పు నను ఇవియు కట్టబడెను; వీటి ద్వారములును ఆ రీతినే కట్టబడియుండెను.౹ మరియు మార్గపు మొగను దక్షిణపుతట్టు గదులయొక్క తలుపులవలె వీటికి తలుపులుండెను, ఆ మార్గము ఆవరణములోనికి పోవు నొకనికి తూర్పుగా నున్న గోడ యెదుటనే యుండెను.౹ అప్పుడాయన నాతో ఇట్లనెను — విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులును దక్షిణపుగదులును ప్రతిష్ఠితములైనవి, వాటి లోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతిపరిశుద్ధ వస్తువులను భుజించెదరు, అక్కడ వారు అతిపరిశుద్ధ వస్తువులను, అనగా నైవేద్యమును పాపపరిహారార్థబలిపశు మాంసమును అపరాధపరిహారార్థబలిపశుమాంసమును ఉంచెదరు, ఆ స్థలము అతిపరిశుద్ధము.౹ యాజకులు లోపల ప్రవేశించునప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్యచేయు వస్త్రములను ఉంచవలెను; అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరుబట్టలు ధరించుకొనవలెను. అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పుతట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టును కొలిచెను.౹ తూర్పుదిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలాయెను.౹ ఉత్తర దిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును దక్షిణదిశను కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును,౹ పశ్చిమదిశను తిరిగి కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును తేలెను.౹ నాలుగుతట్లు అతడు కొలిచెను; ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలమునుండి ప్రత్యేకపరుచుటకై దానిచుట్టు నలుదిశల ఐదువందల బారలుగల చచ్చౌకపు గోడ కట్టబడి యుండెను. తరువాత అతడు తూర్పుతట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పుదిక్కున కనబడెను; దానినుండి పుట్టిన ధ్వని విస్తారజలముల ధ్వనివలె వినబడెను, ఆయన ప్రకాశముచేత భూమి ప్రజ్వరిల్లెను.౹ నాకు కనబడు దర్శనము, పట్టణమును నాశముచేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనమువలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలబడితిని.౹ తూర్పుతట్టు చూచు గుమ్మపుమార్గమున యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించెను.౹ ఆత్మ నన్నుఎత్తి లోపటి ఆవరణములోనికి తీసికొని రాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను.౹ మందిరములోనుండి యొకడు నాతో మాటలాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నాయొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను.౹ –నర పుత్రుడా, యిది నా గద్దె స్థలము, నా పాదపీఠము; ఇక్కడ నేను ఇశ్రాయేలీయులమధ్య నిత్యమును నివసించెదను, వారు ఇకను జారత్వముచేసి తమ రాజుల కళేబరములకు ఉన్నతస్థలములను కట్టి, తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకయుందురు, నాకును వారికిని మధ్య గోడ మాత్రముంచి నా గడపదగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధములదగ్గర వారి ద్వార బంధములను కట్టి, తాముచేసిన హేయక్రియలచేత నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసితిని.౹ వారు జారత్వము మాని, తమ రాజుల కళేబరములను నాయొద్దనుండి దూరమునకు కొనిపోయినయెడల వారిమధ్యను నేనెల్లప్పుడును నివసింతును. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములనుబట్టి సిగ్గుపడునట్లు ఈ మందిరమును వారికి చూపించుము, వారు దాని వైఖరిని కనిపెట్టవలెను.౹ తాము చేసినవాటన్నిటినిబట్టి వారు సిగ్గుపడినయెడల, మందిరముయొక్క వైఖరిని దాని యేర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమస్థానములను దానినిగూర్చిన మర్యాద లన్నిటిని విధులన్నిటిని దాని ఆచారములను క్రమములను వారికి కనుపరచి, వారు ఆ ఆచారవిధులన్నిటిని గైకొని ఆచరించునట్లువారు చూచుచుండగా వాటిని వ్రాయించుము.౹ ఆ మందిరమునుగూర్చిన విధి యేదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతిపరిశుద్ధము, మందిరమునుగూర్చిన విధి యిదియే. మూరల కొలచొప్పున బలిపీఠముయొక్క కొలత ఎంతనగా మూరెడు, అనగా మూరెడు జేనెడు బలిపీఠమునకు పీఠమొకటి యుండవలెను. దాని డొలుపు మూరె డెత్తును మూరెడు వెడల్పును చుట్టు దాని చూరు జేనెడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను.౹ నేలమీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరువరకును ఎత్తు రెండు మూరలు, వెడల్పు మూరెడు మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరువరకు నాలుగు మూరలు, దాని వెడల్పు మూరెడు.౹ దేవుని కొండయను భాగము నాలుగు మూరలు దేవాగ్నిగుండమునుండి పైకి నాలుగు కొమ్ము లుండెను,౹ దేవాగ్నిగుండము పండ్రెండు మూరల కొలత గలదై చచ్చౌకముగా నుండెను.౹ మరియు చూరు నిడి వియు వెడల్పును నలుదిశల పదునాలుగు మూరలు, దాని చుట్టునున్న అంచు జేనెడు, దాని చుట్టంతయు మూరెడు, డొలుపు ఒకటి యుండెను, దానికున్న మెట్లు తూర్పుతట్టుండెను. మరియు అతడు నాతో ఇట్లనెను–నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దానిమీద రక్తము చల్లి, దహనబలులు అర్పించుటకై విధులనుబట్టి ఈలాగున జరిగింపవలెను.౹ ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–పరిచర్యచేయుటకై నా సన్నిధికివచ్చు సాదోకు సంతానపు లేవీయులగు యాజకులకు పాపపరిహారార్థబలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను.౹ వారు దాని తీసికొని పాపపరిహారార్థబలిగా నర్పించి, బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని నాలుగు కొమ్ములమీదను చూరుయొక్క నాలుగు మూలలమీదను చుట్టునున్న అంచుమీదను చమరవలెను.౹ తరువాత పాపపరిహారార్థబలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతలమందిరమునకు చేరిన నిర్ణయస్థలములో దానిని దహనము చేయవలెను.౹ రెండవదినమున పాప పరిహారార్థబలిగా నిర్దోషమైన యొక మేకపిల్లను అర్పింపవలెను; కోడెచేత బలిపీఠమునకు పాపపరిహారము చేసినట్లు మేకపిల్లచేతను పాపపరిహారము చేయవలెను.౹ దాని నిమిత్తము పాపపరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలును అర్పింపవలెను.౹ యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పుచల్లి దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను.౹ ఏడు దినములు వరుసగా పాపపరిహారార్ధబలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను.౹ ఏడు దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్ర పరచుచు ప్రతిష్ఠించుచు నుండవలెను.౹ ఆ దినములు తీరిన తరువాత ఎనిమిదవ దినము మొదలుకొని యాజకులు బలిపీఠముమీద మీ దహనబలులను మీ సమాధానబలులను అర్పింపగా నేను మిమ్ము నంగీకరించెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తూర్పుతట్టు చూచు పరిశుద్ధస్థలముయొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి యుండెను.౹ అంతట యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఈ గుమ్మముద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దానిద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడును తీయబడకుండ అది మూయబడియే యుండును.౹ అధిపతి యగువాడు తన ఆధిపత్యమునుబట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించునప్పుడు అతడచ్చట కూర్చుండును; అతడైతే మంటపమార్గముగా ప్రవేశించి మంటపమార్గముగా బయటికి పోవలెను.౹ అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. అంతలో యెహోవా తేజోమిహమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా–నరపుత్రుడా, యెహోవా మందిరమునుగూర్చిన కట్టడ లన్నిటిని విధులన్నిటిని నేను నీకు తెలియజేయుచున్నాను; నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటిని చూచి చెవినిబెట్టుము. మరియు పరిశుద్ధస్థలములోనుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరములోపలికి వచ్చుటనుగూర్చి యోచించుము.౹ తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులారా, యిదివరకు మీరు చేసిన హేయక్రియలన్ని చాలును.౹ ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించునప్పుడు నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందును, శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొనిరాగా వారు మీ హేయ క్రియలన్నిటిని ఆధారముచేసికొని నా నిబంధనను భంగపరచిరి.౹ నేను మీకప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక, వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి.౹ కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా — హృదయమందును, శరీరమందును సున్నతిలేని అన్యులై యుండి ఇశ్రాయేలీయులమధ్య నివసించువారిలో ఎవడును నా పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు.౹ మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా, వారితోకూడ నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు.౹ అయినను వారు నా పరిశుద్ధస్థలములో పరిచర్యచేయువారు, నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహనబలి పశువులను బలి పశువులను వధించువారు, పరిచర్యచేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడినవారు.౹ విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్రిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధి నైతిని; వారు తమ దోషమును భరించుదురు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ తమ అవమానమును తాము చేసిన హేయక్రియలకు రావలసిన శిక్షను వారనుభవించుదురు; వారు యాజకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు, పరిశుద్ధ వస్తువులను గాని అతిపరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు.౹ అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నిటిని విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధస్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతివారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి, క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ వారే నా పరిశుద్ధస్థలములో ప్రవేశింతురు, పరిచర్య చేయుటకై వారే నా బల్లయొద్దకు వత్తురు, వారే నేనప్పగించిన దానిని కాపాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చునప్పుడు జనుపనారబట్టలు ధరించుకొనవలెను. లోపటి ఆవరణపు గుమ్మములద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్యచేయునప్పుడెల్ల బొచ్చుచేత చేసిన బట్టలువారు ధరింపకూడదు.౹ అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనుపనారబట్ట కట్టుకొనవలెను, చెమట పుట్టించునదేదైనను వారు ధరింపకూడదు.౹ బయటి ఆవరణములోనికి జనులయొద్దకు వారు వెళ్లునప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుటచేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు, తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములగు గదులలో వాటిని ఉంచి, వేరు బట్టలు ధరింపవలెను,౹ మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు, తలవెండ్రుకలు పెరుగ నియ్యక కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను.౹ లోపటి ఆవరణములో చొచ్చునపుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానముచేయకూడదు.౹ వారు విధవ రాండ్రనైనను విడువబడినదానినైనను పెండ్లిచేసికొనకూడదుగాని ఇశ్రాయేలీయుల సంతతివారగు కన్యలనైనను, యాజకులకు భార్యలై విధవరాండ్రుగా నున్న వారినైనను చేసికొనవచ్చును.౹ ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కను గొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాజ్యెమాడునప్పుడు నా విధులనుబట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులనుబట్టియు కట్టడలనుబట్టియు నా నియామకకాలములను జరుపుదురు; నా విశ్రాంతిదినములను ఆచరించుదురు.౹ తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరిదియు శవమునుముట్టి అంటు పడవచ్చును, అయితే మరి ఏ మనుష్యశవమునుగాని ముట్టి అంటుపడకూడదు.౹ ఒకడు అంటుపడి శుచిర్భూతుడైన తరువాత ఏడు దినములు లెక్కించి పరిశుద్ధస్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణములోని పరిశుద్ధస్థలమునకు వచ్చినవాడు అతడు తనకొరకు పాపపరిహారార్థబలి అర్పింపవలెను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము, ఇశ్రాయేలీయులలో వారి కెంతమాత్రమును స్వాస్థ్యము ఇయ్యకూడదు, నేనే వారికి స్వాస్థ్యము.౹ నైవేద్యములును పాపపరిహారార్థబలిమాంసమును అపరాధ పరిహారార్థబలిమాంసమును వారికి ఆహారమవును, ఇశ్రాయేలీయుల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నియు వారివి.౹ మీ ప్రతిష్ఠి తార్పణములన్నిటిలోను తొలిచూలు వాటన్నిటిలోను మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివియు యాజకులవగును; మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకియ్యవలెను.౹ పక్షులలోను పశువులలోను తనకుతాను చచ్చినదానినిగాని చీల్చబడినదానిని గాని యాజకులు భుజింపకూడదు. మీరు చీట్లువేసి దేశమును విభాగించునప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి ఇరువదియైదువేల కొల కఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును ఉండవలెను, ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును.౹ దానిలో పరిశుద్ధస్థలమునకు ఐదువందల కొల కఱ్ఱల చచ్చౌకము ఏర్పడవలెను; దానికి నలుదిశల ఏబది మూరల మైదానముండవలెను,౹ కొలువబడిన యీ స్థలము నుండి ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పునుగల యొకచోటు కొలిచివేయవలెను. అందులో మహా పరిశుద్ధస్థలముగా ఉన్న పరిశుద్ధస్థల ముండును.౹ యెహోవాకు పరిచర్యచేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్యచేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును; అది వారి యిండ్లకు నివేశమై పరిశుద్ధస్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించునట్లు ఇరువదియైదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును గల యొక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా ఇరువది గదులను ఏర్పాటు చేయవలెను.౹ మరియు పట్టణమునకై అయిదువేల కొలకఱ్ఱల వెడల్పును ఇరువదియైదువేల కొల కఱ్ఱల నిడివియుగల యొక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను, ఇశ్రాయేలీయులకందరికి అది స్వాస్థ్యముగా ఉండును.౹ మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణము నకై యేర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడ మటగాను తూర్పుగాను, ప్రతిష్ఠితభాగమునకును పట్టణము నకై యేర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమి నేర్పాటుచేయవలెను. పడమటినుండి తూర్పువరకు దాని కొలువగా అదియొక గోత్రస్థానమునకు సరిపడు నిడివిగలదై యుండవలెను. అధిపతి యిక నా జనులను బాధింపక వారి గోత్రములనుబట్టి భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించునట్లు అది ఇశ్రాయేలీయులలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు —ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును; ఆలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ ఖరా త్రాసులను ఖరా పడిని ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను.౹ తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణముగా నుండవలెను.౹ తులమొకటింటికి ఇరువది చిన్నముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.౹ ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. నూట ఎనుబది పళ్ల గోధుమలలో మూడు పళ్లవంతునను నూట ఎనుబది పళ్ల యవలలో మూడు పళ్లవంతునను చెల్లింపవలెను.౹ తైలము చెల్లించునదెట్లనగా నూట ఎనుబది పళ్ల నూనెలో పడియు ముప్పాతికవంతున చెల్లింపవలెను. తూము నూట ఎనుబది పళ్లు పట్టునదగును.౹ మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహనబలికిని సమాధాన బలికిని మంచి మేపుతగిలిన గొఱ్ఱెలలో మందకు రెండువందలలో ఒకదానిని తేవలెను.౹ ఇశ్రాయేలీయులలోని అధిపతికి చెల్లింపవలసిన యీ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరును బద్ధులైయుందురు.౹ పండుగలలోను, అమావాస్య దినములలోను, విశ్రాంతిదినములలోను, ఇశ్రాయేలీయులు కూడుకొను నియామకకాలములలోను వాడబడు దహనబలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాపపరిహారార్థబలిపశువులను నైవేద్యములను దహనబలులను సమాధాన బలిపశువులను సిద్ధపరచవలెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసికొని పరిశుద్ధస్థలము నిమిత్తము పాపపరిహారార్థబలి నర్పింపవలెను.౹ ఎట్లనగా యాజకుడు పాపపరిహారార్థబలి పశు రక్తము కొంచెము తీసి, మందిరపు ద్వారబంధములమీదను బలిపీఠవు చూరు నాలుగు మూలలమీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధములమీదను ప్రోక్షింపవలెను.౹ తెలియక తప్పిపోయిన వారిని విడిపించునట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెలయేడవ దినమందు ఆలాగు చేయవలెను.౹ మొదటి నెల పదునాలుగవదినమున పస్కాపండుగ ఆచరింపవలెను; ఏడు దినములు దాని నాచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను.౹ ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికిని పాపపరిహారార్థబలిగా ఒక యెద్దును అర్పింపవలెను.౹ మరియు ఏడు దినములు అతడు నిర్దోషమైన యేడుఎడ్లను ఏడు పొట్టేళ్లను తీసికొని, దినమొక టింటికి ఒక యెద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను; మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.౹ మరియు ఎద్దొకటింటికిని పొట్టేలొకటింటికిని తూము పిండిపెట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె యుండవలెను.౹ మరియు ఏడవ నెల పదునైదవదినమున పండుగ జరుగుచుండగా యాజకుడు ఏడు దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థబలి విషయములోను దహనబలివిషయములోను నైవేద్య విషయములోను నూనె విషయములోను ఆప్రకారముగానే చేయవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–తూర్పుతట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము, పనిచేయు ఆరు దినములు మూయబడియుండి, విశ్రాంతిదినమునను అమావాస్య దినమునను తీయబడియుండవలెను.౹ అధిపతి బయట మంటపమునకు పోవుమార్గముగా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహనబలిపశువులను సమాధానబలిపశువులను అతనికి సిద్ధపరచవలెను; అతడు గుమ్మముదగ్గర నిలువబడి ఆరాధనచేసిన తరువాత వెలుపలికి పోవును, అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు.౹ మరియు విశ్రాంతిదినములలోను అమావాస్యలలోను దేశజనులు ఆ తలుపుదగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను.౹ విశ్రాంతిదినమున అధిపతి యెహోవాకు అర్పింప వలసిన దహనబలి యేదనగా, నిర్దోషమైన ఆరు గొఱ్ఱెపిల్లలును నిర్దోషమైన యొక పొట్టేలును.౹ పొట్టేలుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలెను, గొఱ్ఱెపిల్లలతోకూడ శక్తికొలది నైవేద్యమును, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనెయు తేవలెను.౹ అమావాస్యనాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొఱ్ఱెపిల్లలను నిర్దోషమైన యొక పొట్టేలును అర్పింపవలెను.౹ నైవేద్యమును సిద్ధపరచవలెను, ఎద్దుతోను పొట్టేలుతోను తూమెడు పిండిని గొఱ్ఱెపిల్లలతో శక్తికొలది పిండిని అర్పింపవలెను, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె నైవేద్యము చేయవలెను.౹ అధిపతి ప్రవేశించునప్పుడు గుమ్మపు మంటపమార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను.౹ అయితే దేశజనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరా ధన చేయుటకై వచ్చునప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్లవలెను, దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్లవలెను. తాము వచ్చిన దారినే యెవరును తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను.౹ అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు, వారు బయలు వెళ్లునప్పుడు అందరును కూడి బయలువెళ్లవలెను.౹ పండుగదినములలోను నియామక కాలములలోను ఎద్దుతోగాని పొట్టేలుతో గాని తూమెడు పిండియు, గొఱ్ఱెపిల్లలతో శక్తికొలది పిండియు, తూము ఒకటింటికి మూడుపళ్ల నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను.౹ యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధానబలినైనను అధిపతి యర్పించునప్పుడు తూర్పుతట్టు గుమ్మము తీయవలెను; విశ్రాంతిదినమున అర్పించునట్లు దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవలెను; అతడు వెళ్లిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను.౹ మరియు ప్రతిదినము నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱెపిల్లను దహనబలిగా అర్పింపవలెను; అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను.౹ అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో ఆరవ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు నుండవలెను; ఇవి ఎవరును రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు.౹ గొఱ్ఱెపిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్యదహనబలిగా అర్పింపవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చినయెడల అది యతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును. అది వారసత్వమువలన వచ్చిన దానివంటి స్వాస్థ్యము.౹ అయితే అతడు తన పనివారిలో ఎవని కైనను భూమి ఇచ్చినయెడల విడుదల సంవత్సరమువరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరల వచ్చును; అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు.౹ జనులు తమ స్వాస్థ్యము ననుభ వింపకుండ అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు; నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండునట్లు అతడు తన భూమిలోనుండి తన కుమారులకు భాగముల నియ్యవలెను. పిమ్మట అతడు గుమ్మపు మధ్యగోడమార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట వెనుకతట్టు పశ్చిమదిక్కున స్థలమొకటి కనబడెను.౹ ప్రతిష్ఠితములగు వస్తువులను బయటి ఆవరణములోనికి కొనివచ్చి–యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధపరిహారార్థబలిపశుమాంసమును పాపపరిహారార్థబలిపశుమాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదియే యని నాతోచెప్పి అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనివచ్చి ఆవరణపు నాలుగు మూలలను నన్ను త్రిప్పగా, ఆవరణముయొక్క మూలమూలను మరియొక ఆవరణమున్నట్టు కనబడెను.౹ ఆవరణపు మూలమూలను ఆవరింపబడిన ఆవరణమొకటి కనబడెను. ఒక్కొక్కటి నలువది మూరల నిడివియు ముప్పది మూరల వెడల్పును గలిగి నాలుగును ఏకపరిమాణముగా ఉండెను.౹ మరియు ఆ నాలుగింటిలోను చుట్టు పంక్తిగానున్న అటకలుండెను, చుట్టునున్న అటకల క్రింద పొయిలుండెను.౹ –ఇది వంటచేయువారి స్థలము, ఇక్కడ మందిరపరిచారకులు జనులు తెచ్చు బలిపశుమాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని. వచ్చెను; మందిరము తూర్పుముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడపక్రిందనుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్కను క్రిందనుండి పారు చుండెను,౹ పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపుమార్గముగా నన్ను నడిపించి చుట్టు త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటిగుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడిప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను.౹ ఆ మనుష్యుడు కొలనూలు చేతపట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను.౹ ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను.౹ ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాట లేనంత నది కనబడెను, దాట వీలులేకుండ ఈదవలసినంత నీరుగల నదియాయెను.౹ అప్పుడాయన నాతో ఇట్లనెను–నరపుత్రుడా, నీవు చూచితివిగదా అని చెప్పి నన్ను మరల నది యిద్దరికి తోడుకొనివచ్చెను.౹ నేను తిరిగిరాగా నదీతీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను.౹ అప్పుడాయన నాతో ఇట్లనెను–ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపునీళ్లు మంచినీళ్లు అగును.౹ వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుటవలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును; ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును.౹ మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లా యీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును.౹ అయితే ఆ సముద్రపు బురద స్థలములును ఊబిస్థలములును ఉప్పుగలవైయుండి బాగుకాక యుండును.౹ నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–సరిహద్దులనుబట్టి ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి యిది; యోసేపు సంతతికి రెండు భాగములియ్యవలెను.౹ నేను ప్రమాణముచేసి మీపితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునొందును; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును.౹ ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహాసముద్రము మొదలుకొని హెత్లోనువరకు దేశమునకు సరిహద్దు.౹ అది హమాతునకును బేరోతా యునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపిం చును.౹ పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు; ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.౹ తూర్పుదిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీయుల దేశమునకును మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉండును; సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రమువరకు దాని కొలువవలెను; ఇది మీకు తూర్పు సరిహద్దు.౹ దక్షిణదిక్కున తామారు మొదలుకొని కాదేషునొద్దనున్న మెరీబా ఊటలవరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును; ఇది మీకు దక్షిణపు సరిహద్దు.౹ పశ్చిమదిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును; ఇది మీకు పశ్చిమదిక్కు సరిహద్దు.౹ ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను.౹ మీరు చీట్లువేసి మీకును మీలో నివసించి పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించు నప్పుడు ఇశ్రాయేలీయులలో దేశమందు పుట్టినవారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను, ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యము నొందునట్లు మీవలె వారును చీట్లు వేయవలెను.౹ ఏ గోత్రములో పరదేశులు కాపురముందురో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యము ఇయ్యవలెను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. గోత్రముల పేరులు ఇవి; దానీయుల కొకభాగము. అది ఉత్తరదిక్కు సరిహద్దునుండి హమాతునకుపోవు మార్గమువరకు హెత్లోనునకుపోవు సరిహద్దువరకును హసరేనాను అను దమస్కు సరిహద్దువరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి.౹ దానుయొక్క సరిహద్దునానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము.౹ ఆషేరీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము.౹ నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగము.౹ మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయి మీయులకు ఒక భాగము.౹ ఎఫ్రాయిమీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగము.౹ రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగము. యూదావారి సరిహద్దును అనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమియుండును. దాని వెడల్పు ఇరువదియైదు వేల కొలకఱ్ఱలు; దాని నిడివి తూర్పునుండి పడమరవరకు తక్కిన భాగముల నిడివి వలెనే యుండును; పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండవలెను.౹ యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము ఇరువదియైదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొల కఱ్ఱల వెడుల్పునై యుండవలెను.౹ ఈ ప్రతిష్ఠితభూమి యాజకులదగును. అది ఉత్తరదిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పడమటి దిక్కున పదివేల కొల కఱ్ఱల వెడల్పును తూర్పుదిక్కున పదివేల కొలకఱ్ఱల వెడల్పును దక్షిణ దిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండును.౹ ఇది సాదోకు సంతతివారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారి కప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును; ఏలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లె వారు నన్ను విడిచిపోలేదు.౹ ప్రతిష్ఠిత భూమియందు లేవీయుల సరిహద్దుదగ్గర వారికొక చోటు ఏర్పాటగును; అది అతి పరిశుద్ధముగా ఎంచబడును.౹ యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయుల కొకచోటు నేర్పాటుచేయవలెను; అది ఇరువదియయిదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పునైయుండును. దాని నిడివియంతయు ఇరువదియయిదు వేల కొలకఱ్ఱలును వెడల్పంతయు పది వేల కొలకఱ్ఱలును ఉండును.౹ అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, ఆ భూమియొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనియ్యకూడదు.౹ ఇరువదియయిదువేల కొలకఱ్ఱల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన అయిదువేల కొలకఱ్ఱలుగల చోటు గ్రామకంఠముగా ఏర్పరచబడినదై, పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకువచ్చును; దాని మధ్య పట్టణము కట్టబడును.౹ దాని పరిమాణ వివరమేదనగా, ఉత్తరదిక్కువ నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, దక్షిణ దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, తూర్పు దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, పడమటి దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు.౹ పట్టణమునకు చేరిన ఖాలీస్థలము ఉత్తరపుతట్టున రెండువందల యేబది కొలకఱ్ఱలు, దక్షిణపుతట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు, తూర్పుతట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు, పడమటితట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు ఉండవలెను.౹ ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టముచేత జీవించువారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠితభూమినియానుకొని తూర్పుతట్టున పదివేల కొలకఱ్ఱలును పడమటితట్టున పదివేల కొల కఱ్ఱలును ఉండును.౹ ఏ గోత్రపువారైనను పట్టణములో కష్టముచేసి జీవించువారు దానిని సాగుబడిచేయుదురు.౹ ప్రతిష్ఠిత భూమియంతయు ఇరువదియయిదు వేల కొల కఱ్ఱల చచ్చౌకముగా ఉండును; దానిలో నాలుగవభాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను. ప్రతిష్ఠితస్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని, అనగా తూర్పుదిశను ప్రతిష్ఠితస్థానముగా ఏర్పడిన యిరువది యయిదువేల కొలకఱ్ఱలును పడమటి దిశను గోత్రస్థానములుగా ఏర్పడిన యిరువదియయిదు వేల కొలకఱ్ఱలునుగల భూమినియానుకొనుస్థానము అధిపతిదగును. ప్రతిష్ఠిత స్థానమును, మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును.౹ యూదావారి సరిహద్దునకును బెన్యామీనీయుల సరిహద్దునకును మధ్యగానున్న లేవీయుల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొను భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును.౹ తూర్పునుండి పడమటివరకు కొలువగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పా టగును. బెన్యామీనీయులకు ఒక భాగము,౹ బెన్యామీనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒక భాగము;౹ షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయు లకు ఒక భాగము ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా జెబూలూనీయులకు ఒక భాగము,౹ జెబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడ మరలుగా గాదీయులకు ఒక భాగము;౹ దక్షిణదిక్కున తామారునుండి కాదేషులోనున్న మెరీబా ఊటలవరకు నదివెంబడి మహాసముద్రమువరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును.౹ మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే. వారివారి భాగములు ఇవే. యిదే యెహోవా యిచ్చిన ఆజ్ఞ. పట్టణస్థాన వైశాల్యము ఎంతనగా, ఉత్తరమున నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము.౹ ఇశ్రాయేలీయుల గోత్రపు పేళ్లనుబట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలెను. ఉత్తరపుతట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవిదనియు మూడు గుమ్మములుండవలెను.౹ తూర్పుతట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆతట్టున యోసేపుదనియు బెన్యామీనుదనియు దానుదనియు మూడు గుమ్మములుండవలెను.౹ దక్షిణపుతట్టు నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆతట్టున షిమ్యోనుదనియు ఇశ్శాఖారుదనియు జెబూలూనుదనియు మూడు గుమ్మములుండవలెను.౹ పడమటితట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణముగలది. ఆతట్టున గాదుదనియు ఆషేరుదనియు నఫ్తాలిదనియు మూడు గుమ్మములుండవలెను.౹ దాని కైవారము పదునెనిమిదివేల కొలకఱ్ఱల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు. యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోనురాజగు నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చి దాని ముట్టడివేయగా ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశము లోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతా లయపు బొక్కసములో ఉంచెను.౹ [3-4] రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను — ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి, తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.౹ *** మరియు రాజు తాను భుజించు ఆహారములోనుండియు తాను పానముచేయు ద్రాక్షారసములోనుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను.౹ యూదులలోనుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలోనుండిరి.౹ నపుంస కుల యధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేళ్లు పెట్టెను.౹ రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడు కొనగా దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను గనుక నపుంసకుల యధిపతి దానియేలుతో ఇట్లనెను –మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను; మీ ఈడు బాలుర ముఖముల కంటె మీ ముఖములు కృశించినట్లు ఆయనకు కనబడ నేల? అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు.౹ నపుంసకుల యధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారిమీద నియమించిన నియామ కునితో దానియేలు ఇట్లనెను.౹ భోజనమునకు శాకధాన్యా దులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి పది దినములవరకు మమ్మును పరీక్షింపుము.౹ పిమ్మట మా ముఖములను, రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయెడల జరిగింపుము.౹ అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి పది దినములవరకు వారిని పరీక్షించెను.౹ పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటె సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి, వారికి శాకధాన్యా దుల నిచ్చెను.౹ ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను.౹ నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను.౹ రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారెవ రును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి.౹ రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధమైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను పదియంతలు శ్రేష్ఠులని తెలియబడెను.౹ ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమువరకు జీవించెను. నెబుకద్నెజరు తన యేలుబడియందు రెండవ సంవత్సరమున కలలు కనెను. అందునుగురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రపట్టకుండెను.౹ కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడీవిద్యగలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువ నంపుడని యాజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలచిరి.౹ రాజు వారితో–నేనొక కల కంటిని, ఆ కల భావము తెలిసికొనవలెనని నేను మనోవ్యాకుల మొంది యున్నాననగా కల్దీయులు సిరియాబాషతో ఇట్లనిరి— రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము.౹ రాజు–నేను దాని మరచి పోతిని గాని, కలను దాని భావమును మీరు తెలియజేయనియెడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు; మీ యిండ్లు పెంటకుప్పగా చేయబడును.౹ కలను దాని భావమును తెలియజేసినయెడల దానములును బహుమానములును మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు –రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పినయెడల మేము దాని భావమును తెలియజేసెదమని మరల ప్రత్యుత్తరమిచ్చిరి.౹ అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా — నేను మరచి యుండుట మీరు చూచి కాలహరణము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను.౹ కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధమును మోసపుమాటలను నాయెదుట పలుక నుద్దేశించియున్నారు. మీరు కలను చెప్పలేకపోయినయెడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలిసికొందును.౹ అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి–భూమిమీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్య గలవానియొద్దను కల్దీయునియొద్దను ఇట్టి సంగతి విచారింప లేదు.౹ రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలుకాక మరెవరును ఈ సంగతి తెలియజెప్ప జాలరు; దేవతల నివాసములు శరీరులమధ్య ఉండవుగదా.౹ అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గల వాడై బబులోనులోని జ్ఞానులనందరిని సంహరింపవలెనని యాజ్ఞ ఇచ్చెను.౹ ఇట్టి శాసనము బయలుదేరుటవలన జ్ఞానులు చంపబడవలసియుండగా, వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి.౹ అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహసంరక్షకుల యధిపతియగు అర్యోకుదగ్గరకు పోయి, జ్ఞానయుక్తముగా మనవిచేసెను –రాజు నొద్దనుండి ఈ యాజ్ఞ యింత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజుయొక్క అధిపతియైన అర్యోకు నడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను.౹ అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియ జెప్పుటకై తనకు సమయము దయచేయుమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన యింటికి పోయి తన స్నేహితు లైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులును బబులోనులో తక్కిన జ్ఞానులతోకూడ నశింపకుండునట్లు ఆ కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను.౹ అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను.౹ ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక.౹ ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు.౹ ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది.౹ మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకనుగ్రహించియున్నావు; మేమడిగిన యీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసియున్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను; ఏలయనగా రాజుయొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరల చెప్పెను.౹ ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింప జేయుటకు రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్లి–బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసెదననెను. కావున అర్యోకు–రాజునకు భావము తెలియజెప్పగల యొక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కను గొంటినని రాజుసముఖమున మనవిచేసి, దానియేలును త్వరగా రాజుసన్నిధికి తోడుకొనిపోయెను.౹ రాజు–నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా? అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా దానియేలు రాజుసముఖములో ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను–రాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీవిద్య గలవారైనను శకునగాండ్రయినను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు.౹ అయితే మర్మములను బయలుపరచ గల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినములయందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా రాజా, ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడకమీద పరుండి మనోచింతగలవారై యుండగా మర్మములను బయలు పరచువాడు కలుగబోవుదానిని తమరికి తెలియజేసెను.౹ ఇతర మనుష్యులకందరికంటె నాకు విశేష జ్ఞానముండుటవలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును, తమరి మనస్సుయొక్క ఆలోచనలు తాము తెలిసికొను నిమిత్తమును అది బయలుపరచబడెను.౹ రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమకనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరమునైన రూపమును గలదై తమరియెదుట నిలిచెను.౹ ఆ ప్రతిమయొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు,౹ దాని మోకాళ్లు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను.౹ మరియు చేతిసహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీదపడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను.౹ అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.౹ తాము కనిన కల యిదే, దాని భావము రాజుసముఖమున మేము తెలియ జెప్పెదము.౹ రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్ర హించియున్నాడు; తమరు రాజులకు రాజైయున్నారు.౹ ఆయన మనుష్యులు నివసించు ప్రతిస్థలమందును, మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించియున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటుతరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడి వంటిదగును.౹ పిమ్మట నాలుగవ రాజ్యమొకటి లేచును. అది ఇనుమువలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైనవాటిని దంచి విరుగగొట్టునది గదా; ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడిచేయును.౹ పాదములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును.౹ పాదముల వ్రేళ్లు కొంతమట్టునకు ఇనుపవిగాను కొంతమట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును.౹ ఇనుమును బురదయు మిళితమై యుండుట తమరికి కనబడెను; అటువలె మనుష్య జాతులు మిళితములై యినుము మట్టితో అతకనట్లువారు ఒకరితో ఒకరు పొసగకయుందురు.౹ ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిం చును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.౹ చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహా దేవుడు ముందు జరుగబోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.౹ అంతట రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగనమస్కారము చేసి అతని పూజించి, నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను.౹ మరియు రాజు–ఈ మర్మమును బయలు పరచుటకు నీవు సమర్థుడవైతివే; నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తర మిచ్చెను.౹ అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, అనేక గొప్ప దానములిచ్చి, అతనిని బబులోను సంస్థానమంతటిమీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను.౹ అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసికొనగా రాజు షద్రకు మేషాకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించెను; అయితే దానియేలు రాజుసన్నిధిని ఉండెను. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమయొకటి చేయించి, బబులోనుదేశములోని దూరాయను మైదానములో దాని నిలువబెట్టించెను. అది అరువదిమూరల ఎత్తును ఆరుమూరల వెడల్పునై యుండెను.౹ రాజగు నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధి క్యము వహించినవారినందరిని సమకూర్చుటకును, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ యధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును మంత్రులును ఖజానాదారులును ధర్మశాస్త్రవిధాయకులును న్యాయాధిపతులును సంస్థానములలో ఆధిక్యము వహించినవారందరును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు కూడివచ్చి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయెదుట నిలుచుండిరి.౹ ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా–జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాటలాడువారలారా, మీకాజ్ఞ ఇచ్చుచున్నాను.౹ ఏమనగా, బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణె సుంఫోనీయ వీణె విపంచిక సకలవిధములగు వాద్య ధ్వనులు మీకు వినబడునప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమయెదుట సాగిలపడి నమస్కరించుడి.౹ సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును.౹ సకల జనులకు బాకా పిల్లంగ్రోవి పెద్దవీణె వీణె సుంఫోనీయ విపంచిక సకలవిధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులును దేశస్థులును ఆయా భాషలు మాటలాడువారును సాగిలపడి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి.౹ ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములుచెప్పి రాజగు నెబుకద్నెజరు నొద్ద ఈలాగు మనవిచేసిరి–రాజు చిరకాలము జీవించును గాక.౹ రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి; ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణెను వీణెను విపంచికను సుంఫోనీయను సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను.౹ సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును.౹ రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి.౹ అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసికొని వచ్చిరి.౹ అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను — షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను వీణెను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలోనుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు? షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి–నెబుకద్నెజరూ, యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు.౹ మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.౹ అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను.౹ మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి–షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండమునడుమ పడవేసిరి.౹ రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.౹ షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవరముగ లేచి–మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితిమిగదా యని తన మంత్రుల నడిగెను. వారు–రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తర మిచ్చిరి.౹ అందుకు రాజు–నేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను.౹ అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి–షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికివచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి.౹ అధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి.౹ నెబుకద్నెజరు–షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి.౹ కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్టములో గాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను.౹ అంతటనుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక.౹ మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను.౹ ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. [4-5] నెబుకద్నెజరను నేను నా యింట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనైయుండి యొక కల కంటిని; అది నాకు భయము కలుగజేసెను. నేను నా పడకమీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను.౹ *** కావున ఆ స్వప్నభావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులనందరిని నా యెదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ నేనిచ్చితిని.౹ శకునగాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతి ష్కులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేక పోయిరి.౹ కడపట బెల్తెషాజరను నా దేవత పేరునుబట్టి బిరుదుపొందిన దానియేలను వాడు నా యెదుటికి వచ్చెను; పరిశుద్ధ దేవతల ఆత్మ అతనియందుండెను, కావున నేనతనికి నా కలను చెప్పితిని.౹ ఎట్లనగా–శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరూ, పరిశుద్ధదేవతల ఆత్మ నీయందున్నదనియు, ఏ మర్మము నిన్ను కలతపెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియ జెప్పుము.౹ నేను నా పడకమీద పరుండియుండగా నాకు ఈ దర్శనములు కలిగెను; నేను చూడగా భూమిమధ్యను మిగుల ఎత్తుగల యొక చెట్టు కనబడెను.౹ ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకా శమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను.౹ దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారముండెను; దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెను; సకల మనుష్యులకు చాలునంత ఆహారము దానియందుండెను.౹ [13-14] మరియు నేను నా పడక మీద పండుకొనియుండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా, జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశమునుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను —ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి; పశువులను దాని నీడనుండి తోలివేయుడి; పక్షులను దాని కొమ్మలనుండి ఎగురగొట్టుడి.౹ *** అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి, పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువుడి.౹ ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవమనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును.౹ ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును.౹ బెల్తెషాజరూ, నెబుకద్నెజరను నాకు కలిగిన దర్శనము ఇదే; నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్ప నేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవేదానిని చెప్ప సమర్థుడ వంటిని. అందుకు బెల్తెషాజరను దానియేలు ఒక గంటసేపు అతి విస్మయమునొంది మనస్సునందు కలవరపడగా, రాజు–బెల్తెషాజరూ, యీ దర్శనమువలన గాని దాని భావము వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతట బెల్తె షాజరు–నా యేలినవాడా, యీ దర్శనఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక,౹ తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకాశ మునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను.౹ దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను, దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెనుగదా రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడ వైతివి; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది.౹ –చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము; ఇనుము ఇత్తడి కలి సిన కట్టుతో ఏడు కాలములు గడచువరకు పొలములోని పచ్చికలో దాని కట్టించి, ఆకాశపుమంచుకు తడవనిచ్చి పశువులతో పాలుపొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకమునుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా.౹ రాజా, యీ దర్శనభావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా యేలినవానిగూర్చి చేసిన తీర్మానమేదనగా [25-26] తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువులమధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగుదేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడనియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును. చెట్టుయొక్క మొద్దునుండ నియ్యుడని వారు చెప్పిరిగదా దానివలన సర్వోన్నతుడు అధికారియని నీవు తెలిసికొనిన మీదట నీ రాజ్యము నీకు మరల ఖాయముగ వచ్చునని తెలిసికొమ్ము.౹ *** రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక; ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న క్షేమము నీకికమీదటనుండునని దానియేలు ప్రత్యుత్తర మిచ్చెను.౹ పైన జెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను.౹ పండ్రెండు నెలలు గడచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు–బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను.౹ రాజు నోట ఈ మాట యుండగా ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగా–రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన— నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను.౹ తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువులమధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారి యైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను.౹ ఆ గడియలోనే ఆలాగున నెబుకద్నెజరునకు సంభవించెను; మానవులలోనుండి అతని తరిమిరి, అతడు పశువులవలె గడ్డిమేసెను, ఆకాశపుమంచు అతని దేహమును తడపగా అతని తలవెండ్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెలవంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివియు నాయెను.౹ ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల మానవబుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశముతట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి.౹ భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.౹ ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను; నా మంత్రులును నా క్రిందియధిపతులును నాయొద్ద ఆలోచన చేయ వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని.౹ ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు, ఆయనను స్తుతించుచుకొనియాడుచు ఘన పరచుచు నున్నాను. రాజగు బెల్షస్సరు తన యధిపతులలో వెయ్యిమందికి గొప్ప విందుచేయించి, ఆ వెయ్యిమందితో కలిసికొని ద్రాక్షారసము త్రాగుచుండెను.౹ బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన యధిపతులును తన రాణులును తన ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు, తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని యాలయములోనుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను.౹ అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చి యుంచగా, రాజును అతని యధిపతులును అతని రాణులును అతని ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి.౹ వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజుయొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను.౹ రాజు గారడీ విద్యగలవారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను–ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడినవాడై రాజ్యములో మూడవ యధిపతిగా ఏలును.౹ రాజు నియమించిన జ్ఞానులందరు అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుట యైనను వారివల్ల కాకపోయెను.౹ అందుకు రాజగు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన యధిపతులు విస్మయమొందునట్లుగా ముఖవికారముగలవాడాయెను.౹ రాజునకును అతని యధిపతులకును జరిగిన సంగతి రాణి తెలిసికొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను— రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనియ్యకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము.౹ నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు; నీ తండ్రికాలములో అతడు దైవజ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడైయుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రియైన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీవిద్య గలవారికిని కల్దీయులకును జ్యోతిష్కులకును పై యధిపతిగా అతని నియమించెను.౹ ఈ దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకుత్తర మిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను–రాజగు నా తండ్రి యూదయలోనుండి ఇక్కడికి తీసికొనివచ్చిన చెర సంబంధమగు యూదులలోనుండు దానియేలు నీవే గదా? దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీయందున్నవని నిన్నుగూర్చి వింటిని.౹ ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడీవిద్య గలవారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతియొక్క భావమును తెలుపలేక పోయిరి.౹ అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్నుగూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైనయెడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణకంఠభూషణము ధరించుకొని రాజ్యములో మూడవ యధిపతివిగా ఏలుదువు.౹ అందుకు దానియేలు ఇట్లనెను–నీ దానములు నీయొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైన నిమ్ము; అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియ జెప్పెదను.౹ రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను.౹ దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను; ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను; ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్టములును జనులును ఆయా భాషలు మాటలాడు వారును అతనికి భయపడుచు అతని యెదుట వణకుచు నుండిరి.౹ అయితే అతడు మనస్సున అతిశయించి, బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను.౹ అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువులవంటి మనస్సుగలవాడాయెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలిసికొనువరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను.౹ [22-23] బెల్షస్సరూ, అతని కుమారుడవగు నీవు ఈ సంగతియంతయు ఎరిగి యుండియు, నీ మనస్సును అణచుకొనక, పరలోకమం దున్న ప్రభువుమీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉప పత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియుంచుకొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు.౹ *** కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను; వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్.౹ ఈ వాక్యభావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను.౹ టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి.౹ ఫెరేస్ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును.౹ [28-29] బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని మెడను బంగారపు హారమువేసి ప్రభుత్వముచేయు టలో నతడు మూడవ యధికారియని చాటించిరి.౹ *** ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను.౹ మాదీయుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను. తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరువదిమంది యధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను.౹ వారిపైన ముగ్గురిని ప్రధానులగా నియమించెను; ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ యధిపతులు తప్పకుండ వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.౹ ఈ దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతని నియమింపవలెనని రాజుద్దే శించెను.౹ అందుకా ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయి నను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి.౹ అందుకా మనుష్యులు–అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమను కొనిరి.౹ కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి–రాజగు దర్యా వేషూ, చిరంజీవివై యుందువుగాక.౹ రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, యీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతి నను సరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయుమని మనవిచేసిరి.౹ కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను.౹ ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేముతట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.౹ ఆ మనుష్యులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థనచేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసనవిషయమునుబట్టి–రాజా, ముప్పది దినములవరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? అని మనవి చేయగా రాజు — మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతిప్రకారము ఆ సంగతి స్థిరము; ఎవరును దాని రద్దుపరచజాలరనెను.౹ అందుకు వారు–చెరపట్ట బడిన యూదులలోనున్న ఆ దానియేలు, నిన్నేగాని నీవు పుట్టించిన శాసనమునేగాని లక్ష్యపెట్టక, అనుదినము ముమ్మారు ప్రార్థనచేయుచు వచ్చుచున్నాడనిరి.౹ రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢముచేసికొని, సూర్యు డస్తమించువరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను.౹ ఆ మనుష్యులు దీని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి–రాజా, రాజు స్థిరపరచిన యే శాసనము గాని తీర్మానము గాని యెవడును రద్దుపరచజాలడు; ఇది మాదీయులకును పారసీకులకును విధియని తమరు తెలిసి కొనవలెననిరి.౹ అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజు–నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను.౹ వారు ఒక రాయి తీసికొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి; మరియు దానియేలునుగూర్చి రాజుయొక్క తీర్మానము మారునేమో యని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి.౹ అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగ నియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను.౹ తెల్లవారు జామున రాజు వేగిరమే లేచి సింహముల గుహదగ్గరకు త్వరపడిపోయెను.౹ అతడు గుహదగ్గరకు రాగానే, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి–జీవముగల దేవుని సేవ కుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని యతనిని అడిగెను.౹ అందుకు దానియేలు–రాజు చిరకాలము జీవించునుగాక.౹ నేను నా దేవునిదృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను.౹ రాజు ఇందునుగూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగ లేదు.౹ రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలుమీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొనివచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి, సింహములు వారి యెముకలను సహితము పగులగొరికి పొడిచేసెను. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకలజనులకును రాష్టములకును ఆయా భాషలు మాటలాడువారికిని ఈలాగు వ్రాయించెను–మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక.౹ నా సముఖమున నియమించిన దేమనగా — నా రాజ్యములోని సకల ప్రభుత్వములయందుండు నివాసులు దానియేలుయొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనముకానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును.౹ ఆయన విడిపించువాడును రక్షించు వాడునైయుండి, పరమందును భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటనుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను.౹ ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వకాలమందును వర్ధిల్లెను. బబులోను రాజగు బెల్షస్సరుయొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను; అతడు తన పడకమీద పరుండి యొక కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను.౹ దానియేలు వివరించి చెప్పినదేమనగా–రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరిచూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రముమీద గాలి విసరుట నాకు కనబడెను.౹ అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములోనుండి పై కెక్కెను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై యుండెను.౹ మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను.౹ రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెము కలను పట్టుకొనినది. కొందరు — లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి.౹ అటు పిమ్మట చిరుతపులినిపోలిన మరియొక జంతువును చూచితిని. దాని వీపున పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలుండెను; దానికి నాలుగు తలలుండెను; దానికి ఆధిపత్యమియ్య బడెను.౹ పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్మ్యములుగలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.౹ నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్మువాటిమధ్యను లేచెను; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.౹ ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమమువలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్రములు అగ్నివలె ఉండెను.౹ అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను.౹ అప్పుడు నేను చూచుచుండగా, ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను; తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను.౹ మిగిలిన ఆ జంతు వుల ప్రభుత్వము తొలగిపోయెను; సమయము వచ్చువరకు అవి సజీవులమధ్యను ఉండవలెనని యొక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయెను.౹ రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధు డగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను.౹ సకల జనులును రాష్టములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయ బడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని.౹ నేను దగ్గర నిలిచియున్నవారిలో ఒకని యొద్దకుపోయి — ఇందునుగూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా, అతడు నాతో మాటలాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను.౹ ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి.౹ అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగయుగములు యుగయుగాంతములవరకు రాజ్యమేలుదురు.౹ ఇనుపదంతములును ఇత్తడి గోళ్లునుగల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలిసికొనగోరితిని; అది యెన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై, సమస్తమును పగులగొట్టుచు మ్రింగుచు మిగిలిన దానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.౹ మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు, వాటి మధ్యనుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి, కన్నులును గర్వముగా మాటలాడు నోరునుగల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ములకంటె బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని.౹ ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున దాయెను.౹ ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు ఆలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించితిని.౹ నేనడిగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను–ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోక మంతయు భక్షించును.౹ ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి; కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజుపుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును.౹ ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయపద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు.౹ అతని యధికారము నశింపజేయుటకును నిర్మూలముచేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టి వేయబడును.౹ ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను.౹ దానియేలను నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడ నైతిని; అందుచేత నా ముఖము వికారమాయెను; అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని. రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు మూడవ సంవత్సరమందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనము గాక మరియొక దర్శనము కలిగెను.౹ [2-3] నేను దర్శనము చూచుచుంటిని. చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఊలయి యను నదిప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా, ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచియుండెను; దానికి రెండు కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటె ఎత్తుగా ఉండెను; ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది.౹ *** ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను, అది పట్టకుండ తప్పించుకొనుటకైనను, ఏ జంతువునకును శక్తిలేకపోయెను; అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను.౹ నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటనుండి వచ్చి, కాళ్లు నేల మోపకుండ భూమియందంతట పరుగులెత్తెను; దాని రెండు కన్నులమధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను.౹ ఈ మేకపోతు నేను నదిప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములుగల పొట్టేలు సమీపమునకు వచ్చి, భయంకరమైన కోపముతోను బలముతోను దానిమీదికి డీకొని వచ్చెను.౹ నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలిసికొని, మిక్కిలి రౌద్రముగలదై దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను. ఆ పొట్టేలు దాని నెదిరింపలేక పోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను; దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను.౹ ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచువచ్చెను; అది బహుగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగెను; విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను,౹ ఈ కొమ్ములలో ఒక దానిలోనుండి యొక చిన్నకొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను.౹ ఆకాశసైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్లక్రింద అణగ ద్రొక్కుచుండెను ఆ సైన్యముయొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని, అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను.౹ అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై యొక సేన అతనికియ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టాను సారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను.౹ అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని; అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరియొక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా, అనుదిన బలినిగూర్చియు, అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువునుగూర్చియు కలిగిన యీ దర్శనము నెర వేరుటకు ఎన్నాళ్లు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్లక్రింద త్రొక్కబడుట ఎన్నాళ్లు జరుగునోయనియు మాటలాడుకొనిరి.౹ అందుకతడు— రెండువేల మూడువందల దినములమట్టుకే యని నాతో చెప్పెను. అప్పుడు ఆలయపవిత్రతనుగూర్చిన తీర్పు తీర్చబడును. దానియేలను నేను ఈ దర్శనము చూచితిని; దాని తెలిసికొనదగిన వివేకము పొందవలెనని యుండగా; మనుష్యుని రూపముగల యొకడు నాయెదుట నిలిచెను.౹ అంతట ఊలయి నదీతీరములమధ్య నిలిచి పలుకుచున్న యొక మనుష్యుని స్వరము వింటిని; అది–గబ్రియేలూ, యీ దర్శనభావమును ఇతనికి తెలియజేయుమని చెప్పెను.౹ అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను; అతడు రాగానే నేను మహా భయమొంది సాష్టాంగపడితిని; అతడు–నరపుత్రుడా, యీ దర్శనము అంత్యకాలమునుగూర్చినదని తెలిసికొనుమనెను.౹ అతడు నాతో మాటలాడుచుండగా నేను గాఢనిద్రపెట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను.౹ మరియు అతడు–ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయు చున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమునుగూర్చినది నీవు చూచిన రెండు కొమ్ములుగల ఆ పొట్టేలున్నదే, అది మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు రాజులను సూచించుచున్నది.౹ బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకులరాజు; దాని రెండు కన్నులమధ్య నున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచించు చున్నది.౹ అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి గదా; నలుగురు రాజులు ఆ జనములోనుండి పుట్టుదురుగాని వారు అతనికున్న బలముగలవారుగా ఉండరు.౹ వారి ప్రభుత్వముయొక్క అంతములో వారి యతిక్రమములు సంపూర్తియగుచుండగా, క్రూరముఖము గలవాడును యుక్తిగలవాడునైయుండి, ఉపాయము తెలిసి కొను ఒక రాజు పుట్టును.౹ అతడు గెలుచునుగాని తన స్వబలమువలన గెలువడు; ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు, ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను, అనగా పరిశుద్ధ జనమును నశింప జేయును.౹ మరియు నతడు ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును; అతడు అతిశయపడి తన్నుతాను హెచ్చించుకొనును; క్షేమముగా నున్న కాలమందు అనేకులను సంహరించును; అతడు రాజాధిరాజుతో యుద్ధముచేయును గాని కడపట అతని బలము దైవాధీనమువలన కొట్టివేయబడును.౹ ఆ దినములనుగూర్చిన దర్శనమును వివరించియున్నాను. అది వాస్తవము, అది యనేకదినములు జరిగిన పిమ్మట నెరవేరును; నీవైతే ఈ దర్శనము వెల్లడిచేయకుమనెను.౹ ఈ దర్శనము కలుగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్లు వ్యాధి గ్రస్తుడనైయుంటిని; పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచువచ్చితిని. ఈ దర్శనమునుగూర్చి విస్మయముగలవాడనైతిని గాని దాని సంగతి తెలుప గలవాడెవడును లేక పోయెను. మాదీయుడగు అహష్వేరోషుయొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను.౹ అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించితిని.౹ అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని.౹ నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థనచేసి యొప్పుకొన్నదేమనగా–ప్రభువా, మాహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారియెడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకముచేయువాడా,౹ మేమైతే నీ దాసులగు ప్రవక్తలు నీ నామమునుబట్టి మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును యూదయదేశ జనులకందరికిని చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవారము.౹ ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందినవారము; మేము నీమీద తిరుగుబాటు చేసితిమి; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి, యెరూషలేములోను యూదయదేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు, పర దేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది.౹ ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది.౹ మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి; అయితే ఆయన కృపాక్షమాపణలుగల దేవుడైయున్నాడు.౹ ఆయన తన దాసులగు ప్రవక్తలద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి, వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని, మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి.౹ ఇశ్రాయేలీయులందరు నీ ధర్మశాస్త్రమునతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక–నేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మామీద కుమ్మరించితివి.౹ యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోను జరుగలేదు; ఆయన మా మీదికిని, మాకు ఏలికలుగాఉండు మా న్యాయాధిపతులమీదికిని ఇంత గొప్పకీడు రప్పించి, తాను చెప్పిన మాటలు నెర వేర్చెను.౹ మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడునడవడి మానక పోతిమి; నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనునట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతిమి.౹ మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడైయుండి, సమయము కనిపెట్టి, ఈ కీడు మా మీదికి రాజేసెను.౹ ప్రభువా మా దేవా, నీవు నీ బాహు బలమువలన నీ జనమును ఐగుప్తులోనుండి రప్పించుటవలన ఇప్పటివరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపముచేసి చెడునడతలు నడిచినవారము.౹ ప్రభువా, మా పాపములనుబట్టియు మా పితరుల దోషమునుబట్టియు, యెరూషలేము నీ జనులచుట్టునున్న సకల ప్రజలయెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యములన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.౹ ఇప్పుడైతే మా దేవా, దీనినిబట్టి నీ దాసుడుచేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి, ప్రభువు చిత్తానుసారముగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలముమీదికి నీ ముఖప్రకాశము రానిమ్ము.౹ నీ గొప్ప కనికరములనుబట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరుపెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్ట బడిన యీ పట్టణమును దృష్టించి చూడుము.౹ ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే; నీ ఘనతనుబట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. నేను ఇంక పలుకుచు ప్రార్థనచేయుచు, పవిత్ర పర్వతముకొరకు నా దేవుడైన యెహోవా యెదుట నా పాపమును నా జనముయొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని.౹ నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను.౹ అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను–దానియేలూ, నీకు గ్రహింపశక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని.౹ నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనముచేయ నారంభించి నప్పుడు, ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవలెనని ఆజ్ఞ బయలుదేరెను; కావున ఈ సంగతిని తెలిసికొని నీకు కలిగిన దర్శనభావమును గ్రహించుము.౹ తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతమువరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బదివారములు విధింపబడెను.౹ యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును.౹ ఈ అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియులేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజుయొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను.౹ అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును. పారసీకరాజగు కోరెషు పరిపాలన కాలములో. మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను; గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే; దానియేలు దాని గ్రహించెను; అది దర్శనమువలన అతనికి తెలిసిన దాయెను.౹ ఆ దినములయందు దానియేలను నేను మూడు వారములు దుఃఖప్రాప్తుడనైతిని.౹ మూడు వారములు గడచువరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని; మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసికొనలేదు.౹ మొదటి నెల యిరువది నాలుగవతేది నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని.౹ నేను కన్నులెత్తిచూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను.౹ అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతోకూడనున్న మనుష్యులు దాని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి.౹ నేను ఒంటరినై యీ గొప్ప దర్శనమును చూచితిని; చూచినందున నాలో బలమేమియు లేకపోయెను, నా సొగసు వికారమాయెను, బలము నాయందు నిలువలేదు.౹ నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.౹ అప్పుడొకడు చేతితో నన్నుముట్టి నా మోకాళ్లను అరచేతులను నేలమోపి నన్ను నిలువ బెట్టి –దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు తెలిసికొనుమనెను. అతడీమాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని.౹ అప్పుడతడు–దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొనవలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని పారసీకుల రాజ్యాధిపతి ఇరువదియొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను,౹ ఈ దర్శనపు సంగతి ఇంక అనేకదినములవరకు జరుగదు; అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పెను.౹ అతడీమాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని.౹ అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నాయెదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని —నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను,౹ నా యేలిన వాని దాసుడనైన నేను నా యేలినవానియెదుట ఏలాగున మాటలాడుదును? నా బలము తొలగిపోయెను, ఊపిరి విడువలేక యున్నానని చెప్పగా [18-19] అతడు మరల నన్నుముట్టి నన్ను బలపరచి–నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొమ్ము. ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని–నీవు నన్ను ధైర్యపరచితివి గనుక నా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని.౹ *** అతడు–నేనెందుకు నీయొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది గదా; నేను పారసీకుడగు అధిపతితో యుద్ధముచేయుటకు మరల పోయెదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశముయొక్క అధిపతి వచ్చును.౹ అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ యధిపతియగు మిఖాయేలు గాక యీ సంగతులనుగూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతనియొద్ద నిలువబడితిని. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసినపిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తుచేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును.౹ అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును.౹ అతడు రాజైనతరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. అది అతని వంశపువారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింప బడదు, అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును, అతని వంశపువారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు.౹ అయితే దక్షిణదేశపు రాజును, అతని అధిపతులలో ఒకడును బలముపొందెదరు అతడు, ఇతనికంటె గొప్పవాడై యేలును; అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును.౹ కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధానపడవలెనని కోరగా దక్షిణదేశపు రాజకుమార్తె ఉత్తరదేశపు రాజునొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు; అతడైనను అతని భుజబలమైనను నిలువదు; వారు ఆమెను, ఆమెను తీసికొని వచ్చిన వారిని, ఆమెను కనినవారిని, ఈ కాలమందు ఆమెను బలపరచిన వారిని అప్పగించెదరు.౹ అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతియై ఉత్తరదేశపురాజు కోటలో జొరబడి యిష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపెట్టి ఐగుప్తునకు తీసికొనిపోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపురాజు ప్రభుత్వము కంటె ఎక్కువ ప్రభుత్వము చేయును.౹ అతడు దక్షిణ దేశపురాజు దేశములో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును.౹ అతని కుమారులు యుద్ధము చేయబూని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి యేరువలె ప్రవహించి ఉప్పొంగును; యుద్ధము చేయబూని కోటదనుక వచ్చును.౹ అంతలో దక్షిణదేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తరదేశపురాజుతో యుద్ధము జరిగించును; ఉత్తరదేశపురాజు గొప్పసైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును.౹ ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణదేశపు రాజు మనస్సున అతిశయ పడును; వేలకొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు.౹ ఏలయనగా ఉత్తర దేశపురాజు మొదటి సైన్యముకంటె ఇంక గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరల వచ్చును. ఆ కాలాంతమున, అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును.౹ ఆ కాలములయందు అనేకులు దక్షిణదేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడివచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు.౹ అంతలో ఉత్తరదేశపురాజు వచ్చి ముట్టడి దిబ్బ వేయును. దక్షిణ దేశపు రాజుయొక్క బలము నిలువలేకపోయినందునను, అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యము పొందక పోయినందునను ఉత్తరదేశపు రాజు ప్రాకారములుగల పట్టణమును పట్టుకొనును.౹ వచ్చినవాని కెదురుగా ఎవరును నిలువలేక పోయినందున తనకిష్టమువచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందముగల ఆ దేశములో అతడుండగా అది అతని బలమువలన పాడైపోవును.౹ అతడు తన రాజ్యముయొక్క సమస్త బలమును కూర్చుకొని రావలెనని ఉద్దేశింపగా అతనితో సంధిచేయబడును; ఏమనగా నశింపజేయవచ్చునని యొక కుమార్తెను అతని కిచ్చెదరు, అయితే ఆమె సమ్మతింపక అతని కలిసికొనదు.౹ అతడు ద్వీపముల జనములతట్టు తన మనస్సును త్రిప్పుకొని యనేకులను పట్టుకొనును. అయితే అతనివలన కలిగిన యవమానమును ఒక యధికారి నివారణ చేయును. మరియు ఆయన యవమానము అతనిమీదికి మరల వచ్చునట్లు చేయును, అది అతనికి రాక తప్పదు.౹ అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటలతట్టు త్రిప్పు కొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును.౹ అతనికి మారుగా మరియొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్నుపుచ్చుకొను వానిని లేపును; కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని యీ నాశనము ఆగ్రహమువలననైనను యుద్ధమువలననైనను కలుగదు.౹ అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును; అతనికి రాజ్యఘనత నియ్యరుగాని నెమ్మది కాలమందు అతడువచ్చి యిచ్చకపు మాటలచేత రాజ్యమును అపహరించును.౹ ప్రవాహమువంటి బలము అతని యెదుటనుండి వారిని కొట్టుకొని పోవుటవలనవారు నాశనమగుదురు; సంధి చేసిన అధిపతి సహా నాశనమగును.౹ అతడు సంధిచేసినను మోసపుచ్చును. అతడు స్వల్పజనముగలవాడైనను ఎదు రాడి బలము పొందును.౹ అతడు సమాధాన క్షేమముగల దేశమునకు వచ్చి, తన పితరులు కాని తన పితరుల పితరులుగాని చేయనిదానిని చేయును; ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడుసొమ్మును, ధనమును విభజించి తనవారికి పంచి పెట్టును. అంతట కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్రచేయును అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని, దక్షిణదేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి, తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణదేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహా బలముగలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపురాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును.౹ ఏమనగా, అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు; మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు.౹ కీడుచేయుటకై ఆ యిద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని, యేకభోజన పంక్తిలో కూర్చుండినను కపటవాక్యములాడెదరు; నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు.౹ అతడు మిగుల ద్రవ్యముగలవాడై తన దేశమునకు మరలును. మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధియై యిష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును.౹ నిర్ణయకాలమందు మరలి దక్షిణదిక్కునకు వచ్చునుగాని మొదట నున్నట్టుగా కడపటనుండదు.౹ అంతట కిత్తీయుల ఓడలు అతనిమీదికి వచ్చుటవలన అతడు వ్యాకులపడి మరలి, పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహముగలవాడై, తన యిష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును.౹ అతని పక్షమున శూరులు లేచి, పరిశుద్ధస్థలపు కోటను అపవిత్రపరచి, అనుదిన బలి నిలిపివేసి, నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు.౹ అందుకతడు ఇచ్చకపుమాటలు చెప్పి నిబంధన నతిక్రమించువారిని వశపరచుకొనును; అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు.౹ జనములో బుద్ధిమంతులు ఆనేకులకు బోధించుదురు గాని వారు బహు దినములు ఖడ్గమువలనను అగ్ని వలనను క్రుంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు.౹ వారు క్రుంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును, అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని నిర్ణయకాలము ఇంక రాలేదు గనుక అంత్యకాలమువరకు జనులను పరిశీ లించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు.౹ ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాది దేవునిమీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగువరకు వృద్ధిపొందును; అంతట నిర్ణ యించినది జరుగును.౹ అతడు అందరికంటె ఎక్కువగా తన్నుతాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు; మరియు స్త్రీలకాంక్షితా దేవతను గాని, యే దేవతను గాని లక్ష్యపెట్టడు.౹ అతడు తన పితరులెరుగని దేవతను, అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును; బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి, ఆ దేవతను ఘనపరచును.౹ మరియు ఈ క్రొత్త దేవతను ఆధారముచేసికొని, కోటలకు ప్రాకారములు కట్టించి, నూతన విధముగా తనవారికి మహాఘనత కలుగజేయును; దేశమును క్రయమునకు విభజించి యిచ్చి అనేకులమీద తనవారికి ప్రభుత్వ మిచ్చును.౹ అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధముచేయును. మరియు ఉత్తరదేశపు రాజు రథములను గుఱ్ఱపురౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని, తుపానువలె అతనిమీదపడి దేశములమీదుగా ప్రవాహమువలె వెళ్లును.౹ అతడు ఆనందదేశమున ప్రవేశించుటవలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులలో ముఖ్యులును అతనిచేతిలోనుండి తప్పించు కొనెదరు.౹ అతడు ఇతర దేశములమీదికి తన సేన నంపించును; ఐగుప్తు సహా తప్పించుకొననేరదు.౹ అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తుయొక్క విలువ గల వస్తువులన్నిటిని వశపరచుకొని, లుబీయులను కూషీ యులను తనకు పాదసేవకులుగా చేయును.౹ అంతట తూర్పునుండియు ఉత్తరమునుండియు వర్తమానములు వచ్చి యతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనే కులను పాడుచేయుటకును నశింపజేయుటకును అతడు బయలుదేరును.౹ కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములుగల పర్వతమునకును మధ్య వేయును; అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయముచేయు వాడెవడును లేకపోవును. ఆ కాలమందు నీ జనులపక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలమువరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.౹ మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.౹ బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.౹ దానియేలూ, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలమంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను. దానియేలను నేను చూచుచుండగా మరియిద్దరు మనుష్యులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి ఇవతలి ఒడ్డున ఒకడును నిలిచిరి.౹ ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసికొన్నవాడై యేటినీళ్లపైన ఆడుచుండువాని చూచి–ఈ యాశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని యడుగగా నారబట్టలు వేసికొని యేటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని; ఏమనగా, అతడు తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశమువైపుకెత్తి నిత్యజీవియగువాని నామమున ఒట్టుపెట్టుకొని, ఒకకాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధజనముయొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తము లగుననెను.౹ నేను వింటినిగాని గ్రహింపలేకపోతిని–నా యేలినవాడా, వీటికి అంతమేమని నేనడుగగా అతడు— ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగాఉండునట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊరకుండుమని చెప్పెను.౹ అనేకులు తమ్మును శుద్దిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.౹ అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైనదానిని నిలువ బెట్టువరకు వెయ్యిన్ని రెండువందల తొంబది దినము లగును.౹ వెయ్యిన్ని మూడువందల ముప్పదియైదు దినములు తాళుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు.౹ నీవు అంత్యమువరకు నిలకడగా ఉండినయెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలురాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెను–జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారముచేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను.౹ కాబట్టి అతడుపోయి దిబ్లయీము కుమార్తెయైన గోమె రును పెండ్లిచేసికొనెను. ఆమె గర్భవతియై అతనికొక కుమారుని కనగా యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను–ఇతనికి యెజ్రెయేలని పేరుపెట్టుము. యెజ్రెయేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్తదోషమునుబట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలువారికి రాజ్యముండకుండ తీసి వేతును.౹ ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును.౹ పిమ్మట ఆమె మరల గర్భవతియై కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా–దీనికి లోరూహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము; ఇకమీదట నేను ఇశ్రాయేలువారిని క్షమించను, వారియెడల జాలిపడను.౹ అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.౹ లోరూహామా (జాలినొందనిది) పాలువిడిచిన తరువాత తల్లి గర్భవతియై కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా–మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై యుండను గనుక లోఅమ్మీ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందు–మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే–మీరు జీవముగల దేవుని కుమారులైయున్నారని వారితో చెప్పుదురు.౹ యూదావారును ఇశ్రాయేలువారును ఏకముగా కూడుకొని, తమపైన నొకనినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశములోనుండి బయలుదేరుదురు; ఆ యెజ్రెయేలు దినము మహా ప్రభావముగల దినముగానుండును. మీరు నా జనులని మీ సహోదరులతోను జాలి నొందినవారని మీ స్వదేశీయులతోను మీరు చెప్పుడి.౹ నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటివలె దానిని దిగంబరురాలినిగాచేసి, పాడుపెట్టి యెండిపోయిన భూమివలెను ఉంచి, దప్పిచేత లయపరచకుండునట్లు,౹ మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి; అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను;౹ దాని పిల్లలు జారసంతతియై యున్నారు, వారి తల్లి వేశ్యాత్వము చేసియున్నది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయునది గనుక వారియందు నేను జాలిపడను.౹ అది — నాకు అన్నపానములను గొఱ్ఱెబొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది.౹ ముండ్లకంచె దాని మార్గములకు అడ్డము వేయుదును; దాని మార్గములు దానికి కనబడకుండ గోడ కట్టుదును.౹ అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేక పోవును; ఎంత వెదకినను వారు దానికి కనబడకయుందురు. అప్పుడు అది–ఇప్పటి కంటె పూర్వమే నా స్థితి బాగుగ నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటియొద్దకు వెళ్లుదుననుకొనును.౹ దానికి ధాన్య ద్రాక్షారసతైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉప యోగపరచెను.౹ కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీనియొద్ద నుండి తీసివేసెదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొఱ్ఱెబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండ నేను ఉంచుకొందును;౹ దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నా చేతిలోనుండి దాని విడిపించువాడొకడును లేకపోవును.౹ దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతిదినములను నియామకకాలములను మాన్పింతును.౹ –ఇవి నా విటకాండ్రు నాకిచ్చినజీతమని అది తన ద్రాక్ష చెట్లనుగూర్చియు అంజూరపుచెట్లనుగూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరతును, అడవిజంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవివలె చేతును.౹ అది నన్ను మరచిపోయి నగలుపెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపమువేసియుండుటనుబట్టియు దాని విటకాండ్రను వెంటాడియుండుటనుబట్టియు నేను దానిని శిక్షింతును; ఇది యెహోవా వాక్కు.౹ పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును;౹ అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లనిత్తును; ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణద్వారముగా చేసెదను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చటనుండి నా మాట వినును; నీవు–బయలు అని నన్ను పిలువక–నా పురుషుడవు అనిపిలుతువు, ఇదే యెహోవా వాక్కు.౹ –అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండను అవి దాని నోట రాకుండను నేను చేసెదను.౹ ఆ దినమున నేను నా జనులపక్షముగా భూజంతువులతోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకుజంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును.౹ నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతినిబట్టి తీర్పుతీర్చుటవలనను, దయాదాక్షిణ్యములు చూపుటవలనను నిన్ను ప్రధానము చేసికొందును.౹ నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమునుబట్టి నిన్ను ప్రధానము చేసికొందును.౹ ఆ దినమున నేను మనవి ఆలకింతును; ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమియొక్క మనవి ఆలకించును;౹ భూమి ధాన్య ద్రాక్షారసతైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయు మనవి ఆలకించును.౹ నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితో–మీరే నా జనమని నేను చెప్పగా వారు–నీవే మా దేవుడవు అనియందురు; ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా–ఇశ్రాయేలీయులు ద్రాక్షపండ్ల అడలను కోరి యితర దేవతలను పూజించినను యెహోవావారిని ప్రేమించినట్లు, దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము.౹ కాగా నేను పదునైదు తులముల వెండియు ఐదు తూములు యవలును తీసికొని దానిని కొని ఆమెతో ఇట్లంటిని –చాల దినములు నా పక్షమున నిలిచియుండి యే పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవుండవలెను; నీయెడల నేనును ఆలాగున నుందును.౹ నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలదినములు రాజు లేకయు అధిపతిలేకయు బలినర్పిం పకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు.౹ తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందువారు భయభక్తులుకలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఇశ్రాయేలువారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు.౹ అబద్ధసాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్యచేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్యచేసెదరు.౹ కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులును ఆకాశపక్షులును కాపురస్థులందరును క్షీణించుచున్నారు, సముద్రమత్స్యములు కూడ గతించిపోవుచున్నవి.౹ ఒకడు మరియొకనితో వాదించినను ప్రయోజనము లేదు; ఒకని గద్దించినను కార్యము కాకపోవును; నీ జనులు యాజకునితో జగడమాడువారిని పోలియున్నారు.౹ కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతోకూడ ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనముచేతును.౹ నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును.౹ తమకు కలిమి కలిగినకొలది వారు నాయెడల అధికపాపము చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును.౹ నా జనుల పాపములను ఆహారముగ చేసికొందురు గనుక జనులు మరి యధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు.౹ కాబట్టి జనులకు ఏలాగో యాజకులకును ఆలాగే సంభవించును; వారి ప్రవర్తననుబట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారము చేతును.౹ వారు యెహోవాను లక్ష్యపెట్టుటమానిరి గనుక వారు భోజనముచేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు.౹ వ్యభిచారక్రియలు చేయుటచేతను ద్రాక్షారసము పానముచేయుటచేతను మద్యపానముచేతను వారు మతిచెడిరి.౹ నా జనులు తాము పెట్టుకొనిన కఱ్ఱయొద్ద విచారణచేయుదురు, తమ చేతికఱ్ఱ వారికి సంగతి తెలియజేయును, వ్యభిచారమనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు.౹ పర్వతముల శిఖరములమీద బలులనర్పింతురు, కొండలమీద ధూపము వేయుదురు, సింధూరవృక్షముల క్రిందను చినారువృక్షముల క్రిందను మస్తకివృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు; అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లును వ్యభిచారిణులైరి.౹ జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యముచేయుచు బలులనర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటనుబట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడండ్లు వ్యభిచరించుటనుబట్టి నేను వారిని శిక్షింపను; వివేచనలేని జనము నిర్మూలమగును.౹ ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైతివి; అయినను యూదా ఆ పాపములో పాలుపొందక పోవునుగాక. గిల్గాలునకు పోవద్దు; బేతావెనునకు పోవద్దు; యెహోవా జీవముతోడని ప్రమాణముచేయవద్దు.౹ పెయ్య మొండి తనము చూపునట్టు ఇశ్రాయేలువారు మొండితనము చూపియున్నారు గనుక విశాలస్థలమందు మేయు గొఱ్ఱెపిల్లకు సంభవించునట్లు దేవుడు వారికి సంభవింపజేయును.౹ ఎఫ్రాయిము విగ్రహములతో కలసికొనెను, వానిని ఆలాగుననే యుండనిమ్ము.౹ వారికి ద్రాక్షారసము చేదాయెను, ఒళ్లు తెలియనివారు; మానక వ్యభిచారముచేయు వారు; వారి అధికారులు సిగ్గుమాలినవారై అవమానకరమైన దానిని ప్రేమింతురు.౹ సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొనిపోవును; తాము అర్పించిన బలులనుబట్టి వారు సిగ్గునొందుదురు. యాజకులారా, నామాట ఆలకించుడి; ఇశ్రాయేలువారలారా, చెవిని బెట్టి ఆలోచించుడి; రాజసంతతివారలారా, చెవియొగ్గి ఆలకించుడి, మీరు మిస్పామీద ఉరిగాను తాబోరుమీద వలగాను ఉన్నారు గనుక మిమ్మునుబట్టి ఈ తీర్పు జరుగును.౹ –వారు మితిలేకుండ తిరుగు బాటుచేసిరి గనుక నేను వారినందరిని శిక్షింతును.౹ ఎఫ్రాయిమును నేనెరుగుదును; ఇశ్రాయేలువారు నాకు మరుగైనవారు కారు. ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు; ఇశ్రాయేలువారు అపవిత్రులైరి.౹ తమ క్రియలచేత అభ్యంతరపరచబడినవారై వారు తమ దేవునియొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుటవలనవారు యెహోవాను ఎరుగక యుందురు.౹ ఇశ్రాయేలుయొక్క అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలువారును ఎఫ్రా యిమువారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లు చున్నారు; వారితోకూడ యూదావారును తొట్రిల్లుచున్నారు.౹ వారు గొఱ్ఱెలను ఎడ్లను తీసికొని యెహోవాను వెదకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసికొనినందున వారికి కనబడకుండును.౹ యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి; ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతోకూడ లయమగుదురు. గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊదుడి; బెన్యామీనీయులారా–మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులో బొబ్బపెట్టుడి.౹ శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును; నిశ్చయముగా జరుగబోవు దానిని ఇశ్రాయేలీయుల గోత్రపువారికి నేను తెలియజేయుచున్నాను.౹ యుదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయువారివలెనున్నారు; నీళ్లు ప్రవ హించినట్లు నేను వారిమీద నా ఉగ్రతను కుమ్మరింతును.౹ ఎఫ్రాయిమీయులు మానవపద్ధతినిబట్టి ప్రవర్తింప గోరు వారు; వారికధికశ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింసనొందుదురు బాధింపబడుదురు.౹ ఎఫ్రాయిమీయు లకు చిమ్మట పురుగువలెను యూదావారికి వత్సపురుగువలెను నేనుందును.౹ తాను రోగి యవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయులయొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగుచేయజాలడు.౹ ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహమువంటివాడనుగాను యూదావారికి కొదమసింహమువంటివాడనుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొకడును లేక పోవును వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకువరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును; తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు. మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవదినమున ఆయన మనలను స్థిరపరచును.౹ యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును. ఎఫ్రాయిమూ, నిన్ను నేనేమిచేతును? యూదా, నిన్ను నేనేమిచేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవు నట్లును మీ భక్తి నిలువకపోవును.౹ కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించునట్లు ప్రవక్తలచేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను, నానోటిమాటల చేత వారిని వధించియున్నాను.౹ నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.౹ ఆదాము నిబంధన మీరినట్లువారు నాయెడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరియున్నారు.౹ గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి.౹ బందిపోటుదొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు; వారు ఘోరమైన కాముకత్వము జరిగించువారై యున్నారు,౹ ఇశ్రాయేలువారిలో ఘోరమైన సంగతి యొకటి నాకు కనబడెను, ఎఫ్రాయిమీయులు వ్యభిచారక్రియలు అభ్యాసము చేసెదరు, ఇశ్రాయేలువారు తమ్మును అపవిత్రపరచు కొనెదరు.౹ చెరలోనికి వెళ్లిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా, అతడు నీకు కోత కాలము నిర్ణయించును. –నేను ఇశ్రాయేలువారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు, బంది పోటు దొంగలై బయట దోచుకొందురు.౹ తమ క్రియల చేత వారు చిక్కుపడి యున్నను అవి నా సముఖముననే జరిగినను–మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసికొనడని తమలో తాము అనుకొందురు.౹ వారుచేయు చెడు తనమును చూచి రాజు సంతోషించును; వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు.౹ రొట్టెలు కాల్చు వాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు పొయ్యిని అధికముగా వేడిమిచేసి ఊరకుండునట్లు వారందరు మానని కామాతురతగలవారై యున్నారు.౹ మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలముచేత మత్తిల్లి జబ్బుపడిరి; రాజు తానే అపహాసకులకు చెలికా డాయెను.౹ పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని యున్నారు; తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రియంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంటమండి కాలుచున్నది.౹ పొయ్యి కాలునట్లు వారందరు బహు మంటమండి తమ న్యాయాధిపతులను మ్రింగివేయుదురు, వారి రాజులందరును కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు.౹ ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను; ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పమువంటి వాడాయెను.౹ అన్యులు అతని బలమును మ్రింగివేసినను అది అతనికి తెలియకపోయెను; తన తలమీద నెరసిన వెండ్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు.౹ ఇశ్రాయేలు కున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవాయొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకక యున్నారు.౹ ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను; వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు.౹ వారు వెళ్లగా నేను వారిపైని నా వల వేయుదును, ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును.౹ వారికి శ్రమ కలుగును; వారు నన్ను విసర్జించి తప్పిపోయియున్నారు; వారికి నాశనము కలుగును; వారు నామీద తిరుగుబాటు చేసియున్నారు; వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరియున్నను వారు నామీద అబద్ధములు చెప్పుదురు హృదయ పూర్వకముగా నన్ను బతిమాలుకొనక శయ్యలమీద పరుండి కేకలు వేయుదురు; నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు.౹ నేను వారికి బుద్ధినేర్పి వారిని బలపరచినను వారు నామీద దుర్‌యోచనలు చేయుదురు.౹ వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వానియొద్దకు తిరుగరు; వారు అక్కరకురాని విల్లువలె నున్నారు; వారి యధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తిపాలగుదురు. ఈలాగునవారు ఐగుప్తుదేశములో అపహాస్యము నొందుదురు. –బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధన నతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము.౹ వారు–మా దేవా, ఇశ్రాయేలువారలమైన మేము నిన్ను ఎరిగియున్నవారమే యని నాకు మొఱ్ఱపెట్టుదురు;౹ ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును.౹ నాకు అనుకూలులుకాని రాజులను వారు నియమించుకొని యున్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని యున్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుటచేత వాటిని పోగొట్టుకొని యున్నారు.౹ షోమ్రోనూ, ఆయన నీ దూడను (విగ్రహము) విసర్జించెను నాకోపము వారిమీదికి రగులు కొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాల కుందురు? అది ఇశ్రాయేలువారి చేతి పనియే గదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును.౹ వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును; విత్తినది పైరుకాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు.౹ ఇశ్రాయేలువారు తినివేయబడుదురు; ఎవరికిని ఇష్టముకాని ఘటమువంటివారై అన్యజనులలో నుందురు.౹ అడవి గార్దభము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలువారు అష్షూరీయులయొద్దకు పోయిరి; ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచు కొనెను.౹ వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును; అధిపతులుగల రాజు పెట్టు భారముచేత వారు త్వరలో తగ్గిపోవుదురు.౹ ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను.౹ నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను.౹ నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు; అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు, త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములనుబట్టి వారిని శిక్షించును; వారు మరల ఐగుప్తునకు వెళ్లవలసి వచ్చెను.౹ ఇశ్రాయేలువారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు; యూదావారు ప్రాకారములుగల పట్టణములను చాల కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును. ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమునుబట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి.౹ కళ్లములుగాని గానుగలుగాని వారికి ఆహారము నియ్యవు; క్రొత్త ద్రాక్షారసము లేకపోవును.౹ ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు.౹ యెహోవాకు ద్రాక్షారస పానా ర్పణమును వారర్పింపరు; వారర్పించు బలులయందు ఆయన కిష్టములేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలాపము చేయువారి ఆహారమువలెనగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికిరాదు.౹ నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు? లయము సంభవించినందున జనులు వెళ్లిపోయి యున్నారు; ఐగుప్తుదేశము వారికి కూడు స్థలముగా ఉండును; నొపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును; వెండిమయమైన వారి ప్రియవస్తువులను దురదగొండ్లు ఆవరించును; ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును.౹ శిక్షా దినములు వచ్చేయున్నవి; ప్రతికార దినములు వచ్చేయున్నవి; తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మ ననుసరించినవారు వెఱ్ఱివారనియు ఇశ్రాయేలువారు తెలిసికొందురు.౹ ఎఫ్రాయిము నా దేవునియొద్దనుండి వచ్చు దర్శనములను కనిపెట్టును; ప్రవక్తలు తమ చర్యయంతటిలోను వేటకాని వలవంటివారై యున్నారు; వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు.౹ గిబియాలో చెడుకార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లువారు బహు దుర్మార్గులైరి; యెహోవావారి దోషమును జ్ఞాపకము చేసికొనుచున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును.౹ అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీపితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించినదానివలెనే వారు హేయులైరి.౹ ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరి పోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.౹ వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునులేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.౹ లోయలో స్థాపింపబడిన తూరువంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును.౹ యెహోవా, వారికి ప్రతికారము చేయుము; వారికి నీవేమి ప్రతికారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములుగల వారినిగాను చేయుము.౹ వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది; అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలనుబట్టి వారి నికను ప్రేమింపక నా మందిరములోనుండి వారిని వెలివేతును; వారి యధిపతులందరును తిరుగుబాటు చేయువారు.౹ ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను.౹ వారు నా దేవుని మాటల నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష. చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించినకొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి; తమ భూమి ఫలవంతమైనకొలది వారు తమ దేవతాస్తంభములను మరి విశేషముగా చేసిరి.౹ వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు; యెహోవావారి బలిపీఠములను తుత్తునియలుగా చేయును, వారు ప్రతిష్ఠించిన దేవతాస్తంభములను పాడుచేయును.౹ –రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు.౹ అబద్ధప్రమాణములు చేయుదురు, సంధులు చేయుదురు, వట్టిమాటలు పలుకుదురు, అందువలన భూమి చాళ్లలో విషపుకూర మొలచునట్టుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి.౹ బేతావెనులోనున్న దూడవిషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు, దాని ప్రభావము పోయెనని ప్రజలును, సంతోషించుచుండిన దాని అర్చకులును దుఃఖింతురు.౹ ఎఫ్రాయిము అవమానము నొందుటకు, ఇశ్రాయేలువారు తాము చేసిన ఆలోచనవలన సిగ్గు తెచ్చుకొనుటకు, అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును.౹ షోమ్రోను నాశమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకొనిపోవు నురుగుతో సమానమగును.౹ ఇశ్రాయేలువారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నతస్థలములు లయమగును, ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠములమీద పెరుగును, పర్వతములను చూచి–మమ్మును మరుగుచేయుడనియు, కొండలను చూచి–మామీద పడుడనియు వారు చెప్పుదురు.౹ ఇశ్రాయేలూ, గిబియా దినములనుండి నీవు పాపము చేయుచు వచ్చితివి, అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గులమీద జరిగిన యుద్ధము గిబియాలో వారిమీదకి రాగా నా యిష్టప్రకారము నేను వారిని శిక్షింతును; వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారిమీదికి వత్తురు.౹ ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది; అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును; ఎఫ్రాయిముచేత దున్నిం చుటకు నేనొకని నియమింతును, యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసికొనును.౹ నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమ యము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి.౹ నీ ప్రవర్తన నాధారము చేసికొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోతకోసియున్నారు. అబద్ధమునకు ఫలము పొందియున్నారు.౹ నీ జనులమీదికి అల్లరి వచ్చును; షల్మాను యుద్ధముచేసి బేతర్బేలును పాడుచేసినట్లు ప్రాకారములుగల నీ పట్టణములన్నియు పాడగును; పిల్లలమీద తల్లులు నేలను పడవేయబడుదురు.౹ ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలనుబట్టి బేతేలు మీకు నాశన కారణమగును; ఉదయకాలమున ఇశ్రాయేలురాజు కొట్టబడి నిర్మూలమగును. ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తుదేశములోనుండి పిలిచితిని.౹ ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులనర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి.౹ ఎఫ్రా యిమును చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే; వారిని కౌగలించుకొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్ట లేదు ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని; ఒకడు పశువులమీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి యెదుట భోజనము పెట్టితిని ఐగుప్తుదేశమునకు వారు మరల దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరురాజు వారిమీద ప్రభుత్వము చేయును.౹ వారు చేయుచున్న యోచనలనుబట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును; అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మ్రింగివేయును.౹ నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసికొనియున్నారు; మహోన్నతునితట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎట్లు విస ర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబో యీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండ నా యంతరంగము మండు చున్నది.౹ నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపర చను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను.౹ వారు యెహోవా వెంబడి నడిచెదరు; సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నున్న జనులు వణకుచు వత్తురు.౹ వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తుదేశములోనుండి వత్తురు; గువ్వలు ఎగురునట్లుగా అష్షూరుదేశములోనుండి ఎగిరి వత్తురు; నేను వారిని తమ నివాసములలో కాపురముంతును; ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిమువారు అబద్ధములతో నన్ను ఆవరించియున్నారు; ఇశ్రాయేలువారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు; యూదావారు నిరాటంకముగా దేవునిమీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవునిమీద తిరుగబడుదురు. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు; మానక దినమెల్ల అబద్ధమాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయులతో సంధిచేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు.౹ యూదావారిమీద యెహోవాకు వ్యాజ్యెము పుట్టెను; యాకోబు సంతతివారి ప్రవర్తననుబట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయును.౹ తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరికలవాడై అతడు దేవునితో పోరాడెను.౹ అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను;౹ యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము.౹ కాబట్టి నీవు నీ దేవునితట్టు తిరుగవలెను; కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవునియందు నమ్మిక నుంచుము. ఎఫ్రాయిమువారు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు, బాధపెట్టవలె నన్న కోరిక వారికి కలదు.౹ –నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనినిబట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు.౹ అయితే ఐగుప్తుదేశములోనుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను; నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును.౹ ప్రవక్తలతో నేను మాటలాడి యున్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చియున్నాను, ఉపమానరీతిగా అనేకపర్యాయములు ప్రవ క్తలద్వారా మాటలాడియున్నాను.౹ నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు, గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పింతురు, వారి బలిపీఠములు దున్నినచేని గనిమలమీదనున్న రాళ్లకుప్పలవలె ఉన్నవి యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను, భార్య కావలెనని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావలెనని అతడు గొఱ్ఱెలు కాచెను.౹ ఒక ప్రవక్తద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తుదేశములోనుండి రప్పించెను, ప్రవక్తద్వారా వారిని కాపాడెను.౹ ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతనిమీద నేరము మోపును; అతడు పరులకు అవమానము కలుగజేసినందుకై నేనతని నవమానపరతును. ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలుదేవతనుబట్టి అపరాధియై అతడు నాశన మొందెను.౹ ఇప్పుడు వారు పాపము పెంపుచేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు, అదంతయు పనివారు చేయుపనియే, వాటికి బలులను అర్పించువారు–దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు.౹ కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘమువలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టువలెను, కిటికీలోగుండ పోవు పొగవలె నుందురు.౹ మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను; నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు.౹ మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే.౹ తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి.౹ కాబట్టి నేను వారికి సింహమువంటివాడనైతిని; చిరుతపులి మార్గమున పొంచియున్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును.౹ పిల్లలు పోయిన యెలుగుబంటి యొకనిమీద పడునట్టు నేను వారిమీదపడి వారి రొమ్మును చీల్చివేయుదును; ఆడుసింహము ఒకని మ్రింగివేయునట్లు వారిని మ్రింగివేతును; దుష్టమృగములు వారిని చీల్చివేయును.౹ ఇశ్రాయేలూ, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు.౹ నీ పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండ నీ రాజు ఏమాయెను? —రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసికొంటివిగదా; నీ అధిపతులు ఏమైరి? కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని; క్రోధముకలిగి అతని కొట్టివేయు చున్నాను.౹ ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడి యున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది.౹ ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదనపుట్టును, పిల్లపుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేనివాడై వృద్ధికి రాడు.౹ అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.౹ నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధినొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించుగాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువు లన్నిటిని శత్రువు కొల్లపట్టును.౹ షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటుచేసెను గనుక అది శిక్షనొందును, జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకువేసి కొట్టబడుదురు, గర్భిణిస్త్రీల కడుపులు చీల్చబడును. ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము.౹ మాటలు సిద్ధపరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా–మా పాపములన్నిటిని పరిహ రింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.౹ అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కము–మీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.౹ వారు విశ్వాసఘాతుకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారిమీదనున్న నాకోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహిం తును.౹ చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామరపుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లువారు తమ వేళ్లు తన్నుదురు.౹ అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును.౹ అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు.౹ ఎఫ్రాయిమూ–బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురుపెట్టు సరళవృక్షమువంటి వాడను, నావలననే నీకు ఫలము కలుగును.౹ జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు పెద్దలారా, ఆలకించుడి దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి ఈలాటి సంగతి మీ దినములలో గాని మీపితరుల దినములలోగాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి.వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరమువారిని తెలియజేయుదురు. గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి యున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి యున్నవి. పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి యున్నవి. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షారసపానము చేయువారలారా, రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశ మాయెను, లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది వాటి పళ్లు సింహపు కోరలవంటివి వాటి కాటు ఆడుసింహపు కాటువంటిది. అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసియున్నవి నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి యున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు తెలుపాయెను పెనిమిటి పోయిన యౌవనురాలు గోనెపట్ట కట్టు కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండ నిలిచి పోయెను. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను. భూమిమీది పైరు చెడిపోయెను గోధుమ కఱ్ఱలను యవల కఱ్ఱలను చూచి సేద్య గాండ్లారా, సిగ్గునొందుడి. ద్రాక్షతోట కాపరులారా, రోదనము చేయుడి. ద్రాక్షచెట్లు చెడిపోయెను అంజూరపుచెట్లు వాడి పోయెను దానిమ్మచెట్లును ఈతచెట్లును జల్దరుచెట్లును తోట చెట్లన్నియు వాడిపోయినవి నరులకు సంతోషమేమియు లేకపోయెను. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిర మునకు రాకుండ నిలిచిపోయెను. ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను మన ఆహారము నాశనమాయెను. విత్తనము మంటిపెడ్డల క్రింద కుళ్లిపోవుచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపుకొట్లు వట్టి వాయెను కళ్లపుకొట్లు నేలపడియున్నవి. మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొఱ్ఱెమందలు చెడిపోవుచున్నవి. అగ్నిచేత అరణ్యములోని మేతస్థలములు కాలిపోయినవి మంట తోటచెట్లన్నిటిని కాల్చివేసెను యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేతస్థలములు కాలిపోవుటయు చూచి పశువులును నీకు మొఱ్ఱ పెట్టుచున్నవి. సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధపర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకు దురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ కారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటిముందర అగ్ని మండుచున్నది వాటివెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదెనువనమువలె ఉండెను అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియు విడువబడక భూమి యెడారివలె పాడాయెను. వాటి రూపములు గుఱ్ఱముల రూపములవంటివి రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వతశిఖరములమీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖ ములు తెల్లబారును. బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవుచున్నవి ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు. పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి గోడలమీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి. వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజో హీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములనుకాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.౹ ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు? సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి. జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు —యెహోవా, నీ జనులయెడల జాలిచేసికొని, అన్యజనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులు–వారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమునుబట్టి రోషము పూని తన జనులయెడల జాలిచేసికొనెను.౹ మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా— ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తినొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను మరియు ఉత్తరదిక్కునుండి వచ్చువాటిని మీకు దూరముగా పార దోలి, యెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును; అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లు వాసన కొట్టును.౹ దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్పకార్యములు చేసెను.౹ పశువులారా, భయపడకుడి, గడ్డిబీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపుచెట్లును, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలించును,౹ సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి; తన నీతినిబట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకుపైగా పొర్లి పారును.౹ మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.౹ నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు.౹ అప్పుడు ఇశ్రాయేలీయులమధ్య నున్నవాడను నేనే యనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందురు; నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందకయుందురు. తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.౹ ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మ రింతును.౹ మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.౹ యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేములోను తప్పించుకొనినవారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు. ఆ దినములలో, —అనగా యూదావారిని యెరూషలేము కాపురస్థులను నేను చెరలోనుండి రప్పించు కాలమున అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనులపక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యెమాడుదును.౹ వారు నా జనులమీద చీట్లువేసి, వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై యొక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి గదా? తూరు పట్టణమా, సీదోనుపట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పనియేమి? నేను చేసినదానికి మీరు నాకు ప్రతికారము చేయుదురా? మీరు నా కేమైన చేయుదురా? నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొనిపోతిరి; నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొనిపోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి.౹ యూదావారిని యెరూషలేము పట్టణపువారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి; మీరు చేసినదానిని బహు త్వరగా మీ నెత్తిమీదికి రప్పించెదను.౹ ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదికి రాజేయుదును; మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలోనుండి నేను వారిని రప్పింతును మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమ్మివేయింతును; వారు దూరముగా నివసించు జనులైన షెబాయీయులకు వారిని అమ్మివేతురు; యెహోవా సెలవిచ్చిన మాట యిదే. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటనచేయుడి–యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరు సిద్ధపడి రావలెను.౹ మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడు–నేను బలాఢ్యుడను అనుకొనవలెను.౹ చుట్టుపెట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి; సమకూడి రండి. యెహోవా, నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము.౹ నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికిరావలెను పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధిక మాయెను, మీరు దిగి రండి.౹ తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు.౹ సూర్య చంద్రులు తేజోహీనులైరి; నక్షత్రముల కాంతి తప్పిపోయెను.౹ యెహోవా సీయోనులోనుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయ మగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.౹ అన్యు లికమీదట దానిలో సంచరింపకుండ యెరూషలేము పరిశుద్ధపట్టణముగా ఉండును; మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలిసికొందురు.౹ ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములోనుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును.౹ ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారముచేసి తమతమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన ఎడారిగా ఉండును.౹ ఈలాగున నేను ఇంతకుముందు ప్రతికారము చేయని ప్రాణదోషమునకై ప్రతికారము చేయుదును.౹ అయితే యూదాదేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును, యెహోవా సీయోనులో నివాసిగా వసించును. యూదారాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను, భూకంపము కలుగుటకు రెండు సంవత్సరములు ముందు, ఇశ్రాయేలీయులనుగూర్చి తెకోవలోని పసుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. అతడు ప్రకటించినదేమనగా–యెహోవా సీయోనులోనుండి గర్జించుచున్నాడు, యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండి పోవుచున్నది. యెహోవా సెలవిచ్చునదేమనగా–దమస్కు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు ఇనుపపనిముట్లతో గిలాదును నూర్చిరి.౹ నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను; అది బెన్హదదుయొక్క నగరులను దహించివేయును;౹ దమస్కుయొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును, బెతేదేనులో ఉండకుండ రాజదండము వహించినవానిని నిర్మూలము చేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చునదేమనగా–గాజా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలెనని తాము చెరపెట్టినవారినందరిని కొనిపోయిరి.౹ గాజాయొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;౹ అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించినవాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చునదేమనగా–తూరు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని జనులు సహో దర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడినవారినందరిని ఎదోమీయులకు అప్పగించిరి.౹ నేను తూరు ప్రాకారములమీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును. యెహోవా సెలవిచ్చునదేమనగా–ఎదోము మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగువారిని మానక చీల్చుచు వచ్చెను.౹ తేమానుమీద అగ్ని వేసెదను, అది బొస్రాయొక్క నగరులను దహించివేయును. యెహోవా సెలవిచ్చునదేమనగా–అమ్మోనీయులు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి, గిలాదులోని గర్భిణి స్త్రీల కడుపులను చీల్చిరి.౹ రబ్బాయొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును; రణకేకలతోను, సుడి గాలి వీచునప్పుడు కలుగు ప్రళయమువలెను అది దాని నగరులమీదికి వచ్చి వాటిని దహించివేయును.౹ వారి రాజును అతని అధిపతులును అందరును చెరలోనికి కొని పోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చునదేమనగా–మోయాబు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నముచేసిరి.౹ మోయాబుమీద నేను అగ్నివేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలును బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును.౹ మోయాబీయులకు న్యాయాధిపతియుండకుండ వారిని నిర్మూలము చేసెదను, వారితోకూడ వారి అధిపతులనందరిని నేను సంహరించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చునదేమనగా–యూదా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా వారు తమపితరులనుసరించిన అబద్ధములను చేపెట్టి, మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి, ఆయన విధులను గైకొనక పోయిరి.౹ యూదామీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించివేయును. యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మి వేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమ్మి వేయుదురు.౹ దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు; తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు;౹ తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.౹ దేవదారు వృక్షమంత యెత్తయినవారును సింధూరవృక్షమంత బలముగల వారునగు అమోరీయులను వారిముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా; పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా,౹ మరియు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి, అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా.౹ మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలీయులారా, యీ మాటలు నిజమైనవికావా? ఇదే యెహోవా వాక్కు.౹ అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.౹ ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.౹ అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొనజాలకపోవును, పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొనజాలక పోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొనజాలకుండును.౹ విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరుగెత్తువాడు తప్పించు కొనలేకపోవును, గుఱ్ఱము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును.౹ మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యముగలవాడు దిగంబరియై పారిపోవును; ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తుదేశమునుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మునుగూర్చియు ఆయన రప్పించిన కుటుంబమువారినందరినిగూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి.౹ అదేమనగా భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినిబట్టి మిమ్మును శిక్షింతును.౹ [3-4] సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడుతురా? ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా? ఏమియు పట్టుకొనకుండనే కొదమసింహము గుహలోనుండి బొబ్బ పెట్టునా? *** భూమిమీద ఒకడును ఎరపెట్టకుండ పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమియు పట్టుబడకుండ ఉరి పెట్టువాడు వదలిలేచునా? పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.౹ సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువాడెవడు? అష్డోదు నగరులలో ప్రకటనచేయుడి, ఐగుప్తుదేశపు నగరులలో ప్రకటనచేయుడి; ఎట్లనగా–మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతములమీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి; అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి.౹ వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారముచేతను దోపుడుచేతను సొమ్ము సమకూర్చుకొందురు.౹ కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా— శత్రువు వచ్చును, అతడు దేశమంతట సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును.౹ యెహోవా సెలవిచ్చునదేమనగా–గొల్లవాడు సింహము నోటనుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించునట్లుగా షోమ్రోనులో మంచములమీదను బుట్టాలువేసిన శయ్యలమీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు.౹ ప్రభువును దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా మాట ఆలకించి యాకోబు ఇంటివారికి దానిని రూఢిగా తెలియజేయుడి.౹ ఇశ్రాయేలువారు చేసిన దోషములనుబట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును; ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును.౹ చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరులును లయమగును, బహు నగరులు పాడగును; ఇదే యెహోవా వాక్కు. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా —మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, యీ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా –ఒక కాలమువచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకులచేతను, మీలో శేషించినవారిని గాలములచేతను పట్టుకొని లాగుదురు.౹ ఇటు అటు తొలగకుండ మీరందరు ప్రాకారపు గండ్లద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలి వేయబడుదురు; ఇదే యెహోవా వాక్కు. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి యెక్కువగా తిరుగుబాటు చేయుడి, ప్రతి ప్రాతఃకాలమున బలులు తెచ్చి మూడేసి దినముల కొక సారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి.౹ పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్ఛార్పణనుగూర్చి చాటించి ప్రకటన చేయుడి; ఇశ్రాయేలీయులారా, యీలాగున చేయుట మీకిష్టమైయున్నది; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹ మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారములేకుండ చేసినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.౹ మరియు కోతకాలమునకుముందు మూడు నెలలు వానలేకుండ చేసితిని; ఒక పట్టణముమీద కురి పించి మరియొక పట్టణముమీద కురిపింపకపోతిని; ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేనిచోటు ఎండిపోయెను.౹ రెండు మూడు పట్టణములవారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.౹ మరియు మీ సస్యములను ఎండు తెగులుచేతను కాటుకచేతను నేను పాడుచేసితిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్షతోటలను అంజూరపు చెట్లను ఒలీవచెట్లను తినివేసెను, అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.౹ మరియు నేను ఐగుప్తీయులమీదికి తెగుళ్లు పంపించినట్లు మీమీదికి తెగుళ్లు పంపించితిని; మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యౌవనులను ఖడ్గముచేత హతముచేయించి మీ గుఱ్ఱములను కొల్లపెట్టించితిని; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.౹ దేవుడు సొదొమ గొమొఱ్ఱాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగా మీరు మంటలోనుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించు కొంటిరి; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.౹ కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీయెడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి.౹ పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుష్యుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే; భూమియొక్క ఉన్నతస్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలువారలారా, మిమ్మునుగూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి.౹ కన్యకయైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికిని లేవదు; లేవనెత్తువాడొకడును లేక ఆమె భూమిమీద పడవేయబడియున్నది.౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలు వారిలో వెయ్యిమందియై బయలు వెళ్లిన పట్టణస్థులలో నూరుమంది తప్పించుకొని వత్తురు; నూరుమందియై బయలువెళ్లిన పట్టణస్థులలో పదిమంది తప్పించుకొని వత్తురు.౹ ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున దేమనగా–నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు.౹ బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును.౹ యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకుదురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండ అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతిమీదపడి దాని నాశనముచేయును.౹ న్యాయమును అన్యాయమునకు మార్చి, నీతిని నేలను పడవేయువారలారా,౹ ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారుచీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.౹ ఆయన పేరు యెహోవా; బలాఢ్యులమీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును.౹ అయితే గుమ్మములో నిలిచి బుద్ధిచెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు.౹ దోషనివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన మీ అపరాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్లరసము మీరు త్రాగరు.౹ ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును.౹ మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును.౹ కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి; ఒక వేళ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించినవారియందు కనికరించును.౹ దేవుడును సైన్యములకధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును, వీధులన్నిటిలో జనులు కూడి–అయ్యో శ్రమ అందురు; అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు; రోదనముచేయ నేర్పుగలవారిని అంగలార్చుటకు పిలిపింతురు.౹ ద్రాక్షతోటలన్నిటిలో రోదనము వినబడును.౹ యెహోవా దినము రావలెనని ఆశపెట్టుకొనియున్నవారలారా, మీకు శ్రమ; యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగుకాదు, అంధకారము.౹ ఒకడు సింహము నొద్దనుండి తప్పించు కొనగా ఎలుగుబంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును.౹ యెహోవా దినము నిజముగా వెలుగైయుండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారుచీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను.౹ నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధానబలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను.౹ మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు.౹ నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింప నియ్యుడి.౹ ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా? మీరు మీ దేవతయైన మోలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా.౹ కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఆయన పేరు సైన్యములకధిపతియగు దేవుడు. సీయోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతములమీద నిశ్చింతగా నివసించువారికి శ్రమ; ఇశ్రాయేలువారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైనవారికి శ్రమ కల్నేకు పోయి విచారించుడి; అక్కడనుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి; అవి ఈ రాజ్యములకంటె గొప్పవి గదా; వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటె విశాలమైనవి గదా.౹ ఉపద్రవ దినము బహుదూరముననున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు.౹ దంతపు మంచములమీద పరుండుచు, పాన్పులమీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱెపిల్లలను సాలలోని క్రొవ్వినదూడలను వధించి భోజనము చేయుదురు.౹ స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించు కొందురు.౹ పాత్రలలో ద్రాక్షారసముపోసి పానముచేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు.౹ కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితోకూడా వీరు చెరలోనికి పోవుదురు; అప్పుడు సుఖాసక్తులుచేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతివారికున్న గర్వము నాకసహ్యము; వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసెదనని ప్రభువైన యెహోవా తనతోడని ప్రమాణము చేసెను; ఇదే దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు.౹ ఒక కుటుంబమందు పదిమంది మనుష్యులుండినను వారు చత్తురు.౹ ఒకని దాయాది కాల్చబోవు వానితోకూడ ఎముకలను ఇంటిలోనుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకనిచూచి —యింటిలో మరి ఎవరైన మిగిలియున్నారా? యని అడుగగా అతడు ఇంకెవరును లేరనును; అంతట దాయాదిట్లనును–నీవిక నేమియు పలుకక ఊరకుండుము, యెహోవానామము స్మరించకూడదు;౹ ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు, చిన్న కుటుంబములు చీలి పోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు గుఱ్ఱములు బండలమీద పరుగెత్తునా? అట్టిచోట ఎవరైన ఎద్దులతో దున్నుదురా? అయినను మాశక్తిచేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు, వ్యర్థమైన దానినిబట్టి సంతోషించు మీరు,౹ న్యాయమును ఘోరమైన అన్యా యముగాను, నీతిఫలమును ఘోరదుర్మార్గముగాను మార్చితిరి.౹ ఇందుకు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును, వారు హమాతునకు పోవుమార్గము మొదలుకొని అరణ్యపు నదివరకు మిమ్మును బాధింతురు. కడవరి గడ్డి మొలుచునప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనుపర చెను; ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది.౹ నేలను మొలిచిన పచ్చికయంతయు ఆ మిడుతలు తినివేసినప్పుడు–ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనముగలవాడు, అతడేలాగు నిలుచును? అని నేను మనవిచేయగా యెహోవా పశ్చాత్తాపపడి–అది జరుగదని సెలవిచ్చెను. మరియు–అగ్నిచేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శనరీతిగా నాకు కనుపరచెను. అది వచ్చి అగాధమైన మహా జలమును మ్రింగివేసి, స్వాస్థ్యమును మ్రింగ మొదలుపెట్టినప్పుడు –ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనముగలవాడు, అతడేలాగు నిలుచును? మాని వేయుమని నేను మనవిచేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి— అదియు జరుగదని సెలవిచ్చెను. మరియు యెహోవా తాను మట్టపుగుండు చేతపట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక గోడమీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనుపరచెను.౹ యెహోవా–ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా–నాకు మట్టపుగుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా— నా జనులగు ఇశ్రాయేలీయులమధ్యను మట్టపుగుండు వేయ బోవుచున్నాను. నేనికను వారిని దాటిపోను ఇస్సాకు సంతతివారు ఏర్పరచిన ఉన్నతస్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితస్థలములు నాశమగును. నేను ఖడ్గము చేతపట్టుకొని యరొబాము ఇంటివారిమీద పడుదును. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలురాజైన యరొబామునకు వర్తమానము పంపి–ఇశ్రాయేలీయులమధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు;౹ యరొబాము ఖడ్గముచేత చచ్చుననియు, ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు; అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను.౹ మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను–దీర్ఘదర్శీ, తప్పించుకొని యూదాదేశమునకు పారి పొమ్ము; అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము;౹ బేతేలు, రాజుయొక్క ప్రతిష్ఠితస్థలము రాజధాని పట్టణమై యున్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటనచేయకూడదు.౹ అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను— నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్తయొక్క శిష్యుడనైనను కాను, కాని పసులకాపరినై మేడిపండ్లు ఏరుకొనువాడను.౹ నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి–నీవు పోయి నా జనులగు ఇశ్రాయేలువారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను.౹ యెహోవా మాట ఆలకించుము–ఇశ్రాయేలీయులనుగూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే.౹ యెహోవా సెలవిచ్చునదేమనగా–నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులును కుమార్తెలును ఖడ్గముచేత కూలుదురు, నీ భూమి నూలుచేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు; అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు. మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్లగంప యొకటి నాకు కనుపరచి –ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా–వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని, అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా–నా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికను వారిని విచారణచేయక మానను.౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కు వగును, ప్రతిస్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి.౹ దేశమందు బీదలను మ్రింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా,౹ –తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునోయని చెప్పుకొనువారలారా,౹ దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.౹ యాకోబుయొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా–వారిక్రియలను నేనెన్నడును మరువను.౹ ఇందునుగూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరును అంగలార్చరా? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలునదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపునదివలె అది అణగి పోవును.౹ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా— ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును.౹ మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైనశ్రమదినముగా ఉండును.౹ రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్నపానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.౹ కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు;౹ ఆ దినమందు చక్కని కన్యలును యౌవనులును దప్పిచేత సొమ్మసిల్లుదురు.౹ షోమ్రోనుయొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు, దానూ, నీ దేవుని జీవముతోడనియు, బెయేర్షెబా మార్గ జీవముతోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండ కూలుదురు. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నా కాజ్ఞ ఇచ్చిన దేమనగా–గడపలు కదలిపోవునట్లుగా పై కమ్ములనుకొట్టి వారందరి తలలమీద వాటిని పడవేసి పగులగొట్టుము; తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను, తప్పించు కొనువారిలో ఎవడును బ్రదుకకుండను నేను వారినందరిని ఖడ్గముచేత వధింతును.౹ వారు పాతాళములో చొచ్చి పోయినను అచ్చటనుండి నా హస్తము వారిని బయటికి లాగును; ఆకాశమునకెక్కి పోయినను అచ్చటనుండి వారిని దింపి తెచ్చెదను.౹ వారు కర్మెలు పర్వతశిఖరమున దాగినను నేను వారిని వెదకిపెట్టి అచ్చటనుండి తీసికొని వచ్చెదను; నా కన్నులకు కనబడకుండ వారు సముద్రములో మునిగి నను అచ్చటి సర్పమునకు నేనాజ్ఞ ఇత్తును, అది వారిని కరచును.౹ తమ శత్రువులచేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమున కాజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును; మేలుచేయుటకు కాదు కీడుచేయుటకే నా దృష్టి వారిమీద నిలుపుదును.౹ ఆయన సైన్యములకధిపతియగు యెహోవా; ఆయన భూమిని మొత్తగా అది కరిగి పోవును, అందులోని నివాసులందరును ప్రలాపింతురు, నైలునదివలెనే అదియంతయు ఉబుకుచుండును, ఐగుప్తు దేశపు నైలునదివలెనే అది అణగిపోవును.౹ ఆకాశమందు తనకొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశమండలమునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద ప్రవహింపజేయువాడును ఆయనే; ఆయన పేరు యెహోవా.౹ ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశములోనుండి ఇశ్రాయేలీయులను, కఫ్తోరు దేశములోనుండి ఫిలిష్తీయులను, కీరుదేశములోనుండి సిరియనులను రప్పించితిని.౹ ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్ఠి రాజ్యముమీదనున్నది, దానిని భూమిమీద ఉండకుండ నాశనము చేతును. అయితే యాకోబు సంతతివారిని సర్వనాశముచేయక విడిచి పెట్టుదును; ఇదే యెహోవా వాక్కు.౹ నేనాజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని యొక చిన్నగింజైన నేల రాలదు.౹ –ఆ కీడు మనలను తరిమి పట్టదు, మనయొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరును ఖడ్గముచేత చత్తురు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే.౹ రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు; విత్తనము చల్లు వారి వెంటనే ద్రాక్షపండ్లు త్రొక్కువారు వత్తురు; పర్వతములనుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్ని రసధారలగును; ఇదే యెహోవా వాక్కు.౹ మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములువేసి వాటి పండ్లను తిందురు.౹ వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికివేయ బడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చునది. యెహోవాయొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. —ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడియున్నాడు.౹ నేను అన్యజనులలో నిన్ను అల్పు నిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు.౹ అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండసందులలో నివసించువాడా — నన్ను క్రిందికి పడ ద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి.౹ పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.౹ చోరులేగాని రాత్రి కన్నము వేయువారేగాని నీ మీదికి వచ్చినయెడల తమకు కావలసినంతమట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీయొద్దకు వచ్చినయెడల పరిగె యేరు కొనువారికి కొంత యుండనిత్తురుగదా; నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి యున్నావు.౹ ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును; వారు దాచి పెట్టిన ధనమంతయు పట్టబడును.౹ నీతో సంధిచేసినవారు నిన్ను తమ సరిహద్దువరకు పంపివేయుదురు; నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు; వారు నీ యన్నము తిని నీ కొరకు ఉరి యొడ్డుదురు; ఎదోమునకు వివేచన లేకపోయెను.౹ ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములోనుండి జ్ఞానులను నాశముచేతును; ఇదే యెహోవా వాక్కు.౹ తేమానూ, నీ బలాఢ్యులు విస్మయ మొందుదురు, అందువలన ఏశావుయొక్క పర్వత నివాసులందరు హతులై నిర్మూలమగుదురు.౹ నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమునుబట్టి నీవు అవమానము నొందుదువు, ఇక నెన్నటికినిలేకుండ నీవు నిర్మూలమగుదువు.౹ నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేముమీద చీట్లువేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి గదా.౹ నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు; యూదావారి నాశనదినమున వారి స్థితినిచూచి నీవు సంతోషింపతగదు;౹ నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడ దగదు; వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు; వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు;౹ వారిలో తప్పించుకొనినవారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువతగదు, శ్రమదినమందు అతనికి శేషించినవారిని శత్రువులచేతికి అప్పగింప తగదు.౹ యెహోవాదినము అన్యజనులందరిమీదికి వచ్చు చున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును.౹ మీరు నా పరిశుద్ధమైన కొండమీద త్రాగినట్లు అన్యజనులందరును నిత్యము త్రాగుదురు; తాము ఇక నెన్నడు నుండనివారైనట్లు వారేమియు మిగులకుండ త్రాగుదురు.౹ అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనినవారు దానిమీద నివసింతురు, యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు.౹ మరియు యాకోబు సంతతివారు అగ్నియు, యోసేపు సంతతివారు మంటయు అగుదురు; ఏశావు సంతతివారు వారికి కొయ్యకాలుగా ఉందురు; ఏశావు సంతతివారిలో ఎవడును తప్పించుకొనకుండ యోసేపు సంతతివారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట యిచ్చియున్నాడు.౹ దక్షిణ దిక్కున నివసించువారు ఏశావుయొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు; మైదానమందుండువారు ఫిలిష్తీయులదేశమును స్వతంత్రించుకొందురు; మరియు ఎఫ్రాయిమీయుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనీయులు గిలాదుదేశమును స్వతంత్రించుకొందురు.౹ మరియు ఇశ్రాయేలీయుల దండు, అనగా వారిలో చెరపట్టబడినవారు సారెపతువరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు; యెరూషలేమువారిలో చెరపట్ట బడి సెఫారాదునకు పోయినవారు దక్షిణదేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు.౹ మరియు ఏశావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము యెహోవాది యగును. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –నీనెవెపట్ట ణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.౹ అయితే యెహోవా సన్ని ధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.౹ అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.౹ కాబట్టి నావికులు భయపడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, —ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించునేమో అనెను.౹ అంతలో ఓడ వారు–ఎవనినిబట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని యొకరితో ఒకరు చెప్పుకొని, చీట్లు వేయగా చీటి యోనామీదికి వచ్చెను.౹ కాబట్టి వారు అతని చూచి–యెవరినిబట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చి తివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతి యంతయు మాకు తెలియజేయుమనగా అతడు వారితో ఇట్లనెను — నేను హెబ్రీయుడను; సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై యున్నాను.౹ తాను యెహోవా సన్నిధిలోనుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి యుండెను గనుక వారా సంగతి తెలిసికొని మరింత భయపడి–నీవు చేసిన పని ఏమని అతని నడిగిరి.౹ అప్పుడు వారు–సముద్రము పొంగుచున్నది, తుపాను అధికమౌ చున్నది, సముద్రము మామీదికి రాకుండ నిమ్మళించునట్లు మేము నీ కేమి చేయవలెనని అతని నడుగగా యోనా — నన్నుబట్టియే యీ గొప్పతుపాను మీమీదికివచ్చెనని నాకు తెలిసియున్నది; నన్నుఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీమీదికి రాకుండ నిమ్మళించునని అతడు వారితో చెప్పినను వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుపాను బలముచేత సముద్రము పొంగియుండుటవలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను.౹ కాబట్టి వారు —యెహోవా, నీ చిత్తప్రకారముగా నీవే దీని చేసితివి; ఈ మనుష్యునిబట్టి మమ్మును లయము చేయకుందువు గాక; నిర్దోషిని చంపితిరన్న నేరము మామీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసికొని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి; పడవేయగానే సముద్రము పొంగకుండ ఆగెను.౹ ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి, ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్లు చేసిరి.౹ గొప్ప మత్స్యము ఒకటి యోనాను మ్రింగవలెనని యెహోవా నియమించి యుండగా యోనా మూడుదినములు ఆ మత్స్యముయొక్క కడుపులో నుండెను. ఆ మత్స్యము కడుపులోనుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను.౹ –నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.౹ నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసి యున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి.౹ నీ సన్నిధిలోనుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాల యముతట్టు మరల చూచెదననుకొంటిని.౹ ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొనియున్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది. సముద్రపు నాచు నా తలకుచుట్టుకొని యున్నది.౹ నేను మరెన్న టికిని ఎక్కిరాకుండ భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను, నా దేవా, యెహోవా, నీవు నా ప్రాణము కూపములోనుండి పైకి రప్పించియున్నావు.౹ కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసికొంటిని; నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను.౹ అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు.౹ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులనర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవాయొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను.౹ అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కివేసెను. అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా –నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము.౹ కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను. నీనెవె పట్టణము దేవునిదృష్టికి గొప్పదై మూడుదినముల ప్రయాణమంత పరిమాణముగల పట్టణము.౹ యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంతదూరము సంచరించుచు–ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటనచేయగా నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి.౹ ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను.౹ మరియు రాజైన తానును ఆయన మంత్రులును ఆజ్ఞ ఇయ్యగా –ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పు కొని పశ్చాత్తప్తుడై మనము లయముకాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులుగాని యెద్దులుగాని గొఱ్ఱెలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు,౹ మనుష్యులందరు తమ దుర్మార్గములను విడిచి తాముచేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.౹ ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను. యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని –యెహోవా, నేను నా దేశమం దుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందు గానే తర్షీషునకు పారిపోతిని.౹ నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపుమని యెహోవాకు మనవి చేసెను.౹ అందుకు యెహోవా–నీవు కోపించుట న్యాయమా? అని యడిగెను.౹ అప్పుడు యోనా ఆ పట్టణములోనుండి పోయి దాని తూర్పుతట్టున బసచేసి అచ్చట పందిలి యొకటి వేసికొని —పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని యుండగా దేవుడైన యెహోవా సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగినశ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకుపైగా నీడ యిచ్చునట్లు చేసెను; ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను.౹ మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను.౹ మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి–బ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను.౹ అప్పుడు దేవుడు–ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా–ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను.౹ అందుకు యెహోవా–నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే;౹ అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులునుగల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను. యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలో షోమ్రోనునుగూర్చియు యెరూషలేమునుగూర్చియు దర్శనరీతిగా మోరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సకల జనులారా, ఆలకించుడి, భూమీ, నీవును నీలో నున్న సమస్తమును చెవి యొగ్గి వినుడి; ప్రభువగు యెహోవా మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు, పరిశుద్ధాలయములోనుండి ప్రభువు మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.౹ ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమియొక్క ఉన్నతస్థలములమీద నడువబోవుచున్నాడు.౹ ఆయన నడువగా అగ్నికిమైనము కరుగునట్లు పర్వతములు కరిగి పోవును, లోయలు విడిపోవును, వాటముమీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును,౹ యాకోబు సంతతి చేసిన తిరుగుబాటునుబట్టియు, ఇశ్రాయేలు సంతతివారి పాపములనుబట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతివారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనేగదా; యూదావారి ఉన్నతస్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా? కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్లకుప్పవలె చేసెదను, ద్రాక్షచెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను, దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడురాళ్లను లోయలో పారబోసెదను;౹ దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును, అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడుచేతును, అది వేశ్యయై సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగుదాని జీతముగా మరల ఇయ్యబడును.౹ దీని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను, ఏమియులేకుండ దిగం బరినై నక్కలు అరచునట్లు అరచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను.౹ దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యూదాకు తగిలియున్నవి, నా జనుల గుమ్మములవరకు యెరూషలేమువరకు అవి వచ్చియున్నవి.౹ గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు; అచ్చట ఎంత మాత్రమును ఏడ్వవద్దు; బేత్లెయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని.౹ షాఫీరు నివాసీ, దిగంబరివై అవమానమునొంది వెళ్లిపొమ్ము; జయనానువారు బయలుదేరక నిలిచిరి, ప్రలాపము బేతేజెలులో మొదలుపెట్టి జరుగుచున్నది.౹ మారోతువారు తాము పోగొట్టుకొనిన మేలునుబట్టి బాధ నొందుచున్నారు ఏలయనగా యెహోవా యొద్దనుండి కీడు దిగి యెరూషలేము పట్టణద్వారము మట్టుకువచ్చెను.౹ లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుఱ్ఱములను కట్టుడి; ఇశ్రాయేలువారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమకారణముగా ఉండును.౹ మోరెషెత్గతు విషయములో మీరు విడుదలకై–కోలు ఇయ్యవలసివచ్చును, అక్జీబు ఇండ్లు ఇశ్రాయేలురాజును మోసపుచ్చునవై యుండును.౹ మారేషా నివాసీ, నీకు హక్కు దారుడగు ఒకని నీయొద్దకు తోడుకొని వత్తురు, ఇశ్రాయేలీయులలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు.౹ సీయోనూ, నీకు ప్రియులగువారు నీయొద్ద నుండకుండ పట్టబడియున్నారు; నీ తల బోడిచేసికొనుము, బోరువగద్దవలె నీ బోడితనము కనుపరచుకొనుము. మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములోనున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు.౹ వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు.౹ కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా— గొప్పఅపాయ కాలమువచ్చుచున్నది. దాని క్రిందనుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడువలేకుండునంతగాను ఈ వంశమునకు కీడుచేయనుద్దేశించుచున్నాను.౹ ఆ దినమున జనులు మిమ్మునుగురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా–మనము బొత్తిగా చెడిపోయి యున్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చియున్నాడనియు, మనయొద్ద నుండకుండ ఆయన దానిని తీసివేసెనే యనియు, మన భూములను తిరుగబడినవారికి ఆయన విభజించియున్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొను చున్నట్లు జనులు చెప్పుకొందురు.౹ చీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలుపొందునట్లు నూలు వేయువాడొకడును ఉండడు.౹ మీరు దీని ప్రవచింప వద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపనియెడల అవమానము కలుగక మానదు.౹ యాకోబు సంతతివారని పేరు పెట్టబడినవారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గి పోయెనా? యీ క్రియలు ఆయనచేత జరిగెనా? యథా ర్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా? ఇప్పుడేగదా నా జనులు శత్రువులైరి; నిర్భయముగా సంచరించువారిని చూచి వారు కట్టుపంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకొందురు.౹ వారికిష్టమైన యిండ్లలోనుండి నా జనులయొక్క స్త్రీలను మీరు వెళ్లగొట్టుదురు, వారి బిడ్డల యొద్దనుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడునులేకుండ మీరు ఎత్తికొని పోవుదురు.౹ ఈ దేశము మీ విశ్రాంతిస్థలముకాదు; మీరు లేచి వెళ్లి పోవుడి, మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్రక్రియలు జరిగించితిరి.౹ వ్యర్థమైన మాటలు పలుకుచు, అబద్ధికుడై ద్రాక్షారసమునుబట్టియు మద్యమునుబట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చినయెడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును. యాకోబు సంతతీ, తప్పక నేను మిమ్మునందరిని పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించినవారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొఱ్ఱెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేతస్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు.౹ ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగాపోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవావారికి నాయకుడుగా ఉండును. నేనీలాగు ప్రకటించితిని–యాకోబు సంతతియొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి; న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా.౹ అయినను మేలు నసహ్యించుకొని కీడుచేయ నిష్టపడుదురు, నా జనుల చర్మము ఊడదీసి వారి యెముకలమీది మాంసము చీల్చుచుందురు.౹ నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి యెముకలను విరిచి, ఒకడు కుండలోవేయు మాంసమును ముక్కలుచేయునట్టు బానలోవేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగులగొట్టియున్నారు.౹ వారు దుర్మార్గతననుసరించి నడుచుకొనియున్నారు గనుక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండ తన్ను మరుగుచేసికొనును.౹ ఆహారము నమలుచు, సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టనియెడల అతనిమీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలనుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా –మీకు దర్శనము కలుగకుండ రాత్రికమ్మును, సోదె చెప్పకుండ మీకు చీకటి కలుగును; ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమించును, పగలు చీకటిపడును అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునొందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తర మియ్యకుండుట చూచి నోరు మూసి కొందురు.౹ నేనైతే యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనైయున్నాను.౹ యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి.౹ నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు. దుష్ట త్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు.౹ జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదని యనుకొందురు.౹ కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును. అంత్యదినములలో యెహోవామందిరపర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.౹ కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి —సీయోనులోనుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములోనుండి యెహోవా వాక్కును బయలు వెళ్లును; యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తనమార్గములవిషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు.౹ ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు, జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.౹ ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవా మాట యిచ్చియున్నాడు.౹ సకల జనములు తమతమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించు కొందుము. ఆ దినమున నేను కుంటివారిని పోగుచేయుదును, అవతలకు వెళ్లగొట్టబడినవారిని బాధింపబడినవారిని సమకూర్చుదును; ఇదే యెహోవా వాక్కు.౹ కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్లగొట్టబడినవారిని బలమైన జనముగాను నేను చేతును, యెహోవా సీయోను కొండయందు ఇప్పటినుండి శాశ్వతకాలమువరకు వారికి రాజుగా ఉండును.౹ మందలగోపురమా, సీయోను కుమార్తె పర్వతమా,మునుపటిలాగున యెరూషలేము కుమార్తెమీద నీకు ప్రభుత్వము కలుగును;౹ నీవెందుకు కేకలువేయు చున్నావు? నీకు రాజు లేకపోవుటచేతనే నీ ఆలోచనకర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? సీయోను కుమారీ, ప్రసూతి స్త్రీవలెనే నీవు వేదనపడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురమువరకు నీవు వెళ్లుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలోనుండి నిన్ను విమోచించును.౹ మనము చూచుచుండగా–సీయోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీమీదికి కూడివచ్చియున్నారు.౹ కళ్లములో ఒకడు పనలు కూర్చునట్టు యెహోవావారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలిసికొనకున్నారు, ఆయన ఆలోచనవారు గ్రహింపకున్నారు.౹ సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతి ష్ఠించుదును. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము; శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కఱ్ఱతో చెంపమీద కొట్టుచున్నారు. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.౹ కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లనుకనువరకు ఆయన వారిని అప్పగించును, అప్పుడు ఆయన సహోదరులలో శేషించినవారును ఇశ్రాయేలీయులతోకూడ తిరిగి వత్తురు.౹ ఆయన నిలిచి యెహోవా బలముపొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమునుబట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమ్యంతములవరకు ప్రబలుడగును,౹ ఆయన సమాధానమునకు కారకుడగును, అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని నెదిరించుటకు మేము ఏడుగురు గొఱ్ఱెలకాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము.౹ వారు అష్షూరు దేశమును, దాని గుమ్మములవరకు నిమ్రోదు దేశమును ఖడ్గముచేత మేపుదురు, అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన యీలాగున మనలను రక్షించును.౹ యాకోబు సంతతిలో శేషించినవారు యెహోవా కురిపించు మంచువలెను, మనుష్యప్రయత్నములేకుండను నరులయోచనలేకుండను గడ్డిమీద పడు వర్షమువలెను ఆయాజనములమధ్యను నుందురు.౹ యాకోబు సంతతిలో శేషించినవారు అన్యజనులమధ్యను అనేక జనములలోను అడవిమృగములలో సింహమువలెను, ఎవడును విడిపింపకుండ లోపలికి చొచ్చి గొఱ్ఱెలమందలను త్రొక్కి చీల్చు కొదమసింహమువలెను ఉందురు.౹ నీ హస్తము నీ విరోధులమీద ఎత్తబడియుండునుగాక, నీ శత్రువులందరు నశింతురు గాక. ఆ దినమున నేను నీలో గుఱ్ఱములుండకుండ వాటిని బొత్తిగా నాశనము చేతును, నీ రథములను మాపివేతును,౹ నీ దేశమందున్న పట్టణములను నాశనముచేతును, నీ కోటలను పడగొట్టుదును, నీలో చిల్లంగివారులేకుండ నిర్మూలముచేతును.౹ మేఘములనుచూచి మంత్రించు వారు ఇక నీలో ఉండరు.౹ నీచేతిపనికి నీవు మ్రొక్కకుండునట్లు చెక్కినవిగ్రహములును దేవతాస్తంభములును నీ మధ్య ఉండకుండ నాశనముచేతును,౹ నీమధ్యను దేవతాస్తంభములుండకుండ వాటిని పెల్లగింతును, నీ పట్టణములను పడగొట్టుదును.౹ నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతికారము చేతును; ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి–నీవువచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము.౹ తన జనులమీద యెహోవాకు వ్యాజ్యెము కలదు, ఆయన ఇశ్రాయేలీయులమీద వ్యాజ్యెమాడుచున్నాడు; నిశ్చలములై భూమికి పునా దులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యెము ఆలకించుడి.౹ నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్మునేలాగు ఆయాసపరచితిని? అది నాతో చెప్పుడి.౹ ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించితిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని.౹ నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబురాజైన బాలాకు యోచించినదానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలువరకును జరిగిన వాటిని, మనస్సునకు తెచ్చు కొనుడి. ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. ఆలకించుడి; యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానముగలవాడు నీ నామమును లక్ష్యపెట్టును, శిక్షనుగూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవిగదా.౹ తప్పుత్రాసును తప్పు రాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా? వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును.౹ కాబట్టి నీవు బాగు పడకుండ నేను నీ పాపములనుబట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును.౹ నీవు భోజనముచేసినను నీకు తృప్తి కానేరదు, నీ వెప్పుడు పస్తుగానే యుందువు, నీవేమైన తీసికొనిపోయినను అది నీకుండదు, నీవు భద్రము చేసికొని కొనిపోవుదానిని దోపుడుకు నేనప్పగింతును.౹ నీవు విత్తనము విత్తుదువుగాని కొయ్యక యుందువు, ఒలీవపండ్లను ద్రాక్షపండ్లను త్రొక్కుదువుగాని తైలము పూసికొనకయు ద్రాక్షారసము పానముచేయకయు ఉందువు.౹ ఏలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడల నాచరించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటి ననుసరించుచు వారి యోచనలనుబట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోవుచున్నాను. వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి ఆలాగే యున్నది. ద్రాక్షపండ్లగెల యొకటియు లేకపోయెను, నా ప్రాణమునకిష్టమైన యొక క్రొత్త అంజూరపుపండైనను లేకపోయెను.౹ భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే; ప్రతిమనుష్యుడును కిరాతుడై తన సహోదరునికొరకు వలలను ఒగ్గును.౹ రెండు చేతులతోను కీడుచేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆలాగునవారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు.౹ వారిలో మంచివారు ముండ్లచెట్టువంటివారు, వారిలో యథార్థవంతులు ముండ్లకంచెకంటెను ముండ్లు ముండ్లుగా నుందురు, నీ కాపరుల దినము నీవు శిక్షనొందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు.౹ స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.౹ కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు. అయినను యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.౹ నా శత్రువా, నామీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను, తిరిగి లేతును; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును.౹ నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యెమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను.౹ నా శత్రువు దాని చూచును. —నీ దేవుడైన యెహోవా యెక్కడనని నాతో అనినది అవమానము నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును.౹ నీ గోడలు మరల కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును.౹ ఆ దినమందు అష్షూరుదేశమునుండియు, ఐగుప్తుదేశపు పట్టణములనుండియు, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసునదివరకు ఉన్న ప్రదేశమునుండియు, ఆయా సముద్రములమధ్యదేశములనుండియు, ఆయా పర్వతములమధ్యదేశములనుండియు జనులు నీ యొద్దకు వత్తురు.౹ అయితే దేశనివాసులు చేసిన క్రియలనుబట్టి దేశము పాడగును. నీ చేతికఱ్ఱ తీసికొని నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపువారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు.౹ ఐగుప్తుదేశములోనుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరతును.౹ అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంత కొంచెమని సిగ్గుపడి నోరు మూసి కొందురు. వారి చెవులు చెవుడెక్కిపోవును.౹ సర్పములాగున వారు మన్ను నాకుదురు, భూమిమీద ప్రాకుపురుగులవలె తమ యిరవులలోనుండి వణకుచు ప్రాకి వత్తురు, మన దేవుడైన యెహోవాయొద్దకు భయపడుచు వత్తురు, నిన్నుబట్టి భయము నొందుదురు.౹ తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు.౹ ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.౹ పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్ర హింతువు. నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషువాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.౹ యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.౹ ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన యెండిపోజేయును, బాషానును కర్మెలును వాడిపోవును లెబానోను పుష్పము వాడిపోవును.౹ ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.౹ ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.౹ యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును.౹ ప్రళయ జలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలముచేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును,౹ యెహోవానుగూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును.౹ ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలె కాలిపోవుదురు.౹ నీనెవే, యెహోవా మీద దురాలోచనచేసి వ్యర్థమైనవాటిని బోధించినవాడొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు.౹ యెహోవా సెలవిచ్చునదేమనగా–వారు విస్తారజనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లువారు కోయబడి నిర్మూల మగుదురు; నేను నిన్ను బాధ పరచితినే, నేను నిన్నిక బాధపెట్టను.౹ వారి కాడిమ్రాను నీమీద ఇక మోపకుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును.౹ నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చునదేమనగా–నీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టక యుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమేగాని పోతపోసిన ప్రతిమయేగాని యొకటియులేకుండ అన్నిటిని నాశనముచేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను.౹ సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను. లయకర్త నీమీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలికాయుము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము,౹ దోచుకొనువారు వారిని దోపుడుసొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రాయేలీయులకువలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును.౹ ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయెను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొనియున్నారు, ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి, సరళదారుమయమైన యీటెలు ఆడుచున్నవి;౹ వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒక దానిమీద నొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీలవలె కనబడుచున్నవి, మెరుపులవలె అవి పరుగెత్తుచున్నవి,౹ రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసికొనగా వారు నడుచుచు పడిపోవుదురు, ప్రాకారమునకు పరుగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు.౹ నదులదగ్గరనున్న గుమ్మములు తెరువబడుచున్నవి, నగరుపడిపోవుచున్నది.౹ నిర్ణయమాయెను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు.౹ కట్టబడినప్పటినుండి నీనెవె పట్టణము నీటికొలనువలె ఉండెను; దాని జనులు పారిపోవు చున్నారు; —నిలువుడి నిలువుడి అనిపిలిచినను తిరిగి చూచువాడొకడును లేడు.౹ వెండి కొల్లపట్టుడి, బంగారము కొల్లపట్టుడి, అది సకలవిధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది, అవి లెక్కలేక యున్నవి.౹ అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్లు వణకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి.౹ సింహముల గుహ యేమాయెను? సింహపుపిల్లల మేతస్థలమేమాయెను? ఎవరును బెదరింపకుండ సింహమును ఆడుసింహమును సింహపు పిల్లలును తిరుగులాడు స్థలమేమాయెను? తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడుసింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు, తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పెట్టిన యెరతోను నింపిన సింహమేమాయెను? నేను నీకు విరోధినై యున్నాను, వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను, కత్తి నీ కొదమ సింహములను మ్రింగివేయును, నీకిక దొరకకుండ భూమిలోనుండి నీవు పట్టుకొనిన యెరను నేను తీసివేతును, నీ దూతల శబ్దము ఇక వినబడదు; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ; అది ఎడతెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది.౹ సారధియొక్క చబుకు ధ్వనియు చక్రములధ్వనియు గుఱ్ఱముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథములధ్వనియు వినబడుచున్నవి.౹ రౌతులు వడిగా పరుగెత్తుచున్నారు, ఖడ్గములు తళతళలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి, చాలమంది హతమవుచున్నారు; చచ్చినవారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు; పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు.౹ చక్కనిదానవై వేశ్యవై చిల్లంగి తనమందు జ్ఞానముగల దానవై జారత్వముచేసి జనాంగములమీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసినదానా,౹ నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే–నేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖముమీద కెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును.౹ పదిమంది యెదుట నీమీద మాలిన్యమువేసి నిన్ను అవమానపరచెదను.౹ అప్పుడు నిన్ను చూచువారందరు నీయొద్ద నుండి పారిపోయి–నీనెవె పాడైపోయెనే, దానికొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు.౹ సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసికొని, బహుజనములచేత చుట్టబడి నైలునది దగ్గర నుండిన నోఅమోను పట్టణముకంటె నీవు విశేషమైన దానవా? కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులై యుండిరి.౹ అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకువేసి కొట్టి చంపిరి, దాని ఘనులమీద చీట్లువేసి దాని ప్రధానుల నందరిని సంకెళ్లతో బంధించిరి.౹ నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు.౹ అయితే నీ కోటలన్నియు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లవలె ఉన్నవి; ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చినవానినోట పడును;౹ నీ జనులు స్త్రీలవంటివారైరి, నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవునుల అడ్డకఱ్ఱలు తీయబడియున్నవి, అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది.౹ ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము, నీ కోటలను బలపరచుము, జిగట మంటిలోనికి దిగి యిటుకల బురదను త్రొక్కుము, ఆవములను సిద్ధపరచుము.౹ అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనముచేయును, గొంగళిపురుగు తినివేయురీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళిపురుగులంత విస్తారముగాను మిడుతలంత విస్తారముగాను ఉండుము.౹ నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రములకంటె ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి యెగిరిపోయెను.౹ నీవు ఏర్పరచిన శూరులు మిడుతలంత విస్తారముగా నున్నారు, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగులవలె నున్నారు. ఎండకాయగా అవి యెగిరి పోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికిని తెలియదు.౹ అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతములమీద చెదరి పోయిరి, వారిని సమకూర్చువాడొకడును లేడు.౹ నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు, జనులందరు ఎడతెగక నీచేత హింసనొందిరి, నిన్నుగూర్చిన వార్త వినువారందరు నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. ప్రవక్తయగు హబక్కూకునొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు.౹ నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.౹ అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తి హీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది.౹ అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు.౹ ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను.౹ వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు.౹ వారి గుఱ్ఱములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రియందు తిరుగులాడు తోడేళ్లకంటెను అవి చురుకైనవి; వారి రౌతులు దూరమునుండి వచ్చి తటాలున జొరబడుదురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లువారు పరుగులెత్తి వత్తురు.౹ వెనుక చూడకుండ బలాత్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు.౹ రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు.౹ తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలికొట్టుకొని పోవునట్లువారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు.౹ యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణమునొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయ దుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.౹ నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఏలికలేని చేపలతోను ప్రాకుపురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి.౹ వాడు గాలమువేసి మానవులనందరిని గుచ్చి లాగి యున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులువేయుచున్నాడు.౹ కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్న వని వాడు తన వలకు బలులనర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు.౹ వాడు ఎల్లప్పుడును తన వలలోనుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికిని మానకుండ వాడు జనములను హతము చేయుచుండవలెనా? ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలముమీదను గోపురముమీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా యెహోవా నాకీలాగు సెలవిచ్చెను —చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము.౹ ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.౹ వారు యథార్థపరులుకాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును.౹ మరియు ద్రాక్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకలజనములను వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును.౹ తనదికాని దాని నాక్రమించి యభివృద్ధినొందినవానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ; —వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరు ఇతనినిబట్టి ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా.౹ వడ్డి కిచ్చువారు హఠాత్తుగా నీమీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు.౹ బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి యున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యనుబట్టియు బలాత్కారమునుబట్టియు నిన్ను కొల్లపెట్టుదురు. తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ.౹ నీవు చాలమంది జనములను నాశనముచేయుచు నీమీద నీవే నేర స్థాపనచేసియున్నావు, నీ దురాలోచనవలన నీ యింటి వారికి అవమానము తెచ్చియున్నావు.౹ గోడలలోని రాళ్లు మొఱ్ఱపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తర మిచ్చుచున్నవి. నరహత్య చేయుటచేత పట్టణమును కట్టించువారికి శ్రమ; దుష్టత్వము జరిగించుటచేత కోటను స్థాపించు వారికి శ్రమ.౹ జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు; వ్యర్థమైనదానికొరకు కష్టపడి జనులు క్షీణించుదురు; ఇది సైన్యములకధిపతియగు యెహోవా చేతనే యగునుగదా.౹ ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మాహాత్మ్యమునుగూర్చిన జ్ఞానముతో నిండియుండును. తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ.౹ ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు; నీవును త్రాగి నీ మానము కనుపరచు కొందువు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీకియ్యబడును, అవమానకరమైన వమనము నీ ఘనతమీదపడును.౹ లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీమీదికే వచ్చును, పశువులను బెదరించిన బెదరు నీమీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యనుబట్టియు జరిగిన బలాత్కారమునుబట్టియు ఇది సంభవించును. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించినదానియందు నమ్మిక యుంచుటవలన ప్రయోజన మేమి? అబద్ధములు బోధించు పోతవిగ్రహములయందు నమ్మిక యుంచుటవలన ప్రయోజనమేమి? కఱ్ఱనుచూచి —మేలుకొమ్మనియు, మూగరాతిని చూచి–లెమ్మనియు చెప్పువానికి శ్రమ; అది ఏమైన బోధింపగలదా? అది బంగారముతోను వెండితోను పూతపూయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు.౹ అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. (వాద్యములతో పాడదగినది) యెహోవా, నిన్నుగూర్చిన వార్త విని నేను భయ పడుచున్నాను యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధదేవుడు పారానులోనుండి వేంచేయు చున్నాడు. (సెలా. ) ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తములనుండి కిరణములు బయలువెళ్లుచున్నవి అచ్చట ఆయన బలము దాగియున్నది. ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగు దురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరి గించువాడు. కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణ కెను. యెహోవా, నదులమీద నీకు కోపము కలిగినందుననా నదులమీద నీకు ఉగ్రత కలిగినందుననా సముద్రముమీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గుఱ్ఱములను కట్టుకొని రక్షణార్థమైన రథములమీద ఎక్కి వచ్చుచున్నావు? విల్లు వరలోనుండి తీయబడియున్నది నీ వాక్కుతోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచియున్నావు (సెలా.) భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పై కెత్తును. నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. బహు రౌద్రముకలిగి నీవు భూమిమీద సంచరించు చున్నావు మహోగ్రుడవై జనములను అణగద్రొక్కుచున్నావు నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలు దేరుచున్నావు దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండవారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. (సెలా.) బీదలను రహస్యముగా మ్రింగివేయవలెనని ఉప్పొం గుచు నన్ను పొడిచేయుటకై తుపానువలె వచ్చు యోధుల తలలలో రాజుయొక్క ఈటెలను నాటుచున్నావు. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచు నున్నావు నీ గుఱ్ఱములు మహాసముద్ర జలరాసులను త్రొక్కును. నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినముకొరకు కనిపెట్టవలసి యున్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా యెముకలు కుళ్లిపోవుచున్నవి నా కాళ్లు వణకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును. యూదారాజగు ఆమోను కుమారుడైన యోషీయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఏమియు విడవకుండ భూమిమీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను; ఇదే యెహోవా వాక్కు.౹ మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసెదను; ఆకాశపక్షులనేమి సముద్రమత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసెదను; భూమిమీద ఎవరునులేకుండ మనుష్యజాతిని నిర్మూలము చేసెదను; ఇదే యెహోవా వాక్కు.౹ నా హస్తమును యూదావారిమీదను యెరూషలేము నివాసులందరిమీదను చాపి, బయలుదేవతయొక్క భక్తులలో శేషించినవారిని, దానికి ప్రతిష్ఠితులగువారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను.౹ మిద్దెలమీద ఎక్కి ఆకాశసమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరునుబట్టియు, బయలుదేవత తమకు రాజను దాని నామమునుబట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.౹ యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయనివారిని నేను నిర్మూలము చేసెదను. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి.౹ యెహోవా యేర్పరచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్యదేశస్థులవలె వస్త్రములు వేసికొనువారినందరిని నేను శిక్షింతును.౹ మరియు ఇండ్ల గడపలు దాటివచ్చి యజమానుని యింటిని మోసముతోను బలాత్కారముతోను నింపువారిని ఆ దినమందు నేను శిక్షింతును.౹ ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదనశబ్దమును, పట్టణపు దిగువభాగమున అంగలార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు.౹ కనానీయులందరు నాశమైరి, ద్రవ్యము సమకూర్చుకొనినవారందరును నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారా, అంగలార్చుడి.౹ ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారై–యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షింతును.౹ వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును, వారు ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపురముండరు, ద్రాక్షతోటలు నాటుదురు గాని వాటి రసమును పానముచేయరు.౹ యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు.౹ ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ము దినము.౹ ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను, ఎత్తయిన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును.౹ జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును, వారి మాంసము పెంటవలె పారవేయబడును.౹ యెహోవా ఉగ్రతదినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వనాశనము చేయబోవుచున్నాడు. సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది.౹ విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి.౹ దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రతదినమున మీరు దాచబడుదురు.౹ గాజాపట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును.౹ సముద్రప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ; ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్నుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా–నీయందు ఒక కాపురస్థుడైననులేకుండ నేను నిన్ను లయముచేతును.౹ సముద్రప్రాంతము గొఱ్ఱెల కాపరులు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును.౹ తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలోనుండి రప్పించగా అచ్చటవారిలో శేషించిన వారికి ఒక స్థలముండును; వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమునవారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు.౹ మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణమాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి.౹ నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించు కొందురు. కాబట్టి ఇశ్రాయేలీయులదేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవావాక్కు ఇదే.౹ వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమునుబట్టి యిది వారికి సంభవించును.౹ జనముల ద్వీపములలో నివసించు వారందరును తమతమ స్థానములనుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును, యెహోవావారికి భయంకరుడుగా ఉండును.౹ కూషీయులారా, మీరును నా ఖడ్గముచేత హతులవుదురు.౹ ఆయన ఉత్తరదేశముమీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనముచేయును; నీనెవె పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన యెడారివలె చేయును.౹ దానిలో పసుల మందలు పండుకొనును; సకలజాతి జంతువులును గుంపులుగా కూడును; గూడబాతులును తుంబోళ్లును వారి ద్వారముల పైకమ్ములమీద నిలుచును; పక్షుల శబ్దములును కిటికీలలో వినబడును; గడపలమీద నాశనము కనుపించును. వారు చేసికొనిన దేవదారు కఱ్ఱపనియంతటిని యెహోవా నాశనము చేయును.౹ –నావంటి పట్టణము మరి యొకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. —అది పాడైపోయెనే, మృగములు పండుకొను స్థలమాయెనే అని దాని మార్గమున పోవువారందరు చెప్పుకొనుచు, ఈసడించుచు పోపొమ్మని చేసైగ చేయుదురు. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ.౹ అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవునియొద్దకు రాదు.౹ దాని మధ్య దాని అధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు.౹ దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతుకులు; దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరతురు.౹ అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు; ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండ ఆయన న్యాయవిధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియు లేదు; అయినను నీతిహీనులు సిగ్గెరుగరు.౹ నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలును పాడగును, ఒకడైన సంచరించకుండ వారి వీధులను పాడుచేసియున్నాను, జనములేకుండను వాటియందెవరును కాపురముండకుండను వారి పట్టణములను లయపరచినవాడను నేనే.౹ దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాసస్థలము సర్వనాశము కాకుండునట్లు, నాయందు భయభక్తులుకలిగి శిక్షకు లోబడుదురని నేననుకొంటిని గాని వారు దుష్‌క్రియలు చేయుటయందు అత్యాశగలవా రైరి.౹ కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా — నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్ని చేత భూమియంతయు కాలిపోవును.౹ అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల నిచ్చెదను.౹ చెదరిపోయినవారై నాకు ప్రార్థనచేయు నా జనులు కూషుదేశపు నదుల అవతలనుండి నాకు నైవేద్యముగా తీసికొని రాబడుదురు.౹ ఆ దినమున నీ గర్వమునుబట్టి సంతోషించువారిని నీలోనుండి నేను వెళ్లగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు, నామీద తిరుగబడి నీవుచేసిన క్రియలవిషయమై నీకు సిగ్గు కలుగదు దుఃఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీమధ్య నుండనిత్తును.౹ ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయములేకుండ విశ్రాంతిగలవారై అన్నపానములు పుచ్చుకొందురు;౹ సీయోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి.౹ తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.౹ ఆ దినమున జనులు మీతో ఇట్లందురు–యెరూషలేమూ, భయపడకుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము;౹ నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమనుబట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.౹ నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానము పొందినవారు.౹ ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచిపేరును కలుగజేసెదను,౹ ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచిపేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు. రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయిద్వారా యూదా దేశముమీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను —సైన్యములకధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా –సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.౹ అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయిద్వారా సెలవిచ్చినదేమనగా –ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా —మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.౹ మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనముచేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానముచేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.౹ కాగా సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.౹ పర్వతములెక్కి మ్రాను తీసికొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను; మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని; ఎందు చేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరు మీ మీ యిండ్లు కట్టుకొనుటకు త్వరపడుటచేతనే గదా.౹ కాబట్టి మిమ్మునుబట్టి ఆకాశపుమంచు కురువకయున్నది, భూమి పండక యున్నది.౹ నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతిపనులన్నిటి విషయములోను క్షామము పుట్టించియున్నాను. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహో జాదాకు కుమారుడును ప్రధానయాజకుడునగు యెహోషు వయు శేషించిన జనులందరును తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనిరి.౹ అప్పుడు యెహోవాదూతయైన హగ్గయి యెహోవా తెలియ జేసిన వార్తనుబట్టి జనులకు ప్రకటించినదేమనగా–నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే యెహోవా వాక్కు.౹ యెహోవా యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుయొక్క మనస్సును, ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును,శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడివచ్చి, రాజైన దర్యావేషుయొక్క యేలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల యిరువది నాలుగవదినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి. ఏడవ నెల యిరువది యొకటవదినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా –నీవు యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనుము –పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు గదా; అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడు చున్నది? దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచు చున్నది గదా.౹ అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–జెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ మీరు ఐగుప్తుదేశములోనుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొనుడి; నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.౹ మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా — ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.౹ నేను అన్యజనులనందరిని కద లింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ — వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ –ఈ కడవరి మందిరముయొక్క మహిమమునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవనెల యిరువది నాల్గవదినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా –సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–యాజకులయొద్ద ధర్మశాస్త్ర విచారణచేయుము.౹ ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపుచెంగున కట్టుకొని, తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏవిధమగు భోజనపదార్థమునైనను ముట్టినయెడల, ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా? యని యాజకులనడుగగా వారు కాదనిరి శవమును ముట్టుటవలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినయెడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరల నడుగగా యాజకులు —అది అపవిత్రమగు ననిరి.౹ అప్పుడు హగ్గయి వారికీలాగు ప్రత్యుత్తరమిచ్చెను–ఈ ప్రజలును ఈ జనులును నా దృష్టికి ఆలాగుననేయున్నారు; వారుచేయు క్రియలన్నియు వారచ్చట అర్పించునవియన్నియు నా దృష్టికి అపవిత్రములు; ఇదే యెహోవా వాక్కు.౹ –ఈ రాతి మీద రాయియుంచి యెహోవా మందిరము కట్టనారం భించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించినదానిని ఆలోచనచేసికొనుడి.౹ నాటనుండి యొకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలు చున్నది; తీసికొనవలెనని ఏబది కొలల తొట్టియొద్దకు ఒకడు రాగా ఇరువదికొలలు మాత్రమే దొరకును.౹ తెగులుతోను కాటుకతోను వడగండ్లతోను మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసియున్నాను; అయినను మీలో ఒకడును తిరిగి నాయొద్దకు రాలేదు; ఇదే యెహోవా వాక్కు.౹ మీరు ఆలోచించుకొనుడి. ఇంతకుముందుగా తొమ్మిదవ నెల యిరువది నాలుగవ దినమునుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటనుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి.౹ కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్షచెట్లయినను అంజూరపుచెట్లయినను దానిమ్మచెట్లయి నను ఒలీవచెట్లయినను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. మరియు ఆ నెల యిరువది నాలుగవదినమున యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా –యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము–ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను.౹ రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.౹ నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవునైన జెరుబ్బాబెలూ, నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసికొని ముద్ర యుంగరముగా చేతును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా –యెహోవా మీపితరులమీద బహుగా కోపించెను.౹ కాబట్టి నీవు వారితో ఇట్లనుము —సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగా–మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ మీరు మీపితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలు–సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మీ దుర్మార్గ తను మీ దుష్‌క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించక పోయిరి; ఇదే యెహోవా వాక్కు.౹ మీపితరు లేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రదుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీపితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి–మన ప్రవర్తననుబట్టియు క్రియలనుబట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి. మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవ త్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవదినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యు డొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱములును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱములును కనబడెను.౹ అప్పుడు–నా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూత–ఇవి ఏమియైనది నేను నీకు తెలియజేతుననెను.౹ అప్పుడు గొంజి చెట్లలో నిలువబడియున్నవాడు–ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను.౹ అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన యెహోవాదూతను చూచి–మేము లోకమంతట తిరుగులాడివచ్చియున్నాము; ఇదిగో లోకులందరు శాంతముకలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పెను.౹ అందుకు యెహోవాదూత — సైన్యములకధిపతియగు యెహోవా, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేముమీదను యూదా పట్టణములమీదను కోపముంచియున్నావే; యిక ఎన్నాళ్లు కనికరింపకయుందువు అని మనవిచేయగా యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను.౹ కాబట్టి నాతో మాటలాడుచున్నదూత నాతో ఇట్లనెను–నీవు ప్రకటన చేయ వలసినదేమనగా–సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు — నేను యెరూషలేము విషయములోను సీయోనువిషయములోను అధికాసక్తి కలిగియున్నాను;౹ నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.౹ కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగా–వాత్సల్యముగలవాడనై నేను యెరూషలేముతట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్టబడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా —ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కనబడెను.౹ — ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడుచున్నదూతనడుగగా అతడు–ఇవి యూదావారిని ఇశ్రాయేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను.౹ యెహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా –వీరేమి చేయబోవుచున్నారని నేనడిగినందుకు ఆయన–ఎవడును తలయెత్తకుండ యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయ పెట్టుటకును, యూదాదేశస్థులనందరిని చెదరగొట్టుటకై వారిమీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను. మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టుకొనిన యొకడు నాకు కనబడెను.౹ నీ వెక్కడికి పోవు చున్నావని నేనతని నడుగగా అతడు–యెరూషలేముయొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచిచూడ బోవుచున్నాననెను.౹ అంతట నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా మరియొక దూత యతనిని ఎదుర్కొనవచ్చెను.౹ రెండవ దూత — పరుగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులును పశువులును విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యౌవనునికి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను.౹ నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దానిమధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు.౹ ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి; ఆకాశపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను; ఇదే యెహోవా వాక్కు.౹ బబులోనుదేశములో నివాసివగు సీయోనూ, అచ్చటనుండి తప్పించుకొని పొమ్ము; ఇదే యెహోవా వాక్కు–.౹ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.౹ నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు; అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.౹ సీయోను నివాసులారా, నేను వచ్చి మీమధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.౹ ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.౹ మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.౹ సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై యుండుడి. మరియు యెహోవాదూతయెదుట ప్రధానయాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.౹ — సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా అని యెహోవాదూత సాతానుతో అనెను.౹ యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడియుండగా దూత దగ్గర నిలిచియున్నవారిని పిలిచి–ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి–నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను.౹ –అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి; యెహోవాదూత దగ్గర నిలుచుండెను.౹ అప్పుడు యెహోవాదూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను.౹ –సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా — నా మార్గములలో నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనినయెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.౹ ప్రధానయాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.౹ యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు ఒక దినము లోగానే నేను ఈ దేశముయొక్క దోషమును పరిహ రింతును;౹ ఆ దినమున ద్రాక్షచెట్లక్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరు ఒకరినొకరు పిలుచుకొనిపోవుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొకని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడు చున్నదని యడుగగా నేను–సువర్ణమయమైన దీపస్తంభమును దానిమీద ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనబడుచున్నవి.౹ మరియు రెండు ఒలీవచెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు ఎడమప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి –నా యేలినవాడా, యిదేమిటియని నాతో మాటలాడుచున్న దూత నడిగితిని.౹ నాతో మాటలాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా యని నన్నడుగగా–నేను–నా యేలినవాడా, నాకు తెలియదంటిని.౹ [6-7] అప్పుడతడు నాతో ఇట్లనెను–జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునుభూమి వగుదువు; —కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును.౹ *** యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను — జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి, అతనిచేతులు ముగించును, అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీయొద్దకు పంపియున్నాడని నీవు తెలిసికొందువు.౹ కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారముచేయు యెహోవాయొక్క యేడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుటచూచి సంతోషించును.౹ దీపస్తంభమునకు ఇరుప్రక్కలనుండు ఈ రెండు ఒలీవచెట్లు ఏమిటివనియు,౹ రెండు బంగారపు కొమ్ములలోనుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలును ఏమిటివనియు నేనతని నడుగగా అతడు నాతో–ఇవేమిటివని నీకు తెలియదా యనెను–నా యేలినవాడా, నాకు తెలియదని నేననగా అతడు–వీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము పోయువారై యున్నారనెను. నేను మరల తేరిచూడగా ఎగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడెను.౹ నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా నేను, —ఇరువైమూరల నిడివియు పదిమూరల వెడల్పునుగల యెగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడు చున్నదంటిని.౹ అందుకతడు నాతో ఇట్లనెను–ఇది భూమియంతటిమీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు; రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు.౹ ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు— నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగలయిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. అప్పుడు నాతో మాటలాడుచున్న దూత బయలు వెళ్లి–నీవు నిదానించి చూచి ఇవతలకు వచ్చునదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా ఇదేమిటియని నేనడిగితిని. అందుకతడు–ఇది కొల, ఇది బయలువెళ్లు తూము అనెను; మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదురని చెప్పెను.౹ అప్పుడు సీసపుబిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న యొక స్త్రీ కనబడెను.౹ అప్పుడతడు–ఇది దోషమూర్తి యని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపుబిళ్లను తూముమీద నుంచెను.౹ నేను మరల తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి; సంకుబుడి కొంగ రెక్కలవంటి రెక్కలు వారికుండెను, గాలి వారి రెక్కలను ఆడించుచుండెను, వారు వచ్చి తూమును భూమ్యాకాశములమధ్యకు ఎత్తి దాని మోసిరి.౹ వీరు ఈ తూమును ఎక్కడికి తీసికొని పోవుదురని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా –షీనారుదేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు; అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠముమీద పెట్టియుంచుదురని అతడు నాకుత్తర మిచ్చెను. నేను మరల తేరిచూడగా రెండు పర్వతములమధ్యనుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను, ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై యుండెను.౹ మొదటి రథమునకు ఎఱ్ఱని గుఱ్ఱములు, రెండవ రథమునకు నల్లని గుఱ్ఱములు,౹ మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱము లుండెను.౹ నా యేలినవాడా, యివేమిటియని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా అతడు నాతో ఇట్లనెను–ఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.౹ నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది; తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును, చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములుగల రథము దక్షిణ దేశములోనికి పోవును.౹ బలమైన గుఱ్ఱములు బయలువెళ్లి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా, —పోయి లోక మందంతట సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతట సంచరించుచుండెను.౹ అప్పుడతడు నన్ను పిలిచి — ఉత్తరదేశములోనికి పోవు వాటిని చూడుము; అవి ఉత్తరదేశమందు నా ఆత్మను నెమ్మది పరచునని నాతో అనెను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా –చెరపట్టబడినవారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబీయా యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషీయా యింట దిగియున్నారు; వారు చేరిన దినముననే నీవు ఆ యింటికిపోయి వారి నడిగి వెండి బంగారములను తీసికొని కిరీటముచేసి ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువతలమీద ఉంచి అతనితో ఇట్లనుము–సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–చిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.౹ అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనా సీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.౹ ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి, హేలెమునకును టోబీయాకును యెదాయాకును జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును.౹ దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలిసికొందురు; మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించినయెడల ఈలాగు జరుగును. రాజైన దర్యావేషు ఏలుబడియందు నాలుగవ సంవత్సరము కిస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగవదినమున బేతేలువారు షెరెజెరును రెగెమ్మెలెకును తమ వారిని పంపి –ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు అయిదవ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరము నొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా –దేశపు జనులందరికిని యాజకులకును నీవీ మాట తెలియజేయవలెను. ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేట అయిదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చి నప్పుడు, నాయందు భక్తికలిగియే ఉపవాసముంటిరా? మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకొంటిరి; మీరు పానము చేసి నప్పుడు స్వప్రయోజనమునకే గదా పానము చేసితిరి.౹ యెరూషలేములోను దాని చుట్టును పట్టణములలోను దక్షిణదేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్నకాలమున పూర్వికులగు ప్రవక్తలద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండవచ్చునా? మరియు యెహోవా వాక్కు జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా –సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చియున్నాడు–సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణా వాత్సల్యములు కనుపరచుకొనుడి.౹ విధవరాండ్రను తండ్రిలేనివారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడుచేయ దలచకుడి.౹ అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండ చెవులు మూసికొనిరి.౹ ధర్మశాస్త్రమును, పూర్వికులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణచేత తెలియజేసిన మాటలను, తాము వినకుండునట్లు హృదయములను కురువిందమువలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్దనుండి మహోగ్రత వారిమీదికి వచ్చెను.౹ కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచి నప్పుడు నేను ఆలకింపను.౹ మరియు వారెరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచినమీదట అందులో ఎవరును సంచరింపకుండ అది పాడగును; ఈలాగునవారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసియున్నారు. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ –సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా —మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషము వహించియున్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించియున్నాను.౹ యెహోవా సెలవిచ్చునదేమనగా–నేను సీయోను నొద్దకు మరల వచ్చి, యెరూషలేములో నివాసముచేతును, సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధపర్వతమనియు పేర్లు పెట్టబడును.౹ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపెట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు.౹ ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోను ఆడుపిల్లలతోను నిండియుండును.౹ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఆ దినములందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా? యిదే యెహోవా వాక్కు.౹ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–తూర్పు దేశములోనుండియు పడమటి దేశములోనుండియు నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులైయుందురు, నేను వారికి దేవుడనై యుందును; ఇది నీతి సత్యములనుబట్టి జరుగును.౹ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు నదేమనగా–సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాదివేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకొనుడి.౹ ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకక యుండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను, తన పనిమీద పోవువానికి శత్రుభయముచేత నెమ్మది లేకపోయెను; ఏలయనగా ఒకరిమీదికొకరిని నేను రేపుచుంటిని.౹ అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను.౹ సమాధానసూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశమునుండి మంచు కురియును, ఈ జనులలో శేషించినవారికి వీటినన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ యూదావారలారా, ఇశ్రాయేలువారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై యుంటిరో ఆలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును; భయపడక ధైర్యము తెచ్చుకొనుడి.౹ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మీపితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడుచేయనుద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలుచేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి.౹ మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.౹ తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణముచేయ నిష్టపడకూడదు, ఇట్టివన్నియు నాకు అసహ్యములు; ఇదే యెహోవా వాక్కు. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–నాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి.౹ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–జనములును అనేక పట్టణముల నివాసులును ఇంకను వత్తురు.౹ ఒక పట్టణపువారు మరియొక పట్టణపువారి యొద్దకు వచ్చి–ఆలస్యముచేయక యెహోవాను శాంతిపరచుటకును, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు–మేమును వత్తుమందురు.౹ అనేక జనములును బలముగల జనులును యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును, యెహోవాను శాంతిపరచుటకును వత్తురు.౹ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని–దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు. హద్రాకు దేశమునుగూర్చియు దమస్కు పట్టణమునుగూర్చియు వచ్చిన దేవోక్తి ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దును అనుకొని యున్న హమాతునుగూర్చియు, జ్ఞాన సమృద్ధిగల తూరు సీదోనులనుగూర్చియు అది వచ్చెను.౹ తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.౹ యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతి కప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును.౹ అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణకును, ఎక్రోనుపట్టణము తాను నమ్ము కొనినది అవమానము నొందగా చూచి భీతినొందును, గాజారాజులేకుండపోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును.౹ అష్డోదులో సంకరజనము కాపురముండును, ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసెదను.౹ వారి నోటనుండి రక్తమును వారికను తినకుండ వారి పండ్లనుండి హేయమైన మాంసమును నేను తీసివేసెదను. వారును శేషముగా నుందురు, మన దేవునికి వారు యూదా వారిలో పెద్దలవలె నుందురు, ఎక్రోనువారును యెబూసీయులవలె నుందురు.౹ నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరముమీదికి రాకుండను దానిని కాపాడుకొనుటకై నేనొక దండు పేటను ఏర్పరచెదను. సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.౹ ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములులేకుండ చేసెదను, యుద్ధపు విల్లులేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును.౹ మరియు నీవు చేసిన నిబంధన రక్తమునుబట్టి తాము పడిన నీరులేని గోతిలోనుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించెదను.౹ బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను.౹ యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సీయోను కుమారులను మీమీదికి రేపుచున్నాను.౹ యెహోవావారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపువలె విడువబడును, ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణదిక్కునుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలు దేరును.౹ సైన్యములకు అధిపతియగు యెహోవావారిని కాపాడును గనుక వారు భక్షించుచు, వడిసెలరాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు, ద్రాక్షారసము త్రాగువారివలె బొబ్బలిడుచు, బలిపశురక్త పాత్రలును బలిపీఠపు మూలలును నిండునట్లు రక్తముతో నిండియుందురు.౹ నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును.౹ వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు; ధాన్యముచేత యౌవనులును క్రొత్త ద్రాక్షారసముచేత యౌవన స్త్రీలును వృద్ధి నొందుదురు. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును.౹ గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొఱ్ఱెలమంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధనొందిరి.౹ నా కోపాగ్ని మండుచు కాపరులమీద పడును, మేకలను నేను శిక్షించెదను, సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వములవంటివారినిగా చేయును.౹ వారిలోనుండి మూల రాయి పుట్టును, మేకును యుద్ధపువిల్లును వారిచేత కలుగును, బాధించువాడు వారిలోనుండి బయలుదేరును,౹ వారు యుద్ధముచేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురవలె ఉందురు. యెహోవావారికి తోడై యుండును గనుక వారు యుద్ధముచేయగా గుఱ్ఱములను ఎక్కువారు సిగ్గునొందుదురు.౹ నేను యూదా వారిని బలశాలురుగా చేసెదను, యోసేపు సంతతివారికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలము ఇచ్చెదను, నేను వారియెడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు.౹ ఎఫ్రా యిమువారు బలాఢ్యులవంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించునట్లువారు మనస్సున ఆనందింతురు, వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు, యెహోవానుబట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు.౹ నేను వారిని విమోచించియున్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను,మునుపు విస్తరించినట్లువారు విస్తరించుదురు.౹ అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసికొందురు, వారును వారి బిడ్డలును సజీవులై తిరిగి వత్తురు,౹ ఐగుప్తు దేశములోనుండి వారిని మరల రప్పించి అష్షూరు దేశములోనుండి సమకూర్చి, యెక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికిని లెబానోను దేశము లోనికిని వారిని తోడుకొని వచ్చెదను.౹ యెహోవా దుఃఖసముద్రమునుదాటి సముద్రతరంగములను అణచి వేయును, నైలునదియొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు.౹ నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు; ఇదే యెహోవా వాక్కు. లెబానోనూ, అగ్నివచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయునట్లు నీ ద్వారములను తెరువుము.౹ దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను; సరళవృక్షములారా, అంగలార్చుడి, చిక్కని అడవి నరక బడెను; సింధూరవృక్షములారా, అంగలార్చుడి.౹ గొఱ్ఱె బోయల రోదన శబ్దము వినబడుచున్నది, ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయెను. కొదమ సింహముల గర్జనము వినబడుచున్నది, ఏలయనగా యొర్దానుయొక్క మహారణ్యము పాడైపోయెను.౹ నా దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–వధకేర్పడిన గొఱ్ఱెల మందను మేపుము.౹ వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని యనుకొందురు; వాటిని అమ్మినవారు— మాకు బహు ద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు; వాటిని కాయువారు వాటి యెడల కనికరము చూపరు.౹ ఇదే యెహోవా వాక్కు— నేనికను దేశనివాసులను కనికరింపక ఒకరిచేతికి ఒకరిని, వారి రాజుచేతికి వారినందరిని అప్పగింతును, వారు దేశమును, నాశనముచేయగా వారి చేతిలోనుండి నేనెవరిని విడిపింపను.౹ కాబట్టి నేను సౌందర్యమనునట్టియు బంధమనునట్టియు రెండు కఱ్ఱలు చేతపట్టుకొని వధకేర్పడిన గొఱ్ఱెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచువచ్చితిని.౹ ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి.౹ కాబట్టి నేనికను మిమ్మును కాపుకాయను; చచ్చునది చావవచ్చును, నశించునది నశింపవచ్చును, మిగిలినవి యొకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమను కఱ్ఱను తీసికొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగముచేయునట్లు దానిని విరిచితిని.౹ అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని యున్న గొఱ్ఱెలు తెలిసికొనెను.౹ –మీకు అనుకూలమైనయెడల నా కూలి నాకియ్యుడి, లేనియెడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి తూచి యిచ్చిరి.౹ యెహోవా–యెంతో అబ్బురముగా వారు నా కేర్పరచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసికొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని.౹ అప్పుడు బంధమనునట్టి నా రెండవ కఱ్ఱను తీసికొని యూదావారికిని ఇశ్రాయేలువారికిని కలిగిన సహోదరబంధమును భంగము చేయునట్లు దాని విరిచితిని. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా— ఇప్పుడు బుద్ధిలేని యొక కాపరి పనిముట్లను తీసికొమ్ము.౹ ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోవుచున్నాను; అతడు నశించుచున్న గొఱ్ఱెలను కనిపెట్టడు, చెదరిపోయినవాటిని వెదకడు, విరిగిపోయినదాని బాగుచేయడు, పుష్టిగా ఉన్నదాని కాపుకాయడు గాని క్రొవ్వినవాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలగా చేయుచుండును.౹ మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ; అతని చెయ్యియు కుడికన్నును తెగవేయబడును; అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును. దేవోక్తి ఇశ్రాయేలీయులనుగూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా –నేను యెరూషలేమును చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును.౹ ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైనజనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయ పడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు.౹ ఇదే యెహోవా వాక్కు–ఆ దినమందు నేను గుఱ్ఱములన్నిటికిని బెదరును, వాటిని ఎక్కువారికి వెఱ్ఱిని పుట్టింతును, యూదావారిమీద నా దృష్టియుంచి జనముల గుఱ్ఱములన్నిటికిని అంధత్వము కలుగజేతును.౹ అప్పుడు యెరూషలేములోని అధికారులు–యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుటవలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పు కొందురు.౹ ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతును, వారు నలుదిక్కులనున్న జనములనందరిని దహించుదురు. యెరూషలేమువారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు.౹ మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులును, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదావారిమీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును.౹ ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్ష కుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతివారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవాదూతలవంటి వారుగాను ఉందురు.౹ ఆ కాలమున యెరూషలేముమీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింపజేయ పూనుకొనెదను.౹ దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివా సులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృిష్టయుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలా పింతురు.౹ మెగిద్దోను లోయలో హదద్రిమ్మోనుదగ్గర జరిగిన ప్రలాపమువలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును.౹ దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,౹ లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,౹ మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతివారికొరకును, యెరూషలేము నివాసులకొరకును ఊట యొకటి తియ్యబడును.౹ ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు–ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకమురాకుండ దేశములోనుండి నేను వాటిని కొట్టివేతును; మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములోలేకుండచేతును.౹ ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకొనినయెడల వానిని కన్న తలి దండ్రులు–నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే; నీవికను బ్రదుకతగదని వానితో చెప్పుదురు; వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తలిదండ్రులే వాని పొడుచుదురు.౹ ఆ దినమున తాము పలికిన ప్రవచనములనుబట్టియు, తమకు కలిగిన దర్శనమునుబట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు.౹ వాడు–నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకనియొద్ద సేద్యపు పని చేయువాడనై యున్నాననును.౹ –నీచేతులకు గాయములేమని వారడుగగా వాడు–ఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఖడ్గమా, నా గొఱ్ఱెల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు–గొఱ్ఱెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు.౹ దేశమంతట జనులలో రెండు భాగములవారు తెగవేయబడి చత్తురు, మూడవభాగము వారు శేషింతురు.౹ ఆ మూడవభాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆల కింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇదిగో యెహోవా దినమువచ్చుచున్నది, అందు మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును.౹ ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.౹ అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధముచేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.౹ ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పుతట్టునకును పడమటితట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.౹ కొండలమధ్య కనబడులోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు, అప్పుడు నీతోకూడ పరిశుద్ధులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.౹ యెహోవా, ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును.౹ ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రికాదు; అస్తమయకాలమున వెలుతురు కలుగును.౹ ఆ దినమున జీవజలములు యెరూషలేములోనుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాలమందును ఆలాగుననే జరుగును.౹ యెహోవా సర్వలోకమునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.౹ యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూల గుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొనవరకును, హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగులవరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపుతట్టుననున్న రిమ్మోనువరకు దేశమంతయు మైదానముగా ఉండును,౹ పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు.౹ మరియు యెహోవా తెగుళ్లుపుట్టించి యెరూషలేముమీద యుద్ధము చేసిన జనములనందరిని ఈలాగున మొత్తును; వారు నిలిచియున్నపాటుననే వారి దేహములు కుళ్లిపోవును, వారి కన్నులు కనుతొఱ్ఱలలోఉండియే కుళ్లిపోవును వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్లిపోవును.౹ ఆ దినమున యెహోవావారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరు ఒకరి కొకరు విరోధులై ఒకరిమీదనొకరు పడుదురు.౹ యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టు నున్న అన్యజనులందరి ఆస్తియంతయు విస్తారముగా కూర్చబడును.౹ ఆలాగుననే గుఱ్ఱములమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను గార్దభములమీదను దండుపాళెములో ఉన్న పశువులన్నిటిమీదను తెగుళ్లుపడును.౹ మరియు యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషించినవారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.౹ లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరిమీద వర్షము కురువకుండును.౹ ఐగుప్తీయుల కుటుంబపువారు బయలుదేరకయు రాకయు ఉండినయెడల వారికి వర్షము లేకపోవును, పర్ణశాలపండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవావారిని మొత్తును.౹ ఐగుప్తీయులకును, పర్ణ శాలపండుగ ఆచరించుటకు రాని అన్యజనులకందరికిని రాగల శిక్ష యిదే.౹ ఆ దినమున గుఱ్ఱములయొక్క కళ్లెములమీద–యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును; యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్లెములవలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును.౹ యెరూషలేమునందును యూదాదేశమందును ఉన్న పాత్రలన్నియు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును; బలిపశువులను వధించువారందరును వాటిలో కావలసినవాటిని తీసికొని వాటిలో వండు కొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు. ఇశ్రాయేలీయులనుగూర్చి మలాకీద్వారా పలుకబడిన యెహోవా వాక్కు.౹ యెహోవా సెలవిచ్చునదేమనగా —నేను మీయెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు–ఏ విషయమందు నీవు మాయెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు.౹ ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని.౹ మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము రండని ఎదోమీయులు అనుకొందురు; అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–వారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును; లోకులు–వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్యకోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు.౹ కన్నులార దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహుఘనుడుగా ఉన్నాడని మీరందురు. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యములకధిపతియగు యెహోవా మిమ్మునడుగగా–ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.౹ నా బలిపీఠముమీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపుబల్లను నీచపరచినందుచేతనే గదా గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించినయెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చినయెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.౹ దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి; మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మునుబట్టి యెవరినైన అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.౹ మీలో ఒకడు నా బలిపీఠముమీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ అయితే— యెహోవా భోజనపుబల్ల అపవిత్రమనియు, దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు –అయ్యో, యెంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడినదానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు; ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు; మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా? అని యెహోవా అడుగుచున్నాడు.౹ నేను ఘనమైన మహారాజునైయున్నాను; అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగదియుండగా యెహోవాకు మ్రొక్కుబడిచేసి చెడిపోయినదానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకియ్యబడి యున్నది.౹ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మీరు ఆయాజ్ఞను ఆలకింపకయు, నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాదఫలమును శపింతును; మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకుమునుపే నేను వాటిని శపించి యుంటిని.౹ మిమ్మునుబట్టి విత్తనములు చెరిపి వేతును, మీ ముఖములమీద పేడవేతును, పండుగలలో మీరర్పించిన పశువులపేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీ కిచ్చినవాడను నేనేయని మీరు తెలిసికొందు రని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను; భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి, నా నామము విషయములో భయము గలవారై సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి.౹ యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవాదూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమునుబట్టి బోధింపవలెను.౹ అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి, లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసియున్నారు.౹ నా మార్గములను అనుస రింపక ధర్మశాస్త్రమునుబట్టి విమర్శించుటలో మీరు పక్ష పాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింప దగినవారినిగాను నీచులనుగాను చేసియున్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరియెడల ఒకరము ద్రోహముచేయుచు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయులమధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి; యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లిచేసికొనిరి.౹ యాకోబు సంతతివారి డేరాలలోనుండి మేల్కొలుపు వారిని, పలుకువారిని, సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును.౹ మరియు రెండవసారి మీరాలాగుననే చేయుదురు; యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోను కన్నీళ్లతోను రోదనముతోను తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు, తనకు అనుకూలము కాని అర్పణలను మీచేత తీసికొనకయు నున్నాడు.౹ అది ఎందుకని మీ రడుగగా, యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా.౹ కొంచెముగానైనను దైవాత్మనొందినవారిలో ఎవరును ఈలాగున చేయలేదు; ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవునిచేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా; కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, యౌవనమున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి.౹ భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ యని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నా కసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. మీ మాటలచేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరడుగుచున్నారే. —దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారియందు ఆయన సంతోషపడును; లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను అని చెప్పుకొనుటచేతనే మీరాయనను ఆయాసపెట్టుచున్నారు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ అయితే ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటి వాడు;౹ వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.౹ అప్పుడుమునుపటి దినములలో ఉండినట్లును, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును, యూదావారును యెరూషలేము నివాసులునుచేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును.౹ తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్రమీదను వ్యభిచారులమీదను అప్ర మాణికులమీదను, నాకు భయపడక వారి కూలివిషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారిమీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు. మీపితరులనాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగా–మేము దేనివిషయములో తిరుగుదుమని మీరందురు.౹ మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేనివిషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవభాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.౹ ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునే యున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు.౹ నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనముచేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చునదేమనగా–నన్నుగూర్చి మీరు బహు గర్వపుమాటలు పలికి–నిన్నుగూర్చి యేమి చెప్పితి మని మీరడుగుదురు.౹ దేవుని సేవచేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమనియు,౹ గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదు రనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పు కొనుచున్నారు.౹ అప్పుడు, యెహోవాయందు భయభక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులుకలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.౹ నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైననులేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్వినదూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.౹ నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదములక్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరికొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసికొనుడి.౹ యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.౹ నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లలతట్టును పిల్లల హృదయములను తండ్రులతట్టును త్రిప్పును. అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను; యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను; పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీ నాదాబు నయస్సోనును కనెను; నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్ష యిని కనెను; యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను; ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను; ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను; హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను; యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీ యేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను; జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను; అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను; ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను; యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదువరకు తరములన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదు నాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తువరకు పదునాలుగు తరములు. యేసు క్రీస్తు జననవిధమెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులనుగూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై —దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. రాజైన హేరోదు దినములయందు యూదయదేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి –యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితోకూడ యెరూషలేము వారందరును కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధానయాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి — క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను. అందుకు వారు — యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి. [6-7] అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని *** — మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమునవారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను. [10-11] వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. *** తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి. వారు వెళ్లినతరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై–హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. [14-15] అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని, ఐగుప్తునకు వెళ్లి, ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను. *** ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను. అందువలన –రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై –నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలుదేశమునకు వెళ్లుము; శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలుదేశమునకు వచ్చెను. [22-23] అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.) ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి –పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి, తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి–సర్పసంతానమా, రాబోవు ఉగ్ర తను తప్పించుకొనుటకు మీకు బుద్ధిచెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి. [8-9] —అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచ వద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. *** ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. అందుకు యోహాను —నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని యేసు–ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు–ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను అందుకాయన –మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి –నీవు దేవుని కుమారుడ వైతే క్రిందికి దుముకుము — ఆయన నిన్నుగూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు — ప్రభు వైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను. మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి –నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా యేసు వానితో–సాతానా, పొమ్ము — ప్రభు వైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను. అంతట అపవాది ఆయ నను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. [12-16] యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. — జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.) *** *** *** *** అప్పటినుండి యేసు పర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. [19-20] ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. *** ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసికొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమునుగూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను. ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపెట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను. ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యు లాయనయొద్దకు వచ్చిరి. అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను— ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతం త్రించుకొందురు. నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు. కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారు లనబడుదురు. నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగునవారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా — తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా–ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవా డగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్ప బడియున్నది గదా; నేను మీతో చెప్పునదేమనగా–వ్యభిచారకారణమునుబట్టిగాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. మరియు–నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణము లను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్ప బడిన మాట మీరు విన్నారు గదా, నేను మీతో చెప్పునదేమనగా–ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము, భూమి తోడన వద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు; అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది. పె కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము. ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరినయెడల వానికి నీ పైవస్త్రము కూడ ఇచ్చివేయుము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితోకూడ రెండు మైళ్లు వెళ్లుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరువానినుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పర లోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజమందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు; మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగకమునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును; [9-10] కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, —పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక, *** మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖము లను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియైయుండినయెడల ఆ చీకటి యెంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా–ఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా? ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? వస్త్రములనుగూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు అయినను తన సమస్త వైభవముతోకూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి— ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి–నీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీమీదపడి మిమ్మును చీల్చి వేయును. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా? [10-11] మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును. *** కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది. [13-14] ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే. *** అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు. –ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి–ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు —నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమముచేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను. ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి–ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి–నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి యాయెను. అప్పుడు యేసు–ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి –ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను. యేసు —నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి–ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి–ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహా ముతోకూడను, ఇస్సాకుతోకూడను, యాకోబుతోకూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయునుండునని మీతో చెప్పుచున్నాననెను. అంతట యేసు — ఇక వెళ్లుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పెట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. ఆయన మాటవలన దయ్యములను వెళ్ల గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్లవలెనని ఆజ్ఞాపించెను. అంతట ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీ వెక్కడికి వెళ్లినను నీ వెంటవచ్చెదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను. శిష్యులలో మరియొకడు ప్రభువా, నేను మొదట వెళ్లి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతని చూచి–నన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి. అంతట సముద్రముమీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి— ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడిఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పెట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలోనుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను. వారు–ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు —నీవు మమ్మును వెళ్లగొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందులలోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పెట్టినవారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపెట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి —కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు–ఇతడు దేవ దూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి–మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచి–నీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా [7-8] వాడు లేచి తన యింటికి వెళ్లెను. జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి. *** యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి–నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి–మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనముచేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి. ఆయన ఆ మాటవిని రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యు డక్కరలేదు గదా. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక–కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను. అప్పుడు యోహాను శిష్యులు ఆయనయొద్దకు వచ్చి–పరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు–పెండ్లికుమారుడు తమతోకూడ నుండు కాలమున పెండ్లియింటివారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉప వాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపర చును చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి. ఆ సమయమున, ఇదిగో పండ్రెండు సంవత్సరములనుండి రక్తస్రావ రోగముగల యొక స్త్రీ. –నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి —కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగు పడెను. అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి. –స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి–దావీదు కుమారుడా, మమ్మును కనిక రించుమని కేకలువేసిరి. ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు–నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా వారు–నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి–మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను. అప్పుడు యేసు–ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్లి ఆ దేశ మంతట ఆయన కీర్తి ప్రచురముచేసిరి. యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యముపెట్టిన యొక మూగవాని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగ వాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి–ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పు కొనిరి. అయితే పరిసయ్యులు–ఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి — కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడు కొనుడని తన శిష్యులతో చెప్పెను. ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను. ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి; కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింప కుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి. వెళ్లుచు పరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి; పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏపట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి. ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి. ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుండినయెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి. మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు, వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు, — ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించినవాడు రక్షింపబడును. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు. శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టియుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచ బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. [30-31] మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు. *** మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును. నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు తన పండ్రెండుమంది శిష్యులకు ఆజ్ఞాపించుట. చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడనుండి వెళ్లిపోయెను. క్రీస్తు చేయుచున్న కార్యములనుగూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరి యొకనికొరకు కనిపెట్టవలెనా? అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను. యేసు వారిని చూచి— మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను. వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహా నునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను —మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో–సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.— ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపు చున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. అని యెవనిగూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటివరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు. యోహాను కాలమువరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుండెను. ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే. వినుటకు చెవులుగలవాడు వినుగాక. ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి– మీకు పిల్లనగ్రోవి ఊదితిమిగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితిమి గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్ల కాయలను పోలియున్నారు. యోహాను తినకయు త్రాగకయువచ్చెను గనుక–వీడు దయ్యముపెట్టినవాడని వారనుచున్నారు. మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక–ఇదిగో వీడు తిండిబోతును మద్య పానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందుననెను. పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను. –అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీమధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొంది యుందురు. విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడినయెడల అది నేటివరకు నిలిచియుండును. విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా–తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశిం చునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంట చేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులదిచూచి— ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను–తానును తనతోకూడ నున్నవారును ఆకలిగొని యుండగా దావీదు చేసిన దానిగూర్చి మీరు చదువ లేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులే తప్ప తానైనను తనతోకూడ ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతిదినమున దేవాలయములో విశ్రాంతిదినమును ఉల్లంఘించియు నిర్దోషులై యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా? దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు–కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దో షులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడనెను. ఆయన అక్కడనుండి వెళ్లి వారి సమాజమందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచచెయ్యి గలవాడొకడు కనబడెను. వారాయనమీద నేరము మోపవలెనని–విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి. అందుకాయన మీలో ఏ మనుష్యునికైనను నొక గొఱ్ఱెయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా? గొఱ్ఱె కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యు నితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను. అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచనచేసిరి. యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహుజనులాయనను వెంబడింపగా ఆయన వారినందరిని స్వస్థపరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పినది నెరవేరునట్లు (ఆలాగు జరిగెను) అదేమనగా — ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అను నదే. అప్పుడు దయ్యముపెట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థ పరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను. అందుకు ప్రజలందరు విస్మయమొంది —ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెనుతనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు. సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టు చున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులైయుందురు. దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా–మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచిమాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా —మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు–బోధకుడా, నీవలన ఒక సూచకక్రియ చూడగోరు చున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను. –వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. నీనెవెవారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండివచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతివెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున–నేను వదలివచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యింట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుటచూచి, వెళ్లి తనకంటె చెడ్డైవెన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును; అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటిస్థితి మొదటిస్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరమువారికిని సంభవించుననెను. ఆయన జనసమూహములతో ఇంక మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడ గోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు —ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడ వలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవానిచూచి— నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి [49-50] తన శిష్యులవైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును; పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహో దరియు, నాతల్లియుననెను. ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా — ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మ్రింగివేసెను కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను. చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి–నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను –పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. మరియు–వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. [13-15] ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందము లైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహిం పనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెర వేరుచున్నది. *** *** అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలును నీతిమంతు లును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. [18-19] విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. *** రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును. ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనమువిత్తిన యొక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమలమధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజపెట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి —అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమువిత్తితివి గదా, అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి. –ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు–మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. అందుకతడు —వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను–పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను–పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు. అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి–పొలము లోని గురుగులనుగూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి. అందుకాయన ఇట్లనెను–మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు; పొలము లోకము; మంచి విత్తనములు రాజ్య సంబంధులు; గురుగులు దుష్టుని సంబంధులు; వాటిని విత్తిన శత్రువు అపవాది; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు. గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును. మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక. పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పెట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితి మనిరి. ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి, సమాజమందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతని కెక్కడనుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప, మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆ సమయమందు చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని –ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను; అతడు మృతులలోనుండి లేచియున్నాడు; అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. [3-4] ఏలయనగా–నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి యుండెను. *** అతడు ఇతని చంప గోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోష పరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై–బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతోకూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. వాడతని తల పళ్లెములోపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను; ఆమె తన తల్లియొద్దకు దాని తీసికొని వచ్చెను. అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతిపెట్టి యేసునొద్దకువచ్చి తెలియజేసిరి. యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూహములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యు లాయనయొద్దకు వచ్చి ఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారినిపంపివేయ మని చెప్పిరి. యేసు–వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా [17-18] వారు— ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి. అందు కాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి *** పచ్చికమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి, ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరు తిని తృప్తిపొందిన తరు వాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయు నంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్టబడుచుండెను. రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు–ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి — ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. [32-33] వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి–నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. *** వారద్దరికి వెళ్లి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపెట్టి, చుట్టుపెట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి –వీరిని నీ వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టినవారందరును స్వస్థతనొందిరి. ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనముచేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకాయన మీరును మీపారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? –తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను. మీరైతే— ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి —నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినయెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. [7-9] వేషధారులారా — ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి *** *** జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి; నోటపడునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చున దియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతట ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. అందుకు పేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులైయున్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని నోటనుండి బయటికి వచ్చునవి హృదయములోనుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములోనుండియే వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. [21-22] యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపెట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను. *** అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి–ఈమె మన వెంబడి వచ్చి కేకలువేయు చున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడు కొనగా ఆయన–ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి— ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకాయన–పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె–నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు —అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. యేసు అక్కడనుండి వెళ్లి, గలిలయ సముద్రతీరమునకు వచ్చి, కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనే కులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడుదినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు–ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారు–ఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి. అప్పుడాయన— నేలమీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి వారందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి. స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేలమంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను –సాయంకాలమున మీరు–ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున— ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే యోనానుగూర్చిన సూచకక్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారి కనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు–చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది యెరిగి–అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను. అప్పుడురొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధనుగూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి–మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు–సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు. మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు? మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతోకూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచియున్న వారిలోకొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు — ప్రభువా, మన మిక్కడ ఉండుట మంచిది; నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారియొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా–మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకుడని యేసు వారికాజ్ఞాపించెను. అప్పు డాయన శిష్యులు ఈలాగైతే ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి. అందుకాయన ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టు నను మాట నిజమే; అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమ కిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పు చున్నాననెను. అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహా నునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని– ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు; నీ శిష్యుల యొద్దకు వానిని తీసికొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు–విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంత కాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను. అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదలి పోయెను; ఆ గడియనుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి–మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేక పోతి మని అడిగిరి. [20-21] అందుకాయన–మీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి–ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. *** వారు గలిలయలో సంచరించుచుండగా యేసు–మనుష్యకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవుచున్నాడు, వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి— మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని యడుగగా–చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకమునుపే యేసు ఆ సంగతి యెత్తి సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా అన్యుల యొద్దనా? అని అడిగెను. అతడు–అన్యులయొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరకును; దానిని తీసికొని నా కొరకును నీకొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారిమధ్యను నిలువబెట్టి యిట్లనెను –మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు. మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును. నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ కాగా నీ చెయ్యియైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. [11-12] మీకేమి తోచును? ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల తొంబదితొమ్మిదింటిని కొండలమీద విడిచివెళ్లి తప్పిపోయినదానిని వెదకడా? *** వాడు దాని కనుగొనినయెడల తొంబదితొమ్మిది గొఱ్ఱెలనుగూర్చి సంతోషించు నంతకంటె దానినిగూర్చి యెక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు. మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసినయెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి— ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను–ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొన గోరిన యొక రాజును పోలియున్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కి–నాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికర పడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొని–నీవు అచ్చియున్నది చెల్లింపు మనెను అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి–నా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి —చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని; నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించువరకు బాధపరచువారికి వాని నప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆప్రకారమే మీయెడల చేయుననెను. యేసు ఈ మాటలుచెప్పి చాలించిన తరువాత. గలిలయనుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజనసమూహములు ఆయనను వెంబడింపగా, ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయనయొద్దకు వచ్చి ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగా ఆయన— సృజించినవాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు –ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్ద రును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను. అందుకు వారు–ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా ఆయన మీ హృదయకాఠిన్యమునుబట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను. ఆయన శిష్యులు–భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకాయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంస కులుగా చేయబడిన నపుంసకులునుగలరు, పరలోక రాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులునుగలరు. (ఈ మాటను) అంగీకరింప గలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను. అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి వారిమీద చేతులుంచి, అక్కడనుంచి లేచిపోయెను. ఇదిగో ఒకడు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. అందుకాయన మంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు —ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు–నరహత్య చేయవద్దు, వ్యభిచరింప వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రు లను సన్మానింపుము, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యౌవనుడు — ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు–నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యౌవనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లి పోయెను. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి ఆలాగైతే ఎవడు రక్షణపొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు–ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను (ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. ఏలాగనగా–పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి –మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి. దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను. తిరిగి దాదాపు అయిదు గంట లకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి–పనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను. [11-12] వారది తీసికొని — చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజమానునిమీద సణుగుకొనిరి. *** అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము; నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది; నాకిష్టమువచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను. –ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవదినమున ఆయన మరల లేచును. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా –నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారు–త్రాగగలమనిరి. ఆయన —మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను. తక్కిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ యిద్దరు సహోదరులమీద కోపపడిరి గనుక యేసు తనయొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను. ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను. వారు యెరికోనుండి వెళ్లుచుండగా బహుజనసమూహము ఆయనవెంట వెళ్లెను. ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న యిద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లు చున్నాడని విని ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి— నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొంది ఆయన వెంట వెళ్లిరి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; ఎవడైనను మీతో ఏమైనను అనినయెడల–అవి ప్రభువు నకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదేమనగా –ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువుపిల్లైయెన చిన్న గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగునపరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగునపరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును –దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు–ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము–ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి— నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయనయొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, —దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి –వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు— వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణమునుండి బయలుదేరి బేతనియకు వెళ్లి అక్కడ బసచేసెను. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి–ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను. శిష్యులదిచూచి ఆశ్చర్యపడి–అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి. అందుకు యేసు–మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చి ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా — యేసు నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారు–మనము పరలోకము నుండి అని చెప్పితిమా, ఆయన–ఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును; మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని–మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకాయన ఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చి కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా వాడు పోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవవానియొద్దకు వచ్చి ఆప్రకారమే చెప్పగా వాడు అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడని వారి నడిగెను. అందుకు వారు–మొదటివాడే అనిరి. యేసు సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్య లును అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడక పోతిరి. మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమాను డొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలి పించి, గోపురముకట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను. పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా ఆ కాపులు అతని దాసు లను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరి యొకనిమీద రాళ్లు రువ్విరి. మరల అతడుమునుపటి కంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వార సుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతరకాపులకు ఆ ద్రాక్షతోట గుత్త కిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి –ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను. ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మునుగూర్చియే చెప్పెనని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడినవారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. కాగా అతడు–ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దు లును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి. తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడతడు–పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డ వారినేమి మంచివారినేమి తమకు కనబడినవారినందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లి శాల నిండెను. రాజు కూర్చున్నవారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి –స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియైయుండెను. అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను. అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు –బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతోకూడ తమ శిష్యులను ఆయనయొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనమెరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురూక యొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయనయొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడాయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారు–కైసరువనిరి. అందుకాయన–ఆలా గైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించు డని వారితో చెప్పెను. వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయిరి. పునరుత్థానములేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయనయొద్దకు వచ్చి — బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే చెప్పెను; మాలో ఏడుగురు సహోదరు లుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను. రెండవవాడును మూడవవాడును ఏడవ వానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి. [27-28] అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి. *** అందుకు యేసు–లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్య బడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు. [31-32] మృతుల పునరుత్థానమునుగూర్చి–నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నానని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా? *** ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధ కాశ్చర్యపడిరి. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరి సయ్యులు విని కూడివచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోప దేశకుడు ఆయనను శోధించుచు –బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందు కాయన–నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అత నితో చెప్పెను. ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి –క్రీస్తునుగూర్చి మీకేమి తోచు చున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు— ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకాయన–ఆలాగైతే –నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పు చున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారినడుగగా ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు. అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను –శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు గనుక–వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు. మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు; విందులలో అగ్రస్థానములను సమాజమందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను. తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. [13-14] అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు; మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. *** అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠముతోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశముతోడని ఒట్టుపెట్టుకొనువాడు దేవుని సింహాసనముతోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మ్రింగువారు మీరే. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలి యున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి. ఆలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు –మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీపితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతో కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నియు ఈ తరమువారిమీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచునుఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది. ఇదిమొదలుకొని— ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పువరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన — మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి–నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు. మరియు మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధ సమాచారములనుగూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే — చదువువాడు గ్రహించుగాక– యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొని పోవుటకు దిగకూడదు; పొలములోఉండువాడు, తన బట్టలు తీసికొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను — ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను. కాబట్టి ఎవరైనను–ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశముయొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చు కొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచు నప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అయితే ఆ దినమునుగూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవువరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసి కొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు డెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టు డైన యొక దాసుడు–నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతోకూడ వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్య కలను పోలియున్నది. వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి. పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రివేళ— ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధిలేని ఆ కన్యకలు— మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి–అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా అతడు–మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. (పరలోకరాజ్యము) ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించినట్లుండును. అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను. అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపా దించెను. ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను. అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చి అయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించితివే; అవియుగాక మరి యయిదు తలాంతులు సంపా దించితినని చెప్పెను. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. ఆలాగే రెండు తలాంతులు తీసికొనినవాడు వచ్చి అయ్యా, నీవు నాకు రెండు తలాంతులప్పగించితివే అవియుగాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి — అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితోకూడ నా సొమ్ము తీసికొనియుందునే అని చెప్పి –ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసి వేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు–ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు–మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారును–ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివైయుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన–మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు. యేసు ఈ మాటలన్నియు చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి –రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువవేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను. ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపాయముచేతపట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచనచేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లు–పండుగలో వద్దని చెప్పుకొనిరి. [6-7] యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను. *** శిష్యులు చూచి కోపపడి–ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలిసి కొని–ఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు? బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతోకూడ ఉండను. ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి –నేనాయ నను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను. పులియనిరొట్టెల పండుగలో మొదటి దినమందు, శిష్యులు యేసునొద్దకు వచ్చి–పస్కాను భుజించుటకు మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడి గిరి. అందుకాయన–మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యునియొద్దకు వెళ్లి నా కాలము సమీపమైయున్నది; నా శిష్యులతోకూడ నీ యింట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుండెను. వారు భోజనముచేయుచుండగా ఆయన–మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా, నేనా? అని ఆయన నడుగగా ఆయన నాతోకూడ పాత్రలో చెయ్యిముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన–నీవన్నట్టే అనెను. వారు భోజనముచేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి —మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి–దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్త దిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి. అప్పుడు యేసు వారిని చూచి–ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా— గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా. నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్లెదననెను. అందుకు పేతురు నీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. పేతురాయనను చూచి నేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి. అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి–నేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొనిపోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసుమరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి, సాగిలపడి— నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి ఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరల రెండవమారు వెళ్లి నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగిపోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి తిరిగి వచ్చి, వారు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థనచేసెను. అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చు కొనుడి; ఇదిగో ఆ గడియవచ్చియున్నది; మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు; లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని వారితో చెప్పెను. ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధానయాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి–బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతోకూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనినయెడల–ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బంది పోటుదొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి. యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి. పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు, ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయి–దీని అంత మేమవునో చూడవలెనని బంట్రౌతులతోకూడ కూర్చుండెను. ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి –వీడు దేవాలయమును పడగొట్టి, మూడుదినములలో దానిని కట్ట గలనని చెప్పెననిరి. ప్రధానయాజకుడు లేచి నీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్య మేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు— నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘా రూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవ దూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు; మీకేమి తోచు చున్నదని అడిగెను. అందుకు వారు–వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి; కొందరు ఆయనను అరచేతులతో కొట్టి — క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు మనిరి. పేతురు వెలుపటిముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చి నీవును గలిలయుడగు యేసుతోకూడ ఉంటివి గదా అనెను. అందుకతడు— నేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరి యెదుట అనెను. అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టుపెట్టుకొని–నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి–నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు— ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను కనుక–కోడి కూయకమునుపు నీవు నన్నెరుగ నని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి యేడ్చెను. ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచనచేసి ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి. అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణెములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి — నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధానయాజకులు ఆ వెండి నాణెములు తీసి కొని — ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు— విలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది వెండి నాణెములు తీసికొని ప్రభువు నాకు నియమించినప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెర వేరెను. యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతి–యూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచి నీవన్నట్టే అనెను ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు. కాబట్టి పిలాతు— నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు విన లేదా? అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను. [17-18] కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు–నేనెవనిని విడుదలచేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను *** అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య — నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయ ననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రధానయాజకులును పెద్దలును, బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి అధిపతి ఈ యిద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడుగగా వారు–బరబ్బనే అనిరి. అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా సిలువవేయుమని అందరును చెప్పిరి. అధిపతి–ఎందుకు? ఇతడు ఏ దుష్కా ర్యము చేసెనని అడుగగా వారు సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగు చున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని–ఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరు–వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను. అప్పుడు అధిపతియొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయనయొద్ద సైనికుల నందరిని సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసి వేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని–యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొనిపోయిరి. వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువమోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అన బడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. –ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతోకూడ సిలువవేయ బడిరి. ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు –దేవాలయమును పడగొట్టి మూడుదినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు –వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలురాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతోకూడ సిలువవేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచియున్నవారిలో కొందరామాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొనిపోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను; తక్కినవారు–ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూత మనిరి. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్ద లాయెను; సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధి పతియు అతనితోకూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లియైన మరి యయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను. మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, అక్కడనే సమాధికి ఎదురుగాకూర్చుండియుండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి –అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడుదినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రముచేయ నాజ్ఞా పించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి —ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదు రేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి. అందుకు పిలాతు–కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి. విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి. దూత ఆ స్ర్తిలను చూచి–మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని–మీకు శుభమని చెప్పెను. వారు ఆయనయొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు–భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధానయాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతోకూడి వచ్చి ఆలోచనచేసి ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి — మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి; ఇది అధిపతి చెవినిబడినయెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందరకలుగకుండ చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది. పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి. అయితే యేసు వారియొద్దకు వచ్చి–పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నానని వారితో చెప్పెను. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. –ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. అంతట యూదయ దేశస్థులందరును, యెరూషలేమువారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు. మరియు అతడు నాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను; నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మముపొందెను. వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు–నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను. ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవిమృగములతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు –కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజమందిరములో అపవిత్రాత్మపెట్టిన మనుష్యుడొకడుండెను. వాడు–నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. [25-26] అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను. *** అందరును విస్మయమొంది — ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పు కొనిరి. వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను. వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారి యింట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపెట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పెట్టినవారిని ఆయనయొద్దకు తీసి కొని వచ్చిరి; పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను. ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు. ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితోకూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి ఆయనను కనుగొని, —అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. ఆయన గలిలయయందంతట వారి సమాజమందిరములలో ప్రకటించుచు, దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను. ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా ఆయన కనికర పడి, చెయ్యిచాపి వానిని ముట్టి నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడాయన–ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలుపల అరణ్యప్రదేశములలో నుండెను. నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి. కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హూములోనికి వచ్చెను ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి–కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువుగలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి. వారు–ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని — మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువుగలవానితో — నీ పాపములు క్షమింప బడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తి కొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి పక్ష వాయువు గలవానిని చూచి–నీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొంది మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి —నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి, ఆయనను వెంబడించెను. అతని యింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండి యుండిరి. ఇట్టివారనేకులుండిరి; వారాయనను వెంబ డించువారైరి. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచి–ఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనముచేయుచున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యు డక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. యోహాను శిష్యులును పరిసయ్యులును ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి–యోహాను శిష్యులును పరిసయ్యుల శిష్యులును ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయన నడుగగా యేసు–పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయ దగునా? పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లికుమారుడు వారి యొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలోనే వారుపవాసము చేతురు. ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసిక వేయడు; వేసినయెడల ఆ క్రొత్తమాసిక పాతబట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును; అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను. మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా, శిష్యులు మార్గమున సాగిపోవుచు— వెన్నులు త్రుంచుచునుండిరి. అందుకు పరిసయ్యులు–చూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయుచున్నారని ఆయన నడిగిరి. అందుకాయన వారితో ఇట్లనెను తానును తనతోకూడ నున్నవారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా? అబ్యాతారు ప్రధానయాజకుడై యుండగా దేవమందిరములోనికి వెళ్లి, యాజకులేగాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని, తనతోకూడ ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను. మరియు–విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను. సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతిదినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కని పెట్టుచుండిరి. ఆయన నీవు లేచిమధ్యను నిలువుమని ఊచచెయ్యిగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడిగెను; అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచి నీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరి సయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచనచేసిరి. యేసు తన శిష్యులతోకూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంతములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధపరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పెట్టినవారు ఆయనను చూడ గానే ఆయన యెదుట సాగిలపడి–నీవు దేవుని కుమారుడ వని చెప్పుచు కేకలువేసిరి. తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయన కొండెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. [14-15] వారు తనతోకూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను. *** వారెవరనగా–ఆయన పేతురను పేరుపెట్టిన సీమోను జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయ నేర్గెసను పేరుపెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము. అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పెట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను— సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు. ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడినయెడల, ఆ యిల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడినయెడల వాడు నిలువలేక కడతేరును. ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించినయెడల వాని యిల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములును మనుష్యులుచేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడైయుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పెట్టినవాడని వారు చెప్పిరి. ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరు లును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన–నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టుకూర్చున్న వారిని కలయచూచి— ఇదిగో నా తల్లియు నా సహోదరులును; దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహో దరియు తల్లియునని చెప్పెను. ఆయన సముద్రతీరమున మరల బోధింపనారం భింపగా, బహుజనులాయనయొద్దకు కూడివచ్చియున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుండెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి. ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను –వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మ్రింగివేసెను. కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను. –వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పండ్రెండుమంది శిష్యులతోకూడ ఆయనచుట్టు ఉండినవారు ఆ ఉపమానమునుగూర్చి ఆయన నడిగిరి. అందుకాయన దేవుని రాజ్య మర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను మరియు–ఈ ఉపమానము మీకు తెలియలేదా? ఆలాగైతే ఉపమానములన్నియు మీకేలాగు తెలియుననెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవప్రక్క నుండువారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్య మెత్తికొనిపోవును. అటువలె రాతినేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు; అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగ గానే వారు అభ్యంతరపడుదురు. [18-19] ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు; వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్ష లును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుటవలన అది నిష్ఫలమగును. *** మంచి నేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని, దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను దీపము దీప స్తంభముమీద నుంచబడుటకే గాని కుంచము క్రిందనైనను మంచముక్రిందనైన నుంచబడుటకు తేబడదు గదా రహస్య మేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచబడుటకే గాని యేదియు మరుగుచేయబడలేదు వినుటకు చెవులెవనికైన నుండినయెడల వాడు వినునుగాకనెను. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కియ్యబడును. కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడునని వారితో చెప్పెను. [26-27] మరియు ఆయన–ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి, రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచు నుండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. *** భూమి మొదట మొల కను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. మరియు ఆయన ఇట్లనెను–దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమిమీదనున్న విత్తనములన్నిటికంటె చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి యెదిగి కూర మొక్కలన్నిటికంటె పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశపక్షులు దాని నీడను నివసింపగలవనెను. వారికి వినుటకు శక్తి కలిగినకొలది యీలాటి అనేకమైన ఉపమానములను చెప్పి, ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచెను. [35-36] ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన–అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను. *** అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను. ఆయన దోనె అమరమున తలగడమీద (తల వాల్చుకొని) నిద్రించుచుండెను. వారాయనను లేపి–బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి–నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడాయన–మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి–ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. వారాసముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పెట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి –యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన–అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన–నీ పేరేమని వానినడుగగా వాడు–నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండదగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. గనుక — ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండువేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పెట్టినవాడు బట్టలు ధరించుకొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. జరిగినది చూచినవారు దయ్యములు పెట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియ జేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. ఆయన దోనెయెక్కినప్పుడు, దయ్యములు పెట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవియ్యక–నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి. యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహుజనసమూహము ఆయనయొద్దకు కూడివచ్చెను. ఆయన సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యాయీరను నొకడు వచ్చి, ఆయనను చూచి ఆయన పాదములమీదపడి –నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీచేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితోకూడ వెళ్లెను; బహుజనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకట పడెను. [27-28] ఆమె యేసునుగూర్చి విని–నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. *** వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణయైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహమువైపు తిరిగి–నా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా ఆయన శిష్యులు —జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్నుముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచెను. అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన — కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చి–నీ కుమార్తె చనిపోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు వనిరి. యేసు వారు చెప్పినమాట లక్ష్యపెట్టక–భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజమందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియ్యక సమాజమందిరపు అధికారి యింటికి వచ్చి, వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు, ప్రలాపించుచు నుండుట చూచి లోపలికిపోయి— మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించు చున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండి యున్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాని చెయిపెట్టి— తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. ఆయన అక్కడనుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతిదినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి–ఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు–ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపెట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. ఆయన పండ్రెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మలమీద వారి కధికారమిచ్చి –ప్రయాణముకొరకు చేతికఱ్ఱను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసికొనక చెప్పులు తొడగుకొనుడనియు, రెండంగీలు వేసికొన వద్దనియు వారికాజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను — మీరెక్కడ ఒక యింట ప్రవేశించెదరో అక్కడనుండి మీరు బయలుదేరువరకు ఆ యింటనే బసచేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి, మారుమనస్సు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనెరాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచునుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి విని–బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడుగనుక అతనియందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు —ఈయన ఏలీయా అనియు, మరికొందరు–ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని–నేను తల గొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచియున్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహాను–నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడామె నిమిత్తము యోహానును పెట్టి తెప్పించి, చెరసాలలో బంధించియుండెను. [19-20] హేరోదియ అతని మీద పగపెట్టి అతని చంపింప గోరెను గాని ఆమెచేత గాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు, ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. *** అయితే తగిన దినమొకటి వచ్చెను; ఎట్లనగా, హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయదేశ ప్రముఖు లకును విందుచేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితోకూడ పంక్తిని కూర్చున్నవారిని సంతోషపరచెను గనుక రాజు–నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు–నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను గనుక ఆమె వెళ్లి —నేనేమి అడిగెదనని తన తల్లి నడుగగా ఆమె–బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి–బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములో పెట్టి యిప్పుడే నాకిప్పింప గోరుచున్నానని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లక పోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక బంట్రౌతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్న దాని కిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి. అంతట అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియ జేసిరి. అప్పుడాయన–మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున, భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. కాగా వారు దోనె యెక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి. వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకనుపరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింప సాగెను. చాల ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి–ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాల ప్రొద్దుపోయినది; చుట్టుపెట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్లి భోజనమున కేమైనను కొనుక్కొనుటకు వారిని పంపి వేయుమని చెప్పిరి. అందుకాయన — మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు–మేము వెళ్లి యీన్నూరు దేనారముల రొట్టెలుకొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి. [38-39] అందుకాయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని —అయిదు రొట్టెలును రెండు చేపలు నున్నవనిరి. అప్పుడాయన — పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికాజ్ఞాపింపగా *** వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని, ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఆ రొట్టెలు విరిచి, వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి, ఆ రెండు చేపలను అందరికిని పంచిపెట్టెను. [42-43] వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలును రొట్టె ముక్కలును పండ్రెండు గంపెళ్లు ఎత్తిరి. *** ఆ రొట్టెలు తినినవారు అయిదువేలమంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయునంతలో, దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లెను. సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచు మించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలెనని యుండెను. ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి, భూత మని తలంచి కేకలువేసిరి. అందరు ఆయనను చూచి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలుకరించి— ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతి నొందిరి; అయినను వారి హృదయము కఠిన మాయెను గనుక వారు రొట్టెలనుగూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పెట్టిరి. వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపెట్టి ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటునకు రోగులను మంచములమీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన యెక్క డెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీదులలో ఉంచి, వారిని ఆయన వస్త్రపుచెంగుమాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరు స్వస్థతనొందిరి. యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయనయొద్దకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుటచూచిరి. పరి సయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంతనుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలనుకుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేకాచారములను వారనుసరించెడివారు. అప్పుడు పరిసయ్యులును శాస్త్రులును–నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారముచొప్పున నడుచుకొనక, అప విత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడి గిరి. అందుకాయన వారితో ఈలాగు చెప్పెను— ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరా ధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన–మీరు మీ పారంపర్యా చారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాక రించుదురు. –నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా. [11-12] అయినను మీరు–ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి— నావలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల, తన తండ్రికైనను తల్లి కైనను వానిని ఏమియు చేయనియ్యక *** మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచి–మీరందరు నా మాట విని గ్రహించుడి. [15-16] వెలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని, లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. *** ఆయన జనసమూహమును విడిచి యింటిలోనికి వచ్చినప్పుడు, ఆయన శిష్యులు ఈ ఉపమానమునుగూర్చి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెను— మీరును ఇంత అవివేకులై యున్నారా? వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థములన్నిటిని పవిత్రపరచును. మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఆయన అక్కడనుండి లేచి, తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లి, యొక ఇంట ప్రవేశించి, ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై యుండ లేక పోయెను. అపవిత్రాత్మ పెట్టిన చిన్నకుమార్తెగల యొక స్త్రీ ఆయననుగూర్చి విని, వెంటనే వచ్చి ఆయన పాదములమీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలోనుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి–పిల్లలు మొదట తృప్తి పొందవలెను; పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె–నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడ బల్లక్రింద ఉండి, పిల్లలు పడ వేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకాయన–ఈ మాట చెప్పినందున వెళ్లుము; దయ్యము నీ కుమార్తెను వదలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె యింటికి వచ్చి, తన కుమార్తె మంచముమీద పండుకొని యుండుటయు దయ్యము వదలిపోయి యుండుటయు చూచెను. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి, సీదోను ద్వారా దెకపొలి ప్రాంతములమీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడుగల నత్తి వాని ఒకని ఆయనయొద్దకు తోడుకొనివచ్చి, వానిమీద చెయ్యి యుంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములోనుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొనిపోయి, వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమ్మివేసి, వాని నాలుక ముట్టి ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి —ఎప్ఫతా అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. అప్పుడాయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను; అయితే ఆయన చెప్పవద్దని వారికాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధిచేయుచు –ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఆ దినములలో మరియొక సారి బహుజనులు కూడి రాగా, వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తనయొద్దకు పిలిచి –జనులు నేటికి మూడుదినముల నుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను; నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినయెడల మార్గములో మూర్ఛపోవుదురు; వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారని వారితో చెప్పెను. అందు కాయన శిష్యులు–ఈ అరణ్యప్రదేశములో ఒక డెక్కడ నుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి. ఆయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారు — ఏడనిరి. అప్పుడాయన — నేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి ఆ యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్నచేపలు కూడ వారియొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడ వడ్డించుడని చెప్పెను. వారు భోజనముచేసి తృప్తిపొందినమీదట, మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి. భోజనముచేసినవారు ఇంచు మించు నాలుగు వేలమంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతోకూడ దోనె యెక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చెను. అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశమునుండి యొక సూచకక్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి–ఈ తరమువారు ఎందుకు సూచక క్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరల దోనె యెక్కి అద్దరికి పోయెను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి; దోనెలో వారియొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియు లేకపోయెను. ఆయన–చూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు–తమయొద్ద రొట్టెలు లేవేయని తమలోతాము ఆలోచించుకొనిరి. యేసు అది యెరిగి మనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారై యున్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసికొనరా? నేను ఆ అయిదువేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టి నప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడిగెను. వారు–పండ్రెండని ఆయనతో చెప్పిరి. ఆ నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి, పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని ఆయన అడుగగా వారు — ఏడనిరి. అందుకాయన — మీరింకను గ్రహింపకున్నారా? అని అనెను. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొనివచ్చి, వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొనిపోయి, వాని కన్నులమీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచి–నీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా, వాడు కన్నులెత్తి — మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచు చున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడ సాగెను. అప్పుడు యేసు–నీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములోనుండగా— నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యుల నడిగెను. అందుకు వారు–కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన–మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారినడుగగా పేతురు–నీవు క్రీస్తు వని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్నుగూర్చిన యీ సంగతి ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడుదినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయిపట్టుకొని ఆయనను గద్దింపసాగెను అందుకాయన తన శిష్యులవైపు తిరిగి, వారిని చూచి–సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్క రింపకున్నావని పేతురును గద్దించెను. అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి–నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబ డింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించు కొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్య గలుగును? వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్నుగూర్చియు నామాటలనుగూర్చియు సిగ్గుపడు వాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధదూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను. మరియు ఆయన — ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు దేవునిరాజ్యము బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. ఆరుదినములైన తరువాత, యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువచేయలేడు. మరియు మోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు–బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది; మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను; వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా —ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా–మనుష్య కుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. వారు–ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి. అందుకాయన–ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి? ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పు చున్నానని వారితో అనెను. వారు శిష్యులయొద్దకు వచ్చి, వారి చుట్టు బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి, మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తి కొనివచ్చి ఆయనకు వందనముచేసిరి. అప్పుడాయన–మీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారి నడుగగా జనసమూహములో ఒకడు— బోధకుడా, మూగదయ్యము పెట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని; అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పగా వారాయనయొద్దకు వానిని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే, వాని విలవిల లాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడాయన —ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు–బాల్యమునుండియే; అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు–(నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి–నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుకూడి తనయొద్దకు పరుగెత్తికొనివచ్చుట యేసు చూచి–మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులు–వాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చెయ్యి పెట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు–మే మెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి. అందుకాయన–ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. వారక్కడనుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్లుచుండిరి; అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టములేక పోయెను; ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు —మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడు చున్నాడు, వారాయనను చంపెదరు; చంపబడిన మూడుదినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు— ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు–మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనినిగూర్చి వాదించుచుంటిరని వారినడుగగా వారు ఊరకుండిరి. అప్పుడాయన కూర్చుండి పండ్రెండుమందిని పిలిచి–ఎవడైనను మొదటి వాడైయుండ గోరినయెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెనని చెప్పి యొక చిన్న బిడ్డను తీసికొని వారిమధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగిలించుకొని –ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చు కొనునని వారితో చెప్పెను. అంతట యోహాను–బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను. అందుకు యేసు–వానిని ఆటంకపరచకుడి; నాపేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు; మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే. మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. [43-44] నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; నీవు రెండు చేతులుకలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగ హీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. *** [45-46] నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; రెండు పాదములుకలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుటమేలు. *** నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులుకలిగి నరకములో పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును. ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైనయెడల దేనివలన మీరు దానికి సారము కలుగుజేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. ఆయన అక్కడనుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయనయొద్దకు కూడివచ్చిరి: ఆయన తనవాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను. పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకై–పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయన నడిగిరి. అందుకాయన–మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారి నడిగెను. వారు–పరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా యేసు–మీ హృదయకాఠిన్యమునుబట్టి అతడీ ఆజ్ఞను మీకు వ్రాసి యిచ్చెను గాని సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను. ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతినిగూర్చి ఆయనను మరల నడిగిరి. అందుకాయన–తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను. తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి–చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంక పరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే. చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూని–సద్బోధ కుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను. యేసు–నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను. అందుకతడు–బోధకుడా, బాల్యమునుండి ఇవన్నియు అనుసరించుచునే యుంటినని చెప్పెను. యేసు అతని చూచి అతని ప్రేమించి–నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్లిపోయెను. అప్పుడు యేసు చుట్టు చూచి–ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను— పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము; ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి— అట్లయితే ఎవడు రక్షణపొంద గలడని ఆయన నడిగిరి. యేసు వారిని చూచి–ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. పేతురు ఇదిగో–మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను–నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తలి దండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అనెను. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్లుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయ మొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరల పండ్రెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభవింపబోవువాటిని వారికి తెలియజెప్పనారంభించి — ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్య కుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనుల కప్పగించెదరు. వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడుదినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయనయొద్దకు వచ్చి–బోధకుడా, మేము అడుగునదెల్ల నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన–నేను మీకేమి చేయగోరుచున్నారని వారి నడిగెను. వారు–నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి. యేసు–మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు; నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట యైనను మీచేత అగునా? అని వారి నడుగగా వారు–మా చేత అగుననిరి. అప్పుడు యేసు–నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు; నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు, గాని నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నావశములో లేదు; అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే (దొరకునని) వారితో చెప్పెను. తక్కినపదిమంది శిష్యులు ఆ మాట విని, యాకోబు యోహానులమీద కోపపడసాగిరి. యేసు వారిని తనయొద్దకు పిలిచి వారితో ఇట్లనెను–అన్యజనులలో అధికారులని యెంచబడినవారు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురని మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరినయెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరినయెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. వారు యెరికోపట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహుజనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయి యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని— దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు–దావీదు కుమారుడా, నన్ను కరు ణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను. అప్పుడు యేసు నిలిచి–వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచి–ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు–నేను నీకేమి చేయగోరుచున్నావని వానినడుగగా, ఆ గ్రుడ్డివాడు–బోధకుడా, నాకు దృష్టి కలుగ జేయుమని ఆయనతో అనెను. అందుకు యేసు–నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొంది వెళ్లెను. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి –మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిద పిల్ల కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండ లేదు; దానిని విప్పి, తోలుకొని రండి. ఎవడైనను— మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్ము నడిగినయెడల–అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. [4-5] వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడియున్న గాడిద పిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా, అక్కడ నిలిచియున్న వారిలో కొందరు— మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి. *** అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగుననుపరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలనుపరచిరి. మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును –జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాలమైనందున పండ్రెండుమందితోకూడ బేతనియకు వెళ్లెను. మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు. అందుకాయన–ఇకమీదట ఎన్నటి కిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను; ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి, దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయము గుండ ఏపాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను. మరియు ఆయన బోధించుచు –నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్య పడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోనుండి బయలుదేరెను. ప్రొద్దునవారు మార్గమున పోవుచుండగా ఆ అంజూ రపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని–బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను–మీరు దేవునియందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి–నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్నయెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలును ఆయనయొద్దకువచ్చి –నీవు ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ యధికారము నీకెవడిచ్చెనని అడిగిరి. అందుకు యేసు–నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను. [31-32] అందుకు వారు–మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల, ఆయన — ఆలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును; మనుష్యులవలన కలిగిన దని చెప్పుదుమా అని తమలోతాము ఆలోచించుకొనిరి గాని, అందరు యోహాను నిజముగా ప్రవక్త యని యెంచిరి *** గనుక ప్రజలకు భయపడి–ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు–ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను. ఆయన ఉపమానరీతిగా వారికి బోధింపనారం భించెను; ఎట్లనగా — ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిచుట్టు కంచె వేయించి, ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురముకట్టించి, కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరముపోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు, కాపులయొద్దకు అతడు ఒక దాసునిపంపగా వారు వాని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి. మరల అతడు మరియొక దాసుని వారియొద్దకు పంపగా, వారు వాని తల గాయముచేసి అవమానపరచిరి. అతడు మరియొకని పంపగా వానిని చంపిరి. అతడింక అనేకులను పంపగా, వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుక–వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు–ఇతడు వారసుడు; ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలోతాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి, ద్రాక్షతోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి, ఆ కాపులను సంహరించి, యితరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చును గదా. మరియు –ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువలేదా? అని అడుగగా తమ్మునుగూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి–బోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మే మెరుగుదుము; నీవు మోమోటములేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్ని చ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి–మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి, ఆయన–ఈ రూపమును, పై వ్రాతయు, ఎవరివని వారి నడుగగా వారు–కైసరువి అనిరి. అందుకు యేసు — కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయన యొద్దకువచ్చి –బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను. ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను,వాడును సంతానము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను. ఇట్లు ఏడుగురును సంతానములేకయే చనిపోయిరి. అందరివెనుక ఆ స్ర్తీ యు చనిపోయెను. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి. అందుకు యేసు–మీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడుచున్నారు. వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు. వారు లేచెదరని మృతులనుగూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడు–నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడు చున్నారని వారితో చెప్పెను. శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి–ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను. అందుకు యేసు — ప్రధానమైనది ఏదనగా — ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను ఆ శాస్త్రి–బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణహృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణ బలముతోను, ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి–నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా —క్రీస్తు, దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నా రేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మవలన చెప్పెను. దావీదు ఆయ నను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను–శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుచు విధవరాండ్ర యిండ్లు దిగమ్రిం గుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచు చుండెను. ధనవంతులైనవారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. [42-43] ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి–కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. *** వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను. ఆయన దేవాలయములోనుండి వెళ్లుచుండగా ఆయన శిష్యులలో ఒకడు — బోధకుడా, యీ రాళ్లేలాటివో యీ కట్టడములు ఏలాటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు — ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే; రాతిమీద రాయి యొకటియైన ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని అతనితో చెప్పెను. ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండమీద కూర్చుండియుండగా, పేతురు యాకోబు యోహాను అంద్రెయ అను వారు ఆయనను చూచి –ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నియు నెరవేరబోవుకాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను —ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి–నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధసమాచారములనుగూర్చియు వినునప్పుడు కలవరపడకుడి; ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరవులు వచ్చును. ఇవే వేద నలకు ప్రారంభము. మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి. వారు మిమ్మును సభల కప్పగించెదరు; మిమ్మును సమాజమందిరములలో కొట్టించెదరు; మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల యెదుటను రాజుల యెదుటను నా నిమిత్తము నిలువబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింప బడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవు నప్పుడు మీరు–ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి; చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమున కప్పగింతురు; కుమారులు తలిదండ్రులమీద లేచి వారిని చంపింతురు; నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు; అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును. మరియు నాశకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు — చదువు వాడు గ్రహించుగాక — యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; మిద్దెమీద ఉండువాడు ఇంటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు; పొలములో ఉండువాడు తన వస్త్రము తీసికొనిపోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండ వలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు; దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగ లేదు, ఇక ఎన్నడును కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించు కొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. కాగా — ఇదిగో క్రీస్తు ఇక్కడ నున్నాడు, అదిగో అక్కడ నున్నాడు అని యెవడైనను మీతో చెప్పినయెడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైనయెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి; ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి యున్నాను. ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతమువరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగు చేయించును. అంజూరపుచెట్టును చూచి యొక ఉపమానము నేర్చు కొనుడి. దాని కొమ్మ యింక లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచు నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. ఆ దినమునుగూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూత లైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించి — మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును.) ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకివచ్చునో, అర్ధరాత్రివచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడనెను. రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ, అనగా పులియని రొట్టెలపండుగ వచ్చెను. అప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును మాయోపాయముచేత ఆయన నేలాగు పట్టుకొని చంపుదుమా యని ఆలోచించుకొనుచుండిరి గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసికొని వచ్చి, ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను. అయితే కొందరు కోపపడి — ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేల? ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటె ఎక్కువ వెలకమ్మి, బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెనుగూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను — ఈమె జోలికిపోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయెడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు, మీకిష్టమైనప్పుడెల్ల వారికి మేలుచేయ వచ్చును; నేను ఎల్లప్పుడును మీతో నుండను. ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులచేతికి ఆయనను అప్పగింపవలెనని వారియొద్దకు పోగా వారు విని, సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను. పులియనిరొట్టెల పండుగలో మొదటి దినమునవారు పస్కాపశువును వధించునప్పుడు, ఆయన శిష్యులు–నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచ వలెనని కోరుచున్నావని ఆయన నడుగగా, ఆయన —మీరు పట్టణములోనికి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును; వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచి–నేను నా శిష్యులతోకూడ పస్కాను భుజించుటకు నా విడిది గది యెక్కడనని బోధకుడడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతోకూడ వచ్చెను. వారు కూర్చుండి భోజనముచేయుచుండగా యేసు–మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి–నేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి. అందుకాయన — పండ్రెండు మందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచు వాడే. నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను. వారు భోజనముచేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చి–మీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. అప్పుడాయన —ఇది నిబంధనవిషయమై అనేకులకొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినమువరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవలకొండకు వెళ్లిరి. అప్పుడు యేసు వారిని చూచి–మీరందరు అభ్యంతర పడెదరు; గొఱ్ఱెల కాపరిని కొట్టుదును; గొఱ్ఱెలు చెదరి పోవును అని వ్రాయబడియున్నది గదా. అయితే నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లెదననెను. అందుకు పేతురు— అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి— నేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అతడు మరి ఖండితముగా–నేను నీతోకూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరుననిరి. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన— నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరం భించెను అప్పుడాయన–నా ప్రాణము మరణమగు నంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంతదూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు –నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను. మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి–సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ యైనను మేలుకొనియుండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగి పోయి, యింతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగివచ్చి చూడగా, వారు నిద్రించుచుండిరి; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచ లేదు. ఆయన మూడవ సారి వచ్చి–మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడు చున్నాడు; లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించు వాడు సమీపించియున్నాడని చెప్పెను. వెంటనే, ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని, ప్రధానయాజకులయొద్దనుండియు శాస్త్రులయొద్దనుండియు పెద్దలయొద్దనుండియు వచ్చిరి. ఆయనను అప్పగించువాడు — నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే (యేసు); ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను. వాడు వచ్చి వెంటనే ఆయనయొద్దకు పోయి–బోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా వారు ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచియున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. అందుకు యేసు–మీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించు చుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను). అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా, వారతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి, దిగం బరుడై పారిపోయెను. వారు యేసును ప్రధానయాజకునియొద్దకు తీసికొనిపోయిరి. ప్రధానయాజకులు పెద్దలు శాస్త్రులు అందరును అతనితోకూడవచ్చిరి. పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు దూరమునుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద చలి కాచు కొనుచుండెను. ప్రధానయాజకులును మహాసభవారందరును యేసును చంపింపవలెనని ఆయనమీద సాక్ష్యము వెదకిరిగాని, యేమియు వారికి దొరకలేదు. అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. [57-59] అప్పుడు కొందరు లేచి చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి, మూడుదినములలో చేతిపనికాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయనమీద అబద్ధసాక్ష్యము చెప్పిరి గాని ఆలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. *** *** ప్రధానయాజకుడు వారిమధ్యను లేచి నిలిచి–ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకు చున్న సాక్ష్యమేమని యేసు నడిగెను. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధానయాజకుడు–పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయన నడుగగా యేసు–అవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధానయాజకుడు తన వస్ర్తములు చింపుకొని–మనకు ఇక సాక్షులతో పని యేమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచు చున్నదని అడుగగా వారందరు–మరణమునకు పాత్రుడని ఆయనమీద నేరస్థాపనచేసిరి. కొందరు ఆయనమీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుకువేసి, ఆయనను గుద్దుచు — ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. పేతురు ముంగిటి క్రిందిభాగములో ఉండగా ప్రధానయాజకుని పనికత్తెలలో ఒకతె వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను; అతనిని నిదానించి చూచి —నీవును నజరేయుడగు ఆ యేసుతోకూడ ఉండినవాడవు కావా? అనెను. అందుకతడు–ఆయన ఎవడో నేనెరు గను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్లెను; అంతట కోడి కూసెను. ఆ పనికత్తె అతనిని చూచి–వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరల చెప్పసాగెను. అతడు మరల–నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచి–నిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలయుడవు గదా అనిరి. అందుకతడు–మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి, శపించుకొనుటకును ఒట్టుబెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే రెండవమారు కోడికూసెను గనుక–కోడి రెండు మారులు కూయకమునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను. ఉదయముకాగానే ప్రధానయాజకులును పెద్ద లును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచనచేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు–యూదులరాజవు నీవేనా? అని ఆయన నడుగగా ఆయన–నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరల–నీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడెను. ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు. అధికారుల నెదిరించి, కలహములో నరహత్య చేసినవారితోకూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడివచ్చి, అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా [9-10] ప్రధానయాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలిసికొని–నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను. *** అతడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు–ఆలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరల వారి నడిగెను. వారు–వానిని సిలువవేయుమని మరల కేకలువేసిరి. అందుకు పిలాతు–ఎందుకు? అతడే చెడుకార్యము చేసె నని వారి నడుగగా వారు–వానిని సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను. అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమకూర్చుకొనినతరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తలమీదపెట్టి, –యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమ్మివేసి, మోకాళ్లూని ఆయనకు నమస్కారముచేసిరి. వారు ఆయనను అపహసించిన తరు వాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయుటకు తీసికొనిపోయిరి. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతముచేసిరి. అతడు అలెక్సంద్రునకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసికొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము. అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చుకొనలేదు. వారాయనను సిలువవేసి, ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లువేసి, వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను. మరియు–యూదులరాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరమును వ్రాసి పైగానుంచిరి. [27-29] మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతోకూడ సిలువవేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు —ఆహా దేవాలయమును పడగొట్టి మూడుదినములలో కట్టువాడా, *** *** సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రు లును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచు–వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువమీదనుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతోకూడ సిలువ వేయబడినవారును ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని–అదిగో ఏలీయాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింపవచ్చునేమో చూతమనెను. అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను. ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి–నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్ర్తీలనేకులును వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతిదినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు. పిలాతు — ఆయన ఇంతలోనే చని పోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతిని తనయొద్దకు పిలిపించి–ఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను. శతాధిపతివలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను. అతడు నారబట్టకొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి. విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములుకొనిరి. [2-3] వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా, —సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. *** వారు వచ్చి కన్నులెత్తిచూడగా, రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి యెంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించుకొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందు కతడు కలవర పడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను. వారు బయటకు వచ్చి, విస్మయము నొంది వణకుచు సమాధియొద్దనుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్పలేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. [10-11] ఆయనతో ఉండినవారు దుఃఖపడి యేడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియ జేసెను గాని, ఆయన బ్రదికియున్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి. *** ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారురూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మక పోయిరి. పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు–మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై యుండి, వెనువెంట జరుగుచువచ్చిన సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఘనతవహించిన థెయొఫిలా, ఆరంభమునుండి కన్నులార చూచి వాక్యసేవకులైనవారు మనకు [2-4] అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని. *** *** యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరు ప్రభువుయొక్క సకలమైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవునిదృష్టికి నీతిమంతులై యుండిరి. ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి. ) జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవునియెదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపమువేయు టకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడా దూత అతనితో జెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీస బెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. [14-16] అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. *** *** మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లలతట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతో షింతురనెను. జెకర్యా–యిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా దూత–నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినమువరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను. ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలుచేయుచు, మూగవాడై యుండెను. అతడు సేవచేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన యింటికి వెళ్లెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భ వతియై–మనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను. ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి–దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. [29-30] ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి–ఈ శుభవచన మేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత — మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. *** ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియ–నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత–పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించియున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము; దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియ–ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాటచొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను. ఎలీసబెతు మరియయొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను — స్ర్తీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియ యిట్లనెను— నా ప్రాణము ప్రభువు ను ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలనియందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెనువారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను. [54-55] అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. *** అంతట మరియ,యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను. ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచె నని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతోకూడ సంతోషించిరి. ఎనిమిదవదినమునవారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా తల్లి–ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను. అందుకు వారు–నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరు చున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి. అతడు వ్రాతపలక తెమ్మని–వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. అందునుబట్టి వారి చుట్టుపెట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచురమాయెను. ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులనుగూర్చి వినినవారందరును —ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడైయిట్లు ప్రవచించెను — [68-75] ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను. దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. *** *** *** *** *** *** *** [76-79] మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు మన దేవుని మహావాత్సల్యమునుబట్టి వారి పాపము లను క్షమించుటవలన తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్య మునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శన మనుగ్రహించెను. *** *** *** శిశువు ఎదిగి, ఆత్మయందు బలముపొంది, ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్యములో నుండెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి. [4-5] యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియైయుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను. *** వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత–భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్ట బడి యొకతొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెద రని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతోకూడనుండి –సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొఱ్ఱెల కాపరులు–జరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్నవారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను. అంతట ఆ గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. [22-24] మోషే ధర్మశాస్త్రముచొప్పునవారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు –ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువు కు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయ నను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి. *** *** యెరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలు పరచబడి యుండెను; ఆత్మ వశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. [27-28] అంతట ధర్మశాస్త్రపద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొనివచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను — *** [29-32] —నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధాన ముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని. *** *** *** యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్ప బడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమెయోను వారిని దీవించి–ఇదిగో అనేక హృదయాలోచనలు బయలు పడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు; మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవస్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెని మిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై, యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను. ఆమె కూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయననుగూర్చి మాటలాడుచుండెను. అంతట వారు ప్రభువు ధర్మశాస్ర్తము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను. పస్కాపండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్లుచుండువారు. ఆయన పండ్రెం డేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుకచొప్పునవారు యెరూషలేమునకు వెళ్లిరి. ఆ దినములు తీరినతరువాత వారు తిరిగి వెళ్లుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తలి దండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగిపోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయ నను వెదకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. మూడుదినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకులమధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి–కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని అయనతో చెప్పగా ఆయన–మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను; అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతట ఆయన వారితోకూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియ అధిపతిగాను, అన్నయు, కయపయు ప్రధానయాజకులుగాను, ఉన్నకాలమున అరణ్యములోనున్న జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. [3-6] అంతట అతడు వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించుచుండెను. — ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళముచేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్ననివగును కరకు మార్గములు నున్ననివగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలువేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. *** *** *** అతడు తనచేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి–సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధిచెప్పిన వాడెవడు? మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించుడి — అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలుపెట్టుకొనవద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రా హామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పు చున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. అందుకు జనులు–ఆలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా అతడు–రెండు అంగీలుగలవాడు ఏమియు లేనివానికియ్యవలెననియు, ఆహారముగలవాడును ఆలాగే చేయవలెననియు వారితో చెప్పెను. సుంకరులును బాప్తిస్మము పొందవచ్చి–బోధకుడా, మేమేమి చేయవలెనని అతని నడుగగా అతడు–మీకు నిర్ణయింపబడినదాని కంటె ఎక్కువ తీసికొనవద్దని వారితో చెప్పెను. సైనికులును —మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడు–ఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను. ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరును యోహానునుగూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా యోహాను — నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తి మంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మ లోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును; ఆయన చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఇదియుగాక అతడింకను, చాల సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించు చుండెను. అయితే చతుర్థాధిపతియైన హేరోదుచేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు అదివరకు తాను చేసినవన్నియు చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు–నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి, మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి, నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోశేఖుకు, యోశేఖు యోదాకు, యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీ యేలుకు, షయల్తీయేలు నేరికి, నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయెజెరుకు, ఎలీయెజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీ దుకు, దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు, నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు, యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెరహుకు, తెరహు నాహోరుకు, నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు, షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు, లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహలలేలుకు, మహలలేలు కేయినానుకు, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దానునదినుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాదిచేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది–నీవు దేవుని కుమారుడ వైతే, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను అందుకు యేసు –మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి –ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు –నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తర మిచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి–నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడనుండి క్రిందికి దుముకుము నిన్ను కాపాడుటకు నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు –నీ దేవుడైన ప్రభువు ను శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను. ఆయన అందరిచేత ఘనతనొంది, వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తనవాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా — –ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. [20-21] ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజమందిరములోనున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయన–నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. *** అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి–ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి–వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన–ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడుకాడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను. [25-26] ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను, ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. *** మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములోనుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయ వలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొనిపోయిరి. అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను. అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి, విశ్రాంతిదినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతోకూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజమందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మపెట్టిన వాడొక డుండెను. వాడు–నజరేయుడవైన యేసూ, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీ వెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు–ఊరకుండుము, ఇతనిని వదలి పొమ్మని దానిని గద్దింపగా, దయ్యము వానిని వారిమధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదలి పోయెను. అందు కందరు విస్మయమొంది ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞా పింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి. అంతట ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను. ఆయన సమాజమందిరములోనుండి లేచి, సీమోను ఇంటిలోనికి వెళ్లెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరో వారందరు ఆ రోగులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచి, వారిని స్వస్థపరచెను. ఇంతేకాక దయ్యములు–నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయనయొద్దకు వచ్చి, తమ్మును విడిచి పోకుండ ఆపగా ఆయన–నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను. తరువాత ఆయన యూదయ సమాజమందిరములలో ప్రకటించుచుండెను. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి, ఆ సరస్సు తీరముననున్న రెండుదోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి— దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత–నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను — ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాటచొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పెట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలుమునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పెట్టిన చేపల రాశికి అతడును అతనితోకూడనున్నవారందరును విస్మయమొందిరి. ఆలాగున సీమోనుతోకూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయ మొందిరి). అందుకు యేసు–భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన యొక పట్టణములోనున్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి, సాగిలపడి–ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడాయన చెయ్యిచాపి వానిని ముట్టి–నాకిష్టమే; నీవు శుద్ధుడవుకమ్మని అనగానే, కుష్ఠరోగము వానిని విడిచెను. అప్పుడాయన–నీవు ఎవనితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. అయితే ఆయననుగూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్లుచుండెను. ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయదేశముల ప్రతి గ్రామమునుండియు యెరూషలేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశ కులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచముమీద మోసికొని, వానిని లోపలికి తెచ్చి, ఆయన యెదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపుకూడి యుండి నందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను గనుక, ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి, మంచముతోకూడ యేసు ఎదుట వారిమధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి–మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా, శాస్త్రులును పరిసయ్యులును–దేవదూషణ చేయుచున్న యితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచన లెరిగి–మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? –నీ పాపములు క్షమింపబడి యున్నవని చెప్పుట సులభమా? —నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి–నీవు లేచి, నీ మంచమెత్తికొని, నీ యింటికి వెళ్లుమని నీతో చెప్పుచున్నాననెను. వెంటనే వాడు వారియెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తికొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను. అందరును విస్మయమొంది–నేడు గొప్ప వింతలు చూచితి మని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. అటుపిమ్మట ఆయన బయలుదేరి, లేవి యను ఒక సుంకరి, సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి —నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి, ఆయనను వెంబడించెను. ఆ లేవి, తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితోకూడ భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి–సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి. అందుకు యేసు — రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు. మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. వారాయనను చూచి–యోహాను శిష్యులు తరచుగా ఉపవాసప్రార్థనలు చేయుదురు; ఆలాగే పరి సయ్యుల శిష్యులును చేయుదురు గాని, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు–పెండ్లికుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా— ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసికవేయడు; వేసినయెడల క్రొత్తది దానిని చింపివేయును; అదియునుగాక క్రొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులును పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును లేడు; పాతదే మంచిదనునని చెప్పెను. ఒక విశ్రాంతిదినమున ఆయన పంటచేలలోబడి వెళ్లు చుండగా, ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి, చేతులతో నలుపుకొని, తినుచుండిరి. అప్పుడు పరిసయ్యులలో కొందరు–విశ్రాంతిదినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారినడుగగా యేసు వారితో ఇట్లనెను–తానును తనతోకూడ ఉన్నవారును ఆకలిగొని నప్పుడు దావీదు ఏమిచేసెనో అదియైనను మీరు చదువ లేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరును తినకూడని సముఖపు రొట్టెలు తీసికొని తిని, తనతోకూడ ఉన్నవారికిని ఇచ్చెను గదా అనెను. కాగా–మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును యజమానుడని వారితో చెప్పెను. మరియొక విశ్రాంతిదినమున ఆయన సమాజమందిరములోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు, అక్కడ ఊచ కుడి చెయ్యిగలవాడొకడుండెను. శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నేరము మోపవలెనని, విశ్రాంతిదినమున స్వస్థ పరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి; అయితే ఆయన వారి ఆలోచన లెరిగి, ఊచచెయ్యిగలవానితో— నీవు లేచిమధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు–విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి వారినందరిని చుట్టు కలయజూచి–నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెఱ్ఱి కోపముతో నిండుకొని, యేసును ఏమి చేయుదమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి. ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను. వీరెవరనగా–ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన వారితోకూడ దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్పసమూహమును, ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమంతటినుండియు, యెరూషలేమునుండియు, తూరుసీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండియు వచ్చిన బహుజనసమూహమును, అపవిత్రాత్మల చేత బాధింపబడినవారును వచ్చి స్వస్థతనొందిరి. ప్రభావము ఆయనలోనుండి బయలుదేరి అందరిని స్వస్థపరచు చుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నముచేసెను. అంతట ఆయన తన శిష్యులతట్టు పారచూచి ఇట్లనెను— బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పిత రులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో, ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొంది యున్నారు. అయ్యో యిప్పుడు (కడుపు) నిండియున్నవారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్తురు. మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా–మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలుచేయుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండ అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము; నీ సొత్తు ఎత్తికొని పోవువానియొద్ద దాని మరల అడుగవద్దు. మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించువారిని ప్రేమింతురు గదా మీకు మేలుచేయువారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పుకలుగును? పాపులును ఆలాగే చేతురు గదా మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులైయుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడ లను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కని కరముగలవారై యుండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను–గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకునికంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో–సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలములవలన తెలియబడును. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు. సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును. నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక— ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి, నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియ జేతును. వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలియుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టినవానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పడెను; ఆ యింటిపాటు గొప్పదని చెప్పెను. ఆయన తన మాటలన్నియు ప్రజలకు సంపూర్తిగా విని పించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమైయుండెను. శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి–నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు; అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితోకూడ వెళ్లెను. ఆయన ఆ యింటిదగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి–మీ రాయనయొద్దకు వెళ్లిప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు; అయితే మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రిందను సైనికులు ఉన్నారు; నేనొకని పొమ్మంటె పోవును, ఒకని రమ్మంటె వచ్చును, నాదాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని, అతనిగూర్చి ఆశ్చర్యపడి, తనవెంట వచ్చుచున్న జనసమూహమువైపు తిరిగి–ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాననెను. పంపబడినవారు ఇంటికి తిరిగివచ్చి, ఆ దాసుడు స్వస్థుడైయుండుట కనుగొనిరి. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లుచుండగా, ఆయన శిష్యులును బహుజనసమూహమును ఆయనతోకూడ వెళ్లుచుండిరి. ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతోకూడ ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి–ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన —చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరు భయాక్రాంతులై–మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించియున్నాడనియు దేవుని మహిమపరచిరి. ఆయననుగూర్చిన యీ సమాచారము యూదయ యందంతటను చుట్టుపెట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను. యోహాను శిష్యులు ఈ సంగతులన్నియు అతనికి తెలియజేసిరి. అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి–రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. ఆ మనుష్యులు ఆయనయొద్దకు వచ్చి —రాబోవువాడవు నీవేనా? లేక మరియొకనికొరకు మేము కనిపెట్టవలెనా? అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీయొద్దకు పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములును, బాధలును, అపవిత్రాత్మలునుగల అనేకులను స్వస్థపరచి, చాలమంది గ్రుడ్డివారికి చూపు దయ చేసెను. అప్పుడాయన–మీరు వెళ్లి, కన్నవాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపుపొందు చున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రక టింపబడుచున్నది; నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. యోహాను దూతలు వెళ్లిన తరువాత, ఆయన యోహా నునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను–మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరేమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్తవస్త్రములు ధరించుకొని, సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. అయితే మరేమి చూడవెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పు చున్నాను. –ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపు చున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని యెవరినిగూర్చి వ్రాయబడెనో అతడే యీ యోహాను. స్ర్తీలు కనినవారిలో యోహానుకంటె గొప్పవాడెవడును లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడని మీతో చెప్పు చున్నాను. ప్రజలందరును సుంకరులును (యోహాను బోధ) విని, అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై, దేవుడు న్యాయవంతుడని యొప్పుకొనిరి గాని పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి యీ తరము మనుష్యులను నేను దేనితో పోల్చు దును, వారు దేనిని పోలియున్నారు? సంతవీధులలో కూర్చుండియుండి–మీకు పిల్లనగ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితిమి గాని మీరేడ్వ రైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. బాప్తిస్మ మిచ్చు యోహాను, రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక–వీడు దయ్యముపెట్టినవాడని మీ రనుచున్నారు. మనుష్యకుమారుడు తినుచును, త్రాగుచును వచ్చెను గనుక మీరు–ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితు డును అనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరినిబట్టి తీర్పుపొందుననెను. పరిసయ్యులలో ఒకడు తనతోకూడ భోజనము చేయవలెనని ఆయననడిగెను. ఆయన ఆ పరిసయ్యుని యింటికి వెళ్లి, భోజనపంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్ర్తీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదము లను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి–ఈయన ప్రవక్తయైనయెడల తన్ను ముట్టుకొనిన యీ స్ర్తీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను. అందుకు యేసు— సీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడుబోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు–అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థు లుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను–అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన–నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్ర్తీవైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను–ఈ స్ర్తీని చూచుచున్నావే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి –నీ పాపములు క్షమింపబడియున్నవి అని ఆమెతో అనెను. అప్పుడాయనతోకూడ భోజన పంక్తిని కూర్చుండినవారు–పాపములు క్షమించుచున్న యితడెవ డని తమలోతాము అనుకొనసాగిరి. అందుకాయన— నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్ర్తీతో చెప్పెను. వెంటనే ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్ర్తీలును, అనగా ఏడు దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదుయొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతోకూడ ఉండిరి. వీరును ఇతరు లనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. బహుజనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను –విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మ్రింగివేసెను. మరి కొన్ని రాతినేలను పడి, మొలిచి, చెమ్మలేనందున ఎండిపోయెను. మరి కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను. మరికొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు–వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు–ఈ ఉపమానభావమేమిటని ఆయనను అడుగగా ఆయన–దేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడుచున్నవి.) ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్కనుండువారు, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములోనుండి వాక్యమెత్తికొని పోవును. రాతినేలనుండు వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనకాలమున తొలగిపోవుదురు. ముండ్ల పొదలలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవనసంబంధమైన విచారములచేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. మంచి నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభముమీద దానిని పెట్టును. తేటపరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయ బడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియు లేదు. కలిగినవానికి ఇయ్యబడును, లేనివానియొద్దనుండి తనకు కలదని అనుకొనునది కూడ తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. ఆయన తల్లియు సహోదరులును ఆయనయొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయనదగ్గరకు రాలేక పోయిరి. అప్పుడు–నీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి. అందుకాయన–దేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను. మరియొకనాడు ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోనెను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్లుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సుమీదికి వచ్చి దోనె నీళ్లతో నిండినందునవారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయనయొద్దకు వచ్చి–ప్రభువా ప్రభువా, నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి, గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను. అప్పుడాయన —మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి–ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. వారు గలిలయకు ఎదురుగాఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను. వాడు దయ్యములుపెట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టుకొనక, సమాధులలోనేగాని యింటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి, కేకలువేసి ఆయన యెదుట సాగిలపడి–యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసి చెప్పెను. ఏలయనగా ఆయన–ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచువచ్చెను గనుక వానిని గొలుసులతోను కాలిసంకెళ్లతోను కట్టి కావలియందుంచిరి గాని, వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. [30-31] యేసు–నీ పేరేమని వానినడుగగా, చాల దయ్యములు వానిలో చొచ్చి యుండెను గనుక, వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. *** అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయుచుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను. మేపుచున్నవారు జరిగినదానిని చూచి, పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచినవారు దయ్యములు పెట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా [37-38] గెరసీనీయుల ప్రాంతములలోనుండు జనులందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతోకూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. *** అయితే ఆయన–నీవు నీ యింటికి తిరిగి వెళ్లి, దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చేసెనో ఆ పట్టణ మందంతటను ప్రకటించెను. జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతట ఇదిగో సమాజమందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీదపడి యించుమించు పండ్రెండేండ్ల యీడుగల తనయొక్కతే కుమార్తె చావ సిద్ధముగ ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి. అప్పుడు పండ్రెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్ర్తీ యెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. –నన్నుముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును–మేమెరుగమన్నప్పుడు, పేతురు–ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా యేసు–ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలి పోయినదని, నాకు తెలిసిన దనెను. తాను మరుగై యుండలేదని, ఆ స్ర్తీ చూచి, వణకుచు వచ్చి ఆయన యెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరియెదుట తెలియజెప్పెను. అందుకాయన–కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్మని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి యొకడు వచ్చి–నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమపెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాటవిని–భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి యింటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తలిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు. అందరును ఆమె నిమిత్తమై యేడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా, ఆయన వారితో —ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయెనని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని —చిన్నదానా, లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగివచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన —ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి. అంతట ఆయన— జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను. ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను. మరియు ఆయన–మీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొని పోవద్దు; రెండు అంగీలు ఉంచు కొనవద్దు. మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థ పరచుచు గ్రామములలో సంచారము చేసిరి. చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు–యోహాను మృతులలోనుండి లేచెననియు, కొందరు–ఏలీయా కనబడెననియు; కొందరు–పూర్వ కాలపు ప్రవక్తయొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి. అప్పుడు హేరోదు–నేను యోహానును తల గొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నియు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంట బెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను. జన సమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థ పరచెను. ప్రొద్దు గ్రుంక నారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి–మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపెట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించు కొనునట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి. ఆయన–మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు–మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. [14-15] వచ్చినవారు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు. ఆయన–వారిని ఏబదేసిమంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి. *** అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశమువైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరుతిని తృప్తి పొం దిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపెళ్లెత్తిరి. ఒకప్పుడాయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనయొద్ద ఉండిరి. —నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారి నడుగగా వారు— బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు— ఏలీయాయనియు, కొందరు— పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయనమీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురు–నీవు దేవుని క్రీస్తువనెను. ఆయన —ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను —ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టుకొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము? నన్నుగూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో వానిగూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ధదూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచిచూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాననెను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెని మిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అనువారు. వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితోకూడ ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతోకూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి. (ఆ యిద్దరు పురుషులు) ఆయనయొద్ద నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో–ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. అతడీలాగు మాటలాడుచుండగా మేఘ మొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు— ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకుండిరి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పెట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడిం చుచు గాయపరచుచు వానిని వదలి వదలకుండును. దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను. అందుకు యేసు —విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, నేనెంతకాలము మీతోకూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొని రమ్మని చెప్పెను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడిం చెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థ పరచి వాని తండ్రి కప్పగించెను. గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్య పడుచుండగా ఆయన–ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారామాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగుచేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి. –ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడైయుండునో వాడే గొప్ప వాడని వారితో చెప్పెను. యోహాను–ఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను. అందుకు యేసు — మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. [54-55] శిష్యులైన యాకోబును యోహానును అది చూచి–ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను. *** అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి. వారు మార్గమున వెళ్లుచుండగా ఒకడు–నీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు–నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరియొకనితో–నా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను అందుకాయనమృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. మరియొకడు —ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా యింట నున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా యేసు–నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను. అటుతరువాత ప్రభువు డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడాయన వారితో ఇట్లనెను–కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెపిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు; త్రోవలో ఎవనినైనను కుశలప్రశ్న లడుగవద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు–ఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి. సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు. మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందరపెట్టునవి తినుడి. అందులో నున్న రోగులను స్వస్థపరచుడి–దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయినయెడల మీరు దాని వీధులలోనికి పోయి–మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీపించియున్నదని తెలిసికొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు. అయినను విమర్శకాలమునందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండును. ఓ కపెర్నహూమా, ఆకా శము మట్టుకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను. ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి —ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన–సాతాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట చూచితిని. ఇదిగో పాము లను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి–తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూల మాయెను. సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింప బడియున్నది; కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలు పరచనుద్దేశించునోవాడును తప్ప, మరెవడును ఎరుగడని చెప్పెను. అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి–మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి; అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందు వారితో అనెను. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి— బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను. అందు కాయన–ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీ వేమి చదువుచున్నావని అతని నడుగగా అతడు–నీ దేవుడైన ప్రభువు ను నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నదని చెప్పెను. అందుకాయన–నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి, అతడు–అవును గాని నా పొరుగువాడెవడని యేసునడిగెను. అందుకు యేసు ఇట్లనెను–ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను. ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను. మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవానికిచ్చి–ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచు చున్నది అని యేసు అడుగగా అతడు–అతనిమీద జాలి పడినవాడే అనెను. అందుకు యేసు–నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్ర్తీ ఆయనను తన యింట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరి యుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయనయొద్దకు వచ్చి–ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు —మార్తా, మార్తా, నీవనేకమైన పనులనుగూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఆయన యొక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రాౖర్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు— ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను. అందు కాయన–మీరు ప్రార్థన చేయునప్పుడు–తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము; మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను–మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి–స్నేహితుడా, నాకు మూడురొట్టెలు బదులిమ్ము; నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నాయొద్దకు వచ్చియున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల అతడు లోపలనేయుండినన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొని యున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును;తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టుచుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు–వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు–పరలోకము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగిరి. ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను–తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును; తనకుతానే విరోధమైన యిల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడినయెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులైయుందురు. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యము లను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున–నేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి వెళ్లి, తనకంటె చెడ్డైవెన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డదగునని చెప్పెను. ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక స్ర్తీ ఆయనను చూచి–నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయనఅవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన యీలాగు చెప్పసాగెను–ఈ తరమువారు దుష్టతరము వారై యుండి సూచకక్రియ నడుగుచున్నారు. అయితే యోనానుగూర్చిన సూచకక్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు. యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉండెనో ఆలాగే మనుష్య కుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును. దక్షిణదేశపు రాణి విమర్శకాలమున ఈ తరమువారితోకూడ లేచి వారిమీద నేరస్థాపనచేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను, ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు. నీనెవె మనుష్యులు విమర్శకాలమున ఈ తరమువారితోకూడ నిలువబడి వారిమీద నేరస్థాపనచేయుదురు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి; ఇదిగో యోనా కంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు. ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగుమయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును. కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచుకొనుము. ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగు మయమైతే, దీపము తన కాంతివలన నీకు వెలు గిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమై యుండునని చెప్పెను. ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతోకూడ భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజనపంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభువిట్లనెను–పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడు తనముతోను నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించుచున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసియున్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజమందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమా ధులవలె ఉన్నారు; వాటిమీద నడుచు మనుష్యులు (అవి సమాధులని) యెరుగరనెను. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు — బోధకుడా, యీలాగు చెప్పి మమ్మును కూడ నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన–అయ్యో, ధర్మశాస్ర్తప్రదేశకులారా, మోయ శక్యముకాని బరువులను మీరు మనుష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. అయ్యో, మీపితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీపితరుల కార్యములకు సమ్మతించుచున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగా–నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకునుమధ్యను నశించిన జెకర్యా రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పు చున్నాను. అయ్యో, ధర్మశాస్ర్తప్రదేశకులారా, మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొనిపోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను. [53-54] ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను–పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి. మరుగైన దేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనునవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది మిద్దెలమీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా— దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు. మీ తలవెండ్రుక లన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యులయెదుట ఒప్పుకొనువాడెవడో, మనుష్యకుమారుడు దేవుని దూతల యెదుట వానిని ఒప్పుకొనును. మనుష్యులయెదుట నన్ను ఎరుగననువానిని, నేనును ఎరుగనని దేవుని దూతలయెదుట చెప్పుదును. మనుష్యకుమారునిమీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగునుగాని, పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. వారు సమాజమందిరముల పెద్దలయొద్దకును అధిపతులయొద్దకును అధికారులయొద్దకును మిమ్మును తీసికొని పోవునప్పుడు మీరు–ఏలాగు ఏమి ఉత్తరమిచ్చెదమా, యేమి మాటలాడుదుమా అని చింతింపకుడి, మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. ఆ జనసమూహములో ఒకడు–బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా ఆయన–ఓయీ, మీమీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో–మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను —ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు–నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని — నేనీలాగు చేతును; నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో — ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. అయితే దేవుడు–వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను. అంతట ఆయన తన శిష్యులతో ఇట్లనెను–ఈ హేతువుచేత మీరు — ఏమి తిందుమో, అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో, అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి. ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుటవలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొన గలడు? కాబట్టి అన్నిటికంటె తక్కువైనవి మీచేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేల? పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్తవైభవముతోకూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి, రేపు పొయిలోవేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెదకుదురు; ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితోకూడ ఇవి మీ కనుగ్రహింపబడును. చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించు కొనుడి; అక్కడికి దొంగరాడు, చిమ్మెటకొట్టదు మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యులవలె ఉండుడి. ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను (ఏ దాసులు) మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ యే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి, తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. అప్పుడు పేతురు–ప్రభువా, యీ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోను చెప్పుచున్నావా? అని ఆయన నడుగగా ప్రభువు ఇట్లనెను–తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి, వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగినదానియంతటిమీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు–నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని, దాసులను దాసీలనుకొట్టి, తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి, అపనమ్మకస్థులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్త మెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపకఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరువరకు నేనెంతో ఇబ్బందిపడుచున్నాను. నేను భూమిమీద సమాధానము కలుగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు; భేదమునే కలుగజేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను— మీరు పడమటనుండి మబ్బు పైకి వచ్చుట చూచునప్పుడు —వానవచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు; ఆలాగే జరుగును. దక్షిణపు గాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు; ఆలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు; ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేల? ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేల? వాదించువానితోకూడ అధికారియొద్దకు నీవు వెళ్లుచుండగా అతనిచేతినుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము, లేదా, అతడొకవేళ నిన్ను న్యాయాధిపతియొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును. నీవు కడపటి కాసు చెల్లించువరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాననెను. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను–ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందునవారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్నవారందరికంటె అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను —ఒక మనుష్యుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చి నప్పుడు ఏమియు దొరకలేదు గనుక అతడు–ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు; దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను. అయితే వాడు–అయ్యా, నేను దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడ ఉండనిమ్ము; అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుమని అతనితో చెప్పెను. విశ్రాంతిదినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్లనుండి బలహీన పరచు దయ్యము పెట్టిన యొక స్ర్తీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి–అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి ఆమెమీద చేతులుంచ గానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచినందున ఆ సమాజమందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహమును చూచి–పనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు–వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతిదినమున తన యెద్దునైనను గాడిదనైనను గాడియొద్దనుండి విప్పి, తోలుకొనిపోయి, నీళ్లు పెట్టును గదా. ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింప దగదా? అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను. ఆయన–దేవుని రాజ్యము దేనిని పోలియున్నది? దేనితో దాని పోల్తును? ఒక మనుష్యుడు తీసికొనిపోయి తన తోటలోవేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయెను; ఆకాశపక్షులు దాని కొమ్మలయందు నివసించెననెను. మరల ఆయన–దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్ర్తీ తీసికొని, అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచా రము చేయుచుండెను. ఒకడు–ప్రభువా, రక్షణపొందువారు కొద్దిమందేనా? అని ఆయన నడుగగా ఆయన వారిని చూచి–ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి–అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు ఆయన–మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరునీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు. అప్పుడాయన— మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు చున్నాను; అక్రమముచేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును. అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పునుండియు పడమటనుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియువచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి–నీ విక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంప గోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి–మీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి— ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్లగొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవదినమున పూర్ణ సిద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీ రొల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నది— ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను. విశ్రాంతిదినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని యింటిలోనికి వెళ్లినప్పుడు, ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగముగల యొకడు ఆయన యెదుట ఉండెను. [3-4] యేసు–విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా? అని ధర్మశాస్త్రోపదేశ కులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పు డాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి *** –మీలో ఎవని గాడిదయైనను ఎద్దయినను గుంటలో పడినయెడల విశ్రాంతిదినమున దానిని పైకి తీయడా? అని వారి నడిగెను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. పిలువబడినవారు భోజనపంక్తిని అగ్రపీఠములు ఏర్పరచు కొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. –నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతనిచేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి —ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గు పడి కడపటి చోటున కూర్చుండసాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు, నిన్ను పిలిచినవాడు వచ్చి–స్నేహి తుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము; అప్పుడు నీతోకూడ కూర్చుండువారందరియెదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. మరియు ఆయన తన్ను పిలిచినవానితో ఇట్లనెను— నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు; వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుప కారము కలుగును. అయితే నీవు విందుచేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. ఆయనతోకూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలో ఒకడు ఈ మాటలు విని–దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో నిట్లనెను–ఒక మనుష్యుడు గొప్ప విందుచేయించి అనేకులను పిలిచెను. విందుకాలమందు అతడు — ఇప్పుడు సిద్ధమైయున్నది, రండని పిలువబడినవారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు— నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడు కొనుచున్నాననెను. మరియొకడు–నేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను. మరి యొకడు — నేనొక స్ర్తీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను. అప్పుడా దాసుడు తిరిగి వచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ యింటి యజమానుడు కోపపడి–నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీను లను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొనిరమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతట దాసుడు–ప్రభువా, నీ వాజ్ఞాపించినట్టు చేసితినిగాని యింకను చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు–నా యిల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము; ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచిచూడడని మీతో చెప్పుచున్నాననెను. [25-26] బహుజనసమూహములు ఆయనతోకూడ వెళ్లు చున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి–ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. *** మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురముకట్టింపగోరినయెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా? చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున చూచువారందరు–ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు. మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేలమందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా. ఆప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని వారితో చెప్పెను. ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులును శాస్త్రులును అది చూచి–ఇతడు పాపులను చేర్చుకొని వారితోకూడ భోజనముచేయుచున్నాడని చాల సణుగుకొనిరి. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను –మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలుకలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా? అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి –మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినదని వారితో చెప్పును గదా. అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనను పది వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి —నాతోకూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినదని వారితో చెప్పును గదా. అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పు చున్నాననెను. మరియు ఆయన ఇట్లనెను–ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు–తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్నిదినములైన తరు వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను. [14-15] అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడసాగి, వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. *** వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు–నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి —ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము; ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్దకుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి–ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో–నీ తమ్ముడు వచ్చియున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో–ఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. అందుకతడు–కుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను–ఒక. ధనవంతునియొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతనియొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి— నిన్నుగూర్చి నేను వినుచున్న యీ మాట ఏమిటి? నీ గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుము; నీవు ఇక మీదట గృహనిర్వాహకుడవై యుండ వల్లకాదని వానితో చెప్పెను. ఆ గృహనిర్వాహకుడు తనలో తాను–నా యజమానుడు ఈ గృహనిర్వాహకత్వపు పనిలోనుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహనిర్వాహ కత్వపు పనినుండి తొలగించునప్పుడు వారు నన్ను తమ యిండ్లలోనికి చేర్చుకొనునట్లు ఏమి చేయవలెనో నాకు తెలియుననుకొని, తన యజమానుని ఋణస్థులలో ఒక్కొక్కని పిలిపించి–నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాని నడిగెను. వాడు— నూరు మణుగుల నూనె అని చెప్పగా–నీవు నీ చీటి తీసికొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసి కొమ్మని వానితో చెప్పెను. తరువాత వాడు–నీవు ఎంత అచ్చియున్నావని మరియొకని నడుగగా వాడు— నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో–నీవు నీ చీటి తీసికొనియెనుబది తూములని వ్రాసికొమ్మని చెప్పెను. అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధులకంటె ఈ లోక సంబంధులు తమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులై యున్నారు. అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విష యములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా ఆయన–మీరు మనుష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవునిదృష్టికి అసహ్యము. యోహాను కాలమువరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలును ఉండిరి; అప్పటినుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది; ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పి పోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. తన భార్యను విడనాడి, మరియొకతెను వివాహము చేసికొను ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు; భర్తను విడిచినదానిని వివాహము చేసికొనువాడు వ్యభిచరించుచున్నాడు. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి –తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను–నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను. అందుకు అబ్రాహాము — కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను. అప్పుడతడు–తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. అందుకు అబ్రాహాము–వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు–తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లినయెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు–మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలోనుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను. ఆయన తన శిష్యులతో ఇట్లనెను–అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ. వాడీ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటె వాని మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందినయెడల అతని క్షమించుము. అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపుతిరిగి–మారుమనస్సు పొందితిననినయెడల అతని క్షమింపవలెననెను. అపొస్తలులు–మా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు–మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచి–నీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చినప్పుడు–నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక–నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత — మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయలమధ్యగా వెళ్లుచుండెను. ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి –యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి–మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు. అందుకు యేసు–పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి –నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను. దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయన–దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తర మిచ్చెను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను–మనుష్య కుమారుని దినములలో ఒకదినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చునుగాని మీరు ఆ దినమును చూడరు. వారు–ఇదిగో యిక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినయెడల వెళ్లకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒక దిక్కునుండి మెరుపుమెరిసి, ఆకాశముక్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది యీ తరము వారిచేత ఉపేక్షింపబడవలెను. నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను. ఆప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దెమీదఉండు వాడు ఇంటఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగకూడదు; ఆలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి యిద్దరొక్క మంచముమీద ఉందురు; వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును. [35-37] ఇద్దరు స్ర్తీలు ఒక్క తిరుగలి విసరుచుందురు; ఒకతె కొనిపోబడును ఒకతె విడిచిపెట్టబడుననెను. శిష్యులు–ప్రభువా, యిది ఎక్కడ (జరుగు) నని ఆయన నడిగినందుకు ఆయన–పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె. ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. –దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చి–నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు–నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను. మరియు ప్రభువిట్లనెను–అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనినవారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారివిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? తామే నీతిమంతులని తమ్మునమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. –ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి–దేవా, నేను చోరులును అన్యా యస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉప వాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు–దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయనయొద్దకు వారిని తీసికొనిరాగా ఆయన శిష్యులు అది చూచి తీసి కొనివచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తనయొద్దకు పిలిచి–చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది. చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఒక అధికారి ఆయనను చూచి–సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన నడిగెను. అందుకు యేసు–నేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింప వద్దు, నరహత్యచేయ వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తలి దండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను. అందుకతడు–బాల్యమునుండి వీటినన్నిటిని అనుసరించుచునే యున్నాననెను. యేసు విని–నీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతని చూచి —ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను. ఇది వినినవారు–ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన–మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. పేతురు— ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా [29-30] ఆయన–దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును, ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. *** ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి–ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెర వేర్చబడును. ఆయన అన్యజనుల కప్పగింపబడును; వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయనమీద ఉమ్మి వేసి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు; మూడవదినమున ఆయన మరల లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు; ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవప్రక్కను కూర్చుండి భిక్షమడుగుకొను చుండెను. జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని–ఇది ఏమని అడుగగా వారు–నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్లుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు–యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా –ఊరకుండుమని ముందర నడుచుచుండినవారు వానిని గద్దించిరి గాని, వాడు మరి ఎక్కువగా–దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేసెను. అంతట యేసు నిలిచి, వానిని తనయొద్దకు తీసికొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన–నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, వాడు–ప్రభువా, చూపు పొందగోరుచున్నాననెను. యేసు–చూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను; వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుటవలన చూడ లేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి–జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరు అది చూచి–ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి–ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు–ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజ కుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాల నిచ్చి–నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి–ఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను. మొదటివాడాయన యెదుటికి వచ్చి–అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా అతడు–భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణములమీద అధికారివై యుండుమని వానితో చెప్పెను. అంతట రెండవవాడు వచ్చి–అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా అతడు–నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను. అంతట మరియొకడు వచ్చి–అయ్యా, యిదిగో నీ మినా; నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయువాడవునైన కఠినుడవు గనుక, నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను. అందుకతడుచెడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తువాడను, విత్తనిదానిని కోయు వాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి –వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను. వారు–అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి. అందుకతడు–కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలు టకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ల వలెనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవలకొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, తన శిష్యుల నిద్దరిని పిలిచి –మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు; దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైననుమీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్ము నడిగినయెడల–ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడినవారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులు–మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి. అందుకు వారు–ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్లమీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి, ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగునపరచిరి. ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు –ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు–బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి–వీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి –నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి. (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతోకూడ నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను. [45-46] ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్ర యము చేయువారితో –నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను. *** ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించు చున్నప్పుడు, ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనముచేయ జూచుచుండిరి గాని ప్రజలందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలతోకూడ ఆయన మీదికివచ్చి –నీవు ఏ అధికారమువలన ఈ కార్యము చేయుచున్నావో, యీ అధికారము నీ కెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకాయన— నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారినడుగగా వారు–మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల–ఆలాగైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని — అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు–ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితోననెను. అంతట ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్ప సాగెను — ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, కాపులకు గుత్తకిచ్చి, దేశాంతరముపోయి బహుకాల ముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపులయొద్ద కొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపి వేసిరి. మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి, వట్టిచేతులతో పంపివేసిరి. మరల నతడు మూడవవాని పంపగా వారు వానిని గాయ పరచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడా ద్రాక్షతోట యజమానుడు–నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును; ఒక వేళ వారు అతని సన్మానించెదరను కొనెను. అయినను ఆ కాపులు అతనిని చూచి–ఇతడు వారసుడు; ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితో నొకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని— అట్లు కాకపోవును గాకనిరి. ఆయన వారిని చూచి— ఆలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతిమీద పడు ప్రతివాడును తునకలై పోవును; గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను. ప్రధానయాజకులును శాస్త్రులును తమ్మునుగూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరిగాని జనులకు భయపడిరి. వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయనయొద్దకు పంపిరి. వారు వచ్చి–బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచునున్నావు; నీ వెవనియందును మోమోటము లేక సత్యము గానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి. [23-24] ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి–ఒక దేనారము నాకు చూపుడి. దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు— కైసరు వనిరి. *** అందుకాయన–ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారు ప్రజలయెదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయనయొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి. –బోధకుడా, భార్య బ్రదికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయినయెడల, అతని సహోదరుడతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే మనకు వ్రాసి యిచ్చెను. యేడుగురు సహోదరులుండిరి. మొదటివాడొక స్ర్తీని పెండ్లి చేసికొని సంతానము లేక చనిపోయెను. రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి. ఆప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చని పోయిరి. పిమ్మట ఆ స్ర్తీయు చనిపోయెను. [32-33] కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి. *** అందుకు యేసు–ఈ లోకపు జనులు పెండ్లిచేసికొందురు,పెండ్లికియ్యబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచ బడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారైయుండి, దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు. [37-38] పొదనుగురించిన భాగములో –ప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు, మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. *** [39-40] తరువాత వారాయనను మరేమియు అడుగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు–బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివనిరి. *** ఆయన వారితో–క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు— [42-43] నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నాకుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు. *** దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను. ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెను–శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర యిండ్లను దిగమ్రింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి — ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి కానుకలు వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను. కొందరు–ఇది అందమైన రాళ్లతోను అర్పితములతోను శృంగారింపబడియున్నదని దేవాలయమునుగూర్చి, మాటలాడుచుండగా ఆయన–ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతిమీద రాయి యుండకుండ అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను. అప్పుడు వారు–బోధకుడా, ఆలాగైతే ఇవి యెప్పుడు జరుగును? ఇవి జరుగబోవునని సూచన ఏమని ఆయన నడుగగా ఆయన — మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి–నేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడిపోకుడి. మీరు యుద్ధములనుగూర్చియు కలహములనుగూర్చియు వినినప్పుడు జడియకుడి; ఇవి మొదట జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను–జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును; అక్క డక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవు లును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాతములును గొప్ప సూచనలును పుట్టును. ఇవన్నియు జరుగకమునుపు వారు మిమ్మును బలాత్కారముగా పెట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధిపతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్ష్యా ర్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధా నము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు; నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు. గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచు నప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసి కొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెర వేరుటకై అవి ప్రతి దండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనములమధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను —అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అవి చిగిరించుట చూచి వసంతకాలమప్పుడే సమీపమాయెనని మీ అంతట మీరు తెలిసి కొందురు గదా? అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి. అవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరు ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయనయొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. పస్కా అనబడిన పులియనిరొట్టెల పండుగ సమీ పించెను. ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఏలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి. అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్లి, ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానినిగూర్చి ప్రధానయాజకులతోను అధిపతులతోను మాటలాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని, జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను. పస్కాపశువును వధింపవలసిన పులియనిరొట్టెల దినమురాగా యేసు పేతురును యోహానును చూచి— మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు–మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా ఆయన–ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించునప్పుడు నీళ్లకుండ మోసికొనిపోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును; అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్లి –నేను నా శిష్యులతోకూడ పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి. అతడు సామగ్రిగల యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి. అప్పుడాయన— నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి–మీరు దీనిని తీసికొని మీలో పంచుకొనుడి; ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పు చున్నాననెను. పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చి–ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని–ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతోకూడ ఈ బల్లమీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్యకుమారుడు పోవుచున్నాడుగాని ఆయన ఎవరిచేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పెను. వారు–ఈ పనిని చేయబోవువాడెవరో అని తమలోతాము అడుగుకొన సాగిరి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను —అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిమీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకునివలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తినికూర్చుండు వాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్యచేయు వానివలె ఉన్నాను. నా శోధనలలో నాతోకూడ నిలిచియున్నవారు మీరే; [29-30] గనుక నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనములమీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. *** సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పెట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. అయితే అతడు —ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన–పేతురూ, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు, నేడు కోడికూయదని నీతో చెప్పుచున్నాననెను. మరియు ఆయన–సంచియు జాలెయు చెప్పులునులేకుండ నేను మిమ్మును పంపినప్పుడు, మీకు ఏమైనను తక్కువాయెనా అని వారినడిగినప్పుడు వారు–ఏమియు తక్కువకాలేదనిరి. అందుకాయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలెయు తీసికొని పోవలెను; కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను; –ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసియున్నది; ఏలయనగా నన్నుగూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాననెను. వారు ప్రభువా, ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా–చాలునని ఆయన వారితో చెప్పెను. తరువాత ఆయన బయలుదేరి, తనవాడుకచొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి. ఆ చోటు చేరి ఆయన వారితో–మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్త మైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులయొద్దకు వచ్చి, వారు దుఃఖముచేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ఆయన ఇంకను మాటలాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. పండ్రెండుమందిలో యూదా అన బడినవాడు వారికంటె ముందుగా నడిచి, యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయనయొద్దకు రాగా యేసు–యూదా, నీవు ముద్దుపెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా ఆయన చుట్టు ఉన్నవారు జరుగబోవు దానిని చూచి–ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని కుడి చెవి తెగనరికెను. అయితే యేసు–ఈ మట్టుకు తాళుడని చెప్పి, వాని చెవి ముట్టి బాగుచేసెను. యేసు తన్ను పట్టుకొనవచ్చిన ప్రధానయాజకులతోను దేవాలయపు అధిపతులతోను పెద్దలతోను–మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీచెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు; అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. వారాయనను పెట్టి యీడ్చుకొనిపోయి ప్రధానయాజకుని యింటిలోనికి తీసికొనిపోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతట కొందరు నడుముంగిట మంటవేసి చుట్టు కూర్చుండినప్పుడు, పేతురును వారిమధ్యను కూర్చుండెను. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచి–వీడును అతనితోకూడ ఉండెనని చెప్పెను. అందుకు పేతురు–అమ్మాయీ, నేనతని నెరుగననెను. మరి కొంత సేపటికి మరియొకడు అతని చూచి–నీవును వారిలో ఒకడవనగా పేతురు— ఓయీ, నేను కాననెను. ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు–నిజముగా వీడును అతనితోకూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు–ఓయీ, నీవు చెప్పినది నాకు తెలియ దనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను గనుక పేతురు–నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొని వెలుపలికిపోయి సంతాపపడి యేడ్చెను. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి, –నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. ఉదయముకాగానే ప్రజల పెద్దలును ప్రధానయాజకులును శాస్త్రులును సభకూడి, ఆయనను తమ మహా సభలోనికి తీసికొనిపోయి –నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన — నేను మీతో చెప్పినయెడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మును అడిగినయెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరు–అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయన–మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు–మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటిమాట వింటిమిగదా అని చెప్పిరి. అంతట వారందరును లేచి ఆయనను పిలాతునొద్దకు తీసికొనిపోయి –ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి. పిలాతు— నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన–నీవన్నట్టే అని అతనితో చెప్పెను. పిలాతు ప్రధానయాజకులతోను జనసమూహములతోను–ఈ మనుష్యునియందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. అయితే వారు–ఇతడు గలిలయదేశము మొదలుకొని ఇంతవరకును యూదయదేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని–ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాల ప్రశ్నలువేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు. ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయనమీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై యుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి. అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి –ప్రజలు తిరుగబడునట్లు చేయుచున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ లేదు; హేరోదునకు కూడ కనబడలేదు. హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. [16-17] కాబట్టి నేనితనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా *** వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి. వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను వారు–వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి. మూడవ మారు అతడు–ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి. గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ముకొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలమంది స్ర్తీలును ఆయనను వెంబడించిరి. యేసు వారివైపు తిరిగి–యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. ఇదిగో–గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి. అప్పుడు–మామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు. వారు పచ్చిమ్రానుకే యీలాగు చేసినయెడల ఎండినదానికేమి చేయుదురో అని చెప్పెను. మరి యిద్దరు ఆయనతోకూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతోకూడ సిలువవేసిరి. యేసు— తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి; అధికారులును–వీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయినయెడల తన్నుతాను రక్షించుకొనునని అపహసించిరి. అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి –నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. –ఇతడు యూదుల రాజని పైవిలాసము కూడ ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు–నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడ రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించి–నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి–యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. అందుకాయన వానితో–నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను; సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి–తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి–ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి, రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్లిరి. ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబడించిన స్ర్తీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునైయుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టు చుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగుకొని దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకుమునుపెప్పుడును ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతిదినారంభము కావచ్చెను. అప్పుడు గలిలయనుండి ఆయనతోకూడ వచ్చిన స్ర్తీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి. ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్ర్తీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి సమాధిముందర ఉండిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరు–సజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు –మనుష్యకుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అనిరి. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి. ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా–మగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితోకూడ ఉన్న యితర స్ర్తీలును. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెఱ్ఱిమాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి, సమాధి యొద్దకు పరుగెత్తికొనిపోయి వంగిచూడగా, నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగినదానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్లెను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్లుచు జరిగిన ఈ సంగతులన్నిటినిగూర్చి యొక రితో నొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను; అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను. ఆయన— మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయొపా అనువాడు–యెరూషలేములో బస చేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను. ఆయన —అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు–నజరేయుడైన యేసునుగూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయైయుండెను. మన ప్రధానయాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువవేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి; ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడుదినములాయెను. అయితే మాలో కొందరు స్ర్తీలు తెల్ల వారగానే సమాధియొద్దకు వెళ్లి, ఆయన దేహమును కానక వచ్చి –కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతోకూడ ఉన్నవారిలో కొందరు సమాధియొద్దకు వెళ్లి ఆ స్ర్తీలు చెప్పినట్టు కనుగొనిరి గాని, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన–అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా వారు–సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితోకూడ ఉండుటకు లోపలికి వెళ్లెను. ఆయన వారితోకూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు–ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగి వెళ్లగా, పదునొకొండుగురు శిష్యులును వారితోకూడ ఉన్నవారును కూడివచ్చి –ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమ కేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి. వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారిమధ్యను నిలిచి–మీకు సమాధానమవుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి. అప్పుడాయన–మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పెట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదము లను వారికి చూపెను. అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన–ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి. ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను. అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి –క్రీస్తు శ్రమపడి మూడవదినమున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనియవరకు వారిని తీసికొనిపోయి చేతు లెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.౹ ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,౹ కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు.౹ ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.౹ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.౹ అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకు సాక్షిగా వచ్చెను.౹ అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను.౹ నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతిమనుష్యుని వెలిగించుచున్నది.౹ ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు.౹ ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.౹ తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.౹ వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.౹ ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి౹ యోహాను ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు–నా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను.౹ ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.౹ ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.౹ ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపి నప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే.౹ అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను.౹ కాగా వారు–మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు–కాననెను.౹ –నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా— కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు–నీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి.౹ అందు కతడు–ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్య ములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను.౹ పంపబడినవారు పరిసయ్యులకు చెందినవారు.౹ వారు–నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్త వైనను కానియెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా౹ [26-27] యోహాను— నేను నీళ్లలో బాప్తిస్మ మిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు; మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను.౹ *** యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి–ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.౹ నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన.౹ నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మ మిచ్చుచు వచ్చితినని చెప్పెను.౹ మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు– ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.౹ నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు–నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పెను.౹ ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిననెను. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా౹ అతడు నడుచుచున్న యేసువైపు చూచి–ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల అని చెప్పెను.౹ అతడు చెప్పినమాట ఆ యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి.౹ యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబడించుట చూచి–మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారు–రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బి యను మాటకు బోధకుడని అర్థము.౹ — వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్న స్థలము చూచి, ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను.౹ యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ.౹ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి–మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి౹ యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతనివైపు చూచి–నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని–నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.౹ ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు.౹ ఫిలిప్పు నతనయేలును కనుగొని — ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.౹ అందుకు నతనయేలు — నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా–వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను.౹ యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి–ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను.౹ –నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు–ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న ప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను.౹ నతనయేలు–బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.౹ అందుకు యేసు —ఆ అంజూరపు చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను.౹ మరియు ఆయన — మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. మూడవదినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను.౹ యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువ బడిరి.౹ ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి–వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా౹ యేసు ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను.౹ ఆయన తల్లి పరిచారకులను చూచి —ఆయన మీతో చెప్పునది చేయుడనెను.౹ యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను.౹ యేసు–ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి.౹ అప్పుడాయన వారితో–మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి.౹ ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారుని పిలిచి౹ –ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.౹ గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి. అటుతరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి౹ దేవాలయములో ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి౹ త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడ ద్రోసి౹ పావురములు అమ్మువారితో–వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పెను.౹ ఆయన శిష్యులు— నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి.౹ కాబట్టి యూదులు —నీవు ఈ కార్యములు చేయుచున్నావే; యే సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా౹ యేసు —ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడుదినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.౹ యూదులు–ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడుదినములలో దానిని లేపుదువా అనిరి.౹ అయితే ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను.౹ ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి.౹ అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు౹ గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు. యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యు డొకడుండెను.౹ అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి–బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.౹ అందుకు యేసు అతనితో —ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.౹ అందుకు నీకొదేము — ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా౹ యేసు ఇట్లనెను–ఒకడు నీటిమూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ యునై యున్నది.౹ మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.౹ గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.౹ అందుకు నీకొదేము–ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా౹ యేసు ఇట్లనెను–నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా?౹ మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధమైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు?౹ మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.౹ [14-15] అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. *** దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.౹ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.౹ ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను.౹ ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డైవెనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.౹ దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిం చును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.౹ సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును. అటుతరువాత యేసు తన శిష్యులతోకూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను.౹ సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి.౹ యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండ లేదు.౹ శుద్ధీకరణాచారమునుగూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను.౹ గనుక వారు యోహాను నొద్దకు వచ్చి–బోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతోకూడ ఉండెనో, నీ వెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి.౹ అందుకు యోహాను ఇట్లనెను–తనకు పరలోకమునుండి అనుగ్రహింపబడితేనేగాని యెవడును ఏమియు పొంద నేరడు.౹ నేను క్రీస్తును కాననియు, ఆయనకంటె ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు.౹ పెండ్లికుమార్తెగలవాడు పెండ్లికుమారుడు; అయితే నిలువబడి పెండ్లికుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లికుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమై యున్నది.౹ ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది. పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు; భూమి నుండి వచ్చువాడు భూసంబంధియై భూసంబంధమైన సంగతులనుగూర్చి మాటలాడును; పరలోకమునుండి వచ్చు వాడు అందరికి పైగానుండి౹ తాను కన్నవాటినిగూర్చియు విన్నవాటినిగూర్చియు సాక్ష్యమిచ్చును; ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు.౹ [33-34] ఆయన సాక్ష్యము అంగీక రించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసి యున్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మ ననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.౹ *** తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించియున్నాడు.౹ కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును. యోహాను కంటె యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు౹ ఆయన యూదయ దేశము విడిచి గలిలయదేశమునకు తిరిగి వెళ్లెను.౹ అయినను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి.౹ ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక౹ యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.౹ అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.౹ సమరయ స్త్రీ ఒకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు–నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.౹ ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.౹ ఆ సమరయ స్ర్తీ–యూదుడ వైన నీవు సమరయ స్ర్తీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.౹ అందుకు యేసు–నీవు దేవుని వరమును— నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.౹ అప్పుడా స్ర్తీ–అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును?౹ తానును తన కుమాళ్లును, పశువులును, యీ బావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను.౹ అందుకు యేసు —ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును;౹ నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.౹ ఆ స్త్రీ ఆయనను చూచి–అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదు కొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా౹ యేసు నీవు వెళ్లి నీ పెనిమి టిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను.౹ ఆ స్ర్తీ–నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో— నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే;౹ నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.౹ అప్పుడా స్ర్తీ–అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.౹ మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను౹ –అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹ మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹ అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹ ఆ స్త్రీ ఆయనతో–క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా౹ యేసు–నీతో మాటలాడుచున్ననేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్ర్తీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గానినీకేమికావలెననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావని యైనను ఎవడును అడుగలేదు.౹ ఆ స్త్రీ తనకుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి౹ –మీరు వచ్చి, నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా౹ వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయనయొద్దకు వచ్చుచుండిరి.౹ ఆ లోగా శిష్యులు–బోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి.౹ అందుకాయన–భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా౹ శిష్యులు–ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు చెప్పు కొనిరి.౹ యేసు వారిని చూచి–నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.౹ ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలమువచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పు చున్నాను.౹ విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు.౹ విత్తువాడొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే.౹ మీరు దేనినిగూర్చి కష్టపడ లేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను. –నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్య మిచ్చిన స్ర్తీయొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమర యులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.౹ ఆ సమరయులు ఆయనయొద్దకు వచ్చి, తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను.౹ ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి–ఇకమీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక౹ మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి. ఆ రెండుదినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలయకు వెళ్లెను.౹ ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్య మిచ్చెను.౹ గలిలయులు కూడ ఆ పండుగకు వెళ్లువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయనచేసిన కార్యములన్నియు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్న హూములో ఒక ప్రధానికుమారుడు రోగియైయుండెను.౹ యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను.౹ యేసు–సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను.౹ అందుకా ప్రధాని–ప్రభువా, నా కుమారుడు చావకమునుపే రమ్మని ఆయనను వేడుకొనెను.౹ యేసు–నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయెను.౹ అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి, అతని కుమారుడు బ్రదికి యున్నాడని తెలియజెప్పిరి.౹ ఏ గంటకు వాడు బాగు పడసాగెనని వారిని అడిగినప్పుడు వారు–నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి.౹ –నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మిరి.౹ ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ. అటుతరువాత యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్లెను. యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు.౹ [3-4] ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగుపడును, గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి.౹ *** అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను.౹ యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి–స్వస్థపడ గోరుచున్నావా అని వానినడుగగా౹ ఆ రోగి–అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను.౹ యేసు–నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా౹ వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను. ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు–ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి.౹ అందుకు వాడు— నన్ను స్వస్థపరచినవాడు–నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను.౹ వారు–నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి.౹ ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను.౹ అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచి— ఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా౹ వాడు వెళ్లి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను.౹ ఈ కార్యములను విశ్రాంతిదినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.౹ అయితే యేసు–నాతండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను.౹ ఆయన విశ్రాంతిదినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను— తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.౹ తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.౹ తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును.౹ తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని౹ తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.౹ నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడైయుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.౹ మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను.౹ దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలమువచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని౹ మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.౹ నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినయెడల నా సాక్ష్యము సత్యము కాదు.౹ నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు; ఆయన నన్నుగూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని యెరుగుదును.౹ మీరు యోహాను నొద్దకు (కొందరిని) పంపితిరి; అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను.౹ నేను మనుష్యులవలన సాక్ష్యమంగీకరింపను గాని మీరు రక్షింప బడవలెనని యీ మాటలు చెప్పుచున్నాను.౹ అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్ట పడితిరి.౹ అయితే యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి యున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.౹ మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు.౹ ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు.౹ లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.౹ అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు.౹ నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను.౹ నేను మిమ్మును ఎరుగుదును; దేవుని ప్రేమ మీలో లేదు.౹ నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీకరింతురు,౹ అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి;౹ మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపును.౹ అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు.౹ మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను. అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.౹ రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి.౹ యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతోకూడ కూర్చుండెను.౹ అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.౹ కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తనయొద్దకు వచ్చుట చూచి–వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని౹ యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.౹ అందుకు ఫిలిప్పు–వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.౹ ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ౹ –ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా౹ యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.౹ యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలు కూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;౹ వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.౹ కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవలరొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.౹ ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి–నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపుటద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.౹ అంతలో చీకటాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.౹ అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.౹ వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;౹ అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను.౹ కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను. మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతోకూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి.౹ అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.౹ కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.౹ సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని–బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా౹ యేసు —మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.౹ వారు–మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా౹ యేసు–ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.౹ వారు–అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?౹ భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.౹ కాబట్టి యేసు–పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు.౹ పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.౹ కావునవారు–ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుమనిరి.౹ అందుకు యేసు వారితో ఇట్లనెను–జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.౹ మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.౹ తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను.౹ నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.౹ ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.౹ కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహార మని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు–ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?౹ ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? —నేను పరలోకమునుండి దిగి వచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.౹ అందుకు యేసు–మీలో మీరు సణుగుకొనకుడి;౹ నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.౹ –వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.౹ దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నవాడు.౹ [47-49] విశ్వసించువాడే నిత్యజీవముగలవాడు. జీవాహారము నేనే. మీపితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.౹ *** *** దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే.౹ పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. యూదులు–ఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.౹ కావున యేసు ఇట్లనెను–మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు.౹ నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్యజీవముగలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.౹ నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.౹ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.౹ జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.౹ ఇదే పర లోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాననెను౹ ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని–యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.౹ యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను–దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?౹ ఆలాగైతే మనుష్యకుమారుడుమునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు?౹ ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని౹ మీలో విశ్వసించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించనివారెవరో, తన్ను ప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును.౹ మరియు ఆయన —తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను. అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.౹ కాబట్టి యేసు–మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా౹ సీమోను పేతురు— ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;౹ నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.౹ అందుకు యేసు–నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను.౹ సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను. అటుతరువాత యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను.౹ యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక౹ ఆయన సహోదరులు ఆయనను చూచి–నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యు లును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము.౹ బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి.౹ ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.౹ యేసు–నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది.౹ లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.౹ మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకనుపరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను.౹ ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను.౹ పండుగలో యూదులు–ఆయన ఎక్కడ నని ఆయనను వెదకుచుండిరి.౹ మరియు జనసమూహములలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొంద రాయన మంచివాడనిరి; మరికొందరు–కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి;౹ అయితే యూదులకు భయపడి ఆయననుగూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను.౹ యూదులు అందుకు ఆశ్చర్యపడి–చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి.౹ అందుకు యేసు–నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.౹ ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును.౹ తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయనయందు ఏ దుర్నీతియులేదు.౹ మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను.౹ అందుకు జనసమూహము–నీవు దయ్యము పెట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా౹ యేసు వారిని చూచి–నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడుచున్నారు.౹ మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు.౹ మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతిదినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతిదినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడుచున్నారేమి?౹ వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. యెరూషలేమువారిలో కొందరు–వారు చంప వెదకు వాడు ఈయనే కాడా?౹ ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా?౹ అయినను ఈయన ఎక్కడి వాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చు నప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుకొనిరి.౹ కాగా యేసు దేవాలయములో బోధించుచు–మీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు.౹ నేను ఆయన యొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను.౹ అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ౹ మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచి–క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటికంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి.౹ జనసమూహము ఆయననుగూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి.౹ యేసు–ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును;౹ మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను.౹ అందుకు యూదులు— మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసుదేశస్థులకు బోధించునా?౹ –నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి–ఎవడైనను దప్పిగొనినయెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.౹ నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను.౹ తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మ నుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడ లేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.౹ జనసమూహములో కొందరు ఈ మాటలు విని–నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి;౹ మరికొందరు–ఈయన క్రీస్తే అనిరి; మరికొందరు–ఏమి? క్రీస్తు గలిలయలోనుండి వచ్చునా?౹ క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి.౹ కాబట్టి ఆయననుగూర్చి జనసమూహములో భేదము పుట్టెను.౹ వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరి సయ్యులయొద్దకును వచ్చినప్పుడు వారు–ఎందుకు మీరాయనను తీసికొని రాలేదని అడుగగా౹ ఆ బంట్రౌతులు–ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి.౹ అందుకు పరిసయ్యులు–మీరు కూడ మోస పోతిరా?౹ అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా?౹ అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి.౹ అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు.౹ అతడు–ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనకమునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా౹ వారు–నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.౹ అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి. యేసు ఒలీవలకొండకు వెళ్లెను.౹ తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను.౹ శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి౹ –బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;౹ అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.౹ ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.౹ వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి–మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి౹ మరల వంగి నేలమీద వ్రాయుచుండెను.౹ వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీమధ్యను నిలువబడియుండెను.౹ యేసు తలయెత్తి చూచి–అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు౹ ఆమె —లేదు ప్రభువా అనెను. అందుకు యేసు–నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. మరల యేసు–నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.౹ కాబట్టి పరిసయ్యులు–నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా౹ యేసు— నేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.౹ మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను.౹ నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే.౹ మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా.౹ నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను.౹ వారు–నీ తండ్రి యెక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు–మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రిని కూడ ఎరిగి యుందురని వారితో చెప్పెను.౹ ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. మరియొకప్పుడు ఆయన–నేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనేయుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.౹ అందుకు యూదులు–నేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పుచున్నాడే; తన్ను తానే చంపు కొనునా అని చెప్పుకొనుచుండిరి.౹ అప్పుడాయన–మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను.౹ కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.౹ కాబట్టి వారు–నీ వెవరవని ఆయన నడుగగా యేసు వారితో–మొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే.౹ మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.౹ తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహిం పక పోయిరి.౹ కావున యేసు–మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.౹ నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.౹ ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో–మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;౹ అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా౹ వారు–మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి.౹ అందుకు యేసు–పాపముచేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును.౹ కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతం త్రులైయుందురు.౹ మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు.౹ నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను.౹ అందుకు వారు ఆయనతో–మా తండ్రి అబ్రాహామనిరి; యేసు–మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు.౹ దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు.౹ మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారు— మేము వ్యభిచారమువలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా౹ యేసు వారితో ఇట్లనెను–దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.౹ మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా?౹ మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.౹ నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు.౹ నాయందు పాపమున్నదని మీలో ఎవడు సాప్థిచును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?౹ దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను.౹ అందుకు యూదులు–నీవు సమరయుడవును దయ్యముపెట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా౹ యేసు–నేను దయ్యముపెట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచు వాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు.౹ నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు.౹ ఒకడు నా మాట గైకొనినయెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను.౹ అందుకు యూదులు–నీవు దయ్యము పెట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను —ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు.౹ మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడ వని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి.౹ అందుకు యేసు–నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; —మా దేవుడని మీరెవరినిగూర్చి చెప్పు దురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు.౹ మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను.౹ మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను.౹ అందుకు యూదులు— నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా,౹ యేసు–అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.౹ కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్లిపోయెను. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను.౹ ఆయన శిష్యులు — బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా౹ యేసు–వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.౹ పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనముచేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు.౹ నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.౹ ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి౹ –నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను.౹ కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారును–వీడు కూర్చుండి భిక్ష మెత్తుకొనువాడు కాడా అనిరి.౹ వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతే–నేనే యనెను.౹ వారు–నీ కన్నులేలాగు తెరవబడెనని వానినడుగగా౹ వాడు–యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి–నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను.౹ వారు, ఆయన ఎక్కడనని అడుగగావాడు, నేనెరుగననెను. అంతకుముందు గ్రుడ్డియైయుండినవానిని వారు పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి.౹ యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము౹ వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు–నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను.౹ కాగా పరిసయ్యులలో కొందరు–ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు–పాపియైన మనుష్యుడు ఈలాటి సూచక క్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను.౹ కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు–ఆయన ఒక ప్రవక్త అనెను.౹ వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి,౹ –గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి.౹ అందుకు వాని తలిదండ్రులు–వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము.౹ ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి.౹ వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలి వేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి.౹ కావున వాని తలిదండ్రులు–వాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి.౹ కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి —దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా౹ వాడు–ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగుదును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నాననెను.౹ అందుకు వారు–ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా౹ వాడు–ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను.౹ అందుకు వారు–నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము;౹ దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.౹ అందుకు ఆ మనుష్యుడు —ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను.౹ దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును.౹ పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు.౹ ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను.౹ అందుకు వారు–నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని–నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను.౹ అందుకు వాడు–ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా౹ యేసు — నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను.౹ అంతట వాడు–ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను.౹ అప్పుడు యేసు–చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను.౹ ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని–మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి.౹ అందుకు యేసు — మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని–చూచుచున్నామని మీరిప్పుడు చెప్పు కొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను. గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై యున్నాడు.౹ ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱెల కాపరి.౹ అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును.౹ మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.౹ అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.౹ ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను౹ –గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు.౹ నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.౹ దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.౹ జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱెలను పెట్టి చెదరగొట్టును.౹ జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱెలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.౹ నేను గొఱ్ఱెల మంచి కాపరిని.౹ తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.౹ ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.౹ నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.౹ ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను. ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.౹ వారిలో అనేకులు–వాడు దయ్యము పెట్టినవాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.౹ మరికొందరు–ఇవి దయ్యము పెట్టినవాని మాటలుకావు; దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి. ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను.౹ అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా౹ యూదులు ఆయనచుట్టు పోగై–ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.౹ అందుకు యేసు–మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.౹ అయితే మీరు నా గొఱ్ఱెలలోచేరినవారుకారు గనుక మీరు నమ్మరు.౹ నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.౹ నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.౹ వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;౹ నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.౹ యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేతపట్టుకొనగా౹ యేసు— తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.౹ అందుకు యూదులు–నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.౹ అందుకు యేసు–మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?౹ లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల–నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,౹ తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో — నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?౹ నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,౹ చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను.౹ వారు మరల ఆయనను పట్టుకొన చూచిరిగాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను. యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చు చుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను.౹ అనేకులు ఆయనయొద్దకు వచ్చి–యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి.౹ అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి. గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగియాయెను.౹ ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.౹ అతని అక్కచెల్లెండ్రు — ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.౹ యేసు అది విని–యీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.౹ యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.౹ అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.౹ అటుపిమ్మట ఆయన–మనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా౹ ఆయన శిష్యులు–బోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.౹ అందుకు యేసు–పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచినయెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు.౹ అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను.౹ ఆయన యీ మాటలు చెప్పిన తరువాత–మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా౹ శిష్యులు— ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి.౹ యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి.౹ [14-15] కావున యేసు–లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.౹ *** అందుకు దిదుమ అనబడిన తోమా–ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను. యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను.౹ బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము౹ గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.౹ మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను.౹ మార్త యేసుతో–ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.౹ ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను.౹ యేసు–నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా౹ మార్త ఆయనతో–అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.౹ అందుకు యేసు–పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;౹ బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.౹ ఆమె–అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడ వైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.౹ ఆమె ఈ మాట చెప్పి వెళ్లి–బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను.౹ ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను.౹ యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను౹ గనుక యింటిలో మరియతోకూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి.౹ అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి–ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను.౹ ఆమె ఏడ్చుటయు, ఆమెతోకూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు–అతని నెక్కడ నుంచితిరని అడుగగా,౹ వారు–ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.౹ యేసు కన్నీళ్లు విడిచెను.౹ కాబట్టి యూదులు–అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.౹ వారిలో కొందరు–ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.౹ యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.౹ యేసు–రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త–ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.౹ అందుకు యేసు–నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;౹ అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి–తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.౹ నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.౹ ఆయన ఆలాగు చెప్పి–లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా౹ చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు— మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను. కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని౹ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసుచేసిన కార్యములనుగూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చి–మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.౹ మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్ర మించుకొందురని చెప్పిరి.౹ అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైయుండి —మీ కేమియు తెలియదు.౹ మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.౹ తనంతట తానే యీలాగు చెప్ప లేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక౹ యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.౹ కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలోచించుచుండిరి. కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతోకూడ ఉండెను.౹ మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలోనుండి యెరూషలేమునకు వచ్చిరి.౹ వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి–మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.౹ ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్నయెడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి. కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.౹ మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతోకూడ భోజమునకు కూర్చున్నవారిలో ఒకడు.౹ అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను.౹ ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా౹ –యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను.౹ వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రద్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.౹ కాబట్టి యేసు–నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;౹ బీదలు ఎల్లప్పుడును మీతోకూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను. కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరును కూడ చూడవచ్చిరి.౹ [10-11] అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధానయాజకులు లాజరును కూడ చంప నాలోచనచేసిరి. *** మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని౹ ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి —జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి. [14-15] —సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.౹ *** ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయననుగూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటినిచేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి.౹ ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతోకూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి.౹ అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి.౹ కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు— మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంటపోయినదని చెప్పుకొనిరి. ఆ పండుగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు గ్రీసుదేశస్థులు ఉండిరి.౹ వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి–అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా౹ ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి.౹ అందుకు యేసు వారితో ఇట్లనెను–మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది.౹ గోధుమగింజ భూమిలో పడి చావకుండినయెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును.౹ తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.౹ ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును?–తండ్రీ, యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని;౹ తండ్రీ, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతట–నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.౹ కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము–ఉరిమెను అనిరి. మరికొందరు–దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి.౹ అందుకు యేసు— ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను.౹ ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును;౹ నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.౹ తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.౹ జనసమూహము–క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.౹ అందుకు యేసు–ఇంక కొంతకాలము వెలుగు మీమధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండ గనే నడువుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు.౹ మీరు వెలుగు సంబంధు లగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి. – ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచ బడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను.౹ [39-40] ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా–వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండు నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసివారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను.౹ *** యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను.౹ అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములోనుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు.౹ వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను–నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.౹ నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.౹ నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.౹ ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండినయెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని.౹ నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.౹ ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.౹ మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నాననెను. తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన. గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.౹ వారు భోజనముచేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను గనుక౹ తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసియున్నదనియు యేసు ఎరిగి౹ భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసి కొని నడుమునకు కట్టుకొనెను.౹ అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.౹ ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చి నప్పుడు అతడు–ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను.౹ అందుకు యేసు–నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా౹ పేతురు–నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు–నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.౹ సీమోను పేతురు–ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తల కూడ కడుగుమని ఆయనతో చెప్పెను.౹ యేసు అతని చూచి–స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను.౹ తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక— మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండి–నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా?౹ బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.౹ కాబట్టి ప్రభువు ను బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే.౹ నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.౹ దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.౹ మిమ్మునందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని –నాతోకూడ భోజనముచేయువాడు నాకు విరోధ ముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును.౹ జరిగి నప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగకమునుపు మీతో చెప్పుచున్నాను.౹ నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనువాడగు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవర పడి–మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను౹ ఆయన యెవరినిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరితట్టు ఒకరు చూచుకొనుచుండగా౹ ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను౹ గనుక ఎవరినిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను.౹ అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు–ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను.౹ అందుకు యేసు–నేనొక ముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను;౹ వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు–నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా౹ ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు.౹ డబ్బు సంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవాటినికొనుమని యైనను, బీదలకేమైన ఇమ్మని యైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి.౹ వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ. వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను–ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు; దేవుడును ఆయనయందు మహిమపరచబడి యున్నాడు.౹ దేవుడు ఆయనయందు మహిమపరచబడినయెడల, దేవుడు తనయందు ఆయనను మహిమపరచును; వెంటనే ఆయనను మహిమపరచును.౹ పిల్లలారా, యింక కొంతకాలము మీతోకూడ ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేనెక్క డికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పినప్రకారము ఇప్పుడు మీతోను చెప్పు చున్నాను.౹ మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.౹ మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను. సీమోను పేతురు–ప్రభువా, నీవెక్కడికి వెళ్లుచున్నావని ఆయనను అడుగగా యేసు–నేను వెళ్లు చున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను.౹ అందుకు పేతురు —ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పగా౹ యేసు–నాకొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని.యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి.౹ నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.౹ నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరునుఉండు లాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసి కొని పోవుదును.౹ నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.౹ అందుకు తోమా— ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా౹ యేసు —నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.౹ మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.౹ అప్పుడు ఫిలిప్పు–ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా౹ యేసు–ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?౹ తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు.౹ తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.౹ నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేనుచేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును.౹ నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.౹ మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు.౹ నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మ ను మీకనుగ్రహించును.౹ లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును.౹ మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు;౹ అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.౹ నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.౹ నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందు నని చెప్పెను.౹ ఇస్కరియోతు కాని యూదా— ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా౹ యేసు–ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము.౹ నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని.౹ ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.౹ శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.౹ నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లు చున్నానని మీరు సంతోషింతురు.౹ ఈ సంగతి సంభవించినప్పుడు, మీరు నమ్మవలెనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను.౹ ఇకను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు.౹ అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయుచున్నాను. లెండి, యిక్కడనుండి వెళ్లుదము. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవ సాయకుడు.౹ నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.౹ నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై యున్నారు.౹ నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలిం పరు.౹ ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.౹ ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును.౹ నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.౹ మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు.౹ తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి.౹ నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచి యుందురు.౹ మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.౹ నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ౹ తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.౹ నేను మీ కాజ్ఞాపించువాటినిచేసినయెడల, మీరు నా స్నేహితులైయుందురు.౹ దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.౹ మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.౹ మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను.౹ లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు.౹ మీరు లోక సంబంధులైనయెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.౹ — దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీ మాట కూడ గైకొందురు.౹ అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు.౹ నేను వచ్చి వారికి బోధింపకుండినయెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు.౹ నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడ ద్వేషించుచున్నాడు.౹ ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.౹ అయితే –నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెర వేరునట్లు ఈలాగు జరిగెను.౹ తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును.౹ మీరు మొదటనుండి నాయొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. మీరు అభ్యంతరపడకుండవలెనని యీ మాటలు మీతో చెప్పుచున్నాను.౹ వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలమువచ్చుచున్నది.౹ వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదు గనుక ఈలాగు చేయుదురు.౹ అవి జరుగుకాలము వచ్చినప్పుడు నేను వాటినిగూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొనులాగున యీ సంగతులు మీతో చెప్పుచున్నాను; నేను మీతోకూడ ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు.౹ ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్లుచున్నాను —నీవు ఎక్కడికి వెళ్లు చున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని౹ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది.౹ అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.౹ ఆయన వచ్చి, పాపమునుగూర్చియు నీతిని గూర్చియు తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.౹ [9-11] లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమునుగూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పునుగూర్చియు ఒప్పుకొన జేయును.౹ *** *** నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింప లేరు.౹ అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.౹ ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.౹ తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.౹ కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను.౹ కాబట్టి ఆయన శిష్యులలో కొందరు–కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని యొకనితో ఒకరు చెప్పుకొనిరి.౹ –కొంచెము కాలమని ఆయన చెప్పుచున్న దేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి.౹ వారు తన్ను అడుగ గోరుచుండిరని యేసు యెరిగి వారితో ఇట్లనెను–కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటనుగూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా?౹ మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు.౹ అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.౹ ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియ జెప్పుగడియ వచ్చుచున్నది.౹ ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు.౹ మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు.౹ నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను. ఆయన శిష్యులు–ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు.౹ సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా౹ యేసు వారిని చూచి–మీరిప్పుడు నమ్ము చున్నారా?౹ యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.౹ నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెను–తండ్రీ, నా గడియ వచ్చియున్నది.౹ నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి.౹ అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.౹ చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని.౹ తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.౹ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితివి; వారు నీ వాక్యము గైకొని యున్నారు.౹ నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక౹ నీవు నాకు అనుగ్ర హించినవన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి యున్నారు.౹ నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్ర హించియున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను.౹ నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహిమపరచబడి యున్నాను.౹ నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగునవారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.౹ నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.౹ ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను.౹ వారికి నీ వాక్యమిచ్చియున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి వారిని కాపాడు మని ప్రార్థించుచున్నాను.౹ నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.౹ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.౹ నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.౹ వారును సత్యమందు ప్రతిష్ఠచేయబడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.౹ [20-21] మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.౹ *** మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.౹ వారియందు నేనును నాయందు నీవును ఉండుటవలనవారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.౹ తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినవారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి.౹ నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు.౹ నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడ కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను.౹ యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లు చుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను.౹ కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధములతోను అక్కడికి వచ్చెను.౹ యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి–మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను.౹ వారు–నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు–ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.౹ ఆయన–నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి.౹ మరల ఆయన–మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు–నజరేయుడైన యేసునని చెప్పగా౹ యేసు వారితో–నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను.౹ –నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.౹ సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను.౹ ఆ దాసునిపేరు మల్కు. యేసు–కత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె లోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి.౹ అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ.౹ కయప–ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి యేసుతోకూడ వెళ్లెను.౹ పేతురు ద్వారము నొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధానయాజకునికి నెళవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొనిపోయెను.౹ ద్వారమునొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడు–కాననెను.౹ అప్పుడు చలివేయుచున్నందున దాసులును బంట్రౌతులును మంటవేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను. ప్రధానయాజకుడు ఆయన శిష్యులనుగూర్చియు ఆయన బోధనుగూర్చియు యేసును అడుగగా౹ యేసు–నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.౹ నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను.౹ ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు — ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను.౹ అందుకు యేసు–నేను కాని మాట ఆడినయెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడినయెడల నన్నేల కొట్టుచున్నావనెను.౹ అంతట అన్న, యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను. సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి–నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడు–నేను కాను, నేనెరుగననెను.౹ పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధానయాజకుని దాసులలో ఒకడును–నీవు తోటలో అతనితోకూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు౹ పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను. వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు.౹ కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చి–ఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను.౹ అందుకు వారు–వీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండ మని అతనితో చెప్పిరి.౹ పిలాతు–మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా౹ యూదులు–ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి–యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా౹ యేసు–నీ అంతట నీవే యీ మాట అనుచున్నావా? లేక యితరులు నీతో నన్నుగూర్చి యిది చెప్పిరా? అని అడిగెను.౹ అందుకు పిలాతు–నేను యూదు డనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా౹ యేసు–నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను.౹ [37-38] అందుకు పిలాతు–నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు–నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు–సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి–అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;౹ *** అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను.౹ అయితే వారు–వీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను.౹ సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి౹ ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి–యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి.౹ పిలాతు మరల వెలుపలికి వచ్చి–ఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను.౹ ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు– ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను.౹ ప్రధానయాజకులును బంట్రౌతులును ఆయనను చూచి–సిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతు–ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను.౹ అందుకు యూదులు–మాకొక నియ మము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పు కొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.౹ పిలాతు ఆ మాట విని మరి యెక్కు వగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి౹ –నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు౹ గనుక పిలాతు–నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను.౹ అందుకు యేసు–పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించినవానికి ఎక్కువ పాపము కలదనెను.౹ ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులు–నీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి.౹ పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి, రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు.౹ ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడు–ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా౹ అందుకు వారు–ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతు–మీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు–కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి.౹ అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు.౹ అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనినిమధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి.౹ మరియు పిలాతు–యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను.౹ యేసు సిలువవేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి.౹ –నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని–యూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధానయాజకులు పిలాతుతో చెప్పగా౹ పిలాతు–నేను వ్రాసిన దేమో వ్రాసితిననెను. సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్ర్తములు తీసికొని,యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీని కూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక౹ వారు–దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి.వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను; ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి.౹ ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి.౹ యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలు చుండుట చూచి–అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను,౹ తరువాత శిష్యుని చూచి–యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను. అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు–నేను దప్పిగొనుచున్నాననెను.౹ చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి.౹ యేసు ఆ చిరక పుచ్చుకొని–సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతిదినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతిదినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.౹ కాబట్టి సైనికులు వచ్చి ఆయనతోకూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి.౹ వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని౹ సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడి చెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.౹ ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయ నెరుగును. –అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు —తాము పొడిచినవానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది. అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను.౹ మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము కూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.౹ అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి.౹ ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.౹ ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందునవారు అందులో యేసును పెట్టిరి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ద లేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.౹ గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యునియొద్దకును వచ్చి —ప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగమని చెప్పెను.౹ కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి.౹ వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా, ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు వచ్చి౹ వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు.౹ అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి, సమాధిలో ప్రవేశించి,౹ నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నార బట్టలయొద్ద ఉండక వేరుగా ఒకటచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను.౹ అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను.౹ ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి.౹ అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చు చుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా,౹ తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను.౹ వారు— అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె–నా ప్రభువును ఎవరో యెత్తికొనిపోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను.౹ ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.౹ యేసు–అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని–అయ్యా, నీవు ఆయనను మోసికొనిపోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.౹ యేసు ఆమెను చూచి–మరియా అనిపిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అనిపిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.౹ యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి–నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.౹ మగ్దలేనే మరియ వచ్చి–నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చిమధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.౹ ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.౹ అప్పుడు యేసు–మరల మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.౹ ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది–పరిశుద్ధాత్మను పొందుడి.౹ మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను౹ గనుక తక్కిన శిష్యులు–మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు–నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను. ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితోకూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చిమధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగును గాక అనెను.౹ తరువాత తోమాను చూచి–నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.౹ అందుకు తోమా ఆయనతో–నా ప్రభువా, నా దేవా అనెను.౹ యేసు–నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను. మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని౹ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. అటుతరువాత యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా౹ సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి.౹ సీమోను పేతురు–నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు–మేమును నీతోకూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు.౹ సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.౹ యేసు— పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా,౹ లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడాయన–దోనె కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి.౹ కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు–ఆయన ప్రభువు సుమీ అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్ర్తహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను.౹ దరియించుమించు ఇన్నూరు మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి.౹ వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను.౹ యేసు–మీరిప్పుడు పెట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా౹ సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;౹ చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు–రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున–నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు.౹ యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలను కూడ పంచిపెట్టెను.౹ యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి. వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి–యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసు–నా గొఱ్ఱెపిల్లలను మేపుమని అతనితో చెప్పెను.౹ మరల ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన–నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను.౹ మూడవసారి ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. — నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి–ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.౹ యేసు — నా గొఱ్ఱెలను మేపుము. నీవు యౌవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీచేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుముకట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను.౹ అతడు ఎట్టి మరణమువలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి–నన్ను వెంబడించుమని అతనితో అనెను.౹ పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించినవాడును, భోజనపంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని–ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగినవాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను.౹ పేతురు అతనిని చూచి–ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను.౹ యేసు–నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను.౹ కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని–నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను. ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరు గుదుము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మద్వారా ఆజ్ఞాపించిన౹ తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినిగూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని.౹ ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.౹ ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను–మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;౹ యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాబట్టి వారు కూడివచ్చినప్పుడు–ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన౹ –కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.౹ అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.౹ ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.౹ ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి౹ –గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొన బడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది.౹ వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు.౹ వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్యనిలిచి ఇట్లనెను౹ –సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను.౹ అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను.౹ ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చియొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను.౹ ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అన బడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా –అతని యిల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది.౹ [21-22] కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు, ఆయన మన మధ్య సంచరించుచుండిన కాల మంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతోకూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను.౹ *** అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి౹ ఇట్లని ప్రార్థనచేసిరి–అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా,౹ తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరి చర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.౹ అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయపేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతోకూడ లెక్కింపబడెను. పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.౹ అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.౹ మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ౹ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.౹ ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతిమనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి.౹ అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి–ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా?౹ మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?౹ పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అను దేశములయందలివారు,౹ కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు,౹ క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.౹ అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.౹ కొందరైతే–వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను–యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి.౹ మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.౹ యోవేలు ప్రవక్త ద్వారా చెప్ప బడిన సంగతి యిదే, ఏమనగా –అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మ ను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మ ను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీమధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబర చెను; ఇది మీరే యెరుగుదురు.౹ దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.౹ మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను –నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువు ను చూచు చుంటిని ఆయన నా కుడిపార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు. నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను;౹ అతని సమాధి నేటివరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తయైయుండెను గనుక –అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టుపెట్టుకొనిన సంగతి అతడెరిగి,౹ క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమునుగూర్చి చెప్పెను.౹ ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము.౹ కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మనుగూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించియున్నాడు.౹ దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను— నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠ ముగా ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని —సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా౹ పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.౹ ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.౹ ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి–మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.౹ కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి.౹ వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను.౹ విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి.౹ ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి.౹ మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై౹ ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను. పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా,౹ పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.౹ పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా౹ పేతురును యోహానును వానిని తేరి చూచి–మాతట్టు చూడుమనిరి.౹ వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.౹ అంతట పేతురు–వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి౹ వాని కుడిచెయ్యి పట్టుకొని లేవ నెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.౹ వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.౹ వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి౹ శృంగారమను దేవా లయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.౹ పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను–ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చి నట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు?౹ అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి.౹ మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగి తిరి.౹ మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.౹ ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను.౹ సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును.౹ అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను.౹ ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును౹ మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి.౹ అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము.౹ మోషే యిట్లనెను– ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ౹ ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.౹ మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.౹ ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో —నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీపితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు.౹ దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను. వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును౹ వారు ప్రజ లకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి౹ వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి.౹ వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్యయించుమించు అయిదువేలు ఆయెను. మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి.౹ ప్రధానయాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితోకూడ ఉండిరి.౹ వారు పేతురును యోహానునుమధ్యను నిలువబెట్టి— మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా౹ పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను —ప్రజల అధికారులారా, పెద్దలారా,౹ ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక౹ మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసినదేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామ ముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.౹ ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.౹ మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.౹ స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితోకూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.౹ అప్పుడు —సభ వెలుపలికి పొండని వారికాజ్ఞాపించి తమలోతాము ఆలోచనచేసి౹ –ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజాలము.౹ అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై— ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి.౹ అప్పుడు వారిని పిలిపించి–మీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి.౹ అందుకు పేతురును యోహానును వారినిచూచి–దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవునిదృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;౹ మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;౹ ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.౹ స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు. వారు విడుదల నొంది తమ స్వజనులయొద్దకు వచ్చి, ప్రధానయాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటల నన్నిటిని వారికి తెలిపిరి.౹ వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. —నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు. –అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభువు మీదను ఆయన క్రీస్తుమీదను భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.౹ [27-28] ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.౹ *** ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి౹ రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములనుచేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.౹ వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.౹ ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమునుగూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.౹ భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.౹ వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడైయుండి దానిని అమ్మి౹ దాని వెల తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను.౹ భార్యయెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.౹ అప్పుడు పేతురు —అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను?౹ అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను.౹ అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారికందరికిని మిగుల భయము కలిగెను;౹ అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి. ఇంచుమించు మూడు గంటల సేపటికి వానిభార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను.౹ అప్పుడు పేతురు–మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె–అవును ఇంతకే అని చెప్పెను.౹ అందుకు పేతురు–ప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతో చెప్పెను.౹ వెంటనే ఆమె అతని పాదములయొద్దపడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి.౹ సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను. ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహ త్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి.౹ కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని౹ ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కు వగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.౹ అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.౹ మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి. ప్రధానయాజకుడును అతనితోకూడ ఉన్నవారందరును, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని౹ అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి.౹ అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని వచ్చి–మీరు వెళ్లి దేవాలయములో నిలువబడి౹ ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను.౹ వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధానయాజకుడును అతనితోకూడ నున్నవారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించి —వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి.౹ బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగివచ్చి౹ –చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి.౹ అంతట దేవాలయపు అధిపతియు ప్రధానయాజకులును ఆ మాటలు విని–ఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.౹ అప్పుడు ఒకడు వచ్చి–ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా౹ అధిపతి బంట్రౌతులతోకూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను.౹ వారిని తీసికొనివచ్చి సభలో నిలువబెట్టగా౹ ప్రధానయాజకుడు వారిని చూచి–మీరు ఈ నామమునుబట్టి బోధింప కూడ దని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను.౹ అందుకు పేతురును అపొస్తలులును–మనుష్యు లకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.౹ మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను.౹ ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించియున్నాడు.౹ మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంప నుద్దేశించగా౹ సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి–ఈ మనుష్యులను కొంత సేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను౹ –ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్తసుమండి.౹ ఈ దినములకుమునుపు థూదా లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసి కొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి.౹ వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతోకూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడు కూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరి పోయిరి.౹ కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా–ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును.౹ దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.౹ వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించి–యేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.౹ ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందునవారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి౹ ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.౹ అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచి–మేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు.౹ కాబట్టి సహోదరులారా, ఆత్మ తోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము;౹ అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి.౹ ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందునవారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకా నోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నీకొలాసు అను వారిని ఏర్ప రచుకొని౹ వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచకక్రియలను చేయుచుండెను.౹ అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని౹ మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మ ను వారెదిరింపలేకపోయిరి.౹ అప్పుడు వారు–వీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని౹ ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి౹ అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు–ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు.౹ ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి.౹ సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను. ప్రధానయాజకుడు–ఈ మాటలు నిజమేనా అని అడిగెను.౹ అందుకు స్తెఫను చెప్పినదేమనగా–సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండకమునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై౹ –నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను.౹ అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొనివచ్చెను.౹ ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను.౹ అయితే దేవుడు–అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధపెట్టుదురనియు చెప్పెను.౹ మరియు దేవుడు–ఏ జనమునకు వారు దాసులైయుందురో ఆ జనమును నేను విమర్శచేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను.౹ మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి.౹ ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి౹ దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అ నుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను.౹ తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరవును బహుశ్రమయువచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను.౹ ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, మన పితరులను అక్క డికి మొదటి సారి పంపెను.౹ వారు రెండవసారి వచ్చి నప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసి కొనెను; అప్పుడు యోసేపుయొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను.౹ యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను; వారు డెబ్బదియయిదు గురు౹ యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి,౹ షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి.౹ అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొకరాజు ఐగుప్తును ఏలనారంభించెను.౹ ఇతడు మన వంశస్థుల యెడల కపటముగా ప్రవర్తించి౹ తమ శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధపెట్టెను.౹ ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచ బడెను.౹ తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసికొని తన కుమారునిగా పెంచు కొనెను.౹ మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్య సించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.౹ అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.౹ అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను.౹ తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలం చెను గాని వారు గ్రహింపరైరి.౹ మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి–అయ్యలారా, మీరు సహోదరులు; మీరెందుకు ఒకనికొకడు అన్యా యము చేసికొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ జూచెను.౹ అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు–మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు?౹ నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలచియున్నావా అని అతనిని త్రోసివేసెను.౹ మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశియైయుండి, అక్కడ ఇద్దరు కుమారులను కనెను.౹ నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను.౹ మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా౹ –నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింపలేదు.౹ అందుకు ప్రభువు–నీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్నచోటు పరిశుద్ధభూమి.౹ ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదు నని అతనితో చెప్పెను.౹ –అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. –నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే.౹ సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే.౹ ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై౹ — మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశములోనుండి మనలను తోడుకొని వచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి.౹ ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి.౹ అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచి పెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది. –ఇశ్రాయేలు ఇంటివారలారా మీరు అరణ్యములో నలువది యేండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా? మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసికొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను. అతడు చూచిన మాదిరిచొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము, సాక్ష్యపుగుడారము అరణ్యములో మన పితరులయొద్ద ఉండెను.౹ మన పితరులు తమ పెద్దలచేత దానిని తీసికొనినవారై, దేవుడు తమ యెదుటనుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువతోకూడ ఈ దేశములోనికి దానిని తీసికొనివచ్చిరి. అది దావీదు దినములవరకు ఉండెను.౹ అతడు దేవుని దయపొంది యాకోబుయొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను.౹ [47-50] అయితే సొలొమోను ఆయనకొరకు మందిరముకట్టించెను. అయినను –ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు. *** *** *** ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీపితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.౹ మీపితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.౹ దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను. వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి.౹ అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి౹ –ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.౹ అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీదపడి౹ పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములుపెట్టిరి.౹ ప్రభువునుగూర్చి మొరపెట్టుచు–యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.౹ అతడు మోకాళ్లూని — ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.౹ భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి.౹ సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొనిపోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను. కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి.౹ అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమువరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించు చుండెను.౹ జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా౹ అనేకులను పెట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలువేసి వారిని వదలిపోయెను; పక్షవాయువుగలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి.౹ అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీచేయుచు, తానెవడో యొక గొప్పవాడని చెప్పుకొనుచు, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను.౹ కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరు— దేవుని మహాశక్తి యనబడినవాడు ఇతడే అని చెప్పు కొనుచు అతని లక్ష్యపెట్టిరి.౹ అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరచినందున వారతని లక్ష్య పెట్టిరి.౹ అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమునుగూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి.౹ అప్పుడు సీమోను కూడ నమ్మి బాప్తిస్మముపొంది ఫిలిప్పును ఎడబాయకుండి, సూచక క్రియలును గొప్ప అద్భుతములును జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని, పేతురును యోహానును వారియొద్దకు పంపిరి.౹ వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారికొరకు ప్రార్థనచేసిరి.౹ అంతకు ముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియుండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి. అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతు లుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.౹ అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి౹ వారియెదుట ద్రవ్యము పెట్టి–నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను.౹ అందుకు పేతురు–నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక.౹ నీ హృదయము దేవునియెదుట సరియైనది కాదు గనుక యీ కార్యమందు నీకు పాలుపంపులు లేవు.౹ కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారుమనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును;౹ నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను.౹ అందుకు సీమోను —మీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండ మీరే నాకొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను. అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్లుచు, సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ప్రభువు దూత–నీవు లేచి, దక్షిణముగా వెళ్లి, యెరూషలేమునుండి గాజాకు పోవు అరణ్యమార్గమును కలసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను.౹ అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకేక్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను.౹ అతడు తిరిగి వెళ్లుచు, తన రథముమీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను.౹ అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో–నీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను.౹ ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా విని–నీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా౹ అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను.౹ అతడు లేఖనమందు చదువుచున్న భాగ మేదనగా— ఆయన గొఱ్ఱెవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకక పోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు — ప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను.౹ అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.౹ వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చి నప్పుడు నపుంసకుడు–ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను.౹ ఫిలిప్పు–నీవు పూర్ణహృదయముతో విశ్వసించినయెడల పొందవచ్చునని చెప్పెను. అతడు–యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని యుత్తరమిచ్చెను.౹ ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను.౹ వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు.౹ అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించు టయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి౹ యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనినయెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను.౹ అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చి నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.౹ అప్పుడతడు నేలమీదపడి —సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.౹ –ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన–నేను నీవు హింసించు చున్న యేసును;౹ లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.౹ అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువ బడిరి.౹ సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేక పోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి.౹ అతడు మూడుదినములు చూపులేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు–అననీయా, అని అతనిని పిలువగా౹ అతడు–ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు–నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు.౹ అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికివచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను.౹ అందుకు అననీయ–ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని.౹ ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొంది యున్నాడని ఉత్తరమిచ్చెను.౹ అందుకు ప్రభువు–నీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు ౹ ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.౹ అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి–సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృిష్టిపొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి యున్నాడని చెప్పెను.౹ అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను.౹ వెంటనే సమాజమందిరములలో —యేసే దేవుని కుమారుడని ఆయననుగూర్చి ప్రకటించుచు వచ్చెను.౹ వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధానయాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడ వచ్చియున్నాడని చెప్పుకొనిరి.౹ అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి–ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప నాలోచింపగా౹ వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వారములయొద్ద కాచుకొనుచుండిరి౹ గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొనిపోయి గంపలో ఉంచి, గోడ గుండ అతనిని క్రిందికి దింపిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి.౹ అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలులయొద్దకు తోడుకొనివచ్చి–అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను.౹ [28-29] అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు, ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకుభాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని౹ *** సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడుకొనివచ్చి తార్సునకు పంపిరి. కావున యూదయ గలిలయ సమరయ దేశములం దంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశు ద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారముచేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధులయొద్దకు వచ్చెను.౹ అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పెట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి,౹ పేతురు–ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా౹ వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్నవారందరు అతనిచూచి ప్రభువుతట్టు తిరిగిరి. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్‌క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను.౹ ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి.౹ లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి.౹ పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొనివచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి.౹ పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి–తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను.౹ అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను.౹ ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి.౹ పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి. యైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.౹ అతడు తన యింటివారందరితోకూడ దేవునియందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థనచేయు వాడు.౹ పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి–కొర్నేలీ, అనిపిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.౹ అతడు దూతవైపు తేరి చూచి భయపడి–ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూత–నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.౹ ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము;౹ అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను.౹ అతనితో మాటలాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి౹ వారికి ఈ సంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంట లకు పేతురు ప్రార్థనచేయుటకు మిద్దెమీది కెక్కెను.౹ అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధముచేయుచుండగా అతడు పరవశుడై౹ ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులుపెట్టి దింప బడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను.౹ అందులో భూమియందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకుపురుగులును, ఆకాశపక్షులును ఉండెను.౹ అప్పుడు —పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమత నికి వినబడెను.౹ అయితే పేతురు–వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా౹ –దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను.౹ ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి౹ –పేతురు అను మారుపేరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా? అని అడిగిరి౹ పేతురు ఆ దర్శనమునుగూర్చి యోచించుచుండగా ఆత్మ–ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకుచున్నారు.౹ నీవు లేచి క్రిందికిదిగి, సందేహింపక వారితోకూడ వెళ్లుము; నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను.౹ పేతురు ఆ మనుష్యులయొద్దకు దిగి వచ్చి–ఇదిగో మీరు వెదకువాడను నేనే; మీరు వచ్చిన కారణ మేమని అడిగెను.౹ అందుకు వారు–నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూద జనులందరివలన మంచిపేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి యను ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్ను తన యింటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధదూత వలన బోధింపబడెనని చెప్పిరి; అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. మరునాడు అతడు లేచి, వారితోకూడ బయలుదేరెను; యొప్పేవారైన కొందరు సహోదరులును వారితోకూడ వెళ్లిరి.౹ మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కనిపెట్టుకొని యుండెను.౹ పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదములమీదపడి నమస్కారము చేసెను.౹ అందుకు పేతురు–నీవు లేచి నిలువుము, నేను కూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి౹ అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి, అనేకులు కూడియుండుట చూచెను.౹ అప్పుడతడు–అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడనియైనను అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు.౹ కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని గనుక, ఎందునిమిత్తము నన్ను పిలువనంపితిరో దానినిగూర్చి అడుగు చున్నానని వారితో చెప్పెను.౹ అందుకు కొర్నేలి— నాలుగు దినముల క్రిందట పగలు మూడుగంటలు మొదలుకొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా యెదుట నిలిచి౹ –కొర్నేలీ, నీ ప్రార్థన వినబడెను; నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి యున్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి౹ పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము; అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను.౹ వెంటనే నిన్ను పిలిపించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞా పించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నామని చెప్పెను. అందుకు పేతురు నోరుతెరచి ఇట్లనెను౹ –దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను.౹ ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.౹ యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.౹ యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయమొదలుకొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును౹ అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.౹ ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడ దీసి చంపిరి.౹ దేవుడాయనను మూడవదినమున లేపి౹ ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరు వాత ఆయనతోకూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.౹ ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను.౹ ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను.౹ [45-46] సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.౹ *** అందుకు పేతురు–మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి౹ యేసు క్రీస్తు నామమందువారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి. అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిరని అపొస్తలులును యూదయ యందంతటనున్న సహోదరులును వినిరి.౹ పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు౹ –నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనముచేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెను౹ –నేను యొప్పే పట్టణములో ప్రార్థనచేయుచుండగా పరవశుడనైతిని, అప్పుడొక దర్శనము నాకు కలిగెను; అది ఏదనగా నాలుగు చెంగులుపెట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొక విధమైన పాత్ర ఆకాశమునుండి దిగి నాయొద్దకు వచ్చెను.౹ దానివైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమియందుండు చతుష్పాద జంతువులును అడవి మృగములును ప్రాకెడు పురుగులును ఆకాశపక్షులును నాకు కనబడెను.౹ అప్పుడు —పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని యొక శబ్దము నాతో చెప్పుట వింటిని.౹ అందుకు నేను–వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా౹ రెండవమారు ఆ శబ్దము ఆకాశము నుండి–దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను.౹ ఈలాగు ముమ్మారు జరిగెను; తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసికొని పోబడెను.౹ వెంటనే కైసరయనుండి నాయొద్దకు పంప బడిన ముగ్గురు మనుష్యులు మేమున్న యింటియొద్ద నిలిచి యుండిరి.౹ అప్పుడు ఆత్మ –నీవు భేదమేమియు చేయక వారితోకూడ వెళ్లుమని నాకు సెలవిచ్చెను. ఈ ఆరుగురు సహోదరులు నాతోకూడ వచ్చిరి; మేము కొర్నేలి యింట ప్రవేశించితిమి.౹ అప్పుడతడు–నీవు యొప్పేకు మనుష్యు లను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము;౹ నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన యింట నిలిచి తనతో చెప్పిన యొక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను.౹ నేను మాటలాడ నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను.౹ అప్పుడు–యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తి స్మము పొందుదురని ప్రభువు చెప్పినమాట నేను జ్ఞాపకము చేసికొంటిని.౹ కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడ సమానవరము అనుగ్రహించి యుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను.౹ వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక–అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసియున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. స్తెఫను విషయములో కలిగినశ్రమనుబట్టి చెదరి పోయినవారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక, ఫేనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశములవరకు సంచరించిరి.౹ కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపువారితో మాటలాడుచు ప్రభువైన యేసునుగూర్చిన సువార్త ప్రకటించిరి;౹ ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి.౹ వారినిగూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపువారు విని బర్నబాను అంతియొకయవరకు పంపిరి.౹ అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.౹ అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి.౹ అంతట అతడు సౌలును వెదకు టకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను.౹ వారు కలిసి యొక సంవత్సర మంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చిరి.౹ వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.౹ అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను.౹ ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారిచేత పెద్దలయొద్దకు దానిని పంపిరి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు. సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని౹ యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.౹ ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియనిరొట్టెల పండుగ దినములు.౹ అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండు గైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను.౹ పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.౹ హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికులమధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.౹ ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి–త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతనిచేతులనుండి ఊడిపడెను.౹ అప్పుడు దూత అతనితో–నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత —నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.౹ అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను.౹ మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకు తెలివివచ్చి–ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించియున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.౹ ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనేకులుకూడి ప్రార్థనచేయుచుండిరి.౹ అతడు తలవాకిటి తలుపుతట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.౹ ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెత్తి కొనిపోయి–పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను.౹ అందుకు వారు–నీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు–అతని దూత అనిరి.౹ పేతురు ఇంకనుతట్టుచున్నందునవారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.౹ అతడు–ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి — యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొకచోటికి వెళ్లెను.౹ తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.౹ హేరోదు అతనికోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలివారిని విమర్శించి వారిని చంప నాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను. తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యా గ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.౹ నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా౹ జనులు–ఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి.౹ అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతోకూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి.౹ వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ–నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను.౹ అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూ కయకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి.౹ వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను.౹ వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చి నప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి.౹ ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను.౹ అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము.౹ అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై౹ అతని తేరిచూచి–సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువుయొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?౹ ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.౹ అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వ సించెను. తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ యెక్కి పాఫునుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెను.౹ అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి కూర్చుండిరి.౹ ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజమందిరపు అధికారులు–సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైన బోధవాక్యము చెప్పవలెనని యున్నయెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి.౹ అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను— ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొనివచ్చి౹ యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను.౹ మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి యిచ్చెను.౹ ఇంచుమించు నాలుగువందల ఏబది సంవత్సరములు ఇట్లు జరిగెను. అటుతరువాత ప్రవక్తయైన సమూయేలువరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయ చేసెను.౹ ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్లవరకు దయచేసెను.౹ తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన–నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను. అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టించెను.౹ ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను.౹ యోహాను తన పనిని నెరవేర్చుచుండగా —నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను; ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను. సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, యీ రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది.౹ యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతి విశ్రాంతిదినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్షవిధించుటచేత ఆ వచనములను నెరవేర్చిరి.౹ ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి.౹ వారు ఆయననుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి.౹ అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.౹ ఆయన గలిలయనుండి యెరూషలేమునకు తనతోకూడ వచ్చిన వారికి అనేకదినములు కనబడెను; వారిప్పుడు ప్రజల యెదుట ఆయనకు సాక్షులై యున్నారు.౹ [32-33] దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆలాగే –నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది.౹ *** మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటనుబట్టి–దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను.౹ కాబట్టి వేరొక కీర్తనయందు–నీ పరిశుద్ధుని కుళ్లుపట్ట నియ్యవని చెప్పుచున్నాడు.౹ [36-37] దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి, తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్లిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్లుపట్టలేదు.౹ *** కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,౹ మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియుగాక.౹ ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీమీదికి రాకుండ చూచుకొనుడి; అదేమనగా— ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడి నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసెదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి.౹ సమాజమందిరములోనివారు లేచిన తరువాత అనేకులు యూదులును, భక్తిపరులైన యూదమత ప్రవిష్టులును, పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాటలాడుచు, దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి. మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణ మంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.౹ యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి.౹ అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి–దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము;౹ ఏలయనగా –నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.౹ అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.౹ [49-50] ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.౹ *** వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి.౹ అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి. ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి. యూదుల సమాజమందిరములో ప్రవేశించి, తేటగా బోధించినందున అనేకులు, యూదులును గ్రీసు దేశస్థు లును విశ్వసించిరి. ౹ అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరులమీద పగ పుట్టించిరి.౹ కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడపిరి. ప్రభువు వారిచేత సూచకక్రియలను అద్భుతములను చేయించి, తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించు చుండెను.౹ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపొ స్తలుల పక్షముగాను ఉండిరి.౹ మరియు అన్యజనులును యూదులును తమ అధికారులతో కలిసి వారిమీదపడి వారిని అవమానపరచి రాళ్లు రువ్వి చంపవలెనని యుండిరి.౹ వారాసంగతి తెలిసికొని లుకయొనియలోని పట్టణములగు లుస్త్రకును దెర్బేకును చుట్టుపెట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. [7-8] లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.౹ *** అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతనివైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి౹ — నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పి నప్పుడు అతడు గంతులువేసి నడువ సాగెను.౹ [11-12] జనసమూహములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో —దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగి వచ్చియున్నారని కేకలువేసి, బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగియైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి.౹ *** పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతియొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారములయొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను.౹ అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి౹ –అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచి పెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.౹ ఆయన గతకాలములలో సమస్త జనులను తమతమ మార్గములయందు నడువనిచ్చెను.౹ అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్నుగూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి.౹ వారీలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండ సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను. అంతియొకయ నుండియు ఈకొనియ నుండియు యూదులు వచ్చి, జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలుమీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి.౹ అయితే శిష్యులు అతనిచుట్టు నిలిచియుండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి, మరునాడు బర్నబాతోకూడ దెర్బేకు బయలుదేరి పోయెను.౹ వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయకును తిరిగివచ్చి౹ శిష్యుల మనస్సులను దృఢపరచి–విశ్వాసమందు నిలుకడగా ఉండ వలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.౹ మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్థనచేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.౹ తరువాత పిసిదియ దేశమంతట సంచరించి పంఫూలియకు వచ్చిరి.౹ మరియు పెర్గేలో వాక్యము బోధించి, అత్తాలియకు దిగి వెళ్లిరి.౹ అక్కడనుండి ఓడ యెక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడినవారై, మొదట బయలుదేరిన అంతియొ కయకు తిరిగి వచ్చిరి.౹ వారు వచ్చి, సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు, వివరించిరి.౹ పిమ్మట వారు శిష్యులయొద్ద బహుకాలము గడపిరి. కొందరు యూదయనుండి వచ్చి–మీరు మోషే. నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి.౹ పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి.౹ కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి.౹ వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; దేవుడు తమకు తోడై యుండి చేసినవన్నియు వారు వివరించిరి.౹ పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరులేచి, అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. అప్పుడు అపొస్తలులును పెద్దలును ఈ సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను— సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును.౹ మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్య మిచ్చెను.౹ వారి హృదయములను విశ్వాసమువలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు౹ గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు?౹ ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంతట ఆ సమూహమంతయు ఊరకుండి, బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచకక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను.౹ వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను–సహోదరులారా, నా మాట ఆలకించుడి.౹ అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించియున్నాడు.౹ ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి; ఎట్లనగా— ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను; మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులును ప్రభువు ను వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైనవాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెద నని అనాదికాలమునుండి ఈ సంగతులను తెలియ పరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది.౹ కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపట్టక౹ విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.౹ ఏలయనగా, సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలనమునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరుగల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను.౹ వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా–అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగానుండిన సహోదరులకు శుభము.౹ కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మే మధికారమిచ్చి యుండలేదు౹ [25-26] గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతోకూడ మీయొద్దకు పంపుట యుక్తమని మాకంద రికి ఏకాభిప్రాయము కలిగెను.౹ *** కాగా యూదాను సీలను పంపి యున్నాము; వారును నోటిమాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు.౹ [28-29] విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక. *** అంతట వారు సెలవుపుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి.౹ వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి.౹ మరియు యూదాయు సీలయు కూడ ప్రవక్తలై యుండి నందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి.౹ [33-34] వారు అక్కడ కొంతకాలము గడపి, సహోదరులయొద్దనుండి తమ్మును పంపిన వారియొద్దకు వెళ్లుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి.౹ *** అయితే పౌలును బర్నబాయు అంతియొకయలో నిలిచి, యింక అనేకులతోకూడ ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి. కొన్ని దినములైన తరువాత–ఏ యే పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులయొద్దకు తిరిగి వెళ్లి, వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను.౹ అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను.౹ అయితే పౌలు, పంఫూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను.౹ వారిలో తీవ్రమైన వాదము కలిగినందునవారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను;౹ [40-41] పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి, సంఘములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ. తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.౹ అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు.౹ అతడు తనతోకూడ బయలుదేరి రావలెనని పౌలుకోరి, అతని తండ్రి గ్రీసుదేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికి తెలియును గనుక వారినిబట్టి అతని తీసికొని సున్నతి చేయించెను.౹ వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి.౹ గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని౹ [7-8] యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు. అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.౹ *** అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి–నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను.౹ అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి.౹ మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యపట్టణమును రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిదినములు ఆ పట్టణములో ఉంటిమి.౹ విశ్రాంతిదినమున గవిని దాటి నదీతీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, కూడివచ్చిన స్త్రీలతో మాటలాడు చుంటిమి.౹ అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగుపొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను.౹ ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె–నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండు డని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యముపెట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను.౹ ఆమె పౌలును మమ్మును వెంబడించి–ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను.౹ ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి–నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి, పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయిరి.౹ అంతట న్యాయాధిపతులయొద్దకు వారిని తీసికొనివచ్చి–ఈ మనుష్యులు యూదులై యుండి౹ రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు, మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి.౹ అప్పుడు జనసమూహము వారిమీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులును వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి.౹ వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోవేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి.౹ అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను.౹ అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి.౹ అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను.౹ అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను.౹ అప్పుడు పౌలు–నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను.౹ అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి౹ వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను.౹ అందుకు వారు— ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి౹ అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి.౹ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.౹ మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనముపెట్టి, దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు–ఆ మనుష్యులను విడుదలచేయుమని చెప్పుటకు బంటులను పంపిరి.౹ చెరసాల నాయకుడీమాటలు పౌలునకు తెలిపి–మిమ్మును విడుదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపి యున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను.౹ అయితే పౌలు–వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలోవేయించి, యిప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పము; వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసికొని పోవలెనని చెప్పెను.౹ ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా, వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి,౹ వారిని బతిమాలుకొని వెలుపలికి తీసికొనిపోయి — పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి.౹ వారు చెరసాలలోనుండి వెలుపలికి వచ్చి లూదియ యింటికి వెళ్లిరి; అక్కడి సహోదరులను చూచి, ఆదరించి బయలుదేరి పోయిరి. వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణములమీదుగా. వెళ్లి థెస్సలొనీకకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజమందిరమొకటి యుండెను౹ [2-3] గనుక పౌలు తనవాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి–క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతిదినములు తర్కించుచుండెను.౹ *** వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.౹ అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి.౹ అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి — భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చియున్నారు; యాసోను వీరిని చేర్చుకొనియున్నాడు.౹ వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.౹ ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి.౹ వారు యాసోనునొద్దను మిగిలినవారియొద్దను జామీను తీసికొని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజమందిరములో ప్రవేశించిరి.౹ వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.౹ అందుచేత వారిలో అనేకులును, ఘనతగల గ్రీసుదేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలమందియు విశ్వసించిరి.౹ అయితే బెరయలో కూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి.౹ వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.౹ పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణమువరకు తోడుకొని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతనియొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి. పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.౹ కాబట్టి సమాజమందిరములలో యూదులతోను, భక్తిపరులైన వారితోను ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలిసికొను వారితోను తర్కించుచు వచ్చెను.౹ ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు–ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసునుగూర్చియు పునరుత్థానమునుగూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు–వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.౹ అంతట వారు అతని వెంటబెట్టుకొని అరేయొపగు అను సభ యొద్దకు తీసికొనిపోయి–నీవు చేయుచున్న యీ నూతన బోధ యెట్టిదో మేము తెలిసికొనవచ్చునా?౹ కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొన గోరు చున్నామని చెప్పిరి.౹ ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు.౹ పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా –ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడు చున్నది.౹ నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద–తెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.౹ జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.౹ ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.౹ [26-27] మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.౹ *** మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె–మన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.౹ కాబట్టి మనము దేవుని సంతానమై యుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.౹ ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.౹ ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు. మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరు–దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.౹ ఆలాగుండగా పౌలు వారి మధ్యనుండి వెళ్లిపోయెను.౹ అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి. అటుతరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను.౹ యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీనుండి క్రొత్తగా వచ్చినవారు.౹ వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి.౹ అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చు చుండెను.౹ వారు ఎదురాడి దూషించినప్పుడు, అతడు తన వస్త్రములు దులుపుకొని–మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేను నిర్దోషిని; యికమీదట అన్యజనులయొద్దకు పోవుదునని వారితో చెప్పి౹ అక్కడనుండి వెళ్లి, దేవునియందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని యింటికి వచ్చెను. అతని యిల్లు సమాజమందిరమును ఆనుకొనియుండెను.౹ ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు తన యింటివారందరితోకూడ ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులువిని విశ్వ సించి బాప్తిస్మము పొందిరి.౹ రాత్రివేళ దర్శనమందు ప్రభువు–నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము.౹ నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా౹ అతడు వారిమధ్య దేవుని వాక్యము బోధించుచు, ఒక సంవత్సరము మీద ఆరునెలలు అక్కడ నివసించెను. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొనివచ్చి౹ –వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి.౹ పౌలు నోరు తెరచి మాటలాడబోగా గల్లియోను — యూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను మీమాట సహనముగా వినుట న్యాయమే.౹ ఇది యేదో యొక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమునుగూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శచేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి౹ వారిని న్యాయపీఠము ఎదుటనుండి తోలివేసెను.౹ అప్పుడందరు సమాజమందిరపు అధికారియైన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్ట సాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతినిగూర్చియు లక్ష్యపెట్టలేదు. పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి.౹ వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి, తాను మాత్రము సమాజమందిరములో ప్రవేశించి, యూదులతో తర్కించుచుండెను.౹ వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా౹ అతడు ఒప్పక–దేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను.౹ తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపువారిని కుశలమడిగి, అంతియొకయకు వచ్చెను.౹ అక్కడ కొంతకాలముండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగియయందును సంచరించుచు శిష్యులనందరిని స్థిరపరచెను. అలెక్సంద్రియవాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను.౹ అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మముమాత్రమే తెలిసికొనిన వాడైనను, యేసునుగూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను.౹ ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి.౹ తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహ పరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించినవారికి చాల సహాయము చేసెను.౹ యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి–మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా౹ వారు–పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి.౹ అప్పుడతడు–ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు–యోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి.౹ అందుకు పౌలు–యోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను.౹ వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.౹ తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి.౹ వారందరు ఇంచుమించు పండ్రెండుగురు పురుషులు. తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమునుగూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను.౹ అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను.౹ రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్నవారందరును ప్రభువు వాక్యము వినిరి.౹ మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను;౹ అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డైలెనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను.౹ అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు–పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పెట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి.౹ యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి.౹ అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా౹ ఆ దయ్యముపెట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి.౹ ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘన పరచబడెను.౹ విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసి యొప్పుకొనిరి.౹ మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.౹ ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమునవచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మనస్సులో ఉద్దేశించి–నేనక్కడికి వెళ్లిన తరువాత రోమా కూడ చూడవలెనని అనుకొనెను.౹ అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమునుగూర్చి చాల అల్లరి కలిగెను.౹ ఏలాగనగా — దేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుటవలన ఆ పనివారికి మిగుల లాభము కలుగజేయుచుండెను.౹ అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుకూర్చి–అయ్యలారా, యీ పనివలన మనకు జీవనము బహు బాగుగా జరుగు చున్నదని మీకు తెలియును.౹ అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు.౹ మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయేగాక, మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియయందంతటను భూలోకమందును పూజింపబడుచున్న యీమెయొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచు చున్నదని వారితో చెప్పెను.౹ వారు విని రౌద్రముతో నిండిన వారై–ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి;౹ పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసి దోనియవారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి.౹ పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను, గాని శిష్యులు వెళ్లనియ్యలేదు.౹ మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహి తులైయుండి అతనియొద్దకు వర్తమానము పంపి–నీవు నాటక శాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి.౹ ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున, కొందరాలాగున కేకలువేసిరి; తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలమందికి తెలియలేదు.౹ అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములోనుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను.౹ అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటలసేపు–ఎఫెసీయుల అర్తెమి దేవి మహాదేవి అని కేకలువేసిరి.౹ అంతట కరణము సమూహమును సముదాయించి–ఎఫెసీయులారా, ఎఫె సీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు?౹ ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము.౹ మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు.౹ దేమేత్రికిని అతనితోకూడనున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒక రితో ఒకరు వ్యాజ్యె మాడవచ్చును.౹ అయితే మీరు ఇతర సంగతులనుగూర్చి యేమైనను విచారణ చేయవలెనని యుంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును.౹ మనము ఈ గలిబిలినిగూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను.౹ అతడీలాగు చెప్పి సభను ముగించెను. ఆ యల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించినమీదట వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లుటకు బయలు దేరెను.౹ ఆ ప్రదేశములయందు సంచరించి, పెక్కుమాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను.౹ అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడయెక్కి సిరియకు వెళ్ల వలెనని యుండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియమీదుగా తిరిగి రావలెనని నిశ్చయించుకొనెను.౹ మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడునైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైనన తుకికు, త్రోఫిమును అతనితోకూడ వచ్చిరి.౹ వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి.౹ పులియనిరొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారియొద్ద ఏడు దినములు గడిపితిమి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.౹ మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.౹ అప్పుడు ఐతుకు అను నొక యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై యెత్తబడెను.౹ అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీదపడి కౌగిలించుకొని–మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను.౹ అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలు దేరెను.౹ వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చి నప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్లితిమి. తాను కాలి నడకను వెళ్లవలెనని అతడా ప్రకారముగా మాకు నియమించియుండెను.౹ అస్సులో అతడు మాతో కలిసికొని నప్పుడు మేమతనిని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి.౹ అచ్చటనుండి వెళ్లి మరునాడు కీయొసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమొసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి.౹ సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫె సును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను. అతడు మిలేతునుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను.౹ వారు తనయొద్దకు వచ్చినప్పుడతడు వారితో ఇట్లనెను— నేను ఆసియలో కాలుపెట్టిన దినమునుండి, ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో మీరే యెరుగుదురు.౹ యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును.౹ [20-21] మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచు కొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు, దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచ వలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును ఏలాగు సాక్ష్య మిచ్చుచుంటినో యిదంతయు మీకు తెలియును.౹ *** ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడినవాడనై యెరూషలేమునకు వెళ్లుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదుగాని,౹ బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును.౹ అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.౹ ఇదిగో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు నేను మీమధ్యను సంచరించుచుంటిని; మీలో ఎవరును ఇకమీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియును.౹ కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషినికానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. ౹ దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.౹ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపా దించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆయావత్తుమందనుగూర్చియు, మీ మట్టుకు మిమ్మునుగూర్చియు జాగ్రత్తగా ఉండుడి.౹ నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.౹ మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.౹ కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతిమనుష్యునికి మానక బుద్ధిచెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి.౹ ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడినవారందరిలో స్వాస్థ్య మనుగ్రహించుటకును శక్తి మంతుడు.౹ ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు;౹ నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును.౹ మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు— పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. అతడీలాగు చెప్పి మోకాళ్లూని వారందరితో ప్రార్థన చేసెను.౹ అప్పుడు వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు౹ పౌలు మెడమీదపడి అతనిని ముద్దుపెట్టుకొని, వారు ఓడవరకు అతనిని సాగ నంపిరి. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకును, మరునాడు రొదుకును, అక్కడనుండి పతరకును వచ్చితిమి.౹ అప్పుడు ఫేనీకేకు వెళ్ల బోవుచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి.౹ కుప్రకు ఎదురుగా వచ్చి, దానిని ఎడమతట్టున విడిచి, సిరియవైపుగా వెళ్లి, తూరులో దిగితిమి; అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసియుండెను.౹ మేమక్కడ నున్న శిష్యులను కనుగొని యేడుదినములక్కడ ఉంటిమి. వారు–నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి.౹ ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలివరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి.౹ అంతట మేము ఓడ ఎక్కితిమి, వారు తమతమ యిండ్లకు తిరిగి వెళ్లిరి. మేము తూరునుండి చేసిన ప్రయాణము ముగించి, తొలెమాయికి వచ్చి, సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి.౹ మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తి కుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి.౹ కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.౹ మేమనేక దినములక్కడ ఉండగా, అగబు అను ఒక ప్రవక్త యూదయనుండి వచ్చెను.౹ అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తన చేతులను కాళ్లను కట్టుకొని–యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనులచేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను.౹ ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును–యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని౹ పౌలు— ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.౹ అతడు ఒప్పుకొన నందున మేము–ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసికొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి.౹ మరియు కైసరయనుండి కొందరు శిష్యులు, మొదటనుండి శిష్యుడుగా ఉండిన కుప్రీయుడైన మ్నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతోకూడ వచ్చిరి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మును సంతోషముతో చేర్చుకొనిరి.౹ మరునాడు పెద్దలందరు అక్కడికి వచ్చియుండగా పౌలు మాతోకూడ యాకోబునొద్దకు వచ్చెను.౹ అతడు వారిని కుశల మడిగి, తన పరిచర్యవలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను.౹ వారు విని దేవుని మహిమపరచి అతని చూచి–సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచుచున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు.౹ అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడువకూడదనియు నీవు చెప్పుటవలన వారందరు మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్నుగూర్చి వర్తమానము వినియున్నారు.౹ కావున మన మేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు.౹ కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మ్రొక్కుబడియున్న నలుగురు మనుష్యులు మాయొద్ద ఉన్నారు.౹ నీవు వారిని వెంటబెట్టుకొనిపోయి వారితోకూడ శుద్ధిచేసికొని, వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికయ్యెడి తగులుబడి పెట్టుకొనుము; అప్పుడు నిన్నుగూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలిసికొందురు౹ అయితే విశ్వసించిన అన్యజనులనుగూర్చి–వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపినదానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి.౹ అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంట బెట్టుకొనిపోయి, వారితోకూడ శుద్ధిచేసికొని, దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివానికొరకు కానుక అర్పించువరకు శుద్ధిదినములు నెరవేర్చుదుమని తెలిపెను. ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహ మంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని౹ –ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజ లకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి.౹ ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితోకూడ పట్టణములో అంతకుముందువారు చూచియున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి.౹ పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను.౹ వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై యధికారికి వర్తమానము వచ్చెను;౹ వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట బెట్టుకొని వారియొద్దకు పరుగెత్తివచ్చెను; వారు పై యధికారిని సైనికులను రాణువవారిని చూచి పౌలును కొట్టుట మానిరి.౹ పై యధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని, రెండు సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞా పించి–ఇతడెవడు? ఏమిచేసెనని అడుగగా,౹ సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలువేయు చున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను.౹ పౌలు మెట్లమీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసికొని పోవలసి వచ్చెను.౹ ఏలయనగా–వానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసికొనిపోవనై యుండగా అతడు పైయధికారిని చూచి–నేను నీతో ఒకమాట చెప్పవచ్చునా? అని అడిగెను. అందుకతడు–గ్రీకుభాష నీకు తెలియునా?౹ ఈ దినములకుమునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొనిపోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? అని అడిగెను.౹ అందుకు పౌలు–నేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను; ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను.౹ అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీభాషలో ఇట్లనెను– సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి. అతడు హెబ్రీభాషలో మాటలాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడతడు ఈలాగు చెప్పసాగెను. –నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనైయుండి౹ ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని.౹ ఇందునుగూర్చి ప్రధానయాజకుడును పెద్దలందరును నాకు సాక్షులైయున్నారు. నేను వారివలన సహోదరులయొద్దకు పత్రికలు తీసికొని, దమస్కులోని వారిని కూడ బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్లితిని.౹ నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను.౹ నేను నేలమీద పడి–సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నా వని నాతో ఒక స్వరము పలుకుట వింటిని.౹ అందుకు నేను–ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన–నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను.౹ నాతోకూడ నున్నవారు ఆ వెలుగును చూచిరిగాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు.౹ అప్పుడు నేను–ప్రభువా, నే నేమి చేయవలెనని అడుగగా, ప్రభువు–నీవు లేచి దమస్కులోనికి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన వన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను.౹ ఆ వెలుగుయొక్క ప్రభావమువలన నేను చూడలేక పోయినందున నాతోకూడ ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని.౹ అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును, అక్కడ కాపురమున్న యూదులందరిచేత మంచిపేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నాయొద్దకు వచ్చి నిలిచి౹ –సౌలా! సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృిష్టిపొంది అతని చూచితిని.౹ అప్పుడతడు–మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియమించియున్నాడు;౹ నీవు కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యులయెదుట ఆయనకు సాక్షివైయుందువు.౹ గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను.౹ అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని.౹ అప్పుడాయన–నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్నుగూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను.౹ అందుకు నేను–ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియును.౹ మరియు నీ సాక్షి యైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని.౹ అందుకు ఆయన–వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమి మీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి.౹ వారు కేకలువేయుచు తమ పైబట్టలు విదుల్చుకొని ఆకా శముతట్టు దుమ్మెత్తి పోయుచుండగా౹ వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞా పించెను.౹ వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచి–శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను.౹ శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతియొద్దకు వచ్చి— నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీ యుడు సుమీ అనెను.౹ అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి–నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమనగా౹ అతడు–అవునని చెప్పెను. సహస్రాధిపతి— నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలు–నేనైతే పుట్టుకతోనే రోమీయుడననెను.౹ కాబట్టి అతని విమర్శింపబోయినవారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడ భయపడెను. మరునాడు, యూదులు అతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధానయాజకులును మహాసభ వారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసి కొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను. పౌలు మహా సభవారిని తేరిచూచి–సహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగల వాడనై దేవునియెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను.౹ అందుకు ప్రధానయాజకుడైన అననీయ–అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచియున్నవారికి ఆజ్ఞాపింపగా౹ [3-4] పౌలు అతనిని చూచి–సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచియున్నవారు —నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి.౹ *** అందుకు పౌలు సహోదరులారా, యితడు ప్రధానయాజకుడని నాకు తెలియలేదు— నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి యున్నదనెను.౹ వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి–సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణనుగూర్చియు, మృతుల పునరుత్థానమునుగూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను.౹ అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను.౹ సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు.౹ అప్పుడు పెద్దగొల్లు పుట్టెను; పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి–ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఒక ఆత్మయైనను దేవదూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడి యుండవచ్చునని చెప్పుచు తగువులాడిరి.౹ కలహమెక్కు వైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి–మీరు వెళ్లి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసికొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను. ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి–ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడ సాక్ష్య మియ్యవలసియున్నదని చెప్పెను. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి.౹ ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ.౹ వారు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును వచ్చి–మేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని గట్టిగ ఒట్టుపెట్టుకొని యున్నాము.౹ కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనినిగూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవిచేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి.౹ అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను.౹ అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తనయొద్దకు పిలిచి–ఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడుకొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను.౹ శతాధిపతి సహస్రాధిపతియొద్ద కతని తోడుకొనిపోయి–ఖైదీయైన పౌలు నన్ను పిలిచి–నీతో ఒక మాట చెప్పుకొనవలెననియున్న యీ పడుచువానిని నీయొద్దకు తీసికొనిపొమ్మని నన్ను అడిగెనని చెప్పెను.౹ సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసి కొనిపోయి–నీవు నాతో చెప్పుకొనవలెనని యున్నదేమని యొంటరిగా అడిగెను.౹ అందుకతడు–నీవు పౌలునుగూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసికొని రావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి యున్నారు.౹ వారి మాటకు నీవు సమ్మతింపవద్దు; వారిలో నలువదిమందికంటె ఎక్కువ మనుష్యులు అతనికొరకు పొంచియున్నారు. వారు అతని చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనియున్నారు; ఇప్పుడు నీయొద్ద మాట తీసికొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను. అందుకు సహస్రాధిపతి–నీవు ఈ సంగతి నాకు తెలిపితివని యెవనితోను చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేసెను.౹ తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తనయొద్దకు పిలిచి–కైసరయవరకు వెళ్లుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బదిమంది గుఱ్ఱపురౌతులను ఇన్నూరు మంది యీటెలవారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచి౹ పౌలును ఎక్కించి–అధిపతియైన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధపరచుడని చెప్పెను.౹ మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను— మహాఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు.౹ యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, అతడు రోమీయుడని నేను విని, సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని.౹ వారు అతనిమీద మోపిన నేరమేమో తెలిసికొనగోరి నేను వారి మహాసభయొద్దకు అతనిని తీసికొనివచ్చితిని.౹ వారు తమ ధర్మశాస్త్రవాదములనుగూర్చి అతనిమీద నేరము మోపిరే గాని మరణమునకైనను, బంధకములకైనను తగిన నేరము అతనియందేమియు కనుపరచలేదు.౹ అయితే వారు ఈ మనుష్యునిమీద కుట్రచేయనై యున్నారని నాకు తెలియవచ్చినందున, వెంటనే అతని నీయొద్దకు పంపించితిని. నేరము మోపినవారు కూడ అతనిమీద చెప్పవలెనని యున్న సంగతి నీయెదుట చెప్పుకొన నాజ్ఞాపించితిని. కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొనిపోయిరి.౹ మరునాడు వారతనితోకూడ రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి.౹ వారు కైసరయకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడ అతనియెదుట నిలువ బెట్టిరి.౹ అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు–ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని౹ –నీమీద నేరము మోపువారు కూడ వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి,౹ హేరోదు అధికారమందిరములో అతనిని కావలియందుంచవలెనని ఆజ్ఞాపించెను. అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయ వాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి.౹ పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతనిమీద నేరముమోప నారంభించి యిట్లనెను— మహాఘనతవహించిన ఫేలిక్సా, మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము.౹ నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండ మేము క్లుప్తముగా చెప్పుకొనుదానిని తమరు ఎప్పటివలె శాంతముగా వినవలెనని వేడుకొనుచున్నాను.౹ ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి,౹ [6-8] మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి. తమరు విమర్శించినయెడల మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను.౹ *** *** యూదులందుకు సమ్మతించి యీ మాటలు నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి–మాటలాడుమని పౌలునకు సైగ చేయగా అతడిట్లనెను— తమరు బహు సంవత్సరములనుండి యీ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను.౹ యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాటనుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును.౹ దేవాలయములోనేమి, సమాజమందిరములలోనేమి, పట్టణములోనేమి, నేను ఎవనితోను తర్కించుట యైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు.౹ మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు.౹ [14-15] ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.౹ *** ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను.౹ కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని.౹ నేను శుద్ధి చేసికొనిన వాడనై యీలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపుకూర్చి యుండ లేదు, నావలన అల్లరి కాలేదు. ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి;౹ నామీద వారికేమైన ఉన్నయెడల వారే తమరి సన్నిధికివచ్చి నామీద నేరము మోపవలసియుండెను.౹ [20-21] లేదా, నేను మహాసభయెదుట నిలిచియున్నప్పుడు, మృతుల పునరుత్థానమునుగూర్చి నేడు వారియెదుట విమర్శింపబడు చున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన యీయొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనియుంటే వీరైన చెప్పవచ్చుననెను. *** ఫేలిక్సు ఈ మార్గమునుగూర్చి బాగుగా ఎరిగినవాడై–సహస్రాధిపతియైన లూసియ వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను.౹ మరియు అతని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతోకూడ వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తుయేసునందలి విశ్వాసమునుగూర్చి అతడు బోధింపగా వినెను.౹ అప్పుడతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమునుగూర్చియు రాబోవు విమర్శనుగూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి–ఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను.౹ తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను.౹ రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచి వాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను. ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడుదినములకు కైసరయనుండి యెరూషలేమునకు వెళ్లెను.౹ అప్పుడు ప్రధానయాజకులును యూదులలో ముఖ్యులును పౌలుమీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి.౹ మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి–మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనినిగూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి.౹ అందుకు ఫేస్తు–పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు; నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ల బోవుచున్నాను౹ గనుక మీలో సమర్థులైనవారు నాతోకూడ వచ్చి ఆ మనుష్యునియందు తప్పిదమేదైన ఉంటే అతనిమీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను. అతడు వారియొద్ద ఎనిమిది, పది దినములు గడిపి కైసరయకు వెళ్లి మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి పౌలును తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను.౹ పౌలు వచ్చి నప్పుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలిచి, భారమైన నేరములనేకముల మోపిరి గాని వాటిని బుజువు చేయలేక పోయిరి.౹ అందుకు పౌలు —యూదుల ధర్మశాస్త్రమునుగూర్చి గాని దేవాలయమునుగూర్చి గాని, కైసరునుగూర్చి గాని నేనెంతమాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను.౹ అయితే ఫేస్తు యూదులచేత మంచివాడనిపించు కొనవలెనని–యెరూషలేమునకు వచ్చి అక్కడ నా యెదుట ఈ సంగతులనుగూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను.౹ అందుకు పౌలు–కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి యున్నాను; నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమియు చేయ లేదని తమరికి బాగుగా తెలియును.౹ నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినయెడల మరణమునకు వెనుకతీయను; వీరు నామీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరముకాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను.౹ అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచనచేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పోవుదు వని ఉత్తరమిచ్చెను. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసికొనుటకు కైసరయకు వచ్చిరి.౹ వారక్కడ అనేకదినములుండగా, ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను; ఏమనగా–ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన యొక ఖైదీ యున్నాడు.౹ నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి.౹ అందుకు నేను —నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖాముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని.౹ కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమియు చేయక, మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి ఆ మనుష్యుని తీసికొని రమ్మని ఆజ్ఞాపించితిని.౹ నేరము మోపినవారు నిలిచి నప్పుడు, నేననుకొనిన నేరములలో ఒకటియైనను అతని మీద మోపినవారు కారు.౹ అయితే తమ మతమునుగూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను;౹ ఆ యేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై యేలాగున విచారింపవలెనో యేమియు తోచక, యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటినిగూర్చి విమర్శింపబడుటకు అతని కిష్టమవునేమో అని అడిగితిని.౹ అయితే పౌలు, చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి యుంచ వలెనని చెప్పుకొనినందున నేనతనిని కైసరునొద్దకు పంపించువరకు నిలిపియుంచవ లెనని ఆజ్ఞాపించితిననెను.౹ అందుకు అగ్రిప్ప–ఆ మనుష్యుడు చెప్పుకొనునది నేనును వినగోరు చున్నానని ఫేస్తుతో అనగా అతడు–రేపు వినవచ్చునని చెప్పెను. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, సహస్రాధిపతులతోను పట్టణ మందలి ప్రముఖులతోను అధికారమందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనియ్యగా పౌలు తేబడెను.౹ అప్పుడు ఫేస్తు–అగ్రిప్పరాజా, యిక్కడ మాతో ఉన్న సమస్తజనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరు–వీడు ఇక బ్రదుక తగడని కేకలు వేయుచు అతనిమీద నాతో మనవి చేసికొనిరి.౹ ఇతడు మరణమునకు తగినది ఏమియు చేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తియెదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించియున్నాను.౹ ఇతనిగూర్చి మన యేలినవారిపేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమియు కనబడలేదు గనుక విచారణయైన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరియెదుటికిని, అగ్రిప్ప రాజా, ముఖ్యముగా మీ యెదుటికిని, ఇతని రప్పించియున్నాను.౹ ఖయిదీమీద మోపబడిన నేరములను వివరింపకుండ అతని పంపుట యుక్తముకాదని నాకు తోచు చున్నదని చెప్పెను. అగ్రిప్ప పౌలును చూచి–నీ పక్షమున చెప్పు కొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి యీలాగు సమాధానము చెప్పసాగెను— అగ్రిప్పరాజా, తమరు యూదులలోఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగినవారు గనుక౹ యూదులు నామీద మోపిన నేరములన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొనుచున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను.౹ మొదటినుండి యెరూషలేములో నా జనముమధ్యను బాల్యమునుండి నేను బ్రదికిన బ్రదుకు ఏలాటిదో యూదులందరు ఎరుగుదురు.౹ వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు.౹ ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీ క్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను.౹ మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు.౹ దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచుచున్నారు?౹ నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని;౹ యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధానయాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని;౹ అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణచేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని.౹ అందునిమిత్తము నేను ప్రధానయాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా౹ రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.౹ మేమందరమును నేలపడినప్పుడు–సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.౹ అప్పుడు నేను–ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను–నీవు హింసించుచున్న యేసును.౹ [16-18] నీవు నన్ను చూచియున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము; నేను ఈ ప్రజల వలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను; వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.౹ *** *** కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక౹ మొదట దమస్కులోనివారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారుమనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని.౹ ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నముచేసిరి;౹ అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని; —క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని౹ ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పు లకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు–పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపెట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను.౹ అందుకు పౌలు ఇట్లనెను–మహాఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.౹ రాజు ఈ సంగతులెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను; వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండ లేదని రూఢిగా నమ్ముచున్నాను; ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు.౹ అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును.౹ అందుకు అగ్రిప్ప–ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను.౹ అందుకు పౌలు–సులభముగానో దుర్లభము గానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను. అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితోకూడ కూర్చుండినవారును లేచి అవతలకు పోయి౹ –ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి.౹ అందుకు అగ్రిప్ప–ఈ మనుష్యుడు–కైసరు ఎదుట చెప్పు కొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను. మేము ఓడయెక్కి ఇటలీ వెళ్లవలెనని నిర్ణయమై నప్పుడు, వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతియైన యూలి అను వానికి అప్పగించిరి.౹ ఆసియ దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి; మాసిదోనీయుడును థెస్సలొనీక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతోకూడ ఉండెను.౹ మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి, అతడు తన స్నేహితులయొద్దకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను.౹ అక్కడనుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపించితిమి.౹ మరియు కిలికియకును పంఫూలియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితిమి.౹ అక్కడ శతాధిపతి ఇటలీవెళ్లనైయున్న అలెక్సంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను.౹ అనేక దినములు మెల్లగా నడచి, యెంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనియ్యకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితిమి.౹ బహు కష్టపడి దాని దాటి, మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దానిదగ్గర లసైయ పట్టణముండెను. చాల కాలమైన తరువాత ఉపవాసదినము కూడ అప్పటికి గతించినందున ప్రయాణముచేయుట అపాయ కరమై యుండెను.౹ అప్పుడు పౌలు–అయ్యలారా, యీ ప్రయాణమువలన సరకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడ హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను.౹ అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను.౹ మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడనుండి బయలుదేరి యొకవేళ శక్యమైతే ఫీనిక్సునకుచేరి అక్కడ శీతకాలము గడపవలెనని యెక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయవ్యదిక్కులతట్టుననున్న క్రేతురేవై యున్నది.౹ మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమ కూడినదని తలంచి లంగరెత్తి, క్రేతు దరిని ఓడ నడిపించిరి.౹ కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీదనుండి విసరెను.౹ దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతిమి.౹ తరువాత కౌద అన బడిన యొక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్ట తరమాయెను.౹ దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసి కొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుకతిప్పమీద పడుదుమేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయిరి.౹ మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయ సాగిరి.౹ మూడవ దినమందు తమ చేతులార ఓడసామగ్రి పారవేసిరి.౹ [20-21] కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించు కొందుమను ఆశ బొత్తిగ పోయెను. వారు బహు కాలము భోజనము లేక యున్నందున పౌలు వారిమధ్యను నిలిచి–అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలుదేరకయే యుండవలసినది. అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును.౹ *** ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హానికలుగదు.౹ నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి–పౌలా, భయపడకుము;౹ నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించియున్నాడని నాతో చెప్పెను.౹ కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను.౹ అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసి యుండునని చెప్పెను. పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొనిపోవుచుండగా అర్ధరాత్రివేళ ఓడవారు ఏదో యొక దేశము దగ్గర పడు చున్నదని యూహించి౹ బుడుదువేసి చూచి యిరువది బారల లోతని తెలిసికొనిరి. ఇంకను కొంతదూరము వెళ్లిన తరువాత, మరల బుడుదువేసి చూచి పదునైదు బారల లోతని తెలిసికొనిరి.౹ అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి, వారు ఓడ అమరములోనుండి నాలుగు లంగరులువేసి యెప్పుడు తెల్ల వారునా అని కాచుకొని యుండిరి.౹ అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి, తాము అనివిలోనుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపి వేసిరి.౹ అందుకు పౌలు–వీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోను సైనికులతోను చెప్పెను.౹ వెంటనే సైనికులు పడవ త్రాళ్లు కోసి దాని కొట్టుకొని పోనిచ్చిరి.౹ [33-34] తెల్లవారుచుండగా పౌలు— పదునాలుగు దినములనుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని యున్నారు గనుక ఆహా రము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియు ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను.౹ *** ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తిన సాగెను.౹ అప్పుడందరు ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి.౹ ఓడలో ఉన్న మేమందరము రెండువందల డెబ్బది ఆరుగురము.౹ వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలికచేసిరి.౹ ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని, దరిగల యొక సముద్రపు పాయను చూచి, సాధ్యమైనయెడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలో చించిరి౹ గనుక లంగరుల త్రాళ్లుకోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని౹ రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పెట్టించిరి. అందువలన అనివి కూరుకొనిపోయి కదలక యుండెను, అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగెను.౹ ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండునట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని౹ శతాధిపతి పౌలును రక్షింప నుద్దేశించి వారి ఆలోచన కొనసాగనియ్యక, మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలెననియు౹ కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కలమీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసికొంటిమి.౹ అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంతకాదు. ఏలాగనగా, అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందునవారు నిప్పురాజబెట్టి మమ్మును అందరిని చేర్చుకొనిరి.౹ అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పులమీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను.౹ ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలా డుట చూచినప్పుడు–నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతడు సముద్రమునుండి తప్పించుకొనినను న్యాయమాతనిని బ్రదుకనియ్యదని తమలో తాము చెప్పు కొనిరి.౹ అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి, యే హానియు పొందలేదు.౹ వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభి ప్రాయము మాని–ఇతడొక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడుదినములు స్నేహ భావముతో ఆతిథ్య మిచ్చెను.౹ అప్పుడు పొప్లియొక్క తండ్రి జ్వరముచేతను రక్తభేదిచేతను బాధపడుచు పండుకొని యుండెను. పౌలు అతనియొద్దకు వెళ్లి ప్రార్థనచేసి, అతనిమీద చేతులుంచి స్వస్థపరచెను.౹ ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడ వచ్చి స్వస్థత పొందిరి.౹ మరియు వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాద చేసి, మేము ఓడ ఎక్కి వెళ్లినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. మూడు నెలలైన తరువాత, ఆ ద్వీపమందు శీతకాల మంతయు గడపిన అశ్వినీ చిహ్నముగల అలెక్సంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి౹ సురకూసైకి వచ్చి అక్కడ మూడుదినములుంటిమి.౹ అక్కడనుండి చుట్టు తిరిగి రేగియుకు వచ్చి యొక దినమైన తరువాత దక్షిణపు గాలి విసరుటవలన మరునాడు పొతియొలీకి వచ్చితిమి.౹ అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి.౹ అక్కడనుండి సహోదరులు మా సంగతి విని అప్పీయా సంతపేట వరకును త్రిసత్రములవరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి యున్న సైనికులతోకూడ ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. మూడుదినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైనవారిని తనయొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడతడు–సహోదరులారా, నేను మన ప్రజల కైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను, యెరూషలేములోనుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని.౹ వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని౹ యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందునన వలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనముమీద నేరమేమియు మోపవలెనని నా అభిప్రాయము కాదు;౹ ఈ హేతువుచేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించితిని; ఇశ్రాయేలుయొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడియున్నానని వారితో చెప్పెను.౹ అందుకు వారు–యూదయనుండి నిన్నుగూర్చి పత్రికలు మాకు రాలేదు; ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్క డైనను నిన్నుగూర్చి చెడుసంగతి ఏదియు మాకు తెలియ పరచను లేదు, మరియు ఎవరును చెప్పుకొనను లేదు.౹ అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీవలన విన గోరుచున్నాము; ఈ మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియుననిరి. అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములోనుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి.౹ వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయిరి. అదేదనగా. –మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు; చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని యీ ప్రజలయొద్దకు వెళ్లి చెప్పుము.౹ ఈ ప్రజలు కన్నులార చూచి చెవు లార విని మనసార గ్రహించి నావైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృద యము క్రొవ్వియున్నది. వారు చెవులతో మంద ముగా విని కన్నులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీపితరులతో చెప్పిన మాట సరియే.౹ [28-29] కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురుగాక, వారు దాని విందురు. *** పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి, తనయొద్దకు వచ్చువారినందరిని సన్మానించి౹ ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసు క్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. యేసు క్రీస్తు దాసుడును, అపొస్తలుడుగా నుండు టకు పిలువబడినవాడును,౹ [2-7] దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది. మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను. యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయనద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు. *** *** *** *** *** మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.౹ [9-10] ఇప్పుడేలాగైనను ఆటంకములేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, మిమ్మునుగూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.౹ *** మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని౹ ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.౹ సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిదివరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు౹ గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను.౹ కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.౹ సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.౹ ఎందుకనిన–నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.౹ ఎందు కనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను.౹ ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.౹ మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.౹ వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.౹ వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశ లను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.౹ అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగములవరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్. అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి.౹ అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.౹ అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై౹ కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును౹ మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.౹ ఇట్టి కార్యములను అభ్య సించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?౹ అట్టి కార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము.౹ అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించు కొందువని అనుకొందువా?౹ లేదా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?౹ నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రతదినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.౹ ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.౹ సత్‌క్రియను ఓపికగాచేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.౹ [8-9] అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారిమీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్క్యార్యముచేయు ప్రతిమనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును.౹ *** సత్‌క్రియచేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.౹ [11-12] దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.౹ *** ధర్మశాస్త్రము వినువారు దేవునిదృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.౹ ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు.౹ అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.౹ దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా?౹ ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేప్ఠమైనవాటిని మెచ్చుకొనుచున్నావు కావా?౹ జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి —నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను,౹ చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై యున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా?౹ ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?౹ వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా?౹ ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపర చెదవా?౹ వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియే గదా దేవుని నామము అన్యజనులమధ్యను దూషింపబడు చున్నది?౹ నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును.౹ కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతివిధులను గైకొనినయెడల అతడు సున్నతి లేనివాడైయుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా?౹ మరియు స్వభావమునుబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్న తియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా?౹ బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు.౹ అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి?౹ ప్రతివిషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను.౹ కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతిమనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.౹ మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసినయెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థు డగునా? నేను మనుష్యరీతిగా మాటలాడుచున్నాను;౹ అట్లనరాదు. అట్లయినయెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును?౹ దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యమువలన దేవుని సత్యము ప్రబలినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల?౹ మేలు కలుగుటకు కీడుచేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే. ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా— నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతిమార్గము వారెరుగరు. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పు చున్నదని యెరుగుదుము.౹ ఏలయనగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.౹ ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.౹ అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.౹ ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.౹ కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.౹ పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని౹ క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.౹ కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయబడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టివేయ బడెను? క్రియాన్యాయమునుబట్టియా? కాదు, విశ్వాస న్యాయమునుబట్టియే.౹ కాగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలులేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.౹ దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.౹ దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.౹ విశ్వాసముద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు; ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము.౹ అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయకారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు.౹ లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రా హాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను౹ పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచ బడదు.౹ పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.౹ ఆప్రకారమే క్రియలులేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మను ష్యుడు ధన్యుడని దావీదు కూడ చెప్పుచున్నాడు.౹ ఏలాగనగా— తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు.౹ ఈ ధన్యవచనము సున్నతిగలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతిలేనివారినిగూర్చి కూడ చెప్పబడినదా? అబ్రాహాముయొక్క విశ్వాస మతనికి నీతి అని యెంచబడెననుచున్నాము గదా?౹ మంచిది; అది ఏ స్థితియందు ఎంచబడెను? సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే.౹ మరియు సున్నతి లేనివారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.౹ మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతిమాత్రము పొందినవారుగాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగుజాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.౹ అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రా హామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను.౹ ధర్మశాస్త్రసంబంధులు వారసులైనయెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును.౹ ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిం చును; ధర్మశాస్త్రము లేనియెడల అతిక్రమమును లేక పోవును.౹ ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సం తతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికి కూడ దృఢము కావలెనని, కృపననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.౹ తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు— ఇందునుగూర్చి –నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.౹ —నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.౹ మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,౹ అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక౹ దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.౹ అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.౹ అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని౹ మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడ వ్రాయ బడెను.౹ ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము ౹ మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమనుగూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము.౹ [3-4] అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడు దము.౹ *** ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.౹ ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.౹ నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.౹ అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.౹ కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.౹ ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము.౹ అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము. ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ౹ ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు.౹ అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషేవరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను,౹ అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను.౹ మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగ లేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.౹ మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలినయెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవముగలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.౹ కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను.౹ ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.౹ [20-21] మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా?౹ అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?౹ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?౹ కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి.౹ మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైనయెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము.౹ ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయబడెనని యెరుగుదుము.౹ చనిపోయినవాడు పాపవిముక్తు డని తీర్పుపొందియున్నాడు.౹ [8-9] మనము క్రీస్తుతోకూడ చనిపోయినయెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదు మని నమ్ముచున్నాము.౹ *** ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు౹ అటువలె మీరును పాపము విష యమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.౹ మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.౹ మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్న టికినికూడదు.౹ లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీ రెరుగరా?౹ మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,౹ పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.౹ మీ శరీర బలహీనతనుబట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.౹ మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.౹ అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,౹ అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.౹ ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము. సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంతకాలమే ధర్మశాస్త్రమతనిమీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను.౹ భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలుగాని, భర్త చనిపోయినయెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదల పొందును.౹ కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని చేరినయెడల వ్యభిచారిణియనబడును గాని, భర్త చనిపోయినయెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసికొనినను వ్యభిచారిణి కాకపోవును.౹ కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి.౹ ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై యుండెను.౹ ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొంది తిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము. కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.౹ అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.౹ ఒకప్పుడు నేను ధర్మశాస్త్రములేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.౹ అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను.౹ ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను.౹ కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది.౹ ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను.౹ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను.౹ ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.౹ ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేప్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను.౹ కావున ఇకను దానిచేయు నది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.౹ నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.౹ నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడుచేయుచున్నాను.౹ నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.౹ కాబట్టి మేలుచేయగోరు నాకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది.౹ అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని౹ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొనుచున్నది.౹ అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?౹ మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను. కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.౹ క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మ యెుక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.౹ [3-4] శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్రసంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాపపరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.౹ *** శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము;౹ ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.౹ ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.౹ కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.౹ దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారేగాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.౹ క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.౹ మృతులలోనుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.౹ మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మ చేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు.౹ దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు.౹ ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొంది తిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము–అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.౹ మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.౹ మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసు లము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.౹ దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.౹ [20-21] ఏలయనగా సృష్టి, నాశనమునకులోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచ బడెను.౹ *** సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము.౹ అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహముయొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము.౹ ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?౹ మనము చూడనిదాని కొరకు నిరీక్షించినయెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము. అటువలె ఆత్మ యు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు.౹ మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనముచేయుచున్నాడు.౹ దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.౹ ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.౹ మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?౹ తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?౹ దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే;౹ శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే౹ క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?౹ ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా— నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.౹ [38-39] మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు.౹ క్రీస్తునందు నిజమే చెప్పు చున్నాను, అబద్ధమాడుట లేదు.౹ పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.౹ వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.౹ పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.౹ అయితే దేవునిమాట తప్పిపోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు.౹ అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును, అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు.౹ వాగ్దానరూపమైన వాక్యమిదే— మీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును. [10-12] అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగాఉండు నిమిత్తము, పిల్ల లింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.౹ *** *** ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది. కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు.౹ అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు— ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును. కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును.౹ మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను— నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచగోరునో వాని కఠిన పరచును.౹ అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల అని నీవు నాతో చెప్పుదువు.౹ అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?౹ ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?౹ ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్ఛ యించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిన నేమి?౹ [23-24] మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలోనుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి? *** ఆప్రకారము— నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియు రాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును.౹ మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్ప బడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులనివారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని౹ యెషయాయు ఇశ్రాయేలునుగూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పినప్రకారము— సైన్యములకు అధిపతియగు ప్రభువు, మనకు సంతా నము శేషింపచేయకపోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము. [30-31] అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి; అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు,౹ *** వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. –ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో సాప్థిచుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొంద వలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికిచేయు ప్రార్థనయునై యున్నవి.౹ వారు దేవునియందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.౹ ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడ లేదు.౹ విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు.౹ ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు.౹ [6-7] అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది–ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు; లేక —ఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు.౹ *** అదేమని చెప్పుచున్నది? — వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.౹ అదేమనగా–యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.౹ ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.౹ ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.౹ యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.౹ ఎందుకనగా— ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడులేకుండ వారెట్లు విందురు?౹ ప్రకటించువారు పంప బడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై— ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది అయినను అందరు సువార్తకు లోబడలేదు— ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?౹ కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును.౹ అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను. మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా? జనము కానివారివలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనమువలన మీకు ఆగ్రహము కలుగ జేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. [20-21] మరియు యెషయా తెగించి –నన్ను వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచా రింపనివారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే— అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. ఆలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేను కూడ ఇశ్రాయేలీయుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.౹ తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయానుగూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠము లను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు.౹ అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను. ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది.౹ అది కృపచేతనైనయెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.౹ ఆలాగైన ఏమగును? ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరక లేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కినవారు కఠినచిత్తులైరి.౹ ఇందువిషయమై— నేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి యున్నాడని వ్రాయబడియున్నది. మరియు–వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంక ముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక.౹ వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు.౹ కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లన రాదు.౹ వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను. వారి తొట్రు పాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును! [13-14] అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి, వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘన పరచుచున్నాను.౹ *** వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయినయెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?౹ ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.౹ అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయ బడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టుయొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము.౹ నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుట లేదు.౹ అందుకు–నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.౹ మంచిది; వారు అవి శ్వాసమునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;౹ దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు.౹ కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్నయెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.౹ వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.౹ ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టునుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడినయెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవచెట్టున అంటుకట్టబడరా? సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరు చున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.౹ [26-27] వారు ప్రవేశించు నప్పుడు— విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును; నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు. *** సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులుగాని, యేర్పాటువిషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు.౹ ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.౹ [30-31] మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింప బడితిరి. అటువలెనే మీ యెడల చూపబడిన కరుణనుబట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు౹ *** అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ౹ ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?౹ ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు?౹ ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగములవరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.౹ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవా డగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.౹ [4-5] ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో, ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.౹ *** [6-7] మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక, ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను,౹ *** బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.౹ మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.౹ సహోదరప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.౹ ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.౹ నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.౹ పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.౹ మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు.౹ సంతోషించు వారితో సంతోషించుడి;౹ ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొన వద్దు.౹ కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి.౹ శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.౹ ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి–పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.౹ కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహ మిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.౹ కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము. ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ.వలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.౹ కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.౹ [3-4] ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలుచేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడుచేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారముచేయు దేవుని పరిచారకులు.౹ *** కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షినిబట్టియు లోబడియుండుట ఆవశ్యకము.౹ ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.౹ ఇందుకే గదా మీరు పన్ను కూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండవలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి. ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.౹ ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల వద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్నయెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.౹ ప్రేమ పొరుగువానికి కీడుచేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వా సులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.౹ రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకారక్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము.౹ అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము.౹ మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచనచేసికొనకుడి. విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చు కొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు౹ ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ము చున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు.౹ తినువాడు తిననివాని తృణీ కరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను.౹ పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.౹ ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను.౹ దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుట మాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు.౹ మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు.౹ మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువు వారమై యున్నాము.౹ తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను.౹ అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము. [11-12] నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. *** కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చ కుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డైమెనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించు కొనుడి.౹ సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే.౹ నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినయెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడు చేయకుము.౹ మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి.౹ దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.౹ ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు.౹ కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. ౹ భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి; సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము.౹ మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది.౹ నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకుతానే తీర్పు తీర్చు కొననివాడు ధన్యుడు.౹ అనుమానించువాడు తినినయెడల విశ్వాసములేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.౹ తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.౹ క్రీస్తు కూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని— నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.౹ ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.౹ [5-6] మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము, క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక.౹ *** కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి.౹ [8-9] నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని సాప్థిచుటకును, అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను. అందు విషయమై— ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది. *** మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు మరియు సమస్త అన్యజనులారా, ప్రభువు ను స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది. మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు— యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయనయందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞానసంపూర్ణులును, ఒకరికి ఒకరు బుద్ధిచెప్ప సమర్థులునై యున్నారని నామట్టుకు నేనును మిమ్మునుగూర్చి రూఢిగా నమ్ముచున్నాను.౹ [15-16] అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మవలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి, అన్యజనులనిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసికొని మీకు జ్ఞాపకము చేయవలెనని యుండి యెక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను.౹ *** కాగా, క్రీస్తుయేసునుబట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయకారణము కలదు.౹ [18-19] ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపెట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.౹ *** [20-21] నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము ఆయననుగూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతు రనియు, వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనైయుండి ఆలాగున ప్రకటించితిని. *** ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను.౹ [23-24] ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరములనుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి, నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ సహవాసమువలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.౹ *** అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.౹ ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియవారును అకయవారును కొంత సొమ్ము చందావేయ నిష్టపడిరి.౹ అవును వారిష్ట పడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై యున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులై యున్నారు.౹ ఈ పనిని ముగించి యీ ఫలమును వారికప్పగించి, నేను, మీ పట్టణముమీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును.౹ నేను మీయొద్దకు వచ్చునప్పుడు, క్రీస్తుయొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని యెరుగుదును. [30-32] సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, మీరు నాకొరకు దేవునికిచేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తునుబట్టియు, ఆత్మ వలని ప్రేమనుబట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను.౹ *** *** సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై యుండును గాక. ఆమేన్. కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని,౹ ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను. క్రీస్తుయేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి.౹ వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.౹ ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.౹ మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు.౹ నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.౹ ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వందనములు.౹ క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు.౹ క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టొబూలు ఇంటివారికి వందనములు.౹ నా బంధువుడగు హెరోది యోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు.౹ ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు; ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను.౹ ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు; అతని తల్లికి వందనములు; ఆమె నాకును తల్లి.౹ అసుంక్రితుకును, ప్లెగో నుకును, హెర్మేకును, పత్రొబకును, హెర్మాకును వారితోకూడనున్న సహోదరులకును వందనములు.౹ పిలొలొగుకును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్ధులకందరికిని వందనములు.౹ పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతి రేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.౹ అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.౹ మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను.౹ సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక. నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు.౹ ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను.౹ నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక. [25-27] సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, యేసు క్రీస్తునుగూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును౹ కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.౹ మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు కృపాసమాధానములు మీకు కలుగును గాక. క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.౹ [5-6] క్రీస్తునుగూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి;౹ *** గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.౹ మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపర చును.౹ మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.౹ నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయె యింటివారి వలన నాకు తెలియవచ్చెను.౹ మీలో ఒకడు–నేను పౌలు వాడను, ఒకడు–నేను అపొల్లోవాడను, మరియొకడు— నేను కేఫావాడను, ఇంకొకడు–నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?౹ [14-15] నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు, క్రిస్పునకును గాయియుకును తప్ప మరి యెవరికిని నేను బాప్తిస్మ మియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.౹ *** స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను.౹ బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యములేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.౹ సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.౹ ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది. జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?౹ దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్ప మాయెను.౹ యూదులు సూచకక్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు.౹ అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.౹ ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.౹ దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని౹ [27-29] ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.౹ *** *** అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు. –అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను. సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను.౹ నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసు క్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.౹ మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని.౹ [4-5] మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.౹ *** పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని౹ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.౹ అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండినయెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు.౹ ఇందునుగూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపర చెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.౹ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.౹ ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మ కే గాని మరి ఎవనికిని తెలియవు.౹ దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.౹ మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.౹ ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.౹ ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింప బడడు.౹ ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింప గలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము. సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేక పోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.౹ అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీ రింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా?౹ మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?౹ ఒకడు–నేను పౌలు వాడను, మరియొకడు–నేను అపొల్లోవాడను, అని చెప్పు నప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?౹ అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొ క్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి౹ నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే౹ కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.౹ నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.౹ మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు. దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి యైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.౹ వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.౹ [12-13] ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్య కాలు మొదలైనవాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.౹ *** పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.౹ ఒకని పని కాల్చివేయబడినయెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలోనుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?౹ ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు. ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనినయెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.౹ ఈ లోక జ్ఞానము దేవునిదృష్టికి వెఱ్ఱితనమే. –జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును; మరియు –జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువు నకు తెలియును అని వ్రాయబడియున్నది.౹ కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.౹ పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే.౹ మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు. ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతిమను ష్యుడు మమ్మును భావింపవలెను.౹ మరియు గృహనిర్వా హకులలో ప్రతివాడును నమ్మకమైనవాడైయుండుట అవశ్యము.౹ మీ చేతనైనను, ఏ మనుష్యునిచేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను.౹ నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతు డనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.౹ కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధ కారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును. సహోదరులారా, మీరు మమ్మును చూచి, లేఖనములయందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరొకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకుండునట్లు, ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లోమీదను పెట్టుకొని సాదృశ్యరూపముగా చెప్పియున్నాను.౹ ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ జేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?౹ ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తు లైతిరి, ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి; అవును, మేమును మీతోకూడ రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా?౹ మరణదండన విధింపబడినవారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూత లకును మనుష్యులకును వేడుకగా నున్నాము.౹ మేము క్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు బుద్ధి మంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము.౹ ఈ గడియవరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసములేక యున్నాము;౹ స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింప బడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చు కొనుచున్నాము;౹ దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము. మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధిచెప్పుటకు ఈ మాటలు వ్రాయు చున్నాను.౹ [15-16] క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.౹ *** ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.౹ నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు.౹ ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.౹ దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.౹ మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయొద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా? మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.౹ ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసిన వానిని మీలోనుండి వెలివేసినవారు కారు.౹ నేను దేహవిషయమై దూరముగా ఉన్నను ఆత్మవిషయమై సమీపముగా ఉండి, మీతోకూడ ఉండి నట్టుగానే యిట్టి కార్యము ఈలాగు చేసినవానినిగూర్చి యిదివరకే తీర్పు తీర్చియున్నాను.౹ [4-5] ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును, నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతోకూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను.౹ *** మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?౹ మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింప బడెను౹ గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కా పట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని.౹ అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా?౹ ఇప్పుడైతే, సహోదరు డనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.౹ వెలుపలివారికి తీర్పు తీర్చుట నా కేల? వెలుపలివారికి దేవుడే తీర్పు తీర్చునుగాని౹ మీరు లోపటివారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలోనుండి వెలివేయుడి. మీలో ఒకనికి మరియొకనిమీద వ్యాజ్యెమున్నప్పుడు వాడు పరిశుద్ధులయెదుట గాక అనీతిమంతులయెదుట వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడా?౹ పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసి యుండగా, మిక్కిలి అల్పమైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా?౹ మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరు గరా? ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?౹ కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగినయెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని కూర్చుండబెట్టుదురా? ౹ మీకు సిగ్గు రావలెనని చెప్పు చున్నాను. ఏమి? తన సహోదరులమధ్యను వ్యాజ్యెము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా?౹ అయితే సహోదరుడు సహోదరునిమీద వ్యాజ్యెమాడు చున్నాడు, మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యెమాడు చున్నాడు.౹ ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా?౹ అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే యీలాగు చేయుచున్నారు.౹ అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర రని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవా రైనను పురుష సంయోగులైనను౹ దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.౹ మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చ బడితిరి. అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచు కొనబడనొల్లను.౹ భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడి యున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.౹ దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తివలన లేపును.౹ మీ దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంతమాత్రమును తగదు.౹ వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా? –వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?౹ అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.౹ జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడుచేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.౹ మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,౹ విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు వ్రాసినవాటివిషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.౹ అయినను జారత్వములు జరుగు చున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.౹ భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.౹ భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైని అధికారము లేదు.౹ ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.౹ [6-7] ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నా వలె ఉండ గోరుచున్నాను. అయినను ఒకడొక విధము నను మరి యొకడు మరియొక విధమునను ప్రతిమనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు. *** నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.౹ అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.౹ మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.౹ ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.౹ ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పున దేమనగా–ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడినయెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.౹ మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్య జింపకూడదు.౹ అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధపరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులైయుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.౹ అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహో దరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు.౹ ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?౹ అయితే ప్రభువు ప్రతివానికి ఏస్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏస్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను.౹ సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు.౹ దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు.౹ ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే యుండవలెను.౹ దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది. ౹ ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్యము పొందినవాడు. ఆ ప్రకా రమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.౹ మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి.౹ సహోదరులారా, ప్రతిమనుష్యుడును ఏస్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. కన్యకల విషయమై, ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పు చున్నాను.౹ ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను.౹ భార్యకు బద్ధుడవై యుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు.౹ అయినను నీవు పెండ్లిచేసికొనినను పాపము లేదు, కన్యక పెండ్లిచేసికొనినను ఆమెకు పాపము లేదు; అయితే అట్టివారికి శరీరసంబంధమైనశ్రమలు కలుగును; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను.౹ సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును౹ ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోష పడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును౹ ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.౹ మీరు చింతలేనివారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచున్నాడు.౹ పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు.౹ అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.౹ మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధాన వర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను.౹ అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయినయెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చినయెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడలను, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును౹ ఎవడైనను తన కుమార్తెకు పెండ్లిచేయ నవసరములేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహములేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనినయెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు.౹ కాబట్టి తన కుమార్తెకు పెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు.౹ భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను.౹ అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను. విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: —మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.౹ ఒకడు తనకేమైనను తెలియుననుకొనియుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు.౹ ఒకడు దేవుని ప్రేమించినయెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.౹ కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము: — లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.౹ దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.౹ ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.౹ అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది.౹ భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు.౹ అయినను మీకు కలిగియున్న యీ స్వాతంత్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి.౹ ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?౹ అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీను డైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును.౹ ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుటవలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపముచేయు వారగుచున్నారు.౹ కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను. నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నాపనికి ఫలము మీరు కారా?౹ ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీమట్టుకైనను అపొస్తలుడనై యున్నాను. ప్రభువునందు నా అపొస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా?౹ నన్ను విమర్శించువారికి నేను చెప్పుసమాధానమిదే.౹ తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా?౹ తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా?౹ మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా?౹ ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్షతోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు?౹ ఈ మాటలు లోకాచారమునుబట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడ వీటిని చెప్పు చున్నదిగదా? –కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా?౹ కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్ను వాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.౹ మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా?౹ ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము.౹ ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనముచేయుచున్నా రనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువారు బలిపీఠముతో పాలివారై యున్నారనియు మీరెరుగరా?౹ ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు.౹ నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు.౹ నేను సువార్తను ప్రకటించు చున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.౹ ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహ కత్వము నాకు అప్పగింపబడెను.౹ అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగ పరచుకొనకుండ సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము.౹ నేను అందరి విషయము స్వతంత్రుడనై యున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని.౹ యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.౹ దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని.౹ బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.౹ మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.౹ పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగానియొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.౹ మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.౹ కాబట్టి నేను గురిచూడనివానివలె పరుగెత్తు వాడను కాను,౹ గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను. సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి;౹ అందరును మోషేనుబట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి;౹ అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి;౹ అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.౹ అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.౹ వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. –జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి.౹ మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.౹ మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి.౹ మీరు సణుగ కుడి; వారిలో కొందరు సణిగి సంహారకునిచేత నశించిరి.౹ ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయ బడెను.౹ తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.౹ సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపొండి.౹ బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి౹ మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొను టయేగదా? —మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా?౹ మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టెయొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము.౹ శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా?౹ ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పి తములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?౹ లేదు గాని, అన్యజను లర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు.౹ మీరు ప్రభువు పాత్ర లోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.౹ ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా? అన్ని విషయములయందు నాకు స్వాతంత్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదు గాని అన్నియు క్షేమాభి వృద్ధి కలుగజేయవు.౹ ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.౹ మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. –భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై యున్నవి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచి నపుడు వెళ్లుటకు మీకు మనస్సుండినయెడల మీకు వడ్డించినది ఏదో దానినిగూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి.౹ అయితే ఎవడైనను మీతో— ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి.౹ మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్య విషయములో తీర్పు తీర్చబడనేల?౹ నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దానినిమిత్తము నేను దూషింప బడనేల?౹ కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.౹ యూదులకైనను, గ్రీసుదేశస్థుల కైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగ జేయకుడి.౹ ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింప బడవలెనని వారి ప్రయోజనమునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసికొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను.౹ ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను.౹ ఏ పురుషుడు తలమీద ముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును.౹ ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.౹ స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.౹ పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది.౹ ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్తీనుండి కలుగలేదు.౹ మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింపబడలేదు.౹ ఇందువలన దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను.౹ అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు.౹ స్త్రీ పురుషునినుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవునిమూలముగా కలిగియున్నవి.౹ మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థిం చుట తగునా?౹ పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచును గదా?౹ స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్య బడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము.౹ ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలిసికొనవలెను. మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరుకూడి వచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువ మేలుకు కాదు.౹ మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ము చున్నాను.౹ మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయము లుండక తప్పదు.౹ మీరందరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు.౹ ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటె ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనముచేయుచున్నాడు; ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును.౹ ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచు దురా? మీతో ఏమి చెప్పుదును? దీనినిగూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను.౹ నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి౹ దానిని విరిచి–యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.౹ ఆప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని–యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.౹ మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.౹ కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమునుగూర్చియు రక్తమునుగూర్చియు అపరాధియగును.౹ కాబట్టి ప్రతిమనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.౹ ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.౹ ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.౹ అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము.౹ మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడు చున్నాము.౹ కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి.౹ మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనినయెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును. మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములనుగూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు.౹ మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.౹ ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.౹ మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.౹ నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.౹ అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది.౹ ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ ననుసరించిన జ్ఞాన వాక్యమును,౹ మరియొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము లను౹ మరియొకనికి అద్భుతకార్యములనుచేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి.౹ అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవ యవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.౹ ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మ ను పానము చేసినవారమైతిమి.౹ శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.౹ –నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంతమాత్రమున శరీరము లోనిది కాక పోలేదు.౹ మరియు–నేను కన్ను కాను గనుక శరీరము లోనిదానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.౹ శరీరమంతయు కన్న యితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?౹ అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను.౹ అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ? అవయవములు అనేకములైనను శరీర మొక్కటే.౹ [20-21] గనుక కన్ను చేతితో–నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో — మీరు నాకక్కరలేదని చెప్పజాలదు.౹ *** అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే.౹ శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములుకాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును.౹ [24-25] సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.౹ *** కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును.౹ అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమై యుండి వేరు వేరుగా అవయవములై యున్నారు౹ మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములుగలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.౹ అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములుగలవారా?౹ అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?౹ కృపావరములలో శ్రేప్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును.౹ ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.౹ బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.౹ ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;౹ అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అప కారమును మనస్సులో ఉంచుకొనదు.౹ దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.౹ అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.౹ ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచి పోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;౹ మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని౹ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.౹ నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.౹ ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.౹ కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలు చును; వీటిలో శ్రేప్ఠమైనది ప్రేమయే. ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి.౹ ఎందు కనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు.౹ క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆద రణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు.౹ భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.౹ మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.౹ సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయొద్దకు వచ్చి సత్యమును బయలు పరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయవలెననియైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెననియైనను మీతో మాటలాడకపోయినయెడల, నావలన మీకు ప్రయోజనమేమి?౹ పిల్లనగ్రోవి గాని వీణె గాని, నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు, స్వరములలో భేదము కలుగజేయనియెడల, ఊదినదేదో మీటినదేదో యేలాగు తెలియును?౹ మరియు బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చు నప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును?౹ ఆలాగే మీరు స్పష్టమైన మాటలు లుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడుచున్నట్టుందురు.౹ లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టముకానిదై యుండదు.౹ మాటల అర్థము నాకు తెలియకుండినయెడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును.౹ మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.౹ భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను.౹ నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థనచేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.౹ కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.౹ లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు–ఆమేన్ అని వాడేలాగు పలుకును?౹ నీవైతే బాగుగానే కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నావు గాని యెదుటివాడు క్షేమాభి వృద్ధి పొందడు.౹ నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను.౹ అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు. సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి. –అన్యభాషలు మాటలాడు జనులద్వారాను, పరజనుల పెదవులద్వారాను, ఈ జనులతో మాటలాడుదును; అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయ బడియున్నది.౹ కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవి శ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై యున్నది.౹ సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవి శ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱిమాటలాడుచున్నారని అనుకొందురు కదా?౹ అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును.౹ అప్పుడతని హృదయరహస్యములు బయలుపడును. ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగు చున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరియొకడు బోధింపవలెనని యున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటనచేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్పవలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.౹ భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైనయెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను.౹ అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.౹ ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను.౹ అయితే కూర్చున్న మరి యొకనికి ఏదైనను బయలు పరచబడినయెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను.౹ అందరు నేర్చుకొనునట్లును అందరు హెచ్చరిక పొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును.౹ మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి.౹ ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.౹ వారు ఏమైనను నేర్చుకొనగోరినయెడల, ఇంట తమతమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.౹ దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా? మీయొద్దకు మాత్రమే వచ్చెనా? ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధినని యైనను తలంచుకొనినయెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను.౹ ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము. [39-40] కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగ నియ్యుడి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను.౹ మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్నయెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.౹ నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,౹ లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.౹ ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.౹ అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.౹ తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను.౹ అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;౹ ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.౹ అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కు వగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.౹ నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి. క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రక టింపబడుచుండగా మీలో కొందరు–మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?౹ మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తు కూడ లేపబడియుండలేదు.౹ మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేముచేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.౹ దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము.౹ మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడ లేపబడలేదు.౹ క్రీస్తు లేప బడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు.౹ అంతేకాదు, క్రీస్తునందు నిద్రించినవారును నశించిరి.౹ ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము. ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.౹ మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.౹ ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.౹ ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రది కింపబడుదురు.౹ అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.౹ ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.౹ కడపట నశింపజేయబడు శత్రువు మరణము.౹ దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. సమస్తమును లోబరచబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోబరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడియున్నదను సంగతి విశదమే.౹ మరియు సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరచిన దేవునికి తానే లోబడును. ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల?౹ మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేల?౹ సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మునుగూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును.౹ మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరా డినయెడల నాకు లాభమేమి? మృతులు లేపబడనియెడల —రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము.౹ మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరు పును.౹ నీతిప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయ కుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను. అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును.౹ ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా.౹ నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజ యైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు.౹ అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు.౹ మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు.౹ మరియు ఆకాశవస్తు రూపములు కలవు, భూవస్తురూపములు కలవు; ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు.౹ నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదముకలదు గదా౹ మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;౹ ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలీహనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;౹ ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీర మున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది.౹ ఇందు విషయమై–ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.౹ ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది.౹ మొదటి మను ష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.౹ మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టి వారే.౹ మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.౹ [51-52] ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.౹ *** క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది.౹ ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, — విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.౹ ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ?౹ మరణపుముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.౹ అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.౹ కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి. పరిశుద్ధులకొరకైన కానుకవిషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి.౹ నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆది వారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.౹ నేను వచ్చి నప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును.౹ నేను కూడ వెళ్లుట యుక్తమైనయెడల వారు నాతోకూడ వత్తురు.౹ అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను.౹ అప్పుడు మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. [7-8] ప్రభువు సెలవైతే మీయొద్ద కొంతకాలముండ నిరీ క్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు.౹ *** కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తువరకు ఎఫెసులో నిలిచియుందును. తిమోతి వచ్చినయెడల అతడు మీయొద్ద నిర్భయుడైయుండునట్లు చూచుకొనుడి, నావలెనే అతడు ప్రభువు పనిచేయుచున్నాడు౹ గనుక ఎవడైన అతనిని తృణీకరింప వద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి; అతడు సహోదరులతోకూడ వచ్చునని యెదురు చూచుచున్నాను.౹ సహోదరుడైన అపొల్లోనుగూర్చిన సంగతి ఏమనగా, అతడీ సహోదరులతోకూడ మీయొద్దకు వెళ్లవలెనని నేనతని చాల బతిమాలుకొంటిని గాని, యిప్పుడు వచ్చుటకు అతనికి ఎంతమాత్రమును మనస్సులేదు, వీలైనప్పుడతడు వచ్చును. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి;౹ మీరుచేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి. స్తెఫను ఇంటివారు అకయయొక్క ప్రథమఫలమై యున్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారనియు మీకు తెలియును.౹ కాబట్టి సహోదరులారా, అట్టివారికిని, పనిలో సహాయముచేయుచు ప్రయాసపడుచుఉండు వారికందరికిని మీరు విధేయులై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.౹ [17-18] స్తెఫను, ఫొర్మూనాతు, అకా యికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరులేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మా నించుడి. *** ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును, వారి యింటనున్న సంఘమును, ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు.౹ సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి. పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయు చున్నాను.౹ ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు ౹ ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.౹ క్రీస్తుయేసునందలి నా ప్రేమ మీయందరితో ఉండును గాక. ఆమేన్. దేవుని చిత్తమువలన క్రీస్తు యేసుయొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులో నున్న దేవుని సంఘమునకును, అకయయందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని చెప్పి వ్రాయునది.౹ మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.౹ కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక.౹ దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.౹ క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది.౹ మేము శ్రమ పొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణకొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేము కూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై యున్నది.౹ మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మునుగూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది.౹ సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించినశ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతిమి.౹ మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.౹ ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.౹ అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే౹ మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప, మరేవియు మీకు వ్రాయుట లేదు; కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీ క్షించుచున్నాము.౹ మరియు మన ప్రభువైన యేసుయొక్క దినమందు మీరు మాకేలాగో, ఆలాగే మేము మీకును అతిశయకారణమై యుందుమని, మీరు కొంత మట్టుకు మమ్మును ఒప్పుకొనియున్నారు. [15-16] మరియు ఈ నమ్మికగలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీయొద్దకు వచ్చి, మీ యొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంప బడవలెనని ఉద్దేశించితిని.౹ *** కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?౹ దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు.౹ మాచేత, అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతిచేతను, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవుననువాడై యున్నాడు.౹ దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి. ౹ మీతోకూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే.౹ ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు. మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను.౹ మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు. మరియు నేను దుఃఖముతో మీయొద్దకు తిరిగిరానని నామట్టుకు నేను నిశ్చయించుకొంటిని.౹ నేను మిమ్మును దుఃఖపరచునెడల నాచేత దుఃఖపరచబడినవాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును?౹ నేను వచ్చి నప్పుడు ఎవరివలన నేను సంతోషము పొందతగినదో, వారివలన నాకు దుఃఖము కలుగకుండవలెనని యీ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేయని మీ అందరియందు నమ్మకము కలిగి యీలాగు వ్రాసితిని.౹ మీకు దుఃఖము కలుగ వలెనని కాదు గాని, మీయెడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని. ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల, నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీకందరికిని దుఃఖము కలుగజేసియున్నాడు. నేను విశేషభారము వానిమీద మోపగోరక యీ మాట చెప్పుచున్నాను.౹ అట్టివానికి మీలో ఎక్కువమందివలన కలిగిన యీ శిక్షయే చాలును౹ గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును.౹ కావున వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.౹ మీరన్ని విషయములందు విధేయులై యున్నారేమో అని మీ యోగ్యత తెలిసికొనుటకే గదా పూర్వము వ్రాసితిని.౹ మీరు దేనిగూర్చియైనను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను.౹ నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోస పరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చి నప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి యుండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున౹ నా మనస్సులో నెమ్మది లేక వారియొద్ద సెలవు తీసికొని అక్కడనుండి మాసిదోనియకు బయలుదేరితిని.౹ మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తునుగూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.౹ రక్షింపబడువారిపట్లను నశించువారిపట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము.౹ నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.౹ కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించుచున్నాము. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టు చున్నామా? కొందరికి కావలసినట్టు మీయొద్దైకెనను మీ యొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా?౹ మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా?౹ రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయ బడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు.౹ క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు.౹ మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.౹ ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.౹ [7-8] మరణ కారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహిమతోకూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను, ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి. ఇట్లుండగా ఆత్మసంబంధమైన పరిచర్య యెంత మహిమగలదై యుండును?౹ *** శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమ కల దగును.౹ అత్యధికమైన మహిమ దీనికుండుటవలన ఇంతకుమునుపు మహిమ కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను.౹ తగ్గిపోవునదే2 మహిమగలదై యుండినయెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా. [12-13] తగ్గిపోవుచున్న మహిమయొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరిచూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసికొనెను. మేమట్లు చేయక, యిట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాటలాడుచున్నాము.౹ *** మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది.౹ నేటివరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయములమీదనున్నది గాని౹ వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభువుయొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్యమునుండును.౹ మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము.౹ అయితే కుయుక్తిగా నడుచు కొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతిమనుష్యుని మన స్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము.౹ మా సువార్త మరుగుచేయబడినయెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయబడియున్నది.౹ దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.౹ [5-6] —అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమనుగూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించు కొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. *** అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.౹ ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము;౹ తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.౹ యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మర ణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము.౹ ఏలయనగా, యేసుయొక్క జీవము కూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము.౹ కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి.౹ కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి. కాగా [14-15] —విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతోకూడిన ఆత్మగలవారమై, ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడ లేపి, మీతోకూడ తన యెదుట నిలువ బెట్టునని యెరిగి, మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. *** కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.౹ మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక౹ క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మన కున్నదని యెరుగుదుము.౹ మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండివచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.౹ [3-4] ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మ్రింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.౹ *** దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.౹ వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము౹ గనుక ఈ దేహములో నివసించు చున్నంతకాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని యెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము.౹ ఇట్లు ధైర్యముగలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.౹ కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.౹ ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డైవెనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను.౹ మమ్మును మేమే మీ యెదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని, హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము.౹ ఏలయనగా మేము వెఱ్ఱివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవార మైతిమా మీ నిమిత్తమే.౹ క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,౹ జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.౹ కావున ఇకమీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.౹ కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;౹ సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.౹ అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై–దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.౹ ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను. కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. –అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.౹ మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక౹ శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును౹ దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై,౹ పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను౹ సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,౹ [8-10] ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుం డియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింప బడినవారమైనట్లుండియు చంపబడనివారము; దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము. *** *** ఓ కొరింథీయులారా, అరమరలేకుండ మీతో మాటలాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి యున్నది.౹ మీయెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై యున్నది.౹ మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతి ఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచు కొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పు చున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?౹ క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?౹ [16-18] దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. –నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. –కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. —మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి; మే మెవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు.౹ మీకు శిక్షావిధి కలుగ వలెనని నేనీలాగు చెప్పలేదు. చనిపోయినగాని జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పి తిని గదా౹ మీ యెడల నేను బహు ధైర్యముగా మాటలాడుచున్నాను, మిమ్మునుగూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగు చున్నాను. మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను.౹ అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను.౹ తీతు రాకవలనమాత్రమే కాకుండ, అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యా సక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణవలన కూడ మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగ సంతోషించితిని.౹ నేను వ్రాసిన పత్రికవలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను; నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలముమట్టుకే దుఃఖపెట్టెనని తెలిసికొనియున్నాను.౹ మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదుగాని మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మావలన మీరు నష్టము పొందకుండుటకై, దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి.౹ దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.౹ మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన యీ దుఃఖము ఎట్టి జాగ్రతను ఎట్టి దోషనివార ణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమునుగూర్చి సమస్త విషయములలోను మీరు నిర్దోషులై యున్నారని ఋజువు పరచుకొంటిరి.౹ నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసినవాని నిమిత్తము వ్రాయలేదు; వానివలన అన్యాయము పొందినవాని నిమిత్తమైనను వ్రాయలేదు; మాయెడల మీ కున్న ఆసక్తి దేవునియెదుట మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని.౹ ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతే కాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతుయొక్క ఆత్మ మీ అందరివలన విశ్రాంతిపొందినందున అతని సంతోషమును చూచి మరి యెక్కువగా మేము సంతోషించి తిమి.౹ ఏలయనగా, నేనతని యెదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేమేలాగు అన్నిటిని మీతో నిజముగా చెప్పితిమో ఆలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను.౹ మరియు మీరు భయముతోను వణకుతోను తన్ను చేర్చుకొంటిరని అతడు మీయందరి విధేయతను జ్ఞాపకముచేసికొనుచుండగా, అతని అంతఃకరణము మరి యెక్కువగా మీ యెడల ఉన్నది.౹ ప్రతివిషయములోను మీవలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక నంతోషించుచున్నాను. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అను గ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియజేయుచున్నాము.౹ ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్త రించెను.౹ [3-4] ఈ కృపవిషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.౹ *** ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు.౹ కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో ఆలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడు కొంటిమి.౹ మీరు ప్రతివిషయములో, అనగా విశ్వాస మందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్తయందును మీకు మాయెడలనున్న ప్రేమయందును ఏలాగు అభివృద్ధిపొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందు కూడ అభివృద్ధిపొందునట్లు చూచుకొనుడి.౹ ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు; ఇతరుల జాగ్రత్తను మీకు చూపుటచేత మీ ప్రేమ యెంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను.౹ మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.౹ ఇందునుగూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను; సంవత్సరము క్రిందటనే యీ కార్యము చేయుటయందే గాక చేయ తలపెట్టుటయందు కూడ మొదటివారై యుండిన మీకు మేలు౹ కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో, ఆలాగే మీ కలిమికొలది సంపూర్తియగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి.౹ మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి యుంటే శక్తికి మించి కాదు గాని కలిమికొలదియే యిచ్చినది ప్రీతికరమవును.౹ ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు గాని [14-15] —హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగుల లేదనియు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగాఉండు నిమిత్తము, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియొకప్పుడు వారి సమృద్ధి మీ యక్కరకును సహా యమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను. *** మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము.౹ అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన యిష్టముచొప్పుననే మీయొద్దకు బయలు దేరి వచ్చుచున్నాడు.౹ మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధిచెందిన సహోదరుని అతనితోకూడ పంపుచున్నాము.౹ అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతోకూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారతని ఏర్పరచుకొనిరి.౹ మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై యున్నాము గనుక దానినిగూర్చి మామీద ఎవడును తప్పు మోపకుండ మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము.౹ ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.౹ మరియు వారితోకూడ మేము మా సహోదరుని పంపు చున్నాము. చాల సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తిగలవాడనియు, ఇప్పుడును మీ యెడల అతనికి కలిగిన విశేషమైన నమ్మికవలన మరి యెక్కువైన ఆసక్తిగలవాడనియు తెలిసికొనియున్నాము.౹ –తీతు ఎవడని యెవరైన అడిగినయెడల అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునై యున్నాడనియు; —మన సహోదరులెవరని అడిగినయెడల వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమయునై యున్నారనియు నేను చెప్పుచున్నాను.౹ కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశ యము వ్యర్థముకాదనియు వారికి సంఘములయెదుట కనుపరచుడి. పరిశుద్ధులకొరకైన యీ పరిచర్యనుగూర్చి మీ పేరు వ్రాయుటకు నా కగత్యములేదు.౹ మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలన–సంవత్సరము నుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మునుగూర్చి మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి.౹ అయితే మిమ్మునుగూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థముకాకుండునట్లు, నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై యీ సహోదరులను పంపితిని.౹ మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియవారెవరైనను నాతోకూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గుపరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?౹ కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్య వలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.౹ కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా3 పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.౹ సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిం చును.౹ మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.౹ ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది.౹ విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును.౹ ఇట్టి ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.౹ ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది.౹ ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందునవారు దేవుని మహిమపరచుచున్నారు.౹ మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థనచేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు.౹ చెప్ప శక్యము కాని ఆయన వరమునుగూర్చి దేవునికి స్తోత్రము. మీ ఎదుట నున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీయెడల ధైర్యముగలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొనుచున్నాను.౹ శరీరప్రకారము నడుచుకొనువారమని మమ్మునుగూర్చి కొందరనుకొనుచున్నారు కారా? అట్టి వారియెడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.౹ మేము శరీరధారులమై నడుచు కొనుచున్నను శరీరప్రకారము యుద్ధముచేయము.౹ మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై యున్నవి.౹ మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపెట్టి౹ మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవి ధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడి యున్నాము.౹ సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనినయెడల, అతడేలాగు క్రీస్తువాడో ఆలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను.౹ పడ ద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమునుగూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను.౹ నేను వ్రాయు పత్రికలవలన మిమ్మును భయపెట్టవలెనని యున్నట్టు కనబడకుండ ఈ మాట చెప్పుచున్నాను.౹ — అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై యున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును.౹ మేమెదుటలేనప్పుడు పత్రికల ద్వారా మాటలయందెట్టి వారమైయున్నామో, యెదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై యుందుమని అట్లనువాడు తలంచుకొనవలెను.౹ తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుట కైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలము గాని, వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నికచేసికొని యొకరితోనొకరు సరిచూచుకొను చున్నందున, గ్రహింపులేక యున్నారు.౹ మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలమువరకును రావలెనని దేవుడు మాకు కొలిచియిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము.౹ మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు, మీవరకును వచ్చియుంటిమి గనుక మీయొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్లుచున్న వారము కాము.౹ మేము మేరకు మించి యితరుల ప్రయాసఫలములలో భాగస్థులమనుకొని అతిశయ పడము. మీ విశ్వాసము అభివృద్ధియైనకొలది మాకనుగ్ర హింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు,౹ మీ ఆవలి ప్రదేశములలో కూడ సువార్త ప్రకటించునట్లుగా, మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని, మరి యొకని మేరలో చేరి, సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపగోరము.౹ అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను.౹ ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు. కొంచెమవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను, నన్నుగూర్చి మీరేలా గైనను సహించుడి.౹ దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రదానము చేసితిని గాని,౹ సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.౹ ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానినిగూర్చి సహించుట యుక్తమే.౹ నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను.౹ మాటలయందు నేను నేర్పులేనివాడనైనను జ్ఞానమందు నేర్పులేని వాడను కాను. ప్రతి సంగతిలోను అందరిమధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనుపరచియున్నాము.౹ మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా?౹ మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము పుచ్చుకొని, వారి ధనము దొంగిలినవాడనైతిని.౹ మరియు నేను మీయొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా నేనెవనిమీదను భారము మోపలేదు; మాసిదోనియనుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్తపడితిని, ఇక ముందుకును జాగ్రత్తపడుదును౹ క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు నేనీలాగు అతిశయ పడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు.౹ ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే తెలియును.౹ అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును.౹ ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పని వారునై యున్నారు.౹ ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు౹ గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పు చున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చు కొనుడి.౹ నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.౹ అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.౹ మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు.౹ ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్ము మ్రింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్పచేసికొనినను, ఒకడు ముఖముమీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు.౹ మేము బలహీనులమై యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగి యున్నాడో, ఆ విషయమందు నేను కూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా.౹ వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే.౹ వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యా యములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.౹ యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;౹ ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.౹ అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని ఆపదలలోను ఉంటిని.౹ ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలిదప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్ప వలసినవి అనేకములున్నవి.౹ ఇవియును గాక సంఘములన్నిటినిగూర్చిన చింతయు కలదు. ఈ భారము దిన దినమును నాకు కలుగుచున్నది.౹ ఎవడైనను బలహీను డాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?౹ అతిశయ పడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులనుగూర్చియే అతిశయపడుదును.౹ నేనబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.౹ దమస్కులో అరెత అను రాజుక్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను.౹ అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి అతనిచేతిలోనుండి తప్పించుకొనిపోతిని. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసివచ్చినది. ప్రభువు దర్శనములనుగూర్చియు ప్రత్యక్షతలనుగూర్చియు చెప్పుదును.౹ క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపో బడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.౹ [3-4] అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.౹ *** అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను.౹ అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచినదానికన్నను నావలన వినినదానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను.౹ నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒకముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.౹ అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.౹ అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.౹ నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను.౹ సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలునియొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీమధ్యను నిజముగా కనుపరచబడెను.౹ నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప, మరి ఏ విషయములో మీరితర సంఘములకంటె తక్కువ వారైతిరి? నేను చేసిన యీ అన్యాయమును క్షమించుడి. ఇదిగో, యీ మూడవసారి మీయొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను.2 పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది గదా౹ కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?౹ అది ఆలా గుండనియ్యుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేతపట్టుకొంటిని అని చెప్పుదురేమో.౹ నేను మీ యొద్దకు పంపినవారిలో ఎవనివలననైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా?౹ మీయొద్దకు వెళ్లుటకు తీతును హెచ్చరించి అతనితోకూడ ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేమొక్క ఆత్మవలననే ఒక్క అడుగుజాడలయందే నడుచుకొనలేదా? మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని యెదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాము; ప్రియులారా, మీ క్షేమాభివృద్ధికొరకు ఇవన్నియు చెప్పు చున్నాము.౹ [20-21] ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టు డనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులునుఉండు నేమో అనియు, నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు,మునుపు పాపముచేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారుమనస్సు పొందని అనేకులనుగూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. ఈ మూడవ సారి నేను మీయొద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచ బడవలెను.౹ నేనుమునుపు చెప్పితిని; నేనిప్పుడు మీయొద్ద లేకున్నను రెండవసారి మీయొద్దనున్నట్టు గానే,మునుపటినుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చినయెడల కనికరము చూపను.౹ క్రీస్తు నాయందు పలుకుచున్నాడని ఋజువు కోరుచున్నారా? ఆయన మీయెడల బలహీనుడు కాడు గాని, మీయందు శక్తిమంతుడై యున్నాడు.౹ బలహీనతనుబట్టి ఆయన సిలువవేయబడెను గాని, దేవుని శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమై యున్నాము గాని, మీ యెడల దేవుని శక్తినిబట్టి, ఆయనతోకూడ జీవముగలవారము.౹ మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మునుగూర్చి మీరే యెరుగరా?౹ మేము భ్రష్టులము కామని మీరు తెలిసికొందురని నిరీక్షించుచున్నాను.౹ మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము; మేము యోగ్యులమైనట్టు కనబడవలెననికాదు గాని, మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము.౹ మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము గాని, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము.౹ మేము బలహీనులమై యున్నను మీరు బలవంతులై యుండినయెడల సంతోషించెదము. దీని నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావలెననియే ప్రార్థించుచున్నాము.౹ కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక, మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారముచొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూరముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సుగలవారై యుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై యుండును.౹ పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకరికి ఒకరు వందనములు చేసికొనుడి. పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును,౹ నాతోకూడనున్న సహోదరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది.౹ తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.౹ మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.౹ దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.౹ అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.౹ మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పర లోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.౹ మేమిదివరకు చెప్పినప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించినయెడల వాడు శాపగ్రస్తుడవును గాక.౹ ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరు చున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియ జెప్పు చున్నాను.౹ మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.౹ పూర్వమందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు౹ నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గల వాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి.౹ అయినను తల్లిగర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని౹ ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.౹ నాకంటె ముందుగా అపొస్తలు లైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని; పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని.౹ అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని.౹ నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు.౹ పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చితిని.౹ క్రీస్తునందున్న యూదయసంఘములవారికి నా ముఖపరిచయములేకుండెను గాని౹ [23-24] —మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని, వారు నన్నుబట్టి దేవుని మహిమపరచిరి. అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతోకూడ యెరూషలేమునకు తిరిగి వెళ్లితిని.౹ దేవదర్శన ప్రకారమే వెళ్లితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవు నేమో, లేక వ్యర్థమై పోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించు చున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని.౹ అయినను నాతోకూడనున్న తీతు గ్రీసు దేశస్థుడునైనను అతడు సున్నతి పొందుటకు బలవంతపెట్టబడలేదు.౹ మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తు యేసువలన మనకు కలిగిన మన స్వాతంత్యమును వేగు చూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులవలన జరిగినది.౹ సువార్త సత్యము మీమధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్క గడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు.౹ ఎన్నికైనవారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరునివేషము చూడడు. ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు.౹ అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందనివారికి బోధించుటకై నా కప్ప గింపబడెనని వారు చూచినప్పుడు,౹ [8-9] అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతిపొందినవారికిని అపొ స్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.౹ *** మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి యుంటిని. [11-12] అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని; ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనముచేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరైపోయెను.౹ *** తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబా కూడ వారి వేషధారణముచేత మోస పోయెను.౹ వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా–నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?౹ [15-16] మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలోచేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచియున్నాము; ధర్మశాస్త్రసంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.౹ *** కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు.౹ నేను పడగొట్టినవాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా.౹ నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విష యమై చచ్చినవాడనైతిని.౹ నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.౹ నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్‌ప్రయోజనమే. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా!౹ ఇది మాత్రమే మీవలన తెలిసికొనగోరుచున్నాను; ధర్మశాస్త్రసంబంధ క్రియలవలన ఆత్మ ను పొందితిరా లేక విశ్వాస ముతో వినుటవలన పొందితిరా?౹ మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మా నుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీ రానుసారముగా పరిపూర్ణులగుదురా?౹ వ్యర్థముగానే యిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థ మగునా?౹ ఆత్మ ను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధ క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు?౹ అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచ బడెను.౹ కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి.౹ దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి— నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.౹ కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతోకూడ ఆశీర్వదింపబడుదురు.౹ ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా— ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.౹ ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా— నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.౹ ధర్మశాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును.౹ [13-14] ఆత్మ నుగూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమో చించెను; ఇందునుగూర్చి— మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. *** సహోదరులారా, మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; మనుష్యుడుచేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరే మియు కలుపడు.౹ అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులనుగూర్చి అన్నట్టు–నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే–నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు.౹ నేను చెప్పునదేమనగా–నాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు.౹ ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగినయెడల ఇక వాగ్దానమూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానమువలననే దానిని అనుగ్రహించెను.౹ ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దా నము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను.౹ మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే.౹ ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి యున్నయెడల వాస్తవముగా నీతిధర్మశాస్త్రమూలముగానే కలుగును గాని౹ యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడికాకమునుపు, ఇక ముందుకు బయలు పరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి.౹ కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు డాయెను.౹ అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము.౹ యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు.౹ క్రీస్తులోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.౹ ఇందులో యూదుడని గ్రీసుదేశస్థు డని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.౹ మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్ని టికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు.౹ తండ్రిచేత నిర్ణయింప బడిన దినము వచ్చువరకు అతడు సంరక్షకులయొక్కయు గృహనిర్వాహకులయొక్కయు అధీనములో ఉండును.౹ అటువలె మనమును బాలురమై యున్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై యుంటిమి;౹ [4-5] అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.౹ *** మరియు మీరు కుమారులై యున్నందున–నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మ ను దేవుడు మన హృదయములలోనికి పంపెను.౹ కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని౹ యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల?మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?౹ మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు.౹ మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను.౹ మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు.౹ అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానినిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతనువలెను, క్రీస్తుయేసునువలెను నన్ను అంగీక రించితిరి.౹ మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్య మైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను.౹ నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా?౹ వారు మీ మేలుకోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు; మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసి వేయ గోరుచున్నారు.౹ నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే.౹ నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడువరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.౹ మిమ్మునుగూర్చి యెటుతోచక యున్నాను; నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడియుండగోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి.౹ దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా?౹ అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలివలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను.౹ ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు.౹ ఈ హాగరు అనునది అరేబియాదేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతోకూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది.౹ అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి.౹ ఇందుకు— కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదనపడని దానా, బిగ్గరగా కేకలువేయుము; ఏలయనగా పెనిమిటిగలదాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు అని వ్రాయబడియున్నది.౹ సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమై యున్నాము.౹ అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు ఆత్మ నుబట్టి పుట్టినవానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది.౹ ఇందునుగూర్చి లేఖన మేమి చెప్పుచున్నది?— దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసి కుమా రుడు స్వతంత్రురాలి కుమారునితోపాటు వార సుడై యుండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమా రులమే గాని దాసి కుమారులము కాము. ఈ స్వాతంత్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి. చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను.౹ ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై యున్నాడని సున్నతిపొందిన ప్రతిమనుష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను.౹ మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృప లోనుండి తొలగిపోయి యున్నారు.౹ ఏలయనగా, మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము.౹ యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.౹ మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను?౹ ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వానివలన కలుగలేదు.౹ పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును.౹ మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మునుగూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును.౹ సహోదరులారా, సున్నతి పొందవలెనని నే నింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువవిషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా?౹ మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.౹ ధర్మశాస్త్ర మంతయు— నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది.౹ అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచు కొనుడి. నేను చెప్పునదేమనగా ఆత్మా నుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.౹ శరీరము ఆత్మ కును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిం చును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయ కుందురు.౹ మీరు ఆత్మ చేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు.౹ శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,౹ విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,౹ భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.౹ అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.౹ [23-24] ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసి యున్నారు. *** మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మ ను అనుసరించి క్రమముగా నడుచుకొందము.౹ ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను.౹ ఒకని భారముల నొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.౹ ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచు కొనును.౹ ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.౹ ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ౹ మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.౹ ఏలాగనగా తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మ నుబట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును.౹ మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము.౹ కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలుచేయుదము. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి.౹ శరీరవిషయమందు చక్కగా అగపడగోరువారెవరో వారు తాము క్రీస్తుయొక్క సిలువవిషయమై హింసపొందకుండుటకు మాత్రమే సున్నతిపొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు౹ అయితే వారు సున్నతిపొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు; తాము మీ శరీరవిషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు.౹ అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడి యున్నాము.౹ క్రొత్తసృష్టి పొందుటయే గాని సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు.౹ ఈ పద్ధతిచొప్పున నడుచుకొను వారికందరికి, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. నేను యేసుయొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమపెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆమేన్. దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులును క్రీస్తుయేసునందు విశ్వాసులునైనవారికి శుభమని చెప్పి వ్రాయునది౹ మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైనయేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.౹ [4-6] ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.౹ *** *** దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.౹ [8-9] కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.౹ *** ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవే గాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చ వలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.౹ [11-12] మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తికలుగజేయవలెనని, దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు.౹ *** మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి.౹ దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరియెడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు, నేను వినినప్పటినుండి౹ మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.౹ [17-19] మరియు మీ మనోనేత్రములు వెలిగింప బడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.౹ *** *** [20-21] ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు.౹ *** మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.౹ ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది. మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతోకూడ బ్రదికించెను.౹ మీరు వాటినిచేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.౹ వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించిమునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.౹ [4-5] అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృప చేత మీరు రక్షింపబడియున్నారు.౹ *** క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,౹ క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.౹ మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.౹ అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.౹ మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. కాబట్టిమునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు౹ ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.౹ అయిననుమునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.౹ ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.౹ ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,౹ తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.౹ మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.౹ ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.౹ కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.౹ క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.౹ ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.౹ ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. ఈ హేతువుచేత అన్యజనులైన మీనిమిత్తము క్రీస్తు యేసుయొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను.౹ మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన యేర్పాటును గూర్చి మీరు వినియున్నారు.౹ ఎట్లనగా —క్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచబడినదను సంగతినిగూర్చిమునుపు సంక్షేపముగా వ్రాసితిని.౹ మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు మర్మమునుగూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొన గలరు.౹ ఈ మర్మమిప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియ పరచబడలేదు.౹ ఈ మర్మమేదనగా–అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే.౹ దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.౹ [8-11] దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున, పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగై యున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.౹ *** *** *** ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి.౹ కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చినశ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై యున్నవి. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని౹ [15-18] మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వ ర్యముచొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతోకూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,౹ *** *** *** జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.౹ [20-21] మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. [1-2] కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,౹ *** మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోకూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.౹ శరీర మొక్కటే, ఆత్మ యు ఒక్కడే; ఆప్రకారమే మీ పిలుపువిషయమైయొక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడితిరి.౹ ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,౹ అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు.౹ అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరముయొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను.౹ అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.౹ ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చు చున్నదిగదా.౹ దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటె మరి పైకి ఆరోహణమైనవాడునై యున్నాడు.౹ [11-12] మనమందరము విశ్వాసవిష యములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.౹ *** పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభి వృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.౹ అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక,౹ ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.౹ ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చ బడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.౹ వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.౹ వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.౹ [20-21] అయితే మీరు యేసునుగూర్చి విని, ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయనయందు ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు.౹ *** కావునమునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని౹ మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై,౹ నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.౹ కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు.౹ [27-28] అపవాదికి చోటియ్యకుడి; దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.౹ *** వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.౹ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.౹ సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.౹ ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.౹ క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.౹ మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.౹ కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సర సోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.౹ వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.౹ [6-7] వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి.౹ *** మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.౹ వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.౹ గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి౹ నిష్ఫలమైన అంధకారక్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి.౹ ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులనుగూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.౹ సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా౹ అందుచేత —నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు. [15-16] దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.౹ *** ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.౹ మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.౹ ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,౹ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,౹ క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.౹ క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.౹ సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.౹ [25-27] పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.౹ *** *** అటువలెనే పురుషులు కూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించు వాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.౹ [29-30] తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తు కూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.౹ *** ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.౹ ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.౹ మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను. పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధే యులైయుండుడి; ఇది ధర్మమే. [2-3] నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు, ఇది వాగ్దానముతోకూడిన ఆజ్ఞలలో మొదటిది. *** తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులై యుండుడి.౹ మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు,౹ మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి.౹ దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు.౹ యజమానులారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోకమందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై, వారిని బెదరించుట మాని, ఆప్రకారమే వారియెడల ప్రవర్తించుడి. తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.౹ మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.౹ ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.౹ అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి౹ ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని౹ పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి.౹ ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.౹ మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.౹ ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపననుచేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.౹ మరియు నేను దేనినిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరుతెరచునప్పుడు౹ దానినిగూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్ఛక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి. మీరును నా క్షేమసమాచారమంతయు తెలిసికొనుటకు ప్రియసహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నియు మీకు తెలియజేయును.౹ మీరు మా సమాచారము తెలిసికొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీయొద్దకు పంపితిని. తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతోకూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక.౹ మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.౹ మన తండ్రియగు దేవునినుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక. [3-6] మొదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి, మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేనుచేయు ప్రతి ప్రార్థ నలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.౹ *** *** *** నా బంధకములయందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే.౹ క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి, మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి.౹ [9-11] మీరు శ్రేప్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసుక్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను. *** *** సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను.౹ ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేన లోని వారికందరికిని తక్కినవారికందరికిని స్పష్టమాయెను.౹ మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి.౹ [15-17] కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను, మరికొందరు మంచిబుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతోకూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని, శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు; వీరైతే నేను సువార్తపక్షమున వాదించుటకు నియమింపబడియున్నాననియెరిగి, ప్రేమతో ప్రకటించుచున్నారు.౹ *** *** అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనే గాని, యేవిధముచేతనైనను క్రీస్తు ప్రక టింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషింతును.౹ మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని౹ నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనవలనను, యేసుక్రీస్తుయొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణ మించునని నేనెరుగుదును.౹ నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.౹ అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైనయెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు.౹ ఈ రెంటిమధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు.౹ అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది.౹ [25-26] మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరల మీతో కలిసి యుండుటచేత నన్నుగూర్చి క్రీస్తుయేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితోకూడ కలిసియుందునని నాకు తెలియును.౹ *** [27-28] నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మునుగూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై యున్నది. ఇది దేవునివలన కలుగునదే.౹ *** ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీ రిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి యున్నందున౹ క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమునశ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమవలన ఆదరణయైనను, ఆత్మ యందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల౹ మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుం చుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి.౹ కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తన కంటె యోగ్యుడని యెంచుచు౹ మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.౹ క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.౹ ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని౹ మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.౹ మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను.౹ [9-10] అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,౹ *** ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులై యున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాల మందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.౹ ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.౹ [14-15] మీరు మూర్ఖైమెన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.౹ *** అట్టి జనముమధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్‌ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయకారణము కలుగును.౹ మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనానందించి మీ యందరితోకూడ సంతోషింతును.౹ ఇటు వలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చు కొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీయొద్దకు పంపు టకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను.౹ మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు.౹ అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసు క్రీస్తు కార్యములను చూడరు.౹ అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్తవ్యాపకము నిమిత్తము సేవ చేసెను.౹ కాబట్టి నాకేమి సంభవింపనైయున్నదో చూచినవెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను.౹ నేనును శీఘ్రముగా వచ్చెదనని ప్రభువునుబట్టి నమ్ము చున్నాను.౹ మరియు నా సహోదరుడును, జతపనివాడును, నాతోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించినవాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని.౹ అతడు రోగియాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్షగలవాడై విచారపడు చుండెను.౹ నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమై యుండెను గాని దేవుడతనిని కనికరించెను; అతనిమాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను.౹ కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించునిమిత్తమును నా కున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని.౹ [29-30] నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైయుండెను గనుక పూర్ణా నందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదేసంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము.౹ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి.౹ ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.౹ కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసికొనవచ్చును; మరి ఎవ డైనను శరీరమును ఆస్పదము చేసికొనదలచినయెడల నేను మరి యెక్కువగా చేసికొనవచ్చును.౹ ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై,౹ ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.౹ అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.౹ నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేప్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.౹ క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,౹ [10-11] ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.౹ *** ఇదివరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేనినిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను.౹ సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు౹ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.౹ కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును.౹ అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి.౹ అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పు చున్నాను.౹ నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు.౹ మన పౌరస్థితి పర లోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.౹ సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును. కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి. ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను.౹ అవును, నిజమైన సహకారీ ఆ స్ర్రీలు క్లెమెంతుతోను నా యితర సహకారులతోను సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి.౹ మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.౹ దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.౹ అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.౹ మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడై యుండును. నన్నుగూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయ సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచనచేసియుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను.౹ నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను.౹ దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధికలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను.౹ నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.౹ అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని.౹ ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప నారంభించి మాసిదోనియలోనుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపువారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియును.౹ ఏలయనగా థెస్సలొనీకలో కూడ మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి.౹ నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పు చున్నాను.౹ నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగ మునై యున్నవి.౹ కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవ సరమును తీర్చును.౹ మన తండ్రియైన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి.౹ నాతోకూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. కొలొస్సయిలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తు నందు విశ్వాసులైన సహోదరులకు,౹ దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమనిచెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. [3-4] పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమనుగూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.౹ *** మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.౹ ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించు చున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది.౹ ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసునివలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి.౹ అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు; అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. [9-12] అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము.౹ *** *** *** ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.౹ ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది.౹ ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.౹ ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.౹ ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.౹ సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.౹ [19-20] ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.౹ *** మరియు గతకాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్‌క్రియలవలన మీ మనస్సులో విరోధభావముగలవారునైయుండిన మిమ్మును కూడ౹ తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.౹ పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి యుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్నశ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.౹ [25-26] దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచార కుడనైతిని.౹ *** అన్యజనులలో ఈ మర్మముయొక్క మిహ మైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీయందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను.౹ ప్రతిమనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతిమనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతిమనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.౹ అందునిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. మీ కొరకును, లవొదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడనివారందరికొరకును౹ నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.౹ బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.౹ ఎవడైనను చక్కని మాటలచేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను.౹ నేను శరీరవిషయములో దూరముగా ఉన్నను ఆత్మవిషయములో మీతోకూడ ఉండి, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. [6-7] కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి. *** ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.౹ ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;౹ మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై యున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై యున్నాడు;౹ మీరును, క్రీస్తు సున్నతియందు, శరీరేచ్ఛలతోకూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి.౹ మీరు బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి.౹ [13-15] మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. *** *** కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.౹ ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది౹ [18-19] అతి వినయాసక్తుడై దేవదూతా రాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచినవాటినిగూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరములచేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. *** [20-22] మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి–చేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును.౹ *** *** అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.౹ [2-3] పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది.౹ *** మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి.౹ వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి వచ్చును.౹ పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి.౹ ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.౹ [9-10] ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతోకూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు.౹ *** ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు. కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.౹ ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.౹ వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.౹ క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు చుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి.౹ సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానముచేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.౹ మరియు మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి. భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది.౹ భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.౹ పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.౹ తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.౹ దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి.౹ [23-24] ప్రభువువలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు.౹ *** అన్యాయము చేసినవానికి తాను చేసిన అన్యాయముకొలది మరల లభించును, పక్షపాతముండదు. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని యెరిగి, న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులయెడల చేయుడి. [2-4] ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమునుగూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమ యము దేవుడు దయచేయవలెనని మాకొరకు ప్రార్థించుడి.౹ *** *** సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచు కొనుడి.౹ ప్రతిమనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి. ప్రియసహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడునైన తుకికు నన్నుగూర్చిన సంగతులన్నియు మీకు తెలియజేయును.౹ [8-9] మీరు మా స్థితి తెలిసికొనునట్లును మీ హృదయములను అతడు ఆదరించునట్లును, అతనిని అతనితోకూడ నమ్మకమైన ప్రియసహోదరుడైన ఒనేసిమును మీయొద్దకు పంపుచున్నాను; ఇతడు మీ యొద్దనుండి వచ్చినవాడే; వీరిక్కడి సంగతులన్నియు మీకు తెలియజేతురు. *** నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పు చున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి.౹ మరియు యూస్తు అను యేసు కూడ మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందినవారిలో చేరినవారు, వీరుమాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై యున్నారు, వీరివలన నాకు ఆదరణ కలిగెను.౹ మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని యితడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు.౹ ఇతడు మీకొరకును, లవొదికయవారి కొరకును, హియెరా పొలివారికొరకును బహు ప్రయాసపడుచున్నాడని యితనినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను.౹ లూకా అను ప్రియుడైన వైద్యుడును, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు.౹ లవొదికయలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి.౹ ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చది వించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.౹ మరియు–ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను; నా బంధకములను జ్ఞాపకము చేసి కొనుడి. కృప మీకు తోడై యుండును గాక. తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. [2-3] విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనముచేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.౹ *** [4-5] ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు.౹ *** పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి.౹ [7-8] కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను; అక్కడమాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.౹ *** [9-10] మీయొద్ద మాకెట్టి ప్రవే శము కలిగెనో, అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియ జెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచి పెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. సహోదరులారా, మీయొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని౹ మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానముపొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియును.౹ ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదుగాని౹ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టు వారముకాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.౹ మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.౹ మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారముచేయుటకు సమర్థులమై యున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు.౹ అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీమధ్యను సాధువులమై యుంటిమి.౹ మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.౹ అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనముచేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి.౹ మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి౹ [11-12] తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును. *** ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.౹ అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశస్థులవలన అనుభవించితిరి.౹ [15-16] ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి, అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు, దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట వారిమీదికి వచ్చెను. *** సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్దికాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సునుబట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితిమి.౹ కాబట్టి మేము మీయొద్దకు రావలెనని యుంటిమి; పౌలను నేను పలుమార్లు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను.౹ ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసుయొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా.౹ నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనంద మునై యున్నారు. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని యెంచి,౹ [2-4] యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీయొద్ద ఉన్నప్పుడు, మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును; అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు.౹ *** *** ఇందుచేత నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని.౹ తిమోతియు ఇప్పుడు మీయొద్దనుండి మాయొద్దకు వచ్చి, మేము మిమ్మును ఏలాగు చూడ నపేక్షించుచున్నామో ఆలాగే మీరును మమ్మును చూడ నపేక్షించుచు, ఎల్లప్పుడును మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసికొనుచున్నారని, మీ విశ్వాసమునుగూర్చియు మీ ప్రేమనుగూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను.౹ అందుచేత సహోదరులారా, మా యిబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి.౹ ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే.౹ [9-10] మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మన దేవునియెదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము? *** మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీయొద్దకు తీసికొని వచ్చును గాక.౹ [12-13] మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను, ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు.౹ కాగా మీ రేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము.౹ మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.౹ [4-5] మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.౹ *** ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతి దండన చేయువాడు.౹ పరిశుద్ధు లగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.౹ కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. సహోదరప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్ప బడితిరి.౹ [10-12] ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరియెక్కువగా అభివృద్ధినొందుచుండవలెననియు, సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువలేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక, మీ సొంతకార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము. *** *** సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.౹ యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతోకూడ వెంటబెట్టుకొని వచ్చును.౹ మేము ప్రభువుమాటనుబట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.౹ ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు.౹ ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభు వుతోకూడ ఉందుము.౹ కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి. సహోదరులారా, ఆ కాలములనుగూర్చియు ఆ సమ యములనుగూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.౹ రాత్రి వేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.౹ లోకులు — నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొను చుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు౹ సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.౹ మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము.౹ కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.౹ నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు.౹ మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.౹ ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.౹ మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతోకూడ జీవించునిమిత్తము ఆయన మనకొరకు మృతిపొందెను.౹ కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధిచెప్పు వారిని మన్ననచేసి౹ వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి.౹ సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా —అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.౹ ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి;౹ [16-18] ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.౹ *** *** [19-21] ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.౹ *** *** ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.౹ మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును. సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి. పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.౹ సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆన బెట్టుచున్నాను. మన ప్రభువైనయేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక. మన తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.౹ తండ్రియైన దేవునినుండియు ప్రభువైనయేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై యున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధిపొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించు చున్నది.౹ అందువలన మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్నశ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయ పడుచున్నాము.౹ దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.౹ [6-8] ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతి దండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.౹ *** *** [9-10] ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరయందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.౹ *** [11-12] అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృపచొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు, మేలుచేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణముచేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము. సహోదరులారా, ప్రభువుదినమిప్పుడే వచ్చియున్నట్టుగా ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల౹ మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటనుబట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము.౹ మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు.౹ ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.౹ నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా?౹ కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు.౹ ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును.౹ అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.౹ నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను౹ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును౹ [11-12] ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. *** ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.౹ మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.౹ కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి, మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. [16-17] మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, మీ హృదయములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తమును,౹ మేము మూర్ఖులైన దుష్టమనుష్యుల చేతిలోనుండి తప్పింపబడు నిమిత్తమును, మాకొరకు ప్రార్థించుడి; విశ్వాసము అందరికి లేదు.౹ అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి కాపాడును.౹ మేము మీకు ఆజ్ఞా పించువాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదు రనియు ప్రభువునందు మిమ్మునుగూర్చి నమ్మకము కలిగి యున్నాము.౹ దేవునియందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము.౹ ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును. మేము మీమధ్యను అక్రమముగా నడుచుకొనలేదు;౹ ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితిమి.౹ మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితిమి గాని, మాకు అధికారములేదనిచేయలేదు.౹ మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు–ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞా పించితిమి గదా.౹ మీలోకొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము.౹ అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము.౹ సహోదరులారా, మీరైతే మేలుచేయుటలో విసుకవద్దు.౹ ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.౹ అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధిచెప్పుడి. సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడై యుండును గాక. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయు చున్నాను; ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికి తోడై యుండును గాక. మన రక్షకుడైన దేవునియొక్కయు మన నిరీక్షణయైన క్రీస్తుయేసుయొక్కయు ఆజ్ఞప్రకారము క్రీస్తుయేసుయొక్క అపొస్తలుడైన పౌలు,౹ విశ్వాసమునుబట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. [3-4] నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితము లేని వంశావళులును, విశ్వాససంబంధమైన దేవుని యేర్పా టుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను.౹ *** ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే.౹ [6-7] కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పువాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి నిష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.౹ *** [8-11] అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము, ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదూష కులకును పితృహంతకులకును మాతృహంతకులకును నర హంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్యచోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును, హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండినయెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని, నీతిమంతునికి నియమింపబడలేదని యెవడైనను ఎరిగి, ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినయెడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము. *** *** *** [12-13] పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.౹ *** మరియు మన ప్రభువుయొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు, అత్యధికముగా విస్తరించెను.౹ పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధాను డను.౹ అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.౹ సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. నా కుమారుడవైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.౹ అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమై ఓడ బద్దలైపోయినవారివలె చెడియున్నారు.౹ వారిలో హుమెనైయును అలెక్సం ద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును౹ రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.౹ ఇది మంచిదియు మన రక్షకుడగు దేవునిదృష్టికి అనుకూలమైనదియునై యున్నది.౹ ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.౹ దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.౹ ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.౹ ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను, అపొస్తలుడనుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశ యమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.౹ మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రములచేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలం కరించుకొనక,౹ దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.౹ స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధే యతతో నేర్చుకొనవలెను.౹ స్త్రీ మౌనముగా ఉండ వలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.౹ మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?౹ మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను.౹ అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలు కడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింపబడును. ఎవడైనను అధ్యక్షపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.౹ [2-3] అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషు డును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యా దస్థుడును, అతిథిప్రియుడును, బోధింపతగినవాడునైయుండి, మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వి కుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేనివాడునై,౹ *** సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను.౹ ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?౹ అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు.౹ మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను.౹ ఆలాగుననే పరిచారకులు మాన్యులై యుండి, ద్విమనస్కులును, మిగుల మద్యపానాసక్తులును, దుర్లాభము న పేక్షించువారునైయుండక౹ విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను.౹ మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును.౹ అటువలె పరిచర్యచేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితాను భవముగలవారును, అన్ని విషయములలో నమ్మకమైనవారునై యుండవలెను.౹ పరిచారకులు ఏకపత్నీ పురుషులును, తమ పిల్లలను తమ యింటివారిని బాగుగా ఏలువారునై యుండవలెను.౹ పరిచారకులై యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహు ధైర్యముగలవారగుదురు. శీఘ్రముగా నీయొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను;౹ అయినను నేను ఆలస్యముచేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జను లేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది.౹ నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును౹ దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.౹ ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహమునిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిపుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పు చుందురు.౹ దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు;౹ ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనవలనను పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడల, నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు క్రీస్తుయేసునకు మంచి పరిచారకుడవై యుందువు.౹ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.౹ శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతోకూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.౹ ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైయున్నది.౹ మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ సంగతుల నాజ్ఞాపించి బోధించుము.౹ నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.౹ నేను వచ్చువరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము.౹ పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచనమూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము.౹ నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.౹ నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.౹ అన్నదమ్ములని యౌవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవన స్త్రీలను హెచ్చరించుము.౹ నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము.౹ అయితే ఏ విధవరాలికైనను పిల్లలుగాని మనుమలుగాని యుండినయెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవునిదృష్టికనుకూలమైయున్నది.౹ అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియైయుండి, దేవునిమీదనే తన నిరీక్షణనుంచుకొని, విజ్ఞాప నలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలుకడగా ఉండును.౹ సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకు చుండియు చచ్చినదైయుండును.౹ వారు నిందారహితులై యుండునట్లు ఈలాగు ఆజ్ఞాపించుము.౹ ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడైయుండును.౹ అరువది ఏండ్ల కంటె తక్కువవయస్సు లేక, ఒక్క పురుషునికే భార్యయై,౹ సత్‌క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదైతే ఆమెను విధవ రాండ్ర లెక్కలో చేర్చవచ్చును.౹ [11-12] యౌవనస్థులైన విధవ రాండ్రను లెక్కలో చేర్చవద్దు; వారు క్రీస్తునకు విరో ధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదలుకొనిరను తీర్పుపొందినవారై పెండ్లాడగోరుదురు.౹ *** మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాం డ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరు బోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చు కొందురు.౹ కాబట్టి యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను.౹ ఇంతకుముందే కొందరు త్రోవనుండి తొలగి పోయి సాతానును వెంబడించినవారైరి.౹ విశ్వాసురాలైన యే స్త్రీ యింటనైనను విధవరాండ్రుండినయెడల, సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దానిమీద భారములేకుండ ఆమెయే వీరికి సహాయము చేయవలెను. బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.౹ ఇందుకు–నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనేగాని పెద్దమీద దోషా రోపణ అంగీకరింపకుము.౹ ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.౹ విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియుచేయక, నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతలయెదుటను నీకు ఆనబెట్టుచున్నాను. ౹ త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరులపాపములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము.౹ ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బునిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము.౹ కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారివెంట వెళ్లుచున్నవి.౹ అటువలె మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమను కాడిక్రింద ఉన్నవారందరును, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచవలెను.౹ విశ్వాసులైన యజమానులుగల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీక రింపక, భిన్నమైన బోధనుపదేశించినయెడల౹ వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములనుగూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురను మానములును,౹ చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.౹ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.౹ [7-8] మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములుగలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.౹ *** ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.౹ ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా దించుకొనుటకు ప్రయాసపడుము. ౹ విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.౹ సమస్తమునకు జీవా ధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను,౹ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగువరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను.౹ శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.౹ సమీ పింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్. ఇహమందు ధనవంతులైనవారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.౹ [18-19] వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము. *** ఓ తిమోతీ, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అప విత్రమైన వట్టిమాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్ప బడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము.౹ ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విష యము తప్పిపోయిరి. కృప మీకు తోడై యుండునుగాక. క్రీస్తు యేసునందున్న జీవమునుగూర్చిన వాగ్దానమునుబట్టి దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది.౹ తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసునుండియు కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. [3-5] నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, నీ కన్నీళ్లను తలచుకొని, నాకు సంపూర్ణా నందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు, నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని, నా పితురాచారప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియెడల కృతజ్ఞు డనై యున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను, అది నీయందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ము చున్నాను.౹ *** *** ఆ హేతువుచేత నా హస్తనిక్షేపణమువలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను.౹ దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.౹ కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమునుగూర్చి యైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్తనిమిత్తమైనశ్రమానుభవములో పాలివాడవై యుండుము.౹ [9-10] మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమునుబట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.౹ *** ఆ సువార్తవిషయములో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను, బోధకుడనుగాను, నియమింపబడి తిని.౹ ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.౹ క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము;౹ నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మవలన కాపాడుము. ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు; వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువా రున్నారు.౹ [16-17] ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను.౹ *** మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారముచేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువువలన కనికరము పొందునట్లు అనుగ్రహించును గాక. నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము.౹ నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము,౹ క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము.౹ సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కు కొనడు.౹ మరియు జెట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.౹ పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసినవాడు.౹ నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము; అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును.౹ నా సువార్త ప్రకారము, దావీదు సంతానములో పుట్టి మృతులలోనుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము.౹ నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్తవిషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు.౹ అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతోకూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను.౹ ఈ మాట నమ్మదగినది, ఏదనగా–మన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము.౹ సహించిన వారమైతే ఆయనతోకూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.౹ మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని, ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము.౹ దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.౹ అపవిత్రమైన వట్టిమాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు.౹ [17-18] కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు; వారు–పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.౹ *** అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. – ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు – ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది.౹ గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును.౹ ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును.౹ నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.౹ నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని యెరిగి అట్టివాటిని విసర్జించుము.౹ [24-26] సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును; అందువలన సాతాను తన యిష్టము చొప్పున చెరపెట్టిన వీరు వాని యురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని, ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.౹ ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహం కారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు౹ అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు౹ ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు,౹ పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.౹ [6-7] పాపభరితులై నానావిధములైన దురాశలవలన నడిపింప బడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలయొక్క యిండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు.౹ *** యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసవిషయములో భ్రష్టులై సత్యమును ఎది రింతురు.౹ అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో ఆలాగే వీరిది కూడ అందరికి తేటపడును గనుక వీరు ఇకముందుకు సాగరు.౹ అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును,౹ అంతి యొకయ ఈకొనియ లుస్త అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడైవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను.౹ క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు.౹ అయితే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంత కంతకు చెడిపోవుదురు.౹ [14-15] క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసి కొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.౹ *** [16-17] దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా౹ వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంత ముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము.౹ ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అను కూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,౹ సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలమువచ్చును.౹ అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.౹ నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది.౹ మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.౹ ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును. నాయొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము.౹ దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;౹ లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు. తుకికును ఎఫెసునకు పంపితిని.౹ [12-13] నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.౹ *** అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాల కీడుచేసెను, అతని క్రియలచొప్పున ప్రభువతనికి ప్రతిఫలమిచ్చును;౹ అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను.౹ నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు, అందరు నన్ను విడిచిపోయిరి; ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక.౹ అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని.౹ ప్రభువు ప్రతి దుష్కా ర్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రిస్కకును అకులకును ఒనేసిఫొరు ఇంటివారికిని నా వందనములు.౹ ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను. త్రోఫిము రోగియైనందున అతని మిలేతులో విడిచివచ్చితిని.౹ శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయ త్నముచేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక. కృప మీకు తోడై యుండును గాక. దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తమును,౹ [2-4] నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతోకూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటనవలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను. తండ్రియైన దేవునినుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. *** *** నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.౹ ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును.౹ ఎందు కనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందా రహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక,౹ అతిథిప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవి త్రుడును, ఆశానిగ్రహముగలవాడునైయుండి,౹ తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను. అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు.౹ వారి నోళ్లు మూయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభముకొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు.౹ వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను–క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండి పోతులునై యున్నారు.౹ [13-14] ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక, విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము.౹ *** పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి.౹ దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయు లును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము.౹ ఏలాగనగా వృద్ధులు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేనివారునై యుండవలెననియు,౹ [3-5] ఆలాగుననే వృద్ధీస్తలు కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు, యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధిచెప్పుచు, మంచి ఉపదేశముచేయువారునై యుండవలెననియు బోధించుము.౹ *** *** అటువలెనే స్వస్థబుద్దిగలవారై యుండవలెనని యౌవనపురుషులను హెచ్చరించుము.౹ [7-8] పరపక్షమందుండువాడు మనలనుగూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యములవిషయమై మాదిరిగా కనుపరచుకొనుము. నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.౹ *** [9-10] దాసులైనవారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంక రించునట్లు, తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోష పెట్టుచు, వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చరించుము.౹ *** ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై౹ మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,౹ అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.౹ ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను. వీటినిగూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూ ర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచునుండుము నిన్నెవనిని తృణీకరింపనీయకుము. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు,౹ ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధ పడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.౹ ఎందుకనగా మనము కూడమునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయయందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని౹ మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు౹ మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.౹ [6-7] మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణనుబట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను.౹ *** ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతు లనుగూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై యున్నవి గాని,౹ అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.౹ మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.౹ అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. నికొపొలిలో శీతకాలము గడపవలెనని నేను నిర్ణయించు కొన్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నాయొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము.౹ ధర్మశాస్త్రవేదియైన జేనాను అపొల్లోనును శీఘ్రముగా సాగనంపుము; వారికేమియు తక్కువలేకుండ చూడుము.౹ మనవారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమునుబట్టి సమయోచితముగా సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడై యుండును గాక. క్రీస్తుయేసు ఖైదీయైన పౌలును, సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలే మోనుకును౹ మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది.౹ మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక. [4-6] నీ ప్రేమనుగూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమునుగూర్చియు నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనముచేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు, క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేప్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను.౹ *** *** సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. [8-10] కావున యుక్తమైనదానినిగూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమనుబట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను.౹ *** *** అతడుమునుపు నీకు నిష్‌ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను.౹ నా ప్రాణము వంటివాడైన అతనిని నీయొద్దకు తిరిగి పంపియున్నాను.౹ నేను సువార్తకొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారముచేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొనవలెనని యుంటిని గాని౹ నీ ఉపకారము బలవంతముచేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు.౹ [15-16] అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడు గాను, విశేషముగా నాకును, శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను, నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను.౹ *** కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల నన్ను చేర్చు కొన్నట్టు అతనిని చేర్చుకొనుము.౹ అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసినయెడలను, నీకు ఏమైన ఋణమున్నయెడలను, అది నా లెక్కలో చేర్చుము;౹ పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల?౹ అవును సహోదరుడా, ప్రభువునందు నీవలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము.౹ నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను.౹ అంతేకాదు, నీ ప్రార్థ నల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధముచేయుము. [23-24] క్రీస్తుయేసునందు నాతోడి ఖైదీయైన ఎపఫ్రా, నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. *** మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక. అమేన్. పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు౹ ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.౹ [3-4] ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేప్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.౹ *** ఏలయనగా –నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక –నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితో నైన ఎప్పుడైనను చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. [7-8] —తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే –దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది. *** నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. మరియు – ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. అయితే –నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయువరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనినిగూర్చియైన యెప్పుడైనను చెప్పెనా?౹ వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.౹ ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతి క్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా౹ [3-4] ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుటచేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్యములచేతను, నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితోకూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను. *** మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు.౹ అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు –నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడ లేదుగాని౹ దేవుని కృపవలన ఆయన ప్రతిమనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొంది నందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము౹ ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూ ర్ణునిగా చేయుట ఆయనకు తగును.౹ [11-12] పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక –నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు –నే నాయనను నమ్ముకొనియుందును అనియు –ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.౹ *** కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములుగలవారైనందున ఆప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను.౹ [14-15] ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.౹ *** కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.౹ తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు. ఇందువలన, పరలోకసంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.౹ దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయన కూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.౹ [3-4] ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనతపొందినట్టు, ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను.౹ *** ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.౹ అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపెట్టినయెడల మనమే ఆయన యిల్లు.౹ మరియు పరిశుద్ధాత్మ యిట్లు చెప్పుచున్నాడు. –నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్య ములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీపితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరమువారివలన విసిగి –వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలిసికొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టువారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.౹ [13-15] నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు–నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధిచెప్పుకొనుడి. ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపెట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.౹ *** *** విని కోపము పుట్టించినవారెవరు? మోషేచేత నడిపింపబడి ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవారందరే గదా౹ ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు అరణ్యములో రాలి పోయెను.౹ తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదా౹ కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము. ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.౹ వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసముగలవారై కలిసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్‌ప్రయోజనమైనదాయెను.౹ కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతినిగూర్చి –నేను కోపముతో ప్రమాణముచేసినట్టువారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము.౹ మరియు –దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని యేడవ దినమునుగూర్చి ఆయన యొకచోట చెప్పి యున్నాడు.౹ ఇదియునుగాక ఈ చోటుననే –వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు. [6-7] కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించు దురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినినవారు అవిధేయతచేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీ రాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము, ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథములో–నేడని యొక దినమును నిర్ణయించుచున్నాడు.౹ *** యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును.౹ కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.౹ ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.౹ కాబట్టి అవిధే యతవలనవారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము.౹ ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.౹ మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము.౹ మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.౹ గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును.౹ తాను కూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు.౹ ఆ హేతువుచేత ప్రజల కొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు.౹ మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును.౹ అటువలె క్రీస్తు కూడ ప్రధానయాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని –నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అని ఆయనతో చెప్పినవాడే అయనను మహిమపరచెను.౹ ఆప్రకారమే –నీవు మెల్కీసెదెకుయొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యున్నావు అని మరియొకచోట చెప్పుచున్నాడు.౹ శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులుకలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.౹ ఆయన, కుమారుడైయుండియు తాను పొందినశ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.౹ [9-10] మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను. *** ఇందునుగూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతు లున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము.౹ కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింప వలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారేగాని బలమైన ఆహారము తినగలవారుకారు.౹ మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు.౹ వయస్సు వచ్చినవారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. కాబట్టి నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు,౹ దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములనుగూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణుల మగుటకు సాగిపోదము.౹ దేవుడు సెలవిచ్చినయెడల మనమాలాగు చేయుదము.౹ ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై౹ [5-6] దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.౹ *** ఎట్లనగా, భూమి తనమీద తరుచుగా కురియు వర్షమును త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అను కూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును.౹ అయితే ముండ్లతుప్పలును గచ్చతీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును. అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరింతకంటె మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితి లోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాము.౹ మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యా యస్థుడు కాడు.౹ [11-12] మీరు మందులు కాక, విశ్వాసముచేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. *** దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక౹ తనతోడు అని ప్రమాణముచేసి –నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను.౹ ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.౹ మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే.౹ [17-18] ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.౹ *** ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.౹ నిరంతరము మెల్కీ సెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను. రాజులను సంహారముచేసి, తిరిగి వచ్చుచున్న అబ్రా హామును౹ [2-3] ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో, ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. *** ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రా హాము అతనికి కొల్లగొన్న శ్రేప్ఠమైన వస్తువులలో పదియవ వంతు ఇచ్చెను.౹ మరియు లేవి కుమాళ్లలోనుండి యాజ కత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసమునుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద, అనగా ప్రజలయొద్ద పదియవవంతును పుచ్చు కొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని౹ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రా హామునొద్ద పదియవవంతు పుచ్చుకొని వాగ్దానములను పొందినవానిని ఆశీర్వదించెను.౹ తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై యున్నది.౹ మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు.౹ అంతే కాక ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాముద్వారా దశమాంశములను ఇచ్చెను.౹ ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక ఆయాజకులవలన సంపూర్ణ సిద్ధి కలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి?౹ ఇదియుగాక యాజకులు మార్చబడినయెడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును.౹ ఎవనిగూర్చి యీ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోనివాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్యచేయ లేదు.౹ మన ప్రభువు యూదా సంతానమందు జన్మించె ననుట స్పష్టమే; ఆ గోత్రవిషయములో యాజకులనుగూర్చి మోషే యేమియు చెప్పలేదు.౹ [15-16] మరియు శరీరాను సారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింప బడి, మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది.౹ *** ఏలయనగా –నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను.౹ [18-19] ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడియున్నది; అంత కంటె శ్రేప్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము.౹ *** [20-22] మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేప్ఠమైన నిబంధనకు పూటకాపాయెను. వారైతే ప్రమాణములేకుండ యాజకులగుదురు గాని యీయన –నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను; ఆయన పశ్చా త్తాపపడడు అని యీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను.౹ *** *** మరియు ఆయాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని౹ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.౹ ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. ౹ [27-28] ధర్మశాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్ను తాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా,౹ మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడుకాక ప్రభువే సాప్థిచిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.౹ ప్రతి ప్రధానయాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము.౹ ధర్మశాస్త్రప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమిమీద ఉన్నయెడల యాజకుడై యుండడు.౹ మోషే గుడారము అమర్చబోయినప్పుడు –కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.౹ ఈయనయైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేప్ఠమైన సేవకత్వము పొంది యున్నాడు.౹ ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు.౹ అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు – ప్రభువు ఇట్లనెను–ఇదిగో యొక కాలమువచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్తనిబంధన చేయుదును. అది నేను ఐగుప్తుదేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు. ఏమనగా–వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందునువారు నాకు ప్రజలైయుందురు.వారిలో ఎవడును – ప్రభువు ను తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దలవరకు అందరును నన్ను తెలిసికొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగివారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. మెుదటి నిబంధనకైతే సేవానియమములును ఈ లోక సంబంధమైన పరిశుద్ధస్థలమును ఉండెను.౹ ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టె లును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు.౹ రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.౹ అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను.౹ దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.౹ ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్లుదురు గాని౹ సంవత్సరమునకు ఒక్క సారి మాత్రమే ప్రధానయాజకుడొక్కడే రక్తము చేతపట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును.౹ దీనినిబట్టి ఆ మొదటి గుడార మింక నిలుచుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయు చున్నాడు.౹ ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.౹ ఇవి దిద్దు బాటు జరుగుకాలమువచ్చువరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబం ధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా,౹ మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.౹ ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల,౹ నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కు వగా శుద్ధిచేయును.౹ ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడినవారు నిత్యమైన స్వాస్థ్యమునుగూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు.౹ మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.౹ ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పు డైనను చెల్లునా?౹ ఇందుచేత మొదటి నిబంధన కూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు.౹ [19-20] ధర్మశాస్త్రప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పినతరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొఱ్ఱెబొచ్చుతోను, హిస్సోపుతోను, కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసికొని–దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను.౹ *** అదేవిధముగా గుడారముమీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను.౹ మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధిచేయబడవలసియుండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటె శ్రేప్ఠమైన బలులవలన శుద్ధిచేయబడ వలసియుండెను.౹ అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింప లేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.౹ అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు.౹ అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్కసారే ప్రత్యక్షపరచ బడెను.౹ మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియ మింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.౹ ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్క సారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్షమగును. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగల. దియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆయాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు.౹ ఆలాగు చేయగలిగినయెడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞిప్త ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా.౹ అయితే ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి౹ ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.౹ కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు. –బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్టమైనవికావు. అప్పుడు నేను–గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. –బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్టమైనవి కావనియు పైని చెప్పిన తరువాత౹ ఆయన–నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పు చున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.౹ యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమునుబట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.౹ మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును.౹ [12-13] ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడువరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీను డాయెను.౹ *** ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.౹ ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడ మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు.౹ ఏలాగనగా –ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే–నా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత –వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు. [19-20] సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,౹ *** దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,౹ మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములుగలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములుగలవారమునైయుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.౹ వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.౹ [24-25] కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. *** మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని౹ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.౹ ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు.౹ ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మ ను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? –పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు – ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా.౹ జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము. అయితే మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతోకూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి.౹ ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుటచేత పదిమందిలో ఆరడిపడితిరి; మరియొక విధముగా చూచితే, వాటి ననుభ వించినవారితో పాలివారలైతిరి.౹ ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేప్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి.౹ కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.౹ మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది. –ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చు చున్నవాడు ఆలస్యముచేయక వచ్చును.౹ నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసినయెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము. విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.౹ దానినిబట్టియే పెద్దలు సాక్ష్యముపొందిరి.౹ ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.౹ విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేప్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.౹ విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లుకొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొని పోయెను గనుక అతడు కనబడలేదు.౹ విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.౹ విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.౹ అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను.౹ విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.౹ ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రా హాము ఎదురుచూచుచుండెను.౹ విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.౹ అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను. వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.౹ ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశద పరచుచున్నారు కారా?౹ వారు ఏదేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల మరల వెళ్లు టకు వారికి వీలు కలిగియుండును.౹ అయితే వారు మరి శ్రేప్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు. [17-19] అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, –ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై, తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.౹ *** *** విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.౹ విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.౹ యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమా రుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి తన శల్యములనుగూర్చి వారికి ఆజ్ఞాపించెను.౹ మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు ఆ శిశువు సుందరుడైయుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.౹ [24-26] మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృిష్టి యుంచెను.౹ *** *** విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.౹ తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను.౹ విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచి పోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగి పోయిరి.౹ విశ్వాసమునుబట్టి యేడు దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను.౹ విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.౹ ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు.౹ వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;౹ అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి.౹ స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేప్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొంద నొల్లక యాతనపెట్టబడిరి.౹ మరికొందరు తిరస్కారము లను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభ వించిరి.౹ రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయ బడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి,౹ గొఱ్ఱెచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమ పడి హింసపొందుచు, అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.౹ [39-40] వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందినవారైనను. మనములేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము, దేవుడు మనకొరకు మరి శ్రేప్ఠమైనదానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దానఫలము అనుభవింప లేదు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున౹ మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.౹ మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.౹ మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు.౹ [5-6] మరియు –నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీక రించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. *** శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?౹ కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.౹ మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారియందు భయభక్తులుకలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా?౹ వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు.౹ మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.౹ కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.౹ మరియు కుంటికాలు బెణకక బాగుపడునిమిత్తము మీ పాదములకు మార్గములను సరాళము చేసికొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.౹ మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అప విత్రులై పోవుదురేమో అనియు,౹ ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.౹ ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు. స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధ కారమునకును, తుపానుకును,౹ [19-20] బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినయెడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి.౹ *** మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే–నేను మిక్కిలి భయపడి వణకు చున్నాననెను.౹ ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును,౹ పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,౹ క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.౹ మీకు బుద్ధిచెప్పుచున్నవానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమిమీదనుండి బుద్ధిచెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినయెడల, పరలోకమునుండి బుద్ధిచెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయముగదా.౹ అప్పు డాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు –నే నింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశ మును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు.౹ ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగాఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసి వేయబడునని అర్ధమిచ్చుచున్నది.౹ [28-29] అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగి యుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు. సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.౹ [2-3] మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.౹ *** వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.౹ ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి. –నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.౹ కాబట్టి – ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము. మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయ కులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.౹ యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.౹ నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపనుబట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనము లనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగ లేదు.౹ మనకొక బలిపీఠమున్నది; దాని సంబంధమైనవాటిని తినుటకు గుడారములో సేవచేయువారికి అధికారములేదు.౹ వేటిరక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకునిచేత తేబడునో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును.౹ కావున యేసు కూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.౹ కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు వెళ్లుదము.౹ నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచుచున్నాము. ౹ కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.౹ ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి.౹ మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి. మా నిమిత్తము ప్రార్థనచేయుడి; మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచుమంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాను.౹ మరియు నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి యెక్కువగా మిమ్మును బతి మాలుకొనుచున్నాను. [20-21] గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. *** సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి యున్నాను గనుక ఈ హెచ్చరికమాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను.౹ మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలిసికొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినయెడల అతనితోకూడ వచ్చి మిమ్మును చూచెదను. మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇటలీవారు మీకు వందనములు చెప్పుచున్నారు. కృప మీ అందరికి తోడై యుండును గాక. ఆమేన్. దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది. [2-3] నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.౹ *** మీరు సంపూర్ణులును, అనూ నాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.౹ అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.౹ [7-8] అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు. *** దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను.౹ ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.౹ సూర్యుడు దయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.౹ దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు–నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.౹ ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.౹ దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.౹ నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి.౹ శ్రేప్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనా గమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.౹ ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతిమనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.౹ ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.౹ అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.౹ మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.౹ ఎవ డైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.౹ వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా౹ అయితే స్వాతంత్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.౹ ఎవ డైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనినయెడల వాని భక్తి వ్యర్థమే.౹ తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా–దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే. నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటముగలవారై యుండకుడి.౹ ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల౹ మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి–నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో–నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల౹ మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా?౹ నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?౹ అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చు చున్నవారు వీరే గదా?౹ మీకు పెట్టబడిన శ్రేప్ఠమైన నామమును దూషించువారు వీరే గదా?౹ మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు.౹ మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.౹ ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పిపోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును;౹ వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్యచేయ వద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్రవిషయములో నపరాధి వైతివి.౹ స్వాతంత్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పుపొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగు ననే ప్రవర్తించుడి.౹ కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?౹ సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు.౹ మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక–సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?౹ ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.౹ అయితే ఒకడు —నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలులేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును.౹ దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.౹ వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా?౹ మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించి నప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొంద లేదా?౹ విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా?౹ కాబట్టి –అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితు డని అతనికి పేరుకలిగెను.౹ మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.౹ అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?౹ ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.౹ అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును.౹ గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా౹ ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును.౹ ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!౹ నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.౹ మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని౹ యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.౹ దీనితో తండ్రియైన ప్రభువు ను స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.౹ ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.౹ నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?౹ నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు. మీలో జ్ఞాన వివేకములుగలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.౹ అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.౹ ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.౹ ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.౹ అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.౹ నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?౹ మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు.౹ మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకైదురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.౹ వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.౹ –ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?౹ కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత–దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.౹ కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.౹ దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.౹ వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.౹ ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి. ౹ ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? –నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా,౹ రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.౹ కనుక–ప్రభువు చిత్తమైతే మనము బ్రదికి యుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.౹ ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.౹ కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును. ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములనుగూర్చి ప్రలాపించి యేడువుడి.౹ మీ ధనము చెడి పోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.౹ మీ బంగారమును మీ వెండియు తుప్పుపెట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి.౹ ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపెట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.౹ మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.౹ మీరు నీతిమంతుడైనవానికి శిక్షవిధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడువరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా౹ ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచు కొనుడి.౹ సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.౹ నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి.౹ సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబుయొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశముతోడనిగాని భూమితోడనిగాని మరి దేని తోడనిగాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను. మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.౹ మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థనచేయవలెను.౹ విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.౹ మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.౹ ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమిమీద వర్షింపలేదు.౹ అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించినయెడల౹ పాపిని వాని తప్పుమార్గమునుండి మళ్లించువాడు మరణమునుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసికొనవలెను. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్ జ్ఞానమునుబట్టి,౹ ఆత్మ వలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. [3-4] మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.౹ *** కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.౹ ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానావిధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.౹ నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.౹ [8-9] మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.౹ *** [10-11] మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైనశ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశో ధించిరి.౹ *** పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించినవారిద్వారా మీకిప్పుడు తెలుప బడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.౹ [14-16] —నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.౹ *** *** పక్షపాతములేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.౹ పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టు నట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని౹ అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా౹ [20-21] ఆయన జగత్తు పునాది వేయబడకమునుపే నియ మింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవునియందు ఉంచబడియున్నవి.౹ *** [22-23] మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్యమూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా *** –సర్వశరీరులు గడ్డినిపోలినవారు,వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్నయెడల౹ [2-3] సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణమాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.౹ *** మనుష్యులచేత విసర్జింపబడినను, దేవునిదృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,౹ యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.౹ ఏలయనగా –ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో సాప్థిచుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.౹ విశ్వ సించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వ సింపనివారికైతే –ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.౹ కట్టువారు వాక్యమునకవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.౹ అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.౹ ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ లను విసర్జించి,౹ అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారిమధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువునిమిత్తమై లోబడియుండుడి.౹ రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతి దండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి.౹ ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.౹ స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి.౹ అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రముకాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి.౹ ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును.౹ తప్పిద మునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి.౹ క్రీస్తు కూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.౹ ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.౹ ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.౹ మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.౹ మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు. అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;౹ అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యములేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.౹ జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,౹ సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవునిదృష్టికి మిగుల విలువగలది.౹ అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.౹ ఆప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు. అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గల వారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.౹ ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి. –జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడుచేయువారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హానిచేయువాడెవడు?౹ మీరొకవేళ నీతినిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి;౹ [15-16] నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి; అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడు దురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్‌ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు.౹ *** దేవుని చిత్త మాలాగున్నయెడల కీడుచేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది.౹ ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతు డైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్క సారే శ్రమపడెను.౹ [19-20] దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.౹ *** దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విష యము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.౹ ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారులమీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.౹ శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.౹ మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును,౹ అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.౹ సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.౹ మృతులు శరీరవిషయములో మానవరీత్య తీర్పు పొందునట్లును ఆత్మవిషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడ సువార్త ప్రకటింపబడెను. అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.౹ ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.౹ సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.౹ దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి.౹ ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అను గ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగు చున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.౹ క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.౹ క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.౹ మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.౹ ఎవడై నను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరునుబట్టియే దేవుని మహిమపరచవలెను.౹ తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?౹ మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?౹ కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. తోటిపెద్దను, క్రీస్తు శ్రమలనుగూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.౹ బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభా పేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.౹ మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి;౹ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.౹ చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారు లను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.౹ దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిప్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.౹ ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.౹ నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అప వాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.౹ లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైనశ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.౹ తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బల పరచును.౹ యుగయుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమేన్. మిమ్మును హెచ్చరించుచు, ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి, మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వానుచేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి.౹ బబులోనులో మీవలె నేర్పరచబడిన ఆమెయు, నా కుమారుడైన మార్కును, మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికిని సమాధానము కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవునియొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తుయొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.౹ [2-3] తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.౹ *** ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను౹ ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును,౹ జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని,౹ భక్తియందు సహోదరప్రేమను, సహోదరప్రేమయందు దయను అమర్చుకొనుడి.౹ ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ చేయును.౹ ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి పోయి, గ్రుడ్డివాడును దూరదృిష్టిలేనివాడునగును.౹ అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి.౹ మీ రిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు. ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుయొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీక రించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను.౹ [13-14] మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.౹ *** నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును.౹ ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని౹ ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చి నప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా౹ మేము ఆ పరిశుద్ధపర్వతముమీద ఆయనతోకూడ ఉండిన వారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి.౹ మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.౹ ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.౹ ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి. మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటు వలెనే మీలోను అబద్ధబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.౹ మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.౹ వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.౹ దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.౹ మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.౹ మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి,౹ దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.౹ ఆ నీతిమంతుడు వారిమధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.౹ [9-10] భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచ బడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్చా పరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు.౹ *** దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరతురు.౹ వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములనుగూర్చి దూషించుచు, తమ దుష్‌ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాముచేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు,౹ ఒకనాటి సుఖానుభవము సంతోషమని యెంచుకొందురు. వారు కళంకములును నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు.౹ వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభత్వమందు సాధకముచేయబడిన హృదయముగలవారును, శాపగ్రస్తులునైయుండి,౹ తిన్ననిమార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.౹ ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతి క్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.౹ వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునై యున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.౹ వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించుకొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు.౹ తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా౹ వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింప బడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును.౹ వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు.౹ కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను. ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను౹ పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సు లను రేపుచున్నాను.౹ అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,౹ –ఆయన రాకడనుగూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.౹ ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలోనుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.౹ ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.౹ అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.౹ కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.౹ అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.౹ [11-12] ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.౹ *** అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును. ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి.౹ మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు.౹ వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ౹ ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి.౹ మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినమువరకును మహిమ కలుగును గాక. ఆమేన్. జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.౹ ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.౹ మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితోకూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది.౹ మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా–దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.౹ ఆయనతోకూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.౹ అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.౹ మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు.౹ మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.౹ మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవ డైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.౹ ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.౹ మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము.౹ ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.౹ [5-6] ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను; ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచు కొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము. *** ప్రియులారా, మొదటనుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనేగాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు; ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే.౹ మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించు చున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయనయందును మీయందును సత్యమే.౹ వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు.౹ తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు.౹ తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవు చున్నాడో అతనికి తెలియదు. చిన్నపిల్లలారా, ఆయన నామముబట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను.౹ తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగి యున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.౹ చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగి యున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవునివాక్యము మీయందు నిలుచుచున్నది; మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.౹ ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.౹ లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.౹ లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. చిన్నపిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.౹ వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతోకూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లువారు బయలువెళ్లిరి.౹ అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.౹ మీరు సత్యమెరుగనివారైనందున నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగియున్నందునను, ఏ అబద్ధమును సత్యసంబంధమైనది కాదని యెరిగి యున్నందునను మీకు వ్రాయుచున్నాను.౹ యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.౹ కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు.౹ అయితే మీరు మొదటనుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి; మీరు మొదటనుండి వినినది మీలో నిలిచినయెడల, మీరు కూడ కుమారునియందును తండ్రియందును నిలుతురు.౹ నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము.౹ మిమ్మును మోసపరచువారినిబట్టి యీ సంగతులు మీకు వ్రాసియున్నాను.౹ అయితే ఆయనవలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు ౹ కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయనయందు నిలిచియుండుడి.౹ ఆయన నీతిమంతుడని మీరెరిగి యున్నయెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని యెరుగుదురు. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మన కెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.౹ ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగు దుము.౹ ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవి త్రునిగా చేసికొనును.౹ పాపముచేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.౹ పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును; ఆయనయందు పాపమేమియు లేదు.౹ ఆయనయందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగనులేదు.౹ చిన్నపిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు.౹ అపవాది మొదటనుండి పాపము చేయుచున్నాడు గనుక పాపముచేయు వాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.౹ దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.౹ దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేట పడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.౹ మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదా౹ మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా? సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించినయెడల ఆశ్చర్యపడకుడి.౹ మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు.౹ తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.౹ ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.౹ ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?౹ చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.౹ [19-20] ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విష యములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.౹ *** ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము.౹ మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును.౹ ఆయన ఆజ్ఞ యేదనగా–ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననునదియే.౹ ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయనయందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచి యుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలిసికొనుచున్నాము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.౹ [2-3] యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది; యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మ ను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.౹ *** చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.౹ వారు లోకసంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును.౹ మనము దేవుని సంబంధులము; దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ యేదో, భ్రమపరచు ఆత్మ యేదో తెలిసికొనుచున్నాము. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.౹ దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.౹ మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.౹ మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.౹ ప్రియులారా, దేవుడు మన లను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము.౹ ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించినయెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.౹ దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మనయందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తన ఆత్మ లో పాలు దయచేసియున్నాడు.౹ మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము.౹ యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పు కొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.౹ మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.౹ తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము.౹ ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండ నతోకూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు.౹ ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.౹ ఎవడైనను–నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు ౹ దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము. యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవునిమూలముగా పుట్టియున్నాడు. పుట్టించినవానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును.౹ మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము.౹ మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.౹ దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే౹ యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?౹ నీళ్లద్వారాను రక్తముద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమేగాక నీళ్లతోను5 రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మ యే.౹ [7-8] సాక్ష్య మిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మ యు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించియున్నారు.౹ *** మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే.౹ దేవుని కుమారునియందు విశ్వాసముంచువాడు తనలోనే యీ సాక్ష్యము కలిగియున్నాడు; దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారునిగూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే.౹ ఆ సాక్ష్యమేమనగా–దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారునియందున్నది.౹ దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతు లను మీకు వ్రాయుచున్నాను.౹ ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.౹ మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగిన వని యెరుగుదుము.౹ తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడు కొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు.౹ సకల దుర్నీతియు పాపము; అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.౹ మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయుదుష్టునియందున్నదనియు ఎరుగుదుము.౹ మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చిమనకు వివేక మనుగ్రహించియున్నాడని యెరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతునియందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.౹ చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి. పెద్దైనెన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికిని, ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది.౹ నేనును, నేను మాత్రమే గాక సత్యము ఎరిగినవారందరును, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడుఉండు సత్యమునుబట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము.౹ సత్యప్రేమలు మనయందుండగా తండ్రియైన దేవుని యొద్దనుండియు, తండ్రియొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్దనుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రివలన మనము ఆజ్ఞను పొందినప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను.౹ కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటనుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు, మనము ఒకరి నొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను.౹ మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదటనుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.౹ యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు.౹ అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు. మేము మీమధ్యను నెర వేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.౹ క్రీస్తుబోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు. ౹ ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.౹ శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. అనేక సంగతులు మీకు వ్రాయవలసియుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సులేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను.౹ ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. పెద్దైనెన నేను సత్యమునుబట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండ వలెనని ప్రార్థించుచున్నాను.౹ నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తననుగూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని.౹ నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు.౹ [6-7] వారు నీ ప్రేమనుగూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనులవలన ఏమియు తీసి కొనక ఆయన నామము నిమిత్తము బయలు దేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపినయెడల నీకు యుక్తముగా ఉండును.౹ *** మనము సత్యమునకు సహాయ కులమవునట్టు అట్టివారికి ఉపకారముచేయ బద్ధులమై యున్నాము. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు.౹ వాడు మమ్మునుగూర్చి చెడ్డమాటలు వదరుచు, అది చాలనట్టుగా, సహోదరులను తానే చేర్చు కొనక, వారిని చేర్చుకొన మనస్సుగలవారిని కూడ ఆటంక పరచుచు సంఘములోనుండి వారిని వెలివేయుచున్నాడు; అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియ లను జ్ఞాపకము చేసికొందును.౹ ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలుచేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.౹ దేమేత్రియు అందరివలనను సత్యమువలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడ అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము; మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు. అనేక సంగతులు నీకు వ్రాయవలసియున్నది గాని సిరాతోను కలముతోను నీకు వ్రాయ నాకిష్టము లేదు;౹ శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను; అప్పుడు ముఖాముఖిగా మాటలాడు కొనెదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము. యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.౹ మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడు చుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.౹ ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగి యున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.౹ మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.౹ ఆప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపెట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారముచేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.౹ అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాక రించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు.౹ అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించి నప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపక– ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.౹ వీరైతే తాము గ్రహింపని విషయములనుగూర్చి దూషించువారై, వివేకశూన్యములగు మృగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మునుతాము నాశనముచేసికొనుచున్నారు.౹ అయ్యో వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.౹ వీరు నిర్భయముగా మీతో సుభోజనముచేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింప బడిన చెట్లుగాను,౹ తమ అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను, మార్గముతప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి యున్నది.౹ [14-15] ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను —ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.౹ *** వారు తమ దురాశలచొప్పున నడుచుచు, లాభమునిమిత్తము మనుష్యులను కొనియాడుచు, సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును. [17-18] అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలచొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి.౹ *** అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు.౹ [20-21] ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలొ నిలుచునట్లు కాచుకొని యుండుడి.౹ *** సందేహపడువారిమీద కనికరము చూపుడి.౹ అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైనవారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. [24-25] తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా, మహిమయు మాహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక. ఆమేన్. యుసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.౹ అతడు దేవుని వాక్యమునుగూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.౹ సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,౹ నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.౹ మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.౹ ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్. అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.౹ [10-11] ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము–నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.౹ *** ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.౹ తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.౹ ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;౹ ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.౹ ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.౹ నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను — భయపడకుము;౹ నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకముయొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.౹ [19-20] కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని, అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములనుగూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము— ఏడు నక్షత్రములు తన కుడిచేతపట్టుకొని యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు చెప్పు సంగతు లేవనగా౹ –నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొ స్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు,౹ నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.౹ అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.౹ నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.౹ అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు; నేను కూడ వీటిని ద్వేషించుచున్నాను.౹ చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును. స్ముర్నలో ఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుము— మొదటివాడును కడపటివాడునైయుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా౹ –నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నే నెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడ కుము.౹ ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.౹ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు. పెర్గములోఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము— వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా౹ –సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీమధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపెట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.౹ అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలోఉన్నారు.౹ అటువలెనే నీకొలాయితుల బోధననుసరించు వారును నీలో ఉన్నారు.౹ కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను.౹ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము— అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాదములునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా –నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరి చర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.౹ అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసియున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.౹ మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు.౹ ఇదిగో నేను దానిని మంచము పెట్టించి దానితోకూడ వ్యభిచరించువారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును,౹ దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.౹ అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతానుయొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పు చున్నదేమనగా–మీపైని మరి ఏ భారమును పెట్టను.౹ నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి.౹ [26-27] నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు;౹ *** మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.౹ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. సార్దీస్‍లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము— ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలునుగలవాడు చెప్పు సంగతులేవనగా–నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే౹ నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము. ౹ నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.౹ అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‍లో నీయొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.౹ జయించు వాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.౹ సంఘములతో ఆత్మ చెప్పు చున్న మాట చెవిగలవాడు వినునుగాక. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము— దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయలేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా౹ –నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచియున్నాను; దానిని ఎవడును వేయ నేరడు.౹ యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.౹ నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.౹ నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.౹ జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వానిమీద వ్రాసెదను.౹ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము— ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా౹ –నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.౹ నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.౹ నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక— నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.౹ నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్దకొనుమని నీకు బుద్ధిచెప్పుచున్నాను.౹ నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము.౹ ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండితట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసినయెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.౹ నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.౹ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు— ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను౹ వెంటనే నేను ఆత్మ వశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడై యుండెను,౹ ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు మేఘధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను.౹ సింహాసనముచుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.౹ ఆ సింహాసనములోనుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.౹ మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకుమధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను.౹ మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది; మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది.౹ ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి–భూతవర్తమాన భవిష్యత్కాలములలోఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.౹ ఆ సింహాసనమునందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా౹ [10-11] ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు– ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానినిబట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీసుడైయుండువాని కుడిచేత చూచితిని.౹ మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గ రగా ప్రచురింపగా చూచితిని.౹ అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.౹ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా౹ ఆ పెద్దలలో ఒకడు–ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.౹ మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.౹ ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేతిలోనుండి ఆ గ్రంథమును తీసికొనెను.౹ ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.౹ [9-10] ఆ పెద్దలు— నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.౹ *** మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.౹ వారు–వధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.౹ అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును —సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.౹ ఆ నాలుగు జీవులు–ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఆ గొఱ్ఱెపిల్ల ఆ యేడుముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి —రమ్ము అని ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని.౹ మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండి యుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్లెను. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు–రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని.౹ అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్లెను; మనుష్యులు ఒకని ఒకడు చంపు కొనునట్లు భూలోకములో సమాధానములేకుండచేయు టకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికార మియ్య బడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు–రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసు చేతపట్టుకొని కూర్చుండి యుండెను.౹ మరియు–దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయ వద్దనియు, ఆ నాలుగు జీవులమధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు–రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.౹ అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను; దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గమువలనను కరవువలనను మరణమువలనను భూమిలోనుండు క్రూరమృగములవలనను భూనివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవభాగముపైన అధికారము వానికియ్యబడెను. ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.౹ వారు–నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతి దండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.౹ తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియు–వారివలెనే చంపబడబోవువారి సహ దాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,౹ పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలెను.౹ మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.౹ [15-17] భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని–సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు? మీరు మామీదపడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు. అటుతరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచకుండునట్లు భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని.౹ మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారముపొందిన ఆ నలు గురు దూతలతో౹ ఈ దూత–మేము మా దేవుని దాసు లను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.౹ మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.౹ యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండువేలమంది. రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో పండ్రెండు వేలమంది,౹ ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, నఫ్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది, మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది,౹ షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, లేవి గోత్రములో పండ్రెండు వేలమంది, ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది,౹ జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి.౹ అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి౹ –సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్ర మని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.౹ [11-12] దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి–ఆమేన్; యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్.౹ *** పెద్దలలో ఒకడు–తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.౹ అందుకు నేను–అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను–వీరు మహాశ్రమలనుండి వచ్చినవారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకు కొని వాటిని తెలుపుచేసికొనిరి.౹ అందువలనవారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైనవాడు తానే తన గుడారము వారిమీద కప్పును;౹ వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,౹ ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును. ఆయన యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను.౹ అంతట నేను దేవునియెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను. మరియు సువర్ణధూపార్తి చేతపట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్య బడెను.౹ అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.౹ ఆ దూత ధూపార్తిని తీసికొని, బలిపీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను. అంతట ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయ బడెను; అందువలన భూమిలో మూడవభాగము కాలి పోయెను, చెట్లలో మూడవభాగమును కాలిపోయెను, పచ్చగడ్డియంతయు కాలిపోయెను. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండు చున్న పెద్ద కొండవంటిది ఒక్కటి సముద్రములో పడ వేయబడెను. అందువలన సముద్రములో మూడవభాగము రక్తమాయెను.౹ సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవభాగము చచ్చెను, ఓడలలో మూడవభాగము నాశన మాయెను. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండు చున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి నదుల మూడవభాగముమీదను నీటిబుగ్గలమీదను పడెను.౹ ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవభాగము మాచిపత్రి యాయెను; నీళ్లు చేదై పోయినందున వాటివలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవభాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవభాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవభాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవభాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశమధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు–బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములనుబట్టి భూనివాసులకు అయ్యో, అయ్యో, అయ్యో, అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను.౹ అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను.౹ ఆ పొగలోనుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలోఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను.౹ మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను.౹ మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలన కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును.౹ ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.౹ ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి,౹ స్త్రీల తలవెండ్రుకలవంటి వెండ్రు కలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను.౹ ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తు నట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను.౹ తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను.౹ పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను. మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండు శ్రమలు ఇటుతరువాత వచ్చును. [13-14] ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవునియెదుట ఉన్న సువర్ణ బలిపీఠముయొక్క కొమ్ములనుండి యొక స్వరము —యూఫ్రటీసు అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆయారవ దూతతో చెప్పుట వింటిని.౹ *** మనుష్యులలో మూడవభాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్ట బడిరి.౹ గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువది కోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని.౹ మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండియున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరువు లుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను.౹ ఈ మూడు దెబ్బలచేత, అనగా వీటి నోళ్లలోనుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకములచేత, మనుష్యులలో మూడవభాగము చంపబడెను,౹ ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకలయందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హాని చేయును.౹ ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు, దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్త కృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు.౹ మరియు తాము చేయుచున్న నరహత్యలును మాయమంత్రములును జారచోరత్వములును చేయకుండునట్లువారు మారుమనస్సు పొందినవారు కారు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద మేఘధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.౹ ఆయన చేతిలో విప్ప బడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,౹ సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను.౹ ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా–ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.౹ మరియు సముద్రముమీదను భూమిమీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి౹ –పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి, యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొని–ఇక ఆలస్యముండదు గాని౹ యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.౹ అంతట పరలోకమునుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచు–నీవు వెళ్లి సముద్రముమీదను భూమిమీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసికొనుమని చెప్పుట వింటిని.౹ నేను ఆ దూత యొద్దకు వెళ్లి–ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన— దాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను.౹ అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెనుగాని నేను దానిని తిని వేసిన తరువాత నా కడుపుకు చేదాయెను.౹ అప్పుడు వారు–నీవు ప్రజలనుగూర్చియు, జనములనుగూర్చియు, ఆయా భాషలు మాటలాడువారినిగూర్చియు, అనేక మంది రాజులనుగూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చి— నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము. ౹ ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.౹ నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.౹ వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.౹ ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడై నను వారికి హానిచేయనుద్దేశించినయెడల ఆలాగునవాడు చంపబడవలెను.౹ తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.౹ వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును.౹ వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువు కూడ సిలువవేయబడెను.౹ మరియు ప్రజలకును, వంశములకును, ఆయా భాషలు మాటలాడువారికిని, జనములకును సంబంధించినవారు మూడుదినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు.౹ ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్సహించుచు, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు.౹ అయితే ఆ మూడుదినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి; వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.౹ అప్పుడు–ఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి.౹ ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవభాగము కూలిపోయెను. ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి. మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. రెండవ శ్రమ గతించెను; ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు–ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగములవరకు ఏలుననెను.౹ అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారముచేసి౹ –వర్తమానభూతకాలములలోఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.౹ జనములు కోప గించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుము లును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను.౹ ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను.౹ అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటము లుండెను.౹ దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవభాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననై యున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మ్రింగివేయ వలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను.౹ సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను.౹ ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖా యేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా౹ ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను.౹ కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాది యనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితోకూడ పడ ద్రోయబడిరి.౹ మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని–రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపు వాడైన అపవాది1 పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.౹ వారు గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణమువరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు.౹ అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను. ఆ ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడి యుండుట చూచి, ఆ మగశిశువును కనిన స్త్రీని హింసిం చెను;౹ అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషింపబడును.౹ కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెనుగాని౹ భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన ప్రవాహమును మ్రింగివేసెను.౹ అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను. మరియు పది కొమ్ములును ఏడు తలలునుగల యొక. క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.౹ నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.౹ దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్లుచు ఆశ్చర్యపడుచుండిరి.౹ ఆ మృగమునకు అధికారమిచ్చినందునవారు ఘటసర్పమునకు నమస్కారముచేసిరి. మరియు వారు–ఈ మృగ ముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారముచేసిరి.౹ డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పా టాయెను ౹ గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.౹ మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశముమీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను.౹ భూని వాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.౹ ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక;౹ ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను; ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱెపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడు చుండెను;౹ అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.౹ అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.౹ కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.౹ మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.౹ [16-17] కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరి ద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొసటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారములేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది.౹ *** బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు. మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతోకూడ ఉండిరి.౹ మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.౹ వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.౹ వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడి కెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.౹ వీరినోట ఏ అబద్ధమును కనబడ లేదు; వీరు అనింద్యులు. అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను.౹ అతడు–మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి–మోహోద్రేకముతోకూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను. మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను— ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవ డైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల౹ ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధదూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.౹ వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడలవాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.౹ దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతట–ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడైయుండెను ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను.౹ అప్పుడు మరియొక దూత దేవాలయములోనుండి వెడలివచ్చి —భూమి పైరుపండి యున్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలిపెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘముమీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను.౹ మేఘముమీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములోనుండి వెడలివచ్చెను; ఇతనియొద్దను వాడిగల కొడవలియుండెను.౹ మరియొకదూత బలిపీఠమునుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలిగలవానిని గొప్ప స్వరముతో పిలిచి–భూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను.౹ కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను౹ ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్లెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను. మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా, ఏడు తెగుళ్లు చేతపట్టుకొనియున్న యేడుగురు దూతలు. ఇవే కడవరి తెగుళ్లు; వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణెలుగలవారై, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.౹ [3-4] వారు– ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. *** అటుతరువాత నేను చూడగా, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను.౹ ఏడు తెగుళ్లు చేతపట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు, నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని, రొమ్ములమీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆ ఆలయములోనుండి వెలుపలికి వచ్చిరి.౹ అప్పు డా నాలుగు జీవులలో ఒక జీవి, యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న యేడు బంగారు పాత్రలను ఆ యేడుగురు దూతల కిచ్చెను.౹ అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తినుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతలయొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగువరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను. మరియు–మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయములోనుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని. అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమిమీద కుమ్మరింపగా ఆ క్రూరమృగముయొక్క ముద్రగలవారికిని దాని ప్రతిమకు నమస్కారముచేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండుపుట్టెను. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మ రింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నియు చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను.౹ అప్పుడు వర్తమాన భూతకాలములలోఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి;౹ దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పుతీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని.౹ అందుకు–అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని. నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మ రింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను.౹ కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమ పరచునట్లువారు మారుమనస్సు పొందినవారుకారు. అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగముయొక్క సింహాసనముమీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను; మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి;౹ తమకు కలిగిన వేదనలనుబట్టియు పుండ్లనుబట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారుమనస్సు పొందినవారు కారు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను.౹ మరియు ఆ ఘటసర్పము నోటనుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని.౹ అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి,౹ [15-16] హెబ్రీభాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతు రేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు. *** ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగా–సమాప్తమైనదని చెప్పుచున్న యొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను.౹ అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది.౹ ప్రసిద్ధమైన మహా పట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి.౹ ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను. ౹ అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి. ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను. —నీవిక్కడికి రమ్ము, విస్తార జలములమీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను;౹ భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.౹ అప్పుడతడు ఆత్మ వశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవ దూషణ నామములతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని.౹ ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తనచేతపట్టుకొనియుండెను.౹ దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను–మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను.౹ మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా౹ ఆ దూత నాతో ఇట్లనెను–నీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీనిగూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములునుగలిగి దాని మోయుచున్న క్రూరమృగమునుగూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను.౹ నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములోనుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు.౹ ఇందులో జ్ఞానముగల మనస్సు కనబడును. ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడు కొండలు;౹ మరియు ఏడుగురు రాజులు కలరు; అయిదుగురు కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను.౹ ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన యీ క్రూరమృగము ఆ యేడుగురితోపాటు ఒకడునైయుండి, తానే యెనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును.౹ నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొకగడియ క్రూరమృగముతోకూడ రాజులవలె అధికారము పొందుదురు.౹ వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.౹ వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభు వులకు ప్రభువును రాజులకు రాజునైయున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.౹ మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను — ఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాటలాడువారిని సూచించును.౹ నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.౹ దేవుని మాటలు నెరవేరువరకు వారు ఏకాభిప్రాయముగలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుటవలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను.౹ మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను.౹ అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి యిట్లనెను–మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యము నైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను.౹ ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతోకూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములవలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని–నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి.౹ దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.౹ అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.౹ అది–నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖ భోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి.౹ అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును.౹ [9-10] దానితో వ్యభిచారముచేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయా క్రాంతులై దూరమున నిలువబడి దాని దహనధూమమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు–అయ్యో, అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందురు.౹ *** [11-14] లోకములోని వర్తకులును, ఆ పట్టణమును చూచి యేడ్చుచు, తమ సరకులను, అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదా రంగుబట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపుబట్టలు మొదలైన సరకులను, ప్రతివిధమైన దబ్బమ్రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కఱ్ఱ యిత్తడి యినుము చలువరాళ్లు మొదలైనవాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను, దాల్చినిచెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తనిపిండి గోధుమలు పశువులు గొఱ్ఱెలు మొదలగు వాటిని, గుఱ్ఱములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు; నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవన్నియు దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించి పోయినవి, అవి యికమీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు.౹ *** *** *** [15-16] ఆ పట్టణముచేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు–అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచు, దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు.౹ *** ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనముచేయు వారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి౹ –ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలువేసి౹ తమ తలలమీద దుమ్ముపోసి కొని యేడ్చుచు దుఃఖించుచు–అయ్యో, అయ్యో, ఆ మహాపట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పు కొనుచు కేకలు వేయుచుండిరి.౹ పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనందించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు. తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి–ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.౹ [22-23] నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికులయొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదు వారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైనచేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు, దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.౹ *** మరియు ప్రవక్తలయొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింప బడినవారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను. అటుతరువాత బహుజనులశబ్దమువంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని– ప్రభువు ను స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును;౹ ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పుతీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతి దండన చేసెను; మరి రెండవసారి వారు– ప్రభువు ను స్తుతించుడి అనిరి.౹ ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది.౹ అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి–ఆమేన్, ప్రభువు ను స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి.౹ మరియు–మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను.౹ [6-7] అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము–సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలు చున్నాడు; ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.౹ *** మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.౹ మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను–గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను.౹ అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడు–వద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము. యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను. మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శచేయుచు యుద్ధము జరిగించుచున్నాడు౹ ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;౹ రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.౹ పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.౹ జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.౹ –రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది. [17-18] మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి–రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. *** మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.౹ అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.౹ కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను. మరియు పెద్దసంకెళ్లను చేతపట్టుకొని అగాధముయొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని.౹ అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,౹ ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను. అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.౹ ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.౹ ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు. వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.౹ భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.౹ వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.౹ వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రిం బగళ్లు బాధింపబడుదురు. మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.౹ మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.౹ సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.౹ మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.౹ ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.౹ మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.౹ అప్పుడు — ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును.౹ ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.౹ అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు–ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు–ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.౹ మరియు ఆయన నాతో ఇట్లనెను–సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.౹ జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడైయుండును.౹ పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి–ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి,౹ ఆత్మ వశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.౹ దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్యరత్నమును పోలియున్నది.౹ ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మములమీద వ్రాయబడియున్నవి.౹ తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మములున్నవి.౹ ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱెపిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.౹ ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.౹ ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.౹ మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.౹ ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.౹ ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,౹ అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.౹ దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.౹ దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువు ను గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.౹ ఆ పట్టణములో ప్రకా శించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.౹ జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.౹ అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.౹ జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.౹ గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి౹ ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షముయొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియో గించును.౹ ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.౹ ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనముచేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.౹ రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. మరియు ఆ దూత యీలాగు నాతో చెప్పెను— ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, త్వరలో సంభవింప వలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను.౹ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా,౹ అతడు–వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను–ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది;౹ అన్యాయముచేయు వాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనుపరిశుద్ధుడుగానే యుండనిమ్ము. ౹ ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.౹ నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.౹ జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు.౹ కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. సంఘములకోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను. ఆత్మ యు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా–ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;౹ ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును. ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు–అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్; ప్రభువైన యేసూ, రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుం డును గాక. ఆమేన్.